అజహర్‌ పై జీవితకాలం వేటును రద్దు చేసిన హైకోర్టు

  మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌కు 12 ఏళ్ల తరువాత ఊరట లభించింది. ఆయనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అజారుద్దీన్‌పై 2000లో బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అజారుద్దీన్‌ సిటీ సివిల్‌ కోర్టులో నాడు పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తూ సిటీ సివిల్‌ కోర్టు నాడు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సుధీర్ఘంగా హైకోర్టు విచారించింది. విచారణ అనంతరం అజారుద్దీన్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని రద్దు చేస్తూ గురువారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో అజారుద్దీన్‌ అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. అజారుద్దీన్‌కు ఊరట లభించడంతో ఆయన కుటుంబీకులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.

టెస్టుల్లో యువీ, రైనా అవుట్

    ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు సంచలనాలు ఏమి జరగలేదు. సందీప్ పాటిల్ సారథ్యంలోని కొత్త సెలెక్షన్ కమిటీ పాత సంప్రదాయాన్నే కొనసాగించింది. టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనాకు చోటు దక్కలేదు. సీనియర్లు, యువకులతో కూడిన జట్టులో మొత్తం ఏడుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్, ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ఒక వికెట్ కీపర్ ఉన్నారు.  విజయ్, రహానెకు చోటు. ఫామ్‌లోలేని ఓపెనింగ్ జోడీ సెహ్వాగ్, గంభీర్‌ను జట్టులో కొనసాగిస్తూనే రిజర్వ్ ఓపెనర్‌గా తమిళనాడు ఆటగాడు మురళీవిజయ్, ముంబయి బ్యాట్స్‌మన్ రహానెను తీసుకున్నారు. వీరి ఎంపిక ఢిల్లీ ఓపెనర్లకు ఓ రకంగా హెచ్చరికలాంటింది. బద్రీనాథ్ స్థానంలో విజయ్‌కు అవకాశమిచ్చారు. మిడిలార్డర్‌లో వెటరన్ సచిన్‌తో పాటు పుజార, కోహ్లీ, యువీపై బాధ్యతలు ఉంచారు. ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 15న అహ్మదాబాద్‌లో తొలి మ్యాచ్ ఆరంభంకానుంది.

ఇన్ఫోసిస్ కాస్ట్ కటింగ్

  ఇక్కడ ఉద్యోగాల్లేవ్..! సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీకూడా ఈ బోర్డ్ పెట్టేసింది. ఇండస్ట్రీకి మళ్లీ రిసెషన్ మొదలయ్యింది. భారీగా పెరుగుతున్న వ్యయం, విపరీతంగా తగ్గిపోతున్న వర్క్ కాంట్రాక్ట్ లు ఈ నిర్ణయానికి కారణం. కనీసం మూడు నెలలవరకూ క్యాంపస్ ఇంటర్యూవు చేయకూడదని ఇన్ఫోసిస్ యాజమాన్యం నిర్ణయించింది.   ఇప్పటిదాకా ఇంటర్వ్యూ దశలో ఉన్న 17 వేల ఉద్యోగాలకుకూడా ఈ నిర్ణయంతో బ్రేక్ పడింది. ఇంతకు ముందు ఎంపిక చేసిన అభ్యర్ధులకు ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చేవాళ్లు. ఇప్పుడా శిక్షణ కాలాన్ని రెండున్నర నెలలకు కుదించారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా పెద్ద కంపెనీలు కాస్ట్ కటింగ్ ప్రయత్నాల్లో మునిగితేలుతుంటే బోలెడన్ని చిన్నచిన్న కంపెనీలు తాళాలేసేసుకున్నాయ్. చాలాకంపెనీలు స్టాఫ్ ని తగ్గించుకునే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నాయ్.

నేనే గనక హోం మంత్రినైతే : టిజి

  తాను గనక హోం మంత్రి పదవిలో ఉండి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్ని ఘనంగా జరిపించి ఉండేవాడినని మంత్రి టి.జి. వెంకటేష్ వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్ని వ్యతిరేకించేవాళ్లకి అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హతకూడా లేదని విమర్సించారు. అప్పట్లో రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్ కి మార్చడంవల్లే ఇప్పుడిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కర్నూలు రాజధానిగా ఉండుంటే సీమాంధ్ర ప్రాంతం ఈ పాటికి ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.   ఇంకా ఇలాంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని చాలా చాలా జరుపుకుని తీరతామన్న నమ్మకం తనకు బలంగా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. జాతీయ జెండాని ఆవిష్కరించి వేడుకల్నిప్రారంభించిన లగడపాటితోపాటు కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లంతా సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందడం సాధ్యమని ఆయన అన్నారు.

దేనికైనా రెడీ వివాదం..తెలంగాణ వాదుల మద్దతు

  దేనికైనా రెడీ సినిమా వివాదం తారా స్థాయికి చేరుతోంది. మోహన్ బాబు ఇంటిముందు ఆందోళన జరిపిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులపై దాడిచేయడంపై తెలంగాణ వాదులుకూడా మండిపడుతున్నారు. వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని మోహన్ బాబుతోపాటు ఆయన అనుచరుల్నికూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల చందాలతో బతుకుతున్న మోహన్ బాబు తిరిగి జనంపై దాడిచేయడం అత్యంత హేయమైన విషయమంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.   సినిమాలమీద కలెక్షన్లు పోగేసుకుని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేస్తూ పరిహసించే ప్రయత్నాల్ని మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. బ్రాహ్మణులపట్ల మోహన్ బాబు కుటుంబ సభ్యులు దుర్మార్గంగా వ్యవహరించారని తెలంగాణ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ నేత, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఖండించారు. సినిమాలో సీన్లని వెంటనే తొలగించి, ఈ వివాదంపై వెంటనే మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని తెలంగాణ అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయ్.   మరోవైపు మంచు విష్ణువర్ధన్ బాబుకూడా అదే స్థాయిలో మండిపడుతున్నారు. నిరసన తెలిపేందుకు వచ్చినవాళ్లు తమ ఇంటిపై దాడి చేయడమేంటంటూ వీరంగమేస్తున్నారు. తానింట్లో లేను కాబట్టి సరిపోయిందని, లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు. ఇంకోసారి ఇలాంటి పని చేయాలనుకున్నవాళ్లు సిటీలో తిరగడానిక్కూడా భయపడాల్సొస్తుందని విష్ణువర్థన్ బాబు హెచ్చరించాడు.ఇరువర్గాలూ రాష్ట్ర మానవహక్కుల సంఘంలో ఫిర్యాదుకూడా చేశాయి.

రీతీ స్పోర్ట్స్‌తో సైనా నెహ్వాల్‌ 40 కోట్ల డీల్

సైనా నెహ్వాల్‌ మేనేజింగ్ కంపెనీ రీతీ స్పోర్ట్స్‌తో రూ. 40 కోట్ల విలువ చేసే డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సైనా నెహ్వాల్ సంవత్సరానికి 14 కోట్ల రూపాయలు పొందుతుంది. ఇంతకు ముందు సైనా నెహ్వాల్ ఏడాదికి 1.5 కోట్ల రూపాయలు పొందేది. ఈ డీల్ కుదరటంతో తను ఎంతో థ్రిల్ అయ్యానని, ఇంత త్వరగా పెద్ద అవకాశం లభిస్తుందని అనుకోలేదని సైనా చెప్పింది. భవిష్యత్తులో దేశం కోసం మరిన్ని టైటిల్స్ గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. దక్కన్ క్రానికల్‌తో తమ ఒప్పందం జూలై 31ముగియటంతో సైనా రీతీ స్పోర్ట్స్‌తో డీల్‌ను కుదుర్చుకుంది. భవిష్యత్తులో వివాదాలు రాకుండా చూసుకోవడానికి యాడ్ షూట్స్ అన్నీ హైదరాబాదులోనే జరగాలని సైనా టీమ్ ఒప్పందంలో రాసుకుంది.