వైసీపీ, బీజేపీ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత!

ఎన్డీయేలో వైసీపీ కలుస్తుందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో బీజేపీ ఏపీ ఇన్ చార్జ్ సునీల్ దేవోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో ఎలాంటి పొత్తు ఉండదని ఎలాంటి అవగాహన కూడా లేదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పటికే జనసేనతో కలిసి పని ప్రారంభించామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేనతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. ఇరు పార్టీలు తమకు విరుద్ధమేనని తమకు టీడీపీతో కానీ వైసీపీతో గానీ ఎలాంటి పొత్తు పెట్టుకునే ఉద్దేశాలు లేవని ఆయన వెల్లడించారు. అదేవిధంగా తమకు ఎలాంటి ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని కేవలం జనసేనతో మాత్రమే మద్దతుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు సునీల్ తెలిపారు. ఏపీలోని మరో రెండు పార్టీలతో మాకు ఎలాంటి ఒప్పందాలు లేవని ఆయన తెలివారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వైఫల్యాలతో తప్పుడు విధానాలను అవలంభిస్తొందని ఆయన స్పష్టం చేశారు. తాము ఇండిపెండెంట్ పార్టీగానే ఎదగడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి.. వైసీపీ.. బీజేపీకి మధ్య ఉన్న సంబంధాలను.. ఈ మధ్య నెలకొన్న ఊహాగానాలను సునీల్ దేవోధర్ స్పష్టం చేసినట్లే.

రామోజీరావుకు మంత్రి బొత్స బహిరంగ లేఖ!!

తనపై రాసిన తప్పుడు వార్తను ఈనాడు దినపత్రిక వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ నేత, పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావుకు లేఖ రాశారు.  "రామోజీరావు గారికి.. ఈ రోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో నేను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈ లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీ విలేకరికి ద్వారా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించాలని కోరుతున్నాను.  చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితులమీద ఐటీ దాడుల్లో ఏకంగా వేల కోట్లు వెలుగు చూసిందంటున్న నేపథ్యంలో చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారించాలన్న డిమాండ్‌తో నేను విశాఖ పత్రికా సమావేశంలో మాట్లాడాను. ప్రధానమైన ఈ విషయం మీ పత్రికకు ప్రధాన వార్త కాలేదు. మీకు ఇలాంటి మాటలు రుచించవు. చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు మింగేసినా మీకు ఆయన అంటే ఉన్న దిక్కుమాలిన ప్రేమ గత మూడు దశాబ్దాలుగా మీ పత్రికలో నిత్యం కనిపిస్తూనే ఉంది. అది మీ ఇష్టం– తెలుగు ప్రజల దౌర్భాగ్యం.  అలాగే డాక్టర్‌ వైయస్సార్‌గారిమీద, వైయస్‌ జగన్‌గారిమీద మీ వ్యతిరేకత, శత్రుత్వం ఏనాడూ మీరు దాచుకున్నది లేదు. అలాగని మేం అనని మాటల్ని మీ అజెండా ప్రకారం మార్చి ప్రచురించే స్థాయికి దిగజారి, చంద్రబాబు పార్టీని బతికించి రక్షించుకోవాలనుకుంటున్న మీ మానసిక స్థితిని ప్రశ్నించేందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను.  ‘‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం’’అని నేను అన్నట్టుగా మీరు హెడింగ్‌ పెట్టారు. నేను ఆ మాటలు ఎక్కడ అన్నానో చూపించండి. ఈ హెడింగ్‌ పెట్టటం ద్వారా రెండు వైపులా పదునున్న కత్తిని మాకు వ్యతిరేకంగా వాడాం అని మీరు మురిసిపోతున్నట్టున్నారు. మొదటిది– నేను అనని ఈ మాటల్ని అన్నానని చెప్పటం ద్వారా, పూర్తిగా మా మీద నమ్మకంతో ఉన్న మైనార్టీలను రెచ్చగొట్టాలన్నది మీ దురాలోచన. రెండోది– ఈ వ్యాఖ్యలు మేం చేయలేదని ఖండిస్తే...  కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బ కొట్టవచ్చన్నది మీ రెండో దురాలోచన. నా వ్యాఖ్యల్ని వక్రీకరించి మీ మొదటి పేజీలో ప్రచురించిన తీరును చూస్తే  ఈ విషయం అర్థమవుతోంది.  రాష్ట్ర ప్రయోజనాలు, ప్రధానంగా ఇక్కడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రయోజనాలు పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వం మాది. కేంద్రానికి–రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు ఉండాలని, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తెచ్చుకునేలా సంబంధాలు ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. అందులో భాగంగానే ప్రధానిని, హోం మంత్రిని, కేంద్రంలోని పెద్దలను ముఖ్యమంత్రిగారు కలుస్తారన్నది కనీస జ్ఞానం ఉన్నవారికి అర్థం అవుతుంది.  అదే సమయంలో రాజకీయ పార్టీలుగా ఎవరి భావాలు వారికి ఉంటాయి. మా నాయకుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రత్యేక హోదా కోసం 2014నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. వైయస్సార్‌ కాంగ్రెస్‌గా మా విధానాలు మావి. బీజేపీ విధానాలు వారివి. ఏ సిద్ధాంతాలూ లేని, ఎప్పుడు ఎవరితో అయినా కలిసి, విడిపోయి, మళ్ళీ కలిసిపోయే విధానం మీరు నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీది. మేం రాజకీయంగా మా స్వతంత్రాన్ని ఎప్పుడూ కాపాడుకుంటున్నా, వైయస్సార్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రోజుకో ప్రచారం చేయటం మీ విధానం. ప్రజలకు మంచి చేయటం చేతగాని చంద్రబాబును ఎలాగూ ప్రజల్లో పెంచలేరు కాబట్టి మమ్మల్ని చిన్నగీత చేయటానికి మీరు ఎంతగా దిగజారుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోండి.  ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, చంద్రబాబు ప్రయోజనాలు, మీ అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం అబద్ధాలు, కట్టుకథలతో ఇంకెంత కాలం మీ పత్రిక నడుపుతారు? చంద్రబాబు పర్సనల్‌ సెక్రెటరీ తీగ లాగుతుంటే కదులుతున్న వేల కోట్ల రూపాయల అవినీతి  డొంకను మీరెందుకు చూపించటం లేదు? ఇలాంటి వార్తల్ని దాచటం కూడా పత్రికా విలువల్లో భాగమేనా? ఇందులో జాతీయ ప్రయోజనాలు ఏమన్నా ఇమిడి ఉన్నాయా?  చంద్రబాబుకు 70. మీకు 84.  ఇంత పండు వయసు వచ్చినా రాష్ట్రం గురించి కంటే మీ స్వప్రయోజనాల కోసమే రగిలిపోతున్న మీ వైఖరి వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మీ పాజిటివ్‌ కంట్రిబ్యూషన్‌ ఏమిటంటే చెప్పుకునేందుకు ఏమీ లేని పరిస్థితి తెచ్చుకున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పేరు చెపితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమూ లేదు... ఈనాడు పత్రిక వల్ల తెలుగు ప్రజలకు జరిగిన మేలు ఫలానా అంటే చెప్పేందుకూ ఏమీ మిగల్లేదు. ఎందుకీ పరిస్థితి వచ్చిందో మీరే ఆలోచించుకోండి.  చివరిగా... మీ వార్త తప్పు, మీ ఆలోచన తప్పు. మీ పాలసీ తప్పు. చంద్రబాబును బతికించటం కోసం మీరు ఎంతటి అసత్యాలయినా పత్రికలో ప్రచురించటం తప్పు మాత్రమే కాదు... నేరం కూడా. మీ స్పందనను బట్టి నా తదుపరి కార్యాచరణ ఉంటుంది.  – బొత్స సత్యనారాయణ"

అప్పుల కోసం ఏపీ తిప్పలు!!

మనిషికైనా, సంస్థకైనా, ప్రభుత్వానికైనా, ఆర్ధికపరమైన క్రమశిక్షణ లేకపోతే ఎదురయ్యే కష్టాలను ఊహించటం కష్టం. ఒక్కసారి కుప్పకూలిపోతే మళ్లీ కోలుకోవడం సాధ్యం కాదు. అందుకే ఏ వ్యక్తి అయినా సంస్థ అయినా ప్రభుత్వమైనా ఆదాయం ఎంత ఖర్చెంత అని లెక్కలేసుకుని ప్రాధాన్యాలకు తగ్గట్లుగా వెళ్తారు. బ్యాంకులు అప్పనంగా ఇచ్చేసాయ్ అని క్రెడిట్ కార్డులు ఓవర్ డ్రాఫ్ట్ లు వాడేస్తే వాడేసినంత కాలం బాగానే వుంటుంది. తిరిగి చెల్లించ లేక దివాలా ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదాయాల గురించి పట్టించుకో కుండా అప్పులు చేసి పొజిషన్ లో ఉంది. ఈ ఏడాది ఓ 10 వేల ఆదాయం సంపాదిస్తే వచ్చే ఏడాది 11 వేలు సంపాదించాలి. అలా కాకుండా 10 వేల ఆదాయం వస్తే ఆదాయం తగ్గినట్లే. ఎందుకంటే గతేడాది రూపాయి విలువకు ఈ ఏడాది రూపాయి విలువకు చాలా తేడా వచ్చేస్తుంది. అలా కాదు ఎనిమిది వేలు మాత్రమే సంపాదిస్తే ఆర్థిక పరిస్థితి చితికిపోయినట్లే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఇదే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీ ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో ఏపీ సర్కారు ఆదాయం 98,790 కోట్లు. గతేడాది ఇదే ఎనిమిది నెలల కాలానికి వచ్చిన ఆదాయం లక్షా ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అంటే పది వేల కోట్లు తక్కువ. ప్రజలు కట్టే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ప్రభుత్వానికి ఇంత ఆదాయం తగ్గిందంటే ప్రజల అంతకు 10 రెట్లు ఆదాయాన్ని కోల్పోయి ఉంటారు. ఆ లెక్కన ఏపీ ప్రజల మొత్తంగా లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని అంచనా వేయొచ్చు. రాష్ట్ర విభజనప్పుడు ఏపీ ప్రజల తలసరి ఆదాయం 93,000 లు, ఐదేళ్ల తరవాత 1 లక్ష 66 వేలు, ఇప్పుడు రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 1 లక్షా 20 వేల దగ్గర ఉంది. అంటే కొత్త ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఒక్కొక్కరికీ 40 వేలకు పైగానే ఆదాయం పడిపోయింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించి పోయింది. మొదట ఇసుక కొరత తర్వాత అమరావతి నిలిపివేతతో రియల్ ఎస్టేట్ రంగం దివాలా ముప్పును ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఉత్పాదక వ్యయం చేయడం మానేసింది. అంటే ప్రాజెక్టులు అభివృద్ధి పనులపై ఖర్చు లేదు. అనుత్పాదక వ్యయంగా భావించే సంక్షేమ పథకాలపై మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం తగ్గిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం వెతుక్కున్న ఒకే ఒక్క మార్గం అప్పులు. అప్పులు చేయడంలో ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర సృష్టిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరం అది కూడా పది నెలల కాలంలోనే ఏకంగా 47,100 కోట్ల అప్పు చేసింది. మరో రెండు నెలల కాలంలో మరో పది వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తుంది.

కష్టాల తెలంగాణ.. లక్ష బిల్లులు పెండింగ్!!

తెలంగాణ రాష్రంలో సీఎం కేసీఆర్ పాలన చాలా నిశ్శబ్దంగా సాగుతుంది. పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో రాష్ట్రం మొత్తం సుమారు లక్ష బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా బకాయలు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అధికారికంగా అంగీకరించడం విశేషం. పెండింగ్ బకాయిల వివరాలు తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్త జి శ్రీనివాసరావు చేసిన దరఖాస్తుకు ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది. ఆర్థిక సంక్షోభంతో రాష్ట్రంలో పెండింగ్ బిల్లులకు మోక్షం లభించడం లేదు. ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నా ప్రభుత్వం బిల్లుల్ని క్లియర్ చేయలేక పోతుంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన కల్యాణలక్ష్మి, రైతుబంధు బట్టి సంక్షేమ పథకాలకు నిధుల మంజూరు కాలేదు. ఖరీఫ్, రబీ సీజన్ లకు సంబంధించి దాదాపు 3,000 కోట్ల వరకు రైతుబంధు బకాయిలు పేరుకు పోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మూడు లక్షల వరకు కల్యాణలక్ష్మి,, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది. పరిశ్రమలకు రాయితీల కింద 1,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. తాత్కాలిక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొని ఉంది. విద్యార్థులకు ఉపకార వేతనాలు, కాలేజీలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా భారీ ఎత్తున బకాయిలే ఉన్నాయి. అలాగే.. పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే ప్రయోజనాల కోసమూ పలువురు నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా మరికొన్ని జిల్లాల్లో ఆసరా పింఛన్ లు కూడా ఒకటి రెండు నెలలు ఆలస్యంగా అందిస్తున్నట్లు సమాచారం.  

చిరంజీవి వైసీపీలో చేరుతున్నారా?.. బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు!!

నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో ఏపీ అధికార పార్టీ వైసీపీ కలవబోతున్నదని, మెగాస్టార్ చిరంజీవి వైసీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, ఏపీ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాజాగా విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏలో చేరాలన్న ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని అన్నారు. తాము బీజేపీకి దగ్గరగా లేమని, అలాగని దూరంగానూ లేమని తెలిపారు. రాష్ట్రం బాగుకోసం ఏం చేస్తే మేలు జరుగుతుందో ఆ పని చేసేందుకు తమ అధినేత జగన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఇక చిరంజీవి పార్టీలో చేరే విషయమై మాత్రం ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. అది చిరంజీవి ఇష్టమని, ఒకవేళ ఆయన చేరితే మాత్రం సముచిత స్థానం తప్పకుండా లభిస్తుందని బొత్స చెప్పారు.

వైసీపీకి 3 కేబినెట్ బెర్తులు... ఆ ముగ్గురికి ఛాన్స్..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ఎన్డీఏలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమి త్ షా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశంలో దీనిపైనే చర్చ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఎన్డీఏలో చేరితే... వైసీపీకి ఇవ్వనున్న కేంద్ర కేబినెట్ బెర్తులపై జగన్ కు అమిత్ షా వివరించినట్లు చెబుతున్నారు. ఇరువురి మధ్య అరగంటపాటు జరిగిన సమావేశంలో ఎన్డీఏలో చేరాలని జగన్ ను అమిత్ షా ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఒక కేబినెట్ ర్యాంకు... రెండు ఎంవోఎస్ మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ అండ్ కేంద్ర కేబినెట్లోకి వైసీపీ చేరుతుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రముఖంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే నందిగం సురేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. విజయసాయిరెడ్డికి కేబినెట్ ర్యాంక్ తోనూ... మిథున్ రెడ్డి, నందిగం సురేష్ కు సహాయ మంత్రి పదవులు దక్కనున్నాయని చెబుతున్నారు. అయితే, విజయసాయిరెడ్డిపై సీబీఐ అండ్ ఈడీ కేసులు ఉండటంతో ఆయనను కేబినెట్లోకి తీసుకోకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది. ఒకవేళ, విజయసాయికి బెర్త్ దక్కకపోతే ఎస్సీ లేదా బీసీ మహిళకు అవకాశం దక్కొచ్చని చెబుతున్నారు. భవిష్యత్ రాజకీయ అవసరాల కోసమే, వైసీపీని ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానిస్తోందని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో వైసీపీకి పెరగనున్న బలం నేపథ్యంలోనే బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోందని అంటున్నారు. ఏదిఏమైనా ఇరు పార్టీలూ భవిష్యత్ అవసరాలు, పరస్పర లబ్ది చూసుకునే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్... ఎన్డీఏలో చేరితే... బాబు నెత్తిపై పాలు పోసినట్లే..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకస్మిక ఢిల్లీ పర్యటనకు అనేక కారణాలు వినబడుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ, మండలి రద్దు, హైకోర్టు తరలింపు, రాష్ట్ర సమస్యలు, పెండింగ్ నిధులు, గ్రాంట్లు కోసమే ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఇతర కేంద్ర మంత్రులను జగన్ కలిశారని అంటున్నా... అంతకంటే, ముఖ్యమైన రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. ఎన్డీఏలో వైసీపీ చేరబోతోందని, అలాగే, కేంద్ర కేబినెట్లోకి వైసీపీ తీసుకోబోతున్నారనేది ఆ ప్రచారం యొక్క సారాంశం. అయితే, ఎన్డీఏలో వైసీపీ చేరుతుందనే ప్రచారమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఏపీలో రాజకీయ సమీకరణాలు క్షణాల్లో మారిపోవడం ఖాయమంటున్నారు. వైసీపీ... ఎన్డీఏలో చేరి, కేబినెట్ బెర్తులు తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశముంది. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి కొన్ని లాభాలున్నా.... రాజకీయంగా మాత్రం కొన్ని బలమైన వర్గాలు వైసీపీకి దూరమయ్యే అవకాశాలు మొండుగా ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే... కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ చేరడం ద్వారా జగన్ అండ్ విజయసాయిరెడ్డిపై ఉన్న సీబీఐ అండ్ ఈడీ కేసులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కేసుల విషయంలో కొంత ఊరట కలుగొచ్చు. ఇక, టీడీపీ అధినేత, ప్రతిపక్ష లీడర్ చంద్రబాబుపై ఉన్న కేసుల్లో విచారణను వేగవంతం చేసే అవకాశముంది. అలాగే, టీడీపీ హయాంలో అవినీతి జరిగిందంటున్న వైసీపీ....కేంద్ర ప్రభుత్వంతో కలిసి దూకుడుగా ముందుకెళ్లే ఛాన్సుంటుంది. అయితే, ఎన్డీఏ అండ్ కేంద్ర కేబినెట్లో చేరడం ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాలు వైసీపీకి దూరమయ్యే అవకాశముంది. ఎందుకంటే, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముస్లిం అండ్ క్రిస్టియన్ వర్గాలు... వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ వర్గాలు తెలుగుదేశం వైపు చూసే అవకాశముంటుంది. అంతేకాదు, వైసీపీలోని ముస్లిం ప్రజాప్రతినిధులు, నాయకులు ఇరకాటంలో పడతారు. తమ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిధుల విషయంలో వైసీపీ రాజీపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కొమ్ముకాసిన ఓటర్లు దూరమయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది.  ఎన్డీఏ అండ్ కేంద్రంలోకి వైసీపీని ఆహ్వానిస్తే, బీజేపీకి కూడా నష్టాలు ఉంటాయ్. వైసీపీ మిత్రపక్షమైతే... ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఎదగాలనుకుంటున్న బీజేపీకి... ఏపీలో ద్వారాలు మూసుకుపోతాయి. అంతేకాదు, ఏపీలో కలిసి పనిచేసేందుకు అవగాహన కుదుర్చుకుని ముందుకెళ్తున్న జనసేన-బీజేపీ బంధానికి బ్రేకులు పడొచ్చు. వీటన్నింటినీ మించి, రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళన గురించి మాట్లాడే నరేంద్రమోడీ విశ్వసనీయతకు మచ్చ వచ్చే అవకాశముంటుంది. విపక్షాలకు ఒక ఆయుధాన్ని అందించినట్లవుతుంది.

బ్రదర్‌ అనిల్‌ కు తప్పిన ప్రమాదం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ బావమరిది, షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో అనిల్‌తో పాటు గన్‌మెన్లు, డ్రైవర్‌ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను సంఘటనా స్థలానికి వెళ్లారు. తన కారులో అనిల్, గన్‌మెన్లు, డ్రైవర్‌ ను.. ప్రథమ చికిత్స కోసం విజయవాడలోని ఎంజే నాయుడు ఆస్పత్రికి తరలించారు.

రేపే తెలంగాణ కేబినేట్ భేటీ.. కీలక నిర్ణయాలు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ ఉంటుందని అంటున్నారు. ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.  ఇప్పటికే పంచాయతీ రాజ్ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇక మున్సిపల్ యాక్టు అమలులోకి రాబోతుంది. ఇక రెవిన్యూ చట్టంపైనే కసరత్తు చేస్తున్నారు. గతంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా రెవిన్యూ చట్టంపైన సుదీర్ఘంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రెవెన్యూ చట్టం మొత్తాన్ని కూడా మార్పు చేసి దాన్ని అమల్లోకి తీసుకురావల్సిన అవసరం ఉంటుంది.అదేవిధంగా రెవెన్యూ చట్టం మార్పుతో పాటు దాని కింద పని చేసే ఉద్యోగులకు సంబంధించి విధులు బాధ్యతలు కూడా మారనున్నాయి. వీటన్నిటిపైనా ఒక క్లారిటీ తీసుకోవడంతో పాటు క్యాబినెట్ లో దీనిపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎప్పటి నుంచో లాంచ్ చేయాలనే విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది అని సమాచారం.  ఇక పట్టణ ప్రగతి కూడా లాంచ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇప్పటికే థర్డ్ టీఎంసీ అదే విధంగా కొన్ని కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు కూడా ఉన్నాయి. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో సీఏఏకి సంబంధించిన అంశంపైన కూడా ప్రభుత్వం వైఖరి తెలియజేసే అవకాశం ఉంది. మొత్తానికైతే కొన్ని కీలక నిర్ణయాలు లేదంటే కొత్త పథకాలకు సంబంధించిన విషయాలు రేపు ఉండబోయే అవకాశమైతే ఉందని సమాచారం. ఆదివారం రోజు సడెన్ గా క్యాబినెట్ పెట్టారంటే ఖచ్చితంగా కొన్ని కీలక అంశాల పై కేబినెట్ లో మంత్రులు, ముఖ్యమంత్రి చర్చించే చాన్స్ ఉందని సమాచారం.

జగన్ పై 31... చంద్రబాబుపై ఒకే ఒక్కటి... క్రిమినల్ కేసుల్లో వైసీపీ టాప్.!

సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీలన్నీ తమ అభ్యర్ధులపై ఉన్న కేసుల వివరాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్ధుల క్రిమినల్ రికార్డును తమతమ పార్టీ వెబ్ సైట్స్ లో పెట్టేందుకు వివరాలు సిద్ధం చేస్తున్నాయి. అయితే, వైసీపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల్లో మొత్తం 86మందిపై కేసులున్నట్లు చెబుతున్నారు. ఇక, టీడీపీ ప్రజాప్రతినిధుల్లో 15మందిపై కేసులున్నట్లు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అత్యధికంగా 31 కేసులు ఉండగా.... అందరి కంటే అతి తక్కువగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష లీడర్ చంద్రబాబుపై ఒకే ఒక్క కేసు ఉన్నట్లు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.... వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఏపీ ముఖ్యమంత్రి) - 31 కేసులు, కన్నబాబు(వ్యవసాయశాఖ మంత్రి) - 3 కేసులు, కొడాలి నాని ( సివిల్ సప్లై మంత్రి) -  4 కేసులు, పేర్ని నాని(I&PR మంత్రి) - 2 కేసులు, అనిల్ కుమార్ (ఇరిగేషన్ మంత్రి) -  కేసులు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(ఆర్థిక శాఖ మంత్రి) - 2 కేసులు, సురేష్ (విద్యాశాఖ మంత్రి) - 2 కేసులు, గౌతమ్ రెడ్డి(పరిశ్రమల శాఖ మంత్రి) - 3 కేసులు, శంకర నారాయణ (బీసీ సంక్షేమ శాఖ మంత్రి) - 6 కేసులు,  వెల్లంపల్లి శ్రీనివాస్ రావు (దేవాదాయశాఖ మంత్రి) - 2 కేసులు, మోపిదేవి వెంకటరమణ (పశుసంవర్ధక శాఖ మంత్రి) - 2 కేసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి (అటవీశాఖ మంత్రి) -   2 కేసులు, అంజద్ బాషా (ఉప ముఖ్యమంత్రి) - 3 కేసులు, గోరంట్ల  మాధవ్ (ఎంపీ) - 2 కేసులు, విజయ్ సాయి రెడ్డి(ఎంపీ) - 13 కేసులు, చంద్ర శేఖర్(ఎంపీ) - 4 కేసులు, MVV సత్యనారాయణ(ఎంపీ) - 1 కేసు, రంగయ్య(ఎంపీ) - 1 కేసు, అవినాష్ రెడ్డి(ఎంపీ) - 4 కేసులు, బలశౌరి(ఎంపీ) - 2 కేసులు, బ్రహ్మానందరెడ్డి(ఎంపీ) - 1 కేసు, రఘురామకృష్ణంరాజు(ఎంపీ) - 6 కేసులు, భరత్ (ఎంపీ) - 2 కేసులు, మిథున్ రెడ్డి (ఎంపీ) - 3 కేసులు, ధర్మాన ప్రసాదరావు(     ఎమ్మెల్యే) - 2 కేసులు, దాడిశెట్టి రాజా ( ఎమ్మెల్యే) - 15 కేసులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, ఏమేం కేసులు ఉన్నాయో... తమతమ పార్టీ వెబ్ సైట్లలో ఆయా పార్టీలు పెట్టాకే ఫుల్ క్లారిటీ రానుంది.

అమ్మవారి ఆలయం కూల్చివేత.. గ్రామంలో కలకలం

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా సూర్యారావుపాలెంలో కలకలం రేగింది. గ్రామంలోని అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో ఓ వైపు జాతర ఏర్పాట్లు సాగుతూ ఉండగానే ఈ ఘటన జరగడం సర్వత్రా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కావాలనే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒక వ్యక్తి జేసిబీతో వచ్చి ఈ ముఖద్వారాన్ని పడగొట్టేశాడని.. ఆ పడగొట్టిన విషయాన్ని అక్కడ స్థానికులు గమనించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతని వెంటపడి పట్టుకోవటానికి ప్రయత్నించినప్పటికి జేసిబీతో అతడు వేగంగా వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్థానికులు వెల్లడిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగడంతో అంతటా తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అమ్మవారి ఆలయంలో మరికొన్ని రోజులలో జాతర జరగనుంది. ఈ జాతరను గ్రామస్థులు చాలా ఘనంగా చేస్తుంటారని తెలుస్తోంది.  ఆ ఆలంయంలో అమ్మవారిని ఊరివాళ్లంతా గ్రామదేవతగా భావిస్తారు.

పురపాలక చట్టంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్ లో తాజాగా కొత్త కలెక్టర్లకు అవగాహన కార్యక్రమంలో జరిగింది. నగరంలోని మర్రి చెన్నా రెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ లో అదనపు కలెక్టర్ లకు నూతన పురపాలక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ వారికి పలు సూచనలు చేశారు. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మున్సిపల్ చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనిచెయ్యని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రూపాయి లంచం లేకుండా 21 రోజులలో ఇళ్లకు పర్మిషన్ లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల కోణంలో ఆలోచించి పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ఏప్రిల్ నుంచి టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకురానుండటం తో మార్చి లోపు దానికి సంబంధించిన అన్ని లోటు పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. టీఎస్ బి-పాసా తో పాటు మరో రెండు కొత్త యాప్ లను తీసుకువస్తున్నామన్నారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని అన్నారు. మెరుగైన పరిపాలన కోసమే కొత్త మున్సిపల్ చట్టం తీసుకువచ్చినట్టు వెల్లడించారు మంత్రి కేటీఆర్. ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ బాధ్యతను సీఎం కేసీఆర్ మున్సిపల్ చట్టం ద్వారా కల్పించారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను తెలుసుకొని పని చేయాలని కలెక్టర్ లకు సూచించారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా పట్టణాలలో ప్రణాళికాబద్ధమైన ప్రగతిని సాధించవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఏపీలో పీఠముడిలా మండలి వ్యవహారం!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆకస్మికంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని  పేర్కొంటూ అసెంబ్లీ మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆయనకు లిఖిత పూర్వక సమాధానం పంపారు. మండలిలో ఇలాంటి పరిణామాలు జరగడం ఇదే తొలిసారిగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించినందుకు కార్యదర్శి సభాధిక్కారణ విచారణ ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మండలి చరిత్రలో ఈ పరిణామం కూడా మొదటిసారే కానుంది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని చైర్మన్ ఇచ్చిన ఆదేశాల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదేవిదంగా రాష్ట్రంలో రెండు చట్ట సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండటం సంక్లిష్టతను పెంచింది. మామూలుగా శాసన సభ మండలికి వేరు వేరు కార్యదర్శులు ఉండాలి. కానీ ఇంతకు ముందు మండలి కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ పదవీ విరమణ తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులే మండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాసన సభలో వైసీపీకి మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండటం రెండు సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు వ్యవహారంలో తాము చెప్పినట్లే వినాలని అధికార పక్షం మండలిలో సంఖ్యాబలం ఉన్న తమ మాటే వినాలని విపక్ష టిడిపి పట్టుపడుతున్నాయి. అలాగే.. మండలి కార్యదర్శి అధికార పక్షం చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఆదేశాలను వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి బులిటెన్ విడుదల చేయాలనీ రెండ్రోజుల క్రితం మండలి చైర్మన్ ఆయనకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో తన ఆదేశాలు పాటించాలని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ.. తాను ఆ ఆదేశాలను పాటించలేకపోతున్నానని కార్యదర్శి పంపిన సమాధానంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.  చైర్మన్ ఆదేశాలపై కొందరు సాంకేతిక అభ్యంతరాలు లేవనెత్తారని అందువల్ల తాను ఆ ఆదేశాలను పాటించలేక పోతున్నానని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పీటముడి పడింది. కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని చైర్మన్ ఆదేశిస్తుంటే దానిని అమలుచెయ్యటానికి కార్యదర్శి నిరాకరించటం ఏపీలో కొత్త ట్విస్ట్.

కేసీఆర్ చెప్పినా జగన్ వినలేదు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ సీఎంగా అన్ని ప్రాంతాలనూ.. అందరినీ కలుపుకొని పోతూ అన్ని రాష్ట్రాలవారితో సఖ్యత కొనసాగిస్తుండటం విశేషం. ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్నేహపూర్వక వాతావరణం అనేది ప్రధానం. ఆ దిశగానే వైఎస్ జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా అవకాశం ఉన్నప్పుడంతా వైఎస్ జగన్ హైదరాబాద్ విచ్చేసి సీఎం కేసీఆర్ తో సమాలోచనలు జరిపి విభజన సమయంలో పరిష్కరించుకోవాల్సిన అంశాలపై చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు ఆ దిశగా చర్చోపచర్చలు జరిపారు. ముందుముందు కూడా అలాంటి వాతావరణమే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొనే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఏపీ మంత్రి పేర్నినాని తాజాగా ఆర్టీసీ విలీనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ వద్దని తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పారని.. అయినా ఆయన మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదని అన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన ఆర్టీసీ కార్మికులకు ఇంధన పొదుపు, భద్రత అవార్డులు అందించే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అసలేం జరిగిందంటే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారని మంత్రి చెప్పారు. ఇది చాలా పొరపాటని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి కార్మికుల వేతనాలు పెద్ద గుదిబండని కూడా కేసీఆర్ తెలిపినట్లు ఆయన వివరించారు. కానీ జగన్ మాత్రం ఈ విషయాన్ని సవాల్‌గా తీసుకొని విలీన ప్రక్రియను పూర్తి చేశారని పేర్ని నాని వివరించారు. అంతేకాకుండా కార్మికుల విషయంలో ప్రభుత్వ విధానం తప్పని భావిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా పేర్ని నాని వెల్లడించారు. తమ ప్రభుత్వం చేస్తున్న పనుల్లో తప్పులున్నాయని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని.. ఆర్టీసీ కార్మికులు తమపై నమ్మకం ఉంచాలని.. ఇక సీపీఎస్‌ రద్దు, ఆర్టీసీ కార్మికులకు పింఛన్‌ డిమాండ్లను సీఎం జగన్ నెరవేర్చుతారని కూడా పేర్ని నాని వివరించారు.

60 వ రోజుకు చేరిన రాజధాని ఆందోళన.. రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన!

రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో రైతులు చేయి, చేయి కలిపి తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఇవాళ్టికి అరవైయవ రోజుకు చేరాయి. రోజుకో రూపంలో రైతులు, మహిళలు, రైతు కూలీలు తమ నిరసనను తెలుపుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తుళ్లూరు, మందడంలో మహాధర్నాలో కొనసాగించారు. రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు, జై అమరావతి నినాదంతో రాజధాని ప్రాంతం మారుమోగింది. మందడం, తుళ్లూరులో మహిళలు పన్నెండు గంటల నిరాహార దీక్ష చేశారు. మందడంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజధాని అమరావతికి మద్దతు తెలపాలంటూ అసెంబ్లీ సచివాలయం ఉద్యోగులు పోలీసులకు గులాబీలు పంచారు. రాయగుడిలో ముస్లిం మహిళలు స్థానిక దర్గాల్లో పొంగళ్లు పెట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ప్రార్థనలు చేశారు. అమరావతి కోసం ఎన్ని రోజులైనా పోరాడతామని పునరుద్ఘాటించారు. తమను రెచ్చగొట్టాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కూడా తమ బతుకులతో ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  అమరావతితోనే మా భవిత అంటూ తుళ్లూరు మహిళలు శుక్రవారం మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. గ్రామం నడిబొడ్డున ఉన్న ఎర్రమాసు వారి చెరువు చుట్టూ మహిళలు మానవహారంగా ఏర్పడి జై అమరావతి నినాదాలు చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఏడు వందల మీటర్ల దూరం ఉన్న చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ మీద చేయి చేయి కలిపి ఆకుపచ్చ రంగు బెలూన్ లు పట్టుకుని అమరావతికి జై అంటూ నినదించారు. పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ లకు మందడం మహిళలు, రైతులు ఘన నివాళి అర్పించారు. వారి త్యాగాలను మననం చేసుకుంటూ మౌన ప్రదర్శనగా గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వారు చూపిన తెగువను ఆదర్శంగా తీసుకొని అమరావతి ఉద్యమం కొనసాగిస్తామని మహిళలు ప్రతినబూనారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎర్రబాలెం, వెలగపూడి, రాయిపూడి, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో పర్యటించనున్నారు.

తన ప్రత్యర్థిని గుర్తించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ!!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మా రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అని ప్రకటిస్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులకు ఇంకా క్లారిటీ రావడం లేదు. అధిష్టానం కూడా బిజెపికి వ్యతిరేకంగా కార్యాచరణ ఇస్తోంది. దేశంలో ఆర్థిక స్థితికి బీజేపీ విధానాలే కారణమంటూ దీక్షలకు పిలుపునిచ్చింది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్లపై కేంద్రం తీరును తప్పుపడుతూ మళ్లీ ఈ నెల 16న ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా జరిగే ఆందోళనల్లో భాగంగా మండల స్థాయి వరకూ ఆందోళనకు వెళ్లాలని సూచించింది. అధిష్టానం ప్రకటించిన కార్యాచరణపై టి కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు విషయాలను వదిలేసి అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదన కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థిని గుర్తించలేకపోతుందనే  అభిప్రాయానికి నేతలు వచ్చేశారు.  తెలంగాణలో అధికార టీ ఆర్ ఎస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ మాత్రం కాంగ్రెస్సే కానీ, ఇటీవల బిజెపి హడావుడి చేస్తూ మేమే ప్రత్యామ్నాయం అంటూ నిలబడే ప్రయత్నం చేస్తోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం ప్రత్యర్థి పార్టీ అనే విషయాన్ని మర్చిపోయినట్టే ఉంది. రాష్ట్ర స్థాయిలో ఉద్యమ కార్యాచరణ అంతా కాంగ్రెసు టీ ఆర్ ఎస్ మధ్య ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది కానీ, రాష్ట్రంలో ఇప్పటివరకూ అంతగా ప్రభావితం చూపని బీజేపీ లక్ష్యంగా ఆందోళనలు చేయటంతో బిజెపి, కాంగ్రెస్ మధ్య ఫైట్ గా మారిపోయి అధికార టీ ఆర్ ఎస్ పార్టీ లాభపడుతుందన్న అభిప్రాయంతో కొందరు నాయకులు ఉన్నారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మానేసి బీజేపీని టార్గెట్ చేయడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ కు వచ్చే లాభమేమీ ఉండదనే వాదన ఉంది.  ఇటీవల కేంద్ర బడ్జెట్ మీద మాజీ కేంద్ర మంత్రి చిదంబరంతో సెమినార్ నిర్వహించారు. దీంట్లో కూడా ఎక్కువగా బీజేపీ లక్ష్యంగానే కార్యాచరణ జరిగింది. బీజేపీని వదిలేసి తెలంగాణలో ప్రత్యర్థి పార్టీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సమస్యలపై పోరాటం చేస్తే ఉద్యమాలకు ఊతమిచ్చినట్టవుతుందని దాంతో కాంగ్రెస్ కేసీఆర్ ను బలంగా ఢీ కొట్టే ప్రయత్నం చేస్తుందనే టాక్ జనంలోకి వెళుతోంది. ఇది రాజకీయంగా కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశం, కొందరు సీనియర్ లు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణలో రాజకీయ అవసరాలు ప్రత్యర్థి ఎవరన్నది గుర్తించి ఉద్యమాలు చేయాలన్నదే ప్రధాన అంశం. ఇప్పటివరకు టీ ఆర్ ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పినా ఆశించిన రీతిలో కాంగ్రెస్ కు వర్కౌట్ కాలేదు. కానీ, టి ఆర్ ఎస్ లక్ష్యంగా ఉద్యమాలు చేయడం మానేసి ఏఐసీసీ ఇచ్చే కార్యాచరణకే పరిమితం కావడంపై నేతలు అసంతృప్తిగా ఉన్నారు.

మెట్రో అధికారుల తీరుపై కిషన్ రెడ్డి అసహనం.. ఈరోజు మెట్రోలో ప్రయాణం!!

హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలవలేదని బిజెపి ప్రజాప్రతినిధులు సీరియస్ అవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది బిజెపి. ఈ నేపథ్యంలో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని చెప్పేందుకు ఇవాళ మెట్రోలో ప్రయాణం చేయనున్నారు బిజెపి నేతలు. ఈ నెల ఏడున జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు సేవలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ ఈ రూటును ప్రారంభించారు, ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సిన అందరి నేతలను పిలిచారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులకు మాత్రం ఆహ్వానం అందలేదట. దీనిపై రామచంద్రరావు అదే రోజున అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకుంటానని సంబంధిత వేదికలపై ఫిర్యాదు చేస్తానన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చివరి నిముషంలో సమాచారమిచ్చారని తెలుస్తుంది. ఒకవైపు పార్లమెంట్ సెషన్స్ నడుస్తుంటే ముందస్తు సమాచారం లేకుండా ఇలా ప్రోగ్రాం ఫిక్స్ చేస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందకపోవడంపై బీజేపీ మండిపడుతోంది. తమ భాగస్వామి కూడా ఉందని చెప్పేందుకు బిజెపి నేతలు ఇవాళ మెట్రోలో ప్రయాణించనున్నారు. ఈ కార్యక్రమానికి మెట్రో అధికారులను కూడా పిలిచారు. మధ్యాహ్నం మెట్రో అధికారులతో రివ్యూ చేయనున్న కిషన్ రెడ్డి ఆ తరువాత జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర నేతలతో కలిసి ప్రయాణించనున్నారు.

కేంద్రం వద్ద ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తిన సీఎం జగన్...

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి కేంద్రం వద్ద లేవనెత్తారు ముఖ్యమంత్రి జగన్. హోదా కేంద్రం పరిధిలోనిదేనని వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అమిత్ షాను కోరారాయన. అలాగే పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు 838 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు తెలిపారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు రివైజ్ అంచనాలు 55,549 కోట్ల రూపాయలుగా కేంద్ర జల వనరుల శాఖ సాంకేతిక కమిటీ ఆమోదించిందని, దీనికి పరిపాలన అనుమతి వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన దానిలో కేంద్రం నుంచి రావలసిన 3360 కోట్లు ఇప్పించాలన్నారు. వెనకబడిన జిల్లాలకు గడిచిన మూడేళ్ళుగా ఎలాంటి నిధులు రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రెవిన్యూ లోటు భర్తీకి సంబంధించి రావలసిన 8968 కోట్లు ఇప్పించాల్సిందిగా కోరారు. ఇటు రాజధాని నిర్మాణం కోసం 2500 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు.  అటు మూడు రాజధానుల అంశాన్ని కూడా కులంకషంగా అమిత్ షాకి వివరించారు జగన్. హైకోర్టును కర్నూలుకు తరలించటానికి త్వరగా ఆదేశాలు వచ్చేలా చూడాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. గడిచిన రెండు నెలలుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు వివరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను మండలి అడ్డుకొనే ప్రయత్నం చేసి అపహాస్యం చేసిందన్నారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమండ్ చేసిందని మిగిలిన చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు పారిశ్రామిక ప్రగతి సాగునీటి రంగానికి సంబంధించి వీలైనంత సాయం చెయ్యాలి అని అమిత్ షాను కోరారు. అలాగే దిశ చట్టాన్ని ఆమోదించేలా చర్యలు తీసుకువాలని కోరారు. ఇవాళ కూడా జగన్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.

బాబు టార్గెట్ గా వైసీపీ... జగనే లక్ష్యంగా టీడీపీ... ఏపీలో హైఓల్టేజ్ ఐటీ వార్... 

ఐటీ రైడ్స్‌పై ఏపీలో హైఓల్టేజ్ పొలిటికల్‌ వార్ జరుగుతోంది. అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం... పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. చంద్రబాబు టార్గెట్‌గా మంత్రులు ఘాటు కామెంట్స్ చేస్తుంటే.... ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యంగా రివర్స్ కౌంటరిస్తోంది టీడీపీ. అయితే, ఐటీ రైడ్స్ వ్యవహారంలో చంద్రబాబును కార్నర్ చేసేందుకు అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే, మంత్రుల నుంచి ముఖ్యనేతల వరకు అందరూ బాబు టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. ఏపీ రైడ్స్ లో బయటపడ్డ అక్రమాస్తులన్నీ చంద్రబాబువేనంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మాజీ పీఎస్‌ ఇంట్లోనే 2వేల కోట్లు అక్రమాస్తులు దొరికితే... ఇక, చంద్రబాబును పట్టుకుంటే... ఎన్ని లక్షల కోట్లు దొరుకుతాయోనంటూ... మాటల తూటాలు వదులుతున్నారు. ఇప్పుడు లాగింది తీగ మాత్రమేనని డొంక చాలా పెద్దగుందంటూ ఐటీ అధికారుల మాదిరిగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రా అవినీతి అనకొండ చంద్రబాబు... అంటూ ఘాటైన పంచ్‌ డైలాగులు పేల్చుతున్నారు. అయినా, తన మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. నిప్పునని చెప్పుకునే చంద్రబాబు ...ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ కామెంట్స్‌కు తెలుగుదేశం నేతలు దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. అసలు, ఐటీ దాడులతో టీడీపీకి సంబంధమేంటంటూ యనమల ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి... అందరినీ అందులోకి లాగేందుకు చూస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఇక, నారా లోకేష్ కూడా వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. చంద్రబాబులో లేని అవినీతిని వెతకడం కంటే గుడ్డుపై ఈకలు పీకడం ఈజీ అంటూ అధికార పార్టీకి కౌంటరిచ్చారు. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు అవినీతి బట్టబయలైందంటూ అధికార వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే.... దొంగే ...దొంగన్నట్లుగా జగన్ పార్టీ నేతల తీరు ఉందంటూ తెలుగుదేశం స్ట్రాంగ్ కౌంటరిస్తోంది.