రేపే తెలంగాణ కేబినేట్ భేటీ.. కీలక నిర్ణయాలు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ ఉంటుందని అంటున్నారు. ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.  ఇప్పటికే పంచాయతీ రాజ్ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇక మున్సిపల్ యాక్టు అమలులోకి రాబోతుంది. ఇక రెవిన్యూ చట్టంపైనే కసరత్తు చేస్తున్నారు. గతంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా రెవిన్యూ చట్టంపైన సుదీర్ఘంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రెవెన్యూ చట్టం మొత్తాన్ని కూడా మార్పు చేసి దాన్ని అమల్లోకి తీసుకురావల్సిన అవసరం ఉంటుంది.అదేవిధంగా రెవెన్యూ చట్టం మార్పుతో పాటు దాని కింద పని చేసే ఉద్యోగులకు సంబంధించి విధులు బాధ్యతలు కూడా మారనున్నాయి. వీటన్నిటిపైనా ఒక క్లారిటీ తీసుకోవడంతో పాటు క్యాబినెట్ లో దీనిపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎప్పటి నుంచో లాంచ్ చేయాలనే విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది అని సమాచారం.  ఇక పట్టణ ప్రగతి కూడా లాంచ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇప్పటికే థర్డ్ టీఎంసీ అదే విధంగా కొన్ని కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు కూడా ఉన్నాయి. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో సీఏఏకి సంబంధించిన అంశంపైన కూడా ప్రభుత్వం వైఖరి తెలియజేసే అవకాశం ఉంది. మొత్తానికైతే కొన్ని కీలక నిర్ణయాలు లేదంటే కొత్త పథకాలకు సంబంధించిన విషయాలు రేపు ఉండబోయే అవకాశమైతే ఉందని సమాచారం. ఆదివారం రోజు సడెన్ గా క్యాబినెట్ పెట్టారంటే ఖచ్చితంగా కొన్ని కీలక అంశాల పై కేబినెట్ లో మంత్రులు, ముఖ్యమంత్రి చర్చించే చాన్స్ ఉందని సమాచారం.

జగన్ పై 31... చంద్రబాబుపై ఒకే ఒక్కటి... క్రిమినల్ కేసుల్లో వైసీపీ టాప్.!

సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీలన్నీ తమ అభ్యర్ధులపై ఉన్న కేసుల వివరాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్ధుల క్రిమినల్ రికార్డును తమతమ పార్టీ వెబ్ సైట్స్ లో పెట్టేందుకు వివరాలు సిద్ధం చేస్తున్నాయి. అయితే, వైసీపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల్లో మొత్తం 86మందిపై కేసులున్నట్లు చెబుతున్నారు. ఇక, టీడీపీ ప్రజాప్రతినిధుల్లో 15మందిపై కేసులున్నట్లు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అత్యధికంగా 31 కేసులు ఉండగా.... అందరి కంటే అతి తక్కువగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష లీడర్ చంద్రబాబుపై ఒకే ఒక్క కేసు ఉన్నట్లు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.... వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఏపీ ముఖ్యమంత్రి) - 31 కేసులు, కన్నబాబు(వ్యవసాయశాఖ మంత్రి) - 3 కేసులు, కొడాలి నాని ( సివిల్ సప్లై మంత్రి) -  4 కేసులు, పేర్ని నాని(I&PR మంత్రి) - 2 కేసులు, అనిల్ కుమార్ (ఇరిగేషన్ మంత్రి) -  కేసులు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(ఆర్థిక శాఖ మంత్రి) - 2 కేసులు, సురేష్ (విద్యాశాఖ మంత్రి) - 2 కేసులు, గౌతమ్ రెడ్డి(పరిశ్రమల శాఖ మంత్రి) - 3 కేసులు, శంకర నారాయణ (బీసీ సంక్షేమ శాఖ మంత్రి) - 6 కేసులు,  వెల్లంపల్లి శ్రీనివాస్ రావు (దేవాదాయశాఖ మంత్రి) - 2 కేసులు, మోపిదేవి వెంకటరమణ (పశుసంవర్ధక శాఖ మంత్రి) - 2 కేసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి (అటవీశాఖ మంత్రి) -   2 కేసులు, అంజద్ బాషా (ఉప ముఖ్యమంత్రి) - 3 కేసులు, గోరంట్ల  మాధవ్ (ఎంపీ) - 2 కేసులు, విజయ్ సాయి రెడ్డి(ఎంపీ) - 13 కేసులు, చంద్ర శేఖర్(ఎంపీ) - 4 కేసులు, MVV సత్యనారాయణ(ఎంపీ) - 1 కేసు, రంగయ్య(ఎంపీ) - 1 కేసు, అవినాష్ రెడ్డి(ఎంపీ) - 4 కేసులు, బలశౌరి(ఎంపీ) - 2 కేసులు, బ్రహ్మానందరెడ్డి(ఎంపీ) - 1 కేసు, రఘురామకృష్ణంరాజు(ఎంపీ) - 6 కేసులు, భరత్ (ఎంపీ) - 2 కేసులు, మిథున్ రెడ్డి (ఎంపీ) - 3 కేసులు, ధర్మాన ప్రసాదరావు(     ఎమ్మెల్యే) - 2 కేసులు, దాడిశెట్టి రాజా ( ఎమ్మెల్యే) - 15 కేసులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, ఏమేం కేసులు ఉన్నాయో... తమతమ పార్టీ వెబ్ సైట్లలో ఆయా పార్టీలు పెట్టాకే ఫుల్ క్లారిటీ రానుంది.

అమ్మవారి ఆలయం కూల్చివేత.. గ్రామంలో కలకలం

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా సూర్యారావుపాలెంలో కలకలం రేగింది. గ్రామంలోని అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో ఓ వైపు జాతర ఏర్పాట్లు సాగుతూ ఉండగానే ఈ ఘటన జరగడం సర్వత్రా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కావాలనే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒక వ్యక్తి జేసిబీతో వచ్చి ఈ ముఖద్వారాన్ని పడగొట్టేశాడని.. ఆ పడగొట్టిన విషయాన్ని అక్కడ స్థానికులు గమనించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతని వెంటపడి పట్టుకోవటానికి ప్రయత్నించినప్పటికి జేసిబీతో అతడు వేగంగా వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్థానికులు వెల్లడిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగడంతో అంతటా తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అమ్మవారి ఆలయంలో మరికొన్ని రోజులలో జాతర జరగనుంది. ఈ జాతరను గ్రామస్థులు చాలా ఘనంగా చేస్తుంటారని తెలుస్తోంది.  ఆ ఆలంయంలో అమ్మవారిని ఊరివాళ్లంతా గ్రామదేవతగా భావిస్తారు.

పురపాలక చట్టంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్ లో తాజాగా కొత్త కలెక్టర్లకు అవగాహన కార్యక్రమంలో జరిగింది. నగరంలోని మర్రి చెన్నా రెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ లో అదనపు కలెక్టర్ లకు నూతన పురపాలక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ వారికి పలు సూచనలు చేశారు. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మున్సిపల్ చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనిచెయ్యని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రూపాయి లంచం లేకుండా 21 రోజులలో ఇళ్లకు పర్మిషన్ లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల కోణంలో ఆలోచించి పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ఏప్రిల్ నుంచి టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకురానుండటం తో మార్చి లోపు దానికి సంబంధించిన అన్ని లోటు పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. టీఎస్ బి-పాసా తో పాటు మరో రెండు కొత్త యాప్ లను తీసుకువస్తున్నామన్నారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని అన్నారు. మెరుగైన పరిపాలన కోసమే కొత్త మున్సిపల్ చట్టం తీసుకువచ్చినట్టు వెల్లడించారు మంత్రి కేటీఆర్. ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ బాధ్యతను సీఎం కేసీఆర్ మున్సిపల్ చట్టం ద్వారా కల్పించారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను తెలుసుకొని పని చేయాలని కలెక్టర్ లకు సూచించారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా పట్టణాలలో ప్రణాళికాబద్ధమైన ప్రగతిని సాధించవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఏపీలో పీఠముడిలా మండలి వ్యవహారం!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆకస్మికంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని  పేర్కొంటూ అసెంబ్లీ మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆయనకు లిఖిత పూర్వక సమాధానం పంపారు. మండలిలో ఇలాంటి పరిణామాలు జరగడం ఇదే తొలిసారిగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించినందుకు కార్యదర్శి సభాధిక్కారణ విచారణ ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మండలి చరిత్రలో ఈ పరిణామం కూడా మొదటిసారే కానుంది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని చైర్మన్ ఇచ్చిన ఆదేశాల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదేవిదంగా రాష్ట్రంలో రెండు చట్ట సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండటం సంక్లిష్టతను పెంచింది. మామూలుగా శాసన సభ మండలికి వేరు వేరు కార్యదర్శులు ఉండాలి. కానీ ఇంతకు ముందు మండలి కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ పదవీ విరమణ తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులే మండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాసన సభలో వైసీపీకి మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండటం రెండు సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు వ్యవహారంలో తాము చెప్పినట్లే వినాలని అధికార పక్షం మండలిలో సంఖ్యాబలం ఉన్న తమ మాటే వినాలని విపక్ష టిడిపి పట్టుపడుతున్నాయి. అలాగే.. మండలి కార్యదర్శి అధికార పక్షం చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఆదేశాలను వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి బులిటెన్ విడుదల చేయాలనీ రెండ్రోజుల క్రితం మండలి చైర్మన్ ఆయనకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో తన ఆదేశాలు పాటించాలని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ.. తాను ఆ ఆదేశాలను పాటించలేకపోతున్నానని కార్యదర్శి పంపిన సమాధానంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.  చైర్మన్ ఆదేశాలపై కొందరు సాంకేతిక అభ్యంతరాలు లేవనెత్తారని అందువల్ల తాను ఆ ఆదేశాలను పాటించలేక పోతున్నానని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పీటముడి పడింది. కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని చైర్మన్ ఆదేశిస్తుంటే దానిని అమలుచెయ్యటానికి కార్యదర్శి నిరాకరించటం ఏపీలో కొత్త ట్విస్ట్.

కేసీఆర్ చెప్పినా జగన్ వినలేదు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ సీఎంగా అన్ని ప్రాంతాలనూ.. అందరినీ కలుపుకొని పోతూ అన్ని రాష్ట్రాలవారితో సఖ్యత కొనసాగిస్తుండటం విశేషం. ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్నేహపూర్వక వాతావరణం అనేది ప్రధానం. ఆ దిశగానే వైఎస్ జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా అవకాశం ఉన్నప్పుడంతా వైఎస్ జగన్ హైదరాబాద్ విచ్చేసి సీఎం కేసీఆర్ తో సమాలోచనలు జరిపి విభజన సమయంలో పరిష్కరించుకోవాల్సిన అంశాలపై చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు ఆ దిశగా చర్చోపచర్చలు జరిపారు. ముందుముందు కూడా అలాంటి వాతావరణమే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొనే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఏపీ మంత్రి పేర్నినాని తాజాగా ఆర్టీసీ విలీనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ వద్దని తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పారని.. అయినా ఆయన మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదని అన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన ఆర్టీసీ కార్మికులకు ఇంధన పొదుపు, భద్రత అవార్డులు అందించే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అసలేం జరిగిందంటే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారని మంత్రి చెప్పారు. ఇది చాలా పొరపాటని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి కార్మికుల వేతనాలు పెద్ద గుదిబండని కూడా కేసీఆర్ తెలిపినట్లు ఆయన వివరించారు. కానీ జగన్ మాత్రం ఈ విషయాన్ని సవాల్‌గా తీసుకొని విలీన ప్రక్రియను పూర్తి చేశారని పేర్ని నాని వివరించారు. అంతేకాకుండా కార్మికుల విషయంలో ప్రభుత్వ విధానం తప్పని భావిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా పేర్ని నాని వెల్లడించారు. తమ ప్రభుత్వం చేస్తున్న పనుల్లో తప్పులున్నాయని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని.. ఆర్టీసీ కార్మికులు తమపై నమ్మకం ఉంచాలని.. ఇక సీపీఎస్‌ రద్దు, ఆర్టీసీ కార్మికులకు పింఛన్‌ డిమాండ్లను సీఎం జగన్ నెరవేర్చుతారని కూడా పేర్ని నాని వివరించారు.

60 వ రోజుకు చేరిన రాజధాని ఆందోళన.. రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన!

రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో రైతులు చేయి, చేయి కలిపి తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఇవాళ్టికి అరవైయవ రోజుకు చేరాయి. రోజుకో రూపంలో రైతులు, మహిళలు, రైతు కూలీలు తమ నిరసనను తెలుపుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తుళ్లూరు, మందడంలో మహాధర్నాలో కొనసాగించారు. రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు, జై అమరావతి నినాదంతో రాజధాని ప్రాంతం మారుమోగింది. మందడం, తుళ్లూరులో మహిళలు పన్నెండు గంటల నిరాహార దీక్ష చేశారు. మందడంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజధాని అమరావతికి మద్దతు తెలపాలంటూ అసెంబ్లీ సచివాలయం ఉద్యోగులు పోలీసులకు గులాబీలు పంచారు. రాయగుడిలో ముస్లిం మహిళలు స్థానిక దర్గాల్లో పొంగళ్లు పెట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ప్రార్థనలు చేశారు. అమరావతి కోసం ఎన్ని రోజులైనా పోరాడతామని పునరుద్ఘాటించారు. తమను రెచ్చగొట్టాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కూడా తమ బతుకులతో ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  అమరావతితోనే మా భవిత అంటూ తుళ్లూరు మహిళలు శుక్రవారం మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. గ్రామం నడిబొడ్డున ఉన్న ఎర్రమాసు వారి చెరువు చుట్టూ మహిళలు మానవహారంగా ఏర్పడి జై అమరావతి నినాదాలు చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఏడు వందల మీటర్ల దూరం ఉన్న చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ మీద చేయి చేయి కలిపి ఆకుపచ్చ రంగు బెలూన్ లు పట్టుకుని అమరావతికి జై అంటూ నినదించారు. పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ లకు మందడం మహిళలు, రైతులు ఘన నివాళి అర్పించారు. వారి త్యాగాలను మననం చేసుకుంటూ మౌన ప్రదర్శనగా గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వారు చూపిన తెగువను ఆదర్శంగా తీసుకొని అమరావతి ఉద్యమం కొనసాగిస్తామని మహిళలు ప్రతినబూనారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎర్రబాలెం, వెలగపూడి, రాయిపూడి, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో పర్యటించనున్నారు.

తన ప్రత్యర్థిని గుర్తించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ!!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మా రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అని ప్రకటిస్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులకు ఇంకా క్లారిటీ రావడం లేదు. అధిష్టానం కూడా బిజెపికి వ్యతిరేకంగా కార్యాచరణ ఇస్తోంది. దేశంలో ఆర్థిక స్థితికి బీజేపీ విధానాలే కారణమంటూ దీక్షలకు పిలుపునిచ్చింది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్లపై కేంద్రం తీరును తప్పుపడుతూ మళ్లీ ఈ నెల 16న ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా జరిగే ఆందోళనల్లో భాగంగా మండల స్థాయి వరకూ ఆందోళనకు వెళ్లాలని సూచించింది. అధిష్టానం ప్రకటించిన కార్యాచరణపై టి కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు విషయాలను వదిలేసి అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదన కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థిని గుర్తించలేకపోతుందనే  అభిప్రాయానికి నేతలు వచ్చేశారు.  తెలంగాణలో అధికార టీ ఆర్ ఎస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ మాత్రం కాంగ్రెస్సే కానీ, ఇటీవల బిజెపి హడావుడి చేస్తూ మేమే ప్రత్యామ్నాయం అంటూ నిలబడే ప్రయత్నం చేస్తోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం ప్రత్యర్థి పార్టీ అనే విషయాన్ని మర్చిపోయినట్టే ఉంది. రాష్ట్ర స్థాయిలో ఉద్యమ కార్యాచరణ అంతా కాంగ్రెసు టీ ఆర్ ఎస్ మధ్య ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది కానీ, రాష్ట్రంలో ఇప్పటివరకూ అంతగా ప్రభావితం చూపని బీజేపీ లక్ష్యంగా ఆందోళనలు చేయటంతో బిజెపి, కాంగ్రెస్ మధ్య ఫైట్ గా మారిపోయి అధికార టీ ఆర్ ఎస్ పార్టీ లాభపడుతుందన్న అభిప్రాయంతో కొందరు నాయకులు ఉన్నారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మానేసి బీజేపీని టార్గెట్ చేయడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ కు వచ్చే లాభమేమీ ఉండదనే వాదన ఉంది.  ఇటీవల కేంద్ర బడ్జెట్ మీద మాజీ కేంద్ర మంత్రి చిదంబరంతో సెమినార్ నిర్వహించారు. దీంట్లో కూడా ఎక్కువగా బీజేపీ లక్ష్యంగానే కార్యాచరణ జరిగింది. బీజేపీని వదిలేసి తెలంగాణలో ప్రత్యర్థి పార్టీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సమస్యలపై పోరాటం చేస్తే ఉద్యమాలకు ఊతమిచ్చినట్టవుతుందని దాంతో కాంగ్రెస్ కేసీఆర్ ను బలంగా ఢీ కొట్టే ప్రయత్నం చేస్తుందనే టాక్ జనంలోకి వెళుతోంది. ఇది రాజకీయంగా కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశం, కొందరు సీనియర్ లు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణలో రాజకీయ అవసరాలు ప్రత్యర్థి ఎవరన్నది గుర్తించి ఉద్యమాలు చేయాలన్నదే ప్రధాన అంశం. ఇప్పటివరకు టీ ఆర్ ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పినా ఆశించిన రీతిలో కాంగ్రెస్ కు వర్కౌట్ కాలేదు. కానీ, టి ఆర్ ఎస్ లక్ష్యంగా ఉద్యమాలు చేయడం మానేసి ఏఐసీసీ ఇచ్చే కార్యాచరణకే పరిమితం కావడంపై నేతలు అసంతృప్తిగా ఉన్నారు.

మెట్రో అధికారుల తీరుపై కిషన్ రెడ్డి అసహనం.. ఈరోజు మెట్రోలో ప్రయాణం!!

హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలవలేదని బిజెపి ప్రజాప్రతినిధులు సీరియస్ అవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది బిజెపి. ఈ నేపథ్యంలో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని చెప్పేందుకు ఇవాళ మెట్రోలో ప్రయాణం చేయనున్నారు బిజెపి నేతలు. ఈ నెల ఏడున జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు సేవలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ ఈ రూటును ప్రారంభించారు, ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సిన అందరి నేతలను పిలిచారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులకు మాత్రం ఆహ్వానం అందలేదట. దీనిపై రామచంద్రరావు అదే రోజున అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకుంటానని సంబంధిత వేదికలపై ఫిర్యాదు చేస్తానన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చివరి నిముషంలో సమాచారమిచ్చారని తెలుస్తుంది. ఒకవైపు పార్లమెంట్ సెషన్స్ నడుస్తుంటే ముందస్తు సమాచారం లేకుండా ఇలా ప్రోగ్రాం ఫిక్స్ చేస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందకపోవడంపై బీజేపీ మండిపడుతోంది. తమ భాగస్వామి కూడా ఉందని చెప్పేందుకు బిజెపి నేతలు ఇవాళ మెట్రోలో ప్రయాణించనున్నారు. ఈ కార్యక్రమానికి మెట్రో అధికారులను కూడా పిలిచారు. మధ్యాహ్నం మెట్రో అధికారులతో రివ్యూ చేయనున్న కిషన్ రెడ్డి ఆ తరువాత జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర నేతలతో కలిసి ప్రయాణించనున్నారు.

కేంద్రం వద్ద ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తిన సీఎం జగన్...

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి కేంద్రం వద్ద లేవనెత్తారు ముఖ్యమంత్రి జగన్. హోదా కేంద్రం పరిధిలోనిదేనని వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అమిత్ షాను కోరారాయన. అలాగే పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు 838 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు తెలిపారు. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు రివైజ్ అంచనాలు 55,549 కోట్ల రూపాయలుగా కేంద్ర జల వనరుల శాఖ సాంకేతిక కమిటీ ఆమోదించిందని, దీనికి పరిపాలన అనుమతి వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన దానిలో కేంద్రం నుంచి రావలసిన 3360 కోట్లు ఇప్పించాలన్నారు. వెనకబడిన జిల్లాలకు గడిచిన మూడేళ్ళుగా ఎలాంటి నిధులు రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రెవిన్యూ లోటు భర్తీకి సంబంధించి రావలసిన 8968 కోట్లు ఇప్పించాల్సిందిగా కోరారు. ఇటు రాజధాని నిర్మాణం కోసం 2500 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు.  అటు మూడు రాజధానుల అంశాన్ని కూడా కులంకషంగా అమిత్ షాకి వివరించారు జగన్. హైకోర్టును కర్నూలుకు తరలించటానికి త్వరగా ఆదేశాలు వచ్చేలా చూడాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. గడిచిన రెండు నెలలుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు వివరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను మండలి అడ్డుకొనే ప్రయత్నం చేసి అపహాస్యం చేసిందన్నారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమండ్ చేసిందని మిగిలిన చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు పారిశ్రామిక ప్రగతి సాగునీటి రంగానికి సంబంధించి వీలైనంత సాయం చెయ్యాలి అని అమిత్ షాను కోరారు. అలాగే దిశ చట్టాన్ని ఆమోదించేలా చర్యలు తీసుకువాలని కోరారు. ఇవాళ కూడా జగన్ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.

బాబు టార్గెట్ గా వైసీపీ... జగనే లక్ష్యంగా టీడీపీ... ఏపీలో హైఓల్టేజ్ ఐటీ వార్... 

ఐటీ రైడ్స్‌పై ఏపీలో హైఓల్టేజ్ పొలిటికల్‌ వార్ జరుగుతోంది. అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం... పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. చంద్రబాబు టార్గెట్‌గా మంత్రులు ఘాటు కామెంట్స్ చేస్తుంటే.... ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యంగా రివర్స్ కౌంటరిస్తోంది టీడీపీ. అయితే, ఐటీ రైడ్స్ వ్యవహారంలో చంద్రబాబును కార్నర్ చేసేందుకు అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే, మంత్రుల నుంచి ముఖ్యనేతల వరకు అందరూ బాబు టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. ఏపీ రైడ్స్ లో బయటపడ్డ అక్రమాస్తులన్నీ చంద్రబాబువేనంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మాజీ పీఎస్‌ ఇంట్లోనే 2వేల కోట్లు అక్రమాస్తులు దొరికితే... ఇక, చంద్రబాబును పట్టుకుంటే... ఎన్ని లక్షల కోట్లు దొరుకుతాయోనంటూ... మాటల తూటాలు వదులుతున్నారు. ఇప్పుడు లాగింది తీగ మాత్రమేనని డొంక చాలా పెద్దగుందంటూ ఐటీ అధికారుల మాదిరిగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రా అవినీతి అనకొండ చంద్రబాబు... అంటూ ఘాటైన పంచ్‌ డైలాగులు పేల్చుతున్నారు. అయినా, తన మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. నిప్పునని చెప్పుకునే చంద్రబాబు ...ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వైసీపీ కామెంట్స్‌కు తెలుగుదేశం నేతలు దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. అసలు, ఐటీ దాడులతో టీడీపీకి సంబంధమేంటంటూ యనమల ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి... అందరినీ అందులోకి లాగేందుకు చూస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఇక, నారా లోకేష్ కూడా వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. చంద్రబాబులో లేని అవినీతిని వెతకడం కంటే గుడ్డుపై ఈకలు పీకడం ఈజీ అంటూ అధికార పార్టీకి కౌంటరిచ్చారు. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు అవినీతి బట్టబయలైందంటూ అధికార వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే.... దొంగే ...దొంగన్నట్లుగా జగన్ పార్టీ నేతల తీరు ఉందంటూ తెలుగుదేశం స్ట్రాంగ్ కౌంటరిస్తోంది.

తెలంగాణలో తుపాకుల మోత... మాజీ మావోల ఇళ్లల్లో సోదాలు...

తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఇప్పటివరకు అప్పడప్పుడూ హైదరాబాద్ లో మాత్రమే కనిపించిన తుపాకీ కాల్పులు ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అమెరికన్ల తరహాలో తుపాకి కలిగి ఉండాలనే కోరిక ఇటీవల పెరిగిపోతోంది. గన్ పేల్చాలన్న సరదా... ఏదోఒక టైమ్ లో ఉపయోగపడుతుందన్న లెక్కలతో అక్రమంగా తుపాకులు కొనుగోలుచేసి ఇళ్లల్లో దాచుకుంటున్నారు. ఎప్పుడైనా తీవ్ర ఆవేశానికి గురైనప్పుడో... లేక పట్టలేని సంతోషంలో ఉన్నప్పుడో... నలుగురిలో గొప్ప కోసమే తుపాకీని బయటికి తీసి కాల్పులు జరుపుతున్నారు. దాంతో, జనం ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కాల్పుల మోత ప్రజలను కలవరపెడుతోంది. నెలరోజుల వ్యవధిలో మూడుచోట్ల కాల్పులు జరగడంతో పోలీసుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లిలో భార్యాభర్తల గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన భర్త నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ తర్వాత అక్కన్నపేటలో ఏకే47 ఫైరింగ్ అయితే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఎందుకంటే, పోలీస్ స్టేషన్ లో మాయమైన ఏకే47తో కాల్పులు జరపడం కల్లోలం రేపింది. ఇక, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో ఆర్మీ రిటైర్డ్ జవాను గాల్లోకి కాల్పులు జరపడంతో జనం భయంతో వణికిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో మాజీ సైనికుడు తిరుమల‌రెడ్డి గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. తిరుమలరెడ్డి గాల్లోకి కాల్పులు జరుపుతుండగా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో, తిరుమలరెడ్డి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీనికంటే ముందుగా రెండుసార్లు తిరుమలరెడ్డి కాల్పులు జరిపినా అవి బయటికి రాలేదు. అయితే, మూడోసారి జరిపిన కాల్పులు అతడిని పట్టించాయి. ఆర్మీలో ఉండగా జమ్మూలో తుపాకీ కొనుగోలు చేసిన తిరుమలరెడ్డి... మొత్తం 20 రౌండ్ల బుల్లెట్లలో 14 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇక, మిగిలిన 6 రౌండ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అయితే, తెలంగాణలో పెరిగిపోతున్న గన్ కల్చర్ పై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట ఘటనలోనూ గన్‌ పేల్చాలన్న కోరికతోనే కాల్పులు జరిపినట్లు రిమాండ్ రిపోర్ట్‌ చెబుతోంది. ఇక, తిరుమలరెడ్డి కూడా సరదా కోసమే ఆకతాయిగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, గన్ పేల్చాలన్న సరదా కారణంగా గ్రామాల్లో గన్‌ కల్చర్‌ పెరిగిపోతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో గన్ పేల్చాలన్న సరదా పెరిగిపోవడంతో వివిధ మార్గాల్లో తుపాకులను కొనుగోలుచేసి రహస్యంగా కాల్పులు జరుపుతున్నారని అంటున్నారు. దాంతో, రాష్ట్రవ్యాప్తంగా అక్రమ తుపాకుల లెక్క తేల్చేందుకు మాజీ మావోయిస్టులు, జనశక్తి సభ్యుల ఇళ్లల్లో సోదాలకు సిద్ధమవుతున్నారు. గతంలో, మాజీ మావోయిస్టులు, జనశక్తి సభ్యుల నుంచి గన్స్‌, లోకల్ మేడ్ తుపాకులు, తపంచాలు స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉండటంతో ఆ దిశగా అప్రమత్తయ్యారు. అలాగే, లైసెన్స్ దారుల ఇళ్లల్లోనూ తనిఖీలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

జగన్ ఢిల్లీ టూర్ కి PKయే కారణమట? మోడీ-షానే పిలిచారని ప్రచారం

ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.

స్టేట్ లో జనసేనతో... సెంట్రల్ లో వైసీపీతో... బీజేపీ డబుల్ గేమ్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసలు ఎవరు ఎవరితో జత కడుతున్నారో అర్ధంకాని పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా బీజేపీ-జనసేన... బీజేపీ-వైసీపీ మధ్య సంబంధాల్లో పరస్పర విరుద్ధ భావజాలం కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేనతో కలిసి కాపురం చేస్తోన్న బీజేపీ.... కేంద్రానికి వచ్చేసరికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. స్టేట్ లో కొట్టుకుంటున్న బీజేపీ, వైసీపీలు... ఢిల్లీలో మాత్రం ఒకరికొకరు స్నేహహస్తం చాచుకుంటున్నారు. ఇదే, ఇప్పుడు జనసేనానికి ఇబ్బందిగా మారిందనే మాట వినిపిస్తోంది. కలిసి పని చేయాలని, జగన్‌ ప్రభుత్వంపై ఉద్యమించాలని, జనసేన-బీజేపీ ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకున్నాయి. కానీ ఇంతవరకూ ఉమ్మడి ఉద్యమం పట్టాలెక్కలేదు. మరోవైపు, బీజేపీ అధిష్టానం మాత్రం, సీఎం జగన్‌తోనూ, వైసీపీ ఎంపీలతోనూ క్లోజ్‌గా మూవ్‌ కావడం, వరుసగా జగన్‌ ఢిల్లీ పర్యటనలు, జనసేన అధినేతలో అనుమానపు బీజాలు నాటుతున్నాయంటున్నారు.  జగన్‌ అదేపనిగా ఢిల్లీకి వెళ్లడం ...ప్రధాని మోడీ అండ్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవడాన్ని పవన్‌ సహించలేకపోతున్నారట. ఒకవైపు జగన్‌ ప్రభుత్వంపై పోరాడదామంటూనే, మరోవైపు అదే జగన్‌తో క్లోజ్‌గా మూవ్‌ అవడం అస్సలు అర్థంకావడం లేదని సేనాని అంటున్నారట. అయితే, పవన్‌ను బీజేపీ ఆటలో అరటి పండు చేస్తోందని జనసేన సీనియర్లు లోలోపల రగిలిపోతున్నారట. దాంతో, అసలు ముందుముందు సంసార నావ సాగుతుందా...నడి సంద్రంలో మునిగిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పెళ్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ బంగారు కడియంని కొట్టేశారు.. !

సహజంగా వేడుకల్లో కొంతమంది కేటుగాళ్లు తమ చేతి వాటాన్ని చూపుతుంటారు. తాజాగా ఓ వింత అనుభవం తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఎదురైంది. తాజాగా ఓ వివాహ మహోత్సవానికి వెళ్లిన శ్రీనివాస్ గౌడ్ చాలా ఉత్సాహంగా గడిపారు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ వధూవరులనూ దీవిస్తూ అందరినీ పలకరిస్తూ అభిమానులతో ఫొటోలు దిగుతూ చాలా చురుగ్గా ఎంతో హుషారుగా కనిపించారు. అయితే పెళ్లికి వేల మంది రావడంతో అభిమానుల తాకిడి ఎక్కువైంది. కొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందట్లోనే దొంగలు తమ చేతివాటం చూపించారు. ఏకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతికున్న బంగారు కడియాన్ని లేపేశారు. అభిమానులతో హడావిడిగా గడిపిన మంత్రి తన చేతి కడియాన్ని దొంగలు కొట్టేయడాన్ని గమనించలేదు. పెళ్లి.. వేడుక నుంచి బయటకు వచ్చిన తర్వాత తన చేతిని చూసుకున్న శ్రీనివాస్ గౌడ్ కడియం లేకపోవడంతో షాక్ తిన్నారు. తనకు ఎంతో కలిసొచ్చిన ఆ కడియం లేకపోవటంతో దిగాలు పడ్డారు. కొన్నేళ్లుగా ఆ కడియాన్ని ధరిస్తున్నానని ఎంతో కలిసొచ్చినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ కడియం దొరికిన వారెవరైనా తనకి తెచ్చి ఇస్తే లక్ష రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు. సెంట్ మెంట్ అలాంటిది మరి. ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని వస్తువులు ఆభరణాలు కలిసొస్తుంటాయి. ఈ జాబితాలో వాహనాలూ, వాటి నెంబర్స్ కూడా ఉంటాయి. ఈ కలిసొచ్చిన వస్తువుల విలువ ఎంతైనా వాటికి విలువ కట్టలేం అంతే. కానీ వారి జీవితంలో ఆ వస్తువులు ఎంతో విలువైనవిగా భావిస్తూ ఉంటారు. ఆ లక్కీ వస్తువులు కనబడకపోయినా.. కోల్పోయిన ఆ బాధ వర్ణనాతీతం. మరి శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా అలాంటి అనుభవమే ఎదురుకావడం షాక్ కు గురిచేసే విషయమే.

టీటీడీ సంచలనం.. గరుడ వారధి ప్లైఓవర్ కు తాత్కాళిక బ్రేక్!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవస్థానం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. తాజాగా తిరుపతి కార్పొరేషన్ అధికారులతో టిటిడి పాలక మండలి కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో గరుడ వారధి ప్లైఓవర్ నిర్మాణం పనులను తాత్కాలికంగా నిలిపి వేయాలని బోర్డు నిర్ణయించింది. అయితే గరుడ వారధి ఫ్లైఓవర్ డిజైన్ ఫైనల్ కాలేదని పెద్దలు ఆగమ శాస్త్ర సలహాలు తీసుకుంటామన్నారు బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా ఫ్లై ఓవర్ పై ఇప్పుడే నామాలు పెట్టాల్సిన అవసరం లేదని భావిస్తున్నామన్నారు. ఫైనల్ గా టీటీడీ బోర్డులో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో బసంత్ కుమార్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీషా పాల్గొన్నారు. కార్పొరేషన్ కు టీటీడీ చెల్లించాల్సిన 80 కోట్ల బకాయిలపైనా చర్చ జరిగింది. గరుడ వారిది పిల్లర్ల పై నామాలు వేయడం వల్ల భక్తిభావం పెరుగుతుందనీ ఫ్లై ఓవర్ కు ప్రత్యేకత ఉండాలనే లక్ష్యం తోనే నామాలు వేశామని గిరీషా చెప్పారు. అంతేకాకుండా అనేక విభేదాలతో నడుస్తున్న గరుడ వారధి నిర్మాణానికి ఎట్టకేలకు బ్రేక్ పడినట్లైంది. దాదాపుగా 640 కోట్ల రూపాయలతో తిరుపతిలో నిర్మాణం చేపట్టిన గరుడ వారిది పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సుమారు 425 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన టిటిడి ఇప్పటి వరకు దాదాపుగా 45 శాతం పనులు పూర్తయినా కూడా ఇప్పటికీ ఒక్క పైసా కూడా టీటీడీ చెల్లించలేదని సమాచారం అందుతుంది. టీటీడీ నిధులు ఖర్చు చేయడానికి ముందు నుంచి కొంత మంది భక్తులు తప్పుపట్టడం కోర్టుకెళ్లడంతో.. గరుడ వాది నిర్మాణం ఒక వివాదాస్పదం గానే కొనసాగుతోంది. అయితే దీనిపైన వేసిన నామాలు పైన విషయం కూడా వివాదాస్పదంగా మారిపోయే పరిస్థితి ఉందని తెలుస్తోంది.

వైఎస్ జగన్ కేసు పిబ్రవరి 28కి వాయిదా!

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది.  వచ్చే శుక్రవారం ప్రభుత్వ సెలవు కావడంతో కేసును తదుపరి విచారణను 28కి వాయిదా వేసినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈకేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న జగన్ ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు రాలేకపోయారు అన్న విషయాన్ని న్యాయమూర్తికి ఆయన తరఫు న్యాయవాదులు చెప్పడంతో అందుకు కోర్ట్ అంగీకరించలేదు. ఏ2 నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి కూడా హాజరు కాలేదు. తెలంగాణ విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, విరిగి రాజగోపాల్ మరొక ఇద్దరు ఈ కేసులో హాజరయ్యారు. దీంతో సీబీఐ విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వైఎస్ జగన్ వేసిన పిటిషన్ లో.. ఈడీ కేసులో తప్పక హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ఈరోజు ఢిల్లీ పర్యటణ కారణంగా హాజరు కాకపోవడంతో కేసు 29వ తేదీకి వాయిదా పడింది.  

అదంతా తప్పుడు ప్రచారమే.. టీడీపీపై బురద జల్లుతున్నారు

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఐటీ రైడ్స్ చాలా తీవ్రంగా సాగుతున్నాయి. అయితే ఈ ఐటీ రైడ్స్ లో చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్లు దొరికినట్టు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమ. శ్రీనివాస్ ఇంట్లో 70 నుంచి 80 వేలు మాత్రమే పట్టుబడ్డాయని ఆయన అన్నారు. అదేవిధంగా వేరు వేరు చోట్ల జరిగిన ఐటీ తనిఖీల్లో టీడీపీకి సంబంధం లేదని కూడా ఆయన తెలిపారు. అవినీతి మరకను టీడీపీకి అంటించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు బోండా ఉమ.  మాజీ పీఎస్ శ్రీనివాస్ కు టిడిపితో సంబంధం ఏంటని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని వివరించారు. పీఏలు, పీఎస్ లతో పార్టీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10,15 మంది పీఏలుగా పని చేశారని తెలిపారు. శ్రీనివాస్ పై దాడుల పేరుతో టీడీపీపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోని ఇన్ ఫ్రా కంపెనీపై దాడిని పార్టీకీ అంటగట్టడం హేయమని యనమల అన్నారు. దాడులు జరిగిన ఇన్ ఫ్రా కంపెనీకే జగన్ కాంట్రాక్టులు ఇచ్చారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

బాబు బండారం.. బయటపెడితే ఇక అంతే!!

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ హీట్ పెంచుతుంది. చంద్రబాబు బండారం మొత్తం బయట పడితే ఆయన అక్రమ సంపాదన రెండు లక్షల కోట్ల వరకు ఉంటుందని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పీఎస్ వద్దే సుమారు రెండు వేల కోట్ల వరకు అక్రమాల రికార్డులు దొరికాయంటే ఇక చంద్రబాబు వద్ద ఇంకెన్ని ఉంటాయోనని ఆయన కామెంట్ చేశారు. అలాగే.. ఇప్పుడు బయటపడింది కేవలం తీగ మాత్రమే అని డొంక చాలా పెద్దగా ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ ఎందుకు మాట్లాడట్లేదని కూడా ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా మాట్లాడుతూ.. కేవలం ఒక పర్సనల్ సెక్రెటరీ నివసించే నివాసం వద్దనే ఓ చిన్న అపార్ట్ మెంట్ లో వేలకోట్లకు పైగా డబ్బు... లెక్క చూపలేనంత ఆదాయం.. లభించిందని అన్నారు. ఆ ధనానికి సంబంధించి అక్కడే అవసరమైన పత్రాలన్నీ కనిపించాయంటే అందుకు మూలాధారమైన వ్యక్తి  చంద్రబాబుగారి ఖజానా వద్ద అక్రమ సంపాదన ఇంకెంత ఉండవచ్చో అంచనా వేయచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబు గారు ఇప్పటికీ తమ ప్రభుత్వంపై సవాల్ విసురుతుంటారని సాక్ష్యాలు చూపమని, కేసులుంటే బుక్ చేయమని ఈరోజు కేవలం తన సెక్రెటరీ వద్దె లభించిన రెండు వేల కోట్లే దీనికి సాక్ష్యాలని, తీగ దాకా వచ్చిన సాక్ష్యంతో డొంక లాగటానికి ఎంతో సమయం పట్టదని ఆయన హెచ్చరించారు. అలాగే... బాబుగారి బండారం మొత్తం బయట పడితే అది ఖచ్చితంగా రెండు లక్షల కోట్లకుపైగా ఉంటుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అందుకు తగిన ఆధారాలు ఉన్నట్లు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.