తెలంగాణలో తుపాకుల మోత... మాజీ మావోల ఇళ్లల్లో సోదాలు...

తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఇప్పటివరకు అప్పడప్పుడూ హైదరాబాద్ లో మాత్రమే కనిపించిన తుపాకీ కాల్పులు ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అమెరికన్ల తరహాలో తుపాకి కలిగి ఉండాలనే కోరిక ఇటీవల పెరిగిపోతోంది. గన్ పేల్చాలన్న సరదా... ఏదోఒక టైమ్ లో ఉపయోగపడుతుందన్న లెక్కలతో అక్రమంగా తుపాకులు కొనుగోలుచేసి ఇళ్లల్లో దాచుకుంటున్నారు. ఎప్పుడైనా తీవ్ర ఆవేశానికి గురైనప్పుడో... లేక పట్టలేని సంతోషంలో ఉన్నప్పుడో... నలుగురిలో గొప్ప కోసమే తుపాకీని బయటికి తీసి కాల్పులు జరుపుతున్నారు. దాంతో, జనం ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కాల్పుల మోత ప్రజలను కలవరపెడుతోంది. నెలరోజుల వ్యవధిలో మూడుచోట్ల కాల్పులు జరగడంతో పోలీసుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లిలో భార్యాభర్తల గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన భర్త నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ తర్వాత అక్కన్నపేటలో ఏకే47 ఫైరింగ్ అయితే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఎందుకంటే, పోలీస్ స్టేషన్ లో మాయమైన ఏకే47తో కాల్పులు జరపడం కల్లోలం రేపింది. ఇక, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో ఆర్మీ రిటైర్డ్ జవాను గాల్లోకి కాల్పులు జరపడంతో జనం భయంతో వణికిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో మాజీ సైనికుడు తిరుమల‌రెడ్డి గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. తిరుమలరెడ్డి గాల్లోకి కాల్పులు జరుపుతుండగా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో, తిరుమలరెడ్డి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీనికంటే ముందుగా రెండుసార్లు తిరుమలరెడ్డి కాల్పులు జరిపినా అవి బయటికి రాలేదు. అయితే, మూడోసారి జరిపిన కాల్పులు అతడిని పట్టించాయి. ఆర్మీలో ఉండగా జమ్మూలో తుపాకీ కొనుగోలు చేసిన తిరుమలరెడ్డి... మొత్తం 20 రౌండ్ల బుల్లెట్లలో 14 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇక, మిగిలిన 6 రౌండ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అయితే, తెలంగాణలో పెరిగిపోతున్న గన్ కల్చర్ పై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట ఘటనలోనూ గన్‌ పేల్చాలన్న కోరికతోనే కాల్పులు జరిపినట్లు రిమాండ్ రిపోర్ట్‌ చెబుతోంది. ఇక, తిరుమలరెడ్డి కూడా సరదా కోసమే ఆకతాయిగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, గన్ పేల్చాలన్న సరదా కారణంగా గ్రామాల్లో గన్‌ కల్చర్‌ పెరిగిపోతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో గన్ పేల్చాలన్న సరదా పెరిగిపోవడంతో వివిధ మార్గాల్లో తుపాకులను కొనుగోలుచేసి రహస్యంగా కాల్పులు జరుపుతున్నారని అంటున్నారు. దాంతో, రాష్ట్రవ్యాప్తంగా అక్రమ తుపాకుల లెక్క తేల్చేందుకు మాజీ మావోయిస్టులు, జనశక్తి సభ్యుల ఇళ్లల్లో సోదాలకు సిద్ధమవుతున్నారు. గతంలో, మాజీ మావోయిస్టులు, జనశక్తి సభ్యుల నుంచి గన్స్‌, లోకల్ మేడ్ తుపాకులు, తపంచాలు స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉండటంతో ఆ దిశగా అప్రమత్తయ్యారు. అలాగే, లైసెన్స్ దారుల ఇళ్లల్లోనూ తనిఖీలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

జగన్ ఢిల్లీ టూర్ కి PKయే కారణమట? మోడీ-షానే పిలిచారని ప్రచారం

ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.

స్టేట్ లో జనసేనతో... సెంట్రల్ లో వైసీపీతో... బీజేపీ డబుల్ గేమ్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసలు ఎవరు ఎవరితో జత కడుతున్నారో అర్ధంకాని పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా బీజేపీ-జనసేన... బీజేపీ-వైసీపీ మధ్య సంబంధాల్లో పరస్పర విరుద్ధ భావజాలం కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేనతో కలిసి కాపురం చేస్తోన్న బీజేపీ.... కేంద్రానికి వచ్చేసరికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. స్టేట్ లో కొట్టుకుంటున్న బీజేపీ, వైసీపీలు... ఢిల్లీలో మాత్రం ఒకరికొకరు స్నేహహస్తం చాచుకుంటున్నారు. ఇదే, ఇప్పుడు జనసేనానికి ఇబ్బందిగా మారిందనే మాట వినిపిస్తోంది. కలిసి పని చేయాలని, జగన్‌ ప్రభుత్వంపై ఉద్యమించాలని, జనసేన-బీజేపీ ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకున్నాయి. కానీ ఇంతవరకూ ఉమ్మడి ఉద్యమం పట్టాలెక్కలేదు. మరోవైపు, బీజేపీ అధిష్టానం మాత్రం, సీఎం జగన్‌తోనూ, వైసీపీ ఎంపీలతోనూ క్లోజ్‌గా మూవ్‌ కావడం, వరుసగా జగన్‌ ఢిల్లీ పర్యటనలు, జనసేన అధినేతలో అనుమానపు బీజాలు నాటుతున్నాయంటున్నారు.  జగన్‌ అదేపనిగా ఢిల్లీకి వెళ్లడం ...ప్రధాని మోడీ అండ్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవడాన్ని పవన్‌ సహించలేకపోతున్నారట. ఒకవైపు జగన్‌ ప్రభుత్వంపై పోరాడదామంటూనే, మరోవైపు అదే జగన్‌తో క్లోజ్‌గా మూవ్‌ అవడం అస్సలు అర్థంకావడం లేదని సేనాని అంటున్నారట. అయితే, పవన్‌ను బీజేపీ ఆటలో అరటి పండు చేస్తోందని జనసేన సీనియర్లు లోలోపల రగిలిపోతున్నారట. దాంతో, అసలు ముందుముందు సంసార నావ సాగుతుందా...నడి సంద్రంలో మునిగిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పెళ్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ బంగారు కడియంని కొట్టేశారు.. !

సహజంగా వేడుకల్లో కొంతమంది కేటుగాళ్లు తమ చేతి వాటాన్ని చూపుతుంటారు. తాజాగా ఓ వింత అనుభవం తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఎదురైంది. తాజాగా ఓ వివాహ మహోత్సవానికి వెళ్లిన శ్రీనివాస్ గౌడ్ చాలా ఉత్సాహంగా గడిపారు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ వధూవరులనూ దీవిస్తూ అందరినీ పలకరిస్తూ అభిమానులతో ఫొటోలు దిగుతూ చాలా చురుగ్గా ఎంతో హుషారుగా కనిపించారు. అయితే పెళ్లికి వేల మంది రావడంతో అభిమానుల తాకిడి ఎక్కువైంది. కొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందట్లోనే దొంగలు తమ చేతివాటం చూపించారు. ఏకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతికున్న బంగారు కడియాన్ని లేపేశారు. అభిమానులతో హడావిడిగా గడిపిన మంత్రి తన చేతి కడియాన్ని దొంగలు కొట్టేయడాన్ని గమనించలేదు. పెళ్లి.. వేడుక నుంచి బయటకు వచ్చిన తర్వాత తన చేతిని చూసుకున్న శ్రీనివాస్ గౌడ్ కడియం లేకపోవడంతో షాక్ తిన్నారు. తనకు ఎంతో కలిసొచ్చిన ఆ కడియం లేకపోవటంతో దిగాలు పడ్డారు. కొన్నేళ్లుగా ఆ కడియాన్ని ధరిస్తున్నానని ఎంతో కలిసొచ్చినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ కడియం దొరికిన వారెవరైనా తనకి తెచ్చి ఇస్తే లక్ష రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు. సెంట్ మెంట్ అలాంటిది మరి. ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని వస్తువులు ఆభరణాలు కలిసొస్తుంటాయి. ఈ జాబితాలో వాహనాలూ, వాటి నెంబర్స్ కూడా ఉంటాయి. ఈ కలిసొచ్చిన వస్తువుల విలువ ఎంతైనా వాటికి విలువ కట్టలేం అంతే. కానీ వారి జీవితంలో ఆ వస్తువులు ఎంతో విలువైనవిగా భావిస్తూ ఉంటారు. ఆ లక్కీ వస్తువులు కనబడకపోయినా.. కోల్పోయిన ఆ బాధ వర్ణనాతీతం. మరి శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా అలాంటి అనుభవమే ఎదురుకావడం షాక్ కు గురిచేసే విషయమే.

టీటీడీ సంచలనం.. గరుడ వారధి ప్లైఓవర్ కు తాత్కాళిక బ్రేక్!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవస్థానం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. తాజాగా తిరుపతి కార్పొరేషన్ అధికారులతో టిటిడి పాలక మండలి కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో గరుడ వారధి ప్లైఓవర్ నిర్మాణం పనులను తాత్కాలికంగా నిలిపి వేయాలని బోర్డు నిర్ణయించింది. అయితే గరుడ వారధి ఫ్లైఓవర్ డిజైన్ ఫైనల్ కాలేదని పెద్దలు ఆగమ శాస్త్ర సలహాలు తీసుకుంటామన్నారు బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా ఫ్లై ఓవర్ పై ఇప్పుడే నామాలు పెట్టాల్సిన అవసరం లేదని భావిస్తున్నామన్నారు. ఫైనల్ గా టీటీడీ బోర్డులో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో బసంత్ కుమార్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీషా పాల్గొన్నారు. కార్పొరేషన్ కు టీటీడీ చెల్లించాల్సిన 80 కోట్ల బకాయిలపైనా చర్చ జరిగింది. గరుడ వారిది పిల్లర్ల పై నామాలు వేయడం వల్ల భక్తిభావం పెరుగుతుందనీ ఫ్లై ఓవర్ కు ప్రత్యేకత ఉండాలనే లక్ష్యం తోనే నామాలు వేశామని గిరీషా చెప్పారు. అంతేకాకుండా అనేక విభేదాలతో నడుస్తున్న గరుడ వారధి నిర్మాణానికి ఎట్టకేలకు బ్రేక్ పడినట్లైంది. దాదాపుగా 640 కోట్ల రూపాయలతో తిరుపతిలో నిర్మాణం చేపట్టిన గరుడ వారిది పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సుమారు 425 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన టిటిడి ఇప్పటి వరకు దాదాపుగా 45 శాతం పనులు పూర్తయినా కూడా ఇప్పటికీ ఒక్క పైసా కూడా టీటీడీ చెల్లించలేదని సమాచారం అందుతుంది. టీటీడీ నిధులు ఖర్చు చేయడానికి ముందు నుంచి కొంత మంది భక్తులు తప్పుపట్టడం కోర్టుకెళ్లడంతో.. గరుడ వాది నిర్మాణం ఒక వివాదాస్పదం గానే కొనసాగుతోంది. అయితే దీనిపైన వేసిన నామాలు పైన విషయం కూడా వివాదాస్పదంగా మారిపోయే పరిస్థితి ఉందని తెలుస్తోంది.

వైఎస్ జగన్ కేసు పిబ్రవరి 28కి వాయిదా!

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది.  వచ్చే శుక్రవారం ప్రభుత్వ సెలవు కావడంతో కేసును తదుపరి విచారణను 28కి వాయిదా వేసినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈకేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న జగన్ ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు రాలేకపోయారు అన్న విషయాన్ని న్యాయమూర్తికి ఆయన తరఫు న్యాయవాదులు చెప్పడంతో అందుకు కోర్ట్ అంగీకరించలేదు. ఏ2 నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి కూడా హాజరు కాలేదు. తెలంగాణ విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, విరిగి రాజగోపాల్ మరొక ఇద్దరు ఈ కేసులో హాజరయ్యారు. దీంతో సీబీఐ విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వైఎస్ జగన్ వేసిన పిటిషన్ లో.. ఈడీ కేసులో తప్పక హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ఈరోజు ఢిల్లీ పర్యటణ కారణంగా హాజరు కాకపోవడంతో కేసు 29వ తేదీకి వాయిదా పడింది.  

అదంతా తప్పుడు ప్రచారమే.. టీడీపీపై బురద జల్లుతున్నారు

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఐటీ రైడ్స్ చాలా తీవ్రంగా సాగుతున్నాయి. అయితే ఈ ఐటీ రైడ్స్ లో చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్లు దొరికినట్టు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమ. శ్రీనివాస్ ఇంట్లో 70 నుంచి 80 వేలు మాత్రమే పట్టుబడ్డాయని ఆయన అన్నారు. అదేవిధంగా వేరు వేరు చోట్ల జరిగిన ఐటీ తనిఖీల్లో టీడీపీకి సంబంధం లేదని కూడా ఆయన తెలిపారు. అవినీతి మరకను టీడీపీకి అంటించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు బోండా ఉమ.  మాజీ పీఎస్ శ్రీనివాస్ కు టిడిపితో సంబంధం ఏంటని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని వివరించారు. పీఏలు, పీఎస్ లతో పార్టీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10,15 మంది పీఏలుగా పని చేశారని తెలిపారు. శ్రీనివాస్ పై దాడుల పేరుతో టీడీపీపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోని ఇన్ ఫ్రా కంపెనీపై దాడిని పార్టీకీ అంటగట్టడం హేయమని యనమల అన్నారు. దాడులు జరిగిన ఇన్ ఫ్రా కంపెనీకే జగన్ కాంట్రాక్టులు ఇచ్చారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

బాబు బండారం.. బయటపెడితే ఇక అంతే!!

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ హీట్ పెంచుతుంది. చంద్రబాబు బండారం మొత్తం బయట పడితే ఆయన అక్రమ సంపాదన రెండు లక్షల కోట్ల వరకు ఉంటుందని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పీఎస్ వద్దే సుమారు రెండు వేల కోట్ల వరకు అక్రమాల రికార్డులు దొరికాయంటే ఇక చంద్రబాబు వద్ద ఇంకెన్ని ఉంటాయోనని ఆయన కామెంట్ చేశారు. అలాగే.. ఇప్పుడు బయటపడింది కేవలం తీగ మాత్రమే అని డొంక చాలా పెద్దగా ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ ఎందుకు మాట్లాడట్లేదని కూడా ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా మాట్లాడుతూ.. కేవలం ఒక పర్సనల్ సెక్రెటరీ నివసించే నివాసం వద్దనే ఓ చిన్న అపార్ట్ మెంట్ లో వేలకోట్లకు పైగా డబ్బు... లెక్క చూపలేనంత ఆదాయం.. లభించిందని అన్నారు. ఆ ధనానికి సంబంధించి అక్కడే అవసరమైన పత్రాలన్నీ కనిపించాయంటే అందుకు మూలాధారమైన వ్యక్తి  చంద్రబాబుగారి ఖజానా వద్ద అక్రమ సంపాదన ఇంకెంత ఉండవచ్చో అంచనా వేయచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబు గారు ఇప్పటికీ తమ ప్రభుత్వంపై సవాల్ విసురుతుంటారని సాక్ష్యాలు చూపమని, కేసులుంటే బుక్ చేయమని ఈరోజు కేవలం తన సెక్రెటరీ వద్దె లభించిన రెండు వేల కోట్లే దీనికి సాక్ష్యాలని, తీగ దాకా వచ్చిన సాక్ష్యంతో డొంక లాగటానికి ఎంతో సమయం పట్టదని ఆయన హెచ్చరించారు. అలాగే... బాబుగారి బండారం మొత్తం బయట పడితే అది ఖచ్చితంగా రెండు లక్షల కోట్లకుపైగా ఉంటుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అందుకు తగిన ఆధారాలు ఉన్నట్లు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై క్యాట్ నిర్ణయం 24కి వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఎడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన సస్పెన్షన్ ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వర రావు క్యాట్ ను ఆశ్రయించారు. తాజాగా క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు తరుపున అదేవిధంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసును ఈనెల 24 వ తేదీకి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ వుండటం వలన వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతున్నామని 24వ తేదీకి పూర్తి స్థాయి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పి క్యాట్ స్పష్టం చేసింది. అదేవిధంగా తనకు ఎనిమిది నెలలుగా జీతం ఇవ్వక పోవటమే కాకుండా తనను నిరాధారమైన ఆరోపణలతో సస్పెండ్ చేశారని చెప్పి ఏబీ వెంకటేశ్వర రావు తన పిటిషన్ లో పేర్కొన్నారు. పైగా కొనని పరికరాలని కొనుగోలు చేసినట్టు చూపించటమే కాకుండా అందులో అవినీతికి పాల్పడినట్టు పేర్కొంటూ పైగా తన కుమారుడికి సంబంధం లేని అంశాలను కూడా తన కుమారుడికి సంబంధం ఉన్నట్టు చూపించడం వంటి అంశాలన్నిటిపై కూడా ఏబి వెంకటేశ్వర రావు క్యాట్ ను ఆశ్రయించారు. వీటి ఆధారంగా తనను సస్పెండ్ చేయడం అన్యాయమని చెప్పి ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏబీ వెంకటేశ్వరరావు తరపున సీనియర్ కౌన్సిల్ లో వాదించారు. కాగా ఏపీ ప్రభుత్వం తరపున ప్రకాష్ రెడ్డిని నియమిస్తూ నిన్న ప్రభుత్వం జివో జారీ చేసింది. ప్రభుత్వం తరపున కూడా ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. దాదాపుగా 45నిమిషాల సేపు అటు ప్రభుత్వం తరఫునుంచి ఇటు ఏబి వెంకటేశ్వర రావు తరుపు నుంచి వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత ఈ నెల 24 వ తేదీకి వాయిదా వేస్తూ ఆ రోజు తుది నిర్ణయం వెలువరిస్తామని చెప్పి క్యాట్ స్పష్టం చేసింది.

రెచ్చిపోతున్న రేషన్ మాఫియా!!

తెలంగాణ, ఏపీలలో అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది.  పేదలు నోటి దగ్గరికి చేరాల్సిన రేషన్ బియ్యం సరిహద్దులు దాటిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కాకినాడ పోర్టు ద్వారా వేరే ప్రాంతాలకు తరలిపోతోంది. మధ్యలో ఎన్నో చెక్ పోస్టులు అధికారులు విజిలెన్స్ ఉన్నా దర్జాగా తరలించుకుపోతోంది రేషన్ మాఫియా. పశ్చిమ గోదావరి జిల్లాను అడ్డాగా చేసుకున్న అక్రమార్కులు సరిహద్దు ప్రాంతాలైన చింతలపూడి, రాఘవపురం, గురుభట్లగూడెం గ్రామాల్లో డంపులు పెట్టి లారీలతో లోడ్లకు లోడులు తరలిస్తున్నారు. వందల టన్నుల బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. అయితే పలు ప్రాంతాలను నుంచి తూర్పు గోదావరి జిల్లాకు తరలించి అక్కడ రీసైక్లింగ్ చేస్తున్నారు. దగ్గర్ లోనే కాకినాడ పోర్టు ఉండటంతో ఆ దారిలో దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం పేదల బియ్యం తరలిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మాఫియా పని మరింత ఈజీ అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలలోని కొందరు రైస్ మిల్లర్లు ఈ రేషన్ దందాను వెనుకుండి నడిపిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అంతా ఒక చోట చేర్చి తర్వాత పెద్దపెద్ద లోడులతో సరిహద్దులు దాటిస్తున్నాయి రైసు మిల్లర్ల యాజమాన్యాలు. రేషన్ మాఫియాతో కుమ్మక్కైన అధికారులు రేషన్ బియ్యాన్ని ఎలాంటి తనిఖీలు చేయకుండా సరిహద్దులు దాటిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం లారీలోనే కాదు వ్యాన్ లు, ఆటోల్లోనూ మూటలకు మూటలు తరలిస్తున్నారు. ఈ పాస్ విధానంలో సరుకుల పంపిణీని కూడా డీలర్ లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కార్డుదారులు ఎక్కడైనా బియ్యాన్ని తీసుకునే సౌలభ్యాన్ని వక్రమార్గం పట్టిస్తున్నారు. ప్రతి నెల సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నా కొందరు డీలర్లు కుంటి సాకులతో లబ్ధిదారులను వెనక్కి పంపించేస్తున్నారు. చాలా చోట్ల రెండు నెలలకు ఒకసారి రేషన్ ఇస్తున్నారు. డీలర్ల తీరుతో చాలా పట్టణాల్లో లబ్ధి దారులు విసిగిపోతున్నారు. సరుకులు కూడా తీసుకోవడం లేదు. దాంతో వారి రేషన్ మాఫియా చేతికందుతోంది. రేషన్ డీలర్లు ఈ పాస్ యంత్రాల టెక్నీషియన్ లు, ఎన్ఐటీ టెక్నీషియన్ లు, వీఆర్వోలు, ఫుడ్ ఇన్ స్పెక్టర్ ల అండతో దళారీలు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అరికట్టాల్సిన అధికారగణం చేష్టలుడిగి చూస్తుండటం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.  

బాబును మించిపోతున్న వైఎస్ జగన్!

ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా లోటులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బ్యాంకుల నుంచి అప్పులు తేవడం జరుగుతుంది. సహజంగా ప్రభుత్వ అవసరాలకు అప్పులు తీసుకు రావడం మామూలే. ఆయా కార్పొరేషన్ ల ఆస్తులను తనఖా పెట్టి మరీ తెచ్చిన రుణ మొత్తాలను జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేస్తున్నారు. అదేమంటే.. ప్రభుత్వ కార్పొరేషన్ ల ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వాటిని ప్రభుత్వ అవసరాలకు మళ్లించడంలో వైఎస్ జగన్ సర్కార్ గత ప్రభుత్వాన్ని మించిపోయింది. గత సర్కారు చివరి సంవత్సరంలో కార్పొరేషన్ ల అప్పులు భారీగా తీసుకురాగ, జగన్ ప్రభుత్వం తొలి ఏడాది నుంచే ఈ తరహా మళ్లింపులో ఆరి తేరింది. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పౌరసరఫరాల సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఇలా 12 వేల కోట్ల రూపాయల వరకు అప్పుగా తెచ్చిన మొత్తాన్ని సదరు కార్పొరేషన్ల కోసమే వినియోగించారా? లేక ప్రభుత్వ అవసరాలకు మళ్లించారా? అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ఈ అప్పులేమీ ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం పరిధిలోకి రాకపోవడంతో ఎక్కడ దొరికితే అక్కడ ఎడా పెడా దూసుకొస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 1.14 లక్షల కోట్ల ఆదాయం రాగా ఇందులో 90% శాతం మొత్తానికి ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చి అప్పులు తెచ్చుకోవచ్చు అని సమాచారం. అంతేకాకుండా ఆర్థిక శాఖ ఏప్రిల్ నుంచి జనవరి వరకు 16 వేల కోట్ల రూపాయల అప్పులకు గ్యారెంటీ ఇచ్చింది. ఇందులో జనవరి నాటికి 12 వేల కోట్లు రుణంగా తెచ్చారు. పీఎఫ్సీ నుంచి మొత్తం 9వేల కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా పలు జిల్లాల్లో ఏపీ జెన్ కో భూములనూ కొన్ని ప్రాజెక్టులను ఆ కార్పొరేషన్ కు బదిలీ చేశారు. బ్యాంకుల వద్ద ఈ ఆస్తులను తనఖా పెట్టి భారీ మొత్తంలో అప్పులు తెస్తున్నారు. పీఎఫ్సీ నుంచి లక్ష్యంగా పెట్టుకున్న 9 వేల కోట్లలో ఇప్పటికే 5,500 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకోగా ఇంకో రూ. 3500 కోట్లు రావాల్సి ఉంది. ఎస్బిఐ అలహాబాద్ బ్యాంకులో నుంచి పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.3 వేల కోట్ల రూపాయిల అప్పు తెచ్చారు. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ.1800 కోట్ల రూపాయల రుణాలు తెచ్చారు. మిగతా కార్పొరేషన్ ల నుంచి కొద్దికొద్దిగా 1,700 ల కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చారు. ఈ మొత్తం 12 వేల కోట్లకు చేరుకుంది. జెన్ కో ద్వారా మరో 2,500 ల కోట్ల రూపాయల రుణం తేవటానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే గత ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ రుణాలను ఎక్కువగా తీసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టి, ఆమోదింప చేసుకుని ఆ తర్వాత ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులమీద ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్ధల ఎన్నికల్లో సవరణలకు బీజం వేస్తూ పంచాయతీ రాజ్ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. వ్యవసాయ మండలి ముసాయిదా బిల్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.  గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లులును ప్రవేశపెట్టింది. అయితే శాసనసభ ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడింది. వాటిని సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు చైర్మన్ షరీఫ్ ప్రకటించటంతో పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని ఏకంగా శాసన మండలిని రద్దు చేస్తూ శాసన సభ తీర్మానం చేసింది. మార్చి 15 వ తేదీ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఎన్నికలు కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి సత్తా చాటితే మూడు రాజధానులకు ప్రజల మద్దతు లభించినట్టేననే అభిప్రాయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిరూపించాలని ప్రభుత్వం భావిస్తోంది.  

జగన్ ని వదలని సీబీఐ.. హోదాను బట్టి మినహాయింపు తగదు!

ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరడం సరి కాదని సిబిఐ స్పష్టం చేసింది. హాజరు మినహాయింపు ఏ నిందితుడికి హక్కు కాదని అది న్యాయస్థానం విచక్షణాధికారమని పేర్కొంది. నిందితుడికి హోదా ఆర్థిక స్తోమత కోర్టుపై ప్రభావం చూపలేవని స్పష్టం చేసింది. అలాగే చట్టం ముందు అందరూ సమానమేనని చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని తెలియజేసింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ జగన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లను కొట్టేయాలంటూ సీబీఐ హైదరాబాద్ విభాగం ఎస్పీ పీసీ కల్యాణ్ 17 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అదేవిధంగా చిన్న చిన్న కేసులలో న్యాయస్థానాలు విచక్షణాధికారం మేరకు నిందితుల వ్యక్తిగత హాజరు కు మినహాయింపు ఇస్తాయని తెలిపారు.  కానీ జగన్ పై ఉన్నవి తీవ్రమైన ఆర్ధిక నేరాలని వీటిలో హాజరు మినహాయింపు ఇవ్వడం సరి కాదని అఫిడవిట్ పేర్కొన్నారు. సీఎం హోదా ఉందన్న కారణంగా మినహాయింపు ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ఆరోపణలు చేశారు. తీవ్రమైన ఆర్థిక నేరం కాబట్టి మినహాయింపు ఇవ్వలేమని 2014 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని 2016 లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఇదే అభ్యర్థనతో మరోసారి పిటిషన్ లు దాఖలు చేయగా వాటిని అదే కోర్టు కొట్టివేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీలును కూడా హైకోర్టు 2017 ఆగస్టు 31న కొట్టేసిందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెల 10 న ఒకసారి సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. దాదాపు 9 నెలలు సీఆర్పీసీ సెక్షన్ 317 కింద హాజరు మినహాయింపు కోరారు. సహేతుకమైన కారణాలు లేకుండానే మినహాయింపు కోరుతూ విచారణ ప్రక్రియకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా ఉందని తెలిపింది.  నేర న్యాయస్మృతి లోని సెక్షన్ 273 ప్రకారం నిందితుడు సమక్షంలోనే నేర విచారణ జరగాలని సిబిఐ తన కౌంటర్ లో తెలిపింది. జగన్ ఇతర నిందితులతో కుమ్మక్కై ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీశారు. మోసం నమ్మక ద్రోహానికి పాల్పడి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. రాష్ట్ర వనరులను ఇతరులకు కట్టబెట్టడం ద్వారా లబ్ది పొందారు. దాల్మియా కేసులో పునీత్ దాల్మియాకు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిందని ఆ కారణంగా జగన్ మినహాయింపు కోరడం సరికాదని పునీత్ ఒక్క కేసులో నిందితుడు జగన్ 11 చార్జిషీట్ లలో ప్రథమ నిందితుడిగా ఉన్నారని అన్నారు. దీంతో పుణిత్ తో పోలిస్తే ఆర్ధికంగా కూడా ఆయన భారీగా లబ్ది పొందారు కాబట్టి ఈ నేపథ్యంలో జగన్ పిటిషన్ లను కొట్టివేయండి అని సీబీఐ అభ్యర్థించింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏప్రిల్ 9న తుది విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొన్నటి కోర్ట్ విచారణ వాయిదా పడిన కారణంగా ఏపీ సీఎం జగన్ కు కొంత మేర ఉపశమనం కలిగినట్లు తెలుస్తోంది.

ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఎందుకు తిరుగుతున్నానో తెలుసా?: పవన్

రెండు రోజుల పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చిన పవన్ కల్యాణ్ ముందుగా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తర్వాతి రోజు కూడా అక్కడే ఉండి పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక రైతులు, చేనేత కార్మికులు ప్రజల కష్టాలు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు చిన్నపాటి వంతెన కూడా నిర్మించలేకపోతే ఎన్నికల్లో గెలిచి ఏం ప్రయోజనమని జనసేనాని ప్రశ్నించారు. ప్రలోభాలకు లోనై ఓట్లేస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయని చురకలంటించారు.  జోరాపురం వంతెన సమస్యపై స్థానికులతో చర్చించారు. ఎమ్మిగనూరులో చేనేత కార్మికులతో భేటీ అయ్యారు పవన్. వారి గోడు విన్న పవన్ సమస్యలపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. మిగతా నాయకుల్లాగా మాటలు చెప్పి తప్పించుకోనని, భవిష్యత్తులో మీ బిడ్డలకు కష్టాలు రాకుండా చూసుకునే అవకాశం దక్కితే అంతే చాలు అంటూ పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. చేనేతల సమస్యలపై కేంద్రం దిగొచ్చేలా కలిసి పోరాడదామని హామీ ఇచ్చారు.  ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు పెన్షన్ లు పెంచాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయినా తానింకా ప్రజల్లోనే ఎందుకు తిరుగుతున్నానో అర్థం చేసుకోవాలని ఆయన వేడుకున్నారు. జనం కష్టాలూ, కన్నీళ్లలో అండగా ఉండటానికే జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. వెంటనే అధికారంలోకి రావడం తన టార్గెట్ కానేకాదన్నారు. పవర్ అంటే నిజమైన అర్థం ప్రజల కష్టాలు తీర్చేదని, తన చేతుల్లో పవర్ ఉంటే అందరి కష్టాలు తీర్చే వాడిని అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

సొంత పబ్లిసిటీ కోసం, సొంత ఎజెండాలతో పనులు చేయొద్దు: సీఎం కేసీఆర్

గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాల్సిన క్రమంలో బ్యారేజీల ఆపరేషన్ రూల్స్ ను సిద్ధం చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో సాగునీటి రంగంపై అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అధికారుల వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. సొంత పబ్లిసిటీ కోసం సొంత ఎజెండాలతో పనులు చేయొద్దని ప్రభుత్వ కార్యక్రమాలే అమలు చేయాలని కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.  కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సాగునీటికి సంబంధించిన ఇంజినీరింగ్ విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి తేవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఈ వ్యవస్థను పదకొండు సర్కిళ్లుగా విభజించాలని సూచించారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్ ఉండాలని సూచించారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కాళేశ్వరం నుంచి తుమ్మడిహట్టి వరకు ఆరు చోట్ల గేట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీలు సకాలంలో పనులు పూర్తి చేయటం లేదని అలాంటి వాటిని గుర్తించి రద్దు చెయ్యాలని ఆదేశించారు.  అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా లక్ష్మి బ్యారేజీని సందర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రాణహిత నదీ జలాలను పరిశీలించారు, ఏరియల్ వ్యూ ద్వారా లక్ష్మి బ్యారేజ్ ను వీక్షించారు సీఎం. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజనీర్ లతో సమీక్షించారు. రాబోయే వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా చేరుతుందని లక్ష్మీ బ్యారేజి నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని సూచించారు. లక్ష్మీ బ్యారేజీ సందర్శన కంటే ముందు కరీంనగర్ నుంచి హెలికాప్టర్ లో కాళేశ్వరం చేరుకున్న కేసీఆర్ హెలికాప్టర్ నుంచి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ లను ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద పూజలు చేశారు, నదిలో నాణేలు వదిలి జల నీరాజనాలు అర్పించారు. ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు.

దెబ్బకి దెబ్బ.. వైసీపీపై యుద్దానికి సిద్దమైన టీడీపీ!!

ఏపీ మండలి రద్దుపై ఢిల్లీ పర్యటనకు టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. రాజకీయ కారణాలతోనే మండలి రద్దు చేశారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. కౌన్సిల్ రద్దు అంత సులభం కాదని హస్తినలో తమ వాదన వినిపిస్తామని చెబుతున్నారు. అటు ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఇచ్చిన నోటిఫికేషన్ పై కూడా చర్చ జరుగుతోంది. ఏపీ కౌన్సిల్ వార్ ఢిల్లీకి చేరుతోంది, ప్రధానిని కలిసిన సీఎం జగన్ కౌన్సిల్ రద్దుపై విజ్ఞప్తి చేశారు. కౌన్సిల్ లో బిల్లులను అడ్డుకునే పరిస్థితిని వివరించి అసెంబ్లీ చేసిన తీర్మానం ఆధారంగా మండలిని రద్దు చేయాలని కోరారు. కౌన్సిల్ రద్దు అంత సులభం కాదని జాప్యం జరుగుతుందని టిడిపి వాదిస్తోంది.  సీఎం ఢిల్లీ పర్యటన తరుణంలో ప్రతిపక్ష టీడీపీ కౌంటర్ పర్యటనకు సిద్ధమవుతోంది. మండలి రద్దు పూర్తిగా రాజకీయ కారణాలతో జరుగుతోందని ఆరోపిస్తున్న టిడిపి ఈ విషయాన్ని ఢిల్లీ వరకు తీసుకు వెళ్లాలని చూస్తోంది. మూడు రాజధానులు వద్దన్నందుకు మాత్రమే మండలి రద్దు చేస్తున్నారనే వాదనను కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. కేంద్ర న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులను కలిసి మండలి పరిణామాలపై కేంద్రానికి నివేదించనున్నారు. ఇదే క్రమంలో ప్రధాని, రాష్ట్రపతి కూడా కలిసేందుకు టిడిపి ఎమ్మెల్సీలు ప్రయత్నం చేస్తున్నారు.  ఇప్పటికే ఢిల్లీలోని టిడిపి ఎంపీలు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మండలిపై సీఎం వ్యాఖ్యలపై టిడిపి చర్యలకు దిగుతోంది. కౌన్సిల్ ను, సభ్యులును అవమానించేలా సిఎం మాట్లాడారని టిడిపి ఆరోపిస్తోంది. సిఎంపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నట్లు టిడిపి ప్రకటించింది. కౌన్సిల్ లో లాయర్లూ, డాక్టర్లూ గ్రాడ్యుయేట్ లు ఉన్నారని వారిని కించ పరిచేలా సిఎం వ్యాఖ్యలు చేశారని టిడిపి వాదిస్తోంది. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వడంపై కూడా టిడిపి ఎమ్మెల్సీలలో చర్చ జరిగింది. ఆర్డినెన్స్ ఇచ్చినా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందేననీ చెబుతోంది. కౌన్సిళ్లు సమావేశపరచకుండా అసెంబ్లీ సెషన్స్ జరపకూడదని వాదిస్తోంది.

వ్యూహానికి ప్రతివ్యూహంతో ముందుకు వెళుతున్న జగన్ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాసనసభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గవర్నర్ సభలను ప్రొరోగ్ చేయటం సాధారణ ప్రక్రియ అయినా ఈసారి మాత్రం ఇలా చేయటం అధికార పార్టీకి మేలు చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.  బిల్లును సభ ముందు ఉండగానే ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్బాలు రాజ్యసభలోనూ వివిధ అసెంబ్లీలోనూ ఉందంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. ట్రిపుల్ తలాక్ వంటి బిల్లులు రాజ్యసభ ముందున్నా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు ఆమోదించిన 2013 భూ సేకరణ చట్టం విషయం లోనూ సవరణల కోసం రెండు సార్లు కేంద్రం ఆర్డినెన్స్ లు జారీ చేశాయి అన్నది ప్రభుత్వ వర్గాల వాదన.  వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్న ప్రభుత్వానికి ఉభయ సభల ప్రోరోగ్ ఉత్తర్వులతో వెసులుబాటు లభించినట్టయ్యింది. ఇప్పటి కిప్పుడు మండలి రద్దు కాదు, తనకున్న బలంతో ఎలాగైనా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేసి జనంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టిడిపి భావిస్తోంది. దీంతో వైసీపీ ప్రతివ్యూహంతో ముందుకు వెళుతోంది. సెలక్ట్ కమిటీతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్ ను జారీ చేసి పని మొదలెట్టాలని యోచిస్తోంది. అందుకే సెలెక్ట్ కమిటీ ఏర్పాటును జాప్యం చేసినట్లు తెలుస్తోంది.  ఒకసారి సెలక్ట్ కమిటీకి బిల్లును చైర్మన్ పంపించిన తరువాత అదే బిల్లుపై ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదని అంటున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసినా లేకున్నా రూల్స్ ప్రకారం ఆర్డినెన్స్ ఇవ్వలేరని చెబుతోంది. సెలక్ట్ కమిటీ రూలుతో ప్రభుత్వానికి టిడిపి షాకిస్తే మండలి రద్దు తీర్మానం చేసి ఇప్పుడు ప్రొరోగ్ ద్వారా ఏకంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లులపై ఆర్డినెన్స్ కు సిద్ధమవుతోంది జగన్ ప్రభుత్వం. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయంలో కేంద్రం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తోందని వైసిపి చెబుతోంది. టిడిపి ఎమ్మెల్యేలు స్టేజ్ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని ఎద్దేవ చేస్తున్నారు. మరి ఈ ప్రొరోగ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

మొన్న మోడీ, నేడు షా.. వరుస భేటీలతో విపక్షాలను భయపెడుతున్న జగన్!!

ఏపీ సీఎం జగన్ ఈరోజు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ప్రధాని మోడీతో సుదీర్ఘ భేటీ అయ్యారు జగన్, ఇవాళ మళ్లీ అమిత్ షాతో భేటీకి పిలుపు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిగ్గా మారింది. అమిత్ షాతో పాటు, మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  మూడు నెలలుగా సీఎం జగన్ ను పట్టించుకోని కేంద్రం ఆకస్మికంగా వరుస భేటీలకు అవకాశం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ప్రధానితో జరిగిన సుదీర్ఘభేటీలో విభజన సమస్యలు, పెండింగ్ నిధులతో పాటు మూడు రాజధానులు, శాసన మండలి రద్దు అంశాలను ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించటంతో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత ప్రభుత్వంతో పాటు వైసీపీ కూడా ఫుల్ జోష్ లో ఉంది. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు, ఆరోపణలు చేస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి అది కూడా ప్రధాని మోడీ వీటిపై సానుకూలంగా వ్యవహరించటం వైసీపీలో ఉత్సాహాన్ని నింపింది.  ప్రధానితో జరిగిన భేటీలో ప్రస్తావించిన మూడు రాజధానులు శాసనమండలి రద్దుతో పాటు హైకోర్టు తరలింపు వ్యవహారాలను కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగానే హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేక భేటీ కోసం మళ్లీ ఢిల్లీ వెళుతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ చట్టం, కర్నూలు జుడీషియల్ రాజధాని ప్రకటనతో హై కోర్టు తరలింపు వ్యవహారానికి సంబంధించిన అంశాలను అమిత్ షాతో చర్చిస్తారు. మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న దిశా యాక్టుతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన తొమ్మిది, పది షెడ్యూల్స్ అంశాలు కూడా చర్చించనున్నారు.  అమిత్ షాతో భేటీ తర్వాత మరికొందరు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానితో భేటీలో రెవెన్యూ లోటు, విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్ అంశాలున్న నేపథ్యంలో ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులతో భేటీ అయ్యే అవకాశముంది. అవసరమైతే ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బస చేసి, రేపు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ ను కలవనున్నట్లు సమాచారం. మొత్తానికి కేంద్రంతో రెండు రోజులుగా సాగుతున్న చర్చలు, సానుకూల ధోరణి అధికార పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మూడు నెలలుగా ప్రతిపక్షాలతో ఎదురవుతున్న అడ్డంకులు, అవరోధాలు తొలగిపోతే పాలనపై పూర్తి దృష్టి సారించే అవకాశాలుంటాయని భావిస్తోంది.

మమ్మల్ని డమ్మీ ఎమ్మెల్యేలను చేశారంటూ తెగ ఫీలైపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!!

2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ తో విజయనగరం జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తొమ్మిదికి తొమ్మిది స్థానాలను వైసీపీ గెలుచుకుంది, ఇంకేముంది పార్టీ కూడా అధికారంలోకి రావడంతో చక్రం తిప్పాలని అనుకున్నారు ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే టిడిపి నేతల హవా నడిచిందో అదే విధంగా చేద్దామని వీళ్లు కూడా భావించారు కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయట.  2014 ఎన్నికల్లో జిల్లాలో టిడిపి ఆరు, వైసిపి మూడు చోట్ల గెలిచింది. సుజయ కృష్ణ రంగారావు టిడిపిలో చేరి మంత్రి అయ్యారు, అప్పట్లో టిడిపి ఎమ్మెల్యేలు ఏది చెబితే అది జరిగేది అని అంటారు. పింఛన్ లు, ఇళ్ల కేటాయింపులు, వెనుకబడిన తరగతులకు లోన్లు, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో టిడిపి శాసన సభ్యుల హవా నడిచేదట. వైసిపి ఎమ్మెల్యేలున్న చోట కూడా టిడిపి నేతలు చెప్పినదానికే అధికారులు ఊ కొట్టేవారట. ఇదంతా చూసిన వైసీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాగే చేయాలని కలలు కన్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర పరిమితం చేయడంతో వైసీపీ ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని టాక్. అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల సాయంతో నిజమైన లబ్దిదారుల ఎంపిక జరుగుతుండటంతో తమకు పని లేకుండా పోయిందని అనుచరుల దగ్గర చెప్పుకుని ఎమ్మెల్యేలు వాపోతున్నారట. అంతా అధికారుల కనుసన్నల్లోనే సంక్షేమ పథకాల కేటాయింపులు జరగడం, డిజిటల్ పద్ధతిలోనే లబ్దిదారుల ఎంపిక నిర్వహిస్తుండటంతో తామంతా డమ్మీలం అయినట్లు శాసనసభ్యులు మధనపడుతున్నారట.  సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు వచ్చి తమకు పింఛన్ లు ఇప్పించాలని ఇంకో పథకంలో లబ్ధి చేకూర్చాలని కోరినా చేయలేకపోతున్నారట. పనేదైనా ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రామ సచివాలయం, జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారమవుతుండడంతో జనాలు కార్యాలయాల చుట్టూనే తిరుగుతున్నారట. గతంలో అధికారుల బదిలీలు. పోస్టింగ్ ల విషయంలో ఎమ్మెల్యే సిపార్సు లేఖలకు డిమాండ్ ఉండేది. ఎమ్మెల్యేలు కూడా తమకు నచ్చిన అధికారిని నియోజకవర్గానికి తెచ్చుకునేవారు. ప్రస్తుతం అమరావతి పరిధిలోనే ట్రాన్సఫర్స్ జరుగుతున్నాయని, మరికొన్ని మంత్రుల కనుసన్నల్లో జరిగిపోతున్నాయని అంటున్నారు. దీంతో సొంత పనులు సైతం ఎవరినో ఒకరిని అడుక్కునే పరిస్థితి నెలకొందని కుమిలిపోతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగగలమని తమలో తామే ప్రశ్నించుకుంటున్నారట శాసన సభ్యులు.