'కోవ్యాక్సిన్' క్లినికల్‌ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్ నుంచే వ్యాక్సిన్!

కరోనా మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌కు చెందిన 'భారత్‌ బయోటెక్‌' మరో ముందడుగు వేసింది. కరోనా‌ కట్టడికి ‘కోవ్యాక్సిన్‌’ను భారత్‌ బయోటెక్ డెవ‌ల‌ప్ చేసింది. తాజాగా ఈ వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి లభించింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేశారు. జంతువుల పై ఇది సానుకూల ఫలితాలను ఇవ్వడంతో ప్రస్తుతం మానవులపై ప్రయోగాలకు సిద్ధమైపోయింది. ఈ ‘కోవ్యాక్సిన్‌’ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. మానవులపై ఫేజ్‌ -1, ఫేజ్‌ -2 పరీక్షలకు అనుమతులు జారీ చేసింది. కరోనా‌‌ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. జులై నెల నుంచి మానవులపై ప్రయోగాలు చేయనుంది. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. ‘కోవ్యాక్సిన్‌’ తయారీ చరిత్రాత్మకం అవుతుందన్నారు.

కొండపోచమ్మ కాల్వకు గండి.. నీట మునిగిన పొలాలు

కొండపోచమ్మ జలాశయం కాల్వకు ఈ ఉదయం గండి పడింది. ఇటీవలే కొండపోచమ్మ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీరు విడుదల చేశారు. ఈక్రమంలో ఈరోజు ఉదయం 7గంటలకు సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్‌ కుడి కాలువకు గండి పడింది. దీంతో గ్రామంలోకి భారీగా వరదనీరు ప్రవహించింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో కాలువకు నీటివిడుదల నిలిపివేశారు. ఉదయం పూట కావడంతో ప్రమాదం తప్పిందని, అదే రాత్రివేళ అయితే పెను నష్టం జరిగి ఉండేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖలో మరో గ్యాస్ లీక్ దుర్ఘటన.. ఇద్దరు మృతి

విశాఖ లో ఎల్.జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరిచిపోక ముందే మరో సారి గ్యాస్ లీక్ దుర్ఘటన చోటుచేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ లైఫ్ సైన్సెస్ లోని రియాక్టర్ నుంచి బెంజీన్ మేడిజోన్ అనే విష వాయువు లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో షిఫ్ట్‌ ఇంచార్జ్‌ నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్ మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కాగా వారిని గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటన గురించిన సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాద ఘటనపై నలుగురు అధికారులతో కమిటీని నియమించినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. మరోవైపు ఫార్మా సిటీ ప్రమాద ఘటనపై కలెక్టర్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లపై నిషేధం

భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హలో, క్యామ్ స్కానర్ తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. దేశ రక్షణకు, ప్రజా సంక్షేమానికి హానికరంగా భావిస్తున్న కార్యకలాపాలతో సంబంధం ఉందన్న కారణంతో ఈ యాప్ లను నిషేదిస్తున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. చైనా సరిహద్దు లడఖ్ లో జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన 21 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో, దేశవ్యాప్తంగా చైనా అంటే ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. చైనా వస్తువులు, యాప్స్ బ్యాన్ చేయాలనీ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, టిక్ టాక్ వంటి యాప్ లను నిషేధించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, కేంద్రం ఈ కీలక నిరణయం తీసుకుంది.

ఒక్క ఘటన..  ఊరంతా క్వారంటైన్

కరోనా పేరు చెపితే చాలు ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ప్రజల్లో ఈ కలవరానికి కారణం అది వ్యాప్తి చెందుతున్న తీరు. మార్చ్ లో మొదటి కేసు నమోదైన తెలంగాణ లో ప్రస్తుతం రోజు సుమారుగా వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. తొలి రోజుల్లో నగరాలలో మొదలైన కరోనా కేసులు ప్రస్తుతం గ్రామాలను కూడా చుట్టుముడుతున్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా బొమ్మల రామారారం లో ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ యువకుడు చనిపోయిన తర్వాత పరీక్షలు చేయగా అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఐంది. ఐతే మృతుడికి కరోనా ఉందన్న విషయం తెలియక ఆ గ్రామానికి చెందిన సుమారు 500 మంది అతడి అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియల తర్వాత కరోనా టెస్ట్ రిజల్ట్ లో అతడికి కరోనా ఉన్నట్లు తేలడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న వైద్యాధికారులు ఆ యువకుడి అంత్యక్రియలకు హాజరైన వారంతా హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో దాదాపుగా గ్రామం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్ళింది.

హరితహారానికి కొత్త అర్ధం.. వందలాది చెట్లను నరికి మామిడి మొక్కలు నాటారు!!

తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, మంత్రులు సైతం స్వయంగా మొక్కలు నాటి ప్రజల్లో చైతన్య కలిగిస్తున్నారు. అంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం అభాసుపాలైంది. ఇన్నిరోజులు హరితహారమంటే మొక్కలు నాటి పచ్చదనం పెంచటం, ప్రకృతిని కాపాడటం అనుకున్నాం. కానీ, హరితహారమంటే ఉన్న పచ్చని చెట్లని నరికి ఆదాయమొచ్చే కొత్త మొక్కలు నాటడమని.. హరితహారానికి తెలంగాణ పోలీస్ అకాడమీ కొత్త అర్ధం చెప్పింది. హరితహారం కార్యక్రమం లో భాగంగా కొత్త మొక్కలు నాటేందుకు వందలాది చెట్లను అధికారులు నరికించేశారు. హరితహారంలో మామిడి చెట్లను నాటడం ద్వారా భవిష్యత్తులో అకాడమీ ఆదాయాన్ని పెంచవచ్చని ఓ ఉన్నతాధికారి నిర్ణయించారట. అందుకే అక్కడ ఉన్న చెట్లను నరికించేశారు. అయితే ఆదాయం కోసం ఉన్న చెట్లను నరికి కొత్త మొక్కలను నాటడం హరితహారం ఎలా అవుతుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

లీజుకి రామోజీ ఫిల్మ్ సిటీ..!! వాస్తవం ఏంటంటే...

ఆసియాలోనే అతి పెద్ద సినిమా స్టూడియోగా పేరు తెచ్చుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ.మన తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలుస్తోంది. ఐతే కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీ ని డిస్ని హాట్ స్టార్ కు లీజుకిచ్చేశారని అటు సోషల్ మీడియాలోనూ ఇటు కొన్ని వెబ్ సైట్లలోనూ కొన్ని వార్తలు వచ్చాయి.. కరోనా కారణంగా అటు షూటింగ్ లు, ఇటు టూరిస్టుల తాకిడి లేకపోవడం తో లీజుకు ఇస్తున్నారని ఆ వార్తల సారాంశం. తాజాగా ఇదే విషయమై ఫిల్మ్ సిటీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. రామోజీ ఫిల్మ్‌సిటీని అద్దెకు, లీజుకు ఇచ్చార‌న్న వార్త‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని తేల్చేసింది. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాణ సంస్థలు సోనీ పిక్చ‌ర్స్‌, జీ టీవీ వంటి వారిని రామోజీ ఫిల్మ్‌సిటీ లో షూటింగ్ కోసం ఆహ్వానించిన‌ట్టు ప్ర‌క‌టించింది. క‌రోనా మహమ్మారి నేప‌థ్యంలో ముంబైలో షూటింగులు చేసే ప‌రిస్థితి ప్రస్తుతం లేదు. అంతే కాకుండా దేశంలో ఎక్క‌డా కూడా షూటింగులకు అనువైన వాతావ‌ర‌ణం ప్రస్తుతం లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని ఫిల్మ్‌సిటీకి వ‌చ్చి షూటింగులు చేసుకోమ‌ని ఆ సంస్థల ప్ర‌తినిధులకు ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. షూటింగుల‌కు అన్ని విధాలా అనువైనది కావడం తో పాటు అన్ని మౌలిక వ‌సతుల్ని ఉచితంగా క‌ల్పిస్తామ‌ని ఫిల్మ్‌సిటీ ఆహ్వానాలు పంపింది. ఆ ఆహ్వానానికి జీ టీవీ, సోనీ పిక్చ‌ర్స్ తమ అంగీకారం తెలిపాయని స‌మాచారం.

జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌‌ను మరో నెల పొడిగించింది. రాష్టంలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా కేసులలో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌ తీసేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని, అందువల్లే మరో నెల పొడిగించడం జరిగిందని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు.  మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఇప్పటికే కరోనా కేసులు 1.6 లక్షలు దాటేశాయి. మరణాలు కూడా 7వేలకు పైగా సంభవించాయి. కరోనా వ్యాప్తి ఈ స్థాయిలో ఉన్నందునే లాక్‌డౌన్‌‌ ను పొడిగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏపీ మంత్రి నాని అనుచరుడి దారుణ హత్య

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత హత్య కలకలం రేపింది. మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యాడు. మునిసిపల్ చేపల మార్కెట్‌లో ఉన్న భాస్కరరావుని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. గాయపడిన భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కత్తి పోటు ఛాతీలో బలంగా దిగడంతో భాస్కర్ రావు గుండెకు బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. కత్తికి సైనేడ్ పూసి పొడిచినట్టు వైద్యులు భావిస్తున్నారు.  భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్‌గా పని చేశాడు. పాతకక్షల నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  మరోవైపు, భాస్కరరావు మరణవార్త తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.

అచ్చెన్నాయుడు ఆరోగ్యం పై కమిటీ వేసిన ప్రభుత్వం

ఈఎస్‌ఐ అవినీతి వ్యవహారంలో అరెస్టైన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఆయనకు విధించిన మూడు రోజుల ఏసీబీ కస్టడీ ముగియడంతో ఈరోజు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా జూన్ 30 వరకు కోర్టు మూసి ఉంచిన కారణంగా విచారణను జూలై ఒకటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ఇది ఇలా ఉండగా అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక వైద్యుల కమిటీని నియమించింది. ఏసీబీ అదుపులోకి తీసుకున్న తరువాత అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై అటు పార్టీ నేతలు, ఇటు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐదుగురు వైద్యులతో కూడిన ఒక కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి, అలాగే ఆయనకు వైద్యం చేసిన సిబ్బందిని విచారించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను ఇవ్వనుంది.

పోలీసులపైకి కుక్కలను వదిలిన వైసీపీ నేత

వైసీపీ నేత,  సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనను అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులపై కుక్కలను వదిలారు. ఇటీవల హైదరాబాద్‌లో పీవీపీ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ విల్లాకు సంబంధించి విక్రమ్ కైలాస్ అనే వ్యక్తి ఇంటికి దాదాపు 20 మందిని వెంటబెట్టుకుని వెళ్లి.. తాను అమ్మిన వీళ్ళను ఆధునీకరించడానికి వీల్లేదంటూ.. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేసి, చంపేస్తానని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పీవీపీపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. విధులకు ఆటంకం కల్గించారని పీవీపీపై కేసు నమోదు చేశారు.  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం.

ఇంట్లోనే ఉండమంటే ఊరంతా తిరిగేసాడు.. దీంతో కొన్ని వందలమందికి టెన్షన్ 

ప్రస్తుతం మనమంతా కరోనా కాలం లో బతుకుతున్నాం. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే తప్ప బయటికి వెళ్లలేని ప్రస్థితి. ఐతే కొంత మంది మాత్రం మాకేంటి మేము ఆరోగ్యంగా బాగానే ఉన్నాము. మాకు కరోనా సోకదు అని కనీసం మాస్క్ కూడా లేకుండా తిరిగేస్తున్నారు. అదేమంటే మీ సంగతి మీరు చూసుకోండి అనే జవాబు. ఐతే ఇటువంటి వారి కోసమే ఈ వార్త. అసోంలో ఒక కూరగాయల వ్యాపారికి కొద్ది రోజుల క్రితం దగ్గు రావడం మొదలైంది. దాంతో ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు చెప్పగా అబ్బే కొద్దిగా వేడి చేసింది అందుకే దగ్గు స్టార్ట్ ఐంది అని తన మానాన తాను కూరగాయలు అమ్మడానికి వెళ్ళాడు. అతను కూరగాయలు అమ్ముతూ తిరుగుతుండగా అటు వచ్చిన పోలీసులు గమనించి ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే వేడి చేసి దగ్గు వస్తోందని చెప్పాడు. అతని పరిస్థితి గమనించిన పోలీసులు కరోనా పరీక్ష చేయించుకోమని చెప్పగా నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు. ఐతే పోలీసులు మాత్రం ఎందుకైనా మంచిది అని ఒక టెస్టింగ్ సెంటర్ కు తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించారు. అంతే కాకుండా మూడ్రోజులు కూరగాయలు అమ్మ వద్దని కరోనా టెస్టు రిజల్ట్ వచ్చే వరకూ ఇంట్లోనే ఉండమని పోలీస్ లు చెప్పి పంపించారు. ఐతే ఇంటికి తిరిగి వస్తూ దారిలో కూడా వెజిటబుల్స్ అమ్ముకుంటూ వెళ్ళాడు. అంతే కాకుండా ఆ వ్యాపారి తన వద్ద ఉన్న కూరగాయలు పాడై పోతున్నాయని చెప్పి వాటిని ఎపుడు అమ్మే ఏరియా లో కాకుండా వేరే ఏరియాలో కూరగాయలు అమ్ముతూ చాల కాలనీలు చుట్టేశాడు. ఇంతలో కరోనా టెస్ట్ రిజల్ట్స్ రావడం తో పాలీసులు అతన్ని వెదుక్కుంటూ అతని ఇంటికి చేరే సరికి ఆ వ్యాపారి ఇంటి దగ్గర లేకపోవడం తో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఫోన్ చేసి అతనిని ఇంటికి రప్పించి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి చెప్పారు. ఐతే పోలీసులకు మాత్రం కొత్త టెన్షన్ స్టార్ ఐంది. టెస్ట్ రిజల్ట్ వచ్చేవరకు ఇల్లు కదలొద్దని చెప్పినా వినిపించుకోకుండా తిరిగేసిన కారణంగా ఎన్ని వందల మందికి కరోనా అంటించేసాడో అని అటు పోలీసులు ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనకేం కాదన్న నిర్లక్ష్యమే మన కొంపముంచుతుంది. మన నిర్లక్ష్యం కారణంగా ఎందరో బలవుతున్నారు. కాబట్టి, మనం జాగ్రత్తగా ఉంటూ.. మనల్ని, మన వాళ్ళని కాపాడుకుందాం.

సీఎం జగన్ కు రఘురామకృష‌్ణంరాజు లేఖ.. యాంటీ క్రిస్టియన్‌గా చిత్రీకరించారు!!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష‌్ణంరాజు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల వెల్లడైన సీ-ఓటర్ ఫలితాల్లో ఉత్తమ సీఎంగా నాలుగో స్థానం సాధించినందుకు గాను జగన్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మొదటి స్థానం సాధించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి నుంచి ఇటీవల తనకు షోకాజ్‌ నోటీసు అందిందని, దానిపై స్పందిస్తూ ఈ లేఖ రాస్తున్నట్లు రఘురామ కృష‌్ణంరాజు తెలిపారు. రిజిస్టరయిన పార్టీ కాకుండా తనకు మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు వచ్చిందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకోవద్దని ఎన్నికల సంఘం చెప్పిందని తెలిపారు. ఏ సందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వాడుకునేందుకు అవకాశం లేదని ఈసీ చెప్పిందని పేర్కొన్నారు.  తాను వెంకటేశ్వరస్వామికి భక్తుడినినని చెప్పిన ఆయన.. స్వామివారి ఆస్తుల అమ్మకం విషయంలో భక్తుల మనోభావాలను మాత్రమే తాను వివరించి చెప్పానని తెలిపారు. అంతేగానీ, తాను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తనను కొందరు యాంటీ క్రిస్టియన్‌గా చిత్రీకరించారని ఆరోపించారు. అలాగే ఇంగ్లీష్ మీడియంపై గతంలో తాను చెప్పిన అభిప్రాయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్‌లో మాట్లాడానని.. సీఎం కూడా చాలా సంతృప్తి చెందారని రఘురామ కృష‌్ణంరాజు పేర్కొన్నారు. తనపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని, పార్టీ ఆదేశాలను తాను ఏనాడు థిక్కరించలేదని పేర్కొన్నారు. మీ నాయకత్వాన్ని సమర్థిస్తానని అన్నారు. తనపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, మీకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని రఘురామ కృష‌్ణంరాజు ఆరోపించారు.

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. దాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, వాటిపై హైకోర్టు వాదనలు విన్నది.  సచివాలయం కూల్చివేతపై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. సచివాలయ నిర్మాణం అనేది విధానపరమైన నిర్ణయమని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం అన్ని అవసరాలకు సరిపోవట్లేదని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు.  వాదనలను విన్న హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని చెప్పింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.

కరోనా పై విజయం సాధించిన 99 ఏళ్ల మహిళ

కరోనా తీవ్రతకు యువకుల నుండి వృద్దుల వరకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో కూడా వైరస్ పురుషులకు ఎక్కువగా సోకుతోందని.. ఐతే మృతులలో మాత్రం మహిళలే ఎక్కువగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 99 ఏళ్ల వయసున్న బెంగుళూరుకి చెందిన మహిళ కరోనా బారి నుండి బయటపడ్డారు. ఈ భయంకర వైరస్ ఆమెకు ఆమె మనుమడి ద్వారా సోకింది. దీంతో ఆమెను, 70 ఏళ్ల ఆమె కుమారుడు, కోడలు, మనుమడి తో సహా విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 18 న చేర్చారు. ఐతే ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే కుటుంబం లోని ముగ్గురికి జలుబు దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి కానీ ఆ వృద్ధ మహిళకు మాత్రం ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. హాస్పిటల్ లో చేరిన మొదట్లో ఆమె చికిత్సకు సరిగా సహకరించలేదని ఐతే తరువాత మెల్లమెల్లగా డాక్టర్లు, నర్సులు ధైర్యం చెప్పడంతో ఆమె త్వరగా కోలుకున్నారని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ తెలిపారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుండి ఆ వృద్ధ మహిళ మనుమడు తప్పించి మిగిలిన వారు ఎవరు బయటకు వెళ్లకపోయినా వారికి ఈ వైరస్ ఎలా సోకిందో అని వారు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి 9 రోజుల ట్రీట్ మెంట్ తరువాత 99 ఏళ్ల ఆ మహిళ తన కుటుంబం తో కలిసి వైరస్ పై విజయం సాధించి క్షేమంగా ఇంటికి చేరారు. కర్ణాటక లోనే కరోనా కోరల నుండి బయట పడిన అత్యంత వృద్ధురాలుగా కూడా ఆమె రికార్డులకు ఎక్కారు.

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడురోజుల క్రితమే మహమూద్‌ అలీ కరోనా టెస్టులు చేయించుకున్నారు. అస్తమా ఉండటంతో ముందుగానే కుటుంసభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచే ఆయనను అపోలోకు తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు మంత్రులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.  మరోవైపు అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇటీవల హోంమంత్రిని కలిసిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు.

‘పీఎం కేర్స్‌’కు చైనా సంస్థల నుంచి భారీగా విరాళాలు!

భారత్-చైనా సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. భారత్ లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య చైనా పేరుతో మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి భారీగా నిధులు వచ్చాయని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించిన ‘పీఎం కేర్స్‌’ నిధికి చైనా సంస్థల నుంచి భారీగా నిధులు వచ్చాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.  ఎన్నో ప్రముఖ చైనా కంపెనీలు పీఎం కేర్స్ కు భారీగా నిధులు ఇచ్చాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. ఓవైపు చైనా కారణంగా జాతి భద్రతకు ప్రమాదం వాటిల్లుతున్న వేళ.. చైనా సంస్థల నుంచి విరాళాలను ఎందుకు అంగీకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పీఎం కేర్స్ కు పేటీఎం నుంచి రూ.100 కోట్లు, టిక్ ‌టాక్‌ నుంచి రూ.30 కోట్లు, షావోమీ నుంచి రూ.15 కోట్లు, హువావే నుంచి రూ. 7 కోట్లు, ఒప్పో నుంచి రూ.1 కోటి పీఎం కేర్స్ కు విరాళంగా వచ్చాయని తెలిపారు. గత నెల 20 నాటికి, పీఎం కేర్స్ నిధికి దాదాపు 9,678 కోట్లు వచ్చాయని, ఈ డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ నిధులు దారి మళ్లుతున్నాయని, అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలీదని ఆరోపించారు. పీఎం కేర్స్ మోదీ సొంత నిధి అయిపోయిందని విమర్శలు గుప్పించారు. 2007 నుంచి బీజేపీకి చైనా కమ్యూనిస్టు పార్టీతో(సీపీసీ) సంబంధాలున్నాయని అభిషేక్ ఆరోపించారు. గత 13ఏళ్లలో ఆ పార్టీ అధ్యక్షులు చైనాతో సంబంధాలు నెరపినంతగా, భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు నెరపలేదని విమర్శిచారు. 2007, 2008 లలో రాజ్‌నాథ్‌ సింగ్‌, 2011 లో గడ్కరీ, 2014లో అమిత్‌ షా సీపీసీతో సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. బీజేపీ దేశ భద్రత గురించి లెక్కలేదు.. అయితే తమ గురించి లేదా రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచిస్తుంటారని అభిషేక్ విమర్శించారు.

కరోనా వైరస్ కు విరుగుడు ఆ జంతువుల నుండి.. మానవాళికి మరో తీపి కబురు

కరోనా తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా మనుషుల్లో ఉండే యాంటీ బాడీస్ ఈ వైరస్ ను అడ్డుకుని ప్రాణహాని లేకుండా చేయగలవు. ఐతే మనలోని యాంటీ బాడీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎఫెక్టివ్ గా వైరస్ ను ఎదుర్కోగలవు. ఐతే చాలామందిలో ఈ యాంటీ బాడీస్ చాలా తక్కువగా ఉండడం తో పరిస్థితి విషమిస్తోంది. తాజాగా దీనికి విరుగుడు గా అల్పక అనే జంతువు నుండి సేకరించిన నానో బాడీస్ ను మనుషులలో ప్రవేశ పెడితే అవి కరోనా వైరస్ ను అడ్డుకుంటాయనే వార్త వైరల్ అవుతోంది. తాజాగా దీని పైన రీసెర్చ్ చేసిన దక్షిణ ఆఫ్రికా, స్వీడన్‌ పరిశోధకుల దీనిని ధృవీకరిస్తున్నారు. అసలు కరోనా వైరస్ ను ల్యాబ్ లో తయారు చేసారా లేక జంతువుల నుండి మనుషులకు సోకిందా అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. కానీ తాజాగా పరిశోధన ప్రకారం మనుషులను కాపాడేది మాత్రం అల్పక అనే జంతువు అనే తెలుస్తోంది. అల్పకాలు గా పిలిచే ఈ జంతువులు చూడడానికి మన దగ్గర ఉండే మేకలు, ఒంటెలకు దగ్గరగా ఉంటాయి. ప్రస్తుతం ఇవే మనని కాపాడతాయని దక్షిణ ఆఫ్రికా, స్వీడన్‌ సైంటిస్టుల రీసెర్చ్ ద్వారా తెలుస్తోంది. వాటిలోని నానో బాడీస్ మనుషుల్లో ప్రవేశపెట్టగా అవి కరోనా వైరస్ ను అడ్డుకున్నాయని ఆ శాస్త్రవేత్తలు తెలిపారు. ఐతే ఇప్పుడు వీటిలోని యాంటీబాడీస్ సేకరించి మనుషులకు ఇవ్వడానికి మరో రెండు మూడు వారాల వరకు సమయం పట్టవచ్చని వారు తెలియ చేస్తున్నారు. అసలు ఈ యాంటీ బాడీస్ ఎలా పనిచేస్తాయంటే కరోనా వైరస్ కు చుట్టూ ఉన్న ముళ్లలాంటి కొవ్వును ఇవి చుట్టుముట్టి వాటిని కరిగేలా చేస్తాయి. దానితో కరోనా వైరస్ చచ్చిపోతుంది. దానితో కరోనా వైరస్ పీడ కూడా విరగడ అవుతుంది. ఈ దిశగా జర్మనీలో మొదటిసారి ఒక 12 ఏళ్ల వయసున్న అల్పక నుంచి నానోబాడీస్ తీసి ప్రయోగించగా ఫలితం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. అంతా సవ్యంగా జరిగితే కరోనా వైరస్‌కు ఈ యాంటీబాడీస్ అసలైన వ్యాక్సిన్ అవుతాయని ఆ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఏదేమైనా ఆ దేవుడి దయవల్ల, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వస్తే మనకు ఇంకా కావాల్సిందేముంది.

ఆక్సిజన్‌ తొలగించారు.. బై డాడీ.. అదే చివరి మాట

'ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్‌ బంద్‌ చేశారు. సార్‌ సార్‌ అని బతిమిలాడినా పట్టించుకోలేదు.' అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించిన కాసేపటికే మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ జవహర్ నగర్ కు చెందిన 35 ఏళ్ల రవికుమార్ కరోనా లక్షణాలతో ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే తనపట్ల వైద్యులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపిస్తూ.. రవికుమార్ ఓ సెల్ఫీ వీడియో తీసి తండ్రికి పంపాడు. ‘ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్‌ తొలగించారు. సార్‌ సార్‌ అని బతిమిలాడినా పట్టించుకోలేదు. ఇప్పటికే మూడు గంటలైంది. గుండె ఆగిపోయింది. ఊపిరొక్కటే కొట్టుకుంటోంది. బై డాడీ’ అంటూ వాట్సాప్ లో వీడియో పంపాడు. వీడియోలో కొడుకు దయనీయ స్థితిని చూసిన తండ్రి.. ఆ షాక్‌ నుంచి తేరుకునేలోపే కుమారుడు మరణించాడని సమాచారం వచ్చింది. రవికుమార్ అతని తండ్రికి పంపిన వీడియోని బట్టి చూస్తే.. అతను దాదాపు మూడు గంటల పాటు నరకయాతన అనుభవించి మరణించాడని అర్థమవుతోంది. కాగా, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రవికుమార్ మరణించాడని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అసలు పెట్టిన ఆక్సిజన్‌ ఎందుకు తీసేశారో చెప్పాలని రవికుమార్ తండ్రి ప్రశ్నించారు. నా కుమారుడికి జరిగిన అన్యాయం మరొకరికి జరగవద్దని కోరుకుంటున్నాను అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన కరోనా బాధితుడి పట్ల ప్రభుత్వ బాధ్యతా రాహిత్య వైఖరికి పరాకాష్ట అని విమర్శిచారు. కాగా, ఈ ఘటనపై ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి సూపరింటిండెంట్ స్పందించారు. వైద్యుల నిర్లక్ష్యంతో రవికుమార్ చనిపోయాడనడం సరికాదని అన్నారు. కరోనా వైరస్ యువకుల్లో ఎక్కువగా గుండెపై ప్రభావం చూపిస్తుందని, గుండె దెబ్బతిన్న తర్వాత ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని తెలిపారు. రవికుమార్ విషయంలోనూ అదే జరిగిందని సూపరింటిండెంట్ పేర్కొన్నారు.