తిరుపతి బీజేపీ అభ్యర్ధిగా దాసరి శ్రీనివాసులు?

తిరుపతి పార్లమెంటు స్ధానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో, బీజేపీ అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారి, దాసరి శ్రీనివాసులు పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికుడయిన దాసరి, ఈపాటికే క్షేత్రస్థాయిలో ఆలయాల అభివృద్ధి, అనాధ బాలురను ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. బీజేపీలో చేరిన ఆయనకు, ప్రస్తుత నాయకత్వం ఎలాంటి పదవి ఇవ్వకపోయినా.. ప్రతిష్టాత్మక సమరసత సేవా  ఫౌండేషన్ బాధ్యతలలో బిజీగా ఉన్నారు.   స్థానికుడయినందున, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉన్న దాసరి శ్రీనివాసులుకు, గత ఎన్నికల్లోనే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ బీజేపీ-సంఘ పరివారం అంతా,  వైసీపీని గెలిపించాలన్న భావనతో ఉండటంతో, ఆయన పోటీ చేసే యోచన విరమించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత సమరసత సేవా   ఫౌండేషన్ బాధ్యతలు అప్పగించడంతో, ఆయన దానిపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తున్నారు.   ప్రస్తుతం ఈ ఫౌండేషన్ ఆధ్వర్యాన.. తీరప్రాంతాలు, దళిత-గిరిజన వాడల్లో దాదాపు 500 దేవాలయాలు నిర్మించారు. మత్స్యకారులు, దళితుల లక్ష్యంగా మతమార్పిళ్లు జరుగుతున్న నేపథ్యంలో.. వాటిని  అడ్డుకుని, వారిలో హైందవ మత సంప్రదాయాలు పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే సూటిగా చెప్పాలంటే, హిందూమతమే దళిత-బడుగువాడల వద్దకు వెళుతోంది.   అందులో భాగంగా మత్స్యకారులు-దళిత-గిరిజనులకు వేదం నేర్పించే, బృహత్తర బాధ్యతను ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఆ ప్రకారంగా.. అర్చక శిక్షణ పూర్తి చేసుకున్న బీసీ-దళిత యువకులను, వారి ప్రాంతాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించే దేవాలయాలకు అర్చకులుగా నియమిస్తున్నారు. ఆలయాల్లో వారి ఆధ్వర్యానే ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఆ రకంగా ఇప్పటివరకూ, రాష్ట్రంలో 500 దేవాలయాలు నిర్మించడం విశేషం. అంటే 500 మంది ఎస్సీ-ఎస్టీ-బీసీలను అర్చకులుగా  నియమించారన్న మాట. రాష్ట్రంలో అసలు దేవాలయాలు లేని ప్రాంతాలను గుర్తించి, ప్రధానంగా.. తీరప్రాంతాలు-దళిత-గిరిజన వాడల్లో దేవాలయాలు నిర్మించడం ఈ ఫౌండేషన్ లక్ష్యమని చెబుతున్నారు.   టీటీడీ ఇచ్చే నిధులను,  దేవదాయ శాఖ ద్వారా సమరసత ఫౌండషన్‌కు వస్తుంది. ఒక్కో దేవాలయానికి 5 లక్షల చొప్పున కేటాయిస్తున్నారు.  ఆవిధంగా ఇప్పటిదాకా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు, 25 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నారు. గతంలో ఈ బాధ్యతను దివంగత మాజీ ఏఐఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ విజయవంతంగా నిర్వర్తించగా, ఇప్పుడు ఆ బాధ్యతలను దాసరి శ్రీనివాసులు నిర్వహిస్తున్నారు.   ఆ కార్యక్రమాలు సమీక్షిస్తున్న దాసరి.. మరోవైపు తిరుపతి పార్లమెంటు పరిథిలో, పేద-అనాధ-వీధి బాలలను గుర్తించి, వారిని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించే కార్యకమ్రాలు చేపడుతున్నారు. దళిత-బీసీ విద్యార్థినీ, విద్యార్ధుల తలిదండ్రుల వద్దకు వెళ్లి, వారిని ఒప్పించి ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది పిల్లలను ఆయన, గురుకుల పాఠశాలలో చేర్పించడం విశేషం.   కాగా ప్రస్తుతం బీజేపీ-జనసేన కలసి పనిచేస్తుండటం, టీడీపీ బలహీనపడుతుండటం, ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం వల్ల... ఈసారి తిరుపతిలో బీజేపీ, అధికార వైసీపీకి బలమైన పోటీ ఇవ్వగలదన్న భావన ఉంది. పైగా గతంలో అక్కడ,  వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు మాజీ ఏఐఎస్ వెంకటస్వామి బీజేపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. వైసీపీ నుంచి పదవీ విరమణ చేసిన మాజీ అధికారి వరప్రసాద్ కూడా, తిరుపతి నుంచే గెలవడం విశేషం.   అంతకుముందు రిటైర్డు పోలీసు అధికారి వర్ల రామయ్యను, టీడీపీ నాయకత్వం చివరి నిమిషంలో సీటిచ్చినా, ఆయన బలమైన పోటీ ఇచ్చారు. దీన్నిబట్టి తిరుపతి స్థానంలో ప్రజలు పదవీ విరమణ చేసిన అధికారులను,  ప్రజలు ఆదరిస్తున్నారన్న విషయం అర్ధమవుతుంది. బహుశా అదే అంచనాతో,  దాసరి శ్రీనివాసులుకూ ఎంపీ సీటు ఇచ్చేందుకు బీజేపీ యోచిస్తున్నట్లు కనిపిస్తోంది.  -మార్తి సుబ్రహ్మణ్యం

ముఖ్యమంత్రి కార్యాలయంపై ముసురుకున్న మరో వివాదం

రాజ్యాంగ పరంగా ఏర్పడిన వ్యవస్థ అయినా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం మా ఆధీనంలో పని చేయాల్సిందేనని మంకుపట్టు పట్టి కూర్చున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టు పదే పదే గుర్తు చేస్తున్నా మారడం లేదు.    అదే వైఖరితో ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు పని చేస్తూ ప్రకటనలు జారీ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశంపై ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఈ నెల 28న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.    స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది. అందుకే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కసరత్తు ప్రారంభించారు. ఒక వైపు ఈ కసరత్తు కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి కార్యాలయం దీన్ని జరగకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.    అందులో భాగంగానేనా అన్నట్లు సోమవారం సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సమావేశంలో ఎవరు పాల్గొంటారు అనే అంశంపై ఎలాంటి క్లారిటీ లేకుండా ఈ సమావేశానికి హాజరుకావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు వాట్ప్ యాప్ లో మెసేజ్ వచ్చింది.    రాజ్యంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ ను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి కి చెందిన కార్యదర్శి ఈ విధంగా సమావేశానికి రావాలని ఆదేశాలు ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. రాష్ట్రంలో జరగబోయే పార్లమెంటు ఉప ఎన్నిక, శాసన మండలి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల విషయం పై ఈ నెల 26న అంటే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చించేందుకు రావాలని ఆ మెసేజి సారాంశం.    ఘాటైన సమాధానం ఇచ్చిన ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఈ నెల 28న అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ విధమైన మెసేజి ఎన్నికల కమిషనర్ కు రావడం ఏమిటి? ఎన్నికల కమిషనర్ ను ఈ విధంగా ప్రభుత్వ అధికారి సమన్ చేయవచ్చా? ఇవేవీ ఆలోచించకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం మెసేజీలు పంపేసింది.    ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నుంచి వచ్చిన ఈ మెసేజికి ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఘాటైన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటు అయిన వ్యక్తి అని ఈ విధంగా ఒక సమావేశానికి తనను రావాల్సిందిగా ప్రభుత్వ అధికారి కోరడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని సమాధానం లో పేర్కొన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.    ఈ విధంగా  విధులకు భంగం కలిగిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం విషయాన్ని సంబంధిత న్యాయస్థానం దృష్టి కి తీసుకువెళ్లాల్సి ఉంటుందని కూడా ఘాటుగా సమాధానం ఇవ్వడంతో ఒక్క సారిగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు తాము చేసిన తప్పేంటో తెలిసింది.    తనకు తెలియకుండా సమావేశాలకు వెళ్లవద్దని, తన కార్యదర్శిని రమేష్‌ కుమార్ ఆదేశించారు. 26 నుంచి విజయవాడలో అందుబాటులో ఉంటానని కార్యదర్శికి తెలిపారు. రమేష్ కుమార్ సమాధానం చూసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తగ్గుతుందా లేక ఇంకా అదే విధంగా ప్రవర్తిస్తుందా అనేది చూడాలి.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల భారం పడనుంది. జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.2,074 కోట్ల భారం పడనుంది. జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించింది. మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.3,802 కోట్ల రూపాయల భారం పడనుంది. మొదటి డీఏ బకాయిలను జీపీఎస్‌లో మూడు విడతల్లో జమ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఏమీ చేయలేరు.. మంత్రి కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్  

కరోనా కలకలంతో మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసందే. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. మరోపక్క.. స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది.    అయితే తాజాగా స్థానిక ఎన్నికల వ్యవహారంపై మంత్రి కొడాలి నాని మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. అది సరైన పద్దతి కాదు. నిమ్మగడ్డ మరి కొన్ని నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారు. తర్వాత రిటైర్ అయ్యి హైదరాబాద్‌లో ఉంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నేను చెప్పిందే రాజ్యాంగం అంటే కుదరదు. అసలు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఈ విషయంలో ఏమీ చెయ్యలేరు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అలా కాకుండా ఎన్నికల సంఘం తనంత తాను ఎన్నికలు నిర్వహిస్తానంటే అది జరిగే పనికాదు. కరోనా మహమ్మారి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. ఇంతకూ ముందులాగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువ మందిని తరలించడం కూడా సాద్యం కాదు. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు. అసలు దసరా తర్వాత కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అసలు బీహర్ అసెంబ్లీ ఎన్నికలతో ఇక్కడి స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు" అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

మీ హత్యకు కుట్ర జరుగుతోంది.. మాజీ మంత్రి అయ్యన్నకు బెదిరింపు మెసేజ్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్లు ఆయనకు ఒక వ్యక్తి పంపిన మెసేజ్ కలకలం రేపుతోంది. తాను ఒక ఎస్సై నంటూ అవతలి వ్యక్తి ఆయనకు మేసేజ్ పెట్టారు. ఈ హత్యకు ఇప్పటికే లావాదేవీలు కూడా జరిగాయని ఆ మెసేజ్ సారాంశం. అయ్యన్నను హత్యచేసి దానిని మావోయిస్టులు చేసినట్లు చిత్రీకరిస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఐతే ఈ మేసేజ్ పై అయ్యన్నపాత్రుడు వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వియ్యపు తాతారావు అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వియ్యపు తాతారావు బుచ్చయ్యపేట కేటీ ఆగ్రహారానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ తాతారావు గతంలో కూడా పలువురికి బెదిరింపు మేసేజ్‌లు పంపినట్లు పోలీసు విచారణలో తేలింది.

పెన్సిలుతో పొడిచి, కొరికి కూతుర్ని హింసించిన తల్లి 

సమాజంలో మానవత్వం నశించిపోతోంది. అమానుషాలు పెరిగిపోతున్నాయి. సొంత మనుషులే కిరాతకులవుతున్నారు. మెంటల్ బ్యాలెన్స్ తప్పి సైకోల్లో ప్రవర్తిస్తున్నారు. ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలాంటి దారుణ ఘటన జరిగింది. కన్నకూతురిపైనే తల్లి కిరాతకంగా ప్రవర్తించింది. కన్నకూతురిని పెన్సిలుతో 12 సార్లు పొడిచింది.  అనంతరం కొరికి గాయాలపాలు చేసింది తల్లి.    కరోనా నేపథ్యంలో విద్యాలయాలు ఆన్‌లైన్‌ కాస్లులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆరో తరగతి చదువుతున్న 12 ఏండ్ల  బాలిక ఇంట్లో వర్చువల్ పద్ధతిలో క్లాసులు వింటోంది. ఆ సమయంలో టీచర్ ఆ బాలికను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ బాలిక సమాధానం చెప్పకపోవడంతో ఆమె పక్కనే ఉన్న తల్లికి కోపం వచ్చి ఇలా కర్కశంగా ప్రవర్తించింది. టీచర్‌ ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదంటూ కన్న కూతురిని దారుణంగా గాయపర్చింది. తన చేతిలో ఉన్న పెన్సిల్ తో 12 సార్లు పొడిచింది. అంతటితో ఆగని ఆ మహా తల్లి .. నోటితో కొరికి కూతురిని గాయపరిచింది.                         అక్కను అమ్మ గాయపర్చడంతో అది చూసిన చిన్నకూతురు భయపడిపోయింది. తెలివిగా వ్యవహరించింది. 1098 ఛైల్డ్ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో  ఎన్జీవో ప్రతినిధులు వారి ఇంటికి చేరుకుని ఆ తల్లికి చివాట్లు పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు చికిత్స చేయించారు. కుమార్తెను పెన్సిలుతో పొడిచిన తల్లిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అమరావతిలో పెయిడ్‌ ఉద్యమం.. వీడియోతో అడ్డంగా బుక్కయ్యారు!!

అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 300 ల రోజుల నుంచి అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తుంటే.. అది ఉద్యమమే కాదని, అసలు వాళ్ళంతా రైతులు కాదు పెయిడ్ అరిస్ట్ లని అన్న జగన్ సర్కార్.. ఇప్పుడదే అమరావతి ఉద్యమాన్ని చూసి భయపడుతోందా?. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టించడం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.    అమరావతి రైతులకు పోటీగా శనివారం నాడు మందడంలో ఓ శిబిరం వెలిసింది. అయితే, ఆ శిబిరంలో పాల్గొన్నవారికి శిక్షణ ఇస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి లీక్ అయింది. ఆ వీడియో చూస్తే అమరావతి రైతులుకి వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమం నడిపే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శిబిరానికి వచ్చిన మహిళలకు ఏం మాట్లాడాలో శిక్షణ ఇస్తున్నాడు. ఏ ఊరని ఎవరైనా అడిగితే రాజధాని ప్రాంతంలోని గ్రామమని చెప్పమన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారని.. అందువల్లే రిలే దీక్షలో పాల్గొంటున్నామని చెప్పమని మహిళలతో చెబుతున్నట్లు వీడియోలో ఉంది. అంతేకాదు, డబ్బులు కోసం కాదు.. ఇళ్ల స్థలాల కోసమే స్వచ్ఛందంగా వచ్చామని చెప్పాలని వారికి చెబుతున్నట్లు వీడియోలో రికార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   ఇప్పటి వరకూ రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులు అని వక్రంగా మాట్లాడిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు వీడియోతో అడ్డంగా బుక్కయిన ఈ వ్యవహారంపై ఏం సమాధానం చెప్తారోనన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమరావతి రైతులు అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పెరుగుతుందన్న భయం ప్రభుత్వంలో మొదలైందని, అందుకే పెయిడ్‌ ఉద్యమాన్ని చేయిస్తోందని మండిపడుతున్నారు.

బీహార్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఏపీ! టెర్రరిజం గవర్నమెంటన్న చంద్రబాబు 

విశాఖలోని గీతం విద్యాసంస్థల కూల్చివేతలను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గీతం  యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కట్టడాలను అధికారులు కూల్చివేయడం పట్ల ఆయన మండిపడ్డారు. ఎంతోమంది విద్యార్ధుల చదువులకు,యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతోన్న విశాఖలోని అత్యున్నత 'గీతం' విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నాను.. కోర్టులో ఉన్న వివాదంపై,ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైసీపీ కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు ట్వీట్లు చేశారు.   ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై ఇలా విధ్వంసాలకు పాల్పడటం రాష్ట్ర ప్రగతికి చేటుదాయకమన్నారు చంద్రబాబు. మొన్న మాజీ మేయర్ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం, నేడు గీతం వర్సిటిలో విధ్వంసం వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. వ్యక్తులపై, పార్టీపై అక్కసుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలను గర్హిస్తున్నామని చెప్పారు. గవర్నమెంట్ టెర్రరిజం అంటూ ఇప్పటికే విద్యా, వైద్య ,పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు రావాలంటేనే భయపడే దుస్థితి ఏర్పడిందన్నారు చంద్రబాబు.              రాష్ట్రంలో జరుగుతున్న హింసా విధ్వంసాలను చూసి బీహార్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఏపీ మారిందనే ప్రచారం దేశంలో జరుగుతుందన్నారు చంద్రబాబు. అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా కోట్ల రూపాయల నష్టాన్ని భరించి 2590 మంది కోవిడ్ పేషంట్లకు చికిత్స అందించింది గీతం సంస్థ. అలాంటి ఆదర్శవంతమైన సరస్వతీ నిలయాన్ని అర్థరాత్రి 200 మందితో వెళ్ళి కూల్చడం దారుణమని చంద్రబాబు అన్నారు.   కట్టడం చేతగానివాళ్లకు కూల్చే హక్కులేదన్నారు చంద్రబాబు.ఇప్పటికే చదువు,ఉపాధి,ఆరోగ్య చికిత్సల కోసం ఏపీ ప్రజలు పక్కరాష్ట్రాలకు పోతున్నారని చెప్పారు.ఈ సమయంలో అటు విద్యాసేవ,ఇటు సామాజికసేవల్లో చేయూత అందిస్తూ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై రాజకీయ కక్షసాధింపు మరో తుగ్లక్ చర్య అని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

గులాబీ కార్యకర్తలకే వరద సాయం! గ్రేటర్ లో కొత్త పంచాయితీ 

కుండపోత వానలు, వరదలతో గ్రేటర్ హైదరాబాద్ వణికిపోయింది. గతంలో ఎప్పుడు లేనంతగా వరద నగరాన్ని ముంచెత్తింది. దాదాపు 15 వందల కాలనీలు రెండు, మూడు రోజుల పాటు మోకాళ్ల లోతు నీటిలోనే ఉండి పోయాయి. ఇండ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది  ఇండ్లు నీట మునిగాయి. వరద తగ్గినా ఇంకా కొన్ని బస్తీలు బురదలోనే ఉన్నాయి. వరద కట్టడిలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం.. బాధితులకు మాత్రం నష్ట పరిహారం ప్రకటించింది. వరద ముంచెత్తిన కాలనీల్లోని ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. వరద బాధితులకు నష్ట పరిహారం ఇవ్వడం బాగానే ఉన్నా... పంపిణిలో మాత్రం మళ్లీ అవకతకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిజమైన వరద బాధితులకు కాకుండా అధికార పార్టీ నేతలు చెబుతున్నవారికే డబ్బులు ఇస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు జనాలు.   వరదలతో తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాల్లో తిరిగి జీహెచ్ఎంసీ అధికారులు వివరాలు సేకరించారు. అయితే అవి కూడా తప్పుడు తడకలుగా ఉన్నాయని చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు, లోకల్ కార్పొరేటర్, వార్డు లీడర్లు చెప్పిన పేర్లతోనే అధికారులు జాబితాలు తయారు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ పార్టీ వారికే టీఆర్ఎస్ నేతలు పరిహారం ఇప్పిస్తున్నారని చాలా ప్రాంతాల్లో ఆందోోళనలు  జరుగుతున్నాయి. చెక్కుల పంపిణికి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను పరిహారం కోసం నిలదీస్తున్నారు నిజమైన వరద బాధితులు. వరదలతో ముంపుకు గురైన వారికి నష్ట పరిహారం  ఇవ్వాలి గాని.. ఇలా ఎవరికి  పడితే వారికే ఇవ్వడమేంటనీ ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే  మైనంపల్లికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గోషామహాల్ పరిధిలో చెక్కుల పంపిణికి వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను స్థానికులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకే వరద సాయం పేరుతో నష్ట పరిహారం అందిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.   టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో అంతా వారి చెప్పినట్లే చెక్కుల పంపిణి జరుగుతోంది. అయితే విపక్షాల కార్పొరేటర్లు ఉన్న చోట మాత్రం అలా చేయడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపైనే ఆర్కే పురం డివిజన్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్నారు స్థానికులు. ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ గా బీజేపీ వ్యక్తి ఉన్నారు.  అయితే వరద బాధితుల లిస్టు మాత్రం ఆమెకు తెలియకుండానే తయారైందట. వరదలతో సమయంలో గల్లీగల్లీ తిరిగి ప్రజల కష్టాలు చూసిన తనకు తెలియకుండా లిస్టు ఎలా ప్రిపేర్ చేస్తారని మంత్రి సబిత ముందే బీజేపీ కార్పొరేటర్ ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలు చెప్పినవారి పేర్లతో తయారు చేశారని,  వరద సాయంలోనే రాజకీయం చేయడమేంటనీ ఆమె సబితను నిలదీశారు. స్థానికులు కూడా భారీగా వచ్చి టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చెక్కుల పంపిణిని హడావుడిగా చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.   కొన్ని డివిజన్లలో అధికార పార్టీ నేతలు మరింత బరితెగించారని చెబుతున్నారు. అసలు ముంపే లేని ప్రాంతాల్లో కూడా చెక్కులు ఇస్తున్నారని తెలుస్తోంది. ఫేక్ బాధితులకు చెక్కులు ఇచ్చి.. తర్వాత వారికి కొంత ఇచ్చి మిగితాదంతా గులాబీ నేతలు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ నేతలు కలిసి వరద సాయాన్ని కాజేస్తున్నారనే విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఓటు వేస్తామని హామీ ఇస్తేనే చెక్కులు ఇస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని సమాచారం. వరద సాయాన్ని ఓట్ల కోసం ఉపయోగించుకోవడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి.   భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ లో అపార నష్టం జరిగిందని సీఎం కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారు. గ్రేటర్ వరద బాధితులకు సాయం కోసం విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. సర్కార్ పిలుపుతో టాలీవుడ్ స్టార్లు, వ్యాపార వేత్తలు, ఐటీ సంస్థలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. వరద బాధితులకు సాయం పేరుతో విరాళాలు సేకరిస్తున్న ప్రభుత్వం.. పరిహారాన్ని సరిగ్గా పంపిణి చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమ పార్టీ నేతల జేబులు నింపేందుకే కేసీఆర్, కేటీఆర్లు సినీ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులపై ఒత్తిడి తెచ్చి మరీ విరాళాలు సేకరిస్తున్నారా అని విపక్షాలు ఫైరవుతున్నాయి. వరద కట్టడిలో విఫలమైన ప్రభుత్వం.. వరద సాయంలో రాజకీయం చేయడం దారుణమంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఇప్పటికేనా ప్రభుత్వం చిల్లర పనులు మానుకోవాలని సూచిస్తున్నాయి. మొత్తంగా వరద బాధితులకు అందించే నష్ట పరిహారం విషయంలోనూ అక్రమాలు జరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

పోలింగ్ కు ముందు ఫెస్టివల్! దుబ్బాక ఓటర్లకు డబుల్ ధమాకా

ఉప ఎన్నికలు వచ్చాయంటనే ఓటర్లకు డిమాండ్. ఉప ఎన్నికలో పోటీ తీవ్రంగా ఉంటే ఓటర్లకు పండుగే. మరో పది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఓటర్లకు మాత్రం డబుల్ ఫెస్టివల్ వచ్చినట్లైంది. తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా. ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు విజయ దశమి రావడంతో దుబ్బాక  ఓటర్లకు డబుల్ ధమాకా తగిలినట్లైంది. ఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్ల ప్రసన్నం కోసం నానా పాట్లు పడుతున్నాయి. భారీగా డబ్బులు వెదజల్లుతున్నారు నేతలు. ఇప్పుడు దసరాను ఓట్ల వేటలో పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని తెలుస్తోంది. పండగ పూట ప్రజలకు భారీగా నజనారాలు, తాయిలాలు ఇస్తున్నారట. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో దసరా జోష్ రెట్టింపైందని చెబుతున్నారు.    దుబ్బాక నియోజకవర్గంలోని ఓటర్ల కోసం పండగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయట ప్రధాన పార్టీలు. మందు, మటన్ ఇంటింటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. ఇందుకోసం భారీగా మేకలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యూహం ప్రకారం పార్టీలు  ముందుకెళ్తున్నాయని చెబుతున్నారు. మందు, మటన్ పంపిణి కోసం ప్రతి 100 ఇండ్లకు ఒక ఇన్​చార్జిని పెట్టారట. గ్రామాలు, వార్డులు, కులాలు, మహిళా గ్రూపులు, రైతులు, యువజన సంఘాలు.. ఇలా ఎలా సాధ్యమైతే అలా మటన్ పంపిణి చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు. పండుగ రోజు ప్రతి ఇంటికి లిక్కర్ ను సరఫరా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని చెబుతున్నారు. మద్యం పంపకాల్లో క్యాండిడేట్లు కొత్త పోకడ పోతున్నారట. గ్రూపులు పెట్టి, స్పెషల్​టోకెన్లు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది.   దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా ప్రలోభాలు జోరుగా నడుస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు క్యాండిడేట్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కొత్త ఆఫర్లతో ఓటర్లపై వల విసురుతున్నారు. సన్న బియ్యం బస్తాలు, నూనే డబ్బాలు, గోదుమ పిండిలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారట. ఇంటింటికీ కేజీ బాస్మతి బియ్యం ప్యాకెట్లను కొన్ని గ్రామాల్లో ఇచ్చారని చెబుతున్నారు. వెజిటేరియన్స్​ కోసం స్వీట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంటిల్లిపాదికి కొత్త బట్టలను కూడా సరఫరా చేసినట్లు చెబుతున్నారు. యువకులకైతే ఏది అడిగితే అది ఇచ్చేందుకు పార్టీల నేతలు ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.   మంది, మటన్ పంపిణిలోనూ పార్టీలు పోటి పడుతున్నట్లు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ వారు ఇచ్చిన దాని కంటే ఎక్కువే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక పార్టీలు పోటీ పడి ఇస్తున్న తాయిలాలతో ఖుషీగా ఉన్నారు దుబ్బాక ఓటర్లు. ఉప ఎన్నిక సమయంలో దసరా రావడంతో ఈసారి జబర్దస్తుగా జరుపుకుంటామని చెబుతున్నారు. మొత్తంగా దుబ్బాకలో ఈసారి దసరా డబుల్ జోష్ తో జరుగుతుందని తెలుస్తోంది.

బీహార్ సంగతి సరే.. మిగిలిన రాష్ట్రాలు పాకిస్తాన్ లో ఉన్నాయా.. బీజేపీపై మండిపడ్డ శివసేన 

బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో తీవ్ర దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామన్న బీజేపీ హామీపై ఇపుడు దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ ఒకప్పటి మిత్రపక్షమైన శివసేన తన అధికార పత్రిక సామ్నా వేదికగా ఈ హామీని తీవ్రంగా తప్పు పట్టింది. "ప్రాణాంతకమైన కరోనా వైరస్ ను ఎదుర్కునే వ్యాక్సిన్ పై బీజేపీ రాజకీయాలు చేస్తోంది. బీహార్ కు కరోనా వ్యాక్సిన్ అందాలి. కానీ మిగిలిన రాష్ట్రాలేమైనా పాకిస్తాన్ లో ఉన్నాయా? వ్యాక్సిన్ పై దేశంలోని అన్ని రాష్ట్రాలకూ సమాన హక్కులున్నాయి." అని సామ్నాలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది.    కరోనా తో మొత్తం దేశం తీవ్రంగా బాధపడుతోందని, అయితే కేవలం బిహార్ మాత్రమే కోవిడ్ తో బాధపడటం లేదని అలాంటి పరిస్థితిలో వ్యాక్సిన్ రాజకీయాలు చేయడం ఏంటని బీజేపీ పై శివసేన తీవ్రంగా విమర్శించింది. ఇటువంటి పరిస్థితుల్లో జాతి, కుల, మత, ప్రాంత భేదాల్లేకుండా అందరికీ కరోనా వ్యాక్సిన్ అందేలా చూస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, కానీ బీజేపీ మాత్రం బీహార్ ఎన్నికల సందర్భంగా రాజకీయం చేస్తోందని శివసేన తప్పు పట్టింది. అసలు ఈ విషయంలో బీజేపీని ఎవరు గైడ్ చేస్తున్నారో తమకు తెలియదని, బీజేపీ నాయకత్వంలో ఏం లోపముందో కూడా తమకు తెలియదని విమర్శించింది.   అంతేకాకుండా బీహార్ ఎన్నికలలో వివిధ పార్టీల నేతలు కోవిడ్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదని, ప్రచార సమయంలో కనీసం భౌతిక దూరాన్ని పాటించడం లేదని శివసేన మండిపడింది. "కరోనా మహమ్మారి వ్యాపిస్స్తున్న సమయంలో దేశంలో బిహార్ ఎన్నికలే మొట్టమొదటివి. దీంతో అన్ని ర్యాలీలు వర్చువల్ ర్యాలీలుగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే పార్టీలు ఆ విషయాల్నే మరిచిపోయినట్లున్నాయి. అసలు భౌతిక దూరం అనేది ఏమాత్రం లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొందరు ముఖ్య నేతలు హెలికాప్టర్ల సహాయంతో వివిధ ప్రాంతాలకు వెళ్లి, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహుశా బిహార్ లో ప్రస్తుతానికి కరోనా వైరస్ లాంటిదేమీ లేదు కాబోలు." అంటూ సామ్నా వేదికగా శివసేన సెటైర్లు వేసింది.

కోడెల శివరాం పెత్తనం మాకొద్దు ‘బాబూ’...

సత్తెనపల్లిలో మరోసారి తమ్ముళ్ల తిరుగుబాటు   నాయకత్వానికి ఫిర్యాదు చేయనున్న కమ్మ వర్గ నేత లు   గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో.. తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య మరోసారి ఆధిపత్యపోరు మొదలయింది. నియోజకవర్గ పార్టీపై కోడెల శివరాం పెత్తనంపై, పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఎలాంటి పదవి లేని శివరాం, నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు.   ఇప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ, శివరాం రాకతో గందరగోళంగా మారిందన్న ఫిర్యాదుతో నాయకత్వం వద్దకు వెళ్లనున్నారు. గత ఎన్నికల ముందు కోడెలను వ్యతిరేకించిన కమ్మ వర్గ నాయకులే, ఇప్పుడు శివరాంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండటం ప్రస్తావనార్హం. అధికారంలో ఉన్నప్పుడు, కోడెల కుటంబ చర్యలతో ఘోరంగా దెబ్బతిన్న పార్టీ పరువు, ఇప్పుడిప్పుడే తిరిగి తేరుకుంటున్న సమయంలో, శివరాం రాకతో మళ్లీ ఐదేళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదంలో పడిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.   పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, కోడెల కుటుంబ సభ్యుల చర్యల వల్ల పార్టీ దెబ్బతింది. స్పీకర్ స్థాయి నేతయినా నేతలు భయపడలేదు. కోడెలకు టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ.. చంద్రబాబు సమక్షంలోనే, గుంటూరు పార్టీ ఆఫీసులో టీడీపీ సీనియర్లు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయినా పట్టించుకోని నాయకత్వం.. కోడెలకు టికెట్ ఇవ్వడం, పార్టీ ఓడిపోవడం, ఆ తర్వాత అసెంబ్లీలో ఫర్నిచర్ ఎత్తుకెళ్లిన కేసు, ఎక్కువ అద్దెకు తన సొంత భవనాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం, ఆ తర్వాత శివరాం తమ వద్ద డబ్బులు తీసుకున్నారంటూ పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు, తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టులు కండిషన్ బెయిల్ ఇవ్వడాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ నేతలు గుర్తు చేస్తున్నారు.   గత ఎన్నికల్లో సులభంగా గెలవాల్సిన సత్తెనపల్లి సీటు నుంచి, పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం.. కోడెల కుటుంబసభ్యుల వ్యవహారశైలేనని స్పష్టం చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య తర్వాత, ఇప్పటివరకూ నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనని శివరాం.. ఇప్పుడు మళ్లీ కార్యకర్తలను పిలిపించుకోవడం, సొంత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. గత ఎన్నికల్లో కోడెల కుటుంబసభ్యుల వల్ల నష్టపోయిన కార్యకర్తలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా కోడెల మృతికి శివరాం ఒత్తిళ్లే కారణమని, కోడెల శివప్రసాద్ బావమరిని సాయి అప్పట్లో డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదును టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకోలేదని, శివరామే హత్య చేశారని సాయి చేసిన ఆరోపణ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.   ఐదేళ్ల కాలంలో ఒక్కరికీ న్యాయం చేయకుండా, ఆర్ధికంగా ఎదిగేందుకే  కాలం వెచ్చించి.. ఇప్పుడు మళ్లీ తమపై పెత్తనానికి రావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి నియోజకవర్గ ఇన్చార్జిని నియమించకపోవడంతో, స్థానిక నేత అబ్బూరి.. వ్యయ ప్రయాసలకోర్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరిస్తున్నారు. కోడెల కుటుంబసభ్యుల చర్యల వల్ల దూరమైన పార్టీని, తిరిగి జనంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెబుతున్నారు.   ఈ సమయంలో.. తిరిగి కోడెల శివరాం రంగంలోకి దిగి హడావిడి చేయడం వల్ల, ఆ కుటుంబం వల్ల నష్టపోయిన కార్యకర్తలు, ప్రజలు పార్టీని ఎందుకు అభిమానిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన మేనేజర్ చేసిన పొరపాట్ల వల్ల నష్టం జరిగిందని, ఇకపై అలా జరగకుండా అండగా ఉంటానన్న హామీపై, సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యువనేత ప్రమేయం-ఆదేశాలు లేకపోతే, ఒక సాధారణ మేనేజర్ రెచ్చిపోవడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో శివరాం, గుంటూరు షోరూం కేంద్రంగా చలాయించిన హవా, తమకు చేసిన అవమానాలు మర్చిచపోలేమని సీనియర్లు ఖరాఖండీగా చెబుతున్నారు. మెత్తగా మాట్లాడే ఆయన మాటలకు-చేతలకు పొంతన ఉండదని చెబుతున్నారు.     ఇప్పుడిప్పుడే జనంలోకి వెళుతున్న పార్టీలో.. శివరాం మళ్లీ ప్రవేశించడం వల్ల, లాభం కంటే నష్టమే ఎక్కువంటున్నారు. ఐదేళ్ల కాలంలో సాగించిన హవా వల్ల నష్టపోయిన వర్గాలు-వ్యక్తులు-నేతలు- ఆ కుటుంబాన్ని మర్చిపోతున్న సమయంలో, మళ్లీ అదే వ్యక్తి రావడం వల్ల, ఇప్పుడు ఉన్న కార్యకర్తలు కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పైగా ఆయన మీద కేసులు కూడా కొట్టివేయలేదని, కేసులున్న వ్యక్తులకు నాయకత్వం అప్పగిస్తే, ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయో నాయకత్వమే ఆలోచించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.   నిజానికి కోడెల కుటుంబానికి.. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇంకా సానుకూల పరిస్థితి రాలేదు. సూటిగా చెప్పాలంటే ఆ కుటుంబంపై వ్యతిరేకత పూర్తిగా తొలగిపోలేదు. పైగా ఆ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు సాగించిన హవా, తీసుకున్న నిర్ణయాలు-చర్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై.. రెడ్లలోని ఒక వర్గానికి తప్ప, మిగిలిన ఏ వర్గంలోనూ వ్యతిరేకత లేదు. ఆయన సోదరుడి జోక్యంపైనే  విమర్శలున్నాయి. అయితే, కోడెల హయాంలో జరిగిన వ్యవహారాలతో పోలిస్తే, అది చాలా తక్కువేనన్న అభిప్రాయం ఉంది. ఇటీవల కోర్టుకెక్కిన క్వారీ వ్యవహారం కూడా వైసీపీ అంతర్గతమే. అది కూడా అంబటి స్వయంకృతమేనంటున్నారు. ఇవి తప్ప, ప్రజలకు గానీ-వివిధ కులాలకు గానీ, అంబటితో వచ్చిన సమస్యలంటూ కనిపించడం లేదు.   ప్రస్తుతం సత్తెనపల్లిలో వైసీపీని ఎదుర్కొనే శక్తి టీడీపీకి లేకపోయినా, కొంతమేరకు ఆ పార్టీకి ఓటు బ్యాంకు స్థిరంగానే ఉంది. బలమైన కమ్మ సామాజికవర్గ దన్ను ఉంది. అయితే గత ఎన్నికల్లో ఆ వర్గం కోడెల కుటుంబంపై వ్యతిరేకతతో, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడమే టీడీపీ ఓటమికి ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. కొడుకు-కూతుళ్లు ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదన్న ఫిర్యాదులను, చంద్రబాబు అప్పుడే పరిష్కరించి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. ప్రధానంగా గ్రామాల్లో ఇప్పటికీ ఆ పార్టీ అంత బలహీనంగా ఏమీ లేదు.   ఈ సమయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న శివరాం.. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశిస్తే.. పార్టీకి ఉన్న సానుకూలత కూడా, వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందన్నది మెజారిటీ కార్యకర్తల వాదన. దివంగత కోడెల శివప్రసాద్ స్థానంలో, శివరాంను చూసేందుకు కార్యకర్తలెవరూ ఇష్టపడటం లేదు. సత్తెనపల్లి-నర్సరావుపేటలో కుటుంబసభ్యుల జోక్యం లేకపోతే, కోడెల జీవించి ఉండేవారన్న అభిప్రాయం ఇంకా తొలగిపోలేదు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గమే, శివరాం రాకను వ్యతిరేకిస్తుండటం ప్రస్తావనార్హం. సంపాదనే ప్రధానంగా, ప్రజలతో ఆత్మీయత- మానవ సంబంధాలు కోల్పోయిన వారి వల్ల, పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. పైగా వ్యక్తులపై పడిన బురద, పార్టీ తనంతనట తాను అంటించుకున్నట్లవుతుందని స్పష్టం చేస్తున్నారు.   కాగా, నియోజకవర్గ పార్టీలో శివరాం.. వర్గ విబేధాలు సృష్టిస్తున్నారన్న ఫిర్యాదుతో, పార్టీ నాయకత్వం వద్దకు వెళ్లేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నారు. దీనికి కమ్మ వర్గ నేతలే నాయకత్వం వహిస్తుండటం విశేషం. కోడెల జీవించినప్పుడే, ఆయనకు భయపడకుండా.. ఎన్నికల్లో ఆయనకు ఇకెట్ ఇవ్వవద్దని, ఫిర్యాదు చేసేందుకు వెళ్లామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీలో ఎలాంటి పదవి లేని శివరాం వ్యవహారశైలిపై, ఫిర్యాదు చేసేందుకు భయమెందుకని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ హోదాలో శివరాం నియోజకవర్గంలో కార్యకమ్రాలు నిర్వహిస్తున్నారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.   తమకు శివరాం నాయకత్వం వద్దని, ఆయన ఉంటే తాము పార్టీలో కొనసాగడం కష్టమని, నాయకత్వానికి స్పష్టం చేయనున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీని బతికించాలన్న ఆసక్తి-చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే, ఎవరైనా మాజీ ఎమ్మెల్యేల స్థాయి, లేదా జిల్లా స్థాయి నాయకులకు పార్టీ పగ్గాలివ్వాలని సూచించనున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదే కామోసు? అధికారం శాశ్వత మనుకుని విర్రవీగే.. ఇప్పటి తరం యువ నాయకులకు, సత్తెనపల్లి పరిణామాలు ఓ కనువిప్పు! -మార్తి సుబ్రహ్మణ్యం

గన్నవరం ఎమ్మెల్యే వంశీకి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్  

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రత కొన‌సాగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య కొంత తగ్గినట్టు కనపడినప్పటికీ మళ్ళీ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది … అంతేకాకుండా ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా కరోనా మ‌హ‌మ్మారి మాత్రం వ‌ద‌ల‌టం లేదు. అంతేకాకుండా సామాన్య ప్రజలు మాత్ర‌మే కాకుండా ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా దీని బారిన పడుతున్నారు.   ఏపీలో ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా బారిన ప‌డ‌గా… తాజాగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా వైరస్ సోకింది. తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు పాజిటివ్ అని తేల‌టంతో 14 రోజుల పాటు హోంక్వారెంటైన్ లో ఉండ‌నున్నట్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యే వంశీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నార‌ని, ఆయనకు ఎలాంటి కరోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని వైద్యులు తెలిపారు. దీంతో గ‌త నాలుగైదు రోజులుగా ఆయ‌న్ను క‌లిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

రూటు మార్చిన ట్రంప్.. భారత్ ఎంతో రోత.. కారణం అదేనా...

నిన్నటి వరకు భారత్ అన్నా.. మోడీ అన్నా.. ఎంతో ఇష్టమన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా భారత్ అంటే రోత అన్నట్లుగా మాట్లాడాడు. తాజాగా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా.. డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జోబైడెన్‌తో నాష్‌విల్లేలో గురువారం రాత్రి జరిగిన జరిగిన చివరి డిబేట్ లో ట్రంప్‌ భారత్‌ను మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. "భారత్‌ను చూడండి.. అక్కడ పీల్చేగాలి కూడా రోత పుట్టిస్తుంది. భారతే కాదు.. చైనా, రష్యా దేశాలు కూడా వాయుకాలుష్యమయమే.." అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ మూడు దేశాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణస్థాయిలకు పడిపోయిందని అన్నారు. వాతావరణ మార్పుల విషయంలో ఆ మూడు దేశాలు సహకరించడం లేదని ఆరోపించారు. అందుకే పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుందంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి ఆ మూడు దేశాలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ట్రంప్ అన్నారు.   ఇది ఇలా ఉండగా భారత్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ చేసిన విమర్శలపై నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు. గత ఏడాది అమెరికాలో నిర్వహించిన "హౌడీ.. మోడీ" కార్యక్రమాన్ని పలు సందర్భాల్లో ట్రంప్‌ ప్రస్తావిస్తూ.. మోదీ తనకు ఆప్తమిత్రుడంటూ ఆకాశానికి ఎత్తేసిన విషయాన్నీ పలువురు నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. అయితే ట్రంప్‌ ఒక్కసారిగా ఇలా రూటు మార్చి భారత్‌పై విరుచుకుపడటానికి కారణం... వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న భారతీయుల ఓట్లపై ట్రంప్‌, బైడెన్‌ కన్నేశారు. అయితే ఇటీవల జరిగిన సర్వేల్లో అనూహ్యంగా బైడెన్‌కే భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు వెల్లడి కావడంతో ట్రంప్‌ తన అక్కసునంతా ఈవిధంగా వెళ్లగక్కారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కొంప ముంచిన వైసీపీ లేఖలు? పోలవరానికి రూ. 15.6 వేల కోట్లే!

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని అత్యంత భారీగా తగ్గించేసింది. పోలవరానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సింది రూ.15,667.90 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. ఇందులోనూ  రూ.8,614.16 కోట్లు ఇప్పటికే మంజూరు చేశామని కేంద్రం చెబుతోంది. ఈ లెక్కన పోలవరానికి కేంద్రం ఇంకా ఇవ్వాల్సింది కేవలం రూ.7,053.74 కోట్లే. 2013, 2014 అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.15,667.90 కోట్లకు కేంద్రం కుదించింది. కేంద్రం ఇవ్వాల్సింది రూ.7,053.74 కోట్లే అని అంగీకరిస్తేనే.. ప్రసుత్తం రూ.2,234.28 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం షరతు పెట్టిందని తెలుస్తోంది.    పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయాన్ని కేంద్రం తగ్గించిన సమాచారం తెలియడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజులుగా హైరానా పడుతున్నట్లు తెలుస్తోంది. అందు కోసమే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఇవాళ కూడా నిర్మలతో సమావేశమయ్యారు బుగ్గన. అయితే పోలవరం నిధులు, సవరించిన బడ్జెట్ అంచనాల ఆమోదంపై కేంద్రం నుంచి బుగ్గనకు ఎలాంటి ఊరట లభించలేదని చెబుతున్నారు.    నెల రోజుల క్రితం పోలవరం ప్రాజెక్ట్ సవరించిన బడ్జెట్ కు పోలవరం అథారిటీ ఆమోదం తెలిపిందని వార్తలు వచ్చాయి. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు పునరావాస ప్యాకేజీ, ముంపు బాధితులకు పరిహారం కోసం అవసరమైన 56 వేల కోట్ల రూపాయలు భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వైసీపీ నేతలు కూడా ప్రచారం చేసుకున్నారు. జగన్ వల్లే ఇది సాధ్యమైందని, కేంద్రాన్ని ఒప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారని మంత్రులు కూడా చెప్పారు. ఇప్పడు సీన్ మారిపోవడంతో వైసీపీ నేతలు దిక్కులు చూస్తున్నారు. వైసీపీ నేతలు చెప్పినట్లు నెల రోజుల క్రితం కేంద్రం ఓకె చెబితే.. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎందుకు ఈ ప్రకటన చేస్తారనే చర్చ వస్తోంది.ఢిల్లీ నుంచి సరైన సమాచారం లేకుండానే వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.56 వేల కోట్లకుపైగా అంచనాలను గతంలో టీడీపీ కేంద్రానికి పంపింది. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పోలవరంపై పలు ఆరోపణలు చేస్తూ కేంద్రానికి వైసీపీ లేఖలు రాసింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని, అందుకే.. 2013- 14లో రూ.29,027.95 కోట్లుగా ఉన్న అంచనాలను రూ.55,548.87 కోట్లుకు పెంచేశారని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఆరోపించారు. ప్రాజెక్టు అంతా అవినీతిమయమని. కమీషన్లకు కక్కుర్తిపడి అంచనా వ్యయాన్ని పెంచారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ రాసిన లేఖలు, ప్రతిపక్ష నేతగా గతంలో జగన్ చేసిన ఆరోపణలే పోలవరానికి ఇప్పుడు శాపంగా మారాయని అధికారులు అంటున్నారు.    వైసీపీ అధికారంలోకి వచ్చాకా పోలవరం పనుల్లో వేగానికి బ్రేక్ పడింది ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరిట కాంట్రాక్టు సంస్థను మార్చేసింది జగన్ సర్కార్. అయితే ఇప్పుడు కేంద్రం కాలాన్ని కూడా రివర్స్‌ చేసి, 2013-14 అంచనాలే ఫైనల్‌ అని తేల్చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో  పోలవరం ప్రాజెక్ట్ పనులపై ఆందోళన నెలకొంది. కేంద్రం 15.6 వేల కోట్లే ఇస్తే.. ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వానికి భారం కానుంది. అసలే అంతమాత్రంగా ఆర్థిక పరిస్థితి ఉన్న ఏపీకి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి కష్టమవుతుందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.   అంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై తాజాగా జరుగుతున్న పరిణామాలు ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. రాజకీయాల  కోసం జగన్ గతంలో చేసిన ఆరోపణలు వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు.

కమలానికి కాదేదీ అనర్హం.. కరోనా వ్యాక్సిన్ సైతం!

ఇంతకూ వ్యాక్సిన్ ఉచితమా? కాదా?   బీహార్ మేనిఫెస్టోతో కొత్త సందేహాలు   భారతీయ జనతా పార్టీ అంటే గంగానది అంత స్వచ్ఛమైనది. ఇంకా ఎక్కువ మాట్లాడితే గంగ కంటే స్వచ్ఛమైనది. దానికి రాజకీయాలు-అధికారం కంటే సిద్ధాంతం ముఖ్యం. రాజకీయ అవకాశవానికి అల్లంత దూరంలో ఉంటుంది. తుచ్ఛమైన రాజకీయ ప్రయోజనాల కోసం, అవసరార్ధ రాజకీయాలు చేయదు. వాజపాయ్ మాదిరిగా, అవసరమైతే అధికారమయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అది.. అవసరార్ధ రాజకీయాలు, పూటకో మాట, రాష్ర్టానికో హామీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీలా కాదు. కాంగ్రెస్ అనే రాజకీయభూతం, దేశంలో సృష్టించిన పుండాకోరు సంస్కృతిని కూకటివేళ్లతో పెకలించి, దాని భ్రష్ఠాచార-అవకాశ వాద రాజకీయాలకు.. చరమగీతం పలికేందుకు పుట్టిన పార్టీ బీజేపీ!   అంత పవిత్రమైన, అంత మంది పులుకడిగిన ముత్యాలున్న పార్టీ.. ఒక ఓటుతో అధికారాన్నే కాదనుకున్న పార్టీ... కేవలం ఒక్క రాష్ట్రంలో ఓట్ల కోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందా? అసాధ్యం.. నెవ్వర్.. అసంభవ్.. కండిత ముడియాదు.. ఆగోదిల్ల.. హైలీ ఇంపాజిబిల్!!! అవును కదా?.. నిన్నటి వరకూ అంతా అలాగే ఫీలయ్యారు. కానీ కేంద్రమంత్రి నిర్మలమ్మ ప్రకటించిన, బీహార్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో చూసిన తర్వాత.. అవకాశవాద రాజకీయాలు, అనుచిత హామీల తీరు చదివిన తర్వాత.. రాజకీయ జేజెమ్మ కాంగ్రెస్‌కే, కమలం పువ్వు పార్టీ దగ్గులు నేర్పుతుందనిపించక మానదు. ప్రపంచం అంతా కరోనా వైరస్‌తో గజగజలాడుతోంది. శ్వేత సౌదాధిపతి, ప్రపంచపెద్దన్న ట్రంపు నుంచి.. భారత రెండవ పౌరుడయిన మన నెల్లూరు నాయుడు గారి వరకూ, కరోనా ఎవరినీ విడిచిపెట్టలేదు. పాపం దానికి కులాలు-మతాలు-హోదాలు-పదవులతో పనిలేదు.  ప్రపంచం మీదకు చైనా వదిలిన ఆ మహమ్మారికి,  ఇప్పటికీ కోట్ల మంది బలవుతూనే ఉన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు, వ్యాక్సిన్ తయారుచేసే పనిలో పెద్ద దేశాలు బిజీగా ఉన్నాయి. మనదేశంలో కూడా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వస్తే తొలి విడత 25 కోట్ల మందికి ఇచ్చే విధంగా ఏర్పాటుచేస్తామని, అందులో ముందుగా కరోనా వారియర్స్, వృద్ధులు, పిల్లలకు ఇస్తామని కేంద్రం కూడా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉంది.   కానీ, తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రకటించిన, వ్యాక్సిన్ తాయిలమే దేశ ప్రజలలో కొత్త సందేహాలు రేపింది. తమ పార్టీకి ఓటు వేసి, ఆ పీఠమేదో తమకు అప్పగిస్తే.. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నది, నిర్మలమ్మ హామీల వరదలో వినిపించిన ఓ మహాప్రసాదం. అంటే ఆ ప్రకారంగా.. కేవలం బీహార్ ప్రజలకే, అది కూడా తన్మయత్వంతో కమలం పువ్వును వికసింపచేస్తేనే, ఆ రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ప్రసాద భాగ్యం దక్కుతుందన్నమాట! లేకపోతే లేనట్లే లెక్క. మరి ఇతర రాష్ట్ర ప్రజలకు ఆ భాగ్యం లేదా?.. అన్న ప్రశ్నకు,  బీజేపీ మోతుబరి భూపీందర్ యాదవ్ చేసిన మరికొన్ని అమృతవాక్కులు, దేశ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేశాయి.   వ్యాక్సిన్ అనేది ఉచితం కాదని, నామమాత్రపు ధరకు లభిస్తుందని, రాష్ర్టాలే ఈ ఖర్చును భరించాలని సదరు బీజేపీ మహా మంత్రి సెలవిచ్చారు. ఆ ప్రకారంగా బీహార్‌లో తాము అధికారంలోకి వస్తేనే, వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నది కమలదళాల కవిహృదయమన్న మాట. అంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తారేమోనని,  భ్రమిస్తూ వచ్చిన వెర్రి వెంగళప్పల కళ్లను, కమలనేత్రాలు ఆ విధంగా తెరిపించాయన్నమాట. మరి ఇన్నాళ్లూ టీవీలో నరేంద్రుల వారిచ్చిన గంభీర ఉపన్యాసాలు. కొట్టిన చప్పట్లు.. వెలిగించిన కొవ్వొత్తుల మాటేమిటి? అంతా తూచ్చేనా?   కేంద్రం తీరు చూస్తే అదే డౌటనుమానం వస్తోంది మరి! రాదా మరి..? ఎందుకంటే.. కరోనా సీజన్‌లో మోదీ భయ్యా చప్పట్లు కొట్టమంటే, జనం గంటలు మోగించారు. కొవ్వుత్తులు వెలిగించమంటే, ఏకంగా దివిటీలే వెలిగించారు. మరి నరేంద్ర భయ్యా చెబితే ఇంత చేసిన జనాలకు, కమలం పార్టీ ఇచ్చే బహుమతి ఇదేనా? ఇప్పుడు కమలం పార్టీ ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా  కావాలంటే, మళ్లీ ఎన్నికలు రావలసిందేనా? అప్పటివరకూ వ్యాక్సినుకు తెరవు లేదా? ఎన్నికలొచ్చే వరకూ కళ్లలో వత్తులేసుకుని, దేభ్యమొహాలతో ఎదురుచూడాల్సిందేనా?   ప్రజారోగ్యం బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పుడు, మరి ఎవరి ఖర్మకు వారిని విడిచిపెట్టడం భావ్యమా? మరోపక్క.. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని, కేంద్ర ఆరోగ్యమంత్రి సెలవిస్తున్నారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? పార్టీ నేతదా? కేంద్రమంత్రిదా? హేమిటో.. ఈ కమలం కంగాళీయం! అయినా అవకాశవాద రాజకీయాలకు ఆమడదూరం.. ఇంకా చెప్పాలంటే వేల కిలోమీటర్ల దూరం ఉంటుందనుకునే,  భారతీయ జనతా భిన్నమైన పార్టీ అనే కడిగిన ముత్యానికి.. ఈ రాజకీయ పైత్యమేమిటన్నది దేశప్రజల ప్రశ్న. -మార్తి సుబ్రహ్మణ్యం

మొన్న సబ్బం హరి.. ఈరోజు గీతం యూనివర్సిటీ.. అక్రమ నిర్మాణాలంటూ అర్ధరాత్రి కూల్చివేత 

విశాఖలోని ప్ర‌తిష్టాత్మ‌క విశ్వవిద్యాలయం గీతం యూనివ‌ర్శిటీకి చెందిన ప‌లు క‌ట్ట‌డాల‌ను విశాఖ మున్సిప‌ల్ అధికారులు గత అర్ధరాత్రి నుండి మొదలుపెట్టి కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలతో.. గీతం వర్సిటీ ప్రధాన ద్వారంతో పాటు, ప్రహరీ గోడలో కొంతభాగం, అలాగే సెక్యూరిటీ రూములను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సమయంలో యూనివర్సటీకి దారి తీసే రోడ్లను మూసివేసి మరీ కూల్చివేత కొనసాగయించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.    అయితే తమకు ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే కూల్చివేత‌లు చేప‌ట్టార‌ని గీతం వ‌ర్శిటీ ఆరోపిస్తుండ‌గా… గ‌తంలోనే నోటీసులిచ్చిన‌ట్లు రెవెన్యూ అధికారులు అంటున్నారు. దాదాపు 40ఎక‌రాల ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జీవీఎంసీ అధికారులు పేర్కొన్నారు.    అయితే కొద్దీ రోజుల క్రితం విశాఖలోని టీడీపీ నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను, టాయిలెట్ ను కూడా ఇలాగె శనివారం రోజు ఎంచుకుని మరీ కూల్చివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ ఏపీలో వరుసగా టీడీపీ నాయకులను టార్గెట్‌గా చేసుకుని వారికి సంబంధించిన నిర్మాణాలను కూల్చివేసే పనిలో పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలా ఇచ్చారు.. ఇలా తీసుకున్నారు! టీఎస్ ఉద్యోగుల నిరాశ

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం డీఏను విడుదల చేసింది. జూలై 2019 నుంచి అమలు కావాల్సిన DAను 5.24 % పెంచుతూ జీవో జారి చేసింది. 2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక డిఏను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలని ఆర్థిక శాఖను సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ డీఏ కోసమే చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. ఉద్యోగులు కోరిక మేరకు దసరా పండుగ మరుసటి రోజున  సెలవు దినంగా ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.   దసరా ముందు డీఏ పెంపు ప్రకటన రావడంతో ఉద్యోగులు ఊరట చెందారు. దసరా మరుసటి రోజు సెలవుగా ప్రకటించడాన్ని స్వాగతించారు. అయితే తెలంగాణ ఉద్యోగుల సంతోషం ఎంతో సేపు నిలవలేదు. వరద బాధితుల సహాయం కోసం విరాళంగా ఉద్యోగుల ఒకరోజు వేతనం కట్ చేస్తూ మరో నిర్ణయం వెలువడింది. సర్కార్ నిర్ణయంతో తమ  సంతోషం కొన్ని నిమిషాల్లోనే ఆవిరైపోయిందని ఉద్యోగులు ఢీలా పడ్డారు. ప్రభుత్వం ఇలా ప్రకటించి.. అలా తీసుకున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించాలని నిర్ణయించారు. మొత్తం రూ.33 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి సహాయంగా అందించే కాన్సెంట్ లెటర్ ను ఉద్యోగ సంఘాల నాయకులు ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ కు అందించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒక రోజు వేతనాన్ని అందించనున్నారు.       ప్రభుత్వానికి ఒక రోజు వేతనం ఇవ్వాలన్న జేఏసీ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమ ఒక రోజు వేతనాన్ని ఎలా పణంగా పెట్టారంటూ కొన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణా గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఓపెన్ లెటర్ కూడా విడుదల చేసింది. పీఆర్సీ, ఐఆర్ విషయంలో సర్కార్ నిర్లక్ష్యంగా ఉన్నా.. జేఏసీ ఎందుకు ప్రశ్నించడం లేదని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నేతలు ప్రశ్నించారు. కరోనా కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడిన.. ఎందుకు స్పందించలేదని నిలదీశారు.  గ్రామ రెవిన్యూ సంఘాల బాటలోనే మరికొన్ని సంఘాలు కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపాయి.

అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టుల గోల... రఘురామరాజు సంచలన కామెంట్స్ 

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అక్కడి రైతులు, ప్రజలు 300 రోజులుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఐతే ఈ ఉద్యమాన్ని ఎలాగైనా భగ్నం చేసి తాము కోరుకున్న విధంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనీ వైసిపి సర్కార్ విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అమరావతి పరిరక్షణ కోసం రైతులు ఉద్యమం చేపట్టి.. 300 రోజులు పూర్తీ కావడంతో పాటు ప్రధాని మోడీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్దండరాయనిపాలెంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో వైసీపీ సర్కార్ కు మళ్ళీ టెన్షన్ మొదలైంది.   ఇప్పటిదాకా తమపార్టీ నేతలతో విశాఖ కర్నూల్ ప్రాంతాల్లో మూడు రాజధానుల అనుకూల ప్రదర్శనలు చేయించిన సర్కార్ ఇపుడు ఏకంగా అమరావతి ప్రాంతంలోనే బలప్రదర్శన చేయాలనే వ్యూహాన్ని అమల్లోకి తెచ్చేసింది. గతంలో కూడా దళిత రైతుల పేరుతో వైసీపీ అనుకూల క్యాంపులు నిర్వహించి... చంద్రబాబునాయుడి పర్యటనలో.. చెప్పులు కూడా వేయించినా అవన్నీ బయటపడిపోయాయి. తాజాగా నిన్న తాము కూడా ప్రదర్శన నిర్వహిస్తామని.. మూడు రాజధానులకు అనుకూలమంటూ కొందరు పోలీసులను పర్మిషన్ అడిగినట్లు.. దానికి వారు ఒక టైమ్ ఫిక్స్ చేసినట్లు హైడ్రామా నడిచింది. ఐతే ఈ విషయం తెలుసుకున్న అక్కడి రైతులు భగ్గుమన్నారు. దీంతో ఏదేమైనా సరే అని.. మళ్లీ కొందరిని చివరి నిమిషంలో ఆటోల్లో తరలించి.. ఆ ప్రాంతంలో గొడవలు రేపటానికి కూడా ప్రయత్నించారు.   ఐతే ఈ మొత్తం ఉదంతం పై వైసిపి రెబల్ ఎంపీ రఘురామరాజు స్పందిస్తూ.. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ ప్రయత్నించిందని అన్నారు. కర్నూల్‌లో ఒక రాజధాని, విశాఖలో ఒక రాజధాని కావాలని అసలు బుద్ధున్నోడు ఎవడైనా అడుగుతాడా? అమరావతి వాడు కర్నూల్‌లో ఒకటి.. వైజాగ్‌లో ఒకటి కావాలని అడుగుతాడా? అన్నం తింటున్నారా.. గడ్డితింటున్నారా... ఇది కేవలం పెయిడ్ ఆర్టిస్టుల పని అని అర్థమువుతోంది. వైసిపి వాళ్ళు చిన్నపిల్లల్లా, తెలివితక్కువతనంతో ప్రవర్తిస్తున్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నోళ్లకి ఇది చాలా ఈజీగా అర్థమవుతోంది. నాలుగు గంటలకల్లా ... ఆటోలో కొంతమంది అక్కడికి చేరుకున్నారంటూ అయన తన దగ్గరున్న మొబైల్‌లోని ఓ ఫొటో చూపించారు. వైసీపీ లోకల్ ఎమ్మెల్యేనే పెయిడ్ ఆర్టిస్టుల సప్లయిర్ అని అయన తీవ్ర ఆరోపణలు చేసారు. అసలు ప్రజాప్రతినిధే ఒక జూనియర్ ఆర్టిస్ట్ రోల్ తీసుకున్నారన్నారు. వాళ్లకు వెయ్యి రూపాయలు ఇచ్చారట. ఐతే ఆటోలో వచ్చిన వారికి... ఎందుకు వెళుతున్నారో కూడ తెలియదని అయన అన్నారు.