జో బైడెన్ తో అమెరికా సర్వనాశనమా..! పదేళ్ల క్రితమే బిన్ లాడెన్ జోస్యం? 

ఆప్ఘనీస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్ చేతుల్లోకి వెళ్లింది. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఆప్ఘనీస్తాన్ ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు. అప్ఘన్ నుంచి అమెరికా తన బలగాలను ఉప సంహరించుకోవడంతోనే.. ఆపరేషన్ ప్రారంభించిన తాలిబన్లు కొన్ని రోజుల్లోనే కాబుల్ లోకి ఎంటరయ్యారు. తాలిబన్లకు భయపడి అధ్యక్షుడు అఫ్రస్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. దీంతో ఆప్ఘన్ సైన్యం నుంచి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు అధికారం దక్కింది. అమెరికా వల్లే ఆప్ఘనీస్తాన్ తాలిబన్ల వశం అయిందనే ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బైడెన్ తాలిబన్లకు సహకరించారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి.  తాజాగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు సంబంధించి మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది.  బైడెన్ అధ్యక్షుడైతే  అమెరికా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పదేళ్ల క్రితమే చెప్పాడనే విషయం వెలుగులోనికి వచ్చింది. 2011లో అమెరికా బలగాలు లాడెన్‌ను మట్టుబెట్టిన తర్వాత.. లాడెన్  రాసిన 48 పేజీల లేఖ లభ్యమైంది. మే 2010లో తన సోదరుడు అతియా అబ్దుల్ రహ్మాన్‌కు లాడెన్ ఈ లేఖ రాశాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, సీఐఏ డైరెక్టర్ డేవిడ్ పెట్రాస్‌ల విమానాలను లక్ష్యంగా చేసుకోవాలని అందులో సూచించిన లాడెన్.. బైడెన్‌ జోలికి వెళ్లొద్దని మాత్రం హెచ్చరించాడు. ఒబామాను చంపేస్తే బైడెన్ అధ్యక్షుడవుతాడని, ఆయన అధ్యక్షుడయ్యాడంటే మన కల నెరవేరినట్టేనని తన లేఖలో బిన్ లాడెన్ చెప్పారు. అధ్యక్ష పదవికి బైడెన్ పూర్తిగా అసమర్థుడని, ఆయన  హయాంలో అమెరికా సంక్షోభంలో కూరుకుపోతుందని, అతడితోనే అమెరికా పతనం ప్రారంభమవుతుందని కూడా ఆ లేఖలో లాడెన్ పేర్కొన్నాడు. కాబట్టి బైడెన్‌కు ఎలాంటి హానీ తలపెట్టవద్దని 48 పేజీలున్న ఈ లేఖలో తన అనుచరులకు సూచించాడు. ఆ లేఖలోని 36వ పేజీలో రెండు హిట్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్న తన కోరికను లాడెన్ వెల్లడించాడు. అందులో ఒకటి పాకిస్థాన్‌లో, మరోటి ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పాటు చేయాలన్నాడు. ఈ రెండూ ఒబామా, సీఐఏ డైరెక్టర్‌ల హత్యకు పథక రచన చేయాలని కోరాడు.  బిన్ లాడెన్ రాసిన లేఖ 2012లో తొలిసారి ఈ లేఖ వెలుగులోకి రాగా, ఇప్పుడు ఆఫ్ఘన్ సంక్షోభం నేపథ్యంలో మరోమారు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవడం, ఆప్ఘనీస్తాన్ తాలిబన్ల వశం కావడంతో.. బైడెన్ విషయంలో లాడెన్ చెప్పింది నిజం కాబోతోందా? అన్న చర్చ జరుగుతోంది.  

కవిత, సీతక్క పోరులో గెలుపెవరిది? రేవంత్ ఎంట్రీతో మారిన సీన్..

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడేండ్లుగా తమకు ఎదురే లేకుండా ముందుకు సాగుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి.. ప్రస్తుతం గడ్డుకాలం మొదలైనట్లు కనిపిస్తోంది. కేసీఆర్ పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే అదనగా విపక్షాలు దూకుడు పెంచడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి. కొన్ని రోజుల వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి కనిపించగా.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత సీన్ మారిపోయింది. వరుస కార్యక్రమాలతో రేవంత్ రెడ్డి జనాల్లోకి వెళుతుండటంతో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు పెరిగిపోతోంది. కాంగ్రెస్ దూకుడుతో గులాబీ పార్టీలో టెన్షన్ నెలకొంది.  హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రత్యేక వ్యూహం రచించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో అతిపెద్ద సంస్థ అయిన సింగరేణిపైనా ఫోకస్ చేశారు. త్వరలో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగనుండటంతో.. అక్కడ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. సింగరేణిలో ప్రస్తుతం టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హవా సాగుతోంది. నాలుగేండ్ల క్రితం జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీజీబీకేఎస్ బంపర్ విక్టరీ కొట్టింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ  కవిత ఉన్నారు. దీంతో ఆమె ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గతంలో గెలిపించారు. ఈసారి కూడా సింగరేణి ఎన్నికలపై కవిత ఫోకస్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీకి ఏ విధంగా వెళ్ళాలి. ఎలా చేయాలి. ప్రతిపక్ష నేతలకు ఎలా సమాధానాలు చెప్పాలి అనే దానిపై వ్యూహం రచిస్తున్నట్లు సింగరేణిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కవిత సారథ్యంలోని టీజీబీకేఎస్ కు షాకిచ్చేలా రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ రూపొందించారని తెలుస్తోంది. కవిత పోటీగా ఫైర్ బ్రాండ్ లీడర్, ఎమ్మెల్సీ సీతక్కను బరిలోకి దింపుతున్నారట రేవంత్ రెడ్డి. సీతక్క కూడా ఇప్పటికే సింగరేణి ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. సింగరేణి ఎన్నికలపై రేవంత్ రెడ్డి సీతక్కతో ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు  సమాచారం. ఇప్పటికే ఆయా కార్మిక సంఘం నాయకులతో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.   సింగరేణి వ్యాప్తంగా 12 సెగ్మెంట్లలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రభుత్వం బూస్టింగ్ గా భావిస్తుంది. అందుకే  సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికలలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఓటమి పాలు అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం సింగరేణి వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పడుతుందనే ఆలోచనలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులు ఈ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకొని బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా సింగరేణి ఎన్నికలను సవాల్ గా తీసుకుందని తెలుస్తోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పదవి కాలం ముగిసి ఎప్పుడో నిర్వహించాల్సిన కార్మిక సంఘం ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్నాయి. గత రెండు నెలల క్రితమే రావాల్సిన సింగరేణి ఎన్నికల నగరా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. హుజరాబాద్ లో ఉప ఎన్నిక ముగిసిన వెంటనే నవంబర్ మొదటివారంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ నుంచి సీతక్క రంగంలోకి దిగితే సింగరేణి ఎన్నికలు రాజకీయ వేడి రాజేసే అవకాశాలున్నాయి. సింగరేణి కార్మికుల్లో సీతక్క మంచి గుర్తింపు ఉంది. గతంలో టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీయూసీ అధ్యక్షురాలిగా పని చేశారు సీతక్క. దీంతో ఆమె కార్మికుల సమస్యలపై మంచి అవగాహన ఉంది. కరోనా సమయంలో సీతక్క చేసిన పనులకు జనాల నుంచి ఆమె నీరాజనాలు దక్కాయి.  సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల రంగంలోకి సీతక్క దిగితే.. అధికార పార్టీకి కష్టమేననే చర్చ బొగ్గు గనుల్లో సాగుతోంది. ఎమ్మెల్సీ కవితకు ఈసారి గెలుపు అంతా ఈజీ కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.   

వైఎస్సార్ కు జగన్ కు పోలికే లేదా? కేవీపీ నోట షాకింగ్ నిజాలు.. 

కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ బంధువు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత. వైఎస్సార్ రాజకీయ ప్రస్థానంలో సలహాదారుడిగా ఆయన వెంట నడిచారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తీసుకున్న అన్ని నిర్ణయాల్లోనూ కేవీపీ పాత్ర ఉందని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు కేవీపీ. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు ప్రభుత్వం, ఇటు పాలనలో నెంబర్ టు స్థానం కేవీపీదే. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ.. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కు సపోర్ట్ గా నిలిచారు. అయితే కొద్ది రోజులకే జగన్ కు ఆయన దూరమయ్యారు. జగన్ కొత్త పార్టీ పెట్టుకుంటే.. కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయనే ప్రచారం అప్పట్లో జరిగింది.   కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దూరంగానే ఉంటున్నప్పటికి.. జగన్ గురించి ఆయనకు పూర్తిగా తెలుసుని అంటారు. వైఎస్సార్ ఆత్మ బంధువుగా చిన్నప్పటి నుంచి జగన్ ను దగ్గరగా చూశారు కేవీపీ. అందుకే జగన్ వ్యవహార శైలీ, ఆయన నైజం గురించి కేవీపీకి తెలిసినంతగా మరొవరికి తెలియదంటారు. అలాంటి కేవీపీ.. ఏపీ సీఎం జగన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారు కేవీపీ. కాని ఇటీవల ఆయన ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వైఎస్సార్ తో తన అనుబంధాన్ని పంచుకున్న కేవీపీ.. ఏపీ సీఎం జగన్ వైఖరిపైనా తనకు తెలిసిన విషయాలు బయటపెట్టారు. జగన్ తీరు ఎలా ఉంటుంది, వైఎస్సార్ ఎలా ఉండేవారు, వైఎస్ తో పోల్చితే జగన్ పరిస్థితి ఏంటన్న అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేవీపీ.  ఏపీ సీఎం జగన్ ఎవరి మాట వినరనే అర్ధం వచ్చేలా మాట్లాడారు కేవీపీ. మంత్రివర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాల్ని తీసుకోవాల్సిన సమయంలో సీనియర్ మంత్రులు.. సలహాదారులతో సమస్యలపై చర్చించి వైఎస్ నిర్ణయం తీసుకునేవారన్నారు. రోశయ్య లాంటి సీనియర్ల సలహాల్ని వైఎస్ తీసుకునే వారన్న విషయాన్ని కేవీపీ గుర్తు చేశారు. దీంతో  వైఎస్ మంత్రివర్గ సహచరులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే.. జగన్ మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పరోక్షంగా కేవీపీ చెప్పినట్లైంది. సమస్యల పరిష్కారానికి ముందు చర్చలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఎవరి మాట వినరన్న ఆరోపణ.. ఎవరి సలహాలు స్వీకరించే విమర్శలపైనా స్పందించేందుకు కేవీపీ ఇష్టపడలేదు.  2024లో జరిగే ఎన్నికల్లో జగన్  తిరిగి అధికారంలోకి వస్తారా? అన్న ప్రశ్నకు సూటి సమాధానం చెప్పని కేవీపీ.. జగన్ కున్న బలం గురించి ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ - టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలు జరిగితే రెండు మినహా అన్ని స్థానాలు జగన్ గెలిచారని చెప్పారు. కడపలో ఆయనకున్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.  రామచంద్రాపురం.. నర్సాపురం మినహా అన్నింటా జగన్ పార్టీ గెలిచిందని చెప్పారు. నెల్లూరు లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సుబ్బిరామిరెడ్డిని బరిలోకి దింపితే.. జగన్ తన అభ్యర్థిగా మేకపాటిని దింపి అత్యధిక మెజార్టీతో గెలుపొందారని.. ఆ ఎన్నికల్లో టీడీపీ డిపాజిటివ్ కోల్పోయిందని కేవీపీ తెలిపారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల కాలం ఉన్నందున.. ఎవరు గెలుస్తారో ఇప్పుడే  అంచనా వేయలేమన్నారు. మంత్రులందరిని తీసి వేసి.. అంతా కొత్త వారితో కాబినెట్ ను సిద్ధం చేసుకుంటారన్న ప్రశ్నకు బదులిచ్చిన కేవీపీ.. గతంలోనే జగన్ ఈ విషయాన్ని చెప్పారని.. మంత్రివర్గంలో 90 శాతం మందిని తొలగిస్తానని చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు.  వైఎస్ హయాంలో చోటు చేసుకున్న అంశాలతో పాటు.. సీఎం జగన్ తో తనకున్న రిలేషన్ గురించి కేవీపీ సమాధానం ఇచ్చారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో తనకు నేరుగా సంబంధాలు లేవన్నారు. జగన్ తాను ఒకే పార్టీలో ఉన్నంత వరకు కష్టనష్టాల్ని.. సమస్యల్ని షేర్ చేసుకునే వాళ్లమని.. పార్టీ నుంచి వేరు పడినతర్వాత తమ మధ్య వ్యక్తిగత సంబంధాలు అలానే ఉన్నా.. అప్పటిలా సమస్యల్ని పంచుకునే విధానం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ ఎదుర్కొంటునన విమర్శల్నే గతంలోనూ వైఎస్ ఎదుర్కొనేవారని.. జగన్ వయసు ఉన్నప్పుడు వైఎస్ కు ఇలాంటి సమస్యే ఎదురయ్యేదన్నారు. పాదయాత్ర తరువాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా.. మిత్రుల ద్వారా.. సన్నిహితుల ద్వారా తెలిసిన విషయాల మీదనే తాను స్పందిస్తున్నానని చెప్పారు కేవీపీ. 

హుజురాబాద్ కు మరో కీలక పదవి.. ఈటల చుట్టే కేసీఆర్ రాజకీయమా? 

హుజురాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా? సర్వేలన్ని కారు పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయా? అంటే ప్రభుత్వ వర్గాలు, టీఆర్ఎస్ నేతల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, గులాబీ నేతల చర్యలు కూడా అలాంటే సంకేతమే ఇస్తున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్ని హుజురాబాద్ తో సంబంధం ఉండేలానే ఉంటున్నాయి. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ పథకాలు కూడా అన్ని హుజురాబాద్ కేంద్రంగానే ఉంటున్నాయి. దీంతో ఈటల రాజేందర్ ను ఓడించడం గులాబీ బాస్ కు పెద్ద పరీక్షగా మారిందనే చర్చ సాగుతోంది. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పౌడి కౌశిక్ రెడ్డిని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆయన పార్టీలో చేరిన వెంటనే ఆ పదవి దక్కడం మరో విశేషం. హుజురాబాద్ నియోజకవర్గానికే చెందిన బండ శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. కొత్తగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలోనే అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ. 1000 కోట్లు విడుదల చేశారుమూడేండ్లుగా పెండింగులో ఉన్న రెండో విడత గొర్రెల పంపిణి కూడా హుజారాబాద్ లో తిరిగి ప్రారంభించారు. తాజాగా మరో కీలక పదవి హుజారాబాద్ నియోజకవర్గానికే దక్కింది.  తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్‌ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వకుళాభరణం కృష్ణమోహన్ గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా పని చేశారు.  కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, కిశోర్ గౌడ్, శుభప్రద్ పాటిల్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.  వకుళాభరణం కృష్ణమోహన్‌ ది హుజూరాబాద్‌ నియోజకవర్గమే. ఈటల రాజేందర్ ను ఓడించడం లక్ష్యంగానే వకుళాభరణానికి బీసీ కమిషన్ చైర్మన్ పదవి దక్కిందనే ప్రచారం జరుగుతోంది. వకుళాభరణం బీసీ సంఘం తరపున గతంలో చాలా పోరాటాలు చేశారు. బీసీ వర్గాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీంతో ఆయనకు కీలక పదవి ఇవ్వడం ద్వారా బీసీ వర్గాల మద్దతు పొందవచ్చని గులాబీ బాస్ ప్లాన్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కేసీఆర్ నిర్ణయాలు, చర్యలను గమనిస్తున్న వారు.. ఆయనకు హుజారాబాద్ లో ఓటమి భయం పట్టుకుందనే విమర్శలు చేస్తున్నారు. అందుకే పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని కీలక పదవులన్ని ఒక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తులకే కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఉప ఎన్నికలను కేసీఆర్ అసలు పట్టించుకునే వాడే కాదని... ఇప్పుడు మాత్రం రోజూ ఆయన హుజురాబాద్ జపమే చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడమే ఇందుకు కారణం అంటున్నారు. నిద్రలోనూ కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నిక భయపెడుతున్నట్లుందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విషయాన్ని గ్రహించారు కాబట్టే... కేసీఆర్ ఇంతగా ఫోకస్ చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. మొత్తానికి ఏది ఏమైనా ఈటల రాజేందర్ ప్రభావంతో హుజురాబాద్ నియోజకవర్గానికి మహార్దశ పెట్టిందనే చర్చ జనాల్లో సాగుతోంది. 

మా ఇంటికి రావొద్దు.. షర్మిలకు దిమ్మతిరిగే షాక్! 

వైఎస్సార్ టీపీ తెలంగాణ అధినేత్రి షర్మిలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ రాజీనామాతో  కుదేలైన వైఎస్ షర్మిలకు మరో  ఊహించని షాక్ తగిలింది. నిరుద్యోగుల కుటుంబాలకు మద్దతుగా పోరాడుతున్న ఆమెకు.. ఓ నిరుద్యోగి కుటుంబం నుంచే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షల్లో భాగంగా ఈ నెల 24న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టాలని షర్మిల నిర్ణయించారు. అయితే దీక్ష ముందు రోజే దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దంటూ నిరుద్యోగి నరేష్‌ తండ్రి.. వైఎస్ షర్మిలకు విజ్ఞప్తి చేయడం కలకలం రేపుతోంది.  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన నరేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. నరేష్ ముగ్గురు అన్నలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. నరేష్‌కు ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం చేస్తూ తన తండ్రికి చేదోడుగా ఉన్నాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి మంగళవారం చేస్తున్న నిరుద్యోగ దీక్షలో భాగంగా.. లింగాపూర్‌కు చెందిన నరేష్ ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేశారు. అందుకోసం  పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. నరేష్ తండ్రి నిర్ణయంతో వైసీపీ నేతలంతా ఆలోచనలో పడ్డారు.  గత మంగళవారం మహబూబాబాద్‌ నియోజకవర్గంలోని గూడూరు మండలం గుండెంగ గ్రామంలో షర్మిల దీక్ష చేశారు. గ్రామ సమీపంలోని సోమ్లా తండాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్‌ నాయక్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. 

మోడీ ప్రభుత్వానికి మరో తలనొప్పి.. కుల గణన సాధ్యమేనా? 

దేశంలో రాజకీయం వేడెక్కుతోంది. రేపో మాపో ఎన్నికలు జరుగుతాయో  అన్నంతగా రాజకీయ కార్యకలపాలు ఊపందు కుంటున్నాయి. ఇదిలా ఉండగానే మరో  సున్నిత అంశం తెర మీదకు వచ్చింది.  జనగణన కులాలవారీగా జరగాలని, ఇప్పటికే రెండు సార్లు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసిన బీహార్ రాజకీయ గణం.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రంలో కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని కోరింది. ముఖ్యమత్రి, జేడీయు నేత నితీష్ కుమార్ సారధ్యంలో ప్రధానిని కలిసిన పది పార్టీల ప్రతినిధి బృందంలో, ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. ప్ర‌ధానితో భేటీ అయిన‌వారిలో ముఖేశ్ స‌హాని, జిత‌న్ రామ్ మాంజీలు కూడా ఉన్నారు. ఒక విధంగా ఈ ఒక్క విషయంలో ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీలు ఏకమయ్యాయి.  ప్ర‌ధానిని క‌లిసిన త‌ర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, అదే విధంగా ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్’ మీడియాతో మాట్లాడారు.అయితే, ఆ ఇద్దరి స్వరంలో మాత్రం స్పష్టమైన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించింది. నితీష్ కుమార్, మిత్ర ధర్మాన్నిపాటిస్తూ కావచ్చును, ప్రధానికి చెప్పవలసింది చెప్పాం, ఆయన కూడా చక్కగా విన్నారు.. ఇప్పుడు బంతి మోడీ కోర్టులో వుంది, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చాద్దాం, అంటూ చేతులెత్తి దండం పెట్టారు. ఒక విధంగా చూస్తే, ఆయన బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి, చేతులు కడుక్కున్నారు.ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్’ మాత్రం ఎలాంటి మొహమాటాలు లేకుండా, ఒక్క బీహార్’లో కాదు దేశం అంతటా కుల గణన జరగవలసిందే అని, గట్టిగా డిమాండ్ చేశారు. అంతే కాదు, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూసి, తమ నిర్ణయం ప్రకటిస్తామంటూ ఒక హెచ్చరిక లాంటిది చేశారు. బీహార్‌లో బీజేపీ మినహా అన్ని పార్టీలు  కులాలవారీ జనగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే. ఈ డిమాండ్‌ విషయంలో, బీజేపీ కేంద్ర నాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా, బీహార్ బీజేపీ నాయకులు చాలావరకు కుల గణనను సమర్ధిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుల గణన డిమాండ్’ను తాను ఎప్పుడూ వ్యతిరేకించ లేదని, కర్ర విరగకుండా పాము చావకుండా మాటలను  మెలికలు తిప్పి  సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నా.   బీహార్ ఉప ముఖ్యమంత్రి రేణుదేవి సహా పలువురు బీజేపీ నేతలు కులగణనకు మద్దతు పలుకుతున్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అవుననీ, కాదని అనకుండా నెట్టుకొస్తోంది. అయితే, ఇప్పుడు ఈ డిమాండ్‌పై నితీష్, తేజస్వి ఏకాభిప్రాయంతో ఉండటంతో పాటుగా బీజీపీ రాష్ట్ర నాయకులూ కూడా అటే మొగ్గుచుపుతున్న నేపధ్యంలో, కేంద్రం కూడా  ఇక దాగుడుమూతలు కట్టేయక తప్పదని పరిశీలకులు అంటున్నారు.  అలాగే ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సున్నిత సమస్య విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదన్న మాట కూడా రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అయితే ఇదొక తేనే తుట్టెను కదిలించడమే అవుతుందని, కొందరు అంటుంటే, ఓబీసీ జాబితాను రూపొందించుకునే రాష్ట్రాల హక్కును పునరుద్దరిస్థూ 127  రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చిన కేంద్ర ప్రభుత్వం, కుల గణన విషయంలోనూ సానుకూలంగా స్పందించ వచ్చని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు. కుల గణన వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది, అదే సమయంలో కులాల మధ్య ఇప్పటికే  రగులుతున్న చిచ్చు మరింతగా భగ్గు మంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కుల గణన అటు రాజకీయంగానూ, ఇటు సామాజికంగానూ రెండు వైపులా పదునున్న కత్తి... మోడీ ఎటు నుంచి నరుకొస్తారో ... ఈసున్నిత సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. 

థర్డ్ వేవ్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త 

కరోనా మహామ్మారి సెకండ్ వేవ్ చివరాఖరి దశకు చేరుకుంది. ఇక రేపో మాపో బై బై చెప్పి వెళ్ళిపోతుంది, ఆగష్టులో వస్తుందనుకున్న థర్డ్ వేవ్ రాలేదు. మనం ఇక కాస్త ఊపిరి  తీసుకోవచ్చు, అని అందరూ ఆశపడుతున్న సమయంలో, కేంద్ర హోమ్ శాఖ బాంబు పేల్చింది. సెకండ్ వేవ్ ఉదృతి సంపూర్ణ క్షీణ దశకు చేరుకుంది, కానీ, మహమ్మారి థర్డ్ వేవ్ వచ్చేసిందని,  అక్టోబర్ నాటికీ, ఉదృత రూపం దాలుస్తుందని పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది.  కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ  పరిధిలో పనిచేసే  జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐఎండీ) నిపుణుల కమిటీ, థర్డ్ వేవ్ వచ్చేసిందని,  ప్రస్తుతానికి  కొంత మెల్లగా ఉన్నా, అక్టోబర్ నాటికి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. కొవిడ్ పునరుత్పత్తి రేటు, ‘ఆర్ – వాల్యూ’ పెరుగుతోంది. జూలై చివరి వారంలో 0.9 గా ఉన్న ఆర్ – విలువ ఇప్పుడు ఒకటి గీత దాటిందని ఇది థర్డ్ వేవ్ వచ్చిందనేందుకు తిరుగు లేని  సంకేతమని,తేల్చి చెప్పింది. అలాగే, ‘థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే సంసిద్ధత.. పిల్లలపై ప్రభావం, రికవరీ’ పేరు’ తో ప్రధాని కార్యలయానికి సమర్పించిన అధ్యయన నివేదికలో ఎన్ఐఎండీ ముందుగా అనుకున్నట్టు చిన్న పిల్లల్లే థర్డ్ వేవ్ టార్గెట్’ కానుందని, అదే సమయంలో పెద్దలను వదలదని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ నష్టం తప్పదని గట్టి హెచ్చరికలే చేసినట్లు సమాచారం.  ఒకవేళ పెద్ద సంఖ్యలో పిల్లలు కోవిడ్ బారినపడితే వారికి తక్షణమే చికిత్స అందజేసేలా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్‌లు సహా పిల్లలకు అవసరమైన వైద్య సదుపాయాలను సిద్ధం చేసుకోవాలి’ అని తెలిపింది. అనారోగ్య సమస్యలున్న చిన్నారులకు ప్రాధాన్యత, దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. థర్డ్ వేవ్ అక్టోబరులో తారాస్థాయికి చేరుకుంటుందని గతంలో వివిధ సంస్థలు వేసిన అంచనాలతో ఈ కమిటీ ఏకీభవించింది.ఈ  నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగానే, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రంలో మరో 41 ఆసుపత్రుల్లో ప్లాంటుల ఏర్పాటు చేస్తోందని చెప్పారు. భద్రాచలం, జగిత్యాల్, జనగాం అప్రభుత్వ ఆసుపత్రులలో PSA ఆక్సిజన్ ప్లాంటులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ చికిత్స, వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా సజావుగా కొనసాగుతోందని, రాష్త్రంలో మరో 13 లక్షల 18 వేల వాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అందరికీ కొవిడ్ వాక్సిన్ వేసేందుకు అన్నీ ఏర్పాట్లూ జరుగుతున్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అయితే, కొవిడ్ జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కోరారు. కిషన్ రెడ్డి, ప్రత్యక్షంగా థర్డ్ వేవ్ ప్రస్తావన చేయక పోయినా, కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్దం అవుతోందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.  నిజానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ ఫస్ట్  ఫస్ట్ వేవ్ సమయంలో తీసుకున్న శ్రద్ధ సెకండ్ వేవ్ సమయంలో తీసుకోలేదు. అందుకే, సెకండ్ వేవ్ కొవిడ్ కేసులే కాదు మరణాలు కూడా చాలా పెద్ద ఎత్తున సంభవించాయి. అయితే, ప్రభుత్వాతో పాటుగా, ప్రజలు కూడా  నిర్లక్ష్యంగా నిబంధనలను గాలికి వదిలేశారు. అందుకే, ఫస్ట్ వేవ్ కన్నా.., సెకండ్ వేవ్’లో మన దేశం  ఎక్కువ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. అలాగే, సెకండ్ వేవ్ ఉదృతికి డెల్టా వేరియంట్ కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఇప్పుడు వచ్చిన థర్డ్ వేవ్’ ఏ వేరియంట్’ అవుతుందో, ఎలాంటి ప్రభావం చూపుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. థర్డ్ వేవ్ రాక తప్పదని తేలడంతో.. పిల్లల్ని కాపాడేందుకు భారీ ఎత్తున వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని కమిటీ సైతం నివేదికలో పేర్కొనట్లు సమాచారం. మరో వంక  కొవిడ్ పునరుత్పత్తి రేటు, ‘ఆర్ – వాల్యూ’ పెరుగుతోంది. జూలై చివరి వారంలో 0.9 గా ఉన్న ఆర్ – విలువ ఇప్పుడు ఒకటి గీత దాటిందని ఇది థర్డ్ వేవ్ వచ్చిందనేందుకు స్పష్టమైనసంకేతమని, దీనిని ఉపేక్షించ రాదని ఎన్ఐఎండీ  నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జ‌గ‌నన్న‌తో జ‌గ‌డ‌మేనా?.. రాఖీ క‌ట్ట‌లేదంటే క‌ల‌హ‌మేనా?

రాఖీ. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సాక్షి. సోద‌రుడికి రాఖీ క‌ట్ట‌ని సోద‌రి బ‌హుషా ఉండ‌రేమో. అందుబాటులోనే ఉండి అన్న‌కి చెల్లి రాఖీ క‌ట్ట‌లేదంటే.. వారిద్ద‌రి మ‌ధ్య అస‌లే మాత్రం మంచి సంబంధాలు లేన‌ట్టే. వాళ్లు అన్నాచెల్లిల్లు కాద‌న్న‌ట్టే. రాఖీకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది మ‌రి. అలాంటిది.. తోడ‌బుట్టిన జ‌గ‌న‌న్న‌కి చెల్లి ష‌ర్మిల‌మ్మ రాఖీ క‌ట్ట‌లేదంటే..? ఏమ‌నుకోవాలి? ఎందుకు క‌ట్ట‌లేద‌నుకోవాలి? వారి మ‌ధ్య ఉన్న‌వి కేవ‌లం రాజ‌కీయ విభేదాలేనా? అంత‌కుమించి గొడ‌వ‌లా? రాఖీ కూడా క‌ట్ట‌నంత కోపం ఎందుకొచ్చింది? వారి మ‌ధ్య అన్నాచెల్లెలి సంబంధం అంత దారుణంగా ఎందుకు దెబ్బ‌తింది? జ‌గ‌న‌న్న ష‌ర్మిల‌మ్మ‌కు అంత ద్రోహం చేశారా? అందుకే, రాఖీకి సైతం అన‌ర్హుడిగా మారారా? ఇలాంటి ప్ర‌శ్న‌లు, అనుమానాలే ఇప్పుడు ఏపీలో జోరుగా వినిపిస్తున్నాయి.  అన్న-చెల్లి అంటే వాళ్ల‌లాగే ఉండాల‌ని.. జ‌గ‌న్, ష‌ర్మిల‌ను చూసి ఒక‌ప్పుడు అనేవారు. అన్న జైలుకెళితే.. అన్న కోసం ఇల్లు వ‌దిలి రోడ్డెక్కారు చెల్లెమ్మ‌. అన్న జైల్లో ఉంటే.. పార్టీ ప‌త‌నం కాకుండా.. పాద‌యాత్ర చేశారు. జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్నంటూ.. జ‌గ‌న్ లేకున్నా ప్ర‌జాక్షేత్రంలో జ‌గ‌న్ పేరు మారుమోగేలా చేశారు. అలాంటి అన్న‌.. అంద‌ల‌మెక్కాక చెల్లికి అన్యాయం చేశార‌ని అంటారు. పార్టీ కోసం త‌న‌ను వాడేసుకొని.. అధికారం వ‌చ్చాక త‌న‌ను క‌రివేపాకులా ప‌క్క‌న‌పెట్టేశార‌నేది ఆ చెల్లి ఆక్రోశం అని చెబుతారు. జ‌గ‌న్ ఎంతోమందిని మోసం చేసినా.. చివ‌రాఖ‌రికి సొంత చెల్లిని సైతం అలా వ‌దిలేస్తార‌ని ఆమె ఊహించ‌లేక‌పోయారు. ఆ అవ‌మాన భారాన్ని త‌ట్టుకోలేక‌.. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఓ మూల‌న ప‌డుండ‌లేక‌.. పెట్టాబేడా స‌ర్దేసుకొని.. అన్న‌పై ఆగ్ర‌హించి లోట‌స్‌పాండ్‌కి మ‌కాం మార్చేశారు.  తెలంగాణ కోడ‌లినంటూ.. రాజ‌న్న‌రాజ్యం తెస్తానంటూ.. అన్న‌లానే తానూ సీఎంను అవుతానంటూ.. వైఎస్సార్‌టీపీ స్థాపించి.. త‌న‌కు తోచిన రాజ‌కీయం తాను చేసుకుపోతున్నారు ష‌ర్మిల‌. అయితే, ష‌ర్మిల పార్టీపై అంద‌రికీ అనుమానం. ఆమె జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణ‌మేనా? కేసీఆర్ కుట్ర‌లో భాగ‌మేనా? బీజేపీ డైరెక్ష‌నా? ఇలా అనేక డౌట్స్‌. అన్నిటికంటే జ‌గ‌న్‌-ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు నిజ‌మేనా? వారిద్ద‌రికీ చెడిందా? అనేదే ప్ర‌ధాన అనుమానం. ఆ అనుమాన నివృతి కోసం ఎప్ప‌టిక‌ప్పుడు శ‌ల్య ప‌రీక్ష‌కు గురిచేస్తూనే ఉంది తెలుగు స‌మాజం.  నెల క్రితం వైఎస్సార్‌ జ‌యంతి సంద‌ర్భంగా ఇడుపుల‌పాయలో తండ్రి స‌మాధి ద‌గ్గ‌ర అన్నా-చెల్లిలు క‌లుస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ, గ‌త అల‌వాటుకు భిన్నంగా జ‌గ‌న్ ఉద‌యం కాకుండా సాయంత్రి తండ్రికి నివాళులు అర్పించారు. ఎందుకంటే.. మార్నింగ్ టైమ్‌లో ష‌ర్మిల ఇడుపుల‌పాయ వ‌చ్చారు కాబ‌ట్టి. చెల్లి ముఖం చూడ‌కూడ‌ద‌నే.. జ‌గ‌న్ ఇలా టైమ్ మార్చుకున్నార‌ని అన్నారు. ష‌ర్మిల‌పై జ‌గ‌న్‌కే కోపం అన్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. వారిద్ద‌రి బంధం బాగానే తేడా కొట్టింద‌ని అనుకున్నారంతా. రాఖీ నాడు ఆ అనుమానంపై మ‌రింత క్లారిటీ వ‌చ్చింది. జ‌గ‌న‌న్న‌కు ష‌ర్మిల రాఖీ క‌ట్ట‌నే లేదు. జ‌స్ట్‌.. అంద‌రితో పాటూ జ‌గ‌న్‌కు సైతం రాఖీ శుభాకాంక్ష‌లు చెబుతూ సింపుల్‌గా ట్వీట్ చేసి స‌రిపెట్టేశారు ష‌ర్మిల‌.  ట్వీట్‌ను బ‌ట్టి చూస్తే.. త‌న‌ను ఆద‌రిస్తున్న అంద‌రిలానే జ‌గ‌న‌న్న కూడా ఒక‌రనేలా.. గుంపులో గోవింద‌లా మార్చేశారు. రాఖీ క‌ట్ట‌కున్నా.. ఆ మాత్రం విషెష్ అయినా చెప్పారంటే.. వారిద్ద‌రి మ‌ధ్య ఇంకా ఏ మూల‌నో బంధం-అనుబంధం దాగుంద‌ని అనేవారూ లేక‌పోలేదు. మ‌రోవైపు.. ఇదంతా వారిద్ద‌రూ క‌లిసి ఆడుతున్న నాట‌క‌మేన‌ని.. ఆ పొలిటిక‌ల్ డ్రామా ర‌క్తిక‌డుతున్న వేళ‌.. షర్మిల జ‌గ‌న్ ఇంటికి వెళ్లి రాఖీ క‌డితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిందంతా తుస్సు మంటుంద‌ని.. అందుకే, రాఖీకి దూరంగా ఉండి.. ఉండ‌బ‌ట్ట‌లేక అలా ట్వీట్‌తోనైనా జ‌గ‌న‌న్న‌ను గుర్తు చేసుకున్నార‌ని అంటున్నారు. ఇలా దొందూ దొందే అనే వారు కొంద‌రైతే.. రాఖీ కూడా క‌ట్ట‌లేదంటే.. వారిద్ద‌రి మ‌ధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయ‌నే వారు మ‌రికొంద‌రు. ఇందులో ఏ వాద‌న నిజ‌మో.. ఆ అన్నాచెల్లిల‌కే తెలియాలి.    

జ‌గ‌న్ స‌ర్కారుపై హైకోర్టు సీరియ‌స్‌.. రెండు వారాలు డెడ్‌లైన్‌..

ఏపీ అప్పుల కుప్ప‌గా మారింది. జీతాలు, బిల్లులు చెల్లించ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతోంది. నిధుల‌న్నీ సంక్షేమ ప‌థ‌కాల‌కే ఊడ్చేసి.. ప్ర‌భుత్వ ఖ‌జానా ఖాళీ చేసేశారు. ఎడాపెడా అప్పులు తెచ్చి.. ప‌ప్పుబెల్లాల్లా పంచేస్తున్నారు. కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసి.. అన్నిశాఖ‌ల సొమ్ములూ అటే మ‌ళ్లిస్తున్నారు. వివిధ ప‌థ‌కాల కోసం కేంద్రం ఇచ్చే సొమ్మంతా కూడా స్వాహా చేసేస్తున్నారు. మ‌ళ్లీ ఫ‌స్ట్ తారీఖు రాగానే.. ఒక్క‌డ అప్పు దొరుకుతుందాన‌ని కిందామీదా ప‌డుతున్నారు. ఇలా ఏపీ ప్ర‌భుత్వ అడ్డ‌గోలు విధానాల‌తో ఉపాధి హామీ ప‌థ‌కం బిల్లులు కొండ‌ల్లా పేరుకుపోయాయి. ఎప్ప‌టి నుంచో బిల్లులు చెల్లించ‌కుండా కాంట్రాక్ట‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోంది స‌ర్కారు. దీంతో.. వారంతా ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ అనంత‌రం హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  ఏపీ స‌ర్కారుపై హైకోర్టు మండిపడింది. నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో బిల్లులు చెల్లించి హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. బిల్లులు చెల్లించకపోవడం పిటిషనర్ల జీవించే హక్కును హరించడమేనని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు. రెండు వారాల్లోపు 500 మంది పిటిషనర్లకు డబ్బు చెల్లించి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. చెల్లించాల్సిన డబ్బుకు వడ్డీ, 20 శాతం మినహయింపును ప్రధాన పిటిషన్ విచారణలో పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే గౌరవంతో జీవించడమని కోర్టు వ్యాఖ్యానించింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించమని ఇప్పటికే చెప్పినప్పటికీ.. ప్రభుత్వం ఖాతరు చేయలేదని న్యాయస్థానం తప్పుబట్టింది. కేంద్రం నరేగా పనులకు నిధులు చెల్లించామని.. తమ ద‌గ్గ‌ర‌ బకాయిలు లేవని అఫిడవిట్‌లో చెప్పిందని కోర్టు తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం నుంచి డబ్బులు రాలేదని చెబుతోందని, ఈ రెండు పరస్పర విరుద్ధమైన అంశాలని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో బిల్లులు చెల్లిస్తామని అడ్వకేట్ జనరల్ హమీ ఇచ్చినప్పటికీ చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది. రెండు వారాల్లోగా బ‌కాయిల‌న్నీ చెల్లించాలంటూ జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు.    

వైసీపీకి 50 స్థానాలు మాత్ర‌మే.. ర‌ఘురామ స‌ర్వేలో సంచ‌ల‌నం..

ఇప్పుడంతా స‌ర్వేల హ‌వా న‌డుస్తోంది. ఇండియా టుడే-- మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వే సీఎం జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చిన‌ప్ప‌టి నుంచీ ఏపీలో స‌ర్వేల‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. జ‌గ‌న్ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. కేవ‌లం 6 అంటే 6శాతం మంది మాత్ర‌మే జ‌గ‌న్ బెస్ట్ సీఎం అని చెప్ప‌డం ప్ర‌జ‌లు వైసీపీ పాల‌నపై ఎంత విర‌క్తితో ఉన్నారో అర్థం అవుతోంది. ఇక‌, ఇటీవ‌ల లోక‌ల్ యాప్ నిర్వ‌హించిన స‌ర్వేలోనూ ఇలాంటి సంచ‌ల‌న విష‌యాలే వెలుగుచూశాయి. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీదే గెలుపంటూ లోక‌ల్ స‌ర్వే తేల్చేసింది. ఇలా వ‌రుస స‌ర్వేలు వైసీపీ ప‌త‌నాన్ని సూచిస్తుండ‌టం అధికార పార్టీలో క‌ల‌వ‌రం చెల‌రేగుతోంది. తాజాగా, న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ సైతం రంగంలోకి దిగారు. తాను కూడా స‌ర్వే చేయించానంటూ ఆ వివ‌రాలు వెల్ల‌డించారు. ర‌ఘురామ స‌ర్వే ఫ‌లితాలు సైతం ఆస‌క్తిక‌రంగా ఉంది.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 50 స్థానాలు మించి రావని తెలిపారు ర‌ఘురామ‌. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డిలు మ‌ళ్లీ గెలుస్తార‌ని.. వారికి 60శాతం మంది ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌న్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరిద్దరు తప్ప వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇక ప‌నిలో ప‌నిగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన న‌ర్సాపురం స‌ర్వే వివ‌రాల‌నూ వెల్ల‌డించారు. అయితే.. న‌ర్సాపురంలో త‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా జ‌గ‌న్ పోటీ చేస్తే.. తానే గెలుస్తానంటూ స‌ర్వే ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. స‌ర్వేలో జ‌గ‌న్ కంటే త‌న‌కు 19శాతం ఎక్కువ ప్రజాధార‌ణ ల‌భించింద‌ని తెలిపారు. ర‌ఘురామ స‌ర్వేలో జ‌గ‌న్ ఓడిపోవ‌డం.. పెద్దిరెడ్డి, చెవిరెడ్డిలాంటి వాళ్లు గెల‌వ‌డం లాంటి ఫ‌లితాలు రావ‌డం ఆస‌క్తి రేపుతోంది.  మ‌రోవైపు.. వైఎస్ వివేకా హ‌త్య కేసుపైనా స్పందించారు ఎంపీ ర‌ఘురామ‌. వివేకా హత్యలో ఎవరి ప్రమేయం ఎంత ఉందోనని ప్రజలకు అనుమానం ఉందన్నారు. ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక‌, ప్ర‌భుత్వం అమ‌ర‌రాజా కంపెనీ కాలుష్యం గురించి మాట్లాడుతోంద‌ని.. మ‌రి, నాసిర‌కం మ‌ద్యం వ‌ల్ల పాడ‌వుతున్న ప్ర‌జ‌ల ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడ‌ర‌ని ప్ర‌శ్నించారు ర‌ఘురామ‌.   

కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ఫిక్స్! కేసీఆర్ నుంచి ఊహించని ట్విస్ట్? 

తెలంగాణ కేబినేట్ లో మార్పులకు రంగం సిద్ధమైందా? సీఎం కేసీఆర్ ఊహించని ట్విస్టు ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కేసీఆర్ కేబినెట్ లో మార్పులు ఉంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని అంతా భావించారు. కాని జరగలేదు. తాజాగా మళ్లీ కేబినెట్ మార్పుల అంశం తెరపైకి వస్తోంది. ఆగస్టు 24 మంగళవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనన్నారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారని చెబుతున్నారు. అయితే త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చించడానికే గులాబీ బాస్.. ఈ సమావేశం ఏర్పాటు చేశారనే చర్చ సాగుతోంది. పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో కేబినెట్ మార్పులపై కేసీఆర్ సిగ్నల్ ఇస్తారని అంటున్నారు.  తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలన్ని హుజురాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీల కార్యక్రమాలు కూడా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో మంత్రివర్గంలో మార్పులు జరిగినా.. అది హుజురాబాద్ కు లింక్ అయి ఉంటుందనే చర్చ  రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దళిత బంధు పథకాన్ని ఇటీవలే ప్రకటించారు కేసీఆర్. పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో అమలు చేస్తున్నారు. విపక్షాలు మాత్రం హుజురాబాద్ లో ఉన్న 50 వేల దళితుల ఓట్ల కోసమే  దళిత బంధు స్కీం తెచ్చారని అంటున్నాయి. దళిత బంధు స్కీం ప్రకటించగానే మరికొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. దళితులను కేసీఆర్ మోసం చేశారని, మంత్రివర్గంలో మాదిగలకు చోటు లేదనే విమర్శలు వచ్చాయి.  సీఎంవోలో దళిత అధికారిని ఎందుకు నియమించలేదని కొందరు ప్రశ్నించారు. ప్రస్తుత కేబినెట్ లో కొప్పుల ఈశ్వర్ ఉన్నా ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన వారు. తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ. అందుకే విపక్షాలు ఈ అంశాన్ని లెవనెత్తుతూ  కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నాయి. దళిత బంధు స్కీం తెచ్చినా అనుకున్న ఫలితం కనిపించకపోవడం, విపక్షాల విమర్శలతో సీఎం కేసీఆర్ మరిన్ని చర్యలకు ఉపక్రమించారు. సీఎంవోలో దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ రాహుల్ బొజ్జాను నియమించారు. ఇక కేబినెట్ ను విస్తరించి మరో దళిత ఎమ్మెల్యేను తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. ఈటలతో ఖాళీ అయిన మంత్రిపదవిని దళితుడితో పూరించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. ఈ లెక్కన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన చోటు ఖాయమైందని చెబుతున్నారు.  తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  2018 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచే విజయం సాధించారు. సండ్రతో పాటు అశ్వారావుపేట నుంచి మచ్చా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు. సీఎం కేసీఆర్ తో సండ్రకు మంచి సంబంధాలున్నాయి. అందుకే కేసీఆర్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే సండ్ర.. టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. గత మార్చిలో మచ్చా నాగేశ్వరరావు కూడా కారెక్కారు. దీంతో టీడీడీఎల్పీ అధికారికంగా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయింది. కేసీఆర్ పురమాయించడం వల్లే.. మచ్చాతో మాట్లాడి ఆయన టీఆర్ఎస్ లో చేరేలా సండ్ర పావులు కదిపారని అంటున్నారు. అప్పటి నుంచే సండ్రకు కేబినెట్ బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.  హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత కీలకం కావడంతో మాదిక వర్గానికి చెందిన సండ్రను కేబినెట్ లోకి తీసుకుంటే తమకు కలిసివస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. సండ్రతో పాటు కేబినెట్ లో మరికొందరిని కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ దిశగా కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రితో పాటు ఓ బీసీ మంత్రికి గండం ఉందనే చర్చ  తెలంగాణ భవన్ లో సాగుతోంది. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందే కేబినెట్ విస్తరణతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు కేసీఆర్ తీసుకుంటారని తెలుస్తోంది. 

30ఏళ్లుగా తాలిబ‌న్ల‌కి చిక్క‌ని పంజ్‌షిర్‌‌.. తాజాగా 300 మంది హ‌తం.. ఏమిటీ స్పెషాలిటీ?

తాలిబ‌న్లు ఎంతటి బ‌ల‌వంతులో.. అఫ్ఘ‌నిస్తాన్‌లో వారిప‌ట్టు ఎంత ఉందో తాజా ప‌రిణామాలు తెలుపుతున్నాయి. అమెరికా బ‌ల‌గాలు ఇలా వెనుదిర‌గానే.. రోజుల వ్య‌వ‌ధిలోనే అలా అఫ్ఘ‌న్‌ను ఆక్ర‌మించేసుకున్నారు ముష్క‌రులు. అప్ప‌టి వ‌ర‌కూ ఎక్క‌డ న‌క్కారో.. స‌డెన్‌గా ఎక్క‌డి నుంచి ఊడిప‌డ్డారో తెలీదు కానీ.. వ‌చ్చీరాగానే కాబూల్‌ను హ‌స్త‌గ‌తం చేసేసుకున్నారు. రాజ‌ధానే వారి గుప్పిట్లోకి రావ‌డంతో.. ఇక అఫ్ఘ‌న్ తాలిబ‌న్ల రాజ్యమైపోయింది. యావ‌త్ అఫ్ఘ‌నిస్తాన్‌ను కైవ‌సం చేసుకున్న తాలిబ‌న్ల‌కు.. అదే దేశంలోని ఓ ప‌ర్వ‌త‌లోయ మాత్రం ఇప్ప‌టికీ వారి చేతికి చిక్క‌నేలేదు. ఇప్పుడ‌నే కాదు.. గ‌త 30 ఏళ్లుగా తాలిబ‌న్ల‌కు కొరుకుడుప‌డ‌ని కొయ్య‌లా మారింది ఆ ప్రాంతం. అదే పంజ్‌షిర్‌. దాని అర్థం ఐదు సింహాలు. ఆ ఏరియాకు రారాజు.. అహ్మ‌ద్ మ‌సూద్‌.  కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్ ఉంది. జ‌నాభా సుమారు లక్ష. వారంతా పోరాట యోధులు.. అక్క‌డి ప‌ర్వ‌తాలు వారికి పెట్ట‌ని కోట‌లు. శతాబ్దాలుగా పంజ్‌షిర్‌‌లో అటు విదేశీ బలగాలు, ఇటు తాలిబన్లు కాలుమోపలేకపోయారు. మిలటరీ కమాండర్‌ అహ్మద్ షా మసూద్.. 1979-1989 మధ్య సోవియట్ సేనలను తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ తర్వాత నుంచి తాలిబ‌న్లతో పోరాడారు. అయితే,  తాలిబన్లు, ఆల్‌ఖైదా ఉగ్రవాదులు కలిసి జర్నలిస్ట్‌లుగా మారు వేషాల్లో వచ్చి.. అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ అటాక్‌కు రెండు రోజుల ముందు 2001 సెప్టెంబరు 9న ఆత్మాహుతి దాడి చేసి అహ్మ‌ద్ షా మ‌సూద్‌ను చంపేశారు. ఆ త‌ర్వాత.. అమెరికా, నాటో దళాలు అఫ్గన్‌పై దాడి చేయడం, మసూద్‌ దళాలతో ఆ బలగాల స్నేహానికి దారితీసింది. అప్ప‌ట్లో అధికారంలోకి వచ్చిన హమీద్‌ కర్జాయ్‌.. అహ్మద్‌ షా మసూద్‌ను నేషనల్‌ హీరోగా ప్రకటించడంతో పాటు ఆయన చనిపోయిన‌ రోజును హాలిడేగా డిక్లేర్ చేశారు. ప్రస్తుతం పంజ్‌షిర్‌ ప్రాంతానికి అహ్మద్‌ షా మసూద్‌ తనయుడు అహ్మద్‌ మసూద్ చీఫ్‌గా ఉన్నారు, 9000 మంది సైన్యంతో.. అఫ్గన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌తో క‌లిసి తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. పంజ్‌షీర్‌ను ఆక్రమించుకోడానికి తాలిబన్‌లు చేస్తున్న‌ ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. తాజాగా, 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ సైన్యం ప్రకటించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వ‌చ్చాయి.  పంజ్‌షీర్ వైపు వందలాది వాహనాల్లో, భారీ ఆయుధాలతో తాలిబన్లు కదులుతున్నారు. అఫ్గన్ ప్రభుత్వ మాజీ సైన్యం, పంజ్‌షిర్‌ మిలీషియా బృందం సంయుక్తంగా తాలిబన్లను ఎదుర్కొంటున్నాయి. పంజ్‌షిర్ లోయకు సమీపంలోని మూడు జిల్లాలను అఫ్గన్ ప్రభుత్వ సైన్యం, ఇతర మిలీషియా గ్రూప్‌లు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లాహ్ మహ్మద్ ట్విట్టర్‌లో తెలిపారు. మ‌రోవైపు, త‌మ‌కు స‌రిప‌డా ఆయుధాలు అందించాలంటూ అమెరికాను కోరారు. పంజ్‌షిర్‌పై ఎలాగైనా ప‌ట్టుసాధించాల‌ని తాలిబ‌న్లు ప‌ట్టుద‌ల‌గా ఉండ‌టంతో యుద్ధం వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మారింది.  

బుల్లెట్ సాంగ్‌ డ్యాన్స‌ర్‌కి ఫుల్‌ స‌పోర్ట్‌.. 20 కోట్ల స్కామ్ వ‌దిలేసి న‌ర్సుపై చ‌ర్య‌లా?

బుల్లెట్ బండెక్కి వచ్చేస్తప.. అందాల దునియానే చూపిస్తపా.. సోష‌ల్ మీడియాను షేక్ చేసిన పెళ్లికూతురు డ్యాన్స్ ఓ నర్సు ఉద్యోగానికి ఎస‌రు పెట్టిన విష‌యం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పిహెచ్‌సిలో బుల్లెట్ బండి పాటకు ఆస్పత్రి ప్రాంగణంలో నర్సు డ్యాన్స్ చేయ‌డం.. ఆ వీడియో సైతం వైర‌ల్‌గా మార‌డం.. కలెక్టర్ ఆదేశాలతో డ్యాన్సు చేసిన నర్సుకు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు మెమో జారీ చేయ‌డం.. కాంట్ర‌వ‌ర్సీగా మారింది. డ్యూటీలో ఉన్న‌ప్పుడు డ్యాన్స్ ఎలా చేసార‌నేది అధికారుల ప్ర‌శ్న‌. ఏం చేస్తే త‌ప్పా? ఆగ‌స్టు 15 హాలిడే రోజున స‌ర‌దాగా డ్యాన్స్ చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటారా? అంటూ తోటి ఉద్యోగులు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. సోష‌ల్ మీడియాలో సైతం ఆ న‌ర్సుకు మ‌ద్దుతుగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా, న‌ర్సుకు మెమో ఇవ్వ‌డంపై ఓ సీనియ‌ర్ న‌ర్సు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అక్క‌డితో ఆగ‌లేదామె.. 20 కోట్ల స్కాము చేసిన నిందుతుల‌పై చ‌ర్య‌లు తీసుకోరు గానీ, అణ‌గారిన వ‌ర్గానికి చెందిన న‌ర్సును మాత్రం శిక్షిస్తారా? అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ వీడియో పెట్ట‌డంతో మ‌రింత‌ ర‌చ్చ జ‌రుగుతోంది.  డ్యాన్స్ చేసిన‌ నర్సుకి మెమో జారీ చేయడంపై హెల్త్ డిపార్ట్‌మెంట్‌కే చెందిన ఓ సీనియర్ నర్సు నేరుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌‌ని నిలదీసిన వీడియో సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌‌కి ఆమె ప‌లు ప్రశ్నలు సంధించారు. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ అవినీతి గురించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే పట్టించుకోని మీరు.. డ్యాన్స్ చేసిందని ఓ నర్సుపై చర్యలు తీసుకుంటారా? అని నిలదీశారు. ఆ అమ్మాయి ఏమైనా డ్యూటీలో డ్యాన్స్ చేసిందా.. పంద్రాగస్టు సెలవు రోజు ఆనందంగా డ్యాన్స్ చేస్తే తప్పా? అని నిల‌దీశారు. ఆమెకిచ్చిన మెమోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే నర్సులందరం సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు.  నర్సులంటే చిన్నచూపు ఉందని ఆ సీనియ‌ర్ న‌ర్సు ఆవేదన వ్యక్తం చేశారు. 20 కోట్ల రూపాయల అవినీతి చేసినోడిపై చర్యలు తీసుకోకుండా డ్యాన్స్ చేస్తే చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. డైరెక్టర్‌పై ఫిర్యాదు చేస్తే సీఎం, మంత్రి, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ ఎవరూ పట్టించుకోలేదన్నారు. అతను కలెక్షన్ చేసి మీకు వాటాలిస్తున్నారు కాబట్టే ఆయన్ను ప్రొటెక్ట్‌ చేస్తున్నారని అంతా అనుకుంటున్నారంటూ మ‌రింత అగ్గి రాజేశారు.  మ‌రోవైపు, డ్యాన్స్ చేసిన‌ నర్సుకి ప‌లువురు స్థానిక‌ బీజేపీ నేతలు మ‌ద్ద‌తుగా నిలిచారు. పదేళ్లకు పైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి.. ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోందని.. కరోనా కాలంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేసిందని చెప్పారు. అలాంటి అణగారిన వర్గానికి చెందిన పేద మహిళకు ఇచ్చిన మెమోని వెనక్కి తీసుకోవాలని బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేశారు.  డ్యాన్స్ చేసిన న‌ర్సుకు అన్నివ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు పెర‌గ‌డంతో జిల్లా అధికారులు సైతం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. మొదటి తప్పుగా భావించి మెమోతో సరిపెట్టాలని భావిస్తున్నార‌ట‌. చ‌ర్య‌లు తీసుకుంటే.. అన‌వ‌స‌ర ర‌చ్చ అవుతుంద‌ని.. అందుకే ఆ ఇష్యూని ఇక్క‌డితో వ‌దిలేయాల‌ని అనుకుంటున్నార‌ని అంటున్నారు.   

హ‌రీశ్‌రావు అర్థ‌రాత్రి వ్యూహాలు.. ఈట‌ల‌కు ఊహించ‌ని షాకులు..

త‌న్నీరు హ‌రీశ్‌రావు. కేసీఆర్‌కు అల్లుడు. టీఆర్ఎస్ ఆవిర్భావంతో రాజ‌కీయ అరంగేట్రం చేశారు. కేసీఆర్ డైరెక్ష‌న్‌లో ఉద్య‌మాన్ని ఉర‌క‌లెత్తించారు. గులాబీ బాస్‌ వెన్నంటే ఉంటూ.. మామ నుంచి జిత్తుల‌మారి వ్యూహాలు, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు అన్నీ బాగా ఒంట‌బ‌ట్టించుకున్నారు. మామ త‌ర్వాత మామ అంత‌టోడు అయ్యారు. అలాంటిది, త‌న‌యుడు కేటీఆర్ కోసం అల్లుడు హ‌రీశ్‌ని అట‌కెక్కించేశారు కేసీఆర్‌. చాన్నాళ్ల త‌ర్వాత ఇప్పుడు త‌న‌కు ప‌క్క‌లో ఈటెలా మారిన రాజేంద‌ర్ కోసం ట్ర‌బుల్ షూట‌ర్‌ను అట‌క మీద‌నుంచి దించి.. బూజు దులిపి.. ప‌దును పెట్టి.. హుజురాబాద్‌లో ఈట‌ల‌పై ప్ర‌యోగించారు. హ‌రీశ్ ఎంట్రీతో హుజురా..వార్ మ‌రింత రంజుగా మారింది. ఒక్క దుబ్బాక మిన‌హా గ‌త 20ఏళ్ల‌లో హ‌రీశ్‌రావుకు అప్ప‌గించిన ఏ ఒక్క ప‌నిలోనూ విఫ‌లం అయింది లేదు. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా కంప్లీట్ చేసేందుకు త‌న అనుభ‌వాన్నంతా వాడేస్తున్నారు హ‌రీశ్‌రావు. త‌న పాత మిత్రుడు ఈట‌ల‌కు కొత్త‌గా చుక్క‌లు చూపిస్తున్నారు.  ముస‌లికి నీటిలో బ‌ల‌మున్న‌ట్టు.. ఈట‌ల రాజేంద‌ర్‌ హుజురాబాద్‌లో అత్యంత బ‌ల‌వంతుడు. ఆ విష‌యం తెలిసే.. ముస‌లిని బ‌ల‌హీనం చేసేందుకు దాని చుట్టూ ఉన్న నీటినంత‌టినీ మోట‌ర్లు పెట్టి తోడేస్తున్నారు హ‌రీశ్‌రావు. ఈట‌ల‌కు అండాదండాగా ఉన్న ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుల‌ను టీఆర్ఎస్‌లోకి లాగేశారు హ‌రీశ్‌రావు. ఈట‌ల‌ సామాజిక వర్గానికే చెందిన, ఆయ‌న‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జిల్లా సహకార బ్యాంకు వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌తో పాటు మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు చుక్కా రంజిత్‌ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలకు చెందిన పలువురు బీజేపీని వీడి కారెక్క‌నున్నారు.  హరీష్‌రావు శనివారం రాత్రి ఆకస్మికంగా హుజూరాబాద్‌కు వచ్చి సింగాపురంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు వసతి గృహంలో మ‌కాం వేశారు. హుజూరాబాద్‌ నియోజక వర్గానికి చెందిన ముఖ్య నాయకులతో ఆయన విడివిడిగా సమావేశమై చ‌ర్చించారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఈటలతోపాటు బీజేపీలోకి వెళ్లిన వారి గురించి ఆరా తీశారు. ఈట‌ల వెంట కీల‌కంగా ఉంటున్న‌.. పింగిలి ర‌మేశ్ ముదిరాజ్‌, చుక్కా రంజిత్‌గౌడ్‌ల‌పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీశారు. ఆ మార్నాడే తాము బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్టు ఆ ఇద్ద‌రు ప్ర‌క‌టించేశారు. ఈ పరిణామం ఈట‌ల రాజేంద‌ర్‌కు ఊహించ‌ని షాక్‌. కోలుకోలేని దెబ్బ అంటున్నారు.  మ‌రోవైపు.. హుజురాబాద్ వ్యాప్తంగా త‌న మ‌నుషుల‌ను మోహ‌రిస్తున్నారు హ‌రీశ్‌రావు. ఒక్కో గ్రామానికి 10-15 మంది చొప్పున తన నమ్మిబంట్లకు బాధ్యతలు అప్పగించారు. స్థానిక నేతలను ప్రచారానికి వాడుకుంటూనే గ్రౌండ్ లెవల్‌లో మాత్రం తన సొంత కేడర్‌‌ని రంగంలోకి దించారు. స్థానికంగా ఎవ‌రు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లో, ఎవ‌రు ఈట‌ల అభిమానులో తెలీని క‌న్ఫ్యూజ‌న్ ఉంది. గులాబీ కండువా క‌ప్పుకున్న‌ అనేక‌మంది.. ఈట‌ల కోసం ప‌ని చేస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. ఆ అనుమానంతోనే హ‌రీశ్‌రావు స్థానికులెవ‌రినీ న‌మ్మ‌కుండా.. సిద్ధిపేట నుంచి త‌న మ‌నుషుల‌ను ర‌ప్పించి.. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామ‌గ్రామాన మోహ‌రించార‌ని అంటున్నారు. మొదట్లో హుజురాబాద్‌లో గెలుపు ఈజీ అని భావించిన టీఆర్ఎస్.. ఆ త‌ర్వాత ఈట‌ల‌కే ఎడ్జ్ ఉందంటూ స‌ర్వేల‌లో తేల‌డంతో ఖంగుతిన్న‌ట్టుంది. ఆ స‌ర్వే రిపోర్టుల త‌ర్వాతే హ‌రీశ్‌రావు మ‌రింత యాక్టివ్ అయ్యారు. ఇప్ప‌టికే దుబ్బాక‌తో త‌న ఇమేజ్‌కు దారుణ‌మైన డ్యామేజ్ జ‌రిగింది. హుజురాబాద్‌లో ఎలాగైన టీఆర్ఎస్‌ను గెలిపించి.. పోయిన ప‌రువు, ప‌ర‌ప‌తి తిరిగి సంపాదించుకోవాల‌నేది హరీశ్‌రావు క‌మిట్‌మెంట్‌. మామ‌కు ఈట‌ల ఓట‌మిని బ‌హుమ‌తిగా ఇచ్చి.. కేసీఆర్‌కు మ‌రింత ద‌గ్గ‌ర అయ్యే గోల్డెన్ ఛాన్స్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మిస్ చేసుకోవ‌ద్ద‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారట‌ హ‌రీశ్‌రావు. మ‌రి,  హ‌రీశ్ వ్యూహాలను ఈట‌ల చిత్తు చేస్తారా? చిత్తైపోతారా? చూడాలి....

సొంత జిల్లాలో జగన్ కు షాక్! టీడీపీలోకి సీనియర్ నేత జంప్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా ప్రభుత్వ  వ్యతిరేకత భారీగా పెరిగిపోతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం, అభివృద్ది పనుల ఊసే లేకపోవడం, మహిళలలపై అఘాత్యాలు పెరిగిపోవడం వంటి అంశాలతో జగన్ రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లోనూ ఇదే తేలింది. జాతీయ స్థాయి సంస్థలతో పాటు లోకల్ ఏజెన్సీ సర్వేల్లోనూ టీడీపీ వైపే ఏపీ ప్రజలు చూస్తున్నారనే సంకేతం వచ్చింది. దీంతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఇటీవల ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం ఉధృతం చేయడంతో.. ఆ పార్టీకి జనాల నుంచి మంచి స్పందన వస్తోంది. జగన్ రెడ్డి సర్కార్ పై జనాలు కోపంగా ఉండటం, టీడీపీ ప్రజా పోరాటాలతో దూకుడుగా వెళుతుండటంతో  నాయకుల చూపు కూడా ఇప్పుడు టీడీపీ వైపు పడినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే చాలా మంది నేతలు సైకిల్ ఎక్కేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కొందరు టీడీపీలోచేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేతలు కూడా కొందరు తిరిగి సొంత గూటికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. కడప జిల్లాలోనూ వైసీపీకి షాగ్ తగలనుందని తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత ఒకరు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం  కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గతంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న రామసుబ్బారెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. అయితే ఆయన అధికార పార్టీలో ఇమడటం లేదని తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమస్య లేకపోయినా నియోజకవర్గ స్థాయిలో అధికార పార్టీ నేతలు అవమానించే రీతిలో వ్యవహరిస్తుండడంతో తమ నాయకుడు మనస్తాపం చెందినట్టు రామసుబ్బారెడ్డి అనుచరులు చర్చించుకుంటున్నారు. దీనితో  టీడీపీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశామనే అంతర్మథనం చెందుతు న్నట్టు తెలుస్తోంది. వైసీపీ పెద్దలు కొన్ని నెలల క్రితం జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పి.రామసుబ్బారెడ్డిని కూర్చోపెట్టి చర్చించి క్లారిటీ ఇచ్చారు. 2024లో తిరిగి జమ్మలమడుగు అభ్యర్థిగా సుధీర్ రెడ్డే ఉంటారని అధిష్టానం పెద్దలు తేల్చి చెప్పారు. రామసుబ్బారెడ్డికి తగిన గౌరవం ఇస్తామని చెప్పి పంపారు. సీఎం జగన్ సూచనలతో రామసుబ్బారెడ్డి సైలెంటుగానే ఉంటున్నా... ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయేలా కొందరు పొగపెడుతున్నారని రామసుబ్బారెడ్డి అనుచరులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో రామసుబ్బారెడ్డి మాటను ఎవరూ పట్టించుకోవద్దని అధికారులకు సదరు ప్రజాప్రతినిధి అనధికార ఆదేశాలు ఇచ్చారని సమాచారం. దీంతో ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటనే ప్రశ్న రామసుబ్బారెడ్డిని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు.వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వలేమని చెప్పినందున ఇక వైసీపీలో కొనసాగడం ఎందుకుని కొందరు ఒత్తిడి తెస్తున్నారట. అంతేకాదు టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పెరిగిపోతుండటం, వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉండటంతో రామసుబ్బారెడ్డి కూడా ఆలోచనలో పడ్డారని అంటున్నారు.  వైసీపీలో అవమానాలు భరించే కంటే.. రాజకీయ భవిష్యత్ కి పునాది వేసిన టీడీపీలో కి మళ్లీ వెళ్లాలనే ఆలోచనలో రామసుబ్బారెడ్డి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేర డంతో జమ్మలమడుగులో ప్రతిపక్ష పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని తనను గౌరవించే టీడీపీలోకి వెళ్లాలనే ఆలోచనలో  ఆయన ఉన్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రే స్వయంగా ఆదిరించినా స్థానిక నేతలతో విభేదాల వల్ల పార్టీ వీడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.  శివారెడ్డి హత్యానంతరం ఆయన అన్న కుమారుడు రామసుబ్బారెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. 1994 , 99లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ , చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. 2004 నుంచి ఆయన వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. 

రాఖీలు క‌ట్టి నిర‌స‌న‌.. సీఎం జ‌గ‌న్‌కు మ‌హిళా ఉద్యోగుల డెడ్‌లైన్‌..

రాఖీలు ఎవ‌రైనా ప్రేమ‌తో క‌డ‌తారు.. అభిమానం క‌డ‌తారు.. ఆప్యాయ‌త‌తో క‌డ‌తారు.. అదేంటి.. ఆ మ‌హిళ‌లు జ‌గ‌న‌న్న‌కు అలా నిర‌స‌న తెలుపుతూ రాఖీలు క‌ట్టారేంటి! ఇదే ఇప్పుడు ఏపీలో చ‌ర్చ‌ణీయాంశ‌మైంది. రాఖీ పండ‌గ సంద‌ర్భంగా ఏపీ మ‌హిళా ప్ర‌భుత్వ ఉద్యోగులు సీఎం జ‌గ‌న్ చిత్ర‌ప‌టాల‌కు రాఖీలు క‌ట్టి నిర‌స‌న తెలిపారు. ప‌నిలో ప‌నిగా ఓ డెడ్‌లైన్ పెట్టి సీరియ‌స్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అన్న అన్నే.. డిమాండ్లు డిమాండ్లే అన్న‌ట్టు.. పండ‌గ పూట ఏపీ వ్యాప్తంగా మ‌హిళా ఎంప్లాయిస్ చేసిన నిర‌స‌న కార్య‌క్ర‌మం జ‌గ‌న‌న్న ప‌రువును బ‌జారు పాలు చేసింది. మ‌హిళల‌తో క‌న్నీళ్లు పెట్టించిన ఏ ముఖ్య‌మంత్రీ బాగుప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లోనే లేదంటూ సీఎం జ‌గ‌న్‌కు అల్టిమేటం జారీ చేశారు.  సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యమిస్తున్న మహిళా ఉద్యోగులు రాఖీ నాడు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జ‌గ‌న్‌రెడ్డి చిత్రపటాలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. సీఎం చిత్రపటాలకే కాకుండా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, జిల్లా కలెక్టర్లకు సైతం రాఖీలు కట్టి నిరసన తెలిపారు.  ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఉద్యమ కార్యాచరణలో ప్రకటించిన ‘రక్షాబంధన్‌ - మహిళా పోరుబాట’ కార్యక్రమం ఏపీలో పెద్ద ఎత్తున జ‌రిగింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌  విధానం రద్దు చేసి పాత పెన్షన్‌  విధానం పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ‘జగనన్నా.. పెన్షన్‌ రక్ష కల్పించన్నా’ అంటూ మహిళా ఉద్యోగులు నినదించారు. ‘జగనన్నా.. సీపీఎస్‌ ఎప్పుడు రద్దు చేస్తావన్నా’ అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మ‌హిళా ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ నెల 31లోగా సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తెలియజేయకపోతే.. సెప్టెంబరు 1న అన్ని జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌  ఆధ్వర్యంలో మహా నిరసన ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.   

హుజూరాబాద్ ఓటర్లు డిసైడై పోయారా? ఎవరేం చేసినా  ఫలితం అదేనా? 

హుజూరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క తప్పుతోందా?  అనుకున్నదొకటి, అయినది ఒకటి అన్నట్లుగా, ఏదో ఆశించి తీసుకుంటున్న నిర్ణయాలు బూమ్రాంగ్ అవుతున్నాయా? అందుకేనా, ఏమి చేయాలో పాలుపోకనే ముఖ్యమంత్రి రోజుకో సమీక్ష నిర్వహిస్తున్నారా? నియోజక వర్గం నాయకులను పిలిపించుకుని, అక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది? ఆళ్ళే మంటున్నరు, వీళ్ళేమంటున్నరు? అని ఆరాతీస్తోంది అందుకేనా, చివరకు అధికారులు వండి వడ్డించిన ‘వంటింటి’ సర్వేలు కూడా ఆయన ఆశలు మీద నీళ్ళు చల్లుతున్నారా?  అందుకేనా, ముఖ్యమంత్రి ఏమి చేద్దాం, ఎలా బయట పడదాం,అని మేథోమథనం సాగిస్తోంది అందుకేనా? అంటే,అంతర్గత వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి ఒక్క దళిత బంధుతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించవచ్చని, ముఖ్యమంత్రి లెక్కలేశారు. ఆ ఉద్దేశంతోనే పైలట్ ప్రాజెక్ట్ హుజూరాబాద్ నియోజక వర్గాన్ని ఎంపిక చేశారు. నియోజక వర్గం పరిధిలోని దళిత కుటుంబాల లెక్కలు తీశారు. నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలున్నాయి. (హుజూరాబాద్ మండలంలో 5,323, కమలాపూర్ మండలంలో 4346, వీణవంక మండలంలో 3678, జమ్మికుంట మండలంలో 4996,ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలు). నియోజక వర్గంలోని అన్ని దలిత కుతుబాలకు ఒకేసారి పథకాన్ని వర్తింప చేయాలని, తద్వారా దళిత ఓట్లను గంపగుట్టగా తమ వైపుకు తిప్పుకుంటే, ఈటలను ఇట్టే సునాయాసంగా ఇంటికి పంపించవచ్చని ఆశించారు. ఇందుకోసంగా  రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్’ లో పథకం అమలుకు కేటాయించిన, రూ. 1200 కోట్లకు అదనంగా మరో రూ.2000 కోట్లు కేటాయించేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్దమయ్యారు. అంటే, ఈ పథకం మీద ముఖ్యమంత్రి ఎంతగా ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చును. నిజానికి, ఆ నిజాన్ని అయన దాచుకోలేదు. హుజూరాబాద్’లో గెలిచేందుకే దళిత బంధు పథకం, అని బహిరంగంగా ప్రకటించారు.  కానీ, దళిత బంధు పథకం నుంచి ఆశించిన ఫలితాలు రాకపోగా వ్యతిరేక ఫలితాలు స్పష్టమవుతున్నాయని, కొంచెం ఆలస్యంగా అర్థమైందని సన్నిహత వర్గాల తాజా సమాచారం. అందుకే మళ్ళీ ఓల్డ్ ట్రిక్స్ ప్లే  చేస్తున్నారని అంటున్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ కథ వినిపించడంతో పాటుగా ఈటల వెంట ఉన్న నాయకులను తమ వైపుకు తిప్పుకోవడంపై మరో మారు దృష్టిపెట్టాలని శుక్రవారం అర్థరాత్రి వరకు నిర్వహించిన సమావేశంలో నిర్ణయించినట్లు, తెలుస్తోంది.  ఇందులో భాగంగానే, ఇప్పటకే సమాదానదండోపాయాలను ప్రయోగించి  ఈటల అనుచరులు చాలా వరకు తమవైపుకు తిప్పుకున్న అధికార పార్టీ, ఇప్పుడు మరో మారు, ఆయన  అనుచరులకు వల విసురుతోంది. అందులోనూ ముఖ్యంగా ఇంతవరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగని ఈటల సన్నిహిత అనుచరులను కారెక్కిచేందుకు,గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే, ఈటలకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటున్న పింగిలి ర‌మేష్‌, చుక్కా రంజిత్’లు తాజాగా కారెక్కి గులాబీ గూటికి చేరారు.  అయితే, గుర్రాన్ని బలవంతంగా రేవు వరకు తీసుకు పోవచ్చును, కానీ, నీళ్ళు తాగించడం సాధ్యం కాదు. అలాగే, అదిరించో బెదిరించో, ఈటల అనుచరులను తమ వైపుకు తిప్పుకోవచ్చును కానీ, మనసులను మార్చడం అయ్యే పని కాదని, అటు వెళ్ళిన వారే అంటున్నారు. నిజానికి, ఇప్పటికే, హుజూరాబాద్ ఓటర్లు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటు ఈటల అటు కేసీఆర్ ఏ ఒడ్డున నిలవాలో జనం డిసైడై పోయారని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

సెప్టెంబ‌ర్‌లో థ‌ర్డ్ వేవ్ ప‌క్కా.. రోజుకు 5 లక్షల కేసులట‌.. నీతి ఆయోగ్ హెచ్చరిక..

థ‌ర్డ్ వేవ్ లేదు ఏమీ లేదు. జ‌నాలు చూడు ఎంత బిందాస్‌గా తిరుగుతున్నారో. కేసులు కూడా పెద్ద‌గా ఏమీ రావ‌ట్లేదు. ప్ర‌జ‌ల్లో సైతం క‌రోనా భ‌యం లేదు. సెకండ్ వేవ్ ముగిసింద‌ని తెలంగాణ‌ అధికారికంగానే ప్ర‌క‌టించింది. ఏపీలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. హైద‌రాబాద్‌లో బోనాల పండ‌గ జోరుగా జ‌రిపారు. అయినా, కేసులు అంతంతే ఉన్నాయి. ఏపీలో స్కూల్స్ కూడా తెరిచారు. ఇలా మొత్తం అన్‌లాక్ అవుతోంది. రాబోవు వినాయ‌క చ‌వితి సైతం పెద్ద ఎత్తున జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. రాష్ట్రాల తీరు ఇలా ఉంటే.. కేంద్రం మాత్రం క‌రోనా క‌ట్ట‌డిపై ప‌దే ప‌దే హెచ్చ‌రిస్తోంది. మీరు చేస్తున్న‌ది త‌ప్పు.. ఇంకా కొవిడ్ ముప్పు పోలేదంటూ ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లు చేస్తోంది. అయినా, రాష్ట్రాలు ప‌ట్టించుకుంటేగా. తాజాగా, నీతి ఆయోగ్ మ‌రో వైర‌స్ బాంబ్ వ‌దిలింది. క‌రోనా ఎక్క‌డికీ పోలేద‌ని.. థ‌ర్డ్ వేవ్‌కు రెడీ అవుతోంద‌ని.. మూడో ముప్పు మ‌రింత డేంజ‌ర‌స్‌గా ఉంటుంద‌ని గ‌ట్టి వార్నింగ్ ఇస్తోంది. సెప్టెంబ‌ర్‌లోనే ముహూర్తం అంటూ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి మరోమారు వికృతరూపం చూపనుంది. లేటెస్ట్‌గా నీతి ఆయోగ్ కరోనా థర్డ్ వేవ్‌పై హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబరులో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని అల‌ర్ట్ చేస్తోంది. కరోనా బారిన పడిన ప్రతీ 100 మందిలో 23 మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయ‌ని అంచనా వేసింది. ఆ పరిస్థితులకు త‌గ్గ‌ట్టు ముందుగానే దేశంలో రెండు లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాలని సూచింది.  2 లక్షల ఐసీయూ బెడ్లతో పాటు 1.2 లక్షల వెంటిలేటర్ కలిగిన ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు కలిగిన బెడ్లు, 10 లక్షల కోవిడ్ ఐసోలేషన్ కేర్ బెడ్లు సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. గ‌తంలొ సెకండ్ వేవ్ గురించి కూడా నీతి ఆయోగ్ క‌రెక్ట్‌గా అంచ‌నా వేసింది. ఇప్పుడు మూడో ముప్పు గురించి తెల‌ప‌డంతో ప్ర‌భుత్వం, అధికారులు అల‌ర్ట్ అవుతున్నారు.  ఆగ‌స్టులో కొవిడ్ కేసులు నియంత్ర‌ణ‌లోనే ఉన్నాయి. దేశంలో గత‌ 56 రోజులుగా 50 వేలకు దిగువగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 30,948 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 403 మంది చ‌నిపోయారు. 

మెగాస్టార్ ప‌వ‌ర్‌స్టార్ అయ్యేనా? ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు?

హ్యాపీ బ‌ర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి. బ‌ర్త్‌డే విషెష్‌తో తెలుగురాష్ట్రాలు హోరెత్తిపోతోంది. ఆదివారం మొత్తం మెగా సంద‌డే. ఆచార్య‌, గాడ్‌ఫాద‌ర్‌, భోళాశంక‌ర్‌ల చ‌ర్చే. ప్ర‌ముఖులంతా చిరంజీవికి శుభాకాంక్ష‌లు చెప్పారు. ఫ్యాన్స్ అంతా పోస్టులు, స్టేట‌స్‌లు, పాట‌లతో త‌మ అభిమానం చాటుకున్నారు. సోష‌ల్ మీడియా మొత్తం మెగాస్టార్ మేనియానే. గ్రీన్ ఛాలెంజ్‌తో సోష‌ల్ కాజ్ సైతం పెద్ద ఎత్తున కొన‌సాగింది. అంతా బాగుంది.. మెగాస్టార్ పుట్టిన‌రోజు వేడుక‌లు బ్ర‌హ్మాండంగా సాగాయి. అంతేనా.. అస‌లైన ఫ్యాన్స్ ఇంతే కోరుకుంటున్నారా? ఆచార్యతో అడ్జ‌స్ట్ అయిపోతారా? గాడ్‌ఫాద‌ర్‌తో గ‌మ్మున ఉండిపోతారా? భోళాశంక‌ర్ భ‌జ‌న చేసుకుంటూ రిలాక్స్ అవుతారా? కానే కాదు.. సినీ ఫ్యాన్స్ అలా కాంప్ర‌మైజ్ అవుతారేమో కానీ.. పొలిటిక‌ల్ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవిని ఇంకెక్క‌డో చూడాల‌నుకుంటున్నారు.. అన్న‌య్య‌ను అంద‌నంత ఎత్తున ఊహించుకుంటున్నారు.. ఆయ‌న్ను ఎక్క‌డికో తీసుకెళ్లాల‌నుకుంటున్నారు కానీ.. మెగాస్టార్ మాత్రం అందుకు ఇప్పుడే సిద్ధంగా లేనంటున్నారు. సినిమాల‌తో య‌మా బిజీగా ఉంటున్నారు. మ‌రి, మెగాస్టార్ ప‌వ‌ర్ కేవ‌లం సినిమాల వ‌ర‌కేనా? పాలిటిక్స్‌లో మ‌ళ్లీ 'ప‌వ‌ర్‌' చూపించే రోజులు రావంటారా? కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌. కేంద్ర మాజీమంత్రి. టాలీవుడ్ బిగ్‌బాస్‌. తెలుగు రాష్ట్రాల‌లో ఫుల్ క్రేజ్‌. దేశంలోనూ మంచి పాపులారిటీ. అభిమాన‌గ‌ణం మెండు. రాజ‌కీయాల్లో రాణించ‌డానికి అన్ని అర్హ‌త‌లూ ఉన్నాయి. అయినా, ఏవో కార‌ణాలతో ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్ క‌న్ఫ్యూజ‌న్‌గా మారింది. ప్ర‌జారాజ్యంతో ఉద‌యించే సూర్యుడిగా వెలుగొందుతార‌ని అనుకున్నారంతా. వైఎస్సార్ ఆప‌రేష‌న్‌కు కాంగ్రెస్‌లో క‌లిసిపోయి కేంద్ర మంత్రి అయ్యారు. క‌ట్‌చేస్తే.. రాష్ట్ర విభ‌జ‌న‌తో పాటూ ఆయ‌న రాజ‌కీయ ఉన్న‌తీ ముక్క‌లుచెక్క‌లైంది. ఆ త‌ర్వాత చిరంజీవి మ‌ళ్లీ రాజ‌కీయాల్లో మెరిశారు. వ‌రుస హిట్‌ల‌తో మునుప‌టి చ‌రిష్మా సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న టెక్నిక‌ల్‌గా కాంగ్రెస్‌లోనే ఉన్నా.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.  చిరంజీవి పాలిటిక్స్‌లో యాక్టివ్ లేకున్నా.. సినీ పాలిటిక్స్‌లో మాత్రం అంద‌రిక‌న్నా ముందున్నారు. టాలీవుడ్ స‌మ‌స్య‌లపై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో సినీ కార్మికుల‌ను ఆదుకున్నారు. ప‌రిశ్ర‌మ అభివృద్ధికి చొర‌వ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇటు తెలంగాణ స‌ర్కారు, అటు ఏపీ ప్ర‌భుత్వానికి అత్యంత స‌న్నిహితుడిగా మారారు. క‌ల్వ‌కుంట్ల‌-కొణిదెల ఫ్యామిలీల మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి-జ‌గ‌న్ క్లోజ్ రిలేష‌న్ మెయిన్‌టెన్ చేస్తున్నారు. అపాయింట్‌మెంట్ లేకుండానే ఇద్ద‌రు సీఎంల‌ను క‌లిసేంత సాన్నిహిత్యం ఏర్ప‌డింది. తెలంగాణ పాలిటిక్స్‌లోకి చిరంజీవి వ‌చ్చే అవ‌కాశం లేకున్నా.. ప‌రోక్షంగా కేసీఆర్‌కు స‌పోర్ట్‌గా ఉంటున్నారు. ఇక‌, ఏపీ రాజ‌కీయాల్లో మెగాస్టార్ రోల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్ప‌టికీ మెగాస్టార్.. ట్రంప్‌కార్డ్‌గానే ఉన్నారు. ఏపీ రాజ‌కీయాల‌ను శాసించ‌లేక‌పోయినా.. ప్ర‌భావితం మాత్రం చేయ‌గ‌ల‌రు. అందుకే, చిరంజీవిని ట్రాప్ చేసేలా జ‌గ‌న్ ఆయ‌న‌తో ఈమ‌ధ్య కాలంలో రాసుకుపూసుకు ఉంటున్నార‌ని అంటున్నారు.. త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాన్ జ‌న‌సేన పార్టీ నుంచి కాచుకోడానికి.. అన్న‌య్య చిరంజీవితో న‌రుక్కొస్తున్నార‌ని భావిస్తున్నారు. కావాల‌నే చిరంజీవిని ప‌లుమార్లు క‌లుస్తూ.. ఏపీ టాలీవుడ్‌పై చ‌ర్చిస్తూ.. చిరంజీవి-జ‌గ‌న్ మంచి ఫ్రెండ్స్ అనే మెసేజ్ ప‌బ్లిక్‌లోకి వెళ్లేలా చూసుకుంటున్నారు. ఇదంతా జ‌గ‌న్ ఆడుతున్న మైండ్‌గేమ్ అంటున్నారు. చిరంజీవిని వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు పంపుతార‌నే ప్ర‌చారానికీ తాడేప‌ల్లి వ‌ర్గాల లీకులే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. జ‌న‌సేన నుంచి ర‌క్ష‌ణ‌కే మెగాస్టార్‌ను సేఫ్‌గార్డ్‌గా ముందుంచుతున్నార‌ని విశ్లేషిస్తున్నారు.  ఇక ఈసారి ప్ర‌ధాని కావాల‌ని ఆశ‌ప‌డుతున్న రాహుల్‌గాంధీ సైతం ఏపీలో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ను మ‌ళ్లీ పట్టాలెక్కించాల‌ని భావిస్తున్నారు. అందుకోసం ఏపీ మొత్తం సెర్చ్ లైట్ పెట్టి వెతికితే.. ఒక్క చిరంజీవి మాత్ర‌మే వారికి ఆశాకిర‌ణంలా క‌నిపిస్తున్నారు. అందుకే, చిరంజీవిని మ‌ళ్లీ కాంగ్రెస్‌లో యాక్టివ్ చేసే బాధ్య‌త‌ను రాహుల్‌గాంధీ.. ఉమెన్‌చాందీకి అప్ప‌గించార‌ని చెబుతున్నారు. తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి మాదిరిగా.. చిరంజీవిని ఏపీపీసీసీ చీఫ్ చేసి.. ప‌త్తా లేకుండా పోయిన కాంగ్రెస్‌కు ఓ రూపు తీసుకురావాల‌ని చూస్తున్నారు. అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌రెడ్డి జైలుక వెళితే.. వైసీపీలో ఉన్న‌వారంతా ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ వాదులే కాబ‌ట్టి.. వారిని మ‌ళ్లీ వెన‌క్కి లాగి.. చిరంజీవి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్‌కు మ‌ళ్లీ ప్రాణం పోయాల‌నేది రాహుల్ అండ్ టీమ్ ఐడియా. మ‌రి, అది సాధ్య‌మా? అంటే... అనుమాన‌మే. వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కూ సినిమా షెడ్యూళ్ల‌తో బిజీగా ఉన్నారు మెగాస్టార్‌. ప్ర‌స్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న ఆయ‌న‌.. మ‌ళ్లీ పొలిటిక‌ల్ లైట్‌లోకి వ‌స్తారా? ఏపీ పాలిటిక్స్‌లో ఫుల్ జోష్ మీద‌ త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉండ‌గా.. మ‌ళ్లీ ఈ అన్న‌య్య ఎంట్రీ అవ‌స‌ర‌మా? సినిమాల్లో మెగాస్టార్‌.. మ‌ళ్లీ పొలిటిక‌ల్‌గా యాక్టివ్ అయి 'ప‌వ‌ర్‌'స్టార్‌గా మారుతారా? ఏమో......