"OYO"లో క‌లుద్దామా.. నేను అలాంటిదాన్ని కాదు సార్‌...

సాఫ్ట్‌వేర్ జాబులు చాలా సాఫ్ట్‌గా ఉంటాయ‌నేది ఓ భ్ర‌మే. అక్క‌డా కంటికి క‌నిపించ‌ని రాజ‌కీయాలు ఫుల్లుగా ఉంటాయి. అక్క‌డా కుల‌, మ‌త తేడాలుంటాయి. అక్కడా బాసుల రూపంలో దాగున్న తోడేళ్లు ఉంటాయి. త‌మ టీమ్‌లో అంద‌మైన అమ్మాయి ఉంటే చాలు.. కామా*ధులు క‌ళ్ల‌తోనే కుళ్ల‌బొడుస్తుంటారు. కొలీగ్స్ కొంత‌వ‌ర‌కు ఓకే అయినా.. టీమ్ లీడ్స్, మేనేజ‌ర్స్‌తోనే అస‌లైన ప్రాబ్ల‌మ్‌. అంద‌రూ అలా అని కాదు.. చాలామందే అలా ఉంటార‌ని చెబుతున్నారు పోలీసులు. జ‌స్ట్ చెప్ప‌డ‌మే కాదు.. ఇటీవ‌ల సైబ‌రాబాద్ షీ టీమ్స్ డీల్ చేసిన ఓ కేసును అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. ఆ కేస్ తాలూకా ఓ వాట్సాప్ చాట్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి బాస్‌ల రూపంలో ఉండే శాడిస్టుల‌కు అస్స‌లు భ‌య‌ప‌డ‌కుండా ఉండ‌మంటూ.. ఎలాంటి ఎక్స్‌ట్రాలు చేసినా తోక క‌ట్ చేసేందుకు మేమున్నామంటూ అభ‌య‌మిస్తోంది షీ టీమ్‌. ఇంత‌కీ ఆ వాట్సాప్ చాట్‌లో ఏముందంటే....  బాస్ నుంచి అమెకు మెసేజ్ వ‌చ్చింది. నీ ప్రాజెక్ట్ ప‌ర్‌ఫార్మెన్స్ బాగా లేద‌ని మొద‌ట భ‌య‌పెట్టాడు. అయినా, ఓకే నేను చూసుకుంటా.. శాల‌రీ హైక్ వ‌చ్చేలా చేస్తా.. కానీ...... అంటూ మెసేజ్ పెట్టాడు. కానీ.. ఏంటి సార్ అని ఆమె అడిగితే.. ఓయో రూమ్స్‌లో క‌లుద్దామా అంటూ అస‌లు మేట‌ర్ రివీల్ చేశాడు. తాను అలాంటి దాన్ని కాదంటే.. బ్లాక్ మెయిల్‌కు దిగాడు. హైక్ ఉండ‌దు.. ఉద్యోగం ఉండ‌దు.. కెరీర్ ఉండ‌దు.. అంటూ బెదిరించాడు. ఆ యువ‌తి ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా వెంట‌నే షీ టీమ్స్‌కు కంప్లైంట్ చేసింది. వెంట‌నే కాప్స్ ఆ కంత్రీ బాస్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ బాస్ ఉద్యోగ‌మే ఊడింది. ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింప‌డానికి.. ఆ వాట్సాప్ చాట్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ పేరుతో ఏర్పాటైన ప్రత్యేక విభాగం మహిళలకు రక్షణ కల్పిస్తోంది. మహిళలు, టీనేజ్ యువతులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆటకట్టించేందుకు షీటీమ్స్ డెకాయ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నాయి. అయితే సోషల్ మీడియా పెరిగిపోవడంతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో వచ్చే వేధింపులపై ఎలా స్పందించాలి?.. ఆ విషయంపై పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలి? అనే దానిపై ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ సరికొత్తగా అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా ఈ వాట్సాప్ చాటింగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇంత‌కీ ఆ లేడీ ఎంప్లాయ్ త‌న బాస్ ఫోన్ నెంబ‌ర్‌ను ఏ పేరుతో సేవ్ చేసుకుందో తెలుసా... డైనో"సార్‌"...

వాతావరణ శాఖ జారీ చేసే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్టుల గురించి తెలుసా? 

వర్షాకాలంలో వాతావరణ శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. వర్షాలు, వరదలపై ముందుస్తు జాగ్రత్తలు చెబుతూ అవసరమైతే అలర్టులు జారీ చేసింది భారత వాతవరణ శాఖ(ఐఎండీ). అలర్టుల్లో ముఖ్యమైనవి ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్టులు. దేశంలో వర్ష సూచన, వాతావరణ హెచ్చరికలకు సంబంధించి ఎల్లో, ఆరెంజ్, రెడ్‌ అలర్ట్‌లను జారీ చేస్తారు. వచ్చే 24 గంటల్లో పడే భారీ వర్షాలు, తుఫానులు, ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితిని.. వర్షపాతం నమోదయ్యే అవకాశాన్ని బట్టి ఈ హెచ్చరికలు ఉంటాయి. అయితే చాలా మందికి వాతావరణ శాఖ జారీ చేస్తే హెచ్చరికలపై అవగాహన ఉండదు. అందుకే అలర్టులు ఎన్ని రకాలు, వాటిని ఎప్పుడు జారీ చేస్తోరా తెలుసుకుందాం... ఐఎండీ  గ్రీన్‌ అలర్ట్‌  ఇస్తే  ఎలాంటి ప్రమాదం లేదని అర్థం.  ఎల్లో అలర్ట్‌ అంటే ఆరు నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం, 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్‌ జారీ చేస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని సూచిస్తారు.  ఆరెంజ్‌ అలర్ట్‌-  పది నుంచి 20 సెంమీటర్ల వర్షపాతం, 40–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని.. ఇబ్బందులేమైనా వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్‌ సూచిస్తుంది. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తే లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందే.. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. రెడ్‌ అలర్ట్‌ - ఇది అత్యంత కీలకం. ఒక రకంగా చెప్పాలంటే కుండపోత వానలు, తుఫాను వంటి ప్రకృతి విపత్తును సూచించడానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేస్తారు. అంటే 20 సెంటీమీటర్లకు మించి వాన పడే అవకాశం ఉందని అర్థం. రెడ్‌ అలర్ట్‌ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.  రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ముప్పు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. 

టీటీడీ క‌ల్యాణమండ‌పాల్లో సువార్త స‌భ‌లు! ముగ్గురు రెడ్లపై ర‌ఘురామ మండిపాటు

టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ చేతకాకపోతే సుబ్బా‌రెడ్డి, ధర్మా‌రెడ్డి, జవహర్‌రెడ్డిలు టీటీడీ పదవుల నుంచి తప్పుకోవాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. కల్యాణ మండపాలు అద్దెకిస్తే, అక్కడ సువార్త సభలు పెడితే సుబ్బారెడ్డి ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. భక్తులు ఇచ్చిన భూముల్లో కల్యాణ మండపాలు నిర్మించారని, వాటిని ఎవరికో అద్దె కిస్తే పరిస్ఠితి ఏంటని ర‌ఘురామ‌ నిలదీశారు.  జెరూసలేం వెళ్లే వారికి సబ్సిడీ ఇస్తూ టీటీడీలో అన్నింటికీ డబ్బులు వసూలు చేస్తున్నారని ర‌ఘురామ‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెరూసలేంకి ఇచ్చే సబ్సిడీకి తిరుమలలో దోపిడీ ఏంటని ప్రశ్నించారు. టీటీడీ ఆదాయం కోసం రూమ్‌రెంట్లు కూడా పెంచుతున్నారని, ఇది ఏమాత్రం సమంజసం కాదని మండిప‌డ్డారు. టీటీడీ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు. భక్తులను భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్య‌బ‌ట్టారు. డబ్బుల కోసం చేసే పనులు మానేయండి.. చేతకాకపోతే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి జవహర్‌రెడ్డిలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  ఆగమ మండలి ఏర్పాటు మీద దృష్టి పెట్టాలని ర‌ఘురామ కోరారు. నిష్ణాతులైన వారిని ఆగమ మండలిలో నియమించాలన్నారు. ధ‌ర్మ పరిషత్‌ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీటీడీ అధికారుల‌ను ప్రశ్నించారు.   

అఫ్గ‌న్‌ను వీడిన అమెరికా.. లాస్ట్‌లో తాలిబ‌న్ల‌కి ట్విస్ట్ ఇచ్చిన ఆర్మీ..

20 ఏళ్లు. రెండు ద‌శాబ్దాల పాటు అఫ్గ‌నిస్తాన్‌ను కాపాడిన అమెరికా.. ఇక సెల‌వంటూ.. మ‌ళ్లీ తిరిగిరామంటూ కాబుల్‌కు అల్విదా చెప్పేసి వెళ్లిపోయింది. ఆ దేశాన్ని తాలిబ‌న్ల‌కు వ‌దిలేసి.. తన దారి తాను చూసుకుంది. సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్‌ సీ-17 కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరడంతో అఫ్గన్ భూభాగం నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తయ్యింది. ముందే నిర్దేశించుకున్న ఆగస్టు 31 గడువుకు ఒక రోజు ముందే త‌న‌ బలగాలను పూర్తిగా తరలించేసింది. తాలిబ‌న్లు అఫ్గ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకున్నాక‌.. ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు ల‌క్ష‌న్న‌ర మంది పౌరుల‌ను సుర‌క్షితంగా ఆ దేశం నుంచి షిఫ్ట్ చేసింది. ఇంకా చాలామందినే త‌ర‌లించాల్సి ఉన్నా.. తాలిబ‌న్లు విధించిన గ‌డువు ముగియ‌డం.. ఐసిస్ ఉగ్ర‌దాడుల భ‌యంతో ఒక్క రోజు ముందే అమెరికా సైన్యం ఆ దేశాన్ని వీడి వెళ్లిపోయింది. అఫ్గ‌న్‌లో 20 ఏళ్ల అమెరికా అధ్యాయం ముగిసింది.  వెళ్తూ వెళ్తూ అమెరికా ఆర్మీ అఫ్గ‌న్‌లో ఉన్న త‌మ దేశ యుద్ధ విమానాలు, అత్యాధునికి క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌, సైనిక ప‌రిక‌రాల‌ను నిర్వీర్యం చేసి వెళ్లారు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న 73 యూఎస్‌ యుద్ధ విమానాలను నిరుపయోగంగా మార్చేసి.. తుక్క‌గా చేశారు.  ‘తాలిబన్ అధీనంలోకి అఫ్గన్ వెళ్లడంతో అక్కడ నుంచి రావడానికి ముందే అమెరికా సైన్యాలు వీటిని నిర్వీర్యం చేశారు.. ఆ యుద్ధ విమానాలు ఎప్పటికీ ఎగరలేవు.. వాటి ఏ ఒక్కరూ నడపలేరు.. వాటిలో చాలా వరకూ యుద్ధం మొదలుపెట్టగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.. కానీ ఖచ్చితంగా మళ్లీ ఎగరలేవు’ అని అమెరిక‌న్ ఆర్మీ అధికారి తెలిపారు.  కాబుల్ విమానాశ్రయంలో 6,000 మంది సైనికులతో అమెరికా రెండు వారాలుగా తరలింపు ప్రక్రియ చేప‌ట్టింది. అక్క‌డ‌ మిలియన్ డాలర్ల విలువైన 70 ఎంఆర్ఏపీ యుద్ధ వాహనాలను వదిలిపెట్టింది. రాకెట్, మోర్టార్, ఆయుధాల దాడులను సమర్థంగా ఎదుర్కొనే సీ-రామ్ వ్యవస్థను కూడా అక్కడే వదిలేసింది. ఆ వ్యవస్థలను చివరి నిమిషం వరకూ ఉప‌యోగించిన అమెరికా.. చివ‌రి విమానం టేకాఫ్ అయ్యే స‌మ‌యానికి వాటిని కూడా ప‌నికిరాకుండా చేసి వెళ్లిపోయింది.  తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ అఫ్గన్‌ నుంచి అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని, ఉపయుక్తంగా ఉన్నారని అమెరికా సైనికాధికారి తెలిపారు. ఇక‌, 20 ఏళ్ల త‌ర్వాత‌ అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీంతో.. 20 ఏళ్ల రాజ‌కీయ ఉత్కంఠ ముగిసిన‌ట్టైంది. అయితే, 20 ఏళ్ల క్రితం తాలిబ‌న్ల ఏరివేత‌తో మొద‌లైన శాంతిప్ర‌క్రియ.. ఇప్పుడు మ‌ళ్లీ ఆ తాలిబ‌న్లే అఫ్గ‌నిస్తాన్‌ను చేజిక్కించుకోవ‌డంతో ముగియ‌డం.. ఊహించ‌ని ప‌రిణామం. అమెరికా-అఫ్గ‌న్‌ల‌ వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌నం.   

తిరుమల వెంకన్నకే రూ. 3 కోట్ల వెన్నుపోటు.. హవ్వ

ఆంధ్రాలో జగనన్న హయాంలో ఇష్టారీతి పాలన నడుస్తోంది అనడానికి తాజా నిదర్శనం. ప్రభుత్వంలో తమవాళ్లు ఉన్నారనో లేక తామే ప్రభుత్వం అనుకుంటున్నారో తెలీదు కానీ.. కొందరు అధికారుల అవినీతి, ఆశ్రిత పక్షపాతం మాత్రం వడ్డీకాసులవాడినే విస్తుపోయేలా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరస్వామి రాత్రనకా పగలనకా గర్భగుడిలో నిలబడి భక్తుల నుండి నిలువు దోపిడీల ద్వారా సంపాదిస్తుంటే... భక్తుల కానుకలనే జీతాలుగా తీసుకుంటూ.. ఆయన కొలువులో పనిచేస్తున్న టీటీడీ అధికారులు మాత్రం వెంకన్నకే వెన్నుపోటు పొడుస్తున్నారు. అక్రమార్కులతో కుమ్మక్కై అవినీతి పంకిలంలో కూరుకుపోతున్నారు. టీటీడీకి చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిన తిరుమలలోని ఓ హోటల్ నిర్వాహకుడికి పరోక్షంగా సహకరించి... ఎవరి కంటా పడకుండా వారిని రాత్రికి రాత్రే తిరుమల నుండి దాటించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.  తిరుమలలో పెద్ద షాపులు, చిన్న దుకాణాలు, చిల్లర వర్తకులు... ఇలా పలు వ్యాపార సంస్థల నుంచి అద్దెల చెల్లింపులో టీటీడీ నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. ఒక్క నెల అద్దె బకాయి ఉన్నా కూడా అధికారులు అంగీకరించరు. స్థానిక ప్రజలని కూడా చూడకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. కరోనా కష్ట సమయంలో కూడా స్థానిక వ్యాపారులకు అద్దెల చెల్లింపులో ఒక్క రూపాయి కూడా మినహాయింపు ఇవ్వకపోవడం గమనార్హం. అందుకు విరుద్ధంగా టీటీడీ పెద్దలు ఓ హోటల్ నిర్వాహకుడికి ఏకంగా మూడు కోట్ల రూపాయల బకాయిలను వదిలేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ హోటల్ సంస్థ రూ. 3 కోట్ల అద్దె బకాయిలు ఎగవేసినా టీటీడీ యాజమాన్యం నోరు మెదపలేదంటే తెరవెనుక ఏం జరిగి ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం వారి వద్ద నుండి బకాయిలు రాబట్టుకునే చర్యలు కూడా తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా హోటల్ ఖాళీ చేయించి రాత్రికి రాత్రే చెన్నైకి పంపించారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ హోటల్ యాజమాన్యం ద్వారా నెలకు రూ. 23.90 లక్షల అద్దె టీటీడీకి జమ అవుతోంది. ఆ హోటల్ ను కాదనుకుని బెంగళూరుకు చెందిన మరో సంస్థకు ఉచితంగా ఇవ్వడానికే చెన్నై హోటల్ ను ఖాళీ చేయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  టీటీడీ భక్తులెవరూ అడగకపోయినా.. ఇటీవల సంప్రదాయ భోజనం అనే నిర్ణయాన్ని తీసుకుంది. అయితే దేవాలయంలో అన్న వ్యాపారం అంటూ ఆ నిర్ణయం మీద విమర్శలు రావడంతో టీటీడీ వెనక్కి తగ్గింది. అది వేరే విషయం. అయితే భోజన పథకాన్ని బెంగళూరుకు చెందిన మరో సంస్థకు ఇవ్వడానికే చెన్నై హోటల్ మేనేజ్ మెంట్ ను భారీ నష్టానికైనా సరే.. అర్ధరాత్రి ఖాళీ చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సంప్రదాయ భోజనం కాస్తా బెడిసికొట్టడంతో తిరుమలలోని పలు పెద్ద  హోటల్స్ ని కూడా బెంగళూరు సంస్థకు ఉచితంగా కట్టబెట్టే  యోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు.  ఆ రూ. 3 కోట్లు ఎగ్గొట్టిన విధంబెట్టిదనిన... తిరుమలలో హోటల్స్ నడపాలంటే దాదాపు 5 కోట్ల రూపాయల వ్యాపార టర్నోవర్ ఉండాలనే నిబంధన ఉంది. తిరుమల పాలకమండలి సభ్యుల బోర్డు సమావేశం నిర్వహించే అన్నమయ్య భవన్ కింది భాగంలోనే ఉన్న అన్నమయ్య హోటల్ ను టీటీడీ టెండర్ విధానం ద్వారా లీజుకు కట్టబెడుతుంది. చెన్నైకి చెందిన ఓ యాజమాన్యం ఈ హోటల్ ను నెలకు రూ. 23 లక్షల అద్దె చెల్లించే విధంగా టెండర్ల ద్వారా దక్కించుకున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఆరు మాసాల అద్దెను డిపాజిట్ గా చెల్లించాలి. ఒకవేళ ఈ అద్దె సొమ్మును సక్రమంగా చెల్లించకపోతే మూడు మాసాల వరకు మాత్రమే గడువు ఇచ్చి డిపాజిట్ సొమ్మును టీటీడీ పూర్తిగా స్వాధీనం చేసుకుని హోటల్ ను వెంటనే ఖాళీ చేయించి నిర్వాహకుల వద్దనుండి హోటల్ ను స్వాధీనం చేసుకునే నిబంధనలు ఉన్నాయి. అయితే హోటల్ యాజమాన్యం అద్దె చెల్లించడంలో విఫలమైంది. హోటల్ యాజమాన్యం దాదాపు ఏడాదిన్నరపాటు అద్దెలు సక్రమంగా చెల్లించలేదు. దీంతో టీటీడీకి నెలకు ఇరవై మూడు లక్షల చొప్పున ఏడాదిన్నర కాలానికి నాలుగున్నర కోట్ల రూపాయల అద్దె బకాయిలు నిలిచిపోయాయి. అయినా టీటీడీ గానీ, పంచాయతీ గానీ, రెవెన్యూ అధికారులు గానీ హోటల్ యాజమాన్యం నుంచి బకాయిలు వసూళ్లు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బకాయిల వసూళ్లకు వెళ్ళినప్పుడల్లా పంచాయతీ, రెవెన్యూ అధికారులను హోటల్ యాజమాన్యం మామూళ్ల మత్తులోకి దింపి మేనేజ్ చేసినట్లు  సమాచారం. ఈ క్రమంలోనే నాలుగున్నర కోట్ల బకాయిల వసూళ్లకు హోటల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాగా హోటల్ యాజమాన్యం కరోనా కారణంగా తాము బకాయిలు చెల్లించలేక పోతున్నట్లు వివిధ సాకులు కారణాలుగా చూపించి, తమ కు మినహాయింపు ఇవ్వాలని నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానాల్లో నాలుగు దఫాలుగా పిటిషన్లు వేసి ఈ పిటిషన్లు సాకుగా చూపించి టీటీడీకి అద్దెలు చెల్లించకుండా కాలయాపన చేశారు.  న్యాయస్థానం మాత్రం హోటల్ యాజమాన్యం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పూర్తి బకాయిలు టీటీడీకి చెల్లించాల్సిందేనని ఆదేశించింది. దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్ళిన హోటల్ యాజమాన్యం గతంలో రెండు హోటళ్లకు ఇదేవిధంగా టీటీడీ అద్దెల చెల్లింపులో మినహాయింపు ఇచ్చిందని విజ్ఞప్తి చేసింది. అయితే న్యాయస్థానం కూడా టీటీడీ వైఖరికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిటిషనర్ వాదనను కొట్టేసింది. అయితే ఇవన్నీ తెలిసినప్పటికీ టీటీడీ అధికారులు మాత్రం ఈ హోటల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కపెట్టారు. నిబంధనల మేరకు ఏ హోటల్ నిర్వాహకుడైనా మూడు మాసాలపాటు అద్దెలు చెల్లించకపోతే వెంటనే చర్యలు తీసుకుని అద్దెలు రికవరీ చేసి హోటల్ ను స్వాధీనం చేసుకుని మళ్లీ టెండరు నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. అయితే ఈ సంఘటనలో ఏడాదిన్నర కాలంగా బాడుగలు చెల్లించకపోయినా ఎందుకు మినహాయింపు ఇచ్చారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కోర్టు తీర్పు, బకాయిల వ్యవహారం ఇలా నడుస్తుండగానే టీటీడీలో ఓ ఉన్నతాధికారి హోటల్ నిర్వాహకులతో అనధికారిక సంప్రదింపులు జరిపారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.  నాలుగున్నర కోట్ల బకాయిలకు గాను డిపాజిట్ సొమ్ము మినహాయించుకొని మరో మూడు కోట్ల రూపాయల బకాయిలను ఏ మాత్రం పట్టించుకోకుండా, వారి వద్ద నుండి వసూలు చేయకుండా దయా హృదయం చూపించడంలో ఆంతర్యం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా చెన్నై హోటల్స్ యాజమాన్యం మాత్రం టీటీడీ వైఖరి కారణంగా తంతే బూరెల గంపలో పడ్డట్టయ్యింది. మూడు కోట్లు మిగిలించుకున్న ఆనందంలో హోటల్ ను ఆగమేఘాలపై ఖాళీ చేసి అర్ధరాత్రే చెన్నైకి చెక్కేశారు. మెజారిటీ ప్రజల ఇష్టదైవమైన ఓ ప్రముఖ ధార్మిక సంస్థలో ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు ఇలా అధర్మ పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నప్పడు సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడే  కన్నెర్ర చేస్తాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

చింతమనేనిని చంపాలనుకున్నారా?

చింతమనేని ప్రభాకర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనో సంచలనం. ప్రజా పోరాటమైనా, అభివృద్ధి కార్యక్రమమైనా... అధికార పార్టీలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా ఆయన రూటే సెపరేటు. నిత్యం ఎదో ఒకటి చేస్తూ వార్తల్లో ఉంటారు. ప్రజల కోసం కొన్ని సార్లు  అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తూ ఇబ్బందుల్లో పడుతుంటారని అంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కీలక నేతగా ఉన్న చింతమనేని ప్రభాకర్.. దెందులూరు నుంచి అసెంబ్లీకి పలుసార్లు గెలిచారు. గత టీడీపీ హయాంలో ప్రభుత్వ విప్ గా పని చేశారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు చింతమనేని ప్రభాకర్. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. తన పార్టీ అధికారంలో లేకున్నా ప్రజలకు దూరం కాలేదు చింతమనేని. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనున్నాంటూ ధైర్యం ఇస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని తమకు ఇబ్బందిగా మారారని భావించిన అధికార పార్టీ ఆయనను టార్గెట్ చేసిందని చెబుతారు. అందుకే ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు చింతమనేని. అయినా తన తీరు మాత్రం మార్చుకోకుండా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు.  ఆదివారం మరోసారి చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. విశాఖ జిల్లా జీకే వీధి మండలం శ్రీదారాలమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో నర్సీపట్నం వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు,  గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో ప్రభాకర్,  ఆయన అనుచరులు అనుమానాస్పదంగా తిరిగారంటూ విశాఖ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం భీమడోలు సర్కిల్ ఇన్స్స్ పెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చి 41 నోటీసు ఇచ్చి, విడిచిపెట్టారు. చింతమనేని అరెస్ట్ , తర్వాత ఆయనపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. విశాఖ జిల్లాలో తనను అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన ఘటనలు వివరిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు చింతమనేని ప్రభాకర్. పోలీసులు తనను చంపేస్తారని అనుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం నుంచి తనను చింతపల్లికి తీసుకెళ్లారని తెలిపారు చింతమనేని. తనకు అదే చివరి క్షణం అని అనుకున్నానని... ఆ దట్టమైన అడవుల్లో తనను కాల్చేసి, నక్సలైట్లు కాల్చేశారని చెపుతారేమోనని భావించానని అన్నారు. రక్షకభటులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకభటులుగా మారారని మండిపడ్డారు. తనకు నక్సల్స్ తో ప్రమాదం ఉందని చెపుతున్నారని... కానీ, తనకు ప్రమాదం నక్సల్స్ తో లేదని, పోలీసులతోనే తనకు ప్రమాదమని అన్నారు. తన అరెస్ట్ వెనుక వైసీపీ కుట్ర ఉందని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు.

వైఎస్సార్ సంస్మ‌ర‌ణ‌ స‌భ‌.. విజ‌య‌మ్మ ఫిట్టింగ్‌.. వైసీపీలో టెన్ష‌న్...

సెప్టెంబ‌ర్ 2. వైఎస్సార్ మ‌ర‌ణించిన రోజు. వైఎస్ 12వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న స‌తీమ‌ణి, వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ హైద‌రాబాద్‌లో సంస్మ‌ర‌ణ స‌భ‌ ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేత‌ల్లో క‌ల‌వ‌ర‌పాటు పెంచుతోంది. వైఎస్సార్ పేరతోనే పార్టీ పెట్టుకొని.. వైఎస్‌ బొమ్మ చూపించి.. ఓట్లు దండుకొని.. ఆయ‌న పేరుతో ప‌థ‌క‌లు పెట్టి.. రాజ‌కీయం చేసే వైసీపీ నాయ‌కులు ఇప్పుడు త‌మ ప్రియ‌త‌మ నేత‌, దివంగ‌త రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వ‌ర్ధంతికి వెళ్లాలా? వ‌ద్దా? అని తేల్చుకోలేని దుస్థితిలో ఉండ‌టం శోచ‌నీయం. ఇంత‌కీ వారికి అంత ఇబ్బంది ఏమొచ్చింది? విజ‌య‌మ్మ నిర్వ‌హించే వైఎస్సార్ వర్ధంతికి వెళితే స‌మ‌స్యేంటి? వైసీపీ నేత‌ల‌కు వ‌చ్చిన ఇర‌కాట‌మేంటి? ఎందుకో ఏమో కానీ.. ఇన్నేళ్లూ ఇడుపుల‌పాయ‌లో వైఎస్ స‌మాధికి దండేసి.. బొకే ఉంచి.. కాసేపు ప్రేయ‌ర్ చేసి స‌రిపెట్టే విజ‌య‌మ్మ‌.. ఈసారి మాత్రం అనూహ్యంగా వైఎస్సార్ సంస్మ‌ర‌ణ స‌భ అంటూ పెద్ద ప్రోగ్రామే కండెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా అట్ట‌హాసంగా ఎందుకు స‌భ పెడుతున్నారో ఆమెకే తెలియాలి. వ‌ర్థంతి స‌భ‌కు ప్ర‌స్తుతం వివిధ పార్టీల్లో ఉన్న‌ ఆనాటి వైఎస్సార్ కేబినెట్ స‌హ‌చ‌రులంద‌రినీ ఆహ్వానించారు. ఇన్విటేష‌న్ అందుకున్న వారిలో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లో ఉన్న ప‌లువురు కీల‌క నేత‌లు ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ప‌రిణామం అంద‌రికంటే వైసీపీ నేత‌ల‌కే మ‌రింత ఇబ్బందిగా మారిందంటున్నారు. జ‌గ‌న్‌-ష‌ర్మిల మ‌ధ్య‌ విభేదాలు వ‌చ్చి.. చెల్లి అలిగి అత్తగారి రాష్ట్రానికి వెళ్లిపోయింది. అక్క‌డ వైఎస్సార్‌టీపీ పేరుతో వేరు కుంప‌టి పెట్టుకుంది. విజ‌య‌మ్మ కూతురికే  స‌పోర్ట్‌గా ఆమెకు ద‌న్నుగా నిలిచింది. త‌ల్లి-చెల్లి లేని ఒంట‌రి ప‌క్షిగా మిగిలారు జ‌గ‌న‌న్న‌. ఇటీవ‌ల ఇడుపుల‌పాయ‌లో వైఎస్సార్ జ‌యంతికీ ప‌ర‌స్ప‌రం ముఖాలు చూసుకోలేనంత వైరం పెరిగింద‌ని అంటున్నారు. అలాంటిది వైఎస్సార్ పేరుతో విజ‌య‌మ్మ నిర్వ‌హిస్తున్న సంస్మ‌ర‌ణ స‌భ‌కి జ‌గ‌న్ వ‌స్తారా? రారా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. వ‌స్తే కుటుంబ‌మంతా ఒక్క‌టే.. ఇప్ప‌టిదాకా ఆడిందంతా ఫ్యామిలీ డ్రామా అని తేలిపోతుంది. రాక‌పోతే.. తండ్రి పేరు మీద‌ త‌ల్లి నిర్వ‌హించిన‌ స‌భ‌కు.. జ‌గ‌న్ రాలేద‌ని అంతా ఆడిపోసుకుంటారు. వైఎస్ బొమ్మ‌తో ఓట్లు దండుకొని.. ఇప్పుడు తండ్రి సంస్మ‌ర‌ణ స‌భ‌కే వెళ్ల‌ని సుపుత్రుడ‌ని అబాసుపాల‌వుతారు. వెళితే ఒక ప్రాబ్ల‌మ్‌.. వెళ్ల‌క‌పోతే మ‌రింత ఇర‌కాటం. ఇలా జ‌గ‌న్ ప‌రిస్థితి అడ‌క‌త్త‌ర‌లో పోక‌చెక్క‌లా మారిందంటున్నారు. అయితే.. ఇంత‌కీ ఆ స‌భ‌కు జ‌గ‌న్‌కు ఇన్విటేష‌న్ ఇంకా రాలేద‌ని.. అస‌లు వ‌స్తుందో రాదో కూడా తెలీద‌ని చెబుతుండ‌టం మ‌రింత ఆస‌క్తిక‌రం.  జ‌గ‌న్ మేట‌ర్ ప‌క్క‌న‌పెడితే.. ప‌లువురు వైసీపీ నేత‌ల‌కు మాత్రం ఆహ్వానాలు అందాయి. మ‌రి, వారైనా వెళ‌తారా? లేదా? అంటే ఏమో అనే సందేహం. వెళితే జ‌గ‌న్ ఏమ‌నుకుంటారో.. వెళ్ల‌క‌పోతే విజ‌య‌మ్మ‌, వైఎస్ అభిమానులు ఏమ‌నుకుంటారో.. ఇలా వైఎస్సార్ స‌భ వైసీపీ నేత‌లకు కొత్త త‌ల‌నొప్పులు తీసుకొస్తుంద‌ని అంటున్నారు. అయితే, ఇప్ప‌టికైతే జ‌స్ట్ ఎస్ఎంఎస్‌లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని.. విజ‌య‌ల‌క్ష్మి నేరుగా పిలిస్తే అప్పుడు చూడొచ్చ‌ని అనుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేరే పార్టీల్లో ఉన్న ప‌లువురు నేత‌లు ఆహ్వానాలు అందుకున్నా.. ఆ స‌భ‌కు వెళ్ల‌డంపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అంటున్నారు. వాళ్లు వెళ్లినా వెళ్ల‌క‌పోయినా పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌దు కానీ.. వైసీపీ నేత‌లే ఏం చేసినా అది వారికి ఏదో ఒక‌ర‌కంగా ఇబ్బందిక‌రంగా మారొచ్చు. విజ‌య‌మ్మ భ‌లే ఫిట్టింగ్ పెట్టిందిలే అని తెగ ఇదైపోతున్నార‌ట వారంతా.   

తొడలు చరుస్తున్న తెలంగాణ రాజకీయం.. తిట్లు వచ్చినోడిదే రాజ్యం! 

ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సవాళ్ల అధ్యాయం నడుస్తోంది. మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ళు, ప్రతి ససవాళ్ళ ప్రహసనం ఒకటి రంజుగా సాగుతోంది. ఈ సవాళ్ల వ్యవహారం ఒక విధంగా  రాజకీయ భాషను మార్చి వేసింది. బూతు పురాణం స్త్యైకి దిగజార్చింది. ఇంతవరకు ఎపీలోనే ఉన్నారనుకున్న బూతు మంత్రులు తెలంగాణలోనూ తక్కువ కాదని  మంత్రి మల్లా రెడ్డి నిరుపించారు.    అసలే హుజూరాబాద్ ఉప ఎన్నిక కాకమీదున్న తెలంగాణ రాజకీయం ఈ సవాళ్లతో మరింత  వేడెక్కింది. మంత్రి మల్లారెడ్డి భూఆక్రమణలను పీసీసీ  చీఫ్ రేవంత్ రెడ్డి  బయట పెట్టారు. మంత్రి మళ్ళా రెడ్డి కబ్జాకోరని రేవంత్ రెడ్డి ఆరోపించారు.రేవంత్ రెడ్డి విమర్శలకు ఘాటుగా స్పందించిన మల్లారెడ్డి, బూతు పురాణం ఎత్తుకున్నారు. ఇద్దరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామని.. దమ్ముంటే రాజీనామా చేయాలని తొడగొట్టి మరీ సవాలు విసిరారు. మరో వంక, ఈ వివాదంలో వేలు పెట్టిన మంత్రి కేటీఆర్ మల్లారెడ్డికి అండగా నిలిచారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోని వాళ్లు ఆయనకే వాళ్లు విసురుతున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇలా రేవంత్, మాలల రెడ్డి మధ్య సవాలుగా మొదలైన, సవాళ్ల ప్రహసనం అనేక మలుపులు తిరుగుతోంది.  ఆ ప్రహసనం అలా నడుస్తుండగానే, మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్, మరో  సవాల్ గోలకు తెర తీశారు. ఈటల ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు కు జాయింట్ గా  సవాల్‌ విసిరారు. దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేదా మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్  బరిలో దిగాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కేసీఆర్ లేదా హరీష్ రావు (ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తే వారు) గెలిస్తే.. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని.. తాను గెలిస్తే  కేసీఆర్, హరీష్ తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని ఈటల సవాల్ విసిరారు. అయితే ఈటల సవాలుకు అటు నుంచి స్పందన లేదు కానీ, ఊరుకుంటారని అనుకోలేము. అలాగే 2001లో  తెరాస ఆవిర్భావం నాటికి తన ఆస్తులు ఎన్నో చెబుతానని.. సీఎం కేసీఆర్‌ కూడా చెప్పాలని ఈటల మరో సవాల్‌  కూడా యాడ్ చేశారు. ఇక ఈకథ ఎటు సాగుతుందో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడవలసిందే.   రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు పత్రికల పతాక శీర్షికలకు, మీడియా కాలక్షేపానికి పనికొస్తాయే కానీ, అంతకు మించి ఇంకేదో జరుగుతుందని అనుకోలేము.ఆశించ కూడదు. గతంలోనూ ఇంతకంటే, గొప్ప నాయకులే ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకున్నారు. కానీ, కట్టుబడిన ఇష్యూని ఒక లాజికల్ కంక్లూజన్’కు తీసుకు పోయిన సందర్భం ఎక్కడా ఒక్కటి కూడా లేదు. అంతే కాదు, ఈ సవాళ్ళ పర్వం ఇంతటితో అయిపోయిందని కూడా అనుకోలేము. సో.. ఇవి కూడా అంతే..ఎన్నికల వరకు ఇలా సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వం సాగుతూనే ఉంటుంది. కొత్త నీరొచ్చి పాట నీరు కొట్టుకుపోయినట్లుగా, కొత్త సవాళ్ళు వచ్చి పాత సవాళ్ళను తుడిచేస్తాయి. అంటే కానీ, ముగింపు మాత్రం ఉండదు. ఇదొక రాజకీయ కాలుష్య ప్రవాహం .. అలా సాగుతూనే ఉంటుంది.  ఇక్కడొక చిన్న కొసమెరుపు ఏమంటే, ‘మాట తప్పం, మడమ తిప్పం’ అనే  ట్యాగ్లైన్ తగిలించుకున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై టీడీపీ జాతీయ కార్యదర్శి, నారా లోకేష్ .. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా విసిరిన సవాలుకు ఇంత వరకు స్పందన వచ్చిందే లేదు.  

తాగినోడికి తాగినంత‌.. స‌ర్కారుకు అప్పు మీద అప్పు ముట్టేంత‌!

90ml సీసాలు తీసుకొచ్చి మందుబాబుల‌కు బాగా కంఫర్ట్ క‌లిగిస్తోంది ఏపీ స‌ర్కారు. ఎంచ‌క్కా చాటుగా జేబులో పెట్టుకోవచ్చు. ఎవ‌రికీ క‌నిపించ‌దు. ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దు. మొబైల్ కంటీ ఈజీగా జేబులో స‌ర్దేసుకోవ‌చ్చు. ఎక్క‌డ కావాలంటే అక్క‌డ గుటుక్కున మింగేయ‌వ‌చ్చు. ఒకేసారి నాలుగైదు చిన్న సీసాలు కొనేసుకొని.. జేబులోనో, బ్యాగులోనో పెట్టేసుకొని.. అప్పుడింత అప్పుడింత మందేసుకోని.. రోజంతా మ‌త్తులోనే జోగొచ్చు. ఇక టిన్ బీర్ల‌తో మ‌రింత మ‌జా. క్యాన్ ప‌ట్టుకొని స్టైల్‌గా ఫోజులు కొడుతూ బీర్ సిప్ చేయొచ్చు. ప‌బ్లిక్ ముందు ఫోజులు కొట్టేందుకు ఇది మ‌రింత చ‌క్క‌ని ఛాన్స్‌. అందుకే ఇంత మంచి స‌ర్కారు ఇంకెక్క‌డైనా ఉంటుందా అని తాగుబోతులు జ‌గ‌నన్న ఫోటోను జేబులో పెట్టుకొని తిరుగుతున్నారట‌.  కాక‌పోతే మందుతాగుతున్న ప్ర‌తీసారీ అదేదో విషం తాగుతున్న‌ట్టు ఉంటోంద‌ట‌. ఊరూ-పేరు లేని ప‌నికిమాలిన స‌రుకంతా అమ్ముతుండ‌టంతో మందు గొంతు దిగ‌డం లేద‌ట‌. ఆ చెత్త మందు తాగ‌లేక‌.. తాగ‌కుండా ఉండ‌లేక‌.. సిప్పు సిప్పుకీ జ‌గ‌న‌న్న‌కి శాప‌నార్థాలు పెడుతున్నారు మందుబాబులు. అంతెందుకు, జ‌గ‌న్‌ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ సైతం మందు విష‌యానికి వ‌చ్చే స‌రికి మావోడు దెబ్బేశాడంటూ దొబ్బులు దొబ్బుతున్నారు. ఇలా మందు విష‌యంలో మ‌ద్యంప్రియుల‌ను నిలువునా మోసం చేసిన జ‌గ‌న్‌.. ఐదేళ్ల‌లో మ‌ద్య నిషేధం అని క‌ల్ల‌బొల్లి మాట‌లు చెప్పి ఏపీ ప్ర‌జ‌ల‌నూ ద‌గా చేశార‌ని మండిప‌డుతున్నారు. షాపులు త‌గ్గించి.. ధ‌ర‌లు పెంచేసి.. కాసులు దండుకుంటున్నారే త‌ప్ప‌.. మ‌ద్య నిషేధం ఊసే ఎత్త‌డం లేద‌ని తిడుతున్నారు జ‌నాలు. ఈ మ‌ద్యం దందా చాల‌ద‌న్న‌ట్టు.. లిక్క‌ర్ బిజినెస్‌నే ష్యూరిటీగా చూపించి వేల కోట్లు అప్పులు తెస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్క‌టే. ఇక అప్పుల య‌వ్వారం ఎలా సాగుతోందంటే.... ఇప్పటికే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి దొడ్డిదారిన రూ.21,500 కోట్లు అప్పు తెచ్చింది ఏపీ ప్ర‌భుత్వం. మళ్లీ మద్యం ఆదాయాన్నే నమ్ముకుని మరో 25 వేల కోట్లు బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 30 మద్యం డిపోలు ఉన్నాయి. ఇవన్నీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ పరిధిలోనివే. మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకం విధించిన ప్రభుత్వం... పది మద్యం డిపోల పరిధిలో వచ్చే ఆదాయాన్ని నేరుగా ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కార్పొరేషన్‌’ (ఏపీఎస్‌డీసీ)కి మళ్లించి.. దానిని హామీగా చూపించి రూ.21,500 కోట్ల అప్పు తెచ్చింది. అలా తెచ్చిన అప్పుతోనే సంక్షేమ ప‌థ‌కాల బండి లాగిస్తోంది. ఇలా పన్ను ఆదాయాన్ని నేరుగా ‘ఎస్ర్కో’ చేయడం రాజ్యాంగ విరుద్ధం. అస‌లు ఏపీఎస్‌డీసీ ఏర్పాటునే కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది. అలా అప్పులు తేవ‌డం తప్పని తేల్చింది. అయినా స‌ర్కారు తీరు మార‌లేదు. ఇప్పటికే పది డిపోల పరిధిలో మద్యంపై వచ్చే అదనపు ఆదాయాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు మిగిలిన 20 డిపోల ఆదాయంపై కన్నేసింది. అయితే... గతంలో నేరుగా ‘ఎస్ర్కో’ చేసి ఇరుక్కుపోవడంతో, ఇప్పుడు కొత్త దారి వెతుక్కున్న‌ట్టు తెలుస్తోంది.  కొత్త ‘స్కీమ్‌’లో భాగంగా.. నేరుగా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారానే అప్పు తెచ్చుకుంటారు. పైకి ఇందులో ఎక్కడా ప్రభుత్వ పాత్ర కనిపించదు. కానీ... అప్పు ద్వారా తెచ్చుకున్న డబ్బులు మాత్రం ప్రభుత్వానికే పోతాయని అనుమానాలున్నాయి. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ 20 డిపోల పరిధిలో మద్యంపై విధించే ఏఆర్‌ఈటీని హామీగా చూపిస్తుంది. ఈ ఖాతాలో రోజూ రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఈ మొత్తాన్ని ఏ రోజుకు ఆ రోజు తిరిగి చెల్లిస్తాం అనే హామీ ఇస్తూ రుణం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ తీసుకునే అప్పు, అంతిమంగా సర్కారు ఖాతాలోకే వెళుతుందని చెబుతున్నారు.  గత ఏడాది మార్చిలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ తీసుకున్న రూ.1400 కోట్ల క్యాష్‌ క్రెడిట్‌ లోన్‌ చెల్లించడానికే ఆ కార్పొరేషన్‌ ఆపసోపాలు పడుతోంది. ఈ రుణం కాలపరిమితి ఆరు నెలలు. దీనిని కూడా చెల్లించలేని సంస్థ... గడువులోపు రూ.1400 కట్టేసి, మళ్లీ మరుసటి రోజునే అంతే మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. అలాంటిది దీనిని నమ్మి రూ.25 వేల కోట్లు అప్పు ఇచ్చేందుకు ఏ బ్యాంకు ముందుకు వస్తుందో? కేంద్రం షంటింగ్స్‌తో ఏపీకి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ బ్యాంకులు ‘ఓకే’ చెప్పగానే.. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చుకొనే ఏర్పాట్ల‌లో ఉంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. ఇలా మ‌ద్యం ఆదాయం మీద‌నే ప్ర‌భుత్వ మ‌నుగ‌డ ఆధార‌ప‌డి ఉన్న‌ప్పుడు.. ఇక సంపూర్ణ మ‌ద్య నిషేధం హామీ బీరు పొంగులా కారి పోయిన‌ట్టేనా?  

స్కూల్ కు రావాలని బలవంతపెట్టొద్దు.. గురుకులాలు, హాస్టళ్లు తెరవొద్దు!

తెలంగాణలో స్కూళ్లను తెరవడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్ కు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గురుకులాలు, హాస్టళ్లను తెరవొద్దని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా కేసులు తగ్గకపోయినా పాఠశాలలను రీ ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ఆన్‌లైన్‌, ప్రత్యక్ష బోధనపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారంలోపు మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని సూచించింది.   గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఇంకా కొవిడ్‌ తీవ్రత కొనసాగుతోందని చెప్పింది. సెప్టెంబరు-అక్టోబరులో కొవిడ్‌ మూడో దశ ముప్పు హెచ్చరికలు.. మరోవైపు విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలూ ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటినీ సమన్వయం చేసి చూడాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 4కి వాయిదా వేసింది.   కోర్టులో వాదనల సందర్భంగా అన్ని వైద్య సదుపాయాలు ఉన్న అమెరికాలో రోజుకి లక్ష కేసులు పెరుగుతున్నాయని పిటిషనర్ తరపు లాయర్ చెప్పారు. భారతదేశంలో  వైద్య సదుపాయాలు లేవని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. చిన్నపిల్లలను పాఠశాలకు పంపే ముందు తల్లిదండ్రులు అండర్ టేకింగ్ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తుయని  పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరుపన వాదనలు వినిపించిన ఏజీ.. UNICEF పాఠశాల తప్పనిసరిగా ఓపెన్ చేయాలి అని చెప్పిందన్నారు. చాలా మంది స్కూల్లో న్యూట్రిషన్ ఫుడ్ మిస్ అవుతున్నారని కోర్టుకు తెలిపారు. స్కూల్లో ఆహార సరఫరా పై డీఈఓ నేతృత్వంలో  పర్యవేక్షణలో చేస్తామన్నారు ఏజీ.  ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ అక్టోబర్ లో కోవిడ్ తీవ్రస్థాయిలో వినిపిస్తుందని నివేదిక అందించిన డబ్ల్యూహెచ్ఓకు ఎం చెపుతారని ప్రశ్నించింది.కోవిడ్ టీకా పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.. అది డిసెంబర్లో పూర్తి చేస్తారని అలాంటప్పుడు ఏవిధంగా వ్యాక్సిన్ లేకుండా పాఠశాలలకు ప్రవేశాన్ని అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించింది. ఒకవేళ స్కూల్స్ లో ఉన్న పిల్లలకు ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు అన్న హైకోర్టు.. చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు అలాంటప్పుడు అటువంటి పరిస్థితి లో పాఠశాలల మేనేజ్మెంట్ వారి భరిస్తుందా అని నిలదీసింది. పిల్లలను స్కూల్స్ కు పంపకపోతే తల్లిదండ్రుల పైన ఏమైనా చర్యలు తీసుకునే అధికారం మీకు ఉందా అని ప్రశ్నించింది హైకోర్టు.   

బ్రేకింగ్ న్యూస్‌.. యువ‌తి గొంతు కోసిన ఉన్మాది..

తెలుగు రాష్ట్రాల్లో ఉన్మాదుల ఆగ‌డాలు అస‌లేమాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌తో అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. క‌ఠిన చ‌ట్టాలు, వేగంగా శిక్ష‌లు ప‌డ‌క‌పోవ‌డ‌మే ఈ బ‌రితెగింపున‌కు కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మొన్న‌టికి మొన్న తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్ ఇంటి స‌మీపంలో యువ‌తిపై అత్యా*చారం జ‌రిగినా ఇప్ప‌టికీ మ‌రో నిందితుడిని ప‌ట్టుకోలేక పోయారు పోలీసులు. ఆ త‌ర్వాత గుంటూరు, విజ‌య‌న‌గ‌రం లాంటి మ‌రిన్ని దారుణ ఘ‌ట‌న‌లు ఏపీలో భ‌యాందోళ‌న‌లు రేపాయి. ఏపీతో పోటీనా అన్న‌ట్టు తెలంగాణ‌లోనూ దారుణం జ‌రిగింది. ఓ యువ‌తిపై ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు ఓ దుర్మార్గుడు.  కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్పుర కాలనీలో ఉండే యువతి ఇంట్లోకి ఓ దుండ‌గుడు ప్ర‌వేశించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి.. ఆ ఇంట్లో ఉన్న యువ‌తి గొంతు కోసాడు. కుటుంబీకులు తెరుకునేలోగా ఆ ఉన్మాది అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ‌చ్చింది ఎవ‌రు? ఎందుకు ఆమెపై దాడి చేశాడు?  తెలిసిన వాడేనా? అఘంతుకుడా? అనే వివ‌రాలు ఆరా తీస్తున్నారు పోలీసులు.   

కారు ప్ర‌మాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడ‌లు దుర్మ‌ర‌ణం..

బెంగళూరులో ఘోర కారు ప్రమాదం జరిగింది. ఓ కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంట‌నే మంట‌లు చెల‌రేగాయి. ఘ‌ట‌న‌లో కారు నుజ్జునుజ్జు అయింది. ముందు, వెనుక సీట్ల‌లో ఉన్న‌వారంతా విఘ‌త‌జీవులుగా మారారు. ప్ర‌మాదంలో మొత్తం ఏడుగురు చ‌నిపోయారు. ఆరుగులు స్పాట్‌లోనే చ‌నిపోగా.. మ‌రొక‌రు హాస్పిట‌ల్‌లో మృతి చెందారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.   చ‌నిపోయిన వారిలో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాశ్‌ కుమారుడు కరుణసాగర్‌, కోడలు బిందు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు చనిపోయారు. బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ ప్ర‌మాదంతో త‌మిళ‌నాట విషాదం నెల‌కొంది. 

ఈడీ కార్యాలయంలో పూరి జగన్నాథ్.. డ్రగ్స్ కేసులో ఏం జరగనుందో? 

తెలుగు రాష్ట్రాల్లో సంచనం స్పష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నాలుగేండ్ల క్రితం వెలుగుచూసిన డ్రగ్స్ కేసు.. సిట్ విచారణ తర్వాత తుస్సుమంది. తాజాగా ఈడీ ఎంట్రీతో కేసులో మళ్లీ విచారణ ప్రారంభమైంది. విచారణకు రావాలని ఈడీ 12 మంది సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 22 వరకు ఈడీ విచారణ కొనసాగనున్నది. తొలి రోజు మంగళవారం నాటి విచారణకు దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.  ఉదయం 10.30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా... 10.05 గంటలకే  వచ్చేశారు పూరి జగన్నాథ్. ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా... పూరీ జగన్నాథ్ స్పందించలేదు. కారు దిగిన వెంటనే నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. ఈడీ సిబ్బంది ఆయనను మెట్లపై నుంచి పైకి తీసుకెళ్లారు. పూరి తో పాటు ఆయన కుమారుడు ఆకాష్,  సీఏ ( చార్టెడ్ అకౌంటెట్ )లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. మనీలాండరింగ్ తో పాటు ఇతర విషయాలపై కూడా పూరీని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించనున్నారు ఈడీ అధికారులు. డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కీలక అంశాల పై ప్రశ్నించనున్నారు.  అక్టోబర్​ 2న చార్మీ కౌర్, 6న రకుల్​ప్రీత్​సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్​ క్లబ్​ జనరల్ మేనేజర్, 15న ముమైత్​ఖాన్, 17న తనీష్​, 20న నందు, 22న తరుణ్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. డ్రగ్స్ కొనుగోలుకు డబ్బులను అక్రమమార్గంలో విదేశాలకు తరలించినట్లు అనుమానిస్తున్న మరో 50 మందికి కూడా ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.  మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులకు ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది.  ఈ కేసులో సిట్ బృందానికి నేతృత్వం వహించిన ఎక్సైజ్ అధికారి శీలం శ్రీనివాస్ రావు సోమవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. కేసు దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఆయన ఈడీ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది. తమ విచారణకు హాజరుకావాలని మరికొందరు ఆబ్కారీ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంలో భారీ ఎత్తున నల్లధనం చేతులు మారినట్లు వెల్లడైనా ఎందుకు నిర్లక్ష్యం వహించారన్న విషయంపై ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో  ఎక్సైజ్ అధికారులు 12 కేసులు నమోదు చేసి 11 ఛార్జీషీట్లు దాఖలు చేశారు. అయితే అందులో ఎక్కడా గతంలో విచారణను ఎదుర్కొన్న సినీతారల పేర్లు లేవు. సినీ తారలతో పాటు మొత్తం 62 మంది అనుమానితుల నుంచి వెంట్రుకలు, గోర్లు, రక్తం నమూనాలను సేకరించి ఫోరెన్సిక్​ల్యాబ్ కు పంపినప్పటికీ పరిశీలనలో ఏమి తేలిందనే విషయాన్ని ఇప్పటికీ గోప్యంగా ఉంచారు. డ్రగ్​ స్మగ్లర్లు కెల్విన్, రాఫెల్​ ఎలెక్స్​ముఠాలను అరెస్ట్​చేశారు. కానీ లోతైన దర్యాప్తు చేయకుండా చేతులు దులుపుకున్నారు. ఆ సమయంలో ఎక్త్సెజ్​ కమిషనర్ గా​ అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. ఆ తర్వాత ‘ఫోరమ్ ​ఫర్​ గుడ్​ గవర్నెన్స్ ’వంటి సంస్థల ఆందోళన,​ కోర్టు జోక్యంతో డ్రగ్స్​ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగడం ఆబ్కారీ శాఖకు సంకటంగా మారింది.   

కేసీఆర్ కు రేవంత్ బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి తుమ్మల? 

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందా? కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణమాలు, అధికార పార్టీ నేతల కదలికలను బట్టి.. త్వరలో కారుకు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ ఆపరేషన్ అనుకున్నదానికంటే సక్సెస్ అవుతుందని, త్వరలోనే కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారని గాంధీభవన్ వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నారు.  విప్లవాల గడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచే రేవంత్ రెడ్డి యాక్షన్ మొదలుపెట్టారట. రేవంత్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో .. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా జిల్లాను శాసించిన తుమ్మల.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. పాలేరులో తుమ్మలపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల మరింత బలహీనమయ్యారు. నియోజకవర్గంలో తుమ్మల ప్రాబల్యం తగ్గించేందుకు ఉపేందర్ రెడ్డి ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా మంత్రి పువ్వాడ కూడా తుమ్మలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ తీరుపై కొన్ని రోజులుగా తుమ్మల గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సమావేశాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.  మరోవైపు జిల్లాలో అధికారపార్టీ పై అసమ్మతి పెరుగుతుండటం, ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ కనిపించడంతో..  తుమ్మల నాగేశ్వరరావు  కూడా కాంగ్రెస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తుమ్మలతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని, ఆయన కూడా అంగీకరించారని చెబుతున్నారు. త్వరలోనే అధికారికంగా తుమ్మల తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పాలేరులో జరిగిన ఓ సభలో మాట్లాడిన తుమ్మల తనయుడు.. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తీరుపైనా విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవడం వల్లే తుమ్మల తనయుడు ఆ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.   టీడీపీ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మంలో పోటీ చేసిన తుమ్మల పువ్వాడ అజయ్ పై ఓడిపోయారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పట్టున్న తుమ్మలను టీఆర్ఎస్‌లోకి పిలిచి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని అప్పజెప్పారు. అనంతరం మంత్రిగా జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక పాత్రపోషిస్తూ జిల్లాకు సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులు తెచ్చిపెట్టారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు తుమ్మల నాగేశ్వరరావు. అయితే 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా కారు హవా వీచినా.. పాలేరులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తరువాత పార్టీలో కూడా తన స్థాయికి తగ్గ గుర్తింపు లేకపోవడంతో ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు తుమ్మల.  మళ్ళీ పాలేరు నుండి నిలబడ్డ ఆయన ఓటమి పాలవడం నాటినుంచి నేటి వరకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన పార్టీ మారుతారు అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తుమ్మల కాంగ్రెస్ లో చేరితో ఖమ్మం జిల్లాలో కారు స్పీడ్ కు బ్రేకులు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

గద్దర్ కు దళిత బంధు బాధ్యతలు? టీఆర్ఎస్ నేతల మంతనాలు..

తెలంగాణ రాజకీయాలు గతంలో ఎప్పుడు లేనంతగా వేడెక్కాయి. కాంగ్రెస్ దళిత గిరిజన దండోరాలతో స్పీడ్ పెంచింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అధికార పార్టీ దళిత బంధు స్కీం తీసుకొచ్చింది. త్వరలో మరిన్ని బంధులు తెస్తామని చెబుతున్నారు సీఎం కేసీఆర్. పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిల కూడా జిల్లాలు చుట్టేస్తున్నారు. అన్ని పార్టీల లక్ష్యం హుజురాబాద్ అసెంబ్లీ  ఉప ఎన్నిక చుట్టే సాగుతోంది.  తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. నాయకుల వలసలు కూడా జోరందుకున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలను ప్రభావితం చేసే నేతలను తమ బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. ఇందులో భాగంగానే  ప్రజా గాయకుడు గద్దర్‌పై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. అల్వాల్ భూదేవినగర్‌లోని నివాసంలో గద్దర్‌తో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చర్చలు జరిపారు. దాదాపు గంటకు పైగా వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే టీఆర్ఎస్ నేతలు గద్దర్ చర్చలు జరిపారని తెలుస్తోంది.  హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంతో గద్దర్‌తో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని, ఈ ప్రతిష్టాత్మక పథకంతో ఎంతో మంది పేద దళితులకు ప్రయోజనం చేకూరుతుందని వారు గద్దర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం కోసం మద్దతు ఇవ్వాలని ఆయన్ను కోరినట్లు సమాచారం. అంతేకాదు దళిత బంధు బాధ్యతలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ మాటగా గద్దర్ కు మంత్రి కొప్పుల ఆశ్వర్ చెప్పారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ ప్రతిపాదనపై గద్దర్‌ ఇంకా  హామీ ఇవ్వలేదన చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనపై గద్దర్ సానుకూలంగా స్పందిస్తారనే ఆశతోనే ఉన్నారు.  గద్దర్ తో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపాడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో గద్దర్ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా  తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులపై చర్చించడానికి తనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరారు. కిషన్ రెడ్డితో భేటీ అయిన కొన్ని రోజుల్లోనే.. టీఆర్ఎస్‌ నేతలు గద్దర్‌తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డితో రాజకీయాలపైనా గద్దర్ చర్చించారనే సమాచారం టీఆర్ఎస్ పెద్దలకు వచ్చిందట. హుజూరాబాద్ ఎన్నికల్లో గద్దర్ బీజేపీకి మద్దతు తెలిపితే.. టీఆర్ఎస్‌కు ఇబ్బందులు వస్తాయని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే అప్రమత్తమై.. గద్దర్‌ మద్దతు కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సీఎం కేసీఆర్ పంపించారనే ప్రచారం జరుగుతోంది.  మొత్తానికి విప్లవ భావజాలమున్న గద్దర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలవడం... టీఆర్ఎస్ నేతలు ఆయనతో మంతనాలు సాగించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లీకులు వస్తున్నట్లుగా దళిత బంధు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం కోరితే.. అందుకు గద్దర్ ఓకె చెబుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ నేతలతో గద్దర్ ఎలా వ్యవహరించబోతున్నారన్నది కూడా చర్చగా మారింది. 

వాళ్లను పాకిస్తాన్ పంపిస్తాం.. కమలం నేతల కామెంట్లతో కలకలం 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర రాజకీయ కాక రాజేస్తోంది. ప్రజా సంగ్రామ్ యాత్రలో భాగంగా తొలి మూడు రోజులు హైదరాబాద్ లోనే పాదయాత్ర చేశారు సంజయ్. అది కూడా ఓల్జ్ సిటీలోనే ఆయన యాత్ర సాగింది. తొలి రోజు చార్మినార్ పరిధిలో సంజయ్ పర్యటించగా.. రెండవరోజు గోల్కోండలో సభ నిర్వహించారు. పాతబస్తీలో సాగిన బండి యాత్ర పోలీసులకు టెన్షన్ పుట్టించింది. ఇక పాతబస్తీలో జరిగిన పలు సభల్లో ప్రసంగించిన బండి సంజయ్ ఉద్వేగ ప్రసంగాలు చేశారు.  గోల్కోండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు బండి సంజయ్. హైదరాబాద్ పేరును మారుస్తామని మరోసారి ప్రకటించారు బండి సంజయ్. అంతేకాదు నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ వెనుక రహస్యం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తోందని బండి సంజయ్‌ మండిపడ్డారు.   బండి సంజయ్ పాదయాత్రలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంఐఎం పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఐఎం దొంగలను పాకిస్థాన్ కు పంపిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దెబ్బకు ఎంఐఎం నేతలు ఇప్పటికే జనగణమన పాడుతున్నారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం వత్తాసు పలుకుతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని... అప్పుడు ఏం చేస్తారో ఎంఐఎం నేతలు ఇప్పుడే చెప్పాలని అన్నారు. పాతబస్తీలో చార్మినార్ వద్ద సభ పెట్టామని... ఎవరూ ఏమీ చేయలేకపోయారని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని రాజాసింగ్ అన్నారు.

పీకేకు పరిటాల గుండు కొట్టించారా? చేసిందెవ‌రు? చేయించిందెవ‌రు?

అది టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయం. చంద్రబాబు నాయుడు దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా జేజేలు అందుకుంటున్న రోజులు.. చంద్రబాబుకు అంతర్జాతీయంగా ఇమేజ్ వస్తున్న కాలం.. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఓ రేంజ్ లో వెలిగిపోతున్నారు. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సూపర్ డూపర్ సినిమాలతో టాలీవుడ్ ను ఊపేస్తున్నారు. అప్పుడు చిరంజీవి ఎక్కడికెళ్లినా లక్షలాది మంది జనం వచ్చేవారు. రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేసేవారు.  ఆ సమయంలోనే  2004 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2003లో ఓ బాంబ్ లాంటి వార్త వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, కీలక నేతగా ఉన్న ఓ నేతకు.. సినిమాల్లో సూపర్ హిట్లు కొడుతున్న మెగా ఫ్యామిలీకి  మధ్య గొడవ జరిగినట్లుగా వచ్చిందా వార్త. కాంగ్రెస్ పార్టీకి కరపత్రంగా ఉండే అప్పటి రాజ్యసభ సభ్యులు తిక్కవరపు వెంకట్రామిరెడ్డికి చెందిన  డెక్కన్ క్రానికల్ పత్రిక.. మంచి మసాలా దట్టించి ప్రచురించింది ఆ కథనాన్ని. మెగా కుటుంబానికి  చెందిన హీరో ప‌వ‌న్‌ కల్యాణ్‌కు మంత్రి ప‌రిటాల ర‌వి గుండు కొట్టించార‌న్న ఆ వార్త.. అప్పట్లో సంచలనమైంది.  పరిటాల రవి పేరు చెబితేనే అప్పుడు అంతా గజగజలాడేవారు. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయారు పరిటాల. పేదల పాలిట పెన్నిదిగా ఎదిగారు. పీపుల్స్ వార్ భావజాలంతో ఎదిగిన పరిటాల రవి.. పేదల కోసమే పని చేశారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడారు. అందుకే ఆయనకు లక్షలాది మంది మద్దతుగా నిలిచారు. జనాల గుండెల్లో పరిటాల ఎంతగా నిలిచిపోయారంటే.. ఆయన హత్యకు గురై 16 ఏండ్లు అవుతున్నా.. ఇప్పటికి ఆయన జయంతి, వర్థంతి రోజున వెంకటాపురంలోని ఆయన సమాధి వద్దకు లక్షలాది మంది స్వచ్ఛందంగా వచ్చి నివాళులు అర్పిస్తారు. రాబిన్ హుడ్ లా ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన పరిటాల రవికి.. మెగా హీరో కుటుంబానికి గొడవ ఉందన్నట్లుగా వచ్చిన ఆ డెక్కన్ క్రానికల్ కథనం పెను సంచలనమైంది. రాజకీయాలను షేక్ చేసింది.  ఇంత‌కీ ఆనాడు అస‌లేం జ‌రిగింది? పీకేకు ప‌రిటాల ర‌వి గుండు కొట్టించారా? ఎందుకు కొట్టించారు? వారిద్ద‌రికీ గొడ‌వ జ‌రిగిన మాట నిజ‌మేనా? అనుకోకుండా అలా ర‌చ్చ జ‌రిగిందా? లేక‌  కావాల‌నే వివాదం సృష్టించారా? ఇంత‌కీ ఆ ప్రొప‌గాండ చేసిన వారి టార్గెట్ ప‌వ‌న్‌క‌ల్యాణా? ప‌రిటాల ర‌వినా? లేక‌, చంద్ర‌బాబు నాయుడా? అప్ప‌టి ఇంట్రెస్టింగ్ పొలిటిక‌ల్ లిటిగేష‌న్.. ప‌రిటాల ర‌వి జ‌యంతి సంద‌ర్భంగా మ‌రోసారి ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. మెగాస్టార్ చిరంజీవీతో పాటు 2003లో వ‌రుస హిట్స్‌తో మాంచి ఊపు మీదున్నారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. స‌డెన్‌గా ఓ రోజు టీవీల్లో థ‌మ్స్అప్ యాడ్‌లో గుండుతో క‌నిపించారు పీకే. అంతే ఒక్క‌సారిగా అంతా షాక్‌. అదేంటి.. ప‌వ‌ర్ స్టార్ ఏంటి.. గుండు చేయించుకోవ‌డం ఏంట‌ని అంతా అవాక్క‌య్యారు. క‌ట్ చేస్తే.. ప‌రిటాల ర‌వితో ప‌వ‌న్‌క‌ల్యాణ్ గొడ‌వ ప‌డ్డార‌ని.. అందుకే ప‌రిటాల పీకేకి గొండు కొట్టించార‌ని.. ఆ గుండు ర‌వి చేయించిందేనంటూ డెక్కన్ క్రానికల్ లో  కొన్ని రోజుల తర్వాత వార్త వ‌చ్చింది. ప‌రిటాల‌-చిరంజీవి మ‌ధ్య ఓ ల్యాండ్ మేట‌ర్‌లో వివాదం నెల‌కొన‌గా.. పీకే జోక్యంతో విష‌యం గుండు వ‌ర‌కూ దారి తీసిందంటూ.. దిట్టంగా మ‌సాలా ద‌ట్టించి.. వండి వార్చింది. ఆ న్యూస్‌తో అంతా షేక్‌. పీకే గుండుకంటే.. క‌ల్యాణ్‌బాబును ప‌రిటాల ర‌వి కొట్టించాడ‌ని, గుండు కూడా చేయించాడ‌నే న్యూస్ తెగ వైర‌ల్ అయింది. యావ‌త్ రాష్ట్రాన్ని షేక్ చేసింది. ఏళ్ల త‌ర‌బ‌డి ఆ టాపిక్‌పై చ‌ర్చ..ర‌చ్చ‌ జ‌రిగింది.  ప‌వ‌న్‌క‌ల్యాణ్  ఆనాటి గుండు ఎపిసోడ్‌పై పరిటాల రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. పవన్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కాని నిజం కంటే అబద్దాన్నే జనాలు తొందరకు నమ్మేస్తారన్నట్లుగా.. పీకే గుండు విషయంలోనూ అబద్దమే ఎక్కుగా ప్రచారమైంది. ఆ తర్వాత ఆ గుండు మేట‌ర్ వెనుక అస‌లు సూత్ర‌ధారి, పాత్ర‌ధారి వేరే ఉన్నార‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదంతా అప్పటి కాంగ్రెస్ నేతలు.. పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీ మీద, చంద్ర‌బాబు మీద చేయించిన‌ కుట్ర‌, కుతంత్ర‌మ‌న్న సంగ‌తి తేలింది.  పరిటాల రవీంద్ర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన కమ్మ కులానికి చెందిన వారు కాగా.. పవన్ కల్యాణ్ కాపు కులానికి చెందిన వారు. 1988లో జరిగిన వంగవీటి హత్య తర్వాత కాపులంతా టీడీపీకి దూరమయ్యారు. నిజానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత కాపులంతా ఆయన వెంటే నిలిచారు. కాపుల సంపూర్ణ మద్దతు వల్లే 1983,85లో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. అందుకే టీడీపీకి కాపులను దూరం చేయాలనే కుట్రలో భాగంగానే వంగావీటి రంగా హత్య జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కుట్రలో భాగంగానే 1988 తరహాలోనే  రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య కక్షలు భగ్గుమనేలా చేయాలనే కుట్రలో భాగంగానే .. ప‌వ‌న్‌ కల్యాణ్‌కు మంత్రి ప‌రిటాల ర‌వి గుండు కొట్టించార‌నే కథనాన్ని అప్పుడు కాంగ్రెస్ ఎంపీకగా ఉన్న వెంకట్రామిరెడ్డికి చెందిన డెక్కన్ క్రానికల్ లో ప్రచురించారు.   1988  టీడీపీకి దూర‌మైన కాపులు.. నిజం తెలుసుకున్న తర్వాత  1994 ఎన్నికల్లో మళ్లీ టీడీపీకి మద్దతుగా వచ్చారు. 1995లో చంద్ర‌బాబు సీఎం అయ్యాక..  సీబీఎన్ ప‌రిపాల‌న‌ ద‌క్ష‌త చూసి.. కాపు వ‌ర్గం టీడీపీకి బ‌ల‌మైన‌ మ‌ద్ద‌తుదారులుగా మారారు. ఆ అభిమానం అలా కొన‌సాగుతూనే వ‌చ్చింది. దీంతో టీడీపీకి ద‌న్నుగా ఉన్న కాపుల‌ను ఆ పార్టీ నుంచి దూరం చేయాల‌ని క‌న్నింగ్ స్కెచ్ వేశార‌ట అప్పటి కాంగ్రెస్ నేతలు. అందుకు పావుగా..  అప్పుడు సినిమాల్లో మంచి హిట్ లు కొడుతున్న.. కాపుల‌కు రోల్‌మోడ‌ల్‌గా ఉన్న మెగా ఫ్యామిలీని వారి ప్ర‌మేయం లేకుండానే వాడేసుకున్నారని తెలుస్తోంది. టీడీపీ వారికి, మెగా బ్ర‌ద‌ర్స్‌కు గొడ‌వ‌లున్నాయ‌నే ప్ర‌చారం రేపి.. కాపులను తెలుగుదేశానికి దూరం చేయాల‌నే ప‌న్నాగం ప‌న్నార‌ట‌. అందులో భాగంగా.. గ‌తంలో ఎప్పుడో గుండుతో క‌నిపించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను.. కొత్తగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారట.  అప్పటి కాంగ్రెస్ పెద్దల పక్కా ప్లాన్ లో భాగంగానే పీకే గుండుకు మ‌సి పూసి మారేడు కాయ చేశారు. ఆనాటి పీకే గుండుకు.. ప‌రిటాల ర‌వినే కార‌ణ‌మ‌ని.. లేని వివాదాన్ని కొత్త‌గా సృష్టించారు. అప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ప్ర‌స్తావించ‌ని ఆ క‌థ‌ను.. వ్యూహాత్మ‌కంగా.. త‌న ప్ర‌ధాన అనుచ‌రుడి ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నంగా వ‌చ్చేలా చేశారు. అంతా కలిసి పీకే గుండుపై అగ్గిపుల్ల గీచి.. ప‌రిటాల ర‌విపై ప‌డేశారు. ఆ మంట‌పై  కాంగ్రెస్ నేత అనుచ‌ర‌వ‌ర్గ‌మంతా త‌లా ఇంత పెట్రోల్ చ‌ల్ల‌డంతో.. అది భ‌గ్గున మండి.. పెద్ద రాజ‌కీయ ర‌చ్చే రాజుకుంది. పవన్ కు అవమానం జరిగితే.. మెగా అభిమానులైన కాపులు తమకే అవమానం జరిగినట్లుగా ఫీలై.. టీడీపీపై ర‌గిలిపోయి, ఆ పార్టీకి దూర‌మ‌వ్వాల‌నేది ఆనాటి కాంగ్రెస్ పెద్దల స్కెచ్‌. పొలిటిక‌ల్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ క‌ల్పిక అబాంఢానికి.. క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ బాధ్య‌త‌ల‌న్నీ ఆనాటి కాంగ్రెస్ పెద్దలే వ‌హించార‌ని చెబుతారు. వైఎస్సాఆర్ ప్రధాన అనుచరుడిగా ఉంటూ, మీడియాలో తెగ హడావుడి చేసే ఓ నేతే కనుసన్నల్లోనే ఇదంతా నడిచిందని అంటారు.  త‌న‌కు, ప‌రిటాల ర‌వితో ఎలాంటి గొడ‌వా లేద‌ని, త‌న గుండుకు ర‌వికి ఎలాంటి సంబంధం లేద‌ని..  2018లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్వయంగా బ‌య‌ట‌పెట్టారు. ఆ విష‌యం ప‌రిటాల సునీత‌కు పీకేనే స్వ‌యంగా వివ‌రించార‌ు. ఆగ‌స్టు 30 ప‌రిటాల ర‌వి జ‌యంతి సంద‌ర్భంగా ఆనాటి పీకే గుండు వివాదం తాజాగా చ‌ర్చ‌కొచ్చింది. రాజకీయ లబ్ది కోసమే నాయకులు.. కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి ఎలాంటి కుట్రలు చేశారో తెలుసుకోవడానికి పరిటాల రవీంద్ర, పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఉదాహరణగా నిలుస్తోంది.. 

బుర్ర లేని సచ్చు వెదవల సలహాలు.. దిక్కుమాలిన సూత్రాలన్న వైసీపీ ఎంపీ..

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట‌లు అగ్గి రాజేస్తున్నారు. ఓవైపు అమ‌రావ‌తి కోసం 600 రోజులుగా రాజ‌ధాని రైతులు ఉద్య‌మిస్తుంటే.. అక్క‌డి ద‌ళిత రైతుల‌పై బొత్స చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత క‌ల‌క‌లం రేపుతున్నాయి. స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అమ‌రావ‌తి రైతులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. తక్షణం తన వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మంత్రి మాటలతో ఆవేదన చెందామని రాజధాని దళిత రైతులు అంటున్నారు. బొత్సపై ఎస్సీ, ఎస్టీ, చీటింగ్‌ కేసు నమోదు చేయాలని దళిత జేఏసీ డిమాండ్ చేసింది. ఇక‌, మంత్రి బొత్స సత్యన్నారాయణ మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. రాజధాని అంశంలో మంత్రి బుద్ధిలేని, మతిలేని ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. బుర్ర లేని సచ్చు వెదవల సలహాలతోనే ఇలాంటి పరిస్థితులు దాపురించాయన్నారు. పనికిమాలిన, దిక్కుమాలిన సూత్రాలు చెప్పవద్దని మంత్రి బొత్సాకు సూచించారు. మంత్రి అనుకున్నట్లు రాజధాని విశాఖ వెళ్ల‌డం అయ్యే పని కాదన్నారు. రాజధాని తరలించాలంటే సుమారు రూ. 90 వేల కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని రఘురామ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని రఘురామ స్ప‌ష్టం చేశారు. మంత్రి బొత్స మాటలు పట్టించుకోవద్దని అమరావతి రైతులు, మహిళలను కోరారు. సీఎం జగన్ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా మంత్రి ఇలానే మాట్లాడుతుంటారని అన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి గేదెల కోసం స్విమ్మింగ్ పూల్స్ కట్టినట్లు ఉందని ఎంపీ ర‌ఘురామ‌ ఎద్దేవా చేశారు. 25 కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం రూ. 12 వేల కోట్లు ఇస్తే.. రాష్ట్రం మరో రూ. 6 నుంచి 7 వేల కోట్లు మార్జిన్ మనీ కలిపి ఇవ్వాలని, ఆ డబ్బుల కోసం ఎస్‌బీఐ నుంచి అప్పుగా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలా చేయడం ఎఫ్‌ఆర్‌బిఎం నిభందనలు ఉల్లంగించడమేనన్నారు. నవరత్నాలను అమలు చేస్తున్నామని చెప్పుకునేందుకు కార్పొరేషన్‌లకు నిధులు మళ్లించి ఖర్చు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రంలో ఒక ఆర్థిక మంత్రి, ఢిల్లీలో మరో ఆర్థిక మంత్రి ఉండవలసిన పరిస్ధితులు ఏర్పడ్డాయంటూ మండిప‌డ్డారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.   

డబ్బుల భోజనం.. కల్యాణ మండపాల లీజు! వివాదాలకు కేరాఫ్ గా టీటీడీ బోర్డు 

తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి శ్రీ వెంకటేశ్వరుని నిలయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమలను అతి పవిత్రంగా భావిస్తుంటారు. అయితే తిరుమల ఆలయ వ్యవహారాలు చూసే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాత్రం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఆలయానికి మచ్చ తెస్తోంది.  వైసీపీ ప్రభుత్వం వచ్చాకా గత రెండేండ్లుగా టీటీడీ పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్యమత ప్రచారం మొదలుకుని ఆలయ ప్రసాదాల వరకు అన్నింటా విమర్శలే ఎదుర్కొంది టీటీడీ బోర్డు. శ్రీవారి సన్నిధిలో వెలుగుచూస్తున్న ఘటనలపై భక్తులు ఆవేదన చెందుతున్నా టీటీడీ తీరు మాత్రం మారడం లేదు. ఇటీవలే టీటీడీ ప్రవేశపెట్టిన సంపద్రాయ భోజనంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా శ్రీవారి కల్యాణ మండపాల లీజు విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. తెలుగు రాష్ట్రాలలోని 177 కల్యాణ మండపాలను లీజుకు ఇచ్చేందుకు టీటీడీ సిద్దమైంది. దేశవ్యాప్తంగా 299 కల్యాణ మండపాలను టీటీడీ నిర్మించింది. గతంలో కల్యాణ మండపాల పరిస్థితులపై విజిలెన్స్ ఆధ్వర్యంలో టీటీడీ ఓ కమిటీని నియమించింది. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చాలా చోట్ల కల్యాణ మండపాలు నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు నివేదిక అందింది. కొన్ని ప్రాంతాల్లో కల్యాణ మండపాలో గేదలను మేపుతున్నట్లు ఫోటోలోతో విజిలెన్స్ సమాచారం ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక మేరకు ఇకపై కల్యాణ మండపాలను నిర్మించకూడదని పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలోని గత పాలకమండలి నిర్ణయం తీసుకుంది.  అయితే  వైసీపీ ప్రభుత్వం వచ్చాక  తిరిగి కల్యాణ మండపాల నిర్మాణానికివైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 5 సంవత్సరాల కాలపరిమితితో కల్యాణ మండపాలు లీజుకు ఇచ్చేందుకు టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక వైపు నూతన కల్యాణ మండపాలను నిర్మిస్తూ…. మరో వైపు నిర్మించిన కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కల్యాణ మండపాల నిర్మాణంపై నిర్దిష్టమైన విధానం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. ఇటీవల సంప్రదాయ భోజనం పథకాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో టీటీడీ వెనక్కి తగ్గింది.  డబ్బులు తీసుకుని భోజనం పెట్టాలనే నిర్ణయంపై పెద్ద యెత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టకూడదని నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ భోజనాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అన్న ప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని వైవీ సుబ్బా రెడ్డి అన్నారు. స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని ఆయన అన్నారు. పాలకమండలి లేని సమయంలో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని  చెప్పారు. తిరుమలలో నిత్య అన్నదాన్నం నిరంతరాయంగా కొనసాగుతుందని, దీంతోపాటు టీటీడీ పరిధిలో వేలం ద్వారా అనేక క్యాంటీన్ లు నడుపుతున్నారని, వాటిలో 10 బిగ్ క్యాంటీన్లు,7 జనతా క్యాంటీన్లు, 148  ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, 128 టి స్టాల్స్ నిర్వహిస్తున్నారు. వీటికిప్రతినెలా లైసెన్స్ ఫీజ్ కడుతుంటారని చెప్పింది.