ఏప్రిల్ నుంచే పెంచిన ఆస్తి పన్ను వసూల్.. జనాలకు జగన్ సర్కార్ డబుల్ షాక్
posted on Aug 27, 2021 @ 12:15PM
ఏపీ సర్కార్ మళ్లీ మాట తప్పింది. సీఎం జగన్ రెడ్డి మరోసారి మడమ తిప్పారు. ఆస్తిపన్నుపై ప్రజలకు భారీ షాకిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆస్తి పన్ను పెంపు ఉండబోదంటూ ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఎన్నికలన్ని ముగియడంతో ఇప్పుడు దొంగ దెబ్బ కొట్టింది. గతంలో పెంచాలని నిర్ణయించిన మేరకు ఆస్తి పన్ను ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తుందని నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే పట్టణ స్ధానిక సంస్ధలు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. దీంతో ఆస్తి పన్ను పెంపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం లెక్కచేయలేదని తెలుస్తోంది.
ఆస్తిపన్ను పెంపుపై ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కాని అమలు చేయలేదు. ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో వాయిదా వేస్తున్నట్లు నమ్మించింది. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనూ కొత్త ఆస్తిపన్ను పెంపుపై ఊహాగానాలు వచ్చినా ప్రభుత్వం మాత్రం ఇప్పుడే కాదన్నట్లుగా చెప్పుకుంది. కానీ సరైన సమయం చూసి పన్ను పెంపు నిర్ణయాన్ని బయటపెట్టింది. ఏప్రిల్ 1 నుంచే అంటే ఈ ఆర్ధిక సంవత్సరం మొదలైన నాటి నుంచే ఆస్తిపన్ను పెంపు వర్తిస్తుందని తాజాగా నోటీసులు జారీ చేస్తోంది. అంటే ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తానికి ఆస్తిపన్ను పెరిగినట్లు లెక్క. ఈ మేరకు పట్టణ స్ధానిక సంస్ధలైన నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా. ప్రభుత్వ తీరుతో పన్ను చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు.
నిజానికి పట్టణ స్ధానిక సంస్ధల్లో ఆస్తిపన్ను పెంపుపై ఆర్దిక సంవత్సరం ఆరంభంలోనే డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. వీటి ఆధారంగా ప్రజలు పన్నుల చెల్లింపు పూర్తి చేస్తారు. కానీ ఇప్పుడు ఆర్దిక సంవత్సరం ఆరంభం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి ఆస్తిపన్నుపెంచినట్లు ఇప్పుడు నోటీసులు జారీ చేయాల్సి రావడంతో ప్రభుత్వం మరో స్పెషల్ నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో గతంలో ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో జారీ చేసిన నోటీసుల ప్రకారం పన్ను చెల్లించి ఉంటే దాన్ని మినహాయించి మిగిలిన పన్ను చెల్లించేలా ఈ స్పెషల్ నోటీసుల జారీ ప్రారంభించారు. సెప్టెంబర్ చివరి నాటికి ఈ నోటీసుల జారీ పూర్తవుతుందని తెలుస్తోంది. ఆస్తి విలువ ఆధారంగా పన్ను ఇప్పటివరకూ పట్టణ స్ధానిక సంస్ధల పరిధిలో వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తిపన్ను లెక్కించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆయా ఆస్తుల విలువ, రిజిస్ట్రేషన్ ధరల ఆధారంగా ఆస్తిపన్ను నిర్ణయిస్తోంది.
గతంలో వార్షిక అద్దె విలువ ఆయా ఇళ్ల పరిస్ధితి, నమూనా ఆధారంగా నిర్ణయం అయ్యేది. కానీ ఇప్పుడు మార్కెట్లో దానికి ఉన్న విలువ, రిజిస్ట్రేషన్ ధర ఆధారంగా నిర్ణయం కాబోతోంది. అందుకే దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పన్ను పెంపుతో పాటు దాన్ని మదింపు విధానం కూడా మారడం డబుల్ షాక్ కానుంది. దీంతో గతంతో పోలిస్తే భారీగా ఆస్తిపన్ను పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విధానం అమలైతే భవిష్యత్తులో పెరిగే రిజిస్ట్రేషన్ ధరలు, భూముల విలువలు కూడా కచ్చితంగా ఆస్తిపన్నును నిర్ణయించడం ఖాయంగా తెలుస్తోంది.
ఏపీలో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు రాగానే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అభ్యంంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలు, స్వచ్చంద సంస్ధలు, ప్రజా సంఘాలు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలు తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విపక్షాలు నిరసనలు తెలిపాయి. బయట కూడా ఆందోళనలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ పన్నుల పెంపుపై ఆగ్రహం వ్యక్తమైంది. వైసీపీకి ఓటేస్తే గెలిచాక పన్నులు పెంచేస్తారని విపక్షాలు జనాన్ని అప్రమత్తం చేశాయి. అయినా ప్రజలు మాత్రం వైసీపీకే ఓటేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం అందుకున్న జగన్ సర్కార్ ఆస్తిపన్ను పెంపుపై ప్రజలకు భారీ షాకిచ్చింది. గతంలో వరుస ఎన్నికలు జరగడం, వాటిలో గెలుపు వైసీపీ సర్కార్ కు ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రభుత్వం ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని దాచిపెట్టింది. ఇప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఎన్నికలు లేకపోవడం, పన్నులు పెంచినా వచ్చే ప్రజావ్యతిరేకతతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేకపోవడంతో ప్రభుత్వం అదను చూసి భారీ దెబ్బ కొట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోణంలో ఆస్తిపన్ను వాయిదా వేసి ఇప్పుడు ఏకంగా ఏప్రిల్ నుంచే పెంపు వర్తిస్తుందని చెప్పడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఆస్తి పన్ను పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. తాజా నోటీసులపై మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.