మనీష్ సిసోడియా అరెస్టు సరే.. కవితపై ఆరోపణల విషయంలో నోరుమెదపరేం?: బండి

మద్యం కుంభకోణం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న వైఖరి వింతగా ఉంది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవితను కాపాడుకోవడానికి ఆయన నేల విడిచి సాము చేస్తున్నారు. ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు కాగానే, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే ఆమోదించారు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకూ మద్యం కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. కానీ మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం దారుణమంటూ ఊరూ వాడా ఏకం చేసేలా గగ్గోలు పెడుతున్నారు. ఈ కుంభకోణం కేసులో కవిత అరెస్టు అనివార్యమన్న నిర్ధారణకు రావడం వల్లనే కేసీఆర్ ప్రధానికి లేఖ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారన్న విమర్శ:లు వినవస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విలేకరుల సమావేశం పెట్టి మరీ ఈ ఆరోపణలు చేశారు.   అవినీతి ఆరోపణలపై, లిక్కర్ కుంభకోణంలో అక్రమాలపై విచారణను అడ్డుకోవాలని ప్రయత్నించడం సమంజసం కాదని బండి సంజయ్ అంటున్నారు.  గతంలోనూ అంటే యూపీఏ హయాంలో కూడా అవినీతి కుంభకోణాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పలువురు రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ మాత్రం విపక్షాలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ గుండెలు బాదుకోవడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం లేదా అని ప్రశ్నించారు.    ప్రధానిని బదనాం చేయాలన్న దురుద్దేశంతోనే కేసీఆర్ మద్యం కుంభకోణం విషయంలో కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు.  కేసీఆర్ కు కోర్టుల మీదా,  ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విమర్శించారు. తెలంగాణ సీఎస్ ను దాదాపు 30 సార్లు కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయ స్థానం మందలించింది. ఆ విషయం గురించి ప్రశ్నించకుండా,  10 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని మహిళా గవర్నర్ ను బదనాం చేస్తున్న కేసీఆర్ తన 10 వేల ఫైళ్లు పెండింగ్ పెట్టుకున్నడు. 50 వేల జీవోలను వెబ్ సైట్లో పెట్టకుండా చీకట్లో దాచేసిన సంగతి గురించి ఎందుకు మాట్లాడరంటూ బండి నిలదీశారు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సంతకాల్లేకుండా లేఖను పత్రికలకు రిలీజ్ చేయడం దిగజారుడు తనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.  లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత  బిడ్డ పాత్ర ఉందా? లేదా? అన్న విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కవితపై వచ్చిన ఆరోపణల గురించి నోరు మెదపని కేసీఆర్.. అదే కేసులో ఇతర పార్టీ నేత జైలుకు వెళితే ఖండించడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఏపీలో తెలుగుదేశంకే జనం జై.. శ్రీ ఆత్మ సాక్షిసర్వే వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి   వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే.. విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యతిరేక పవనాలలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏమిటి.. 175కు 175 స్ధానాలలో విజయం సాధిస్తామన్న వైసీపీ ధీమా, తమ గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్న విపక్షం విశ్వాసం. వాస్తవంగా ప్రజలేమనుకుంటున్నారు.  అంటే శ్రీ ఆత్మసాక్షి సర్వే అటు అధికార పార్టీ ధీమా.. ఇటు విపక్షం విశ్వాసం రెండూ కూడా అతిశయోక్తిగానే ఉన్నాయని చెబుతోంది. 175కు 175 సంగతి పక్కన పెట్టి అసలు అధికారంలోకి రావడానికి అవసరమైన స్థానాలలో గెలవడానికే వైసీపీ చెమటోడ్చక తప్పదని చెబుతోంది. అలాగే గత ఎన్నికలతో పోలిస్తే బ్రహ్మాండంగా పుంచుకున్న తెలుగుదేశం కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే మరింత కసరత్తు చేయక తప్పదని సర్వే పేర్కొంది. ఏపీలో రాజకీయ వేడి ఎల్ నినో కారణంగా వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రతలను తలదన్నేలా ఉంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఎన్నికల హీట్ దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతున్నాది. ఈ నేపథ్యంలోనే పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు పెచ్చరిల్లుతున్నాయి. అయితే రాష్ట్రంలో వాస్తవంగా ఏ పార్టీకి మెరుగైన విజయావకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ వెనుకబడి ఉంది.  ఇత్యాది అంశాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని శ్రీ ఆత్మసాక్షి సర్వే ఫలితాన్ని వెలువరించింది.  ఎన్నికల ఫలితాలను దాదాపు కచ్చితంగా అంచనా వేసే సర్వే సంస్థలలో శ్రీ ఆత్మసాక్షి ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పూర్తి సాధికారతతో ముందుగానే శ్రీ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ఆ సర్వేలో ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయాన్ని యాక్యురేట్ గా అంచనా వేసింది. సర్వే చెప్పిన విధంగానే ఫలితాలు ఉన్నాయి. అప్పటి ఎన్నికలలో వైసీపీ 139 నుంచి 142 స్థానాలలో విజయం సాధిస్తుందని, అలాగే అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం 22 నుంచి 28 స్థానాలలో విజయం సాధిస్తుందని  ఇక జనసేన 0 నుంచి 2 స్థానాలలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వాస్తవ ఫలితాలు కొంచం అటూ ఇటూలో సరిగ్గా అలాగే వచ్చాయి. వైసీపీ 151 స్థానాలలో విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలలో గెలుపొందింది. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అలాగే పాలకొల్లు, ఉండి, హిందుపూర్, ఇచ్చాపురం, అలాగే విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలనూ కూడా వైసీపీ కోల్పోతుందని  కచ్చతంగా అంచనా వేసింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. ఫలితం కూడా అలాగే వచ్చింది.  అదే విధంగా రాష్ట్రంలోని పాతిక పార్లమెంటు నియోజకవర్గాలలో వైసీపీ 22 స్థానాలలోనూ తెలుగుదేశం 2 స్థానాలలోనూ విజయం సాధిస్తాయన్న శ్రీ ఆత్మసాక్షి సర్వే అంచనా అక్షరాలా నిజమైంది.  ఇక మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల విషయంలో కూడా శ్రీ ఆత్మసాక్షి సర్వే ఏం చెప్పిందో సరిగ్గా అదే జరిగింది. ఫలితం అలాగే వచ్చింది.   దీంతో శ్రీ ఆత్మసాక్షి సర్వేలపై ప్రజలలో విశ్వసనీయత పెరిగింది. అటువంటి సంస్థ తాజాగా మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలలో గెలుచుకుంటుంది. ఏ యే స్థానాలలో హోరాహోరీ పోరు ఉంటుంది అన్న అంశాలపై రాష్ట్రంలో దశల వారీగా సమగ్ర సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాలను సమగ్రంగా వెలువరించింది. జిల్లాల వారీగా నియోజకవర్గాలలో పార్టీల విజయావకాశాలు, హోరాహోరీ పోరు ఉండే నియోజకవర్గాలు ఇత్యాది వివరాలతో శ్రీ ఆత్మసాక్షి సర్వే విడుదల చేసింది.  జిల్లాల వారీగా ఏయే నియోజకవర్గాలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఏయే నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు అన్న అంశాలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఒకింత మొగ్గు కనిపిస్తున్నా.. గెలుపు అంత సులభసాధ్యం కాదని సర్వే ఫలితం చెబుతోంది. అలాగే మరో సారి అధికారం చేజిక్కించుకుకోవడంపై ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీకి అంత సీన్ లేదనీ సర్వే ఫలితం వెల్లడించింది.  శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా, నిష్పాక్షికంగా ఈ సర్వే నిర్వహించింది. ఇద్దరు ఎన్ ఆర్ ఐలు, ముగ్గురు రాజకీయవేత్తల కోరిక మేరకు ఈ సర్వే నిర్వహించింది.  మొదటి దశ సర్వేను గత ఏడాది సెప్టెంబర్ 3న విడుదల చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ 77 స్థానాలలో, వైసీపీ 56, జనసేన 4 స్థానాలలో విజయం సాధిస్తాయి.  ఈ సర్వే విడుదల చేసిన మూడు నెలల తరువాత ఈ సంస్థ మూడు విడతల్లో మరో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలనే ఇప్పుడు విడుదల చేసింది. ఈ సర్వే కోసం నియోజకవర్గానికి సగటున 330 మందితో డైరెక్ట్ గా ఇట్రాక్ట్ అయ్యారు. అంటే రాష్ట్రంలో ఈ సర్వే సంస్థ 60 వేల 200 శాంపిల్స్ నుంచి కలెక్ట్ చేసిన వివరాలను ఇప్పుడు వెలువరించింది.  ఈ సర్వే మూడు విడతల్లో గత ఏడాది నవంబర్ 20 నుంచి ఫిబ్రవరి 17 వరకూ నిర్వహించింది. అదే మొదటి దశ సర్వేలో అయితే శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రతినిథులు రాష్ట్రం మొత్తంలో లక్షా 370 వేల శాంపిల్స్ నుంచి వివరాలు సేకరించారు. ఆ విషయం పక్కన పెడితే తాజా సర్వే ప్రకారం  రాష్ట్రంలో అధికార వైసీపీకి 41.50 శాతం ఓటర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీకి 42.50 శాతం మంది, జనసేనకు 11 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఇతరులు 2.5శాతం ఉండగా, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ మరో 2.5శాతంగా ఉంది. మొత్తం మీద 175 నియోజకవర్గాలలో అధికార వైసీపీ 63 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉంటే, తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశాలు 78 స్థానాలలో ఉన్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే ఈ పార్టీ 7 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మరో 37 నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు సాగనుంది. ఇలా హోరా హోరీ పోరు సాగే నియోజకవర్గాలలో కూడా విపక్ష వైసీపీకి 14 చోట్ల, తెలుగుదేవం పార్టీకి 13 చోట్ల కొద్ది పాటి మొగ్గు కనిపిస్తోంది.  ఇక జిల్లాల వారీగా పార్టీల విజయావకాశాల విషయానికి వస్తే.. శ్రీకాకుళొం జిల్లాలో మిత్తం 10 స్థానాలు ఉండగా వీటిలో ఇచ్చాపురం, ఎచ్చెర్ల, పాతపట్నం, రాజాం, పలాస, అముదాల వలస స్థానాలలో తెలుగుదేవం, పాలకొంండ, నరసన్నపేటలలో వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయి. టెక్కలి, శ్రీకాకుళంలలో హోరా రోహీ పోరు సాగుతుంది. అంటే జిల్లాలోని పది నియోజకవర్గాలలో 6 స్థానాలలో తెలుగుదేశం, 2 స్థానాలలో వైసీపీకి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. మిగిలిన రెండు స్థానాలలో అంటే టెక్కటి, శ్రీకాకుళం లలో హోరాహోరీ పోరు సాగుతుంది. అలాగే  విజయనగరం  జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నాలుగు నిజోజకవర్గాలలో తెలుగుదేశం, మూడు నియోజకవర్గాలలో వైసీసీకి విజయావకాశాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి విజయనగరం, బొబ్బొలి, ఎస్. కోట, గజపతినగరంలలో విజయావకాశాలు ఉండగా, వైసీపీకి చీపురుపల్లి, నెల్లిమర్ల, సాలూరులలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. పార్వతీపురం, కురుపాంలలో హోరా హోరీ పోరు ఉంటుంది.  ఇక విశాఖజిల్లా విషయానికి వస్తే ఈ  జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 15. వీటిలో  ఏడు నియోజకవర్గాలలో తెలుగుదేశం, ఐదు నియోజకవర్గాలలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉండగా  మూడు నియోజకవర్గాలలో  హోరాహోరీ పోరు ఉంటుది.  తెలుగుదేశం పార్టి విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, భీమిలిపట్నం, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలలో ముందంజలో ఉంటే, వైసీపీ విశాఖ సౌత్, విశాఖ నార్త్, యలమంచిలి, అరకు వ్యాలీ, పాడేరులలో వైసీపీ ఆధిక్యత కనపరుస్తోంది. ఇక పాయకరావుపేట, గాజువాక, మాడుగుల నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉండగా, వాటిలో ఆరు నియోజకవర్గాలలో తెలుగుదేశం, ఆరు నియోజకవర్గాలలో వైసీపీ, నాలుగు నియోజకవర్గాలలో జనసేన పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. మిగిలిన మూడు నియోజకవర్గాలలోనూ హోరాహోరీ పోరు ఉంటుంది. పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాలలో తెలుగుదేశం, రామచంద్రాపురం, రంపచోడవరం, కాకినాడ అర్బన్, అనపర్తి, తుని, రాజానగరంలలో వైసీపీ, పిఠాపురం, రాజమండ్రిరూరల్, రాజోలు, కొత్త పేటలలో జనసేనకు విజయావకాశాలు ఉన్నాయి. ఇక శ్రీ ఆత్మసాక్షిసర్వే ప్రకారం పి.గన్నవరం, మండపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాలలో తెలుగుదేశం 8 నియోజకవర్గాలలోనూ వైపీపీ రెండు నియోజకవర్గాలలో విజయం సాధిస్తాయి. జనసేన పార్టీకి ఈ జిల్లాలో మూడు నియోజకవర్గాలలో విజయావకాశాలు ఉన్నాయి. పాలకొల్లు, ఆచంట, ఉంగుటూరు, దెందులూరు, తణుకు, కొవ్వూరు, పోలవరం, ఉండి నియోజకవర్గాలు తెలుగుదేశం ఖాతాలోనూ,  ఏలూరు, గోపాలపురం నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనూ పడతాయి. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో జనసేనకు విజయావకాశాలు ఉన్నాయి. నిడదవోలు, చింతలపూడిలలో హోరాహోరీ పోరు ఉంటుంది.   అలాగే కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఎనిమిది నియోజకవర్గాలు తెలుగుదేశం,  ఐదు నియోజకవర్గలు వైసీపీ ఖాతాలో పడతాయని సర్వే పేర్కొంది. రెండు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. తెలుగుదేశం విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్,  జగ్గయ్యపేట, పెనమలూరు, మైలవరం, అవనిగడ్డ, మచిలీపట్నంలలో విజయం సాధిస్తే,  వైసీసీకి గన్నవరం, పామర్రు,  గుడివాడ, తిరువూరు, నూజివీడులలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. విజయవాడ వెస్ట్, కైకలూరులలో హోరాహోరీ పోరు ఉంటుంది. గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో 8 తెలుగుదేశం ఖాతాలోనూ, 6 వైసీపీ ఖాతాలోనూ పడతాయి. మూడు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు. పొన్నూరు, వేమూరు, తాడికొండ, చిలకలూరి పేట, రేపల్లె, మంగళగిరి, వినుకొండ, బాపట్లలలో తెలుగుదేశం గెలిచే అవకాశాలు అధికంగా ఉంటే,  గుంటూరు ఈస్ట్, మాచర్ల, పత్తిపాడు, పెదకూరపాడు, తెనాలి, నరసరావు పేటలలో వైసీపీకి విజయావకాశలు ఉన్నాయి. ఇక గుంటూరు వెస్ట్, గురజాల, సత్తెనపల్లిలో హోరాహోరీ పోరు ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరింట తెలుగుదేశం, ఐదు నియోజకవర్గాలలో వైసీపీ, ఒక నియోజకవర్గంలో హోరా హోరీ ఉంటుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఒంగోలు, కనిగిరి, కొండెపి, పరచూరు, అద్దంకి, సంతనూతలపాడు లలో తెలుగుదేవం, మార్కాపురం, ఎర్రగొండ్లపాలెం, గిద్దలూరు, కందుకూరు, దర్శిలలో  వైసీపీ గెలిచే అవకాశాలు ఉండగా, చీరాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఐదింటిని తెలుగుదేశం, రెండు నియోజకవర్గాలలో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయి. మూడింటిలో హోరాహోరీ పోరు ఉంటుంది.  నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, వెంకటగిరి, కావలిలలో తెలుగుదేశం, ఆత్మకూరు, సర్వేపల్లిలలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, కోవూరులలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం నాలుగు, వైసీపీ 8 గెలుచుకునే అవకాశాలున్నాయి. రెండు నియోజకవర్గాలలో పోటీ తీవ్రంగా ఉంటుంది.  మందపల్లి, కుప్పం,  నగరి, పలమనేరులలో తెలుగుదేశం విజయం సాధిస్తే,  తిరుపతి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, చంద్రగిరి, చిత్తూరు, తంబళ్లపల్లిలలో వైసీపీ విజయం సాధిస్తుంది. ఇక పీలేరు, శ్రీకాళహస్తిలలో పోటీ తీవ్రంగా ఉంటుంది.  కడప జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం రెండు స్థానాలలోనూ, వైసీపీ ఆరు స్థానాలలోనూవిజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. రెండు స్థానాలలో పోటీ హోరాహోరీ ఉంటుంది.  మైదుకూరు, ప్రొద్దుటూరులలో తెలుగుదేశం, కడప, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేల్, కోడూరులలో వైసీపీ గెలుస్తాయి. రాజంపేట, కమలాపురం నియోజకవర్గాలలో పోటీ తీవ్రంగా ఉంటుంది.  అనంతపురం జల్లాలో14  నియోజకవర్గాలు ఉండగా వీటిలో 7 చోట్ల తెలుగుదేశం, 7 చోట్ల వైసీపీ విజయం సాధిస్తాయి. ఒక నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంది. అనంతపురం, కదిరి, హిందూపురం,  తాడిపత్రి,  కళ్యాణదుర్గం, పెనుకొండ,  ఉరవకొండలలో తెలుగుదేశం, రాప్తాడు, గుంతకల్లు, పుట్టపర్తి, ధర్మవరం, రాయదుర్గం, మడకశిరలలో వైసీపీ విజయం సాధిస్తాయి. సింగనమలలో పోటీ నువ్వానేనా అన్నట్లుగా ఉంటుంది.  ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలోని 14 నియోజకవర్గాలలో ఏడింటిలో కర్నూలు, ఏడింటిలో వైసీపీ విజయం సాధించే అవకాశలు ఉన్నాయని శ్రీఆత్మసాక్షి సర్వేపేర్కొంది.  శ్రీశైలం, కొడుమూరు, మంత్రాలయం, బనగానపల్లి, ఆలూరు, ఆదోని, పత్తికొండలలో తెలుగుదేవం, నందికొట్కూరు, పాణ్యం,  ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ, కర్నూలు, నంద్యాలలో వైసీపీకివిజయావకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది.  మొత్తానికి శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం 2024 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య తేడా స్వల్పమేనని కూడా సర్వే వెల్లడిస్తోంది.  

వైఎస్ వివేకానందరెడ్డి హత్య... ముచ్చటగా మూడోసారి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  జగన్ సొంత బాబాయ్  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు ముచ్చటగా మూడోసారి నోటీసులు ఇచ్చారు. మార్చి 6వ తేదీన తమ విచారణకు రావాలంటూ వైయస్ అవినాష్ రెడ్డికి తొలుత సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ఆ రోజు తన నియోజకవర్గంలోని వేంపల్లిలో పార్టీ మండల, కార్యకర్తల, గృహాసారథుల, కన్వీనర్ల, వాలంటీర్ల సమావేశం ఉందని.. ఈ నేపథ్యంలో హాజరుకాలేనని ఆయన సీబీఐకి తెలిపడంతో.. మార్చి 10వ తేదీన   విచారణకు రావాలని  అవినాష్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు నోటిసులు అందజేశారు. దీంతో హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి మరోమారు వైయస్ అవినాష్ రెడ్డి విచారణకు తరలి రానున్నారు. అలాగే ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి సైతం.. మార్చి 12వ తేదీన కడపలో తమ విచారణకు హాజరుకావాలని సీబీఐ అదికారులు నోటిసులు అందజేశారు. అయితే తాను హైదరాబాద కు రాలేనని అవినష్ సీబీఐకి వర్తమానం పంపించారనుకోండి అది వేరే సంగతి.     అయితే వివేకా హత్య కేసులో అందరి చూపులే కాదు.. వేళ్లన్నీ కూడా అనినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయనే విధంగా ఇప్పటికే దర్యాప్తు సంస్థ సీబీఐ... కోర్టుకు సమర్పించిన   అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో వీరిద్దరికి సీబీఐ నోటీసులు జారీ చేసిందనగానే.. అటు మీడియా.. ఇటు సోషల్ మీడియలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అదీకాక  స్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి సీబీఐ ఎప్పుడు నోటీసులు జారీ చేసినా.. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయంటూ... సీబీఐకి తెలపడం.. వారు మరో తేదీ ఫిక్స్ చేయడం.. ఆ క్రమంలో సీబీఐ అధికారులు ఎక్కడా.. ఎప్పుడూ.. వీరి పట్ల దూకుడుగా వ్యవహరించకుండా చాలా సమయమనం పాటిస్తూ వస్తున్నారనే చర్చ సైతం సాగుతోంది.   ఇక గత జనవరి 28న వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని.. తొలిసారిగా హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో సీబీఐ అధికారులు విచారించారు. ఈ సందర్బంగా ఆయన కాల్‌డేటాపై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు. ఆ క్రమంలో వైయస్ వివేకా హత్య జరిగిన సమయంలో.. అంతకు ముందు... ఆ తర్వాత వెళ్లిన కాల్‌డేటాపై దృష్టి పెట్టడం..  అందులో భాగంగా నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి  జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి,   జగన్ సతీమణి పీఏ నవీన్‌ సెల్ పోన్లకు కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వీరిద్దరికీ సీబీఐ అధికారులు ఫిబ్రవరి 3వ తేదీన కడపలో తమ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. వారిద్దరు సీబీఐ విచారణకు హాజరయ్యారు.  అయితే వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి పీఏ నవీన్‌ను మరోసారి సీబీఐ అధికారులు.. విచారణకు పిలువనున్నారని.. అందుకు వారి న్యాయవాదితో ఇప్పటికే అంశంపై మాట్లాడినట్లు మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో సందేహం ఉన్న ప్రతి అంశాన్ని సీబీఐ అధికారులు వదిలిపెట్టకుండా విచారణ జరుపుతున్నారు. ఆ క్రమంలో  వివేకా హత్య జరిగిన రోజు.. వైయస్ అవినాష్ తో ఫొటో దిగిన సుధాకర్ అనే వ్యక్తిని సైతం సీబీఐ అధికారులు పిలిచి మరీ విచారించడం గమనార్హం.  ఇక వైయస్ వివేకా హత్య జరిగి ఈ ఏడాది మార్చి 15కి సరిగ్గా నాలుగేళ్లు పూర్తి కావోస్తోంది. అదే రోజు సీబీఐ పలువురిని అరెస్ట్ చేసినా.. అందులో ఆశ్చర్యం లేదనే ఓ చర్చ అయితే సోషల్ మీడియాలో వాడి వేడిగా నడుస్తోంది. ఇక ఇటు లోక్‌సభకు .... అటు అసెంబ్లీ ఎన్నికలకు అట్టే సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో అసలు వివేకా హత్య ఎందుకు జరిగింది?..  అసలు ఈ హత్య జరగడానికి గల ప్రధాన కారణం?.. వైఎస్సార్టీపీ పార్టీ అధినేత్రి షర్మిల చెప్పినట్లు కడప ఎంపీ సీటు కోసమే ఈ హత్య జరిగిందా? లేకుంటే.. ఆర్థిక వ్యవహారాలు కారణమా? లేకుంటే మరేదైనా కారణమా? ఇక వివేకా హత్యకు సుపారీగా 40 కోట్ల రూపాయిలు.. ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు?.. అంత పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి.. వైఎస్ వివేకాను ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అలాగే ఈ హత్య వెనుక ఉన్న అసలు సిసలు పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అనేది బయటకు వస్తే.. దాని తాలుకు ప్రభావం వచ్చే ఎన్నికల ఫలితాలపై సుస్పష్టంగా పడుతోందనే ఓ చర్చ సైతం తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడిగా నడుస్తోంది.

ఈశాన్యంలో కమల వికాసం.. మరి దక్షిణాదిన?

ఒకప్పుడు బీజేపీ అంటే ఉత్తర భారత్ పార్టీ ... ఇప్పటికీ, దక్షిణ భారత దేశంలో బీజేపీకి  ఒక్క కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ చెప్పుకోదగ్గ బలం, బలగం లేవు. ఇప్పుడిప్పుడు తెలంగాణలో ఒకింత  బలపడుతున్నా ఈ సంవత్సరం (2023) చివర్లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి కాకున్నా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను అయినా పొందగలుగుతుందా అంటే,   అనుమానమే.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గానీ, తెలంగాణలో బీజేపీది బలుపా వాపా అన్నది తేలదు.  సరే, దక్షిణ భారత దేశంలో బీజేపీ భవిష్యత్ ఏమిటనే విషయాన్ని పక్కన పెట్టి   ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు ఈశాన్య  రాష్ట్రాల (త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ) విషయానికి వస్తే ఈశాన్యంలో బీజేపీ మరోమారు సత్తా చాటుకుంది. మూడు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ రెండు చోట్ల జయకేతనం ఎగురవేసింది.   నాగాలాండ్‌, త్రిపురలో బీజేపీ కూటమి విజయం సాధించగా మేఘాలయలో హంగ్‌ ఏర్పడింది.  త్రిపురలో బీజేపీ - ఐపీఎఫ్ టీ కూటమి విజయం సాధించింది. మరో రెండు రోజుల్లో  అంటే బుధవారం (మార్చి 8)   వరసగా రెండవ సారి బీజేపీ ప్రభుత్వం త్రిపురలో కొలువు తీరేందుకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ సీనియర్ నాయకులు కొత్త ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. అయితే, ఇంతవరకు ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో స్పష్టత రాలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి మానిక్‌ షా, కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీపడుతున్నారు.   అలాగే, నాగాలాండ్ లోనూ బీజేపీ కూటమి విజయం సాధించింది. 60 స్థానాలకు గానూ ఎన్‌డీపీపీ- బీజేపీ కూటమి 37 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 12 స్థానాల్లో, నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ పార్టీ(ఎన్‌డీపీపీ) 25 స్థానాల్లో గెలిచాయి.ఈ విజయంతో నాగాలాండ్‌ రాజకీయ దిగ్గజం, నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ పార్టీ(ఎన్‌డీపీపీ) అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నెయిఫియు రియో వరుసగా ఐదో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.అయితే, ఏడుసీట్లు గెలుచుకున్న ఎన్సీపీ, ఐదు సీట్లు గెలుచుకున్న ఎన్పీపీ, ఒకటి రెండు సీట్లు గెలుచుకున్న జేడీయు, ఎల్జీపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, ఆర్పీఐ  పార్టీలు, ఎన్‌డీపీపీ- బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాయి. దీంతోనాగాలాండ్ లో మరో మారు  ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మేఘాలయ ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.26 స్థానాల్లో గెలిచిన ఎన్‌పీపీ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీ(యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ) 11 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ 5, బీజేపీ 2 చోట్ల గెలిచాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ 31 కాగా బీజేపీ, యూడీపీతో కలిసి సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.  నిజానికి 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి, ప్రస్తుతం కాంగ్రెస్  పరిస్థితి కంటే దయనీయంగా ఉంది. (త్రిపురలో 4/60, మేఘాలయ 5/60, నాగాలాండ్ 0/60) కంటే అద్వాన్న స్థితిలో వుంది. అయితే ఇప్పడు మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వుంది. అయితే, దక్షిణాదిలో అదే పరిస్థితి వస్తుందా? ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కర్ణాటకలో అధికారం నిలబెట్టుకుని, తెలంగాణలో ప్రభుత్వంలో రాకున్నా,  గౌరవప్రదమైన స్థానాలు పొందగలుగుతుందా? అంటే, ఇప్పటికిప్పుడు స్పష్టమైన సమాధానం చెప్పడం   చాలా కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

సైకిల్ తోనే పొత్తు.. 14న జనసేనాని క్లారిటీ?

మార్చి  14.. జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఏపీలో పార్టీ పుట్టి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగు పెడుతోంది జనసేన.. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ఈసందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న బందరులో భారీ బహిరంగసభ నిర్వహించాలని జనసేన  నిర్ణయించింది.  2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది. అయితే జనసేన పోటీ చేసిన సీట్లలో కేవలం రాజోలులో మాత్రమే పార్టీ అభ్యర్ది రాపాక వరప్రసాద్ గెలిచారు.  ఆ తరువాత ఆయనా వైసీపీ గూటికి చేరారనుకోండి అది వేరే సంగతి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓడిపోయారు.  దీంతో ఈసారి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. సీరియస్ పాలిటిక్స్  పై దృష్టిని కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో జనసేన పదో పుట్టిన రోజుపై అందరిలో ఆసక్తిని కనిపిస్తోంది.    జనసేన  బందరు బహిరంగ సభలో పవన కళ్యాణ్  పొత్తుల విషయంలో ఏమి మాట్లాడతారు? ఎలాంటి ప్రకటన చేస్తారు? అనే విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  నిజానికి గత సవత్సరం మంగళగిరిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలోనే పవన్ కళ్యాణ్  తొలి సారిగా, పొత్తుల విషయాన్నిప్రస్తావించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. ఇక అక్కడి నుంచి, పొత్తుల చర్చ మలుపుల మీద మలుపులు తిరిగి.. చివరకు బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే దిశగా అడుగులు పడుతున్నాయి.   అయితే ఇంతవరకూ ఇందుకు సంబంధించి తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పొత్తు విషయంలో స్పష్టమైన సంకేతాలు అయితే పవన్ కళ్యాణ్ ఇస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలోనే దాగుడు మూతలకు తెరదించుతూ బందరు సభలో పొత్తులపై స్పష్టత ఇవ్వాలని పవన్ కళ్యాణ్  ఒక నిర్ణయానికి వచ్చారని జనసేన శ్రేణులే చెబుతున్నాయి.  నిజానికి బందరు సభలో పవన్  ఇటు పొత్తుల విషయంలో, అటు కాపు రిజర్వేషన్ విషయంలో క్లారిటీ ఇస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అందుకే  పార్టీ ఆవిర్భావ సభకు ముందుగానే కీలక అంశాల పైన పార్టీ నేతలతో చర్చలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 11వ తేదీన పవన్ విజయవాడ చేరుకోనున్నారు. 12వ తేదీన మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తో సహా అన్ని జిల్లాల కాపు నేతలతో పవన్ సమావేశం కానున్నారు. వారి నుంచి కాపు రిజర్వేషన్ల అంశం పైన అభిప్రాయాలు సేకరించి.. పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలనే అంశం పైన ఒక నిర్ణయం తీసుకోనున్నారు.  అలాగే  13వ తేదీ పార్టీ ముఖ్య నేతలతో పవన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే క్రమంలో అమలు చేసిన వ్యూహాలు.. నియోజవకర్గ సమీక్షలు.. వారాహి పై రాష్ట్ర వ్యాప్త పర్యటన గురించి ఈ భేటీలో నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు కొనసాగుతున్నా రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. పెరుగుతోంది. నిజానికి  బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలనే నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని కూడా అంటున్నారు. ఇదే విషయాన్ని  పవన్ పార్టీ నేతలతో పంచుకొనే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీతో పొత్తు ఖాయమని జనసేన నేతలు కూడా భావిస్తున్నారు. ఈ అంశం పైన పార్టీ నేతల నుంచి పవన్ అభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉంది. బీజేపీ, టీడీపీ తో జనసేన భవిష్యత్ బంధం గురించి పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ పొత్తు నిర్ణయాధికారం అధ్యక్షుడికి అప్పగిస్తూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఆవిర్భావ సభా వేదిక నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్దం అవుతున్నారు. ఆ సభా వేదిక నుంచే బీజేపీ, టీడీపీతో తమ భవిష్యత్ సంబంధాల పైన క్లారిటీ ఇస్తారని సమాచారం. టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. వైసీపీ సవాళ్ల నడుమ ఇక పొత్తుల అంశం పైన ఎక్కవ కాలం సాగదీయటం మంచిది కాదని పవన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొత్తుల వ్యవహారంతో పాటుగా.. కాపు రిజర్వేషన్ల పైన జనసేన వైఖరి..కార్యాచరణ పవన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఈ సారి జనసేన ఆవిర్భావ సభపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.

మోడీ పై కేసీఆర్ లేఖాస్త్రం కవితను రక్షించుకునేందుకేనా?

‘దుర్వినియోగం కాని అధికారం అధికారమే కాదు’ (Power is no power, if it is not misused) ఇదొక ఇంగ్లీష్ నానుడి. కేంద్రంలో కానీ, రాష్ట్రాలలో కానీ అధికారంలో ఉన్న పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడతాయి. అది అభిలషణీయం కాకపోయినా అదే నిజం. అదే వాస్తవం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారత చరిత్ర చెపుతున్న సత్యం ఇది.  అధికారంలో ఎవరుంటే వారు రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం, విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా 2014లో మొదలైన అపచారం కాదు. బీజేపీ పుట్టక ముందే ఈ దురాచారం మొదలైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంది. ఇప్పడు బీజేపీ  కూడా  అదే పని చేస్తోంది.  కాంగ్రెస్ హయాంలో వంద సార్లకు పైగా ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన) దుర్వినియోగం అయింది.  1959లోనే కేరళలోఇఎమ్‌ఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వానికి అసెంబ్లీ మెజారిటీ ఉన్నప్పటికీ, కేంద్రం బర్తరఫ్ చేసింది. రాష్ట్రపతి పాలనా విధించింది. ఇక అప్పటి నుంచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో వంద సార్లకు పైగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలలో ఆర్టికల్ 356 దుర్వినియోగం అయింది. అలాగే, కాంగ్రెస్ హయాంలో  సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికార దుర్వినియోగం గురించి విపక్షాలు విమర్శలు చేయడం కాదు, సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు  సిబిఐని  ‘పంజరంలో చిలక’ (Parrot in the cage) అని పేర్కొన్నది. అలాగని, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తప్పని కాదు  చేయకూడదనీ కాదు. అయితే ఈ ఆరోపణలను ప్రజలు ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటారు అనేదే, ప్రశ్న.  అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ నేపధ్యంతో  ప్రజా తీర్పును  గౌరవించాలంటూ ప్రధాని మోడీకి తొమ్మిది విపక్ష పార్టీల నేతలు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ లేఖపై నలుగురు సీఎంలు కేసీఆర్, మమతా బెనర్జీ, భగవంత్ మాన్, కేజ్రీవాల్ తో పాటు  బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్,  నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, యేపీ  మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంతకాలు చేశారు.  గ వర్నర్ వ్యవస్థను  రాజకీయం  చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.  ఇది మంచి పద్దతి కాదని సూచించారు. నిజమే కానీ, ఈ లేఖ రాసిన  సమయం సందర్భం, అందులోని అంశాలను గమినిస్తే,  ప్రజలు విపక్షాల ఆరోపణలను, (ముఖ్యంగా తెలంగాణ ప్రజలు) ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారు అనేది అనుమానమే అంటున్నారు.  ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్  తన కుమార్తె రక్షించుకునేందుకే లేఖాస్త్రాని సంధించారని అంటున్నారు.  నిజానికి సిసోడియా అరెస్ట్ నేపధ్యంగా కేసీఆర్, ఇతర నేతలు లేఖ రాసినా  కవితను కాపాడుకోవడమే కేసేఆర్ ప్రధాన లక్ష్యమని సామాన్య ప్రజలకు కూడా అర్థమైందని అంటున్నారు. అయితే ఎవరేమన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలాగే ఈ లేఖలో సంతకాలు చేసిన నేతలు పేర్కొన్నట్లుగా, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు.. ఎవరు ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారు.

మార్చిలోనే మాడ్చేస్తున్నాయ్.. ముందు ముందు ఎలా ఉంటుందో?

రాష్ట్రంలో ఎండలు మార్చి లోనే మాడ్చేస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. ఎల్ నినా ప్రభావంతో ఈ ఏడాది ఎండలు అధికం అని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించినా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలను మాత్రం ఎవరూ ఊహించలేదు. నడి వేసవిలో ఏర్పడే తుపానుల కారణంగా కొద్ది పాటి ఉపశమనం ఉంటుందన్న ఆశలను కూడా ప్రతి తుపాను (యాంటీ సైక్లోన్ ) పరిస్థితులు కలిగే అవకాశం లేకుండా చేస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి మొదటి వారంలోనే 40 డిగ్రీలకు చేరిన ఎండలు.. నడి వేసవి వచ్చే సరికి 50 డిగ్రీల సెల్సియస్ లకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ మధ్య నాటికి జోరందుకోవలసిన శీతల పానియాల విక్రయాలు ఇప్పటికే పీక్స్ కు చేరుకున్నాయంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.  మార్చి మొదటి వారంలోనే ఎండలిలా మాడ్చేస్తుంటే.. ఇక ఏప్రిల్, మే నెలలలో, రోహిణీ కార్తెలో రోళ్లే పగులుతాయా అన్నంత ఆందోళన వ్యక్తమౌతోంది. ఇక ఎండలకు తోడు యాంటీ తుపాన్ (ప్రతి తుపాన్) పరిస్థితుల కారణంగా వాతావరణంలో తేమ తగ్గిపోయి, వడగాలులు వీసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదౌతాయి.  ఇప్పటికే ఉదయం 8 గంటలకే ఎండ చుర్రుమంటోది.. మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.  మండే ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఐక్యంగా ఉంటే నిలుస్తాయి.. లేకుంటే అంతే సంగతులు?

జాతీయ స్థాయిలో బీజేపీకి దీటుగా నిలవాలంటే.. ఐక్యంగా ఉండట మొక్కటే ప్రతిపక్షాలకు ఉన్న ఏకైక ఆప్షన్ ఐక్యంగా 2024 ఎన్నికలను ఎదుర్కోవడమే. అలా కాకుండా ఐక్యత సాధించడంలో విపక్షాలు విఫలమైతే మాత్రం అంతే సంగతులు. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు తేల్చి చెప్పిన నిజమిదే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై ప్రభుత్వ వ్యతిరేకత ఓ రేంజ్ లో ఉన్నా జాతీయ స్థాయిలో విపక్షాలు ఐక్యంగా లేకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత వల్ల బీజేపీకి ఇసుమంతైనా నష్టం లేకపోగా, మరింత బలపడటం ఖాయమని ఈ సాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. విపక్షాల అనైక్యత బీజేపీని నీటిలో మొసలిగా ఎవరూ ఢీ కొట్టలేని బలశాలిగా మార్చేసిందని విస్పష్టంగా తేల్చేసింది. ఆ ఫలితాలు విపక్షాలకు జ్ణానోదయం కలిగిస్తే.. వాటి ఐక్యతా యత్నాలు.. ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఎవరికి వారేగా రంగంలోనికి దిగితే.. మరో సారి కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం నల్లేరు మీద బండి నడకే అవుతుందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. అదే జరిగితే 2024 ఎన్నికల తరువాత విపక్షం అనేదే ఉండని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 2019 ఎన్నికలలో ప్రధాన విపక్ష హోదాను కాంగ్రెస్ అతికష్టం మీద నిలుపుకోగలిగింది. విపక్షాల ఐక్యత విషయంలో ఇదే పరిస్థితి కొనసాగితే.. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత ఏ పార్టీకీ కూడా విపక్ష హోదా దక్కే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు.  నాగాలాండ్‌లో బీజేపీ విజయం నల్లేరు మీది బండి నడకే అయ్యిందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో విపక్షమనేదే లేదు. ఇక త్రిపుర విషానికి వస్తే అక్కడ విజయం కోసం బీజేపీ చెమటోడ్చింది.  అందుకు కారణం ఆ రాష్ట్రంలో  కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య పొత్తు ఉండటమే.  పొత్తులు లేకుండా బీజేపీని నిలువరించడం అసాధ్యం అన్న విషయాన్ని ఇప్పటికే గుర్తించిన ఏకైక పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్సే.. పొత్తులు లేకుండా బీజేపీని నిలువరించడం అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చేసింది. అయితే ఆ పొత్తుల కోసం ఒక మెట్టు దిగడానికి  ఆ పార్టీ ఇసుమంతైనా సిద్ధంగా లేదు. బీజేపీయేతర కూటమి తన నాయకత్వంలోనే ఏర్పాటు అవ్వాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకు తాజా తార్కానమే.. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాయ్ పూర్ వేదికగా జరిగిన ప్లీనరీలో చేసిన ప్రకటనే. అయితే కాంగ్రెస్ తో కలిసేందుకు ఇప్పటి వరకూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటి వారు సిద్ధంగా లేరు. అసలు పొత్తులు, ఎత్తులు, వ్యూహాల విషయంలో విపక్షాలు వేటికవిగా వేర్వేరుగా అడుగులు వేయడం చూస్తుంటే... ఏ పార్టీకి ఆ పార్టీ తాము అధికారంలోకి రాకున్నా పర్వాలేదు కానీ.. మరో విపక్షానికి ఆ అవకాశం రాకూడదని అంటున్నారు.  అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. స్వయంగా విపక్షాల ఐక్యతా యత్నాలను ముందుండి నడిపించాల్సిన కాంగ్రెస్ పార్టీయే ఆ ప్రయత్నాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తోంది.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీల ఐక్యతే లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలకు రాయ్ పూర్ లో జరిగిన పార్టీ  ప్లీనరీ వేదికగా గండి కాంగ్రెస్ గండి కొట్టింది? విభేదాలను పక్కన పెట్టి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ కలుపుకు పోయే దిశగా అడుగులు వేయాల్సిన కాంగ్రెస్.. అతి విశ్వాసంతో కొన్ని పార్టీలను ఐక్యత విషయంలో తమతో కలిసి అడుగువేయాలన్న ఆలోచన కూడా చేయకుండా నిరోధించింది.   భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా వచ్చిన సానుకూల స్పందన.. పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి పెరిగిన జనాదరణ కారణంగా కాంగ్రెస్ మళ్లీ తన సహజ లక్ష్యమైన ఒంటెత్తు పోకడలకు శ్రీకారం చుట్టిందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా పలు మార్లు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి ఉప సంహరించుకున్న చరిత్ర కాంగ్రెస్ ఉంది. అయితే మన్మోహన్ సారథ్యంలో  రెండు పర్యాయాలు అంటే పదేళ్ల పాటు కాంగ్రెస్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపింది. అయితే అప్పట్లో ఆ పార్టీ మిత్ర ధర్మాన్ని పాటించిందా అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు అంటే దాదాపు పదేళ్ల పాటు కేంద్రంలో ప్రధాన విపక్ష పాత్రను పోషిస్తున్న కాంగ్రెస్.. ఈ పదేళ్ల కాలంలోనూ ఉమ్మడి పోరాటాలకు నేతృత్వం వహించిన సందర్భాలు బహుస్వల్పం అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ వైఖరి కారణంగానే మమతా బెనర్జీ వంటి బలమైన నేతలు ఆ పార్టీతో కలిసేందుకు ముందుకు రావడం లేదు.  మొత్తంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి 2019 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ వైదొలగిన తరువాత ఆ పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇప్పటికీ కనిపిస్తోంది. జాతీయ పార్టీగా శతాధిక వత్సరాల అనుభవం ఉన్న గ్రాండ్ ఓల్డ్ పొలిటికల్ పార్టీ విపక్ష పాత్రను పోషించడంలో సందేహాలకు అతీతంగా విఫలమైంది. అయితే జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్  లేకుండా కూటమిని ఊహించడం అసాధ్యం. ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి కోసం కేసీఆర్, మమత, నితీష్ వంటి నేతలు చేసిన ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగానే సాగాయి. అసలు విపక్ష ఐక్యతకు ప్రధాన అవరోధం కాంగ్రెస్సే అని చెప్పాలి. అదే సమయంలో తమ తమ రాష్ట్రాలలో కొద్ది పాటి బలం ఉన్న ప్రాంతీయ పార్టీలు.. ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ బలోపేతం కాకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని పొత్తుల విషయంలో తమ డిమాండ్లకు అనుగుణంగా తగ్గేలా చేయాలని భావిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ తో సహా విపక్షాలన్నీ తమ గోతిని తామే తవ్వుకుంటున్న చందంగా ఐక్యతను పక్కన పెట్టి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నాయి. ఈ పరిస్థితి మారనంత వరకూ కేంద్రంలో తమ అధికారానికి వచ్చిన ఢోకా ఏం లేదన్న ధీమాతో బీజేపీ ఉంది.  

ముగింపు దశకు వివేకా హత్య కేసు.. అవినాష్ అరెస్ట్?

వైఎఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ కు మరో మారు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో రెండు సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా మరో సారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం ఈ కేసులో ఆయన అరెస్టు తప్పదన్న చర్చకు మరో మారు తెరతీసింది. రెండో సారి సీబీఐ విచారణకుహాజరైన అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డిలో ఆందోళన కనిపించింది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. సీబీఐ విచారణ సవ్య దిశలో సాగటం లేదని విమర్శించారు. తనను మూడో సిరి విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదనీ, సీబీఐ ప్రశ్నలన్నిటికీ తాను సమాధానాలు చెప్పానని అప్పట్లో స్పష్టం చేశారు.  మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ తనకు చెప్పలేదని అవినాష్ ప్రకటించినా.. ఇప్పుడు తాజాగా ముచ్చటగా మూడో సారి కూడా విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేస్తూ సీబీఐ నోటీసు ఇచ్చింది. రెండో సారి విచారణ తరువాత మూడో సారి విచారణకు పిలవడానికి మధ్య సీబీఐ ఎక్కువ రోఝుల వ్యవధి కూడా అవినాష్ కు ఇవ్వలేదు. అయితే సీబీఐ మూడో సారి విచారణకు రావాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు అవినాష్ రెడ్డి స్పందించిన తీరు, ఇచ్చిన సమాధానమే ఆయన అరెస్టు అనివార్యమన్నది తేటతెల్లం చేస్తున్నది. సీబీఐ సోమవారం (మార్చి 6)విచారణకురావాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు అవినాష్ రెడ్డి ఆ రోజు విచారణకు హాజరు కావడం వీలుపడదని సమాధానం ఇచ్చారు. తొలిసారి విచారణకు నోటీసు ఇచ్చిన సమయంలోనూ  ఆయన ఇదే సమాధానం ఇచ్చిన సంగతి విదితమే. దీంతో పెద్దగా కారణాలు వివరించాల్సిన అవసరం లేకుండా విచారణకు సహకరించడం లేదన్న ఒకే ఒక్క కారణంతో సీబీఐ అవినాష్  రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది. అయినా కూడా అవినాష్ రెడ్డి విజ్ణప్తి మేరకు సీబీఐ అధికారులు  ఈ  నెల 10న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సింది ఆదేశిస్తూ ఆదివారం (మార్చి 5)న పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి మరీ నోటీసు ఇచ్చి వచ్చారు.  ఆ  రోజు  మాత్రం  ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని సీబీఐ అధికారులు అల్టిమేటం ఇచ్చినట్లుగా  కూడా చెబుతున్నారు. వరుస పరిణామాలను గమనిస్తే   వివాక్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు  తుదిదశకు చేరుకున్నట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.   ఇక వరుస అరెస్టులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. పైగా వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటి వరకూ రెండు సార్లు సీబీఐ ఎదుట విచారణకుహాజరయ్యారు.  అలాగే  సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి  పీఏ నవీన్ ను కూడా మరోసారి విచారణకు పిలిచేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రిని కూడా సీబీఐ కడపలోనే విచారించనుంది.   వీటన్నిటికీ మించి ఈ కేసులో నిందితుడు సునీల్ యావద్ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలను గమనిస్తే.. ఆయనను అరెస్టు చేయడమే తరువాయి అన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు. 

తెలుగుదేశం నాయకుడు వరుపుల రాజా కన్నుమూత

తెలుగుదేశం నాయకుడు వరుపుల రాజా గుండెపోటుతో కన్నుమూశారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వరుపుల రాజా శనివారం (మార్చి 4) రాత్రి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో కన్నుమూశారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. ప్రస్తుతం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల తెలుగుదేవం ఇన్ చార్జ్ గా ఉన్న వరుపుల రాజా గత కొన్ని రోజులుగా  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన శనివారం మార్చి 3) సాయంత్రమే స్వగ్రామమైన ప్రత్తిపాడుకు చేరుకున్నారు.  తన నివాసంలో పార్టీ నేతలతో రాత్రి వరకూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తరువాత ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.   ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వరుపుల రాజా ప్రారంభించిన రాజా.. డీసీసీబీ చైర్మన్‌గా, ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. గత ఎన్నికలలో  ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి  ఓటమి పాలయ్యారు. వరుపుల రాజా మృతితో టీడీపీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మీయ స్నేహితుడైన రాజా ఆకస్మిక మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యానికి సంజీవని లాంటి తీర్పు!

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మన ప్రజాస్వామ్యం వర్దిల్లుతోందన్న విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఏకంగా విదేశీ గడ్డ మీద నుంచే భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. మోడీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలు కేంద్రం చెప్పుచేతల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయన్నారు. పెగాసన్ స్పై వేర్ తో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఒక్క రాహుల్ గాంధీయే అని కాదు... బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపుగా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్ర ద్యర్యాప్తు సంస్థల తీరు కూడా వారి ఆరోణలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇక ప్రజాస్వామ్య వవస్థకు మూల స్తంభం లాంటి కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండే వారినే ఈ రాజ్యంగ బద్ధ సంస్థకు కమిషనర్లుగా నియమించి ఎన్నికలలో లబ్ధి పొందేలా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో ఒక పద్ధతి ప్రకారం జరగాలని విస్పష్టంగా చెప్పడం కచ్చితంగా ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవాలి.  సుప్రీం చెప్పిన విధంగా అత్యున్నత స్థాయి త్రిసభ్య కమిటీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్లను నియమిస్తే.. ఇక ఆ రాజ్యాంగ సంస్థపై  ఆరోపణలు వచ్చేందుకు ఆస్కారం ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సందేహించే పరిస్థితి ఉండదు. ప్రధాని, విపక్ష నేత, సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ప్యానల్ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల పేర్లను సిఫారసు చేస్తుందనీ, అలా ఆ ప్యానల్ సిఫారసు చేసిన వారినే నియమించాలని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటి వరకూ కేంద్ర కేబినెట్ సిఫారసల మేరకే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకాలు జరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ పద్ధతికి సుప్రీం తీర్పుతో చెక్ పడినట్లే.  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి స్పష్టమైన మార్గ దర్శకాలతో కొత్త చట్టం తీసుకు వచ్చే వరకూ ముగ్గురు సభ్యుల ప్యానల్ ద్వారానే ఈ నియమకాలు జరగాలని కూడా కేంద్రం ఆదేశించింది.  ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో ప్రధానితో పాటు విపక్ష నేతకు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికీ కూడా భాగస్వామ్యం కల్పించడం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం కలుగుతుందనడంలో సందేహానికి తావుండదు.  2024లో లోక్‌సభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు, విమర్శలు  వెల్లువెత్తుతున్న తరుణంలో  ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన నియామకాలకు సరైన చట్టమంటూ ఉండాలని రాజకీయ పార్టీలు పట్టుబట్టకుండా ఉండడంపై  కూడా సుప్రీంకోర్టు   విమర్శించింది. అడుగులకు మడుగులెత్తే ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని చిరకాలం, కలకాలం పదవుల్లో, అధికారంలో కొనసాగాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి  అని కూడా సుప్రీం ధర్యాసనం పేర్కొంది.  దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తప్పనిసరిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలను శిరసావహించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సూత్రాలకు తగ్గట్టుగా ఎన్నికల కమిషన్‌ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నట్లుగా  ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం మారకపోతే   ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల దేశ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందనడంలో సందేహం లేదు. . ఎన్నికల కమిషన్‌ ఎంత స్వేచ్ఛగా ఉంటే, ఎంత స్వతంత్రంగా వ్యవహరిస్తే అంత ఉన్నతంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.   

‘వసంత’రాగంలో అమరావతి పాట.. సైకిలెక్కేయడానికేనా?

విశాఖ పరిపాలన రాజధానిగా చేసుకొని.. త్వరలోనే  ఇక్కడి నుంచే పాలన  ప్రారంభిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్  శుక్రవారం (మార్చి 3)  విశాఖపట్నం వేదికగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సాక్షిగా ప్రకటించారు.  అయితే  ఉమ్మడి కృష్ణాజిల్లా  మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాత్రం మూడు రాజధానులనేది వైసీపీ విధానమైతే కావచ్చు కానీ తాను మాత్రం  ఏకైక రాజధాని అమరావతికే మద్దతిస్తానని విస్ఫష్టంగా చెప్పేశారు. అదీ విశాఖ పరిపాలనా రాజధాని అని జగన్ ప్రకటించడానికి సరిగ్గా ఒకే ఒక్క రోజు ముందు అంటే గురువారం (మార్చి 2)న వసంత కృష్ణ ప్రసాద్ ఈ విషయం చెప్పారు. ఆయనేం జగన్ విశాఖ పరిపాలనా రాజధాని అని ప్రకటిస్తారని తెలియక  చెప్పిన మాట కాద. విశాఖ రాజధానిగా తాను త్వరలో పాలన ప్రారంభిస్తానని జగన్ గతంలో కూడా విస్పష్టంగా ప్రకటించారు. మూడు రాజధానులే తమ విధానమని గత మూడున్నరేళ్లుగా చెబుతూనే ఉన్నారు. అయినా వైసీపీ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న తన మద్దతు అమరావతికేనని విస్పష్టంగా చెప్పారు. అది కూడా జగన్ మానస పుత్రిక లాంటి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం ( మార్చి 3)   కవులూరులో  పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన్ని గ్రామస్థులు అడ్డుకొని.. రాజధానిపై మీరు ఇలా సైలెంట్‌గా ఉంటే ఎలా? రాజధాని అమరావతిపై మీ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిపై గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో భూముల రేట్లు పడిపోయాయని వారు ఎమ్మెల్యే ఎదుటే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళనతో ఆయన ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయి.. అమరావతికే నా ఓటు అంటు క్లియర్ కట్‌గా వారికి స్పష్టం చేసినట్లు సమాచారం. వసంత ఇలా అమరావతికి మద్దతుగా మాట్లాడటంతో ఆయన తెలుగుదేశం గూటికి చేరే యోచనలో ఉన్నారన్న ప్రచారం ఒక్క సారిగా జోరందుకుంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా వసంత కృష్ణ ప్రసాద్ ఇలా అమరావతికే నా మద్దతు అంటే చెప్పారో లేదో.. అలా పార్టీలో వసంత కృష్ణ ప్రసాద్ ప్రత్యర్థి వర్గం, అంటే  మంత్రి జోగి రమేష్ వర్గం వెంటనే రంగంలోకి దిగి విమర్శలు గుప్పించింది. సామాజిక మాధ్యమం వేదికగా ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. వీరికి దీటుగా వసంత వర్గం కూడా సామాజిక మాధ్యమంలో రిటార్డులు సంధిస్తోంది. ఒక విధంగా ఇరువురి వర్గాల మధ్యా సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతోంది.   కాగా వసంత వైసీపీతో బంధం తెంచుకుంటారన్న ప్రచారం జోరందుకోవడానికి ఆయన తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వైసీపీపై ఇటీవల బహిరంగంగానే విమర్శలు గుప్పించడం, విజయవాడ ఎంపీ, తెలుగుదేశం నాయకుడు కేశినేని నానితో భేటీ కావడం కూడా కారణమేనని చెబుతున్నారు. ఇక వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీ లైన్ కు భిన్నంగా ఉయ్యూరు శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడడాన్ని కూడా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అదెప్పుడంటే.. కొద్ది రోజుల కిందట  ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుంటూరులో చంద్రన్న కానుక కార్యక్రమంలో   జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు..  దీంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై వైపీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్  ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తనకు చాలా కాలంగా తెలుసునని.. మంచి వ్యక్తి అని.. తనకు స్నేహితుడు అంటూ మీడియా ముందుకు వచ్చి  చెప్పడమే కాదు.. ఇలా జన్మభూమికి ఎంతో కొంత సేవ చేస్తూన్న ఇలాంటి ఎన్నారైలపై కేసులు పెడితే.. భవిష్యత్తులో మరే ఎన్నారై జన్మభూమికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రారని అన్నారు. ఇది కూడా ఆయన వైసీపీ లైన్ కు భిన్నంగా వెళుతున్నారనడానికి తార్కానంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఇటీవలి కాలంలో వసంత కృష్ణ ప్రసాద్, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ సైకిల్ ఎక్కేస్తారన్న ప్రచారం జోరందుకుంది. అయితే వీరిద్దరి పంచాయతీ జగన్ వరకూ వెళ్లింది. దీంతో జగన్ వీరిద్దరినీ కూర్చో బెట్టి సమన్వయం కుదిర్చారు. మైలవరం టికెట్ వసంతకృష్ణ ప్రసాద్ కే అని స్పష్టం చేయడమే కాకుండా.. నియోజకవర్గాలలో జోక్యం వద్దని జోగి రమేష్ కు విస్పష్టంగా చేప్పారని అప్పట్లో పార్టీ శ్రేణులే చెప్పాయి. దీంతో ఇరువురి మధ్యా సమన్వయం కుదిరిందని అంతా అనుకుంటున్న సమయంలోనే రాజధాని విషయంలో వసంత కృష్ణ ప్రసాద్ ఇచ్చిన క్లారిటీ మళ్లీ ఆయన పార్టీ మార్పు చర్చను తెరమీదకు తెచ్చింది.  ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ ను ప్రస్తావనకు తీసుకు వస్తున్నారు. ఆయన కూడా అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం పాదయాద్ర నెల్లూరులో ప్రవేశించిన సందర్భంగా వారిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న తరువాతే జగన్ తో గ్యాప్ పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ అమరావతికి మద్దతుగా మాట్లాడటంతో ఆయనకు ఇక పార్టీలో కొనసాగే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు.  

పేరులో నేముంది.. మారిస్తే ఒరిగేదేముంది?

మోడీ సర్కార్ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో నగరాలు పట్టణాలు, వీధులు, ప్రాంతాల పేర్లు మార్చడానికి ప్రయత్నాలు ఎక్కవ అయ్యాయి. అయితే ఈ పేర్ల మార్పు ప్రక్రియపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.  గతంలో భారత్ పై దాడులు చేసి, దేశాన్ని దోచుకోవడం ఆలయాలను ధ్వంసం చేయడం వంటి దారుణా లకు పాల్పడిన రాజుల పేర్లు ఇప్పటికీ ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలలోని రోడ్లకు, వీధులకు కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు స్పందించింది. దాడులకు పాల్పడినవారు పెట్టిన పేర్లను మార్చాలని కోరిన ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కొట్టివేసింది. భారతదేశం  ఈ ఆధునిక యుగంలో కూడా గత కాలపు సేతు బంధనాలను తవ్వుకోవడానికే పరిమితం అవ్వడం సరి కాదని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  దేశంలోని అనేక రోడ్లు, వీధులు, ప్రదేశాలు, పట్ట ణాలు, నగరాలకు ఇప్పటికీ ఒకప్పటి    పేర్లే కొనసాగడం ఏమిటని ప్రశ్నిస్తూ,  పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి   దేశాలలో హిందూ మతానికి చెందిన వ్యక్తుల పేర్లను తొలగించిన విషయాన్ని తన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో పిటిషనర్ ప్రస్తావించారు. అయితే ఈ పిటిషన్ ఏ విధంగా చూసినా ప్రజాప్రయోజన వ్యాజ్యం కిందకి రాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సమాజంలో విద్వేషాలు పెచ్చరిల్లడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలకు వంత పాడేలా ఈ పిటిషన్ ఉందని వ్యాఖ్యానించింది. దేశంలో మత విద్వేషాలు పెచ్చరిల్లాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ పిటిషనర్ ను మందలించింది. ఇటువంటి పిటిషన్లు వేయడం భావ్యం కాదని విస్పష్టంగా పేర్కొంది.  అనివార్యం అనుకుంటే తప్ప పేర్ల మార్పు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ రీతిలో పేర్ల మార్పు అన్నది స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయేమో తప్ప దీర్ఘ కాలంలో ఇది సమాజంలో చీలికలకు, అశాంతికి దారి తీస్తుందని  అభిప్రాయపడింది.  భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో మతోన్మాదానికి స్థానం లేదని అ  ప్రజలంతా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాజ్యాంగ ఉపోద్ఘాతంలోనే ఉందని కోర్టు స్పష్టం చేసింది.  

బాలినేనికి గుప్తా దెబ్బ.. మామూలుగా లేదుగా?!

నిజం నిష్టూరంగానే ఉంటుంది. అందుకే యాదార్థవాది లోక విరోధి అన్నారు పెద్దలు. వైసీపీలో అసమ్మతి నేత సుబ్బారావు గుప్తా విషయంలో దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నది పరిశీలకుల విశ్లేషణ.  తాజాగా గుప్తాను రెండు రోజుల కిందట ఒంగోలులో పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సోదాల్లో ఆయన వద్ద గంజాయి దొరికిందని అందుకే అరెస్ట్ చేశామని చెబుతున్నారు. అయితే దీనితో తనకేం సంబంధం లేదని సుబ్బారావు గుప్తా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాపు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు   ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.   మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు సుబానీ అండ్ గ్యాంగ్..  ఇటీవల ఒక మహిళా హాస్టల్‌పై చేసిన దాడిపై  సుబ్బారావు గుప్తా సీరియస్‌గా స్పందించడమే కాకుండా.... బాలినేని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.  సుబ్బారావు గుప్తా ఇలా స్పందించిన రెండంటే రెండు రోజులకే   ఆయనను  అరెస్ట్ చేయడం  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరో వైపు  బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడు  ప్రణీత్‌ రెడ్డీపై   సుబ్బారావు గుప్తా చేస్తున్న విమర్శలు కూడా ఈ అరెస్టుకు ఒక కారణమా అన్న అనుమానం ఒంగోలు వాసులు వ్యక్తం చేస్తున్నారు.  పోలీసుల సమక్షంలోనే తన తడాఖా ఏమిటో... అబ్బా కొడుకులకు టన్నులు టన్నుల కొద్ది చూపిస్తానంటూ సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యల  వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. ఇక  2021, డిసెంబర్‌లో నాటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్బంగా స్థానిక ఫ్యాన్ పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న మన పార్టీ చర్యల వల్ల ఇతర పార్టీల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... భవిష్యత్తలో మరో పార్టీ అధికారంలోకి వస్తే.. మన పార్టీ శ్రేణులు పరిస్థితి ఏమిటనేది ఓ సారి ఆలోచించాలంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.  అయితే ఈ వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పార్టీలోని ఇతర నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీంతో  సుబ్బారావు గుప్తా  ప్రాణ భయంతో గుంటూరులోని ఓ లాడ్జిలో దాక్కుంటే.. బాలినేని ప్రధాన అనుచరుడు సుభానీ తన గ్యాంగ్‌తో కలసి..  లాడ్జిలో దాక్కొన్న గుప్తా పట్టుకొని బండ బూతులు తిడుతూ.. తీవ్రంగా దాడి చేసి.. మోకాళ్లపై కూర్చొబెట్టి...  వాసన్నకు  సారీ చెప్పించారు. ఇందుకు సంబంధించిన  వీడియో  నాడు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసింది. ఆ  తర్వాత బాలినేని శాంతించి.. సుబ్బారావు గుప్తాను తన ఇంటికి పిలిపించుకొని.. అతడికి కేకును మంత్రిగారే స్వయంగా  తినిపించినా.. అప్పటికే బాలినేనికి వ్యక్తిగతంగా ఎంత నష్టం జరగాలో అంతా నష్టం జరిగిపోయిందని ప్రచారం సైతం సాగింది. ఆ తర్వాత సుబ్బారావు గుప్తాపై దాడిని పలు ప్రజా సంఘాలు బహిరంగంగా ప్రశ్నించడంతో.. చేసేది లేక.. సుభానీపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఇక సుబ్బారావు గుప్తా.. వివిధ పార్టీల నాయకులనే కాదు... పలు సంఘాల నేతలను సైతం స్వయంగా కలిసి.. తనపై జరిగిన దాడిని వివరించారు. అంతేకాదు తనపై దాడికి నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద   ఆందోళనకు కూడా దిగారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు  చేస్తానని అప్పట్లోనే  ప్రకటించారు. మరో వైపు ప్రెస్‌మీ‌ట్ పెట్టి... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతానని ప్రకటించమే కాదు.. ప్రెస్ మీట్ పెట్టి బండబూతులు తిట్టకుండా.. మా ఎమ్మెల్యే బాలినేని లాగా చాలా సాప్ట్‌గా కనిపిస్తూ.. చేయాల్సిన వ్యవహారమంతా కామ్‌గా చేసుకుపోవాలంటూ అప్పటి మంత్రి కొడాలి నానికి హిత బోధ చేయడమే కాకుండా, ఈ విషయంలో  మా ఎమ్మెల్యే వాసన్న వద్ద ట్రైనింగ్ తీసుకోవాలంటూ కొడాలి నానికి ఉచిత సలహా కూడా ఇచ్చేశారు.   అయితే సుబ్బారావు గుప్తాపై బాలినేని ప్రధాన అనుచరుడు సుభానీ దాడి చేసిన వీడియో కారణంగా.. బాలినేనిపై  ప్రజల్లో  ఓ విధమైన వ్యతిరేకత వచ్చిందనే ఓ ప్రచారం అయితే అప్పట్లో  చాలా గట్టిగానే జరింగింది. ఆ కారణంగానే పా  బాలినేనికి అప్పటి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఊడిందన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది.   మరోవైపు జగన్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని పలు సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయని  సమాచారం. ఇక ఒంగోలులో సైతం బాలినేనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఇది ఇటీవల బాలినేని నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని ఆయన వర్గమే స్పష్టం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేనికి వచ్చే ఎన్నికల్లో సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ వల్ల చాలా గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందనే ఓ ప్రచారం అయితే ఒంగోలు నియోజకవర్గంలో వాడి వేడిగా సాగుతోంది.

గ్లోబల్ సమ్మిట్ వేళ ఏపీ పరువు తీసిన తెలంగాణ మంత్రి హరీష్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏమిటన్నది ఆయనకు పట్టదు. కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు వచ్చిన వారు కచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం అంశం నుంచి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగం పరిస్థితి, వ్యవసాయ రంగం ఎలా ఉంది, జనం సంతోషంగా ఉన్నారా, లేదా ప్రభుత్వ వ్యతిరేకతతో రగిలిపోతూ ఆందోళనల బాట పడుతున్నారా.. ఇలా ప్రతి విషయాన్నీ వారు పరిగణనలోనికి తీసుకుంటారు. అన్నీ బాగున్నాయని వారు భావిస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వెలిగిపోతోందా? లేక మసకబారిపోయి.. ఇక్కడ ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయా? అలా తరలిపోతుంటే అందుకు కారణాలేమిటి వంటి విషయాలనూ పరిశీలిస్తారు. అన్నిటికీ మించి రాష్ట్రంపై పొరుగు రాష్ట్రాలలో ఉన్న అభిప్రపాయమేమిటి అన్న విషయాలను కూడా తాము ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న నిర్ణయానికి వచ్చేందుకు పరిగణనలోనికి తీసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క అంశంలో రాష్ట్రంలో పరిస్థితులను గురించి మాట్లాడుకుంటే.. జగన్ హయాంలో ఈ  నాలుగేళ్ల కాలంలో ఏ రంగం కూడా అభివృద్ధి చెందలేదు. సంక్షేమ పథకాల పేరుతో ఎంపిక చేసిన లబ్ధిదారుల ఖాతాలలో జగన్ బటన్లు నొక్కి మరీ సొమ్ములుపందేరం చేసుకుంటున్నానని చెప్పుకుంటున్నా.. రాష్ట్రంలోని ఏ వర్గమూ సంతోషంగా ఉన్న దాఖలాలు కనిపించవు. ఒకప్పుడు దేశానికే తలమానికంగాఉన్న విద్యుత్ రంగం ఇప్పుడు కుదేలైపోయింది. విద్యుత్ కోతలతో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇక ప్రభుత్వోద్యోగులు జీతాలో రామచంద్రా అంటూ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమౌతున్నారు. ప్రజలకు మా ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. ఇంత సొమ్ము పందేరం చేసింది అంటూ జనంలోకి వెళుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు  వారి నుంచి ఛీత్కారాలే ఎదురౌతున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బయటకు వెళ్లాలంటేనే అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు భయపడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇక కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. చేసిన పనులకు బిల్లుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో పొరుగు రాష్ట్రం తెలంగాణ మంత్రులు తమ రాష్ట్ర అభివృద్ధిని చాటుకోవడానికి ఏపీలోని వెనుకబాటు తనాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, విద్యుత్ కోతల పరిస్థితి, ఆ రాష్ట్రంలో ఉండలేక తమ రాష్ట్రానికి తరలివస్తున్న పరిశ్రమల గురించి పదే పదే ప్రస్తావించి ఏపీ అన్ని రంగాలలోనే వెనుకబడి ఉందని చాటుతున్నారు.  తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి   కేటీఆర్ తమ రాష్ట్ర ప్రగతిని చాటుకోవడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి గతంలో క్రెడాయ్ సమావేశం వేదికగా ఏపీ దుస్థితిని కళ్లకు కట్టారు. ఆంధ్రప్రదేశ్ పరువును గంగలో కలిపేశారు.   క్రెడాయ్ స‌మావేశంలో ఏపీ బండారం బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డంతో.. ఇక‌పై రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్తాయో రావో అనే ఆందోళ‌న. జ‌గ‌న్ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దుస్థితిని, దౌర్భాగ్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టేలా వివ‌రించారు. ఏపీలో విప‌రీత క‌రెంట్ కోత‌లు, ఊరూరా గుంత‌ల మ‌య‌మైన రోడ్లు, తాగు-సాగు నీటి క‌ష్టాలను ప్ర‌పంచానికి తెలిసేలా..  జ‌గ‌న్‌కు తెలిసొచ్చేలా( తెలిసొచ్చినా ఏపీ సీఎంగా వాటిని పట్టించుకోరనుకోండి) కీల‌క‌మైన క్రెడాయ్ వేదిక‌గా గొంతెత్తి చాటారు కేటీఆర్‌.  అక్కడితో ఊరుకోకుండా తెలంగాణ గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే ఒక్కసారి ఏపీ వెళ్లి చూ డండి మీకే తెలుస్తుందని ముక్తాయించారు.  ఆ తరువాత కూడా పలువురు తెలంగాణ మంత్రులు ఏపీ విషయంలో అక్కడి అభివృద్ధి లేమి విషయంలో చులకనగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీలో గ్లోబల్ఇన్వెస్టర్ల సదస్సు జరుగుతున్న తరుణంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏపీలో వ్యవసాయ రంగం ఎంతగా కుదేలైందో ఉదాహరణతో చెప్పి ఏపీ పరువును మూసీ నదిలో కలిపేశారు. ఆయనేమన్నారంటే.. ఏపీని అన్నపూర్ణగా అంటారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రవాదులు రాష్ట్రం విడిపోతే తెలంగాణ ఏడారి అయిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయ్యింది. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయ రంగం ఎలా పురోగమించిందో తెలియాలంటే ఏపీలో ఆ రంగం దుస్థితిని గురించి తెలుసుకుంటే సరిపోతుందన్నారు. ఈ యాసంగిలో తెలంగాణలో 56లక్షల ఎకరాలలో వరి సాగుచేస్తుంటే.. ఏపీలో కేవలం 16లక్షల ఎకరాలలో వరి సాగు అవుతోందన్నారు. విద్యుత్, జలవనరుల విషయంలో ఏపీ అధ్వాన్న స్థితికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ఏ రంగాలలో అయితే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ అట్టడుగున ఉందో.. ఆ రెండు రంగాలలో తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని హరీష్ రావు చెప్పారు.  

ఇన్వెస్టర్ల సమ్మిట్ జగన్మాయేనా?.. విద్యుత్ రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు అంటే నమ్మేదెలా?

పేక మేడలు కట్టేసి వాటినే అద్భుత కట్టడాలుగా నమ్మమంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. తాను సర్వ నాశనం చేసిన విద్యుత్ రంగంలోనే భారీ పెట్టుబడులు వచ్చాయని చెబుతూ.. ఇక రాష్ట్రం వెలుగుల మయం అయిపోతుందంటున్నారు. ఔను జగన్  రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని తన అవినీతి సామ్రాజ్య విస్తరణకు ఒక పావుగా మార్చుకున్నారు.  జగన్ విద్యుత్  ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల కాంట్రాక్టులను అస్మదీయులు, బినామీలకు కట్టపెట్టారు. ఇందు కోసం విద్యుత్ వినియోగదారులను నిలువుదోపిడీ చేయడానికి కూడా వెనుకాడలేదు. సర్దుబాటు పేరుతో విద్యుత్ వినియోగ దారుల మీద మూయలేని భారాన్ని మోపుతున్నారు.  2021-22 వార్షిక సంవవత్సరంలో డిస్కంలు కొనుగోలు చేసిన విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటును 2023-24 లో వసూలు చేసుకునేందుకు ఏపీ ఈఆర్సీ డిస్కంలకు అనుమతి ఇవ్వడం ఇందుకు తార్కానం.  రూ.3,082 కోట్ల సర్ధుబాటు ఛార్జీలతో కలిపి మరో రూ.456 కోట్ల సరఫరా నష్టాలను కూడా వినియోగదారుల నుంచి వసూలు చేయాలు చేయ డానికి రెడీ అయిపోయింది జగన్ సర్కార్. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సర్కార్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి మరీ అవసరం లేకుండా   హిందుజాకు చెల్లించేందుకు వినియోగదారులపై రూ.49,106 కోట్ల భారం మోపారు. అంతే కాకుండా తన బినామి కంపెనీ అయిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు రూ.2,629 కోట్లు విలువైన బిల్లులు చెల్లించారు. దీంతో జగన్ రెడ్డి నాలుగేళ్లలో ప్రజలపై మోపిన మొత్తం భారం అక్షరాలా  55,273 కోట్ల రూపాయలు.  జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ డిస్కంలు తిరిగి లేవలేని అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. 2019 లో అధికారంలోకి వచ్చే నాటికి   18,022 కోట్ల రూపాయలుగా ఉన్న డిస్కంల అప్పు.   2022 డిసెంబర్ నాటికి   .50,004 కోట్ల రూపాయలకు చేరుకుంది.   అంటే, జగన్  మూడున్నరేళ్లలో డిస్కంల పేరుతో   31,981 కోట్ల రూపాయలు అప్పు చేశారు.   ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు రూ.31,277 కోట్లు. 2019-22 మధ్య కాలంలో బహిరంగ మార్కెట్ లో  రూ. 12,200 కోట్ల విలువైన విద్యుత్ కొనుగోలు చేశారు. కొనుగోళ్లలో కమిషన్ల కోసం రూ.60 వేలు ఖరీదు ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను రూ.1.30 వేలు పెట్టి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొన్నారు. మూడున్నరేళ్లలో కేవలం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు రూ.2,629 కోట్లు రూపాయల బిల్లులు చెల్లించారు.  వాస్తవ పరిస్థితి ఇదైతే.. విశాఖ లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో రాష్ట్ర విత్త మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అవాస్తవాలు వినిపించి జనాలను నమ్మించే విఫల యత్నం చేశారు. వాస్తవానికి గ్లోబల్ సమ్మిట్ లో తొలి రోజు జగన్ సర్కార్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పలు ఎంవోయూలు కుదుర్చుకుంది. ఆ ఒప్పందాల డొల్ల తనం గురించి తరువాత చెప్పుకుందా.. మొదలు  అసలు  గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి ఇసుమంతైనా లేదనడానికి, చంద్రబాబునాయుడి హయాంలో  ఐదేళ్లలో 14,655 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పి ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయి రాష్ట్ర విద్యుత్ రంగం ఎదిగింది. ఆ 14, 655 మెగావాట్ల విద్యుత్ లో 7 వేల మెగావాట్ల సోలార్, విండ్ విద్యుత్ ప్లాంట్లే. అదే జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను నిర్వీర్యం చేశారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారు. సోలార్, విండ్ పీపీఏలను రద్దు చేశాడు.  వారు సరఫరా చేసిన విద్యుత్ కు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. చంద్రబాబు హయాంలో రెన్యువబుల్ ఎనర్జీలో రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటే  నేడు అట్టడుగు స్థానానికి పడిపోయింది.  జగన్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి జరిగిన దాఖలాలు లేవు. బాబు హయాంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఉన్న ఏపీ జగన్ నాలుగేళ్ల పాలనలో విద్యుత్ కోతల రాష్ట్రంగా మారిపోయింది.  ఇప్పుడు తగుదునమ్మా అని విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో విద్యుత్ రంగంలో 8.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రకటిస్తున్నారు.  అంటే లక్షా 50 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నామని జగన్ సర్కార్ ప్రకటిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో పీక్ డిమాండ్ అందులో సగానికి సగం కూడా ఉండదు. మరి డిమాండ్ లేని రంగంలో ఇన్వెస్టర్లు భారీగా ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకున్నారంటే జగన్మాయ అనే చెప్పాలి. భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రకటనలు గుప్పించుకోవడానికే తప్ప ఈ ఒప్పందాలలో ఏవి గ్రౌండ్ అవుతాయంటే ఎవరూ నోరు మెదపరు. రైతు భరోసా అంటూ తెనాలిలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కుడు లాంటివే ఈ ఒప్పందాలు కూడా అనుకోవాలి. ఇక ఇన్వెస్టర్ల సదస్సుకు వచ్చిన డిలిగేడ్స్ ఇన్ని వేల మంది అన్ని వేల మంది అంటూ చేసుకున్న ప్రచారంలోని డొల్లతనం ఏమిటో ఐ ప్యాక్ సాక్షిగా నిన్ననే బయటపడింది. 

ప్రముఖ రచయిత్రి కే.రామలక్ష్మి ఇక లేరు

ప్రముఖ రచయిత్రి, కె.రామలక్ష్మి కన్నుమూశారు. సుప్రసిద్ధ కవి అరుద్ర సతీమణి కే.రామలక్ష్మి గత కొంత కాలంగా అస్వస్థతతో తీసుకుంటున్నారు.ఆమె శుక్రవారం (మార్చి 3)న  తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 93 ఏళ్లు.  ప్రముఖ కవి ఆరుద్ర సతీమణి.. కూచి రామలక్ష్మి (93) ఇకలేరు. వయోభారం, అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మలక్‌పేటలోని తన పెద్ద కుమార్తె కవిత ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కే.రామలక్ష్మి స్వస్థలం కాకినాడ సమీపంలోని కోటనందూరు. ఆమె కొంత కాలం పాత్రికేయురాలిగా కూడా పని చేశారు. కే.రామలక్ష్మి పలు కథలు, నవలలు, విమర్శనా వ్యాసాలు, సినిమా సమీక్షలు రాశారు. అంతే కాకుండా ఆమె పలు సినిమాలకు కథ, మాటలు అందించారు.  జీవన జ్యోతి ,  చిన్నారి పాపలు, గోరింటాకు వంటి సినిమాలకు కథ, మాటలు అందించారు.