జాతీయ రాజకీయాల్లో పోటా పోటీ భేటీలు

వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలకు చెందిన 26 పార్టీలు బెంగళూరులో సమావేశమైన సంగతి తెలిసిందే. నిన్న ప్రారంభమైన ఈ సమావేశాలు ఈరోజు కూడా కొనసాగాయి. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కూటమికి చెందిన అగ్రనేతలు భేటీ అయ్యారు.  నిన్న సాయంత్రం విపక్షాలకు చెందిన అగ్ర నేతలంతా విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నాటి సమావేశానికి చెందిన అజెండాపై చర్చలు జరిపారు. మరోవైపు విపక్ష కూటమి నాయకత్వ బాధ్యతలను యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీకి అప్పగించవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది.  లోకసభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ బేటీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసీ నేత మమతా బెనర్జీ , యుపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ కలుసుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత మొదటి సారిగా వీరిద్దరు ఒకే వేదిక మీద భేటి అయ్యారు. ఒకరి యోగ క్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు.  విపక్షాల భేటీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఈరోజు జరగనున్న భేటీ అత్యంత కీలకమైనది. ఈనాటి సమావేశానికి కేవలం అగ్ర నాయకత్వాలు మాత్రమే హాజరయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. సోనియాగాందీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు స్టాలిన్, నితీశ్ కుమార్, కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ఈనాటి భేటీలో పాల్గొన్నారు.  ఫ్రంట్ పేరుపై సూచనలు చేయాలని నిన్నటి విందు సమావేశంలో అన్ని పార్టీలను కోరారు.  మరో వైపు ఎన్డీఏ కూటమి న్యూఢిల్లీలో సమావేశమైంది . యుపీఏ కూటమి ఎన్డీఏ కూటమి పోటా పోటీగా సమావేశాలు జరపడం ఆసక్తికరంగా మారింది. ఇవ్వాల్టి భేటీలో లోక జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కూడా హాజరయ్యారు. ఈయన మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు. తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ బాధ్యతలను తానే చూసుకుంటూ బీహార్ రాజకీయాలలో తన దైన ముద్ర వేసుకున్నారు.  జాతీయ రాజకీయాల్లో ఇవ్వాల్టి రోజు చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.  యుపీఏ, ఎన్డీఏ భేటీలు  ఒకే రోజు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకరకంగా చెప్పాలంటే శక్తి ప్రదర్శన అని అభివర్ణించవచ్చు.  కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన విపక్ష భేటీలో దాదాపు రెండు డజన్ల పార్టీలు హాజరయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కూడా దాదాపు అదే సంఖ్యలో పార్టీలు భాగస్వామ్యమయ్యాయి.  మహరాష్ట్ర కు చెందిన నేతలు షిండే , అజిత్ పవార్ తదితరులు హాజరయ్యారు. 

స్పీడ్ న్యూస్ 1

1. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ ఒకింత తగ్గింది. సోమవారం శ్రీవారిని 71వేల 804 మంది దర్శించుకున్నారు. 25వేల 208 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 5.40 కోట్ల రూపాయలు వచ్చింది. ............................................................................................................................................................... 2. కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ  కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని  చిన్మయ మిషన్ హాస్పిటల్  చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ............................................................................................................................................................... 3. తెలంగాణలో  వ్యాప్తంగా ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం రేపటి నుంచి శుక్రవారం వరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. .............................................................................................................................................................. 4. చంద్రయాన్ రాకెట్ శకలం ఒకటి ఆస్ట్రేలియా  సముద్ర తీరంలో  కనిపించిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అక్కడి సముద్ర తీరం వద్ద కనిపించిన  డ్రమ్ము ఆకారంలో ఉన్న ఆ వస్తువు చంద్రయాన్  శకలం అయి ఉంటుందని భావిస్తున్నట్లు అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు. ...................................................................................................................................................... 5. జమ్మూకశ్మీరులో  నిన్న రాత్రి  జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.  వీరు విదేశీయులని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హతమైన ఉగ్రవాదులు విదేశీయులని భావిస్తున్నారు.  సింధారా, పూంచ్ ప్రాంతాల్లో  కూంబింగ్ సందర్భంగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. .......................................................................................................................................................... 6.పొలండ్‌ రాజధాని వార్సాకు  47 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్‌ఫీల్డ్‌ వద్ద విమానాలు నిలిపి ఉంచే హ్యాంగర్‌ఫై సెస్నా 208 అనే చిన్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హాంగర్‌లో ఉన్న నలుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. .............................................................................................................................................................. 7. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల   రెండో వారంలో  జరగనున్నాయి.  ప్రభుత్వ బిల్లుల ఆమోదంపై ప్రభుత్వానికి, గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మధ్య  విభేదాల  నేపథ్యంలో ఈ సమావేశాలలో కొత్త బిల్లులేవీ ప్రవేశపెట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  .......................................................................................................................................................... 8. యమునా నది వరద నీరు ప్రసిద్ధ వారసత్వ కట్టడం తాజ్ మహల్ ను తాకింది. గత 45 సంవత్సరాలలో యమునానది వరద తాజ్ మహల్ ను తాకడం ఇదే తొలిసారి. యమునా  వరద కారణంగా  రామ్‌బాగ్‌, ఎత్మాదుద్దౌలా, జోహ్రీ బాగ్‌, మెహ్‌తాబ్‌ బాగ్‌  వంటి కట్టడాలకు ముంపు పొంచి ఉన్నది.   ............................................................................................................................................................... 9. మణుగూరు బీటీపీఎస్​ లో ప్రమాదవశాత్తు కాంట్రాక్టు కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు.    బిహార్ రాష్ట్రానికి చెందిన సచిన్ మోహత్ కుబేర్  అనే కాంట్రాక్ట్ కార్మికుడు  బీటీపీఎస్​లోని చిమ్నీపైకి ఎక్కి పనులు చేస్తూ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.   .......................................................................................................................................................... 10.  మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైసీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారు.   వేటపాలెం వద్ద రొయ్యల ఫ్యాక్టరీలో వాకింగ్ చేస్తుండగా ఆయనను పాము కాటు వేసింది.  ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ............................................................................................................................................................. 11. కేదార్‌నాథ్  ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్లను నిషేధిస్తూ  బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.  ఒక‌ యూట్యూబర్ కేదార్‌నాథ్ ఆలయం వ‌ద్ద‌  ల‌వ‌ర్‌కి ప్రపోజ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో కేదార్‌నాథ్ ఆలయ పవిత్రత దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. .............................................................................................................................................................. 12. డెంగీ జ్వరాలు హస్తినను వణికిస్తున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ నెల 15 వ తదీవరకూ 163 మంది డెంగీ జర్వం బారిన పడ్డారు. యమునా నది వరదల కారణంగా పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెరిగిం డెంగీ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ...................................................................................................................................................... 13.  దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది.   మంగళవారం ఉదయానికి యమునానది నీటి మట్టం 206 మీటర్లకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ..................................................................................................................................................... 14. జమ్మూ కశ్మీరులో ఓ చిరుతపులి దాడి ఘటనలో 12 మంది గాయపడ్డారు.  దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలోని అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన చిరుత పులి సల్లార్ గ్రామంలోని జనావాసాలపై దాడికి పాల్పడింది.  .......................................................................................................................................................... 15.   ముంబయిలో అధికారులు వీధి కుక్కల బెడతను నియంత్రించి, వాటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు.   పౌరులకు ఆధార్ కార్డ్ లా వీధి శునకాలకు కూడా వాటికి సంబంధించిన సమాచారంతో   క్యూఆర్ కోడ్‌తో కూడిన ఐడెంటిటీ కార్డులు తగిలించారు. ............................................................................................................................................................. 

కేరళ మాజీ సీఎం ఉమెన్ చాంది కన్నుమూత

కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ  కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని  చిన్మయ మిషన్ హాస్పిటల్  చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. ఉమెన్ చాంది మరణించారని ఆయన కుమారుడు తన ఫేస్ బుక్ ద్వారా పేర్కొన్నారు. ఉమెన్ చాంది మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక లెజెండ్ ను కోల్పోయామని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.  ఉమెన్ చాంది 1970లొ తొలి సారిగా పూతుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై చట్ట సభలో అడుగుపెట్టారు. ఆ తరువాత అదే నియోజకవర్గం నుంచి 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977లో కేరుణాకరణ్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు.  ఆ తరువాత 2004 నుంచి 2006 వరకూ, 2011 నుంచి 2016 వరకూ కేరళ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.  ఉమెన్ చాందీ 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నియోజకవర్గం నుంచి  1970లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.  ఉమెన్ చాందీ వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1977 లో కె. కరుణాకరన్ కేబినెట్ లో తొలిసారి మంత్రిగా పనిచేశారు. ఉమెన్ చాందీ  రెండు సార్లు(2004-2006, 2011-2016) సీఎంగా పనిచేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా కూడా పని చేశారు. 

కాంగ్రెస్ బీసీ మంత్రం

తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది. మ‌రికొద్ది నెల‌ల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించేందుకు అన్ని ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. క‌ర్ణాట‌కలో కాంగ్రెస్ పార్టీ విజ‌యం త‌రువాత తెలంగాణ‌లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్న విష‌యం తెలిసిందే. గ్రామ స్థాయి నుంచి మండ‌ల‌, జిల్లా స్థాయిల్లో పార్టీ శ్రేణులు యాక్టివ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు వంటి కీల‌క నేత‌లు కాంగ్రెస్‌లో చేర‌డం అద‌న‌పు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది. వీరికి తోడు మ‌రికొంద‌రు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే బీఆర్ఎస్ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సైతం తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టిసారించారు. తెలంగాణ‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ప‌లు సంద‌ర్భాల్లో రాహుల్ పేర్కొంటూ వ‌స్తున్నారు. రాహుల్ గాంధీ అంత ధీమాగా చెప్ప‌డానికి కార‌ణం స‌ర్వేల నివేదిక‌లేన‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కాంగ్రెస్ నిర్వ‌హించిన స‌ర్వేలో కాంగ్రెస్ విజ‌యం ప‌క్కా అని తేలిదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి‌. తెలంగాణలోని పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు కాంగ్రెస్‌తోనే త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావిస్తున్నరని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.  2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీలో నేత‌ల మ‌ధ్య విబేధాలు కేసీఆర్‌కు క‌లిసొచ్చాయ‌నే చెప్పొచ్చు. ఈసారి ఆ అవ‌కాశాన్ని కేసీఆర్‌కు ఇవ్వ‌కుండా కాంగ్రెస్ నేత‌లంతా ఐక్య‌తా రాగాన్ని అందుకున్నారు. నేత‌లంతా ఒకేమాట‌పై ఉంటూ కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దాడిచేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాల‌ను తిప్పికొడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటుండ‌గా.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రోజురోజుకు జోష్ పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయా సామాజిక వ‌ర్గాల‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. ఇప్ప‌టికే ఎస్సీ, ఎస్టీ ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే ఆ రెండు సామ‌జిక వ‌ర్గాల ఓట‌ర్లు ఎక్కువ‌గా కాంగ్రెస్ వెంటే ఉంటూ వ‌స్తున్నారు. మిగిలిన వారినిసైతం కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికేలా కాంగ్రెస్ అధిష్టానం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నది. దీనికితోడు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ద‌ళితుడే తెలంగాణ సీఎం అవుతాడ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఆ హామీని తుంగ‌లో తొక్కారు. మ‌రోవైపు ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి అని చెప్పి కేసీఆర్ కేవ‌లం కొద్ది మందికి మాత్ర‌మే ఇచ్చి ఆ ప‌థ‌కానికి ఎగ‌నాం పెట్టారు. ద‌ళిత బంధు విష‌యంలో దాదాపు అదే ప‌రిస్థితి. ఈ విష‌యాల‌పై ఎస్సీ ఓట‌ర్ల‌లో చైత‌న్యం నింపి వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకొనేలా కాంగ్రెస్ అధిష్టానం చ‌ర్య‌లు చేప‌ట్టింది.  మ‌రోవైపు.. ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలో పోరాటాలు సాగుతున్న పోడు భూముల సమస్యకు ఈ మధ్యనే కేసీఆర్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా   పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పెద్ద సంబురంగా జరిపించింది. దీంతో ఎస్టీ ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు బీఆర్ఎస్ అదిష్టానం గ‌ట్టి ప్లానే వేసింది. దీనికి విరుగుడుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీలకుకూడా భారీ ఆర్ధిక సాయం అందించే పథకం తెస్తామని ఆ పార్టీ నేత‌లు హామీ ఇస్తున్నారు. ఆ రెండు సామాజిక వ‌ర్గాల‌కు తోడు బీసీ వ‌ర్గాల‌పైనా కాంగ్రెస్ గురిపెట్టింది. తెలంగాణ‌లో బీసీ   ఓట‌ర్లు అధికంగా ఉన్నారు. అనేక‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ముల‌పై వీరి ప్ర‌భావం ఎక్కువే. బీసీ ఓట‌ర్లు అధికంగా ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించే నియోజ‌క‌వ‌ర్గాలుకూడా ఉన్నాయి. దీంతో బీసీల‌పై కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపులో బీసీల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని ఇప్ప‌టికే ఆ పార్టీ నేత‌లు చెప్పారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గ‌ర్జ‌న స‌భ‌లు నిర్వ‌హించేందు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మైంది.  బీసీ గ‌ర్జ‌న స‌భ‌ల్లో భాగంగా తొలుత ప‌లు జిల్లాల్లో స‌న్నాహ‌క స‌మావేశాలు నిర్వ‌హించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యించింది. ఈనెల 19న సంగారెడ్డిలో, 21న క‌రీంన‌గ‌ర్, 23న నిజామాబాద్‌, 24 అదిలాబాద్ జిల్లాల్లో సన్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ నేత వీహెచ్ ప్ర‌క‌టించారు. అయితే, ఈ స‌న్నాహ‌క స‌మావేశాల‌కు రాహుల్ గాంధీ, క‌ర్ణాట‌క సీఎం సిద్ధ రామ‌య్య‌ల‌ను ఆహ్వానిస్తామ‌ని చెప్పారు. ఈ స‌మావేశాల్లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం బీసీ వ‌ర్గాల‌ను విస్మ‌రించింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే బీసీల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని, బీసీల అభివృద్ధికోసం అమ‌లు చేసే ప‌థ‌కాల‌ను సైతం ఈ స‌మావేశాల్లో వివ‌రించే అవ‌కాశం ఉంది. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ ఓట్ల‌పై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా బీసీ వ‌ర్గాల ఓట్ల‌పైనా ఫోక‌స్ పెట్టింది. కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు స‌క్సెస్ అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.

బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కాంగ్రెస్‌కు పెరిగిన క్రేజ్

తెలంగాణ‌లో మ‌రి కొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అందుకు ఈసీ ఏర్పాట్లు మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు  కాంగ్రెస్‌, బీజేపీలు వాటి వాటి  వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు తెలంగాణ‌లో మ‌రోసారి అధికారం మాదే అని భావించిన బీఆర్ఎస్ నేత‌ల్లో ప్ర‌స్తుతం ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతున్నది. క‌ర్ణాట‌క‌లో  విజ‌యం త‌రువాత తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్ద‌లు సైతం తెలంగాణపై ప్ర‌త్యేక దృష్టిసారించ‌డంతో బీఆర్ఎస్‌లో కంగారు మొదలైంది. గ‌తంలోలా కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య చీలిక తెచ్చి పార్టీ బ‌లాన్ని నిర్వీర్యం చేయాల‌నుకున్న సీఎం కేసీఆర్ ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. కాంగ్రెస్ పార్టీలోని అగ్ర‌నేత‌లంతా ఏక‌తాటిపైకి వ‌చ్చారు. కేసీఆర్‌ను గ‌ద్దెదించ‌డ‌మే ల‌క్ష్యం అంటూ నేత‌లు గంటాప‌థంగా చెబుతున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీనేత‌ల ఐక‌మ‌త్యంగా అధికార పార్టీపై పోరాడుతుండ‌టంతో గ్రామ‌ స్థాయి నుంచి పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది.  రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా సాగుతోందా అనిపించేలా వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌ల్లో బ‌ద‌నాం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. ఈ క్ర‌మంలో అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ అధిష్టానం త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. అయితే  అధికార పార్టీ వ్యూహం బెడిసికొట్టింది.   రేవంత్ రెడ్డి రైతుల‌కు కేవ‌లం మూడు గంట‌ల పాటే ఉచిత విద్యుత్ ఇవ్వాల‌ని చెప్పారని, రైతులంటే కాంగ్రెస్‌కు గిట్ట‌ద‌ని అర్థ‌మైంద‌ని, రైతులంతా కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను నిల‌దీయాలంటూ బీఆర్ఎస్ నేత‌లు ప్రెస్‌మీట్లు పెట్టిమ‌రీ చెప్పారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచ‌న‌ల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా స‌బ్ స్టేష‌న్ల వ‌ద్ద బీఆర్ఎస్ నేత‌లు నిర‌స‌న‌కు సైతం దిగారు. అయితే  బీఆర్ఎస్ వ్యూహాన్ని కాంగ్రెస్   నేత‌లు తిప్పికొట్టారు. రేవంత్ వ్యాఖ్యల‌ను వక్రీకరిస్తూ బీఆర్ఎస్ రైతుల మెప్పు పొందాల‌ని చూస్తున్నద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకొని వ‌చ్చిన రేవంత్ సైతం బీఆర్ఎస్ నేత‌లపై ఆగ్ర‌హం వ్య‌క్త చేశారు. త‌న వ్యాఖ్య‌ల‌ను పూర్తిస్థాయిలో కాకుండా బీఆర్ఎస్ అధిష్టానం వారికి అనుకూలంగా కట్ అండ్ పేస్ట్ పద్ధతిలో వీడియో విడుద‌ల చేసింద‌ని రేవంత్ ఆగ్రహం వ్య‌క్తం చేశాడు. అమెరికాలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను రేవంత్ మీడియా ముందు మ‌రోసారి వెల్ల‌డించారు. 24గంట‌ల విద్యుత్ పేరుతో కేసీఆర్ కోట్లాది రూపాయ‌లు దోపిడీ చేస్తున్నారని రేవంత్ చెప్పారు. 24గంట‌ల ఉచిత విద్యుత్ పేరుతో ఏడాదికి 16వేల కోట్లు కేటాయిస్తున్న కేసీఆర్‌.. కేవ‌లం ఎనిమిది గంట‌లు మాత్ర‌మే ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, ఈ మాత్రం విద్యుత్ ఇవ్వ‌టానికి కేవ‌లం 8వేల కోట్లు మాత్ర‌మే స‌రిపోతాయ‌ని రేవంత్ చెప్పారు. కానీ, ఉచిత విద్యుత్ పేరుతో కోట్లాది రూపాయ‌లు కేసీఆర్ దోపిడీ చేస్తున్నారని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. దీనికితోడు బీఆర్ఎస్ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు కాంగ్రెస్ నేత‌లు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తుండ‌టంతో బీఆర్ఎస్ బ‌డా నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. బీఆర్ఎస్ లేవ‌నెత్తిన ఉచిత‌ విద్యుత్ అంశం ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ పార్టీకే క్రేజ్ పెంచింద‌ని అధికార పార్టీ నేత‌లు వాపోతున్నార‌ని పరిశీలకులు చెబుతున్నారు‌. అయితే, బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం త‌న పంతాన్ని నెగ్గించుకొనేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉంది. కాంగ్రెస్ నేత‌లు సైతం బీఆర్ఎస్ వ్యూహాల‌ను తిప్పికొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.  ఉచిత విద్యుత్ అంశంపై అమెరికాలో రేవంత్ వ్యాఖ్య‌ల‌పై అధికార పార్టీ నేత‌లు నిర‌స‌న‌లు తెలిపినా ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా స్పందన క‌నింపించ‌లేద‌ని బీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించడంతో ఆ ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగిస్తూనే మ‌రో అంశాన్ని లేవ‌నెత్తింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అప్పటి సీఎం వైఎస్ఆర్ హ‌యాంలో తొమ్మిది గంట‌ల ఉచిత విద్యుత్ ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఇప్పుడున్న కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ అని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్‌ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేటీఆర్‌, హ‌రీష్ రావులు రేవంత్ రెడ్డి చోటా చంద్ర‌బాబు అంటూ విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టారు. అయితే, బీఆర్ఎస్ కొత్త‌గా లేవ‌నెత్తిన అంశంపైనా కాంగ్రెస్ నేత‌లు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో ఉన్న స‌గం మంది మంత్రులు టీడీపీ నుంచి వ‌చ్చిన‌వారేన‌ని.  పోచారం శ్రీనివాసరెడ్డి చంద్రబాబు పంచన లేడా? దయాకర్ రావు చంద్రబాబు పంచన లేడా?  తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు పంచన లేడా? అంటూ కాంగ్రెస్ నేత‌లు ఎదురు దాడికి దిగుతున్నారు. చంద్రబాబు దయా దక్షిణ్యాలతోనే బీఆర్ఎస్ నేతలకు రాజకీయ భిక్ష అని, కేసీఆర్‌ మంత్రి వర్గం మొత్తం టీడీపీలోనే పుట్టిందంటూ కాంగ్రెస్ నేత‌లు కేటీఆర్, బీఆర్ఎస్ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై ఎటాక్ మొద‌లు పెట్టారు. మొత్తానికి బీఆర్ఎస్ ఏ అంశాన్ని లేవ‌నెత్తినా కాంగ్రెస్ నేత‌లు ఐక్యంగా  కౌంట‌ర్ ఇస్తుండ‌టంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. ఇదే రీతిలో కాంగ్రెస్ నేత‌లు ముందుకు సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌టం ప‌క్కా అంటూ విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. 

స్పీడ్ న్యూస్ 4

31. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముఖచిత్రం మారిపోయిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఉజ్వల పథకం కింద దేశంలో పది కోట్ల మందికి మోడీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని ట్వీట్ చేశారు. మహిళలు పొగపొయ్యిలతో ఇబ్బందులు పడే రోజులు పోయాయన్నారు. .............................................................................................................................................. 32.   రాహుల్ గాంధీకి వడ్లకు, ఎడ్లకు తేడా తెలియదంటూ  మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై  స్పందించిన రేవంత్  ప్రాసకోసం పాకులాడే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అంటూ ఎద్దేవా చేశారు. వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ............................................................................................................................................................... 33.  ఇచ్చిన హామీలను అమలు చేయనందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ....................................................................................................................................... 34.  ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్ కు శ్రీకారం చుట్టింది.  తొలుత కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో  ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.  ............................................................................................................................................................ 35.  అన్నమయ్య జిల్లా నవాబుకోటలో  టమోటా సాగు చేసే రైతు మధుకర్ దారుణ హత్యకు గురయ్యారు. తన టమోటా పంటకు కాపలాగా పడుకున్న మధుకర్ ను  దుండగులు పొలంలోనే గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.  ............................................................................................................................................................... 36.  విజవాడ ధర్నా చౌక్ లో సహకార సంఘాల ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.  తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, జీవో 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ..........................................................................................................................................................` 37. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో  ఓ కేసుకు సంబంధించి పోలీసులు అదుపులో ఉన్న సెక్యూరిటీ గార్డు మరణించాడు. ఆదివారం ఉదయమే అతడు లాకప్ లో మరణించగా సాయంత్రం వరకు పోలీసులు నిందితుడు మరణించిన విషయాన్ని గోప్యంగా ఉంచడంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   .......................................................................................................................................................... 38. గుంటూరు హిందూ కళాశాల కూడలిలో  తెలుగుదేశం బీసీ నాయకుల ఆందోళన చేపట్టారు. బాపట్ల జిల్లాలో హత్యకు గురైన  పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ............................................................................................................................................................ 39. ఏలూరు ఎస్పీ కార్యాలయం వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్ ను ఆందోళనకు దిగారు.   ప్రభుత్వం వాడుకున్న  14, 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలంటూ నినాదాలు చేశారు.  ........................................................................................................................................................ 40. వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ నాలుకను వెయ్యిసార్లు కోస్తామంటూ సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

రాజకీయాలలో టాలీవుడ్ కరివేపాకులు!

ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఫిల్మ్ గ్లామర్ ఒక అసెట్. అందులో సందేహం లేదు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచీ సినీమా ప్రభావం చాలా చాలా ఎక్కువగానే ఉంది. కలావాచస్పతిగా గుర్తింపు పొందిన కొంగర జగ్గయ్య, డాక్టర్ ప్రభాకరరెడ్డి వంటి వారు ఇటు సినిమాలలోనూ.. అటు రాజకీయాలలోనూ రాణించారు. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత సినీ గ్లామర్ అనేది రాజకీయాలకు ఒక అదనపు హంగుగా ఇమిడిపోయింది. ఎన్టీఆర్ తరువాత తెలుగుదేశంలో  సినీ గ్లామర్ కు  చంద్రబాబు నాయుడు కూడా సముచిత స్థానం ఇచ్చారు. తమ ప్రచారం ద్వారా పార్టీకి అదనపు ఆదరణ కలిగేందుకు దోహదపడిన వారికి సముచిత పదవులు హోదా కల్పించి గౌరవంగా చూసుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తరువాత కాంగ్రెస్ కూడా అనివార్యంగా సినీ స్టార్లకు పార్టీలో అవకాశం ఇచ్చింది. హీరో కృష్ణ వంటి వారు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాకుండా చట్ట సభలకు కూడా ఎన్నికయ్యారు. అయితే ఆ పార్టీలో వారికి సరైన గుర్తింపు లేదన్న భావనతో క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తెలుగుదేశం మాత్రం సినీ పరిశ్రమ సేవలను సమర్థంగా వినియోగించుకోవడమే కాకుండా.. పార్టీకి సేవలందించిన వారికి సరైన ప్రాధాన్యత కూడా ఇచ్చి ప్రోత్సాహించింది. నటుడు మోహన్ బాబుకు రాజ్యసభ సభ్యత్వం, ప్రస్తుత మంత్ర రోజాకు అప్పట్లో అంటే ఆమె తెలుగుదేశంలో ఉన్న సమయం తెలుగు మహిళా అధ్యక్షపదవిని కట్టబెట్టింది.  రాష్ట్ర విభజన తరువాత కూడా  విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం సినీ పరిశ్రమ సేవలను ఉపయోగించుకుంటూనే వచ్చింది. వస్తోంది. అదే కోవలో వైసీపీ కూడా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను పార్టీలో చేర్చుకున్నప్పటికీ... వారి పట్ల యూజ్ అండ్ త్రో వైఖరినే అవలంబిస్తూ వస్తోందని పరిశీలకులు అంటున్నారు.  వైసీపీలో చేరిన నటులు జీవిత, రాజశేఖర్ వంటి వారు గుర్తింపు కరవై దూరమయ్యారు.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. దర్శకులు ఎస్పీ కృష్ణారెడ్డి వైసీపీకి సేవలందించే ఉద్దేశంతో పార్టీలో చేరినప్పటికీ ఆయనను పట్టించుకునే నాథుడే లేకపోయాడు.  ఇక 2019 ఎన్నికల సమయంలో పార్టీ కోసం సినీ కెరీర్ ను కూడా ఫణంగా పెట్టి  పని చేసిన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, లవ్ యూ రాజా అనే ఊతపదంతో పాపులర్ అయిన సినీ రచయత నటుడు పోసాని కృష్ణ మురళి, కాట్రవల్లి అలీల పరిస్థితి అలాగే తయారైంది. వీరిలో తన స్థాయి మరచి విపక్షంపైనా మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పై నోరు పారేసుకున్న ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్ కు ముందుగా ఓ పదవి దక్కింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. వివాదంలో చిక్కుకున్న ఆయన పదవిని ఊడబెరికిన జగన్ ఆ తరువాత కనీసం పట్టించుకోలేదు. దీంతో తనేకు అంతో ఇంతో పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టిన సినీ పరిశ్రమకూ. రాజకీయాలకూ కూడా పనికిరాని పుష్పంగా మిగిలిపోయారు. ఇక పోసాని, అలీల విషయానికి వస్తే.. వైసీపీ విజయానికి కూలీలుగా పని చేసిన వీరిద్దరికీ పదవుల ఆశ చూపిన జగన్.. పార్టీ విజయం తరువాత పూర్తిగా విస్మరించారు. ముఖ్యంగా అలీ అయితే.. 2019 ఎన్నికలలో పోటీయే లక్ష్యంగా రాజకీయ ప్రవేశం చేశారు. ఇందు కోసం ఆయన తెలుగుదేశం, జనసేన పార్టీలతో సంప్రదింపులు జరిపి చివరకు వైసీపీలో చేరారు. అయితే ఆ ఎన్నికలలో అలీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు. కానీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, రాజ్యసభ సభ్యత్వం వంటి హామీలు లభించడంతో.. పోటీకి అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తిని మనసులోనే దిగమింగుకుని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తే.. చివరికి మూడు సంవత్సరాల తరువాత అలీకి దక్కింది ఓ సలహాదారు పదవి. పోసాని పరిస్ఠితీ అంతే. స్థాయికి తగ్గ పదవులు కాకున్నా అలీ, పోసాని కూడా మరో గత్యంతరం లేక ఇప్పటికీ పార్టీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా అలీ విషయానికి వస్తే సినీ ఇండస్ట్రీలో స్టార్ కమేడియన్ గా ఆయన స్థాయే వేరు. ముఖ్యంగా పవన్  కల్యాణ్ కు ఆయన క్లోజ్ ఫ్రెండ్ అని అలీ వైసీపీలో చేరడానికి ముందు వరకూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. వైపీసీలో చేరిన తరువాత అలీ పవన్ కల్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో అటు స్నేహానికీ దూరం కావడమే కాకుండా సినీ అవకాశాలు సైతం బాగా తగ్గిపోయాయి. వచ్చే ఎన్నికలలోనైనా పోటీకి  జగన్ పార్టీ టికెట్ ఇస్తారా అంటే ఆ నమ్మకమూ లేదు. వైసీపీ పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఒక వేళ అవకాశం దక్కినా గెలుపుపై నమ్మకాలూ అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో అలీ పరిస్థతి అగమ్య గోచరంగా మారిందని పరిశీలకులు అంటున్నారు.   తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో ఓ వెలుగువెలిగిన కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు.. వైసీపీ కండువా కప్పుకున్న తరువాత ఆ పార్టీలో కనీస గుర్తింపునకు కూడా నోచుకోవడం లేదు.  కరుణామయుడు సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విజయచందర్ వైసీపీలో చేరి ఎందుకూ కొరగాకుండా పోయారు.  భానుచందర్, హాస్య నటుడు కృష్ణుడు ఎందరో అటు సినీమాలకు దూరమై, ఇటు రాజకీయంగానూ గుర్తింపునకు నోచుకోక అనామకంగా మిగిలిపోయారు.  మధ్యలో   హీరో నాగార్జున, నటి రాశి ముఖ్యమంత్రి జగన్ ను కల్సినప్పటికీ ఆ పార్టీలో చేరడానికి మాత్రం ముందుకు రాలేదు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం వైసీపీకి లేదని అర్ధమౌతున్నది. అలాగే వైసీపీకి కూడా సినీ పరిశ్రమకు చెందిన వారిని యూజ్ అండ్ త్రో గా వాడుకుని వదిలేయడమే తప్ప వారి ప్రతిభకు తగిన గుర్తింపు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమౌతోంది.

స్వీడ్ న్యూస్ 3

21. జగనన్న స్మార్ట్‌ సిటీ నిర్మాణానికి వ్యతిరేకంగా బద్దేలులో  ఎస్సీలు ఆందోళనకు దిగారు.  తమకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారంటూ  జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు.  ఈ సందర్భంగా  పోలీసులు, ఎస్సీలకు మధ్య తోపులాట జరిగింది. ..........................................................................................................................................................  22. కోడిని కుక్క కరిచిన ఘటన వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఘర్షణకు కారణమైంది. ఉమ్మడి కడప జిల్లా మాధవరం గ్రామంలో  జరిగింది. స్థానిక  తెలుగుదేశం నేతకు చెందిన కోడిని  వైసీపీ నేత పెంపుడు కుక్క కరవడంతో ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరిగింది. ఈ దాడిలో  ఒకరు గాయపడ్డాడు. ................................................................................................................................................... 23. ఓటర్ల జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారి ఓట్లు పెద్ద సంఖ్యలో గల్లంతయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు.  ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో, లేదో చెక్ చేసుకోండని సూచించారు. ఓటు లేకపోతే వెంటనే ఓటరుగా మీ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.  ............................................................................................................................................. 24.  బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో  నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే బీజేపీయేతర పక్షాల సమావేశాన్ని దేశ ముఖచిత్రాన్ని మార్చే  సమావేశంగా కర్నాటక  డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు.  140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్ ను మార్చే   సమావేశమన్నారు. ........................................................................................................................................................ 25. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో   రానున్న మూడు  రోజులూ  వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు  కురుస్తాయనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. .................................................................................................................................... 26.  ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో  ప్రజలకు సగం ధరకే  టమాటాలు దొరుకుతున్నాయి. భారత ప్రభుత్వ సహకారంతో ఎన్‌సిసిఎఫ్‌ఐ ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్‌లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో  ఉంచుతోంది యోగి సర్కార్. .......................................................................................................................................................... 27.  జనసేన కార్యకర్తపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై పవన్ కల్యాణ్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు చేయడం కోసమే ఆయన తిరుపతి వచ్చారు.  కాగా ఇప్పటికే సీఐ అంజూ యాదవ్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు. ............................................................................................................................................. 28.  మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే వింధ్య ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. వింధ్య రీజియన్ ప్రత్యేక రాష్ట్ర హోదా సాధన కోసం  ప్రజలు స్థాపించిన  పార్టీ వింధ్య జనతా పార్టీకి తాను నేతృత్వం వహిస్తానని  ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి తెలిపారు. .................................................................................................................................. 29.  అగ్రరాజ్యాన్ని పిడుగులతో కూడిన వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి.  ముఖ్యంగా   ఈశ్యాన్య ప్రాంతంలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.  దీంతో ఈశ్యాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దయ్యాయి.  అలాగే భారీ వర్షాల కారణంగా ఈశాన్య అమెరికా  వరద ముంపులో చిక్కుకుంది. ..........................................................................................................................................................   30.  భారీ వర్షాలు ఉత్తర భారత దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.  భారీ వర్షాలతో హరిద్వార్‌ వద్ద గంగానది  ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది.  దీంతో హరిద్వార్‌, రూర్కీ, ఖాన్‌పుర్‌, భగవాన్‌పుర్‌, లస్కర్‌ పరిధిలోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

సీఐ అంజు యాదవ్ ఇమేజ్ పెంచేసిన పవన్?!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ అంజు యాదవ్ వర్సెస్ జనసేన అన్నట్లుగా ఏపీలో ఒక వివాదం నడుస్తున్నది. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శితో సీఐ దురుసుగా ప్రవర్తించడం, ఆయనపై సీఐ చేయిచేసుకోవడంతో జనసేన సీరియస్ అయింది. జనసేన పార్టీ కార్యకర్తల నుండి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరకూ ఈ విషయంపై సీరియస్ అవుతున్నారు.  జనసేన జిల్లా కార్యదర్శి సాయిపై చేయి చేసుకోవడం సహా  ఆమె పాత వీడియోలను వైరల్ చేసిన జనసేన కార్యకర్తలు ఆమెపై చర్య తీసుకోవాలని కోరారు. గతంలో ఆమె అమాయకులను ఇబ్బంది పెట్టడం, తొడకొట్టి సవాళ్లు విసిరడం వంటి పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమెకు పోలీస్ శాఖ చార్జ్ మెమో జారీచేశారు. జనసేన నేతపై చేయిచేసుకున్న ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీ విచారణ నిర్వహించి.. డీజీపీకి నివేదిక కూడా సమర్పించారు. ఈ ఘటనపై  మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ ఇందుకు సంబంధించి ప్రతివాదులైన అయిదుగురికి నోటీసులు జారీ చేసి ఈ నెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఇదే ఘటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ అంజు యాదవ్ చేయి చేసుకుంటున్నా సహనంగా ఉన్న సాయిని పవన్ కల్యాణ్ అభినందించి.. సాయిలాంటి దృఢ సంకల్పం ఉన్నవారు జనసేనకు కావాలంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు, పవన్ తిరుపతికి వచ్చి సీఐ సంగతి తేలుస్తానంటూ ప్రకటించారు. అన్నట్లుగానే తిరుపతి వచ్చి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటికే  ఎస్పీ విచారణ పూర్తి చేసి డీజీపీకి నివేదిక కూడా ఇచ్చేసినా పవన్ మాత్రం   ఐదుగురు జనసేన కార్యకర్తలతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సీఐపై ఫిర్యాదు చేశారు.  జనసేన ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపుతున్న సమయంలో దుమారం రేగింది. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దనహం చేశారు. ఇందుకు ప్రతిగా శ్రీకాళహస్తిలో గత బుధవారం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం సమీపంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టె సాయి మహేష్ తో పాటు ఇతర నాయకులు సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు సిద్దమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వారి నుండి దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. జనసేన నాయకులను బలవంతంగా టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలోనే జనసేన నేత సాయి మహేష్ పై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. సరే ఆ ఘటనపై మానవహక్కుల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. వారి స్థాయిలో చేయాల్సింది చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా..   అసలు సీఐ అంజు యాదవ్ పై జనసేన కార్యకర్తలు, నేతలు ఇంకా పోరాటం చేయడం కరెక్టేనా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ఘటనలో తిరుపతికి వెళ్లి మరీ ఫిర్యాదులు చేయడం అవసరమా?  ఇది జనసేనాని స్థాయిని పెంచలేదు సరికదా, అంజు యాదవ్ ఇమేజ్ ను మాత్రం అమాంతంగా పెంచేసింది. జనసేన నేతలపై పోలీసులు ఎక్కడ దురుసుగా ప్రవర్తించినాపవన్ కళ్యాణ్ అక్కడకి వెళ్లి ఫిర్యాదులు చేస్తారా? అన్న ప్రశ్నలు పరిశీలకుల నుంచి వెలువడుతున్నాయి. ఒక సీఐకి పవన్ అనవసర ప్రాధాన్యత ఇచ్చారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.  జనసేన పార్టీ సీఐ అంజు యాదవ్ పై పోరాటం చేస్తున్నదా.. లేక ఆమె ఇమేజ్ పెంచుతున్నదా?  అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే నిత్యం పార్టీ కార్యకర్తలు, పోలీసు వ్యవస్థ మధ్య ఇలాంటి వాతావరణమే ఉంటుంది. అందునా ఇలాంటి కోపాన్ని అణుచుకోలేని సీఐలు ఉన్న ప్రాంతాలలో ఇది ఎప్పుడూ ఉండేదే. అంజూ యాదవ్ జనసేన  జనసేన నేత సాయి మహేష్ పై చేయి చేసుకోవడం  ముమ్మాటికీ తప్పే. అందుకే పోలీస్ శాఖ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు హెచ్ఆర్సీ కూడా స్పందించి వివరణ కోరింది. ఇలాంటి సమయంలో ఆ రెండు శాఖల వారికి కావాల్సిన సమాచారాన్ని జనసేన సమకూరిస్తే న్యాయం దక్కుతుంది. అందుకు భిన్నంగా స్వయంగా జనసేనాని పవన్ కల్యాణే ఆమెపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి తిరుపతికి రావడంతో అంజూ యాదవ్ కు ఒక సెలబ్రిటీ గుర్తింపు వచ్చేసింది. జనసేనానే స్వయంగా ఆమెకు ఎక్కడ లేని పబ్లిసిటీ ఇచ్చి ఆమె స్థాయిని పెంచేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

స్పీడ్ న్యూస్ 2

11. బెంగళూరులో నేడూ రేపు బీజేపీయేతర పక్షాల సమావేశం జగరనున్నది. అయితే తొలి రోజు  ఈ సమావేశాలకు విపక్ష కూటమి ప్రయత్నాలలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డుమ్మా కొట్టారు.  ............................................................................................................................................................... 12. తూర్పు ఫ్రాన్స్‌లోని ఆల్సేస్ ప్రాంతంలో తన ఇంటి టెర్రస్‌పై కూర్చుని స్నేహితురాలితో కలిసి కాఫీ తాగుతున్న మహిళపై ఓ ఉల్క పడింది.  ఉల్క తనను తాకగానే షాక్ కొట్టినట్లు అయ్యిందని ఆమె చెప్పింది.  ఆ ఉల్క సిమెంట్ రాయిలా వింత రంగులో  ఉంది. .......................................................................................................................................................... 13. విపక్షాల కూటమికి హాజరౌతున్న ఆప్. కేంద్రం ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడంతో ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన సమావేశానికి హాజరైన ఆప్ కాంగ్రెస్ కేంద్రం ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని షరతు విధించిన సంగతి తెలిసిందే. ......................................................................................................................................................... 14.  తమిళనాడులో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా  మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడి ఇళ్లపై ఈ ఉదయం అధికారులు దాడులు చేశారు.  మంత్రి వి. సెంథిల్‌బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ........................................................................................................................................................ 15.వర్ధన్నపేట బస్టాండ్ లో ఆగివున్న ఆర్టీసి బస్సును డీసీఎం వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో   డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎంలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలు గాయపడ్డారు. ............................................................................................................................................................... .16. ఈ నెల 20న నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదా పడిది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు.   ............................................................................................................................................................... 17.  గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందనప్పటికీ గవర్నర్ తమిళిసై  రాజ్ భవన్ ఆవరణలో  బోనాల పండుగ నిర్వహించి బోనం ఎత్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.   ............................................................................................................................................................ 18. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించారు.  సర్వభూపాల వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆణివార ఆస్థానం తమిళులకు అత్యంత ప్రీతివంతమైన రోజు అని తెలిసిందే.   ............................................................................................................................................................ 19.  నరసరావుపేటలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య  ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలు చేశారు. ఘర్షణలపై ఇంకా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఘర్షణకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ............................................................................................................................................................... 20. వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ కర్నూలులో  క్లీన్ ఆంధ్రప్రదేశ్‌ డ్రైవర్లు నిరసన దిగారు. సీఐటీయూ  ఆధ్వర్యంలో డ్రైవర్లు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు.   

వైసీపీలో ముసలం .. చంద్రబాబుకు జై కొడుతున్న నేతలు

ఏపీలో  అధికార వైసీపీతో స‌హా టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ఎన్నిక‌ల ర‌ణ‌రంగానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. గెలుపే ల‌క్ష్యంగా పార్టీల అధినేత‌లు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. వైసీపీ అధినేత‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. అయితే, ఆయ‌న వ్యూహాలు ఆశించిన ఫ‌లితాలు ఇవ్వ‌డం లేద‌ని వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతుంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు పూర్త‌యింది. ఈ నాలుగేళ్ల కాలంలో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఆశించిన స్థాయిలో మేలు జ‌ర‌గ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లే  చెబుతున్న ప‌రిస్థితి. నాలుగేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను అరెస్టులు చేయించ‌డం, జైళ్ల‌కు పంపించ‌డం త‌ప్ప పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల మేలుకోసం చేసింది పెద్ద‌గా ఏమీలేద‌ని జనం గట్టిగా నమ్ముతున్నారు. ఇటీవ‌ల ఇంటింటికి వైసీపీ కార్య‌క్ర‌మంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. త‌మ‌కు ఏం చేస్తున్నార‌ని ఇంటింటికి వ‌స్తున్నార‌ని ప‌లు చోట్ల‌ ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను నిల‌దీసిన ఘ‌ట‌న‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి.  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాలుగేళ్ల కాలంలో ఏపీకి పెద్ద డ్యామేజ్ జ‌రిగింద‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం ప‌నులు వేగంగా జ‌రిగాయి. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు కూడా వేగంగా జ‌రిగాయి. ప్ర‌తీ సోమవారం చంద్ర‌బాబు పోల‌వ‌రం ప‌నుల‌పై స‌మీక్ష‌లు జ‌రిపి ప‌నులు వేగ‌వంతం అయ్యేలా ప్ర‌త్యేక దృష్టిసారించారు. ఇందు కోసం ఆయన సోమవారం ను పోలవారంగా మార్చుకున్నారు కూడా. అంతేకాక‌, ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న కంపెనీల‌ను సైతం ఒప్పించి రాష్ట్రానికి ర‌ప్పించారు. దీంతో ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధిపై దేశ‌ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏపీ దేశ‌ వ్యాప్తంగా న‌వ్వుల‌పాలవుతున్నద‌న్న చ‌ర్చ  విస్తృతంగా జ‌రుగుతున్నది. ఏపీ రాజ‌ధాని ఏది అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే త‌లదించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నామని, హైద‌రాబాద్‌, ఇత‌ర రాష్ట్రాల‌కు ఉద్యోగ రిత్యా వెళ్లిన వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ఆ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నార‌ట‌. ప్ర‌జ‌ల్లో పార్టీపై వ్య‌తిరేక‌త చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున బ‌రిలోకి దిగితే విజ‌యం సాధించ‌టం క‌ష్ట‌మ‌న్న భావ‌న‌కు ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్ర‌బాబుతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని, చంద్ర‌బాబు వెంట ఉంటే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న భావ‌న‌కు ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తీరుతో విసుగుచెందిన నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు కీల‌క వైసీపీ నేత‌లు ఆ పార్టీ రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే. వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వంటి నేత‌లు చంద్ర‌బాబుకు జై కొట్టారు. ఈ ముగ్గురు నేత‌లు టీడీపీ యువనేత‌ లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో పాల్గొని జ‌గ‌న్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది టీడీపీనేన‌ని, ప్ర‌జ‌లంతా టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.    నెల్లూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలే కాకుండా రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ వైసీపీ ఎమ్మెల్యేలు అవ‌కాశం దొరికితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ నుంచి బ‌రిలో నిలిస్తే ఎలాగూ విజ‌యం సాధించ‌లేమ‌న్న భావ‌న‌కు స‌ద‌రు ఎమ్మెల్యేలు వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. వైసీపీ ఎంపీ సుభాష్ చంద్ర‌బోస్, ఆయన కుమారుడు సూర్య‌ప్ర‌కాశ్‌లు వైసీపీని వీడుతున్నార‌నీ, వారు త్వ‌ర‌లో టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నీ ప్ర‌చారం జ‌రుగుతుంది. చంద్ర‌బాబుకు జై కొడితే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న భావ‌న‌కు వారు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు కాకినాడ జిల్లా జ‌గ్గంపేట వైసీపీలో ముస‌లం మొద‌లైంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మ‌ధ్య వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరింది. వీరిలో ఒక‌రు చంద్ర‌బాబుకు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీలో కొన‌సాగేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, వారంతా చంద్ర‌బాబుకు జై కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. జ‌గ‌న్ క‌క్షపూరిత రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు తెచ్చుకోవ‌టం కంటే చంద్ర‌బాబు వెంటఉంటేనే ప్ర‌జ‌ల మద్ద‌తు ల‌బిస్తుంద‌న్న భావ‌నలో ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తే వారు టీడీపీ తీర్థం పుచ్చుకొనేందుకు రెడీగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.

స్పీడ్ న్యూస్ 1

1. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం శ్రీవారిని 86 వేల 170 మంది దర్శించుకున్నారు. 31 వేల 128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ........................................................................................................................................................... 2. దొంగలు ఏటీఎంలో  ఏసీని దోచుకెళ్లినఇ సంఘటన పంజాబ్ లోని  బాఘ్ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఓ  ఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం ఇద్దరు దొంగలు ఏటీఎంలో అమర్చిన ఏసీని దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు వైరల్ అవుతున్నాయి. ............................................................................................................................................................   3.పాకిస్థాన్‌లోని  సింధ్ ప్రావిన్స్‌లోని కాష్మోరే ప్రాంతంలోగల ఓ హిందూ దేవాలయంపై కొందరు దోపిడీ దారులు రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో రాకెట్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.    ............................................................................................................................................................   4.  రంగారెడ్డి జిల్లా  బూర్గుల శివారులోగల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో  ఆదివారం సంభవించిన పేలుడులో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.  గ్యాస్ సిలెండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది.   ............................................................................................................................................................ 5. విమానం గాల్లో ఉండగానే పైలట్ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో  ఓ ప్రయాణీకురాలే   విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు.   శనివారం అమెరికాలోని  విన్‌యార్డ్‌ ఎయిర్‌పోర్టులో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.   ............................................................................................................................................................ 6.  భోపాల్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌‍ప్రెస్‌లో  సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. రైలులోని సీ-14 కోచ్‌ వద్ద మంటలు వ్యాపించాయి.  దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి.   ............................................................................................................................................................   7.  మంత్రి కేటీ రామారావుకు బెర్లిన్‌ నగరంలో నిర్వహించే  ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పాలసీ అలయెన్స్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానం అందింది.   ప్రపంచ నిపుణులతో కూడిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ............................................................................................................................................................ 8.  మేడ్చల్ జిల్లా దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బహదూర్ పల్లి సమీపంలోని టెక్ మహీంద్ర వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యువరాజు, నాయుడుగా గుర్తించారు. ............................................................................................................................................................ 9. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతికి రానున్నారు. జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై ఆయన తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.  ............................................................................................................................................................ 10. ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పాక్ లో గోధుమ పిండి ధర రికార్డు స్థాయిలో 320 రూపాయలకు చేరిందని పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

ఎస్సీ, ఎస్టీ ఓట్ల కోసం తెలంగాణ పార్టీల కొట్లాట!

తెలంగాణలో ఎన్నికల సమయం వచ్చేసింది. అక్టోబర్ లేదా నవంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుండి సమాచారం కూడా వచ్చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ప్రీ ఎలక్షన్ ఏర్పాట్లు కూడా ప్రభుత్వ శాఖలు మొదలు పెట్టాయి. దీంతో రాజకీయ పార్టీలు కూడా  ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రజల మధ్యకు వెళ్లి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కొత్త కొత్త ప్రభుత్వ పథకాలు, పెండింగ్ హామీలను నెరవేర్చే పని చేస్తుంటే.. ప్రతి పక్షాలు నెరవేర్చని హామీలను ఎండగడుతూ కొత్త కొత్త హామీలను ఇస్తూ ఓటర్లను ఆకర్షించే పని చేస్తున్నాయి. అయితే, జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను లోతుగా చూస్తే తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్, కాంగ్రెస్   ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముందుగా బీఆర్ఎస్ ని చూస్తే.. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడేనని హామీ ఇచ్చారు. కానీ, తీరా రాష్ట్రం సిద్దించి, పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కుర్చీ ఎక్కారు. అలాగే దళితులకు కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి దాన్నీ వదిలేశారు. దీంతో దళితులలో ఈ అసంతృప్తి కనిపిస్తుంది. దాన్ని మాఫీ చేసి దళితులను ఆకట్టుకునేందుకు దళిత బంధు పేరుతో భారీ మొత్తంలో ఆర్ధిక సాయం అందించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో అక్కడ అధిక శాతం ఉన్న దళితులను తన వైపుకు తిప్పుకొనేందుకు మొదలు పెట్టిన ఈ దళిత బంధు అప్పటి నుండి విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ వస్తున్నారు. దీంతో పాటు కొత్త తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా కొత్త పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అంతేకాదు 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రకాష్ అంబేద్కర్ తో ప్రారంభించారు. మరో వైపు ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా బీఆర్ఎస్ రకరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలో పోరాటాలు సాగుతున్న పోడు భూముల సమస్యకు ఈ మధ్యనే కేసీఆర్ సర్కార్ చెక్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పెద్ద సంబురంగా జరిపించింది. పోడు భూముల సమస్య తొలగిందంటే అది కేసీఆర్ ఒక్కడి వల్లనే సాధ్యమైందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్టీల చెవులలో రీ సౌండ్ వినిపించేలా ఊరూరా చాటారు. ఈ పోడు భూములలో దాదాపు 90 శాతంగా పైగా భూమి ఎస్టీలకు సంబంధించినదే అంటే కేసీఆర్ ఏ స్థాయిలో వ్యూహ రచన చేసారో అర్ధం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్టీలకు సంబంధించి ఐటీడీఏల పరిధిలో గిరిజనులకు ఉపాధి కలిగించేలా రకరకాల పేర్లతో యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో కేసీఆర్ ఉద్యమం సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చి అమలు చేయలేదో కాంగ్రెస్ వాటినే ఫోకస్ చేసి ప్రజలలోకి వెళ్లేలా చేస్తుంది. కేసీఆర్ చెప్పిన దళిత సీఎం ఛాన్స్ కాంగ్రెస్ లో మాత్రమే ఉందనేలా కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది. కాంగ్రెస్ లో దళిత నేత భట్టి విక్రమార్క, ఎస్టీ మహిళా నేత సీతక్కల పేర్లు ఇప్పటికే కాంగ్రెస్ దిగ్విజయంగా ఫోకస్ లోకి తెచ్చి పెట్టింది. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి కేటాయిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీలకు కూడా భారీ ఆర్ధిక సాయం అందించే పథకం తెస్తామని చెప్తున్నారు. ఇలా మొత్తంగా చూస్తే ఒక వైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనే కన్నేసి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి. మరి తెలంగాణ ఎస్సీ, ఎస్టీలు ఈసారి ఎవరిని నమ్మి ఓట్లేస్తారో చూడాలి.

చిన్న‌మ్మ ఫైర్‌.. జ‌గ‌న‌న్న సైలెంట్‌.. వైసీపీలో వణుకు?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌న్న నిర్ణయానికి వచ్చేశారా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అధికార ద‌ర్పంతో పైకి దీమాను వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోలోప‌ల ఓట‌మి భ‌యంతో వ‌ణికిపోతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నది. నాలుగేళ్ల వైసీపీ పాల‌న‌పై ఇటీవ‌ల స‌ర్వేలు నిర్వ‌హించ‌గా ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నార‌ని తేలిందని చెబుతున్నారు‌. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు , రాజ‌ధాని విష‌యంలో , అలాగే   రాష్ట్రం నుంచి పెద్ద‌ పెద్ద కంపెనీలు త‌ర‌లిపోవ‌టంలోనూ జ‌గ‌న్ త‌ప్పుడు నిర్ణ‌యాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని, ఈ క్ర‌మంలో ఏపీలోని ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నార‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం ప‌నులు, పోల‌వ‌రం ప‌నుల‌తో పాటు ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క చాన్స్  అంటూ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో సానుభూతి ఓట్లు, బీజేపీ కేంద్ర పెద్ద‌ల అండ‌దండ‌లు తోడ‌వ్వ‌డంతో భారీ మెజార్టీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.  అయితే ప్రజలు తనపై పెట్టుకున్న  న‌మ్మ‌కాన్ని జగన్ వ‌మ్ము చేశారనీ, , చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధి సైతం నిర్వీర్య‌మైంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారని ఇటీవలి సర్వేలలో వెల్లడైందంటున్నారు. దీంతో చంద్ర‌బాబుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్య‌మ‌న్న భావ‌న‌కు ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు వ‌చ్చారని చెబుతున్నారు.  వైసీపీ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన అంత‌ర్గ‌త స‌ర్వేల్లో సైతం ఇదే విషయం వెల్లడైనట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.   ఈ క్ర‌మంలో లోలోప‌ల వైసీపీ నేత‌లను ఓట‌మి భ‌యం వెంటాడుతున్నా అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆ పార్టీలోని నేత‌లే గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇదిలాఉంటే జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి వైసీపీ నేత‌లు టీడీపీ, జ‌న‌సేన నేత‌లే టార్గెట్‌గా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎదురు ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నార‌న్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అయితే వైసీపీ సర్కార్ పై ఎంతగా విమర్శలు చేసినా బీజేపీ నేత‌లకు  కౌంట‌ర్ ఇచ్చేందుకు మాత్రం వైసీపీ నేత‌లు వెనుక‌డుగు వేస్తున్నారు. జ‌గ‌న్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావ‌డానికి బీజేపీకూడా ఒక కార‌ణ‌మ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. దీంతో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల‌కు ట‌చ్‌లో ఉంటూ వ‌స్తున్నారు.  అయితే ఇటీవలి కాలంలో  బీజేపీ ఏపీలో త‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జీని మార్చేసింది. నాలుగేళ్ల వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని బీజేపీ అంత‌ర్గ‌త స‌ర్వేల ద్వారా తేలడంతో  ఆ పార్టీ నేత‌లు వైసీపీపై ఎటాక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలు రాష్ట్రానికి వ‌చ్చి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ అవినీతి ప‌రుడు అంటూ విమ‌ర్శించారు. దీనికితోడు బీజేపీ అగ్ర‌నేత‌లు చంద్ర‌బాబును ఢిల్లీకి పిలిపించుకొని భేటీ కావ‌టం ఏపీ రాజ‌కీయాల్లో అల‌జ‌డి రేపింది.  ఇదే స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర ప‌గ్గాలు దగ్గుబాటి పురంధ‌రేశ్వ‌రికి అప్ప‌గించ‌డం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పురంధ‌రేశ్వ‌రికి రాష్ట్ర పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం వెనుక బీజేపీ పెద్ద వ్యూహాన్నే అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.  ద‌గ్గుబాటి పురంధ‌రేశ్వ‌రి   ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన  అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వైసీపీ ప్ర‌భుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన నిధుల‌ను వైసీపీ త‌మ నిధులుగా ప్ర‌చారం చేసుకుంటున్నద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీ ప్ర‌భుత్వానికి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. మామూలుగా, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తే.. మ‌రుస‌టిరోజే కౌంట‌ర్ ఇచ్చేందుకు వైసీపీ నేత‌లు క్యూ క‌డ‌తారు. పురంధ‌రేశ్వ‌రి విష‌యంలో అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. ఆమె వ్యాఖ్య‌ల‌ను ఖండించేందుకు, కౌంట‌ర్ ఇచ్చేందుకు వైసీపీ నేత‌లు సాహ‌సం చేయ‌లేక‌పోయారు. దీని వెనుక పెద్ద‌కార‌ణ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ దూకుడుతో బెంబేలెత్తిపోతున్న త‌రుణంలో బీజేపీ నేత‌ల‌కు కూడా కౌంటర్ ఇచ్చి ఇబ్బంది ప‌డ‌టం ఎందుకనే భావ‌న‌కు వైసీపీ అధిష్టానం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పురంధ‌రేశ్వ‌రి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చి కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌కు ఆగ్ర‌హం తెప్పించే బ‌దులు సైలెంట్‌గా ఉండ‌ట‌మే మేల‌న్న భావ‌న‌కు జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో బీజేపీతో పెట్టుకొని ఇబ్బందులు ప‌డేకంటే సైలెంట్‌గా ఉండి వారి మెప్పును పొంద‌ట‌మే మేల‌న్న భావ‌న‌లో సీఎం జ‌గ‌న్  ఉన్నార‌ని, ఈ క్ర‌మంలోనే పురంధ‌రేశ్వ‌రి వ్యాఖ్య‌ల‌కు వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇచ్చేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని ఏపీ రాజ‌కీయాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయి మాత్రం ప్రత్యేక హోదా, విభజన హామీలను ప్రస్తావిస్తూ పురంధేశ్వరికి కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధినేత సహా ఎవరూ పురంధేశ్వరి విమర్శలకు స్పందించకుండా మౌనంగా ఉంటే.. ఇటీవల పార్టీలో ప్రాధాన్యత కరవైందని అంతా భావిస్తున్న విజయసాయి గళమెత్తడంపై పార్టీ వర్గాల్లోనే ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. విజయసాయి కౌంటర్ పార్టీకి మేలు చేయడం అటుంచి మరింత నష్టం జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. 

పోటీ ఎక్కడ నుంచి.. పొంగులేటి సందిగ్ధం

తెలంగాణలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఆర్ఎస్  సహా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్ నేతలు  ఏకమయ్యారు. ఇదే క్ర‌మంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు తెలంగాణలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్  తరువాత   రాష్ట్రంలో  ఊహించని రీతిలో పుంజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలు కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు.  బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్త‌ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. మ‌రోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో పది నియోజక వర్గాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని పొంగులేటి సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా  వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాలో మెరుగైన ఫలితాలే వచ్చాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు. కొద్ది కాలానికి పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  బీఆర్ఎస్ గూటికి చేరారు. కేవ‌లం భ‌ట్టి విక్ర‌మార్క‌, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాత్ర‌మే కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నారు. పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌క ముందు వ‌ర‌కు ఖ‌మ్మంలో భ‌ట్టి విక్ర‌మార్క‌, రేణుక చౌద‌రి వ‌ర్గాలు ఉన్నాయి. భ‌ట్టి విక్ర‌మార్క క‌నుస‌న్న‌ల్లోనే  ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేర‌డం  ఆ పార్టీకి మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ల‌యింది. అయితే, ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం ఐదు నుంచి ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో పొంగులేటి వ‌ర్గీయులే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నది. కాంగ్రెస్ అధిష్టానం సైతం అందుకు అంగీకరించినట్లు ఆ పార్టీ నేత‌లే చెప్పుకుంటున్నారు.  ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లాలో పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డికి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. ప్ర‌త్యేకంగా పొంగులేటి అంటే అభిమానించేవారు దాదాపు అన్ని గ్రామాల్లో ఉన్నారు. వారిలో చాలామంది పొంగులేటి వెంట కాంగ్రెస్ వైపు  వ‌చ్చారు. ఇప్ప‌టికే భ‌ట్టి విక్ర‌మార్క‌, రేణుకాచౌద‌రి వంటి నేత‌ల‌తో పాటు పొంగులేటి చేరిక కాంగ్రెస్‌కు ఆ జిల్లాలో తిరుగులేని విజ‌యాన్ని ఇస్తుంద‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన   పొంగులేటి అప్ప‌టి టీడీపీ అభ్య‌ర్థి నామా నాగేశ్వ‌ర‌రావుపై విజయం సాధించారు. ఆ త‌రువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం మేర‌కు బీఆర్ఎస్ లో చేరారు. నామా సైతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవ‌టంతో  2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పొంగులేటికి కాకుండా ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానం నుంచి నామా నాగేశ్వ‌ర‌రావుకు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో  పొంగులేటి ఆ ఎన్నిక‌ల్లో  పోటీ చేయ‌లేదు. ఈసారి  పొంగులేటి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.  ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లాలో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు జ‌న‌ర‌ల్ స్థానాలుగా ఉన్నాయి. పాలేరు, ఖ‌మ్మం, కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గాల్లో పొంగులేటి ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నార‌ట‌. పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి ష‌ర్మిల పోటీలో ఉంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ష‌ర్మిల‌ సైతం తాను పాలేరు నుంచే పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో పొంగులేటి ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని స‌మాచారం. మిగిలిన ఖ‌మ్మం, కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొంగులేటి బ‌రిలోకి దిగాల్సి ఉంటుంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌నే విష‌యంపై పొంగులేటి సందిగ్దంలో ఉన్నారట‌. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోని నేత‌లు, కార్య‌క‌ర్త‌లుసైతం పొంగులేటి తమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయాల‌ని కోరుతున్నార‌ట‌. దీంతో పొంగులేటి వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతార‌నే అంశం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చకు దారితీసింది.

నందులు గత వైభవ చిహ్నాలేనా?

తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి రాష్ట్రవిభజన తర్వాత  అగమ్యగోచరంగా మారింది. ఎంతో చరిత్ర కలిగిన మన తెలుగు సినీ పరిశ్రమలో  అంగట్లో అన్నీ ఉన్నా అన్న సామెతను గుర్తు చేసేలా ఉంది.  అన్నీ ఉన్నా ఎక్కడో ఏదో కొరత కనిపిస్తున్నది. కోట్లకు కోట్లు కలెక్షన్లు తెచ్చే పెట్టే సినిమాలు వస్తున్నా.. తెలుగు సినీ పరిశ్రమ ఖండాలు దాటి ఖ్యాతి దక్కించుకుంటున్నా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి మాత్రం ఇసుమంతైనా ప్రోత్సాహం అందడం లేదు. కోట్లకు కోట్లు సినీ పరిశ్రమ  పన్నులు కడుతున్నా..  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు  మాత్రం పరిశ్రమపై ఎటువంటి శ్రద్ధా చూపడం లేదు.  త్రుణమో పణమో ఇచ్చి సినీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేయాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయడమే లేదు. సినిమా వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వడమే తప్ప.. ప్రభుత్వాలు మాత్రం సినిమా వాళ్లకి తిరిగి ఏదీ ఇవ్వడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ లోనే ఉండిపోయింది. షూటింగులు, ఎడిటింగులు, మీటింగులు అన్నీ ఇక్కడ నుండి నడుస్తున్నాయి. సినిమా వాళ్ళ నుండి ఆదాయం కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమని అరకొరగానే పట్టించుకుంటున్నది. సినిమా వాళ్ళు పిలిస్తే మంత్రులు తలసాని, కేటీఆర్ లాంటి వారు హాజరై ఆశీర్వదించడం, షూటింగులకు, కొత్త సినిమా విడుదల సమయంలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం తప్ప అభివృద్ధి, ప్రోత్సాహకాల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను పక్కన పెట్టేసిన తెలంగాణ ప్రభుత్వం ఉగాది ఉత్సవాలు లాంటి వేడుకలను సైతం జరిపించడం లేదు. కేవలం షూటింగుల వలన వచ్చే ఆదాయాన్ని, టికెట్ల పైసలను తన ఖజానాలో వేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తిరిగి సినిమా కోసం ఖర్చు పెట్టేందుకు ఇష్టపడడమే లేదు. ఇక ఏపీలో పరిస్థితే వేరు. సినీ ఇండస్ట్రీ అంతా తెలంగాణలో ఉండగా చేయడానికి మా దగ్గర ఏముంది అన్నట్లు ఏపీ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖలో చాలా సినిమాలు షూటింగ్స్ చేసేవారు. కానీ, ఇప్పుడు విశాఖ వైపు దర్శక, నిర్మాతలు వెళ్లడమే మానేశారు. సినిమా విడుదల సమయంలో మాత్రం ఈవెంట్లు నిర్వహించి ప్రమోషన్లు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ఏపీకి రావాలని కోరుతున్నారు తప్ప.. వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు అనువైన అభివృద్ధి మాత్రం చేయడం లేదు. పైగా ఆ మధ్య సినిమా టికెట్లను కూడా ప్రభుత్వమే అమ్మాలని ఆలోచన చేయడంతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సమయంలో సినీ పెద్దలు కొందరు తాడేపల్లి గూడెం జగన్ నివాసానికి వచ్చి ఒంగి ఒంగి మరీ దండాలు పెట్టి సమస్యను చెప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి తెలంగాణ కొత్త రాష్ట్రం కనుక.. పాత రాష్ట్రమైన ఏపీనే యధావిధిగా నంది అవార్డులు ఇచ్చినా అభ్యంతరం లేదు. కానీ, ఏపీ ప్రభుత్వం అసలు రాష్ట్రంలోనే లేని పరిశ్రమకి అవార్డుల ఖర్చు కూడా దండగే అన్నట్లు ఉండిపోతుంది. అయితే, తెలుగు సినీ పరిశ్రమకి ఎందుకీ పరిస్థితి వచ్చిందంటే రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. సినీ పరిశ్రమ అంతా తెలంగాణలోనే ఉన్నా అందులో ఆంధ్రా వాళ్లే ఎక్కువ. వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా వారిగానే చూస్తున్నట్లుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ యాస హిట్టు కొడుతోంది. తెలంగాణ నటులు, టెక్నీషియన్లు కూడా పెరుగుతున్నారు. దీంతో భోజ్ పురి సినీ పరిశ్రమ మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ సినీ పరిశ్రమ ఎదగాలని భావిస్తోంది. అందుకే ఆంధ్రా వారి ఆధిపత్యం అధికంగా ఉన్న కారణంగా ప్రస్తుతం పరిశ్రమను పట్టించుకోవడం లేదు. పరిశ్రమలో తెలంగాణ వారిని అభివృద్ధిలోకి తీసుకు రావాలని చూస్తుంది. దీంతో పరిశ్రమలో ఆంధ్రా నటులు, ఆంధ్రా టెక్నీషియన్లు, దర్శక నిర్మాతలు ఇప్పుడు అటు ఏపీలో చెల్లక.. తెలంగాణ పట్టించుకోక  ఎవరికీ పట్టని వారిలా మిగిలిపోయారు.   దీంతో ప్రతిభామంతులైన నటీనటులకు వారి ప్రతిభకు గుర్తుగా ఇచ్చే నంది పురస్కారాలు గత వైభవ చిహ్నాలుగానే మిగిలిపోయాయి.