రాజధాని లేని రాష్ట్రం అంటూ బొత్స పరువు తీసిన తెలంగాణ మంత్రి!

మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కనీసం పరీక్షలు కూడా నిర్వహించుకోలేని స్థితిలో తెలంగాణ ఉందని ఏపీ మంత్రి అంటే.. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం మీరు కూడా మమ్మల్ని అంటారా అంటూ తెలంగాణ మంత్రి కౌంటర్ వేశారు. టీఎస్పీఎస్సీపై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ట్రాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితిలో తెలంగాణలో ఉందన్నారు. అంతేకాదు, తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో స్కామ్ ఎలా జరిగిందో అంతా చూస్తూనే ఉన్నామని.. అన్నీ చూచి రాతలే అన్నారు. ఈ పేపర్ లీకేజీ స్కాం వ్యవహారంలో ఎంతమంది అరెస్టు అవుతున్నారో వార్తలు వస్తూనే ఉన్నాయని.. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితిలో తెలంగాణ ఉందంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు.  మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు వెంటనే స్పందించారు. బొత్స వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ రాష్ట్రమేంటో, మా రాష్ట్రమేంటో మాకు తెలియదా? అని ప్రశ్నించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. రాజధాని కూడా లేని రాష్ట్రం అది అన్నారు. బొత్స అలా మాట్లాడటం సరికాదని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. గతంలో ఏపీపీఎస్సీలో ఎన్ని స్కాంలు జరిగాయో చూసుకోవాలంటూ బొత్సకు సూచించారు. ఏ రాష్ట్రంలో ఎన్ని ఆస్పత్రులు కట్టుకున్నారనేది అందరికి తెలుసునని.. ఇప్పటికీ అక్కడివారికి అనారోగ్యం వస్తే చికిత్స కోసం ఎక్కడికి వస్తున్నారని ప్రశ్నించారు. నెలకొకసారైనా హైదరాబాద్‌కు రాకుంటే ఆయన ప్రాణం ఊరుకోదని.. అలాంటిది హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని బొత్సు  శ్రీనివాస్ గౌడ్ హితవుపలికారు.  ఇప్పుడు ఇరు రాష్ట్రాల మంత్రుల వ్యాఖ్యలతో మరోసారి ఏపీ రాజధాని వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏపీకి రాజధాని ఏదని గతంలో అదే మంత్రి బొత్సను మీడియా అడిగితే సమాధానం చెప్పలేక కాసేపు నీళ్లు నమిలి త్వరలోనే చెప్తామన్నారు. కానీ, ఏళ్ళు గడిచినా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎక్కడో స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నది. కాగా, ఇప్పుడు అదే మంత్రి బొత్సకి పక్క రాష్ట్రాల నుండి కూడా కౌంటర్లు పడుతున్నాయి. ఒకరకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరువు తీసేశారు. అలాగే జగన్ పరువుకూడా తీసేశారు. రాజధానే లేని రాష్ట్రం మీరా మమ్మల్ని అనేది అంటూ వైసీపీ నేతలు అందరికీ చురకలంటించారు. దీంతో ఇప్పుడు ఏపీలో మరోసారి రాజధాని అంశంపై చర్చలు సాగుతున్నాయి.  ఇరు రాష్ట్రాల మంత్రుల వ్యాఖ్యలపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం నిదానంగా సాగుతూ, ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేయలేకపోయారని విమర్శించిన వైసీపీ.. ఇప్పుడు చివరికి అసలు రాజధానే లేకుండా రోడ్డున పడేసిందని ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతిని నాశనం చేసేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రం ఇప్పుడు రాజధాని లేకుండా మిగిలిపోయింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇప్పుడు ఇలా పక్క రాష్ట్రాల నేతలు సైతం మొత్తం రాష్ట్రాన్ని ఎగతాళిగా మాట్లాడే పరిస్థితి వచ్చిందని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రి శ్రీనివాస్ అన్నట్లు వైద్యానికి కూడా ఏపీ ప్రజలు హైదరాబాద్ కు పరుగులు పెట్టడాన్ని కూడా ప్రజలు ఆలోచించాల్సిన విషయమే అనీ.. ఏపీలో వసతుల కొరత ఏ స్థాయిలో ఉందో ఈ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని పేర్కొంటున్నారు. మారి ఈ అంశంలో వైసీపీ నేతల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

నవ జాతిరత్నాలు!

2019 ఎన్నికల్లో వైయస్ జగన్ పార్టీ అధికారాన్ని అందుకొందంటే... అంతకు ముందు  ప్రతిపక్ష నేతగా ఆయన తన పాదయాత్రలో నవరత్నాల పేరిట పథకాలను ప్రకటించడంతోనే సాధ్యమైందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నవరత్నా పథకాలు ప్రకటించి   జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన ఈ నాలుగేళ్ల పాలన.. ఎలా ఉందో.. ప్రజలందరికీ బాగానే అర్థమైంది. ఈ జగన్ ప్రభుత్వంలో సీఎంతో సహా తొమ్మిది మంది కీలక నేతలు ఉన్నారని.. వారి వ్యవహారశైలిని, మానసిక స్థితిని బట్టి.. నవరత్నాల్లోని ఏ ఏ రత్నం పెట్టుకుంటే వారికి మంచిదంటూ సెటైరికల్‌గా చెబుతున్న..ఓ చిత్ర రాజం  సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.  ఆ చిత్ర రాజంలో తొలుత వైఢూర్యం స్థానంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఫొటో ఉంది. జనాలకు పంగనామం పెట్టువాళ్లు ధరించుట మంచిదంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక ఆ తర్వాత స్థానంలో అంటే రెండో స్థానంలో ముత్యం ఉంది. ఆ స్థానంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అన్ని విషయాల్లో వేలు పెట్టే వారికి శ్రేయస్కరమంటూ రాసి ఉంది. ఇక ముచ్చటగా మూడో స్థానం... అంటే పగడం.. ఈ స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇసుక, మట్టి, మద్యం వ్యాపారులు ఈ పగడం ధరించడం ఉత్తమమని స్పష్టం చేసి ఉంది. ఆ తర్వాత నాలుగోస్థానం.. గోమేథకం స్థానంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఇది మానసిక రోగులు ధరించుట అన్ని విధాల శ్రేయస్కరమని వివరించి ఉంది.  ఆ తర్వాత స్థానం... అంటే పంచమస్థానం... కనక పుష్యరాగం స్థానంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ ఉన్నారు.  నటనలో ప్రతిభ ఉన్నవారు ఈ రత్నాన్ని ధరిస్తే.. మంచిందని స్పష్టం చేసి ఉంది. అలాగే షష్టమ స్థానం అంటే ఆరు...నీలం రాయి. ఆ స్థానంలో  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వారు ఈ రాయిని ధరిస్తే.. ఉత్తమొత్తమమని రాసి పెట్టి ఉంది.  ఇక సప్తమ స్థానంలో వజ్రం ఉంది. ఆర్బాటం, అవివేకం ఉన్నవాళ్లు ఇష్టపడతారంటూ.. ఆ స్థానంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజు చిత్రం ఉంది. అదే విధంగా అష్టమ స్థానం.. ఇందులో కెంపు ఉంది. తంబాకు నమిలే వారికి ఇది అన్ని విధాలా మంచిదని రాసి ఉంది.  ఈ స్థానంలో కొడాలి నాని చిత్రం ఉంది. ఇక చిట్టచివరి స్థానం అంటే నవమ స్థానంలో పచ్చ ఉంది. పగటి నిద్రలో కలల విహారం చేసే వారు ధరిస్తే.. మంచిదంటూ.. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ధరిస్తే శ్రేయస్కరమని రాసి ఉంది.  2014 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ వైయస్ జగన్ ప్రతిపక్షానికి పరిమితమైయ్యారు. ఆ తర్వాత అంటే.. 2017 చివరిలో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టి.. 4 వేల కిలోమీటర్లకు పైగా ఆయన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే.. నవరత్న పతకాలు, సంక్షేమ పథకాలతో  రాజన్న రాజ్యం వస్తుందంటూ ఆయన పేర్కొన్నారు.  దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలంతా ఓట్లన్నీ జగన్ పార్టీకి గంపగుత్తగా  గుద్దారు. అయితే  జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత, ఎక్కడ, ఏమిటీ అంటే చెప్పే నాథుడే లేకుండా పోయాడు. అలాగే జగన్ పార్టీలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని తానే అయి వ్యవహరిస్తున్నారు.  దీంతో ఆయనకు సకల శాఖల మంత్రి అనే ట్యాగ్ లైన్‌ని సైతం ప్రతిపక్ష టీడీపీ తగిలించేసింది.  అలాగే ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ఫ్యాన్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం అందరికీ తెలిసిందే. అదే విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్ విషయం కూడా విదితమే. ఇక ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న విడదల రజినీ.. ఏపీ పాలిటిక్స్ ‌లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది... ఆ తర్వాత.. ఆమె పోలిటికల్ గ్రాఫ్ ఎలా పెంచుకొంటూ వెళ్లిందనేది ప్రతీ ఒక్కరికి తెలిసిందే.  ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. అయితే సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. జగన్ పార్టీలో చేరి.. ఎంపీగా గెలుపొందారు. గతేడాది ఆయన నగ్న వీడియో అంటూ ఓ వీడియో   వెలుగులోకి వచ్చి.. అటు మీడియాలో..ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆర్కే రోజా.. ప్రస్తుతం మంత్రిగా ఉండి.. ప్రతిపక్ష పార్టీలపై ప్రెస్ మీట్ పెట్టి కారాలు మిరియాలు నూరుతారన్న సంగతి తెలిసిందే. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాని.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం... శాసనసభ స్పీకర్ పదవి అంటే.. రాజ్యాంగ బద్దంగా ఉంటూ.. అన్ని పార్టీల వారిని సమ దృష్టితో చూడాలి. కానీ సదరు స్పీకర్ తమ్మినేని మాత్రం పక్కా అధికార పార్టీ నేతగా వ్యవహరించడం కొసమెరుపు. అంతేకాదు అసెంబ్లీలో సభ సాక్షిగా అప్పుడప్పుడు స్పీకర్‌ కూర్చిలో ఆసీనులై ఆయన కునికి పాట్లు పడుతోన్న పలు వీడియోలు, ఫోటోలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని సైతం నెటిజన్లు తమదైన శైలిలో వివరిస్తున్నారు.

మరో సీఐ వీరంగం!

పోలీస్‌శాఖలో హోంగార్డుల నుంచి జిల్లా ఎస్పీల వరకు అందరూ తమ పని తాము  పద్దతిగా.. చేసుకుపోతుంటే.. సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు మాత్రం.. ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకొంటున్నాయి.   తాజాగా శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ అలియాస్ చావలి అంజమ్మ.. స్థానికంగా ఆందోళన చేస్తున్న ఓ జనసేన కార్యకర్త చెంపలు.. ఆమె రెండు చేతులతో వాయిస్తున్న ఓ వీడియో సూపర్ స్పీడ్‌తో అటు మీడియాలో... ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ ఘటనపై నెటిజన్లు  అంజు యాదవ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అదీకాక ఇప్పటికే ఆమె వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమైందన్న సంగతి అందరికి తెలిసిందేనని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అంతేకాదు ఆమె వ్యవహారశైలిపై జాతీయ మహిళ కమిషన్ సైతం మండిపడిందని.. ఆ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ రాష్ట్ర డీజీపీని ఆదేశించినా.. ఇప్పటి వరకు అంజుయాదవ్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఓ చర్చ  ఖాకీవనంలోనే జోరుగా కొనసాగుతోంది.  శ్రీకాళహస్తిలో రాత్రి 9 గంటల సమయంలో హోటల్ ఎందుకు మూయలేదంటూ.. హోటల్ యజమాని భార్యపై సీఐ అంజూయాదవ్ చెయ్యి చేసుకోవడం.. అందుకు సంబంధించిన వీడియోలు సైతం గతంలో వైరల్ అయినాయి. అలాగే మద్యం విక్రయాలు సాగిస్తున్నారంటూ.. మరో మహిళపై సదరు సీఐ  దాడి చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.   సదరు సీఐ అంజుయాదవ్ గారి బాదుడు కార్యక్రమం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయినా సీఐ అంజూయాదవ్ గారి ఖాకీ పవర్.. శ్రీకాళహస్తి సర్కిల్‌ పరిధిలో పలువురికి ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ తగిలే ఉంటుందనే ఓ చర్చ   స్థానికంగా నడుస్తోందని వారు వ్యంగ్యంగా అంటున్నారు. అంతే కాదు.. రేపో.. మాపో.. అటో ఇటో.. ఏటో వైపు నుంచి వచ్చి.. ఎవరిపైన అ దాడి చేస్తుందోననే ఓ విధమైన ఆందోళన శ్రీకాళహస్తి వాసుల్లో అంతర్గతంగా ఉందనే ఓ ప్రచారం సైతం సాగుతోందని అంటున్నారు.  ఇప్పటికే విశాఖపట్నం ఆర్మీ రిజర్వుడు సీఐ స్వర్ణలత.. నోట్ల మార్పిడి వ్యవహారంలో చిక్కి.. ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్కిస్తున్నారనీ, అలాగే గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి సీఐగా గోరంట్ల మాధవ్  వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సీఐగా ఆయన గారు చేసిన ఓవర్ యాక్షన్‌కి ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఫిదా అయిపోయి.. ఆ తర్వాత ఆయన్ని పార్టీలోకి ఇలా ఆహ్వినించడంతో.. అలా ఆయన తన సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి.. హిందూపురం ఎంపీ టికెట్‌పై గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందేనని వారు పేర్కొంటున్నారు.  ఏదీ ఏమైనా.. పోలీసులు అంటే ప్రజలకు రక్షక భటులని.. ఆ క్రమంలో ప్రజలు చెల్లించే పన్నులను జీతాలుగా తీసుకోంటూ.. ఆ ప్రజలకు అండగా.. రక్షణగా నిలవకుండా.. తాము దైవలోకం నుంచి ఊడి పడ్డామని.. ఓ చేతిలో లాఠీ, మరో చేతిలో తుపాకీ చూసుకోని తమకు తాము దైవాంశ సంభూతులమనుకొంటూ.. పోలీసు శాఖలోని పలువురు పోలీసులు తమకు తాము పరువు మాపుకొంటున్నారని నెటిజన్లు ఓ విధమైన ఆందోళనతో పేర్కొంటున్నారు.

స్పీడ్ న్యూస్- 2

21.హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో 12 ఏళ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. రాత్రి నుంచి గాలిస్తున్నా ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో కిడ్నాప్ అయి ఉంటాడని భావిస్తున్నారు. 22.తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలను ప్రతి రోజు చూస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు.  23.చైనా లోన్‌యాప్ ఏజెంట్ల వేధింపులకు మరొకరు బలయ్యారు. పెరుగుతున్న వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం  బెంగళూరులో వాటిల్లింది.  24.ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశానికి పయనమయ్యారు.  25.కేరళలో ప్రొఫెసర్‌ చేతిని నరికిన ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఆరుగుర్ని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. దోషులపై మోపిన అన్ని  అభియోగాలు రుజువయ్యాయి.  26.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అ, ఆలు కూడా రావని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్‌కు వారాహికి, వరాహికి తేడా తెలియదన్నారు. 27. సినీ నిర్మాత బండ్ల గణేశ్ హాస్పిటల్లో బెడ్ పై ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చేతికి సెలైన్ కూడా ఉండటంతో ఆయనకు ఏమయిందనే చర్చ జరుగుతోంది. 28. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తిరుమల చేరుకున్నారు. సతీమణితో కల్సి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.  30.ఉత్తర భారత దేశాన్ని భారీ వర్షాలు కుదుపేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీలో ఓ కొండ కుప్ప కూలిపోయింది. 31 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ పలు వేదికల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లే ముందు మరోసారి ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 32.మంత్రి రోజా తిరుమల దర్శనానికి వెళ్లారు. ఆమెతో పాటుగా శ్రీముఖి ఫ్యామిలీ కూడా వెళ్లింది. ఇలా మంత్రి రోజాతో కలిసి జబర్దస్త్ ఆర్టిస్టులు, బుల్లితెర తారలు నిత్యం తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.   33.కుండపోత వర్షాలు  హిమాచల్‌ ప్రదేశ్‌‌లో  బీభత్సం సృష్టించాయి. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ రహదారులు, నివాసాలు కొట్టుకుపోయాయి.  34.దేశ వ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. అన్ని  అయితే ఇటీవల భారీగా పెరిగిన చికెన్ ధరలు.. నేల చూపులు చూడటంతో కిలో చికెన్‌ రూ.150 నుంచి రూ.180 మధ్య అమ్ముతున్నారు.  35.గ్రేటర్ నోయిడా పరిధిలోని హోషియార్ పూర్ పరిధిలో నివసించే శైలజా చౌదరీ అనే మహిళకు గత శుక్రవారం ఒక ఈ- చలాన్ వచ్చింది. ఆమె పేరిట ఎటువంటి బైక్, కారు రిజిస్టర్ కానప్పటికీ ట్రాఫిక్ పోలీసులు 1000 రూపాయల చలానా విధించారు. 36. టమాటాలకు బౌన్సర్లు పెట్టుకున్న యూపీకి చెందిన కూరగాయల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో వారణాసికి చెందిన  సమాజ్‌వాది పార్టీ కార్యకర్త తన దుకాణం వద్ద బౌన్సర్లు కాపలాగా ఉంచిన విషయం తెలిసిందే.  37.దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసిన నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు శిక్ష పడింది. గోకుల్ చాట్‌, లుంబినీ పార్క్‌, దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్లతోనూ వీళ్లకు సంబంధాలు ఉన్నాయి.  ఎన్‌ఐఏ  కోర్టు శిక్షలను ఖరారు చేసింది.  38.తెలంగాణలో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం  లక్ష రూపాయల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జూన్‌ 26తో ముగిసింది.  39. ఇంటి కుక్కే కదా అని కుక్కకాటును నిర్లక్ష్యం చేసినందుకు  40 ఏళ్ల జ్యోతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో చోటు చేసుకుంది. సకాలంలో కుక్క కాటుకు వైద్యం అందిస్తే ఆ మహిళ బతికేదని వైద్యులు అంటున్నారు.  40.ఆవర్తనం కారణంగా వచ్చే రెండ్రోజులు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  ఇక భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌కు ఎల్లోఅలర్ట్‌ జారీ చేశారు. 41. తెలంగాణలో ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.  రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరిస్తోందని సీల్పీ నేత భట్టి విక్రమార్క  మండిపడ్డారు.  42. 'జయం' చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ సదా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తనకు పెళ్లి అంటే ఆసక్తి లేదని స్పష్టం చేసింది.  43.బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ చిత్రం కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 44. టెస్లా ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజ సంస్థ భారత మార్కెట్‌లోకి మాత్రం ఇప్పటిదాకా ప్రవేశించలేదు.ఈ నేపథ్యంలో భారత మార్కెట్లోకి వీలైనంత త్వరగా అడుగుపెట్టేందుకు టెస్లా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. 45.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆసీనులయ్యారు. 46. చంపేస్తానని బెదిరించి 9వ తరగతి విద్యార్థి నుంచి లక్షలు గుంజాడో పదో తరగతి విద్యార్థి. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిందీ ఘటన. 47. ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని  బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి  స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీలు కలుస్తాయని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సంకేతాలను ఇచ్చిందని చెప్పారు.  48.షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉంటే సరిపోదని అన్నారు. అర్జెంట్‌గా అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటే కుదరదని చెప్పారు. 49.దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని ఇప్పుడు కొత్త వైరస్ ఒకటి తీవ్రంగా కలవర పెడుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఈ క్రమంలోనే ఏం చేయాలో పాలు పోని చిలీ సర్కార్.. 3 నెలలు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 50.చంద్రయాన్-3 విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్ నమూనాను చెంగాలమ్మ అమ్మవారి ముందు ఉంచి, ప్రయోగం సాఫీగా జరగాలని ప్రార్థించారు.

టీటీడీకి ఆర్టీఐ మినహాయింపు సమర్థనీయమేనా?

రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నది సామెత. మరి దేవుడి సొమ్ము.. అందులోనూ భక్తులు ముడుపుల రూపంలోనూ, విరాళాల రూపంలోనూ ఇచ్చిన సొమ్ము ఎవరి పాలు అవుతోంది. అది తెలుసుకునే హక్కు  భక్తులందరికీ ఉంటుంది. అటువంటిది ప్రపంచ  ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఒక సారి భగవంతుడికి సమర్పించుకున్న తరువాత ఆ ముడుపుల సొమ్ము, హుండీ కానుకల సొత్తు ఎలా వ్యయం అవుతోంది. సద్వినియోగం అవుతోందా? లేదా? అన్న విషయాలను ఆరా తీసే హక్కు ఎవరికీ లేదంటోంది. భక్తులు స్వామి వారికి చెల్లించే మొక్కులు, విరాళాలతో తిరుమలలో భక్తులకు సౌకర్యాలు సమకూరుతాయని, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం, జీర్ణదేవాలయాల ఉద్ధరణ  తదితర ధార్మిక కార్యక్రమాలకు వ్యయం చేస్తారన్నది భక్తుల విశ్వాసం. సాధారణంగా ప్రజలు ఇచ్చే విరాళాలతో చేపట్టే పనులకు పబ్లిక్ ఆడిట్ ఉండాలి. అంటే ఎలా ఖర్చు చేశారు? ఎందుకు ఖర్చు చేశారు అని అడిగితే జవాబు చెప్పే జవాబుదారీ తనం ఉండాలి. అయితే తిరుమలలో మాత్రం ఆ ప్రశక్తే లేదు అంటున్నారు.   చివరాఖరికి టిటిడి ఆదాయ వ్యయాల వివరాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి కూడా రావుట. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది.    దేశ రక్షణ రహస్యాలకు సంబంధించిన అంశాలు తప్ప, మిగిలిన అన్ని రంగాలకూ సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. చివరాఖరికి కోర్టులు కూడా ఈ చట్ట పరిధిలోకే వస్తాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఈ చట్ట పరిధిలోకి రాదు అంటోంది టీటీడీ.  ఏమైనా అంటే తమది స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అంటోంది.  టీటీడీకి ప్రభుత్వంలో సంబంధం లేదని చెప్పుకుంటోంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, జేఈవో వంటి అధికారులను నియమించేది ప్రభుత్వమే. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులను నియమించేది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జంబో పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తే కోర్టులు అభ్యంతరం చెప్పాయి కూడా. నిజమే టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థే అయినా ప్రభుత్వ అధీనంలో, ప్రభుత్వ అజమాయిషీలో పని చేస్తుంది. అటువంటి టీటీడీకి ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) పరిథిలోకి రాకుండా మినహాయింపు ఇవ్వడమేమిటన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.    వేల కోట్ల రూపాయలు విరాళాలు పోగయ్యే ఒక దేవాలయంలో, తామిచ్చిన విరాళాలు ఏమవుతున్నాయో.. తెలుసుకునే హక్కు భక్తులకు లేదనడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు.  అన్నిటికీ మించి గత కొన్నేళ్లుగా  తిరుమల తిరుపతి దేవస్థానం  నిధులు  పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ,  శ్రీవాణి ట్రస్టు  లో అవకతవకలు జరిగాయంటూ రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తున్న తరుణంలో టిటిడీని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.  గతంలో స్వామి వారి పింక్‌ డైమండ్‌ మాయమైందని, అది చంద్రబాబు ఇంట్లో ఉందంటూ నాటి ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. దానిపై అప్పటి టీటీడీ పావకవర్గం వారిపై పరువునష్టం దావా దాఖలైంది. దానికి సంబంధించి 2 కోట్ల రూపాయల ఫీజును టీడీపీ కోర్టుకు చెల్లించింది. ఇప్పుడు ఆ డబ్బు కోర్టులోనే డిపాజిట్‌ రూపంలో ఉంది. ప్రభుత్వం మారి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇన్చార్జి జేఈఓ ధర్మారెడ్డి.. అసలు వెంకన్నకు పింక్‌ డైమండ్‌ లేదని, మీడియా సమక్షంలోనే వెల్లడించారు. అంటే వ్యక్తులు చేసిన ఆరోపణలకు, టీటీడీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందన్న మాట. మరి ఆ 2 కోట్ల రూపాయలు ఎవరి ఖాతా నుంచి వసూలు చేస్తారన్నది ప్రశ్న. రోజుకు ఎన్ని టిక్కెట్లు అమ్ముతున్నారు? వాటికి వచ్చేదంత? రోజుకు వీవీఐపీల దర్శనాలు ఎన్ని అనుమతిస్తున్నారు? అందులో జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు ఎంతమంది? అన్న వివరాలను భక్తులకు ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ అధికారులదేనంటున్నారు. తమ డబ్బుకు లెక్క అడిగే హక్కు తమకుందన్నది భక్తుల వాదన. జస్టిస్‌ కోదండరామ్‌ సింగిల్‌బెంచ్‌ జడ్జిగా ఉన్నప్పుడు.. 2018లో ప్రభుత్వ నిధులతో సంబంధం లేని దేవాలయాలను, ఆర్టీఐ నుంచి మినహాయింపు ఇస్తూ తీర్పు వెలువ డింది. అయితే, దానిపై అనేక రిట్‌ అప్పీళ్లు అప్పటినుంచీ ఇంకా పెండింగ్‌లోనే  ఉన్నాయి.   సేవా టికెట్లు, వీఐపీ, ప్రొటోకాల్‌ దర్వనాలు, టీటీడీ చానెల్‌కు భక్తులిచ్చే విరాళాల్లో అవకవతకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఇన్ని ఆరోపణలను ఎదుర్కొంటున్న టీటీడీకి ఆర్టీఐ నుంచి మినహాయింపు ఇవ్వడం ఎంత మాత్రం సమంజసం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  టీటీడీ రక్షణ శాఖ కాదనీ,  అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే టీటీడీనీ ఆర్టీఐ పరిథిలోకి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.  

నానక్ రామ్ గూడాలో వాలంటీర్ల హెడ్ ఆఫీస్!

ఏపీలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని వారాహీ రెండో విడత యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్ వ్యవస్థే కారణం అనేలా పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల  సమాచారాన్ని వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించగా.. పవన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. అయితే, పవన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు.  వాలంటీర్ల పొట్టకొట్టాలని తానెప్పుడూ అనుకోలేదని అంటూనే కోడిపిల్లలను గద్దలు తన్నుకు వెళ్ళినట్లుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల జీతం భూమ్ భూమ్ కి తక్కువ, ఆంధ్ర గోల్డ్ కు ఎక్కువ అని సానుభూతి చూపిస్తూనే చాలా చోట్ల వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని, ఈ వ్యవస్థలో కొందరు కిరాతకులు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదంటూ.. కొందరు వాలంటీర్లు ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో పట్టుబడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలు భయపెట్టి, వాళ్లు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని కొందరు వాలంటీర్లు భయపెడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో ఏపీలో వాలంటీర్లు సేకరించే డేటా మొత్తం హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని హెడ్ ఆఫీసుకు వెళ్తుందని మరో కొత్త ఆరోపణను తెర మీదకి తెచ్చారు. వాలంటీర్ల వ్యవస్ధ హెడ్ ఆఫీసు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉందని, ఇక్కడ 700 మంది ఉద్యోగులున్నారని పవన్ చెప్పారు. నానక్ రామ్ గూడలోని సంస్థలో ఏపీ డేటా ఎందుకు పెట్టారని.. ఏపీ ప్రజల డేటాను ఆ సంస్థలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్‌ క్రాస్‌ సంస్థకు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ అధిపతిగా ఉన్నారని.. మరి సీఎం జగన్‌ వాలంటీరు వ్యవస్థకు ఎవరు అధిపతి అని ప్రశ్నించారు. జగనన్నే నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చారు.. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో కొందరు వాలంటీర్లు ఉన్నారని సెటైర్లు వేశారు.  పవన్ చేసిన మిగతా ఆరోపణల సంగతి ఎలా ఉన్నా నానక్ రామ్ గూడకి తరలివెళ్తున్న ఏపీ డేటా ఆరోపణ మాత్రం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నది. నిజంగానే ఏపీ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల వద్ద ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది. ఈ డేటాను వైసీపీకి సంబంధించిన ప్రైవేట్ కార్యాలయాలకు తరలిస్తున్నారా? లేక ఈ డేటా వ్యవహారాన్ని వైసీపీ ఏదైనా ప్రైవేట్ సంస్థకు అప్పగించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేపు ఎన్నికలలో ఈ డేటా ఉపయోగించి ప్రజలను బెదిరించి, ఆశజూపి, మభ్యపెట్టి ఓట్లుగా మలచుకునే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వైసీపీ ఆ తరహా ఆలోచనతోనే ప్రజల డేటాను నానక్ రామ్ గూడ కార్యాలయానికి తరలిస్తున్నదా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి.  నానక్ రామ్ గూడ ఆఫీసు గురించి ఎలాంటి సమాచారం లేకుండా అయితే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపించడం లేదు. ఏదో సమాచారం సేకరించే నానక్ రామ్ గూడ పేరు బయటకి చెప్పినట్లు కనిపిస్తుంది. ఇది తీవ్రమైన అంశం, తీవ్రమైన ఆరోపణ కనుక ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

వైసీపీకి విశాఖ జిల్లా అధ్యక్షుడి రాజీనామా.. పార్టీలో గౌరవం దక్కకేనని వివరణ

జ‌గ‌న్ సార‌థ్యంలోని వైసీపీలో అసమ్మతి పెరిగిపోతోంది. పార్టీ కోసం, పార్టీ ప్రతిష్ట కోసం ప్రాణం పెట్టయినా పని చేస్తామనే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.   పార్టీ నాయ‌కుడికే షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న వారి సంఖ్య  కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణంగా  అధికార ప‌క్షానికి విప‌క్షాల నుంచి ఒత్తిడి ఉంటుంది, స‌మ‌స్య‌లూ ఉంటాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైసీపీలో మాత్రం వ్య‌వ‌హారం రివర్స్ లో  ఉంది.  పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసే వారు, పార్టీపై వ్యతిరేక కామెంట్లు చేసేవారు  రోజు రోజుకూ ఎక్కువ‌వుతున్నారు. ఇంటి గుట్టు ఇంటి వారే బ‌య‌ట‌ ప‌డేసుకుంటున్నారు. పార్టీలో రెబెల్ వ్య‌వ‌హారా లు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  ఇప్పటికే  నెల్లూరు జిల్లాలో  వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మాజీ మంత్రి బాలినేని కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెడ్డి  వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి   రాజీనామా చేశారు. ఆయన పార్టీలోనే ఉన్నా అసమ్మతి సెగ మాత్రం పార్టీకి గట్టిగానే తగిలేలా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకటి రెండు అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ వైసీపీలో అసమ్మతి రగులుతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షపదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నారు. తన రాజీనామా సందర్భంగా పార్టీలో  కనీస గౌరవం కరవవ్వడంతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.  ఎన్నో ఆశయాలు, ఆశలతో రాజకీయాల్లోకి వచ్చానని అవి చేసే పరిస్థితి లేనపుడు పదవిలో కొనసాగడం సరికాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని చెప్పిన పంచకర్ల కనీసం అధిష్ఠానం తన మాట వినేందుకు కూడా సిద్ధంగా లేకపోవడంతో తన మాట వినే అవకాశం లేనందునే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

స్పీడ్ న్యూస్ 1

1.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.  శుక్రవారం మధ్యాహ్నం రెండుగంటల 35 నిమిషాలకు  రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది.  2. భారత రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నెలలో భారీగా పెరిగింది. అంతకుముందు నెలలో 4.31గా ఉన్న రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నెలలో 4.81కి చేరుకుంది.  3.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర  ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. చోడవరం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.  4.తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద భక్తులకు చిరుత కనిపించింది. దీంతో టీటీడీ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఒక బాలుడిపై చిరుత దాడి తెలిసిన విషయమే. 5.సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బుధవారం మరో ఇద్దరు అరెస్టయ్యారు. కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్, అతని కూతురు సాహితీలను ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.  6. ముఖ్యమంత్రి జగన్ కొంతకాలంగా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని జగన్ ను పవన్ నిలదీశారు. తాడేపల్లిగూడెం లో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని మాట్లాడారు. 7. జగన్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాలలో నాశనం అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.  ఉండవల్లిలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో బాబు మాట్లాడారు. రాష్ట్రానికి ఇప్పుడు సంపద సృష్టించే ప్రభుత్వం కావాలని మీడియా చిట్ చాట్ లో చంద్రబాబు చెప్పారు. 8.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.   ఈ నేపథ్యంలో ఆయనపై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.  9.రాజోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు  కన్నుమూశారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోగల తన అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కృష్ణంరాజు మృతి చెందారు.  10.వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 11. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీ సమీపానికి వరదనీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో  ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మూసివేస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు.  12.మరో రెండేళ్లలో ఇంటర్నెట్ అంతమైపోతుందంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’లో వచ్చిన కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంటర్నెట్‌లోనూ ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  13.  వ్యవసాయానికి మూడు గంటల ఉచిత విద్యుత్ చాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రిమల్లారెడ్డి మాట్లాడుతూ రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అని, తనను కూడా బ్లాక్ మెయిల్ చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 14.రాజస్థాన్‌లో దారుణం జరిగింది. హత్యకేసు నిందితులను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తుండగా అడ్డుకున్న ఓ ముఠా పోలీసుల కళ్లలో కారం చల్లి నిందితులపై కాల్పులు జరిపింది.  15.వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలానికి విండీస్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. కేవలం 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్ అయింది.  16.భార్యకు తెలియకుండా వంటలో రెండు టమాటాలు వాడిన ఓ వ్యక్తి కాపురం కూలిపోయింది. భర్తపై మండిపడ్డ ఆ ఇల్లాలు తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసింది.  17.స్కూల్‌లోనే విద్యార్థులు మందుకొట్టారు. ఆపై టీచర్‌ను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన ఉదంతం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. 18. హర్యానాలో అసాధారణ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది.  19.అదుపుతప్పిన స్మార్ట్‌ఫోన్ వినియోగం బాల్యాన్ని చిదిమేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌కు బానిసైపోయిన ఓ పదేళ్ల బాలుడు చివరకు మతిస్థిమితం కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో తాజాగా వెలుగు చూసింది.  20. కోల్‌కతా లోకల్ రైలులో కొందరు మహిళలు జుట్టు పట్టుకొని ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియోను ఆయుషి అనే మహిళ కోల్‌కతా లోకల్ పేరుతో  ట్విట్టర్ లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వసూల్ రాణి రజనీ.. మాజీ మంత్రి ప్రత్తిపాటి ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అభివృద్ధి అనవాలు లేకుండా తుడిచేయడానికే కంకణం కట్టుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రులు పలువురు సొంత పనులలో పడి అభివృద్ధిని విస్మరిస్తున్నారని పార్టీ శ్రేణుల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఇక విపక్షాలు కూడా పలువురు మంత్రుల అవినీతి, అక్రమార్జనలపై ఆధారాలతో సహా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ అక్రమార్జన, అస్తులపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన విమర్శలపై ఇంకా చర్చ జరుగుతుండగానే  మంత్రి రజనీపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ కు సంక్షేమం పేరిట బటన్ లు నొక్కేందుకే ఎక్కడ లేని సొమ్మూ సరిపోవడం లేదనీ, ఆదాయం లేని రాష్ట్రంలో అప్పులు తెచ్చి మరీ అరకొర సంక్షేమం కోసం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తుంటే ఆయన కేబినెట్ లోని మంత్రులు మాత్రం తమతమ నియోజకవర్గాల అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెడతారని ప్రత్తిపాటు అన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దివాళా దిశగా నడుపుతుంటే.. ఆయన మంత్రి రజనీ నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ఇంటిని  చక్కబెట్టుకునే పనిలో పడ్డారని, ఆ క్రమంలో వసూల్ రాణిగా మారారని ప్రత్తిపాటి విమర్శించారు.    మంతి రజనికి అభివృద్ధిపై శ్రద్ధ లేదనీ, ఆమె దృష్టి అంతా వసూళ్లపైనే కేంద్రీకరించారనీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో మంత్రులందరూ యథారాజా తథా ప్రజా అన్నట్లుగా రాష్ట్ర ప్రగతిని విస్మరించి సొంత పనులు చక్కబెట్టుకోవడంలోనే నిమగ్నమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి రజనీపై చేసిన విమర్శలు, సవాళ్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. ఓలేరువాగుపై వంతెన, మురుగునీటి శుద్ధి కేంద్రం వంటివి పురోగతి లేకుండా పడి ఉన్నాయన్నారు. మంత్రి రజనికి నియోజవర్గ అభివృద్ధి పట్టదనీ, ఎంత సేపూ వసూళ్లపైనే శ్రద్ధ చూపుతూ వసూల్ రాణిగా మారారని విమర్శించారు. ఓలేరు వాగు వంతెన వద్ద, మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద సెల్ఫీ దిగిన ప్రత్తిపాటి  మీడియాతో మాట్లాడుతూ మంత్రి రజిని అసమర్థత, చేతకానితనం, అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం, ఓట్లేసిన ప్రజలకు కనబడకుండా పోవడం, ప్రజలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం లేకపోవడంతోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.  తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.16 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభించామని... వైకాపా అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్ల మూడు నెలల కాంలో ఈ పనులు ఒక్క  అంగుళం కూడా కదల్లేదని ప్రత్తిపాటి చెప్పారు. అమృత్ పథకంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం మురుగునీటి శుద్ధి కేంద్రం మంజూరు చేయగా, ఈ కేంద్రానికి 2018లో శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. దానిని పూర్తి చేసి ఉంటే ప్రజలు అంటువ్యాధులు, అనారోగ్యాల బారినపడకుండా ఎంతో ఉపయోగపడేదని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. అదే విధంగా ఓలేరు వాగు వంతెనకు నాడు  రూ.7.68 కోట్లు మంజూరు చేశారని, కానీ జగన్ హయాంలో ఇప్పటి దాకా ఈ వంతెన నిర్మాణం ముందుకు సాగలేదన్నారు.   రూ.7.68 కోట్ల పనులను పూర్తి చేయలేని అసమర్థ మంత్రి రజిని నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రజనికి మంత్రి పదవి మంత్రి కుటుంబం బాగుపడటాకే ఉపయోగపడిందని ప్రత్తిపాటి అన్నారు. ఆమె మంత్రి పదవి వల్ల నియోజకవర్గానికి జరిగిన మేలు ఏదీ లేదని ప్రత్తిపాటి విమర్శించారు.  ఎక్కడ ఏం చేస్తే డబ్బులు వస్తాయనే వాటిపై ఉన్న దృష్టి ఓట్లేసిన ప్రజల  ప్రయోజనాలపై లేదన్నారు.   వైకాపా ప్రభుత్వానికి, మంత్రి రజినికి ప్రజలు వీఆర్‌ఎస్ ఇవ్వడం ఖాయమని ప్రత్తిపాటి తెలిపారు.

పవన్ పై రోజా విమర్శలు బూమరాంగ్

జగన్ ను మెప్పించేందుకు మంత్రి రోజా చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా వైసీపీ ఇరుక్కుంది. జగన్ సర్కార్ తరచూ చెప్పే రివర్స్ ఇప్పుడు రోజాకు ఎదురైంది. జనసేన పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నంలో రోజా ప్రదర్శించిన  అత్యుత్సాహం బూమరాంగ్ అయ్యింది. వైపీపీనే డిఫెన్స్ లో పడేసింది.   ఏపీలో మహిళలు మాయం,  కిడ్నాపుల వెనుక వాలంటీర్లు, వైసీపీ నేతలు ఉన్నారన్న పవన్ ఆరోపణలపై వైపీపీ మంత్రులు ఘాటుగా స్పందించారు.  పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కొందరు మహిళా వాలంటీర్ల ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ పవన్ కు నోటీసులు కూడా పంపింది.   ఐదువేల రూపాయల కోసం రాష్ట్ర ప్రజల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని, జీవితాలు త్యాగం చేసిన వాలంటీర్లపై ఆరోపణలు చేసిన పవన్.. తక్షణం   క్షమాపణ చెప్పి, వాలంటీర్ల కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలంటూ మంత్రి రోజా పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేశారు.  అలాగే పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు.  దీంతో జనసేన శ్రేణులు రాష్ట్రంలో వాలంటీర్లు చేసిన అరాచకాలను ఆధారాలతో సహా బయటపెడుతూ మంత్రి రోజాకు ప్రశ్నలు సంధించారు. జనసేనాని మొత్తం వాలంటీర్లనందరినీ విమర్శించలేదనీ, వారిలో కొందరు అరాచకాలను ఎత్తి చూపారనీ, అసలు అలాంటి వాటికి అవకాశం ఇస్తున్న వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నించారనీ జనసైనికులు అంటున్నారు. మంత్రి రోజా పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలకు స్పందిస్తూ.. వాలంటీర్లు పాల్పడిన అత్యాచారాలు, పొరుగురాష్ట్రం నుంచి మద్యం బాటిళ్లు తీసుకువస్తూ పట్టుబడిన ఉదంతాలు, వితంతులను వేధించిన ఘటనలను, పెన్షన్లను కొట్టేసిన సంఘటనలను ఆధారాలతో సహా వెల్లడిస్తూ అటువంటి వారికి మంత్రి రోజా మద్దతు ఇస్తున్నారా అంటూ ప్రశ్నలు గుప్పించారు.  అలాగే జగన నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో వాలంటీర్ల చేతిలో అత్యాచారానికి గురైన బాలికలు, వేధింపులకు గురైన ఒంటరి మహిళలు, కిడ్నాప్ అయిన బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదులతో కూడిన వీడియోక్లిప్పింగులను జత చేస్తూ సామాజిక మాధ్యమంలో రోజాపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో వాలంటీర్ల అత్యాచారాలు, అకృత్యాలకు సంబంధించి ఆధారాలతో సహా జనసైనికులు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టడంతో  వైసీపీ డిఫెన్స్ లో పడింది. రోజా అత్యుత్సాహంతో  వలంటీర్లను వెనకేసుకొస్తూ  చేసిన విమర్శలు బూమరాంగ్ అవ్వడంతో వైసీపీ అడ్డంగా బుక్కైనట్లు అయ్యింది.  వలంటీర్లు  అకృత్యాలు, అరాచకాలు, అమానుషానికి పాల్పడినప్పుడు నోరు విప్పని మంత్రి రోజా ఆ అకృత్యాలు చేసిన వారిని సమర్ధిస్తూ మాట్లాడటాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.   

ఎంపీ అభ్యర్థుల కోసం వైసీపీ వేట!?

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమయం వచ్చేసింది.  తెలంగాణలో ఈ ఏడాదే ఎన్నికలు జరగనుండగా.. అక్కడ రాజకీయం కాకమీదుంది. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు అందుకు సమాయత్తమవుతున్నాయి. మరో వైపు కేంద్రం మినీ జమిలీకి వెళ్లే ఆలోచన ఉందనే ప్రచారం  కూడా ఏపీ పొలిటికల్ హీట్  పెంచేసింది. దీంతో ఈ నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఏడాది ఇంకో లెక్క అన్నట్లుగా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముందుగా తమ పార్టీలో ఏం జరుగుతుంది? రానున్న ఎన్నికలలో గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ మొదలు పెట్టారు.  ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు చేయించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇటీవల   పనితీరు బాలేని ఎమ్మెల్యేలకు క్లాసు  కూడా పీకారు. ఒక రకంగా చెప్పాలంటే పర్ఫామెన్స్ రిపోర్టర్ వీక్ గా ఉన్న వారందరికీ తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ వర్క్ షాప్ మొదలు పెట్టారు. ఇకనైనా పని తీరు మార్చుకోకపోతే 20 నుండి 25 మందికి టికెట్లు ఇవ్వడం కష్టమేననని తేల్చేసినట్లు తెలిసింది.  మరో 20 మంది ఎమ్మెల్యేలకు అయితే అసలు టికెట్లు ఇచ్చేది లేదని, మహా అయితే ఈ ఏడాదిలో ఇప్పటి నుండి పర్ఫామెన్స్ బావుంటే ఒకరిద్దరికి నియోజకవర్గ బదిలీ చేసే అవకాశం మాత్రమే ఉంటుందని కూడా చెప్పేశారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  ఇప్పుడు వైసీపీ ఎంపీల టికెట్ల వ్యవహారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోకస్ చేసినట్లు తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీలు 22 మంది విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు  రెబ‌ల్‌గా మారి సొంత పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత జరిగినా ఆయన్ను పార్టీ ఇప్పటి వరకూ సస్పెండ్ చేయలేదు.. ఆయనా రాజీమానా చేయలేదు.  ఆ సంగతి అలా ఉంచితే వైసీపీకి ఇప్పుడు 21 మంది ఎంపీల బలం ఉంది. ఇప్పటికే వీరిలో నలుగురు ఎంపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఎంపీగా పోటీ చేయ‌లేమ‌ని అధిష్టానానికి చెప్పేసినట్లుగా తెలుస్తుంది. వీరిలో అనకాపల్లి ఎంపీ బీశెట్టి స‌త్య‌వ‌తి, అరకు ఎంపీ గొట్టేటి మాధ‌వి, విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారు. ఈ నలుగురూ కూడా  ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నది తమ భావనగా అధిష్టానానికి  ఇప్పటికే చెప్పినట్లుగా ప్రచారం జరుగుతున్నది. దానికి వైసీపీ నుండి ఎలాంటి స్పందనా రాకపోవడంతో చాలాకాలంగా ఈ నలుగురు పార్టీకి కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నాలుగు స్థానాలలో వైసీపీ కొత్త వారిని వెతుక్కోవాల్సిందే. ఆ నలుగురు వారికి వారే ఈసారి పార్లమెంటుకు వెళ్ళేది లేదని నిర్ణయించుకోగా మరో నలుగురు ఎంపీలను పార్టీ అధిష్టానమే ఈసారి అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఉన్నారు. ఈ నలుగురినీ అసెంబ్లీలో తమకి అండగా ఉంటారనే కారణంగా అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు వైసీపీ కొత్త అభ్యర్థులకు దించాల్సి ఉండగా.. మరో ముగ్గురు ఎంపీలు వారి వారి స్థానాలలో గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవని  రిపోర్టర్లు వచ్చినట్లు తెలుస్తుండగా వారిని కూడా మార్చాలని వైసీపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అంటే మొత్తంగా 21 మందిలో పది మంది పాత వారికి మాత్రమే ఎంపీ టికెట్లు ఇవ్వనుండగా 11 లోక్ సభ నియోజకవర్గాలలో  కొత్త వారినే  బరిలోకి దించాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.  ఈ 21 కాకుండా మిగతా 4 స్థానాలలో ఎంపీ ఆర్ఆర్ఆర్ స్థానంతో పాటు మరో స్థానంలో కొత్త వారికి అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

కేసీఆర్ సర్కార్ కు హిమాన్షు షాక్.. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై ఆవేదన

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనవడు హిమాన్షు బీఆర్ఎస్ పార్టీ గాలి తీసేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పరువును నిలువుగా గంగలో ముంచేశారు.  గౌలిదొడ్డిలోకి కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు హిమాన్షు తన స్నేహితులతో కలిసి రూ.40 లక్షలు కంట్రిబ్యూట్ చేసి పాఠశాలకు సకల సౌకర్యాలూ కల్పించారు. ఇది హర్షించదగ్గ విషయమే. ముఖ్యమంత్రి మనవడు బాధ్యత వహించి పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించవచ్చ. కానీ అదే సమయంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సర్కారు స్కూళ్ళ దుస్థితి ని పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ పాఠశాలను సందర్శించిన హిమాన్షు ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కళ్ల వెంబడి నీళ్లోచ్చాయని పేర్కొన్నారు. ఆయన మాటలను బట్టి  బీఆర్ఎస్ సర్కార్ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు పెద్ద పీట వేశాం, సౌకర్యాలు కల్పించాం అని చెప్పుకుంటున్నదంతా మాటలకే పరిమితమని స్వయంగా సీఎం మనవడే చెప్పినట్లైంది.  రాష్ట్రం  అభివృద్ధి చెందుతూ బంగారు తెలంగాణ దిశగా  పరుగులు పెడుతోందంటూ మంత్రులు, బీఆర్ఎస్ నేతలూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న సమయంలోనే కేశవనగర్ పాఠశాల దుస్థితిపై హిమాన్షు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ప్రభుత్వ ప్రచారం చూస్తుంటే సర్కార్ తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ సామెతను గుర్తుకు తెస్తున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమం వేదికగా కేసీఆర్ సర్కార్ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదనడానికి హిమాన్షు వ్యాఖ్యలే నిదర్శనమంటూ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు.    స్వంత చొరవతో సమకూర్చిన నిధులతో బాగుపడిన ఆ స్కూల్‌లోని కొత్త తరగతి గదులు, ఫర్నీచర్, ఇతర సౌకర్యాలను హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం( జూలై 12) ప్రారంభించారు.  ఆ సందర్భంగా హిమాన్షు ప్రసంగం క్షేత్ర స్థాయిలో మన వూరు  మన బడి కార్యక్రమం ఎంత సుందరముదనష్టంగా అమలు అవుతోందో కళ్లకు కట్టింది.

చంద్రయాన్‌ 3కు .కౌంట్‌డౌన్‌ ప్రారంభం

చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది. గురువారం (జూలై 13)మధ్యాహ్నం 2 గంటల 35 నిముషాల 13 సెకండ్లకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమై 24 గంటల పాటు కొనసాగుతుంది. శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 35 నిముషాల13 సెకండ్లకు  గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెడుతుంది. ఈ నేపథ్యంలో ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్‌ షార్ కు చేరుకుని వాహక నౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి గృహంలో చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ వీరముత్తువేల్‌, ఎల్‌వీఎం-3పీ4 మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌, అసోసియేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ నారాయణన్‌, వెహికల్‌ డైరెక్టర్‌ బిజూస్‌ థామస్‌ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.   2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు.   చందమామపైకి ల్యాండర్‌ను విజయవంతంగా జారవిడిచిన చంద్రయాన్‌ -1  తరువాత  ఇస్రో, చంద్రుడిపై రోవర్‌ను దింపే లక్ష్యంతో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైంది. ఈ వైఫల్యం పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. లోపాలను సవరించుకొని  చంద్రయాన్‌-3 ప్రయోగానికి సిద్ధమైంది. శుక్రవారం (జూలై14)నుంచి సరిగ్గా 40 రోజుల తర్వాత చంద్రయాన్‌-3 చంద్రుడిని చేరుకొంటుంది.  

వైసీపీ ఫేక్ ప్రచారంపై లోకేష్ న్యాయ పోరాటం.. పాదయాత్రకి బ్రేక్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట నాలుగువేల కిమీ పాదయాత్రకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ రెండు వేల కిమీ పాదయాత్ర పూర్తి చేసుకోగా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే, యువగళం యాత్రకు రెండు రోజులు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తనపై, తన కుటుంబంపై త‌ప్పుడు వార్తలు రాస్తూ, త‌న‌ని అప్రతిష్టపాలు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోందంటూ   గతంలో ఆయన ఒక దినపత్రికపై ప‌రువున‌ష్టం దావా వేశారు. వైసీపీ నేత‌లు, సోష‌ల్ మీడియా బాధ్యులు కూడా త‌న‌ని టార్గెట్ చేస్తున్నారంటూ క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేశారు.  వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఈ కేసులో పిటిష‌న‌ర్ అయిన నారా లోకేశ్ వాంగ్మూలాన్ని మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ కోర్టులో   శుక్రవారం (జూలై 13) న‌మోదు చేయ‌నున్నారు. దీంతో యువ‌గ‌ళం పాద‌యాత్రకి  శుక్రవారం (జులై 13), శనివారం (జూలై 14) ల‌లో విరామం ప్రక‌టించారు. 12న పాదయాత్ర ముగించుకొని లోకేష్  అమ‌రావ‌తి కి వెళ్లనున్నారు. అనంతరం మళ్ళీ  ఆదివారం (జూలై15) యువగళం యాత్ర పునఃప్రారంభం కానుంది. కాగా, గతంలో వైసీపీ నేతలు.. టీడీపీ, చంద్రబాబు, నందమూరి కుటుంబాలపై తీవ్రంగా విషం చిమ్మిన సంగతి తెలిసిందే. చివరికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై కూడా చంద్రబాబుపై అసత్య ప్రచారం చేశారు. అలాగే ఆ మధ్య లోకేష్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య స‌మ‌స్యల‌తో బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహ‌త్యపై కూడా వైసీపీ నేతలు సోష‌ల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన లోకేష్ అప్పట్లో  క్రిమినల్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ కేసులు విచారణకి వచ్చాయి.  ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీ హిల్స్ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా విష‌ప్రచారం చేశారు. ఆ వివాదం, ఆ సర్వే నంబర్లూ ఫేక్ అని తేలింది. అయినా గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు. హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య కు పాల్పడ్డారని ఫేక్ ప్రచారం చేశారు.  త‌ప్పుడు రాత‌లపై గుర్రంపాటికి లోకేష్ త‌న లాయ‌ర్ దొద్దాల కోటేశ్వర‌రావు ద్వారా నోటీసులు పంపారు. గుర్రంపాటి కార్యాల‌యాల‌కు నోటీసులు పంపితే తీసుకోలేదు. చివ‌రికి గుర్రంపాటికి వాట్స‌ప్ ద్వారా నోటీసులు పంపారు.  మరో వైసీపీ నేత, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సెప్టెంబ‌రు 2022లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. నారా చంద్రబాబుని సారా చంద్రబాబు నాయుడు అని పిలవాలని కోరారు. హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని.. బీ-3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని, వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని   ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాదు భువనేశ్వరి, బ్రాహ్మణిలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌పైనా మందూ మగువ అంటూ వ్యాఖ్యలు చేశారు.  సునీత చేసిన దారుణ‌మైన   వ్యాఖ్యలపై లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖ‌లు చేశారు. త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా అస‌త్య ఆరోప‌ణ‌ల‌ని ప్రచారం చేస్తున్న వారిపై న్యాయ‌పోరాటం మొద‌లుపెట్టారు. ఇప్పుడు ఈ కేసులలో లోకేశ్ వాంగ్మూలాన్ని మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ కోర్టు రికార్డు చేయనుంది.

స్పీడ్ న్యూస్ -2

21.సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియో పోస్ట్ చేసిన ప్రముఖ సినీ స్టంట్ మాస్టర్, నటుడు కనల్ కన్నన్‌ను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు నాగర్‌కోయిల్‌లో అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ డీఎంకే నేత ఫిర్యాదు చేయడంతో కన్నన్‌ను అరెస్ట్ చేశారు. 22.భీమవరంలో పవన్ కల్యాణ్ ఓడిపోయే అవకాశమే లేదని, అక్కడ ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసుకోవాలని జనసేనానికి  ఎపి ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి హితవు పలికారు. పవన్ ఓటమికి వైసీపీ కారణం కాదని తేల్చిచెప్పారు.  23. రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం దక్కక పోవడం గమనార్హం.  24.  మూడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై  ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక అని ఆయన అభివర్ణించారు. 25. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఈనెల 17, 18వ తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు సమాచారం. 26.   ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. త్వరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలోసభలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి కేంద్ర మంత్రి వర్గం చర్చిస్తోంది. 27.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో వరుసగా రెండోసారి ఓడిపోయిన భారత్.. నెల విరామం తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్ బరిలోకి దిగుతోంది.  భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది.   28.ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్ల అంశంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ వాలంటీర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా పని చేయాలని అన్నారు.  29. దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన శ్రద్దా వాకర్ హత్య ఘటన తరహాలో మరో యువతి హత్య జరిగింది. 30.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త ఇంటికి మారబోతున్నట్టు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ బీ2 ప్రాంతంలోని త్రీ బెడ్రూమ్‌ ఫ్లాట్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. 31.బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి రాహుల్ కుమార్ ఇటీవల ప్రయాణం రద్దు చేసుకుని ఎయిర్ టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. రూ.13,820 పెట్టి కొన్న టికెట్ ను క్యాన్సిల్ చేస్తే సదరు ఎయిర్ లైన్స్ కంపెనీ తిరిగిచ్చింది. కేవలం 20 రూపాయలు మాత్రమే చార్జి వసూలు చేసింది. 32. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం కుదరదని స్పష్టం చేశారు. 33.ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వచ్చే నెల లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 34. గత రెండు ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాలు, ఆంధ్రతో సరిహద్దు పంచుకుంటున్న ఖమ్మంలో ఎక్కువగా ఉన్న ఆంధ్ర సెటిలర్లతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారిని తమవైపునకు తిప్పుకునేందుకు టీకాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం.గులాబీ పార్టీ నేతల వైఖరిపై ఆంధ్ర సెటిలర్స్‌లో ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 35. బీజేపీ, కాంగ్రెస్ లను విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదం మూడు పంటలని, కాంగ్రెస్ పార్టీ విధానం మూడు గంటలని, బీజేపీ విధానం మతం పేరిట మంటలని విమర్శించారు.  36.ప్రఖ్యాత మైత్రి  బ్యానర్ ఇప్పుడు ఇతర భాషా చిత్రాల నిర్మాణం దిశగా కూడా అడుగులు వేయడం మొదలెట్టింది. ఆల్రెడీ బాలీవుడ్ లో ఒక ప్రాజెక్టును లైన్లో పెట్టేసింది. అలాగే మల్లూవుడ్ లోను ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించింది. 37.సంచలనం సృష్టించిన జగన్ పై దాడి కేసు విచారణ కొనసాగుతోంది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో నిన్న ఈ కేసు విచారణ జరిగింది.  38.అనిల్ అంబానీకి చెందిన బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ను గౌతమ్ అదానీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది.  అనిల్ అంబానీకి చెందిన పవర్ ప్లాంట్ ను కొనుగోలు చేయడం ద్వారా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులో తన పరిధిని విస్తరించాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.  39.వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అతి పెద్ద సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది.  40.జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల చిచ్చు ఇప్పట్లో చల్లారేట్టు కనిపించడంలేదు. వాలంటీర్లలో 75 శాతం మహిళలే ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర" అని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. 41.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వినూత్న నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని ఓ వాలంటీర్ కాళ్లు కడిగారు. 42.ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో అనేక జిల్లాల్లో గణనీయంగా వర్షపాతం నమోదైంది.  43. ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో వివాదానికి తెరపడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  తెలిపారు. తాను స్వయంగా కడియం కులం గురించి ప్రస్తావించలేదని, గతంలో ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఉటంకించినట్లు చెప్పారు. 44.ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. తమిళనాడులో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక, విహార యాత్రకు వెళ్లారు. 45.ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 20 చీతాల్లో మరో చీతా మృతి చెందింది. నాలుగు నెలల వ్యవధిలో ఇది 7వ చీతా మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌లో జరిగింది.  46.తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. సీఎంగా ఎవరికైనా అవకాశం లభించవచ్చని, ఇప్పుడు చెప్పలేమని తెలిపారు.  47.  వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఇప్పుడు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా టాటా స్ట్రైడర్  కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.  48.యూనిఫామ్ సివిల్ కోడ్‌పై అభిప్రాయాలు తెలపాలని 22 వ లా కమిషన్ జూన్ 14 వ తేదీన ప్రకటన విడుదల చేసింది. జులై 10 వ తేదీ సాయంత్రం వరకు 46 లక్షల అభ్యర్థనలు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  49.ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి అమలు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.  50.మనీల్యాండరింగ్ కేసులో  నిందితులుగా ఉన్న పాకిస్థాన్ ప్రధాని  షెహబాజ్ షరీష్ ( కుమారుడు సులేమాన్ షేబాజ్‌ సహా పలువుర్ని ప్రత్యేక జిల్లా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రూ.1,600 కోట్ల పీకేఆర్ మనీ ల్యాండరింగ్ కేసులో తమ పేర్లను తొలగించాలని కోరుతూ ప్రధాని కుమారుడు సులేమాన్ షేబాజ్, ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. 

పొత్తులుంటాయి కేంద్ర మంత్రి.. చులకన కాదల్చుకోలేదు.. బాబు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ, బీజేపీలు అడుగులు వేస్తున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వచ్చే ఎన్నికలలో  రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందన్న అంచనాల నడుమ మరో సారి అధికారాన్ని దక్కించుకోవడానికి వైసీసీ ఆడుతున్న మైండ్ గేమ్ కు బీజేపీ తోడైందంటున్నారు. అటువంటి మైండ్ గేమ్ లో భాగంగానే తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నారాయణ స్వామి తెలుగుదేశం, జనసేనలతో బేజీపీ పొత్తు ఉంటుందన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు స్పందించబోనని ,అలా స్పందించి చులకన కాబోననీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు.  కేంద్రంలోని మోడీ సర్కార్ తో  వైసీపీ అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపడం, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ నేతలు, రాష్ట్రపర్యటనకు వచ్చిన ఆ పార్టీ అగ్రనేతలు జగన్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించడం ప్రజలలో  కన్ఫ్యూజన్ క్రియోట్ చేయడమనే వ్యూహంలో భాగమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో సారి అధికారంలోకి రావాలంటే మిత్రులను చేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పేరుకే కేంద్రంలో ఉన్నది  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అయినా.. ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలేవీ సొంతంగా ఒకింత బలం ఉన్న పార్టీలు కావు. లోక్ సభలో వాటి ప్రాతినిథ్యం సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో  బీజేపీ జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను అధిగమించి బలం చాటాలంటే ఎన్డీయేను పటిష్టం చేసుకోక తప్పని పరిస్థితి. మరో వైపు ఇటీవలి కాలం వరకూ బలహీనంగా కనిపించిన కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒక్కసారిగా బలోపేతం అయ్యాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకతే ఇందుకు కారణమని వేరేగా చెప్పాల్సిన  అవసరం లేదు.  ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ పాత మిత్రులను దరి చేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో ఈ నెల 18న సమావేశం కూడా ఏర్పాటు చేసింది. కేంద్రంలో మోడీ సర్కార్ పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఉన్న బలం సరిపోదన్న ఉద్దేశంతో పాత మిత్రులను కూడా కలుపుకోవడానికి చేసే ప్రయత్నంలోనే బీజేపీ తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఒకే సమయంలో అధికార, విపక్షాలతో సంబంధాలను నెరపుతూ.. అవసరాన్ని బట్టి.. అంటే వచ్చే ఎన్నికలలో   వైసీపీ, తెలుగుదేశంల పెర్ఫార్మెన్స్ ను బట్టి, తన అవసరాలను బట్టి జట్టు కట్టాలన్న వ్యూహంతో కమలనాథులు పావులు కదుపుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు ఏపీలో ఒకలా, హస్తినలో ఒకలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. కేంద్రం స్థాయిలో జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తూనే.. రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి వైసీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కర్రవిరగకుండా, పాము చావకుండా అన్న టెక్నిక్ ను ఉపయోగిస్తోందంటున్నారు. మొత్తం మీద కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలపై చంద్రబాబు నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా స్పందించడమే కాకుండా   దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.   ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి జగన్ దుర్మార్గపాలనను అంతమొందించడమే తన ధ్యేయమని చెప్పారు. ఇదొక పెద్ద బాధ్యత అందుకే పెద్ద ఆలోచనలూ చేయాలి.  పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ.  జగన్.. ఆ స్థాయి పోరాటానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదన్న చంద్రబాబు,    ఓట్ల అవకతవకలపై ఢిల్లీని వదిలిపెట్టేది లేదన్నారు. ఓట్ల తీసివేత, దొంగ ఓట్ల నమోదులను సరిదిద్దకపోతే కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత కోల్పోతుందన్నారు. ఇక తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం ఆయన ఖండించారు.  వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందనీ, వలంటీర్ల ఉద్యోగాలకు ఢోకా లేదనీ భరోసా ఇస్తూనే వాలంటీర్ల సేవలను పౌర సేవలకు మాత్రమే ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. మొత్తంగా ఆయన కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలపై స్పందించి చులకన కాదలచుకోలేదంటూనే ప్రజలలో కన్ఫ్యూజ్ క్రియోట్ చేయడానికి జగన్ సర్కార్ ఆడుతున్న మైండ్ గేమ్ ను ఎండగట్టారు. ప్రజా వ్యతిరేక జగన్ సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యంగా రాజీలేకుండా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. 

తెలంగాణ బీజేపీ మూడు ముక్కలు!

తెలంగాణ బీజేపీలో ఇప్పుడు  అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయి.   బీజేపీ తన సిద్ధాంతాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం పేరుతో వలస నేతలను ప్రోత్సహించడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు బీజేపీలో నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఈ అసమ్మతిని తొలగించి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు  అధిష్టానం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆ అసమ్మతి రాగం ఒక పట్టాన కొలిక్కి రావడం లేదు. పైగా అది పెరిగి పార్టీని ముక్కలు చేస్తున్నది. అంతర్గత కుమ్ములాటను తగ్గించేందుకు తెలంగాణ బీజేపీలో   ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున మార్పులను చేసింది. ముఖ్యంగా నాయకత్వ మార్పుతో అయినా పార్టీ గాడిన పడుతుందని అధిష్టానం భావించింది.  అయితే అందుకు భిన్నంగా అంతకు ముందు పార్టీలో రెండు వర్గాలు  ఉంటే ఇప్పుడు ప్రక్షాళన తరువాత మూడవ వర్గం ఏర్పడి పార్టీ లో మూడు ముక్కలాట పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. నిజానికి బండిని తప్పించాలనే డిమాండ్ మరో సీనియర్ నేత ఈటల రాజేందర్, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావుది. వీళ్ళు బాహాటంగానే బండి నాయకత్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే, బండిని తప్పించాలని కోరిన వారికి కాకుండా కిషన్ రెడ్డికి పార్టీ అప్పగించింది అధిష్టానం. రెండు వర్గాలను కలుపుకుపోతాడనే కిషన్ కు ఈ పని అప్పజెప్పింది. కానీ, ఆ రెండు వర్గాలు కలిసిపోవడం సంగతెలా ఉన్నా ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కిషన్ కు మరో వర్గం ఏర్పడింది. ఫలితంగా ఇప్పుడు ఒకే రాష్ట్ర శాఖలో మూడు వర్గాలు ఏర్పడి ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.   దీంతో ఇలాంటి ప‌రిస్థితుల్లో కిష‌న్‌రెడ్డిని ఎంపిక చేయ‌డం బీజేపీకి ఏమాత్రం క‌లిసొచ్చే విష‌యం కాదంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఈ మూడు వర్గాలలో ప్రధానంగా ఈటల వర్గం తనకు అధ్యక్ష పదవి దక్కలేదనే ఆవేశంలో ఉండగా.. బండి వర్గం తమ నేతలు తప్పించడంపై అసమ్మతి వెళ్లగక్కుతుంది. కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి వెనక సీఎం అభ్యర్థిగా హామీ ఉందనే ప్రచారంతో ఈటల, బండి   వర్గాలు గుర్రుగా ఉన్నాయి. మరోవైపు ఈటలకు చేరికల కమిటీ బాధ్యతలు ఇవ్వడంపై కూడా ముందు నుండీ పార్టీలో ఉన్న సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎవరికి వారు మూడు వర్గాలు తన నాయకుడే సీఎం అభ్యర్థిగా  ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా తెలంగాణ బీజేపీలో  మూడు ముక్కలాటతో ఆ పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది.  అధిష్ఠానం తీసుకున్న నాయకత్వ మార్పు నిర్ణ‌యం వ‌ల్ల క్యాడ‌ర్‌లో ఇంకా గందరగోళం పెరిగింది. వ‌ర్గ‌పోరు చ‌ల్లార‌క‌పోగా మ‌రింత ఎక్కువైంది. దీంతో ఇప్పుడు స‌గ‌టు బీజేపీ కార్య‌క‌ర్త‌ల్లో బీజేపీని న‌మ్ముకోవ‌డం క‌రెక్టు కాదేమో అన్న సందిగ్ధ‌త‌కు బీజం పడినట్లు రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నిజానికి మొన్నటి వరకూ కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదే వర్గ పోరు బీజేపీకి తగులుకుంది. ఇదే పరిస్థితి ఎన్నికల వరకూ కొనసాగితే తెలంగాణలో బీజేపీ మళ్ళీ జీరో స్థాయికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ ప్రయత్నాలు ఈ నేతల అసంతృప్తిని మాఫీ చేస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.

స్పీడ్ న్యూస్ 1

1.దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 80 మంది ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే మరణించారు. 2.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే సీతక్క కూడా సీఎం అయ్యే అవకాశం ఉందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. రేవంత్ మాటలపై సీనియర్లు కన్నెర్ర చేస్తున్నారు.  3.ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో మూడు గంటలపాటు సమావేశమయ్యారు.  4. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రమంగళవారం సాయంత్రం కావలి నియోజకవర్గంలో పూర్తయి ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతులకు  గిట్టుబాటు ధర కల్పిస్తామని  ఈ సందర్బంగా నారా లోకేశ్      హామీ ఇచ్చారు.  5. 2016-17 నుండి 2021-22 మధ్య ఆరేళ్ల కాలంలో ఇతర అన్ని జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలతో పోలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మూడు రెట్లు ఎక్కువగా వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలలో సగానికి పైగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానే వస్తున్నాయి. 6. రాష్ట్రంలో వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  7.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన 50వ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలు వంటి బెట్టింగులపై 28 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు.  8. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అన్నారు. 9.ఉమ్మడి పౌర స్మృతి  బిల్లు ఒకసారి పార్లమెంటులో పాస్ అయ్యాక, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందిగా అనిపిస్తే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవచ్చునని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. కె సి ఆర్ దేశం విడిచివెళతానంటే ఎవరూ ఆపరని అన్నారు. 10.జనసేనాని పవన్ కల్యాణ్ బుధవారం ఏలూరుజిల్లా ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నేతలు, వీరమహిళలతో సమావేశమయ్యారు.  వాలంటీర్ వ్యవస్థపై త్వరలో కోర్టుకు వెళతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 11.రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే ఏ రాజకీయ పార్టీకైనా వచ్చిన సమస్య ఏమిటని ఆమె ప్రశ్నించారు. 12.ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్న, ఇప్పటికే చేసిన పరిశ్రమలలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రైవేటు పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు జగన్ సూచించారు. 13.ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనే ఐటీ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్ లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హతమార్చాడు.  14. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు అనుమతులను ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులను కూడా మంత్రివర్గం సిఫారసు చేయనుంది.  15.తనకు పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టడమే గాక విగ్గుతో బట్టతలను దాచిపెట్టి పెళ్లికి సిద్ధమైన వ్యక్తిని పట్టుకుని వధువు బంధువులు మండపంలోనే చితకబాదారు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రం గయ జిల్లాలో జరిగింది. 16.తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. 17.బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్  సలహాతో తాను ఇద్దరు పిల్లలకు తల్లినయ్యానని మరో బాలీవుడ్ నటి కశ్మీరా షాతెలిపింది. సరోగసీ ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నించమని సల్మాన్ చెప్పారని... ఆయన సలహాతో పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత తమ జంట  తల్లిదండ్రులమయ్యామని   చెప్పింది. 18.  మహానాడులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.  వీటిలో పూర్ టు రిచ్ విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది.  పూర్ టు రిచ్ విధానాన్ని అర్థం చేసుకోవడం కొంత కష్టమైనా... ఆచరణలో ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చంద్రబాబు అన్నారు. 19. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని నిన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలలో నూతన భవనాలు, పలు విభాగాలను ఆమె ప్రారంభోత్సవ  సభలో కాసేపు మాట్లాడి కూర్చుండిపోయారు. 20. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఉండి చదువుకుంటున్న నాలుగో తరగతి గిరిజన విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత దారుణంగా చంపేశారు.జిల్లాలోని బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడెంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.

లక్ష్య సాధన దిశగా లోకేష్ అడుగులు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర మరో మైలు రాయిని చేరుకొంది. ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం (జులై 11)  ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లిలో 2 వేల కిలోమీటర్లు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి నారా లోకేశ్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.   అలా ప్రారంభమైన ఆయన పాదయాత్ర .. కేవలం 153 మూడు రోజల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. 2 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకొన్న సందర్బంగా కొత్తపల్లిలో నారా లోకేశ్  పైలాన్‌ను ఆవిష్కరించారు. మరోవైపు లోకేశ్ పాదయాత్ర.. అప్రతిహతంగా సాగుతోండడం పట్ల.. టీడీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  లోకేశ్ చేపట్టిన పాదయాత్ర రాయలసీమలో ప్రారంభమై.. 53 నియోజకవర్గాల్లోని 135 మండలాల మీదగా వందలాది గ్రామాల్లో నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. అయితే ఈ పాదయాత్రలో నారా లోకేశ్ .. 30 లక్షల మందిని నేరుగా కలవగా.. వివిధ వర్గాల ప్రజల నుంచి వేలాది వినతి పత్రాలను ఆయన స్వీకరించారు.    ఇంకోవైపు ప్రతీ 100 కిలోమీటర్లకు ఆయన ఓ హామీ ఇస్తున్నారు. అందులో భాగంగా శిలాఫలకాలను  ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్బంగా కొత్తపల్లిలో పిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇస్తున్న హామీలన్నీ తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేస్తామని ప్రజల్లో నారా లోకేశ్ భరోసా కల్పిస్తున్నారు.    ఇక నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. అప్రతిహతంగా కొనసాగుతోంది. పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి దాదాపు ఎక్కడా విరామం లేకుండా సాగుతోంది. అయితే అత్యవసరం అయితే తప్ప.. అంటే.. నందమూరి తారకరత్న మరణించిన సమయంలో.. ఆయన బౌతిక కాయానికి నివాళులర్పించేందుకు ఒక సారి.. అలాగే ఇటీవల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తరాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు జరిగిన పసుపు పార్టీ పండగ మహానాడు సందర్బంగా మాత్రమే.. నారా లోకేశ్ తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన విషయం విదితమే.    అధికార జగన్ పార్టీ, పోలీసులు కలిసి ఆంక్షలు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా.. నారా లోకేశ్ మాత్రం తనదైన శైలీలో.. తాను అనుకున్న లక్ష్యం దిశగా వడి వడిగా అడుగులు వేసుకొంటూ ముందుకు వెళ్తున్నారు. లోకేశ్ చేపట్టిన ఈ పాదయాత్రను నాలుగు వందల రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది. అంటే నారా లోకేశ్ సగం లక్ష్యాన్ని పూర్తి చేసుకొని.. ఆయన అడుగులు లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ నారా లోకేశ్.