కేసీఆర్ రెచ్చగొట్టినందునే సభ జరుగుతోందా?

  తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర విభజన చేస్తూ నిర్ణయం ప్రకటించిన తరువాత, హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్లాడి, వారిలో లేని భయాందోళనలను కలిగించడం వలననే, నేడు ఏపీయన్జీవోలు హైదరాబాదులో సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.   మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ అసలు కేసీఆర్ కి 2014ఎన్నికల వరకు తెలంగాణా ఏర్పాటు ఇష్టం లేనందునే ఆవిధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి తెలంగాణా ప్రక్రియ జాప్యం జరిగేందుకు పరోక్షంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ డిల్లీలో కూర్చొని ఏమి చేస్తున్నాడని ఆయన ప్రశించారు. తెలంగాణా ఏర్పాటయితే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నాడని ప్రశ్నించారు.   వారిరువురూ ఎపీయన్జీవోలను కూడా అంతే తీవ్రంగా విమర్శించారు. హైదరాబాదులో సభను నిర్వహిస్తూ వారు ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణా ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.   తెదేపా నేతలిరువురు చెప్పిన మాటలలో వాస్తవం ఉంది. నిజానికి కేసీఆర్ “ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవలసిందే. వారికి వేరే ఆప్షన్ ఉండవు” అని చెప్పిన తరువాత నుండే వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. నాటి నుండే ఆంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభాజను వ్యతిరేఖిస్తూ నిరసన దీక్షలు మొదలుపెట్టారు. అది తెలంగాణా ఉద్యోగులకు కోపం కలిగించడం సహజమే గనుక వారు కూడా ఆంధ్ర ఉద్యోగులతో పోటాపోటీగా దీక్షలు మొదలుపెట్టారు. తత్ఫలితంగా నేడు రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఘర్షణలు నిత్యకృత్యం అయిపోయాయి. నిన్న హైకోర్టులో న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణలు వాటికి పరాకాష్టగా నిలిచాయి. ఈ భయాందోళనలే నేడు వారిచే సభ నిర్వహింపజేస్తున్నాయి. తెదేపా నేతలు అదే మాట చెప్పారిప్పుడు.   నిజానికి కేసీఆర్ చెప్పినా చెప్పకపోయినా, రాష్ట్ర విభజన తరువాత చట్ట ప్రకారం జరుగవలసిన తంతు అంతా జరిగినప్పుడు, ఉద్యోగులలో బదిలీల మీద ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపోవలసి వస్తే వెళ్ళిపోయి ఉండేవారు. ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నవారికి బదిలీలపై ఊర్లు మారడం తప్పదని వారికి తెలియకపోదు. కానీ కేసీఆర్ అన్నమాటలతో వారి భవిష్యత్ పట్ల అకస్మాత్తుగా అంతవరకు లేని భయాందోళనలు మొదలయ్యాయి. దానికి తోడూ తెరాసలో అతని కుటుంబ సభ్యులు కూడా వారిలో ఆ భయాందోళనలు మరింత పెరిగే విధంగా మాట్లాడేరు.   తెరాస నేతలు ఆంద్ర-తెలంగాణా ఉద్యోగుల మద్య జరుగుతున్న గొడవలలో తలదూర్చుతూ వారి మధ్య విద్వేషాలకు మరింత ఆజ్యం పోస్తున్నారు. సీమంధ్ర నేతలు కూడా అదేపని చేస్తున్నారంటే వారు తెలంగాణాను వ్యతిరేఖిస్తునందునే ఆపని చేస్తున్నట్లు అర్ధంఅవుతుంది. కానీ తెలంగాణా రాష్ట్రం కోసం పోరాడుతున్న తెరాస కూడా అదే పనిచేయడం చూస్తే నిజంగానే వారికి తెలంగాణా ఏర్పాటు ఇష్టం లేదని భావించాలేమో! దీనిని బట్టి తెరాస నేతలెవరికీ కూడా ఎన్నికల వరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పడటం ఇష్టం లేదని తెదేపా నేతలు చేస్తున్నఆరోపణలు నిజమేననిపిస్తోంది.

తెదేపా కూడా తెలంగాణాను వదులుకొబోతోందా

  కాంగ్రెస్ ప్రయోగించిన విభజనాస్త్రానికి మొదట వైకాపా తెలంగాణా వదిలిపెట్టి పారిపోగా, ఇప్పుడు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలో మాట్లాడుతున్న తీరు చూస్తే, త్వరలో తెదేపా కూడా తెలంగాణా నుండి మూట ముల్లె సర్ధుకొనే పరిస్థితి కనబడుతోంది. సీమంద్రాలో పార్టీని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ కాదనకపోయిన్నపటికీ, ఆయన బొత్తిగా తెలంగాణా సంగతి మరిచిపోయినట్లుగా సీమంధ్ర తరపున వఖల్తా పుచ్చుకొని మాట్లాడటం చూస్తుంటే తెదేపా కూడా తెలంగాణాను వదిలిపెట్టేయబోతోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.   రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన కొత్తలో ఆయన సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కేంద్రం నాలుగయిదు లక్షల కోట్లు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అంటే ఆయన రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నట్లేనని వైకాపా ప్రచారం మొదలుపెట్టడంతో ఇప్పుడు ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. ఆయన ఆత్మగౌరవ యాత్రలో మాట్లాడుతున్నమాటలు సమైక్యవాదాన్ని సమర్దిస్తూ ఉండటంతో, ఇప్పుడు కాంగ్రెస్, తెరాసలు కూడా తెలంగాణపై ఆయన వైఖరిని స్పష్టం చేయమని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఇక పార్టీలోని తెలంగాణా నేతలయితే ఒకవేళ చంద్రబాబు కూడా సమైక్యాంధ్ర అంటే అప్పుడు తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలో చేస్తున్న ప్రసంగాలను వారు నిశితంగా గమనిస్తున్నారు. ఒకవేళ ఆయన ఇదే ధోరణి కొనసాగిస్తే పొమ్మనకుండా పొగపెట్టినట్లుగా తెలంగాణా నేతలందరూ ఒకరొకరుగా పార్టీని వీడే అవకాశముంది. అందువల్ల ముందుగా చంద్రబాబు ఇంటిని చక్కబెట్టుకొని ఆ తరువాత రాష్ట్రాన్ని, దేశాన్ని చక్కబెట్టే ఆలోచన చేస్తే మేలేమో! లేకుంటే ఆయన యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేసరికి తెలంగాణా నేతలెవరూ పార్టీలో కనబడరు.

అగాధంలో రూపాయి

  నేడు భారత దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీనికి కారణాలు అనేకం. అన్నీ ప్రభుత్వ విధానాలతో కూడుకున్న కారణాలు. నేటి యు.పి.ఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే ప్రధాన కారణం. నేటి ప్రభుత్వానికి ఓట్ల మీదున్న శ్రద్ధ ప్రజా సంక్షేమం మీద లేదు. అందుకు ఉదాహరణగానే రోజుకొకటి పుట్టుకొస్తున్న ప్రజాకర్షక పధకాలు. నేటి రూపాయి పతనం డాలరుతో పోలిస్తే 68 రూపాయిలు దాటుతోంది. దీనితో భారత ఆర్ధిక పరిస్థితి 1990-91 నాటి పరిస్థితికి దిగజారిందా అన్నంత ఆందోళన కలిగిస్తుంది.   నేటి దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దటానికి అప్పటి ప్రధాని,ఆర్ధిక మంత్రి విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ఎన్నో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. వాటిలో భాగంగా పారిశ్రామిక సరళీకరణ,సబ్సిడీలను తగ్గించటం,ఎన్నో పొదుపు చర్యలను చేపట్టటం లాంటి విధానాలను అనుసరించి దేశం ఆర్ధిక ప్రగతి వైపు పయనిస్తుందనే నమ్మకం పెట్టుబడిదారులలో కలిగించి,దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దటం జరిగింది. కాని అప్పటి ఆర్ధిక మంత్రిగా పనిచేసిన నేటి ప్రధాని హయాంలో,మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సరళీకృత ఆర్ధిక విధానాలను కొనసాగిస్తున్నప్పటికి అప్పటి భిన్నమైన పరిస్థితులను కలుగచేసి పెట్టుబదిదారులలో అపనమ్మకాన్ని కలిగించటంమే నేటి ఈ రూపాయి పతనానికి కారణమయ్యింది.   పెట్టుబడిదారీ వ్యవస్థలు వ్యతిరేకించే సబ్సిడీలని పెంచుతూ,సంక్షేమ పధకాలను మరింత పెంచుతూ పెట్టుబడులను వెనుకకు వెళ్ళే పరిస్థితిని సృష్టించారు. గ్యాస్ మీద సబ్సిడీ ఇంతకు ముందు నుండి ఇస్తున్నప్పటికీ దానిని నగదు బదిలీ పధకం కింద మార్చి అదొక కొత్త సంక్షేమ పదకంగా చూపించటం ఒక కారణం కాగా లక్ష కోట్లు దాటిన ఆహారభద్రత అనే మరొక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టటం ద్వారా ఈ యు.పి.ఎ ప్రభుత్వం సంక్షేమ రాజ్యంగా రాజ్యంగా మారుస్తున్నామనే సంకేతం పంపటం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరిగి రూపాయి మరింత పతనం దిశగా పయనిచింది. ఇక పొదుపు చర్యలనేవి ఎక్కడా కానరావటం లేదు. ఓట్లు మరియు సీట్లు తప్ప దేశ ఆర్ధిక ప్రగతితో మాకు సంబంధం లేదు అనేటట్లు నేటి ప్రభుత్వం ప్రవర్తించటం పేద,ధనిక లేదా మధ్య తరగతి అనే భేదం లేకుండా ప్రజలంతా మూల్యం చేలిచుకోవలసి వస్తోంది.   నేడు సామాన్య ప్రజలతో పాటు MLA,MP లు మరియు కేంద్ర,రాష్ట్ర మంత్రులకు కూడా ఈ రూపాయి పతనం వలన కలిగే నష్టాలను గుర్తిస్తున్నట్లు లేరు. ఎగుమతులు,దిగుమతుల వ్యత్యాసం కూడా బాగా పెరిగిపోవటం కూడా నేటి ఈ దుస్థితికి కారణం. ఈ ఎగుమతులు దిగుమతులు డాలరు కరెన్సీలో జరుగుతున్నపుడు దిగుమతుల విలువ ఎంత ఉంటుందో ఎగుమతుల విలువ కూడా అంతే ఉండాలి. కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండటంతో డాలరుకు డిమాండ్ పెరిగి రూపాయి పతనం అవుతుంది. ఎగుమతులను పెంచటానికి దిగుమతులను తగ్గించటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామ మాత్రంగా ఉన్నాయి.   ఈ రూపాయి పతనం వలన ప్రజల పై ఉండే ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. 1. 70%పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం వలన పెట్రోల్,డీసెల్ ధరలు విపరీతంగా పెరిగి,దీని ద్వారా రవాణా చార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి సామాన్యులకు బ్రతుకు భారంగా మారుతుంది. 2. దిగుమతి చేసుకుంటున్న బొగ్గు , డీసెల్ లాంటివి విద్యుత్త్ ఉత్పత్తికి ఉపయోగించటం వలన విద్యుత్త్ చార్జీలు విపరీతంగా పెరిగి ప్రజల పై మరింత భారం పడుతుంది. 3. రైలు,బస్సు,ఆటో లాంటి చార్జీలు కూడా పెరిగి ప్రజల పై ప్రయాణ చార్జీల భారం కూడా పడుతుంది. 4. నేటి నిత్యావసర వస్తువులలో చాలావాటిని దిగుమతి చేసుకోవటం వలన దాదాపుగా అన్నిటి ధరలు అంటే సబ్బులు,సర్ఫ్ లు,సెంట్లు,పేస్ట్ లు,సెల్ ఫోన్లు,పళ్ళు,కూరగాయలు ,ఉల్లి ,వెల్లుల్లి,కళ్ళజోళ్ళు,కాలిజోళ్ళు,తలకు రాసుకునే నూనెలు,పౌడర్లు,ఒక్కటేమిటి అన్నిటిని దిగుమతి చేసుకోవటానికి మనం అలవాటుపడ్డాము,తదనుగుణంగానే వాటన్నిటి ధరలు పెరిగి,భారం కానున్నాయి. 5. నేడు టి.వి,సెల్ ఫోన్ కార్ లాంటివి ప్రజలకు విలాసంగా కాక నిత్యావసరంగ మారటం గమనించ దగ్గ విషయం. వీటిలో వాడే విడి భాగాలనో లేదా మొత్తంగానో దిగుమతి చేసుకోవటం వలన వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 6. నేడు ప్రపంచమంత ఒక గ్లోబల్ విలేజ్గా మారుతున్న తరుణంలో చాలామంది విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ డాలరు విలువ పెరగటంతో విదేశీ ప్రయాణం మరింత భారం కానుంది. 7. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి ఆ చదువుల ఫీజులు మోయలేనంత భారం కానున్నాయి. 8. ఈ భారం ఔషధ పరిశ్రమల మీద పడి మందుల ధరలు అధికమవటం కారణంగా వైద్య సేవలు ఇహ ముందు అందుబాటులో లేనివిధంగా ఖరీదు కానున్నాయి. 9. ఎరువులు,విత్తనాలు దిగుమతి చేసుకోవటం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులైన ఆహార ధాన్యాలు,పొగాకు,పత్తి,మొదలైనవన్నీ ప్రియం కానున్నాయి.   నేడు అధికార పక్షం కాని,ప్రతిపక్షం కాని వోట్ బ్యాంకు రాజకీయాలను వదిలి దేశ ఆర్ధిక ప్రగతి గురించి,దేశ భద్రత గురించి ఆలోచించ వలసిన సమయం ఆసన్న మయింది. అలా కాకుంటే మనదేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుంది. సమర్దవంత మైన పరిపాలన ద్వారా వోట్లు పెంచుకోవాలని చూడాలే కానీ,ప్రజాకర్షక పధకాల ద్వారానో,విభజనల ద్వారానో వోట్లు పెంచుకోవాలని చూడడం నీచ రాజకీయానికి పరాకాష్ట.   - సాయి లక్ష్మి

ఆ జాదూ అందుకే పనిచేయలేదా

  రాష్ట్ర విభజనపై చాలా లోతుగా అధ్యయనం చేసిన మాజీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ ఆజాద్, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖించిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయనను తెలంగాణా వాదులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేఖించేవారు. ఇంకా రాష్ట్ర విభజన జరుగక ముందే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య నెలకొన్నయుద్ధ వాతావరణం, రాజకీయ పార్టీల కప్పగంతులు తదితర అంశాలన్నీఆజాద్ భయాలు నిజమని ఋజువు చేస్తున్నాయి.   రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఎదురయిన అనుభవాలు, ఆజాద్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని, వాటిపై కూలంకుషంగా చర్చించిన తరువాతనే విభజన ప్రకటన చేసామని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలకు జవాబు చెప్పలేకపోతోంది. అంతే గాక మళ్ళీ వెనకడుగు వేయక తప్పడం లేదు.   కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రవిభజన చేయాలని ఆరేడు నెలల క్రితమే నిర్ణయించుకొన్నట్లు వచ్చిన వార్తలు గమనిస్తే, అంత సమయం ఉంచుకొని కూడా క్లిష్టమయిన అంశాలకు ఎటువంటి పరిష్కార మార్గాలు ఆలోచించకుండా చాలా నిర్లక్ష్యంగా ప్రకటన చేసినట్లు అర్ధం అవుతోంది. కనీసం ప్రకటన మరికొంత కాలం జాప్యం చేసి ముందుగా ఈ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదేమో.   అయితే, తెరాస నుండి తానెత్తుకు వచ్చిన తెలంగాణా అంశాన్ని, హైదరాబాద్ పర్యటనకు బయలుదేరిన నరేంద్ర మోడీ ఎక్కడ ఎగురేసుకు పోతాడో అనే భయంతోనో లేక మరో కారణంతోనో కాంగ్రెస్ చాలా హాడావుడిగా రాష్ట్ర విభజన ప్రకటన చేసేసి తన గొయ్యి తానే తవ్వుకొంది.   క్లిష్టమయిన రాష్ట్ర విభజన సమస్యను తలకెత్తుకోవడం ఎందుకనే ఆలోచనతోనే బహుశః గులాం నబీ ఆజాద్ దానిని నాన్చుతూ కాలక్షేపం చేసి ఉండవచ్చును. అయితే ఆయన ధోరణి నచ్చకనో లేక రాష్ట్ర విభజన చేసిన ఘనత దక్కించుకోవాలనే ఆలోచనతోనో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తప్పించి ఆయన స్థానంలో స్థానంలో దిగ్విజయ్ సింగ్ ను నియమించింది. రాహుల్ గాంధీకి చెక్కభజన చేసే దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు చెప్పటిన నెలరోజుల లోగానే, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పావులు కదిపి రాష్ట్ర విభజన ప్రకటన చేసేసారు. గులాం నభీ ఆజాద్ చేయలేని ఘనకార్యం దిగ్విజయ్ సింగ్ చేసినప్పటికీ, అది సమస్యను పరిష్కరించక పోగా కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. మరి దీనిని ఆజాదూ మాయం చేస్తాడో లేక మన సింగ్ బాబే దిగ్విజయంగా పూర్తిచేస్తాడో చూడాలి.

హరికృష్ణకి గాలం వేస్తున్న వైకాపా

  వైకాపా తన బద్ధ శత్రువయిన తెదేపాను, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని చాలా కాలంగా వ్యూహాలు రచిస్తోంది. ఫ్లెక్సీ బ్యానర్స్ వ్యూహంతో హరికృష్ణ, అతని కుమారుడు జూ.యన్టీఆర్-చంద్రబాబు, బాలకృష్ణలకు మధ్య ఆ పార్టీ పెట్టిన చిచ్చుఅందుకు ఒక చక్కటి ఉదాహరణ. సమైక్యనినాదం అందుకొన్న వైకాపా, హరికృష్ణను కూడా మెల్లగా ఆ ముగ్గులోకి లాగి, చంద్రబాబుకి తెలియకుండా చాలా కధ నడిపినట్లు తెలుస్తోంది.   చంద్రబాబు, బాలక్రిష్ణలపై కోపంతో రగిలిపోతున్నహరికృష్ణను ఆయుధంగా చేసుకొని తేదేపాపై గురిపెట్టేందుకు వైకాపా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేవరకు చంద్రబాబుకి కూడా తెలియదు. రాజీనామా చేసిన తరువాత తను కూడా సమైక్యాంధ్ర కోరుతూ బస్సు యాత్ర చేపడతానని హరికృష్ణ ప్రకటించడం కూడా వైకాపా వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. తద్వారా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నహరికృష్ణను పార్టీ నుండి బహిష్కరించినట్లయితే ఆయనని వైకాపా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. అప్పుడు ఆయనతో బాటు ఆయన కుమారుడు జూ.యన్టీఆర్ కూడా వైకాపాకు బోనస్ గా దొరుకుతాడు. అంతే గాక, తెదేపా సమైక్యాంధ్రకు వ్యతిరేఖమనే భావన కూడా ప్రజలలో కలిగిన్చావచ్చును.   ఒకవేళ బహిష్కరించకపోయినట్లయితే, హరికృష్ణ చేస్తున్నసమైక్యవాదంతో తేదేపాకు తెలంగాణాలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. కానీ గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహంతో తనకు, తేదేపాకు మధ్య చిచ్చుపెట్టింది వైకాపాయేనని హరికృష్ణకు తెలిసినప్పటికీ, ఆయన ఆ పార్టీ ఉచ్చులోనే చిక్కుకోబోతున్నట్లు కనబడుతున్నారు.   చంద్రబాబు మీద ద్వేషంతో ఒకవేళ ఆయన వైకాపాలో జేరినట్లయితే ఆయన ఆ పార్టీలో ఎంతో కాలం ఇమడలేరు. ఎందుకంటే, ఆయనవంటి ఆవేశపరుడు జగన్ మోహన్ రెడ్డి వంటి దుందుడుకు స్వభావం గల వ్యక్తితో ఎంతో కాలం సర్దుకుపోలేరు. మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే వైకాపా ఆయనను చంద్రబాబు, తెదేపాలపై ఆయుధంగా వాడుకోవాలని, జూ.యన్టీఆర్ స్టార్ ఇమాజ్ ని వాడుకోవాలనే ఆలోచనతోనే పార్టీలోకి ఆహ్వానించవచ్చుతప్ప ఆయనేదో గొప్పవాడని, గొప్ప ప్రజాకర్షణగల నేతని కాదు.   ఒకవేళ హరికృష్ణ వైకాపాలో జేరినట్లయితే, ఆయన తన జీవిత కాలంలో జూ.యన్టీఆర్ ను ఉన్నత పదవిలో చూసే అవకాశం లేదు. ఎందుకంటే వైకాపాలో ఆ అవకాశం కేవలం జగన్ మోహన్ రెడ్డికే రిజర్వ్ చేయబడి ఉంది. ఈ విషయం గ్రహిస్తే హరికృష్ణ తెదేపా వీడే సాహసం ఎన్నడూ చేయరు.

రాజ్యస‌భ‌లో ఉల్లి లొల్లి

  మ‌న రాష్ట్రంలో ప్రజ‌ల‌ను భ‌య‌పెడుతున్న నిత్యవ‌స‌ర వ‌స్తువుల మంట రాజ్యస‌భ‌ను తాకింది. సోమ‌వారం స‌భ ప్రారంభం కాగానే మ‌న రాష్ట్రంలో మండిపోతున్న ఉల్లిధ‌ర పై స‌భ‌లో గంద‌ళ‌గోలం నెల‌కొంది. దాంతో స‌భ రెండు సార్లు వాయిదా ప‌డింది. స‌భ తిరిగి ప్రారంభం కాగానే మాజీ రాజ్య సభ్యులు దిలీప్ సింగ్ జుదేవ్, ఎస్ ఎం లాల్ జాన్ బాషాల మృతి, ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో మ‌ర‌ణించిన నౌకా సిబ్బంది మృతి పట్ల చైర్మన్ హమీద్ అన్సారీ సంతాపం తెలిపారు. త‌రువాత మ‌రోసారి రాజ్యస‌భ‌లో నిర‌స‌లు మొద‌ల‌య్యాయి. వామపక్షాల సభ్యులు లేచి, ఉల్లిపాయల ధరలు మండి పోతున్నాయ‌ని ప్రభుత్వం చొర‌వ తీసుకొని ధ‌ర‌ల‌ను నియంత్రించాల‌ని కోరారు. స‌భాప‌తి ఎన్నిసార్లు వారించిన స‌భ్యులు విన‌క‌పోవ‌టంతో స‌భ‌ను మ‌రోసారి వాయిదా వేశారు. ఆ త‌రువాత కూడా స‌భ‌లో పరిస్థితి ఏ మాత్రం మార‌క‌పోవ‌టంతో మ‌రోసారి వాయిదా వేశారు.

పటేల్ సమైక్యతా సందేశాన్ని గాలికి వదిలేసిన మోడీ!

     - డా. ఎబికె ప్రసాద్   [సీనియర్ సంపాదకులు]   పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన మేకగా మారిపోతుందా? కాదు కనుకనే, దానికి 'మేకవన్నె పులి' అని పేరు పెట్టాల్సివచ్చింది! మేడిపండు చూపులకు మేలిమిగా కనిపిస్తే చాలా? దాని పొట్ట విప్పితే చాలు, అన్నీ పురుగులేనని ప్రజలకు తెలుగు! అలాగే 2000 మంది మైనారిటీల ఊచకోతకు బాధ్యుడై కూడా న్యాయవ్యవస్థనూ, అసమర్థపు కాంగ్రెస్ పాలనావ్యవస్థనూ కొండేళ్ళుగా మభ్యపెడుతూ కేసులనుంచి తప్పించుకుని తిరుగుతూ వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన 'కంట్లో దూలాల్ని' చూసుకోకుండా ఎదుటివారి కళ్ళల్లో నలుసుల్ని వెతకచూడ్డంలో ఆరితేరిన వాడు! అశేష త్యాగాల ద్వారా భారత ప్రజాబాహుళ్యం అరవై అయిదేళ్ళనాడు సాధించుకున్న స్వాతంత్యాన్నీ, సెక్యులర్ (మతాతీత, లౌకిక)వ్యవస్థా స్థాపనను ప్రజలకు గ్యారంటీ చేసి ప్రజలకు హామీ పడిన రాజ్యాంగాన్నీ ఈ ఆరుదశాబ్దాలలో అటు కాంగ్రెస్ పాలకులూ, ఇటు రాజేకీయ ముసుగులో పాలనా శక్తిగా 'హిందుత్వ'పేరిట అవతరించిన భారతీయ జనతా పార్టీ నేడు 'మోడీత్వ'రంగులో క్రమంగా నాయకులు బయటపడ్డారు! కాంగ్రెస్ పాలకుల తప్పుడు రాజకీయాలను చాటు చేసుకుని దేశ ప్రజలను, రాష్ట్రాలను సామ్రాజ్య వలస పాలకుల మాదిరిగానే విభజించి-పాలించే దుర్నీతికి బి.జె.పి. మతరాజకీయవాదులు కూడా గజ్జెకట్టారు. ప్రపంచబ్యాంకు ప్రజావ్యతిరేక "సంస్కరణల''కూ, విదేశీ బహుళజాతి కంపెనీల, దేశీయ గుత్తపెట్టుబడి వర్గాల ప్రయోజనాలకూ తమ తమ పదవీప్రయోజనాల కోసం గొడుగు పట్టడంలో కాంగ్రెసూ, బి.జె.పీ. నేడు పోటాపోటీలు పడుతున్నాయి! అందులో భాగంగానే, చివరికి జాతీయ స్వాతంత్ర్యోద్యమం గుర్తించి ఏకభాషా, సంస్కృతులు పునాదిగా భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణను సుసాధ్యం చేసిన పరిణామాన్ని బలవంతంగా తిప్పికొట్టేందుకు ఈ రెండు మత రాజకీయశక్తులూ తమ ఉనికికోసం, ఒకటిగా ఉన్న రాష్ట్రాలను విడగొట్టి ప్రజలమధ్య ఐక్యతను విచ్చిన్నం చేయడానికి వెనుకాడడం లేదు. ప్రజల వకాలిక సమస్యలయిన తిండి, బట్ట, వసతి, ఉపాథి అవసరాలను తీర్చగల ప్రణాళికాబద్ధమైన పతకాలను అమలు జరిపే బాధ్యతనుంచి ఈ రెండు పార్టీలు రోజురోజుకీ ప్రజలనుంచి దూరమవుతూ, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థకు సహజమైన 'చిట్కా'ను - విభజించి-పాలించే నీటిని ఆశ్రయించి ప్రజలమధ్య ఘర్షణలను, చీలికలను పెంచడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. ఈ ధోరణి పదవీ ప్రయోజన కాంక్ష దేశ విభజనతోనే ప్రారంభమయి కొనసాగుతోంది!   ప్రజలమధ్య, రాష్ట్రాలమధ్య తగవులు, తంపులు పెట్టే 'సంస్కృతి' ఆధారంగానే స్వాతంత్ర్యానంతర కాంగ్రెస్ అధిష్ఠానమూ, అనంతర దశలో బిజెపి నాయకులూ పంజాబ్ ను చీల్చడం (పంజాబ్-హర్యానాలుగా)దగ్గరనుంచి మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లను ఛత్తీస్ గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ లుగా ముక్కలుగా బద్దలుకొట్టడం వరకూ కీలకమైన పాత్రవహించాయి. ఈ 'విభజన' రాజకీయ కుట్రలో ప్రధాన సమర్థన "విడిపోవటం వికాసం'' కోసమేననీ, "విడిపోయి కలిసి ఉందా''మనీ చేసే విషప్రచారం! అదే సూత్రాన్ని ఇప్పుడు ఈ రెండు మత రాజకీయపక్షాలూ, ఎన్నికలలో తమ స్వార్థప్రయోజనాల కోసం, అందరూ ఆమోదించిన భాషాప్రయుక్త ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాల స్వరూపాలను చెడగొట్టి, సమైక్యంగా మెలగుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధుల్లోనే అభివృద్ధిని నమోదు చేసుకుంటున్న ప్రజలను చెల్లాచెదురు చేయడానికి సంకల్పించాయి; ఈ విచ్చిన్నకర విధానం పైననే ఈ రెండు పక్షాలూ ఆధారపడి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే యత్నంలో ఉన్నాయి! తమ మత, కుహనా లోకిక రాజకీయాలు ప్రజలు గ్రహించకుండా ఉండేందుకు సమాజంలోని అట్టడుగు వర్గాల, బడుగుబలహీన వర్గాల ప్రయోజనాలను 'రక్షించ'డానికే తాము ఉన్నట్టుగా 'సినీ'పరిభాషలో 'బిల్డప్' యిచ్చుకుంటున్నాయి.   ఉదాహరణకు బిజెపి-ఎన్.డి.ఎ. హయాము కృత్రిమంగా ఛత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పరచడానికి చెప్పిన 'సాకు' ఏమిటి? ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించామని! కాని ఆ లక్ష్యం నెరవేర లేదు సరికదా, ఎ మూడు రాష్ట్రాల నుంచి వీటిని ఎ ఉద్దేశ్యంతో 'చీల్చామ'ని చెప్పాలో ఆ ఆదివాసీల బతుకుల్ని విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాథిరంగాలలో చట్టబండలు చేశారు; ఐక్యరాజ్యసమితి, దేశీయ సాధికార సంస్థలూ అజ్రిపిన సర్వేక్షణల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు సరికదా, అక్కడి మైనింగ్ వ్యాపారాలు సాగించడం కోసం గిరిజనుల భూముల్ని మల్టీనేషనల్, దేశీయ బడా కంపెనీలు స్వాధీనం చేసుకుని వందలాది కోట్ల రూపాయల్ని దోచుకుతింటున్నాయి. ఆమాటకొస్తే అసలు ఈ ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేసింది - తిలాపాపం తలా పిడికెడూ పంచుకుని, అమాయక ఆదీవాసీ జనాలను, బడుగువర్గాలనూ పస్తుల్లోకి నెట్టడం! ఈ రెండు రాజకీయపక్షాలూ పోటాపోటీలతో పెంచిన ముఖ్యమంత్రులు పరమ అవినీతిపరులు కావటమూ, ఈ భారం దుర్భరమైనప్పుడు వారిని జైళ్ళపాలుచేయక తప్పని పరిస్థితులకు 'తాళి'కట్టడమూ!   ఇలాంటి పరిస్థితుల్లోనే, ఇటీవల హైదరాబాద్ లో సభ తీర్చిన బిజెపి 2014 ఎన్నికల సమన్వయ సంఘానికి సీనియర్ నాయకుడైన అద్వానీని పక్కకునెట్టి నరేంద్ర మోడీని రథసారథి చేశారు! ఉద్దేశ్యం - మతరాజకీయాల ద్వారా తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావించిన బిజెపి గత అయిదేళ్ళక్రితం వరకూ కర్నాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అప్పటిదాకా దక్షిణభారతంలో కాలు మోపలేని బిజెపి మొదటిసారిగా కర్నాటకలో పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అక్కడినుంచి స్థానికంగా కర్నాటకలో ఎన్నిరకాల మతఘర్షణలు చోటు చేసుకున్నాయో రాజకీయ పరిశీలకులకు తెలుసు! మరి ఈనాడు ఈ పార్టీ పరిస్థితి ఏమిటి? ఏడు రాష్ట్రాల్లో తన అధికారం కోలిపోయి, ప్రస్తుతం పాలనాశక్తిగాబిజెపి పాలన కేవలం నాలుగురాష్ట్రాలకు కుదించుకుపోయింది! పైగా ఈ నాల్గింటిలోనూ రెండు రాష్ట్రాలు [గోవా, మోడీవారి గుజరాత్] రాజకీయంగా ప్రాధాన్యతలేని కేవల సత్తరగాయాలుగా మిగిలిపోయాయి! చివరికి దక్షిణాదిన చేజిక్కించుకున్న ఆ 'ఒక్కాయికొక్కు' కర్నాటక సహితం ఈ ఏడాది (2013) మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా అవమానకరంగా బిజెపి చేజారిపోయింది! అంతకుముందు జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోయింది; ఇక 2005 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ లోని జనతాదళ్ తో పొత్తువల్ల బిజెపి ఘనంగా ఎన్నికైనట్టు కనపడింది. కాని నరేంద్రమోడీ పార్టీ కేంద్ర రాజకీయాల్లో చోటుచేసు కావటంతో లోక్ దళ్ తో పొత్తు చిత్తు కావలసివచ్చింది! కాగా 2009 లోక్ సభ ఎన్నికల్లో ఈ "పొత్తు'' 40 లోక్ సభ స్థానాల్లో 32 స్థానాలను గెలుచుకుంది. కాని 1999 ఎన్నికల్లో 12 స్థానాలు గెలుచుకున్న బిజెపి 2009లో సొంతంగా ఆ స్థానాలను మాత్రమే నిలుపుకోగల్గింది. కాని 2013 మోడీ బిజెపి అధిష్ఠానంలోకి రావటంతో బీహాల్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుజరాతీ మోడీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. కారణం? మోడీతో జోడీవల్ల జనతాదళ్ కు అంతకుముందు తనకు దగ్గరయిన బీహార్ లోని 17 శాతం ముస్లీం మైనారిటీల తాను మద్ధతు కోల్పోవలసి వస్తుందని భావించాడు! ఇక జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలు 2013 జనవరిలో బిజెపి ప్రభుత్వాన్ని కూలగొట్టాయి, ఫలితంగా రాష్ట్రపతి పాలన వచ్చింది! ఇక 2012లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది! ఇక దేశంలోనే అతిపెద్ద జనాభా గల ఉత్తరప్రదేశ్ లో, ఎన్నికల వ్యూహంలో, సీట్ల సంఖ్యలో అత్యంతగా పార్లమెంటులో బలాబలాల్ని ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్ లో 2012 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో కేవలం 47 స్థానాలనే బిజెపి గెలుచుకోగలిగింది. మూడవ పార్టీగా మాత్రమే పరువు నిల్పుకున్నది. 2007లో కూడా కేవలం 51 సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది; అంటే 2002 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడైన రాజ్ నాథ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండికూడా బిజెపి 88 సీట్లతోనే సరిపెట్టుకోవలసివచ్చింది. అంటే 2002 నుంచీ ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బి.ఎస్.పి. పార్టీలు వంతులవారీగా ప్రభుత్వాలు నిర్వహిస్తూ అనేక వైఫల్యాలకు కారణమవుతున్నాగాని ఆ వైఫల్యాలను తనకు అనుకూలంగా బిజెపి మార్చుకోలేక పోవటానికి ప్రధాన కారణం - దాని హిందుత్వ, మోడీత్వ, ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్ మత రాజకీయాలే! ఇలా ఉత్తరప్రదేశ్ లో రానురానూ బిజెపి పతనమవుతూ వచ్చింది. 1996 తర్వాత జరిగిన 4 అసెంబ్లీ ఎన్నికల్లోనో ఆ రాష్ట్రలో ఈ పార్టీ మొత్తం (425 అసెంబ్లీ స్థానాల్లో) వోట్లలోనూ, సీట్ల సంఖ్యలోనూ కూడా క్రమంగా పతనమవుతూవుతూ వచ్చింది. సరిగ్గా ఇందువల్లనే అది 2000-2001 లో కేంద్రంలో సంకీర్ణప్రభుత్వంలో ఉన్నప్పుడే బిజెపి ఉత్తరప్రదేశ్ ను విభజించి ఉత్తరాఖండ్ ను ఏర్పాటు చేస్తేనైనా కేంద్రంలో తన ప్రభుత్వం నిలుస్తుందేమోనని చీల్చడానికి సాహసించింది! అలాగే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారాన్ని సహించలేనప్పుడు దాన్ని ముక్కలు చేసి ఛత్తీస్ గడ్ ను, బీహార్ లో తన పాలనలేదని జార్ఖండ్ నూ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది! ఇంతకూ అన్నింటికన్నా ఉత్తరప్రదేశ్ అంతటి పెద్ద రాష్ట్రాన్ని చీలగొట్టాలన్న తలంపు బిజెపికి రావడానికి కారణం పార్లమెంటు సభ్యులలో గణనీయమైన సంఖ్యా అక్కడినుంచే ఎన్నిక అవుతూండటం. అందుకే "యు.పి. అంటే ఇండియా, ఇండియా అంటే యు.పి.'' అన్న వ్యంగ్యవర్ణన జనంలో పాకిపోయింది! నెహ్రూ-ఇందిర పాలనలనుంచి నేటి సోనియా-రాహుల్ కాంగ్రెస్ వరకూ ఈ టప్పుడు సమీకరణే రాజ్యమేలుతోంది. అందుకే 'సుపరిపాలన'. 'అభివృద్ధి' మంత్రాలను తన ఆర్థిక దోపిడీకి ఆకర్షణీయ సూత్రాలుగా ప్రకటించిన వరల్డ్ బ్యాంకు అటు కాంగ్రెస్ పాలకులకు, ఇటు బిజెపి పాలకులకూ సమాన 'ఆరాధ్య'దైవమయింది! ఎవరికివారు తమ పాలనలను "వెలిగిపోతున్న ఇండియా'' అని తమకు తామే నినాదాలు ఎన్నికల సమయంలో సృష్టించుకుని ప్రజలను భ్రమల్లోకి నెట్టి కూర్చున్నారు. ఒడ్డు చేరుకునే వరకూ బోటు మల్లయ్యను మర్యాదగా పిలిచి, దాటింతర్వాత "బోడి''మల్లయ్య అన్నట్టు మోసగించడానికి అలవాటు పడ్డారు. అదే పద్ధతిలో హైదరాబాద్ సభలో నరేంద్రమోడీ స్థానంలేని ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని నిలపడంకోసం "వికాస''పురుషుని వేషంలో తెలుగుజాతిని విడగొట్టేందుకు, ఐక్య ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేసేందుకు రాజకీయ కుట్రలో భాగస్వామి అవుతున్నాడు!   కాని వందలాదిమంది రైతాంగ ఆత్మహత్యలకు, పోష్టకాహారానికి దూరమైపోయిన వేలాదిమంది బాలబాలికల, శిశువుల అకాలమరణాలకు నిలయమైన [ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం] గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతం తనను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని చాలాకాలంగా ఉద్యమిస్తోంది. ఏడు జిల్లాలతో కూడిన [జామ్ నగర్, సురేంద్రనగర్, రాజ్ కోట, అమ్రేలి, భావనగర్, పోర్ బందర్, జూనాఘడ్] సౌరాష్ట్రను గుజరాత్ నుంచి వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న ఉద్యమం అక్కడ ఉదృతంగా సాగుతోంది. దానికి పరిష్కారం చూపలేని మోడీ తగుదునమ్మా అని తెలుగుజాతిని రెండుగా చీల్చడం ద్వారా, వేర్పాటు ఉద్యమానికి ఊతంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని పెంచాలని కలలుగంటున్నారు. గుజరాత్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ముక్కలు కావాలి, బిజెపికి నాలుగు సీట్లు పెంచుకోవాలి, తద్వారా ఢిల్లీ దర్బారుకు ఎగబాకాలి, అదీ రంధి! అందుకోస్సం నెహ్రూకు పోటీగా సర్థార్ వల్లభాయ్ పటేల్ కు నిలువెత్తు భారీ విగ్రహాలు ఆవిష్కరించారట! కాని పటేల్ నిలబడింది - భారతదేశ సమైక్యతకు, సంస్థానాల విలీనీకరణ ద్వారా రాస్ష్ట్రాల సుస్థిరత కోసమేగాని మోడీలాగా స్వార్థపూరితమైన విభజన ద్వారా తన 'వికాసం' కోసం కాదు!   ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్రాల పునర్విభజన కోసం నియమించిన మొదటి ఫజత్ ఆలీ కమీషనూ, నిన్నమొన్నటి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రెండు నివేదికలూ మొదటి ప్రాధాన్యాన్ని - ఏకీకృత సమైక్యాంధ్రకే, విశాలాంధ్రకే స్పష్టంగా పేర్కొన్నాయని మరచిపోరాదు. శ్రీకృష్ణ కమీషన్ ఆరు ప్రాధాన్యతలలో మొదటి ప్రాధాన్యతను, ఆఖరి మాటనూ (1/6 ప్రతిపాదనలు) ఆద్యంతాల బిగింపులాగా సమైక్యరాష్ట్రమే సరైనదీ, పురోగతికి సవ్యమైనదీనని స్పష్టం చేసింది! ఇక్కడ నరేంద్రమోడీగాని, అతడిలాంటి బిజెపి నాయకులుగానీ ఈ సందర్భంగా సర్దార్ పటేల్ 1952 జులైలో పార్లమెంట్ లో చేసిన ప్రసంగాన్ని బట్టీపట్టకపోయినా కనీసం చదువుకొని ఉండటం అవసరం! ఆనాడే గూర్ఖాలాండ్ లేదా ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన తలెత్తినప్పుడు సర్థార్ పటేల్ ముఖం వాచేలా యిలా హెచ్చరించారు:   "ఉత్తరబెంగాల్ లోని గూర్ఖాలాండ్ లేదా గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అవాస్తమైన, అసహజమైన, జాతీయప్రయోజనాలకు హానికరమైన ప్రతిపాదనగా భారతప్రభుత్వం భావిస్తోంది. అలాంటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం ప్రారంభించే ఎలాంటి ఉద్యమానికి ఎలాంటి అవకాశం యివ్వరాదని కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది' ఇలాంటి మతిలేని ప్రయత్నాల ద్వారా దేశ సంఘీభావాన్ని చెడగొట్టడాన్ని కేంద్రప్రభుత్వం సహించబోదు''! ఈ విషయంలో పటేల్ ఏకభాషా సంస్కృతులు ఆధారంగా సహేతుకమైన భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును అభిలషిస్తూ జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానాలను గౌరవిస్తూ, అసహజమూ, అశాస్త్రీయమైన పద్ధతుల్లో రాష్ట్రాల విభజనను వ్యతిరేకిస్తూ స్పష్టం చేశారని మోడీ ప్రభృతులు తెలుసుకోవటం మంచిది!

జగన్, విజయమ్మల రాజీనామాతో కొత్తగా ఒరిగేదేమిటి

  ఈ రోజు వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద వైఖరిని నిరసిస్తూ తమ యంపీ, శాసనసభ సభ్యత్వాలకి రాజీనామాలు చేసారు. అయితే వారు తమ రాజీనామాలకు చెపుతున్న కారణాలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. తమ పార్టీ తెలంగాణాలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన తరువాత కూడా, నేటికీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్నామని దైర్యంగా చెప్పకుండా, ఇటువంటి కుంటి సాకులు చెపుతూ రాజీనామాలు చేయడం ఆ పార్టీ రాజకీయ దౌర్భాల్యాన్ని సూచిస్తోంది.   తమ పార్టీ శాసనసభ్యుల చేత సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయించినప్పుడు కూడా ఆ పార్టీ దైర్యంగా ఆమాట చెప్పలేకపోయింది. అందువల్ల ఆ పార్టీకి చెందిన కొండ సురేఖ, మహేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతలను కోల్పోయింది. వైకాపా తెలంగాణాలో తన దుఖాణం బంద్ చేసుకొన్న తరువాత కూడా, ఇప్పటికీ దైర్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి తాము వ్యతిరేఖమని చెప్పకపోవడం చూస్తే, మళ్ళీ ఎప్పటికయినా ఆ ప్రాంతంలో తమ పార్టీ బ్రతికిబట్ట కట్టకపోతుందా అనే ఒక చిన్న ఆశ వారిలో ఇంకా మిగిలి ఉన్నట్లు అర్ధం అవుతోంది.   ఇక వారు కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించి, తమ చేతిలోంచి జారిపోయిన ఉద్యమంపై పట్టు సాధించడానికే. తాము మొదలుపెట్టిన సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు హైజాక్ చేసుకుపోయి, తెలంగాణా నేతలతో తీవ్ర వాగ్వాదాలు చేస్తూ మంచి ఆసక్తికరమయిన డ్రామా నడిపిస్తు, సమైక్యాంధ్ర కోసం తామే చాలా కష్టపడుతున్నట్లు ప్రజలందరిని నమ్మించ గలుగుతున్నారు.ప్రజలు కూడా కాంగ్రెస్ ఆడుతున్న ఈ డ్రామా పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు.    ముఖ్యమంత్రి మొదలుకొని ఉండవల్లి, లగడపాటి, కావూరి, ఘంటా, టీజీ, శైలజానాథ్ ఇలా చెప్పుకొంటూ పోతే సీమంధ్రకోసం పోరాడుతున్న కాంగ్రెస్ నేతలలిస్టు చేంతాడంత ఉంది. కానీ వైకాపా నేతల పేర్లు ఎక్కడా వినబడవు. అందువల్ల ప్రజలందరి దృష్టి కూడా కాంగ్రెస్ మీదనే ఉంది. ఇక సీమంధ్ర ప్రజలు, ప్రభుత్వ సంస్థలు కూడా ఎవరి దారిన వారు స్వతంత్రంగా ఉద్యమాలు చేసుకు పోతుండటంతో ఇప్పుడు వైకాపా పని పులుసులో కరివేపాకులా తయారయింది. ఒక్క కాంగ్రెస్, తెదేపా నేతలు, సాక్షి మీడియా తప్ప వైకాపా ఊసెత్తేవారే లేరిప్పుడు.   తెలంగాణాలో తమ పార్టీని బలిపెట్టుకొని మరీ మొదలుపెట్టిన సమైక్య ఉద్యమంలో తమకు ఇటువంటి పరిస్థితి రావడాన్నివారు జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ ప్రజల దృష్టిని తమవైపు ఆకర్షించాలంటే ఇటువంటి మంచి కార్డులు వేయవలసిందే. అందుకే జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మలు రాజీనామాలు చేసి గేమ్ లో ‘షో’ చెప్పేశారు.   అయితే నిజానికి అది షో కాదు ‘డ్రాప్’ అని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ రాజకీయ చదరంగంలో వారు తెలంగాణాలో గేమ్ ఓడిపోయిన తరువాత మళ్ళీ సీమంద్రాలో కూడా మరో మారు ఓడిపోయారు.

రాజకీయ చదరంగంలో పావుగా మారిన ఐఏయస్ ఆఫీసర్

  ఉత్తరప్రదేశ్ కి చెందిన దుర్గా నాగ్ పాల్ అనే 27ఏళ్ల ఐఏయస్ ఆఫీసర్ అధికార సమాజ్ వాది పార్టీ కాంగ్రెస్ పార్టీల మద్య జరుగుతున్నవికృత రాజకీయ క్రీడలో పావుగా మారిపోయింది. ఆమె నొయిడా జిల్లాలో గల కడల్పూర్ అనే గ్రామంలో అక్రమ నిర్మాణం చేస్తున్న ఒక మసీదు గోడని కూల్చి వేసి, మతఘర్షణలు చెలరేగేందుకు కారణమయ్యారని సమాజ్ వాది ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. అయితే, ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు, ముస్లిముల పవిత్ర రంజాన్ పండుగ సమయంలో మశీదు గోడను కూల్చివేసినట్లు స్థానికులు, వక్ఫ్ బోర్డు సభ్యులే చెపుతున్నారు.   కొందరు సమాజ్ వాది నేతల అండతో సాగుతున్నఇసుక మాఫియాను ఆమె  డ్డీ కొనడంతో, వారే ఆమెను తమకు అడ్డు తప్పించేందుకు ఇదంతా చేసినట్లు బయట పడటంతో దుర్గా నాగ్ పాల్ కు ఉత్తరప్రదేశ్ మీడియా తోబాటు జాతీయ మీడియా కూడా మద్దతుగా నిలిచింది.   అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమయిన ఉపకధ కూడా ఉంది. మసీదు గోడ కూల్చిన సంగతి తెలియగానే, స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యుడు టాకూర్ దీరేంద్ర సింగ్ తన అనుచరులను వెంటబెట్టుకొని వెంటనే కడల్పూర్ గ్రామానికి వెళ్లి స్థానిక ముస్లిములను కలిసి వివరాలను సేకరించి పీసీసీకి, కాంగ్రెస్ (27వ తేదీన) అధిష్టానానికి చేరవేసాడు.   ఆ మరునాడు ఆ గ్రామంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు లక్నోమరియు డిల్లీ నుండి కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు వస్తున్నట్లు తెలుసుకొన్నసమాజ్ వాదీ ప్రభుత్వం, వారు దీనిని రాజకీయం చేసి తన ముస్లిం వోటు బ్యాంకును గండి కొట్టేందుకు వస్తున్నారని గ్రహించిన వెంటనే, ఇదంతా తన మెడకు చుట్టుకోకూడదనే ఆలోచనతో, సంబందిత ప్రభుత్వాదికారులను పరగులు తీయించి 27వ తేదీ అర్ధరాత్రిపూట డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యాలయం తెరిచి, అక్కడి నుండి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు స్థానిక మాజిస్ట్రేట్ కు ఫాక్స్ మెసేజ్ పంపారు.   కానీ, ఆ మరునాడు కాంగ్రెస్ నేతలెవరూ అక్కడికి రాకపోవడంతో అఖిలేష్ ప్రభుత్వం తాము తొందరపడి దుర్గాను సస్పెండ్ చేసినట్లు గ్రహించింది.   ఈ విషయమంతా మీడియాకి పొక్కడంతో, ఇక ప్రభుత్వం కూడా తన తప్పును సమర్దించుకోక తప్పలేదు. ఒకవైపు మీడియా అఖిలేష్ ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే, మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి అకిలేష్ యాదవ్ ఆ విమర్శలకు ధీటుగా స్పందించినప్పటికీ, ఈ వ్యవహారం మరింత ముదిరితే ప్రమాదమని భావించడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దుర్గా నాగ్ పాల్ తో రాజీయత్నాలు మొదలుపెట్టింది.   మశీదు గోడ కూల్చేందుకు తానే ఆదేశాలు జారీ చేసానని అంగీకరిస్తూ క్షమాపణ పత్రం వ్రాసి ఇచ్చినట్లయితే, సస్పెన్షన్ ఆర్డర్స్ వెనక్కు తీసుకొంటామని ఆమెకు కబురు పంపింది. అయితే, ఏ తప్పు చేయని తాను క్షమాపణ కోరే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పడంతో ప్రభుత్వం కంగు తింది. ప్రస్తుతం ఈ కధ సుప్రీం కోర్టుకి చేరుకోంది. ఈ నెల 22న సుప్రీం కోర్టు ఈ కేసు విచారణ చేపట్టబోతోంది.   ఈ కధలో కొసమెరుపు ఏమిటంటే, ఆమెను అవినీతిపై పోరాడే దుర్గామాతగా మీడియా వర్ణించడం జీర్ణించుకోలేని రాష్ట్రమంత్రి అజాం ఖాన్, ఆమె పేరులో కేవలం దుర్గా అనే పేరు ఉన్నందునే మీడియా ఆమెకు అంత అనవసరమయిన ప్రాదాన్యం ఇస్తోందని, లేకుంటే అసలు ఆమెను పట్టించుకొనే వారే ఉండరని అన్నారు.

తెరాస మరో కొత్త నాటకం షురూ

  ఈ రోజు తెరాస మరో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టింది. “కేసీఆర్ ని హతమార్చడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని, అందుకు సుపారీ కూడా ఇచ్చినట్లు తమకు తెలుసని, ఆ కుట్రలు ఎవరు ఎందుకు పన్నుతున్నారో కూడా తమకు బాగా తెలుసునని, కానీ సమయం వచ్చినప్పుడు అది బయటపెడతామని, కేసీఆర్ పై ఈగ వాలినా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని ” ఆయన మేనల్లుడు హరీష్ రావు, ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కు ప్రభుత్వం వెంటనే జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేసారు.   కాంగ్రెస్ తెరాసను, కేసీఆర్ ను పక్కనబెట్టి తెలంగాణా ప్రకటించేసినప్పటి నుండి ఆయన పరిస్థితి, ఆ పార్టీ పరిస్థితి కూడా కుడితిలో పడిన ఎలుకవలే ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు కాంగ్రెస్ తెలంగాణా సెంటిమెంట్ ఎత్తుకుపోవడమే కాకుండా తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పని పరిస్థితి కల్పించింది. తెరాస బెట్టు చేస్తుంటే, మరో వైపు ఆ పార్టీ నేతలు ఒకరొకరుగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నారు. విలీనం చేస్తే అసలు తన ఉనికినే కోల్పోయే ప్రమాదం. చేయకపోతే పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం.   ఇటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తప్ప తమ రాజకీయ మనుగడ ఉండదని వారు భావిస్తున్నారు. అందుకే మొన్న ఆంధ్రా ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవలసిందే అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. దాని పరిణామాలు రోజూ అందరూ చూస్తూనే ఉన్నారు.ఈ రోజు “కేసీఆర్ హత్యకి కుట్ర’ అంటూ ఆ అగ్నికి మరింత ఆజ్యం జోడించారు. దీని విపరీత పరిణామాలు రేపటి నుండి బయటపడినా ఆశ్చర్యంలేదు. ఈవిధంగా విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేయడం వలన అంతిమంగా నష్టపోయేది వారే తప్ప వేరేవరూ కాదు. అయితే ఈవిధంగా ఎంత కాలం నెట్టుకు రాగలమని వారే ఆలోచించాలి.   కేసీఆర్ హత్యకు నిజంగా ఎవరో కుట్ర పన్నుతున్నారని తెలిస్తే ముందుగా ఆయనకి ఏ ప్రమాదం జరుగకుండా మరింత భద్రత పెంచి జాగ్రత్త పడాలి. ఆయన హత్యకు ఎవరు కుట్ర పన్నుతున్నారో కూడా వారికి తెలిసినపుడు ముందుగా ఆ విషయం మీడియాకు కాకుండా పోలీసులకి చెప్పి రక్షణ కోరి ఉండాలి. ఆయన హత్యకు కుట్ర జరుగుతున్నసంగతి తెలిసినప్పటికీ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాని ఏదో శుభకార్యం జరగబోతున్నటు మీడియాలో ప్రకటించుకోవడం నీచ రాజకీయమే.   ఆయన హత్యకు ఎవరు కుట్ర పన్నుతున్నారో తెలుసినపుడు సదరు కుట్రదారులపై పోలీసులకి పిర్యాదు చేయాలి. కానీ అలాచేయకుండా సమయం వచ్చినప్పుడు వారి పేర్లు బయట పెడతామని చెప్పడం చూస్తే దానివెనుక దాగిన వారి చవకబారు ఆలోచనలకి కనపడుతాయి. తమ రాజకీయ మనుగడకోసం ఇటువంటి కపట ఆలోచనలు, ఎత్తులు వేస్తే అది బెడిసికొట్టడం ఖాయం. అబద్దాల పునాదుల మీద పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తే అది వారికే నష్టం.   అసలు ముందు కేసిఆర్ కి ఆయన స్వంత పార్టీ నేతల నుండే ఏమయినా ప్రమాదం పొంచి ఉందేమో పోలీసులు విచారించాలి.

హరికృష్ణ రాజీనామా! ఎందుకో

  కేంద్రం రాష్ట్ర విభజనపై ప్రకటన చేసేవరకు మౌనం పాటించిన సీమంధ్ర నేతలు ఇప్పుడు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. అసలు తమ రాజీనామాలతో వారు ఏమి సాధిద్దామనుకొంటున్నారో, అసలు దానివల్ల కేంద్రం మనసు మార్చుకొంటుందని వారు నిజంగా నమ్ముతున్నారో లేదో, లేక సీమంధ్ర ప్రాంతంలో తాము మిగిలిన వారికంటే వెనుకబడిపోతామని భయపడి రాజీనామాలు చేస్తున్నారో గానీ మొత్తం మీద ఒకరిని చూసి మరొకరు పోటీలుపడి మరీ రాజీనామాలు చేస్తున్నారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కూడా వారం వర్జ్యం, ముహూర్తం అన్ని సరి చూసుకొని ఆదివారం ఉదయం 8.30 గంటలకు యన్టీఆర్ ఘాట్ వద్ద నాటకీయంగా రాజీనామా చేసారు.   అయితే, ఆయన రాజ్యసభ సభ్యుడుగా ప్రజలకు ఏమి మేలు చేసారో తెలియదు కానీ, కనీసం రాజ్యసభకు నామినేట్ చేసిన తెదేపా కోసం కూడా ఆయన చేసిందేమీ లేదు. తెదేపా సభలు సమావేశాలు జరిగిన ప్రతీసారి వచ్చి అలకలు, చిరాకు ప్రదర్శించడమే తప్ప ఆయన పార్టీకి ఒరగబెట్టిందేమి లేదు. ఇక పార్టీ (చంద్రబాబు) తనకు చాలా అన్యాయం చేసిందంటూ చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకి కూడా దూరంగా ఉంటున్న ఆయన గత కొద్ది రోజులుగా మళ్ళీ పార్టీ తరపున మాట్లాడటం మొదలుపెట్టారు. బహుశః వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం ఆయన ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లున్నారు.   నందమూరి కుమారుడుగా ఆయన పార్టీ టికెట్ ఆశిస్తే ఆశించవచ్చు తప్ప, లేకుంటే ఆయన ఏవిధంగాను అందుకు అర్హులు కారని చెప్పవచ్చును. ఆయన ఏనాడు బాధ్యతగల పార్టీ సభ్యుడిగా వ్యవహరించలేదు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు ఏమి చేసారో ఆయనే చెప్పాలి. అటు పార్టీకి గానీ, ప్రజలకు గానీ ఏవిధంగాను అక్కరకు రాని ఆయన, తనకు తీరికున్నపుడు వచ్చి ఒకసారి పార్టీకి, ప్రజలకి మొహం చూపించి మాయమయిపోతుంటారు. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగినపోయిన తరువాత వారం వర్జ్యం ముహూర్తం అన్ని చూసుకొని నాటకీయంగా రాజీనామా ఇవ్వడమెందుకు?   ఆయన పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఆ తేడా ఎన్నడూ కనబడలేదు. అందువల్ల ఆయన రాజీనామా చేయడం వలన ఆయనకే వ్యక్తిగతంగా కొంత నష్టం జరుగుతుంది తప్ప ప్రజలకి కానీ, పార్టీ గానీ మాత్రం ఎటువంటి మేలు జరుగదు. ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే ఇవ్వచును కానీ ఇప్పుడు రాజీనామా చేస్తే అందుకు ప్రతిగా ప్రజలు వచ్చే ఎన్నికలలో ఆయనకే ఓటేస్తారని హామీ ఏమీ లేదనే సంగతి ఆయన తెలుసుకొంటే మంచిదేమో.

హైదరాబాద్ పై మొదలయిన చిచ్చు

  హైదరాబాద్ పై రెండు ప్రాంతాలవారి పట్టుదలలు గురించి కేంద్రానికి పూర్తి అవగాహన ఉన్నపటికీ, దానిపై సరయిన వివరణ ఈయకుండా, హైదరాబాదును పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని క్లుప్తంగా చెప్పి రాష్ట్ర విభజన ప్రకటన చేసి చేతులు దులుపుకొంది. కేంద్రం హైదరాబాద్ పై స్పష్టత ఈయకపోవడంతో దానిపై రకరకాల అనుమానాలు, ఊహాగానాలు, వాదనలు, ప్రతిపాదనలు మొదలయ్యాయి. కొంత మంది నేతలు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతుంటే, మరికొందరు దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మరో సరికొత్త రాజధానులు ఏర్పరచాలని వాదిస్తున్నారు.   చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతున్న మంత్రి సి.రామచంద్రయ్య హైదరాబాద్ ను శాశ్వితంగా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని మరో సరికొత్త ప్రతిపాదన చేసారు. అయితే, హైదరాబాద్ కి ఆంధ్ర ప్రాంతానికి మధ్య తెలంగాణా ప్రాంతాలు ఉండటం వలన హైదరాబాదును శాశ్విత ప్రాతిపాదికన రాజధానిగా చేయడం అసాదయం. అయినప్పటికీ, అక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఇటువంటి ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. నిన్న కొందరు కాంగ్రెస్ యంపీలు రాజీనామాలు చేసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపివచ్చిన చిరంజీవి కూడా హైదరాబాద్ ను శాశ్విత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని కోరడం గమనిస్తే బహుశః కేంద్రం కూడా అటువంటి ఆలోచనలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఇటువంటి ప్రతిపాదనలు చేసినంత తేలికగా ఆచరణ సాధ్యం కాదు.   రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా సాగాలంటే, ముందుగా రాజధాని హైదరాబాద్ పై రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న భయాలు, అపోహలు, అనుమానాలను తొలగించవలసి ఉంటుంది. హైదరాబాద్ మరియు ఇతర అంశాలను అధ్యయనంచేసి ఇరు ప్రాంతాల వారికి ఆమోధయోగ్యమయిన తగిన పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు నిన్ననే ప్రకటించింది.   అయితే, కేసీఆర్ వంటి అతివాదులు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తుండటం వల్ల, అక్కడ స్థిరపడిన లక్షలాది ఆంద్ర ప్రజల భయాందోళనలు మరింత పెరిగాయి. అనేక సంవత్సరాలుగా ఒకే చోట కలిసిమెలిసి పనిచేస్తున్న ఉద్యోగులలో ఇటువంటివి చిచ్చు పెట్టి వారి మధ్య ఉద్రిక్తతలకు పెంచడం ఖాయం. అదేవిధంగా హైదరాబాదులో నివసిస్తున్న ప్రజల మధ్య కూడా వైషమ్యాలు సృష్టించడం ఖాయం. అందువల్ల కేంద్రం హైదరాబాద్ ను ముందు తన అధీనంలోకి తీసుకొని ప్రజల అపోహలు దూరం చేయడం మంచిది. లేకుంటే రెండు ప్రాంతాల అతివాదుల వాద ప్రతివాదాల కారణంగా ప్రజల మధ్య ఘర్షణ చెలరేగితే మరో కొత్త సమస్య మొదలవుతుంది. చేతులు కాలిన తరువాతనే ఆకులు పట్టుకొనే అలవాటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇకనయినా ఆ అలవాటు మానుకొని ముందుగానే మేల్కొంటే మంచిది.

మ‌జ్లీస్ తెలం'గానం'

  తెలంగాణ‌ ప్రాంతంలో ఉంటూ కూడా మొద‌టి నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేఖిస్తూ వ‌స్తున్న ఏకైక పార్టీ మ‌జ్లీస్ తెలంగాణ ఏర్పాటు అయితే త‌మ ప్రాభ‌వం త‌గ్గడంతో పాటు బిజెపి బ‌ల‌ప‌డుతుంద‌న్న అనుమానంతో తొలి నుంచి ఆ పార్టీ ప్యత్యేక రాష్ట్రన్ని వ్యతిరేఖిస్తూ వ‌స్తుంది. అయితే ఎవ‌రి వ‌త్తిళ్లుకు త‌లొగ్గని అధిష్టానం తెలంగాణ‌ను ప్రకటించేసింది. దీంతో ఇప్పుడు త‌రువాత రాష్ట్రంలో ప‌రిస్థితులు ఎలా ఉండాలి అన్న అంశం పై దృష్టి పెట్టింది మ‌జ్లీస్‌. తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న సీమాంద్రల‌ను సెటిల‌ర్స్ అని పిల‌వ‌కుండా వారి స్వేచ్చకు ఎలాంట భంగం క‌లుగ‌కుండా చూడాల‌ని మ‌జ్లీస్ పార్టీ నేత అస‌దుద్దీన్ ఒవైసీ కోరారు. అలా ఇక్కడి సీమాంద్రల‌కు ర‌క్షణ క‌ల్పించిన నేప‌ధ్యంలో తెలంగాణ‌కు అనుకూలంగా పార్లమెంట్‌లో ఓటు వేసేందుకు సిద్దం అని ప్రక‌టించారు. విభ‌జ‌లన అనివార్యమైనందున తాము కూడా తెలంగాణ రాష్ట్రానికి మ‌ద్దతు ప్రక‌టిస్తున్నామ‌న్నారు. తెలంగాణ‌తో పాటు దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల డిమాండ్‌ల‌పై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టాల‌న్నారు. గ‌తంలో రాయ‌ల్ తెలంగాణ విష‌యాన్ని తెర మీద‌కు తెచ్చిన మ‌జ్లీస్ భ‌విష్యత్తులో కూడా ఆ అంశం తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.

తెగ‌దెంపులు అన్నంత సులువేనా

  కాంగ్రెస్ అన్నంత ప‌ని చేసింది. 50 ఏళ్లుగా న‌లుగుతున్న తెలంగాణ విష‌యాన్ని మూడు రోజుల్లో తేల్చేసింది.. 10 జిల్లాల‌తో కూడిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు యుపిఏ స‌ర్కార్ కూడా స‌మ్మతిస్తూ ఏక వాఖ్య తీర్మానం చేసింది. నాలుగు నెల‌లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిచేస్తామ‌న్న కాంగ్రెస్ రాజధాని విష‌యంలో మెలిక పెట్టింది. గ‌తంలో ఏ రాష్ట్ర ఏర్పాటు సంద‌ర్భంలో తీసుకొని విదంగా తెలంగాణ విష‌యంలో ఉమ్మడి రాజ‌ధాని విష‌యాన్ని తెలర‌పైకి తెచ్చింది. అది కూడా ప‌ది సంవత్సరాల సుధీర్ఘ కాలం హైద‌రాబాద్‌ను రెండు రాష్ట్రాల‌కు ఉమ్మడి రాజ‌ధానిక‌గా ఉంటుంద‌ని ప్రక‌టించింది. ఈ స‌మ‌యంలో చ‌ర్చించఉకోవాల్సి మ‌రో అంశం అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును 5 నెలల కాలంలో పూర్తిచేయ‌గ‌ల‌దా.. అసెంబ్లీ అభిప్రాయ సేక‌ర‌ణ‌, పార్లమెంట్‌లొ బిల్లు పెట్టడం, నీళ్లు గ‌నులు స‌రిహ‌ద్దులు లాంటి అనేక అంశాల ప‌రిష్కారం ఇలా ఎన్నో స‌మ‌స్యల‌తో ముడి ప‌డి ఉన్న ఈ విష‌యం అంత త్వర‌గా తేలుతుందా.. దీనికి తోడు ఇప్పటికే కేంద్రం నిర్ణయం పై సీమాంద్ర ప్రాంతం భ‌గ్గుమంది. అక్కడి ప్రజ‌ల‌ను ప్రజాప్రతినిధుల‌ను ఎలా బుజ్జగిస్తారు. ఇలా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో స‌వాల్లు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ 200 రోజులుగా పైగా ప‌డుతుంద‌ని ప్రక‌టించిన కాంగ్రెస్ ఇప్పుడు నాలుగు నెల‌లోనే రాష్ట్ర ఏర్పాటు చేస్తామ‌ని ఎలా ప్రక‌టించింది. ఇలాంటి ఎన్నో  ప్రశ్నల‌కు కాంగ్రెస్ అధినాయ‌కత్వం నుంచి స‌మాధానం రావాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణ పై తేల్చిన కాంగ్రెస్ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకునంద‌నే చెప్పాలి.

రాష్ట్ర రాజకీయ నేతల వితండ వాదన

  నేడు కేంద్రం రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం తీసుకోనున్న తరుణంలో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక సరికొత్త వితండ వాదన అందుకొన్నాయి. అదేమంటే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకొనే హక్కు ఉత్తరాది నేతలకు ఎవరిచ్చారు? అని. ఆంధ్రప్రదేశ్ గురించి ఏమాత్రం అవగాహన లేని ఉత్తరాదినేతలందరూ కలిసి రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించడం ఏమిటని ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. నిజమే, వారి వాదన సహేతుకమే. అయితే వారికి ఆ అవకాశం ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించుకొంటే మన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలేనని చెప్పవలసి ఉంటుంది.   రాష్ట్ర విభజనపై ఉద్యమం మొదలయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలే చూసుకోన్నాయి తప్ప, ఎ ఒక్క పార్టీ కూడా విజ్ఞత కనబరచి రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మేధావులను సమావేశ పరచి సమస్యను రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకొనే ప్రయత్నం చేయలేదు. నిజానికి రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకొనవలసిన ఈ సమస్యను కాంగ్రెస్, తెరాసలు తమ స్వలాభం కోసం సమర్ధంగా పెంచి పోషిస్తే, మిగిలిన రాజకీయ పార్టీలు తమవంతుగా తలో పుల్ల వేస్తూ ఆ మంటను మరింత ఎగదోసాయి. తత్ఫలితంగానే ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ గురించి ఏమాత్రం అవగాహన లేని ఉత్తరాది నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. అందుకే నేడు వారు రాష్ట్ర విభజనపై సాధికారంగా మాట్లాడుతుంటే, మన రాజకీయపార్టీలు, వాటి నేతలు ఇప్పుడు మా రాష్ట్రం మీద ఉత్తరాదివారి బోడి పెత్తనం ఏమిటని మండి పడుతూ వితండ వాదనలు చేస్తున్నారు.   రాష్ట్ర సమస్యను రాష్ట్ర రాజకీయపార్టీలు పరిష్కరించుకొనే తెలివిడి, ఐక్యాత, శ్రద్ధ లేకపోవడం వలననే వారు ఇందులో వేలు పెట్టె అవకాశం కలిగింది. అందుకు వారిని నిందించడం కంటే మన తెలివి తక్కువతనాన్ని మనమే నిందించుకోవడం మేలు. రాష్ట్ర విభజన సమస్యతో యావత్ తెలుగుజాతి ఆత్మగౌరవం డిల్లీ నేతల కాళ్ళ ముందు పెట్టి పరువు తీసుకొన్నతరువాత ఇక పోయిన ఆత్మగౌరవం గురించి బాధపడటం ఎందుకు?   పరిస్థితి ఇంత వరకు వచ్చిన తరువాత ఉత్తరాది, దక్షినాది అంటూ మరో సరికొత్త వాదన మొదలుపెట్టడం వలన కొత్తగా ఒరిగేదేమీ లేకపోయినా వారికి మనపట్ల వారికేర్పడిన చులకన భావం మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇటువంటి వితండ వాదనలు చేయడం మానుకోని కనీసం ఇక మిగిలున్నపరువునైనా కాపాడుకోగలిగితే అదే పదివేలు.

వైసిపి రాజీనామాస్త్రం

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్ రెడీ చేస్తుంది అనుకుంటున్న త‌రుణంలో రాష్ట్రంలోని మిగ‌తా పార్టీలు ఇరుకున ప‌డ్డాయి.. కేంద్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఎవ‌రికి అనుకూలంగా జ‌రుగుతున్నాయో తెలియ‌క పోయినా ఇన్నాళ్లు ఇరు పక్షాల‌వారు త‌మ‌కే అనుకూలంగా జ‌రుతున్నాయని చెపుతూ వ‌చ్చారు.. కాని ఇప్పుడు సీన్ మారింది కాంగ్రెస్ అడుగులు ప్రత్యేక రాష్ట్రం వైపే అన్న సంకేతాలు అంద‌డంతో మిగ‌తా పార్టీలు త‌మ అస్త్రాల‌కు ప‌దును పెడ‌తున్నారు..  శుక్రవారం కోర్ క‌మిటీ భేటి నేప‌ధ్యంలో రాష్ట్రంలో ప‌రిణామాలు వేగంగా మారాయి.. ఉద‌యాన్నే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వీర‌శివారెడ్డి త‌న ఎమ్మేల్యే ప‌ద‌వితోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామ చేశాడు.. ఇదే స‌మ‌యంలో రేసులో తాము వెన‌క ప‌డ‌కూడ‌దూ అని భావించిన వైసిపి నేత‌లు కూడా రాజీనామాస్త్రాల‌ను ప్రయోగించారు.. వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంభందించిన వైయ‌స్ విజ‌య‌మ్మ త‌ప్ప మిగ‌తా అంద‌రూ ఎమ్మెల్యేలు రాజీనామాలు స‌మ‌ర్పించారు.. స్పీక‌ర్ ఫార్మెట్లో రాసిన రాజీనామ ప‌త్రాలను స్పీక‌ర్ కార్యాల‌యానికి ఫ్యాక్స్ చేశారు.. దీనితో పాటు రాష్ట్రం స‌మైఖ్యంగా ఉంచ‌డానికి ఎటువంటి త్యాగాల‌కైనా సిద్దమ‌ని ప్రక‌టించారు..తమ పదవులకు రాజీనామా చేస్తూ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని వెనుక పెద్ద రాజ‌కీయ వ్యూహ‌మే ఉంద‌టున్నారు విశ్లేష‌కులు.. తెలంగాణ‌లో కేడ‌రే లేని వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ క‌నీసం సీమాంద్రలో అయిన హీరోలు అనిపించుకోవాలి అనే ప్లాన్‌లో భాగంగానే ఆ పార్టీ నాయ‌కులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు..

రాష్ట్ర విభజన జరిగితే కిరణ్ పరిస్థితి ఏమిటి

  కోర్ కమిటీలో సమైక్యాంధ్ర కోసం వాదించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్టానం రాష్ట్ర విభజనకు మొగ్గు చూపితే రాజీనామా చేస్తారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, తను అటువంటి పనిచేయబోనని ఆయన స్వయంగా చెప్పారు. అంటే, అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకొంటానని అంగీకరించినట్లే భావించవచ్చును.   తెలంగాణా అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంటే, మరో వైపు సీమంధ్ర నేతలు సమైక్యాంధ్ర సభలు, సమావేశాలు అంటూ చాలా హడావుడి చేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, శైలజానాథ్, గంట శ్రీనివాస రావు, టీజీ వెంకటేష్ తదితరులు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న నేతలుగా ఇప్పటికే ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. కానీ వారెవరూ కూడా అధిష్టానాన్ని దిక్కరించే పరిస్థితి లేదు. వారు ఎన్ని సభలు నిర్వహించుకొన్నపటికీ అంతిమంగా అందరూ కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడేవారే. మరయితే, ఈ సమైక్యాంధ్ర సభలు, హడావుడి ఆందోళనలు ఎందుకు అని ప్రశ్నిస్తే, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న నేతలుగా ప్రజలలో గుర్తింపు తెచ్చుకోవడానికి మాత్రమేనని చెప్పక తప్పదు.   రేపు అధిష్టానం రాష్ట్ర విభజన చేసినప్పుడు, వారందరూ మళ్ళీ మరోమారు బహిరంగ సభలు పెట్టి ప్రజలకి తాము ఏఏ కారణాలచేత, విధిలేని పరిస్థితుల్లో అయిష్టంగా అందుకు అంగీకరించవలసివచ్చిందో సంజాయిషీలు ఇచ్చుకోవడం ప్రజలు చూడవచ్చును. కానీ, ఆ తరువాత, ఇంత కాలంగా తాము చేస్తున్న సమైక్యాంధ్ర కోసం చేస్తున్న పోరాటాలవల్ల ఏర్పడిన ప్రత్యేక గుర్తింపుని (యన్కాష్) సద్వినియోగించుకొంటూ వారందరూ కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవి, హోం, ఆర్ధిక, రెవెన్యు వంటి కీలక పదవుల కోసం పోటీలు పడవచ్చును.   మరటువంటి భుజకీర్తులు తగిలించుకొన్నవారితో కిరణ్ కుమార్ రెడ్డి పోటీపడి, మళ్ళీ తన ముఖ్యమంత్రి పదవి నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డికి కేవలం కోర్ కమిటీలో తను చేసిన వాదనల గురించి మాత్రమే చెప్పుకోవడానికి ఉంటుంది. అయితే, ఆ ప్రాధమిక అర్హత రేసులో పాల్గొనడానికి సరిపోదు గనుక ఆయన ముందున్న రెండే రెండు ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవలసి ఉంటుంది.   మొదటి ఆప్షన్: అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి, అధిష్టానానికి విధేయుడిగా ఉంటూ మళ్ళీ ముఖ్యమంత్రి దక్కించుకోవడం. రెండవ ఆప్షన్: (అధిష్టానానికి తన పరిస్థితి అంతా సవినయంగా విన్నవించుకొని, సోనియమ్మఅనుమతితోనే) రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రాజీనామా చేసేసి తను కూడా ఒక వీరత్రాడు వేసేసుకొని, రేసులో పాల్గొంటూ ఆనక అధిష్టానం దయతోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవడం. ఈ రెండు మార్గాలలో దేనిని ఎంచుకొంటారనేది వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకటించిన తరువాత తేలిపోతుంది.   అయితే ఆయన వినయ విదేయతలకు, సమర్ధతకు మెచ్చిఅధిష్టానం కేంద్రానికి ప్రమోట్ చేసినా చేయవచ్చును. అదేజరిగితే, కిరణ్ పని తంతే బూర్లె గంపలో పడినట్లే మరి!

రాష్ట్ర విభజనలో హైదరాబాద్ పంచాయితీ

  రాష్ట్ర విభజనలో వేరే ఏ ఇతర అంశాల దగ్గరయినా పట్టు విడుపులు చూపుతున్న రెండు ప్రాంతాల నేతలు హైదరాబాద్ అంశం వచ్చేసరికి అది తమకే చెందాలని బిగుసుకుపోతున్నారు. అందుకు కారణం హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధికరాజధానిగా నిలవడమే. హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం లేకపోతే రెండు ప్రాంతాలు కూడా మనుగడ సాగించడం కష్టం. భారీ పరిశ్రమలు, మెట్రో రైల్, విద్య వైద్య, సినీ, వ్యాపార సంస్థలు అన్నీకూడా హైదరాబాద్ లోనే నెలకొని ఉండటంతో రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అక్కడి నుండే వస్తోంది. అటువంటి హైదరాబాద్ ను వదులుకొంటే అటు తెలంగాణా అయినా, ఇటు సీమంధ్ర ప్రాంతమయిన ఎన్ని లక్షల కోట్ల ప్యాకేజీలు పుచ్చుకొన్నపటికీ మళ్ళీ ఆ స్థితికి చేరుకోవడానికి దశాబ్దాలు పట్టడం ఖాయం. ఒకవేళ దైర్యంచేసి ప్యాకేజీకి ఒప్పుకొన్నాఅవినీతికి ఆలవాలమయిన నేటి రాజకీయ వ్యవస్థలో అది సక్రమంగా వినియోగించబడుతుందనే నమ్మకం ప్రజలకి లేదు. అందుకే, రెండు ప్రాంతాల నేతలు హైదరాబాద్ కోసం అంతగా పట్టుబడుతున్నారు.   ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఏపార్టీ ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టినా రాష్ట్ర అభివృద్ధి అంటే హైదరాబాద్ ని అభివృద్ది చేయడమేనని అపోహలోఉంటూ, కేవలం హైదరాబాద్ అభివృద్దిపైనే దృష్టి పెడుతూ, మిగిలిన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడమే. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకి అతీతంగా తమ తమ ప్రాంతాలను సర్వతోముఖాభివృద్ధికి నిబద్దతగా కృషిచేసి ఉంటే నేడు హైదరాబాద్ గురించి ఈ గొడవలు ఉండేవే కావు.   అందువల్ల హైదరాబాద్ కోసం పట్టుబడుతున్న తెలంగాణా లేదా సీమంద్రా ఉద్యమకారులనో ఇందుకు నిందించవలసిన పని లేదు. తమ ప్రాంతాలను అబివృద్ధి చేసుకోవాలనే తపన లేని ప్రజాప్రతినిధుల వలననే నేడు ఈ సంకట పరిస్థితి ఏర్పడింది గనుక దానికి వారినే తప్పుపట్టవలసి ఉంటుంది.

జగన్‌ పోటికి అనర్హుడే

      అసెంబ్లీ రౌడీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఆ సినిమాలో హీరో జైలు నుంచే పోటి చేసి ఎలక్షన్స్‌లో గెలుస్తాడు.. ఎమ్మెల్యే అవుతాడు.. కాని ఇక పై అలాంటి సీన్స్‌ కనిపించక పోవచ్చు.. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పుతో ఇక జైలులో ఉన్న వ్యక్తులకు, వేరే ఏ ఇతర కారణాలతో అయినా పోలీస్‌ కస్టడీలో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటిచేయడం కుదరదు..   పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యుల అనర్హతపై బుధవారం సంచలన తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు మరో కేసులో ఈ తీర్పును ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు దోషులుగా తేలితే ఆ రోజు నుంచే వారు పదవులకు అనర్హులని జస్టిస్ ఎకె పట్నాయక్, జస్టిస్ ఎస్‌జె ముఖోపాధ్యాయలతో కూడిన బెంచ్‌ రెండు రోజుల క్రితం తీర్పునిచ్చింది. ఈ బెంచ్‌ గురువారం మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఓటు హక్కు వినియోగించుకునే వ్యక్తికి మాత్రమే ఎన్నికల్లో పోటీ హక్కు ఉంటుందనని తెల్చి చెప్పింది.. జైలుకెళ్లడం, పోలీస్ కస్టడీ వల్ల ఓటు హక్కును కోల్పోయే వ్యక్తికి పోటీ చేసే అవకాశం కూడా ఉండదని చెప్పింది. అయితే ఏ చట్టం కిందనైనా ముందస్తు నిర్బంధంలోకి వెళ్లిన వ్యక్తులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఇప్పటికే కనీసం రెండేళ్ల శిక్ష పడిన వ్యక్తి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక కస్టడీలో ఉన్న వారు కూడా పోటీ చేయడానికి వీల్లేదని తాజాగా పేర్కొంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఎలా ఉన్న రాష్ట్రరాజకీయలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపనుంది.. భావి ముఖ్యమంత్రి చెప్పుకుంటూ జైలు నుంచే చక్రం తిప్పుతున్న జగన్‌ ఎలక్షన్స్‌ లోపు బయటికి రానిపక్షంలో అతను ఇక ఎన్నికల్లో పోటి చేయడం కుదరదు..