చిరు ధైర్యం వెనుక మతలబేంటి?

      అప్పుడెప్పుడో కాస్తంత ధైర్యం చేసి హైదరాబాద్‌ని శాశ్వత యు.టి. చేయాలన్న స్టేట్‌మెంట్ ఇచ్చిన కేంద్రమంత్రి చిరంజీవి ఈమధ్య కాలంలో మళ్ళీ అలాంటి ధైర్యాలేవీ చేయకుండా అధిష్ఠానం దృష్టిలో చిరు మంచి బాలుడు అనే ఇమేజ్ సంపాదించునేలా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారశైలి ఆయన్ని సీమాంధ్ర ప్రాంతానికి మరింత దూరం చేసింది.   తాజాగా చిరు మరోసారి ధైర్యం చేసి సీమాంధ్రులకు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర విభజనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నానని, రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చివరి వరకు పోరాడతానని అన్నారు. తెలంగాణపై తీర్మానం, బిల్లు రెండూ అసెంబ్లీకి తప్పనిసరిగా పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తోందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలు, భయాలు, ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్రం ముందు వెళ్తూ ఉండడాన్ని సహించలేనని చెప్పారు. చిరంజీవి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ సగటు సీమాంధ్రుడికి ఆనందం కలిగించవచ్చేమోగానీ, రాజకీయ పరిశీలకులను మాత్రం ఆలోచనలో పడేసింది.     చిరంజీవి ఏమిటీ.. ఇంత దూకుడుగా వ్యవహరించటమేమిటన్న సందేహాలు కలుగుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతున్నా చిరంజీవి తన పదవిని పట్టుకుని వేలాడుతున్నారన్న ఆగ్రహం అక్కడి ప్రజల్లో వుంది. తనకు, సీమాంధ్ర ప్రజలకు మధ్య ఏర్పడ్డ ఆ గ్యాప్‌ని పూడ్చుకోవాలన్న ఆలోచనలో ఎప్పటినుంచో చిరంజీవి వున్నారు. మరోవైపు విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రుల దృష్టిలో సీఎం కిరణ్ హీరోగా మారుతున్నారు. తాజాగా రాష్ట్రపతి, ప్రధానికి విభజనను వ్యతిరేకిస్తూ లేఖలు రాయటం ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్‌ని మరింత పెంచింది. ఇవన్నీ ఇలా చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో కిరణ్ సీమాంధ్ర ఛాంపియన్‌గా నిలబడిపోయే అవకాశం ఉందని ఊహించిన చిరంజీవి, కిరణ్‌కి పోటీగా తాను కూడా రంగంలో వున్నానని నిరూపించుకోవడం కోసమే సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా, ధైర్యంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సభ ఎలా జరుగుతుందో ఏంటో?

      హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైసీపీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావ సభ ఎలా జరుగుతుందో ఏంటోనన్న టెన్షన్ ఆ పార్టీ శ్రేణులను పట్టి పీడిస్తోంది. వరదల కారణంగా సీమాంధ్ర నుంచి వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం వుంది. దాంతోపాటు వైసీపీ నాయకత్వం కూడా అక్కడే వుండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండంటూ సీమాంధ్ర కార్యకర్తలకు ఆల్రెడీ పిలుపు ఇచ్చింది. పైపైకి పిలుపు ఇచ్చినా బస్సుల్లో, రైళ్ళలో కార్యకర్తల్ని హైదరాబాద్‌కి భారీగా తరలించే ఏర్పాట్లు చేసింది.   అయితే వైసీపీ సమైక్య శంఖారావ సభ విషయంలో గుర్రుగా వున్న తెలంగాణ వాదులు ఈ సభకు ఆటంకం కలిగించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు వస్తున్న 50కి పైగా బస్సులను వరంగల్ జిల్లా వర్ధన్నపేట, జనగాం దగ్గర తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు, తెలంగాణ వాదులకు మద్య వాగ్వివాదం జరిగింది. అక్కడ బస్సుల్ని ఇంకా తెలంగాణ వాదులు వదల్లేదని తెలుస్తోంది. సభ సమయం మించిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఉపయోగం ఏంటన్న ఆలోచనలో బస్సుల్లోని వారు వున్నారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఇదేవిధంగా వైసీపీ బస్సులను తెలంగాణ ఉద్యమకారులు నిలిపివేసినట్టు  తెలుస్తోంది. ఇక రైళ్లలో బయల్దేరిన కార్యకర్తల పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే వుంది. భారీ వర్షాల కారణంగా దాదాపు అన్ని రైళ్ళూ ఆలస్యంగా నడుస్తున్నాయి. దానివల్ల రైళ్ళలో వచ్చే కార్యకర్తలు సభకు సమయానికి చేరుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒంగోలు నుంచి, చిత్తూరు నుంచి వైసీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ళు హైదరాబాద్‌కి చేరుకున్నప్పటికీ, వైజాగ్‌లో ఏర్పాటు చేసిన రైలు భారీ వర్షం కారణంగా చివరి నిమిషంలో రద్దు కావడంతో ఉత్తరాంధ్ర నుంచి రావాల్సిన కార్యకర్తలు ఇక రాలేనట్టేనని అర్థమవుతోంది. ఒంగోలు, చిత్తూరు నుంచి వచ్చిన రైళ్ళలో కార్యకర్తల సంఖ్య చాలా తక్కువగా ఉండటం పార్టీ నాయకత్వానికి నిరాశను కలిగించినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమైక్య శంఖారావ సభ ఎలా జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ నాయకత్వంలో ఏర్పడింది.  

చూసి రమ్మంటే....

  మమ్మీ ఇలాగయితే నేనిక ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను అంతే!   మళ్ళీ కొంపదీసి ఏమయినా నాన్సెన్స్ చేసావా ఏమిటి?   ఏమిటి మమ్మీ నువ్వు కూడా ఆ మోడీ అంకుల్లాగ నన్నే అంటావు?   ఏమన్నాడురా?   నేనేమో మా నానమ్మ,నాన్నగారు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. నన్నుకూడా ఏదో ఒక రోజు అలాగే చంపేస్తారేమో అని జనాలని సెంటిమెంటుతో పడేయాలని ట్రై చేసాను.   ఒరేయ్! ప్రచారానికి వెళ్లిన వాడివి అవేమి మాటలు రా? ఎంచక్కా నీకిష్టమయిన అభివృద్ధి, యువత, రాజకీయ ప్రక్షాళన వంటి మంచి టాపిక్స్ మాట్లాడుకోకుండా, రేపోమాపో సింహాసనం మీద కూర్చోవలసిన వాడివి చచ్చిపోతానని చెపుతావేమిటిరా?అది కూడాఎన్నికల ప్రచార సభలో...అయినా నువ్వు పోతానంటే ఆ మోడీకేమిటట?   అదికాదు మమ్మీ..ఊరికే పోతానంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అందుకే మొన్న ముజఫర్ నగర్ మతఘర్షణలలో చాలా మంది పోయారు. అలాగే నేనూ పోవచ్చునని చెప్పిన తరువాత, ఇక్కడ ఒక మంచి పంచ్ డైలాగొకటి పడితే గానీ మన మాటలకి మంచి ఎఫెక్ట్ రాదని, అక్కడి మత ఘర్షణలలో మిగిలిన ముస్లిం కుర్రాళ్ళని పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళు తమతో చేతులు కలపమని అడిగారని చెప్పాను మమ్మీ.   అదేమిటిరా ఆ సంగతి నీకెవరు చెప్పారు?   నాకా మాత్రం తెలివితేటలు లేవనుకొన్నావా? మన ఇంటలిజన్స్ అంకుల్స్ నాకు చెప్పారని చెప్పాను. అంతే జనాలు బలే నమ్మేసారనుకో.   కొంపముంచావు పో! అయినా నీకు తెలీని విషయాలన్నీ ఎందుకు కెలికేవురా? ఆ మోడీకి తెలిస్తే నీ పని నా పని ఇక అయిపోయినట్లే!   తెలిసిపొయిందమ్మా!   ఈ మోడీ ఒకడు మన ప్రాణాలకి. ఇంతకీ ఏమంటున్నాడు రా?   నేను మత ఘర్షణలు గురించి మాట్లాడేసరికి మోడీ అంకుల్ బాగా భయపడిపోయినట్లే ఉన్నాడు మమ్మీ. అందుకే నా ప్రశ్నలకి జవాబు చెప్పలేక, అతితెలివి ప్రదర్శిస్తూ నన్నేఎదురు ప్రశ్నిస్తున్నాడు.   ఏమని?   అలా అడుగు చెపుతాను! అసలు ఇంటలిజన్స్ వాళ్ళు ఏ అధికారం లేని నాకు ఇటువంటి రహస్య సమాచారం ఎందుకు చెపుతున్నారని అడిగారమ్మా. నేనెవరో తెలియకుండానే ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడు. పైగా మనదేశంలో పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతున్నారని మన ఇంటలిజన్స్ వాళ్ళే చెపుతుంటే మరి మన ప్రభుత్వం నిద్ర పోతోందా? పైగా ఏదో మీడియా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నట్లు నేను ఆ విషయం రిపోర్ట్ చేయడమేమిటి? బుద్ధి లేకపోతేను..అని నన్నుతిట్టాడు మమ్మీ.   ఒరేయ్! నీ మాటలతో నా బీపీ పెరిగిపోతోంది. ఇంకా నువ్వేమి మాట్లాడావు? ఆయనేమని అడిగాడు తొందరగా చెప్పు. వెంటనే దిగ్గీ అంకుల్నో లేక షిండే అంకుల్నో వెళ్లి నీ మాటలని ఖండించమని చెప్పాలి.   అదేమిటి మమ్మీ..నేను మోడీని భలే పడేసానని మెచ్చుకొంటావనుకొంటే నువ్వు కూడా నా మాటలను ఖండించమని చెపుతానంటున్నావు...అలాగయితే నేనిక నిజంగానే ఏ ఎన్నికల ప్రచారానికి వెళ్ళను పో!   పోన్లే..పోన్లే...నేను చెప్పను గానీ, ముందేమీ జరిగిందో త్వరగా చెప్పు. టెన్షన్ తట్టుకోలేపోతున్నాను.   ఏమి లేదు మమ్మీ.. ఇంక నా ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఓడిపోయానని నన్నుక్షమాపణలు కోరే బదులు నేను మన ఇంటలిజన్స్ అంకుల్స్ తో రహస్య సమాచారం షేర్ చేసుకొన్నానని ఒప్పుకొంటావా? లేదా? ఒప్పుకొంటే ఆ పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళుమన దేశంలో తిరుగుతుంటే మన గవర్నమెంటు పట్టించుకోవడం లేదని ఒప్పుకొంటారా లేదా? అలాగయితే ఆ పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళు ఎవరెవరు కుర్రాళ్ళని కలిసారో వాళ్ళ పేర్లు చెపుతావా లేదా? అంటూ ఒకటే అర్ధం పర్ధం లేని ప్రశ్నలు మమ్మీ. పైగా నేను చెప్పిన మాటలు నిజం కానట్లయితే, ముస్లిం కుర్రాళ్ళందరికీ పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళతో సంభందాలు అంటగట్టినందుకు బేషరతుగా ముస్లిములందరికీ క్షమాపణలు చెప్పమని పెద్ద గొప్పగా డిమాండ్ ఒకటి..హా తెలివి తేటలు ఆయనకే స్వంతం అనుకొంటున్నారు పాపం..   అయ్యో దేవుడా... చూసి రమ్మంటే కాల్చి వచ్చావేమిట్రా బాబు...బాబోయ్! ఆ బీపీ మాత్రలందుకో..ఆ త్వరగా ..త్వరగా ....ఇదిగో సెక్రెటరీ వెళ్లి ఆ షిండే గారిని, దిగ్విజయ్ ని మన వాళ్ళందరినీ వెంటనే ఉన్నపళంగా రమ్మని చెప్పు. వెళ్ళు పరిగెత్తు.. వెంటనే మనోడి మాటలను ఖండించకపోతే కొంపలు మునిగేట్లు ఉన్నాయి... ఓరి దేవుడా...   ఛ్చీ..నువ్విప్పెడు అంతే మమ్మీ నీతో ఇక మాట్లాడను...కటీఫ్

జగన్ పట్టుదల వల్లే..

      సమైక్యవాదిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు ఏదో ఒక ఆటంకం కలుగుతూనే వుంది. హైదరాబాద్‌లో సమైక్య శంఖారావ సభను పెట్టుకుందామనుకుంటే మొదట పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత కోర్టు పర్మిషన్ ఇచ్చినా సభ డేట్ ఈనెల 26కి మారింది. హైదరాబాద్‌లో సభ జరిపి తమ పార్టీ సత్తా చూపించాలని జగన్ కలలు కంటుంటే, ఆయన కలల మీద వరుణుడు వాన నీళ్లు చల్లాడు.   వర్షాలు, వరదలతో సీమాంధ్ర మొత్తం సమస్యలు ఎదుర్కొంటూ ఉండటంతో సభ నిర్వహణను వాయిదా వేయాలన్న ఆలోచనకి వైకాపా నాయకులు వచ్చారు. అటు సీమాంధ్రతోపాటు తెలంగాణలో ముఖ్యంగా సభ జరిగే హైదరాబాద్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉండటంతో సభను వాయిదా వేసుకోవడమే కరెక్టన్న  అభిప్రాయానికి వైకాపా నాయకులు వచ్చారు. అటు సీమాంధ్ర నుంచి కూడా జనం వచ్చే పరిస్థితి లేదు. ఇటు తెలంగాణ నుంచి ఎంతమంది సమైక్యవాదులు సభకు వస్తారో చెప్పలేని పరిస్థితి. ఒక పార్టీ గొడుకు కింద జరుగుతున్న సభకి గొడుగులు వేసుకునో, వర్షంలో తడుస్తూనో వచ్చే ఆసక్తి ఎవరికి వుంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో సభ జరిగితే జనం లేక సభాప్రాంగణం వెలవెలపోయే అవకాశం, తద్వారా వైకాపా పార్టీకి, సమైక్యవాదానికి అవమానకర పరిస్థతులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని భావించారు. అందుకే  ఒక దశలో సభ వాయిదా ఖాయమే అనుకున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ మాత్రం సభ జరిగి తీరాలని పట్టుబట్టడంతో 26న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావాన్ని నిర్వహించాలనే తీర్మానించారు. అయితే సభలో పాల్గొనేవారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, వైకాపా ముందు జాగ్రత్త చర్యగా సీమాంధ్ర జిల్లాల నుంచి తమ కార్యకర్తలను సభకు రావొద్దని ప్రకటించింది. రేపు సభలో జనం పలుచగా వుంటే, ‘‘మేమే జనాన్ని రావొద్దని చెప్పాం’’ అనడానికి వీలుగా ఈ ముందు జాగ్రత్తలు తీసుకుంది.

మీ సభ ఏందిరో.. ఈ నరుకుడేందిరో!

      ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో బలం తగ్గిపోయి, రెంటికీ చెడ్డ రేవడిలా జగన్ పరిస్థితి తయారైంది. తెలంగాణని వదిలేసినా, సీమాంధ్రలో అయినా పరువు నిలుపుకోవడానికి జగన్ నానా తంటాలూ పడుతున్నాడు. దాంట్లో భాగంగానే హైదరాబాద్‌లో శనివారం సమైక్య శంఖారావం సభ నిర్వహించబోతున్నాడు.   సీమాంధ్ర వరదల్లో కొట్టుకుపోతున్నా, హైదరాబాద్ తడిసి ముద్దవుతున్నా సభని వాయిదా వేసుకోకుండా తాను అనుకున్న రోజునే జరపాలని డిసైడయ్యాడు. సభ ఫెయిలైతే సీమాంధ్రులకు అవమానంగా వుంటుందన్న ఆలోచన కూడా లేకుండా సభ నిర్వహించబోతున్నాడు.  శనివారం జరగబోతున్న  ఈ సభ చుట్టూ అటు తెలంగాణవాదుల నుంచి ఇటు సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది చాలదన్నట్టు జగన్ మెప్పు పొందడం కోసం ఆయన పార్టీ కార్యకర్తలు చేస్తున్న కామెంట్లు అభ్యంతరకరంగా వున్నాయి. హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ జరపబోయే సమైక్య శంఖారావం సభకి ఎవరైనా అడ్డువస్తే నరికేస్తామని వైకాపా అధికార ప్రతినిధి రెహమాన్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి హెచ్చరికలు ఎవరు చేసినా సమర్థనీయం కాదు. హైదరాబాద్‌లో సమైక్య సభ జరపడం అల్లర్లు సృష్టించడానికే అని విభజన వాదులు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ ప్రశాంతంగా జరపడానికి కృషి చేయాలి. అలా కాకుండా నరికేస్తాం.. చంపేస్తాం లాంటి కామెంట్లు చేయడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా అధికార ప్రతినిధి చేసిన కామెంట్‌ని జగన్ గానీ, పార్టీలో ఇతర నాయకులు గానీ ఇంతవరకూ ఖండించలేదు. అంటే అధికార ప్రతినిధి చెప్పిన నరుకుడు కార్యక్రమం అధికారికంగానే నిర్వహిస్తారా? వైకాపా వాళ్ళు నరికేస్తూ వెళ్తుంటే నరికేయండి బాబూ అని ఎవరూ తలలు అప్పగించరు. నరుకుతామంటూ జరిపే సభ సమైక్య సభ ఎందుకవుతుంది? రాష్ట్రాన్ని రెండుగా నరికే సభే అవుతుంది.

జగన్‌కీ కట్టేశారు..

      గతంలో నిరసన తెలపడం అంటే నాయకుల దిష్టిబొమ్మలని తగలబెట్టడం వరకూ వుండేది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా అది బతికున్న నాయకులకు కూడా సమాధులు కట్టడం వరకూ వెళ్ళింది. మొన్నామధ్య సమైక్యాంధ్ర ఉద్యమకారులు సోనియాగాంధీ దిష్టిబొమ్మకి సమాధి కట్టారు. అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. నాయకులకు సమాధి కడితే లేనిపోని గొడవలవుతాయి కాబట్టి ఇక ఈ సమాధుల సంప్రదాయం కొనసాగదనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే సీమాంధ్రులు సమాధులు కట్టగా మేం మాత్రం కట్టలేమా అనుకున్నారేమో తెలంగాణ వాదులు కూడా సమాధి కట్టేశారు. అది కూడా వైకాపా నాయకుడు జగన్ ఫొటోకి! హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నందుకు నిరసనగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణలోనే జగన్ ఫొటోకి సమాధి కట్టారు. ఆ సమాధి మీద వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటం పెట్టి కర్మకాండలు కూడా చేశారు.

కోటని తవ్వి ఎముకలు పట్టారు!

      ఉత్తరప్రదేశ్‌లోని రాంబకష్ సింగ్ కోటలో గత ఐదు రోజులుగా పురావస్తు శాఖ అధికారుల పరిస్థితి కోటని తవ్వి ఎముకల్ని పట్టినట్టయింది. కోట భూమిలో టన్నులకొద్దీ బంగారం ఉందని శోభన్ సర్కార్ అనే స్వామీజీ చెప్పిన మాటలు నమ్మి తవ్వకాలు మొదలుపెట్టిన పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం తవ్వకాల్లో ఒక వంటగది, పొయ్యి, కొన్ని ఎముకలు బయటపడటంతో నోళ్ళు తెరిచారు. స్వామీజీ మాటలు నమ్మి కోటని తవ్విపోస్తున్నారేంటని హేతువాదులు విమర్శిస్తే, స్వామీజీ చెప్పారని కాదు.. అక్కడి భూమిలో నిధులున్నాయని తమ పరిశోధనల్లో బయటపడిందని అధికారులు మొదట్లో చెప్పారు. తాజాగా బుధవారం కొత్త స్టోరీ వినిపించారు. కోటలో తవ్వకాలు జరుపుతోంది నిధుల కోసం కాదట.. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో ఉపయోగించిన ఆయుధాల కోసమట. దేశంలోని ఏ  పురావస్తు పరిశోధనశాలలోనూ సిపాయిల తిరుగుబాటు కాలం నాటి ఆయుధాలు లేవట. ఆ లోటుని భర్తీ చేయడానికే ఈ తవ్వకాలు చేపట్టారట. వీళ్ళ తవ్వకాల్లో ఆయుధాలు దొరికితే  వాటిని ప్రదర్శనలో పెడతారట. వీళ్ళ మాటలు వింటుంటే జనం చెవిలో పూలు పెట్టడంలో పురావస్తు శాఖ అధికారులు శోభన్ సర్కార్ స్వామీజీని మించిపోయారని అనిపించడం లేదూ?!  అన్నట్టు ఇంత జరగడానికీ కారణమైన స్వామీజా శోభన్ సర్కార్‌తోపాటు ఆయన శిష్యుడి మీద కేసు నమోదైంది.

థాంక్యూ కేటీఆర్!

      తెరాస నాయకులు కేటీఆర్‌ గారికి సీమాంధ్ర ప్రజల మీద ప్రేమ పొంగి పొర్లుతోంది. అసలే వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న సీమాంధ్ర ప్రజలు ఘనత వహించిన కేటీఆర్ గారు తమ మీద కురిపిస్తున్న అపారమైన ప్రేమ ధాటికి మరింత ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. సీమాంధ్ర వాళ్ళని దొంగలు, దోపిడీదారులుగా, హైదరాబాద్ నుంచి తరిమికొట్టాల్సిన వాళ్ళుగా భావించే కేటీఆర్, సడన్‌గా సీమాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద తన సానుభూతిని వ్యక్తం చేశారు.     అదెలాగంటే, వై.ఎస్.జగన్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న సమైక్య సభని తిట్టిపోయడానికి కేటీఆర్ ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జగన్‌ని నోరారా తిట్టిన అనంతరం ‘‘ఒకవైపు సీమాంధ్ర ప్రజలు వర్షాలతో, వరదలతో బాధలు పడుతుంటే,  ఆ విషయాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్‌లో సమైక్య సభ ఎందుకు పెడుతున్నావ్?’’ అని లా పాయింట్ లాగారు. కేటీఆర్ ప్రశ్నని జగన్ పట్టించుకున్నారో లేదో గానీ, కరడుగట్టిన విభజనవాది నోటి వెంట తమ మీద సానుభూతి వాక్యాలు రావడం విని సీమాంధ్ర ప్రజలు పులకరించిపోతున్నారు. ఇది కలా నిజమా అని తమని తాము గిల్లుకుంటున్నారు. సీమాంధ్రుల బాధల్ని తలచుకుని బాధపడిపోతున్న కేటీఆర్‌కి మనసులోనే థ్యాంక్స్ చెబుతున్నారు. ఏపీఎన్జీవోలు సమ్మె చేసినప్పడు కూడా ఉద్యోగుల సమ్మె వల్ల సీమాంధ్ర ప్రజలు బాధలు పడుతున్నారని, అంచేత వెంటనే సమ్మె విరమించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు టెన్షన్ పడిపోయారు. సీమాంధ్ర ప్రజల మీద టీఆర్‌ఎస్ నాయకులకు ఎంత ప్రేమ.. ఎంత ప్రేమ!!

మాయల మరాఠీ పాలిటిక్స్!

      మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటోంది. కీలక సందర్భాల్లో ప్రాజెక్ట్ గేట్లు మూసేస్తూ తెలంగాణ రైతు కంట కన్నీరు వచ్చేలా చేస్తోంది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశాధినేత చంద్రబాబునాయుడు గతంలో భారీ ఉద్యమం నడిపారు. మహారాష్ట్ర సరిహద్దులకు వెళ్ళి ప్రాణాలకు తెగించి మరీ ఉద్యమించారు. చంద్రబాబు మీద ఆ కృతజ్ఞత తెలంగాణ రైతుల్లో వుంది.   త్వరలో మళ్ళీ తెలంగాణ రైతులకు బాబ్లీ ప్రాజెక్ట్ ద్వారా కష్టాలు రాబోతున్నాయి. ఈనెల 29న బాబ్లీ గేట్లను తానే స్వయంగా మూసివేస్తానని, తెలంగాణా రైతులు అడ్డుకున్నా ఆగేది లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఈ అజిత్ పవార్ ఎవరో కాదు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మరాఠా యోధుడు శరద్ పవార్‌కి స్వయానా సోదరుడి కొడుకు. ఒకపక్క ఎన్.సి.పి. నేత శరద్ పవర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వుంటారు. మరోపక్క ఆయన సోదరుడి కొడుకు, ఆయన పార్టీకే చెందిన అజిత్ పవార్ తెలంగాణ రైతుల కంట కన్నీరు తెప్పించడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఈ ద్వంద్వ వైఖరిని ఏమని పిలవాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ శరద్ పవార్ కపటప్రేమ చూపిస్తున్నారని అనుకోవాలా? మాయల మరాఠీ పాలిటిక్స్ ఇలాగే వుంటాయనుకుని ఊరుకోవాలా? ఈసారి బాబ్లీ కష్టాల నుంచి తెలంగాణ రైతులను ఘనత వహించిన విభజనవాదులు ఎలా కాపాడతారో వేచిచూడాలి.  

దరిద్రులం.. క్షమించు మహాత్మా!

      భారత జాతిపిత మహాత్మాగాంధీ బ్రిటీష్ వాళ్ళని ఇండియా నుంచి తరిమేశారు. బ్రిటీషోళ్ళు మహాత్ముడికి చెందిన వస్తువులని వేలంలో పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ రకంగా మహాత్ముడి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. భారత ప్రభుత్వం మాత్రం మహాత్ముడి వస్తువులను వేలంపాటల చెర నుంచి తప్పించలేనంత దరిద్రంలో కొట్టుమిట్టాడుతోంది.   గతంలో మహాత్ముడికి సంబంధించిన లేఖలు వేలానికి వచ్చాయి. ఎవరెవరో ఫారినోళ్ళు వాటిని వేలం పాటలో పాడుకుని వాటిని వ్యాపార వస్తువులుగా మార్చేశారు. భారత జాతి సంపదగా చెప్పుకోదగ్గ  ఆ లేఖలను ఇండియాకి తిరిగి తెప్పించడానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మరోసారి గాంధీజీ ఉపయోగించిన వస్తువులు లండన్‌లో వేలానికి పెట్టారు. నవంబర్ 5న ఈ వేలం జరగనుంది. ఎరవాడ జైలులో వున్న సమయంలో గాంధీజీ నూలు వడకడానికి ఉపయోగించిన చరఖాతోపాటు, గాంధీజీ ఉపయోగించిన మొత్తం 60 వస్తువులు ఈసారి వేలానికి పెట్టారు. గాంధీజీ చరఖా దాదాపు 60 లక్షలకు అమ్ముడయ్యే అవకాశం వుందని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు. ఈసారి వేలం వేసే వాటిలో గాంధీజికి సంబంధించిన ముఖ్యమైన నివేదికలు, పుస్తకాలు, ఫొటోలు కూడా ఉంటాయట. ఈసారి కూడా ప్రభుత్వం గాంధీజీకి సంబంధించిన ఈ వస్తువులను అవసరమైనంత డబ్బు ఖర్చుపెట్టి ఇండియాకి తెప్పిస్తుందన్న ఆశ కలగటం లేదు. తరతరాలుగా భారతీయులు అబ్బురంగా చూడాల్సిన గాంధీజీ జ్ఞాపక చిహ్నాలు ఇలా అంగడి వస్తువులుగా మారిపోవడం బాధాకరం. అందుకే... మహాత్ముడి జ్ఞాపకాల స్వాధీనం కోసం డబ్బు ఖర్చు పెట్టలేనంత దరిద్రంలో వున్న భారత ప్రభుత్వం తరఫున మహాత్ముడికి క్షమాపణలు!

దిగ్విజయ్ ఇంటికి గవర్నర్ వెళ్ళొచ్చా?

      రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి వివరించడానికి ఢిల్లీకి వెళ్ళిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యుపీఎ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు పలువురు కేంద్రమంత్రుల్ని, కీలక అధికారులను కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను పూస గుచ్చినట్టు వివరించారు. అంతవరకూ ఓకే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ని ఆయన ఇంటికి వెళ్ళి మరీ నరసింహన్ కలవటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమైంది.   దిగ్విజయ్‌సింగ్ ఇంటికి వెళ్ళిన సమయంలో గవర్నర్ చేతిలో అధికారిక అంశాలకు చెందిన ఫైల్ కూడా ఉందని తెలుస్తోంది. గవర్నర్ హోదాలో వున్న వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని ఇంటికి వెళ్ళి కలవటం, అది కూడా అధికార పర్యటనలో ఉన్నప్పడు కలవటం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దిగ్విజయ్‌సింగ్‌ని నరసింహన్ కలవటం పలు ఊహాగానాలకు కూడా తావిచ్చేలా వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో వున్న గవర్నర్ విమర్శలు తలెత్తే విధంగా వ్యవహరించడం కూడా మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే విభజన సమస్య అత్యంత సున్నితంగా మారిన పరిస్థితుల్లో గవర్నర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. ఏ ప్రాంతం వారిలోనూ ఎలాంటి అపోహలు, అనుమానాలు కలగకుండా వ్యవహరించాల్సి వుంటుంది. అన్నీ తెలిసిన వారు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తారు. ఇది కూడా అలాంటిదేనేమో!

ఇతనా ప్రధాని అవ్వాలనుకునేది?

      అమ్మ సోనియమ్మ కలలన్నీ ఫలించి, చేయాలనుకున్న అడ్డగోలు విభజన వర్కవుటై, ఈదేశాన్ని ఏ రాహు గ్రహమో వక్రంగా చూస్తే రాహుల్‌గాంధీ భారత ప్రధాని అయిపోవడం ఖాయం. జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, గుల్జారీలాల్ నందా, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి లాంటి మహామహులు అధిష్టించిన భారత ప్రధాని కుర్చీమీద రాహుల్ గాంధీ లాంటి అనుభవశూన్యుడు, వారసత్వం తప్ప మరే సత్వం లేని రాహుల్ గాంధీ కూర్చుంటే ప్రజలు ఆ పదవికి ఉన్న గత వైభవాన్ని తలచుకుని బాధపడటం తప్ప మరేం చేయగలరు?     పైన చెప్పిన మహానుభావులతో పోల్చుకుంటే  ఏ విషయంలో అయినా రాహుల్ గాంధీ సరితూగగలడా? సరి తూగకపోతే పోయాడు అడ్జస్ట్ అయిపోదామనుకుంటే అయ్యగారి బిహేవియర్, మాట్లాడే పద్ధతి ఏమైనా పద్ధతిగా ఉంటాయా? ప్రధానమంత్రి పదవికి పోటీపడే వ్యక్తి స్థాయిలో మచ్చుకైనా వుంటాయా? అర్హతని మించిన పదవీకాంక్ష, రాజ్యాంగేతర శక్తిలా ఉండే వ్యవహారశైలి, ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియనితనం.. ఈ లక్షణాల కలబోతగా ఉండే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా ఊహిస్తేనే ఏదోలా అనిపించదా? రాహుల్ గాంధీ తనను తాను ఒక్కసారి పరిశీలించుకుంటే, తానేంటి.. ఈ దేశానికి ప్రధాని అవ్వాలనుకోవడమేంటని అనిపించదా?

రాహుల్‌ని చంపే పనిలేనోడెవరు?

      పాపం రాహుల్‌గాంధీ తననుతాను ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకునే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టున్నాడు. అలాంటి వ్యాధేదో లేకపోతే తన నాయనమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్‌గాంధీ తరహాలోనే తనను చంపే కుట్ర జరుగుతోందని కామెడీ స్టేట్‌మెంట్ ఇవ్వడు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యల వెనుక చాలా హిస్టరీ వుంది. బలమైన కారణాలు, తీవ్రమైన ఉద్యమాలు ఉన్నాయి. మరి రాహుల్‌గాంధీ వెనుక ఏ హిస్టరీ వుంది? రాజీవ్, సోనియాగాంధీల కొడుకుగా పుట్టడం తప్ప రాహుల్ గాంధీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన ప్రాణాలకు తెగించి డీల్ చేసిన ఇష్యూలేంటి? ఎవరో కక్షకట్టి చంపాల్సినంత తీవ్రమైన సమస్యల్ని వేటిని రాహుల్ డీల్ చేశాడు? చంపాల్సినంత సీన్ లేని రాహుల్‌గాంధీని చంపడానికి ప్రయత్నించే పనిలేనోడు ఎవడుంటాడు? తన ప్రవర్తనతో రాహుల్ గాంధీ దేశంలో జనాన్ని చచ్చేలా నవ్వేలా చేస్తున్నాడు. ఇలాంటి కామెడీ కేరెక్టర్ రాహుల్ గాంధీని ఎవరైనా చంపుతారా? ఇండియాలో ప్రస్తుతానికి రాహుల్‌గాంధీని చంపాల్సిన అవసరం ఎవరికీ కనిపించడం లేదు. ఒకవేళ ఎక్కడో స్పెయిన్లో వున్న రాహుల్‌గాంధీ లవర్ వెరోనికా తాలూకు వాళ్ళెవరికైనా ఆ అవసరం ఉందేమో రాహులే ఆలోచించుకోవాలి. నాయనా రాహుల్ గాంధీ భారతీయులెవరూ నిన్ను చంపే అవకాశం లేదు. కాబట్టి ప్రశాంతంగా నిద్రపో. నోటికొచ్చిన స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా దేశాన్ని ప్రశాంతంగా వుంచు.

పళ్ళూడిపోయాకే పాలిటిక్సా?

      మెగా బ్రదర్స్ పవన్‌కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పుకార్లు రావడం, ఎలక్ట్రానిక్ మీడియా ఆ పుకార్లని పెంచి పోషించి వీళ్ళు పోటీ చేయబోయే నియోజకవర్గాలను కూడా డిసైడ్ చేయడం, చివరకు తాము తెలుగుదేశంలో చేరబోవడం లేదని నాగబాబు లేఖ రాయడంతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడిన విషయం తెలిసిందే. కాకపోతే టోటల్‌గా ఈ ఇష్యూలో బోలెడన్ని ధర్మసందేహాలు కలుగుతూ వున్నాయి.     ‘అత్తారింటికి దారేది’ సినిమాకి మైలేజ్ పెంచుకోవడానికే పవన్‌కళ్యాణ్ వర్గీయులే ఈ పుకార్లని షికార్లు చేయించారనేది ఒక డౌటు. సరే, ఆ డౌట్ సంగతి అలా ఉంచితే, పవన్‌కళ్యాణ్ ఏదైనా పార్టీలో చేరితో ఆ పార్టీకి లాభమో, నష్టమో జరుగుతుంది. అంతవరకు ఓకే. మధ్యలో ఈ నాగబాబు ఎవరంట? ఆయన రాజకీయాల్లోకి వచ్చినా, ఏ పార్టీలో చేరినా ఎవరికైనా ఒరిగేదేముందంట? రాజకీయ రంగంలో ఆయన్ని పట్టించుకునేదెవరంట? తాచుపాము బుసకొడితే దాన్నిచూసి వానపాము కూడా బుసకొట్టినట్టు నాగబాబు కూడా తన తమ్ముడితోపాటు తనకి కూడా పొలిటికల్ ప్రాధాన్యం ఆపాదించుకోవడమెందుకో?! పుకార్లన్నీ మెయిన్‌గా పవన్‌కళ్యాణ్‌ మీద వచ్చాయి. అలాంటప్పుడు తెలుగుదేశంలో చేరట్లేదు మొర్రో అని పవన్‌కళ్యాణ్ స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోయేది కదా..  ఇద్దరి తరఫున నాగబాబు ఇవ్వడమేంటి? పవన్‌కళ్యాణ్ తనమీద వస్తున్న పుకార్లని కూడా ఖండించలేనంత బిజీనా? రేపెప్పుడైనా పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిపోతే ఆయన వ్యవహారాలన్నీ నాగబాబే చూసుకుంటారా?  నాగబాబు మీడియాకి విడుదల చేసిన లేఖలో మరో కామెడీ కూడా వుంది. ప్రస్తుతం అన్నదమ్ములిద్దరూ తమ వృత్తిలో బిజీగా వున్నారన్న మాటని నాగబాబు ఉపయోగించాడు. అంటే అర్థం ఏమిటి? వృత్తిలో బిజీ అంతా అయిపోయాక, చేతిలో పనేమీ లేనప్పుడు, పళ్ళూడిపోయాక రాజకీయాల్లోకి వస్తామనా? రాజకీయాలంటే, పార్టీలంటే పనిలేనివాళ్ళ పునరావాస కేంద్రాలా? ఇలాంటి సవాలక్ష ధర్మ సందేహాలకు సమాధానాలు ఇచ్చేదెవరు?

అరుణమ్మ ప్లాను అదిరింది!

      2014లో వచ్చే ఎన్నికలలో రాహుల్‌గాంధీ చేత మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర మంత్రిణి, తెలంగాణ ఆడపడుచు డి.కె.అరుణ కంకణం కట్టుకుంది. దీనికోసం ఈమధ్య అరుణమ్మ గారు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కి వినతిపత్రం సమర్పించింది. అక్కడితో ఆగకుండా మరింత అడ్వాన్సయి రాహుల్‌బాబుని కలిసి మహబూబ్‌నగర్‌లో పోటీ చేసి తెలంగాణని ఉద్ధరించాలని వేడుకున్నట్టు తెలుస్తోంది.   తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తున్నట్టు ప్రకటించడంతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీమీద, సోనియాగాంధీ మీద ప్రేమ తెగ కారిపోతోందట. పాలమూరులో రాహుల్‌గాంధీ పోటీ చేస్తే ఓటర్లు ఎగబడి ఓట్లు వేస్తారట. భారీ మెజారిటీ ఇచ్చేస్తారట. ఇదీ అరుణమ్మగారు చెబుతున్న వెర్షన్. అరుణమ్మ గారు ఆహ్వానించగానే రాహుల్‌గాంధీ తన కుటుంబ నియోజకవర్గమైన అమేథీని వదిలిపెట్టి మహబూబ్‌నగర్ వస్తాడా? పొరపాటుగా కూడా రాడు. రాహుల్‌గాంధీ మరీ అంత బుర్రలో బురదున్నోడు కాడు. ఈ  విషయం డి.కె.అరుణకి కూడా తెలిసే ఉంటుంది. తెలిసినా రాహుల్‌గాంధీని పాలమూరుకి ఆహ్వానించడం వెనుక పెద్దప్లానే వుందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితో ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకుంటున్న వారి క్యూలో డీకే అరుణమ్మ కూడా వుంది. క్యూలో తన ముందు వున్న అందరినీ దాటుకుని వెళ్ళి తెలంగాణ సీఎం పీఠం ఎక్కాలంటే రాహుల్‌గాంధీ మీద తనకున్న విధేయతను ప్రకటించి ఆయనగారి దృష్టిలో పడాలి. అందులో భాగమే రాహుల్‌గాంధీకి అరుణగారి ఆహ్వాన పత్రమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ సీఎం కావడానికి వాళ్ళనీ వీళ్ళనీ కాకాపట్టడం కాకుండా కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు డైరెక్టుగా రాహుల్‌గాంధీనే టార్గెట్ చేసి అరుణమ్మ భలే ప్లాన్ వేసిందని అంటున్నారు.

అమ్మో సోనియమ్మ-కిరణేమో కీలుబొమ్మ

      రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నందుకు సోనియాగాంధీ పేరు చెబితేనే కంపరం పుట్టుకొస్తున్నా, ఆమె రాజకీయ చతురతకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేమని కొంతమంది సమైక్యవాదులు అంటున్నారు. ఇందిరాగాంధీతో సహా నెహ్రూ కుటుంబంలో ఎవరికీ లేని కొంపలు ముంచే రాజకీయ తెలివితేటలు సోనియాగాంధీకి మాత్రమే ఎలా ఒంటబట్టాయా అని అనుకుంటున్నారు. రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఎన్నో సందర్భాలలో సోనియా గాంధీ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించింది. ఎప్పటి విషయాలో, ఎక్కడి విషయాలో ఎందుకు? రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టిన విభజన చిచ్చునే చూడండి.   మహాతల్లి ఎంత చక్కగా అంటించిందో!  అత్త ఇందిరాగాంధీ కూడా చేతులెత్తేసిన తెలంగాణ ఇష్యూని పెంచి, పోషించించి. చివరకి ఆ సమస్యని తన పుత్రరత్నం ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడేలా చేసుకుంది. ఈ రేంజ్ రాజకీయాలు ప్రదర్శిస్తున్న ఇటాలియన్ సోనియాగాంధీని చూసి మనదేశ రాజకీయ నాయకులు పాఠాలు నేర్చుకోవాలి. తెలంగాణకి సోనియాగాంధీ ఓకే అంది కాబట్టి వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్, అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కే మెజారిటీ వస్తుంది. సీమాంధ్రలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మటాషేనని అమాయక ఇండియన్లు మొదట్లో అనుకున్నారు. ఆ తర్వాత సోనియమ్మ తన ఇటలీ పాలిటిక్స్ బయటపెట్టింది. జైల్లోనే శేషజీవితం గడిపేస్తాడేమోనని అందరూ అనుకున్న జగన్‌ని బయటకి తీసుకొచ్చింది. సమన్యాయం జగన్ని సమైక్యవాదం వైపు మళ్ళించి సీమాంధ్రలో జగన్నాటకానికి తెరతీసింది. దాంతో సీమాంధ్రలో జగన్‌కి వచ్చే ఓటు బ్యాంకుని, సీటు బ్యాంకుని తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేసింది. ఒకవేళ ఫ్యూచర్లో జగన్ తోకజాడిస్తే ఎలా అనుకుంది. సేఫ్ గేమ్ మొదలెట్టి సీఎం కిరణ్‌ని సమైక్యవాదిగా రంగంలోకి దించింది. సీఎం కిరణ్ సోనియమ్మ చెప్పినప్పుడల్లా సమైక్యవాదాన్ని వినిపిస్తూ సీమాంధ్ర ప్రజలకు చేరువైపోతున్నాడు. రేపోమాపో సీమాంధ్రలో పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ కొత్తపార్టీ స్కీమ్ కూడా సోనియాగాంధీదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మలా మారిన కిరణ్‌కుమార్‌రెడ్డిని చూసి జాలిపడుతున్నారు. మొత్తమ్మీద రాజకీయ కీకారణ్యంలో సోనియాగాంధీ పెద్ద హంటర్.  ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టేసింది. అటు తెలంగాణలో పెద్దపిట్ట కేసీఆర్‌ని గ్రిప్‌లో వున్నాడు. ఇక సీమాంధ్రలో పోటీపడే కిరణ్, జగన్ ఇద్దరూ కాంగ్రెస్ గూటి పిట్టలే. వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే పక్షంలో రెండు రాష్ట్రాల్లోనూ తనదే హవా.. ఇదీ సోనియమ్మ వేసిన ప్లాన్. అంతా బాగానే వుందిగానీ, సోనియాగాంధీ అసలు స్వరూపాన్ని తెలుగు ప్రజలు కనిపెట్టేశారు. ఇక తెలుగోళ్ళ దగ్గర సోనియాగాంధీ తప్పులు ఉడకవ్!

రాకోయీ... అనుకున్న అతిథీ!!

      ఏదైనా సంస్థ నిర్వహించే కార్యక్రమానికి ఆ రాష్ట్ర గవర్నర్ వస్తే ఆ సంస్థకి ఎంత గౌరవం? అయితే రాష్ట్ర గవర్నర్ వస్తానన్నా రావొద్దనే సంస్థ ఉంటుందా? ఉంటుంది.. గవర్నర్ని రావొద్దన్న ఆ సంస్థ పేరు డెలోయిట్. రాకోయీ... అనుకున్న అతిథీ అనిపించుకున్న ఆ గవర్నర్ మరెవరో కాదు.. మన రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్.   అసలింతకీ జరిగిందేంటంటే, మల్టీనేషన్ కంపెనీ డెలోయిట్ హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్‌లో తమ సంస్థకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు రాజ్‌భవన్‌కి వెళ్ళ గవర్నర్ని తమ కార్యక్రమానికి ఆహ్వానించారు. నరసింహన్ గారు పెద్దమనసు చేసుకుని సరే వస్తానన్నారు. డెలోయిట్ సంస్థ ప్రతినిథులు సంతోషంగా వెళ్ళిపోయారు. యథాప్రకారం గవర్నర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారని ఇన్విటేషన్లలో కూడా వేసేశారు. ఆ తర్వాత షరామామూలుగానే రాజ్‌భవన్ అధికారులు గవర్నర్ గారు పాల్గొనే ఫంక్షన్లో  ఏమేం జరగాలో, ఏమేం జరక్కూడదో తెలిపే ప్రొటోకాల్ షీట్ డెలోయిట్ ప్రతినిధులకు ఇచ్చారు.  గవర్నర్ పాల్గొనే కార్యక్రమంలో రెండుసార్లు జాతీయ గీతాన్ని వినిపించడం అనేది ప్రొటోకాల్. గవర్నర్ గారు సదరు కార్యక్రమంలో 45 నిమిషాలు మాత్రమే  ఉంటారని, గవర్నర్ గారు వచ్చేసరికి అప్పుడు జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఆపేయాలని, ఆయన రాగానే ఒకసారి, వెళ్ళబోయేముందు ఒకసారి.. మొత్తం రెండుసార్లు జాతీయ గీతాన్ని వినిపించాలని ప్రొటోకాల్ అధికారులు చెప్పారు. అయితే తమ కార్యక్రమంలో జాతీయగీతాన్ని ఒకసారి మాత్రమే వినిపిస్తామని, రెండోసారి మాత్రం తమవల్ల కాదని డెలోయిట్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చే తమ గెస్ట్‌లకి ఈ తతంగమంతా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అన్నారు. అయితే గవర్నర్ ప్రొటోకాల్ అధికారులు మాత్రం జాతీయ గీతాన్ని రెండుసార్లు వినిపించాల్సిందేనని పట్టుపట్టారు. దాంతో మా సంస్థ కార్యక్రమాన్ని గవర్నర్ గారు లేకుండానే జరుపుకుంటామని, గవర్నర్ గారు రావాల్సిన అవసరం లేదని డెలోయిట్ ప్రతినిధులు చెప్పేశారు. అలాగే జరిపేశారు. ఈ ధోరణి చూసి రాజ్‌భవన్ అధికారులు అవాక్కయిపోయారు. అయినా గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని.. విదేశీ సంస్థలకి మన జాతీయగీతం విలువ, గవర్నర్ పదవికి వున్న గౌరవం ఏం తెలుస్తుందనీ?! అసలు రహస్యం ఏమిటంటే,  డెలోయిట్ సంస్థ బ్రిటీషోళ్ళది. వాళ్ళకి మన జాతీయగీతమంటే సహజంగానే నచ్చదు. అంతేగా?!

హైదరాబాద్ యు.టి. కన్ఫర్మా?

      అడ్డగోలుగా తెలంగాణ ఇచ్చేసి యువరాజు రాహుల్ని దొడ్డిదారిలో అయినా పీఎం చేయాలని ప్లాన్ వేసిన కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున లేచిన నిరసన జ్వాలల ధాటికి డీలాపడినట్టే అనిపిస్తోంది. పైకి విభజన మీద వెనక్కి తగ్గేది లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, సీమాంధ్రులను మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే వుంది.   తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల మాటతీరు చూస్తుంటే హైదరాబాద్‌ని శాశ్వత యు.టి. చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తాజాగా హైదరాబాద్‌ని యు.టి. చేయడమే అన్ని సమస్యలకి పరిష్కారం అని  కేంద్రమంత్రి జేడీ శీలం చేసిన వ్యాఖ్యలు ఏవో ఆషామాషీగా చేసినవి కావని అంటున్నారు. జేడీ శీలం నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తికాదు. గతంలో ఉండవల్లి, లగడపాటి లాంటి సీమాంధ్ర  కాంగ్రెస్ నాయకులంతా తెలంగాణ రాదని కుండ బద్దలు కొట్టిన కాలంలో కూడా జేడీ శీలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం ఖాయమని నిర్మొహమాటంగా చెప్పారు.  ఇంకా చాలా సందర్భాలలో  శీలం చెప్పిన మాటలు శీలంతో కూడుకునే వున్నాయి. చాలామంది సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల మాదిరిగా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పే అలవాటు లేని  జేడీ శీలం యు.టి.యే అన్ని సమస్యలకు పరిష్కారం అని అన్నారంటే నిప్పు లేకుండా పొగ రాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఐఎఎస్ ఆఫీసర్ అయిన జేడీ శీలం సోనియాగాంధీకి వీర విధేయుడిగా వుంటూ, కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. అలాంటి వ్యక్తి నోటి వెంట వచ్చిన మాటని ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినా లైట్‌గా తీసుకునే దిగ్విజయ్‌సింగ్ కూడా జేడీ శీలం నోటివెంట యు.టి. అనే మాట రాగానే ఢిల్లీలో ఉన్నవాడు ఉలిక్కిపడి కవర్ చేయడానికి ఏదేదో మాట్లాడాడు. యు.టి. చేస్తున్నామని నేనెవరితోనూ అనలేదు అన్నాడు. డిగ్గీ అన్నాడని ఎవరన్నారంట? డిగ్గీరాజా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న సామెతని రుజువు చేసేట్టు మాట్లాడాడంటే  హైదరాబాద్‌ని యు.టి. చేయడం ఖాయమనే అనిపిస్తోంది.

కరెక్ట్ మొగుడు అశోక్‌బాబు!

      రాష్ట్రాన్ని విభజించడానికి కారణమైన సీమాంధ్ర, తెలంగాణ రాజకీయ నాయకులకు కరెక్ట్ మొగుడు ఎవరయ్యా అని అడిగితే.. ఇంకెవరయ్యా.. ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబే అనొచ్చు. రెండు నెలలపాటు సక్సెస్‌ఫుల్‌గా సీమాంధ్ర ఉద్యోగుల చేత సమ్మె చేయించి, అటు విభజనవాదులతోపాటు ఇటు గోడమీద పిల్లివాటాన్ని ప్రదర్శిస్తున్న సీమాంధ్ర రాజకీయ నాయకులు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచేలా చేశారు.   సమ్మెలు, నిరసనలు ఇలా చాలా ప్రశాంతంగా కూడా చేయవచ్చని నిరూపించిన అశోక్‌బాబు అలనాటి సత్యాగ్రహాన్ని గుర్తుకు తెచ్చారు. ఉద్యమం శాంతియుతంగా ఎలా చేయాలో తెలంగాణవాదులు కూడా చూసి నేర్చుకునేలా చేసిన క్రెడిట్ మొత్తం అశోక్‌బాబుది, ఆయన వెనుక ఉన్న ఉద్యోగులదే. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా ఉద్యమం చేస్తున్నాడన్న అక్కసుతో తెలంగాణవాదులు ఆయన్ని ఉద్దేశించి ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా, మనకి దక్కని క్రెడిట్ అశోక్‌బాబుకి దక్కేస్తోందని కొందరు సీమాంధ్ర నాయకులు ఎంత విషం కక్కినా నిండుకుండలా తొణక్కుండా వున్న  అశోక్‌బాబు అసలు సిసలు స్థితప్రజ్ఞతని ప్రదర్శించారు. ఉద్యోగుల సమ్మె విరమణను కూడా వ్యూహాత్మకంగా చేసిన అశోక్‌బాబుని ఎక్కడ నెగ్గాలో అనేది మాత్రమే కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి అని అంటున్నారు. ఏది మాట్లాడినా ఆచి, తూచి ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడే అశోక్‌బాబుని చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది చాలా వుందని విశేషకులు అంటున్నారు. ఎవరు తనను రెచ్చగొట్టేట్టు మాట్లాడినా ఎంతమాత్రం రెచ్చిపోకుండా సంస్కారబద్ధమైన లాంగ్వేజ్‌తో వాతలు పెడుతున్న అశోక్‌బాబుకి అటు సీమాంధ్ర ప్రజల్లో మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల్లో కూడా అభిమానులు పెరుగుతున్నారు. ఈ మహానుభావుడు తెలంగాణ ప్రకటించిన తర్వాత కాకుండా కాస్తంత ముందుగా రంగంలోకి దిగి వుంటే విభజన సీను ఇంత దూరం వచ్చేదేకాదు. ఏది ఏమైనా సీమాంధ్రలో మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రంలో అశోక్‌బాబు మీద ప్రజల్లో ఎంతో గౌరవం వుంది. ఈ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద వుంది. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ పంచనో చేరకుండా, ఏ రాజకీయ నాయకుడి మోచేతి నీళ్ళో తాగకుండా ప్రజల పక్షాల నిలబడితే రాష్ట్ర చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.