పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన రివర్స్ టెండరింగ్ రివర్స్ అవనుందా..?

పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం తల పెట్టిన టెండర్లు రివర్స్ కొట్టే అవకాశముందని జల వనరుల నిపుణులు అంటున్నారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు హెడ్ వర్క్స్ లోని మిగిలిన కాంక్రీటు పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఒక ప్యాకేజి కింద 4987.55 కోట్లతో పిలిచిన రివర్స్ టెండర్లకు ఒకటే టెండరు రావడం దీనికి తార్కాణం అని చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టు లోని అరవై ఐదు ప్యాకేజీ పనులకు పిలిచిన రివర్స్ టెండర్లను ఆరు సంస్థలు పాల్గొని బిడ్ లు దాఖలు చేయటం, 15.6 శాతం తక్కువకు టెండర్ వేయటంతో రివర్స్ టెండరింగ్ విజయవంతమైందని మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటనలు గుప్పించారు. దేశంలోనే తొలి సారిగా ఈ విధానానికి వెళ్లే యాభై ఎనిమిది కోట్లు ఆదా చేస్తామన్నారు. కానీ ఆ సంతోషం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆవిరైంది. పోలవరంలో రెండు పనులకు కలిపి పిలిచిన రివర్స్ టెండర్లలో ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా లిమిటెడ్ ఒకటే బిడ్ వేసింది. జలవనరుల శాఖ ఇచ్చిన జీవో 67 ప్రకారం రివర్స్ టెండరింగ్ లో కనీసం రెండు సంస్థలైనా పాల్గొనాలి, కాని ఒక్క సంస్థే టెండర్ వేయడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పోలవరం కాంక్రీట్, జల విద్యుత్ కేంద్రం పటంలో ఒకే ప్యాకేజీగా గత నెల పదిహేడవ తేదిన రివర్స్ టెండర్ విధానంలో జల వనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. దానికి ముందు రోజే రివర్స్ టెండరింగ్ లో అనుసరించాల్సిన మార్గ దర్శకాలను వివరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ జీవో 67 జారీ చేశారు, ఇప్పుడు ఆ మార్గదర్శకాలే ప్రతిబంధకంగా మారాయి. ఈ ఉత్తర్వును గత ప్రభుత్వం విడుదల చేసుంటే అందులోని లోపాలు సరిచేసేందుకే రివర్స్ బిడ్డింగ్ లో ముందుకు వెళుతున్నామని జగన్ సర్కార్ చెప్పేది. కానీ, గత నెల పదహారున తానిచ్చిన ఉత్తర్వు తాజాగా ప్రధాన సమస్యగా మారింది. అందులో పేర్కొన్న ప్రకారం రివర్స్ టెండర్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా రెండు సంస్థలైనా బిడ్ లు దాఖలు చేయాలి అలాగైతేనే ఒక సంస్థ ఎల్ వన్ గా నిలిస్తే మరో సంస్థతో సంప్రదింపులకు వీలుంటుందని ఉత్తర్వు స్పష్టం చేస్తోంది. పోనీ దీన్ని రివర్స్ టెండర్ అని కాకుండా రీటెండర్ గా భావిద్దాం అన్న నిబంధనలు అంగీకరించవని నిపుణులు కూడా చెబుతున్నారు. జల విద్యుత్ కేంద్ర పనుల నుంచి తమను తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ నవయుగ సంస్థ హైకోర్టులో గతంలోనే వ్యాజ్యం వేసింది. ఏపీజెన్కో తీసుకున్న ప్రీ క్లోజరు నిర్ణయంపై కోర్టు స్టే విధించింది. స్టేను ఎత్తి వేయాలని జెన్ కో వేసిన పిటిషన్ పై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. మరోవైపు సోమవారం ఉదయం పదకొండు గంటలకు రివర్స్ టెండర్ లో ఫైనాన్షియల్ బిడ్ ను జల వనరుల శాఖ తెరవనుంది.

ఉత్తమ్ కంచుకోటలో ఈసారి గులాబీ జెండా ఎగురుతుందా? కేసీఆర్ వ్యూహం అదేనా?

  పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కంచుకోట హుజుర్ నగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎలాగైనా ఉత్తమ్ కు చెక్ పెట్టాలని గులాబీ బాస్ తీవ్రంగా ప్రయత్నించినా, టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. 2009నుంచి హూజుర్ నగర్ నుంచి చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. 2009లో ప్రస్తుత మంత్రి జగదీశ్ రెడ్డి... టీఆర్ఎస్ నుంచి పోటీకి దిగి ఓటమిపాలయ్యారు. ఇక 2014లో అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇచ్చినా, ఆమె కూడా ఉత్తమ్ పై గెలవలేకపోయింది. దాంతో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డిని బరిలోకి దింపారు. అయితే, సైదిరెడ్డి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, చివరికి ఉత్తమ్ చేతిలో పరాజయం పాలవ్వక తప్పలేదు. వరుసగా మూడోసారి టీఆర్ఎస్ కు భంగపాటు కలిగినా, సైదిరెడ్డి... గట్టిపోటీనివ్వడంతో... మళ్లీ అతనికే టికెట్ ఇచ్చి, బరిలోకి దింపింది గులాబీ పార్టీ. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఆలస్యంగా అభ్యర్ధిని ప్రకటించడంతోనే నష్టం జరిగిందని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం.... ఈసారి ముందుజాగ్రత్తపడింది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధిని ప్రకటించి కదనరంగంలోకి దింపింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ మొత్తం దాదాపు క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ.... రెండు నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నల్గొండ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి... నల్గొండ బరిలో నిలిచి సూపర్ విక్టరీ కొట్టారు. అయితే, నల్గొండ ఎంపీ సీటును కోల్పోయి పరాభవంలో ఉన్న టీఆర్ఎస్.... ఎలాగైనాసరే హుజుర్ నగర్ ఉపఎన్నికలో గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది. అందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను... గ్రామ-మండల ఇన్ ఛార్జులుగా నియమించి విజయానికి వ్యూహం పన్నింది. అయితే, ఈసారి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి బరిలో దిగుతుండగా, బీజేపీ నుంచి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీ కూడా తన అభ్యర్ధిని పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఎంతమంది పోటీలో ఉన్నా, ఈసారి మాత్రం హుజూర్ నగర్ లో ఎగిరేది గులాబీ జెండానే అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. దాంతో, హుజూర్ నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది.

కాంగ్రెస్ తో కష్టం.. బీజేపీలోకి రేవంత్ రెడ్డి!!

  పరిస్థితిని బట్టి పద్దతి మార్చుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. అబ్బే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మా తీరు మార్చుకునేది లేదని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014 ఎన్నికల్లో దూసుకెళ్తుంది అనుకుంటే టీఆర్ఎస్ దూకుడు ముందు కాంగ్రెస్ నిలబడలేకపోయింది. పోనీ 2018 ఎన్నికల్లో అయినా మిగతా పార్టీల మద్దతుతో సత్తా చాటుతుంది అనుకుంటే.. మహాకూటమి రూపంలో మునిగిపోయింది. దానికి తోడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా దాదాపు పార్టీని వీడారు. మొత్తానికి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఇలాంటి సమయంలో నేతలంతా కలిసి పార్టీని పుంజుకునేలా చేయాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ.. పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ నేతల పోరు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిలా మారింది. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు కొత్తేమి కాదు. దశాబ్దాలుగా ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ కుర్చీ కోసం వర్గ పోరు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఉత్తమ్ ని పీసీసీ చీఫ్ గా తప్పించి.. తమకి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేసారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఉత్తమ్ ని వ్యతిరేకిస్తూ బహిరంగంగానే విమర్శలు చేసారు. కోమటిరెడ్డి మాత్రమే కాదు.. పలువురు సీనియర్లు పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ని వ్యతిరేకించారు. పీసీసీ కుర్చీపై కన్నేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆ సీనియర్ నేతలంతా కలిసిపోయారు. వారి కలయికకు కారణం రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. రేవంత్ కి టీడీపీలో ఉన్న సమయంలోనే మాస్ లీడర్ గా మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో చేరాక కూడా ఆ క్రేజ్ అలాగే కొనసాగింది. అయితే రేవంత్ తో ఇన్నాళ్లు సీనియర్లకు అంతగా ప్రాబ్లమ్ రాలేదు. కానీ ఇటీవల రేవంత్.. కుటుంబ సమేతంగా వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. దీంతో పీసీసీ చీఫ్ గా త్వరలోనే రేవంత్ బాధ్యతలు చేపట్టనున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దాంతోపాటే సీనియర్ నేతల్లో గుబులు మొదలైంది. ఇన్నాళ్లు మనలో మనం పోటీ పడ్డాం, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ కి ఇస్తానంటే ఎలా ఊరుకుంటాం అనుకున్నారేమో.. అందరూ ఏకమయ్యారు. రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే రేవంత్ తన వ్యాఖ్యలతో సీనియర్లకు అవకాశం ఇస్తున్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి, యురేనియం అంశాలలో.. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో సీనియర్లంతా ఏకమై రేవంత్ ని కార్నర్ చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి, విహెచ్, సంపత్ వంటి వారు పీసీసీ చీఫ్ గా తామే కరెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఓ రకంగా రేవంత్ పేరుకి కాంగ్రెస్ లో ఉన్నా ఒంటరిగానే ఉన్నారని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీనియర్లంతా ఏకమవ్వడం, రేవంత్ ఒంటరవ్వడంతో అధిష్టానం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక్కడి కోసం అందర్నీ వదులుకోలేదు, అలా అని రేవంత్ ని కూడా వదులుకోవడానికి ఇష్టపడకపోవొచ్చు. మరి అధిష్టానం అందరికి సర్ది చెప్పి గొడవ సద్దు మణిగేలా చేస్తుందో లేక ఇలాగే మౌనంగా ఉండి పార్టీకి నష్టం చేసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా పరిస్థితి ఇలాగే కొనసాగితే రేవంత్ బీజేపీ వైపు చూసే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా బీజేపీ తెలంగాణలో బలపడే దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ లాంటి నేతను కళ్ళకద్దుకొని తీసుకునే అవకాశం ఉంది. మరి రేవంత్ కాంగ్రెస్ లో వర్గ పోరు పడలేక బీజేపీలోకి చేరి తన సత్తా చూపుతారేమో చూడాలి.

కోడెలను కాపాడుకోలేకపోయిన టీడీపీ.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

  భవనం నిర్మించాలంటే నెలల సమయం పడుతుంది. కానీ కూల్చివేయాలంటే నిమిషాలు చాలు. అలాగే మనిషి మంచి పేరు సంపాదించాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ ఆ పేరు పోవాలంటే కొన్ని క్షణాలు చాలు. తెలిసో తెలియకో కోడెల శివ ప్రసాద్ విషయంలో కూడా అలాగే జరిగింది. వైద్యుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో ఏళ్లు సేవ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. కొంతకాలంగా ఆరోపణలు, అవమానాలు చుట్టుముట్టడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకొని మరణించారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, టీడీపీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో.. కోడెలకు కష్టాలు మొదలయ్యాయి. అధికార పార్టీ వైసీపీ కోడెలను బాగా టార్గెట్ చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నీచర్ అంశాన్ని బాగా హైలైట్ చేసి కోడెల ప్రతిష్టను మసకబారేలా చేసింది. నిజంగా తప్పు చేసుంటే ఎంతవారినైనా శిక్షించాల్సిందే. కానీ కోడెల చేయని తప్పుకి ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పక తప్పదు. ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ లో ఉండి, పదవీకాలం ముగిసి ఖాళీ చేసేటప్పుడు.. ఫర్నీచర్ అప్పజెప్పడం, పాడైన వాటికి ఖరీదు చెల్లించడం ఆనాయితీ. అసలు సరిగా అప్పజెప్పకపోవడం కూడా ఆనాయితీనే. అంతెందుకు కొత్త మంత్రులు, గవర్నర్లు, కొత్త సీఎంలు వచ్జ్చినప్పుడు కొత్త ఫర్నీచర్, ఇతర సామాగ్రి కొనడం.. పాతవి పక్కనెయ్యడం లేదా సిబ్బంది ఇళ్ళకు తరలిపోవడం కూడా ఆనవాయితీనే. కానీ కోడెల విషయంలో ఈ ఆనవాయితేనే అవినీతి అన్నారు. అసెంబ్లీ, స్పీకర్ కార్యాలయం హైద్రాబాద్ నుండి అమరావతికి వచ్చినప్పుడు.. కొత్త భవనాలు ఫర్నీచర్ తో సహా అమర్చి ఇవ్వడంతో.. పాత ఫర్నీచర్ ను ఆయన తన క్యాంప్ ఆఫీసుల్లో అధికారులకు చెప్పి ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి అదేం కోట్ల విలువైన సొత్తు కాదు. రెండు మూడు లక్షల విలువైన పాత ఫర్నీచర్ మాత్రమే. అది కూడా కోడెల అప్పనంగా కొట్టేయాలి అనుకోలేదు. ఎందరో నాయకులు కోట్లు దోచుకున్నారు. కానీ కోడెల మాత్రం.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఫర్నీచర్ తీసుకెళ్లండని బాధ్యతగా లేఖ రాసారు. కొత్త స్పీకర్ జూన్ 12 లేదా 13 న ఛార్జ్ తీసుకొని ఉండొచ్చు. కానీ జూన్ 7 నే కోడెల పాత సామాగ్రి అప్పగిస్తాను లేదా వెల కట్టండి డబ్బులు చెల్లిస్తాను అని లేఖ రాసారు. కానీ అధికారుల నుంచి సమాధానం లేదు. దీంతో కోడెల మళ్ళీ ఆగస్ట్ 20 న మొదటి లేఖను ప్రస్తావిస్తూ మరో లేఖ రాసారు. అయినా సమాధానం లేదు. నిజానికి ఆ లేఖలకు స్పందించి ఫర్నీచర్ ని పట్టుకొని పోవచ్చు. కానీ ఉద్దేశ్య పూర్వకంగా రాద్దాంతం చేసి, కక్ష సాధింపు తరహాలో ఆగష్టు 24న కేసులు పెట్టి ఆయన్ని అవమానించారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, విజయసాయి రెడ్డి వంటి వారు కోడెలపై దొంగ అనే ముద్ర వేశారు. విజయ సాయి రెడ్డి అయితే కోడెల దూడలు అంటూ వెటకారాలు చేస్తూ ట్విట్టర్ వేదికగా పదేపదే విమర్శలు గుప్పించారు. ఇలాంటి విమర్శలు కోడెలను బాగా కృంగదీశాయి. అసలు నా తప్పులేదు, నేను ముందే లేఖలు రాసాను.. కక్ష సాధింపుతో నా మీద నిందలు వేస్తున్నారని.. కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అవివివేకం కానీ.. ఈ సోషల్ మీడియాలో యుగంలో ఆయన ఆవేదన ఎవరికి పడుతుంది?. 'ఫర్నీచర్ కోసం కోడెల కక్కుర్తి' అంటూ అటు మీడియా, సోషల్ మీడియాలో పదేపదే వార్తలు రావడంతో.. దానిలోని నిజానిజాలు తెలుసుకోకుండా అందరూ ఆయన మీద విమర్శలు గుప్పించారు. వీటిని కోడెల డిఫెండ్ చేసుకోలేకపోయారు. మరోవైపు పార్టీ నుండి కూడా ఆయనకు మద్దతు కరువైంది. ఆయనకు మద్దతిస్తే ఎక్కడ తమ మీద విమర్శలు వస్తాయనుకున్నారో ఏమో.. టీడీపీ నేతలు ఎవరూ మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోడెలకు మద్దతుగా మాట్లాడలేదు. ఒకవైపు అధికార పార్టీ నేతల విమర్శలు, వేధింపులు ఎక్కువవ్వడం.. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు కరువవ్వడంతో కోడెల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. తరువాత టీడీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వం మీద ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన మరణించారని టీడీపీ నేతలు జగన్ సర్కార్ మీద మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న కేసులు అడ్డుపెట్టుకొని కోడెలను తీవ్రంగా వేధించారని మండిపడ్డారు. ఇలాంటి మద్దతే కోడెల కోరుకున్నారు. కానీ పాపం ఆయన మరణించాక లభించింది. ఏమీలేని అంశంలో ఆయనను అంతలా ఇబ్బంది పెడుతుంటే.. ఒక్కడే ఎలా ఎదుర్కోవాలో తెలియక కోడెల మరణానికి తలవంచారు. కోడెల విషయంలో టీడీపీ నేతలు చేసిన తప్పు.. మిగతా నేతల విషయంలో చేయవద్దని కార్యకర్తలు కోరుకుంటున్నారు. మిగతా నాయకులు కూడా ఇలా వేధింపులకు గురైతే.. ముందే వారికి అండగా నిలబడి, వారికి రక్షించుకోవాలని సూచిస్తున్నారు. మరి టీడీపీ నాయకులు, అధినాయకత్వం.. కోడెలలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే వారికి అండగా ఉండి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. అంతేకాదు.. కోడెల మరణంతో టీడీపీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైసీపీ మీద విరుచుకుపడింది. కేంద్రానికి, గవర్నర్ కి ఫిర్యాదు చేసింది. సీబీఐ ఎంక్వయిరీ కోరుతోంది. మరి ఈ పోరాటం టీడీపీ ఇలానే కొనసాగిస్తుందా?. అసలు కోడెల విషయంలో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందో చూడాలి. మొత్తానికి ఎలాంటి స్టెప్ తీసుకున్నా.. కార్యకర్తలు మాత్రం వేధింపులకు గురవుతున్న నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్టానం మీదే ఉందని అంటున్నారు.

టీటీడీ బోర్డులో ఎస్సీ ఎస్టీల కోటా ఎక్కడ? జగన్ వి ఉత్తి మాటలేనా?

  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై వివాదం రాజుకుంటోంది. సుమారు వందేళ్ల టీటీడీ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా 29మందితో జంబో బోర్డును నియమించిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 29మందికి అదనంగా మరో ఏడుగురికి టీటీడీ బోర్డులో చోటు కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఇప్పటికే టీటీడీ బోర్డులో సభ్యులు ఎక్కువయ్యారని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారంటూ విమర్శలు చెలరేగుతుండగా, ఇఫ్పుడు అదనంగా మరో ఏడుగురికి చోటు కల్పించడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మండిపడుతున్నారు. 29మందితో జంబో బోర్డు ఏర్పాటుచేసిన జగన్ ప్రభుత్వం.... తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి, రాకేష్‌సింహా, శేఖర్‌, కుపేందర్‌రెడ్డి, గోవింద హరి, దుష్మంత్ కుమార్‌, అమోల్ కాలేను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటిస్తూ జీవో ఇచ్చింది. మిగతా సభ్యుల్లాగే వీళ్లకూ టీటీడీ ప్రోటోకాల్ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి చోటు కల్పించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డి నివాసం నుంచి వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెనుసంచలనమైంది. అప్పుడు శేఖర్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉండటంతో అప్పటి ప్రభుత్వం అతడిని బోర్డు నుంచి తొలగించింది. అంతేకాదు శేఖర్ రెడ్డిని తొలగించాలంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా డిమాండ్ చేసింది. అయితే, అదే శేఖర్ రెడ్డికి ఇఫ్పుడు టీటీడీ బోర్డులో వైసీపీ సర్కార్ చోటు కల్పించడం ఆశ్చర్యంగా మారింది. ఇక, టీటీడీలో మితిమీరిన రాజకీయ జోక్యం పెరుగుతోందన్న విమర్శలు రేగుతున్నాయి. అసలే 29మందితో జంబో టీమ్ ప్రకటించిన జగన్ ప్రభుత్వం.... అది చాలదన్నట్లు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో బోర్డులో మరికొందరికి చోటు కల్పించడంపై భక్తుల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈసారి ప్రకటించిన పాలక మండలిలో రాష్ట్రేతరులకే పెద్ద పీట వేశారు. అలాగే అన్ని దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న జగన్.... తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

ఆత్మహత్యకు ఒక్కరోజు ముందు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టుంటే కోడెల బతికేవారా? 

  కోడెల గురించి తెలిసినవాళ్లు... ఆయనది చాలా సున్నిత మనస్తత్వం అంటారు. రూపాయి డాక్టర్ గా పేదల ప్రజలకు సేవలందించిన కోడెల ...రాజకీయాల్లోకి వచ్చాకే రాటుదేలారని చెబుతారు. స్వయంగా ఎన్టీఆర్ కోరడంతో చిన్న వయసులోనే రాజకీయాల్లో వచ్చిన కోడెల... అప్పటికే పల్నాడులో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోన్న కాసు కుటుంబానికి ఎదురెళ్లి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. అయితే, 1983లో కోడెల ఎమ్మెల్యేగా గెలిచాక, కాసు కుటుంబం దాడికి ప్రయత్నించింది. దాంతో కోడెలకు ప్రజలే అండగా నిలబడ్డారు. కోడెలను వాటర్ ట్యాంక్ లో పెట్టి, ఆయనకు రక్షణగా నిలిచారు. ఆ సంఘటనే కోడెలలో పట్టుదల రగిల్చింది. దాంతో ప్రజల అండదండలతో పల్నాడులో పట్టుసాధించిన కోడెల... తర్వాతి కాలంలో రాజకీయంగా రాటుదేలారు. కాసు కుటుంబం అరాచకాలకు ఎదురెళ్లి ప్రజలకు రక్షణగా నిలబడ్డారు. ఆ తెగువే కోడెలను అతికొద్దికాలంలోనే ప్రజానాయకుడిగా చేసింది. దాంతో ఒక్క పల్నాడులోనే కాదు... మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కోడెల పేరు మోరుమోగిపోయింది. తన వ్యక్తిత్వంతో తలదించని నేతగా ఎదిగారు. పల్నాడు పులిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశంలో ఫైర్‌బ్రాండ్‌గా మారారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు ఆయన గురించి తెలిసినవాళ్లు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిగా పనిచేసిన కోడెలకు రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, కేసుల గురించి తెలియకుండా ఉండదు. రాజకీయాల్లో ఇది సహజమే అయినా, జగన్ ప్రభుత్వం మాత్రం... ఎన్నో అడుగులు ముందుకేసి కోడెలకు ఊపిరిసలపనీయకుండా చేసింది. కేసు మీద కేసు పెడుతూ, 3నెలల కాలంలోనే కుటుంబం మొత్తంపై దాదాపు 30 కేసులను పెట్టించి వేధించింది. దాంతో కోడెల కుమిలిపోయారు. మానసికంగా కుంగిపోయారు. 70ఏళ్ల పైబడిన వయసులో ధైర్యం సడలింది. మానసిక-ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఆ సమయంలో పార్టీ అండ కోసం కోడెల ఎదురుచూశారు. కానీ అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగాల నేపథ్యంలో... కోడెలకు అండగా నిలిచేందుకు చంద్రబాబు వెనుకంజ వేశారు. కోడెలపై ఎంతో అభిమానమున్నా, అత్యంత సన్నిహితుడైనా, వెనకేసుకొస్తే ఎక్కడ పార్టీకి చెడ్డపేరు వస్తుందోనని బాబు భయపడ్డారు. కోడెలపై, కోడెల కుటుంబంపై జగన్ సర్కార్ ... వరుస కేసులు పెడుతుంటే చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు... పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇవ్వలేదు... కనీసం కోడెలను పరామర్శంచలేదు... ఇదే కోడెలను మరింత కుంగదీసింది. ఒకవైపు జగన్ ప్రభుత్వ వేధింపులు.... మరోవైపు బాబు నుంచి అండ లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన కోడెల... ఎటూపాలుపోక విధిలేని పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు ఒడిగట్టారని అంటున్నారు. కోడెల ఆత్మహత్య తర్వాత చంద్రబాబు .... జగన్ ప్రభుత్వంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కోడెల మరణాన్ని తలచుకుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు కోడెల భౌతికకాయం వెంటే చంద్రబాబు కూడా వచ్చారు. అయితే, ఇదంతా కోడెల బతికుండగా, ఆయనకు అండగా నిలిచి ఉంటే కోడెల బతికుండేవారని అనుకుంటున్నారు. కనీసం కోడెలను జగన్ ప్రభుత్వం వేధిస్తోందంటూ నిన్న పెట్టినట్లు ...కనీసం మూడ్రోజులు ముందు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టుంటే ఆయన బతికేవారని, ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో పవన్ చిచ్చు.. రేవంత్ ని టార్గెట్ చేశారు!!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆయన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు వెళ్లడం.. కొంత మంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ.. పవన్ సమావేశానికి వెళ్లిన రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ.. హైకమాండ్ కు ఫిర్యాదుల పరంపర ప్రారంభమైంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా సమక్షంలో.. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.. రేవంత్ రెడ్డిపై విమర్శలకు..ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ అని, పవన్ కు సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ వెళ్లి జనసేన ఫ్లాగ్ కింద కూర్చోవడం ద్వారా.. ఎలాంటి సంకేతాలు పంపించాలని అనుకుంటున్నారంటూ నేతలను నిలదీశారు. మన పార్టీ పిలిచినప్పుడు పవన్ రాలేదని గుర్తు చేశారు. సీనియర్ నేతలంతా వెళ్లి పవన్ దగ్గర కూర్చోవడం ఏంటని సంపత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంపత్ అభిప్రాయంతో కుంతియా కూడా ఏకీభవించడంతో.. జనసేన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పేనని సీనియర్ నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ హామీ ఇచ్చేశారు. కొన్ని అంశాలలో విపక్షాలు కలిసి పోరాడటం సహజం. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో అందర్నీ కలుపుకొని పోవడం కాంగ్రెస్ కి అవసరం. కానీ కొందరు నేతలు మాత్రం పవన్ సమావేశానికి వెళ్లిన నేతలను తప్పుపడుతున్నారు. అయితే దీని వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందున్నారని ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ కూడా రేవంత్ కి తెలంగాణలో పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఆయన పార్టీని చిన్న బుచ్చుతున్నారన్న ప్రచారం నిర్వహించి.. అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పన్నట్లుగా మాట్లాడారని తెలుస్తోంది.

జాతీయ పార్టీగా టీఆర్ఎస్.! ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో పోటీకి సన్నాహాలు.!

  నేషనల్ ఫ్రంట్ తో కేంద్రంలోనూ చక్రం తిప్పుతామంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావిడి చేసిన గులాబీ బాస్ కేసీఆర్.... టీఆర్ఎస్ కు జాతీయ పార్టీ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ, పలు రాష్ట్రాల ప్రజల సైతం ఆకట్టుకున్న కేసీఆర్... తన పథకాలకు లభిస్తోన్న ఆదరణ, గుర్తింపుతో, రెండు మూడు రాష్ట్రాలకు పార్టీని విస్తరించాలని వ్యూహరచన చేస్తున్నారట. ముఖ్యంగా తనకు ఎక్కువగా గుర్తింపు ఉన్న... ఆంధ్రప్రదేశ్, అలాగే కర్నాటక, మహారాష్ట్రల్లో పోటీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ కేసీఆర్ ఎవరో తెలుసు... టీఆర్ఎస్ గురించి... కేసీఆర్ పరిపాలన గురించి తెలుసు. అయితే, కర్నాటక, మహారాష్ట్ర వాసులకు ఎలా తెలుస్తుందనుకుంటున్నారా? ఇక్కడే కేసీఆర్ తెలివిగా, పావులు కదుపుతున్నారు. కర్నాటక, మహారాష్ట్రల్లో తెలుగువాళ్లు ఉండే ప్రాంతాల్లో పోటీకి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కర్నాటకలోని బళ్లారి, మహారాష్ట్రలోని నాందేడ్ లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే, నిజాం హయాంలో ఈ రెండు ప్రాంతాలూ తెలంగాణలోనే ఉండటమే కాకుండా, ఇఫ్పటికీ అక్కడ అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు ఉండటంతో, వాటిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేసీఆర్ ను కలిసిన పలువురు మహారాష్ట్ర నేతలు... తెలంగాణలో అమలవుతోన్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, మహారాష్ట్ర ప్రజలను కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు మహారాష్ట్రలోనూ టీఆర్ఎస్ పోటీచేస్తే మంచి ఆదరణ లభిస్తుందని వివరించారు. దాంతో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు. ముఖ్యంగా నాందేడ్ జిల్లాలోని దెగ్లూర్, నాయిగాం, భోకర్, హిమాయత్ నగర్, కిన్ వట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కర్నాటక బళ్లారిలోనూ పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారట. ఇకపోతే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ బరిలోకి దిగాలని డిసైడ్ చేశారట. త్వరలో జరగనున్న ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగాలని ఆలోచిస్తున్నారట. మొత్తానికి జాతీయ హోదాపై కన్నేసిన టీఆర్ఎస్.... ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో పోటీకి దిగబోతోంది. మరి, తెలంగాణలో తిరుగులేని పట్టుసాధించిన గులాబీ పార్టీ, పక్క రాష్ట్రాల్లో పాగా వేయాలన్న వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో... జాతీయ పార్టీగా అవతరించాలన్న కల నెరవేరుతుందో లేదో చూడాలి.

బోటు ప్రమాదంపై మోడీ ఒకలా... ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు మరోలా..!

  తూర్పుగోదావరి బోటు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన అంటూ ట్వీట్ చేశారు. అయితే, బోటు ప్రమాదంపై ఏపీ అండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్‌, కన్నా ఘాటుగా స్పందించారు. బోటు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా బోట్లు నడుపుతున్నా, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్ణకరమన్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా తీవ్రంగా స్పందించారు.  గోదావరిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఎవరో ఒకరి స్వలాభానికి ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బోటు ప్రమాదంపై అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్... తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించగా, అలాగే తెలంగాణ బాధిత కుటుంబాలకు... కేసీఆర్‌ ప్రభుత్వం అదనంగా మరో 5లక్షలు పరిహారంగా అందజేయనుంది. తూర్పుగోదావరి బోటు ప్రమాదంలో ఎక్కువమంది తెలంగాణవాసులు ఉండటంతో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏపీ చేరుకున్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌... బాధితులను పరామర్శించడంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్ ‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

అధికారుల అలసత్వమా? బోటు సిబ్బంది నిర్లక్ష్యమా? బోటు ప్రమాదానికి కారణమెవరు?

  బోటు ప్రమాదానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరిలో అధిక నీటి ప్రవాహమే బోటు బోల్తాకి ప్రధాన కారణమని అంటున్నా, అధికారుల అలసత్వం, బోటు సిబ్బంది నిర్లక్ష్యమే కొంపముంచినట్లు తెలుస్తోంది. గోదావరిలో ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో పాపికొండలకు బయల్దేరడం అదిపెద్ద తప్పు అయితే, ప్రయాణికులు అందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడంతో మరో ఘోర తప్పిదంగా కనిపిస్తోంది. అలాగే అనుభవం లేని డ్రైవర్లు, బోటు సిబ్బంది కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రవాహ ఉధృతిని అంచనా వేయలేకపోవడం... మలుపు దగ్గర చాకచక్యంగా వ్యవహరించలేకపోవడంతో... సుడిగుండాలకు బోటు బోల్తా కొట్టిందని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు అంటున్నారు. అయితే, బోటు మొదటి అంతస్తులో ఉన్నవాళ్లు... రెండో అంతస్తులోకి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే మాట కూడా వినిపిస్తోంది. ప్రయాణికులు ఒక్కసారిగా కింది అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్లడంతో బోటు బ్యాలెన్స్ తప్పి, బోల్తాపడిందని అంటున్నారు. ఇదిలాఉంటే, ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారుల పరిశీలనలో తేలింది. పర్యాటకశాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే, రాయల్ వశిష్ట ప్రైవేట్ బోటును నడుపుతున్నట్లు గుర్తించారు. పైగా ఐదు లక్షలు పైగా ఇన్‌ ఫ్లో ఉండగా, పాపికొండలకు బోటు బయల్దేరడం అతిపెద్ద తప్పిదంగా అధికారులు తేల్చారు.

డెత్ జర్నీలుగా మారుతోన్న జల జర్నీలు... గోదావరిలోనే ఎందుకిలా?

నీటిపై ప్రయాణమంటే చిన్న పిల్లవాడి మొదలు వృద్ధుల వరకు అందరిలోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆ ఆనంద క్షణాలను మనసులో మధురమైన గుర్తులుగా మార్చుకుందామని పర్యాటకులు ఆశిస్తారు. కానీ, అలలపై ఆహ్లాదంగా సాగిపోవాల్సిన బోటు ప్రయాణాలు విషాదాంతమవుతున్నాయి. యాత్రికుల రక్షణ గాల్లో దీపంలా మారుతున్నాయి. ముఖ్యంగా పాపికొండల్లో జల విహారం ప్రాణ సంకటంగా మారుతోంది. ప్రకృతి అందాలను తనివితీర తిలకిస్తూ ఉరకలెత్తే ఉత్సాహంతో గోదావరి అలల సయ్యాటతో మునిగి తేలాలన్న సరదాల మాటున విషాదం పొంచి ఉందనే భయంకర నిజాన్ని పర్యాటకులు ఊహించలేకపోతున్నారు. దాంతో జల అందాలను ఆస్వాదిస్తూ చేసిన ప్రయాణం క్షణాల్లోనే ఆవిరైపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలోనూ ఇదే జరిగింది. అప్పటివరకు గోదావరి అందాలను చూసి పర్యాటకులు పరవశించిపోయారు. పాపికొండలను చూస్తున్నామన్న ఆనందంలో కేరింతలు కొట్టారు. గోదావరి చుట్టూ అల్లుకున్న ప్రకృతి అందాలకు ఫిదా అయిపోయారు. లోకాన్ని మరిచి...పరిసరాలను మైమరిచి నదీ సోయగాలను చూస్తూ ఉత్సాహంగా ముందుకుసాగారు. సహచర టూరిస్టులు, బంధువులు, కుటుంబ సభ్యులతో జాలీగా  గడుపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు బోటులో సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు. అయితే, ఆ అందమైన ప్రకృతే వికృతంగా మారుతుందని ఊహించలేకపోయారు. గోదారమ్మ అమాంతం తమను మింగేస్తుందని అనుకోలేదు. అలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. దాంతో ఒక్కసారిగా పడవ పక్కకు ఒరిగి గోదావరిలో మునిగిపోతుంటే... పర్యాటకులు చేసిన హాహాకారాలు, ఆర్తనాదాలు... ఆ గోదారమ్మ వినిపించుకోలేదు. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆత్మీయులు జలసమాధి అయిపోయారు. దాంతో విహరయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. అయితే, బోటు పైఅంతస్తులో ఉన్నవారు మాత్రమే, ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కింది అంతస్తులో అద్దాల మధ్య ఉన్నవారతా జలసమాధి అయ్యారని భావిస్తున్నారు. బోటు దాదాపు 300 అడుగుల లోతులోకి దిగిపోవడంతో... వాళ్లంతా బోటులోనే చిక్కుకుని మరణించారని అంచనా వేస్తున్నారు. బోటును బయటికి తీస్తేనే, మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలపై సోనియా ఫోకస్... పీసీసీ చీఫ్ ల ఎంపికపై కసరత్తు

  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునురుజ్జీవం కోసం ప్రయత్నిస్తోన్న ఏఐసీసీ తాత్కాలిక ప్రెసిడెంట్ సోనియాగాంధీ.... తెలుగు రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర విభజనతో రెండు చోట్లా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని ఏదోవిధంగా బతికించుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేనప్పటికీ, గట్టి ప్రయత్నాలైతే చేయాలని సోనియా నిర్ణయించారు. అందుకే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఏపీసీసీ రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శైలజానాథ్, పల్లంరాజు, జేడీశీలం, చింతా మోహన్, గిడుగు రుద్రరాజు పేర్లను సోనియా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక, తెలంగాణ విషయంలో పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పట్లో లేనట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ కోసం పోటీ ఎక్కువగా ఉండటం, మరోవైపు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, అలాగే అధిష్టానం పరిశీలనలో ఉన్న వ్యక్తులపై సీనియర్లు గుర్రుగా ఉండటంతో, పీసీసీ నియామకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించనున్నారనే ప్రచారంతో ఒక్కసారిగా కలకలం రేగడం, ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు, అలాగే హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముగిసిన తర్వాత... తెలంగాణ పీసీసీ మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి వార్ రూమ్ చర్చలు జరుపుతోన్న సోనియా... తెలుగు రాష్ట్రాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పట్నుంచే పార్టీని బలోపేతంచేసి, 2024లో అధికారం కైవసం చేసుకునేలా రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారట. అందుకే తెలంగాణలో ప్రజాసమస్యలపై నివేదిక ఇవ్వాలని సోనియా ఆదేశించారు.

బీజేపీలోకి జార్ఖండ్ డైనమైట్..! ధోనీ రిటైర్మెంట్ పై ఊహాగానాలు

  టీమిండియా క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ... క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. సౌతాఫ్రికా టూర్‌కి ధోనీని ఎంపిక చేయకపోవడంతో... ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్‌బై చెప్పాలని ధోనీ డిసైడయ్యాడని, త్వరలో ప్రకటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత మహేంద్రసింగ్‌ ధోనీ... పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ధోనీ ...బీజేపీలో చేరబోతున్నారని అంటున్నారు. సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు‌ అతిత్వరలో ఎన్నికలు జరగనుండటంతో... అసెంబ్లీ బరిలో ధోనీ దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమధ్య ఎక్కువగా జాతీయవాదం వినిపించడంతోపాటు ఇటీవల 2నెలలపాటు ఆర్మీలో పనిచేశారని అంటున్నారు. ఇక, టీమిండియా క్రికెటర్ గా, కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోనీ... పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను నెంబర్‌వన్‌గా నిలిపాడు. అంతేకాదు భారత్ కు వన్డే, టీ20 వరల్డ్, ఆసియా కప్ లను అందించి సంచలనం సృష్టంచాడు. కెప్టెన్ గా ఎన్నో సంచలన విజయాలను సాధించడమే కాకుండా, గ్రేట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. 90కి పైగా టెస్టు మ్యాచులాడి సుమారు 5వేల పరుగులు చేసిన ధోనీ... 340కి పైగా వన్డేల్లో 10వేల 500 రన్స్ చేశాడు. వన్డేల్లో 10వేల పరుగులు చేసిన అతికొద్దిమంది క్రికెటర్లలో ధోనీ ఒకడు. ఇలా ఎన్నో రికార్డులు ధోనీ ఖాతాలో ఉన్నాయి. అయితే, తన రిటైర్మెంట్ పై జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నా, ధోనీ స్పందించకపోవడంతో నిజమేనని అంతా భావించారు. అయితే, ధోనీ అర్ధాంగి సాక్షి ఆ సందిగ్దతకు సింగిల్ లైన్ తో తెరిదించింది. డైరెక్టుగా ఖండించకపోయినా, మరి వీటినే వదంతులు అంటారు అంటూ ట్వీట్ చేసి, రిటైర్మెంట్ వార్తలకు తెరదించారు. సాక్షి చేసిన ఆ ట్వీట్ కు క్షణాల్లోనే వేలకొలది లైకులు, రీట్వీట్లు  వచ్చాయి. మరోవైపు బీసీసీఐ కూడా ధోనీ రిటైర్మెంట్ వార్తలపై డిఫరెంట్ గా స్పందించింది. తమకు సమాచారం లేదంటూ తెలివిగా రియాక్టయ్యింది. మరి ధోనీ నిజంగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పి పొలికల్ ఎంట్రీ ఇస్తారో లేదో..!

కాంగ్రెస్ ను బతికించుకునేదెలా? RSS తరహా ప్లాన్ కు సోనియా చర్చలు

  వరుసగా రెండు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని డీలాపడిన కాంగ్రెస్ కు పునరుజ్జీవం తెచ్చేందుకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారు. జవజీవాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో కొత్త జవసత్వాలు నింపేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు. ముఖ్యంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో దెబ్బతిన్న కాంగ్రెస్ పరపతిని పెంచేందుకు సోనియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పూనుకున్న సోనియా... ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సీఎల్పీ లీడర్లు, పీసీసీ చీఫ్ లతో వార్ రూమ్ చర్చలు జరుపుతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు.  అయితే, కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు సోనియా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ తరహా మోడల్ అనుసరించాలని భావిస్తున్నారట. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాదిరిగా ప్రేరక్ లను నియమించాలని సోనియా థింక్ చేస్తున్నారని అంటున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా ఒక్కటే సరిపోదని... ప్రజాసమస్యలపై స్పందిస్తూ నేరుగా ప్రజలతో అనుసంధానం కావాలని, అప్పుడే పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే అంచనాకొచ్చిన సోనియా.... ఆర్ఎస్ఎస్ మాదిరిగా ప్రేరక్ లను నియమించాలని డిసైడయ్యారట.  అతిత్వరలోనే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో, ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ కు పెనుసవాలుగా మారాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి, కాంగ్రెస్ ను మళ్లీ రేసులో నిలిపేందుకు సోనియా సవాలుగా తీసుకున్నారట. మరి సోనియా ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో.... కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందో రాదో... మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తేలిపోనుంది.

సబ్ జైలుకు చింతమనేని... పెండింగ్ లో మరో 60 కేసులు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఏలూరు కోర్టు... 14రోజుల రిమాండ్‌ విధించింది. దళిత యువకులపై దాడి, కులం పేరుతో దూషించిన ఘటనలో అట్రాసిటీ సెక్షన్‌తోపాటు 143, 341, 324, 323, 506, 148 రెడ్ విత్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన పెదవేగి పోలీసులు.... చింతమనేనిని అరెస్ట్ చేసి ఏలూరు కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం సెప్టెంబర్ 25వరకు రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు. 2017లో దళిత యువకులపై దాడి, కులం పేరుతో దూషించిన కేసులో 12రోజులక్రితం చింతమనేనిని అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న చింతమనేని... అప్పట్నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో.... 14 పోలీస్ బృందాలు పశ్చిమగోదావరి జిల్లాను జల్లెడపట్టడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించారు. అయితే సడన్‌గా తన స్వగ్రామం దుగ్గిరాలలో ప్రత్యక్షంకావడంతో, అప్పటికే ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు.... చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులకు చింతమనేని చుక్కలు చూపించారు. కారు దిగనంటూ హైడ్రామా సృష్టించారు. అదే సమయంలో చింతమనేని అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చింతమనేనిని చేతులపై ఎత్తుకున్న అనుచరులు కొద్దిసేపు అలజడి సృష్టించారు. పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దాంతో అనుచరులు, కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు, చింతమనేనిని బలవంతంగా జీపులో ఎక్కించి ఏలూరు తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. అయితే, తనపై అక్రమ కేసులు పెట్టారని, జగన్ ప్రభుత్వం... తనపై కక్షగట్టిందని,  తనను అంతమొందించేందుకు కుట్ర చేసిందని చింతమనేని ఆరోపించారు. ఇదిలాఉంటే, చింతమనేని బాధితులు... పోలీసుల ముందు క్యూకడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీకి పెద్దఎత్తున ఫిర్యాదులు ఇస్తున్నారు. అట్రాసిటీ, భూకబ్జా, బెదిరింపులు ఇలా... చింతమనేనిపై 60కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, చింతమనేని అరెస్ట్‌‌తో... ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, దుగ్గిరాలలో పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు.

జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా? చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

జగన్మోహన్‌రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన 41ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత అరాచక, అనాగరిక పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. వైఎస్ హయాంలోనూ ఇంతటి దౌర్జన్యం జరగలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి టైమ్ లో కేవలం ఒకే ఒక్క జిల్లాకు హింస పరిమితమైతే, ఇప్పుడు రాష్ట్రమంతటా రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. దాడులు, కేసులు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం... ఇలా వంద రోజుల్లోనే వందలకొద్దీ దౌర్జన్యాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క అమరావతిలోనే టీడీపీ నేతలపై 38 అట్రాసిటీ కేసులు పెట్టారన్న చంద్రబాబు... ఈ వంద రోజుల్లోనే తెలుగుదేశం శ్రేణులపై 565 కేసులు, 201 దాడులు, 136 వేధింపులు, 52 అక్రమ కేసులు, 21మంది ఉద్యోగుల తొలగింపు, 15 భూకబ్జాలు, 65 ఆస్తుల ధ్వంసం, 10 హత్యలు, 28 చొప్పున 28 పర్సనల్ అండ్ సోషల్ మీడియా కేసులు పెట్టగా, వైసీపీ వేధింపులు భరించలేక 8మంది ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే గుంటూరు జిల్లాలో 500మందిని గ్రామాల నుంచి తరిమికొట్టారని లెక్కలతో సహా బాబు బయటపెట్టారు. ఇక పోలీసులు సైతం టీడీపీ శ్రేణులను బెదిరిస్తున్నారని, తెలుగుదేశం వాళ్ల ఫిర్యాదులను తీసుకోవడం లేదని ఆరోపించారు. సీఎం జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. ప్రజలు తమ సొంత ఇళ్లల్లో ఉండటానికి పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిందని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. దాడులు, అక్రమ కేసులే కాకుండా తోటలు, ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని, ఇంతటి రాక్షస పాలనను తానెప్పుడూ చూడలేదని అన్నారు. రాక్షసుల గురించి వినడమే గానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని, వైసీపీ నేతలు... రాక్షసులను మరిపిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదని చంద్రబాబు ఫైరయ్యారు. అమ్మాయిని వివస్త్రను చేసి కారం చల్లుతారా? 545మందిని గ్రామాల నుంచి వెలేస్తే చిన్న సమస్యా? బాధితులను పెయిడ్ ఆర్టిస్టులంటారా? అందర్నీ చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా? అంటూ బాబు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, తమకు అడ్డే లేదు... ఏమైనా చేస్తామని వైసీపీ నేతలు అనుకుంటున్నారని, కానీ వైసీపీ దౌర్జన్యాలు ఇక సాగనివ్వబోమంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదిఏమైనా ఛలో ఆత్మకూరు ఆగదని, ఆత్మరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని బాబు తేల్చిచెప్పారు.

తమిళిసై నియామకం కేసీఆర్‌కు ఇష్టం లేదా? మరి ఆ ఆర్టికల్ రాయించిందెవరు?

తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసైపై అప్పుడే రాజకీయ దుమారం మొదలైపోయింది. తమిళిసై ప్రమాణస్వీకారం చేసిన రోజే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ డైరెక్ట్ గా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ సీపీఆర్వో రాసిన వ్యాసం దీనికి కేంద్రమైంది. సర్కారియా కమిషన్ సిపార్సులను ఊటంకిస్తూ రాసిన వ్యాసంలో... తమిళిసై నియామకంపై పరోక్షంగా టీఆర్ఎస్ సర్కారు అయిష్టతను బయటపెట్టిందనే మాట వినిపిస్తోంది. ఎక్కడా తమిళిసై పేరు ఎత్తకుండా రాసిన ఈ వ్యాసంలో... రాజకీయంగా చురుగ్గా ఉన్న నేతలను గవర్నర్లగా నియమించకూడదనే సర్కారియా కమిషన్ సిఫార్సులను ప్రస్తావించారు. గవర్నర్ వ్యవస్థపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందంటూ సీఎం కేసీఆర్ సీపీఆర్వో విశ్లేషణ సాగింది. అయితే సీఎం సీపీఆర్వో ఆర్టికల్ పై బీజేపీ మండిపడుతోంది. అసలు సర్కారియా కమిషన్ సిఫార్సులు ఎక్కడ అతిక్రమించామో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు గవర్నర్ ను గౌరవిస్తామని చెబుతూనే, మరోవైపు గవర్నర్ వ్యవస్థను అవమానించేలా వ్యాసాలు రాయించడమేంటని కాషాయ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి, పైగా సీఎం సీపీఆర్వో... రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ పై అనుమానాలు, అపోహలు ఉన్నాయంటూ, ఆర్టికల్ రాసే స్వేచ్ఛ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆర్టికల్ రాసిన వ్యక్తికి సర్కారియా కమిషన్ సిఫార్సులు గురించి కనీస అవగాహన లేదని మండిపడ్డారు. ఇదంతా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తోన్న బీజేపీ... సీపీఆర్వోను వెంటనే తొలగించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. గవర్నర్ పై అనుచిత ఆర్టికల్ రాసిన సీఎం సీపీఆర్వోపై చర్యలు తీసుకోకపోతే, క్రిమినల్ కేసు పెడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. అయినా, గవర్నర్‌గా బాధ్యతలు తీసుకుని 24గంటలు కూడా గడవకముందే ఇలా విషం కక్కడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, గవర్నర్ల నియామకం రాష్ట్రపతి చేతుల్లో ఉంటుందని, దాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ గా తమిళిసైకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామన్న కేటీఆర్... ఆమె మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. మరోవైపు మిగతా గవర్నర్లకు భిన్నంగా బాధ్యతలు స్వీకరించినరోజే తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తమిళిసై... కేసీఆర్ పరిపాలనను, అమలు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రశంసించారు. బంగారు తెలంగాణ సాధనలో తాను కూడా భాగస్వామ్యమైనందుకు సంతోషంతో ఉందంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి, తెలంగాణకు కొత్త గవర్నర్ రాక సందర్భంగా, సీఎం కేసీఆర్ సీపీఆర్వో రాసిన వ్యాసం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, రాజకీయ కోణంలోనే తమిళిసైని తెలంగాణకు గవర్నర్ గా పంపారనే ప్రచారం విస్తృతంగా సాగుతుండటంతో, ఆమె నియామకం.... సీఎం కేసీఆర్ కు కూడా ఇష్టం లేదనే చర్చ నడుస్తోంది. మరి ముందుముందు ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

పల్నాటి యుద్ధం... వడ్డీతో సహా చెల్లిస్తామంటూ బాబు వార్నింగ్

  పల్నాడు పేరు చెబితేనే పగలు ప్రతీకారాలు గుర్తుకొస్తాయి. దాడులు ప్రతిదాడులు కామన్ గా కనిపిస్తాయి. ఇక అధికారం మారినప్పుడల్లా పరిస్థితులూ మారిపోతాయి. అందుకే, ఇప్పుడు పల్నాడులో కొత్త యుద్ధం నడుస్తోంది. ఆనాటి పల్నాటి యుద్ధాన్ని తలపించేలా అధికార వైసీపీ... ప్రతిపక్ష టీడీపీ... కత్తులు దూసుకుంటున్నాయి. రాజకీయ దాడులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిప్పులు కక్కుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక... గూండాయిజం పెరిగిపోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే...  టీడీపీ వాళ్లే దాడులు చేస్తూ... తిరిగి వైసీపీపై విమర్శలు చేస్తున్నారంటూ అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. పల్నాడులో రాజకీయ దాడుల బాధితుల కోసం పునరావాస శిబిరం ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు... వైసీపీ వంద రోజుల పాలనలో ఐదు వందలకు పైగా దాడులు జరిగాయని, పది మందిని చంపేశారని ఆరోపించారు. ఇదే తరహాలో దాడులు కొనసాగిస్తే, భవిష్యత్తులో అంతకంతకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ చంద్రబాబు హెచ్చరించారు. ఇక నారా లోకేష్ కూడా రాజకీయ దాడులపై నిప్పులు చెరిగారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానని రాక్షస పాలన తెచ్చారంటూ మండిపడ్డారు. అయితే, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, తప్పుడు కేసులు పెడుతూ తమ కార్యకర్తలను ఊరు వదిలిపెళ్లిపోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయితే, తెలుగుదేశం ఆరోపణలపై హోంమంత్రి సుచరిత ఘాటుగా స్పందించారు. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పల్నాడు ప్రశాంతంగా ఉందని, ఆ ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించొద్దని సూచించారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తోందన్న సుచరిత... అసలక్కడ నిజంగా బాధితులు ఉన్నారో లేదో తెలుసుకునేందుకు నిజనిర్ధారణతోపాటు సమగ్ర విచారణ చేపడతామని ప్రకటించారు.  ఒకవేళ పునరావాస కేంద్రాల్లో నిజంగానే బాధితులు ఉంటే, పోలీసులే వారిని స్వయంగా గ్రామాలకు తీసుకెళ్లి...రక్షణ కల్పిస్తారని హోంమంత్రి హామీ ఇచ్చారు. అలాగే, టీడీపీ ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని, ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

హరీష్ రావుకి చెక్ పెట్టిన కేసీఆర్.. ఆర్ధిక శాఖ ఇవ్వడం వెనుక మాస్టర్ ప్లాన్!!

  తెలంగాణలో ఆదివారం నాడు మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. హరీష్ రావు, కేటీఆర్ సహా ఆరుగురు నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్.. హరీష్ రావుకి కీలకమైన ఆర్ధిక శాఖను అప్పగించారు. దీంతో హరీష్ అభిమానుల్లో సంతోషం నెలకొంది. అయితే ఒక్కరోజులో సీను పూర్తిగా రివర్స్ అయింది. హరీష్ కు ఆర్ధిక శాఖను అప్పగించడం వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019-20 ఏడాదికి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణపై ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని అన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తామని చెప్పటంతో పాటు.. ఇక నుంచి ఎలాంటి కొత్త అభివృద్ధి పనులు ఉండబోవని.. బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం తీసుకున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఓ రకంగా ఖాళీ గల్లా పెట్టెను హరీష్ చేతికి ఇచ్చిన కేసీఆర్.. అందులోకి వచ్చే ఆదాయం ఏమైనా సరే.. తాను చెప్పిన రీతిలో బకాయిల చెల్లింపులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేశారు. ఏ శాఖకు ఎంత కేటాయింపు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ కు అధికారం ఉండాలి. కానీ, ఆర్థిక శాఖ ఏం చేయాలన్న విషయాన్ని కేసీఆర్ తన స్పీచ్ లో చెప్పేయటంతో.. పరిమితుల మధ్య హరీష్ పని చేయటానికి మించి చేసేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే.. ఆర్థికమంత్రిగా హరీష్.. సింపుల్ గా ఆఫీసుకు రావటం, వెళ్ళటం తప్పించి పెద్దగా చేసేందుకు పనేమీ ఉండదని అంటున్నారు. దానికి తోడు దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం వలన తెలంగాణలో కూడా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఏ పనులకైన నిధులు కొరత ఏర్పడితే ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ రావు సమాధానం చెప్పాలి. దీన్నిబట్టి చూస్తుంటే.. ఆర్థిక మాంద్యం సమయంలో హరీష్ రావుకి ఆర్ధిక శాఖను అప్పగించి, ఖాళీ గల్లా పెట్టెను చేతికిచ్చి ఇరుకున పెట్టారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.