హుజూర్ నగర్ లో చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతోంది?

  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థినిగా చావా కిరణ్మయి ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ ప్రచారానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రావాలని కొందరు, అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతు ఉండటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహా కూటమి పేరుతో టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. అంతేకాదు అన్ని పార్టీల నాయకులు కలిసి ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు తెలంగాణలో రెండు విడతలుగా వారం రోజుల పాటు గట్టిగానే ప్రచారం నిర్వహించారు. అయితే ఖమ్మం జిల్లాలో తప్ప టీడీపీ ఎక్కడా గెలవలేకపోయింది. ఆ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ప్రచారం కాంగ్రెస్ కు బెడిసికొట్టిందని ఆ పార్టీ నాయకులు ఓపెన్ గానే ప్రకటించారు. దాంతో ఈ సారి హుజూరునగర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కోసం చంద్రబాబు ప్రచారం చేస్తారా చెయ్యరా,చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఏమవుతుంది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమిలో సీట్లు మాత్రమే పంచుకున్న టిడిపి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దత్తు మాత్రమే చేసి పోటీకి దూరంగా ఉంది. దాంతో తెలంగాణలో టిడిపి ఉనికి ప్రశ్నార్ధకంగా తయారైంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడ్డ టిడిపి నేతలు డీలా పడిపోయారు. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు అధిష్ఠానం తెలంగాణ టిడిపిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు ఏపీలో టిడిపి ఓడిపోవటంతో తెలంగాణ పై దృష్టి సారించడమే కాకుండా పార్టీకి పునఃవైభవం తెస్తానని ప్రకటిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయానికి వస్తే బాబు ప్రచారం చేస్తే ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉన్న హుజూర్ నగర్ లో ఆంధ్రా ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని పోటీ చేసిన టిడిపికి ఇరవై ఐదు వేల ఓట్లు దక్కాయి. ఇక రెండు వేల పధ్ధెనిమిదిలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలని ప్రస్తుత అభ్యర్థిని కిరణమై భావించినప్పటికీ పొత్తుల కారణంగా సాధ్యపడలేదు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా పార్టీ అధినేత ప్రచారం చేస్తే అంతో ఇంతో ప్లస్ అవుతుందని అంటున్నారు.ఇక పై టీడీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

హుజూర్ నగర్ లో కనిపించని రేవంత్? కాంగ్రెస్ కు ఊహించని నష్టం తప్పదా.!

  హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య తలెత్తిన విభేదాలు, మనస్పర్ధలు ఇంకా సమిసిపోలేదు. దాంతో హుజూర్ నగర్ ప్రచారంలో రేవంత్ చప్పుడే వినిపించడం లేదు. హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపిక విషయంలో సీనియర్లంతా టార్గెట్ చేయడంతో.... రేవంత్ సైలెంట్ అయ్యారు. అదే సమయంలో తన మాటను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండానే, ఉత్తమ్ భార్య పద్మావతి పేరును అధిష్టానం ప్రకటించడంతో రేవంత్ అలకబూనినట్లు తెలుస్తోంది. అందుకే, రేవంత్ కనీసం హుజూర్ నగర్ వైపు కూడా చూడటం లేదంటున్నారు.  ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే, మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రేవంత్ ఇప్పటివరకు అస్సలు హుజూర్ ప్రచారంలో పాల్గొనలేదు. అసలు ప్రచారానికి వస్తాడో రాడో కూడా తెలియదు. ఇక, ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి కూడా హుజూర్ నగర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రచారంలో కొంత స్తబ్దత నెలకొందనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఎంతకాదన్నా, రేవంత్ రెడ్డి అంటే యూత్ లో యమ క్రేజుంది. రేవంత్ మాటలను, పంచ్ డైలాగులను వినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు రేవంత్ మాటలు జనాన్ని ఆలోచింపచేసేలా ఉంటాయ్. ఎంతకాదన్నా, రేవంత్ ప్రచారం చేశాడంటే, ఎంతోకొంత ఇంపాక్ట్ ఉండకమానదు. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉపఎన్నిక క్యాంపైయిన్ లో రేవంత్ ప్రచారం చేయకపోతే, అది కాంగ్రెస్ కు మైనస్ అయ్యే ప్రమాదముంది. ఒకవైపు, టీఆర్ఎస్, బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా, పంతానికి పోకుండా, అన్ని మార్గాలను వినియోగించుకుంటూ, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారానికి, మొత్తం బలగాన్ని రంగంలోకి దింపుతుంటే, సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ... కేంద్ర మంత్రులను సైతం రంగంలోకి దించి ప్రచారం చేయిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం కనీసం తెలంగాణ ముఖ్యనేతలతో కూడా ప్రచారం చేయించలేకపోతుందనే మాట వినిపిస్తోంది. మరి, ఉత్తమ్ చొరవ తీసుకుని రేవంత్ లాంటి లీడర్లను స్వయంగా ప్రచారానికి ఆహ్వానిస్తే, వివాదానికి తెరపడటమే కాకుండా, అది పార్టీకి కూడా మేలంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మరి ఉత్తమ్-రేవంత్ ల్లో ఎవరో ఒకరు చొరవ తీసుకోకపోతే హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు ఊహించని నష్టం జరగడం ఖాయమేనంటున్నారు కార్యకర్తలు.

టీఆర్ఎస్ కోసం రంగంలోకి వైసీపీ..! హుజూర్ నగర్ లో కుల రాజకీయం

  హుజూర్ నగర్ లో ఎలాగైనాసరే గులాబీ జెండా పాతి... ఉత్తమ్ కు ఝలక్ ఇవ్వాలనుకుంటోన్న టీఆర్ఎస్... ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గెలుపు కోసం సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇప్పటికే సీపీఐ మద్దతు కూడగట్టిన టీఆర్ఎస్... అదే బాటలో సీపీఎంను కూడా దాదాపు తన వైపు తిప్పుకుంది. మరోవైపు, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యనేతల వరకు అందర్నీ రంగంలోకి దింపి, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారం చేయిస్తోంది. అయినా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం... ఏపీ లీడర్లను కూడా రంగంలోకి దించాలని డిసైడైందట. హుజూర్ నగర్లో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండటం, అది కూడా కమ్మ, కాపు కులస్తులు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండటంతో వైసీపీ కమ్మ, కాపు నేతలతో కులాల వారీగా ప్రచారం చేయించాలని టీఆర్ఎస్ చూస్తోందట.  హుజూర్ న‌గ‌ర్ లో క‌మ్మ‌, కాపు ఓట‌ర్లు  ప్రభావం గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. హుజూర్ న‌గ‌ర్ లో 11వేల మంది కమ్మ ఓట‌ర్లు ఉండ‌గా, కాపు ఓట‌ర్లు ఏడు వేల మందికి పైగా ఉన్నారు. అయితే, కాపుల్లో టీఆర్‌ఎస్‌పై కొంత సానుకూల‌త ఉన్నా... క‌మ్మ సామాజికవ‌ర్గం ఓట‌ర్లలో మాత్రం పూర్తి వ్యతిరేక‌త ఉన్నట్లు టీఆర్ఎస్ గుర్తించిందట. దాంతో కమ్మ నేతలను రంగంలోకి దింపి... ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక, రెడ్డి ఓట్లు అత్యధికంగా 27వేల వరకు ఉన్నాయి. అయితే, మెజారిటీ రెడ్డి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపొచ్చన్న అంచనాలతో, క‌మ్మ‌, కాపు ఓట‌ర్లపైనే గులాబీ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టింది. అందుకే ఏపీ కమ్మ, కాపు వైసీపీ నేతలను ప్రచారానికి పంపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. దాంతో దసరా తర్వాత, ఏపీ వైసీపీ నేతలు.... హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఒకవేళ, ఏపీ వైసీపీ నేతలు... టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారంచేస్తే అది కాంగ్రెస్ కు అడ్వాండేజ్ గా మారుతుందని అంటున్నారు. గతంలో చంద్రబాబు... తెలంగాణలో ప్రచారం చేయడాన్ని కేసీఆర్ ఆయుధంగా మలుచుకున్నట్టే... ఇప్పుడు టీకాంగ్రెస్ కూడా ఏపీ నేతల క్యాంపెయిన్ ను అస్త్రంగా మార్చుకునే అవకాశముందంటున్నారు. మరి, నిజంగానే ఏపీ వైసీపీ నేతలు... హుజూర్ నగర్లో ప్రచారం చేస్తారో లేదో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ లో భారీగా విద్యుత్ కోతలు

  ఆంధ్రప్రదేశ్ ప్రజలను వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. గ్రామాల్లో వారం రోజుల నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. అనేక మండలాల్లో ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవటంతో డిమాండ్ పెరగిపోగా విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయి. ఏపీకి ప్రస్తుతం పది నుంచి పదకొండు వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది కానీ కేవలం ఎనిమిది వేల మెగావాట్స్ మాత్రమే ప్రస్తుతం విద్యుదుత్పాదన జరుగుతోంది. వర్షాలు పడటంతో పంటల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ మోటార్లను రైతాంగం విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని ట్రాన్స్ కో అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది. సౌర, పవన, విద్యుత్ సంస్ధల నుంచి విద్యుత్ తీసుకునేందుకు ప్రభుత్వం నిరాకరించింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను పున సమీక్షించాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై సౌర, పవన, విద్యుత్ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో, కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో సౌర, పవన, విద్యుత్ సంస్థలపై ఉన్న విభేదాలతో  వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం విద్యుత్ సరఫరాను తీసుకోవటం నిలిపివేసింది. దీనివల్ల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు థర్మల్ స్టేషన్ల పై ఆధారపడింది. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ఎక్కువగా ఉండటం వల్ల అదనంగా పది లక్షల టన్నుల బొగ్గు నిల్వలు కరిగిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం బొగ్గు కొరత ఏర్పడింది. ఒడిశాలో ఉన్న బొగ్గు గనుల నుంచి కూడా సరఫరా తగ్గిపోయింది. మహారాష్ట్రలో ఎన్నికలుండటంతో ఒడిశా నుంచి బొగ్గును మహారాష్ట్రకు తరలించి అక్కడ విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఏపీకి బొగ్గు సరఫరా నిలిచిపోయాయి ఫలితంగా థర్మల్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన తగ్గిపోయింది. అందువల్లే విద్యుత్ కోతలు పెరిగాయి. వివిధ విద్యుత్ కంపెనీలకు బకాయిలు చెల్లించకపోవడంతో జాతీయ విద్యుత్ ఎక్స్ చేంజ్ లో ఏపీని బ్లాక్ లిస్టులో చేర్చారు. దీంతో బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు సాధ్యం కాలేదు.వెంటనే నూట ఇరవై ఐదు కోట్లు కొన్ని విద్యుత్ సంస్థలకు చెల్లించింది ఏపీ ప్రభుత్వం .దాంతో ఏపీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. అయితే ఇప్పటికే అక్కడ మిగులు విద్యుత్ అమ్మకాలు పూర్తి అయ్యాయి. వివిధ రాష్ట్రాలు తమ వద్ద ఉన్న మిగులు విద్యుత్ ను ఇప్పటికే వేరే రాష్ట్రాలకు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో విద్యుత్ కొనుగోలుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏ రాష్ట్రం దగ్గరైనా మిగులు విద్యుత్తు ఉందేమోనని ఏపీ అధికారులు వాకబు చేస్తున్నారు. బొగ్గు లభ్యత పూర్తిగా పడిపోవడంతో విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన డెబ్బై శాతానికి పైగా పడిపోయింది. విదేశాల నుంచి ఓడల్లో వస్తున్న బొగ్గుతో ప్రస్తుత ఒక యూనిట్ లో మాత్రం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరో యూనిట్ పాక్షికంగా పని చేస్తోంది. దీంతో విద్యుత్ కష్టాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు.

ఉండవల్లి నోట తిరుగుబాటు మాట... జగన్ పై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా?

  వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మొదటిసారి మీడియా ముందుకొచ్చి ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే మొదట్నుంచీ సాఫ్ట్ కార్నర్ చూపించే ఉండవల్లి... పొంచివున్న ముప్పును సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గానే చెప్పేశారు. చరిత్రను గుర్తుచేస్తూమరీ హెచ్చరికలు చేశారు. 51శాతం ఓట్లు... 151 సీట్లు వచ్చాయని విర్రవీగొద్దని చెప్పకనే చెప్పారు. జాతీయ పార్టీల్లో నేతలకు తమ అసంతృప్తిని, ఆవేదనను చెప్పుకోవడానికి హైకమాండ్స్ ఉంటాయన్న ఉండవల్లి... వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు అన్నీ జగనేనని, అందువల్ల ఎమ్మెల్యేల మనసు గెలుచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి తామంటే నమ్మకముందనే విశ్వాసం ఎమ్మెల్యేల్లో కలిగించాలన్నారు. లేదంటే తిరుగుబాటు వచ్చే ప్రమాదముందని చరిత్రను తవ్వితీశారు. 1972లో పీవీ నర్సింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ 56శాతం ఓట్లు... 219 సీట్లు వచ్చాయని, కానీ పీవీని 9నెలల్లోనే దింపేశారని గుర్తుచేశారు. ఇక, 1984లో టీడీపీకి 54శాతం ఓట్లు... 213 సీట్లు వచ్చాయని, కానీ 9నెలల్లోనే ఎన్టీఆర్ కూడా కుర్చీ దిగాల్సి వచ్చిందనే విషయం మర్చిపోవద్దన్నారు. అయినా, ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరగబడతారని ఎవరైనా అనుకున్నారా? అన్న ఉండవల్లి... రాజకీయాల్లో ఊహించనవే జరిగే వీలుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉండవల్లి హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ఇప్పుడు జగన్ నైనా దింపేస్తారంటూ చరిత్రను గుర్తుచేస్తూ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడున్న 151మంది ఎమ్మెల్యేల బలాన్ని చూసుకుని... ఇదే శాశ్వతమని భావించొద్దని జగన్ ను సూచించిన ఉండవల్లి.... ప్రజల్లో మంచి పేరుతోపాటు ఎమ్మెల్యేల మనసు కూడా గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోతే పీవీ నర్సింహరావు, ఎన్టీ రామారావుకి పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు.  అయితే, ఉండవల్లి నోట తిరుగుబాట మాట అనే మాటలను చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. లేదంటే జగన్ పరిపాలనపై మొదటి మీడియా మీడియా సమావేశంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే మామూలు విషయం కాదు. ఏదో ఆషామాషీగా ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేయరు. తనకొచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకే ఉండవల్లి రియాక్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పదేపదే మీ ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉండాలంటూ ప్రస్తావించడం చూస్తుంటే.... మంత్రులు, ఎమ్మెల్యేలు... జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే భావించాలి. ఏదిఏమైనా అధికారం శాశ్వతం కాదని, ఎమ్మెల్యేలు సంతోషంగా లేకపోతే... మీ వాళ్లే మీ మీద తిరగబడతారంటూ... జగన్ కు పొంచివున్న ముప్పుపై ఉండవల్లి హెచ్చరించారు.

కేసీఆర్ ని టెన్షన్ పెట్టిస్తున్న ఖమ్మం.. తుమ్మల, పొంగులేటి.. ఇద్దరిలో ఎవరో ఒక్కరే!!

  తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించింది. అయితే  ఖమ్మం జిల్లాలో మాత్రం మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. రాష్ట్రమంతా కారు టాప్ గేరులో దూసుకుపోతే.. ఖమ్మంలో మాత్రం ఫస్ట్ గేర్ లోనే బ్రేకులు పడ్డాయి. దీంతో కేసీఆర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అనూహ్యంగా లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరింది. 'సారు కారు పదహారు' అంటూ లోక్ సభ పోరుకి హుషారుగా దూసుకెళ్లిన టీఆర్ఎస్ కు.. బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో షాకిచ్చాయి. కానీ ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో ఖమ్మం ఫలితాలు గులాబీ బాస్ కి ఎప్పటికీ అంతుబట్టని ఓ ప్రశ్నలా మిగిలిపోయాయి. ఖమ్మం జిల్లా ఫలితాలే కాదు, రాజకీయాలు కూడా కేసీఆర్ కి అంత ఈజీగా అర్థంకావట్లేదని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటే గెలిచినప్పటికీ.. తరువాత ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో బలపడింది. ఆ బలం ఎంపీ సీటు గెలవడానికి ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్.. తరువాత టీఆర్ఎస్ లో చేరి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో.. జిల్లాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి వారి ఓటమికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి. దీంతో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. ఎన్నిక‌ల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వ‌ర‌రావుకి టికెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి టీఆర్ఎస్ ని వీడరతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఆయనకు రాజ్యసభ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో పార్టీని వీడే ఆలోచనను అప్పుడు పొంగులేటి పక్కన పెట్టారని వార్తలొచ్చాయి. మరోవైపు సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాలో ప‌ట్టు నిలుపుకుంటున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, మాజీ మంత్రి, జిల్లాలో సీనియర్ నేతగా మంచి పట్టు, తనున్న పార్టీ అధికారంలో ఉండటం.. అయితే ఇన్నున్నా తనకి ప్రస్తుతం ఏ పదవి లేకపోవడంతో తుమ్మల అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తనకి మళ్లీ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తారనుకున్నారట. కానీ కేసీఆర్ మాత్రం.. ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. మరోవైపు తుమ్మలకి కూడా రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే తుమ్మల మొదటినుండి కేంద్ర రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు కాదు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడి మేనేజ్ చేయడం కష్టం అనేవాళ్ళు. మరి అలాంటి తుమ్మలను.. ఇప్పుడు రాజ్యసభకు పంపుతానంటే అంగీకరిస్తారా అంటే అనుమానమే. ప్రస్తుతం తుమ్మల, పొంగులేటి ఇద్దరిది ఇంచుమించు ఒకటే పరిస్థితి. జిల్లాలో పట్టుంది కానీ పదవి లేదు. ఒకవేళ భవిష్యత్తులో పదవి దక్కినా ఇద్దరిలో ఎవరో ఒక్కరికే దక్కే అవకాశముంది. దీనికితోడు జిల్లాలో వీరిద్దరి మధ్య వర్గపోరు కూడా నడుస్తుందని అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు టీఆర్ఎస్ ని వీడి బీజేపీ గూటికి చేరే అవకాశముందని అంటున్నారు. తుమ్మలకు ఆయన అనుచరులు పార్టీ మారమని సూచిస్తున్నారట. ఇప్పటికే తుమ్మల సమీప బంధువు గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరడంతో.. ఆయన ద్వారా సంప్రదింపులు జరిపి బీజేపీలో చేరే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు పొంగులేటి అనుచరులు కూడా పార్టీ మారాలని ఆయన మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో పొంగులేటి బీజేపీలో చేరే ఆలోచనలో పడ్డారట. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ రెండు స్థానాలకు అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. మరి ఆ పోటీలో పొంగులేటికి అవకాశం దక్కుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీలో చేరడం కరెక్ట్ అని భావిస్తున్నారట. మరి తుమ్మల, పొంగులేటి ఇద్దరిలో ఎవరో ఒకరు బీజేపీలో చేరతారో లేక ఇలాగే టీఆర్ఎస్ లో కొనసాగుతారో చూడాలి. మొత్తానికి ఖమ్మం రాజకీయాలు గులాబీ బాస్ ని తెగ కలవరపెడుతున్నాయట.

కొందరి కోసం లక్షల మందిని దూరం చేసుకుంటున్న జగన్!!

  గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా లక్షకు పైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించడం రికార్డు అని ఏపీ ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. సచివాలయాల వ్యవస్థతో తమ పార్టీకి ఇటు యువతలో, అటు గ్రామ ప్రజల్లో బోలెడంత మైలేజ్  వస్తుందని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ప్రజల అభిప్రాయం పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు.. సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీ, ఒకే సామజిక వర్గానికి పెద్ద పీట ఇలా పలు కారణాలు ఉన్నాయి అంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. దాదాపు 20 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లక్ష మందికి పైగా (1,26,738) ఎంపిక అయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ లోపంతో ఎక్కువ మంది అర్హతలేని వారు ఉద్యోగానికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, తన సానుభూతి పరులకు ముందే పేపర్ లీక్ చేసి పరీక్ష రాయించారని ప్రచారం జరిగింది. మొదటి 250 ర్యాంకుల్లో ఒకే సామజిక వర్గానికి చెందినవారు 190 కి పైగా ఉండటంతో లీకేజీ అనుమానాలు బలపడ్డాయి. దీంతో స్వల్ప తేడాతో ఉద్యోగం చేజారిన వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అర్హులైన వారిని పక్కనపెట్టి.. తమ పార్టీ సానుభూతిపరులకు, తమ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ భావిస్తున్నట్లు సచివాలయాల వ్యవస్థ వల్ల అధికార పార్టీకి మైలేజీ వస్తుందన్న సంగతి పక్కన పెడితే.. బోలెడంత నెగటివ్ ఇమేజ్ వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరీక్ష నిర్వహణ లోపం, ఫలితాలపై కులముద్ర పడటంతో మిగతా కులాల వారిలో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 18 లక్షల మందికి పైగా నిరాశ తప్పలేదు. ఎంపికైన లక్షమంది మరియు వారి కుటుంబాలు జగన్ సర్కార్ పట్ల ఎంత సానుకూలంగా ఉంటారో.. అంతకు పదింతలు ఎంపిక కాని లక్షల కుటుంబాల వారు జగన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండే అవకాశముంది. పరీక్ష నిర్వహణ లోపం వల్లే తమకు ఉద్యోగం దక్కలేదని మెజారిటీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అది జగన్ సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంపిక కాని అభ్యర్థులు జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సొసైటీ మీద సోషల్ మీడియా ప్రభావం బలంగా ఉంది. అంతెందుకు వైసీపీ అధికారంలోకి రావడంలో కూడా సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడదే సోషల్ మీడియాలో యువత జగన్ సర్కార్ పై తిరగబడుతోంది. ఇది మరింత ఉధృతమైతే వైసీపీకి తీవ్ర నష్టమని చెప్పక తప్పదు. ఓ రకంగా సచివాలయ వ్యవస్థ కూడా ఇసుక మాదిరిగానే లక్షల కుటుంబాలపై ప్రభావం చూపి వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనుందని చెప్పాలి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. లారీ డ్రైవర్లు, కూలీలు ఇలా లక్షల కుటుంబాలు పని దొరక్క రోడ్డున పడ్డాయి. వారంతా జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సచివాలయ ఉద్యోగాలు దక్కని అభ్యర్థుల కుటుంబాలు కూడా చేరితే.. జగన్ మరింత గడ్డు కాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సాక్షి ఉద్యోగుల పంట పండుతోంది... ఇక మిగిలింది కొమ్మినేని ఒక్కరే..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో సాక్షి ఉద్యోగుల పంట పండుతోంది. ఒకరి తర్వాత మరొకరికి కేబినెట్ ర్యాంక్ పదవులు దక్కుతున్నాయి. సీనియర్ ఐఏఎస్ లను మించిన జీతాలు, సౌకర్యాలతో కీలక పదవులు కట్టబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా నియమించుకుని కేబినెట్ ర్యాంకు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి... ఆ తర్వాత సాక్షి ఉద్యోగులు కృష్ణమోహన్, హరికృష్ణలను సీఎంవోలోకి తీసుకున్నారు. ఇక తెలంగాణ జర్నలిస్టు దేవుపల్లి అమర్ ను జాతీయ మీడియా - ఇంటర్ స్టేషన్ మీడియా సలహాదారుగా నియమించుకుని నెలకు దాదాపు 4లక్షల జీతం, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఇక ఇఫ్పుడు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తిని ప్రజాసంబంధాల సలహాదారుగా నియమించారు. అయితే, రామచంద్రమూర్తి కూడా తెలంగాణ జర్నలిస్టే. అయితే, వీళ్లందరికీ సాక్షిలో ఏ స్థాయిలో జీతాలు ఇచ్చారో తెలియదు కానీ, ప్రభుత్వం మాత్రం 4లక్షలపైనే వేతనమిస్తూ, అలవెన్సులు, సౌకర్యాలు అదనంగా కల్పిస్తోంది. ఇక వీళ్లే కాకుండా, పీఆర్వోలుగా, ఫొటో-వీడియోగ్రాఫర్లుగా, ఆఫీస్ బాయ్ లుగా దాదాపు 150మంది సాక్షి ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ డిజిటల్ మీడియాలోకి మరో 150మంది సాక్షి ఉద్యోగులనే తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, సజ్జల, దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి, కృష్ణమోహన్, హరికృష్ణను వివిధ హోదాల్లో నియమించుకుని, పలువురికి కేబినెట్ ర్యాంక్ హోదా కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి... వీరభక్తుడైన కొమ్మినేని శ్రీనివాసరావుకు మాత్రం అన్యాయం చేస్తున్నారనే మాట వినిస్తోంది. తెలంగాణ జర్నలిస్టులందరికీ పెద్దపీట వేసిన జగన్..... అసలుసిసలు ఆంధ్రా జర్నలిస్టుకు మాత్రం ఇంకా ఎందుకు పదవి ఇవ్వలేదని అంటున్నారు. సాక్షిలో పెద్ద తలకాయలందరికీ దాదాపు పదవులిచ్చేశారు... ఇక, కొమ్మినేనికి కూడా ఏదోఒక కీలక పదవి ఇచ్చేస్తే బ్యాలెన్స్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. మరి వీరభక్తుడికి జగన్ ఏ పదవి కట్టబెడతారో చూడాలి.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలు... పేరు మార్చుతారన్న ప్రచారంపై కలకలం...

ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. దాంతో ఎవరు అధికారంలోకొస్తే, వాళ్లు తమ వర్గానికి పెద్దపీట వేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. చంద్రబాబు హయాంలో తన సామాజిక వర్గానికే ప్రతిచోటా కీలక పదవులను కట్టబెట్టారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది కూడా టీడీపీ ఘోర పరాజయం పాలవడానికి కారణాల్లో ఒకటని అంటారు. ఇక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో... రెడ్డి కమ్యూనిటీకి పెద్దపీట వేస్తున్నారనే మాట వినిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50శాతం కోటా అంటూ చట్టం తెచ్చినప్పటికీ, కీలక పదవుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకే పెద్దపీట దక్కుతుందనేది ఆరోపణ. అయితే, ఈ కుల రాజకీయాలు... విశ్వవిద్యాలయాల్లో కూడా అలజడి సృష్టిస్తున్నాయట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక వైద్య విశ్వవిద్యాలయంలో ఇఫ్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, ఆ సామాజికవర్గ ప్రముఖులు.... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో పాగా వేయడానికి సిద్ధమయ్యారట. అందులో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ సీవీరావును తప్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారట. దాంతో ఎందుకొచ్చిన తలపోటని సీవీరావు రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఇష్యూ... సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో అతిత్వరలోనే, వీసీ సీవీరావును తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు స్వయంప్రతిపత్తి కలిగిన వైద్య విశ్వవిద్యాలయంపై వైద్యారోగ్యశాఖ ముఖ్య అధికారి అప్పుడే తనదైన శైలిలో పెత్తనం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ముందు పెద్ద తలకాయలను తప్పిస్తేనే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో తాము అనుకున్నది చేయగలుతామని నిర్ణయానికి వచ్చిన జగన్ సామాజికవర్గ నేతలు, అధికారులు.... ముందుగా వీసీని వెంటనే తప్పించాలని జగన్ పై ఒత్తిడి పెంచారట. అంతేకాదు, అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని సీఎం దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తొలగించాలని జగన్ సామాజికవర్గం డిమాండ్ చేస్తోందట. అయితే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలపై అక్కడి అధికారులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడేళ్ల పదవీ కాలానికి ఎన్నికైన సీవీరావును వీసీగా తప్పిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక, యూనివర్శిటీ పేరు మార్చుతారన్న ప్రచారంపైనా ఉద్యోగులు ఫైరవుతున్నారు. ఎన్టీఆర్ పేరును తొలగిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు.

చంద్రబాబు బాటలో జగన్... వన్‌మ్యాన్‌ ఆర్మీలా పరిపాలన..!

చంద్రబాబు తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు వేయడం మొదలుపెట్టారట. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. విప్లవాత్మక నిర్ణయాలతో తాను దూసుకుపోతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు... తన స్పీడ్ ను అందుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తంచేస్తున్నారట. అంతేకాదు తన అంచనాలు ఒకలా ఉంటే... మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మాత్రం మరోలా ఉందని జగన్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. క్లిష్ట సమయాల్లో కీలక పరిస్థితుల్లో మంత్రులు చాకచక్యంగా వ్యవహరించలేకపోతున్నారని జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా విపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారంటూ మంత్రులకు జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారని జగన్ ఫైరయ్యారట. ముఖ్యంగా గత ప్రభుత్వం కంటే గొప్పగా మనమేం చేస్తున్నామో చెప్పుకోవడంలో ఇటు మంత్రులు... అటు ఎమ్మెల్యేలు వెనుకబడుతున్నారని జగన్ క్లాస్ పీకారట. అయితే, జగన్ స్పీడ్‌ను తట్టుకోలేక మంత్రులు ఇబ్బంది పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా, అంతే వేగంగా రిసీవ్ చేసుకోలేకపోతున్నామని అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఉంటోందని చెబుతున్నారు. దాంతో ఒక్క సీఎం తప్పా...మిగతా వాళ్లెవరూ పనిచేయడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిందని, అదే సమయంలో పరిపాలన మొత్తం జగన్ వన్‌మ్యాన్‌ ఆర్మీలా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ఇదే పరిస్థితి కొనసాగితే, ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

సాక్ష్యాలతో దొరికిన ఆమంచి.. సొంత పార్టీ వ్యక్తి పైనే దాడి!!

  చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల నాగార్జున రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన వ్యక్తులు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులని వార్తలొచ్చాయి. అంతేకాదు అసలు జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి.. ఆమంచి మరియు అతని అనుచరుల అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జున రెడ్డి కూడా తనపై.. ఆమంచి బంధువులు, అనుచరులు దాడి చేశారని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఆమంచి మాత్రం ఇదంతా పచ్చి అబద్దం, ఇది టీడీపీ ఆడిస్తున్న నాటకం అని కొట్టి పారేసారు. అంతేకాదు.. 'నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదు. ఇటీవల ఎన్నికలలో టీడీపీ ఏజంట్‌ గా పనిచేసాడు. టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.' అని ఆమంచి చెప్పుకొచ్చారు.   అయితే ఆమంచి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు అబద్దమని రుజువు చేస్తూ సోషల్ మీడియాలో ఆధారాలు దర్శనమిస్తున్నాయి. నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదని ఆమంచి అన్నారు. కానీ ఆమంచి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో, అదే పార్టీ అధినేతకు చెందిన మీడియా సంస్థలో నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ గా పనిచేసారు.     అదేవిధంగా నాగార్జున రెడ్డి.. ఎన్నికలలో ఏజంట్‌ గా పనిచేసిన మాట వాస్తవమే కానీ.. ఆయన పనిచేసింది టీడీపీ కోసం కాదు ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. నాగార్జున రెడ్డి టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఆమంచి చెప్పుకొచ్చారు. కానీ నిజానికి నాగార్జున రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అంతెందుకు వైఎస్ జగన్ తో కలిసి పాదయాత్రలో కూడా పాల్గొన్నారు.     మరి ఇవన్నీ తెలియకుండానే 'నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ కాదు, టీడీపీకి చెందిన వ్యక్తి' అని ఆమంచి వ్యాఖ్యలు చేసారా?. ఏది ఏమైనా ఆధారాలతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమంచిని ఏకేస్తున్నారు. అంతేకాదు ఆమంచి కుటుంబం మీద ఉన్న కేసుల లిస్ట్ ని కూడా ప్రస్తావిస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమంచి తండ్రి మీద.. హత్య, దొంగసారా మరియు హత్యాయత్నం కింద పలు కేసులు నమోదయ్యాయి. ఆమంచి సోదరుడిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఆమంచి వర్గీయలు చీరాలలో పలువురిపై దాడి చేసిన ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై గతంలో కూడా ఆమంచి సోదరుడు, అనుచరులు దాడి చేసాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆమంచి వర్గీయులే తన మీద దాడి చేసారని నాగార్జున చెప్తున్నాడు. కానీ ఆమంచి మాత్రం సింపుల్ గా.. అతను జర్నలిస్ట్ కాదు, టీడీపీ వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ వ్యక్తి అయితే జగన్ తో పాదయాత్రలో ఎందుకు పాల్గొన్నాడు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన వ్యక్తే ఆమంచి మరియు అతని వర్గీయులపై ఫిర్యాదు చేస్తున్నారు అంటే.. చీరాలలో వారి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు అంటున్నారు. ఆమంచి మరియు అతని వర్గీయులు చీరాలలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతు భరోసా సగానికి సగం కోత... అన్నదాతలకు జగన్ సర్కారు షాక్..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను చూస్తుంటే... కోటలు దాటుతున్నాయ్. కానీ అమలు దగ్గరికి వచ్చేసరికి మాత్రం అసలు రూపం బయటపెడుతున్నారు. అమ్మఒడి పథకం నుంచి రైతుభరోసా పథకం వరకు అన్నింటా ఇదే జరుగుతోంది. వైసీపీ నవరత్నాల్లో భాగంగా ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... లబ్దిదారులను సగానికి సగం తగ్గించేందుకు వడపోత ప్రారంభించారు. అక్టోబర్ నుంచే వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేస్తామని గొప్పగా ప్రకటించిన జగన్... మార్గదర్శకాల పేరుతో అన్నదాతలకు ఊహించని షాకిచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో సర్కారు ప్రకటించిన లబ్దిదారుల సంఖ్య... సగానికి సగం తగ్గిపోయింది. కౌలు రైతులతో కలుపుకొని 64లక్షల పైగా(రైతులు 48.7లక్షలు, కౌలు రైతులు 15.37లక్షలు) సాగుదారులు ఉన్నారని, వారందరికీ పెట్టుబడి సాయం అందిస్తామంటూ వ్యవసాయ బడ్జెట్ లో స్పష్టంగా పేర్కొన్న జగన్ సర్కారు... గైడ్ లైన్స్ అండ్ వడపోత తర్వాత ఆ సంఖ్యను దాదాపు 36లక్షలకు కుదించేసింది. ఎన్నికల టైమ్ లో ప్రతి రైతుకూ 12వేల 500 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామన్న జగన్మోహన్ రెడ్డి.... ఇఫ్పుడు కేంద్రం ఇస్తోన్న 6వేలు పోను... మిగతా 6500లను మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, కేంద్రం అమలు చేస్తోన్న గైడ్ లైన్స్ నే జగన్ సర్కారు కూడా ఫాలో కావాలని నిర్ణయించింది. కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం లబ్దిదారుల సంఖ్య  29.45లక్షలకు పడిపోయింది. ఎన్నికలవేళ కేంద్రం మొదటగా ఏపీలో దాదాపు 43లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్ మనీ జమచేయగా, రెండో విడతకు వచ్చేసరికి పలురకాల కండీషన్స్ తో లబ్దిదారుల సంఖ్యను 33లక్షలకు తగ్గించేసింది. ఇక మూడో విడత వచ్చేసరికి ఆ సంఖ్య 29.45లక్షలకు పడిపోయింది. కేవలం మూడే మూడు నెలల్లో గైడ్ లైన్స్ పేరుతో ఏకంగా పదమూడున్నర లక్షల మంది రైతులను అర్హుల జాబితాలో నుంచి తొలగించేసింది. అయితే, కేంద్రం ఇస్తోన్న సొమ్ముతో కలిపే 12వేల 500 ఇస్తామంటూ మెలిక పెట్టిన జగన్ సర్కారు... అదే గైడ్ లైన్స్ ఫాలో అవుతూ, లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం కోత పెట్టింది. కేంద్రం ఎవరి ఖాతాల్లో అయితే, మూడు విడతల్లో 6వేల రూపాయలు జమ చేసిందో... వాళ్లకే మిగతా ఆరున్నర వేలు వేయనున్నట్లు తెలుస్తోంది. సొంత భూమి కలిగిన రైతుల విషయంలో గైడ్ లైన్స్ ఇలాగుంటే, ఇక కౌలు రైతుల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కౌలు రైతులకు కేంద్రం నయా పైసా ఇవ్వకపోవడంతో, మొత్తం 12వేల 500 తామే ఇస్తామంటోంది జగన్ సర్కారు. అయితే, గైడ్ లైన్స్ అండ్ కండీషన్స్ పేరుతో కౌలు రైతుల సంఖ్యను కూడా 16లక్షల నుంచి ఐదారు లక్షలకు తగ్గించి, పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేంద్రం గైడ్ లైన్స్ అండ్ కండీషన్స్ పేరుతో వైఎస్సార్ రైతు భరోసా లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం కోత పెట్టిన జగన్ సర్కారు... కేవలం 30లక్షల్లోపు రైతులకే సాయం అందించినున్నట్లు తెలుస్తోంది.

లింగమనేని వర్సెస్ జగన్ సర్కార్... ఏపీలో కరకట్ట రాజకీయం...

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసముంటోన్న లింగమనేని రమేష్‌ ఇల్లు కూల్చివేత నోటీసులపై వైసీపీ-టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తన ఇంటిని పక్కా నిబంధనలను పాటించే నిర్మించానని లింగమనేని చెబుతుంటే... రమేష్‌ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. అంతేకాదు తన ఇంటిని కూల్చివేయవద్దంటూ సీఎం జగన్‌కు లింగమనేని లేఖ రాయడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. కృష్ణా కరకట్టపై గెస్ట్‌ హౌస్ కూల్చివేతకు నోటీసులు ఇవ్వడంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన లింగమనేని రమేష్‌.... అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే, నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కూల్చివేతల వల్ల తన ఒక్క కుటుంబమే ప్రభావితం కాదని, రాష్ట్ర ప్రజలందరూ అవుతారన్నారు. నిర్మాణాల కూల్చివేత... రాజధాని ప్రాంతంలో లక్షలాది మందిని నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసిందన్నారు. ఉండవల్లి అతిథిగృహానికి 2012లోనే చట్టపరంగా అన్ని అనుమతులతో పాటు ఇరిగేషన్‌ శాఖలోని కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నుంచి ఎన్‌వోసీ కూడా తీసుకున్నామని, 2014లో ఇక్కడి నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేకపోవడంతో కరకట్ట మీదున్న తన గెస్ట్‌ హౌస్‌ను అధికార నివాసానికి ఇచ్చానన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధిత ఆలోచనలు ఇందుల్లేవన్నారు. లింగమనేని లేఖపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఘాటుగా రియాక్టయ్యారు. లేఖలో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. చంద్రబాబు వల్ల లబ్ది పొందకుంటే... తన ఇంటిని ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. అక్రమంగా భవనాలు కట్టారు కాబట్టే... ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ లేఔట్లతో ప్రభుత్వ భూములను లింగమనేని ఎలా కొల్లగొట్టారో ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. మొత్తానికి కరకట్టపై కూల్చివేతల రాజకీయం రోజురోజుకీ హీటెక్కుతోంది. మరోవైపు లింగమనేని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ షాక్...

తెలంగాణ లోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డిని నిర్ణయిస్తూ ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉత్తమ కుమార్ రెడ్డి తన సతీమణి కి కాంగ్రెస్ టికెట్ కేటాయించి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి కి సోనియా గాంధీ షాకిచ్చారు. రేవంత్ రెడ్డి తన అనుచరుడు అయిన శ్యామల్ కిరణ్ రెడ్డి కి టిక్కెట్ ఇవ్వాలని ఏఐసీసీ కి నివేదించుకున్నా సోనియగాంది కనికరం చూపలేదు. దీంతో పిసిసి లో ఉత్తమ్ మాటకు తిరుగులేదని తేలిపోయింది. హుజూర్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి పేరు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కోదాడ నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ గెలుపొందలేదు. కోదాడ నుంచి టీ.ఆర్.ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపొందారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది లోకసభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గానికి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్టోబర్ ఇరవై ఒకటిన ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ అక్టోబర్ ఇరవై నాలుగున జరగనుంది. ఇక టీ.ఆర్.ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైది రెడ్డిని సీ.ఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సైదురెడ్డికి సీఎం కేసీఆర్ బీఫారం కూడా అందజేశారు. ఆయన గత ఎన్నికలకు ముందు ఎన్నారై గా ఉంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చి ఏడు వేల ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావడంతో పోరు రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాఖగా ఉన్న హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అధికార పార్టీకి గట్టి పోటీ తప్పదన్న చర్చలు నడుస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి ముప్పై వేల మెజారిటీ ఖాయమని ప్రకటించాడు. దీంతో టీ.ఆర్.ఎస్ ఈ ఎన్నికను ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఉత్తమ్ సొంత కోటాలో గులాబీ జెండా ఎగరవేసేందుకే టీ.ఆర్.ఎస్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మధ్యలో బిజెపి సైతం గణనీయంగా ఓట్లు సాధించేందుకు రెడీ అవుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కేసీఆర్ కు సవాల్ గా మారింది.

దుమారం రేపుతున్న అమరావతి హై కోర్టు వివాదం...

  ఏపీలో హై కోర్టు వివాదం తీవ్రరూపం దాల్చుతోంది, హైకోర్టు కావాలంటూ సీమలో ఆందోళన ఊపందుకుంది. హై కోర్టుని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదని ఆంధ్రాలో లాయర్ లు ఉద్యమ బాట పట్టారు. దీంతో ఏపీలో హై కోర్టు వివాదం తీవ్రస్థాయికి చేరుతోంది. శ్రీబాగ్ ఒప్పందం గుర్తు చేస్తూ సీమలోని న్యాయవాదులు కదం తొక్కుతున్నారు. రాజధాని విషయంలోనే సీమకు అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు గుంటూరులో ఐదు జిల్లాల న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు అయితే, రాయలసీమకు హై కోర్టు కావాల్సిందేనని కర్నూలులో లాయర్లు రిలే, నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారనే ప్రచారం మొదలైన క్షణం నుంచి రాయలసీమలో ఉద్యమాలు మొదలయ్యాయి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు ఊపందుకున్నాయి. కర్నూలు, కడప జిల్లా న్యాయవాదులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు, సామాజికవేత్తలతో కలిసి పోరు బాట పట్టారు. సీమకు మొదట్నుంచీ అన్యాయం జరిగిందని హై కోర్టు విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని న్యాయవాదులు అంటున్నారు. హైకోర్టు సీమకు ఇవ్వాలంటూ కడప, కర్నూలు జిల్లాలో ఇప్పటికే రిలే, నిరాహార దీక్షలు నడుస్తుంటే తాజాగా అనంతపురంలో కూడా సీమకు హైకోర్టు నినాదంతో ఆందోళనలు మొదలయ్యాయి. అనంతపురం కోర్టు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు న్యాయవాదులంతా విధుల బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించరాదని దాన్ని అనుసరించి సీమకు న్యాయం చేయాలని అక్కడి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. హై కోర్టు కోసం ఆంధ్రా లోనూ అలజడి మొదలైంది, అమరావతి నుంచి హైకోర్టును తరలిస్తే ఊరుకునేది లేదంటూ ఆంధ్రాలోని ఆరు జిల్లాల న్యాయవాదులు ఉద్యమ బాట పట్టారు. హై కోర్టు రాజధానిలోనే ఉండాలని అమరావతి నుంచి మరో ప్రాంతానికి ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే గుంటూరులో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఉద్యమించామని, ఇప్పుడు వచ్చిన హైకోర్టును ఎలా వదులుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, నెల్లూరుతో పాటు ఉభయ గోదావరి జిల్లాల న్యాయవాదులు గుంటూరులో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

హుజూర్ ఉప ఎన్నికల్లో టిడిపి పరిస్థితేంటి..?

టిడిపి హుజూర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, అది చాలా తప్పుడు సంకేతం వెళ్లింది, కార్యకర్తలందరూ కూడా చాలా నిరుత్సాహపడిపోయారు కానీ, ఇప్పుడు మరోసారి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో ఉంటూనే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా కూడా సమీక్షలు చేస్తూ కొంత యువ నాయకులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నిక వచ్చిన సందర్భంలో టిడిపి నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మిగిలిన టిడిపి నాయకులు కూడా నర్సిరెడ్డి లాంటి నాయకులకి టికెట్ ఇస్తే కొంత టిడిపికి ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. అయితే, నర్సిరెడ్డి ఇప్పటికే అన్ని కార్యక్రమాల్లో స్టేజ్ పై మాట్లాడుతూ కొంత యాక్టివ్ గా ఉన్నారు. ఇలాంటి నాయకులని ప్రోత్సహిస్తే మరోసారి టిడిపికి కొంత ఊపు వచ్చే అవకాశముంటుంది. కాబట్టి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇది అంత సులభంగా జరిగే పని కాదు, ఖర్చు ఒక ఎత్తయితే ఇప్పుడు పోటీ చేస్తే, పోటీలో వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, పోటీ కారణంగా లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పోటీకి నిలబడాలి. కాని, నాయకుల చెబుతున్నట్టుగా పోటీ చేసినంత మాత్రాన పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదనే చెప్పాలి.కానీ, చంద్రబాబు వ్యూహం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఇప్పుడు పోటీ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది అని చంద్రబాబు ఆలోచించే అవకాశాలున్నాయి. దీంతో నర్సిరెడ్డి లాంటి నాయకులు నిరుత్సాహపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా నాయకులను గుర్తించి , వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహించే ప్రయత్నాలైతే టిడిపి నాయకులు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం సరైన నిర్ణయం కాదని టిడిపి సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. కాకపోతే భవిష్యత్తులో మాత్రం పట్టు వదలకుండా నియోజకవర్గాల వారీగా నాయకులని ప్రోత్సహించే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందని, తెలంగాణ లో మరొక్కసారి మంచి రోజులొస్తాయనే ఆలోచనలో తెలంగాణ టిడిపి ఉన్నట్టుగా తెలుస్తోంది.

జగన్‌ను ఇరికించిన కేసీఆర్..! అయినా నిప్పు లేకుండా పొగ రాదు కదా.!

కేంద్రంపైనా, బీజేపీపైనా ఉమ్మడి పోరు చేయాలని కేసీఆర్-జగన్ ఏకాభిప్రాయానికి వచ్చారంటూ వచ్చిన కథనాలతో జగన్ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంపై ప్రముఖ పత్రికలు ప్రచురించిన కథనాలు జగన్ సర్కారులో గుబులు రేపుతున్నాయి.ప్రభుత్వం భయపడుతోంది. మోడీ గవర్నమెంట్ తోనూ, బీజేపీతోనూ సఖ్యతగా ఉంటూ వస్తోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... పేపర్లలో వచ్చిన కథనాలు చూసి కంగుతిన్నట్లు తెలుస్తోంది. దాంతో, కేంద్రం, బీజేపీ తీరుపై కేసీఆర్-జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటూ వచ్చిన కథనాలపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సమావేశంలో అసలు, కేంద్రం గురించి గానీ, అలాగే బీజేపీపైనా కానీ అస్సలు చర్చే జరగలేదని, ఇది దురుద్దేశపూరిత కథనం అంటూ ఏపీ సీఎంవో ప్రకటన ఇచ్చింది. అయితే, కేంద్రం తీరుపైనా, బీజేపీ విధానాలపైనా ముఖ్యమంత్రుల మీటింగ్ లో తీవ్ర చర్చ జరిగినట్లు ప్రముఖ ప్రతికలు కథనాలు ఇచ్చాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ప్రముఖ పత్రిక... కేంద్రం చిన్నచూపు-తెలుగు రాష్ట్రాల అసంతృప్తి అంటూ మెయిన్ హెడ్డింగ్ తో ఫ్రంట్ పేజీ వార్త ప్రచురించింది. అలాగే, ఏపీ, తెలంగాణలో బీజేపీ అనుసరిస్తోన్న విధానాలు సరిగా లేవు... తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు... ఏపీ, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం వ్యతిరేకిస్తోంది... కేంద్రానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు చేద్దామంటూ... ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారంటూ కథనం ఇచ్చింది. ఇక మరో పత్రిక... బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందాం... కనీసం గవర్నర్ల నియామకంపైనా రాష్ట్రాలను సంప్రదించలేదంటూ... కేసీఆర్-జగన్ మీటింగ్ పై కథనం ప్రచురించింది. దాంతో అప్రమత్తమైన జగన్ ప్రభుత్వం వెంటనే వివరణ ఇచ్చింది. కేంద్రం, బీజేపీ గురించి అస్సలు చర్చ జరగలేదని ప్రకటన చేసింది. అయితే, నిజంగానే కేంద్రం, బీజేపీ గురించి చర్చించకపోతే, తెలంగాణ సీఎంవో కూడా స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే కథనాలు నిజమేనని భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. నిప్పు లేకుండా పొగ రాదనే ఎంత సత్యమో... కేంద్రం తీరుపైనా, బీజేపీ విధానాలపైనా కేసీఆర్-జగన్ చర్చించకుండా కథనాలు రావనేది అంతే నిజం. అయితే, కేంద్రంతోనూ, మోడీ-అమిత్ షాతో సఖ్యతనే కోరుకుంటున్న జగన్ కు ఈ కథనాలు ఇబ్బంది కలిగించాయి. దాంతో వెంటనే సీఎంవోతో వివరణ ఇప్పించారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి వివరణ రాలేదు. దాంతో కేంద్రంపైనా, బీజేపీపైనా గుర్రుగా ఉన్నది కేసీఆర్ అయితే, అందులోకి జగన్ కి కూడా తెలివిగా లాగారనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ సవాలు విసురుతోంది... అలాగే 2023లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తోంది. దాంతో బీజేపీతో, మోడీతో కేసీఆర్ తీవ్రంగా విభేదిస్తున్నారు. పైగా మోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక, కేంద్రంలో కేసీఆర్ అస్సలు సత్సంబంధాలు కొనసాగించడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం అండ్ కాషాయ పార్టీతో కేసీఆర్ సై అంటే సై అంటున్నారని, కానీ మోడీ-అమిత్ షాతో తగువు పెట్టుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేని జగన్ ను ఇందులోకి లాగడంతోనే ఏపీ సీఎంవో వివరణ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. ప్రముఖ పత్రికల్లో వచ్చిన కథనాలతో కేసీఆర్ కు ఎలాంటి నష్టం లేకపోయినా, జగన్ కు మాత్రం ఇది కచ్చితంగా ఇబ్బందికర పరిణామమే అంటున్నారు విశ్లేషకులు.

తెలుగుదేశం కంచుకోటలకు బీటలు... అప్రమత్తం కాకపోతే కనుమరుగే..!

తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత విశాఖ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే పసుపు జెండాదే హవా కనిపిస్తుంది. వైజాగ్ రాజకీయాల్లో టీడీపీ ఛరిష్మా చారిత్రాత్మకం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. క్రమంగా వైసీపీ బలపడుతూ వచ్చింది. 2014లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన జగన్ పార్టీ... 2019కి వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకుని ఒక్క విశాఖ అర్బన్ మినహా జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అయితే, జగన్ సునామీలో కూడా విశాఖ అర్బన్‌లో నాలుగు స్థానాలను కైవసం చేసుకుని తెలుగుదేశం సత్తా చాటింది. అంతేకాదు ఓడిపోయిన నియోజకవర్గాల్లోనూ గట్టిపోటీనిచ్చి స్వల్ప తేడాలతోనే సీట్లను కోల్పోయింది. సీట్లు రాకపోయినా, ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదని, విశాఖ జిల్లాలో తెలుగుదేశం పునాదులు స్ట్రాంగ్ గా ఉన్నాయని రుజువు చేసింది. కానీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం గోడలకు బీటలు వారుతున్నాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు, వివాదాలతో ఒక్కో నియోజకవర్గంలో పట్టు కోల్పోతోంది. గంటాతో విభేదాలతో, ఎన్నికలకు ముందే అవంతి శ్రీనివాస్ వైసీపీ గూటికి చేరడంతో భీమిలిలో పట్టుకోల్పోయింది టీడీపీ. ఇక అవంతి బాటలోనే అయ్యన్నపాత్రుడు సొంత తమ్ముడు, తెలుగుదేశాన్ని వీడి... జగన్ గూటికి చేరనుండటంతో నర్సీపట్నం టీడీపీలో చీలికలు మొదలై పార్టీ బలహీనపడిందనే మాట వినిపిస్తోంది. అలాగే, విశాఖ డెయిరీ ఆడారి కుటుంబం వైసీపీలో చేరడంతో దాదాపు గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశం పట్టుకోల్పోందని అంటున్నారు. ఇక, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, వైజాగ్ అర్బన్ అధ్యక్షుడు రెహ్మన్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి, పార్టీ అధిష్టానం వరకు వెళ్లాయి. ఇలా, ప్రతి నియోజకవర్గంలో, ముఖ్యనేతల మధ్య విభేదాలు బయటపడుతుండటంతో, పార్టీ బలహీనపడుతుందనే మాట వినిపిస్తోంది. అయితే, త్వరలోనే జీవీఎంసీ ఎన్నికలు ఉన్నందున, అధిష్టానం అప్రమత్తమై... లీడర్లను సెట్ రైట్ చేయాలని, లేదంటే పార్టీకి నష్టం తప్పదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.   మొత్తానికి ఒకపక్క విభేదాలు-వివాదాలు... మరోపక్క వలసలతో విశాఖ టీడీపీ కష్టాల్లో పడింది. అయితే, తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వైజాగ్ లో టీడీపీకి మంచి పట్టుండటం, సాగరతీర రాజకీయాలను పసుపు జెండా శాసించిన రికార్డు ఉండటంతో, మళ్లీ ఆ కీర్తికిరీటాన్ని నిలబెట్టుకునేందుకు టీడీపీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది.

పోలవరం ప్రాజెక్టు రీడిజైనింగ్? కేసీఆర్-జగన్ భేటీ వెనుక సీక్రెట్ ఇదేనా?

  పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నం జరుగుతుందనే మాట వినిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్.... కేవలం ఎత్తు వల్లే తెలంగాణ, ఒడిషాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం... పోలవరం ఎత్తు తగ్గించేందుకు అంగీకరిస్తే, సమస్యలన్నీ సమసిపోతాయని చెప్పుకొచ్చారు. అయితే, పోలవరం ఎత్తు తగ్గించాలని తాను ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని, అందుకు జగన్ అంగీకరించారంటూ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించి కేసీఆర్ కలకలం రేపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే, ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ ప్రకటనపై అటు చంద్రబాబు... ఇటు ప్రజాసంఘాల నేతలు ఆనాడు మండిపడ్డారు. కేసీఆర్, జగన్ ఎవరైనాసరే పోలవరం ప్రాజెక్టు జోలికొస్తే ఊరుకునేది లేదని బాబు హెచ్చరించారు. 71శాతం పూర్తయిన ప్రాజెక్టుపై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు ఏపీ సీఎం ఒప్పుకున్నారంటోన్న కేసీఆర్ కి ఆంధ్రా పరిస్థితులు ఏం తెలుసని ప్రశ్నించారు. అసలు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కేసీఆర్ ఎవరని చంద్రబాబు నిప్పులు చెరిగారు. 55లక్షల క్యూసెక్యుల నీటిని దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టును డిజైన్ చేశారని, అందువల్ల ప్రాజెక్టు భద్రతతో రాజకీయ ఆటలాడొద్దని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఏదైనా జరగరానిది జరిగితే గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగలదని హెచ్చరించారు. అయితే, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, తాను అనుకున్నదే చేసుకుంటూ పోతున్న జగన్మోహన్ రెడ్డి... పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ఓకే చెప్పారనే మాట వినిపిస్తోంది. కారణాలు ఏమైనా, కేసీఆర్ మాటకు జగన్ అధిక విలువ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా జగన్ కు కేసీఆరే ముఖ్యసలహాదారుగా మారారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఏం చెబితే దానికి జగన్ ఎస్ అంటున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు కూడా జగన్ సానుకూలంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రుల మీటింగ్ లో పోలవరం ఎత్తు తగ్గింపు అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. రహస్య అజెండాగా పోలవరం ఎత్తు తగ్గింపుపై ఇద్దరి మధ్య చర్చలు సాగాయని అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ ప్రకటించినట్లుగా, పోలవరం ఎత్తు తగ్గింపునకు జగన్ ఒప్పుకుంటే, అది ఏపీలో కలకలం రేపే అవకాశం ఉంది. అలాగే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. అంతేకాదు కేసీఆర్ చెప్పినట్లుగా పోలవరం ఎత్తు తగ్గిస్తే... 196 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యమున్న ప్రాజెక్టులో 60 టీఎంసీలు తగ్గిపోయి... 130 టీఎంసీలకు పడిపోతుందని, అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం తప్పదని, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమకు అన్యాయం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, కేసీఆర్ మాటలకు తలొగ్గి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయాలని చూసినా, ప్రజల మనోభావాలతో ఆడుకున్నా, జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోవడం ఖాయమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ జగన్ ప్రభుత్వం.... రాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణకు తాకట్టు పెడితే, పెద్దఎత్తున ప్రజాఉద్యమాలు చేపడతామని తెలుగుదేశం లీడర్లు అంటున్నారు.