కన్న ఊరు కోసం ఉద్యోగాలు వదిలి పోరుబాట...
ప్రశాంత్, శ్రీకాంత్, వెంకటేశ్, చంద్రశేఖర్ రెడ్డి అనే యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు..ఐదెంకెల జీతాలతో ఎలాంటి చీకు చింతా లేకుండా హాయిగా జీవితాన్ని గడుపుతున్నవారు. ఇలాంటి సమయంలో తను పుట్టినఊరు కనుమరుగు కాబోతోందని..ఒక ప్రాజెక్ట్ తన ఊరులాంటి ఊళ్లను నామరూపాల్లేకుండా చేయబోతోందని తెలిసింది .. అంతే జననీ జన్మభూమిశ్చ స్వర్గదపి గరియసి అన్న సూత్రాన్ని నమ్మి వెంటనే తను పుట్టిపెరిగిన ఊరిని నాశనం చేసే ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. అంతే ఊరికంటే ఉద్యోగం ఎక్కువకాదని నమ్మి బంగారు భవిష్యత్ను పక్కనబెట్టి కదనరంగంలోకి దిగారు.
వీళ్లు ఉద్యోగాల్ని పక్కన బెట్టడానికి కారణమైన ప్రాజెక్ట్ సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో నిర్మించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రిజర్వాయర్ నిర్మాణానికి 21,441 ఎకరాలు సేకరించేందుకు అధికారులు భూమిని గుర్తించారు. ఈ భూములన్నీ తొగుట, కొండపాక మండలాల్లోని 18 గ్రామాలకు సంబంధించినవే. ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఈ గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయి. దానితో పాటు భూసేకరణ నిమిత్తం, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 123, 214 జీవోలను వర్తింపచేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి కేటాయించిన తర్వాత ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా 50 వేలు కూడా పలకని చోట 50 లక్షలకు పలుకుతోంది. ప్రభుత్వం ఎకరాకు రూ.5 లక్షల నుంచి 6 లక్షలు చెల్లించి చేతులు దులుపుకునేందుకు చూస్తుండటంతో నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. దీంతో వీరు ఆందోళనకు దిగారు..తమకు పరిహారం కింద ఎకరాకు రూ.25 లక్షలు, భూమికి భూమి, పునరావాసం, జీవనోపాధి కల్పించాలని పోరుబాట పట్టారు. ఈ విషయం హైదరాబాద్, బెంగుళూరు, మైసూర్ ప్రాంతాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఈ ప్రాంత బిడ్డలకు తేలియడంతో వారు తమ గ్రామాల్ని కాపాడుకోవాలని కంకణం కట్టుకున్నారు. ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకుని గ్రామగ్రామాన తిరిగి ప్రాజెక్ట్ వల్ల ఏం కోల్పోతున్నాం తెలిపి అక్కడి ప్రజలల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.
వీరి రాకకు ముందు ఉద్యమాన్ని రెండు గ్రామాల ప్రజలు మాత్రమే చేపట్టారు. ఈ యువకుల రంగప్రవేశంతో ఏటిగడ్డకిష్టాపూర్, వేములఘాట్, ఎర్రవల్లి, పల్లెపహాడ్ తదితర గ్రామాల ప్రజలు కూడా వీరితో చేయి కలిపారు. అంతేకాకుండా ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి, మరింత మంది ఈ ప్రాంత బిడ్డలకు ఉద్యమం వివరాలు తెలిపేందుకు గానూ ఈ టెక్కీలు టెక్నాలజీ సాయం తీసుకున్నారు. రోజువారి వివరాలు తెలపడానికి "మల్లన్న సాగర్ పోరాట సమితి", "మల్లన్న సాగర్ మీడియా" పేరుతో వాట్సాప్, ఫేస్బుక్ ఎకౌంట్లు తెరిచి అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నారు. వాళ్ల నినాదం ఒకటే "2013 భూసేకరణ చట్టాన్ని" అమలు జరిపి "పోలానికి పోలం..ఇంటికి ఇళ్లు..గ్రామానికి గ్రామాన్ని" తమకు ఏర్పాటు చేయాలి లేదంటే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపివేయాలి. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని వారు చెబుతున్నారు. డబ్బు కోసం కన్న ఊరిని వదిలి విదేశాలకు వెళ్లే యువత ఉన్న ఈ రోజుల్లో కన్న ఊరి కోసం ఈ యువకులు పడతున్న తపన నిజంగా అభినందనీయం.