ఉద్యోగం వెతుకులాటలో బరాక్ ఒబామా...

వచ్చే ఏడాది జనవరి 20 నాటికి ఒబామా అమెరికా అధ్యక్ష పదవికాలం ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే పదవికాలం అయిపోయిన తరువాత ఒబామా ప్లాన్ ఏంటీ.. ఏముంది రెండుసార్లు అగ్రరాజ్యమైన అమెరికాకే అధ్యక్షుడిగా ఉన్నారు.. కోట్లకి కోట్లు సంపాదించుకొని ఉంటారు.. చక్కగా ఎంజాయ్ చేస్తారు.. అని అనుకుంటారు. మన దేశంలో ఆ పప్పులన్నీ ఉడుకుతాయేమో కానీ అమెరికాలో మాత్రం అవి జరిగే పనులు కాదు. అమెరికా అధ్యక్ష పదివి నుండి దిగిపోయిన తరువాత చాలా మంది సాదాసీదాగానే జీవితం గడుపుతున్నారు. ఇప్పటికే చాలా మంది అలా సాదాసీదా జీవితం గడుపుతున్నవారు కూడా ఉన్నారు.   ఇప్పుడు ఒబామా కూడా అలానే గడపాలి. దానికోసం ఆయన ఓ ఉద్యోగం వెతుక్కోక తప్పదు. ఈవిషయంపై ఆయన గతంలో చాలా సందర్భాల్లో కూడా మాట్లాడారు. అధ్యక్ష పదవి నుండి దిగిపోయిన తరువాత ఎలాంటి ఉద్యోగం చేయాలో తనకి ఇంకా క్లారిటీ రాలేదని.. కొత్త ఉద్యోగం కోసం అందరిలాగా లింకెడ్ ఇన్ వెబ్ సైట్లో చేరాల్సి వస్తుందేమో.. నేను కూడా లింకెడ్ ఇన్ లో ఖాతా తెరుస్తాను. ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో చూడాలి అంటూ అన్నారు. మొత్తానికి దేశాల్నింటికీ ఆగ్రదేశమైనా అమెరికాకు అధ్యక్షుడిగా చేసినా కూడా పదవి నుండి తప్పుకున్న తరువాత ఉద్యోగం కోసం వెతుక్కోవడం అశ్యర్యపడాల్సిన విషయమే.. అదే మన దేశంలో అయితే అధికారంలో ఉన్నప్పుడే అందినంత దోచుకొని.. అధికారం పోయినా ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు.

ముద్రగడ ఎందులో సక్సెస్ అయ్యారు..?

  ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఈరోజుతో సక్సెస్ ఫుల్ గా పద్నాలుగో రోజుకి చేరుకుంది. ఈరోజు ఆయన ఆయన దీక్ష విరమించనున్నారు. అయితే దీక్ష ఆయన సక్సెఫుల్ గా చేశారు కానీ.. ఆయన అనుకున్నది సక్సెస్ ఫుల్ గా సాధించారా అంటే అది ఆయనకే సమాధానం దొరకని ప్రశ్నగా మారింది. ఆయన దీక్ష ప్రారంభించిన రోజు ఏదో హడావుడి ఉండగా.. ఆతరువాత ఈరోజు దీక్ష విమరించే రోజు మాత్రమే హడావుడి కనిపిస్తుంది తప్ప ఈ పద్నాలుగు రోజులు ముద్రగడ దీక్ష గురించి పెద్దగా పట్టికున్నవారు కూడా లేరు. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఏదో నామ్ కే వాస్త్ రెండు రోజులు హడావుడి చేసింది తప్ప.. ఆతరువాత చేసుకుంటే చేసుకోండి అన్నట్టు ఊరుకుంది.   ఈ దీక్షలో భాగంగా చంద్రబాబు కూడా ముద్రగడతో బాగానే ఆడుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ముద్రగడ అనుకున్నది ఏ ఒక్కటీ జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశారు. ముందు పోలీస్ స్టేషన్లో నిరసన తెలిపిన ఆయనను వ్యాన్ లో కూర్చోపెట్టారు. వ్యాన్ లో దీక్ష అంటే ఇంట్లోకి వెళ్లేలా చేసారు. ఇంట్లో దీక్ష అంటే తీసుకెళ్లి ఆసుపత్రిలో వుంచారు. దీక్షను పట్టించుకోవడం మానేసారు. అంతేనా ఇక మీడియా సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఏ చిన్న విషయం అయినా ఊదరగొట్టే మీడియా ముద్రగడ దీక్ష గురించి మాత్రం పెద్దగా పట్టించుకున్నది లేదు. ఆ దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఆఖరికి మద్దతుగా వచ్చిన దాసరి, చిరుల మీద టార్గెట్ చేశారు. ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేసి, దీక్ష చేసుకుంటే చేసుకోమన్నారు. పోనీ దీక్ష విరమించేదుకు ముద్రగడ కొన్ని షరతులు పెట్టారు. అది కూడా చేశారా అంటే చేయలేదు. అది తననూ, జైలు నుంచి విడుదలైన 13 మందినీ పోలీసు వ్యాన్ లో కిర్లంపూడికి తీసుకువెళ్లాలని, అక్కడికి కలెక్టర్, ఎస్పీలు వచ్చి నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు. దానికి కూడా ప్రభుత్వం నో చెప్పి ఇక ఇంటికెళ్లి దీక్ష విరమించండి అని సూచించింది. ఇక చేసేది లేక ముద్రగడ తమ వాహనంలోనే కిర్లపూడికి చేరుకున్నారు. ఇలా ముద్రగడ కోరింది ఏదీ జరగకుండానే ఆయన దీక్ష విరమించేలా చేశారు.   ఆయన అనుకున్నది జరిగిందల్లా నిందితులు బెయిల్ మీద రావడం. మరి వారికి బెయిల్ ముద్రగడ దీక్ష చేసినా వచ్చేది.. చేయకపోయినా వచ్చేది. కాకపోతే దానికి కొంత సమయం పట్టేది. దానికోసం ముద్రగడ దీక్ష చేపట్టారు. అయితే అంతా బానే ఉంది కానీ.. బెయిల్‌పై విడుదలైన నిందితులపై కొత్తగా కేసులు నమోదైతే, వారు మళ్ళీ అరెస్టయితే ముద్రగడ ఇంకోసారి దీక్ష చేస్తారా.? నిందితుల విడుదల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ, కాపు రిజర్వేషన్ల ఉద్యమం కోసం ఏం చేస్తారు.? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇప్పటికే ముద్రగడ దీక్షను పట్టించుకోని వాళ్లు.. ఇకపై భవిష్యత్తులో మాత్రం పట్టించుకుంటారా అన్నది సందేహం..

పాక్‌లో "పరువు" కోసం దారుణాలు..

కూతురో..కొడుకొ తమ కన్నా తక్కువ కులం వారిని పెళ్లి చేసుకున్నారనో..లేదా వేరే మతం వారిని పెళ్లాడితే..నలుగురిలో తలెత్తుకోలేమని పరువు పోతుందని కన్నబంధాన్ని మరచిపోయి వారిని కడతేర్చే సంఘటనలు మన దగ్గర కొకొల్లలు. దేశంలో రోజూ ఏదో ఒక మూలన ఈ తరహా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సంస్కృతి పాకిస్థాన్‌లో రక్తపుటేరులు పారిస్తోంది. గత రెండు రోజుల నుంచి మూడు నిండు ప్రాణాల్ని పరువు బలి తీసుకుంది.   పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన నస్రీన్ షహజాదీ మూడు నెలల క్రితం తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమె ఇస్లాం స్వీకరించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. నలుగురిలో తలెత్తుకోనీయకుండా చేసిన కూతురిని కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు ఫోన్ చేసిన తల్లిదండ్రులు భర్తతో కలిసి ఇంటికి రమ్మని ఆహ్వానించారు. తల్లిదండ్రులు మారిపోయారని..ఎంతో ఆశతో పుట్టింటికి వెళదామని సిద్ధమయ్యింది. కానీ నస్రీన్ తాను మృత్యుదేవత కౌగిలిలోకి వెళ్లబోతున్నట్టు ఊహించలేకపోయింది. ఇంట్లో నస్రీన్ అడుగు పెట్టగానే ఆదరిస్తారనుకుంటే..ఆగ్రహాంతో ఊగిపోయి కత్తితో పొడిచి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ నిర్జన ప్రదేశంలో పడేశారు.   మరో ఘటనలో మొహమ్మద్ షకీల్, ఆక్సా అనే జంట నాలుగేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని వేరుగా ఉంటోంది. దీనిని సహించలేని ఆక్సా సోదరుడు వారిని చంపాలని సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే సౌదీ నుంచి వచ్చిన ఆయన నాలుగు రోజుల క్రితం తల్లి, మేనమామతో కలిసి సోదరి ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. దంపతులను చితకబాది..అనంతరం వారిని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. మొహమ్మద్ నోట్లో తుపాకి పెట్టి మూడు రౌండ్లు కాల్చారు. ఆ వెంటనే అతడి భార్య ఆక్సా,  నాలుగేళ్ల కొడుకు తలలను గొడ్డలితో నరికేశారు. ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే ఆక్సా అప్పటికే నిండు గర్భిణీ రెండు, మూడు రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చేది. మరో ఘటనలో ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న తల్లే గర్బిణి అయిన తన కుమార్తెను సజీవ దహనం చేసి పాశవికంగా హత్య చేసింది. పాక్‌లో పరువు హత్యల పట్ల ప్రపంచ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ ఈ తరహా హత్యలు సర్వ సాధారణం. గత ఏడాది పాక్‌లో 1100 మంది పరువు హత్యలకు బలయ్యారు.  

"సిగ్గు" లేని బ్యాంకుల జాబితాలోకి ఎస్‌బీఐ

దేశంలోనే అత్యంత పురాతన బ్యాంకుగా..అతిపెద్ద బ్యాంకుగా ఘనత వహించిన "భారతీయ స్టేట్ బ్యాంక్" ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రయాణంలో మంచి పేరుతో పాటు చెడ్డ పేరు కూడా సంపాదించింది ఎస్‌బీఐ. అంతర్జాతీయంగా "హాల్ ఆఫ్ షేమ్" బ్యాంకుల జాబితాలోకి ఎస్‌బీఐ చోటు సంపాదించింది. ఇదేదో గొప్ప పురస్కారం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ప్రపంచ వినాశనానికి కారణమయ్యే క్లస్టర్ బాంబులు, మారణాయుధాలను తయారు చేస్తున్న కంపెనీలకు రుణ సహాయం చేస్తున్న 158 బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల పేర్లను ప్రకటిస్తూ డచ్‌కు చెందిన "పీఏఎక్స్"  "హాల్ ఆఫ్ షేమ్" జాబితాను ప్రచురించింది.   అమెరికా కేంద్రంగా బాంబులు, రాకెట్ సిస్టమ్స్ తయారు చేస్తున్న "ఆర్బిటాల్ ఏటీకే" అనే సంస్థకు ఎస్‌బీఐ భారీ ఎత్తున రుణమిచ్చిందని పీఏఎక్స్ పేర్కొంది. ఈ కారణంగానే హాల్ ఆఫ్ షేమ్ జాబితాలో ఎస్‌బీఐను చేర్చింది. జేపీ మోర్గాన్, బార్ల్కేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్రెడిట్ సూయిస్ తదితర దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలు ప్రపంచ వినాశనానికి అవసరమయ్యే ఆయుధాలు తయారు చేస్తున్న ఏడు సంస్థలకు 28 బిలియన్ డాలర్ల రుణాలు అందించాయి.   ఈ కంపెనీలకు రుణాలివ్వడంపై నిషేధం ఉన్నప్పటికీ ఆయా బ్యాంకులు పట్టించుకోవడం లేదని పీఏఎక్స్ ఆరోపించింది. ఈ జాబితాలో ఆమెరికాకు చెందిన 74 బ్యాంకులు, చైనా నుంచి 29, దక్షిణ కొరియా నుంచి 26 సంస్థలున్నాయి. ఇక భారత్ నుంచి ఈ సిగ్గులేని బ్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థ ఎస్‌బీఐ కావడం దురదృష్టకరం. దీనిపై స్టేట్ బ్యాంక్ స్పందించింది, ఆర్బిటాల్ ఏటీకేకు తాము మాత్రమే రుణమివ్వలేదని..అది ప్రపంచ బ్యాంకుల కన్సార్టియం రూపంలో ఇచ్చామని తెలిపింది. వేల్స్ ఫార్గో, బీఓఏ మెర్రిల్ లించ్, సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ టోక్యో వంటి బ్యాంకులతో కలిసి తాము రుణమిచ్చామని వివరించారు.

మన "రక్షణ" విదేశాల చేతుల్లోకి..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోకి ఆకర్షించడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం గేట్లను బార్లా తెరిచింది. ఇందుకోసం విమానయానం, సింగిల్ బ్రాండ్ రిటైల్, రక్షణ, ఫార్మాతో పాటు పలు రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలిస్తూ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం గతేడాది నవంబర్‌లో ఎఫ్‌డీఐ విధానాన్ని గణనీయంగా సరళీకరించగా..తాజాగా రెండోసారి అదే స్థాయిలో నిబంధనలను సరళతరం చేస్తూ సంస్కరణలను వేగవంతం చేసింది. ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్, శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటికే టీవీ ప్రసారాలు అందించే సంస్థల్లో, కేబుల్ టీవీ ప్రసారాలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, జంతు, మత్స్య పరిశ్రమల వృద్ధి దిశగా నూరు శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.   ఇదంతా ఒక ఎత్తైతే దేశ భద్రతలో ముఖ్య భూమిక పోషించే అత్యంత కీలక రంగాలైన రక్షణ, విమానయాన రంగాల్లో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడం సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు 49 శాతంగా ఉన్న ఈ రంగాల్లో పరిమితుల తొలగింపుతో విదేశీ కంపెనీలు, ఇండియాకు క్యూకట్టి ఇక్కడే ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తయారు చేసుకునే వెసులుబాటు కలగనుంది.  నిన్న గాక మొన్న కొత్త పౌర విమానయాన పాలసీని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం దీనికి మరింత ఊతమిచ్చేలా దేశీయ విమానయాన సంస్థల్లో విదేశీ సంస్థలు 100 శాతం వాటా కొనుగోలుకు మార్గం సుగమం చేసింది.   షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్/దేశీయ షెడ్యూల్డ్ పౌర విమానయాన సేవల కంపెనీలు, ప్రాంతీయ విమాన సంస్థల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పించింది. అయితే, విదేశీ విమానయాన కంపెనీలకు ఈ అవకాశం లేదు. ఇతర రంగాలకు చెందిన కంపెనీలకు ఈ వెసులుబాటు కల్పించారు. 49 శాతం ఆటోమేటిక్ మార్గంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంతకు మించితే మాత్రం ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ షెడ్యూల్డ్ విమానయాన సేవల్లో 49% వరకే ఎఫ్‌డీఐలకు అవకాశం ఉంది. అయితే దీనిని కొంతమంది నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో అనధికార ఆయుధ తయారీదారులు కుటీర పరిశ్రమగా ఎదిగే ప్రమాదముందని అలాంటి ఆయుధాలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళితే దేశ భద్రతకే పెనుముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు. 

అంబరీష్ రాజీనామా..హైడ్రామా..!

కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్థరామయ్య చెప్పినట్లుగానే తన మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేశారు. తన కేబినెట్‌లోని 34 మందిలో 14 మందిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారు. మంత్రి పదవి పోయినవారిలో సినీనటుడు అంబరీష్ కూడా ఉన్నారు. తనను మంత్రి పదవినుంచి తీసేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. మంత్రి పదవి పోవడంతో అందుకు నిరసనగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే దానిని డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి తిరస్కరించారు. సరైన ఫార్మాట్‌లో రాజీనామా లేఖ లేదని ఆయన అభ్యంతరం తెలిపారు.   తాను మండ్యా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానంటూ అంబరీశ్ ఒకే లైన్‌తో పంపిన రాజీనామా లేఖ చెల్లదన్నారు. తిరిగి పూర్తి ఫార్మాట్‌లో రాజీనామా లేఖ పంపాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ ఆయనకు సూచించారు. అయితే అంబరీశ్ కావాలనే ఇలా చేశారా..? లేక రాజీనామా చేయడం సీఎంకు ఇష్టంలేక డిప్యూటీ స్పీకర్‌తో ఇలా చేయించారా..? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు మంత్రివర్గం నుంచి అంబరీష్‌ను తొలగించినందుకు ఆయన మద్ధతుదారులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు సినీ ప్రముఖులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుమట్టారు. ముక్కుసూటి మనస్తత్వం గలవారు, నిజాయితీ ఉన్నవారు ఈ రోజుల్లో రాణించలేరంటూ అంబరీష్ భార్య, నటి సుమలత ట్వీట్టర్‌లో వ్యాఖ్యానించారు.

రాజన్ అయిపోయాడు..నెక్ట్స్ నీ పనే..

ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్‌‌‌ను రెండోసారి కొనసాగించవద్దంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అమెరికా గ్రీన్ కార్డు పోందిన రాజన్..మానసికంగా పూర్తి భారతీయుడు కాదని, భారత ఆర్ధిక వ్యవస్థ వృద్ధి పథంలో పయనించకుండా ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకున్నారని తక్షణం ఆయన్ను బాధ్యతల నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఒక లేఖ రాశారు. యూపీఏ ప్రభుత్వం నియమించిన వ్యక్తిని ఇప్పుడు కీలక బాధ్యతల్లో కొనసాగించడం మంచిదికాదని అన్నారు. ఆయన రాజేసిన అగ్గికారణంగా ఎప్పుడో సెప్టెంబర్‌లో జరగాల్సిన చర్చ కాస్త మేలోనే జరిగింది. ఎందుకంటే రాజన్ పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది.   దేశవ్యాప్తంగా రాజన్‌ను కొనసాగించాలనే వారు..తీసివేయాలనే వారు పరస్పరం మాటల యుద్ధం చేసుకోవడంతో రఘురాం తీవ్ర మనస్థాపం చెందారు. తాను రెండవసారి ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగలేనంటూ ప్రకటించి అందిరిని ఆశ్చర్యంలో ముంచారు. తన ప్రయత్నాలు ఫలించి రాజన్ వైదొలుగుతుండటంతో సుబ్రమణ్యస్వామి ఖుషి ఖుషిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన నెక్ట్స్ టార్గెట్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎంచుకున్నారు.   ఎంఎం ఖాన్ మర్డర్ కేసులో బీజేపీ ఎంపీ మహేశ్ గిరీ దోషి అంటూ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మహేశ్ ఇవాళ కేజ్రీవాల్ ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఆయన ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వెళ్లిన సుబ్రమణ్యస్వామి కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడారు. తాను ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెంటపడ్డానని, ఆయన వెళ్లిపోయాడని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంగతి తెలుస్తానని అన్నారు. కేజ్రీ జీవితం అంతా ఫ్రాడే, ఐఐటీలో తాను మెరిట్ స్టూడెంట్ అంటూ కేజ్రీ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఐఐటీలో ఎలా అడ్మిషన్ పొందాడో త్వరలో వెల్లడిస్తానని సుబ్రమణ్యస్వామి హెచ్చరించారు. మరి కేజ్రీవాల్, స్వామిని ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి.

రాజన్ తర్వాత ఎవరు..?

రఘురామ్ రాజన్ రెండవసారి పదవిలో కొనసాగుతారా..? లేదంటే ప్రధాని ఆయన్ను తప్పిస్తున్నారా..? అంటూ మీడియాలోనూ, ఆర్ధిక రంగంలోనూ రకరకాల వాదనలు వినిపిస్తున్న తరుణంలో.. తన పదవి కాలం ముగిసిన తర్వాత రెండవసారి ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగనని రఘురాం రాజన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజన్‌ తర్వాత తదుపరి గవర్నర్‌గా ఎవరిని నియమిస్తారా..? అంటూ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. సెప్టెంబర్‌ 4కు ముందే రాజన్ తదనంతరం ఎవరిని నియమిస్తామో త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లి ప్రకటించారు. రాజన్ ప్రకటన నేపథ్యంలో అత్యున్నత స్థాయి అధికారులు ఉండే ఆర్ధిక రంగ నియంత్రణాధికారుల నియామకం, పరిశోధనా కమిటీ, అర్హత కలిగిన వారి జాబితా సిద్ధం చేస్తుంది. ఈ జాబితాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.     ప్రస్తుత ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త కౌశిక్ బసు, ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌లలో ఒకరికి అవకాశం ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు బ్రింక్స్ బ్యాంక్ అధినేత కేవీ కామత్, ఆర్ధిక మంత్రి మాజీ సలహాదారు పార్థసారథి షోమ్, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేశ్ మోహన్, సుబీర్ గోకర్ణ్, ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి విజయ్ కేల్కర్, సీసీఐ మాజీ ఛైర్మన్ అశోక్ చావ్లా, ప్రసిద్ధ ఆర్థిక వేత్త ఆర్. వైద్యనాథన్, సెబీ ఛైర్మన్ యూకే సిన్హా, మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అశోక్ లహిరి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. వీరందరింలోచి ఒకరిని ఎంపిక చేస్తారా.? లేక మరేవరైనా కొత్తవారిని తీసుకువస్తారా అనేది వేచి చూడాలి.

సిద్థూ మంత్రివర్గం నుంచి 14 మంది ఔట్..?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. ఇప్పటి వరకు తన కేబినెట్‌లో కొనసాగిన 14 మందిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని మంత్రులుగా తీసుకోవాలని సిద్ధూ భావిస్తున్నారు.  రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ మంత్రి, సినీ నటుడు అంబరీశ్ తదితరులు సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడంతో వాటు అంబరీశ్ అభిమానులు కొన్ని చోట్ల ఆందోళనలు నిర్వహించారు.   దీనికి తోడు మంత్రివర్గంలో బెర్త్ గ్యారెంటీ అనుకున్న తరుణంలో పదవి దక్కకపోవడంతో అప్పట్లోనే చాలా అసమ్మతి సెగలు రేగాయి. తాజాగా తనకు మంత్రిపదవి ఇవ్వకుంటే పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని యాదగిరి ఎమ్మెల్యే మలకారెడ్డి ఢిల్లీలో హెచ్చరించారు. దీనిపై అధిష్టానం సూచనలు సలహాలు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన సిద్దరామయ్య అధినేత్రి సహా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. హైకమాండ్ ఆదేశాల మేరకు మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. నిన్న ఢిల్లీ నుంచి బెంగుళూరు వచ్చిన సిద్దూ హెచ్‌ఏఎల్ విమానాశ్రయం నుంచి ఆజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.

బాలీవుడ్ నటికి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు..?

బాలీవుడ్‌కు అండర్‌వరల్డ్‌కు ఉన్న సంబంధం గురించి కొత్తగా చెప్పవలసిన పనిలేదు. ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులకు, మాఫియా డాన్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే చీకటి వ్యాపారులతో చీకటి వ్యాపారం చేసినట్లు కూడా ఎన్నోసార్లు రుజువయ్యింది. అలా మాఫియాతో చేతులు కలిపి వేలకోట్ల ఆస్తులు వెనకేయాలని చూసిన అలనాటి బాలీవుడ్ నటి మమతా కులకర్ణీ పోలీసులకు చిక్కడంతో హిందీ చిత్రపరిశ్రమ ఉలిక్కిపడింది. థానే కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు ఒకేసారి 18.5 టన్నుల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2 వేల కోట్లకు పైమాటేనని నిపుణులు తేల్చారు. దేశ నేర చరిత్రలోనే ఇంతపెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టబడటం ఇదే మొదటిసారి.   ఈ కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. డ్రగ్స్ మాఫియా మూలాలు ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఉన్నట్లు గుర్తించారు. దీనికి సూత్రధారులుగా అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ విక్కీ గోస్వామి అతని భార్య అలనాటి అందాల తార మమతా కులకర్ణీలని తేలడంతో బాలీవుడ్ స్టన్నయ్యింది.   అయితే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని మమత వాదిస్తోంది. విక్కీ కూడా మమత తన భార్య కాదని చెప్పాడు. కానీ మమత అమాయకురాలు కాదని, మాదకద్రవ్యాల సరఫరా విషయంలో ఆమె పాత్ర కూడా ఉందని పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. అందుకే ఆమెను నిందితుల జాబితాలోకి చేర్చడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌ను కోరతామని థానే పోలీసులు ప్రకటించారు. మమతా డ్రగ్స్‌ను సరఫరా చేయడానికి కొందరు బాలీవుడ్ ప్రముఖుల సహాయం తీసుకున్నారని, ఆ సెలబ్రిటీలను ఇప్పటికే విచారించామని పోలీసులు చెప్పడంతో ఆ ప్రముఖులు ఎవరై ఉంటారా..? అని జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

"ఛీ"వరకు ఒబామా కూడానా..?

ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో మానవత్వం, కాస్త దయా గుణం కలిగిన వాడిగా ప్రపంచం చేత నీరాజనాలు అందుకున్నారు బరాక్ ఒబామా. రష్యా, చైనాలతో మైత్రి..క్యూబాపై ఆంక్షల ఎత్తివేత..హీరోషిమాను సందర్శించడం వంటి చర్యల ద్వారా ఆయన జేజేలందుకున్నారు. రెండవసారి అధ్యక్షుడిగా అతి త్వరలో వీడ్కోలు చెప్పబోతున్న తరుణంలో ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే వాస్తవాలు వెలుగు చూశాయి. సిరియా నియంత "బషర్ అల్ అసద్‌"ను గద్దె దించేందుకు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు ఒబామా పూర్తి అండదండలు అందించారని ఓ రహస్య నివేదిక బయటకొచ్చింది. ఈ నివేదిక అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.   ప్రపంచవ్యాప్తంగా తనకు నచ్చని ప్రభుత్వాలను కూల్చడానికి అమెరికా కుట్రలు చేయడం, నిధులు అందించడం ఎప్పటినుంచో అమలు చేస్తున్న కార్యక్రమం. ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం స్థాపించడానికీ, మానవహక్కులను కాపాడటానికి తాను సాయం చేస్తానని అమెరికా చెప్పుకుంటోంది. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు అసద్ 2000 వ సంవత్సరంలో తన తండ్రి చనిపోయినప్పటి నుంచి నేటీవరకు అధికారంలో ఉన్నాడు. ఈయన బాత్‌పార్టీ నాయకుడు..ఆ పార్టీ సిరియాలో ప్రగతీశీల విధానాలను అమలు చేస్తోంది. ఇది రుచించని అమెరికా సిరియాలో నియంతృత్వ పాలనను అంతం చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతిపక్ష గ్రూపులకు, అల్‌ఖైదాకు నిధుల వరద పారించింది.   ముస్లింలతో సాన్నిహిత్యం పెంచుతానన్న వాగ్ధానం మేరకు ఒబామా సిరియాతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి కృషి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా రహస్య సహాయం కొనసాగించారు. చివరకు అల్‌ఖైదాను పక్కకు తప్పించి దాని స్థానంలో ఐఎస్ పుట్టుకొచ్చి ప్రపంచానికి పెనుసవాలు విసిరింది. ఐఎస్ తన భీకర దాడులతో అసద్‌ ప్రభుత్వాన్ని వణికించింది. అన్ని తమకు అనుకూలంగా జరుగుతున్నాయని ఆనందపడిన అగ్రరాజ్యానికి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఐఎస్ తన భస్మాసుర హస్తాన్ని అమెరికాపైనే పెట్టింది. అప్పటికి గాని తత్వం బోధపడని అమెరికా ఇస్లామిక్ స్టేట్‌పై యుద్ధం ప్రకటించింది. ఇలా ఐఎస్ ఏర్పడటానికి ప్రత్యక్ష, పరోక్ష కారణం ఒబామానే అని నివేదిక సారాంశం. ఈ వార్తలపై ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, అమెరికా కాంగ్రెస్, సీఐఏ ఒబామాను టార్గెట్ చేశాయి.

దేశరాజకీయాల్లో మళ్లీ "ట్యాపింగ్" కలకలం

"ఫోన్ ట్యాపింగ్" దేశ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపింది. ఆరేళ్ల క్రితం నీరా రాడియా టేపుల వ్యవహారం దేశంలో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. రాజకీయ నాయకులు, కార్పోరేట్ సంస్థల అధిపతులు, అధికారులు, మీడియా కుమ్మక్కయిన తీరును 140 టెలిఫోన్ సంభాషణలతో కూడిన టేపులను 2010లో ఔట్‌లుక్ మ్యాగజైన్ బయటపెట్టినప్పుడు దేశం నిర్ఘాంతపోయింది. ఆ టేపులు అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేశాయి. తాజాగా అదే పద్థతుల్లో..రాడియా టేపులను తలదన్నే భయంకరమైన కుమ్మక్కు వ్యవహారాలను అదే ఔట్‌లుక్ మ్యాగజైన్ బయటపెట్టడంతో దేశం మరోసారి ఉలిక్కిపడింది. 2001 నుంచి 2006 మధ్య కాలంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయ్ కార్యాలయంతో సహా ఇప్పుడు న్యాయ వ్యవస్థను, పార్లమెంట్‌ను, బ్యాంకర్లను, ప్రత్యర్ధి వ్యాపార సంస్థలను దేశంలోని ప్రధాన పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన ఎస్సార్ గ్రూప్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.   బహుళజాతి సంస్థ "హచీసన్‌"తో కలిసి హచీసన్‌ ఎస్సార్ పేరుతో టెలికాం వ్యాపారం నిర్వహించింది. అలా వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలోనూ..మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనూ ఎస్సార్ గ్రూప్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాను తన క్లయింట్ "అల్‌బసీత్ ఖాన్" తరపున ప్రధానికి ఫిర్యాదు చేస్తున్నట్టు సురేన్ వెల్లడించారు. 2001-06 మధ్య కాలంలో అల్‌బసీత్ ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించారు.    ట్యాపింగ్ బాధితుల్లో నాటి మంత్రులు ప్రపుల్ పటేల్..రామ్ నాయక్..సురేశ్ ప్రభు..పీయూష్ గోయల్ లాంటి వారితో పాటు వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ..అనిల్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు, ఐడిబిఐ మాజీ చైర్మన్‌ పిపి వోరా, ఐసిఐసిఐ బ్యాంకు సిఇఒ ఎండి కెవి కామత్, ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ జాయింట్‌ ఎండి లలిత గుప్తే, హోం సెక్రటరీ రాజీవ్‌ మహర్షి, అప్పట్లో ప్రధాని కార్యాలయంలో ఉన్న బ్రిజేష్‌ మిశ్రా, ఎన్‌కె సింగ్‌, పార్లమెంట్‌ సభ్యుడు అమర్‌సింగ్‌, బిజెపి నేతలు కిరీటి సోమయ్య, జస్వంత్ సింగ్‌, సహారా అధిపతి సుబ్రతారాయ్‌, బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌.. ఫోన్లను ఎస్సార్‌ ట్యాప్‌ చేసినట్టు సురేన్‌ ఆరోపించారు. ఇంతకీ ఎస్సార్ గ్రూప్ ఇలాంటి పనిచేయటానికి గల కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆ విషయాలు బయటకు వస్తే..మరిన్ని సంచలనాలు చోటు చేసుకునే వీలుందని చెప్పొచ్చు.

బురిడీబాబా దొరికాడు..

డబ్బును రెట్టింపు చేస్తానంటూ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి ఇంటి నుంచి రూ.1.33 కోట్లు ఎగరేసుకుపోయిన బురిడీబాబా పోలీసులకు చిక్కాడు. తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిన్న రాత్రి బెంగుళూరులో అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లికి చెందిన శివకుమారస్వామి ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఇంట్లోంచి వస్తూ కొంత బంగారం, నగదు ఎత్తుకెళ్లాడు. వీటితో తిరుపతి, బెంగుళూరు, కేరళలోని కొన్ని ఆశ్రమాలకు వెళ్లి అక్కడి స్వామీజీలను కలిశాడు. ఈ నేపథ్యంలో కొందరు దొంగస్వాములతో పరిచయాలు పెంచుకుని జనాన్ని ఎలా మోసగించవచ్చో తెలుసుకున్నాడు. అనంతరం బాబా అవతారమెత్తి. తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని..ముగ్గులో కరెన్సీ నోట్లను ఉంచి తాను పూజ చేస్తే చాలు..రెట్టింపు అవుతాయంటూ నమ్మించేవాడు.   నిష్టగా పూజ చేసి..ముగ్గులో రూపాయి నోట్లను ఉంచి గులాబీలను కప్పేవాడు. ఆపై అరగంట సేపు ధ్యానం చేసి మత్తుమందు కలిపిన పరమాన్నం, చక్కెర పొంగలి ఇచ్చేవాడు. బాధితులు మత్తులోకి జారుకున్నాకా నగదుతో ఉడాయించేవాడు. నాలుగేళ్లుగా అందినకాడికి దోచుకుంటూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మోసాలకు పాల్పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ద్వారా లైఫ్‌స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డికి శివానంద పరిచయమయ్యాడు. బెంగుళూరులోని తన నివాసంలో ఒకరోజు పూజ చేసి రూ.1.5 లక్షల నగదును, రూ.3 లక్షలుగా మార్చి వారికి నమ్మకం కలిగించాడు.   ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని తన ఇంటికి మరమ్మత్తులు చేయించారు మధుసూదన్‌రెడ్డి..అందులో లక్ష్మీపూజ, దోష నివారణ పూజ చేయించే ఉద్దేశ్యంతో బెంగుళూరులో శివానందను కలిశారు. ఆయన ఆహ్వానం మేరకు మొన్న హైదరాబాద్‌కు వచ్చిన శివానందకు తన డబ్బుతో పాటు స్నేహితుల డబ్బు మొత్తం రూ.1.33 కోట్లును ఇచ్చి రెట్టింపు చేయాల్సిందిగా కోరారు. సరేనన్న శివానంద పూజలో కూర్చొన్నాడు. ఎప్పటిలానే మత్తు మందు కలిపిన పరమాన్నాన్ని మధుసూదనరెడ్డి కుటుంబసభ్యులకు పంచాడు. దాన్ని తిన్న వెంటనే వారంతా స్పృహ తప్పారు. అనంతరం నగదు, నగల్ని మూటగట్టుకున్న బాబా నేరుగా బెంగుళూరుకు చేరుకున్నాడు. వ్యాపారి ఇంట్లోనూ, బాబా దిగిన ఓరిల్స్ హోటల్స్‌లోని సీసీ కెమెరా ఫుటేజీల సాయంతో రంగంలోకి దిగిన పోలీసులు శివానంద కోసం వేట ప్రారంభించారు. శివానందను బెంగుళూరు నుంచి హైదరాబాద్ తీసుకువచ్చిన డ్రైవర్‌ను సమాచారం మేరకు బెంగుళూరు చేరుకున్న తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బాబాని అదుపులోకి తీసుకున్నారు.

సింహంతో సెల్ఫీ... చిక్కుల్లో జడేజా!

సెల్ఫీ అన్న మాట ఇప్పుడు ఇంటింటి పదంగా మారిపోయింది. వీలైనంత కొత్తగానో, చెత్తగానో సెల్ఫీని దిగేసి పదిమంది దృష్టిలోనూ పడిపోవాలన్న ప్రలోభం పెరిగిపోయింది. కానీ ఆ ప్రలోభం మాటున పొంచి ఉన్న ప్రమాదమే నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు భారతీయ క్రికెటర్‌ రవీంద్ర జడేజా దిగిని సెల్ఫీ కూడా వివాదాలకు కేంద్రంగా మారింది. ఏడాది పొడవునా క్రికెట్‌ ఆడీ ఆడీ అలసిపోయిన రవీంద్ర జడేజాను కాస్త సెలవు తీసుకోమంటూ బోర్డు అధికారులు ఈ మధ్యనే సూచించారు. అందుకోసం జింబాంబ్వేలో జరుగుతున్న సిరీస్‌ నుంచి కూడా తప్పించారు. దొరికిందే సందుగా జడేజా తన భార్యతో కలిసి గుజరాత్‌లోని గిర్‌ నేషనల్‌ పార్కులో చక్కెర్లు కొట్టాడు.   అంతదాకా బాగానే ఉంది కానీ, గిర్‌కే తలమానికమైన ఏషియాటిక్ సింహాలకి అతి సమీపంలో నిల్చొని ఎడాపెడా సెల్ఫీలు దిగేయడమే వివాదంగా మారింది. జడేజా, భార్యాసమేతంగా దిగిన ఈ సెల్ఫీలని చూసి అటవీ శాఖ ఉన్నతాధికారులు సంతోషించలేదు సరికదా... దర్యాప్తుకి ఆదేశించారు. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన సింహాలని వాహనంలోంచి చూడాలే కానీ, కిందకి దిగడం నేరం. అలాంటి సమయంలో జరగరానిది ఏదన్నా జరిగి ఉంటే, సింహాలను కాల్చి పారేయాల్సి వచ్చేది. లేదా జడేజా అన్నా వాటి పంజాకు బలయ్యేవాడు. ఎందుకంటే అది సెల్ఫీ అన్న విషయం సింహాలకు తెలియదు కదా! అటవీ శాఖ అధికారుల దర్యాప్తులో జడేజా తప్పు ఉందని తేలితే కనుక, అతను చట్టపరమైన చర్యలను ఎదుర్కోక తప్పదు.

గుజరాత్ అల్లర్లలో కీలక తీర్పు

14 సంవత్సరాల నాటి రక్తసిక్తమైన నేరానికి ఇవాళ ఓ ముగింపు దక్కింది. 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్లలో భాగంగా 24 మందికి ఓ ప్రత్యేక న్యాయస్థానం కారాగార శిక్షను విధించింది. అయితే ఈ నేరస్తులకు తగిన శిక్షను అందించలేదనీ, పైగా వీరి వెనుక ఉన్న అసలు నేరస్తులు నిర్భయంగా తిరుగుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... 2002, ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోధ్రా స్టేషన్‌లో 58 మంది కరసేవకులను మతవాదులు హతమార్చారు. ఇందుకు ప్రతీకారంగా గుజరాత్‌ అంతగా ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. అల్లర్లను అదుపుచేయాల్సిన అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వ్యవహరించిందన్న ఆరోపణలూ ఉన్నాయి.    గోధ్రా ఘటన జరిగిన మర్నాడు అహ్మదాబాదులో ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల మీద అల్లరి మూకల కళ్లు పడ్డాయి. అందులో భాగంగానే గుల్బర్గా హౌసింగ్‌ సొసైటీ అనే నివాసం సముదాయం మీదకు ఒక్కసారిగా దాడిచేశారు. గుల్బర్గా సొసైటాలో మాజీ పార్లమెంట్‌ సభ్యుడు ఎహ్‌సాన్‌ జాఫ్రీవంటి వారు సైతం ఉన్నా, వారికి రక్షణగా ఎవరూ స్పందించలేకపోయారు. రక్షణను అర్థిస్తూ ఎహ్‌సాన్‌ చేసిన ఫోన్‌ కాల్స్‌ అన్నీ వృధా అయిపోయాయి. జాఫ్రీతో సహా 69 మందిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశారు. ఈ అల్లర్ల వెనుక సాక్షాత్తూ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహం ఉందన్నది జాఫ్రీ భార్య ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని దాటవేస్తూ వచ్చాయి. జాఫ్రీ చివరిసారిగా చేసిన ఫోన్‌కాల్స్‌ జాబితాను కానీ, దర్యాప్తు సంస్థ రూపొందించిన నివేదికను కానీ బహిర్గతం చేసేందుకు న్యాయస్థానాలు సైతం నిరాకరించాయి.   తాజాగా ఓ ప్రత్యేక కోర్టు ఆనాటి అల్లర్లలో ముద్దాయిలుగా పేర్కొన్న 60 మందిలో 24 మందిని దోషులుగా గుర్తించింది. వీరిలో పదకొండు మందికి 14 సంవత్సరాల కారాగార శిక్షను ఖరారు చేసింది. మరో 12 మందికి ఏడు సంవత్సరాల శిక్షనూ, ఒకరికి పదేళ్ల జైలునీ శిక్షగా పేర్కొంది. దోషులుగా గుర్తించినవారిలో వీహెచ్‌పీ నేత అతుల్ వైద్య కూడా ఉండటం గమనార్హం.  

ట్రెండింగ్ టాపిక్: "డియర్" స్మృతీ

కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీని ఉద్దేశిస్తూ బీహార్ విద్యాశాఖ మంత్రి డియర్ అన్న పదంతో సంబోధించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. బీహార్‌కు సంబంధించిన కొత్త విద్యా విధానాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి ట్వీట్ చేశారు. దానిలో డియర్ స్మృతీ ఇరానీజీ...మాకు కొత్త విద్యా విధానాన్ని మాకు ఎప్పుడు తీసుకొస్తారు? మీ క్యాలెండర్లో 2015 ఇంకా పూర్తి కాలేదా..? అని చౌదరి వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై ఇరానీ మండిపడ్డారు. అశోక్‌జీ మహిళలను డియర్ అని సంబోధించడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు..? అని నిలదీశారు.   దీనికి తిరిగి స్పందించిన చౌదరి మిమ్మల్ని అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదు..కానీ నేర్పుతున్నాను..అధికారిక లేఖలు డియర్ అన్న పదంతో ప్రారంభమవుతాయి. ఇది మీకు తెలియంది కాదు..అవమానించడమూ కాదు అంటూ ట్వీట్ చేశారు. అయినా మీరు నేనడిగిన ప్రశ్నకు సమాధానమివ్వకుండా..డొంక తిరుగుడుగా మాట్లాడతారేంటి? అని పేర్కొన్నారు. ఇక అక్కడి నుంచి ఇద్దరి మంత్రుల మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం సాగుతోంది. ఇంకో విషయం ఎంటంటే వీరిద్దరి మద్ధతుదారులు పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు. 

గుత్తాకు కేసీఆర్ ఎందుకు కండువా కప్పలేదు..?

వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో దూసుకుపోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే టీడీపీ, వైసీపీ శాసన సభాపక్షాలను తనలో కలిపేసుకున్న టీఆర్ఎస్ తన నెక్ట్స్ ఫోకస్ కాంగ్రెస్‌పై పెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ జిల్లాలో దాని ఉనికిని లేకుండా చేసేందుకు పావులు కదిపారు కేసీఆర్. దీంతో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు నిన్న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పార్టీలో చేరాలనుకుంటున్న వారందరికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఎంపీ గుత్తాకు మాత్రం కేసీఆర్ గులాబీ కండువా కప్పలేదు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. దీని వెనుక అసలు కథ వేరే ఉంది ..టీఆర్ఎస్ కండువా కప్పుకున్నట్లైతే కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశాలుండటంతో కండువా కప్పే విషయంలో ఆచీతూచి వ్యవహరించాలని గుత్తా భావించారు. అందుకే కేసీఆర్ చేత కండువా వేయించుకోలేదు. కండువా కప్పుకున్నా..కప్పుకోకపోయినా గుత్తా టీఆర్ఎస్ సభ్యుడే. 

బిచ్చమెత్తుకున్న డబ్బుతో సమాజసేవ

కోట్ల రూపాయల డబ్బుండి..ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని మనుషులున్న ఈ రోజుల్లో బిచ్చమెత్తుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో సమాజసేవ చేస్తున్నాడు ఒక వృద్ధుడు. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌‌కుళం తాలుకా ఆలంగిణరు గ్రామానికి చెందిన బూల్‌‌పాండియన్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, భార్య మరణించిన తర్వాత వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన పిల్లలు ఆయన్ను పట్టించుకోకపోవడంతో ముంబైకి వలస వెళ్లిపోయాడు. అక్కడ ఒక దేవాలయంలో పారిశుద్ధ్య పనులు చేస్తూ జీవనం కొనసాగించాడు. ఎంతైనా కన్నతండ్రి కదా బిడ్డలు కాదన్నా..మమకారం చంపుకోలేక మళ్లీ తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. చాలా రోజుల తర్వాత రావడంతో అన్నీ మరచిపోయి తనను ఆదరిస్తారనుకున్న ఆ పిచ్చి తండ్రికి మళ్లీ పాతకథే ఎదురైంది. పలకరించడం సంగతి పక్కన బెడితే అసలు ఇంట్లోకి రానివ్వకపోవడంతో పొట్టనింపుకోవడం కోసం యాచకుడిగా మారిపోయాడు.   అయితే అతనిలోని మానవత్వం బయటపడే సంఘటన ఒకటి జరిగింది. తూత్తుకుడి జిల్లాలో కొన్ని నెలల కిందట భారీ వర్షాలు కురిసి ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులకు అండగా నిలబడాలనకున్న బూల్‌పాండి తన వద్ద ఉన్న నగదును అందించాలనుకున్నాడు. అయితే యాచకుడి దగ్గర సాయం పోందేందుకు ప్రభుత్వ అధికారులు నిరాకరించారు. తన డబ్బును సేవా కార్యక్రమాలకే ఉపయోగించాలనుకున్న ఆయన పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు విద్యా ఉపకరణాలు కొనిపెట్టారు. కుంభకోణం, వడక్కు, మాంగుడి, కొత్తంగుడి తదితర ప్రాంతాల్లోని 18 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ సామాగ్రిని అందించారు. ఆయన సేవాభావాన్ని గుర్తించిన విళాంగుడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బూల్‌పాండిని సత్కరించారు. 

" వైఫ్ స్వాపింగ్"..కొచ్చి టూ భువనేశ్వర్

నెల రోజుల క్రితం కొచ్చి నావల్‌బేస్‌లో బయటపడిన "వైఫ్ స్వాపింగ్" భారత సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాడి భార్యను వీడు..వీడి భార్యను వాడు అనే విచ్చలవిడి తనానికి మారుపేరుగా నిలిచే "భార్యల మార్పిడీ పార్టీలు" సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయి. నేవీలో ఉన్నత స్థాయి అధికారులు సరదా కోసం భార్యలను మార్చుకుని ఆనందిస్తూ..ఇదే సంస్కృతిని జూనియర్లకు పరిచయం చేస్తున్నారు. అలాగే కొచ్చి సైనిక స్థావరంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారికి "వైఫ్ స్వాపింగ్ పార్టీ"లకు వెళ్లడం అలవాటు. పెళ్లయిన తర్వాత తన భార్యను ఈ పార్టీలో పాల్గొనాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో వేధింపులకు గరిచేసేవాడు. . అతనికి అత్తింటివారు మద్ధతు పలకడంతో ఆమె భరించలేక కొచ్చి హర్బర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అప్పటి రక్షణ శాఖ మంత్రి "ఏకే ఆంటోని" విచారణకు ఆదేశించారు. రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.   దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుండగానే మరోసారి "వైఫ్ స్వాపింగ్" కలకలం రేగింది. ఈ సారి ప్లేస్ కొచ్చి నుంచి భువనేశ్వర్‌కు షిఫ్ట్ అయ్యింది. ఒడిషాలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్యనాథ మిశ్రా కోడలు లోపాముద్ర మిశ్రా తాను "వైఫ్ స్వాపింగ్‌"కు ఒప్పుకోకపోవడంతో తనను అత్తింటివారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించడం ఆ రాష్ట్రంలో సంచలనం కలిగించింది. 2006 జనవరి 27న త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో ఆమెకు వివాహం జరిగింది.   లోపాముద్ర మిశ్రా భర్తతో కలిసి పెళ్లయిన కొత్తలో హానీమూన్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ "వైఫ్ స్వాపింగ్‌ పార్టీ"కి రావాల్సిందిగా భర్త అడగటంతో అందుకు ఆమె నిరాకరించింది. అయితే అది అక్కడితో అయిపోయిందని లోపాముద్ర భావించింది. కాని భర్త తరచూ ఇదే రకమైన ఒత్తిడి తెస్తుండటంతో పెద్దింటి కోడలిగా సంయమనంతో వ్యవహారించారు. భర్త వేధింపులకు అత్త ఆశా మంజరి, మామ త్రైలోక్యనాథ మిశ్రా మద్థతు ఇవ్వడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. చివరికి ఓపిక నశించి ఆమె స్థానిక మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మామగారికి ఉన్న పలుకుబడి కారణంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.  తనను హత్య చేస్తామని..తన కుమారుడిని అపహరిస్తామని అత్తింటి వారు బెదిరించారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసి ఎన్నిరోజులనైప్పటికి పోలీసుల నుంచి కనీస స్పందన రాకపోవడంతో ఆమె నగర డీసీపీని ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. దీనికి స్పందించిన ఆయన విచారణకు ఆదేశించారు.