అభాసుపాలవుతోన్న మూడెకరాల భూమి పంపిణీ పథకం

తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం అభాసుపాలవుతోంది.  ఏడాదికేడాది పంపిణీ చేస్తున్న భూమి తగ్గిపోతోంది. గత ఆర్థిక సంవత్సంలో 4500 ఎకరాలు పంచిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 621 ఎకరాలే పంచింది. మరో నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా..లబ్ధిదారుల సంఖ్య కేవలం 241 మందికే పరిమితమైంది. పలు జిల్లాల్లో ఒక్కరికీ కూడా భూమి పంచలేదు. దళితులు అధిక సంఖ్యలో ఉన్న కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భూములు ఉన్నా.. పంపిణీ చేయకపోవడం విమర్శలకు దారితీసింది.    తెలంగాణలో 4లక్షల దళిత కుటుంబాలకు భూములు లేనట్టు సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. 2014 ఆగస్టు 15న గోల్కొండ కోట మీద అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటిదాకా 2వేల 631 మందికి 6913 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. మొదటి సంవత్సరం 1795 ఎకరాల భూమిని 674 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయగా.... రెండో సంవత్సరంలో 1716 మంది లబ్ధిదారులకు 4495 ఎకరాల భూమిని పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 241 మంది అర్హులకు 621ఎకరాలను మాత్రమే పంచింది. మొత్తం మూడేళ్లలో కేవలం 2631 మందికి మాత్రమే భూములు ఇవ్వగలిగింది తెలంగాణ ప్రభుత్వం.   2014-15 ఆర్థిక సంవత్సరంలో సగటును ఒక్కో ఎకరాకు ప్రభుత్వం 4లక్షల 15వేలు చొప్పున ఖర్చు చేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున 4లక్షల 78వేలు ఖర్చుచేస్తోంది. ప్రతి ఎకరాకు 63వేలు అంటే 15శాతం భూముల ధరలు పెరిగినట్టయ్యింది. కొన్ని జిల్లాల్లో ఈ ఏడాది భూపంపిణీ పథకం అసలు ప్రారంభమే కాలేదు.    ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సిందిపోయి.. తగ్గుతుండటాన్ని దళిత సంఘాలు, విపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రభుత్వం భూపంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి భూములు పంచాలని డిమాండ్ చేస్తున్నారు. 

జనసేన తొలి సభ... సంగారెడ్డిలో పెట్టడానికి కారణమేంటి?

తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కల్యాణ్‌... మొదటి సభను సంగారెడ్డిలో నిర్వహిస్తామని చెప్పడం చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మూడేళ్లకు తెలంగాణలో నిర్వహించదలపెట్టిన మొదటి సభకు సంగారెడ్డిని వేదికగా చేసుకోవడం వెనుక వ్యూహామేంటనే చర్చ తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.   జనసేన తొలి సభకు సంగారెడ్డిని వేదికగా ఎంపిక చేసుకోవడం వెనుక జగ్గారెడ్డితో ఉన్న సాన్నిహిత్యమే కారణమనే వాదన వినిపిస్తోంది. సంగారెడ్డిలో బలమైన అనుచర గణమున్న జగ్గారెడ్డి.... సభ ఏర్పాట్లతో పాటు అన్ని అంశాల్లో సహకరిస్తారనే కోణంలోనే ఈ ప్రాంతాన్ని సెలెక్ట్‌ చేసుకున్నట్లు చెబుతున్నారు. తన ప్రసంగాల్లో జగ్గారెడ్డి పేరును ప్రస్తావించడం, గతంలో పలుసార్లు ఇరువురూ భేటీ కావడం కారణం కావొచ్చంటున్నారు.    ఇటీవల సంగారెడ్డి శివార్లలోని ఇస్మాయిల్‌ఖాన్‌ పేటలో షూటింగ్‌ సందర్భంగానూ పవన్‌‌తో జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమవడం, పలు అంశాలపై చర్చించడం హాట్‌ టాపిక్‌గా మారింది. పైగా సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానన్న జగ్గారెడ్డి మాటలు.... ఉత్కంఠను రేపాయి. ఏదిఏమైనా తెలంగాణలో జనసేన తొలి సభ వేదికగా సంగారెడ్డిని వ్యూహాత్మకంగానే ఎంపిక చేశారనే టాక్‌ వినిపిస్తోంది.

పవన్‌ ఎంట్రీతో కేసీఆర్‌ లెక్కలు గల్లంతవుతాయా?

గెలుస్తానో లేదో తెలియదు గానీ...పోటీ చేయడం మాత్రం పక్కా అంటూ అనంతపురం సభలో ప్రకటించి.... ఏపీ పాలిటిక్స్‌లో ప్రకంపనలు పుట్టించిన  పవన్ కల్యాణ్‌.... ఇఫ్పుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి.... తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి పుట్టించారు. ఏదో ఆషామాషీగా...పవన్‌ ఈ ప్రకటన చేశారనుకుంటే తప్పులో కాలేసినట్లే. తెలంగాణలో తనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, సీమాంధ్రుల జనాభా... ఇలా అన్నింటినీ పక్కాగా లెక్కగట్టే పవన్‌ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.   ప్రస్తుతం తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఫుల్‌ స్వింగ్‌ మీదున్న కేసీఆర్‌‌కు, టీఆర్‌ఎస్‌కు ఇది కలవరం పుట్టించే అంశమే. రాజకీయాల్లో ఎవరినీ తేలిగ్గా తీసేయలేం. అలాంటిది తెలంగాణలోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌.... ఎన్నికల బరిలోకి దిగితే ఫలితాలు తారుమారు కావడం అంత కష్టమైన పనేమీ కాదు. ముఖ్యంగా సీమాంధ్రులు అధికంగా ఉండే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గణనీయమైన ఓట్లు సాధించే అవకాశముంది. అలాగే కొన్నిచోట్ల గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ జనసేన ప్రభావం చూపించే ఛాన్సుంది. పైగా 60శాతం పైగా యువతకు టికెట్లు ఇస్తానంటున్న పవన్‌.... కొత్త తరహా రాజకీయాలతో తెలంగాణ ప్రజల మనసులను కూడా గెలుచుకునే అవకాశం లేకపోలేదు.   అయితే ఇప్పటికే ఆంధ్రా పార్టీ ముద్రతో తెలంగాణలో తెలుగుదేశంను నామ రూపాల్లేకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్‌... జనసేన మీద కూడా అలాంటి ముద్రే వేయడం ఖాయం. అయితే తన ఓటు హక్కును ఏపీకి మార్పించుకుని తన స్థానికతపై పిచ్చ క్లారిటీ ఇవ్వడమే కాకుండా, రాష్ట్ర విభజనపై దాగుడు మూతల్లేకుండా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసిన పవన్‌... తనకు తెలంగాణ అన్నా, తెలంగాణ భాష అన్నా.... తెలంగాణ ప్రజలన్నా ఎంతో అభిమానమంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అందుకే తన సినిమాల్లోనూ తెలంగాణ మాండలికానికి, భాషకు, పాటలకు ప్రాధాన్యత కల్పిస్తూ... తెలంగాణపై తనకున్న ప్రేమను నిజాయితీగా చాటుకున్నానని ప్రకటించుకున్నారు. ఈ అంశాలే పవన్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది.    ఏదిఏమైనా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూ, తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యం చూపిస్తూ, జెట్‌ స్పీట్‌తో దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌.... పవన్‌ ప్రకటనను అంత తేలిగ్గా తీసుకుంటుందని చెప్పలేం. అసలు తెలంగాణలో జనసేనకు నూకలు ఉంటాయా లేదా అన్నది పక్కనబెడితే.... ఖచ్చితంగా గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా మాత్రం ఉంటుందనేది వాస్తవం. ఆ లెక్కన చూస్తే పవన్‌ ప్రకటన అధికార టీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టించే అంశమే.

పాపం నహీద్... పాడటం పాపమని తెలియక మహాపాపం చేసింది!

ఢిల్లీలోని జేఎన్ యూ విశ్వవిద్యాలయంలో ఆ మధ్య ఏం జరిగింది? దేశానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు ర్యాలీ తీశారు! హిందూస్థాన్ ని ముక్క ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేశారు! వాళ్ల పై కేసులు పెట్టింది ప్రభుత్వం. వెంటనే రంగంలోకి దిగిన మీడియా, మేదావులు ఏ ఆస్త్రాన్ని బయటకు తీశారు? భావప్రటకన అస్త్రాన్ని! దేశంలో వుంటోన్న జనం దేశానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయొచ్చని అప్పట్లో సెలవిచ్చారు! కాని, విచిత్రంగా ఇప్పుడు అదే భావప్రకటనా స్వాతంత్ర్యానికి హాని ఏర్పడి ఒక పదహారేళ్ల ముస్లిమ్ అమ్మాయి ఇబ్బందిపడుతోంటే... ఎవ్వరూ పెద్దగా స్పందించటం లేదు!   నహీద్ అఫ్రీన్... ఈమెవరో హిందీ ఛానల్స్ చూసేవారందరికీ తెలుసు! ప్రఖ్యాత మ్యూజికల్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ లో పాల్గొంటోంది. ఆసోమ్ కి చెందిన నహీద్ వయస్సు పదహారేళ్లు. అద్బుతంగా పాడుతుంది. అంతే కాదు, ఈ మధ్య ఒక హిందూ భజన్ ని కూడా ఆలాపించింది. అప్పట్నుంచే ఆమెకు అగచాట్లు మొదలయ్యాయి! నహీద్ అసలు ఇక మీదట పాడనే పాడవద్దంటూ ఫత్వా జారీ చేశారు అసోమ్ మత చాందసవాదులు. ఏకంగా 46 ఇస్లామిక్ సంస్థలు నహీద్ ను టార్గెట్ చేశాయి. ఆమె ఇక మీదట పాటలు పాడితే అస్సలు బావుండదని హెచ్చరించే పాంప్లెట్లు అసోమ్ అంతటా ప్రత్యక్షమయ్యాయి!   ముస్లిమ్ మత పెద్దలు నహీద్ పై ఆగ్రహం తెచ్చుకోటానికి కారణం ఆమె షరియా చట్టం ప్రకారం పాపమైన సంగీతం ఆలపించటమే! దాని ప్రకారం పాడటం, ఆడటం, నటించటం... అన్నీ తప్పే! అందుకే, నహీద్ నోరు మూసుకోవాలని ఆర్డర్ జారీ చేశారు అసోమ్ మత పెద్దలు. అక్కడున్నది అదృష్టవశాత్తూ బీజేపి ప్రభుత్వం కావటంతో ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ స్వయంగా ఫోన్ చేసి నహీద్ కు భరోసా ఇచ్చారట. తగిన రక్షణ కల్పిస్తామని చెప్పారట! నహీద్ కూడా తాను మొదట్లో షాకైనా ఇప్పుడు సంగీతం ఎట్టి పరిస్థితుల్లోనూ మానుకోబోనని తెగేసి చెబుతోంది!   అసోమ్ లోని ఇస్లామ్ మత ఛాందసవాదులు బెదిరిస్తే నహీద్ భయపడుతుందా లేదా అన్నది తరువాతి సంగతి.... ముందసలు ఇదంత పెద్ద విషయమేం కాదన్నట్టు ఊరుకుంటోన్న మీడియాను ఏమనాలి? అలాగే, అఫ్జల్ గురు లాంటి ఉగ్రవాదికి మద్దతు తెలిపే స్వేచ్ఛ కూడా అందరికీ వుంటుందని వాదించిన మేదావులు ఒక అమ్మాయి అద్భుతంగా పాడుతోంటే... అడ్డుకోవటం ఏంటని ఎందుకు ప్రశ్నించటం లేదు? అసలు ఒకవేళ అసోమ్ లో బీజేపి ప్రభుత్వం కాకుండా ఇతర సెక్యులర్ పార్టీల ప్రభుత్వం వుండి వుంటే పరిస్థితి ఎలా వుండేది? నహీద్ ఎదుర్కొంటున్నట్టే దశాబ్దాలుగా ఛాందసవాదుల టార్చర్ అనుభవిస్తోంది ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్. అయినా కూడా చాలా సందర్బాల్లో మన సెక్యులర్ ప్రభుత్వాలు ఆమెకి తగినంత రక్షణ ఇవ్వకుండా చేతులెత్తేశాయి!   మీడియా, మేధావులు, లౌకికవాదులమని చెప్పుకునే నేతలు అన్ని మతాల్లోని ఛాందసవాదాన్ని గట్టిగా ఖండిస్తేనే దేశం వేగంగా ముందుకుపోయేది. లేదంటే మధ్య యుగాల నాటి ఆటవిక న్యాయం ఇలాగే కొనసాగుతుంది!

గాయత్రి ప్రజాపతి వికెట్ పడింది! అసలు ఆట ఇప్పుడే మొదలైంది!

ఎన్నికల సమయంలో మోదీ ప్రత్యర్థులపై వాగ్బాణాలు ఎక్కుపెడుతుంటారు. ఇక యూపీ ఎన్నికల్లో అయితే ఆయన రామ బాణాలే సంధించారు ఎస్పీ,బీఎస్పీ, కాంగ్రెస్ లపైన. స్కాం అన్న ఒక పదంలో అందర్నీ కట్టిపడేసి ఎద్దేవ చేశారు. అలాగే, ఎన్నికల భీభత్సమైన యుద్ధ వాతావరణంలో వినిపించిన మరో పంచ్ డైలాగ్... మేం గాయత్రి మంత్రం పఠిస్తాం. వాళ్లు గాయత్రి ప్రజాపతి మంత్రం పఠిస్తారు... అన్నది! మోదీ కూడా టార్గెట్ చేసిన సదరు గాయత్రి ప్రజాపతి ఎవరో తెలిసిందేగా...    గాయత్రి ప్రజాపతి ఎస్పీలోని సీనియర్ నేత. అమేథినగరం నుంచీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే, తాజా ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అంతే కాదు, ఎన్నికల సమయంలో నామినేషన్ వేసి మాయమైపోయారు. ప్రచారంంలో ఎక్కడా కనిపించలేదు. ఆయన నియోజక వర్గంలో అఖిలేష్ ప్రచారం చేసినప్పుడు గాయత్రి ప్రజాపతి కనిపించనే లేదు! ఇంతకు ఆయన చేసిన ఘన కార్యం ఏంటి అంటారా? యూపీలోని బోలెడు మంది దుర్మార్గ నేతల్లాగే ఆయన కూడా ఒక రేప్ కేసులో నిందితుడు. తనపై రేప్ కేసు వున్నా దర్జాగా బయటే తిరిగాడు ఇంత కాలం. కాని, తమ ఎస్పీ సర్కార్ పోయి బీజేపి గవర్నమెంట్ రావటంవతో లక్నోలో అరెస్ట్ అయ్యాడు! ఆయనగారు లక్నోలోనే వున్నా ఇంత కాలం యూపీ పోలీసులకి ఆచూకీ దొరకనే లేదు! ఎస్పీ పాలనలో ఆ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మరీ దారుణంగా తయారైంది. లక్నోలో ఐసిస్ ఉగ్రవాది తలదాచుకున్నా ఆ సమాచారం తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసులకి, ఢిల్లీలోని భద్రాతాధికారులకి తెలిసింది తప్ప యూపీ ఖాకీలకు తెలియలేదు! అదీ వారి దుస్థితి!   అయిదేళ్ల సమాజ్ వాది రౌడీ పాలనలో గాయత్రి ప్రజాపతి లాంటి గూండాల రాజ్యానిక అడ్డు అదుపు లేకుండా పోయింది! ఇప్పుడు పీఠం ఎక్కబోయే బీజేపి సీఎం ప్రధాన కర్తవ్యం ఆ కోరలు చాచిన దాదాల దౌర్జన్యాన్ని పెకిలించటమే! సమూల మార్పు తేలేకున్నా పట్టపగలు హత్యలు, హైవేలపైనే రేప్ లు జరిగే అరాచక స్థితిని చక్కదిద్దాలి. గాయత్రి ప్రజాపతులు మొత్తం ఎంత మంది వున్నారో అందరి లెక్కలూ తీసి తాట కూడా తీయాలి! అది చేస్తేనే యూపీ ప్రజలు వేసిన ఓట్లకు సార్థకత వచ్చేది! బీజేపికి బంగారు భవిష్యత్ కూడా వుండేది!

ఆ 11ఏళ్ల పాకిస్తానీ పాప... మోదీకి ఏం చెప్పిందో తెలుసా?

  సోషల్ మీడియా వచ్చాక జనాల్లో క్రియేటివిటి కట్టలు తెంచుకుంటోంది. ఎవరికి ఏది కావాలంటే అది ప్రచారంలో పెట్టుకునే అవకాశం దక్కుతుండటంతో ఏ క్షణంలో ఏది జనంలోకి వస్తుందో అర్థం కావటం లేదు. అలాంటివే పబ్లిక్ లెటర్స్! ఇప్పుడు ఎవరైనా సరే ప్రధానమంత్రికి కూడా లేఖ రాయొచ్చు. దాన్ని ఆయన చూస్తారా లేదా అన్నది పక్కన పెడితే సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసుకోవటం మాత్రం ఈజీ! తరువాతి రోజు కల్లా సోషల్ మీడియాను ఊపేసిన ఫలానా పబ్లిక్ లెటర్ ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చర్చలోకి తెస్తుంది. అది అప్పుడు ఇంకొంత మందికి తెలుస్తుంది! కొన్నాళ్ల కలకలం... తరువాత అందరూ మరిచిపోతుంటారు!   అనగనగా పాకిస్తాన్ లోని లాహోర్లో ఒక అమ్మాయి. పేరు.. అకీదత్ నవీద్. వయస్సు పదకొండేళ్లు. అంత చిన్న వయస్సులోనే తను భారత ప్రధాని మోదీకి ఒక లేఖ రాసింది. దాంట్లో కమల ధళం ఉత్తర్ ప్రదేశ్ లో భారీ విజయం సాధించినందుకు శుబాకాంక్షలు తెలిపింది. అంతే కాదు, ఇక మీదట మోదీ ఓట్లు గెలిచినట్టే మనస్సులు గెలవాలని పిలుపునిచ్చింది! కేవలం భారతీయుల హృదయాలే కాదు... పాకిస్తానీల హృదయాలు కూడా మోదీ గెలవాలని పదకొండేళ్ల అకీదత్ ఆకాంక్షించింది! గతంలో సుష్మా స్వరాజ్ కు భారత్ , పాక్ మధ్య శాంతి నెలకొల్పాలని ఆశిస్తూ అకీదత్ ఒక లెటర్ రాసిందట! ఇప్పుడు మన ప్రధానికే శాంతి స్థాపన ఆవశ్యకత వివరిస్తూ పబ్లిక్ లెటర్ గురి పెట్టిన అకీదత్ ... అందులో బుల్లెట్ల బదులు బుక్స్, గన్నుల బదులు పేదలకు మందులు కొందామని సందేశం ఇచ్చింది!   ఒక పదకొండేళ్ల అమ్మాయి సమాజం గురించి ఆలోచించటమే గొప్ప అంటే... భారతదేశంలోని ఒకానొక రాష్ట్రమైన యూపీలో బీజేపి గెలిస్తే ... అది కూడా ఆ స్కూలుకెళ్లే పాపకి తెలిసిపోయింది! ఇంత రాజకీయ జ్ఞానం, అవగాహన ఒక బడికెళ్లే పాపకి వుండటం సాధ్యమేనా? ఒకవేళ వున్నా ఏకంగా మోదీకి సలహాలు , సూచనలు ఇస్తున్న అకీదత్ తన స్వంత దేశంలోని పాలకులకి ఏమీ చెప్పకపోవటానికి కారణం ఏంటి? యుద్ధం పోయి శాంతి నెలకొనాలంటే ఇండియా చేయాల్సిన దాని కన్నా ఆ పాప స్వదేశమైన పాక్ చేయాల్సిన కార్యక్రమమే చాలా వుంది! ఈ విషయం ఎందుకు అకీదత్ కి అర్థం కావటం లేదు?   సోషల్ మీడియా ప్రభంజనం తరువాత ఇలా చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద లెటర్ లు రాయటం, వీడియో మెసేజ్ లు ఇవ్వటం బాగా ఎక్కువైపోయింది. చాలా సందర్బాల్లో వీరి వెనుక పెద్దలు ఎవరో వున్నారని చెప్పటం ఏమంత కష్టం కాదు. కేవలం అందరి దృష్టీ ఆకర్షించటానికి చిన్న పిల్లల్ని వాడుకుంటున్నారని బలంగా చెప్పవచ్చు. ప్రధానికి లెటర్ రాయటం వెనుక ఎవరికీ ఎలాంటి దురుద్దేశాలున్నాయని మనం అనటానికి అవకాశం లేదు. కాని, పదకొండేళ్ల అకీదత్ ను అడ్డం పెట్టుకుని ఏదో ఒక విధంగా జనం దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నం జరిగిందన్నది మాత్రం నిజం! మీడియా ఇలాంటి వాటికి ఆచితూచి ప్రాధాన్యత ఇస్తేనే బావుంటుంది...

అమిత్ షా ఎంపిక చేసిన యూపీ సీఎం ఎవరో... ఎవ్వరూ ఊహించలేరట!

ఉత్తర్ ప్రదేశ్ లో భారీ గెలుపుతో మోదీ బాధ్యత తీరింది. కాని, ప్రస్తుత బీజేపికి చాణక్య, చంద్రగుప్తుల్లాంటి అమిత్ షా, నమోల్లో... ఇంకా అమిత్ షాకు బాధ్యత అలానే వుంది! అదే... దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎంపిక చేయటం. యూపీకి ముఖ్యమంత్రి అంటే కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే ముఖ్యం కాదు.  కమల దళం భవిష్యత్ కి కూడా చాలా ముఖ్యం. 2019లో పార్లమెంట్ తిరిగి కైవసం చేసుకోవాలంటే ఉత్తర్ ప్రదేశే ముఖ్యం. దానికి సీఎంగా ఎవరుండి అద్భుతాన్ని సృష్టిస్తారనేదే కీలకం...   గోవా, మణిపూర్లలో మెజార్టీ లేకున్నా సీఎం పీఠం కబ్జా చేసేశారు కాషాయదళం వారు! స్వతంత్ర భారత చరిత్రలో బోలెడన్ని సార్లు కాంగ్రెస్ తనదైన రీతిలో ప్రజాస్వామిక బలప్రయోగం చేసింది. ఇప్పుడు అదే దాదాగిరిని బీజేపి రుచి చూపిస్తోంది. అమిత్ షా మార్చ్ 11 నుంచీ గోవా, మణిపూర్లలో కాంగ్రెస్ కు చెక్ పెట్టడం పై దృష్టి పెట్టారు. పారికర్ ని ప్రయోగించటంతో గోవా కంట్రోల్ కి వచ్చేసింది. ఇక తొలిసారిగా బీజేపి కిరీటంలో మణిపూర్ మణి కూడా విజయవంతంగా వెలిగిపోతోంది. అయితే, విచిత్రంగా అమిత్ షాకు మద్దతు కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన రాష్ట్రాలు ఈజీ అయ్యాయి. కాని, స్వంతంగా రికార్డ్ స్థాయి మెజార్టీ సాధించిన యూపీలో మాత్రం సవాల్ ఎదురవుతోంది! సీఎం ప్రకటనా ఇంకా జరగలేదు...   యూపీలో సీఎం పదవికి ఎవరు అర్హులు అన్న దానిపై అసలు సమస్యంతా బోలెడు మంది సమర్థులు వుండటమే! యూపీ బీజేపి చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య నుంచి మొదలు పెడితే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వరకూ చాలా మందే వున్నారు. ఇక కులాల వారీగా కూడా బ్రాహ్మణ నేతల్నుంచి లిస్ట్ ప్రారంభమైతే సామాజికంగా వెనుకబడ్డ కులాల నాయకుల వరకూ చాలా మందే వున్నారు! అమిత్ షాకు ఛాలెంజ్ గా మారింది ఇదే!   ఉత్తర్ ప్రదేశ్ లో ఎవరు సీఎం అయినా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వుంటుంది. ఒకవైపు మోదీ జనానికి మాటిచ్చినట్టు అభివృద్ధి చేసి చూపాలి. మరో వైపు కులాల కాంబినేషన్లో పార్టీని ఎక్కడా దెబ్బతినకుండా అందర్నీ కలుపుకుని పోవాలి. అలాగే, అన్నిటికంటే ప్రధానంగా, రామజన్మభూమి ఉద్యమానికి కేంద్రం అయిన ఉత్తర్ ప్రదేశ్ రాజ్యంలో... రామాలయం విషయంలో రాబోయే ఒత్తిళ్లని సీఎం తట్టుకోగలగాలి! ఇవన్నిటి కారణంగానే సీనియర్, గతంలో లక్నో పీఠం అధిష్ఠించిన అనుభవం వున్న రాజ్ నాథ్ అయితే బెటరని ఆరెస్సెస్ అంటోందట! కానీ, హరియాణాలో మనోహర్ లాల్ కట్టర్,మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి సర్ ప్రైజ్ సెలక్షన్స్ చేసిన మోదీషా ద్వయం... ఈసారి కూడా ఎవ్వరూ ఊహించని ఎన్నికతో మన ముందుకొస్తారని అంటున్నారు బీజేపిలోని కొందరు నేతలు!   ఆల్రెడీ అమిత్ షా ఒక అనూహ్య నేతను యూపీ సీఎంగా ఎంచుకున్నారనీ... కాని, అందరితోనూ చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నట్టు భావన కల్పించేందుకే కాలయాపన చేస్తున్నారని .... ఢిల్లీలోని కాషాయ వర్గాలు చెప్పుకొంటున్నాయి! ఇంతకీ ఎవరా అన్ ఎక్స్ పెక్టెడ్ సర్ ప్రైజ్ సీఎం? ఇంకా కొన్ని గంటలు ఆగాల్సిందే! 

పవన్ ఎంట్రీతో..జగన్ క్లీన్‌స్వీప్

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ  65 సీట్లు గెలుచుకుంటుందని లెక్కగట్టిన ఓ సర్వే సంస్థ.... ఏ జిల్లాలో ఎన్ని సీట్లు గెలుస్తుందో క్లారిటీ ఇచ్చింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందన్న సర్వే సంస్థ..... తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని చెబుతోంది. పది సీట్లున్న శ్రీకాకుళం జిల్లాలో ఐదు, అలాగే 9 స్థానాలున్న విజయనగరం జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకుంటుందని లెక్కగట్టింది. ఇక 15 సీట్లున్న విశాఖ జిల్లాలో అత్యధికంగా 9 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే సంస్థ అంచనా వేసింది.   ఇక పవన్ కల్యాణ్‌ కులస్తులు అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అంచనా వేసింది. 19 స్థానాలున్న తూర్పుగోదావరిలో అత్యధికంగా 15 సీట్లు కైవసం చేసుకుంటుందని, అలాగే 15 సీట్లున్న పశ్చిమగోదావరిలో ఏకంగా 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని లెక్కగట్టింది. ఇక కాపులు గణనీయంగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ జనసేన సత్తా చాటుతుందని, కృష్ణాజిల్లాలో ఆరు చోట్ల, గుంటూరు జిల్లాలో ఐదు సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తలో మూడు సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది.   అయితే వైసీపీకి బాగా పట్టున్న రాయలసీమలో జనసేన ప్రభావం అంతగా ఉండదని సర్వే సంస్థ తేల్చింది. కడప, కర్నూలు, అనంతపురంలో జనసేన అసలు బోణీ కూడా కొట్టదని చెప్పింది. అయితే కాపు, బలిజ కులస్తులు  కొంచెం అధికంగా ఉన్న చిత్తూరు జిల్లాలో మూడు సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసింది. మొత్తానికి 175 స్థానాల్లో ఉన్న ఏపీలో 65 సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరిస్తుందని తెలిపింది.   ఈ సర్వే నిజమయితే ఆంద్ర లో హంగ్ తప్పదు. మరి అప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారు ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సహజం గా కొత్త పార్టీ వచ్చినప్పుడు ప్రతిపక్షానికే ఆ దెబ్బ తగులుతుంది ..చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్‌కి దెబ్బ పడింది. అలాగే చెన్నై లో విజయ్ కాంత్ పార్టీ పెట్టినప్పుడు ఏఐఏడీఎంకే కి దెబ్బ పడింది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ లో పవన్  పార్టీ ఎంట్రీ  తెలుగు దేశం కి ప్లస్ అవుతుందా ?  

విత్‌డ్రాపై నో లిమిట్స్.. కాని "డబ్బుల్లేవ్"

దేశంలో పేరుకుపోతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేయడంతో పాటు నకిలీ నోట్ల చలామణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేశారు. ప్రజలు తమ దగ్గర ఉన్న పాతనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు గడువు విధించారు. ఆ తర్వాత షరతులతో మార్చి 31 వరకు అనుమతించారు. అయితే పెద్ద నోట్లు రద్దుకావడంతో దేశంలో నగదు సంక్షోభం ఏర్పడింది. విత్‌ డ్రాపై ఆంక్షలు విధించడంతో అత్యవసరాల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం పనులు మానుకుని బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. అయితే ఆర్‌బీఐ రంగంలోకి దిగి విడతల వారీగా నగదు ఉపసంహరణను అనుమతించింది.   మెల్ల మెల్లగా పరిమితులు సడలిస్తూ వచ్చింది..కష్టాలు తీరుతున్నాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ పెద్దనోట్ల రద్దు నాటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో తలెత్తాయి. మార్చి 1 నుంచి ఏటీఎంలు అలాగే బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు తగ్గడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు మళ్లీ మొదటికొచ్చాయి..బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గి, విత్‌డ్రాలు పెరగడంతో ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.     ఫలానా చోట డబ్బు ఉంది అంటే చాలు జనం ఆ పక్కకు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడికి ఎలాగో చేరుకునే సరికి అక్కడ కూడా నో క్యాష్ బోర్డు సామాన్యుడిని వెక్కిరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజుతో నగదు ఉపసంహరణపై ఉన్న అన్నీ పరిమితులు తొలగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అయితే సరిపడనంత నగదు లభ్యత లేకపోవడంతో పాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే దేశంలో కొన్ని ప్రాంతాల్లో నగదు లభ్యతలో ఇబ్బందులు ఉన్నాయని వీలైనంత త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు. 

పోయిన చోటే వెతుక్కుంటున్న బీజేపీ

పోయిన చోటే వెతుక్కోవాలి... పడిన చోటే లేచి నిలబడాలి... సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది బీజేపీ. గోవా ఫలితాల డ్యామేజ్ ను పారికర్ ఇమేజ్ తో సరిచేసేందుకు రెడీ అయ్యింది. మనోహరుడే సరైనోడంటూ పారికర్‌ను రంగంలోకి దింపిన బీజేపీ... మరోసారి గోవా ముఖ్యమంత్రిని చేసేందుకు పావులు కదిపింది.   40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 13 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దాంతో బీజేపీ చక్రం తిప్పింది. ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యేలు, ముగ్గురు MGP ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. మద్దతిస్తున్న ఎమ్మెల్యేల లేఖలతో గవర్నర్‌ను కలిసిన పారికర్‌....ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.   ఎదురులేని నేతగా ఎదిగిన పారికర్... ప్రధాని మోడీకి అత్యంత ఆప్తుడు. మనోహరుడి పనితీరుకు ఫిదా అయిన మోడీ... ఏకంగా గోవా సీఎం పదవికి రాజీనామా చేయించి మరీ, తన కేబినెట్ లో చేర్చుకున్నారు. కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. కానీ ఎన్నికల ఫలితాలతో కమలం ప్లాన్ మార్చింది. మొత్తానికి పారికర్ రీఎంట్రీ గోవా బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుంది. అయితే సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను మొదట ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా? లేక కేంద్రం ఒత్తిడికి తలొగ్గి బీజేపీని పిలుస్తారో చూడాలి.

గోవా, మణిపూర్‌లో బీజేపీ దొంగాట

  గోవా, మణిపూర్‌లో ప్రభుత్వాల ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ రెండు రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది. అయితే గోవా, మణిపూర్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌... రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటుచేసి తీరుతామని ప్రకటించింది.   40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్‌ 17 సీట్లు గెలిస్తే, బీజేపీ 13 స్థానాలతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. అయితే గోవాలో కాంగ్రెస్‌ పార్టీ.... ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అదే బీజేపీ.... ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎనిమిదిమంది సభ్యులు కావాలి. అయితే బీజేపీ మిత్రపక్షాలైన గోవా ఫార్వార్డ్ బ్లాక్, ఎంజీపీ తలో 3 సీట్లు గెలుచుకున్నారు. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ కోసం ఇండిపెండెంట్లతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది.   అయితే గోవాలో ఓటమి పాలైన బీజేపీ, అడ్డదారిలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ మండిపడ్డారు. గోవాలో బీజేపీ నేతలు బేరసారాలకు దిగారన్న డిగ్గీ.... ఇదేనా మీ పార్టీ నైతికత అంటూ ప్రశ్నించారు. ఏదిఏమైనా గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌కు తగిన సంఖ్యా బలముందన్న దిగ్విజయ్‌.... అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ కోసం బీజేపీయేతర ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు తెలిపారు.   ఇక మణిపూర్‌లో వరుసగా నాలుగోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. 60 స్థానాలున్న మణిపూర్‌‌లో 28 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌.... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ముగ్గురు ఎమ్మెల్యేల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మరోసారి సీఎల్పీ నేతగా ఎన్నికైన మణిపూర్‌ ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌.... ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. అయితే 21 సీట్లు గెలిచిన బీజేపీ.... ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండటంతో ఎవరు మణిపూర్‌ పీఠం దక్కించుకుంటారోనన్నది ఉత్కంఠంగా మారింది.

కొంపముంచిన కుటుంబ కథాచిత్రమ్‌

కుటుంబ విభేదాలు సమాజ్‌వాదీ పార్టీ కొంపముంచాయి. ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీలో నడిచిన కుటుంబ కథాచిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా తండ్రి ములాయం మాటనే ధిక్కరించిన తనయుడిగా పేరు తెచ్చుకొనేందుకు అఖిలేష్ యాదవ్ ఎన్ని తంటాలు పడినా లాభం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో పాటు కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికల్లో కనిపించింది. చివరికి ఆ ఫ్యామిలీ డ్రామానే యాదవ పరివారం కొంప ముంచింది.   తండ్రీకొడుకుల ఆధిపత్య పోరాటం నిజానికి ఎన్నికల డ్రామాయే అయినప్పటికీ పార్టీకి మాత్రం తీరని నష్టం తెచ్చిపెట్టింది. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీగా తలపడిన ములాయం, సమాజ్‌వాదీ పార్టీ.... చివరికి అదే పార్టీతో కలిసి పోటీ చేయడం యూపీ వాసులు జీర్జించుకోలేకపోయారంటున్నారు. అఖిలేష్ తన చుట్టూ ఉన్నవారి మాట విని తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ యాదవ్, వారి వర్గాన్ని పక్కకునెట్టడం ఘోరమైన తప్పిదమని విశ్లేషిస్తున్నారు.   ఎంతో రాజకీయానుభవమున్న ములాయం మాటలకు విలువీయకుండా, అఖిలేష్ ఒంటెత్తు పోకడలకు పోవడం వల్లే పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుందని కార్యకర్తలు మండిపడుతున్నారు. హడావుడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అఖిలేష్ పార్టీని ఓటమిలోకి నెట్టారని విమర్శిస్తున్నారు. తండ్రి లేని లోటు కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందని అఖిలేశ్.. ముస్లింల ఓట్లు సంఘటితమవుతాయని కాంగ్రెస్ పార్టీ తప్పుడు అంచనాలతో పప్పులో కాలేశాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. యూపీలో మరోసారి ఎస్పీ నెగ్గాలంటే ములాయం బ్రాండ్‌ తప్ప మరోదారి లేదని ఈ ఫలితాలతో స్పష్టమైందని అంటున్నారు.

నోట్ల రద్దుపై బీజేపీ మాటే నెగ్గింది

నోట్ల రద్దుపై విపక్షాలు పార్లమెంటులోనూ...బయటా నానా రచ్చ చేశాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ ఆందోళనకు దిగాయి. నిజానికి జనం కూడా బ్యాంకులు, ఏటీఎంల దగ్గర తీవ్ర ఇక్కట్లు పడ్డారు. తమ డబ్బు తాము తీసుకోవడానికి నరక యాతన అనుభవించారు. నోట్ల రద్దు ఒక ఎత్తయితే... 2 వేల రూపాయలకు చిల్లర దొరక్క కొత్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే విపక్షాలు నోట్ల రద్దునే ఎన్నికల అస్త్రంగా మలచుకున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని రాహుల్ , కేజ్రీవాల్ లాంటి వాళ్లు పిలుపు ఇచ్చారు.   బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదని విపక్ష నేతలు అంచనా వేశారు. కానీ వారి లెక్కలు తలకిందులయ్యాయి. నిజానికి ఇటీవల జరిగిన ఏ ఎన్నికలోనూ నోట్ల రద్దు ప్రభావం అస్సలు కనిపించలేదు. నోట్ల రద్దు తర్వాత మెజార్టీ ప్రజలు బీజేపీకే మద్దతుగా నిలిచారు. నోట్ల రద్దు చేసిన మరుసటి నెలలో అంటే డిసెంబరులో చండీగఢ్ పురపాలక సంఘం ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది.   ఇటీవల ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కమలదళం అనూహ్యంగా దూసుకుపోయింది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లోనే దాదాపు ఇదే తరహా ఫలితం వచ్చింది. నోట్ల రద్దుతో పడిన కష్టాలను ప్రజలు పెద్దగా గుర్తు పెట్టుకోలేదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ధనవంతులకు వ్యతిరేకంగా మోడీ పెద్ద నోట్ల రద్దు చేశారన్న ఎన్డీఏ మాటల్ని ఓటర్లు అంగీకరించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డీమోనిటైజేషన్ పేదల కోసమేనంటూ బీజేపీ నేతలు చేసిన ప్రచారం ఆ పార్టీకి సత్ఫలితాన్నిచ్చిందని చెబుతున్నారు.

కేసీఆర్‌‌కి కోపమొచ్చింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.... విపక్షాలపై విరుచుకుపడ్డారు. కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ ఒంటికాలిపై లేచారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్‌.... సభా మర్యాదకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సభా హుందాతనాన్ని కాపాడేందుకు కఠినంగానే వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు.  గవర్నర్‌ అసెంబ్లీకి వచ్చినప్పుడు అల్లరి చేయడం రాజ్యాంగబద్ధమా అంటూ ప్రశ్నించారు. సభా మర్యాదను కాపాడటానికి సభ్యులందరూ హుందాగా ప్రవర్తించాలన్న కేసీఆర్‌.... ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే కచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తామని ఘాటుగా తేల్చిచెప్పారు.   కేవలం విమర్శించడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడొద్దన్న కేసీఆర్‌.... మంచి చేస్తే ఒప్పుకోండి, తప్పు చేస్తే ఎత్తిచూపండంటూ సూచించారు. అంతేగానీ నిరాధార ఆరోపణలు చేయొద్దన్నారు. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   గవర్నర్‌ ప్రసంగంలో అబద్దాలుంటే నిరూపించండి.... ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానంటూ ప్రతిపక్షాలకు కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. చిన్న తప్పు చేసినా భవిష్యత్‌ తరాలపై ఆ ప్రభావం పడుతుందని.... ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నామన్న కేసీఆర్‌..... రాజకీయ అవినీతి లేకుండా నిజాయితీగా, పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కరెంట్ కోతల్లేకుండా చేయగలిగామన్న కేసీఆర్‌.... 2019లోపు లక్ష ఉద్యోగాలు ఇచ్చితీరుతామన్నారు.

గూండాగిరే సైకిల్‌ను దెబ్బకొట్టిందా?

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అంచనాలకు మించి ఫలితాలు సాధించింది. అయితే బీజేపీ సునామీకి మోడీ మానియాతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కారణమని విశ్లేషిస్తున్నారు. యువ నాయకుడిగా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగల సమర్థుడిగా అఖిలేష్ యాదవ్ యూపీలో మంచిపేరే తెచ్చుకున్నారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ల్యాప్ టాప్ లు, సైకిళ్ల పంపిణీ, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధికి చేపట్టిన చర్యలు ఆయనకు ప్రజల్లో ముఖ్యంగా యువతలో విశేషమైన పేరే తెచ్చిపెట్టాయి. అందుకే  తండ్రితో విభేదించినపుడు అత్యధిక ఎమ్మెల్యేలు ఆయన పక్షానే నిలిచారు.     అయితే శాంతిభద్రతలను కాపాడటంలో అఖిలేష్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అదే ఓటర్లను ఎస్పీకి దూరం చేసింది. పలుమార్లు హింసాకాండలు చోటు చేసుకోవడం, మత అసహనం, మహిళలపై అత్యాచారాలు వంటి ఘటనలను అదుపు చేయడంలో అఖిలేష్ పూర్తిగా విఫలమయ్యారు. ఎస్పీ పాలనలో గుండాగిరీ పెరిగిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అఖిలేష్ యాదవ్ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో 50 శాతానికి పైగా నేరచరిత్ర ఉన్నవారు కావడంతో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు అర్థమవుతోంది. ఒకపక్క ఎన్నికలు జరుగుతుండగానే అఖిలేష్ సన్నిహితుడైన మంత్రి గాయత్రి ప్రజాపతిపై ఆరోపణలు రావడం...ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, ఘనమైన నేరచరిత్ర ఉన్న రాజా భయ్యాతో సమాజ్ వాదీ సాన్నిహిత్యం కలిగి ఉండటం సైకిల్ ని గట్టిగా దెబ్బ కొట్టాయి. 

యూపీ కోటలో కాషాయ జెండా రెపరెపలు

ఉత్తరప్రదేశ్ కోటపై కాషాయ జెండా ఎగిరింది. యూపీ ఓటర్లు బీజేపికి పట్టం కట్టారు. అత్యధిక సీట్లు కైవసం చేసుకుని బీజేపీ రికార్డులు తిరగరాసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో కాషాయ పార్టీ 324 స్థానాల్లో గెలిచి విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ తో జట్టుకట్టిన సమాజ్‌వాదీ పార్టీ.... బీజేపీ ప్రభంజనంలో కొట్టుకుపోయింది. అఖిలేష్ మంత్రివర్గంలోని పలువురు మంత్రులు ఘోర పరాజయం పాలయ్యారు.     ములాయం ప్రియ సోదరుడు శివపాల్ యాదవ్, చిన్న కోడలు అపర్ణా యాదవ్, నమ్మిన బంటు ఆజం ఖాన్ తదితరులు చిత్తుగా ఓడిపోయారు. ప్రజా తీర్పుని శిరసా వహించి ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఎస్పీ తెలిపింది. పదహారేళ్ల తర్వాత రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తోందన్న ఆనందంలో కమలదళం కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. లక్నో , ఢిల్లీ బీజేపీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కనిపించింది. బాణాసంచా కాల్చి, రంగులు జల్లుకుని ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. 

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది సమాజ్ వాదీ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు ఎందుకు పెట్టుకున్నామా అని ఏడుస్తున్నారు ఎస్పీ లీడర్లు. కూటమిగా 300కి పైగా సీట్లు గెలుస్తామని కలలు కన్న అఖిలేష్ యాదవ్, 60 స్థానాలు కూడా సాధించలేకపోవడంతో రాహుల్ తో జట్టు కట్టడమే కొంప ముంచిందని కుమిలిపోతున్నారు. కాంగ్రెస్ తో జత కట్టకపోయినా ఎస్పీకి ఇప్పటి కంటే ఎక్కువ సీట్లు వచ్చేవని అంటున్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందువల్ల 100కి పైగా సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని విశ్లేషించుకుంటున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే అఖిలేష్ చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదమని చెబుతున్నారు.     అన్ని స్థానాల్లో పోటీ చేసి ఉంటే ఎస్పీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని లెక్కలేసుకుంటున్నారు. ఎన్నికల పొత్తు కాంగ్రెస్ కి బదులు బీఎస్పీతో పెట్టుకుని ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ఓబీసీ, దళిత, ముస్లిం ఓటర్లలో గణనీయమైన బలమున్న బీఎస్పీతో జత కట్టి ఉంటే.... బీజేపీ ఈ స్థాయిలో విజయం సాధించి ఉండేది కాదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే యూపీలో ఏ మాత్రం ప్రభావం చూపని హస్తంతో అఖిలేష్ యాదవ్ చేతులు కలపడం సమాజ్‌వాదీ కొంప ముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేతి దెబ్బతో ఘోరంగా దెబ్బతిన్న తన సైకిల్ కి పంక్చర్లు వేసుకొనే పనిలో పడ్డారు అఖిలేష్. 

ఉత్తరాఖండ్‌‌ను ఊదేశారు

  ఉత్తరాఖండ్‌లో హస్తానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అసెంభ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. ప్రభుత్వ వ్యతిరేకత కమలానికి భారీ విజయాన్ని కట్టబెట్టింది. హరీష్ రావత్ సర్కారుపై ఉన్న యాంటీ ఇన్‌కంబరెన్సీ కాంగ్రెస్‌ను కోలుకోలేకుండా చేసింది. హరీష్ రావత్‌పై ఉన్న వ్యతిరేకత ఓటు బీజేపీకి కలిసి వచ్చింది. అది ఎంతలా అంటే గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా... డబుల్ సీట్లను అధికంగా బీజేపీ దక్కించుకుంది. మొత్తం 50 సీట్లకు పైగా సాధించి విజయ ఢంఖా మోగించింది. ఎన్నికల ముందువరకు ఉత్తరాఖండ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు... రెబల్స్‌గా మారి బీజేపీకి సపోర్ట్ చేశారు. దీంతో రావత్ ప్రభుత్వం పడిపోవడంతో.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు. దీనిని సవాల్ చేస్తూ రావత్ సుప్రీంకోర్టు మొట్లు ఎక్కారు...విజయం సాధించారు. రెబల్ ఎమ్మెల్యేలను లొంగతీసుకుని ప్రభుత్వన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకను మాత్రం రావత్ తగ్గించలేక పోయారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రభుత్వాన్ని పడేశారన్న సానుభూతి కూడా వర్కవుట్ కాలేదు. డీమానీటైజేషన్ ప్రభావం కూడా అస్సలు కనిపించలేదు. అధికార కుమ్ములాటలో కాంగ్రెస్ పడిపోవడంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. అంతే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు అంతంత మాత్రమే చేయడంతో ప్రజల్లో కాంగ్రెస్‌పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇటు మోడీ మానియాతో పాటు... కాంగ్రెస్ వ్యతిరేకత బీజేపీకి కలిసి వచ్చింది. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ పర్వత రాష్ట్రంలో తొలిసారి బీజేపీ భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

ఆ రెండు కుటుంబాలను... ఆ రెండు రాష్ట్రాల ఓటర్లు... ఓట్లతో కుళ్ల బొడిచారు!

  యూపీలో బీజేపి అద్బుత విజయం సాధించింది.కాని, అదే బీజేపి పంజాబ్ లో పల్టీ కొట్టింది! ఎందుకని? పంజాబ్ ఓటమి కేవలం బీజేపీదే కాదు. నిజానికి బీజేపి కన్నా ఆ ఓటమి ఎక్కువగా అకాళీ దళ్ పార్టీది! అక్కడ కూటమిలో ప్రధాన పార్టీ శిరోమణి అకాళీ దళే! బీజేపి కూటమిలో ఎప్పుడూ అనుచర పార్టీనే! అందుకే, పంజాబ్ లో ఓటర్ల వ్యతిరేకత అకాళీ దళ్ తో పాటూ బీజేపి కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది!   పంజాబ్ లో ఎస్ఏడీ, యూపీలో ఎస్పీ రెండూ ఘోర పరాజయం మూట గట్టుకోవటం వెనుక దాదాపు ఒకే రకమైన కారణాలు వున్నాయి! అదే కుటుంబ పాలన! ఉత్తర్ ప్రదేశ్ లో యాదవుల కుటుంబం రాష్ట్రాన్ని తమ స్వంత జాగీర్ గా వాడేసుకుంది. అఖిలేష్ , ఆయన తండ్రి, అతడి భార్య, అతగాడి తమ్ముడు, ఆయనగారి భార్య, ఆఖరుకు... ములాయం వారి రెండో భార్య కూడా ఇల్లు వదిలి రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇలా ఫ్యామిలీ ఫ్యామిలి అంతా ఉత్తర్ ప్రదేశ్ ను ఉప్మా బాక్స్ షేర్ చేసుకున్నట్టు షేర్ చేసుకోవటమే ముప్పు తెచ్చి పెట్టింది. అఖిలేష్ కు, ఆయన బాబాయికి జరిగిన మల్ల యుద్ధం కూడా జనానికి తిక్క రేగేలా చేసింది!   పంజాబ్ లో బాదల్ కుటుంబానిది మరింత దారుణమైన పాలన! అక్కడ ప్రతీ అయిదేళ్లకు ఒకసారి అధికార పార్టీ మారుతుంది. అయినా జనం దయతలచి 2012లో రెండో సారి వరుసగా అకాళీకి అవకాశం ఇచ్చారు. కాని, ఆ పార్టీని నడుపుతున్న బాదల్ కుటుంబ సభ్యులు గత అయిదేళ్లలో అరాచకం చూపించారు. పాకిస్తాన్ తో సరిహధ్దు కలిగిన కీలక రాష్ట్రంలో డ్రగ్స్ దందా అధికారికంగా తామే వెలగబెట్టారు! ఒక ప్రభుత్వంలోని వారు మత్తు పదార్థాలు అమ్ముకోటం కంటే హీనమైన పని మరొకటి వుంటుందా? ఇక ల్యాండ్ గ్రాబింగ్లు, కిడ్నాప్ ల వంటి వాటికైతే లెక్కేలేదు! అందుకే, బాదల్, ఆయన కొడుకు, ఆయనగారి భార్య... ఇలా అందర్నీ ఓటుతో కొట్టారు పంజాబీలు! మళ్లీ అకాళీదళ్ తేరుకోటం పదేళ్ల వరకూ కష్టమే! పైగా కొంత మేర ఆప్ కూడా ఆక్రమించేసింది!