రెవెన్యూలో సగం ఉద్యోగులకే... మరి బంగారు తెలంగాణ ఎలా సాధ్యం?

  వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇష్టమొచ్చినట్లు ఉద్యోగుల జీతాలు పెంచుకుంటూ పోతున్న కేసీఆర్‌... రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. బంగారు తెలంగాణ అంటూనే భవిష్యత్‌‌ను అంధకారంలోకి తీసుకెళ్లిపోతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ అండగా నిలిచారన్న కృతజతతో ఇష్టమొచ్చినట్లు జీతాలు పెంచేస్తూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఇరకాటంలో పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు టీఆర్ఎస్‌ పార్టీకి ఫుల్‌ సపోర్ట్‌ చేశారు. కేసీఆర్‌కి అండగా నిలిచారు. ఆందోళనలు, ధర్నాలతో ఉద్యమాన్ని హోరెత్తించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌... ఉద్యోగులను సంతోషపర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉద్యోగులు నిరాశకు గురి చేయకుండా భారీగా జీతాలు పెంచడం మొదలుపెట్టారు.   2015 మార్చిలో 43 శాతం ఫిట్‌ మెంట్‌ ఇచ్చి....3 లక్షల మంది ఉద్యోగులు, లక్షన్నర మంది పెన్షనర్లను ఆనందంలో ముంచెత్తారు. అంతేకాదు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను 2014 జూన్‌ నుంచి అమలు చేశారు. కేసీఆర్‌ నిర్ణయంతో ప్రభుత్వంపై ఒకేసారి 6వేల 5వందల కోట్ల రూపాయల భారం పడింది. దీనికి తోడు ఏరియర్స్‌ రూపంలో మరో 3వేల 5వందల కోట్ల రూపాయల అదనపు బండ పడింది. తర్వాత 57వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. కేసీఆర్‌ నిర్ణయంతో అదనంగా ప్రభుత్వంపై ఏడాదికి 8వందల కోట్ల రూపాయలు భారం పడింది. అంతేకాదు స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ కింద ఉద్యోగులకు 570 కోట్ల రూపాయలు, డీఏ కింద 5వందల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇదే సమయంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లకు జీతాలను పెంచారు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి మరో 450 కోట్ల రూపాయల భారం పడుతోంది. ఉద్యోగుల జీతాలే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల జీతాలను 2016లో పెంచారు.   ఇలా వరుసగా జీతాలు పెంచడంతో.... తెలంగాణ సర్కార్‌కు వచ్చే రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడుతోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉద్యోగాల జీతాలు 18 వేల 4వందల కోట్ల రూపాయలుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్‌ కాస్తా 25వేల కోట్లకు పెరిగింది. ప్రస్తుతం జీతాల భారం 30వేల కోట్ల రూపాయలకు చేరింది. వరుసగా జీతాలు పెంచుతుండటంతో... సర్కారుకు వచ్చే రెవెన్యూలో సగభాగం జీతాలకే వెచ్చించాల్సి వస్తోంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదని, ముందుముందు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

లాలూతో తెగదెంపులు? బీహార్‌లో కొత్త సమీకరణాలు.!

  ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. దాణా కుంభకోణం కేసుల్లో లాలూపై విచారణ కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన అత్యున్నత ధర్మాసనం.... లాలూపై అభియోగాలను కొట్టివేస్తూ జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టింది. దాణా కుంభకోణంలో లాలూ విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది.   లాలూ బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉండగా 1996లో దాణా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పశుగ్రాసం పేరుతో 900 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ లాలూపై 4 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో దోషిగా తేలడంతో 2013 అక్టోబర్‌లో కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే అదే ఏడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయగా, మిగతా 3 కేసుల్లో లాలూపై దాఖలైన అభియోగాలను జార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సీబీఐ సవాల్‌ చేయడంతో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. మిగతా మూడు కేసులతోపాటు, క్రిమినల్‌ కేసును కూడా పునరుద్ధరించాలని సుప్రీం ఆదేశించింది.   దాణా స్కామ్‌లో లాలూపై మళ్లీ విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో బీహార్‌లో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. అవినీతిపరుడైన లాలూతో తెగదెంపులు చేసుకుని.... బీజేపీ మద్దతు తీసుకోవాలంటూ నితీష్‌ కుమార్‌కి బీహార్‌ బీజేపీ చీఫ్‌ సుశీల్‌కుమార్‌ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు. మొన్న షాబుద్దీన్‌-లాలూ ఆడియో టేప్‌ బయటికి రావడం, ఇప్పుడు దాణా కేసుల్లో విచారణ జరగనుండటంతో బీహార్‌లో రాజకీయంగా అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

విభజన వాదం వినిపించిన పవన్... కౌంటరిచ్చిన టీడీపీ..!

  టీటీడీ ఈవో నియామక వివాదం మరింత ముదురుతోంది. తెలుగు చదవడం, మాట్లాడటం రాదు, అలాంటి అధికారిని టీటీడీ ఈవోగా ప్రభుత్వం ఎలా నియమించిందని ప్రశ్నించిన శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద...ఇది ఆగమానికి సంబంధించి సమస్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఈవోగా వ్యవహరించిన సాంబశివరావును బదిలీ చేయడాన్ని కూడా తప్పుబట్టారు. పైగా ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సైతం సవాలు చేస్తామని స్వరూపానంద చెప్పారు.   స్వామీజీ విమర్శల వేడి చల్లారక ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాది అధికారిని టీటీడీ ఈవోగా నియమించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాది ఐఏఎస్‌ అధికారులకు తాను వ్యతిరేకం కాదన్న పవన్...అమర్‌నాథ్‌, వారణాసి, మధుర లాంటి ఆలయాల్లో దక్షిణాది అధికారులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్‌ ప్రశ్నించారు.   అయితే పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను టీడీపీ నేత వర్ల రామయ్య తప్పు పట్టారు. ఉత్తరాది, దక్షిణాది అని విడదీయడం మంచి పద్ధతి కాదన్నారు. మీడియాలో ప్రచారం కోసమే మాట్లాడటం సరికాదని అన్నారు. దక్షిణాది అధికారులకే టీటీడీ ఈవో పదవని ఏ చట్టంలోనూ రాసిలేదని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్‌ చేశారు కదా అని ఏది బడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. మొత్తానికి టీటీడీ ఈవో విషయంలో ప్రభుత్వ నిర్ణయం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది.

టీఆర్‌ఎ‌స్‌కు ఎదురుగాలి? పుంజుకుంటున్న కాంగ్రెస్‌!

  తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎ‌స్‌కు ఎదురుగాలి వీస్తోందా? ప్రజల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కి మెల్లమెల్లగా ఆదరణ పెరుగుతోందా? తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం కాంగ్రెస్‌దేనా? అవునంటోంది ఓ వాట్సప్‌ సర్వే. నమ్మడానికి కొంత సందేహం కలిగినా.... ఓ నియోజకవర్గంలో నిర్వహించిన వాట్సప్‌ సర్వేలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. లేటెస్ట్‌ టెక్నాలజీని, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ జరిపిన ఈ వాట్సప్ సర్వేలో ప్రస్తుత టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కంటే... కాంగ్రెస్‌ లీడర్‌కే ఎక్కువ ఓట్లు రావడం సంచలనంగా మారింది.   టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న పోరాటం సత్ఫలితాలను ఇస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా కరీంనగర్‌ జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ వాట్సప్ పోల్‌ నిర్వహించింది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టా మధు, కాంగ్రెస్ తరపున దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుతో పాటు మరో ఇద్దరు బరిలో నిలిచారు. ఈ పోల్‌లో టీఆర్ఎస్  అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా ఓట్లు వేశారు. మొత్తం 611 ఓట్లు నమోదు కాగా.... 345 శ్రీధర్ బాబుకు.... పుట్టా మధుకు 258 ఓట్లు వచ్చాయి. తొలుత పుట్టా మధు ఆధిక్యం కనబరచినా... చివరికి ఓటింగ్‌ శ్రీధర్ బాబు కు అనుకూలంగా మారింది. ఇదే ఇప్పుడు టీకాంగ్రెస్‌ నేతల్లో జోష్‌ పెంచుతోంది.   టీఆర్ఎస్‌ ప్రభుత్వంపైనా, కేసీఆర్‌ కుటుంబంపైనా తెలంగాణ ప్రజల్లో మెల్లగా వ్యతిరేకత పెరుగుతోందని... 2019 నాటికి అది మరింత ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ వైఫల్యాలను, కేసీఆర్‌ మాయ మాటలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. అందుకోసం సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగించుకోవాలని డిసైడ్‌ అయ్యింది. సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి... పార్టీ పరిస్థితిపైనా, అభ్యర్ధిపైనా ఓ అంచనాకి రానుంది. అందులో భాగంగానే మంథనిలో వాట్సప్‌ గ్రూపుల్లో శాంపిల్‌ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే శాంపిల్ సర్వేలో పాజిటివ్ రిజల్ట్‌ రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో 2019 విజయంపై నమ్మకం పెరిగింది. ఒక్క మంథనిలోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు.

విద్వేషం తీరితే చాలు… విదేశమైనా ఫర్వాలేదు!

  రాజకీయంలో లాభం,నష్టం వుంటాయి తప్ప… మంచీ, చెడూ వుండవు! రాజకీయ ఎత్తులు, పై ఎత్తుల్లో భాగంగా ఒక్కోసారి కొందరు అత్యుత్సాహపరులు దేశం పరువు కూడా తీస్తుంటారు. అలాంటి సంఘటన తాజాగా చంద్రబాబు అమెరికా పర్యటన నేపథ్యంలో జరిగింది. ఇక్కడ మన దేశంలో వుండగా మనకు ఎన్ని విభేదాలైనా వుండవచ్చు. ఎన్ని విద్వేషాలున్నా కూడా ఫర్లేదు. కాని, దేశం కాని దేశంలో మన రాజకీయాలు, శత్రుత్వాలు బయటపెట్టుకుంటామా? ప్రపంచం ముందు మన పరువు మనమే తీసుకుంటామా? కొందరు అలాంటి దిగజారుడు పనికి కూడా సిద్ధమయ్యారు!   వైసీపీ సపోర్టర్స్ గా భావిస్తున్న వారు కొందరు డాలస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ నగరంలో పర్యటిస్తున్న ఏపీ సీఎంపై కంప్లైంట్ చేశారు! ఎవరికో తెలుసా? ఆ అమెరికన్ నగరపు మేయర్ కి! ఒక తెలుగు ముఖ్యమంత్రిపై ప్రవాస తెలుగు వారే అమెరికన్ మేయర్ కి కంప్లైంట్ చేయటం ఎంత సిగ్గుచేటు? పైగా ఈమెయిల్స్ రూపంలో పంపిన తమ అబద్ధపు మాటల్లో… వారు చంద్రబాబును ఎర్ర చందనం స్మగ్లింగ్ కోసం పాతిక మందిని చంపించిన క్రిమినల్ గా అభివర్ణించారు! ఆయన అమెరికాకి వచ్చింది కూడా చట్ట వ్యతిరేకంగా నిధుల సేకరణ కోసమని చెప్పారు!   ఒక సీనియర్ నేత, ప్రజల చేత ఎన్నుకోబడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అబద్ధం చెప్పటమే దుర్మార్గం. దానికి తోడు అంతర్జాతీయ సమాజం ముందు తల దించుకునేలా అమెరికాలోని ఒక నగర మేయర్ కి కంప్లైంట్ చేయటం… మరింత విషాదం! మొత్తానికి సదరు దుర్మార్గ మెయిల్స్ ప్రభావంతో చంద్రబాబు మీటింగ్ వద్దకొచ్చిన పోలీసులు జరిగేది వేరని అర్థం చేసుకుని సైలెంట్ గా వుండిపోయారట. చంద్రబాబు ఇండియాలోని ఒక సీఎం అని గ్రహించి వారు ప్రత్యేకమైన భద్రత కూడా కల్పించారట!   మెయిల్స్ చేసిన వారు నిజంగా వైసీపీ మద్దతుదారులో కాదో మనకు తెలియదు. కానీ, వారెవరైనా… చంద్రబాబుతో తమకు వైరం వుంటే ఇండియాలో తేల్చుకోవాలి. అమెరికాలో ఆయన్ని రచ్చకీడ్చాలని ప్రయత్నించటం అత్యంత హేయం. ఎందుకంటే, చంద్రబాబుకు అవమానం జరగటం కేవలం ఆయనకు వ్యక్తిగత నష్టం కాదు. ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటన చేస్తున్న ఎవరు అరెస్ట్ అయినా అది మన యావత్ జాతికే అవమానం! గతంలో ఇలాంటి సిగ్గుమాలిన పనికే చాలా మంది ఎంపీలు కూడా పాల్పడ్డారు. మోదీని అమెరికాలోకి రానివ్వద్దని ఒబామాకి అభ్యర్థన చేసుకున్నారు. కేవలం స్వంత రాజకీయ లబ్ది తప్ప ఇలాంటి వారికి దేశ గౌరవం, రాష్ట్ర ప్రతిష్ట వంటివేవీ పట్టవు. ఇలాంటి వార్ని కఠినంగా శిక్షించే చట్టాలు ఏమైనా తీసుకొచ్చే ఆలోచన చేయాలి రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వాలు…

జగన్‌‌కు మరో ఝలక్‌..? మరో రెండు వికెట్లు డౌన్‌..!

  ఇప్పటికే 21మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి... తెలుగుదేశంలో చేరిపోయారు. ఈ వలసల పరంపర ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయముంది, ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే... వచ్చే ఏడాదే జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాంటి పరిస్థితిలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకే మొగ్గుచూపుతున్నారు. అయితే ఈసారి తమదే అధికారమంటోన్న జగన్‌... వలసపోతున్న ఎమ్మెల్యేలను ఆపలేకపోతున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు జగన్‌కు ఝలక్‌ ఇఛ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచే జగన్‌కు ఝలక్‌ తగలనుందని అంటున్నారు. శ్రీ‌కాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, విజ‌య‌న‌గ‌రం జిల్లా పాల‌కొండ ఎమ్మెల్యే క‌ళావ‌తి... వైసీపీని వీడుతారనే ప్రచారం ఎప్పట్నుంచో సాగుతున్నా.... అది నిజం కాబోతుందని అంటున్నారు. శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మంత్రి ....ఈ ఇద్దరు ఎమ్మెల్యేల‌ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.   వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని జగన్‌ చెబుతున్నా.... ఎమ్మెల్యేలు మాత్రం అధికార పార్టీ వైపు చూడటం వైసీపీ శ్రేణులను కలవరపెడుతోంది. దాంతో ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారకుండా నచ్చజెప్పే బాధ్యతను, వలసలను నియంత్రించే బాధ్యతను జిల్లాల వారీగా సీనియర్లకు జగన్‌ అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ మారాలనుకుంటోన్న ఎమ్మెల్యేల సమాచారాన్ని ఇఫ్పటికే తెప్పించుకున్న జగన్‌.... ఎమ్మెల్యేలు చేజారకుండా బుజ్జగింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు రానున్నాయ‌ని, అధికారంలోకి వ‌చ్చేది మ‌న పార్టీయేనని, ఇప్పటికే టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అనేక అవ‌మానాలు ఎదుర్కొంటున్నార‌ని గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక‌త ఉంద‌ని, ఈ స‌మ‌యంలో పార్టీ మారితే వ్యక్తిగతంగా న‌ష్టపోతారంటూ ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ హెచ్చరిస్తున్నారు.   పార్టీ మారకుండా ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూనే, మరోవైపు పార్టీ మారిన నేతల తీరును ప్రజల్లో ఎండగట్టాలని జగన్‌ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాజకీయంగా దెబ్బ తీయాలని జ‌గ‌న్ భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి... పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎండగట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆర్దికాభివృద్ధి దీపం… వెలిగించే చమురుతో కృష్ణా తీరం!

  మనకో సామెత వుంది… దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని! కానీ దీపం వెలిగించుకోటానికి తగిన చమురు వుంటే… ఇల్లు ఎప్పుడైనా చక్కబెట్టుకోవచ్చు! అవునా, కాదా? ఇక శుభవార్త ఏంటంటే… ఇప్పుడు ఆంధ్రుల నవ్యాంధ్ర దీపాన్ని వెలిగించే చమురు… కనకదుర్గమ్మ కనుసన్నల్లో, కృష్ణమ్మ పాదాల చెంత అద్భుతంగా లభించబోతోంది! ఆధునిక కాలపు బంగారం లాంటి సహజ వాయువు, చమురు దేశంలో మరెక్కడా లేని విధంగా కృష్ణా జిల్లాల్లో లభించనున్నాయి! అదే జరిగితే భారీ ఆర్దిక రాబడితో స్వర్ణాంధ్ర సుందర స్వప్నం సుసాధ్యమే!   రాష్ట్ర విభజనతో రాజధాని సైతం లేని దయనీయ స్థితిలో ఏపీ తన పయనం మొదలుపెట్టింది. మూడేళ్లలోనే అమరావతో సహా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు పోతోంది. అయితే, ఎంతగా పెట్టుబడులు ఆకర్షించినా ఆర్దిక లోటు మాత్రం వెంటాడుతూనే వుంది. ప్రతీ దానికీ కేంద్రం తలుపు తట్టి నిరీక్షించాల్సి వస్తోంది. కాని, ఈ చారిత్రక సంధి కాలంలో ఒక్కసారి మనం జాగ్రత్తగా అడుగు వేస్తే ఎంతో ఆర్దిక పురోగతి సాధ్యమేనంటున్నారు నిపుణులు. కారణం… రాజధానికి దగ్గర్లోనే, కృష్ణ తీరంలో భారీగా చమురు నిక్షేపలు బయటపడ్డాయి. త్వరలోనే వాటి వెలికితీత మొదలవనుంది. అది జరిగితే ఇప్పుడు వ్యవసాయం, చేపల పరిశ్రమకి ప్రఖ్యాతిగాంచిన కృష్ఝా జిల్లా స్వరూప, స్వభావమే మారిపోనుంది!   ఇప్పటి పరిణామాల్ని పరికించే ముందు ఓ సారి గతంలోకి వెళదాం. బ్రిటీషు వారు భారత్ లో కాలుమోపిన తొలినాళ్లలోనే మచిలీపట్నానికి కూడా వచ్చారు. 18వ శతాబ్దంలోనే వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇక్కడ కార్యాలయం వుండేది. తెల్లవారి సైన్యం కూడా మకాం చేసేది. ఇంకా భారతదేశం అంతా వారి ఆధీనంలోకి రానప్పుడే మచిలీపట్నంలో వ్యాపార లావాదేవీలు నడిపే వారు ఇంగ్లీషు వాళ్లు. అయితే, అప్పట్లోనే ఒక ఆసక్తికర విషాద ఘటన చోటు చేసుకుంది. 1860-70ల మధ్య కాలంలో ఓ భారీ జల తరంగం ఊళ్ల మీదకి వచ్చి వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. బంగాళాఖాతం మీద నుంచి తరుముకొచ్చిన ఆ రాకాసి అల గురించి బ్రిటీష్ లైబ్రెరీలో ఆధారాలు నమోదై వున్నాయి కూడా!   ఇంతకీ… మొత్తం 40వేల మంది వరకూ సామాన్య ప్రజలు, మత్స్యకారులు, బ్రిటీష్ అధికారులు మరణించిన ఆ దుర్ఘటన ఎందుకు జరిగింది? సముద్రం ఉప్పొంగటానికి కారణం… సముద్ర గర్భంలోనూ, కృష్ణ జిల్లా భూగర్భంలోనూ దాగి వున్నా అపార నిక్షేపాలేనట! ఇది ఇప్పుడు కాదు… 1860ల్లోనే బ్రిటీష్ వారు రాసిపెట్టిన సత్యం! కిందనున్న ఆ చమురు నిల్వల్లోఅగ్ని రాజుకుని పేలుళ్లు సంభవించటం చేతనే సముద్రం అల్లకల్లోలమై జనం మీదకి దూసుకొచ్చింది!   18వ శతాబ్దం నుంచీ నిన్న మొన్నటి వరకూ సముద్ర గర్భంలోని, భూగర్భంలోని చమురు నిల్వలు బయటకు తీసే చౌకైన సాంకేతిక మనకు అందుబాటులో లేదు. కాని, గత కొన్ని దశాబ్దాలుగా చమురు రంగంలో మనం ఎంతో అభివృద్ధి సాధించాం. అందుకే, ప్రస్తుతం కేజీ బేసిన్ లో చమురు ఉత్పత్తి వేగంగా జరిగిపోతోంది. ఇక తరువాతి గమ్యం కృష్ణ తీర ప్రాంతమే అంటున్నారు నిపుణులు. దీంట్లో భాగంగా…  నాగాయలంక మండలంలోని వక్కపట్ల వారి పాలెం, నంగేగడ్డ గ్రామాల్లోని పొలాల్లో చమురు వెలికితీత ప్రారంభించనున్నారు వచ్చే ఆగస్ట్ లో! ఇప్పటికే ఇక్కడ భారీ చమురు నిల్వలు వున్నాయని ఓఎన్జీసీ, కెయిర్ ఇండియా సంస్థలు గుర్తించాయి.   కృష్ణ తీరంలోని కేవలం కొన్ని ఊళ్లూ, కొన్ని ఎకరాల పంట పొలాలకు మాత్రమే చమురు అన్వేషణ పరిమితం కాకూడదనీ …. నదీ తీరం మొత్తం జల్లెడ పట్టాలనీ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, నవ్యాంధ్ర తీరంలో, సముద్ర గర్భం కూడా లోతుగా అన్వేషించాలని అంటున్నారు. దీని వల్ల దేశంలోనే మరే రాష్ట్రానికి లేని చమురు నిల్వల సంపత్తి ఏపీకి కలుగుతుంది. దాని వల్ల భారీగా ఆర్దికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన జరుగుతుంది. తెలుగు వారికే కాదు… చమురు లభించటం వలన… శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత్ కి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది!   ఒకప్పుడు చేతి చమురు వదిలించుకోవటం అంటే డబ్బులు ఖర్చు చేయటం అని అర్థం! కాని, ఆధునిక కాలంలో పెట్రోల్, డీజీల్ ఉత్పత్తికి కారణమైన చమురే అత్యంత ఖరీదైన సంపద! ఆ చమురు వెలికితీసి చేతి అంటించుకోవటమే… ఆర్దికాభివృద్ధి! మరి అటువంటి సహజ సంపద ప్రకృతి మన కృష్ణమ్మ ఒడిలో భద్రంగా దాచింది. ఎంత సమర్థంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజల బాగుకి వాడతాయన్నదే తరువాతి ప్రశ్న!

తాతలాగా, నాన్నలాగా మంచిపేరు తెచ్చుకోలేకపోవచ్చు

  శనివారం తన విశాఖపర్యటనలో మీడియాతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాతలాగా, నాన్నలాగా తాను అంతటి మంచిపేరు తెచ్చుకోలేకపోవచ్చు గానీ పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెడ్డపేరు తీసుకురానని... తాను దొంగబ్బాయిని కానని, దొంగ పేపర్లు, దొంగ చానల్స్‌ను నడపడం లేదని జగన్ ని ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, త్వరలోనే మిగతా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే గ్రామస్థాయిలో పార్టీ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తల సూచన మేరకే నియామకాలు ఉంటాయని తెలిపారు. లోకేష్‌... లోక్యాష్‌ అని పలువురు తనపై ఆరోపిస్తున్నారని, దమ్ముంటే 24 గంటల్లో నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. ఒక వేళ నిరూపించలేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లోకి కేవలం సేవ చేయడానికి మాత్రమే వచ్చానని, కొందరిలాగా సంపాదించుకోవడానికి మాత్రం కాదని అన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నట్టు, గ్రామీణ ప్రాంతాల రూపరేఖలు త్వరలోనే పూర్తిగా మార్చివేస్తామని చెప్పారు లోకేష్.

సంచలనం రేపుతున్న మాఫియా డాన్, లాలూ ఫోన్ క్లిప్

  ఒక జాతీయ మీడియా ఆర్జేడీ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్, మాఫియా డాన్ షహాబుద్దీన్ తో ఫోన్ లో మాట్లాడిన ఆడియో క్లిప్ లీక్ చేయడం సంచలనానికి తెర లేపింది. ఆ ఆడియో క్లిప్ లో షహాబుద్దీన్, లాలూ యాదవ్ కి శివన్ ఎస్పీ సౌరభ్ కుమార్ షా ని తొలగించాల్సిందిగా ఆర్డర్ చేసినట్టు వినిపించింది. "ఆ ఎస్పీని, ఇంకొందరు పనికిరాని అధికారుల్ని పంపించేయండి, మావాళ్ళు అల్లర్లు సృష్టిస్తారు," అని షహాబుద్దీన్ లాలూ కి దిశా నిర్దేశం చేసినట్టుగా ఆ క్లిప్ లో ఉంది. భారతీయ జనతా పార్టీ లీడర్ సుశీల్ కుమార్ మోడీ, లాలూ ప్రసాద్ పై విరుచుకుపడ్డాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజకీయ భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్ చేస్తున్న తప్పుడు పనులని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, లాలూ అయితే నేరస్థులకు కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. "ఆ మీడియా లాలూ, షహాబుద్దీన్ లాంటి ఒక క్రిమినల్ చెప్పిన విదంగా ఎలా వ్యవహరిస్తున్నారో తెలియజేసింది. మరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీనికి ఎలా జవాబిస్తారో చూడాలి," అని అన్నారు. అయితే, నితీష్ కుమార్ పార్టీ వర్గీయులు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. బీహార్ ప్రభుత్వం ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తుందని, ఆ ఆడియో క్లిప్ లో చెప్పబడిన ఎస్పీ ని విధుల్లోంచి తొలగించలేదని, తాము చట్టం పట్ల ఎంత నిభద్దదతో ఉంటామో ఇది రుజువు చేస్తుందని, చెప్పుకొచ్చారు. శివన్ నుండి నాలుగు సార్లు ఎంపీ గా ఎన్నికయిన షహాబుద్దీన్ కి అంతకు ముందు నేర చరిత్ర ఉంది. అతని మీద చాలా క్రిమినల్ కేసు లు ఉన్నాయి. సుప్రీమ్ కోర్ట్ షహాబుద్దీన్ కి బెయిల్ నిరాకరించడంతో, ప్రస్తుతం ఢిల్లీ లోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఆర్జేడీ మాత్రం ఇప్పటికీ షహాబుద్దీన్ కి మద్దతుగా మాట్లాడుతోంది. "ఆడియో క్లిప్ ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఏం మాట్లాడలేం. షహాబుద్దీన్ మంచి లీడర్. మా మద్దతు అతనికుంటుంది. కానీ, ఒక వేళ ఆయన నిజంగా లాలూ తో జైలు నుండి ఫోన్ లో మాట్లాడుంటే మాత్రం అది పెద్ద తప్పే," అని పార్టీ సీనియర్ లీడర్ ఒకరు చెప్పారు. అయితే, సుశీల్ కుమార్ మోడీ మాత్రం నితీష్ కుమార్, లాలూ తో అలయెన్స్ రద్దు చేసుకోవాలని... లాలూ ప్రజా జీవితాన్ని వదిలేయాలని అభిప్రాయపడ్డారు.

నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవ్స్ కు … 450కోట్ల మోదీ గిఫ్ట్!

దక్షిణాసియా ఉపగ్రహం… వినటానికే విచిత్రంగా వుంది కదా? నిజంగానే ఇది కొంత విచిత్రమైన, వినూత్నమైన ఉపగ్రహం. మరి కొన్ని గంటల్లో నింగిలోకి దూసుకుపోనున్న సౌత్ ఏషియా సాటిలైట్ మన చుట్టూ వున్న దేశాలకీ మనం ఇస్తోన్న అంతరిక్ష బహుమతి! అసలు ఉపగ్రహాన్ని భారత్ ఇతర దేశాలకి బహుమతిగా ఇవ్వటం ఏంటి అంటారా? అయితే ఈ ఇంట్రస్టింగ్ థింగ్స్ తెలుసుకోవాల్సిందే!   కొన్ని గంటల్లోనే మన శ్రీహరికోట అంతరిక్ష  కేంద్రం నుంచీ నింగికి ఎగియనుంది దక్షిణాసియా ఉపగ్రహం. దీని ప్రత్యేకత ఏంటంటే… మూడేళ్లుగా 450కోట్లు ఖర్చు చేసి రూపొందించిన ఈ వైజ్ఞానిక అద్బుతం భారత్ తో పాటూ నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ లకు కూడా సేవలందించనుంది! దీన్నే అంతర్జాతీయ పరిభాషలో స్పేస్ డిప్లోమసీ అంటారు! చైనా ఇప్పటికే అంతరిక్ష రంగంలో ఈ అంతరిక్ష రాజనీతిని ఉపయోగించి కొన్ని దేశాలకి సాయం చేసింది. తద్వారా వాట్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. బదులుగా మోదీ చేసిన ఆలోచనే ఈ దక్షిణాసియా ఉపగ్రహం! పాకిస్తాన్ మినహా సార్క్ దేశాలన్నీ ఈ సాటిలైట్ ద్వారా భారత్ అందించే సేవల్ని పొందనున్నాయి!   మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ సౌత్ ఏషియా సాటిలైట్ ని మోదీ భారత్ ఇస్తోన్న గిఫ్ట్ గా అభివర్ణించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ … కేవలం ఇండియాకే పరిమితం కాదని ఆయన చెప్పారు. సహజ వనరుల్ని గుర్తించటం, టెలీమెడిసిన్, విద్యా వంటి అనేక రంగాల్లో ఈ ఉపగ్రహం భూటాన్, మాల్దీవ్ల వంటి దేశాలకి ఎంతో కీలకం కానుంది. వాటికి ఇప్పటి వరకూ అంతరిక్షంలో ఎలాంటి ఉపగ్రహాలు లేవు. అలాగే, నేపాల్, శ్రీలంక, బంగ్లాదే్శ్ లు కూడా మన ఉపగ్రహం నుంచి సేవల్ని పొందుతాయి. పాకిస్తాన్ తనకు తానే ఈ ప్రొగ్రామ్ నుంచి తప్పుకుంది!   ఇండియా అందిస్తోన్న ఈ గిఫ్ట్ సాటిలైట్ వల్ల ముందు ముందు ప్రకృతి విపత్తులు వచ్చినా  సార్క్ దేశాల మధ్య హాట్ లైన్స్ కొనసాగుతాయి. అందువల్ల కమ్యూనికేషన్ ఎంతో మెరుగవుతుంది. జీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి గురి పెట్టడం ఇస్రోకు ఇది పదకొండోసారి! గతంలో జీఎస్ఎల్వీతో చేసిన ప్రయోగాలు ఘన విజయాలు సాధించాయి! మొత్తం మీద సౌత్ ఏషియా సాటిలైట్ దక్షిణాసియాలో భారత్ ని విలక్షణ శక్తిగా నిలుపుతుందనేది నిస్సందేహం!

మంత్రినే ఉగ్రవాది అనుకున్నారు… స్వంత సైనికులే ఎన్ కౌంటర్ చేశారు!

ఉగ్రవాదం… ఇప్పుడు దీని కంటే పెద్ద సమస్య ప్రపంచానికి ఏదీ లేదనిపిస్తోంది! ఎందుకంటే, నిన్న మొన్నటి వరకూ ఉగ్రవాదం కొన్ని దేశాలకీ, కొన్ని ప్రాంతాలకి పరిమితం! కానీ, రాను రాను టెర్రరిజమ్ లేని టెరిటరీ లేకుండాపోతోంది! ప్రపంచం మొత్తం ఉగ్రవాదుల గుప్పిట్లో బందీ అయిపోతోంది. హాయిగా నిర్భయంగా బతికేసే వాడు అమెరికా మొదలు ఆఫ్రికా వరకూ ఎక్కడా లేకుండా పోతున్నాడు!   కొన్ని దశాబ్దాల కింది వరకూ ఉగ్రవాదం అంటే ఆసియాలో వుంటుందనే ఆలోచన వుండేది. పాకిస్తాన్, పాలస్తీనా లాంటి ప్రాంతాల్లో విపరీతంగా వుండేది. ఇజ్రాయిల్, ఇండియా లాంటి దేశాలు బాధిత దేశాలుగా పరిగణింపబడేవి. కాని, ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. వాల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల తరువాత అమెరికా కూడా భయం లేకుండా నిద్రపోలేపోతోంది! ట్రంప్ నిషేధాలు, హెచ్చరికలు అన్నీ ఉగ్రవాదం చలువే! ఇక యూరప్ కూడా ఈ మధ్య దారుణంగా తయారైంది. ఎక్కడ ఏ టెర్రరిస్ట్ ట్రక్ తీసుకుని పైకొచ్చేస్తాడో అర్థం కాని పరిస్థితి! ఎక్కడ ఏ నైట్ క్లబ్ లో జనాల జీవితాలు తెల్లారిపోతాయో ఎవరికీ అర్థం కావటం లేదు!   ఉగ్రవాదుల అరాచకలతో అల్లాడిపోవటం మనకైతే కొత్త కాదు. పాకిస్తాన్ లాంటి దేశాలు స్వయంకృతం కారణంగా మానవ బాంబులతో దద్ధరిల్లిపోతున్నాయి! అయితే, ఎవరూ పట్టించుకోని పేద ఖండమైన ఆఫ్రికా పరిస్థితి ఏంటి? అక్కడా ఉగ్రవాదం ఉరిమి ఉరిమి మీద పడుతోంది! నిజానికి అమెరికా, యూరప్, ఆసియా కంటే ఆఫ్రికాలో టెర్రరిజమ్ మరింత అమానుషం! అందుకు అత్యంత తాజా ఉదాహరణ సోమాలియా మంత్రి కాల్చివేత!   అబ్బాస్ అబ్దుల్లాహి సిరాజీ, 31ఏళ్ల ఈ యంగ్ మినిస్టర్ సోమాలియా చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన మంత్రి! కాని, దురదృష్టం అతడ్ని బుల్లెట్ల రూపంలో వెంటాడి వేటాడింది! విషాదం ఏంటంటే… సిరాజీని ఎవరో ఉగ్రవాదులు చంపలేదు. ఆయన ప్రభుత్వానికి రక్షణగా వుండే సైనిక బలగాలే కాల్చి చంపాయి! అందుక్కారణం, తన కార్ తానే నడుపుకుంటూ వచ్చిన ఆయన్ని చూసి భద్రతా సిబ్బంది ఉగ్రవాదేమోనని అనుమానించటమే!   సోమాలియా ఆడిటర్ జనరల్ కి సెక్యురిటీగా వున్న జవాన్లు కార్ లో వస్తోన్న మంత్రిని చూసి టెర్రరిస్ట్ అనుకున్నారట! దాంతో కాల్పులు జరిపారు. మంత్రి అక్కడికక్కడే చనిపోయాడు! ఇది పైకి మామూలు మానవ తప్పిదంలా కనిపిస్తోన్నా… సోమాలియా లాంటి ఆఫ్రికన్ దేశాల్లో ఉగ్రవాద పంజాని కళ్లకు కడుతుంది! అక్కడ అందరూ అందర్నీ అనుమానించాల్సిన దుస్ఙతి! చివరకు, డ్రైవర్ లేకుండా స్వంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన మంత్రికి కూడా రక్షణ లేదక్కడా! అతడ్నీ అనుమానించే దారుణమైన వ్యవస్థ!   పోమాలియా ఉగ్రవాదంతో అల్లకల్లోలం అయిపోతోంది. అక్కడ పట్టపగలు రాజధాని నడిబొడ్డులో కూడా టెర్రర్ దాడులు జరుగుతుంటాయి. ఉగ్ర మూకలు గన్నులు పట్టుకుని రాక్షసానందంతో తిరుగుతుంటాయి. ఇంచుమించూ ఇలాంటి పరిస్థితే చాలా ఆఫ్రికన్ దేశాల్లో వుంది. ఆ మధ్య నైజీరియాలో బోకో హరామ్ ఉగ్రవాదులు వందల మంది టీనేజ్ క్రిస్టియన్ అమ్మాయిల్ని ఎత్తుకెళ్లారు. ఇంత వరకూ వారి జాడ కూడా దొరకటం లేదు! అదీ అక్కడ నెలకొన్న నరకం!   ఒకవైపు ఆయుధ కంపెనీల స్వార్థం, మరో వైపు రాజకీయ నేతల దుర్మార్గం, ఇంకో వైపు మత పెద్దల , నాయకుల అమానుష సిద్దాంతం… అన్నీ కలిసి ఉగ్రవాదం రూపంలో సోమాలియా లాంటి ఎన్నో దేశాల్ని చిదిమేస్తన్నాయి. దీనికి పరిష్కారం కనుచూపు మేరలో కనిపించటం లేదు…

ఆంధ్రా అభివృద్ధి కోసం… అమెరికాలో చంద్రయానం!

ఒకప్పుడు ప్రధానులు, ముఖ్యమంత్రులు అంటే నాయకుల్లానే వుండేవారు. రాజకీయాలు, ఉపన్యాసాలు… వీటితోనే సరిపెట్టేవారు. కాని, ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో సీన్ మొత్తం మారిపోయింది! ప్రధాని దేశానికి సీఈవో అయితే, సీఎంలు రాష్ట్రాలకి సీఈవోలు! వీళ్లు ముందటి వాళ్లలా కేవలం బిజీగా వుంటే సరిపోవటం లేదు. బిజినెస్ కూడా చూసుకోవాలి! తమ పాలనలోని ప్రాంతానికి ఎంత పెట్టుబడి వచ్చింది? ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఇవే ఇప్పుడు కీలకం అయ్యాయి! చంద్రబాబు లాంటి సీఎంలకి ప్లస్ పాయింట్ అవుతోంది కూడా అదే!   రాజకీయం చేసే నేతలు చాలా మందే వుంటారు. కాని, అభివృద్ది కళ్ల ముందు చూపటం అంత సులువు కాదు. చంద్రబాబు పాలనకి ముందు, పాలన తరువాత సైబర్ సిటీ హైద్రాబాద్ రూపే మారిపోయింది! ఎలా? వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీల్ని ఆయన భాగ్యనగరికి రప్పించటం వల్ల! కేవలం సైబర్ టవర్స్ కట్టేసి ఊరుకుని వుంటే హైద్రాబాద్ ఇవాళ్ల వున్న పొజీషన్లో వుండేదే కాదు! కాని, సమైక్యాంధ్ర సీఎంగా బాబు తొమ్మిదేళ్లు కొనసాగినప్పుడు రేయింబవళ్లూ ఆయన ఎంతో కృషి చేశారు. తాను అమెరికా వెళ్లటమే కాదు .. బిల్ క్లింటన్నే తెలుగు వారి రాజధానికి తీసుకొచ్చారు! అదే ఎన్నో సత్ఫలితాల్ని ఇచ్చింది!   ఇప్పుడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా అమెరికాలో కాలుమోపిన మన సీఎం మరోసారి తన సీఈవో స్కిల్స్ చూపిస్తున్నారు. చూపించాల్సిన సమయం కూడా సరిగ్గా ఇదే! అమరావతితో ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న ఆంధ్ర రాష్ట్రానికి అత్యవసరంగా పెట్టుబడులు కావాలి. అప్పుడు అభివృద్ధి, ఉపాధి సాద్యమవుతాయి. అది సాధించగలరనే భరోసాతోనే జగన్ ని కాదని జనం చంద్రబాబుని ఎంచుకున్నారు! ఇప్పుడు సీఎం ప్రజలు తనపై వుంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే అమెరికాలో అన్వేషణ కొనసాగిస్తున్నారు!   వాషింగ్టన్‌ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్‌, షికాగో… ఇలా బోలెడు రాష్ట్రాలు పర్యటించనుంది చంద్రబాబు బృందం. క్షణం తీరిక లేకుండా సాగే ఈ ప్రయాణంలో అనేక అగ్రిమ్మెంట్లు కూడా జరగనున్నాయి. దాదాపు 300 మంది బడా బడా కంపెనీల సీఈవోలు ముఖ్యమంత్రిని కలుసుకోనున్నారంటే… ఎంత ప్లానింగ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే, యాపిల్ కంపెనీ ఇప్పటికే ఏపీకి వస్తుండగా మైక్రోసాఫ్ట్ ను ఒప్పించే ఆలోచనలో వున్నారు చంద్రబాబు. అదే జరిగితే రెండు ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ లతో ఏపీ రూపే మారిపోతుంది!   చంద్రబాబు అమెరికా పర్యటన ఫలితాలు ఇప్పుడే మనం అంచనా వేయలేకున్నా… ఆయన కృషిని, తపనని మాత్రం తప్పకుండా మెచ్చుకోవాల్సిందే!

తెలంగాణ సర్కార్… కేంద్రంపైకి మిర్చీ ఘాటు మరల్చగలదా?

మిర్చీ ఘాటు మాంచి ఎండా కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! ఏపీలో ఏకంగా ప్రతిపక్ష నేత దీక్షకే దిగారు. అయినా ప్రభుత్వం మిర్చీ రైతుల్ని శాంతిపజేసే చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించటం లేదు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది కూడా ఏం లేదని చెప్పే వారు కూడా వున్నారు. ఇక మరి కొందరు రైతులు కోరిన విధంగా మద్దతు ధర ఇవ్వాలని హితవు పలుకుతున్నారు! ఏపీలో ఎలాంటి పరిస్థితి వుందో తెలంగాణలోనూ అలాంటి స్థితే నెలకొంది!   తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కి వ్యతిరేకంగా మిర్చీ బాగానే ఘాటు రేపింది. ఆయన సీఎం అయిన మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా రైతులు రోడ్డెక్కారు. దాడులు చేసి కలకలం రేపారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీటీడీపికి మంచి అస్త్రాన్ని అందించారు! అందుకే, గత కొన్ని రోజులుగా మిర్చీ వ్యవహారాన్ని ఎదుర్కోవటంలో కేసీఆర్ ఒకింత ఇబ్బంది పడుతున్నారు. రైతులు అడిగిన విధంగా మద్దతు ధర ఇచ్చేయటం తేలికైనా పని కాదు. కానీ, ప్రతిపక్షాలు అదే డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నాయి. రైతుల పక్షాన నిలిచామంటూ టీఆర్ఎస్ సర్కార్ ను కార్నర్ చేస్తున్నాయి!   మిర్చీ ఘాటు తట్టుకోలేకపోతున్న తెలంగాణ గవర్నమెంట్ కేంద్రాన్ని లాక్కొచ్చింది రచ్చలోకి. మద్దతు ధర నిర్ణయించటం కేంద్రం చేయాలని హరీష్ రావు అన్నారు. అంతే కాదు, 70లక్షల టన్నుల మిర్చీ దిగుబడి వుంటే సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 3లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తాననటం పెద్ద జోక్ అన్నారు. దానికి కూడా 5వేల మద్దతు ధర నిర్ణయించటం తమకు ఎంత మాత్రం అంగీకారం కాదని చెప్పుకొచ్చారు!   మిర్చీ మద్దతు ధర నిర్ణయించటం… రైతుల ఆందోళన విరమింపజేయటం… కేంద్రం బాధ్యత కూడా. కాని, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మోదీ సర్కార్ పై నెపం తోసి తాము తప్పుకుందామంటే వీలు కాదు. రైతులు తాము ఓటు వేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తారు. తెలంగాణ మిర్చీ మార్కెట్లో అదే జరుగుతోంది. అంతకంతకూ కేసీఆర్ వ్యతిరేక నినాదాలు పెరిగిపోతున్నాయి. ఎంత త్వరగా రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. అలా కాకుండా ఒక రోజు మిర్చీ రైతుల్ని ఎవరు రెచ్చగొడుతున్నారో మాకు తెలుసుననీ… ఇంకో రోజు కేంద్రం ఆదుకోవాలే తప్ప రాష్ట్రం ఏం చేయలేదనీ… ఇలా రకరకాల స్టేట్మెంట్ లు ఇస్తే రైతన్నలు ఊరుకోరు! కేంద్రం బాధ్యత నిజంగానే వున్నా… తమకు మద్దతు ధర రాకపోవటం రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమనే అనుకుంటారు కర్షకులు. ఎందుకంటే, ఇదేదో పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోటం లాంటి పూర్తి అంశం కాదు. రైతుల సమస్యలు ఎలా చూసినా రాష్ట్రాలే చొరవ చూపి పరిష్కరించాలి!   మద్దతు ధర విషయంలో చాలా రాష్ట్రాల్లో రైతులు అసంతృప్తితోనే వున్నారు. కాని, గతం పరిశీలిస్తే ఆ ఎఫెక్ట్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోందే తప్ప కేంద్రం పై కాదు. దీన్ని గ్రహించి తెలంగాణ సర్కార్ మిర్చీ రైతుని ఎలా ఆదుకోవాలో నిజాయితీగా ఆలోచించాలి. కేంద్రం పై ఘాటైన విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు. కాని, మిర్చీ రైతుల ఘాటును తప్పించుకోవటం మాత్రం సులువు కాదు!

జయ ఎస్టేట్ : దొరలు, దొంగలు, దోపీడీలు అండ్ మిస్టరీ!

జయలలిత అంటే ఓ గ్లామర్, ఓ పొలిటికల్ ఇమేజ్ మాత్రమే కాదు. ఆమె అమ్మగా తమిళ ప్రజలకు ఆరాధ్య దైవం అయ్యారు. తనని వ్యతిరేకించిన, ఎదురించిన వారికి పీడకల కూడా అయ్యారు! కాని, ఇదంతా పైకి కనిపించేదే. సామాన్య జనానికి ఇంత కాలం తెలియని ఎన్నో రహస్యాలు ఒక్కోటి ఇప్పుడు బయటకొస్తున్నాయి! మరీ ముఖ్యంగా, అమ్మకు, చిన్నమ్మకు మధ్య కొనసాగిన ఆర్దిక, అవినీతి అనుబంధాలు అందర్నీ షాక్ కి గురి చేస్తున్నాయి! జయ మరణంతో ఖాళీ అయిన సీఎం కూర్చీలో కుర్చుందామనుకున్న శశికళ ఇప్పుడు జైల్లో వుంది. అలా జరగటానికి కారణాలు బోలెడు. అవన్నీ మనకు తెలిసినవే. అయితే, చిన్నమ్మ జయమ్మ అనుబంధంలోని కొత్త కోణం ఎస్టేట్ లో బయటపడింది! అదీ దోపిడీ దొంగల వాంగ్మూలంలో! వినటానికే విచిత్రంగా వున్న ఈ వ్యవహారమంతా ఏదో సినిమా కథలా నడుస్తోంది! సరిగ్గా అలాంటి నిజాలు, అలాంటి అనుమానాస్పద మరణాలే చోటు చేసుకుంటున్నాయి!   కొన్నాళ్ల క్రితం కొడనాడు అనే ప్రాంతంలోని జయలలిత ఎస్టేట్ లో దొంగలు పడ్డారు. వాచ్ మెన్లపై దాడి చేసి మరీ నగలు, డబ్బులు, దస్తావేజులు ఎత్తుకెళ్లారు! శశికళ జైల్లో వుండగా, దినకరణ్ పోలీస్ కస్టడీలో వుండగా ఇదంతా జరుగుతుండటం అనుమానాస్పదమే! అయినా యధవిధిగా దర్యాప్తు చేసిన పోలీసులు అనుకోని నిజాలు కనుక్కోగలిగారు! జయలలిత ఎస్టేట్ దోచుకున్న దొంగల్లో ఇద్దరు చిల్లర దొంగలు కేరళలో కార్లు దొంగిలిస్తూ పట్టుబడ్డారు. వారిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే దిమ్మతిరిగే విషయాలే బయటకొచ్చాయి!   కేరళ పట్టుబడ్డ ఇద్దరూ దొంగలు జయలలిత ఎస్టేట్ దోచిన పదకొండు మందిలో భాగం. అయితే, వారిది అసలు పాత్ర కాదట. జయలలిత వద్ద గతంలో కార్ డ్రైవర్ గా పని చేసిన కనకరాజ్ దొంగల ముఠా లీడరంటున్నారు. జయలలిత మరో మాజీ డ్రైవర్ నయాన్ కూడా ఎస్టేట్ దోచుకోవటంలో కీలకపాత్ర పోషించాడట. ఈ డ్రైవర్లు ఇద్దరూ మిగతా అందరితో కలిసి మొత్తం 11మంది దోపీడికి వెళ్లారు. ఎస్టేట్ ను కాపలాకాస్తున్న వాచ్ మెన్లను చితకబాదారు. లోనికి వెళ్లి అందినంతా దోచుకున్నారు. అయితే, చివర్లో డ్రైవర్ కనకరాజ్ సినిమా టైపులో మోసం చేశాడు ఇతర దొంగల్ని! రెండు లక్షలు చేతిలో పెట్టి నోరు మూసుకుని పొమ్మన్నాడు. వేషాలేస్తే పెద్ద పెద్ద వారి ప్రమేయం జయలలిత ఎస్టేట్ దోపీడీలో వుందనీ, వారు చూసుకుంటారని అన్నాడు. చేసేది లేక రెండు లక్షలు తీసుకుని వెళ్లిపోయిన చిల్లర దొంగలే ఇప్పుడు పోలీసులకి దొరికారు!   క్రైమ్ సినిమాల్లో మాదిరిగా ఇప్పటికే జయ ఎస్టేట్ దోపిడికి ప్లాన్ చేసిన మాజీ డ్రైవర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇంకో డ్రైవర్ అనుమానాస్పదంగా యాక్సిడెంట్ అయ్యి చికిత్స పొందుతన్నాడు! ఇంత దారుణం తమిళనాడు ప్రభుత్వంలోని ఒక మంత్రే జరిపించాడని కూడా టాక్ వినిపిస్తోంది. అతడికి త్వరలోనే నోటీసులు వెళ్లొచ్చని అంటున్నారు. ఇంతకీ, ఇంత రిస్క్ దొంగలు, దొరలు అందరూ ఎందుకు తీసుకుంటున్నారు? ఈ కొశన్ కి యాన్సర్ జయలలిత ఎస్టేట్ లో దొరికిన కోట్లు విలువ చేసే డబ్బు, భూమి కాగితాలు, నగలే! జయ, శశికళ రూముల్లో సదరు ఎస్టేట్ లో కుప్పలు కుప్పలుగా డబ్బులు, డాక్యుమెంట్స్, నగలు దొరికాయట! ఇంకేం కావాలి… మాంచి క్రైమ్ స్టోరీ నడవటానికి?

మేకప్ పైకప్పుల మాటున … జీవితాల అర్ధాంతర ప్యాకప్!

గ్లామర్ ప్రపంచంలో వున్న వారి గురించి చెప్పేటప్పుడు క్యాండిల్ ఉదాహరణ చెబుతుంటారు! జాగ్రత్తగా గమనిస్తే క్యాండిల్ చుట్టూ మనకు నల్లటి నీడ కనిపిస్తుంది! కాని, దూరంగా మాత్రం తన వెలుగుల్ని ప్రసరిస్తుంది! గ్లామర్ లోకంలోని తారలు కూడా అంతే చేస్తుంటారు! తమ చుట్టూ చీకట్లు అలుముకునేలా చేసుకుంటూ… దూరం నుంచీ చూసే వారికి మాత్రం ధగధగా మెరిసిపోతూ కనిపిస్తారు! ఇందుకు తాజా ఉదాహరణ ఆత్మహత్య చేసుకున్న నటుడు ప్రదీపే!   సినిమా వాళ్లు , సీరియల్ వాళ్లు, మోడల్స్ … ఇలా ఎవరైనా సరే… ఆత్మహత్య చేసుకున్నారని వార్తొస్తే చాలు… దాని వెనుక అంతిమ కారణం ఒత్తిడే అయ్యి వుంటుంది! ఇప్పటికే దాదాపుగా ఆత్మహత్య అని పోలీసులు కూడా అంగీకరిస్తోన్న ప్రదీప్ ఉదంతంలో అతడి భార్యతో చిన్న గొడవే ప్రాణాలు తీసుకోటానికి కారణం అంటున్నారు. ఇలాంటి భార్యా, భర్తల గొడవలు అన్ని రంగాల్లోని వారికి వుంటాయి. అయితే, నటుల వద్దకి వచ్చే సరికి అవ్వి మరింత ఒత్తిడి తీసుకొస్తాయి. ఎందుకంటే, వాళ్లు నటించటంలో భాగంగా ప్రతీ రోజూ ముఖం మీద బలవంతపు చిరు నవ్వు పులుముకోవాల్సిందే! కాని, నిజ జీవితంలో బోలెడు ఆటుపోట్లు కొనసాగుతూ వుంటాయి! ఈ రెండిటీ మధ్యా రాపిడి పెరిగిన కొద్దీ నటుల జీవితం దుర్భరం అవుతు వుంటుంది! గ్లామర్ మెరుపులతో వాళ్లు పైకి అందరికీ ఆర్టిఫిషల్ ఆనందం చూపించినా… లోన రియల్ వెలితి వేటాడుతూ వుంటుంది!   ప్రదీప్ లాగే ఆ మధ్య బాలికా వధూ సీరియల్ హీరోయిన్ ప్రత్యూష ప్రాణాలు తీసుకుంది. ఆమె సూసైడ్ కి కూడా రిలేషన్ షిప్ లో వచ్చిన ఒత్తిడే కారణం! తాను సహ జీవనం చేస్తోన్న వ్యక్తితో ప్రత్యూష గొడవ పడ్డాకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఇక ఉదయ్ కిరణ్ సంగతి కూడా మనకు తెలిసిందే. ప్రొఫెషనల్ లైఫ్లో ఫెయిల్యూర్ తో పాటూ పర్సనల్ లైఫ్ లో టెన్షన్స్ జీవితాన్ని చాలించేలా చేశాయి!   సీరియల్ ఆర్టిస్ట్ ప్రదీప్ ఆత్మహత్యలో అతను తాగి వుండటం కూడా కీలకమైన అంశం. ఒకప్పటి సక్సెస్ ఫుల్ హీరోయిన్ దివ్యభారతి తాగి మేడ మీద నుంచి పడిపోయిందనే చెబుతారు. ఆమె ఆత్మహత్య విషయంలో అనేక అనుమానాలున్నప్పటికీ… మందు, డ్రగ్స్ లాంటి వాటి పాత్ర గ్లామర్ ప్రపంచంలో కొట్టిపారేయలేం. మత్తుకు లోనయ్యాక చిత్తయ్యే అవకాశాలు మరింత ఎక్కువవుతాయి.   ఇప్పటి ప్రదీప్ అయినా, మొన్నటి జియా ఖాన్ అయినా, నిన్నటి ప్రత్యూష బెనర్జీ అయినా… అందరూ చెప్పేది ఒక్కటే… గ్లామర్ ప్రపంచం ఇచ్చే వరాలతో పాటూ శాపాల్ని సమర్థంగా ఎదుర్కోవాలి. మానసిక ఒత్తిడిని తట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. క్షణికావేశం లేకుండా, నిరాశా, నిస్పృహ దరి చేరకుండా జాగ్రత్త పడాలి. లేదంటే అయినా వారందరికీ బాధను మిగులుస్తూ అర్ధాంతరంగా ప్కాకప్ చెప్పేయాల్సి వస్తుంది!

టార్గెట్‌ టీఆర్‌ఎస్‌.... వయా రెడ్‌ చిల్లీ... బీజేపీ కొత్త ప్లాన్‌

తెలంగాణలో మిర్చి మంటలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్‌ వార్‌కి దారి తీస్తోంది. అటు కేంద్ర మంత్రులు... ఇటు తెలంగాణ మంత్రుల ప్రకటనలతో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. మిర్చి రైతుల కష్టాలకు కారణం ...మీరంటే మీరంటూ టీఆర్ఎస్‌, బీజేపీ నేతలు వాదులాడుకుంటున్నారు. తప్పు మీదంటే మీదంటూ మాటల తూటాలు విసురుకుంటున్నారు. మిర్చి రైతులను కేంద్రమే ఆదుకోవాలని టీఆర్‌ఎస్‌ నేతలు అంటుంటే, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అన్నదాతలు కష్టాల పాలయ్యారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే వాణిజ్య పంటలపై దృష్టిపెట్టాలని సూచించడంతో... రైతులు.. మిర్చిని పెద్దఎత్తున సాగు చేశారని, అయితే ఉత్పత్తికి తగ్గట్టుగా మిర్చిని కొనుగోలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గిట్టుబాటు ధర కోసం నెలరోజులుగా మిర్చి రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం.... పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలోనూ జాప్యం చేసిందని కమలం నేతలు ఆరోపిస్తున్నారు.    మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా..... మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్‌ కింద నివేదిక పంపడంలో తెలంగాణ సర్కార్‌ ఆలస్యం చేసిందని, అందుకే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో జాప్యం జరిగిందని కమలం నేతలు అంటున్నారు. తప్పంతా రాష్ట్ర ప్రభుత్వం చేసి.... కేంద్రంపై నిందలు వేయడం సరికాదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే మిర్చి రైతులు నష్టపోయారని, ఇకనైనా సమస్యలను సకాలంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తే ఆదుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు.   మొత్తానికి మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావడంతో ఇప్పుడు క్రెడిట్ కోసం బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు పోటీపడుతున్నారు. ఇది తమ ఘనతంటే తమ ఘనతంటూ వాదులాటకు దిగుతున్నారు.

కేజ్రీలో ఖలేజా తగ్గిందా? ఎందుకు భయపడుతున్నాడు?

ఆమ్‌ ఆద్మీ పార్టీలో అసమ్మతి తుఫాన్ ఎట్టకేలకు తీరం దాటింది. పార్టీకి గుడ్‌బై చెబుదామనుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆప్త మిత్రుడు, సీనియర్ నేత కుమార్ విశ్వాస్ మనసు మార్చుకున్నారు. కుమార్ విశ్వాస్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏజెంటంటూ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే అమాన‌తుల్లా‌ఖాన్‌ను ఆప్‌ నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీ వీడే ఆలోచన విరమించుకున్నారు.   కుమార్ విశ్వాస్ 30 మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకెళ్లిపోతున్నారంటూ ఆప్ ఎమ్మెల్యే అమాన‌తుల్లా ఖాన్ ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది. అమానతుల్లాఖాన్ ఆరోపణలను ఖండించిన కుమార్ విశ్వాస్.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడం లేదంటూ పార్టీ అగ్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోకపోతే పార్టీని వీడతానంటూ హెచ్చరికలు పంపారు. దాంతో ఆప్‌లో క‌ల్లోలం రేగింది. ఇప్పటికే ఢిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కేజ్రీవాల్‌.... విశ్వాస్‌ డిమాండ్‌కు తలొగ్గారు. విశ్వాస్‌ కోరినట్లుగా ఎమ్మెల్యే అమానతుల్లాను పార్టీ నుంచి సస్పెండ్ చేసి... కుమార్ కు రాజస్థాన్ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.    అయితే అమానతుల్లా ఖాన్ హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతించారు. కేజ్రీవాల్ ఆదేశాల్ని శిరసావహిస్తానని చెప్పారు.

అధిక బరువుంటే... 'ప్రతీ రోజూ' కడుపు మాడ్చుకోవాల్సిన పని లేదట!

మనకో పాత ఆరోగ్య సూత్రం ప్రచారం లో వుంది! ఒక్కసారి తింటే యోగి, రెండు సార్లు తింటే భోగి, మూడు సార్లు తింటే రోగీ అనీ! ఇది ఎంత వరకూ నిజమో పెద్ద చర్చే కాని… ఉపవాసం మాత్రం మంచిదే! అదీ అధిక బరువున్న వారికైతే మరీ మంచిది! కానీ, తాజా అధ్యయనాలు ఉపవాసంలో కొత్త ట్రెండ్ ఫాలో అవమంటున్నాయి. అది ఇంకా బెటర్ అని చెబుతున్నాయి!   ఉపవాసంలో కొత్త ట్రెండ్ అంటే ఏమీ లేదండీ… ప్రతీ రోజూ కడుపు మాడ్చుకోకుండా రోజు వదిలి రోజు కడుపుపై కంట్రోల్ పెట్టాలి అనీ! అవును… గతంలో అయితే వారానికి ఒక రోజో, పదిహేను రోజులకి ఒక సారి ఏ ఏకాదశి వేళనో ఉపవాసం అనేవారు పెద్దలు! ఇప్పుడు శారీరిక వ్యాయామం తగ్గిపోయి అధిక బరువు అధికమందిలో కనిపిస్తుండటంతో ప్రతీ రెండో రోజు ఉపవాసం చేయాలని చెబుతన్నారు!   ఒక రోజు కడుపు నిండా తింటే మరో రోజు కడుపు ఖాళీగా వుంచాలి. దీనర్థం నిరాహార దీక్ష చేయమని కాదు. మనకు అవసరమైన కెలోరీల్లో కేవలం 25శాతం మాత్రమే తీసుకోవాలి. అంటే, దాదాపు 500కెలోరీలన్నమాట! ఇక ఉపవాసం చేయని రోజు సగటున 2వేల కెలోరీలు తీసుకోవచ్చు! దీని వల్ల ప్రతీ రోజూ కొసిరి కొసిరి తిన్నదాని కంటే ఎక్కువ ఫలితం వుంటుందని అంటున్నారు రీసెర్చర్స్! వారు ఒక సంవత్సరం పాటూ వందల మంది మీద అధ్యయనం చేసీ మరీ ఈ విషయం చెబుతున్నారు!   రోజు వదిలి రోజు ఉపవాసం చేయటం పైకి బాగానే అనిపించినప్పటికీ… ఆచరణలో కష్టమట! చాలా మంది ఉపవాసం వుండాల్సిన రోజున కూడా అవసరానికి మించే తినేసే ప్రమాదం వుంది. ఇక ఈ ఉపవాసం టెక్నిక్ డయాబెటిస్ వున్న వారికి అసలు మంచిది కాదు. ఎందుకంటే, ఎప్పటికప్పుడు కొంత కొంత మోతాదులో తింటూ వుండటం షుగర్ వున్న వారికి అత్యవసరం. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అధిక బరువు వున్నవారు నిజంగా తమ పట్టుదలపై తమకు కాన్ఫిడెన్స్ వుంటే … ఈ ఆల్టర్ నేట్ ఫాస్టింగ్ టెక్నిక్ యూజ్ చేయవచ్చు! 

అనర్థం తప్పినా… ఆప్ కు అపాయం మిగిలే వుందా?

చీపురు చిరిగిపోకుండా మిగిలింది! ఒకవేళ ఆ పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్ పార్టీని వీడి వుంటే దారుణమే జరిగి వుండేది. ఆప్ అడ్డంగా చీలిపోయి వుండేది. చాలా మంది ఎమ్మెల్యేలు కుమార్ విశ్వాస్ వెంట బయటకి నడిచి వుండే వారని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. అది ఎంత వరకూ నిజమో మనకు తెలియదుగాని… కుమార్ విశ్వాస్ అవసరం మాత్రం, ఆప్ కు, అరవింద్ కు చాలా వుంది. అందుకే, ఆయనను ఇంటికి వెళ్లి కలుసుకున్న కేజ్రీ అమానతుల్లా ఖాన్ అనే కుమార్ విశ్వాస్ ప్రత్యర్థిని సస్పెండ్ కూడా చేశాడు! ఒక మైనార్టీ వర్గానికి చెందిన లీడర్ పై ఏకే వేటు వేయటం సాధారణ విషయం కాదు! కుమార్ వెంట ఎంత ఎమ్మెల్యేలు వున్నదీ దీని వల్ల స్పష్టమైపోతుంది!   కుమార్ విశ్వాస్ అరవింద్ లాగే అన్నా హజారే వెంట అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న నాయకడు. హిందీలో కవిత్వం చెప్పే ఈయన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బాగానే ఫేమస్. అందుకే, ఆప్ స్థాపించే సమయంలో ఆయనని కూడా వెంటబెట్టుకున్నాడు కేజ్రీవాల్. కాని, రాను రాను కేజ్రీవాల్, కుమార్ల మధ్య అంతరం పెరిగింది. అందుకు కారణం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే! అధికారం చేపట్టాక కుమార్ వర్గానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే పార్టీ నడిపే విషయంలో కూడా కుమార్ విశ్వాస్ సూచనలు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా కుమార్ విశ్వాస్ ప్రత్యర్థి వర్గమైన సంజయ్ సింగ్, అతని అనుచరుల్ని చేరదీశాడు. వీటన్నిటి ఫలితమే దిల్లీ మున్సిపల్ ఎన్నికల తరువాత కుమార్ తిరుగుబాటు! కాని, అతడ్ని ఇంత కాలం ఉపేక్షించిన కేజ్రీవాల్ కి ఇప్పుడు వదులుకోవటం మామూలు డ్యామెజ్ కాదు. ఏకంగా ప్రభుత్వమే కూలిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు! అందుకే, ఈగోకి మారు పేరైన ఏకే, కుమార్ ఇంటికి వెళ్లి సంధి చేసుకున్నాడు! తనకు వీర విధేయుడని పేరున్న అమానతుల్లా ఖాన్ ను సాగనంపాడు!   ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెద్ద పెద్ద నాయకులు బయటకి వెళ్లటం ఇప్పుడు కొత్తేం కాదు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వ్యవస్థాపక సభ్యుల్నే కేజ్రీవాల్ సాదరంగా సాగనంపాడు. ఇక బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ లాంటి నేతల సంగతైతే చెప్పక్కర్లేదు. అసలు దిల్లీలో తప్ప మరెక్కడా బలంగా విస్తరించని ఆప్ లో ఇన్ని విభేదాలు ఎలా అని ఆశ్చర్యపోయే వారు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. దేశ వ్యాప్తంగా విస్తరించిన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల్లో కూడా ఇన్ని గొడవలు వుండవు. కాని, అరవింద్ ఆప్ లో మాత్రకం యథా రాజా తథా ప్రజా అన్నట్టు వుంది వ్యవహారం! ఇదంతా ముందు నుంచీ గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు కుమార్ విశ్వాస్ ఎపిసోడ్ ముగియటంతో శుభం కార్డ్ పడ్డట్టు కాదనీ అంటున్నారు. ఆప్ లో ది ఎండ్ కార్డ్ పడాలంటే ఇంకా బోలెడు రచ్చ జరగాల్సి వుందంటున్నారు!