సెంటిమెంట్ గౌరవించాలి: టిపై చిరంజీవి

      రాష్ట్ర విభజన పై ఈరోజు నిర్ణయం వస్తుందన్న నేపథ్యంలో ముగ్గురు కేంద్రమంత్రులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలుసుకున్నారు. చిరు, పళ్లం రాజు, జెడి శీలం, కనుమూరి బాపిరాజు తదితరులు ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.   అన్ని ప్రాంతాల సెంటిమెంట్ లను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని, పార్టీ, ప్రజల భవిష్యత్తు ,సెంటిమెంటును పరిగణనలోకి తీసుకోవాలని కోరామని వారు అన్నారు. అందరికి న్యాయమైన నిర్ణయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. రాహుల్ తోకూడా తాము సమావేశం అయ్యామని, అందరూ తమకు సమానమేనని ఆయన స్పష్టం చేశారని అన్నారు. ఎవరికి అన్యాయం జరిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించామని చిరంజీవి తెలిపారు. ఇరు ప్రాంతాల భవిష్యత్తు ముఖ్యమన్నారు. తనకు అందరూ సమానమే అన్నారు. ఇరువర్గాల సెంటిమెంట్‌ను అర్థం చేసుకోవాలన్నారు. తమకు తమ భవిష్యత్తు ముఖ్యం కాదని ప్రజలు, పార్టీ భవిష్యత్తు ముఖ్యమన్నారు.

టి ఎఫెక్ట్: 15 సీమాంద్ర మంత్రులు రిజైన్!

      సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే పదిహేను మంది సీమాంద్ర మంత్రులు రాజీనామాకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాస రావు విలేకరులతో మాట్లాడారు. నేషనల్ కాన్పరెన్సు కూడా తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పిన విషయాన్ని గమనిస్తే పార్టీ అధిష్టానం తమ వైఖరి మార్చుకుంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.   రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఫలితం వస్తే పదిహేను మంది మంత్రులం రాజీనామా లేఖలపై సంతకాలు చేసి సిద్ధంగా ఉన్నామన్నారు.సమైక్య రాష్ట్రానికి మంత్రులుగా ఉన్నామని, విభజన నిర్ణయం జరిగాక మంత్రులుగా కొనసాగడం సరికాదని భావిస్తున్నామని అన్నారు.తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే రాజీనామా ఆమోదించాలని తమ లేఖలను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చినట్లు చెప్పారు. రాయలసీమకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని మరో మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. రాయలసీమ ఎమ్మెల్యేలతో సమావేశం జరపాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు.

రాష్ట్ర విభజనపై సీమాంద్ర నేతల అల్టిమేటం

      రాష్ట్ర విభజన విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని సీమాంధ్ర నేతలు కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు జరిగితే పార్లమెంటులో తేల్చుకుంటామని అన్నట్లుగా తెలుస్తోంది. సీమాంద్ర నేతలు ఈరోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. రాష్ట్ర విభజన కూడదని, అదే జరిగితే దేనికైనా సిద్ధమని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. తమ మౌనం మరోరకంగా ఊహిస్తే తగిన ఫలితం ఉంటుందని చెప్పారు. ఆహార బిల్లుకు మద్దతిచ్చే అంశంపై పునరాలోచించాల్సి ఉంటుందని ఘాటుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోమని తాము చెప్పమని కానీ, శాస్త్రబద్దంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎస్సార్సీ ద్వారా విభజించాలని కోరారు.  రాష్ట్ర విభజన పై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏమైనట్లని ప్రశ్నించారు. వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ డే: డెసిషన్‌ ఎలా ఉండబోతుంది

      ప్రత్యేక రాష్ట్రం దిశగా కాంగ్రెస్‌ వేగం పెంచిందిజ దశాబ్దాలుగా నలుగుతున్నసమస్యకు ఈ రోజు ఓ పరిష్కారం చూపించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్‌ యూపిఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రదాని నివాసంలో జరగనున్న సమన్వయ కమిటీ మీటింగ్‌లో కాంగ్రెస్‌ తన నిర్ణయానికి భాగస్వామ్య పక్షాలను ఒప్పించే ప్రయత్నం చేయనుంది..   చాలా రోజులుగా కొద్దిరోజుల్లో అని చెబుతున్న సిడబ్ల్యూసి మీటింగ్‌ను కూడా ఈ రోజే నిర్వహించడానికి రెడీ అయింది.. సాయంత్ర కో ఆర్డినేషన్‌ కమిటీ మీటింగ్‌ ముగియగానే ఐదున్నర గంటలకు సోనియా నివాసంలో సిడబ్ల్యూసి మీటింగ్‌ జరగనుంది. ఈ మీటింగ్‌ ముగియగానే తెలంగాణపై కాంగ్రెస్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. ఇప్పటికే యుపిఏ భాగస్వామ్య పక్షాలు తెలంగాణ ఏర్పాటుకు సమ్మతించగా మిగతా పక్షాలను కూడా ఈ రోజు ఒప్పించిన ఓ నిర్ణయం వెలువరించాలనుకుంటుంది కాంగ్రెస్‌.. అయితే కాంగ్రెస్‌ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్న దాని మీదే ప్రదానంగా చర్చ జరుగుతుంది. పది జిల్లాల తెలంగాణా? అదనంగా రెండు జిల్లాలు కలిపిన రాయల తెలంగాణా? హైదరాబాద్‌ను ఎంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తారు? కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ రోజు సాయంత్రం ఓ సమాధానం దొరకనుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి, హైదరాబాద్‌ను కొంత కాలంపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించనున్నారట.

కిరణ్ రాజీనామా చేయలేదు

      రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన వార్తలను ఆయన కార్యాలయం ఖండించింది. నిన్న రాత్రి పదకొండు గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అయితే కిరణ్ మాత్రం రాష్ట్ర విభజన పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సిఎంవో విడుదల చేసిన ప్రకటనలో... తాను అధిష్టానానానికి రాజీనామా సమర్పించేసినట్లు ఎలాంటి నిర్ధారణ, ఆధారాలు లేకుండా ఎలా రాసేస్తారని ఆయన అడిగారు. ఏదైనా ఉంటే నా వివరణ తీసుకోవాలని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు కథనాలు ప్రచురించడం సమంజసం కాదని ప్రకటనలో ముఖ్యమంత్రి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి ఆలోచనల్లో లేరని కూడా సిఎంవో స్పష్టం చేసింది.

తెలంగాణా ఏర్పాటుపై దిగ్విజయ్ సానుకూల సంకేతాలు

  రేపు రాష్ట్ర విభజనపై ఖచ్చితంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ స్ఫష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే అన్ని వర్గాలతో చర్చలు ముగిసినందున ఇక రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు శాసనసభలో తీర్మానం తప్పని సరి కాదని, అది కేవలం ఒక రాజ్యంగ విధానం మాత్రమేనని చెప్పడం గమనిస్తే రాష్ట్ర విభజన ఖాయమయినట్లు తెలుస్తోంది. డిల్లీ నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం తెలంగాణా ప్రజలు కోరుకొంటున్న విధంగానే 10 జిల్లాలతో కూడిన తెలంగాణా ప్రకటించవచ్చునని తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సజావుగా పూర్తయ్యి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేసుకొనే వరకు, అంటే కనీసం 4 లేదా5 సం.ల వరకు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచే అవకాశం ఉంది. తెలంగాణా గవర్నర్ కే హైదరాబాద్ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది.

అమ్మకానికి రాజ్యసభ సీట్లు

  మరోసారి ఓ కాంగ్రెస్ ఎంపి సంచనల వ్యాఖ్యలతో వివాదాస్పదమయ్యాడు. 100 కోట్లు ఉంటే రాజ్యసభ సభ్యుడు కావచ్చు అంటూ ప్రకటించిన సదరు ఎంపి తనకు మాత్రం కేవలం 80 కోట్లకే ఆ అవకాశం దక్కిందని ప్రకటించాడు. హర్యన నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు భీరేందర్ సింగ్ ఈ సంచలన వ్యాఖలు చేశారు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగుతుందని గుర్తించిన సింగ్ వెంటనే నాలుక కరుచుకున్నా ఈ లోపు జరగాల్సి న నష్టం జరిగిపోయింది.. దీంతో లోక్ సభ సమావేశాలు దగ్గర పడుతున్ననేపధ్యంలో బిజిపికి కాంగ్రెస్ ను విమర్శించటానికి మరో అస్త్రం దొరుకినట్టయింది. ఇప్పటికే ఈ విషయం పై స్పందించిన బిజిపి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టింస్తుందని తీవ్రంగా విమర్శించింది.

పది జిల్లాల తెలంగాణే..?

  కేంద్రం తెలంగాణ విషయం తేల్చేయటానకే సిద్దం అయింది. రేపు జరగనున్న సీడబ్ల్యూసి మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే వినిపిస్తున్న వార్తల ప్రకారం పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సీయంతో సహా రాష్ట్ర నాయకత్వానికి ఆ దిశగా సంకేతాలను కూడా అందించినట్టుగా తెలుస్తుంది. దీంతో సీమాంద్ర నాయకత్వం ఆలోచనలో పడింది. రేపు ప్రకటన సమైక్యాంద్రకు వ్యతిరేకంగా ప్రకటన వెలువడిన నేపధ్యంలో తమ కార్యచరణ ఎలా ఉండాలి అన్న దానిపై చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్నసంకేతాలను బట్టి పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రన్నే రేపు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది అన్న వార్త బలంగా వినిపిస్తుంది.

లక్ష కోట్లు: కొండాపై జగన్ ఆగ్రహం

      కొండా సురేఖ తీరుపై పార్టీ నేతలతో చంచల్ గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన పై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ పై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన విమర్శలు నేపధ్యంలో వైయస్ఆర్.  కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ, పార్టీ సీనియర్ నేతలు మైసూరా రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు జైలులో ఉన్న జగన్ ని కలిసి, దాదాపు గంటకు పైగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహ౦ జగన్ వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. కొండా సురేఖ, ఇతర తెలంగాణ నేతల హెచ్చరికలు, సమైక్యాంధ్ర నేతల రాజీనామాల అంశం కూడా చర్చకు వచ్చింది.

రేపే విడుదల

  తెలంగాణ పై తేల్చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది.. రేపు 4 గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించనున్న అధిష్టానం ఆ తరువాత వెంటనే ఐదున్నర గంటలకు  సిడబ్ల్యూసి మీటింగ్ కూడా నిర్వహించడానికి రెడీ అవుతుంది.. వర్కింగ్ కమిటీ మీటింగ్ పూర్తవగానే నిర్ణయం వెలువడుతుందన్నారు రాష్ట్రవ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. ఇప్పటికే సీమాంద్ర ప్రాంతంలో భారీ ఆందోలనలు జరుగుతుండటంతో కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపుతున్నారు. ఇప్పటికే 1200 బలగాలు సీమాంద్ర ప్రాంతాల్లో ఉండగా, మరో 1000 బలగాలను రాష్ట్రనికి పంపుతున్నారు. ఇప్పటికే డిజిపి, ఛీఫ్ సెక్రటరీలతో చర్చించిన కేంద్ర హోంశాఖ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవటానికి రెడీ అవుతున్నారు. రేపు ప్రకటన వెలువడనున్ననేపథ్యంలో పరిస్థితులు క్షణ క్షణానికి మారుతున్నాయి.

జగన్ రిమాండ్ పొడిగింపు

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసు నిందితుల రిమాండును సిబిఐ ప్రత్యేక కోర్టు ఆగస్టు 12 వరకు పొడిగించింది. జగన్ తదితరులను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. జగన్, విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందం, గాలి జనార్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును పొడిగించారు.   జగన్ ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసుల్లో కోర్టుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోనేరు రాజేంద్ర ప్రసాద్, నిత్యానంద రెడ్డిలు హాజరయ్యారు.

కొండా లేఖతో వైకాపా పరువు పాయె

  వైయస్ కుటుంబానికి అత్యంత ఆప్తురాలుగా పేరొందిన కొండా సురేఖ వ్రాసిన బహిరంగ లేఖతో వైకాపా పరిస్థితి మరింత దారుణంగా మారింది. సమైక్యాంధ్ర కోరుతూ ఆ పార్టీ నేతల రాజీనామాలతో తెలంగాణా ప్రజలలో ఆ పార్టీ పట్ల చులకన భావం ఏర్పడగా, “జగన్ మోహన్ రెడ్డిలో తండ్రికి ఉన్న ఒక్క మంచి లక్షణం కూడా లేదని, యంయల్సీ టికెట్లను రూ 7 కోట్లకు అమ్ముకొని కేవలం లక్ష కోట్లు సంపదనే ధ్యేయంగా అతను పార్టీని ఒక ప్రైవేట్ లిమిటడ్ పార్టీగా జైల్లోంచే నడిపిస్తున్నాడని” సురేఖ వ్రాసిన బహిరంగ లేఖతో ఇరు ప్రాంతలలో ఆపార్టీ పరువు గంగలో కలిసిపోయింది. ఈ ఆరోపణలు వేరేవరయినా చేసి ఉంటే ప్రజలు అంతగా పట్టించుకొనే వారు కారేమో. కానీ, వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా మెలిగిన సురేఖే ఇంత తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రజలు నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. అగమ్యగోచరంగా ముందుకు సాగుతున్నపార్టీపై ఈ ఆరోపణలు మరింత తీవ్ర వ్యతిరేఖ ప్రభావం చూపనున్నాయి. తెలంగాణాను వ్యతిరేఖించడం వలన ఆగ్రహంతో ఉన్న తెరాసకు, వైకాపాకు బద్ధ శత్రువయిన తేదేపాకు ఇవి ఆయాచిత అస్త్రాలుగా లభించడంతో ఇక ఆ రెండు పార్టీలు వైకాపాపై మరింత చెలరేగిపోవచ్చును. ఈ నెల 31న జరగనున్న మూడవ దశ పంచాయితీ ఎన్నికల మీద ఆమె లేఖ తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక షర్మిల పాదయత్ర త్వరలో ముగియనున్నందున ఆమె గనుక పార్టీ పగ్గాలు చేప్పట్టి పార్టీని మళ్ళీ గాడిలో పెడితే తప్ప పార్టీకి ఇటువంటి కష్టాలు సమస్యలు తప్పకపోవచ్చును. ఈ రోజు కోర్టు జగన్ మోహన్ రెడ్డి రిమాండును వచ్చే నెల 12 వరకు పొడిగించింది. అతనితో బాటు అదే కేసుల్లో అరెస్టయిన విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందం, గాలి జనార్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును కూడా ఆగస్ట్ 12 వరకు పొడిగించింది.

పురంధేశ్వరి, లగడపాటి ఇళ్ళ ముట్టడి

      సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. సమైక్యాంధ్ర జేఏసీ సోమవారం కేంద్రమంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించింది. వివిధ జిల్లాల్లో ఉన్న కేంద్రమంత్రులు పురంధరీశ్వరి, కావూరి సాంబశివ రావు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి.. ఎంపీలు సబ్బం హరి, సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, కొనకళ్ల నారాయణ, చింతా మోహన్, బొత్స ఝాన్సీ, శివప్రసాద్, రాయపాటి సాంబశివరావుల ఇళ్లను జేఏసీ నాయకులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వీరంతా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లగడపాటి ఇంటి ముందు ఐకాస నేతలు టెంట్లు వేశారు. ఏపీఎన్జీవోలు లగడపాటి ఇంటిపైకి ఎక్కారు. ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పురంధరీశ్వరి ఇంటి వద్ద కూడా ఆందోళనకర వాతావరణం నెలకొంది.

లక్ష కోట్ల ఆస్తి జగన్ లక్ష్యం: కొండా సురేఖ

  రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమంధ్రకు చెందిన వైకాపా శాసనసభ్యుల రాజీనామాలతో ఆ పార్టీలో సంక్షోభం మొదలయింది. ఆ పార్టీకి చెందిన కొండా సురేఖ, మురళి, మహేందర్ రెడ్డి తదితరులు విజయమ్మతో రెండు సార్లు భేటీ అయినప్పటికీ పార్టీ రాష్ట్ర విభజనపట్ల తన ధోరణి మార్చుకొనేందుకు ఇష్టపడక పోవడంతో వారు పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు కొండా సురేఖ విజయమ్మను, జగన్ మోహన్ రెడ్డిని, పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ఒక బహిరంగ లేఖ వ్రాసారు.   క్లుప్తంగా లేఖలో సారాంశం: మేము స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనే వైకాపాలో చేరిన సంగతి మీకు తెలుసు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ‘మాట తప్పకు, మడమ తిప్పకు,’ అనే సిద్ధాంతం పాటిస్తే, ఇప్పుడు మీరు ఇద్దరూ కూడా తద్విరుద్ధంగా ‘మాట తప్పుతాము, మడమ తిప్పుతాము’ అనే కొత్త సిద్ధాంతం అవలంభిస్తున్నారు. తెలంగాణాపై పార్టీ ఇచ్చిన మాటను మరిచి ఇప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమంధ్ర నేతలు రాజీనామాలు చేయడం కేవలం సీమంధ్ర ప్రాంతంలో వీలయినన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికే కదా?   ఇప్పుడు వైకాపా తన పూర్తి నిజస్వరూపాన్నిబయటపెట్టుకొని తమది పక్కా సమక్యవాద పార్టీ అని ఋజువు చేసుకొంది. మీ నిర్ణయం వలన తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడం కోసం రేయింబవళ్ళు కృషిచేసిన మా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఈవిధంగా చేసి మమ్మల్ని మీరిద్దరూ కూడా చాలా అవమానించారు. కొద్ది నెలల క్రితం జరిగిన యంయల్సీ ఎన్నికలలో సీట్లను రూ.7కోట్లకు అమ్ముకోవడం చూస్తే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం లక్ష కోట్ల రూపాయలు సంపాదించడమేనని స్పష్టం అవుతోంది. జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉంటూనే పార్టీని తప్పుడు మార్గంలో నడిపిస్తూ పార్టీని సర్వ విధాల భ్రష్టు పట్టిస్తున్నారు.”

ముఖ్యమంత్రి కిరణ్ పై మండిపడ్డ సోనియా!

      సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మండిపడినట్లు సమాచారం. రాష్ట్ర విభజన బాధ్యత భారాన్ని తాను మోయలేనని చెప్పినప్పుడు సీఎం కిరణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం వార్ రూమ్ భేటి సంధర్బంగా ఆజాద్ తో కిరణ్ విభజన బాధ్యతను మోయలేనని చెప్పడంతో..ఆయన ఈ విషయాన్ని సోనియా గాంధీతో చెప్పాలని అన్నారు. దాంతో కిరణ్ ఆజాద్ జోక్యంతో సోనియాని కలుసుకున్నారు. తన అభిప్రాయాన్ని చెప్పి, రాజీనామా లేఖను ఇవ్వడంతో కిరణ్ పై సోనియా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. ఇన్నాళ్లు తమకు అనుకూలంగా ఉంటున్నట్లు ఎందుకు వ్యవహరించారని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎందుకు చెప్పారని సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీసినట్లు చెబుతున్నారు. ఆతరువాత కిరణ్ హైదరాబాద్ కి తిరిగి వచ్చేసారు. ఈ  పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

రేపే తెలంగాణపై ప్రకటన..!!

        తెలంగాణ పై తేల్చే దిశగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యుపిఎ వడి వడిగా అడుగులు వేస్తుంది.. గతం వారం రోజులగా తెలంగాణపై విస్త్రుత స్ధాయిలో జర్చలు జరిపిన కాంగ్రెస్‌ అదిష్టానం ఇప్పటికే తెలంగాణపై అభిప్రాయ సేకరణ పూర్తియందని ప్రకటించింది.. ఇక మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పడమేనని చెప్పినని నేతలు ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు.   ఈ విషయంపై కాంగ్రెస్ యూపిఎలో తన భాగస్వామ్యపక్షాలయిన ఇతర పార్టీలతొ చర్చించనుంది. యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 29న ఏర్పాటవుతుందని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 31వ తేదీన ఏర్పాటవుతున్నట్లు సమాచారం వచ్చింది. కానీ, ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుంది. సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు, మూడు రోజుల తర్వాత సిడబ్ల్యుసి సమావేశం నిర్వహిస్తారని భావించారు. కానీ, అదే రోజు సిడబ్ల్యుసి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై తేల్చేయాలని కాంగ్రెసు భావిస్తోంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం సిడబ్ల్యుసి రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర వేస్తే అధికారిక ఆమోదం లభించినట్లవుతుంది. ఆగస్టు 5నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్ననేపధ్యంలో,  వీలైతే ఈలోగానే తెలంగాణపై తుది నిర్ణయం ప్రకటించాలని ప్రయత్నింస్తుంది కేంద్రం. యూపిఎ లోని ప్రదాన భాగస్వామ్యపక్షాలనైన శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఫారూఖ్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ, ముస్లీంలీగ్ పార్టీలు ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించగా.. మిగిలిన పార్టీ మద్దతు అవసరం పడకపోవచ్చు అనే ధైర్యంతో ఉంది యుపిఎ.

ముందస్తుకు ఈసి ఏర్పాట్లు

      దేశంలో రాజీకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతుండటంతో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌ సభ ఎన్నికలు కూడా ఉండవొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు..   ఈ నేఫథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్‌ సభ ఎలక్షన్స్‌ కూడా వస్తే కావాల్సిన వనరులను సమకూర్చుకునేందుకు రెడీ అవుతుంది కేంద్ర ఎన్నికల కమీషన్‌.. రెండు చోట్ల ఒకే సారి ఎలక్షన్లు జరిగితే ఇప్పుడున్న ఇవియం మిషన్లు సరిపోవని భావించిన కమీషన్‌ మరో 2 లక్షల మిషన్లకు ఆర్డర్‌ ఇచ్చింది. డిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, మిజోరంలకు సెప్లెంబర్‌ అక్టోబర్‌ నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది.. ఈలోగా ప్రస్థుతం ఆర్డర్‌ ఇచ్చిన ఇవియంలు అందుబాటులోకి వస్తాయిని భావిస్తుంది ఈసి.