యథా రాహుల్.. తథా జగన్!

      కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడు జగన్‌ని మధ్య చాలా అంశాలలో పోలికలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పోలిక-1. రాహుల్ తండ్రి మాజీ ప్రధానమంత్రి. జగన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరి తండ్రులూ కీర్తిశేషులే.  ఇద్దరూ తండ్రికి ఏకైక కుమారులే! రాహుల్, జగన్ ఇద్దరూ తమ తండ్రులు అధిష్టించిన పదవులను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవారే. పోలిక-2. రాహుల్ని ప్రధానమంత్రి చేయాలని ఆయన తల్లి సోనియా పరితపిస్తుంటే, జగన్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తల్లి విజయమ్మ పరిశ్రమిస్తున్నారు. పోలిక-3. రాహుల్, జగన్.. ఇద్దర్నీ జనం మూడక్షరాల పేరుతోనే పిలుస్తారు. రాహుల్‌కి ‘యువరాజు’ అనే నిక్‌నేమ్ వుంది. జగన్‌కి ‘యువనేత’ అనే నిక్‌నేమ్ వుంది. పోలిక-4. అటు రాహుల్, ఇటు జగన్ ఇద్దరూ ఆవేశపరులుగా, దూకుడు కలిగి వున్నవాళ్ళుగా,  తనమాటే నెగ్గాలనే పట్టుదల ఉన్నవారిగా పేరు తెచ్చుకున్నారు. పోలిక-5. రాహుల్ గాంధీ కారణంగా దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జగన్ కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పోలిక-6. రాహుల్‌గాంధీలో, జగన్మోహన్‌రెడ్డిలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తుంది. ఇద్దరికీ చిన్న వయసులోనే పెద్ద కుర్చీ మీద కన్ను వుంది. పోలిక-7. రాహుల్‌కి, జగన్‌కి వేదికల మీద ఎలా మాట్లాడాలో తెలియదు. రాజస్థాన్ ఎన్నిక ప్రచారంలో నోటికొచ్చినట్టు మాట్లాడి రాహుల్ విమర్శలు ఎదుర్కుంటుంటే, సమైక్య శంఖారావంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి జగన్ ఇబ్బందులు తెచ్చుకున్నాడు. పోలిక-8. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎటుచూసినా కనిపించడం లేదు.

కాంగ్రెస్, బిజెపి ట్విట్టర్ వార్

      గతంలో రాజకీయ నాయకులు చట్టసభల్లో, మీటింగుల్లో, ప్రెస్‌మీట్లలో తిట్టుకున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని సోషల్ నెట్‌వర్క్ వేదికల మీద కూడా ‘ట్విట్టు’కుంటున్నారు. ట్విట్టర్లో రెగ్యులర్‌గా కామెంట్లు పోస్ట్ చేసేవాళ్ళలో నరేంద్రమోడీ ముందుంటున్నాడు. ఈమధ్య దిగ్విజయ్ ‌సింగ్ కూడా ట్విట్లు పోస్ట్ చేయడంలో యాక్టివ్‌గా వుంటున్నాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనుకున్నాడో లేక బీజేపీలో నిప్పుపెట్టాలని అనుకున్నాడో గానీ దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్‌లో బీజేపీ మీద కొన్ని కామెంట్లు పోస్ట్ చేశాడు.   ‘‘బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా మతోన్మాది, అబద్ధాల కోరు, మానసిక దుర్బలుడు అయిన నరేంద్రమోడీ కాకుండా సుష్మా స్వరాజ్ అయితే చాలా బాగుండేది.’’ అంటూ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ చదివి సుష్మా స్వరాజ్ కాకుండా మరెవరన్నా అయితే మురిసిపోయి దిగ్వింజయ్ సింగ్‌కి ఫోన్ చేసి థాంక్స్ చెప్పేవారే. కానీ బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ మాత్రం అలా చేయలేదు. ట్విట్టుని ట్విట్టుతోనే ఎదుర్కోవాన్నట్టు ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో ఒకకామెంట్ పోస్ట్ చేశారు. ‘‘బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో దిగ్వింజయ్ సింగ్ అభిప్రాయం అదయితే, మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ కంటే దిగ్వింజయ్ సింగే ఉత్తమ అభ్యర్థి’’ అని పోస్ట్ చేశారు. కుక్కకాటుకి చెప్పుదెబ్బలా వున్న ఈ ట్విట్ చదివిన దిగ్విజయ్ సింగ్ ‘‘సుష్మా స్వరాజ్ చెప్పింది కరెక్టే కదా’’ అనుకున్నాడేమో మళ్ళీ చప్పుడు చేయలేదు.

దిగ్విజయ్ జోక్స్

  సినిమాలలో బ్రహ్మానందమే కాదు, ఒక్కోసారి కాంగ్రెస్ వాళ్ళు కూడా బలే జోకులేసి జనాలను నవ్విస్తుంటారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖల గురించి అమెరికా, జపాన్లో ఉన్నవాళ్ళకి కూడా ఈపాటికి తెలిసిపోయుంటుంది. కానీ ఎప్పుడూ డిల్లీలోనే ఉండే మన రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ వారికి మాత్రం ఆవిషయం తెలియనే తెలియదట. మీడియావాళ్ళు చెపితేనే తెలిసిందని ఇంకా ఆ లేఖలో సారాంశం ఏమిటో చూడవలసి ఉందని జోక్ వేసారు.   క్రిందటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘జగన్ మోహన్ రెడ్డిది మా కాంగ్రెస్ పార్టీది సేమ్ టు సేమ్ డీ.యన్.యే’, అని మళ్ళీ డిల్లీ వెళ్ళిన తరువాత కూడా ‘జగన్ నా కొడుకు వంటి వాడు’ అని మరోసారి కన్ఫర్మ్ చేసిన ఆయన, ఈసారి మాత్రం తమ సంబంధాల గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదుట. బహుశః జగన్ మొన్న హైదరాబాదులో సోనియమ్మని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన తరువాత కూడా ఇంకా ‘జగన్ నా కొడుకు వంటి వాడే’ అనాలంటే చాల గుండె దైర్యం ఉండాలి కదా?   మళ్ళీ రెండు పార్టీలలో హార్మోన్స్ లలో ఏమయినా మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నాయా? అని ప్రజలకి అనుమానం కలిగేలా ఆయన మౌనం వహించినప్పటికీ, ఇంకా డీ.యన్.యే.లు మార్చుకోవడం ఎవరి తరమూ కాదుకదా!

ఇంటి గుట్టు రట్టు చేస్తే ఎలా దివాకర్?

  ఇంటి గుట్టు లంకకి చేటంటారు. మరి అటువంటిది లంకలో ఉన్నవాళ్ళే మన ఇంటి గుట్టుని భద్రంగా  కాపాడే ప్రయత్నం చేస్తుంటే, ఇంట్లో వాళ్ళే గుట్టు రట్టు చేస్తుంటే ఏ ఇంటి పెద్దకయినా ఆగ్రహం కలుగక మానదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో మిగిలిన పార్టీలకి పెద్దన్నపాత్ర పోషిస్తుంటే, అందులో బొత్ససత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన లంకంత తమ కాంగ్రెస్ గుట్టు మట్టులను కోడిపెట్ట కోడి పిల్లలను జాగ్రత్తగా కాపడుకొస్తున్నట్లు కాపాడుకొస్తుంటే, ముఖ్యమంత్రితో సహా అందరూ ఎప్పుడో అప్పుడు ఆ ఇంటి గుట్టు గురించి టంగ్ స్లిప్పు చేసుకొంటూనే ఉన్నారు.   మొన్న జగన్ ముచ్చటపడి హైదరాబాదులో శంఖం ఊదుకొంటుంటే “మా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మంచి అండర్ స్టాండింగ్ ఉందని, అందుకు నూటా నలబై నాలుగు ఉదాహరణలున్నాయని, ఆయన సభకి అన్ని రైళ్ళని పరిగెత్తించడం కూడా అందులో ఒకటని ప్రకటించేసారు కల్లాకపట మెరుగని మన జేసీ దివాకర్ రెడ్డి గారు. ఓసారి లగడపాటి మరోసారి హర్ష కుమార్ ఇంకోసారి జేసీ దివాకర్ రెడ్డి ఇలా ఎందరిని కంట్రోల్ చేయగలడు ఎంత పెద్దన్న అయితే మాత్రం?   అయినప్పటికీ మరీ మౌనంగా కూర్చొంటే కొంప కోల్లేరయిపోతుందని ఆయన బెంగపెట్టుకొన్నవాడై, దివాకర్ రెడ్డిని లైన్లో పెట్టి ‘ఇంటి గుట్టు రట్టు చేస్తే ఎలా? ఉంటే బుద్దిగా ఉండండి లేకుంటే బయటకి దయచేయండని’ మందలించినట్లు మీడియా గుప్పుమంది. అయితే మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నానన్నట్లు, ఏదో ఇంటి గుట్టు బయట పెట్టోదని సింపుల్ గా చెపితే పోయేదానికి, బయటకి పొమ్మని చెప్పడం ఏమిటి?అయినా నన్ను బయటకి పొమ్మనడానికి నువ్వెవరని? దివాకరుడు సీమ పౌరుషం ప్రదర్శించినట్లు తాజా సమాచారం. ఎందుకయినా మంచిదని కాంగ్రెస్ లోనే పుట్టిన తను తన చివరాఖరి శ్వాస కూడా కాంగ్రెస్లోనే కంటిన్యూ అయిపోతానని ఒకచిన్న డిక్లరేషన్ కూడా చేసేసారు.   అయితే అరచేతిని అడ్డం పెట్టి ఉదయించే సూర్యుడిని ఆపలేమని వైయస్సార్ కాంగ్రెస్ వాళ్ళు మాటిమాటికి ఎందుకు ఏ ఉద్దేశ్యంతో అంటున్నారో పెద్దన్నగారు కాస్త ప్రజలకి వివరిస్తే బాగుంటుందేమో!

బీజేపీలోకి కృష్ణంరాజు

      ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి కృష్ణంరాజు తిరిగి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో కృష్ణంరాజు సమావేశమయ్యారు. కృష్ణం రాజు రెండున్నర నెలల క్రితం హైదరాబాదుకు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఇప్పుడు రాజ్‌నాథ్‌ను కలిశారు. కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణం రాజు తిరిగి పాతగూటికి దగ్గరవుతున్నారు.   గతంలో బీజేపీ తరపున పోటీచేసి రెండు సార్లు ఎంపీగా గెలిచిన కృష్ణంరాజు 1999-2004 వరకు కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రిగా కొనసాగారు. అనంతరం బీజేపీ నుంచి వైదొలిగిన చాలాకాలం తర్వాత తిరిగి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

లగడపాటిని బహిష్కరించాలి

      విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై రాష్ట్ర మంత్రి కొండ్రు మురళీమోహన్ మండిపడ్డారు. లగడపాటి మీడియాలో కనబడేందుకు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయింది అవాస్తమని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న లగడపాటిని ముందు పార్టీ నుండి బహిష్కరించండి. ఇదే విషయం కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కోరుతున్నా అని అన్నారు.   చంద్రబాబు నాయుడు , వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చారు. మరి జగన్ మాత్రం ఆ విషయం ఎవరితోనూ చెప్పడం లేదు. రాహుల్ గాంధీని ప్రదానిని చేయాలన్నది జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కోరిక అని జగన్ కు తెలియదా ? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సమైక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం లేదని తాను భావిస్తున్నానని మురళీమోహన్ అన్నారు.

జగన్ తో కేంద్రం కుమ్మక్కు

      కేంద్రంతో జగన్ కుమ్మక్కయ్యారని, అధిష్ఠానం ఆయన్ని దత్తపుత్రుడిగా భావిస్తోందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఇక వైసీపీ, టీఆర్ఎస్ లాలూచీ పడ్డాయన్న విషయాన్ని జగన్ సభను చూసిన చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని అన్నారు. సమైక్య సభ బలపడాలని జగన్ ప్రయత్నించారని, అయితే ఆయన పార్టీ బలపడటం లేదని అధిష్ఠానానికి ఆలస్యంగా అర్థమైందన్నారు. రాష్ట్రం జగన్ గుప్పిట్లో ఉందన్న భ్రమతో కాంగ్రెస్ అధిష్ఠానం విభజన ప్రకియను వేగవంతం చేస్తోందన్నారు.   సమైక్యవాదంతో ముందుకెళ్తున్న ఏపీఎన్జీవో సభకు అడ్డంకులు సృష్టించిన టీఆర్ఎస్.. జగన్‌తో కుమ్మక్కయినందునే ఆయన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు. జగన్, కేసీఆర్ తోడు దొంగల్లా కూడబలుక్కుని హైదరాబాద్‌లో శంఖారావం సభను నిర్వహించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లు వచ్చినా, తీర్మానం వచ్చినా ఓడిస్తామని, ఆ తర్వాత రాజీనామా చేయడానికి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి, ప్రజల గుండెల్లోని భావనను తెలియజేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ప్రజల భావోద్వేగాలను తేలిగ్గా తీసుకోవద్దని అధిష్ఠానానికి చెప్పామన్నారు.

తమలపాకుతో నువొకటంటే తలుపు చెక్కతో నేను రెండంటిస్తా..

  తమలపాకుతో నువొకటంటే తలుపు చెక్కతో నేను రెండంటిస్తా.. అందిట వెనకటికికో గడుసు ఇల్లాలు. జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర సెంటిమెంటు పట్టుకొని సీమాంధ్రలో దూసుకుపోదామని ప్రయత్నిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు చూసినా ఆయన కంటే రెండడుగులు ముందే ఉంటున్నారు.   జగన్ సమైక్య శంఖారావం పూరించడానికి సిద్దం కాగానే కిరణ్ రచ్చబండ ముచ్చట్లకి సిద్దం అయ్యారు. కోట్లు ఖర్చుపెట్టి జగన్ శంఖారావం చేస్తే, కిరణ్ తన ఏసీ ఆఫీసు గదిలో కూర్చొని, పైసా ఖర్చు, ప్రయాస లేకుండా ప్రధానికి, రాష్ట్రపతికి రెండు చిన్న లేఖలు వ్రాసి పడేసి, జగన్ సభకి దక్కవలసిన మీడియా ఫోకస్ అంతా తన వైపు తిప్పుకొని చిద్విలాసంగా చిర్నవ్వులు చిందిస్తున్నారు.   జగన్ అంత చెమటోడ్చినా దక్కని ఫలం, కిరణ్ సందించిన లేఖాస్త్రాలు బాంబులవలె పేలుతూ అటు సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణాలో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన వ్రాసిన లేఖను రాష్ట్రపతి హోంశాఖకు పంపి సంజాయిషీ కోరడమే అందుకు కారణం. రాష్ట్రవిభజన కీలకదశకి చేరుకొన్న ఈ తరుణంలో కిరణ్ ఈవిధంగా లేఖలు వ్రాసి తెలంగాణాకి అడ్డుపడుతున్నాడని తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతలు ఆయన మీద చాలా ఫైర్ అయిపోతున్నారు. తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణాకి అడ్డుపడుతున్నావని ఎంతగా దూషిస్తే, అవతల సీమాంధ్రలో ఆయన రేటింగ్స్ అంతగా పెరిగిపోతున్నాయి.   పైగా ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారారని, ఆయన ఆ కుర్చీలో కూర్చోనంత కాలం రాష్ట్రవిభజన అసాధ్యమని తెలిసినప్పటికీ అధిష్టానం అయనను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని, మీడియాలో వస్తున్నవార్తలు, రాజకీయ విశ్లేషణలు ఆయన రేటింగ్స్ కి మరిన్ని స్టార్స్ జోడిస్తున్నాయి.   అందువల్ల ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మరో కొత్త ఉపాయం ఆలోచించవలసి ఉంటుంది. అయితే రాష్ట్రవిభజన అనివార్యమని అందరికీ తెలిసినప్పటికీ వీరిద్దరిలో ఎవరు సమైక్య ఛాంపియన్ షిప్ ట్రోఫీ గెలుస్తారా అని ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

బీహారీలను ఆకట్టుకొన్ననరేంద్రమోడీ ప్రసంగం

  ఈరోజు (ఆదివారం) పాట్నాలో మోడీ సభ మొదలయ్యే రెండు గంటల ముందు ఏడు వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి.అందులో ఐదుగురు మరణించగా దాదాపు డబ్బై మంది ప్రజలు గాయపడ్డారు. అయినప్పటికీ నరేంద్ర మోడీ సభకు భారిగా జనాలు తరలివచ్చారు.   మోడీ స్థానిక భోజ్ పురీ బాషలో కొంత సేపు ప్రసంగించి బీహారీలను బాగా ఆకట్టుకొన్నారు. ఎటువంటి సభలో ఏ అంశాలు ప్రస్తావించాలో, ఏవిధంగా మాట్లాడాలో బహుశః మోడీకి తెలిసినంత బాగా నేటి రాజకీయ నాయకులలో చాలామందికి తెలియదని చెప్పవచ్చును. డిల్లీ వంటి నగర ప్రజలని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కొంచెం క్లిష్టమయిన అంశాలను, సాంకేతికమయిన పదాలను ప్రయోగించే మోడీ ఇక్కడ మాత్రం స్థానిక ప్రజలకు సులువుగా అర్ధం అయ్యే అంశాలను తనదయిన శైలిలో ప్రసంగించి వారిని ఆకట్టుకోవడమే ఆయన పరిణతికి ఒక మంచి నిదర్శనం.   పౌరాణిక యుగంలో సీతాదేవి పుట్టిన పుణ్యభూమి బీహార్ అని మొదలుపెట్టడంతోనే 'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్' అన్నట్లు ఆ తరువాత ప్రజలచేత జేజేద్వానాలు పలికించుకొంటూ అలవోకగా ఆయన ముందుకు సాగిపోయారు. బీహార్ గత వైభవం గురించి వారి కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ బుద్ధుడు, అశోకుడు, చాణక్యుడు, చంద్రగుప్తుడు, మౌర్యులు వంటి మహామహులు బీహార్ గడ్డ మీదనే జన్మించారని, నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు యావత్ ప్రపంచంలో మేటి విద్యాలయాలుగా పేరు తెచ్చుకొన్నాయని చెప్పడంతో ప్రజలు హర్షద్వానాలు మిన్నంటాయి.   అదేవిధంగా స్వాతంత్రోద్యమంలో గాంధీ మహాత్ముడు చంపారణ్ లో చేసిన ఉద్యమం గురించి చెప్పి, బీహార్ రాష్ట్రం దేశానికి ఎప్పుడు అవసరమయిన జయప్రకాశ్ నారయణ్ వంటి గొప్ప నేతలను అందిస్తూనే ఉందని, అటువంటి మహానీయుడితో కలిసి పనిచేసే భాగ్యం తనకి దక్కనప్పటికీ, ఇప్పుడు బీహార్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు తను చాల సంతోషిస్తున్నాని అన్నారు.   బీహార్ లో అత్యధికంగా ఉన్నయాదవ కులస్తులను ఆయన మెప్పించిన తీరు అసమాన్యం. వారు ఆరాధించే శ్రీకృష్ణుడు గుజరాత్ లో ఉన్న ద్వారకలో నివసించాడని, అందువల్ల యాదవులతో తనకున్న అనుబంధం ప్రత్యేకమయిందని, అందుకే వారికోసం ద్వారక నుండి ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీసులు తీసుకువచ్చానని ఆయన అన్నపుడు ప్రజల స్పందన ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   అయితే వారి కులానికే చెందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దాణా కేసులో ఐదేళ్ళు జైలు శిక్షపడినప్పటికీ ఆయన పేరు పలికి వారి మనసులు నొప్పించకుండా ఆయన జాగ్రత్త పడుతూనే, లాలూ హయంలో సాగిన ఆటవిక రాజ్యం నుండి వారికి విముక్తి కలిగించదానికే బీజేపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి చెందిన జేడీ(యు)కి మద్దతు ఇచ్చిందని, గానీ ఆయన అధికారంలో స్థిరపడిన తరువాత బీజేపీని కాదని కాంగ్రెస్ హస్తం అందుకొని మిత్రద్రోహం చేసాడని విమర్శించారు.   నితీష్ కుమార్ కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు రాష్ట్రం కోసం రూ.50వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీగా కోరారని, అయితే బీహార్ ప్రజలు ఇక కాంగ్రెస్ ముందు ఎంత మాత్రం చేతులు జాపవలసిన అవసరం లేదని, తనను ఇంతగా ఆదరిస్తున్న బీహార్ ప్రజలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, రూ.50వేల కోట్లని వడ్డీతో సహా చెల్లించి ప్రజల ఋణం తీర్చుకొంటానని చెప్పి ప్రజల జేజే ద్వానాలు అందుకొన్నారు.   జాతులు, మతాలు, ప్రాంతాల పేరిట విభజించి పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆరు దశబ్దాల పాలనలో చేసిందేమీ లేదని, కనీసం నేటికీ కోట్లాది పేద ప్రజలు రెండు రొట్టెలు తినడానికి కూడా నోచుకోలేదని, అందువల్ల తమ ఈ పరిస్థితుల్లోమార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాక తప్పదని ఆయన చెప్పారు. నిరుపేద హిందూ, ముస్లిం ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుకోకుండా, తమ పేదరికంపైనే పోరాటం చేయాలని, హిందు, ముస్లిం ప్రజలు సంఘటితంగా కలిసిపనిచేసినప్పుడే ఒక ధృడమయిన భారతదేశాన్ని నిర్మించగలమని మోడీ సందేశం ఇచ్చారు. ఆయన తన ప్రసంగంతో బీహారీలను చాలా బాగా అక్కట్టుకోగాలిగారు. అందువల్ల మోడీ సభ ఊహించిన దానికంటే చాలా దిగ్విజయంగా ముగిసింది.

మోడీ సభకి బాంబులతో స్వాగతం

  అవేమి మోడీకి స్వాగతం పలకడానికి పేల్చిన దీపావళి టపాసులు కావు, ఉగ్రవాదులో మరెవరో పేల్చిన నిజమయిన బాంబులు. ఒకటి తరువాత మరొకటి చొప్పున మొత్తం ఏడూ బాంబులు పాట్నా నగరంలో ప్రేలాయి. అందులో ఐదుగురు మరణించగా డబ్బై మంది గాయపడ్డారు. సభ మొదలవడానికి కేవలం రెండు గంటల ముందు ఈ ప్రేలుళ్ళు జరగడం చాలా విచిత్రం. ఎందుకంటే ప్రధాని అభ్యర్ధిగా పోటీలో ఉన్న మోడీ సభకి చాలా ముందు నుంచే భద్రతాపరమయిన ఏర్పాట్లు అన్నీ జరిగి ఉంటాయి. అయినప్పటికీ వరుస ప్రేలుళ్ళు జరిగాయి. అయినప్పటికీ వేలాది మంది జనాలు మోడీ సభకి తరలివచ్చారు. అటువంటి సంఘటన తరువాత కూడా అన్నివేలమంది (అదే మన రాష్ట్రంలో అన్ని లక్షల మంది అని చెప్పుకొంటాము) సభకు హాజరవడం విశేషమే. బహుశః దీనినే మోడీయిజం అనాలేమో.   అటువంటి సంఘటన తరువాత కూడా అంతమంది నిర్భయంగా తనకు సభకు హాజరవడం చూసి మోడీ కూడా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెల్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీతో సహా అతిరధ మహారధులందరూ మోడీని భూతంగా, బీజేపీని మతతత్వపార్టీగా చూపిస్తూ ప్రజలని ఎంతగా భయపెట్టాలని ప్రయత్నిస్తున్నపటికీ జనాలు మాత్రం మోడీ సభకి తరలివస్తుండటం కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం ముందుందని సూచిస్తోంది.   పైగా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా భావింపబడుతున్న రాహుల్ గాంధీ, పార్టీ ప్రచారనికని బయలు దేరి, తన ప్రసంగాలతో పార్టీకి మేలు చేయకపోగా తన ప్రసంగాలతో తనకి, తన పార్టీకి కూడా తలనొప్పులు తెచ్చిపెట్టడం నరేంద్ర మోడీకి కలిసివస్తోంది. మొట్ట మొదటి సారిగా ఇద్దరూ ప్రధాని అభ్యర్దులు జనాల ముందుకి ఒకేసారి రావడంతో ప్రజలు వారి రాజకీయ పరిణతి, నిజాయితీ మరనేక అంశాలను స్వయంగా బేరీజు వేసుకోగలుగుతున్నారు.   నవంబర్, డిశంబర్ నెలలో ఐదు రాష్ట్రాలలో (మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం మరియు డిల్లీ) జరుగబోయే శాసనసభ ఎన్నికలు వారిరువురికీ సెమీ ఫైనల్స్ అంటివే గనుక దానిని బట్టి వారిరువురిలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలుసుకోవచ్చును.   ఇంతవరకు ఈ ప్రేలుళ్ళకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.

చ్చాల బాధ కలుగుతోంది....

  ప్రజలు అడుగుతున్నారు...ఎప్పుడూ ఎవరినో ఒకరిని అనుకరిస్తూనే ఉంటావెందుకని? ప్రజలు అడుగుతున్నారు. సమైక్యాంధ్ర సభ అని చెప్పి ముప్పై పార్లమెంటు సీట్లు సంపాదించి డిల్లీని శాసిద్దామని ఓట్లు, సీట్లు గురించి ఎందుకు మాట్లాడుతున్నావని ప్రజలు అడుగుతున్నారు? వచ్చేఎన్నికల తరువాత తల్లీ, చెల్లీ, అన్న ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తామని చెపుతూ కూడా మళ్ళీ సోనియమ్మను ఆడిపోసుకోవడమెందుకని...ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్ర విభజన చేయిస్తున్నకేసీఆర్ ఊసెత్తకుండా సమైక్యవాదం వినిపిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డినే ఎందుకు ద్వేషిస్తున్నావని ప్రజలు అడుగుతున్నారు.   జనగణమణ గీతం కూడా సరిగ్గా పాడలేననందుకు ప్రజలు చ్చాల బాధ పడుతున్నారు. ప్రజలకి బాధ కలుగుతోంది..జనగణమణ గీతం కూడా సరిగ్గా పాడలేని వారు వందేమాతరం గేయం పాడుతామని చెపుతుంటే...బాధ కలుగుతోంది...చ్చాలా బాధ కలుగుతోంది సమైక్యాంధ్ర సభ అని చెప్పి ఓట్లు సీట్లు గురించి మాట్లాడుతున్నపుడు.   చ్చాల బాధ కలుగుతోంది....రాహుల్ గాంధీని సోనియమ్మ ప్రధానిని చేస్తుంటే...ఇది అన్యాయం కాదా? అని నువ్వడుగుతున్నపుడు బాధ కలుగుతోంది. ప్రజలు అడుగుతున్నారు...ప్రజలు అడుగుతున్నారు మరి సోనియమ్మ చేయాలనుకొంటున్న తప్పునే విజయమ్మకూడా ఎందుకు చేస్తోందని? విజయమ్మ కలలు సోనియమ్మా కలలకి తేడా ఏమిటని ప్రజలు అడుగుతున్నారు.   రాజకీయాలలో విలువలు లేకుండా పోయినందుకు చ్చాల... బాధ.. కలుగుతోంది...చ్చాల బాధ కలుగుతోంది దేశంలో, రాష్ట్రంలో మరే పార్టీకి కూడా వైకాపా అంత నీతి నిజాయితీ లేకుండా పోయినందుకు చ్చాల.. బ్భాద కలుగుతోంది. ప్రజలు అడుగుతున్నారు...అయినా అటువంటి నీతినిజాయితీ లేని పార్టీలకే ఎందుకు మద్దతు ఇస్తావని?   సమైక్య సభపెట్టి డిల్లీలో చక్రం తిప్పుదామంటున్నావేమిటని ప్రజలు అడుగుతున్నారు...చ్చాల బాధ పడుతున్నారు....సమైక్యాంధ్ర సెంటిమెంటుని ఇలా క్యాష్ చేసుకోవాలని చూస్తునందుకు... ...నిజంగా చాలా బాధ పడుతున్నారు...

రేణుకని సాధిస్తున్నారు!

  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సాధించడానికి రేణుకా చౌదరి అప్పనంగా దొరికినట్టుంది. ఆమెని ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. రేణుకా చౌదరికి వున్న నాయకత్వ లక్షణాలు, ఎవరినీ లెక్కచేయనితనం, తాను చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్పే లక్షణమే ఆమెను తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు శత్రువుగా మార్చాయి. తె.కాం. నాయకులలోని పురుషాధిపత్య ధోరణి కూడా ఆమెకు శత్రువుల్ని పెంచుతోంది.   మహిళా కాంగ్రెస్ నాయకురాలంటే తాము చెప్పిన వాటికి తలూపడం తప్ప ఎదురు మాట్లాకూడదు. ఒకవేళ ఎదురు తిరిగి మాట్లాడితే.. ఇదిగో.. ఇలా రేణుకాచౌదరిని వెంటాడినట్టే వెంటాడి వేధిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను రేణుకా చౌదరి మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే తెలంగాణని అభివృద్ధి చేయడమే ముఖ్యమని ఆమె చెప్పేవారు. అది మనసులో పెట్టుకుని ఆమె మీద తెలంగాణ ద్రోహి ముద్ర వేశారు.   ఆమధ్య తెలంగాణ కాంగ్రెస్ సమావేశానికి రేణుకా చౌదరి వెళ్తే పొన్నం లాంటి నాయకులు ఆమెని ఆ సమావేశంలోంచి బయటకి పంపేయాలని నానా యాగీ చేశారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రి ఒకరు రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా ఆడపడుచే కాని రేణుకని ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొనసాగించకూడదని ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా వున్న రేణుక వచ్చే ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.   అయితే కొంతమంది తె.కాం. నాయకులు ఈసారి రేణుకకు ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వాలంటే ఆమె ఖమ్మం జిల్లాలో పుట్టినట్టు బర్త్ సర్టిఫికెట్ చూపించాలని డిమాండ్ చేశారు. ఈసారి రేణుకకు ఖమ్మం టిక్కెట్ రాకుండా చేయాలన్న ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇదంతా ఇలా వుంటే, రేణుకకు చెక్ పెట్టడంతోపాటు, రాహుల్‌గాంధీ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఖమ్మం జిల్లాలో వున్న రేణుక వ్యతిరేక వర్గం ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాంటి ఒక ప్లాన్ వేసింది.   రాహుల్‌గాంధీ ఈసారి ఎన్నికలలో ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించింది. ఇది రేణుక వర్గీయులకి ఆగ్రహం తెప్పించింది. దాంతో వాళ్ళు ఖమ్మం జిల్లా ఎడిషన్ న్యూస్ పేపర్లలో ‘‘ఖమ్మం నుంచి రేణుకా చౌదరి పోటీ చేయాలంటే బర్త్ సర్టిఫికెట్ కావాలన్నారు. మరి రాహుల్‌గాంధీకి ఖమ్మం జిల్లాలో పుట్టినట్టు బర్త్ సర్టిఫికెట్ ఏదైనా వుందా’’ అనే అర్థం వచ్చేలా ప్రకటనలు ఇచ్చారు. రేణుకని దెబ్బతీయడానికి కాచుకుని కూర్చుని వున్న వాళ్ళకి ఆ ప్రకటనలు లడ్డులా దొరికాయి. ఆ ప్రకటనల కటింగ్‌ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి శనివారం నాడు దిగ్విజయ్‌సింగ్‌కి అందజేశారు.   రేణుకా చౌదరి వ్యవహార శైలి మీద కూడా డిగ్గీకి ఫిర్యాదు చేశారు. యువరాజు మీదే కామెంట్లు చేయడానికి సాహసిస్తున్న రేణుకని, ఆమె వర్గాన్ని తగిన విధంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తమ్మీద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తనను ఎంత సాధిస్తున్నా, వేధిస్తున్నా రేణుకా చౌదరి వెనకడుగు వేయడం లేదు. కాంగ్రెస్ పార్టీలో వున్న ఈ వర్గపోరు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశానికి మరింత లాభం చేకూర్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు

      గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ సభ జరగనున్న భీహారు రాజధాని పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ ఉదయం నుంచి మొత్తం ఆరు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పాట్నా రైల్వే స్టేషన్ లోని పదవ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఓ టాయిలెట్ సమీపంలో తొలి బాంబు పేలుడు జరుగగా, రెండో బాంబు ఓ సినిమా థియేటర్ వద్ద, మిగితా నాలుగు బాంబులు హుంకర్ ర్యాలీ జరిగే గాంధీ మైదాన్ వద్ద జరిగినట్టు సమాచారం. ఈ ర్యాలీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఆదివారం పాట్నాలో మధ్నాహం ఒంటి గంటకు 'హుంకర్' ర్యాలీలో నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.

జగన్ 'పిచ్చి వాగుడు'

      పదహారు నెలలు అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి బాగోలేదు. అందుకే మతి భ్రమించిన వాడిలా పిచ్చి వాగుడు వాగుతున్నాడు. సోనియాగాంధీ మోచేతి నీళ్లు తాగి రోజు ఆమె ఇటలీ నుండి వచ్చిన సంగతి తెలియదా ? అసలు వాళ్ల నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది సోనియాగాంధీ కాదా అని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాద్ సమైక్య శంఖారావం సభలో జగన్ ప్రసంగం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. జగన్ కు ఓట్లు సీట్లే ముఖ్యమని, తెలంగాణ వాళ్లు చీత్కరిస్తున్నా సిగ్గులేకుండా జగన్ కలిసి ఉందామని అంటున్నాడని పొన్నం విమర్శించారు. హైదరాబాద్ లో అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు హైదరాబాద్ లో మీటింగ్ లు పెట్టి జగన్ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాడని, జాతీయ గీతాన్ని అవమానించిన జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమిరెడ్డికి కిరణ్ షాక్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. తెలంగాణ విభజన నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంతో సంబంధం లేకుండా చిత్తూరు జిల్లాకు తాగునీటి అవసరాల కొరకు ఏకంగా రూ.6 వేల కోట్లు కేటాయించుకున్నాడు. ఆర్థికశాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుండి చిత్తూరు జిల్లాకు తాగునీటి తరలించే పథకం ఇది. ఇది పూర్తయితే వందలాది గ్రామాలతో పాటు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంలకు కూడా నీటి సమస్య ఉండదు.     అయితే కండలేరు జలాశయం నుండి కేటాయింపులు లేకున్నా ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు నీటిని తరలిస్తున్నారని, ఇక్కడ రైతులను ఎండబెట్టి ఎలా తరలిస్తారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని నిలదీస్తున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే అనుకోకుండా ఓ ప్రైవేటు కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురయ్యారు. కనిపించిందే తడవు ముఖ్యమంత్రి సోమిరెడ్డితో చిత్తూరు జిల్లాకు నీరు తరలించొద్దని అంటున్నావు..అదే మాట మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో చెప్పించు..అప్పుడు ఆ పనులు నిలిపేస్తా అని చెప్పడంతో అవాక్కవడం సోమిరెడ్డి వంతయింది.

పులిని చూసి వాతలు పెట్టుకోనేల

  ఏపీ ఎన్జీవోల సభకు దీటుగా సమైఖ్య శంఖారావం సభను నిర్వహించి, సీమాంద్రాలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల కంటే సమైక్య రేసులో తామే ముందున్నామని చాటుకోవాలనే యావే తప్ప, సమైక్యాంధ్ర పట్ల ఏమాత్రం చిత్తశుద్దిలేని వైకాపా చాలా సాంప్రదాయబద్ధంగా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని సభను ఆరంభించింది. అయితే మధ్యలో వందేమాతరం గీతం కూడా అందుకొంటామని, తెలుగుజాతిని విడగొడుతున్నవారిని బంగాళాఖాతంలోకి విసిరేస్తామని భీకర ప్రతిజ్ఞలు కూడా చేసారు.   ఇంతకీ మధ్యలో వందేమాతరం గీతం అందుకొంటామని హెచ్చరించవలసిన అవసరంమేమిటో వారికే తెలియాలి. బహుశః వందేమాతరం పాడటానికి తమకు అభ్యంతరం లేదని చెప్పి బీజేపీ వాళ్ళని మంచి ప్రయత్నం ఉందేమో మరి. ఎందుకంటే దేశంలో కొందరు నేతలు వందేమాతరం పాడేందుకు బాహాటంగానే నిరాకరిస్తున్నందున వారిపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది.   కానీ వైకాపా మహోదయులు వందేమాతరం గేయాన్నిసభలో ఆలపించకుండా దాని పరువు నిలిపారు. ఎందుకంటే సభ ముగింపులో వాళ్ళు జనగణమణ జాతీయ గీతాన్ని ఎంత కూనీ చేసారో చూస్తే ఎవరికయినా హృదయం కలుక్కుమానక మానదు. అసలు జాతీయ గీతాన్నిపాడకపోయినా ఎవరూ అడిగేవారు ఉండరు. కానీ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు ఏపీ ఎన్జీవోలు తమ ‘సేవ్ ఆంద్రప్రదేశ్’ సభని జనగణమణ జాతీయ గీతాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో ఆలపించి ముగించి అందరి మన్ననలు పొందడంతో, పోరాడితే పోయేదేముంది విభజన చిచ్చుతప్ప అని జనాలను ఊదరగొట్టినట్లుగానే పాడితే పోయేదేముంది పరువు తప్పఅని తప్పుల తడకలతో జనగణమణ జాతీయ గీతాన్నిపాడి ‘మమ’ అనిపించేసారు.   చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అని పెద్దలు ఊరకనే అనలేదు. అది అక్షరాల వైకాపాకి వర్తిస్తుంది. జాతీయ గీతాన్నితప్పుగా, ఆశ్రద్దగా పాడినందుకు తెలంగాణా న్యాయవాదుల జేఏసీ పోలీసులకి పిర్యాదు చేసింది. అయితే కొమ్ములు తిరిగిన సీబీఐ వాళ్ళే జగన్ కాలిగోరు కూడా తాకలేకపోయింది పోలీసులు మాత్రం ఏమి చేయగలరు పాపం!

కృతజ్ఞతలు వాయిదా!

  సోనియాగాంధీ తెలంగాణా ప్రకటించడంతో ఆమెకు తామెంతో రుణపడిపోయామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అర్జెంటుగా ఆమెకి కృతజ్ఞతలు చెప్పేయడానికి తహతహలాడిపోతున్నారు. దీనికోసం ఆదివారం నాడు కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో కృతజ్ఞతల సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొని, అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేసి, స్తోత్రాలు చెల్లించి అధిష్ఠానం దృష్టిలో పడాలని అనుకున్నారు.   అయితే కృతజ్ఞతల సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటి నుంచి సొంత పార్టీ నుంచి మాత్రమే కాకుండా బయటి పార్టీల నుంచి కూడా విమర్శలు తలెత్తాయి. తెలంగాణ ఏర్పాటుతో అసలే కడుపు మండిపోతున్న సీమాంధ్ర ప్రజల ఆగ్రహాగ్నికి ఇలాంటి సభలు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది కాబట్టి ఈ సభను నిర్వహించకపోవడమే ఉత్తమమన్న అభిప్రాయం కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యక్తం చేశారు.   అయినా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ సీఎం అయిపోవాలని కలలు కంటున్న తెలంగాణ మంత్రులు సోనియమ్మకి కృతజ్ఞతలు చెప్పితీరుతాం అంటూ సభ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా ఈ సభ మీద నిప్పులు చెరిగింది. ఏం సాధించాలరని కృతజ్ఞతలు చెబుతారని నిలదీసింది. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రకటించినా ముఖ్యమంత్రి స్థానంలో వున్న కిరణ్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రిని కట్టడి చేయడం చేతగాని మంత్రులు ఇలాంటి సభలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని టీఆర్‌ఎస్ విమర్శించింది. దాంతో నాలుక్కరుచుకున్న తెలంగాణ మంత్రులు కృతజ్ఞతల సభను వాయిదా వేసుకోవాలని అనుకున్నా ఏర్పాట్లన్నీ జరిగిపోవడంతో గత్యంతరం లేక ముందుకే వెళ్దామని అనుకున్నారు. కానీ లోలోపల అనవసరంగా సభ పెడుతున్నామేమోనని మథనపడుతూనే వున్నారు.   తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మథనను గుర్తించాడేమోగానీ, వరుణదేవుడు కరీంనగర్‌లో భారీ వర్షాలు కురిపించి అంబేద్కర్ స్టేడియంలో కాసిన్ని నీళ్ళ నిలిచేలా చేశాడు. దాంతో తె.కాం. నాయకుల బుర్రల్లో ఫ్లాష్ వెలిగింది. వెంటనే స్టేడియంలో నిలిచిన నీళ్ళ సాకుని చూపించి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతల సభని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సభ ఎప్పుడు జరిపేదీ తర్వాత తెలియజేస్తామని చెప్పారు.