సువార్త సభల్లో వైకాపా జెండాలు

      రాజకీయాలని, మతాన్ని కలపడంలో జగన్ ఫ్యామిలీ ఎప్పుడో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా ఇలాంటి మత రాజకీయాలకు వైకాపా మరింత ఉత్సాహంగా పాల్పడుతోంది. ప్రస్తుతం సీమాంధ్రలో ఎక్కడ క్రైస్తవ సభలు జరిగినా అక్కడకి వైకాపా నాయకులు ప్రత్యక్షమైపోతున్నారు. మనం మనం ఒకటి అంటూ ఓట్లు అడుగుతున్నారు. ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటూ వుంటే మధ్యలో మీ రాజకీయాల గోలేంటని క్రైస్తవులు విసుక్కుంటున్నా వినకుండా వైకాపా వర్గాలు భక్తిబాటలో ఓట్ల వేటకి వెళ్తున్నారు. లేటెస్ట్ గా కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని అద్దాడలో జరుగుతున్న సువార్త సభల్లోకి జగన్ బావమరిది బ్రదర్ అనిల్, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కల్పన వచ్చారు. అక్కడ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎవరో అడిగితే మేం ప్రచారానికి రాలేదు ప్రార్థన చేయడానికి వచ్చామని చెప్పారు. అయితే వీళ్ళంతా వచ్చిన వాహనాకు వైసీపీ జెండాలున్నాయి. ఇలా జెండాలతో రావడం ఎన్నికల ప్రచారం కిందే వస్తుందని ఎవరో అనడంతో అందరూ అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

డిగ్గీ, అమృత భలే పోజులిచ్చారు

      కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ నెత్తిన గుదిబండలా మారిన దిగ్విజయ్ సింగ్ అమృతారాయ్ అనే టీవీ యాంకర్‌తో గత కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీళ్ళ సంబంధం గురించి తెలిసిన అమృతారాయ్ భర్త ఆమె నుంచి విడాకులు కోరుకున్నాడు. వీళ్ళు ఏకాంతంగా వున్న సమయంలో ముచ్చటపడి తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ కావడం, దాంతో వీళ్ళిద్దరూ పెళ్ళి బాట పట్టడం ఈ పాయింట్లన్నీ రెండు రోజులుగా మీడియాలో నానుతూనే వున్నాయి.   అయితే ఇప్పుడు ఈ అంశాన్ని జనం మరో కొత్త కోణంలో చూస్తు్న్నారు. ఆ కోణం ఏమిటంటే, బయటకు లీక్ అయన ఫొటోల్లో దిగ్విజయ్, అమృత సూపర్‌గా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారని, ఈ ఎక్స్ ప్రెషన్లు ఏ సినిమా  హీరో హీరోయిన్లకి అయినా తీసిపోకుండా వున్నాయని. ఎంతో సంతోషంగా వున్న ఫేస్‌తో దిగ్విజయ్ భుజం మీద చేయి వేసిన అమృత.. హాయిగా కళ్ళు మూసుకుని ఏదో తన్మయత్వంలో వున్న దిగ్విజయ్ సింగ్. ఈ ఫొటోలలో వీళ్ళిద్దరి పోజులను చూసి జనం ముచ్చటపడుతున్నారు. సినిమాల్లో నటించే హీరో హీరోయిన్లు ఎక్స్ ప్రెషన్లు ఎలా ఇవ్వాలో వీళ్ళిద్దరిని చూసి నేర్చు్కోవాలని అంటున్నారు. దీనిమీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ ట్విట్టర్‌లో కామెంట్ చేశాడు. ఫొటోల్లో వీళ్ళిద్దరి ఎక్స్ ప్రెషన్లు చూస్తుంటే దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా హీరో హీరోయిన్లని చూసినట్టు అనిపించిందని వర్మ కామెంట్ చేశాడు. దిగ్విజయ్, అమృత ఏదైనా సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తే ఎలా వుంటుందంటారు?  

గూగుల్ మీద కేసు

      ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు విశేష సేవలు అందిస్తూ, ఇంటర్నెట్ ప్రకటనల రంగంలో కూడా అగ్రస్థానంలో వున్న గూగుల్ మీద కేసు నమోదైంది. ఇంటర్నెట్ సెర్చింగ్ రంగంలో, మొబైల్ సెర్చ్ రంగంలో గూగుల్ ఆక్రమంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని కేసు నమోదైంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ముందుగానే యాప్ప్ లోడ్ చేయడం ద్వారా అనేక మోబైల్స్ లో తనకు సంబంధించిన గూగుల్, యూ ట్యూబ్ లాంటి వెబ్ సైట్లకి ప్రాధాన్యం వుండేలా గూగుల్ చూసుకుంటుందనేది ఈ కేసు సారాంశం. ఇలా చేయడం మొబైల్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలకు వ్యతిరేకమని ఆ కేసులో పేర్కొన్నారు. నార్త్ కాలిఫోర్నియాలోని డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ కేసు నమోదైంది. నోకియా వ్యాపార ప్రత్యర్థులు ఈ కేసు పెట్టారు.

రోజాకి వడదెబ్బ.. ఆస్పత్రిలో చికిత్స

      నగరి నుంచి పోటీ చేసీ చేసీ ఓడిపోతూ వస్తున్న రోజా మరోసారి నగర నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో వున్నారు. ఈసారి కూడా రోజా గెలిచే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో రోజా ప్రచారం చేస్తున్నారు. భగభగ మండుతున్న ఎండని కూడా లెక్క చేయకుండా రోజా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శుక్రవారం నాడు నియోజవర్గం పరిధిలోని ఏకాంబరకుప్పంలో ప్రచారం చేస్తున్న రోజాకి భారీ స్థాయిలో వడదెబ్బ తగిలింది. దాంతో ఆమె అక్కడికక్కడే కళ్ళు తిరిగిపడిపోయింది. రోజాకి వడదెబ్బ తగిలిన విషయాన్ని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు ఆమెను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్న ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు.

ప్రధానిగా మోడీకే నా మద్దతు: ప్రీతీజింటా

      బాలీవుడ్ అందాల భామ, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రాంచైజీ ప్రీతీజింటా ప్రధానమంత్రిగా నరేంద్రమోడీకే తన మద్దతు అని స్పష్టంగా ప్రకటించేసింది. నరేంద్రమోడీ ఎంపీగా పోటీ చేస్తున్న హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిని శుక్రవారం నాడు ప్రీతీజింటా సందర్శించింది. కాశీ విశ్వనాథుడిని దర్శించిన అనంతరం ప్రీతీజింటా మీడియాతో మాట్లాడింది. తాను నరేంద్రమోడీని ఎంతగానో అభిమానిస్తానని, మోడీ మన దేశానికి ప్రధానమంత్రి కావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, ఆయనకి ప్రజల్లో మంచి ఆదరణ వుందని ప్రీతీజింటా చెప్పింది. మోడీకి అనుకూలంగా మీరు ఎన్నికలలో ప్రచారం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రీతీజింటా అవుననకుండా, కాదనకుండా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. మోడీకి ఇప్పుడు ప్రచారం అవసరమే లేదని అంది.

జగన్ పార్టీ ఒక సైకో పార్టీ: చంద్రబాబు

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సైకో పార్టీ అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఇటు జగన్‌ మీద, అటు కాంగ్రెస్ అండ్ బొత్స మీద చీపురు తిరగేశారు. సోనియా ఆటలు ఇటలీలో సాగుతాయి కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కాదని అన్నారు. చీపురుపల్లిలో బొత్సకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. వైకాపా సైకో పార్టీల మారిపోయిందని, ఇతర పార్టీల నాయకుల మీద వరుసగా దాడులు చేస్తూ తన సైకో బుద్ధిని బయటపెట్టుకుంటోందని అన్నారు. వైకాపా మంచినీళ్ళలా డబ్బు ఖర్చు పెడుతోందని, ఆ డబ్బు ఎక్కడిదని ప్రశ్నించినవారి మీద దాడులు జరుపుతోందని విమర్శించారు. జగన్ పత్రిక సాక్షికి ఆ పేరు తప్పుగా పెట్టారని, ‘అవినీతి’ అని పెడితే బాగుండేదని బాబు ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అని అరిచినట్టు, అవినీతిలో మునిగిపోయి వున్న సాక్షి పేపర్ తనమీద అవినీతి కథనాలు రాయడం విచిత్రంగా వుందని అన్నారు.

బీజేపీ కండువా వద్దన్న పవన్ కళ్యాణ్

      ‘జనసేన’ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆ పార్టీల కండువాలు కప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ కండువాలను, ఈ పార్టీ నాయకులు ఆ పార్టీ కండువాలను కప్పుకుంటూ వున్నారు. అయితే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మాత్రం ఏ పార్టీ కండువానీ కప్పుకోకుండానే వేదికల మీద ప్రసంగిస్తున్నారు. వేదికల మీద ఏ పార్టీ కండువానీ తన మెడలో వేయడానికి ప్రయత్నించవద్దని పవన్ కళ్యాణ్ మొదట్లోనే రెండు పార్టీల అగ్ర నాయకులకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన మెడలో ఇంతవరకు ఏ పార్టీ కండువా కనిపించలేదు. అయితే భీమవరంలో మోడీతో కలసి పాల్గొన్న సభలో ఒక బీజేపీ నాయకుడు అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ మెడలో బీజేపీ కండువా వేయబోయాడు. అయితే పవన్ కళ్యాణ్ వెంటనే తల బీజేపీ కండువాకి దూరంగా జరిపేశాడు. తల అడ్డంగా ఊపుతూ తనకు కండువా వేయొద్దన్న సంజ్ఞ చేయడంతో సదరు అత్యుత్సాహ బీజేపీ నాయకుడు నాలుక్కరుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన దిగ్విజయ్ ప్రియురాలు

      కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రియురాలు దిగ్విజయ్ సింగ్ కంటే తెలివైనదిలా కనిపిస్తోంది. ఎంచక్కా దిగ్విజయ్‌సింగ్‌తో సరస సల్లాపాలు ఆడుతూ, వాటిని ఫొటోలు తీసుకుని కంప్యూటర్లో, ఈ మెయిల్స్‌ లో పెట్టింది. మరి ఆ ఫొటోలని బయటకి అమృతే లీక్ చేసిందో మరెవరో చేశారోగాని ఫొటోలు బయటపడ్డాయి. దాంతో దిగ్విజయ్ అమృతని పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించక తప్పలేదు. ఎన్నో సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని పెళ్ళితో చట్టబద్ధం చేసుకోక తప్పలేదు. సరసపు ఫొటోలు తీసుకుంది దిగ్విజయ్, అమృత జంట. వాటిని కంప్యూటర్‌లో పెట్టుకుంది ఆ జంటే. ఇప్పుడు సదరు ఫొటోలు లీకైతే ఆ విషయాన్ని పరిశోధించే బాధ్యత మాత్రం పోలీసుల మీద పడింది. తన కంప్యూటర్ని, ఈమెయిల్ని హ్యాక్ చేసింది ఎవరో పరిశోధించి చెప్పాలని అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికిపోయిన దిగ్విజయ్, అమృత బాగానే వున్నారు. పోలీసులకే కొత్త తలనొప్పి వచ్చి పడింది.

రైల్లో పేలుళ్ళ కేసు మేమే పరిశోధిస్తాం.. కేంద్రం సాయం వద్దు: జయ

      చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద గౌహతి ఎక్స్ ప్రెస్ రైల్లో జరిగిన బాంబు పేలుళ్లలో మన రాష్ట్రానికి చెందిన స్వాతి మరణించిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ళలో దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ కేసు విచారణకు సంబంధించి తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అక్కర్లేదని, తమ రాష్ట్ర పోలీసు అధికారులే ఈ కేసును పరిశోధిస్తారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. కేంద్రం అందిస్తానన్న సాయాన్ని ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ కేసును విచారించే బాధ్యతను తమిళనాడుకు చెందిన స్పెషల్ వింగ్ పోలీసు అధికారులకు జయలలిత అప్పగించారు. ఈ కేసును పరిశోధించే విషయంలో కేంద్రం తనంతట తానే చొరవ చూపించినా జయలలిత తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయాలు

      పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించడానికి వీలుగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.   పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న దరిమిలా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిన పోలవరం ప్రాజెక్టు ఖర్చు కేంద్రమే భరిస్తుంది.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ. 20వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. అందులో రూ. 18వేల కోట్లు కేంద్రం సమకూర్చనుంది. ప్రాజెక్టు అనుమతులు సంపాదించే బాధ్యతను కూడా కేంద్రమే తీసుకుంటుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, వారికి నష్టపరిహారం చెల్లించడం కూడా కేంద్రమే చూసుకుంటుంది. ఎస్పీవీ ఏర్పాటు చేయడం ద్వారా వేగంగా అనుమతులు సంపాదించడానికి, నష్టపరిహారం చెల్లించడానికి, పునరావాసం కల్పించడానికి వీలవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.

రేపు విజయవాడలో మోడీ సభ

  నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి నిన్న ఒకేరోజు సీమాంద్రాలో ఐదు సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంచేసి రెండు పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం కలిగించగలిగారు. మళ్ళీ రేపు అంటే శనివారం వారు ముగ్గురు కలిసి విజయవాడలో మరో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం సభ నిర్వహించే వరకు చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తారు. అయన ఈరోజు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలలో ఎన్నికల ప్రచారం చేస్తారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలపై పూర్తి పట్టు సాధించగలిగిన పార్టీకే సర్వసాధారణంగా విజయావకాశాలు ఉంటాయి గనుక తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలు ఆ మూడు జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి.

జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

      వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసమే రాష్ట్ర విభజన జరిగిందని ప్రముఖ నటుడు,జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు దెబ్బతీశారని మండిపడ్డారు. సీమాంద్రులను కేసీఆర్ పదే పదే విమర్శిస్తూ, తిడుతుంటే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను విమర్శించేందుకు జగన్‌కు గొంతు పెగలలేదని అన్నారు. సీమాంద్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేయగల సత్తా ఒక్క టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకే ఉందని పవన్ కల్యాణ్ ఉద్ఘటించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీని ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేదిలేదని, చీల్చిచెండాడతామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ హఠావో... సీమాంధ్ర బచావో అంటూ పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు.

ఇక కెన్యా మగాళ్ళు ఎంతమందినైనా పెళ్ళాడొచ్చు!

      ప్రస్తుతం కెన్యాలో మగాళ్ళందరూ ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఎందుకంటే కెన్యాలో వున్న మగాళ్ళు ఎంతమందినైనా పెళ్ళి చేసుకోవచ్చని కెన్యా పార్లమెంట్ తాజాగా ఒక బిల్లును ఆమోదించింది. గతంలో కెన్యాలో మగాళ్ళు ఒక్క పెళ్ళి మాత్రమే చేసుకోవాలనే చట్టం అమలులో వుండేది. ఇప్పుడు పాత చట్టాన్ని చించేసి, కెన్యా మగాళ్ళు ఎంతమంది మహిళలనైనా పెళ్ళిచేసుకోవచ్చని కెన్యా పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టాన్ని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మతపెద్దలు ఎంతగానో వ్యతిరేకించారు. అయినప్పటికీ కెన్యన్ పార్లమెంట్ ఈ వ్యతిరేకతని, అభ్యంతరాలని ఎంతమాత్రం పట్టించుకోకుండా కొత్తచట్టాన్ని ఆమోదించేసింది. దాంతో కెన్యా కుర్రాళ్ళు... సారీ... కుర్రాళ్ళేం ఖర్మ.. కాటికి కాళ్ళు చాపుకున్న ముసలోళ్ళు కూడా ఇంకా బోలెడన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలని లొట్టలు వేస్తున్నారు. అయితే ఈ చట్టం మహిళలకు మాత్రం మొండిచెయ్యి చూపించింది. కెన్యా మహిళలు కేవలం ఒక్క మగాడిని మాత్రమే పెళ్ళి చేసుకోవాలి. ఎంత అన్యాయం?

ములాయంసింగ్‌ని పిచ్చాస్పత్రిలో చేర్పిస్తే బెటరట!

      యు.పి. మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ రకరకాల వెరైటీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. లేనిపోని సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ములాయం సింగ్ యాదవ్‌ని పిచ్చాస్పత్రిలో చేరిస్తే మంచిదని యు.పి. మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి అభిప్రాయపడ్డారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే ములాయంసింగ్ యాదవ్ మాయావతి మీద కూడా కొంటె కామెంట్లు చేశాడు. ఫైజాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో ములాయం మాట్లాడుతూ, ‘మాయావతిని మిస్ అనాలో, మిస్టర్ అనాలో, సిస్టర్ అనాలో నాకు అర్థం కావడం లేదు’ అని వెటకారంగా మాట్లాడాడు. ఈ కామెంట్లపై మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ములాయం మతి భ్రమించి ఇలా అడ్డమైన కూతలు కూస్తున్నాడని, ఆయన్ని అర్జెంటుగా పిచ్చాస్పత్రిలో చేరిస్తే మంచిదని అన్నారు. ఈసారి ఎన్నికలలో తాను ఓడిపోతాననే భయం ములాయాన్ని పట్టి పీడిస్తోందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని మాయావతి మండిపడింది.

చంద్రబాబు ఓటు చెల్లుతుంది.. భన్వర్‌లాల్‌కి భంగపాటు

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు జూబిలీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్ళి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పొత్తు ధర్మం ప్రకారం తాను బీజేపీకి ఓటు వేశానని, అటు అసెంబ్లీకి గానీ, ఇటు పార్లమెంట్‌కి గానీ తమ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో లేనందున తమ మిత్ర పక్షమైన బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశానని చంద్రబాబు చెప్పారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చంద్రబాబు ఓటు చెల్లదని ప్రకటించారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు భన్వర్‌లాల్‌ని నిలదీశారు. ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నదీ చూపిస్తే తప్పు తప్ప, ఆ తర్వాత ఎవరికి ఓటు వేసిందీ చెబితే తప్పు కాదని వాదించారు. అయినా సరే భన్వర్‌లాల్ తన పట్టు వీడలేదు. ఓటును రద్దు చేసే అధికారం భన్వర్‌లాల్‌కి లేదని చెప్పినా ఆయన పట్టించుకోలేదు. దాంతో ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళింది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు మాట్లాడిన దానిలో తప్పేమీ లేదని, ఆయన ఓటు చెల్లుతుందని ప్రకటించింది. దీంతో చంద్రబాబు ఓటు చెల్లదని ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ భంగపడినట్టు అయింది.

బాంబులు పేలుతున్నాయ్.. మోడీకి భద్రత పెంచండి: బీజేపీ

      చెన్నై రైల్వే స్టేషన్లో జరిగిన బాంబు పేలుళ్ళలో గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ బాంబులు ఆంధ్రప్రదేశ్‌లో పేలడానికి ఉద్దేశించి పెట్టినవేనని, అయితే ట్రెయిన్ గంటన్నర సేపు చెన్నై స్టేషన్‌లోనే ఆగిపోవడం వల్ల అక్కడే పేలుళ్ళు జరిగాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నందున, ఆయనకు హెచ్చరిక ఇచ్చే విధంగా ఈ బాంబు పేలుళ్ళు జరపడానికి తీవ్రవాదులు ప్లాన్ చేసి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన మీద భారతీయ జనతాపార్టీ స్పందించింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ చెందిన యువతి మరణించడం, పలువురు గాయపడటం మీద తన బాధను వ్యక్తం చేసింది. దీంతోపాటు బీజేపీ ఒక ప్రధానమైన డిమాండ్ చేసింది. ఈ సంఘటన మోడీ ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వున్నారో తెలియచెబుతోందని, కాబట్టి మోడీకి భద్రత పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేసింది.

నా లైఫ్.. నా ఇష్టం: దిగ్విజయ్ సింగ్

      కొన్నేళ్ళుగా టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో చాటుమాటు వ్యవహారం నడుపుతూ, దేశ రాజకీయాల్లో పెద్దమనిషిలా చెలామణి అవుతున్న దిగ్విజయ్ ‌సింగ్ ఇప్పుడు తన గుట్టంతా బయట పడేసరికి సిగ్గంతా వదిలేసి మాట్లాడుతున్నాడు. అమృతతో తన వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, ఈ విషయంలో ఎవరైన కామెంట్ చేస్తే ఊరుకోనని అంటున్నారు. ఈయనగారి రాసలీలల వ్యవహారం విషయంలో ఇంతవరకు బిజేపీ నాయకులెవరూ పల్లెత్తు మాట అనకపోయినా మోడీతో తనని పోల్చుకుంటూ మోడీకంటే తానే ఉత్తముడినని అంటున్నాడు. మోడీ చాలాకాలంగా తన పెళ్ళి విషయాన్ని దాచిపెట్టాడని, తాను మాత్రం తాను ప్రేమించిన మహిళను వివాహం చేసుకోబోతున్నానని దిగ్విజయ్ చెబుతున్నాడు.

డిగ్గీ అఫైర్..అమృతే ఇరికించిందా?

      దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్ మధ్య చాలాకాలంగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యవహారం నాటకీయ పరిణామాల మధ్య బయటపడటం, దొరికిపోయిన దిగ్విజయ్ సింగ్ తాను అమృతని పెళ్ళి చేసుకోబోతున్నానని ప్రకటించడం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆశ్చర్యంతోపాటు ఎన్నో అనుమానాలను కూడా కలిగిస్తోంది.   అమృతతో దిగ్విజయ్ సింగ్ చాలా సన్నిహితంగా వున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో దిగ్విజయ్‌కి తమ మధ్య వున్న సంబంధం గురించి దిగ్విజయ్ ట్విట్టర్‌లో బహిర్గతం చేసేశాడు. ఆ తర్వాత అమృత కూడా ట్విట్టర్‌లో తాము పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించింది. అదేవిధంగా తన కంప్యూటర్ని, ఈ మెయిల్‌నీ ఎవరో హ్యాక్ చేశారని అమృత వాపోయింది. దీనిద్వారా అమృత చెప్పదలుచుకున్నది ఏమంటంటే, దిగ్విజయ్, తాను సన్నిహితంగా వున్న ఫొటోలు నా కంప్యూటర్లో, ఈ మెయిల్లో వున్నాయి. వాటిని ఎవరో సంపాదించి ఇంటర్నెట్‌లో లీక్ చేశారు. అయితే ఇక్కడ అందరికీ ఒక అనుమానం వస్తోంది. చాలాకాలంగా దిగ్విజయ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించిన అమృతే ఇక దిగ్విజయ్‌ని పెళ్ళి చేసుకుంటే బెటరేమో అన్న ఉద్దేశంతో ఆమే ఫొటోలు లీక్ చేసి వుండొచ్చేమో! ఇలాంటి ప్లాన్‌కి ఉపయోగించడం కోసమే దిగ్విజయ్‌, తాను ఏకాంతంగా వున్నప్పుడు కంప్యూటర్ కెమెరా ద్వారా ఆ దృశ్యాలను ఫొటోలు తీసిందేమో. సదరు ఫొటోలను తానే లీక్ చేయడం ద్వారా దిగ్విజయ్ సింగ్‌ని పెళ్ళి ఉచ్చులో ఇరికించేసిందేమో.. ఏమో!

ఆ డబ్బు ఎవడబ్బ సొమ్ము?

  సీమాంధ్ర ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఘాటు పదజాలంతో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను ఏకిపారేస్తున్నారు. కేసీఆర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని, సైకిల్ స్పీడు పెంచి, గేరు మార్చి కేసీఆర్ని తొక్కిపారేస్తానని చంద్రబాబు చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అడ్రస్ లేకుండా పోయిందని, భవిష్యత్తులో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ పార్టీ ఈ ఎన్నికలలో డబ్బు వెదజల్లుతోందని, అసెంబ్లీ స్థానానికి 30 కోట్లు, పార్లమెంట్ స్థానానికి 60 కోట్లు ఖర్చుపెడుతోందని, ఈ డబ్బంతా ఎవడబ్బ సొమ్ము అని చంద్రబాబు గట్టిగా ప్రశ్నించారు. జగన్‌కి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టేనని, అంటూ ఎన్నికల తర్వాత జైల్లో వుండే జగన్‌కి ఓటేస్తే ప్రజలే నష్టపోతారని చెప్పారు.