చంద్రబాబు తలమీద బతుకమ్మ

  హైదరాబాదు నగరంలోని కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం హాజరయ్యారు. తలపై బతుకమ్మను పెట్టుకుని మోశారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఒక్కటేనని, తెలుగు ప్రజలు పరస్పర అవగాహనతో అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సమస్యలతోపాటు తెలంగాణ సమస్యలు కూడా ప్రస్తావిస్తున్నానని తెలిపారు. మళ్లీ తెలుగు జాతిని పూర్తిగా కలిపే పార్టీ తెలుగుదేశం తప్ప మరేది వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తుకు రంగం సిద్దం?

  ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి తదితరులకు చెందిన రూ.1500 కోట్ల విలువయిన ఆస్తులను జప్తు చేయగా, వాటిలోరూ. 863 కోట్ల ఆస్తుల జప్తును కోర్టు ద్రువీకరించింది. ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ మళ్ళీ మరోమారు ఆస్తుల జప్తుకు రంగం సిద్దం చేసుకొంటోంది. కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడయిన ఒక పారిశ్రామికవేత్తను విచారించి ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేసుకొన్న తరువాత నిజాం పట్నం, వాడరేవు వద్దగల వాన్ పిక్ పారిశ్రామిక సెజ్ లలో ఆయనకు సంబంధించిన ఆస్తుల జప్తుకు సిద్దమవుతోంది.   అదేవిధంగా ఇండియా సిమెంట్స్ సంస్థ అధినేత యన్. శ్రీనివాసన్ కు సమన్లు జారీ చేసింది. ఆయన జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలలో రూ.140కోట్లు పెట్టుబడులు పెట్టి అందుకు ప్రతిగా తన సిమెంట్ ప్లాంటుకు అవసరమయిన నీటిని పక్కనున్న నదిలో నుండి యదేచ్చగా వాడుకొన్నందున, ఆయనకు సంబందించిన ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బీ.సి.సి.పి.యల్.సంస్థ డైరెక్టర్ జీ.బాలాజీ కడప జిల్లాలో ఎర్రగుంట్ల మరియు కమలాపురం వద్ద గనుల త్రవ్వకాలకు అక్రమంగా అనుమతులు పొంది వెనకేసుకొన్న మొత్తం రూ.142 కోట్లుగా తేల్చిన ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్, ఆ మొత్తానికి సరిపడే ఆస్తుల జప్తుకు సిద్దమవుతోంది.   అదేవిధంగా దాల్ మియా సిమెంట్స్ సంస్థకు 1000 ఎకరాలలో సున్నపురాయి గనుల తవ్వకానికి అనుమతులు మంజూరు చేసినందుకు గాను ఆ సంస్థ నుండి రఘురాం సిమెంట్స్ సంస్థ రెండు దఫాలుగా తీసుకొన్న రూ.95+55 కోట్లకు సరిపోఏ ఆస్తుల జప్తుకు ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ సిద్దం అవుతోంది. ప్రస్తుతం ఈ క్విడ్ ప్రో కేసులలో లబ్ది పొందినవారిని విచారించి, వారికి ఎక్కడెక్కడ ఆస్తులున్నవీ గుర్తించే పనిలో పడింది ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్. బహుశః త్వరలోనే ఆస్తుల జప్తు కార్యక్రమం మొదలవవచ్చును.

పంట రుణాల మాఫీపై బ్యాంకులు కొత్త మెలిక

  వ్యవసాయ రుణ మాఫీ వ్యవహారం జీడిపాకంలా సాగుతూనే ఉంది. ఈ వారంలో రూ.10,000 కోట్ల రుణాలను తీర్చివేయాలని భావించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి బ్యాంకర్లు చిన్న షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించినా స్వీకరిస్తామని, కానీ మిగిలిన రుణాలకు ప్రభుత్వ బాండ్లను తీసుకొని మొత్తం రుణాలు మాఫీ చేయలేమని బ్యాంకర్లు స్పష్టం చేసారు. అందుకోసం రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరమని చెప్పడంతో, ఇక చేసేదేమీ లేక ప్రభుత్వం దశల వారీగానే రుణాలు మాఫీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రుణమాఫీ వ్యవహారం సజావుగా పూర్తి చేసేందుకు ఒక ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయబోతోంది. దాని ద్వారానే వ్యవసాయ, డ్వాక్రా మరియు బంగారు నగలపై తీసుకొన్న రుణాలనట్టినీ మాఫీ చేయబోతునట్లు తాజా సమాచారం.

దుర్గమ్మ గుడిలో నగ్న చిత్రాలు చూసిన పోలీస్

  విజయవాడ ఇంద్రకీలాద్రి మీద శరన్నవరాత్రుల సందర్భంగా అపచారం జరిగింది. ఆ అపచారం చేసింది ఓ పోలీసు అధికారి. మూలా నక్షత్రం రోజున దుర్గమ్మవారి భక్తుల కోలాహలం మధ్య గుడివాడ సీసీఎస్ సీఐ ప్రసాద్ సెల్ ఫోన్‌లో నగ్న చిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడు. సీఐ ప్రసాద్ విధి నిర్వహణను పక్కన పెట్టి ఓ మూలన తాపీగా కూర్చుని తన సెల్ ఫోన్లో నగ్న చిత్రాలను చూస్తుండగా అక్కడే వున్న మీడియా కెమెరాలు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాయి. సీఐ చేసిన ఈ ఘనకార్యం బయటకి పొక్కడంతో అధికారులు ఆ సీఐని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశం మీద కృష్ణాజిల్లా ఎస్పీ విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారం మీద వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజయవాడ శాంతిభద్రతల డీసీపీని ఆయన ఆదేశించారు.

మూడు నెలల్లో జైళ్ళు క్లీన్

  తెలంగాణ జైళ్లను మూడు నెలల్లోగా అవినీతిరహితంగా మార్చివేస్తామని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్ తెలిపారు. దీని కోసం నాలుగు దశల్లో ఒక ప్రత్యేక విధానాన్ని అమలుపరచనున్నట్టు చెప్పారు. ఈ విధానం అమలయ్యేలోగా జైళ్లశాఖ సిబ్బంది తీరు మారకుంటే అందుకు తానే పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తానని వీకే సింగ్ ప్రకటించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి పురస్కరించుకుని మహాత్ముడి సాక్షిగా రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల జైళ్లలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించనున్నట్టు తెలిపారు. ప్రతిజ్ఞ, కౌన్సిలింగ్, హెచ్చరికలు ఇలా తొలి మూడు దశల్లోనూ సిబ్బంది తీరు మార్చుకోకుంటే, నాలుగో దశలో శాఖపరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సంస్కరణల ద్వారా తెలంగాణ జైళ్లను ఆధునీకరించి దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో తెలంగాణలోని అన్ని జైళ్లలో జామర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా జైళ్ళలో తేనున్న సంస్కరణలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

గోవిందుడు అందరివాడేలే: షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

  తారాగణం: రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కాశీ విశ్వనాథ్, సమీర్, కాదంబరి కిరణ్ తదితరులు.   సాంకేతికవర్గం: కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్ శంకర్ రాజా, రచన: పరుచూరి బ్రదర్స్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క‌ృష్ణవంశీ.   అటు రామ్‌చరణ్ అభిమానులు, ఇటు కృష్ణవంశీ అభిమానులు ఎంతో ఎదురుచూస్తు్న్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విడుదలైంది. ఇది ఒక కుటుంబ కథా చిత్రం. లండన్‌లో పుట్టి పెరిగిన ఒక యువకుడు తన వంశ మూలాలను వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక తెలుగు గ్రామానికి వచ్చి, విడిపోయిన తన కుటుంబాన్ని ఎలా కలిపాడన్నది కథాంశం. క‌ృష్ణవంశీ మార్కు ఫ్యామిలీ అంశాలతోపాటు, రామ్‌చరణ్ మార్క్ యాక్షన్ కూడా పుష్కలంగా వున్న సినిమా. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కలర్ ఫుల్‌గా వుంది. సరికొత్త రామ్‌చరణ్ కనిపించాడు. సినిమాలో అక్కడక్కడా పాత సినిమాల ఛాయలు వున్నప్పటికీ వాటిని కొత్తగా చూపించాడు. రామ్‌చరణ్, కాజల్‌జంట బాగుంది. వీళ్ళిద్దరి మధ్య విరసాలు, సరసాలు వర్కవుట్ అయ్యాయి. రామ్‌చరణ్ - ప్రకాష్ రాజ్, రామ్‌చరణ్ - జయసుధ, రామ్‌చరణ్ - శ్రీకాంత్‌ మధ్య సన్నివేశాలు బాగున్నాయి. ప్రకాష్ రాజ్ - జయసుధ మరోసారి తమ నట విశ్వరూపం చూపించారు. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాని చెప్పే కథతో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గోవిందుడు అందరివాడేలే. పేరుకు తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా వున్న ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా.

తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏపీలో ప్రతిష్టిస్తాం: చంద్రబాబు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాంక్ బండ్ మీద వున్న తెలుగు మహనీయుల విగ్రహాలను పీకేసీ లారీలో వేసి ఆంధ్రప్రదేశ్‌కి పంపుతానని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ వ్యాఖ్యలకు మంచి సమాధానం చెప్పారు. తెలుగుజాతి గర్వించదగ్గ తెలంగాణ మహనీయుల విగ్రహాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టిస్తామని అన్నారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను తొలగిస్తానని కేసీఆర్ అనడం సమంజసంగా లేదని చెప్పారు. మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు.   * రైతుల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి వుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణ మాఫీ చేసి తీరుతాం.   * నాదెళ్ళ సత్యకి ఆంధ్రప్రదేశ్ విధానాలు బాగా నచ్చాయి.   * ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏ మీడియాకీ మేం అభ్యంతరం తెలుపలేదు.   * రాజకీయ పార్టీలకు పేపర్లు, టీవీలు వుండటం సబబు కాదు.   * పార్టీల కోసం అవినీతి సొమ్ముతో పేపర్లు, టీవీలు పెట్టడమేమిటి? అలా పెట్టినా ఎంత దుష్ప్రచారం చేసినా ఎన్నికలలో గెలవలేకపోయారు.   * ఆంధ్ర ప్రదేశ్‌కి ఏ పరిశ్రమ వచ్చినా మేం సిద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తాం.   * కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై నేను స్పందించను.   * తెలంగాణలో అన్ని సమస్యలకూ నేనే కారణం అని చెప్పడం సరికాదు. ఎరువుల సమస్యకు కూడా నేనే కారణమా? ప్రజలు మాటలను నమ్మరు.. చేతలను నమ్ముతారు.

నన్ను మోసం చేశాడు బాబోయ్

  హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి ఓ యువతి వచ్చింది. తనను ఓ యువకుడు మోసం చేశాడు బాబోయ్ అని కంప్లయింట్ చేసి, అతని వివరాలు పోలీసులకు ఇచ్చింది. ఈ కథనం అంతా చదివిన తర్వాత ఎవరు మోసం చేశారు.. ఎవరు మోసపోయారు.. అసలు మోసం అంటే ఏమిటి? మోసం చేయకుండా నీతిగా వుండటం ఏమిటి అనే అంశాన్ని గౌరవనీయులైన పాఠకులే ఆలోచిస్తే వారికే సమాధానం దొరకుతుంది. ఇంతకీ పాయింట్‌లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన సదరు యువతి హైదరాబాద్‌లోని వనస్థలిపురంతో భర్త, ముగ్గురు పిల్లలతో నివసిస్తోంది. ఆమెకి ఓ మిస్డ్ కాల్ ద్వారా పంజాగుట్టలో కంప్యూటర్ కోర్సు చేస్తున్న భద్రాచలానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూ వుండేవారు. అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగీ పెరిగీ ఓ ఫైన్ మార్నింగ్ ఆమె తన భర్తని, ముగ్గురు పిల్లల్ని వదిలేసి ఆ యువకుడితో వెళ్ళిపోయింది. ఆమె, ఆ యువకుడు వారంరోజులు మిగతా ప్రపంచాన్ని మరచిపోయారు. వారం తర్వాత అతను ఆమెను ఓ లేడీస్ హాస్టల్లో వదిలి గాయబ్ అయిపోయాడు. దాంతో ఆమెకి అతను తనను మోసం చేశాడన్న విషయం అర్థమైపోయి అర్జెంటుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లయింట్ చేసింది.

టీ హోం మంత్రి నాయినికి అస్వస్థత

  తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అస్వస్థతకి గురయ్యారు. ఆయనను యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. నాయిని నరసింహారెడ్డి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. స్టీల్ మ్యాన్‌లా వుండే నాయిని నరసింహారెడ్డి అస్వస్థతకి గురయ్యారని, ఆస్పత్రిలో చేర్చారన్న వార్త తెలిసిన తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు హోంమంత్రిగా అద్భుతంగా పనిచేస్తున్న నాయినికి ఏమైందోనని బాధపడ్డారు. అయితే నాయిని ఆందోళన చెందాల్సినంత అనారోగ్యానికి గురి కాలేదని, స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యారని, తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

వైద్య సీట్లు భర్తీ చేయాలి... తల్లిదండ్రుల మొర

  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తో వారు మంగళవారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదుట ఆందోళన చేపట్టారు. మొత్తం సీట్లు భర్తీ చేయకపోతే కౌన్సెలింగ్ నిలిపివేయాలని, సీట్లు భర్తీ చేయని వైద్య కళాశాలల గుర్తింపు వెంటనే రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి సూచించారు. కాలేజీ యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్థులు బలి కావాలా అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పెట్టుబడులు కావాలిగానీ, విగ్రహాలు వద్దా?: కిషన్ రెడ్డి

  హైదరాబాద్‌కి సీమాంధ్ర ప్రాంత ప్రజల పెట్టుబడులు కావాలిగానీ, ఆ ప్రాంత మహనీయుల విగ్రహాలు ట్యాంక్‌బండ్ మీద మాత్రం వుండకూడదా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ప్రశ్నించారు. ఏదేమైనా, ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్ర ప్రాంత మహనీయుల విగ్రహాలను తొలగించాలనే కేసీఆర్ ఆలోచన సరికాదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను తొలగించాలని అనదం కేసీఆర్ రెచ్చగొట్టే ధోరణికి నిదర్శనమన్నారు. తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెట్టేందుకు అక్కడ బోలెడంత చోటుందని, అలాంటప్పుడు ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలను తొలగించాలని యోచించటం సరికాదని కేసీఆర్‌కు హితవు పలికారు.ఆంధ్రావారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నప్పుడు ఆ ప్రాంతం వారి విగ్రహాలు హైదరాబాద్‌లో ఉండటంలో తప్పేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఈరోజుతో ‘ఆర్కుట్’ బంద్

  గతంలో సోషల్ మీడియా రంగంలో ఒక ఊపు ఊపిన ‘ఆర్కుట్’కి సోష వచ్చింది. ఫేస్‌బుక్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆర్కుట్‌ని పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఈ వెబ్‌సైట్ సొంతదారు అయిన గూగుల్ దీన్ని ఫేస్‌బుక్‌కి దీటుగా అభివృద్ధి చేయాలని భావించింది. అయితే దీనికి అంత సీన్ లేకపోవడంతో పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో ఆర్కుట్‌ని మూసేయాలని గూగుల్ సంస్థ నిర్ణయించింది. సెప్టెంబర్ 30, 2014వ తేదీ నుంచి ఆర్కుట్ పనిచేయదు. ఈ సైట్‌లో తమకు సంబంధించిన సమాచారం, ఫొటోలను పొందాలని అనుకునేవారు మంగళవారం లోపు తమ అకౌంట్లోకి వెళ్ళి సమాచారం దాచుకోవచ్చు. ఈరోజు తర్వాత ఆర్కుట్ పేజీ ఓపెన్ కాదు. ఈ రోజు తర్వాత ఆర్కుట్‌లోని సమాచారం పొందాలని అనుకునేవారు గూగుల్‌ అకౌంట్ ద్వారా ప్రయత్నించాల్సి వుంటుంది. ఏది ఏమైనప్పటికీ గుడ్ బై ఆర్కుట్.

జయలలితకు మద్దతు.. కడుపు మాడ్చుకున్న తమిళ సినిమా

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభిశంసనకు గురయ్యారు. ఆమెకు కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించింది. అయితే తమిళనాడులోని చాలామంది ప్రజలు మాత్రం ఆమెకు అన్యాయంగా శిక్ష వేశారనే భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళ సినిమా రంగం జయలలితకు వచ్చిన కష్టాలు చూసి తల్లడిల్లిపోతోంది. అందుకే తమిళనాడులోని పలువురు చలనచిత్ర నటులు,టీవీ నటులు నిరాహార దీక్షకు దిగారు. జయలలితకు జైలు శిక్ష వేయడాన్ని నిరసిస్తూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. మరోవైపు తమిళనాడులో సినిమా థియేటర్ల బంద్‌కి ఎగ్జిబిటర్ల సంఘం పిలుపు ఇవ్వడంతో రాష్ట్రంలో థియేటర్లు మూతపడ్డాయి.