అమరావతి శంఖుస్థాపనశిలాఫలకంపై ఉండే పేర్లు ఇవే

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన శిలాఫలకం మీద మొత్తం 16మంది పేర్లు చెక్కబడ్డాయి. వాటిలో అన్నిటి కంటే పైవరుసలో ప్రధాని నరేంద్రమోడి, గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్లు, ఆ క్రిందన ఎడమవైపున వరుసగా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌,నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,బండారు దత్తాత్రేయ,అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న జపాన్ మంత్రి ఇసుకే టకాచీ పేర్లు ఈ శిలాఫలకంపై ఉంటాయి. కుడివైపున వరుసగా అశోక్‌ గజపతిరాజు,తమిళనాడు గవర్నర్ రోశయ్య, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్ బాదల్ ,సుప్రీంకోర్టు జడ్జి ఎన్‌.వి. రమణ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిలపేర్లు ఉంటాయి.

అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై కేసీఆర్ పేరు

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా చేర్చారు, అయితే రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ పేరును ఏపీ కొత్త రాజధాని శంకుస్థాపన శిలాఫలకంపై ఎలా చేర్చుతారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు, టీడీపీ నేతలు కూడా కేసీఆర్ పేరును చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది, అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ రాష్ట్ర విడిపోవడానికి కారణమైన కేసీఆర్ పేరును శిలాఫలకంపై ఎలా చేరుస్తారంటూ కొందరు టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు, దీనిపై పార్టీ హైకమాండ్ ను నేరుగా ప్రశ్నించినట్లు కూడా తెలిసింది, అయితే ప్రోటోకాల్ ప్రకారమే కేసీఆర్ పేరును చేర్చామని, గవర్నర్లు, ముఖ్యమంత్రుల పేర్లు చేర్చడం ఆనవాయితీ అని చెప్పారట.

అమరావతి శంకుస్థాపన షెడ్యూల్ ఇదే

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమ షెడ్యూల్ ను విడుదల చేసింది, ప్రధాని నరేంద్రమోడీతోపాటు దేశ విదేశీ ప్రముఖులు హాజరయ్యే అమరావతి ఫౌండేషన్ మెయిన్ ప్రోగ్రాం మధ్యాహ్నం 12గంటల తర్వాతే మొదలుకానుంది, మధ్యాహ్నం పన్నెండున్నరకి ప్రధాన వేదిక దగ్గరకు చేరుకోనున్న మోడీ... 12.35కి అమరావతి గ్యాలరీని సందర్శిస్తారు, అనంతరం 12.43 గంటల్లోపే రాజధానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత 12.45కి ప్రధాన వేదిక దగ్గరకు చేరుకుంటారు, 12.48 నుంచి 12.50 వరకు ‘మా తెలుగుతల్లి‘ గీతాలాపన, మధ్యాహ్నం 12.50 నుంచి 12.53 వరకు జపాన్ మంత్రి తకాగి స్పీచ్, 12.53 నుంచి 12.56 వరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, 12.56 నుంచి ఒంటి గంట వరకూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తారు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఒంటి గంటా 11 నిమిషాల వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు, చివరిగా ఒంటి గంటా 11 నిమిషాల నుంచి 143 వరకు ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు

యూపీ సర్కారుతో అమితాబ్ కి తలనొప్పులు.. ముందుగానే మేల్కొన్నారు

  ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు రూ 50,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా విమర్శలు తలెత్తాయి. స్వాతంత్ర్య సమరయోధుల కంటే ఈ పెన్షన్ భారీగా ఉండటం.. బిగ్ బీ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్న నేపథ్యంలో ఇంత భారీ పెన్షన్ ను కేటాయించడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇంకా వివాదాస్పదం అవుతుందని గమనించి బిగ్ బీ ముందు జాగ్రత్తగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తనకు.. తన కొడుకు అభిషేక్ బచ్చన్, భార్య జయా బచ్చన్ కు కేటాయించిన పెన్షన్ మొత్తాన్ని పేదలకు ఉపయోగించాలని.. తమ కుటుంబ కోరిక కూడా ఇదేనని అన్నారు. దీనిలో భాగంగా యూపీ సర్కారుకు ఓలేఖ కూడా రాయనున్నారట. మొత్తానికి బిగ్ బీ తొందరగానే మేల్కొని సమస్య జఠిలం కాకుండా మంచి నిర్ణయమే తీసుకున్నారు. కాగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం క్రీడా, కళా రంగాలలో విశేషకృషి చేసిన వారిని గౌరవించేందుకు "యష్ భారతి సమ్మాన్" అనే పెన్షన్ పధకం ప్రారంభించింది. దీనిలో భాగంగానే బిగ్ బీ లాంటి గొప్ప నటులు తమ ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమని అందుకే అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లను ఈ పెన్షన్ పధకానికి ఎంపిక చేసినట్లుగా రాష్ట్ర సాంస్క్రతిక శాఖ ప్రకటించింది.

తలసాని వ్యవహారంతో నాకు సంబంధం లేదు.. భన్వర్ లాల్

  తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుండి శాసనసభకు ఎంపికయి ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోకి మారి మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తలసాని రాజీడ్రామా సమస్య మాత్రం ఇంకా ఓ కొలిక్కి రానే రాలేదు. తాను రాజీనామా చేశానని చెపుతున్నా దానికి సంబంధించి స్పీకర్ కూడా తగిన చర్యలు తీసుకోకపోవడంతో.. ఈ విషయంపై కోర్టులో విచారణ జరిపినా కోర్టు కూడా తాము చేయడానికి ఏం లేదని.. కానీ ఈ విషయంలో స్పీకర్ త్వరగా ఏదో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కూడా తనకు ఈ విషయంతో సంబంధం లేదని వ్యాఖ్యనించారు. భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల కమిషనర్ నసీం జైదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుశాతం ఓట్ల తొలగింపు జరిగింది.. నిజామాబాద్ జిల్లాలో 26 శాతం ఓట్ల తొలగింపు జరిగింది.. ఈ ఓట్ల తొలగింపుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో తలసాని రాజీనామా గురించి అడుగగా ఈ వ్యవహారం తన పరిధిలో లేదని.. తాను కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ గా మాత్రమే ఉన్నానని.. తాను ఏపీకి చెందిన వాడినని సమాధానమిచ్చారు.

అమరావతి నిర్మాణంపై దిగ్విజయ్ అనుమానాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టారు, నయారాయపూర్, ఛండీగఢ్, గాంధీనగర్,  అహ్మదాబాద్, డెహ్రాడూన్ వంటి కేపిటల్ సిటీస్ ను స్వదేశీ కంపెనీలే నిర్మించాయని, కానీ చంద్రబాబు మాత్రం విదేశీ కంపెనీల వెంటపడుతున్నారని మండిపడ్డారు, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని 99ఏళ్ల లీజుకు విదేశీ కంపెనీలకు కట్టబెట్టడం దారుణమన్న దిగ్విజయ్... అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వస్తాయని అనుకోవడం లేదన్నారు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ మాత్రమే పోరాటం చేస్తోందన్న డిగ్గీ.... చంద్రబాబు, జగన్ లు ప్రధాని మోడీని ప్రశ్నించడం లేదన్నారు.

చంద్రబాబు పలక ప్రచారం.. చౌకబారుగా ఉందని విమర్శలు

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వంహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రచారం ఎప్పుడో మొదలైంది. దీనిలో భాగంగానే "మన అమరావతి - మన రాజధాని" పేరుతో వీడియో తీసి వాటి ద్వారా కూడా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. అయితే అక్కడితో ఆగకుండా వినూత్నంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు చంద్రబాబు. అది అలా ఇలా కూడా కాదు పలకతో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు తన కుటుంబసభ్యులు ఆయన సతీమణి, కొడుకు లోకేశ్, కోడలు బ్రహ్మణి, ఆఖరికి మనవడు దేవాన్ష్ తో సహా అందరిని ఈ ప్రచారంలోకి లాగారు. అంతా బానే ఉన్నా ఈ ప్రచారం పై కొంత మంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పలకలతో చేస్తున్న ఈ ప్రచారం అత్యంత చౌకబారుగా ఉందని విమర్సిస్తున్నారు. అయితే మనవడు దేవాన్ష్, కోడలు స్మార్ట్ ఫోన్ తో ప్రచారం బాగుంది కానీ పలకలతోనే మరీ ఇబ్బందికరంగా ఉందని అటు ప్రతిపక్ష నేతలే కాదు.. పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు పలకల ప్రచారం ప్లాన్ పెద్దగా వర్కవుట్ అయినట్టు కనిపించడంలేదు.

తరతరాలు గుర్తుండిపోయేలా భోజనాలు

  అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తరలివచ్చే అతిథులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి పరిటాల సునీత ప్రకటించారు, అతిథులు లోపలికి వచ్చే సమయంలోనే భోజన ప్యాకెట్లను అందిస్తామని, పులిహోరా, చక్రపొంగలి, పెరుగన్నం, తాపేశ్వరం కాజా, అరటి పండు, మజ్జిగ, వాటర్ బాటిల్ ఇవ్వడంతోపాటు ప్రతి ఒక్కరూ భోజనం చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు, శంకుస్థాపన కార్యక్రమానికి తరలివచ్చే అతిథులకు కొన్నిరోజులపాటు గుర్తుండిపోయేలా భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, సుమారు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు సునీత తెలిపారు, మంత్రులు కిమిడి మృణాళిని, పీతల సుజాతలతో కలిసి తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో వంటశాలను పరిశీలించిన సునీత... అక్కడ వండిన ఫుడ్ ఐటెమ్స్ శాంపిల్స్ ను రుచిచూసి పరిశీలించారు

హెలికాప్టర్ ద్వారా మట్టి, నీళ్లు చల్లిన చంద్రబాబు

  మన రాజధాని, మన ఊరి మట్టి అంటూ ప్రజల్లో సెంటిమెంట్ నింపుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని, జలాలను హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రాంతంలో చల్లారు, శంకుస్థాపన ఏర్పాట్లను హెలికాప్టర్ నుంచి పరిశీలించిన చంద్రబాబు... మట్టి, పుణ్యజలాలను చల్లే కార్యక్రమాన్ని కూడా పూర్తిచేశారు, వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టి, జలాలకు ముందుగా పూజలు నిర్వహించిన చంద్రబాబు... అనంతరం హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రాంతమంతటా చల్లారు, ఈ కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు

అమరావతి కోసం ఏసీ బస్సులను పంపిన రజనీ

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న అతిరథ మహారథులకు దేశ విదేశీ ప్రముఖులు, వీవీఐపీలను వేదిక వద్దకు తరలించేందుకు ఎయిర్ పోర్ట్స్ నుంచి ఖరీదైన కార్లను ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రధాన వేదిక దగ్గరకు చేరుకునేందుకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా... విమానాశ్రయాల నుంచి ఏసీ బస్సులతోపాటు బెంజ్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ లాంటి అతి ఖరీదైన కార్లను సమకూర్చుతున్నారు, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే పలు ఏసీ బస్సులను ఏర్పాటు చేయగా, విజయవాడలోని పలువురు ప్రముఖులు... తమ విలువైన కార్లను వీవీఐపీల రవాణా కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం రెండు ఏసీ బస్సులను పంపించినట్లు తెలిసింది.

వరాల విషయంలో చంద్రబాబు కంటే కేసీఆరే బెస్ట్ అంట..

ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అభివృద్ధిలో ఎంత కృషి చేస్తున్నారో అందరి తెలిసిందే. ఎవరి పాలన వారిది అయినప్పటికీ ఇద్దరి ఆశయం మాత్రం ఒక్కటే రాష్ట్రాభివృద్ది. అలాంటప్పుడు సహజంగానే ఇద్దరి పాలనను పోల్చి చూస్తారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ మిగులు రాష్ట్రంగా మిగలగా.. ఆంధ్రా మాత్రం ఆర్ధిక లోటుతో మిగిలింది. దీంతో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వరాల మీద వరాలు కురిపించేవారు. కానీ చంద్రబాబు పరిస్థితి వేరు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల ప్రజల్లో చంద్రబాబు కంటే కేసీఆరే ఎక్కువ వరాలు ఇస్తాడు అన్న ముద్ర పడిపోయింది. ఇది మరోసారి నిజం చేశారు ఈ తెలుగు చంద్రులు. ఈ రోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పోలీసులకు వరాల జల్లు కురిపించారు. పోలీసులకు ప్రోత్సాహాకాలు, ప్రమోషన్లు ఇస్తానని చెప్పారు. అంతటితో ఆగకుండా ఎస్. ఐ ఆపై ఉన్నతాధికారులకు వారు విధులు నిర్వహించే చోట ఇళ్ల స్థలాలను కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు వాటి రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయింపు ఇస్తున్నామని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులకు 35 శాతం అలవెన్స్ లను ప్రకటించారు. పోలీసుల యూనిఫామ్ వార్షిక అలవెన్సును సైతం రూ.3500 నుంచి రూ.7వేల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు విజయవాలో పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన కేసీఆర్ లాగ వరాలైతే ఏం కురిపించలేదు కాని నాలుగు మాటలు చెప్పి పోలీసు సంక్షేమ నిధికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కేసీఆర్ ఇచ్చిన వరాలను చూసి ఏపీ పోలీసులు చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల వరాల మీద ఓ ఏపీ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ఎంతైనా కేసీఆర్.. కేసీఆరే... చంద్రబాబు.. చంద్రబాబే అని అన్నారట.

అమరావతి కోసం డబుల్ బెడ్ రూం వాయిదా

  ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవాన్ని సైతం వాయిదా వేసుకున్నారు, హైదరాబాద్ సనత్ నగర్ ఐడీహెచ్ కాలనీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను షెడ్యూల్ ప్రకారం ప్రారంభించాల్సి ఉన్నా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలని డిసైడైన కేసీఆర్... ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు, ప్రధాని మోడీతోపాటు పలువురు దేశ విదేశీ ప్రముఖులు హాజరుకానుండటం, పైగా చంద్రబాబే స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించిన నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు, తెలంగాణ సంస్కృతిమంచిదన్న కేసీఆర్... మర్యాద ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతోనే ఏపీ రాజధాని శంకుస్థాపనకు వెళుతున్నానని తెలిపారు, అయితే రోడ్డుమార్గంలో వెళ్లాలని అనుకున్నా... అధికారుల సూచన మేరకు హెలికాప్టర్ లోనే అమరావతికి వెళ్లనున్నారు

రామోజీ, రాధాకృష్ణతో దిగ్విజయ్ మీటింగ్?

  ఈమధ్య పొలిటికల్ లీడర్స్ అంతా మీడియా అధినేతల చుట్టూ తిరుగుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావును వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడం సంచలనం సృష్టించగా, తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ .... రామోజీతో సమావేశం కావడంతో ఆసక్తిరేపుతోంది, అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కూడా కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. మర్యాదపూర్వకంగానే సమావేశమైనట్లు  చెబుతున్నా, మీడియా అధినేతలను ప్రసన్నం చేసుకోవడానికే కలిసినట్లు టాక్ వినిపిస్తోంది, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే మీడియా అండ ఉండాలని గుర్తించిన డిగ్గీరాజా... ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన సీబీఐ

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించినట్లు ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక హిందూ సంచలన వార్తను ప్రచురించింది, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఓ కాంటాక్టుకు సంబంధించిన విషయంలో ఆయనను ప్రశ్నించినట్లు తెలిపింది, 2006లో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ ఆస్పత్రుల భవన నిర్మాణ కాంట్రాక్టును... నేషనల్ బిల్డింగ్ నిర్మాణ సంస్థకు కాకుండా ఏపీ ఫిషరీష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఇవ్వడంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించినట్లు హిందూ పత్రిక తెలిపింది. నిర్మాణాల్లో నాణ్యత లేదని గుర్తించిన ఈఎస్ఐ కార్పొరేషన్... 2007లో విచారణకు ఆదేశించింది. ఐఐటీ నిపుణుల పరిశీలన మేరకు భవన నిర్మాణాలు ప్రమాణికంగా లేవని, దాదాపు 5కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని నివేదిక ఇచ్చింది. ఐఐటీ నిపుణుల రిపోర్ట్ ఆధారంగా 2011లో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోన్న సీబీఐ... కార్మికశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించింది, తాజాగా ఆనాటి కేంద్ర మంత్రి కేసీఆర్ తోపాటు ఆయన వ్యక్తిగత అధికారులను కూడా విచారించినట్లు హిందూ పత్రిక కథనం ప్రచురించింది.

ఏపీ శంకుస్థాపన.. జయలలిత కూడా ఆ లిస్ట్ లో

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ నేతలు చాలా బిజీగా ఉన్నారు. ఈకార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ.. సింగపూర్, జపాన్ ప్రధానులతో పాటు పలువురు ప్రముఖులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆహ్వానించారు. అయితే చంద్రబాబు తాను పిలవడానికి అయితే పిలిచారు కాని కొంతమంది మాత్రం తమ బిజీ షెడ్యూల్ తో రావట్లేదని చెపుతున్నారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని..  బాబుకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అయితే అఖరిలో కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నానని ట్విస్ట్ ఇచ్చారు.

శంకుస్థాపనకు వద్దన్న కాంగ్రెస్ పార్టీ.. రాజీనామా చేసి మరీ వెళుతున్న మాజీ ఎమ్మెల్యే

రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం అందరికి ఆహ్వాన్వాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు అందరికి ఆహ్వానాలు అందించినా కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రం కార్యక్రమానికి దూరంగా ఉండాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రతిపక్షనేత అయిన జగన్ తనకు ఆహ్వానం అందించవద్దని, తనని ఆహ్వానించినా రానని ముందే చెప్పారు. దాంతో అసలు పార్టీ అధినేతే వెళ్లనప్పుడు పార్టీ నేతలు మాత్రం ఎందుకు వెళతారు వాళ్లు కూడా వెళ్లరు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్లాలా వద్దా అన్న సంగ్ధిగ్ధంలో పడింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళదామని ఏపీ కాంగ్రెస్ నేత అయిన రఘువీరా రెడ్డిని అడగగా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోడీని కలిసి మాట్లాడే అవకాశం ఇస్తే వెళదామని.. లేకపోతే వద్దని చెప్పగా కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అయితే అందరూ నేతలు బానే ఉన్నా ఒక్క కాంగ్రెస్ నేత మాత్రం శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళొద్దన్నారని రాజీనామానే చేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ నాయకుడు చేసింది నిజమే. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లొద్దని పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చక రాజీనామా చేశారు. తన నియోజక వర్గం తరుపున తను వెళ్లాలని నిశ్చయించుకుని పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంతకీ తను కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చక రాజీనామా చేశారా లేక పార్టీ మారే యోచనలో రాజీనామా చేశారా అన్నది సందేహం.