చంద్రబాబు నా సోదురుడు... ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నా.. ఉమాభారతి

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు నీటి ప్రాజెక్టుల విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఉమా భారతి మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నా సోదురుడు లాంటివాడని ఆమె అన్నారు. అంతేకాదు చంద్రబాబు ఫాస్ట్‌ ట్రాక్‌ సీఎం.. ఆయన పని చేసే విధానం తనకెంతో ఇష్టమని.. తాను అనుకున్నది సాధిస్తారని.. తాను మధ్యప్రదేశ్‌ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సీఎంగా లేరని, కానీ తాను ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నానని ఉమాభారతి తెలిపారు. 2018లోగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

టీఎంసీ కార్యకర్తపై చేయి చేసుకున్న రూపా గంగూలీ.. కేసు నమోదు

  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బీజేపీ మహిళా నేత రూపా గంగూలీ.. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తపై చేయిచేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం.. రూపా గంగూలీ హౌరా నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు ఎన్నికలు ప్రారంభమైన సందర్బంగా ఓటింగ్ సరళిని పరిశీలించేదుకు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన ఆమెకు... తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన రూపా గంగూలీ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. అంతేకాదు.. సదరు వ్యక్తిని తోసేశారు. దీంతో అక్కడ కలకలం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగి పోలింగ్ బూత్ వద్ద ఘర్ణణకు కారణమై, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రూపాపై కేసు నమోదు చేశారు. కాగా ఉత్తర 24 పరగణాలు, బిధాన్‌నగర్‌, హౌరా జిల్లాల్లోని 49 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

తిరువరూర్ నుండి కరుణానిధి నామినేషన్.. ఆ కోరిక నెవరేరాలని..!

  త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల సందడి నెలకొంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆర్కే నగర్ నియోజక వర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. దీనిలో భాగంగానే నామినేషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా డీఎంకే అధినేత కరుణానిధి కూడా తిరువరూర్ నియోజక వర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్నోసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కరుణానిధి ఈసారి ఎన్నికల్లో కూడా తన పార్టీని విజయ తీరాలకు చేర్చి.... దేశంలోనే అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేతగా రికార్డు నెలకొల్పాలని చూస్తున్నారు. మరి ఈసారి ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందో.. కరుణానిధి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

వైసీపీ నుండి మరో ఎమ్మెల్యే.. కార్యకర్తల ఒత్తిడి మేరకే

  వైసీపీ పార్టీ నుండి మరో ఎమ్మెల్యే టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.  అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సర్వేశ్వరరావు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. సర్వేశ్వరరావు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలకు స్పందించి... తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం ఉందని.. కార్యకర్తల ఒత్తిడి మేరకే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తాను అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నానని తెలిపారు. ఈ నెల 28న టీడీపీలో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ సంక్షోభంపై పార్లమెంట్లో రచ్చ..

  పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అలా ప్రారంభమయ్యాయో లేదో.. సభ రణరగంగా మారింది. ప్రతిపక్షాలు సమావేశాలు ప్రారంభంకావడానికి ముందు నుండి ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంపై చర్చించాలన్న వ్యూహంతోనే సభలోకి అడుగుపెట్టాయి.  ఈనేపథ్యంలో.. సభ ప్రారంభంకాగనే ఉత్త‌రాఖండ్‌లో రాజ‌కీయ సంక్షోభంపై చ‌ర్చకు పట్టుబట్టాయి. మరోవైపు అధికార పక్షం.. ఈ అంశం కోర్టులో ఉన్నందున దానిపై చర్చించడం సాధ్యం కాదని.. కోర్టులో ఉన్న అంశంపై చర్చించడం సబ్‌ జ్యుడిస్‌ అవుతుందంటూ చర్చను తిరస్కరించడంతో  ప్ర‌తిప‌క్షాలు మండిప‌డ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ కూడా మొద‌టి రోజంతా ఉత్తరాఖండ్‌ అంశంపైనే దృష్టి కేంద్రీకరిస్తామని డిమాండ్ చేశారు. ఆందోళనలమధ్యే  రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ హ‌మీద్ అన్సారీ ఈరోజు మధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు సభను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రావెల సుశీల్ కేసులో మహిళ ట్విస్ట్..సుశీల్ ఎవరో కూడా తెలియదు..

  మంత్రి రావెల్ కిషోర్ బాబు తనయుడు రావెల సుశీల్.. ఓ ముస్లిం మహిళను చెయ్యి పట్టుకొని కారలోకి లాగబోయాడంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్ ను పోలీసు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు పోలీసులు సుశీల్ పై పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసింది. తనపై తప్పుడు అభియోగాలు మోపారని సుశీల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దీనిపై హైకోర్టు విచారించగా.. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళ, కోర్టుకు వచ్చి రావెల కిశోర్ ఎవరో తనకు తెలియదని వాంగ్మూలం ఇవ్వడంతో, సరైన సాక్ష్యాలు లేని కారణంగా సుశీల్ పై ఆరోపణలను తొలగిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది.

తెలంగాణ కాంగ్రెస్ నుండి మరో రెండు వికెట్లు డౌన్.. వివక్ష చూపుతున్నారు..

ఏపీలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. అటు ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అవుతుంటే.. ఇక్కడ తెలంగాణలోకూడా ప్రతిపక్ష పార్టీనుండి అధికారపార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నుండి పలువురు టీఆర్ఎస్ లోకి చేరగా మరో రెండు వికెట్లు పడనున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆయనతోపాటు మెదక్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫారూక్‌హుసేన్‌ కూడా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. అజయ్‌తో కలిపి కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కారెక్కడంతో శాసనసభలో కాంగ్రెస్‌ బలం 13కు పడిపోనుంది.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు తనపట్ల వివక్ష చూపారని, అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే తెరాసలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విమానంలో నన్ను పీకనులిమి చంపబోయాడు... కన్నయ్య

  ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న కన్నయ్య కుమార్ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. తనను విమానంలో తోటి ప్రయాణికుడు పీకనులిమి చంపబోయాడంటూ కన్నయ్య కుమార్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. అంతేకాదు నాపై దాడి చేసిన వారిపై విమాన సిబ్బంది ఏ చర్యలూ తీసుకోలేదు అని కూడా చెప్పాడు. కాగా దీనిపై విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ప్రభుత్వం  దాడి చేసిన వ్యక్తిని పుణె టీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగి మనస్ జ్యోతి డేక(33)గా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు.   అయితే దీనిపై మనస్ జ్యోతి మాత్రం.. పబ్లిసిటీ కోసం కన్హయ్య ఇదంతా చేస్తున్నాడని.. అసలు తనెవరో కాదు నాకు తెలియదు.. కాలు నొప్పి నుంచి ఉపశమనం కోసం కదలగా తన చేయి కన్హయ్య మెడను రాసుకుంది.. దానికే ఇంతటి నేరం మోపడం సబబు కాదని ఆరోపిస్తున్నాడు.

ఒబామా మూడు హెలికాప్టర్లు రద్దు..

  బరాక్ ఒబామా బ్రిటన్ పర్యటన చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన నేపథ్యంలో బబామా సెక్యూరిటీగా ఆరు చాపర్లు ఉండగా వాటిలో కేవలం మూడింటికి మాత్రమే అనుమతిచ్చారంట బ్రిటన్ రాణి ఎలిజబెత్. 2011 లో ఒబామా ఎలిజబెత్ రాణిని కలవడానికి వచ్చినప్పుడు ఆరు హెలికాఫ్టర్లు ల్యాండ్ కాగా.. దానికి ఆ భవంతిలోని పూల మొక్కలు, గడ్డి నాశనమైయ్యాయట. అందకు గాను రాణిగారు ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో ఇప్పుడు ఒబామా ఆమె నివాసానికి హెలికాప్టర్ లో రానుండగా, 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ ప్రాంగణంలోకి మూడు హెలికాప్టర్లను మాత్రమే అనుమతించాలని ఆమె నిర్ణయించినట్టు 'డైలీ ఎక్స్ ప్రెస్' వెల్లడించింది. మరి రాణిగారి ఆజ్ఞను ఒబామా పాటిస్తారో లేదో చూడాలి..

మాల్యాకు బ్రిటన్ పౌరసత్వం.. అందుకే లైట్ తీసుకుంటున్నాడా..?

  బ్యాంకులకు కోట్లాది రూపాయలు టోకరా వేసి విదేశాల్లో ఉన్న విజయమాల్యా పాస్ పోర్ట్ రద్దు చేస్తూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈడీ విచారణకు రావాలని.. లేదంటే పాస్ పోర్ట్ ను నాలుగు వారాలపాటు సస్పెండ్ చేస్తామని విదేశాంగ శాఖ హెచ్చరించినా మాల్యా మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుండటంతో.. చేసేది లేక మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసింది. అయితే మాల్యా ఇలా వ్యవహరించడానికి గల కారణాలు వేరే ఉన్నాయి అంటున్నారు అధికారులు. ఆ దిశగా దర్యాప్తు చేయగా.. అతనికి బ్రిటన్ పౌరసత్వం ఉందన్న సంచలన విషయం బయటపడింది. 1992 నుండి మాల్యాకు బ్రిటన్ పౌరసత్వం ఉండంటంతో.. ఇక్కడ పాస్ పోర్ట్ రద్దు వల్ల వచ్చే నష్టమేమీ లేదన్న కారణంగానే ఇలా వ్యవహరిస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఇక బ్రిటన్ పౌరసత్వమున్న మాల్యాను ఇకపై దేశానికి రప్పించడం భారత అధికారులకు సాధ్యం కాకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది.

జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ హ్యాక్..పేజీలో సన్నీ అసభ్యకర చిత్రం

ఎన్ని నివారణాచర్యలు చేపడుతున్నా హ్యాకర్లను ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తూనే ఉన్నారు. రైల్వే, ఐబీ. పోలీస్, రక్షణ ఇలా కేంద్ర ప్రభుత్వం వెబ్‌సైట్లన్నింటిని జల్లెడ పట్టిన కేటుగాళ్లు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సైట్‌పై ఫోకస్ చేశారు. జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో చెత్తను తరలించేందుకు ఉపయోగించే వాహనాల రాకపోకలను గమనించే పేజీని ఓపెన్ చేయగా దానిలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ నగ్న చిత్రం దర్శనమిచ్చింది. దీంతో సైట్ హ్యాకింగ్‌కు గురైందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.

సోలార్ పవర్ తో పసిఫిక్ ను దాటేసింది..!

  పూర్తి సౌరశక్తితో నడిచే విమానం సోలార్ ఇంపల్స్ సక్సెస్ ఫుల్ గా ప్రపంచాన్ని చుడుతోంది. ఈ క్రమంలో, 56 గంటలపాటు ఏకధాటిగా ప్రయాణించి, పసిఫిక్ సముద్రాన్ని దాటి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ను చేరుకుంది. ఈ విషయాన్ని పైలట్ బెర్టాండ్ పికార్డ్ ప్రకటించాడు. విమానాలకు వాడే ఇంధనం చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా అందుకోసం సహజ వనరులను ఖర్చు చేయక తప్పని పరిస్థితి. దీనికి పరిష్కారం కనుక్కునే దిశగా సైంటిస్టులు చేసిన ప్రయోగాల ఫలితమే సోలార్ ఇంపల్స్. ఈ విమానం సౌరశక్తితో నడుస్తూ ప్రపంచాన్ని చుడుతోంది. ఇప్పటికి ఇద్దరు మాత్రమే ప్రయాణించగల ఈ విమానాన్ని, భవిష్యత్తులో భారీ స్థాయి ప్రయాణ సాధనంగా మార్చడానికి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విమానాన్ని శబ్ద, వాయి కాలుష్య రహితంగా తయారుచేయడం విశేషం. సోలార్ ఇంపల్స్ తన ప్రయాణాన్ని 2015లో అబుదాబీ నుంచి స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఒమన్, భారత్, మయన్మార్, చైనా లాంటి దేశాల్లో ఆగుతూ వచ్చింది. దేశాల మీదగా ప్రయాణించడం గొప్ప కానప్పటికీ, ప్రపంచంలో అతి పెద్ద మహా సముద్రమైన పసిఫిక్ సముద్రాన్ని దాటడం సోలార్ ఇంపల్స్ ఘనతగా చెప్పచ్చు.

బీహార్లో భారీ అగ్ని ప్రమాదం..వెయ్యి ఇళ్లకు అంటుకున్న నిప్పు..!

  బీహార్లోని దర్భంగా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురి ప్రాణాలు అగ్నికి ఆహుతి కాగా, వేలాది ఇళ్లు అగ్గిపాలయ్యాయి. గ్రామాలకు గ్రామాలే అగ్ని వ్యాపించడంతో, ఈ పెను ప్రమాదం పెద్దదిగా మారిపోయింది. అగ్నిని ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది చెమటోడుస్తున్నారు. బీహార్లో అగ్నిప్రమాదం జరగడం ఈ నెలలో ఇది మూడోసారి. వారం క్రితమే ఒక ఫంక్షన్లో అగ్నిప్రమాదం జరిగి 12 మంది మృత్యువుపాలయ్యారు. బీహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 4లక్షలు పరిహారంగా ప్రకటించింది. ఏప్రిల్ 16 న జరిగిన మరో అగ్ని ప్రమాదంలో పెట్రోల్ బంక్ పేలిపోయింది. దగ్గర్లో మనుషులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఇప్పుడు బీహార్ ప్రభుత్వం, అగ్నిప్రమాదాలు నివారించడానికి ఏం చేయలా అని ఆలోచనలో పడింది.  

సెంచరీ కొట్టి ఓడిపోయిన కోహ్లీ..!

  కోహ్లీ సూపర్ ఫాం కంటిన్యూ అవుతోంది. ఈరోజు గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో 63 బంతుల్లోనే తన తొలి సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీకి టి20 ఫార్మాట్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్, కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. గేల్ లేకపోవడంతో, వాట్సన్ తో కోహ్లీ ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. వాట్సన్ త్వరగా అవుటైనా, కోహ్లీ మాత్రం అద్భుతమైన స్ట్రోక ప్లేతో అలరించాడు. వీలు చిక్కనప్పుడల్లా సింగిల్స్, డబుల్స్ తీస్తూనే చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. కోహ్లీ మొదటి 50 పరుగులు చేయడానికి 40 బంతులు పడితే, తర్వాతి 50 చేయడానికి కేవలం 23 పరుగులే తీసుకున్నాడు. చాలా కాలం తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 51 పరుగులతో తన తొలి ఐపిఎల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు డ్వేన్ స్మిత్ (32, 21 బంతుల్లో), బ్రెండన్ మెకల్లమ్ (42, 24 బంతుల్లో) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. దాంతో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది గుజరాత్ లయన్స్. దినేష్ కార్తీక్ (50, 39 బంతుల్లో) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బ్యాటింగ్ అద్భుతంగా సాగడంతో, మూడు బంతులుండగానే, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది గుజరాత్ లయన్స్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీకి లభించింది.

మయన్మార్ లో వడగళ్ల వాన, 8 మంది మృతి..!

  గత కొన్ని రోజులుగా ఎండలతో మలమలా మాడిపోయిన మయన్మార్ కు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వడగళ్ల వాన, ఈదురుగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానకు ఎనిమిది మంది మృతి చెందారు. దాదాపు గోల్ఫ్ బంతి పరిమాణంలో వడగళ్లు పడుతుండటంలో ప్రజలు బయటికెళ్లడానికి కూడా భయభ్రాంతులౌతున్నారు. వడగళ్ల దెబ్బకు ఇళ్లన్నీ దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 7500 ఇళ్లకు వడదెబ్బ తాకిడి తగిలిందని అధికారుల అంచనా. గత మూడు నాలుగు రోజుల క్రితమే 40, 50 డిగ్రీల ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు ఇప్పుడు వడగళ్లు ప్రాణసంకటంగా మారాయి. ఇళ్లు పూర్తిగా దెబ్బ తిన్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

పుట్టిన రోజున పిల్లలతో క్రికెట్ ఆడిన సచిన్..!

  సచిన్ క్రికెట్ నుంచి రిటైరై మూడేళ్లయినా, ఇంకా ఆడుతున్నాడు అనే భావనలోనే అతని ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మ్యాచ్ జరిగినా కూడా సచిన్ సచిన్ అనే నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. భారత క్రికెట్ అభిమానులకు సచిన్ అనే పేరుతో అంత అనుబంధం ఉంది. ఏప్రిల్ 24 సచిన్ పుట్టినరోజు. ఈరోజుతో 43వ ఏట అడుగుపెడుతున్న సచిన్ తన పుట్టిన రోజును పిల్లల మధ్య జరుపుకున్నాడు. ముంబైలోని ఎమ్ఐజీ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ లో మేక్ ఎ విష్ ఫౌండేషన్ కోరిక మేరకు, పిల్లలతో కలిసి చిన్న క్రికెట్ మ్యాచ్ ఆడించాడు సచిన్. తనతో పిల్లలు ఆడతున్న వీడియోను తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు మాస్టర్. 2013 నవంబర్ న సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 200 టెస్టుల్లో 15921 పరుగులు, 463 వన్డేలాడి 18426 పరుగులు చేశాడు సచిన్. 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్ సచిన్ మాత్రమే.

విజయ్ మాల్యా పాస్ పోర్ట్ ను రద్దు చేసిన ప్రభుత్వం ..!

  విజయ్ మాల్యాను భారత్ కు రప్పించే ప్రయత్నంలో మెల్లమెల్లగా ఉచ్చుబిగిస్తోంది భారత ప్రభుత్వం. దాదాపు 9 వేల కోట్లకు ఎగనామం పెట్టి మార్చిలో ఇండియాను వదిలేసి, యూకే చెక్కేసిన మాల్యాను వెనక్కి రప్పించాలని బ్యాంకులన్నీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా ముంబై కోర్టుకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు ఇచ్చింది. కానీ మాల్యా హాజరు కాకపోవడంతో, పిఎమ్ఎల్ఏ యాక్ట్, 2002 ప్రకారం ముంబై కోర్ట్ స్పెషల్ జడ్జ్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ దృష్ట్యా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతని పాస్ పోర్ట్ ను రద్దు చేసింది. ఏప్రిల్ 15న మాల్యా పాస్ పోర్ట్ ను నాలుగువారాల పాటు సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఆయన పాస్ పోర్టును ఎందుకు రద్దు చేయకూడదో వారంలో తెలపాలని మాల్యాను వివరణ కోరింది. మాల్యా నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే రద్దు చేశామని ప్రభుత్వం చెబుతోంది. మరో వైపు మాల్యా మాత్రం వ్యక్తిగతంగా వచ్చి కలవడానికి మే వరకూ టైం ఇవ్వాలని కోర్టును కోరడం గమనార్హం.