క్విడ్ ప్రోకో నిజమే.. అడ్జుకేటింగ్ అథారిటీ

వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియా సంస్థ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడాన్ని అడ్జుకేటింగ్ అథారిటీ సమర్థించింది.   దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ కు కడప జిల్లాలో 407 హెక్టార్ల భూమిని అప్పటి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు చేసిన ఈడీ.. దాల్మియా సిమెంట్స్ కు సున్నపురాయి గనుల కోసం కడప జిల్లాలో భూముల కేటాయింపునకు ప్రతిగా దాల్మియా సంస్థ జగన్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టిందని నిర్ధారణకు వచ్చిన ఈడీ ఇది క్విడ్ ప్రో కో కిందకు వస్తుందని,  ఈ లావాదేవీల ద్వారా మనీలాండరింగ్ జరిగింటూ కేసు నమోదు చేసింది.   కాగా ఈడీ ఆస్తుల జప్తును సవాల్ చేస్తూ దాల్మియా సంస్థ  అడ్జుకేటింగ్ అథారిటీని ఆశ్రయించింది.  ఎడ్జుకేటింగ్ అథారిటీ  ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జప్తును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.  

మళ్లీ గులాబి గూటికి కోనేరు

కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది.  మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మళ్లీ గులాబీ కండువా కప్పుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన కోనేరు కోనప్ప.. ఆ తరువాత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు.  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు సమక్షంలో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ లో చేరారు. ఈ పరిణామం అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బఅనే చెప్పాలి.  కోనేరు కోనప్పతో పాటు ఆయన సోదరుడు కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు.  

బాలయ్య వ్యాఖ్యలకు చిరు కౌంటర్.. తన చొరవవల్లేనని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు.  సినీ పరిశ్రమ సమస్యలపై చిరంజీవి బృందం అప్పటి ముఖ్యమంత్రి జగన్ ను కలవటానికి వెళ్లినప్పుడు  అవమానం జరిగిందన్న బాలయ్య.. చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్లే జగన్ దిగివచ్చారనడం కరెక్ట్ కాదన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్ట్ అయ్యారు.  బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. టికెట్ల పెంపుపై కొందరు నిర్మాతలు నన్ను కలిశారు. సినిమా ఖర్చు పెరుగుతుండటంతో.. టికెట్లపెంపుపై ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్మాతలు కోరడంతోచొరవ తీసుకున్నానని వివరించారు.   అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే తాను వెళ్లినట్లు స్పష్టం చేశారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారనీ..   సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించి,  సమయం ఇస్తే అందరం వస్తామని చెప్పానని చిరంజీవి వివరించారు. కోవిడ్ వల్ల అయిదుగురే రావాలంటే, తాము పది మంది వస్తామని చప్పాననీ, అందుకు జగన్ అంగీకరించారని అన్నారు.  అప్పట్లో బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్న చిరంజీవి..   తాను  గట్టిగా మాట్లాడితే జగన్ దిగివచ్చారన్నది కూడా అబద్ధమేనన్నారు.  సీఎం అయినా, సామాన్యుడైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా మాట్లాడతానన్నారు. అప్పట్లో తన చొరవ వల్లే టికెట్ల ధరలు పెరిగాయి చిరంజీవి పేర్కొన్నారు. ఇందుకు అక్కడున్నవారంతా సాక్ష్యులేనని వివరించారు.  తాను నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్లు పెరిగాయని గుర్తు చేశారు 

చిరు గట్టిగా మాట్లాడారనడం అవాస్తవం.. అసెంబ్లీలో బాలయ్య

జగన్ హయాంలో తెలుగుసినీ ప్రముఖులకు అవమానం జరిగిందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాటకృష్ణ అన్నారు. అసెంబ్లీలో గురువారం (సెప్టెంబర్ 25) మాట్లాడిన ఆయన జగన్ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు.  అప్పట్లో సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగినా ఎవరూ గట్టిగా నిలదీయలేకపోయారన్నారు.  సినీ సమస్యలపై చర్చించేందుకు జగన్‌తో జరిగిన సమావేశానికి తనకు ఆహ్వానం అందినా వెళ్లలేదని చెప్పారు. అయితే ఈ సందర్భంగా  చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ సమావేశానికి అంగీకరించారని బీజేపీ సభ్యుడు కామినేని అన్నారు. అయితే కామినేని వ్యాఖ్యలను ఖండించిన బాలకృష్ణ  ఎవరూ జగన్‌ను గట్టిగా అడగలేదనీ, చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగొచ్చాడని అనడం కరెక్ట్ కాదనీ స్పష్టం చేశారు. అప్పట్లో చిరంజీవిని  అవమానించారన్నది ఓకే... కానీ ఆయన చెబితే జగన్ దిగొచ్చారన్నది మాత్రం వాస్తవం కాదన్నారు.   అలాగే ఇటీవల విడుదల చేసిన ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) జాబితాలో తన పేరు తొమ్మిదో స్థానంలో ఉండటంపై కూడా బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో మాట్లాడినట్లు చెప్పారు. 

వంశీ ఇలా కనిపించారు.. అలా మాయమయ్యారు!

వైసీసీ అధికారంలో ఉన్నంత కాలం.. అప్పటి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు,  ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మాటల దాడి చేసిన వల్లభనేని వంశీ.. 2024 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత మౌనం వహించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం టికెట్ పై ఎన్నికలలో విజయం సాధించి.. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలు కావడంతో  జగన్ పార్టీ గూటికి చేరిన వల్లభనేని వంశీ.. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడటం సహా.. తెలుగుదేశం కార్యకర్తలపై దౌర్జన్యాలకు తెగబడ్డారు. అయితే చేసిన పాపం ఊరికే పోదన్నట్లుగా అధికారం అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిన వంశీ పరిస్థితి ఆ తరువాత దయనీయంగా మారింది. 2024 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలవ్వడమే కాకుండా వంశీ స్వయంగా గన్నవరంలో ఓడిపోయారు. గతంలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, దాడులతో కేసులలో ఇరుక్కుని జైలు పాలయ్యారు. విజయవాడ జిల్లా జైలులో నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తరువాత బెయిలుపై విడుదలైనా క్రియాశీల రాజకీయాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని పరిశీలకులే కాదు.. వైసీపీ వర్గాలు కూడా భావించారు.  అయితే హఠాత్తుగా వంశీ బుధవారం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులతో భేటీ అయ్యారు.  అది కూడా అతి తక్కువ సమయం మాత్రమే. ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లుగా ఆయన భేటీ సాగింది. మొత్తం మీద వంశీ నియోజకవర్గంలో కొందరు వైసీపీయులను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి నుంచి జగన్ వంశీని పీకేస్తారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆయన బయటకు రావడంతో మళ్లీ పోలిటికల్ గా వంశీ యాక్టివ్ కావాలని భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. అయితే నియోజకవర్గ పార్టీ నేతలు మాత్రం వంశీకి మద్దతుగా నిలిచే ప్రశక్తే లేదని అంటున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. చూడాలి మరి వంశీ ముందు ముందు ఏ నిర్ణయం తీసుకుంటారో? 

జగన్ ప్రలోభాలకు లొంగిన శంకరయ్య!

సీఐ శంకరయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి లీగల్ నోటీసులు పంపడం వెనుక జగన్ ప్రలోభాలు ఉన్నాయా? వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని ప్రలోభపెట్టే జగన్ శంకరయ్యను పావుగా వాడుకుంటున్నారా? అంటే తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాటలను బట్టి ఔననే సమాధానం వస్తున్నది. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జగన్ కొత్త నాటకానికి తెరలేపారని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపడం వెనుక కుట్ర ఉందన్నారు.  ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్న రాంగోపాల్ రెడ్డి..  ఇందకు బాధ్యులైన వారు మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య విధుల్లో ఉన్నారని గుర్తు చేసిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి..  ఆ రోజున నిందితులు సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తుంటే, వారికి శంకరయ్య పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు.  అప్పట్లో ఆర్థిక ప్రయోజనాలు పొందడంతో పాటు పలు సెటిల్‌మెంట్లు చేసుకున్న తర్వాతే..  ఆయన నిందితులకు అనుకూలంగా మారారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ హైకోర్టును ప్రభావితం చేసే ఉద్దేశంతో.. వివేకా హత్య కేసులోని నిందితులకు మేలు చేకూర్చడానికే శంకరయ్య ఈ కొత్త డ్రామా ఆడుతున్నారని రాంగోపాల్‌రెడ్డి అన్నారు. దీని వెనుక జగన్ ఉన్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రికి నోటీసులు పంపడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెన్నై బయలుదేరి వెళ్లారు. గురువారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన చెన్నైకి బయలుదేరారు. అదే రోజు సాయంత్రం చెన్నైలో  తమిళనాడు ప్రభుత్వం మహా విద్యా చైతన్య ఉత్సవ్‌ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.ఆ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా  బుధవారం (సెప్టెంబర్ 24) బిహార్ రాజధాని పాట్నా వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన వెంటనే చెన్నైకు బయలుదేరారు.  త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండి కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అచితూచి అడుగులు వేస్తోంది. ఇక తమిళనాడులోని డీఏంకే ప్రభుత్వం సైతం ఇండి కూటమిలో భాగస్వామి అన్న సంగతి అందరికి తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల తో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ సహా ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ లో రేవంత్ స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.

వాలంటీర్ల‌కు జ‌గ‌న్ హ్యాండ్

పుట్టింటోళ్లు త‌రిమేశారు.. క‌ట్టుకున్నోళ్లూ వ‌దిలేశార‌న్న‌ట్టుగా మారింది  పాపం వాలంటీర్ల ప‌రిస్థితి.  ఫైన‌ల్ గా మేమొచ్చాక మీకంటూ ఒక భ‌రోసా ఇస్తామ‌న్న కోణంలో వీరికి ఊర‌ట క‌ల్పించాల్సిన వీరి సృష్టిక‌ర్త జ‌గ‌న్.. కాస్తా.. వీరికి మొండి చేయి చూపించేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ నేను చేసిన అతి పెద్ద త‌ప్పిదం వాలంటీర్ల‌ను న‌మ్మ‌డం అన్న ఒక  నిర్ణ‌యానికి వ‌చ్చి ఆ దిశ‌గా కొన్ని కీల‌క కామెంట్లు చేశారు. అవేంటో చూస్తే..  వైసీపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన జ‌గ‌న్ త‌న ఐదేళ్ల పాల‌న‌లో వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే న‌ష్ట‌పోయిన‌ట్టు అభిప్రాయ ప‌డ్డారాయ‌న‌. గ‌తంలో వాలంటీర్ల‌కు అవ‌స‌రానికి మించి ప్ర‌యారిటీ ఇవ్వ‌డ‌మే కొంప  ముంచిన‌ట్టు తేల్చి చెప్పేశారు. వీరి కార‌ణంగా గ్రామ‌, మండ‌ల స్థాయి కార్య‌క‌ర్త‌ల‌ను విస్మ‌రించామ‌ని.. ఇదే త‌మ పార్టీ ఓట‌మికి ప్ర‌ధాన‌కార‌ణంగా చెప్పుకొచ్చారు జ‌గ‌న్. ఈ సారికి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తాననీ,   ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ల ద్వారానే ప్రజలకు చేరవేసేలా చేస్తామ‌నీ కార్య‌క‌ర్త‌ల‌ను ఊర‌డించేలా మాట్లాడారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌.. కార్య‌క‌ర్త‌లే అన్నింటా  క్రియాశీల‌కంగా ప‌ని చేస్తార‌ని అన్నారు జ‌గ‌న్. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కోవ‌ల్సి ఉంద‌ని అన్నారు. లోక‌ల్ ఫైట్ కి అంద‌రూ సన్న‌ద్ధం కావాల‌ని కూడా పిలుపునిచ్చారాయ‌న‌. దీన్ని బ‌ట్టి చూస్తుంటే.. జ‌గ‌న్ త‌న కార్య‌క‌ర్త‌ల‌ను బిస్కెట్ వేయ‌డంలో భాగంగానే ఈ కామెంట్లు చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాదు వాలంటీర్ల‌కు హ్యాండ్ ఇవ్వ‌డాన్ని బ‌ట్టీ చూస్తే జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పం, మాట త‌ప్పం అనే ప‌దాలు కేవ‌లం వైసీపీ సోష‌ల్ మీడియా వింగులు రాసుకోడానికి త‌ప్ప ఎందుకూ ప‌నికి  రావ‌న్న కామెంట్లు ఒకింత జోరుగానే వినిపిస్తున్నాయ్.

ఏపీ లిక్కర్ స్కాం.. డిఫాల్ట్ బెయిలు రద్దు కోసం హైకోర్టుకు సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించడమే కాకుండా, రాజకీయంగా కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న మద్యం కుంభకోణం కేసులో  మద్యం కుంభకోణం కేసులో నలుగురు నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిలు మంజురు చేయాడాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం హైకోర్టులో సవాల్ చేసింది.  ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్‌లకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సిట్  హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో గురువారం(సెప్టెంబర్ 25) వాడీ వేడి వాదనలు జరిగాయి.   సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా, నిందితుల తరఫున మరో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. కాగా సిట్ తరఫున వాదించిన సిద్ధార్థ్ లూత్రా.. నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఆగస్టు 11నే తాము అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసి, అందులో ఈ నలుగురు నిందితుల పాత్రను స్పష్టంగా వివరించామని కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్‌లోని అభ్యంతరాలను సెప్టెంబర్ 1లోపే సరిదిద్దామని.. అయినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్ ఇచ్చారని తెలిపారు. ఆగస్టు 18న నిందితుల్లో ఒకరైన బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు..  కేవలం రోజుల వ్యవధిలోనే అంటే.. సెప్టెంబర్ 5న డిఫాల్ట్ బెయిల్ ఎలా మంజూరు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అందువల్ల నలుగురి బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సిద్ధార్థ్ లూద్రా  వాదించారు. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ..  రెగ్యులర్ బెయిల్ ఆదేశాలకు, డిఫాల్ట్ బెయిల్ ఆదేశాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అప్పటి పరిస్థితులు, సాక్ష్యాధారాల ఆధారంగా రెగ్యులర్ బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాత ఇచ్చే డిఫాల్ట్ బెయిల్‌పై దాని ప్రభావం ఉండదన్నారు. చట్టప్రకారం 90 రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, తమ వాదనలను లిఖితపూర్వకంగా శుక్రవారంలోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

జగన్ పట్టిన కుందేలుకి మూడే..!

జ‌గ‌న్ చిన్న‌పిల్లాడో లేక, తానొచ్చిన ఫ్యాక్ష‌న్ కుటుంబ‌మే అలాంటిదో తెలీదు కానీ.. , ఆయ‌న అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌రిగిపోవాలి. అందుకు నిబంధనలు,  పాటింపులేం ఉండ‌క్క‌ర్లేదు. ఏదైనా అంతే..  తిరుమ‌ల డిక్ల‌రేస‌న్ నుంచి మొదలు పెడితే.. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా వ‌ర‌కూ స‌రిగ్గా ఇలాగే క‌నిపిస్తుంది జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి. జ‌గ‌న్ కి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పారు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు. జ‌గ‌న్ కి ఆ హోదా ఇవ్వ‌డానికి త‌న‌కు రూల్స్ బుక్ లో ఎలాంటి  క్లాజు క‌నిపించ‌డం లేద‌న్నారాయ‌న‌. అయితే సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ, ఢిల్లీకి సంబంధించి ఒక ఉదాహ‌ర‌ణ గుర్తు చేశారు. అప్ప‌ట్లో అంటే 2015 ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ క్లీన్ స్వీప్ చేసిందీ.. ఆ టైంలో బీజేపీకి వ‌చ్చింది కేవ‌లం మూడు సీట్లే.. కానీ ఢిల్లీ స్పీక‌ర్.. బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తాను ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా అంగీక‌రించార‌న్న వార్త తెర‌పైకి తెచ్చారు.  ఇదిలా ఉంటే మ‌రో వార్త ఏంటంటే.. తాము స‌భ‌లోకి వ‌స్తాము. కానీ మాట్లాడ్డానికి కావ‌ల్సినంత స‌మ‌యం ఇవ్వాల‌ని కోరుతున్నారు జ‌గ‌న్ అని. రాకుండానే టైం ఇవ్వ‌ర‌న్న గ్యారంటీ ఏంటి? వ‌స్తే క‌దా తెలిసేది?  ఇదెలా ఉందంటే జ‌గ‌న్ టెన్త్ త‌ప్పిన పిల్ల‌లు ఆ కాసిన్ని మార్కులేసి మ‌మ్మ‌ల్ని  పాస్ చేసేయ‌వ‌చ్చు క‌దా? అని అడిగిన‌ట్టుంద‌ని అంటారు కొంద‌రు. ఇంకా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే కొంద‌రు చెప్పేదాన్నిబ‌ట్టి చూస్తే అస‌లు జ‌గ‌న్ కి ఉన్న ఆ ఎమ్మెల్యే ప‌ద‌వి కూడా ఊడిపోయేలా ఉంది. భార‌త రాజ్యాంగం ఆర్టిక‌ల్ 190(4) ప్ర‌కారం.. అర‌వై రోజుల పాటు వ‌రుస‌గా ఎవ‌రైనా స‌భ్యుడు రాకుంటే.. ఆ సీటు ఖాళీగా ప్ర‌క‌టించ‌వ‌చ్చు. ఇప్పుడు జ‌గ‌న్ కు ముందు గొయ్య‌- వెన‌క నుయ్య‌గా ఉంద‌ట ప‌రిస్థితి. ఎంత మాత్రం ఆయ‌న హ్యాపీగా లేరు. ఒక స‌మ‌యంలో జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యే సీటుకు రిజైన్ చేసీ ఎంపీగా పోటీ చేయాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగైనా త‌న‌కీ త‌ల‌వంపులు త‌ప్పుతాయ‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది. మిగిలిన వారి చేత కూడా రిజైన్ చేయించి.. ఉప ఎన్నిక‌ల‌కు పోవాల‌న్న‌ది జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌. మ‌రి వారిలో అంద‌రూ ఓడిపోతే పరిస్థితేంట‌న్న‌ది ఎవ్వ‌రికీ అంతు చిక్క‌డం లేదు.  ఎందుకంటే అ చివ‌రికి పులివెందుల‌లో త‌న స్థానంలో పోటీ చేసే అవినాష్ కూడా ఓడిపోతే.. త‌ర్వాత జ‌గ‌న్ పార్టీ   ఉనికే ప్ర‌శ్నార్ధ‌కం కాగ‌ల‌ద‌న్న మాట వినిపిస్తోంది రాజ‌కీయ వ‌ర్గాల్లో.

జ‌గ‌న్ కాపీ పేస్ట్ క‌హానీ!

జ‌గ‌న్ డిజిట‌ల్ బుక్ తెర‌వ‌డంతో   ఆయ‌న‌కు ఏదీ స్వ‌యంగా త‌యారు చేయ‌డం రాద‌ని క్రిస్ట‌ల్ క్లియ‌ర్ గా అర్ధ‌మై పోయింది.  ఆయ‌న పెద్ద సంక్షేమ రూప‌శిల్పి కూడా ఏమీ కాదు. గ‌తంలో త‌న తండ్రి ప్ర‌వేశ పెట్టిన వాటికే కాస్త సొబ‌గులు అద్దారాయ‌న‌.  అది కూడా ఏమంత ఒరిజిన‌ల్ కాదు. ఇదంతా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రండ్. ఇప్పుడు చూస్తే జ‌గ‌న్ త‌న వెల్ఫేర్ ఇత‌ర‌త్రా ప‌థ‌కాల‌ సోర్స్ మొత్తం లోకేషే అన‌డంలో ఎలాంటి అనుమాన‌మే లేదు..  ఔను నిజమే.. మీరు చ‌దువుతున్నది నిజం. జ‌గ‌న్ కి  కొత్త ఆలోచ‌న ఏదీ రాదు. ఒక‌ప్పుడు లోకేష్ కార్య‌క‌ర్త‌ల‌కు జీతాలు అనే కాన్సెప్ట్ నే త‌ర్వాత జ‌గ‌న్ మ‌క్కీకి మ‌క్కీ కాపీ కొట్టి దాన్ని వాలంటీర్లుగా మార్చారు.  కావాలంటే చూడండి.. ఆయ‌న అపాయింట్  చేసిన చాలా మంది వాలంటీర్ల‌లో అత్య‌ధిక శాతం మంది రెడ్లే క‌నిపిస్తారు. ఇప్పుడు వాళ్ల‌కు కూడా మొండి చేయి ఇచ్చారు. అదే లోకేష్ ఒక వైసీపీ కార్య‌క‌ర్త‌ను కూడా ఆదుకుంటూ.. ఆయ‌న ఆరోగ్య ఖ‌ర్చులు మొత్తం తాము భ‌రిస్తామ‌న్న భ‌రోసా ఇచ్చారు. మాన‌వ‌త్వం చాటుకున్నారు. త‌ర్వాత డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్. ఇవి స్టాన్ ఫ‌ర్డ్ లో చ‌దివి, వ‌ర‌ల్డ్ బ్యాంక్ లో ప‌ని చేసిన అనుభ‌వజ్ఞుడైన లోకేష్ బ్రైన్ చైల్డ్. ఈ కాన్సెప్ట్ ద్వారానే జ‌గ‌న్ చాలా వ‌ర‌కూ నేరుగా జ‌నం ఖాతాల్లో డ‌బ్బు జమ చేశారు. ఈ విష‌యం చాలా మందికి తెలీదు. లోకేష్ కూడా ఇదంతా నాది అన్న కోణంలో ఏదీ చెప్పుకోరు.  ఇప్పుడు చూస్తే రెడ్ బుక్. మాములుగా ఒక మాట అంటుంటారు. నువ్వు చేసిన ప‌నిని ఇత‌రులు కాపీ కొడితే నువ్వొక ట్రెండ్ సెట్ట‌ర్ అని. ఎగ్జాట్ గా లోకేష్ కూడా అంతే. ట్రెండ్ ఫాలో కాడాయ‌న- సెట్ చేస్తారని అంటారు చాలా మంది. మీరు కావాలంటే చూడండి.. లోకేష్ రెడ్ బుక్ ఎంత ఫేమ‌స్ అంటే, పొరుగు రాష్ట్రం నుంచి క‌విత కూడా తాము పింక్ బుక్ రాస్తామ‌ని అన్నారు. ఇక జ‌గ‌న్ అయితే ఓడిపోయిన తొలి నాళ్ల‌లోనే తాము బ్లూ బుక్ రాస్తామ‌న్నారు. ఇప్పుడు చూస్తే బ్లూ అంటే తనను కాపీ క్యాట్ అంటారని భావించారేమో.. దాన్ని డిజిట‌ల్ బుక్ గా మార్చారు. కానీ కాపీ కాపీ కాకుండా  పోతుందా? జ‌గ‌న్  ఏదీ ఒరిజిన‌ల్ కాదు. అంతా డూపే అన్న ముద్ర   ప‌డే తీరుతుంద‌ని అంటున్నారు చాలా మంది వైసీపీ వ‌ర్గాల వారు.

బుచ్చయ్య తాతా.. అసెంబ్లీలో లోకేష్ సరదా సంబోధన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ప్రజాసమస్యలపై చర్చతో పాటు సరదా మాటలు కూడా పేలుతున్నాయి. మండలిలో వైసీపీ, తెలుగుదేశం సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. అసెంబ్లీలో.. అధికారపక్ష సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు. మంత్రులను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ప్రజాగొంతుకు వినిపించడంలో తెలుగుదేశం కూటమి సభ్యులు ఏ మాత్రం వెనుకాడటం లేదు.  ఈ నేపథ్యంలోనే బుధవారం అసెంబ్లీలో ఓ సరదా సంభాషణ జరిగింది. తెలుగుదేశం సీనియర్ సభ్యుడు  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏళ్లతరబడి  ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యత లేని యూనిఫాంలు, బెల్టులు లభిస్తున్నాయన్నారు. అయితే  ప్రస్తతం విద్యా మంత్రి నారా లోకేష్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశారనీ అభినందించారు.  ఇప్పడు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నాణ్యత ఉన్న యూనిఫారాలు, బెల్టులు అందాయన్నారు.  ఇది తన విధుల పట్ల లోకేష్ కు ఉన్న బాధ్యతకు నిదర్శనమని అభినందించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆప్యాయంగా బుచ్చయ్య తాత అని సంబోధించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.. లోకేష్ ను వారిస్తూ తాతా అని కాకుండా అంకుల్ అని సంబోధిస్తే బాగుంటుందేమో అన్నారు. దీనిపై లోకేష్  ఎన్టీఆర్ హయాం నుంచి బుచ్చయ్య ఉన్నారనీ, ఆయనంటే తనకు గౌరవమనీ చెప్పారు. తాను ఆయనను చిన్నప్పటి నుంచీ తాత అనే పిలుస్తున్నానన్నారు.   

ఏపీ రాజకీయాల్లో బుక్ వార్

  ఏపీ రాజకీయాల్లో బుక్ వార్ నడుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు రెడ్ బుక్ తీసుకువచ్చిన నారా లోకేష్.  టీడీపీ కార్యకర్తలను నాటి అధికార వైఎస్సార్సీపీ వేధించిన వైనంపై బాధితుల వివరాల ఆధారంగా రెడ్ బుక్ లో నమోదు చేశారు. నేడు అదే ఒరవడికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టిన మాజీ సీఎం జగన్. వైసీపీ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులను నమోదు చేసేందుకు 'డిజిటల్ బుక్' పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించింది  . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వేధింపులకు గురైన వారు తమ ఫిర్యాదులను digitalbook.weysrcp.com పోర్టల్‌లో గానీ, 040-49171718 ఐవీఆర్ఎస్ నంబర్‌కు ఫోన్ చేసి గానీ నమోదు చేయవచ్చని జగన్ తెలిపారు. ఎవరైనా అధికారి వేధిస్తే, అందుకు సంబంధించిన ఆధారాలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.  ఏపీలో కక్ష రాజీయాలు ఎక్కువయ్యాయి. ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రతిపక్షల నాయకుల దాడులు చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు తమకనుకూలంగా వ్యవహరించని వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రతిపక్షం మాత్రం ఈ దాడులను ప్రజాస్వామ్యంపై దాడులుగా అభివర్ణిస్తోంది. ప్రతి సంఘటనతో రాజకీయ వేడి పెరిగిపోతోంది.  ప్రజలు మాత్రం అభివృద్ధి పక్కనబెట్టబడి కక్ష రాజకీయాల బలి అవుతున్నారు. దీని వల్ల పెట్టుబటులు రావడం లేదు .. దీనివల్ల రాష్ట్రానికి చెడు పేరు వస్తోంది. పెట్టుబడిదారులు కూడా స్థిరత్వం లేని వాతావరణంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధి ఆగిపోగా, యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. పరస్పర కక్షలు పక్కనబెట్టి అభివృద్ధి కోసం కలిసి పనిచేయకపోతే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

మండలిలో జీఎస్టీపై తీర్మానం.. వైసీపీ మద్దతిచ్చిందా? లేదా?

జీఎస్టీపై వైసీపీ వైఖరి ఏమిటన్నది అంతుపట్టకుండా ఉంది. ఒక వైపు ఆ పార్టీ అధినేత జీఎస్టీని పొగుడుతూ, ప్రధాని మోడీని ఆకాశానికెత్తేశారు. అయితే మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మాత్రం జీఎస్టీ విషయంలో తన వైఖరి ఏమిటో స్పష్టం చేయకుండా పలాయన మంత్రి పఠించింది. ఇంతకీ విషయమేంటంటే.. అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలను ఆమోదిస్తూ ప్రభుత్వం తీర్మానించింది.  ఇక శాసన మండలిలో బుధవారం జీఎస్టీ సంస్కరణలపై బుధవారం (సెప్టెంబర్ 24) తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి అధికార పార్టీ సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ వైసీపీ మాత్రం తన వైఖరిని స్పష్టం చేయలేదు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా వైసీపీ తన వైఖరి  చెప్పాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దీనిపై సభలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ నేరుగా సమాధానం ఇవ్వలేదు. పైగా జీఎస్టీ సంస్కరణలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు.. దేశమంతటా అమలు అవుతున్నాయి కదా..అటువంటప్పుడు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తీర్మానం ఎందుకు అంటూ దాటవేశారు. అయితే పయ్యావుల మాత్రం జీఎస్టీ సంస్కరణలను వైసీపీ స్వాగతించి మద్దతు ఇస్తోందా లేదా చెప్పాలంటూ పట్టుబట్టారు. అప్పటికి కూడా బొత్స  స‌మాధానం దాట వేసి మరేదో మాట్లాడారు. ఈ దశలో పయ్యావుల మీరు ఆమెదం తెలపకపోతే ఢిల్లీ నుంచి మీ నాయకుడికి ఫోన్ వస్తుందేమో అని చమత్కరించారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ జీఎస్టీ సంస్కరణలను అద్భుతం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతిని కూడా గుర్తు చేశారు. అయినా బొత్స నోట మాత్రం జీఎస్టీకి ఆమోదం అన్న మాట రాలేదు. ఆ దశలో మండలి చైర్మన్ జఎస్టీపై తీర్మానాన్ని సభ ఆమోదించినట్లుగా ప్రకటించారు. దీనికి కూడా  కూడా మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..  వైసీపీ స‌భ్యులు త‌మ అభిప్రాయం చెప్పకుండా తీర్మానం ఆమోదం పొందింద‌ని ఎలా ప్ర‌క‌టిస్తార‌ని చైర్మ‌న్‌ను నిల‌దీశారు. అయితే చైర్మన్ పయ్యావుల అభ్యంతరాన్ని పట్టించుకోకుండా భోజన విరామానికి సభను వాయిదా వేశారు.  

జగన్ బెయిలుపై విడుదలై నేటికి పుష్కరం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిలుపై బయటకు వచ్చి నేటికి సరిగ్గా 12 ఏళ్లయ్యింది. అంటే పుష్కరకాలం అన్న మాట.  అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు ఇవ్వడంతో 2013 సెప్టెంబర్ 24న ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. అంతకు ముందు ఆయన దాదాపు 16 నెలల పాటు జైలులో ఉన్నారు.   జగన్ పై ఐపీసీ, యాంటీకరప్షన్ యాక్ట్ కింద అభియోగాలు నమోదయ్యాయి. నేరపూరిత కుట్ర, అవినీతి, మోసం,  ఫోర్జరీ  వంటివి ఉన్నాయి.   క్విడ్ ప్రోకో పె ద్వారా ఆయన పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్నది ఆ కేసుల సారాంశం.  2019 ముందు వరకూ అంటే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేంత వరకూ కోర్టు బెయిలు మంజూరు చేసిన సందర్భంగా విధించిన షరతులను పాటించారు. అయితే సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత అధికారిక విధులు కారణంగా చూప్తిస్తూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఆ తరువాత 2024 ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆ మినహాయింపు అలాగే కొనసాగుతున్నది.  జగన్ పై సీబీఐ కేసులు పదకొండు, అక్రమాస్తులకు సంబంధించి ఈడీ కేసులు 9 ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కాదు. కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. పార్టీ అధినేత అన్నది పక్కన పెడితే జగన్ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినా కేసుల విచారణకు వ్యక్తిగత మినహాయింపు కొనసాగుతుండటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం (సెప్టెంబర్ 23) వెల్లడించింది. అంతే కాకుండా ఎలక్షన్ ప్రణాళిక అందజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ సీఎస్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ కూడా రాసింది.  ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఈ నెల 2న, మండల, జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు చెందిన ఓటర్ల జబితాను ఈనెల 10న ప్రచురించినట్లు పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లపై సమాచారం కోరింది.    ఈ నేపథ్యంలో అందరి దృష్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ పైనే ఉంది. ఈ పిటిషన్ బుధవారం (సెప్టెంబర్ 24)న విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపుఇదిలా ఉండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో రిట్​పిటిషన్​దాఖలైంది.  దీనిపై కోర్టు ఏం నిర్ణయిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ రెండో వారంలో స్థానిక ఎన్నికల తొలి విడతకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.  

ప్రతిపక్ష హోదా..జగన్ పిటిషన్ విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో  వైసీపీకి ప్రతిపక్ష హోదా  హోదా ఇవ్వడం సాధ్యం కాదంటూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించన సంగతి తెలిసిందే. జగన్ పిటిషన్ బుధవారం (సెప్టెంబర్ 24) విచారణకు వచ్చింది. అయితే విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.   జగన్ తన పిటిషన్ లో  తనను ప్రతిపక్షనేత హోదా కల్పించేలా ఏపీ శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.   శాసన సభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, స్పీకర్‌ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా తన పిటిషన్ లో జగన్ ప్రతివాదులుగా పేర్కొన్న  స్పీకర్ , అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మత్రి పయ్యావుల కేశవ్ లకు నోటీసులు ఆచ్చింది. ఆ నోటీసులలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది.  జగన్ రెడ్డి ఇంతకు ముందు కూడా ఇలాంటి పిటిషన్ దాఖలు చేశారు. అది పెండింగ్ లో ఉండగానే మళ్లీ మరో పిటిషన్ వేశారు.  మామూలుగా అసెంబ్లీ వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకోవు. స్పీకర్ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే తప్ప ఎటువంటి ఆదేశాలూ ఇచ్చే పరిస్థితి ఉండదు.  ప్రతిపక్ష నేత హోదా అంశంలో గతంలో పదిశాతం సీట్లు లేకుండా హోదా కావాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల పై అనుకూలమైన తీర్పులు వచ్చిన దాఖలాలు లేవు.  

విపక్ష నేత హోదాపై జగన్ పిటిషన్.. హైకోర్టులో నేడు విచారణ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న విషయంలో మంకుపట్టు వీడటం లేదు. ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్యా బలం లేకపోయినా ఆయన దాని కోసం పట్టుబడుతూ అసెంబ్లీని కూడా బాయ్ కాట్ చేశారు. అయినా ప్రభుత్వం దిగిరాలేదు.  సభలో సంఖ్యాబలంలేనందున వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పీకర్ రూలింగ్ కూడా ఇచ్చారు. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు.  తనను ప్రతిపక్షనేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ఇచ్చిన రూలింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ  ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు బుధవారం (సెప్టెంబర్ 24) విచారించనుంది.  జగన్ పిటిషన్ లో  తనను ప్రతిపక్షనేత హోదా కల్పించేలా ఏపీ శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.   శాసన సభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, స్పీకర్‌ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. 

వైసీపీ తీరు మారుతోందా? మండలిలో మద్దతు దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడే వైసీపీ తొలి సారిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపింది. శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ప్రవేశ పెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది.  ఔను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోడీకీ, విత్త మంత్రులు నిర్మలా సీతారామన్, హెచ్ డీ కుమార స్వామిలను అభినందిస్తూ మంత్రి నారా లోకేష్ మంగళవారం  (సెప్టెంబర్ 23) మండలిలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఈ అభినందన తీర్మానానికి వైసీపీ సంపూర్ణ మద్దతు పలికింది. దీంతో ఈ అభినందన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. విషయం ఏదైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరించే వైసీపీ మొట్టమొదటి సారిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు తెలపడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.  జీఎస్టీ సంస్కరణల విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీని ప్రశంసిస్తూ, జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ ట్వీట్ చేసినప్పటికీ, మండలిలో జీఎస్టీని స్వాగతిస్తూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆ తరువాత కారణాలేమైనా ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు.. అలాగని మద్దతు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రశక్తే లేదని ఆ విధంగా చాటారు. కానీ.. కేంద్రాన్ని అభినందిస్తూ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో వైసీపీ తీరు మారిందా అన్న చర్చ మొదలైంది.