పేర్ని నానిపై కేసు..మళ్లీ అజ్ణాతంలోకేనా?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేర్ని నాని తెలియని వాళ్ళు ఉండరు. వైసీసీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా తెలిసిన పేరే.  నిత్యం ఏదో  ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో ఉండే పేర్ని నాని.. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుండి తన నోటికి గట్టిగా పని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ నోటికి అడ్డూ అదుపూ లేదన్నట్లుగా బూతులతో, అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన కొడాలి నాని వంటి వారు  అధికారం కోల్పోయిన తరువాత సైలెంటైపోయారు. ఇక అధికారం కోల్పోయిన తరువాత నిన్న మొన్నటి వరకూ అంబటి రాంబాబు తన గళానికి పని చెప్పారు. అయనా ఈ మధ్య ఎందుకో మౌనం వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నుంచీ పేర్ని నాని వాయిస్ ఆఫ్ వైసీపీ అన్నట్లుగా  రెచ్చిపోతున్నారు. అయితే ఎంత రెచ్చిపోయినా.. పేర్నినాని ఒక విషయంలో మాత్రం గొప్ప పరిణితి ప్రదర్శిస్తున్నారు. తనపైన ఏదైనా కేసు నమోదైతే.. ఆ కేసులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాత వాసం చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నోటి వెంట ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా రాదు. సరే సదరు కేసులో కోర్టులో ఊరట లభించిందంటే చాలు అజ్ణాతం వీడి బయటకు వచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో రెచ్చిపోతుంటారు.  పేర్న నానిపై గతంలో కేసు నమోదైన ప్రతిసారీ కూడా ఆయన ఆ కేసులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాత వాసం చేయడం తెలిసిందే. గతంలో నానిపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలోనూ, అలాగే రేషన్ గోదాముల కేసు సమయంలోనూ కూడా పేర్ని నాని ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాతంలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదైంది.    ఆర్‌.పేట సీఐ ఏసుబాబుపై పేర్ని నాని దౌర్జన్యం చేశారనీ, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనీ కేసు నమోదైంది. ఇంతకీ జరిగిందేంటంటే.. పేర్ని నాని ఆధ్వర్యంలో  వైసీపీ  నేతలు మెడికల్‌ కళాశాల వద్ద ఇటీవల నిరసన చేపట్టారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు.  ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఠాణాకు విచారణకు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. తాము చెప్పేవరకూ పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ వైసీసీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మేకల సుబ్బన్నను పోలీసులు శుక్రవారం (అక్టోబర్ 10) అరెస్టు చేశారు.  దీంతో పేర్ని నాని పెద్ద సంఖ్యలో అనుచరులతో చిలకలపూడి స్టేషన్ కు వెళ్లి హల్ చల్ చేశారు. సీఐతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నానిపై కేసునమోదైంది.   పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనీ, సీఐపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కేసు పెట్టారు. దీంతో ఈ కేసులో కూడా బెయిలు దొరికే వరకూ నాని అజ్ణాతంలోకే అంటూ వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.  

అంతా చొరబాట్ల వల్లే.. అమిత్ షా

దేశంలో ముస్లిం మైనారిటీల జనాభా పెరగడానికి చొరబాట్లే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'దైనిక్ జాగరణ్' మాజీ సంపాదకుడు నరేంద్ర మోహన్ స్మారకోపన్యాసంలో మాట్లాడిన ఆయన దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల కేవలం రాజకీయ సమస్య కాదనీ, ఇది దేశ భద్రత, ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య అనీ అన్నారు.   కొన్ని ప్రాంతాలలో ముస్లింమైనారిటీల జనాభా పెరుగుదల చాలా చాలా అధికంగా ఉందంటూ ఆయన కొన్ని రాష్ట్రాల జనాభా లెక్కలను ఉదహరించారు. అసోంలో గత దశాబ్ద  కాలంలో  ముస్లిం మైనారిటీల జనాభా   29.6 శాతం పెరిగిందన్నారు. చొరబాట్లు లేకుండా ఈ స్థాయిలో ముస్లిం జనాబా వృద్ధి సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ లోని పలు జిల్లాలలో  ముస్లిం జనాభా వృద్ధి రేటు 40 శాతం వరకూ ఉందనీ, సరిహద్దు ప్రాంతాల్లో  అయితే ఇది ఏకంగా 70 శాతం వరకు ఉందని అమిత్ షా అన్నారు.   కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని  ఆరోపించారు. గుజరాత్, రాజస్థాన్‌లకు కూడా సరిహద్దులు ఉన్నాయి. మరి అక్కడ నుంచి చొరబాట్లు ఎందుకు జరగడం లేదు?  అని  ప్రశ్నించారు. చొరబాట్లను అడ్డుకోవడం కేవలం కేంద్ర ప్రభుత్వం లేదా సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బాధ్యత మాత్రమే కాదనీ రాష్ట్రాలు కూడా బాధ్యత తీసుకోవాలని అమిత్ షా అన్నారు.  భౌగోళిక పరిస్థితుల కారణంగా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో కంచె వేయడం సాధ్యం కాదన్న ఆయన అలాంటి చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అత్యంత కీలకమన్నారు. 

కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి.. మంత్రుల మధ్య టెండర్ల మంట!

తెలంగాణ కాంగ్రెస్ వివాదాలతో సహవాసం చేస్తున్నదా అనిపిస్తున్నది. నిత్యం అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలతో  సతమతమౌతూనే ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వార్ జరిగింది.  అధిష్టానం రంగంలోకిదిగి వారి మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. అది అలా ఫుల్ స్టాప్ పడిందో లేదో.. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్  విషయంలో అలిగి.. తనకు టికెట్ రాకుండా చేసిన వారి పేరు త్వరలోనే బయటపెడతానంటూ మీడియాకు ఎక్కారు. దీంతో ఆయనను బుజ్జగించడానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ ఎపిసోడ్  అలా ముగిసిందో లేదో.. ఇలా మరో ఇద్దరు మంత్రుల మధ్య వార్ రచ్చకెక్కింది.   మంత్రి పొంగులేటి తన శాఖ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. దేవాదాయ శాఖ పరిధిలోని టెండర్లలో మంతి పొంగులేటి జోక్యమేంటంటూ కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి అనుచిత జోక్యం చేసుకుంటున్నారంటూ ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఆమె భర్త కొండా మురళి అధిష్ఠానానికి లేఖ రాశారు. ఇక ఇప్పుడు మంత్రి కొండా సురేఖ పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.   దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో మరో  తలనొప్పి మొదలైనట్లైంది.  ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం  ఇబ్బందుల్లో పడిన సమయంలో కొత్తగా కొండా మురళి, పొంగులేటి మధ్య వార్ మరిన్ని ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టినట్లైంది. వాస్తవానికి వరంగల్ ఇంచార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటినుంచి మంత్రి కొండా సురేఖ్ అసంతృప్తితోనే ఉన్నారు.  జిల్లాకు చెందిన   అంశాల్లో పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు తెలియకుండానే, తనను సంప్రదించకుండానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనీ గత కొంత కాలంగా కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడా అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.   ఇంతకీ విషయమేంటంటే...  మేడారం జాతర సమీక్ష సమావేశం లో మంత్రి పొంగు లేటి  తీరుపై  కొండా సురేఖ,  ఆమె భర్త అసంతృప్తి వ్యక్తం చేశారు.వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల‌ లో పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకోవడంతో కొండా దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని మండి పడ్డారు.  టెండ‌ర్ల వ్య‌వ‌హారా లపై కాంగ్రెస్  అధ్య‌క్షుడు ఖ‌ర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.ఇదే విషయాన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపారు.   తాజాగా మంత్రి కొండా సురేఖ పొంగులేటి వ్యవహారశైలిపై అధిష్ఠానాని స్వయంగా ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికిసమాయత్తమౌతున్నారు. చూడాలి మరి ఈ వివాదాన్ని కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందో?

బెంగళూరు టు లండన్.. జగన్ తిరిగొచ్చేది ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి లండన్ బయలుదేరారు. కోర్టు అనుమతిలో ఆయన ఓ పక్షం రోజుల పాటు యూకేలో పర్యటిస్తారు. అయితే ఈ పర్యటనకు బయలుదేరడానికి ముందు ఆయన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తాను తిరిగి వచ్చే వరకూ రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలనీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించాలని ఆదేశించారు. తాను లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ సంతకాలను గవర్నర్ కు అందజేస్తానన్నారు. ఆందోళనలకు పిలుపునివ్వడం, నేతలకు, క్యాడర్ ను ముందుకు నెట్టి తాను ముఖం చాటేయడం పట్ల వైసీపీ శ్రేణులలో అసహనం వ్యక్తం అవుతోంది. గతంలో కూడా రాష్ట్రంలో ఆందోళనలకు పిలుపునిచ్చి జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమయ్యేవారని గుర్తు చేస్తున్నారు.  ఇంతకీ ఇప్పుడు జగన్ లండన్ పర్యటన ఎందుకంటే.. అక్కడ ఉన్న కుమార్తెలతో సమయం గడపడానికి అని చెబుతుంటారు. అండన్ లో వారి చదువులు పూర్తియిన తరువాత కూడా అక్కడే ఎందుకు ఉంటున్నారన్నది తెలియదు. కానీ జగన్ మాత్రం వారితో సమయం గడపడానికి అంటూ ఓ పదిహేను రోజుల పాటు పార్టీకి అందుబాటులో ఉండకుండా వెడుతున్నారు. జగన్ నర్సీపట్నం పర్యటన విషయంలో జనసమీకరణను పార్టీ నేతలు, శ్రేణులూ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన స్వయంగా వచ్చినప్పుడే అంతంత మాత్రం అటెన్షన్ చూపిన పార్టీ శ్రేణులు.. ఇప్పుడు జగన్ విదేశాలకు వెడుతూ ఇచ్చిన ఆదేశాలను ఎంత మేరకు పాటిస్తారన్నది చూడాల్సిందే.  ఇక మరో విషయమేంటంటే జగన్ లండన్ యాత్రకు అనుమతి ఇస్తూ కోర్టు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ ఇప్పటి వరకూ తన పాస్ పోర్టు రెన్యువల్ కు కూడా కోర్టకు వెళ్లకుండానే చేయించుకున్నారు. అంతెందుకు కోడి కత్తి కేసులో సాక్షిగా కూడా ఆయన కోర్టుకు హాజరు కావడానికి సాకులు చెబుతూ ఆ కేసును సాగదీస్తున్నారు. ఇక లండన్ నుంచి వచ్చిన తరువాతనైనా ఆయన సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరౌతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.  

బీహార్ ఎన్నికలు.. క్లీన్ ఇమేజ్ కే పీకే పెద్దపీట

51 మంది అభ్యర్థులతో తొలి జాబితా ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీ తరఫున బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఆ జాబితా మహామహా రాజకీయ ఉద్దండులను సైతం విస్మయానికి గురి చేసిందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్న అభ్యర్థులను పరిశీలించినట్లైతే.. వారు అత్యధికులు రచయతలు, మేథమెటీషియన్లు, మాజీ బ్యూరో క్రాట్లు, రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు, వైద్యులు ఉన్నారు.  ప్రశాంత్ కిశోర్ విడుదల చేసిన అభ్యర్థుల తొలిజాబితాపై ఇప్పుడు బీహార్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ప్రశాంత్ కిశోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 51 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారూ, క్లిన్ ఇమేజ్ ఉన్నవారే కావడం విశేషం. అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కులం, ధనం అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉండే బీహార్ లో ఆ రెంటినీ పూర్తిగా విస్మరించి క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే తన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలపాలని ప్రశాంత్ కిషోర్ భావించడం ఆసక్తి కలిగిస్తున్నది. అయితే అదే సమయంలో  ప్రశాంత్ కిశోర్ సామాజిక సమతుల్యతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 51 మందితో విడుదల చేసిన జాబితాలో 16 శాతం మంది ముస్లిం మైనారిటీలు, 17 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఉన్నారు.  ఇటు సామాజిక సమతుల్యత, అటు విద్యావంతులు, క్లీన్ ఇమేజ్ ఉన్నవారితో ప్రశాంత్ కిషోర్ విడుదల చేసిన జాబితా విడుదల చేయడం ద్వారా తాను బీహార్ లో ధన స్వామ్యం, నేరస్వామ్యం లేని రాజకీయాలు నడుపుతానని ప్రశాంత్ కిశోర్ చెప్పకనే చెప్పారు.   

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలంగాణ సర్కార్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్​లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జోవోను హైకోర్టు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం ను ఆశ్రయించాలని నిర్ణించింది. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 13)న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ సర్కార్ డిసైడైంది.  అభిషేక్ మను సింగ్వి తో పాటు సిద్ధార్థ దవే.. రిజర్వేషన్ల పై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్ లతో  ప్రభుత్వ వాదనలు వినిపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.   ఇక హైకోర్టు జీవో9పై స్టేవిధిస్తూ..  తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.   బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు స్టేకు సంబంధించిన ఆర్డర్ కాపీ శుక్రవారం (అక్టోబర్ 10) అర్ధరాత్రి దాటిన తరువాత అందుబాటులోకి వచ్చాయి.   ట్రిపుల్ టెస్టు పాటించకపోవడం పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది.  అలాగే రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా  కాలపరిమితి దాటిన స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు  ట్రిపుల్​ టెస్ట్​ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దామాషా సీట్లను ఓపెన్​ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది.  

అంజన్ కుమార్ యాదవ్ అలక.. టీకప్పులో తుపాన్

జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు. ఎన్నడూ లేని విధంగా జూబ్లీ బైపోల్ విషయంలో టికెట్ ఇవ్వడానికి లోకల్, నాన్ లోకల్ అన్నచర్చను తెరపైకి తెచ్చి తనను పక్కన పెట్టడం వెనుక ఎవరి హస్తం ఉందో తనకు తెలుసుననీ, త్వరలోనే ఆ పేరు బయటపెడతానంటూ మీడియా ముందుకు వచ్చారు. గతంలో  ఒక కాంగ్రెస్ నేత ఇటు మల్కాజ్ గిరి, అటు కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు లోకల్, నాన్ లోకల్ అన్న మాట ఎందుకురాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్  కష్టకాలంలో ఉన్న సమయంలో నిలబడి, కష్టపడి పని చేసిన తనకు టికెట్ రాకుండా చేశారనీ, అలా చేసిందెవరో త్వరలోనే బయటపెడతాననీ అజంన్ కుమార్ యాదవ్ అన్నారు. వాళ్లు నన్ను తొక్కుకుంటూ పోదామనుకుంటే.. నేను ఎక్కుకుంటూ పోతానని సవాల్ విసిరారు. తాను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నని గుర్తు చేసిన అంజన్ కుమార్ యాదవ్.. జూబ్లీహిల్స్ కు పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు కనీసం తనను సంప్రదించలేదన్నారు. త్వరలోనే కార్యకర్తలతో భేటీ అవుతాననీ, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాననీ, పార్టీ వీడే ఉద్దేశంలో ఉన్నట్లు సూచన ప్రాయంగా తెలిపారు. అయితే అంజన్ కుమార్ యాదవ్ అలక టీకప్పులో తుపాను గా తేలిపోయింది. ఆయనను బుజ్జగించడానికి కాంగ్రెస్ సీనియర్లంతా కలిసి వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్ చార్జి కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అంజన్ కుమార్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా అంజన్ కుమార్ యాదవ్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే భేటీ తరువాత  పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీ బైపోల్ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని చెప్పారు. అంజన్ కుమార్ యాదవ్ పార్టీ సీనియర్ నాయకుడనీ, జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారనీ చెప్పిన పొన్నం, పార్టీ అధిష్టానం నిర్ణయం మరో లా ఉందనీ అన్నారు. ఈ విషయంలో అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తికి గురైన మాట వాస్తవమేననీ, అయితే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా అజంన్ కుమార్ యాదవ్ తో మాట్లాడి.. జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని, ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలను వివరించి సముదాయించారనీ పొన్నం చెప్పారు.   పార్టీలో సీనియర్ నేత, రెండు సార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రెండుసార్లు ఎంపీగా పని చేశారనీ, ఆయన హైదరాబాద్ లో పార్టీకి పెద్దదిక్కనీ చెప్పిన పొన్నం.. జూబ్లీ బైపోల్ అంజన్ కుమార్ యాదవ్ సారథ్యంలోనే  జరుగుందని చెప్పారు.  అంజన్ కుమార్ యాదవ్ పరిస్థితి అర్ధం చేసుకున్నారనీ, జూబ్లీ ఎన్నికలలో దగ్గరుంచి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని మాటిచ్చారనీ తెలిపారు. 

75 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల పరుగు

అలుపెరుగని ప్రగతి శ్రామికుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా 15మైలురాయి దాటిన విజనరీ లీడర్  నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో నారా చంద్రబాబునాయుడు ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి అనితర సాధ్యమనదగ్గ విజయాలను అందుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. అటువంటి చంద్రబాబునాయుడు ఈ రోజు మరో అద్భుత, అసాధారణ మైలు రాయిని చేరుకున్నారు. అదేమిటంటే సీఎంగా 15 ఏళ్లు పని చేసిన రికార్డును సాధించారు. దక్షిణభారత దేశంలో ఈ మైలు రాయిని అందుకున్న మూడో వ్యక్తిగా నిలిచారు. అలాగే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా చంద్రబాబు ఘనత సాధించారు.  చంద్రబాబు తొలి సారిగా 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను.. అంటూ 15 ఏళ్ల కిందట తొలి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆ తరువాత మరో మూడు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, విభజత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.    దేశం మొత్తంలో సుదీర్ఘ కాలం సీఎంలుగా పని చేసిన నేతలు ఎందరున్నా.. దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన నాయకులు చంద్రబాబుకు ముందు కేవలం ఇద్దరు మాత్రమే. వారిలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిథి దాదాపు 19 సంవత్సరాలు సీఎంగా పని చేశారు. ఆయన తరువాత పుదుచ్చేరి సీఎంగా ఎన్.రంగసామి 16 ఏళ్ల ఉన్నారు. వారి తరువాత దక్షిణ భారత దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబునాయుడు మాత్రమే.    చంద్రబాబు రికార్డులు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు చంద్రబాబుదే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సఎంగా దాదాపు తొమ్మదేళ్లు పని చేశారు. యాక్యురేట్ గా చెప్పాలంటే ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబునాయుడు ఎనిమిది సంవత్సరాల 255 రోజులు సీఎంగా ఉన్నారు.  నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం ఇప్పటికి ఆరేళ్ల 110 రోజులు. మొత్తం కలిపితే 15 సంవత్సరాల మైలు రాయి దాటారు.  అయితే దక్షిణ భారత దేశం నుంచి చంద్రబాబు కంటే ఎక్కువ కాలం సీఎంలుగా సేవలందించిన కరుణానిథి, రంగసామిల కంటే సీఎంగా చంద్రబాబు  చంద్రబాబు నాయుడు పాలనా విధానం ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంది. ఆయన విజన్ కు, పని విధానానికి, ప్రగతి, సంక్షేమాల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికీ ప్రపంచ దేశాల నాయకులు ఫిదా అయ్యారు. బిల్ క్లింటన్ వంటి నాయకుడు కూడా చంద్రబాబు విజన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.   హైదరాబాద్ ఐటీ రంగానికి ఊపిరి పోసిన హైటెక్ సిటీ నిర్మాణం, లక్షల మందికి ఉపాధి  ఇవన్నీ చంద్రబాబు దూరదృష్టిని ప్రత్యక్ష తార్కానాలే. ఇక చందర్బాబు చేపట్టిన విద్యుత్  సంస్కరణలు రాజకీయంగా చంద్రబాబుకు నష్టం చేశాయి. అప్పట్లో పార్టీ పరాజయానికి  ప్రధాన కారణమయ్యాయి. అయితే ఆ తరువాత వాటి ఫలాలు అందాయి.  నాలుగు దశాబ్దాలకు పైబడిన చంద్రబాబు రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ, నేర మరక లేదని ఆయన ప్రత్యర్థులే అంగీకరిస్తారనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయ వైరంతో చంద్రబాబుపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.  జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ప్రజానేతగా నిలబెట్టింది. చంద్రబాబు నాయుడు  కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రాజనీతిజ్ణుడిగా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.  

నేను ఎప్పడు ఓడి పోలేదు.. ఓడ గొట్టారు : అంజన్ కుమార్ యాదవ్

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ను ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్  బుజ్జగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన మాజీ ఎంపీని ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. టిక్కెట్‌ను నవీన్ యాదవ్‌కు కేటాయించాల్సిన పరిస్థితులను ఆయనకు వివరించారు.  అనంతరం అంజన్  కుమార్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందానని తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తనను ఇప్పుడు పక్కన పెట్టడం బాధాకరమన్నారు. తాను పార్టీలో చాలా సీనియర్ నాయకుడినని, ఎప్పుడూ ఓడిపోలేదని, కానీ అందరూ కలిసి ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు జూబ్లీ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, ఆ తర్వాత కరోనాతో వెంటిలెటర్‌పై చికిత్స చేయించుకున్నానని గుర్తు చేశారు.  పార్టీ విధేయులకు న్యాయం జరగడం లేదన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనను సంప్రదించకుండా జూబ్లీ అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. నర్సరీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. హస్తం పార్టీలో అనేక పదవులు చేపట్టాను. నేను రెండు సార్లు హైదరాబాద్ అధ్యక్షుడిగా పని చేశాను’ అని ఆయన గుర్తుచేశారు. తనకు అసంతృప్తి ఉందని.. తన బాధనంతా మీనాక్షీ నటరాజన్‌కు చెప్పుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కావలసిన వాడిని కాలేకపోయానన్నారు. అగ్రనేత రాహుల్ ప్రధాని అయితే కేంద్ర మంత్రిని అవుతానని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వమని మీనాక్షికి చెప్పినట్లు అంజన్ కుమార్ యాదవ్‌ తెలిపారు.

బీఆర్ఎస్, బీజేపీ కుట్రే అంటున్న బీసీ సంఘాలు

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇస్తుంద‌ని బీజేపీ  ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి ఎలా తెలుసు? అన్న ప్రశ్న  ఇప్పడు బీసీ సంఘాల నుంచి వస్తున్నది.  కాంగ్రెస్ లేస్త లేదు, బీఆర్ఎస్ స‌స్త లేదు, బీజేపీకి చూస్తే అవకాశం మంచిగుంది అంటూ  జీవోపై కోర్టు స్టే ఇవ్వ‌డానికి ఒక రోజు ముందు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి అన్న మాట‌లేంటంటే.. కాంగ్రెస్ కోర్టులో పెద్దగా  కొట్లాడ‌దు కావాలంటే చూడండి అన్నారు. ఈ విష‌యం అంతగా ఆయ‌న‌కు ఎలా తెలుసు? అన్న‌దొక ప్ర‌శ్న కాగా.. ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీసీ సంఘాల‌ కామెంట్ ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మ‌క్కై చేసిన కుట్ర‌గా అభివ‌ర్ణించారు. బీఆర్ఎస్ అప్ప‌ట్లోనే 50 శాతానికి మించ‌కుండా బీసీల‌కు చ‌ట్టం తీసుకొచ్చింద‌నీ, కేంద్రంలో ఉన్న బీజేపీ వీరికి మ‌రింత సహకారం అందిస్తోంద‌ని దుయ్య‌బ‌డుతున్నాయి బీసీ సంఘాలు. త‌మ‌కు లేక లేక ఒక అవ‌కాశం వ‌స్తే మా నోటికాడ కూడు లాగేసుకున్నార‌ని తీవ్రంగా మండి ప‌డుతున్నారు బీసీలు.  వీహెచ్ అయితే  నాలుగు వారాల వాయిదా అంటే  త‌మ‌కు ద్రోహం చేయ‌డ‌మేన‌ని అన‌గా..  ఆర్ కృష్ణ‌య్య  బీసీల నోట్లో మ‌ట్టి కొట్టార‌ని.. మేం బందుకు పిలుపునిస్తున్నామ‌ని ప్రకటించారు. ఇక హైకోర్టులో ప్ర‌భుత్వ వాద‌న‌లు వినిపించిన సీనియ‌ర్ లాయ‌ర్ ర‌వి వ‌ర్మ‌.. రాష్ట్రంలో 15 శాతం కూడా లేని ఓసీల‌కు ఎందుకు అంత రిజ‌ర్వేష‌న్ ఏం చేస్కుంటారు? అస‌లు మీకు 62 శాతంతో వ‌చ్చిన స‌మ‌స్య ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే 1990ల కాలంలో నాడు జ‌య‌ల‌లిత‌.. ఢిల్లీ వెళ్లి అక్క‌డ అప్పటి ప్రధాని పీవీ ముందు కూర్చుని నా రిజ‌ర్వేష‌న్ నాకు ఇస్తారా చ‌స్తారా అన్న‌ట్టు కొట్లాడార‌నీ, మ‌నం కూడా అలా వెళ్లి మోడీ ఇంటి ముందు కూర్చుందాం ర‌మ్మంటూ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ త‌ర‌ఫు నుంచి గంగుల క‌మ‌లాక‌ర్. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీఎంతో స‌హా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా క‌ల‌సి.. ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర అంత పెద్ద ధ‌ర్నా చేస్తే.. అప్పుడు బీఆర్ఎస్ ఎక్క‌డుందో చెప్పాల‌ని నిల‌దీశారు కాంగ్రెస్ లీడ‌ర్లు.  దేశంలోనే తొలిసారిగా మేం చిత్త‌శుద్ధితో కుల‌గ‌ణ‌న స‌ర్వే చేప‌డితే క‌నీసం పాల్గొన‌ని బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా ఉంద‌ంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఒక అసెంబ్లీ తీర్మానం చేశాక,  అది కూడా అన్ని ప‌క్షాల మద్దతుతో ఏకగ్రీవ  ఆమోదం పొందిన‌ బిల్లును హైకోర్టు త‌ప్పు ప‌ట్ట‌డం, స్టే ఇవ్వ‌డం ఏమిటంటున్నారు కాంగ్రెస్ నాయకులు.   ఒక బిల్లును అసెంబ్లీ ఆమోదించి గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కుగానీ, రాష్ట్ర‌ప‌తి ద‌గ్గ‌ర‌కుగానీ పంపితే.. మూడు నెల‌ల్లోగా తేల్చేయాలి. ఒక వేళ అలా జ‌ర‌క్కుంటే ఆ బిల్లు ఆమోద‌యోగ్య‌మైన‌ట్టేన‌ని  సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తేదీల‌తో స‌హా గుర్తు చేశారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క. ఇక మా చిత్త‌శుధ్దిని శంకించ‌డానికి బీఆర్ఎస్, బీజేపీలు స‌రిపోవ‌ని అన్నారు  టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. చేయాల్సిందంతా చేసి వారు ఇప్పుడు ఆడుతున్న ఈ నాట‌కాలు ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని మండిప‌డ్డారు మ‌హేష్ కుమార్ గౌడ్. ఇక మంత్రి వాకిటి శ్రీహ‌రి మాట్లాడుతూ,  కాంగ్రెస్ 42 శాతానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని.. ఇది తెలంగాణ ఇవ్వ‌డంలో అయినా బీసీ రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌లో అయినా ఒక‌టే విధానంతో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అన్నారు మంత్రి వాకిటి. రేవంత్  త‌మ పాలిట దేవుడిలా ఈ రిజ‌ర్వేష‌న్ల బిల్లు తీసుకొచ్చార‌ని.. అయినా స‌రే వీరంతా క‌ల‌సి త‌మ నోటికాడ ముద్ద లాగేసుకున్నార‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు ఒక లేడీ లాయ‌ర్. సుప్రీంకైనా వెళ్లి.. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌కు కాంగ్రెస్ క‌ట్టుబ‌డితే.. తామంతా క‌ల‌సి వ‌స్తామ‌ని అన్నారు బీసీ సంఘం నేత‌లు.  హైకోర్టు స్టే ఇవ్వ‌డంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఆపేసింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. ఈ దిశ‌గా ఒక గెజిట్ కూడా విడుద‌ల చేసింది. దీంతో ప్ర‌స్తుతం ఉన్న ఎన్నిక‌ల కోడ్ కాస్తా ర‌ద్ద‌య్యింది.

నవీన్ యాదవ్ ద లోక‌ల్ బాయ్ ఆఫ్ జూబ్లీహిల్స్!

1978 నుంచీ జూబ్లీహిల్స్ స్థానికుల‌ లో కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌న్న‌ది తాజాగా కాంగ్రెస్ నుంచి అభ్య‌ర్ధి న్న‌ న‌వీన్ యాదవ్ చేసిన కామెంట్. ఇంత‌కీ ఏంటీ జూబ్లీహిల్స్ హిస్ట‌రీ. ఈ నియోజ‌క‌వ‌ర్గం గ‌తంలో ఏ సెగ్మెంట్లో భాగంగా ఉండేది? ఆ డీటైల్స్ ఏంటి? అని చూస్తే.. ఇది 1952 లో ద్విస‌భ్య స‌భ‌గా ఉండేది. ఇక్క‌డ ఎస్సీ కేట‌గిరిలో ఒక‌రు, జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో ఒక‌రు ఎంపిక‌య్యారు. వారెవ‌ర‌ని చూస్తే బ‌త్తులు సుమిత్రాదేవి ఎస్సీ కేట‌గిరి, న‌వాజ్ జంగ్ జ‌న‌ర‌ల్ కేట‌గిరి. ఆ త‌ర్వాత 1960లో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ్గా.. ఈ ఎన్నిక‌లో సికింద్రాబాద్ కి చెందిన పార్సీ సంప‌న్నురాలు రోడా మిస్త్రీ గెలిచారు. 1962ఎన్నిక‌లోనూ ఆమే గెలిచారు. ఆ త‌ర్వాత ఈ సెగ్మెంట్ హిస్ట‌రీ 2009లో మొద‌లైన‌ట్టు తెలుస్తుంది. ఈ ఎన్నిక‌ల్లో పీజేఆర్ కుమారుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి గెలిచారు. అప్ప‌టి వ‌ర‌కూ ఇది ఖైర‌తాబాద్ సెగ్మెంట్లో ఉండేది. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2018, 2023లోనూ ఆయ‌నే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మాగంటి సైతం ఈ ప్రాంతానికి స్థానికులేం కాదు. ఆయ‌న హైద‌రాబాద్ లోని హైద‌ర్ గూడ నివాసి. దీంతో న‌వీన్ యాద‌వ్ అన్న‌ట్టు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికులు ఎమ్మెల్యేగా అయ్యిందే లేదు. మొన్న కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన అజ‌ర్ సైతం ఇక్క‌డి వారు కారు. మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంద‌న్న కోణంలో ఈ ప్రాంతం నుంచి ఆయ‌న్ను పోటీకి దింపారు అధిష్టానం పెద్ద‌లు. ఇప్పుడు తొలిసారి న‌వీన్ యాద‌వ్ తానీ ప్రాంత స్థానికుడిననీ.. మీ బిడ్డ‌ను గెలిపించాలనీ కోరుతున్నారు. అర్ధశతాబ్దం నుంచీ జూబ్లీహిల్స్ లో అన్యులు రాజ్య‌మేలుతున్నార‌నీ.. మీ ఇంటి త‌మ్ముడు మీరు పిలిస్తే ప‌ల‌క‌డానికి యూస‌ఫ్ గూడ చెక్ పోస్టులోని నా ఆఫీసు త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌నీ.. మీకంద‌రికీ అందుబాటులో ఉంటాన‌ని అంటున్నారాయ‌న‌. అంతే కాదు ప‌దేళ్ల పాటు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేయ‌లేని పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక మాత్రం చేస్తుందా? అన్న లాజిక్ లాగుతున్నారు. త‌న‌పై పెట్ట‌ిన‌వ‌న్నీ ఫాల్స్ కేసుల‌నీ.. అవ‌న్నీ వీగిపోతాయి కాబ‌ట్టి.. చ‌దువుకున్న వాడ్ని.. స్థానికుడ్ని.. నాకు ఓటు వేసి గెలిపిస్తే మీ ఇంటి మ‌నిషిగా ఉంటూ.. మీకు అన్ని ప‌నులు చేసి పెడతానంటున్నారు న‌వీన్ యాద‌వ్.

ఏంటీ ఓసీల‌కు కూడా రిజర్వేషన్లా వెంకటరమణా!?

కామారెడ్డి నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి చిప్పు చెడిపోయిందేమో తెలీదుగానీ, ఓసీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్ కావాలంటున్నారాయ‌న‌. ఇప్ప‌టికే బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ మీదున్న అప‌వాదు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ధ‌ర్మ‌పురి అర‌వింద్ వంటి వారు తాజాగా చేసిన కామెంట్లు  బీజేపీ మీద‌ యాంటీ బీసీ ముద్ర వేస్తున్నాయి. అది చాలదన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ తాజా వ్యాఖ్యలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.   రిజర్వేషన్ల వ్యవహారంపై బీజేపీ కావాలని ఆడిస్తున్న డ్రామాగా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   బీఆర్ఎస్..  బీసీల‌కు వ్య‌తిరేకంగా యాభై శాతం క్యాప్ చ‌ట్టం తేగా..  తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన‌   బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.  కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఢిల్లీకి వెళ్లి అక్క‌డ నిర‌స‌న వ్య‌క్తం చేసినా కూడా కేంద్రం స్పందన శూన్యం. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కేంద్రంలోని బీజేపీయే అడ్డు పుల్ల వేస్తోంద‌న్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానాలకు తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి.  కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఓసీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్లు కావాలంటూ చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు కాదు.. వాస్తవమే అనిపిస్తోందని అంటున్నారు.   మొన్న‌టికి మొన్న కామారెడ్డికి వ‌ర‌ద వ‌చ్చిన‌పుడు తాను ఇంటింటికీ వెళ్లి.. చాకిరీ చేయ‌లేను క‌దా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేసిన వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి.. మ‌రోమారు త‌న వితండ వాద‌న వెలుగులోకి తేవ‌డంతో.. ఈసారి ఎన్నిక‌ల్లో ఆ 8 సీట్లు కూడా ఊడిపోయేలా ఉన్నాయ‌న్న హెచ్చ‌రిక‌లు అందుతున్నాయ్. ఓబీసీల‌కు ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తే తామేమీ అడ్డుకోలేద‌ని అంటారు వీహెచ్ వంటివారు. ఎందుకంటే వారిలో కూడా పేద‌లుంటారు కాబ‌ట్టి,  తాము ఆటంక‌ప‌ర‌చ‌లేద‌న్న కామెంట్ చేశారు వీహెచ్.   56 శాతం గా ఉన్న బీసీల ప్ర‌యోజ‌నాల‌ను అడ్డుకునే విధంగా హైకోర్టు స్టే ఇవ్వ‌డం వెన‌కున్న శ‌క్తులు త్వ‌ర‌లోనే బ‌య‌ట ప‌డ‌తాయ‌ని అంటున్నారు కాంగ్రెస్ నాయ‌కులు, ఇత‌ర బీసీ సంఘాల వారు. ఇప్ప‌టికే బీజేపీ మీదున్న నింద‌లు చాల‌వ‌న్న‌ట్టు వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి వంటి వారు బీజేపీని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేస్తున్నార‌నీ.. ఇది విప‌రీత అర్ధాల‌కు దారి తీసి పార్టీని మ‌రోమారు పుట్టి ముంచినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు కొంద‌రు కాషాయ పార్టీ లీడ‌ర్లు. అనువుగాని చోట అధికుల‌మ‌న‌రాద‌న్న సామెత‌లు గుర్తు చేస్తున్నారు.

ఇచ్చిన సొమ్ముకు డబల్ అంటూ రూ.20 కోట్లకు టోకరా!

హైదరాబాద్ కు చెందిన శ్రీ విద్య అనే మహిళ తన భర్త రాజశేఖర్ రెడ్డి తో కలిసి ఏపీ కి చెందిన ఒక్క ఎమ్మెల్యే  పిఏ నుండి 2వేల కోట్లు వస్తున్నాయని... 2వేల కోట్లు కోసం కంటైనర్లు కొనాలని  వివిధ ప్రాంతాలకు చెందిన మహిళ లను మోసం చేసి కోట్లులో డబ్బులు వసూలు చేసింది. ఏపీకి చెందిన విజయసాయిరెడ్డి మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పి... అమాయక మైన జనాలను నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. కొంతమంది వద్ద బంగారం తీసుకునీ ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మ బలికింది. ఇలా కూకట్ పల్లి, కెపిహెచ్ బి కాలనీ, మియాపూర్ మొదలగు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు కట్టు కథలు చెప్పి వారి వద్ద నుండి బంగారం, సొమ్ములు వసూలు చేసి ఏకంగా 20 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది.   అనంతరం పటాన్ చెరుకు మకాం మార్చేసింది. తీసుకున్న డబ్బులు కానీ బంగారం కానీ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆమెను నిలదీశారు.  దీంతో శ్రీవిద్య వారినందరినీ.. గురువారం సాయంత్రం తన నివాసానికి రమ్మని.. వచ్చిన ఎనిమిది మంది మహిళలను ఒక గదిలో బంధించి, భర్త రాజశేఖరరెడ్డి, తమ్ముడు, పనిమనిషి,  ముగ్గురితో దాడి చేయించింది. ఈ దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీవిద్యపై విద్య మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

తెలంగాణ హైకోర్టులో రేవంత్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేసింది.   స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. జీవో 9పై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం (అక్టోబర్ 9)న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ..  57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలిందనీ,  బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు నివేదిక ఎందుకని వాదించారు. అలాగే రిజర్వేషన్ల బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదన్నారు. అలాగే నిర్ణీత గడువులోగా గవర్నర్‌  ఆమోదించకపోతే దానిని చట్టంగా భావించాల్సి ఉంటుందని వాదించారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చిన  సుదర్శన్‌ రెడ్డి, నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుందని వివరించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్‌ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరని వాదించారు. తెలంగాణ ప్రభుత్వం  రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో  తెచ్చిందని వాదించారు. 

బీహార్‌లో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం : తేజస్వి యాదవ్

  బీహార్ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు దీనికి సంబంధించి చట్టం తీసుకువస్తామని పేర్కొన్నారు. 20 నెలల్లోపు నిరుద్యోగం లేని బీహార్‌ను చూపిస్తామని స్పష్టం చేశారు.  యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్డీఏ సర్కార్ నిరుద్యోగ భృతి ఇస్తోందని తేజస్వి విమర్శించారు. మరోవైపు బీహార్‌లో 2.9కోట్ల కుటుంబాలున్నాయని హామీ ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎన్నికల వేళ కొండ మీది కోతినైనా తెస్తామని నేతలు చెబుతారని పలువురు విమర్శిస్తున్నారు. ఉద్యోగాలు వేలల్లో భర్తీకే ఏళ్లు పడతాయి. అలాంటిది తాము ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.  బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది సాధ్యమయ్యే విషయమే కానీ, దానికి బలమైన సంకల్పం అవసరమని అన్నారు. తమ హామీలను ఎన్డీఏ కూటమి నకలు చేస్తోందని విమర్శించారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6 మరియు 11 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఒక వైపు ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, మరో వైపు ఎన్నికల వ్యూహకర్త మరియు జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా తన పార్టీ తరఫున పోరాటానికి సిద్ధమవుతున్నారు.

జూబ్లిహిల్స్ బైపోల్.. న‌వీన్ యాద‌వ్ గెలుపు అవకాశాలెంత?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా న‌వీన్ యాద‌వ్ ఖరారయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.  న‌వీన్ యాదవ్ బ‌ల‌మైన నేత కావ‌డం వ‌ల్లే.. ఆయ‌న‌పై కేసులు పెడుతున్నార‌ని  టీపీసీసీ చీఫ్‌ మ‌హేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్క‌డ కాంగ్రెస్ కి, న‌వీన్ కి ఉన్న గెలుపు అవ‌కాశాలెన్ని అన్న చర్చ అయితే ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో నవీన్ యాదవ్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇది నిన్నా, మొన్నా అని కాదు.. గత కొన్నేళ్లుగా ఆయనీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.  పండ‌గేదైనా స‌రే ఈ సెగ్మెంట్ లో గ‌త కొన్నాళ్లుగా నవీన్ యాదవ్  హ‌డావిడి హంగామా కనిపిస్తోంది.  ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సామూహిక శీమంతాలు జ‌రిపించారు న‌వీన్ యాదవ్.  నవీన్ యాదవ్  విద్యావంతుడైన యువ‌కుడు కూడా కావ‌డంతో యూత్ ఆయనకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ కనిపిస్తోంది. ఎంత పలుకుబడి, ఫాలోయింగ్ ఉన్నా కూడా నవీన్ యాదవ్ కు రెండుమూడు అంశాల్లో  మాత్రం  సవాళ్లు ఎదురౌతున్నాయి.  ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఇక్క‌డ ముస్లిం మైనార్టీలు ఎక్కువ‌. అందుకే ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గోపీనాథ్ పై అజారుద్దీన్ ను నిలబెట్టింది  కాంగ్రెస్. కానీ ఎందుక‌నో తెలీదు గ‌త కొంత కాలంగా ఇక్క‌డి ఓట‌ర్లు బీఆర్ఎస్ కే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తున్నారు. దానికి తోడు కాంగ్రెస్ సైతం మైనార్టీల్లో ఎవ‌రికీ ఇంత వ‌ర‌కూ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అజ‌ర్ ని ఎమ్మెల్సీ చేసి ఆపై హోం మంత్రిత్వం ఆయ‌న‌కు క‌ట్ట‌బెడ‌తార‌న్న మాట వినిపించింది. ఈ ఎన్నిక‌ల‌క‌న్నా ముందే కాంగ్రెస్ ఆప‌ని చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ అలా చేయలేదు. ఇక రేవంత్ కేబినెట్ లో  ఒక్క ముస్లింకి కూడా చోటు దక్కలేదన్న అంశంపై   బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ని ఎండ‌గ‌డుతోంది. దానికి తోడు సిటీలో బీఆర్ఎస్ ప్ర‌భావం  ఎక్కువ‌. ఆ ప్రభావాన్ని ఎదుర్కొని  న‌వీన్ యాద‌వ్ జూబ్లిహిల్స్ లో నెగ్గుకు రావ‌డం సాధ్య‌మేనా? అని రాజకీయవర్గాలు అంటున్న పరిస్థితి. వీటికి తోడు సిటీలో హైడ్రా ఎఫెక్ట్ కూడా ఎక్కువే. ప్ర‌త్యేకించి జూబ్లిహిల్స్ సెగ్మెంట్లో హైడ్రా పెద్ద న‌ష్టం క‌లిగించ లేదు. కానీ హైడ్రా ఫ‌స్ట్ ఆప‌రేష‌న్ ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత ఘ‌ట్టం జ‌రిగింది ఇక్క‌డే.  దీంతో ఒక ర‌క‌మైన కాంగ్రెస్ వ్య‌తిరేక‌త అంత‌ర్లీనంగా ఉందీ ప్రాంతంలో. ఆ త‌ర్వాత బీఆర్ఎస్ గ‌తంలో ప్ర‌వేశ పెట్టిన బ‌స్తీద‌వాఖాన వంటి వాటిని కాంగ్రెస్ స‌రిగా నిర్వ‌హించ‌డం లేద‌న్న టాక్ కూడా బాగానే స్ప్రెడ్ అవుతోంది. ఇలాంటి వాటి ద్వారా కూడా న‌వీన్ యాద‌వ్ కి వ్య‌తిరేక‌త ఎదుర‌య్యే అవ‌కాశ‌ముంది. ఆపై అన్నిటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా ఎదుర్కోబోతున్న‌ మాగంటి సునీత‌ గోపినాథ్ స‌తీమ‌ణి. దీంతో నవీన్ యాదవ్   సెంటిమెంటును   జ‌యించాల్సి ఉంటుంది. మ‌హిళా ఓట‌ర్లు  ఎప్ప‌టిలాగానే అటు వైపు మ‌ళ్లితే న‌వీన్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కూ లేడీ సెంటిమెంట్ గ్రాబ్ చేయ‌డం కోసం చేసిన ప్ర‌య‌త్నమంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. ఇక ఫైన‌ల్ గా కంటోన్మెంట్ రిజ‌ల్ట్ రిపీట్. కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచిన మాట వాస్త‌వ‌మే. కానీ అదంటే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌. అదే ఇప్పుడు పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చి సుమారు రెండేళ్లు. ఈ కాలంలో కొంత వ్య‌తిరేక‌త వ‌చ్చిన మాట వాస్త‌వం. వీట‌న్నిటినీ త‌ట్టుకుని న‌వీన్ యాద‌వ్ జూబ్లి కింగ్ కావ‌ల్సి ఉంది. మ‌రి ఆయ‌న ఓన్ చ‌రిష్మాతో ఇన్ని వ్య‌తిరేకతలను ప‌రిస్థితుల‌ను నెగ్గుకు రాగ‌ల‌రా? అన్న‌ది తేలాలంటే న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆ రోజే ఈ ఉప ఎన్నిక ఫ‌లితాలు వ‌స్తాయి కాబ‌ట్టి.

ఇదెక్కడి చోద్యం?.. విమర్శల్లోనూ వివక్షా?

ఈ యాక్టివిస్టులున్నారే! త‌న మ‌న బేధాలు పాటించ‌డం వీరికి పెన్నుతో పెట్టిన విద్య‌. వివ‌క్ష చూప‌డం అన్న‌ది వీరికి మైకుతో వ‌చ్చిన ఆర్టు. ఇటీవ‌ల త‌మిళ‌నాడు కేంద్రంగా రెండు ప్ర‌ధాన దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. వాటిలో మొద‌టిది.. క‌రూర్ లో జ‌రిగిన‌  తొక్కిస‌లాట కాగా.. మ‌రొక‌టి  త‌మిళ‌నాడులో త‌యారు చేసిన దగ్గుమందు కార‌ణంగా మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ లో కొంద‌రు పిల్ల‌లు చ‌నిపోవ‌డం. వీటిపై మ‌న ద‌గ్గ‌రున్న యాక్టివిస్ట్ బ్యాచ్ క‌నీపం స్పందించలేదు.  అదే   బీజేపీ  కూట‌మి పార్టీ నేత‌లు చేసే త‌ప్పొప్పుల మీద వీళ్ల బాదుడు.. ఒక రేంజ్ లో ఉంటుందంటే అతిశ‌యోక్తి కాదు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైర‌ల్ జ్వ‌రాన్ని కూడా వ‌ద‌ల‌కుండా వాయించేస్తారు. అదే విజ‌య్ కరూర్ రోడ్ షో కారణంగా  41 మంది చ‌నిపోయారు. అయితే ఈ సంఘటనపై సోకాల్డ్ యాక్టివిస్టులు కనీసం స్పందించను కూడా స్పందించలేదు.  అదే బీజేపీ కేంద్రంగా ఏదైనా చీమ చిటుక్కుమ‌న్నా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తుమ్మినా ద‌గ్గినా కూడా వీరి యాంటీ ర్యాగింగ్ క్యాంపెయినింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ మాట‌కొస్తే మొన్న మోడీ మ‌ణిపూర్ కి వెళ్లిన‌పుడు కూడా ఘ‌ట‌న జ‌రిగిన ఇన్ని రోజుల‌కు, ఇన్ని గంట‌ల‌కు, ఇన్ని గ‌డియ‌ల‌కు ఆయ‌న‌క్క‌డ‌కు వెళ్ల‌డ‌మా అంటూ సెక‌న్ల‌తో స‌హా లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీసి మ‌రీ పోస్టులు పెట్టారీ పెద్ద మ‌నుషులు. అలాంటిది విజ‌య్ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించడంపై ఎందుకు స్పందించడంలేదు?  అంటే ఇక్క‌డే ఉంది అస‌లు లాజిక్కు.. ఇక్క‌డ విజ‌య్ కూడా సేమ్ టూ సేమ్ వీరిలాగానే బీజేపీని వ్య‌తిరేకిస్తారు కాబట్టి.  త‌న సినిమాలో సీన్లు పెట్టిమ‌రీ ఆయ‌న యాంటీ బీజేపీ వాయిస్ వినిపిస్తారు కనుక.  తాజాగా త‌మిళ‌నాడు కు చెందిన ఒక కంపెనీ త‌యారు చేసిన విష‌పూరిత ద‌గ్గుమందు ద్వారా పిల్ల‌లు చ‌నిపోతే.. అదేంటో తెలీదు జ‌స్ట్ ఆస్కింగ్ ప్ర‌కాష్ రాజ్ ప‌త్తా లేరు. ఇక డీఎంకే ద్వారా ఎంపీ అయిన క‌మ‌ల్ హాస‌న్ క‌నిపించ‌రు. ఇక స‌నాత‌న ధ‌ర్మం అంటే విరుచుకుప‌డే స‌త్య‌రాజ్ మాట పెగ‌ల‌దు. అంటే ఇక్క‌డ వివ‌క్ష‌పై పోరాటం చేసే ఈ యోధాను యోధుల గ‌ళం, క‌లం కొన్నిసార్లంతే అదేంటో తెలీదు.. ఆటోమేటిగ్గా మూగ‌పోతాయి. వీరి దృష్టిలో కరూర్ తొక్కిసలాట అయినా, దగ్గుమందు వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అయినా  య‌ధాలాపంగా జరిగినవే. గ‌ట్టిగా నిల‌దీస్తే.. వీటి వెనుక కూడా  బీజేపీ కుట్ర అంటూ బుకాయించినా ఆశ్చ‌ర్యం లేదు. ఇదే ప్ర‌కాష్ రాజ్ అయోధ్య‌లో బాబ్రీ మ‌సీదు కూల‌దోసి మ‌రీ అక్క‌డ రామ మందిరం నిర్మించారని తీవ్రఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తారుగానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ కూలిన దేవాల‌యాల సంఖ్య అస్స‌లు ప‌రిగ‌ణ‌లోకి తీస్కోరు.  ఇక దేవుడు లేనే లేడ‌నే క‌మ‌ల్ హాస‌న్ కి విజ‌య్ పార్టీ రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిస‌లాట కార‌ణంగా పోయిన ప్రాణాల‌కు విలువ లేన‌ట్టే బిహేవ్ చేస్తారు. ఆపై త‌మ రాష్ట్రంలో త‌యారైన ద‌గ్గు మందు కార‌ణంగా చ‌నిపోయిన పిల్ల‌ల విషయంలో అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నట్లుగా  స‌త్య‌రాజ్ సైలెంటైపోతారు. ఇక్క‌డ కూడా అంతే తెలుగులో కొంద‌రు యాక్టివిస్టులుంటారు. వీరు కూడా కేవ‌లం హిందుత్వ‌, ఎన్డీయే, కూట‌మి ద్వారా జ‌రిగే త‌ప్పొప్పుల మీద మాత్ర‌మే దృష్టి సారిస్తారు. మిగిలింది ఏమైనా  కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తారు. ఇదెక్క‌డి విడ్డూర‌మో అర్ధం  కాదంటారు కొంద‌రు సామాజిక‌వేత్త‌లు.

మజ్లిస్ మద్దతు కాంగ్రెస్ కే!

జూబ్లీహిల్ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ ఎవరివైపు అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. నిన్న మొన్నటి దాకా జూబ్లీ బైపోల్ లో పోటీ అంటూ లీకులిచ్చిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు పోటీలో లేదు. కాంగ్రెస్ జూబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించడంతోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా విజయం సాధించడం కష్టమే. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఒకింత ఎక్కువే. బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో నిలబడే పార్టీ అభ్యర్థి పేరు అందరి కంటే ముందుగానే ప్రకటించి ప్రచారం ప్రారంభించేయడం, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించుకోలేక మల్లగుల్లాలు పడుతుండటంతో.. జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. అయితే అందరూ ఊహించినట్లుగానే.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారు అయ్యారు. ఈయన ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకచక్యంగా, ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాల్సి ఉంటుంది. నవీన్ యాదవ్ వినా మరెవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మజ్లిస్ మద్దతు లభించే అవకాశాలు లేవు. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం అంత తేలిక కాదు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అజారుద్దీన్ మొదలకుని ఈ నియోజకవర్గ టికెట్ కోసం రేసులో ఉన్న ఒక్కొక్కరినీ పక్కకు తప్పించి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారయ్యేలా చూశారు. ఇందుకోసం ఆయన అధిష్ఠానాన్ని ఒప్పించారు. ఎవరినీ నొప్పించకుండానే.. పక్కకు తప్పించి తాను కోరుకున్నట్లు నవీన్ యాదవ్ కు పార్టీ హైకమాండ్  టికెట్ కన్ ఫర్మ్ చేసేలా చూశారు.   అయితే జూబ్లీ బైపోల్ కు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత.. ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు నవీన్ యాదవ్ పై కేసు నమోదు కావడంతో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పునరాలోచనలో పడుతుందా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమయ్యాయి. అయితే కాంగ్రెస్ నవీన్ యాదవ్ నే అభ్యర్థిగా ఖరారు చేసింది.  ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే..  ఆయనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. పైగా మజ్లిస్ పార్టీలో అనుబంధం ఉంది. తొలి నుంచీ కూడా జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉంటే మద్దతు ఇస్తామని మజ్లిస్ లోపాయికారీగా చెబుతూ వస్తున్నది. మజ్లిస్ మద్దతు ఉంటే నియోజకవర్గ పరిధిలో దాదాపు 90 వేల పైచిలుకు ఉన్న మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడతాయి. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వమే ఖరారయ్యేలా పావులు కదిపారు. ఇక ఇప్పుడు సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న బీఆర్ఎస్ తన ఆశ నెరవేరాలంటే చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  

జగన్ విశాఖ పర్యటనకు పోలీసుల రూట్ మ్యాప్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్నారు.  ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఆయనీ పర్యటన చేపట్టారు. అయితే నేడు విశాఖలో మహిళల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనున్నందున కాన్వాయ్ లో 10కి మించి వాహనాలు ఉండకూడదని, రోడ్ షో నిర్వహించడం, కూడళ్ల వద్ద ప్రసంగాలు చేయకూడదని ఆయన పర్యటనకు పోలీసులు షరతులు విధించారు. జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ ఇచ్చి, దాని ప్రకారమే పర్యటన సాగాలని కండీషన్ పెట్టారు. పోలీసులు నిర్దేశించిన మార్గం ప్రకారం  విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడీ జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.  నిర్దేశించిన మార్గంలో, నిబంధనలకు లోబడే జగన్ పర్యటన సాగాలని పోలీసులు స్పష్టంగా ఆదేశించారు.