ఫార్ములా ఈ రేస్ కేసు.. కేటీఆర్ క్విడ్ ప్రోకో!.. అరెస్టేనా?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు గవర్నర్ అనుమతించడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలోకే ఫార్ములా ఈ కార్ కేసును లొట్టపీసు కేసుగా గతంలో కేటీఆర్ అభివర్ణించడంతో.. అసలీ కేసేంటి? ఇందులో కేటీఆర్ పై ఉన్న అభియోగాలేంటి.. పది వారాల పాటు నాన్చి నాన్చి గవర్నర్ ఇప్పుడే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడమేంటి? జూబ్లీ బైపోల్ ఫలితానికీ.. గవర్నర్ అనుమతి ఇవ్వడానికి సంబంధం ఏంటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.   బీఆర్ ఎస్ హయాంలో  గత అసెంబ్లీ ఎన్నికల  ముందు 2023లో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఇది సాఫీగానే సాగిపోయింది. అయితే ఆ  తర్వాత దీనిపై తీవ్ర వివాదాలు ముసురుకున్నాయి. ఈ రేస్‌ను కండక్ట్ చేసిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌కు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఖాతా నుంచి 54.88 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి.  అయితే  ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు ఈ సొమ్ము బదిలీ చేసేందుకు   హెచ్ ఎండీఏ ఎటువంటి తీర్మానం చేయలేదు. కనీసం ఆర్థిక శాఖ అనుమతి కూడా పొందలేదు.  దీంతో కేవలం అప్పటి మంత్రి  కేటీఆర్  నోటి మాటే వేదంగా, శాశనంగా భావించి హెచ్ఎండీఏ దాదాపు 54.88 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు బదిలీ చేసింది.   అయితే  ఆ వెంటనే 45 కోట్ల రూపాయలను కేటీఆర్  ఖాతాకు ఫార్ములా ఈ కార్  ఈవెంట్ స్పాన్సర్ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థకు  బదిలీ చేసింది. దీనిపైనే  కేసు నమోదైంది.  సుమారు 55 కోట్ల రూపాయలను ఇచ్చి దానిలో 45 కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల పేరుతో కేటీఆర్ ఖాతాకు బదిలీ చేశారన్నది ఏసీబీ  ఆరోపణ. సో ఈ ఫార్ములా రేస్ వెనుక భారీ అవినీతి జరిగిందని ఏసీబీ చెబుతోంది. దీంతో మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అసలు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీయాలంటే మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను విచారించాలని కోరుతూ ఏసీబీ  గవర్నర్‌  అనుమతి కోరారు. అనుమతి ఇవ్వడంలో జాప్యం చేసినా గవర్నర్ చివరకు అనుమతి ఇచ్చారు. దీంతో కేటీఆర్ చిక్కుల్లో పడ్డట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేటీఆర్ క్విడ్ ప్రోకో ప్రస్ఫుటంగా బయటపడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటి వరకూ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వకుండా మౌనంగా ఉన్న గవర్నర్ ఇప్పుడు అంటే జూబ్లీ ఉప ఎన్నిక తరువాత ఓకే చెప్పడం వెనుక బీజేపీ ఉందంటున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత అయితే ఏకంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ బాంబ్ పేల్చారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీ ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడానికి బీఆర్ఎస్ తో  రహస్య ఒప్పదం అన్న ఆరోపణలను ప్రజలు విశ్వసించడమే కారణమని కమలనాథులు భావిస్తున్నారు. దాంతో  అటువంటిదేమీ లేదని చాటుకోవడానికే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి లభించిందని అంటున్నారు. 

తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు?.. రాజీనామా దిశగా దానం, కడియం అడుగులు

తెలంగాణలో మరో  రెండు ఉప ఎన్నికలు జరగడం ఖాయమా అంటే ఔననే చెప్పాల్సి వస్తున్నది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నిర్ణయం తీసుకునే విషయంలో తెలంగాణ స్పీకర్ విచారణ జోరందుకుంది. సుప్రీం కోర్టు స్పీకర్ నిర్ణయం వెలువరించడానికి నిర్దుష్ట గడువు విధించడంతో ఆయన విచారణ ప్రక్రియను స్పీడప్ చేశారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది పక్కన పెడితే... ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపి మరీ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సారి నోటీసులు అందుకుని కూడా స్పీకర్ విచారణకు గైర్హాజరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెడ్యే కడియం శ్రీహరిలకు స్పీకర్ మరోసారి  నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు రాజీనామా యోచన చేస్తున్నట్లు వారి వారి సన్నిహితుల ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికే వారిరువురూ కూడా వారి వారి అనుచరులతో భేటీ అయ్యారు.  గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలలో దానం, కడియం కూడా ఉన్న సంగతి తెలిసిందే.  కాగా పార్టీ ఫిరాయించిన మిగిలిన ఎనిమిది మందీ ఇప్పటికే స్పీకర్ విచరణకు హాజరౌతుండగా కడియం, దానంలు మాత్రమే గైర్హాజరయ్యారు.  కాగా మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలూ తాము పార్టీ ఫిరాయించలేదని, టెక్నికల్ గా ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతున్నారు. అయితే అలా చెప్పే అవకాశం కడియం, దానంలకు లేకుండా పోయింది. ఎందుకంటే వీరిరువురూ కాంగ్రెస్ గూటికి చేరారనడాని బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆ కారణంగానే వీరు స్పీకర్ విచారణకు గైర్హాజరయ్యారంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. 2024 సార్వత్రిక ఎన్నికలలో   కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.  అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన కడియం శ్రీహరి  2024 లోక్ సభ ఎన్నికలలో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కావ్య తరఫున బహిరంగంగా ప్రచారం నిర్వహించారు.  దీంతో వీరిరువురూ పార్టీ ఫిరాయించలేదని చెప్పడానికి చాన్స్ లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు ఎదుర్కొనే కంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం మేలని ఈ ఇరువురూ భావిస్తున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు తథ్యమన్న చర్చ జోరందుకుంది. 

పేర్ని నానికి పరాభవం.. అయినా నోరెత్తితే ఒట్టు!

ప్రస్తుతం వైసీపీలో నోరున్న ఒకే ఒక నాయకుడిగా గుర్తింపు పొందుతున్న పేర్ని నానికి ఘోర పరాభవం ఎదురైంది. మామూలుగా అయితే నోరేసుకుపడిపోయే పేర్ని నాని ఈ సారి మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. నోరెత్తి ప్రశ్నించలేదు. ఇంతకీ పేర్ని నానికి పరాభవం ఎక్కడ ఎదురైందంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. వైసీపీ అధినేత జగన్ దాదాపు ఆరేళ్ల తరువాత తొలి సారిగా అక్రమాస్తుల కేసు విచారణకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు గురువారం (నవంబర్ 19) హాజరయ్యారు. తాడేపల్లి నుంచి ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుని అక్కడ నుంచి గంటకు ఎనిమిది లక్షలు చెల్లించి మరీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వద్ద కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ కేడర్ జమ అయ్యింది. అయితే కోర్టు ఆవరణలోకి జగన్ ను మాత్రమే అనుమతించారు. ఇక ఎవరినీ ఎంటర్ కానీయలేదు. అలా పోలీసులు ఆపేసిన వారిలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని కూడా ఉన్నారు. మామూలుగా అయితే తనను నిలువరించిన పోలీసులతో పేర్ని నాని వాగ్వాదానికి దిగాలి. కానీ ఎందుకో.. నోరెత్తలేదు. కోర్టు పరిసరాల్లో మాట్లాడితే అక్కడికక్కడే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించేస్తారని భయపడినట్లున్నారని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు. అది పక్కన పెడితే.. తనను పోలీసులు నిలిపివేసినా పేర్ని నాని మాత్రం దాదాపు అరగంటకు పైన కోర్టు బయట అలాగే నిలబడి ఉన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తై జగన్ బయటకు వచ్చే వరకూ నోరెత్తకుండా నిలుచున్నారు. అయితే బయట పెద్ద ఎత్తున గుమిగూడిన వైసీపీయేలు మాత్రం రప్పరప్ప ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారనుకోండి అది వేరే సంగతి.

వీళ్లు వాళ్లేనా?

అక్రమాస్తుల కేసులో  ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత  హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇందు కోసం ఆయన బేంగళూరు నుంచి బుధవారం (నవంబర్ 18) తాడేపల్లిలోని తన ప్యాలెస్ కు చేరుకున్నారు. గురువారం (నవంబర్ 19)న ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సరే అదలా ఉంచితే..  బుధవారం నవంబర్ 18) తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తో ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ఉండి.. గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తరువాత సైలెంటైపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిశారు. వీరితో పాటు ఇప్పుడు పార్టీలో వాయిస్ వినిపిస్తున్న ఏకైక నాయకుడు పేర్ని నాని కూడా ఉన్నారు. ఈ నలుగురూ ఒకే ఫ్రేములో కనిపించడం చాలా కాలం తరువాత ఇదే తొలిసారి.  కాగా జగన్ ను కలిసిన ముగ్గురు నాయకులు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీలలో పేర్ని నానిలో భౌతికంగా పెద్ద మార్పేమీ కనిపించలేదు కానీ, వల్లభనేని వంశీ, కొడాలి నానిల అపియరెన్స్ లో మాత్రం చాలా చాలా మార్పు కనిపించింది. కొడాలి నాని బరువు తగ్గిపోయి.. మనిషి దాదాపుగా సగానికి సగం తగ్గిపోయినట్లు కనిపించారు. వల్లభనేని పరిస్థితి కూడా అలాగే ఉంది. వైసీపీ అందగాడు అంటు జగన్ గతంలో అభివర్ణించిన వల్లభనేని వంశీలో ఇప్పుడు ఆ చార్మ్ కానీ, ఉత్సాహం కానీ మచ్చుకైనా కనిపించడం లేదు.  నెరిసిపోయిన జుట్టు, గుబురుగడ్డంతో వంశీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఈ ముగ్గురూ అంటే కొడాలి, పేర్ని నాని ద్వయం, వల్లభనేని వంశీ అధికార గర్వంతో విర్రవీగుతో.. ప్రత్యర్థులపై ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిగా నోరు పారేసుకునే వారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలైతే అనుచిత భాషా ప్రావీణ్య ప్రదర్శనలో డాక్టరేట్ పొందారా అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత వారిలో ఆ దూకుడు, దురుసుతనం పూర్తిగా కనమరుగైపోయి మన్నుతిన్న పాములా అన్నట్లుగా కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.  

1 నుంచి రేవంత్ జిల్లాల పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టనున్నారు. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తిరుగులేని విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఆ ఉత్సాహం అలా ఉండగానే స్థానిక ఎన్నికలకు వెళ్లి మరో విజయాన్ని పార్టీ ఖాతాలో జమ చేయాలని రేవంత్ తలపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలోనూ తొలుత పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ఆయన భావిస్తున్నారు. ఆ పంచాయతీ ఎన్నికల ముహూర్తం కూడా దాదాపుగా ఖారారైనట్లే కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన అంశం న్యాయస్థానాలలో వచ్చిన తీర్పుల కారణంగా వీలు కాలేకపోయినప్పటికీ, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ కు క్రెడిట్ అయితే దక్కిందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 1 నుంచి 9 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించి, అవి పూర్తి అవ్వగానే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అదే విధంగా ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కూడా చేపట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఈ నెల 1 నుంచి 9 వరకూ జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అయితే అంతకు ముందే.. రాష్ట్రంలో వివిధ శాఖల వారీగా జరిగిన ప్రగతిపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించాలని రేవంత్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

రాష్ట్రపతి, గవర్నర్ లకు గడువు విధించలేం.. సుప్రీం

చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు కాలప పరిమితి  నిర్ణయించలేమని దేశ సర్వోన్నత  న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం గురువారం (నవంంబర్ 20)తీర్పు వెలువరించింది.  దీంతో ఈ విషయంలో సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠకు తెరపడింది. అసలు విషయం ఏమిటంటే.. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడంతో  తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం..  బిల్లులపై గవర్నర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేననీ, అలా తీసుకోకుంటే.. ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే భావించాలని తీర్పు ఇచ్చింది.  దీంతో తమిళనాడు ప్రభుత్వం 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది. దీంతో..  రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి న్యాయవ్యవస్థ గడువులు విధించడం సరికాదంటూ సుప్రీం కోర్టులో  పలు పిటిషన్లు దాఖలయ్యాయి.  ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకున్న అధికారాలతో సుప్రీంకోర్టు సలహా  కోరారు.  బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని గడువులు నిర్దేశించవచ్చా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంను కోరారు.   రాష్ట్రపతి అభ్యర్థన మేరకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు గవర్నర్లకు గడువు విధించడాన్ని వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే   పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ..  గవర్నర్లు తమ నిర్ణయాన్ని నిర్దుష్ట కాలవ్యవధిలో తీసుకోవాలని వాదించాయి.   ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత ససెప్టెంబర్ 11న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న  సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఈ  ఆదివారం(నవంబర్ 23) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణకు ముందు ఈ కీలక అంశంపై తీర్పు వెలువరించనుండటంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా గురువారం (నవంబర్ 20) సుప్రీం తీర్పు వెలువరించింది.  చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు  ఎటువంటి గడువూ విధించలేమని సుప్రీం తీర్పు రాజ్యాంగ ధర్మాసనం విస్పష్ట తీర్పు వెలువరించింది.  అయితే బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్  సుదీర్ఘ సమయం తీసుకుంటే మాత్రం సమీక్షించే అధికారం కోర్టులకు ఉందని పేర్కొంది.  బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ల ముందు వాటిని ఆమోదించడం లేదా రాష్ట్రపతికి పంపడం, అదీ కాకుంటే.. వాటిని తిరిగి అసెంబ్లీకి తిరిగి పంపడం వినా మరో మార్గం లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.   

భార‌తీ రెడ్డి @ 400 కేజీ గోల్డ్?

భారతీరెడ్డి 400 కిలోల బంగారం కొన్నారంటూ ఆరోపణించారు  బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి. అయితే ఇందులో వాస్త‌వ‌మెంత‌? అవాస్త‌వ‌మెంత‌? అన్న విషయానికి వస్తే..  ఆంధ్రప్రదేశ్ మ‌ద్యం కుంభ‌కోణం,  మ‌రో కుంభకోణం ఏదైనా సరే  జ‌గ‌న్ అండ్ కో..  బ్లాక్  మ‌నీ వైట్ చేయ‌డానికి మూడు నాలుగు మార్గాల‌ను ఎంపిక చేసుకుంటే వాటిలో గోల్డ్ బిస్కెట్స్, కాయిన్స్  ఒకటి.  ఈ విష‌యం  రాజ్ కేసిరెడ్డి విచారణలో వెలుగులోకి వచ్చింది.     జ్యువెల‌రీ షాప్స్,  రియ‌ల్ ఎస్టేట్,   యాడ్ ఏజెన్సీస్, ఆపై దేశ విదేశాల్లో కంపెనీల  స్థాప‌న వంటి దారుల గుండా  వీరు త‌మ త‌మ బ్లాక్ మ‌నీ వైట్ చేసేందుకు శాయ‌శ‌క్తులా  కృషిచేసిన‌ట్టు రాజ్ కేశిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది.  అయితే ఈ మొత్తం బినామీల ద్వారా జ‌గ‌న్ కి చేరేలా పకడ్బందీ వ్యూహం ప్రకారం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా  చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి సైతం మ‌ద్యం సొమ్ముతో భారీగా  ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టు తేల్చిన సిట్ ఆయన ఆస్తుల అటాచ్ మెంట్ కు రెడీ అవుతోంది. ప్రభుత్వ అనుమతితో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్ మెంట్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించనుంది.   ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం, ఇతర స్కాముల ద్వారా కూడబెట్టిన ఆస్తిపాస్తులు డ‌బ్బు ద‌స్కం జ‌గ‌న్ కి చేరేలా, ఆపై బంగారం వంటివి భార‌తీరెడ్డికి చేరేలా వైసీపీలోని అక్రమార్కులంతా కలిసి స్కెచ్ వేశారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఒక‌ప్పుడు త‌న  భ‌ర్త‌ను తాను ఈ రాజ‌కీయాలే వ‌ద్ద‌ని చెప్పాన‌ని భారతీరెడ్డి పలు సందర్బాలలో చెప్పారు.  ఇక్క‌డుంటే జైల్లో పెడ‌తారు కాబ‌ట్టి మ‌నం ఎక్క‌డైనా విదేశాల‌కు వెళ్లి హాయిగా ఉందామ‌ని సూచించాన‌నీ చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఆయన వినలేదని భారతీరెడ్డి ఆవేదన కూడా వ్యక్తం చేశారు.  జ‌గ‌న్ కూడా ఆయన  తండ్రిలా పేద ప్ర‌జ‌ల దేవుడిగా మారాల‌ని భావించారనీ, ఈ విషయాన్ని ఆయన తనతో చెప్పారనీ కూడా గతంలో భారతీ రెడ్డి చెప్పారు.  అటువంటి భారతీ రెడ్డి   తాజాగా బంగారం మొత్తం నిల్వ‌లు   త‌న ప‌రం చేసుకున్న‌ట్టుగా ఆదినారాయణరెడ్డి వంటి వారు  మ‌రి  చూడాలి ఈ బంగారాన్ని ఎలా రిక‌వ‌రీ చేస్తారో పోలీసులు. చెవిరెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన‌ట్టు వీటిని కూడా చేస్తారేమో చూడాలి మరి. 

రాష్ట్రపతి, గవర్నర్ కు కాలపరిమితిపై సుప్రీం తీర్పు నేడు

చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు కాలప పరిమితి నిర్ణయించే విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం గురువారం (నవంంబర్ 20)తీర్పు వెలువరించనుంది.  దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ విషయంలో సుప్రీం తీర్పు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.  చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగబద్ధమేనని కొందరు వాదిస్తుండగా, మరి కొందరు అది అధికారాల విభజనను ఉల్లంఘించడమే అవుతుందంటున్నారు.   తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం, బిల్లులపై గవర్నర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేననీ, అలా తీసుకోకుంటే.. ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే భావించాలని తీర్పు ఇచ్చింది.  దీంతో తమిళనాడు ప్రభుత్వం 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది. దీంతో..  రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి న్యాయవ్యవస్థ గడువులు విధించడం సరికాదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకున్న అధికారాలతో సుప్రీంకోర్టు సలహా  కోరారు.  బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని గడువులు నిర్దేశించవచ్చా? స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంను కోరారు.   రాష్ట్రపతి అభ్యర్థన మేరకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు గవర్నర్లకు గడువు విధించడాన్ని వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే   పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ..  గవర్నర్లు తమ నిర్ణయాన్ని నిర్దుష్ట కాలవ్యవధిలో తీసుకోవాలని వాదించాయి.   ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత ససెప్టెంబర్ 11న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న  సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఈ  ఆదివారం(నవంబర్ 23) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణకు ముందు ఈ కీలక అంశంపై తీర్పు వెలువరించనుండటం గమనార్హం. 

తెలంగాణ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు షురూ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు షురూ చేసింది. పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. గురువారం (నవంబర్ 20) నుంచి ఆదివారం (నవంబర్ 23) వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరణకు షెడ్యూల్ విడుదల చేసింది.  ఆదివారం (నవంబర్ 23)  తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డిసెంబరు రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల సవరణకు షెడ్యూల్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  గత సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 1 నుంచి జరగనున్న ప్రజాపాలన వారోత్సవాల అనంతరం  స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. తొలుత పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు తగ్గట్టుగా కసరత్తు ప్రారంభించింది.   

బిహార్ సీఎంగా పదోసారి నితీష్ ప్రమాణస్వీకారం

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్  నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ కుమార్ పేరును బీజేపీ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బిహార్ గవర్నర్కు సమర్పించారు. గురువారం (నవంబర్ 20) ఉదయం పదకొండున్నర గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది పదోసారి. ఈ సారి నితీష్ కుమార్ కేబినెట్ లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా 21 మందితో నితీష్ కేబినెట్ కొలువుతీరనుంది. 

కోర్టుకు జగన్ షెడ్యూల్.. ధిక్కారమా? అహంకారమా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత గురువారం (డిసెంబర్ 20)   హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.   అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఆయన  ఆరేళ్ల తరువాత కోర్టు మెట్టెక్కడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  ముఖ్యమంత్రి హోదాలో ఉండటం, ఇతర కారణాల రీత్యా జగన్ కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. అయితే ఈ సారి మాత్రం అలా కుదరలేదు. ఆయన కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ కు సీబీఐ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురుకావడంతో కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో అనివార్యంగా జగన్ కోర్టుకు హాజరు కాక తప్పడం లేదు.  నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యేందకు జగన్ గురువారం (నవంబర్ 20) ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు హాజరై.. కోర్టు విచారణ ముగిసిన తరువాత లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని, ఆ తరువాత  బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విమానంలో బెంగళూరు వెడతారు.   ఇలా ఉండగా జగన్ కోర్టుకు ఎన్నిగంటలకు వచ్చి ఎన్ని గంటలకు తిరిగి వెళ్లాలన్న విషయాన్ని తనకు తాను స్వయంగా నిర్ణయించుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. అక్రమాస్తుల కేసులో నిందితుడై ఉండీ, 18 నెలలు జైలు జీవితం గడిపి గత పుష్కరకాలంపైగా బెయిలుపై ఉండి కూడా గత ఆరేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాని జగన్ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవడ్డానికి వస్తూ కోర్టుకే సమయం ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.  వీటన్నిటికీ మించి ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తులకు సంబంధించి దాదాపు 31 కేసులకు సంబంధించి విచారణ జరగనుంది. ఇన్ని కేసుల విచారణకు జగన్ ఇచ్చిన గంట సమయం సరిపోతుందా?   జగన్ తనంతట తాను నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే కోర్టులో విచారణ జరుగుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  నిందితుడిగా ఉన్న జ‌గ‌న్ ఒక గంట పాటు మాత్రమే కోర్టులో ఉంటాను అంటూ న్యాయస్థానానికి సమయం ఇవ్వడం ఏమిటని న్యాయనిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  కోర్టులో తాను ఎంత సమయం ఉంటాను అన్నది ఒక నిందితుడు తనంతట తాను స్వయంగా ఎలా నిర్ణయించుకుంటాడు? ఇలా తాను గంట సేపు మాత్రమే ఉంటానంటూ జగన్ న్యాయస్థానానికే షెడ్యూల్ ఇవ్వడం న్యాయ వ్యవస్థను ధిక్కరించడం, చులకన చేయడమే అవుతుందని న్యాయనిపుణులు అంటున్నారు.  జగన్ వైఖరి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.   

అమరావతే ఏపీ రాజధాని డిసెంబర్ లోనే గెజిట్?!

ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజథాని అమరావతిపై కుట్రల  నేపథ్యంలో ప్రస్తుతం అమరావతి రైతులు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ అధికారిక గెజిట్ ను డిమాండ్ చేస్తున్నారు. సీఆర్డీఏ కమిషనర్ ఇటీవలఅ రైతులతో సమావేశమైన సందర్భంగా ఈ విషయంపై రైతుల నుంచి బలమైన డిమాండ్ వినిపించింది. అమరావతి గెజిట్ కు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని రైతులు కోరుతున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఆర్డీయే కమిషనర్  ఈ బిల్లుకు అవసరమైన విధివిధానాలపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు.  అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే శీతాకాల సమావేశాలలోనే అంటే డిసెంబర్ లోనే అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారు చేస్తూ చట్టపరమైన రక్షణ కలిగేలా గెజిట్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పార్లమెంట్ లో చట్టం చేయించి, గెజిట్ జారీ చేయించాలన్న రైతుల డిమాండ్ కు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది.  తెలుగుదేశం ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూండటంతో ఈ మేరకు అమరాతి గెజిట్ విడుదల చేయించే విషయంలో ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా లేదని అంటున్నారు.   

ఆపరేషన్ కగార్ సక్సెస్.. ప్రొఫెసర్ హరగోపాల్

నక్సల్ విముక్త భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయ్యిందని  పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నవంబర్ 18) మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనపై స్పందించిన హరగోపాల్ హైదరాబాద్ లో మాట్లాడుతూ.. పార్టీలోని భిన్నాభిప్రాయాలు, విభేదాల వల్లే మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజ్యంలోని మార్పులు, ప్రజల్లో మావోయిస్టు పార్టీకి సపోర్ట్ లేక పోవడం కూడా ఈ పరిస్థితికి కారణమన్నారు.  కేంద్ర కమిటీ నేతలు.. ప్రభుత్వం ఎదుట లొంగుబాటుకు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు, కారణాలు ఉన్నాయన్నారు. మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైనా ఆదివాసీల ఉద్యమాలు మాత్రం ఆగవని హరగోపాల్ అభిప్రాయపడ్డారు.  

ప్రమాదంలో బీఆర్ఎస్ ఉనికి?.. కారణమేంటంటే?

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఘోర పరాజయం బీఆర్ఎస్ శ్రేణుల నైతికస్థైర్యాన్ని పాతాళానికి పడిపోయేలా చేసింది. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడింది. అయినా అసలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రీయాశీల రాజకీయాల నుంచి వెనకడుగు వేసి బాధ్యతలను తన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అప్పగించిన క్షణం నుంచీ రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పడిపోతూనే వస్తోందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  ఇక ఇప్పడు జూబ్లీ ఉప ఎన్నికలలో దాదాపు పాతిక వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓటమి కేటీఆర్ వైఫల్యాల పరంపరకు పరాకాష్టగా చెబుతున్నారు. సరిగ్గా చెప్పాలంటూ.. గత అసెంబ్లీ ఎన్నికలో పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమై..పార్టీ నడిపే బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించిన తరువాత బీఆర్ఎస్ కు వరుసగా ఇది మూడో ఓటమి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలోని 17 లోక్ సభస్థానాలలో పోటీ చేసిన పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. ఆ తరువాత కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక ఇప్పుడు తాజాగా జూబ్లీ ఉప ఎన్నిక.. ఈ ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పాతిక వేల ఓట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ హ్యాట్రిక్ పరాజయాలతో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. కేటీఆర్ నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా నమోదు చేసుకోలేకపోవడంపై పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూబ్లీ ఓటమిపై పార్టీ నాయకులు ఎవేవో కారణాలు చెప్పవచ్చు.. తాము అధికారంలో ఉండగా అన్ని ఎన్నికలూ గెలిచామంటూ భుజాలు చరుచుకోవచ్చు.. కానీ ఓటమి ఓటమే... అందులోనూ గత అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయాలు సాధించిన గ్రేటర్ పరిధిలోనే వరుసగా రెండు ఉప ఎన్నికలలో ఓటమిపాలు కావడం కచ్చితంగా పార్టీకి తేరుకోలేని దెబ్బేననడంలో సందేహం లేదు.  ఈ వరుస పరాజయాలు కేటీఆర్ నాయకత్వ పటిమపై సందేహాలకు తావిచ్చాయి. ఆయన నాయకత్వ సమర్థతపై పార్టీలోనే చర్చ మొదలైంది.  ఇక అధికార కాంగ్రెస్ అయితే ఇప్పటికే విఫల నేతగా కేటీఆర్ ను అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నది.  ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే.. బీఆర్ఎస్ కు భవిష్యత్తే లేదంటున్నారు. కేసీఆర్ అనారోగ్యం, పార్టీని నడపలేక కేటీఆర్ సతమతం అందుకు కారణమని అంటున్నారు.  అయితే జూబ్లీ ఓటమిని కేటీఆర్ వైఫల్యంగా చెప్పలేం కానీ, నిస్సందేహంగా ఇదో పెద్ద ఎదురుదెబ్బ అని మాత్రం చెప్పుకోవాలి. అయితే  పదేళ్ల పాటు తిరుగులేకుండా అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడిలా కుదేలు కావడంలో తప్పెవరిది? కేసీఆర్ దా? కేటీఆర్ దా అన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. నిజానికి జరిగిందేమిటంటే.. పార్టీకి నిజంగా అవసరమున్న సమయంలో కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అందుకు కేసీఆర్ అనారోగ్యమే కారణమైతే అది పార్టీ దురదృష్టంగా భావించాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించేందుకు అహం అడ్డువచ్చి కేసీఆర్ క్రీయాశీల రాజకీయాలకు దూరమై ఉంటే మాత్రం ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సంక్షోభం కేసీఆర్ బాధ్యతగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఈ సంక్షోభ సమయంలో కేసీఆర్ కేటీఆర్ కు మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది. అయితే అదే జరగడం లేదంటున్నాయి పార్టీ శ్రేణులు.   

తెలంగాణ స్థానిక ఎన్నికలపై తొలగిన సస్పెన్స్!

తెలంగాణ స్థానిక ఎన్నికలు ఎప్పడు అన్నదానిపై సస్పెన్స్ తొలగిపోయింది. జూబ్లీ ఉప ఎన్నిక విజయంతో మాంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇదే జోరులో, ఇదే జోష్ లో ఉండగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కూడా వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 1 నుంచి 9 వ తేదీ వరకూ జరగనున్న ప్రజాపాలన ఉత్సవాల తరువాత స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి 20 నెలలకు పైగా అయ్యింది. ఈ నేపథ్యంలో వాటి నిర్వహణపై గత ఏడాదిగా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.  ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకోవడంతో ఆ సస్పెన్స్ తొలగినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా పాలన వారోత్సవాలు ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటున్నారు. తొలుత పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత స్వల్ప విరామం అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.  అధికార పార్టీ తొలుత స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఉండాలని సంకల్పించింది. ఆ కారణంగానే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జాప్యం అయ్యాయని చెప్పక తప్పదు. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకించడంతో అది వీలు కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలుత హైకోర్టును, అటు పిమ్మట సుప్రీం కోర్టునూ ఆశ్రయించింది. అయితే.. రెండు చోట్లా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల స్పందన రాలేదు. హైకోర్టు రిజర్వేషన్లలో 50శాతం పరిమితికి కట్టుబడి ఉండాలని సూచించగా, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో  ప్రభుత్వ ప్రతిపాదనకు సంబంధించి ఈ నెల 24న సమీక్షించనుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వర్గాలలో హైకోర్టు ఏం చెబుతుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.  మొత్తం మీద కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం   అనుకూలంగా ఉన్న ప్రజల మూడ్ మారకుండానే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  

డిసెంబర్ 9లోగా రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!?

తెలంగాణలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెయ్యేనుగుల బలం ఇచ్చిందా? అందుకే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్పీడ్ పెంచుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేవలం కేబినెట్ లో  ఖాళీగా ఉన్న బెర్తులు భర్తీ చేయడమే కాకుండా.. కొందరు మంత్రుల శాఖల మార్పు, కొందరికి ఉద్వాసన, కొత్త వారికి కేబినెట్ లో చోటు.. ఇలా మొత్తం కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   రాష్ట్రంలో  రేవంత్ కేబినెట్ కొలువుదీరి రెండు సంవత్సరాలు సమీపిస్తున్న నేపథ్యంలో  పాలనలో తన మార్క్ మరింత ప్రస్ఫుటంగా కనిపించేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అనుమతి కోరతూ  ఇప్పటికే  రేవంత్ పార్టీ హైకమాండ్ కు లేఖ రాసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన, అదే సంఖ్యలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నది రేవంత్ యోచనగా చెబుతున్నారు. అలాగే కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చే ఉద్దేశం ఉందంటున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి పంపి అనుమతి కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను కేబినెట్ నుంచి తప్పించి వారికి పార్టీ పదవులు అప్పగించాలన్నది రేవంత్ ప్రతిపాదనగా చెబుతున్నారు. వారి స్థానంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, మహేష్ కుమార్ గౌడ్, మదన్ మోహన్ రావు, బాలూ నాయక్ లను కేబినెట్ లోకి తీసుకోవాలన్నది ఆ ప్రతిపాదనగా చెబుతున్నారు. అదే విధంగా ఆర్థిక, రెవెన్యూ, హోం, ఐటీ వంటి కీలక శాఖలను సీనియర్లకు అప్పగించాలని రేవంత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   జూబ్లీ ఉప ఎన్నిక విజయం నేపథ్యంలో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదను కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా పరిశీలించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వచ్చే నెల9 లోగా రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

పాట్నాకు చంద్రబాబు, లోకేష్.. ఎందుకంటే?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ పాట్నా వెళ్లనున్నారు.  బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వీరిరువురికీ అందిన ఆహ్వానం మేరకు వీరు పాట్నా వెళ్లనున్నారు.   ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన బీహార్ లో పర్యటించి, పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.   ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వచ్చిన ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాట్నా వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 20వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో వారు పాల్గొని నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తారు. 

నితీష్ నేతృత్వంలో బీహార్లో 20న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

బీహార్‌లో ఎన్డీఏ గ్రాండ్ విక్టరీ తర్వాత కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరుతుందనే  చర్చకు ఎండ్ కార్డ్ పడింది.  బీహార్ లో కొత్త సర్కార్ ఏర్పాటుకూ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న నితీష్ నాయకత్వంలో బీహార్ లో  మళ్లీ ఎన్డీయే సర్కార్ కొలువుదీరనుంది.  దీంతో వరుసగా పదో సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే.  ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం  పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌ వేదిక కానుంది. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ  హాజరుకానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.  ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభను ఈ నెల 19న రద్దు చేయనున్నారు. అదే రోజు నితీష్‌ కుమార్ రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాతి రోజే మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం చేస్తారు. మరోవైపు ఎన్డీయే పార్టీలోని చిన్న పార్టీలు ఇప్పటికే తమకేం కావాలో బీజేపీ పెద్దలకు తెలియజేశాయి. అయితే హిందూస్థానీ అవామీ మోర్చా పార్టీ నుంచి మాత్రం వినూత్న ప్రకటన వచ్చింది. తాము ఎలాంటి డిమాండ్లు చేయడం లేదని.. తమకు మంత్రి పదవి వచ్చినా.. రాకపోయినా బీహార్ ప్రజల కోసం పనిచేస్తామని తెలిపింది.   ఇదిలా ఉండగా ఎన్డీయే కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని మంత్రిపదవులు దక్కుతాయి, ఏ శాఖ ఎవరికి దక్కుతుంది అన్న విషయంపై సస్పెన్స్ గా మారింది.   ఈ ఎన్నికలో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీపీ19, హిందూస్థానీ అవామ్ మోర్చా 5, రాష్ట్రీయ లోక్‌ మోర్చా 4 సీట్లు గెలుచుకున్నాయి.  కేబినెట్ కూర్పుపై ఇప్పటికే భాగస్వామ్య పార్టీల మధ్య చర్చలు జరిగాయని సమాచారం.   

తెలంగాణ స్పీకర్ పై సుప్రీం సీరియస్

ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారల్లోగా నిర్ణయం తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు గడువు నిర్దేశించింది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు గతంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను గతంలోనే ఆదేశించింది.  అయితే ఆ సమయం పూర్తయినా స్పీకర్ నిర్ణయం తీసుకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంటూ  బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సోమవారం విచారించిన సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఎమ్మెల్యేల అనర్హతపై రోజు వారీ విచారణ జరిపి.. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.   ఎమ్మెల్యేల అనర్హతపై  మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం ప్రకటించాలని సూచించినా.. ఆలస్యం చేయటం పైన సుప్రీం కోర్టు సీరియస్ అయింది.  విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. అప్పటి లోగా అనర్హతపై నిర్ణయం తీసుకుంటారా? లేక మేం తీసుకోవాలా? అంటూ ప్రశ్నించింది.దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది నాలుగువారాలలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేస్తామని చెప్పారు.