మూడు విడతల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని మంగళవారం (నవంబర్ 25) సాయంత్రం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే నెల 11, 14, 17 తేదీలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైనందున ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ 29న ప్రకటించామని, అక్టోబర్ 9న ఆ షెడ్యూల్ పై కోర్టు స్టే విధించిందని అన్నారు.
తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరుగుతుందన్న రాణి కుముదిని, రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డులకు, . మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలోని 12, 760 పంచాయతీలు, లక్షా పదమూడు వేల ఐదు వందల ముఫ్పై నాలుగు వార్డు స్థానాలకు మూడు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత పోలింగ్కు సంబంధించిన నామినేషన్లను నవంబర్ 27 నుంచి, రెండో విడత ఎన్నికలకు నవంబర్ 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి స్వీకరించనున్నట్లు వెల్లడించారు.