పాలనా వ్యవస్థ లోపాలపై శర సంధానం.. వాస్తవ వేదిక

ఇల్లు అలకగానే పండగ కాదు. రాష్ట్రాలు విభజించగానే సమస్యలు తీరిపోవు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు కోటి సమస్యలు. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిని విడగొట్టిన నాటి పరిస్థితులకూ, నేటికీ పెద్ద తేడా లేదు. ఆనాడు కర్నూలు రాజధానిగా పాలించడానికి నానా కష్టాలూ పడ్డారు పాలకులు. నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితీ అదే.  ప్రణాళికలు బ్రహ్మాండంగా ఉన్నా, ఆచరణలో వాటి అమలుకు అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. ఒక వైపు నిధుల కొరత, మరో వైపు రుణాలపై వడ్డీల భారం, ఇంకో వైపు అడుగడుగునా అవినీతి సర్పాలు బుసలు కొడుతున్నాయి. అమరావతి రాజధానిగా త్వరగా ఎదగాలనుకునే వారి కన్నా, ఎందులో సొమ్ములు దొరుకుతాయోనని వెతుక్కునే నేతలు, దళారులూ ఎక్కువైపోయారు. ఈ పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధి  ‘‘మూరెడు ముందుకి, బారెడు వెనక్కి’’ అన్నట్లు సాగుతోంది.  రాష్ట్ర విభజన జరిగాక, తొలి ఐదేళ్లలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కార్యాలయ విభాగాల తరలింపు జరిగినా, తదుపరి ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం దీని నిర్మాణం జోలికి పోలేదు. పైగా విధ్వంసకర నిర్ణయాలు, రాజకీయ విద్వేషాలతోనే అభివృద్ధిని సర్వనాశనం చేసింది. కూటమి ప్రభుత్వం పేరుతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు తిరిగి దానిని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.  కానీ 15 నెలలు గడిచినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఎలా జరగాలి అనే అంశాలతో పాటు, తెలుగువారి రాష్ట్ర చరిత్రను టచ్ చేస్తూ, 95 ఏళ్ల చరిత్ర కలిగిన స్వాతంత్ర కాలం నాటి వార పత్రిక జమీన్ రైతు, అమరావతి రైతుల గుండె ఘోషతో పాటు 25 ఏళ్లుగా అనేక సమస్యలతో రాజీలేని పోరాటం చేస్తున్న ‘‘తెలుగువన్’’ డిజిటల్ ఛానల్ తో కలిసి పోరాటం ప్రారంభిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఎలుగెత్తి, పరిష్కారమే లక్ష్యంగా, నిర్మొహమాటంగా వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు నేటి నుంచి తెలుగువన్ డిజిటల్ లో  ‘‘వాస్తవ వేదిక’’పై చర్చా కార్యక్రమం ప్రారంభమౌతోంది. జమీన్ రరైతు ఎడిటర్,  నెల్లూరు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ లు ఈ వేదిక ద్వారా ప్రభుత్వం, పాలకుల అవినీతి, అక్రమాలు, అసమర్థ విధానాలపై శర సంధానం చేయనున్నారు.  ప్లీజ్ వాచ్ ఇట్ నవంబర్ 27వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి..

మూడు రంగుల చీర కట్టి.. కవిత అడుగులెటు?

బీఆర్ఎస్ బహిష్కృత నేత, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత రాజకీయ అడుగులు ఎటుపడుతున్నాయన్న విషయంలో రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ తన గులాబి రంగును కాషాయంగా మార్చుకుంటోందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన కల్వకుంట్ల కవిత.. తాను స్వయంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరౌతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ కూడా ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు టార్గెట్ గా ఉంటున్నాయి. అదే సమయంలో  తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అని ఎప్పటి నుంచో ఉన్న అనుమానాలకు బలం చేకూర్చేవిగానే ఆమె వ్యాఖ్యలు విమర్శలు ఉంటున్నాయి. అదే సమయంలో ఆమె తన రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారా అన్న అనుమానాలూ కలిగించేలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆమె ధరించిన చీర ఆమె కాంగ్రెస్ బాట పట్టారా అన్న అనుమానాలకు బలం చేకూర్చాయి.  డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక‌ బుధవారం (నవంబర్ 26)  జరిగింది. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత తన భర్తతో కలిసి హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి హాజరైన కవిత  కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్న చీరను కవిత కట్టుకట్టుకోవడమే తెలంగాణ రాజకీయాలలో పెద్ద చర్చకు తావిచ్చింది. కవిత సాధారణంగా పబ్లిక్ ఈవెంట్లకు హాజరయ్యే సందర్భాలలో సింపుల్ రంగులు ఉండే చీరలనే ధరిస్తారు. అయితే  మల్లు భట్టివిక్రమార్క కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకకు మాత్రం కవిత  ఎరుపు, ఆకుపచ్చ అంచులున్న తెల్లటి చీర ధరించి రావడం అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా పెద్ద రాజకీయ చర్చకు తెరలేపింది. ఆమె అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయన్న అభిప్రాయం కలిగేందుకు తావిచ్చింది.  బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి, ఆ పార్టీ గద్దెలు కూల్చండి అంటూ పిలుపునిచ్చిన కవిత గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉపముఖ్యమంత్రి అయిన భట్టి ఇంట్లో ఓ వేడుకకు కాంగ్రెస్ రంగులున్న చీర ధరించి మరీ హాజరు కావడంపై నెటిజనులు ఓ లెవల్ లో కామెంట్లు చేస్తున్నారు.  

జగన్‌పై టీడీపీ అభిమానుల ఏఐ వీడియో.. ఇలాంటివి వద్దంటూ లోకేష్ హితవు

ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి డుమ్మా కొట్టేస్తున్న జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో  ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఇవ్వని, అర్హత లేని ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంపై విమర్శలతో పాటు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇందులో భాగంగానే జగన్ విపక్ష హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లను బతిమలాడుకుంటున్నట్లుగా ఓ ఏఐ జనరేటెడ్ వీడియో ప్రస్తుతం సామిజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది. ఆ వీడియోలో చంద్రబాబు, పవన్, లోకేష్ నడుచుకుంటూ వెడుతుంటే .. ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అంటూ రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని జగన్  వారిని వేడుకుంటున్నట్లు ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడా వీడియో తెగ వైరల్ అయ్యింది.  అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..  ఆ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్  వ్యక్తిగత దాడులు సముచితం కాదు, ఆ వీడియోను తీసేయండంటూ హితవు పలికారు.  ఇదే లోకేష్ ను గతంలో వైసీపీయులు నానా రకాలుగా ట్రోల్ చేశారు. లోకేష్ ఆహారం, ఆహార్యం ఇలా ప్రతి విషయంలోనూ ఆయనను ట్రోల్ చేసి,  రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయన ఒక తిరుగులేని నేత. ఆయన ఇప్పుడు జగన్ పై వ్యక్తిగత విమర్శలు కూడదంటూ తెలుగుదేశం శ్రేణులకు హితవు చెబుతూ  మర్యాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.   రాజకీయ ప్రత్యర్థులైనా, ప్రజా జీవితంలో గౌరవం, మర్యాదలు తప్పనిసరి అని పేర్కొంటూ.. జగన్ పై ఏఐ జనరేటెడ్ వీడియోను సోషల్ మీడియా నుంచి తీసేయమంటూ పార్టీ శ్రేణులను ఆదేశించారు.  తెలుగుదేశం  పార్టీ కార్యకర్తలు, అభిమానులు సహా ఎవరూ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. ఆంధ్రప్రదేశ్ బలోపేతానికి తోడ్పడే నిర్మాణాత్మక రాజకీయాలపైనే మనం దృష్టి పెట్టాలని హితవు పలికారు.  దటీజ్ లోకేష్ అనిపించుకున్నారు. 

మాక్ అసెంబ్లీ.. ఒరిజినల్ అసెంబ్లీకి మించి!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో బుధవారం విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. అచ్చంగా అసెంబ్లీని తలపించేలా వేసిన సెట్ లో జరిగిన ఈ మాక్ అసెంబ్లీ నిజంగానే అసెంబ్లీ సమావేశం జరుగుతోందా? అనిపించేంత అద్భుతంగా జరిగింది. ఈ మాక్ అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్, స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలుగా పిల్లలు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆ కారణంగానే జరుగుతున్నది నిజంగా అసెంబ్లీ సెషనేనా అనిపించింది. ఈ మాక్ అసెంబ్లీకి రాష్ట్రంలోని  175 నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి ఒక విద్యార్థి చొప్పున పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీని స్పీకర్ అయ్యన్న పాత్రులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా తిలకించారు.   అచ్చంగా అసెంబ్లీలాగే ప్రొటెం స్పీకర్ స్పీకర్ కు బాధ్యతలు అప్పగించడం, ఆ తరువాత ప్రశ్నోత్తరాల సమయం, అలాగే బిల్లులు ప్రవేశపెట్టడం, చివరిగా మాక్ అసెంబ్లీలో విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టడం, మార్షల్స్ రంగ ప్రవేశం అన్నీ ఆకట్టుకున్నాయి. పిల్లలు అసెంబ్లీలో తమతమ పాత్ర లను సమర్ధంగా పోషించడం నిజంగా అబ్బురం. ఒక్క క్షణం నిజమైన ఎమ్మెల్యేల కంటే వీరే మెరుగ్గా చేశారా అనిపించిందని స్వయంగా ముఖ్యమంత్రే అన్నారంటే..మాక్ అసెంబ్లీ ఎంత చక్కగా జరిగిందో అవగతమౌతుంది. ఈ మాక్ అసెంబ్లీని రాష్ట్ర వ్యాప్తంగా   45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.   

చాగంటినీ వ‌ద‌ల‌రా?

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఉంది వైసీపీయుల తీరు. పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పినందుకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ ప్రముఖ ప్రవచన కారుడు చాగంటిపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్నది. చాగంటికి రాజకీయాలు అంటగడుతోంది.   ఇప్ప‌టి వ‌ర‌కూ చాగంటి ప్ర‌వ‌చ‌నాలు కులాలకే కాదు, మ‌తాల‌కు అతీతంగా కూడా ఒక గొప్ప స‌మాన‌త్వాన్ని తీసుకొచ్చి పెట్టాయి. కార‌ణం ఆయ‌న చెబుతోన్న‌ది హైంద‌వ క‌థ‌లా లేక మ‌రొక‌టా అన్నది ప‌క్క‌న పెట్టి.. విన‌డానికి ఇంపుగా ఉండ‌టం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని చాటడం  వ‌ల్లనే ఆయన ప్రవచనాలంటే ఎవ‌రైనా స‌రే చెవులు కోసుకునే ప‌రిస్థితి ఉంది. అది ట్రావెలింగ్ బ‌స్సు కావ‌చ్చు, లేదేంటే యూట్యూబ్ చానెల్ కావ‌చ్చు, ఆపై ఆయ‌న నేరుగా ప్ర‌వ‌చ‌నాలు చెప్పే వేదిక‌లూ కావ‌చ్చు.. మాటల ప్రవాహం అలా దొర్లిపోతూనే ఉంటుంది. అయితే కూట‌మి  ప్ర‌భుత్వం వ‌చ్చాక చాగంటి  ఒక ప‌ద‌వి ఇచ్చి.. ఆయ‌న ద్వారా యువ‌త‌కు మంచి నేర్పే చక్కటి కార్యక్రమం చేపట్టింది.  ఇక్కడే వైసీపీయులు తమ వికృత మనస్తత్వాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనను గౌరవించి, గుర్తించి పదవి ఇచ్చి ఓ గొప్ప బాధ్యత అప్పగించడంతో  వైసీపీ  క‌క్ష క‌ట్టింది. ఇటీవ‌ల ఆయ‌న చేసిన ఒక ప్ర‌వ‌చ‌నం కార‌ణంగా వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ ఇన్నాళ్ల పాటు మీ మీద పెంచుకున్న గౌర‌వం మొత్తం మంట‌గ‌ల‌సి పోయింద‌న్న కోణంలో వారు సోష‌ల్ మీడియాలో  విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.   ఇంత‌కీ చాగంటి ఏమ‌న్నారో చూస్తే.. ఆయ‌న కుటుంబ విలువ‌ల గురించి చెప్ప‌డంలో భాగంగా తోబుట్టువుల అనుబంధం  గురించి చెప్పారు. అంతే ఇదంతా జ‌గ‌న్, ష‌ర్మిళ గురించి ఆయన చెప్పిన‌ట్టు ఊహించుకుని ఆయ‌న్ను తెగ ఆడిపోసుకుంటోంది వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్. ఒక వేళ చాగంటి  హ‌త్య చేయ‌డం త‌ప్పు.. అని చెబితే దాన్ని కూడా జ‌గ‌న్ త‌న బాబాయి వివేకాను హ‌త్య చేయించిన దానికి అన్వ‌యించుకుని.. గోలగోల చేస్తూ విమర్శలకు దిగుతారేమో, అలాగే అవినీతికి పాల్పడకూడదని చాగంటి చెబితే.. అది కూడా జగన్ కొల్లగొట్టిన కోట్ల ఆక్రమాస్తుల గురించే అని దాడికి దిగుతారేమో అన్నట్లుగా వైసీపీయుల కామెంట్లు ఉంటున్నాయి.  

మంత్రి కొమటిరెడ్డి వర్సెస్ పున్నా కైలాష్ నేత.. నల్గొండ కాంగ్రెస్ లో రచ్చ!

నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో చిచ్చు రేగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం రచ్చ రేపింది. నల్గొండ డిసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తి, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. తనపైనా, తన కుటుంబంపైనా అసభ్య పదజాలంతో దూషిస్తూ మీడియాకు ఎక్కిన పున్నా కైలాష్ నేతను డిసీసీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన పున్నా కైలాష్ నేతపై పోలీసు కేసు పెడతానంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డకి లేఖ రాశారు కోమటిరెడ్డి. పున్నా కైలాష్ నేతను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అర్హులైన వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా మంత్రి కోమటిరెడ్డి వ్యవహారశైలిపై జిల్లా కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే ఓర్వలేకపోతున్నారని మండిపడుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే తీవ్ర విమర్శలు చేసిన ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజశేఖరరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో నల్గొండ జిల్లాలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిద్దరూ అందరిపైనా నోరు పారేసుకుంటుంటారనీ,  ఇతరులెవరికీ పదవులు దక్కకుండా కుట్రలు చేయడం, బెదరింపులకు దిగడం వారికి అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నాయి కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు.  ఈ నేపథ్యంలో నల్గోండ జిల్లా కాంగ్రెస్ రేగిన చిచ్చును పార్టీ అధిష్ఠానం ఎలా చల్లారుస్తుందోనన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. 

మూడు విడతల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని మంగళవారం (నవంబర్ 25) సాయంత్రం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే నెల 11, 14, 17 తేదీలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైనందున ఎన్నికల నియమావళి  తక్షణమే అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట  జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్‌  సెప్టెంబర్ 29న ప్రకటించామని,   అక్టోబర్ 9న ఆ షెడ్యూల్ పై కోర్టు స్టే విధించిందని అన్నారు.   తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరుగుతుందన్న రాణి కుముదిని,  రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డులకు, . మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలోని 12, 760 పంచాయతీలు, లక్షా పదమూడు వేల ఐదు వందల ముఫ్పై నాలుగు   వార్డు స్థానాలకు మూడు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లను నవంబర్ 27 నుంచి,  రెండో విడత ఎన్నికలకు నవంబర్ 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి   స్వీకరించనున్నట్లు  వెల్లడించారు.

ఈవీఎంలతో పాటు అదృశ్య శక్తులు కూడా.. బీహార్ ఓటమిపై ప్రశాంత్ కిశోర్

ఇటీవ‌ల‌కాలంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఈవీఎంలను నిందించడం అలవాటుగా మారింది. తాజాగా బీహార్ ఎన్నికల ఓటమిపై స్పందించిన జన సురాజ్ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా ఈవీఎంల కారణంగానే తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఆరోపించారు. ఒక్క ఈవీఎంలే కాకుండా అదృశ్య శ‌క్తుల ప్ర‌మేయంవల్ల కూడా తాము  ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చారు. అయితే అదృశ్య శక్తుల ప్రమేయాన్ని తాము చాలా ఆలస్యంగా గుర్తించామని నొచ్చుకున్నారు. తాను చెబుతున్న విషయాలన్నీ అక్షర సత్యాలన్న ఆయన అయితే ఈ సత్యాలను రుజువు చేయడానికి తగిన ఆధారాలు మాత్రం లేవనిచేతులెత్తేశారు.  ఈ అదృశ్య శక్తులు ఎవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? అన్న విషయం మాత్రం అంతుబట్టడం లేదని చెప్పారు. బీహార్ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత తొలి సారిగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ ఇంతటి ఘోర ఓటమి పొందడం ఒక మిస్టరీగా ఉందన్నారు.  ఇటీవ‌ల జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న్‌సురాజ్ పార్టీ 230 స్థానాల్లో పోటీ చేసింది. జీరో స్ట్రైక్ రేట్ సాధించింది. అంటే పోటీ చేసిన మొత్తం స్థానాలలో పరాజయం పాలైంది. అంతే కాదు ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయంది. దీనిపై ఆయన మాట్లాడుతూ తమ జన సురాజ్ పార్టీకి పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ డిపాజిట్లు గల్లంతైనా..3.5 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. అయితే ఈ ఘోర పరాజయంతో పీకే గ్రాఫ్ దేశ వ్యాప్తంగా పతనమైంది.  ఇంత కాలం ఇతర పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూ ఆయా పార్టీల విజయంలో తనదే సింహభాగమంటూ జబ్బలు చరుచుకున్న పీకే.. సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేకపోవడంతో ఆయనపై నెటిజెన్లు సెటైర్లు రువ్వుతున్నారు.  ఈ నేప‌థ్యంలోనే పీకే తాజాగా జాతీయ వార్తా సంస్థకు  ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓటమికి కారణం ఈవీఎంలు, అదృశ్య శక్తులు అంటూ చెప్పుకొచ్చారు.  “జనసురాజ్ పార్టీగా తాము బాగానే పని చేశాం అని కితాబిచ్చుకున్న పీకే..   ప్ర‌జ‌ల నుంచి కూడా తమకు మంచి మ‌ద్ద‌తు ల‌భించిందన్నారు. ఎక్క‌డికి వెళ్లినా.. ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తాలు ప‌లికారు. మేం సొంతంగా చేయించుకున్న స‌ర్వేల్లోనూ.. క‌నీసం 50 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటామ‌ని భావించాం.  కానీ, ఏం జ‌రిగిందో ఏమో.. ఇలా అయిందంటూ పీకే నిర్వేదం వ్యక్తం చేశారు. అయితే తాను ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను  త‌ప్పుప‌ట్ట‌డం లేద‌న్నారు. అయితే ఎక్కడో ఏదో తేడా కొడుతోందని, ఇప్పుడు అదేమిటో గుర్తించడమే తన ముందున్న పెద్ద టాస్క్ అన్నారు పీకే. 

నాయకత్రయం.. ప్రజలతో మమేకం!

రాజకీయ కక్ష సాధింపు, బటన్ నొక్కి సంక్షేమం పందేరం చేయడమే పాలన అనుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్, అదే సమయంలో జనసామానికి కూడా దూరంగా ఉన్నారు. ఆయన ప్రజలతో మమేకం కావడం అటుంచి ముఖ్యమంత్రిగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా ఇష్టపడలేదు.  అరాచకపాలనకు తోడు జనానికి దూరంగా ఉండటం కూడా వైసీపీ గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలు కావడానికి ప్రధాన కారణంగా మారింది.  అయితే అందుకు భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రజల ప్రభుత్వంగా గుర్తింపు పొందుతోంది. పీపుల్ ఫస్ట్ అన్నట్లుగా పరాజకీయాలు నడుపుతోంది. కూటమి నేతలు ప్రజలతో మమేకం అవుతున్నారు. మరీ ముఖ్యంగా కూటమిలో, కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన, ప్రధానమైన ముగ్గురు నేతలూ ప్రజలతో మమేకమౌతూ ముందుకు సాగుతున్నారు.  ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా మొదటి తారీకున పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రజలలోకి వస్తున్నారు. అంతే కాకుండా శ్రేణులతో ప్రతి రెండు వారాలకు ఒక సారి సంభాషిస్తున్నారు.  అదే విధంగా జనసేనాని, ఉమముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.    ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రజాదర్బార్ తో తరచుగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారు. అంతే కాకుండా లోకేష్ దృష్టికి సమస్య తీసుకువెడితే అది పరిష్కారం అయిపో యినట్లేనన్న గుర్తింపు సాధించారు.  అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విషయంలో కూడా లోకేష్ అనితర సాధ్యమనదగ్గ చొరవ చూపుతున్నారు.  విద్యాశాఖ మంత్రిగా విద్యాసంస్కరణలను అమలు చేస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు.   మొత్తంగా తెలుగుదేశం కూటమి పాలన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ పొలిటికల్ ఎట్మాస్ఫియర్ ను తీసుకువచ్చింది.  

ఇక ఇప్పుడు బీజేపీ దృష్టి బెంగాల్ పై!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ లో మహాఘట్ బంధన్ ను మట్టికరిపించిన బీజేపీ ఇప్పుడు తన దృష్టి మొత్తం పశ్చిమ బెంగాల్ పై కేంద్రీకృతం చేసింది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా బెంగాల్ లో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. పావులు కదుపుతోంది. పశ్చిమ బెంగాల్ లో గత పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడు సార్ల విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నాలుగో సారి కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే గత 15 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో ఈ సారి మమతా బెనర్జీ, ఆమె పార్టీ పట్ల ప్రజలలో ఒకింత వ్యతిరేకత కనిపిస్తోంది.  దీంతో ఈ సారి గెలుపు అంత వీజీ కాదన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కు  తొలి రెండు విజయాలూ సునాయాసంగానే లభించాయి. అప్పట్లో పోటీ తృణమూల్ వర్సెస్ కమ్యూనిస్టులు అన్నట్లు ఉండేది. అప్పటికే పాతికేళ్లకు పైగా రాష్ట్రంలో అధికారం చెలాయించిన కమ్యూనిస్టులపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటంతో తృణమూల్ విజయం నల్లేరుమీద బండి నడకే అయ్యింది. అయితే మూడో సారి తృణమూల్ విజయం అంత సునాయాసంగా అయితే లభించలేదు. తనకు పోటీ లేకుండా చేయడానికి  మమతా బెనర్జీ రాష్ట్రంలో బీజేపీని పెంచి కమ్యూనిస్టులను నిర్వీర్యం చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది.  సరే సంపూర్ణ మెజారిటీతోనే తృణమూల్ విజయం సాధించి ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  వాస్తవానికి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఈ స్థాయిలో బలపడిందంటే అందుకు ప్రధాన కారణం మమతా బెనర్జీయే అని చెప్పాలి.  కమ్యూనిస్టులకు పెట్టని గోడలుగా ఉన్న ప్రాంతాలలో ఒక పద్ధతి ప్రకారం వారి ప్రాబల్యాన్ని మమతా బెనర్జీ నిర్వీర్యం చేశారు. అయితే ఆ స్థానంలో ఆమె పార్టీని బలోపేతం చేయడంతో పాటు బీజేపీకి ఎదగడానికి అవకాశాలు కల్పించినట్లైంది. ఇక ప్రభుత్వ వేధింపుల కారణంగా కమ్యూనిస్టులు చెల్లా చెదురైపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదు సమయంలో స్వీయరక్షణ కోసం చాలా వరకూ కమ్యూనిస్టులు కమలం పార్టీ పంచన చేరినట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా తెలంగాణలో ఈటల వంటి కమ్యూనిస్టు భావజాలం ఉన్న నేతలు కూడా బీఆర్ఎస్ ను ఎదిరించేందుకు కమలం పార్టీ పంచన చేరిన చందంగానే తృణమూల్ ధాటి నుంచి తమను తాము కాపాడుకుని ఎదిరించేందుకు పశ్చిమ బెంగాల్ లో కూడా కమ్యూనిస్టులు బీజేపీకి చేరువయ్యారని విశ్లేషిస్తున్నారు.    2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో   కేవలం 10 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు  2021 అసెంబ్లీలో  38 శాతానికి పెరిగింది.  దీంతో ఈ సారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. కాగా బీజేపీ ఇప్పుడు కలిసివచ్చే అంశమేంటంటే.. తృణమూల్ అధినేత్రితో విభేదించి కమలం గూటికి చేరిన నేతలే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పార్టీలో అగ్రనేతలుగా ఉన్నారు. వీరంతా మోడీ, అమిత్ షా మార్గదర్శకత్వంలో తృణమూల్ పరాజయం, మమతా బెనర్జీని గద్దెదింపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.  ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని గ్రహించినా మమతా బెనర్జీ గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లపైనే మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు.  చూడాలి మరి వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్, బీజేపీ మధ్య పోటీ  ఎంత తీవ్రంగా ఉంటుందో.. ఎవరు గెలిచి అధికారపగ్గాలు చేపడతారో?

విజ‌య‌సాయిరెడ్డి నిజంగా పార్టీ పెడితే?

విజ‌య‌సాయిరెడ్డి పార్టీ- పార్టీ- పార్టీ.. అంటూ మూడు ర‌కాల పార్టీ రిలేటెడ్ కామెంట్స్ చేశారు. మొద‌ట పార్టీ కామెంట్ విష‌యానికి వ‌స్తే తాను ప్ర‌స్తుతం ఏ  పార్టీలో లేనన్న క్లారిటీ ఇచ్చిన ఆయన తాను ఇప్పుడు కేవ‌లం వ్య‌వ‌సాయం  చేసుకుంటోన్న రైతును మాత్ర‌మేన‌ని స్పష్టం చేశారు.  అక్కడితో ఆగకుండా తాను ఏ  పార్టీలోనూ చేర‌డం  లేద‌నీ చెప్పారు. ఇక ముచ్చ‌ట‌గా మూడోది తాను అవ‌స‌ర‌మైతే సొంతంగా ఒక పార్టీ పెడ‌తాన‌న్నారు  ఆయన ఇవే విషయాలు గతంలోనూ చెప్పారు. అయితే ఇప్పుడు.. అవును ఇప్పుడే ఆయన మళ్లీ ఈ కామెంట్లు ఎందుకు చేశారన్న చర్చ మొదలైంది.  ఇంతకీ ఆయన ఇప్పుడు ఈ కామెంట్లు చేయడానికి ఆయన  బీజేపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో సోషల్ మీడియాలో ఆయన లక్ష్యంగా పెద్ద ఎత్తున నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. అందుకే తాను ఈ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.  త‌న‌పై  ఒత్తిళ్లు చాలానే ఉన్నాయనీ,  అయినా స‌రే త‌న‌కు ఏ రాజ‌కీయ పార్టీలో నూ చేరాల‌న్న త‌లంపు కూడా లేదనీ మరో సారి కుండబద్దలు కొట్టేశారు విజయసాయి.   గ‌త 20 ఏళ్లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ప్ర‌త్యేక సంబంధ బాంధ‌వ్యాలున్నాయ‌ని అంటూనే, జనసేన నుంచి పార్టీలో చేరాల్సిందిగా  ఒత్తిడి ఉందన్న అర్ధం వచ్చేలా మాట్లాడుతూనే, అదే సమయంలో తాను ఆ పార్టీలో చేరబోవడం లేదన్న క్లారిటీ ఇచ్చారు. నిజానికి విజ‌య‌సాయిరెడ్డికి బాల‌కృష్ణ‌తో కావ‌చ్చు, టీడీపీకి సంబంధించిన కుటుంబాల‌తో కావ‌చ్చు బంధుత్వాలున్నాయి. అనుబంధం ఉంది, కానీ, ఆ రిలేష‌న్స్ ని క్రాస్ చేసి ఆయ‌న ఎప్పుడూ ఇంత వ‌ర‌కూ రాజ‌కీయాలు చేయ‌లేదు. కాబ‌ట్టి జ‌న‌సేన విష‌యంలోనూ ఇదే  జ‌రుగుతుంద‌నుకోవ‌చ్చ‌. ఇక అవ‌స‌ర‌మైతే పార్టీ పెడ‌తానంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.   విజ‌య‌సాయిరెడ్డి   వైసీపీకి రిజైన్ చేసేట‌పుడు కూడా  మీడియా చానెల్ పెడ‌తాన‌న్నారు.  ఇంత వరకూ ఆ ఊసే లేదు.  ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా సొంతంగా రాజకీయపార్టీ పెట్టడం కూడా జరిగే పని కాదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే   గత ఎన్నికలలో నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు, అప్పుడు గెలిచి ఉంటే విజయసాయి రెడ్డి సొంత పార్టీ మాటను కొందరైనా నమ్మేందుకు అవకాశం ఉండేది. కానీ నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయిన విజయసాయి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టినా, అది బీహార్ లో సొంత పార్టీ పెట్టి పీకే చూపినంత ప్రభావం కూడా ఏపీ రాజకీయాలలో చేపే అవకాశం ఉండదని అంటున్నారు.  

తెలంగాణ డీసీసీ అధ్యక్షులు వీరే

తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తైంది. రాష్ట్రంలో   మొత్తం 36 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.  డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది.  కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన జిల్లాల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ – డాక్టర్ నరేష్ జాదవ్ ఆసిఫాబాద్ – ఆత్రం సుగుణ భద్రాద్రి కొత్తగూడెం -దేవి ప్రసన్న భువనగిరి – బీర్ల ఐలయ్య గద్వాల – రాజీవ్ రెడ్డి హన్మకొండ – ఇనిగాల వెంకట్రామి రెడ్డి హైదరాబాద్ – సయ్యద్ ఖలీద్ సహిఫుల్ల జగిత్యాల – నందయ్య జనగాం – ధన్వంతి జయశంకర్ – భూపాలపల్లి కరుణాకర్ కామారెడ్డి – మల్లికార్జున ఆలె కరీంనగర్ – మేడిపల్లి సత్యం కరీంనగర్ కార్పొరేషన్ – అంజన్ కుమార్ ఖైరతాబాద్ – మోహిత్ ఖమ్మం – నూతి సత్యనారాయణ ఖమ్మం కార్పొరేషన్ – దీపక్ చౌదరి మహబూబాబాద్ – భూక్య ఉమ మహబూబ్ నగర్ – సంజీవ్ ముదిరాజ్ మంచిర్యాల – రఘునాథ్ రెడ్డి మెదక్ – అంజనేయులు గౌడ్ మేడ్చల్ – వజ్రేష్ యాదవ్ ములుగు – పైడకుల అశోక్ నారాయణపేట – ప్రశాంత్ రెడ్డి నాగర్ కర్నూల్ – చిక్కుడు వంశీ కృష్ణ నిర్మల్ – బొజ్జు నిజామాబాద్ – నాగేష్ రెడ్డి నిజామాబాద్ కార్పొరేషన్ – బొబ్బిలి రామకృష్ణ పెద్దపల్లి – రాజ్ ఠాకూర్ రాజన్న సిరిసిల్లా – సంగీతం శ్రీనివాస్ సికింద్రాబాద్ – దీపక్ జాన్ సిద్దిపేట – తుంకుంట ఆకాంక్ష రెడ్డి సూర్యాపేట – గుడిపాటి నర్సయ్య వికారాబాద్ – దారా సింగ్ జాదవ్ వనపర్తి – శివసేన రెడ్డి వరంగల్ – అయూబ్

వాహ్.. క్యా సీన్ హై.. కేటీఆర్, జగన్ పక్కపక్కనే

బీఆర్ఎస్, వైసీపీల బంధం తెలిసిందే.  తెలుగుదేశం పార్టీ పట్ల, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పట్ల వ్యతిరేకతే వారి మైత్రీ బందానికి అసలు, సిసలు కారణంగా  పరిశీలకులు చెబుతారు. ఆ వ్యతిరేకత కారణంగానే.. ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టడం కోసం అప్పటికి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేయగలిగినంత సాయం చేసింది. అందించగలిగినంత సహకారం అందించింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి అవసరమైతే జగన్ విజయం కోసం తాను ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తానని కూడా అన్నారు. ఇక 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అయిన తరువాత జగన్ కేసీఆర్ తో సఖ్యంగా మెలిగారు. ఆ సఖ్యత ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు సహాయం చేయడానికి నాగార్జున సాగర్ జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చి ఆయనకు అనుకూలంగా ఆ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు జగన్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అదేమీ ఫలించ లేదనుకోండి అది వేరే సంగతి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ చంద్రబాబును స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేస్తే.. ఆయన అరెస్టు ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల ఆందోళనలను కేసీఆర్ తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు చేయాలనుకుంటే అక్కడ చేయండి కానీ ఇక్కడ కాదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక 2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ పరాజయం పట్ల కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఏపీలో జగన్ పార్టీ పరాజయం పాలు కావడం ఆశ్చర్యం కలిగించిందని ఆ ఫలితాల తరువాత కేటీఆర్ అన్నారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇరువురూ కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రాబాబుకు వ్యతిరేకంగా కుమ్మక్కు రాజకీయాలు నెరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో రెండూ పార్టీలూ అధికారం కోల్పోయిన తరువాత కూడా కేటీఆర్, జగన్ ల మధ్య అనుబందం అలాగే సాగుతోందనడానికి పలు ఆధారాలు ఉన్నాయి. ఇటీవల జగన్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని కితాబిచ్చారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ జగన్ పట్ల తమ అభిమానాన్ని ఎన్నడూ దాచుకోలేదు. తాజాగా జగన్, కేటీఆర్ లు ఇరువురూ బెంగళూరులో జరిగిన  ఒక కార్యక్రమంలో పక్కపక్కన కూర్చుని ముచ్చటించుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బెంగళూరులో శనివారం నవంబర్ 22) జరిగిన ఓ  కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   కలుసుకున్నారు.  పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు  వారిద్దరు కలిసి  ఫంక్షన్ హాలులోకి వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

పంచాయతీ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు

సుప్రీం మార్గదర్శకాల మేరకు  స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఎట్టకేలకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది.   బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్  అంశాన్నిపక్కన పెట్టేసింది.  ఇటీవలి జూబ్లీ ఉపఎన్నికలో ఘన విజయంతో కాంగ్రెస్ లో, కాంగ్రెస్ క్యాడర్ లో పెరిగిన జోష్ అలా ఉండగానే ఎన్నికలకు వెళ్లి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఇక జాప్యం లేకుండా స్థానిక ఎన్నికలకు రెడీ అయిపోయారు. దీంతో ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజాపాలన విజయోత్సవాలు వచ్చే నెల 1 నుంచి 9వ తేదీ వరకూ రాష్ట్రప్రభుత్వం ఘనంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. అవి కాగానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా సర్పంచ్ లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేసింది. ఆ మేరకు శనివారం (నవంబర్ 22) జీవో జారీ చేసింది.   సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా   జీవో జారీ చేసింది.   ఈ జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్థతిలో అమలు చేస్తారు.   అన్నివర్గాలకూ సమాన న్యాయం జరిగేలా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని పేర్కొంది. గిరిజన గ్రామాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనను   ఈ జీవోలో చేర్చింది. ఎస్టీ జనాభా అధికంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో  సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలన్నీ ఎస్టీలకే రిజర్వ్ అవుతాయి. ఈ ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలక  ఘట్టం పూర్తైనట్లైంది. దీంతో త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేష్ త్వరలో అంటే డిసెంబర్ రెండో వారంలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.  

ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ ముందస్తు ప్రచారం.. దేనికి సంకేతం?

ఆలూ లేదు.. చూలూ లేదు అన్న సామెతలా ఉంది ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి. ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు రాజీనామా మార్గాన్ని ఎన్నుకుంటార్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో సందేహం లేదు. ఈ మేరకు ఇటీవల ఆయన తన అనుచరులతో, ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహించి చర్చలు జరిపారు. అంత వరకూ నిజమే. కానీ తన రాజీనామా విషయాన్ని ఆయన ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేయే. ఆయన రాజీనామా చేసిన తరువాత మాత్రమే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది.  కానీ బీఆర్ఎస్ మాత్రం అప్పుడే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక  ప్రచారానికి తెరలేపేసింది. పోస్టర్లతో హడావుడి చేసేస్తోంది.  సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచార సందడి ప్రారంభించేసింది.  ఇక ఏపీలో వైసీపీ తరహాలో రప్పా రప్పా  అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటుతామంటూ నానా హంగామా చేస్తోంది.  ఇది చూసిన నెటిజనులు నిన్నటి జూబ్లీ ఉప ఎన్నిక, అంతకు ముందటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ ఇలాగే ముందస్తు హడావుడితో హోరెత్తించి ఫలితాల్లో చతికిల బడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

నేనలా చేస్తే.. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏక కాలంలో రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై విమర్శలు గుప్పిస్తూనే.. మరో వైపు ఫార్ములా ఈకార్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి పై మండి పడుతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, తన సోదరుడు కేటీఆర్ కు మద్దతు ఇస్తూనే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.     ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి అనుచరులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమర్శించారు.  చెరువుల‌ను ఆక్ర‌మించి పెద్ద ఎత్తున భ‌వ‌నాలు నిర్మించుకుంటున్నార‌న్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు.  ఇలా భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారన్న కవిత.. వీరి విషయంలో హైడ్రా నిద్రపోతోందా అంటు నిలదీశారు.  పేద‌ల‌  ఇళ్లను కూల్చేవేతలో ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్న హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.తన వద్ద ఉన్న ఆధారాలను హైడ్రాకు అందించడానికి తాను సిద్ధమే కానీ, తానా పని చేస్తే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంపైపోతారని అన్నారు. అలా జంపైపోతే కాంగ్రెస్ వారికి క్లీన్ చిట్ ఇచ్చేస్తుందన్నారు.  

ఆదిని విమర్శించే స్థాయా మీది.. బీటెక్ రవి

వైసీపీ నాయకులకు ఆదినారాయణ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని తెలుగుదేశం నాయకుడు, ఆ పార్టీ పులివెందుల ఇన్ చార్జ్ బీటెక్ రవి అన్నారు. శుక్రవారం (నవంబర్ 21) విలేకరులతో మాట్లాడిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇంటికి వెళ్లాలంటూ ముందు తన ఇల్లు దాటి వెళ్లాలని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడితే సహించేంది లేదన్న బీటెక్ రవి.. నాడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని మీరే  హత్య చేసి  మా మీద కేసు మోపాలని ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అనవసర వాగాడంబరం మాని సత్తా ఉంటే పులివెంొదుల మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించండి సవాల్ విసిరారు.   సతీష్ రెడ్డి 5 సార్లు పోటీ చేస్తే ఐదు సార్లు ఓడిపోయారని, ఆదినారా యణ రెడ్డి నాలుగు సార్లు పోటీ చేస్తే నాలుగు సార్లూ గెలిచారని చెప్పిన ఆయన రానున్న పులివెందుల మునిసిపల్ ఎన్నికలలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు.  ఈ సందర్భంగా బీటెక్ రవి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తడిగుడ్డతో  గొంతులు కోసే రకమని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  

రూ.5లక్షల కోట్ల భారీ స్కామ్.. రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపారంటే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం (నవంబర్ 21) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన  కేటీఆర్ హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ పేర రేవంత్  దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ స్కార్ కు రూపకల్పన చేశారని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం కనీసం 100 శాతం నుంచి అత్యధికంగా 200 శాతం ఎస్ఆర్‌ఓ రేట్లు చెల్లించాలని నిర్దేశించగా, కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందంటూ కొత్త పాలసీని తీసుకువచ్చిందన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో భారీ స్కామ్‌కు ప్రణాళిక రూపొందించారన్నారు. ఈ విధానం ద్వారా   9,292 ఎకరాల భూమిని కేవలం 30 శాతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చనీ, తద్వారా ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండి పడుతుందని కేటీఆర్ అన్నారు.  ఇప్పటికే ఆ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి సోదరులు, అనచరులు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఈఘమేఘాలమీద వారం రోజుల్లో దరఖాస్తులు, మరో వారంలో ఆమోదాలు, కేవలం 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ అంటూ తొందరపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.  ఈ పాలసీ కాంగ్రెస్ కు, ముఖ్యమంత్రి రేవంత్ కు ఏటీఎంగా మారిందన్నారు.  ఆ భూములు కొనుగోలు చేసినా.. క్రమబద్ధీకరణ చేసుకున్నా ఇండస్ట్రియలిస్టులకు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.   ప్రజల ఆస్తిని కాపాడేందుకు బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందని చెప్పారు.  తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనీ, అప్పుడు   నగరంలోని పారిశ్రామిక భూముల లావాదేవీలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.  రేవంత్ రెడ్డి అవినీతికి అండగా నిలబడి  ఈ పాలసీలో భాగస్వాములై భవిష్యత్తులో ఇబ్బందులకు గురికావద్దంటూ  పారిశ్రామికవేత్తలకు  సూచించారు.  ఇంకా ఫార్ములా ఈ కార్ కేసుపై మాట్లాడుతూ.. తనను అరెస్టు చేసే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, అందుకే లైడిటెక్టర్ కు సైతం రెడీ అని సవాల్ విసిరాననీ చెప్పారు. ఇక పరువు కాపాడుకునేందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామా డ్రామాకు తెరతీశారని కాంగ్రెస్ పై మండి పడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారన్నారు. ఒక వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా స్థానిక ఎన్నికల తరువాతే ఉప ఎన్నికలు ఉంటాయని కేటీఆర్ జోస్యం చెప్పారు.  ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ కుప్పిగంతులు వేస్తోందని విమర్శించారు. 

బండి వర్సెస్ ఈటల.. తెలంగాణ బీజేపీలో చీలిక స్పష్టం!

తెలంగాణలో బీజేపీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం నేతల మధ్య సయోధ్య లేకపోవడమే.. సయోధ్య లేకపోవడం ఒక్కటే కాదు.. రాష్ట్ర పార్టీ నేతలలో విభేదాలు తరచూ బహిర్గతమౌతున్నాయి. అంతే కాదు.. ఈ  నేరుగా పేరు పెట్టి మరీ ఒకరినొకరు బహిరంగంగా విమర్శలకు దిగేంతగా ఈ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి.  ఇంత కాలం తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ము లాటలు,నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు  సాగుతూనే ఉన్నాయి. అయితే జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం తరువాత అవి రచ్చెక్కాయి.    రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్న పరిస్థితి నుంచి జూబ్లీ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా గల్లంతయ్యే పరిస్థితికి బీజేపీ దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ రాష్ట్రనాయకుల మధ్య సయోధ్య లేమే అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? నాయకుల మధ్య విభేదాల వెనుక ఉన్న అసలు సిసలు రీజనేంటి? అని పరిశీలిస్తే..   సాధారణంగా బీజేపీలోకి బయట నుంచి వచ్చి చేరిన వారు ఇమడ లేరు. హిందుత్వ భావజాలం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజపరిణామం.   అయితే బీజేపీ నాయకత్వం మోడీ, షా చేతులలోకి వచ్చిన తరువాత పార్టీలో ఆ పరిస్థితి మారిపోయింది. సిద్ధాంతం కంటే ఓట్లు, సీట్ల లెక్కలకే బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా బీజేపీకీ ఇతర పార్టీలకీ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూ తేడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీలో తొలి నుంచి ఉన్నవారూ, తరువాత వచ్చి చేరిన వారి మధ్య అగాధం ఏర్పడింది. అది పెరుగుతూ వస్తోంది. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఈ పరిస్థితి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  జూబ్లీ ఉప ఎన్నికలో ఘోర పరాజయం తరువాత ఈ విభేదాలు నివురు తొలగించుకుని నిప్పులా బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ల మధ్య సైద్ధాంతిక అంతరం ఈ విభేదాలు రాజీకి ఆస్కారం లేనంత తీవ్ర స్థాయికి చేరడానికి కారణమయ్యాయి.  బండి సంజయ్ నూటికి పదహారణాల హిందుత్వ వాది. ఈటల రాజేందర్ రాజకీయ నేపథ్యం ఇందుకు పూర్తి భిన్నం.  ప్రాణం ఉన్నంతవరకు హిందూత్వమే తన మార్గమని బండి సంజయ్ అంటే.. మతతవ్వం ఇక్కడ నడవదని ఈటల కుండబద్దలు కొడతారు.  బరాబర్ హిందుత్వ అజెండాతో  ఎన్నికలో పోటీ చేయడం కరెక్టు కాదంటారు. అలా పోటీ చేస్తే ఇదిగో ఇలా డిపాజిట్లు గల్లంతౌతాయని ఈటల ఎలాంటి శషబిషలూ లేకుండా కుండబద్దలు కొట్టేశారు. జూబ్లీలో బీజేపీకి డిపాజిట్ గల్లంతు కావడానికి హిందుత్వ అజెండాయే కారణమని విస్ఫష్టంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈటల నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావిస్తూ ఆయన మతతత్వ అతివాద ధోరణితో చేసిన ప్రచారమే జూబ్లీలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు కావడానికి కారణమని చెప్పడమే కాకుండా, ప్రచార అజెండాలో మతం ప్రస్తావన లేకుండా ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బండి వర్సెస్ ఈటల వ్యవహారం రాష్ట్ర పార్టీలో స్పష్టమైన చీలకను స్ఫురింప చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.