ఎవరీ హరీష్ కుమార్ గుప్తా.. ఈసీ ఆయన్నేఏపీ డీజీపీగా ఎందుకు నియ‌మించింది?

ఆంధ్రప్రదేశ్ నూత‌న‌ డీజీపీగా హ‌రీశ్ కుమార్ గ‌ప్తాను ఎన్నిక‌ల సంఘం నియ‌మించింది. ఆయన సోమవారం (మే6) బాధ్యతలు చేపట్టారు. ఏపీ డీజీపీగా కొన‌సాగుతున్న రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై ఎన్నిక‌ల సంఘం ఆదివారం బ‌దిలీ వేటు వేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అధికార వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విప‌క్షాల నుంచి ఈసీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపిన ఈసీ.. రాజేంద్ర‌నాథ్ రెడ్డి డీజీపీగా కొన‌సాగితే ఏపీలో ఎన్నిక‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌ర‌గ‌వ‌ని భావించి ఆయ‌న‌పై బ‌దిలీ వేటు వేసింది. కొత్త డీజీపీగా హ‌రీశ్ కుమార్ గుప్తాను నియ‌మించింది. ఆయ‌న సోమ‌వారం (మే6)సాయంత్రం ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే అసలు హ‌రీశ్ కుమార్ గుప్తా ఎవ‌రు? ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల్లో సీనియారిటీ లిస్ట్ లో హ‌రీశ్ ఆరో స్థానంలో ఉన్నారు. తొలి ఐదుగురిని కాద‌ని ఈసీ హ‌రీశ్ కుమార్ గుప్తానే ఎందుకు నూత‌న డీజీపీగా ఎంపిక చేసింది అనే చ‌ర్చ ఏపీ అధికార వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో హ‌రీశ్ కుమార్ గుప్తా అయితేనే ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించ‌గ‌ల‌ర‌ని ప‌లు అంశాల‌ను బేరీజు వేసుకొని ఈసీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హ‌రీశ్ కు ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది.  ఏపీ నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన హ‌రీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయ‌న జ‌మ్మూ అండ్ కాశ్మీర్ కు చెందిన వ్య‌క్తి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల లిస్టులో మొద‌టి స్థానంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉన్నారు. కానీ, ఆయ‌న స‌స్పెన్షన్ పై క్యాట్ విచార‌ణ‌ జరుగుతోంది. దీంతో ఆయ‌న పోస్టింగ్ కు అవ‌కాశం లేకుండా పోయింది. రెండో స్థానంలో ద్వార‌కా తిరుమ‌ల‌రావు ఉన్నారు. తొలుత ఆయ‌న్నే నూత‌న డీజీపీగా ఈసీ ఎంపిక చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ హ‌రీశ్ కుమార్ గుప్తాను ఏపీ నూత‌న డీజీపీగా ఈసీ నియ‌మించింది. హ‌రీశ్ కుమార్ గుప్తా ఎవ‌రు? ఆయ‌న గ‌తంలో ఎక్క‌డెక్క‌డ ప‌నిచేశారు.. ? ఏపీలో ఏఏ విభాగాల్లో ఆయ‌న ప‌నిచేశార‌నే విష‌యాల‌ను చూస్తే..  1992లో ఐపీఎస్ అధికారిగా ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  1994లో ఖ‌మ్మం జిల్లా అడిష‌న‌ల్ ఎస్పీగా ప‌నిచేశారు.  1995లో మెద‌క్ జిల్లా ఏఎస్పీగా ప‌నిచేశారు.  1996లో క‌రీంన‌గ‌ర్ జిల్లా ఏఎస్పీగా ప‌నిచేశారు. 1999లో   తొలిసారి ఆయ‌న‌కు ప‌దోన్న‌తి ల‌భించింది. కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న 2002 సంవ‌త్స‌రం వ‌ర‌కు అక్క‌డే  ప‌నిచేశారు.  2002 సంవ‌త్స‌రంలో యూస‌ఫ్ గూడ‌లోని ఫ‌స్ట్ బెటాలియ‌న్ సూప‌ర్ క‌మాండెంట్ గా వెళ్లారు.  ఆరు నెల‌ల త‌రువాత 2002లోనే సీఐడీ ఎస్పీగా ప‌నిచేశారు.  2004లో హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ప‌నిచేశారు.  2006 నుంచి 2011 సంవ‌త్స‌రం వ‌ర‌కు న‌ల్గొండ జిల్లా ఎస్పీగా ప‌నిచేశారు.  2011 నుంచి 2012 వ‌ర‌కు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీఐజీగా ప‌నిచేశారు.  2012 నుంచి 2016 వ‌ర‌కు గుంటూరు రేంజ్ ఐజీగా ప‌నిచేశారు.  2016లో టెక్నిక‌ల్ స‌ర్వీస్ ఐజీ కొన్నాళ్లు.. లా అండ్ ఆర్డ‌ర్ ఐజీగా కొన్నాళ్లు ప‌నిచేశారు.  2019లో  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత లా అండ్ ఆర్డ‌ర్ అడిష‌న‌ల్ డీజీగా ప‌నిచేశారు.  2022లో ఎస్ఎల్‌పీఆర్‌బి  చైర్మ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న కొద్ది నెల‌ల‌కే రైల్వేలో అడిష‌న‌ల్ డీజీపీగా ప‌నిచేశారు.  2023 మే నెల‌లో హోంశాఖ కార్యదర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  2024 మే 6న ఏపీ నూత‌న డీజీపీగా హ‌రీశ్ కుమార్ గుప్తాకు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఈసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయ‌న వెంట‌నే డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

వాస్తుతో పాటు జగన్ ఈ పనులు కూడా చేయాలి...

ఐదేళ్ళపాటు చేయకూడని అరాచకాలు అన్నీ చేసిన జగన్, ఇప్పుడు అధికారం చేజారిపోతోందని అర్థం చేసుకుని ఆందోళన పడిపోతున్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అమల్లో పెట్టేశారు. ఇనుప కాంపౌండ్ వాల్‌కి సంబంధించిన రిపేర్లు చేశారు. గోడ ఎత్తు తగ్గించడం యుద్ధ ప్రాతిపదిక మీద జరిగిపోయింది. వాస్తు దోషాలను సరిచేశారు సరే... మరి మిగతా దోషాల సంగతేంటి? -- అద్బుతమైన రాజధానిగా రూపొందే అమరావతిని పాడుబెట్టేసి ఘోస్ట్ సిటీగా మార్చేశారు. మరి ఈ దోషానికి పరిహారం ఏమిటి? -- ఈ ఐదేళ్ళలో జగన్ అండ్ కో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. మరి ఆ తప్పుకు దండన ఏమిటి? -- కల్తీ మద్య ప్రవాహంతో వేలాది ప్రాణాలు గాల్లో కలసిపోయేలా చేశారు.. ఆ నేరానికి శిక్ష ఏమిటి? -- హత్యారాజకీయాలు చేసి ఎంతోమంది టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీశారు.. ఆ ఘోరాలకు శిక్ష ఏమిటి? -- రాష్ట్ర విభజన తర్వాత ముందడుగులో వున్న రాష్ట్రాన్ని పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు.. ఆ నేరానికి శిక్ష ఏమిటి? -- పరిశ్రమలను తరిమేసి, ఉపాధి అవకాశాలను పాతాళంలోకి పడేసి లక్షలాది మంది యువకుల జీవితంలో ఐదేళ్ళ కాలాన్ని వృధా చేశారు. ఏం చేస్తే ఈ పొరపాటు సరిదిద్దడానికి వీలవుతుంది? -- ఈ ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఆశీస్సులతో జరిగిన నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, ఆర్థిక నేరాలు... వీటన్నిటి సంగతేమిటి? .... ఇవి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాల్లో కొన్ని... మరి ఇలాంటివన్నిటినీ మరచిపోయి, ఒక్క వాస్తు దోషం సరిచేస్తే అధికారం వచ్చేస్తుందని ఆశించడం అజ్ఞానం కాక మరేమవుతుంది?

తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదుః కేసీఆర్‌

గోదావరి న‌దీ జ‌లాల్ని తీసుకెళ్లి కర్నాటక, తమిళనాడుకు ఇస్తాన‌ని మోడీ చెబుతున్నా,   సి.ఎం. రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించ‌డం లేద‌ని మాజీ సి.ఎం. కేసీఆర్ ప్ర‌శ్నిస్తున్నారు. తాను సిఎంగా ఉన్నప్పుడే మోడీ గోదావరిపై ప్రతిపాదన పంపారట‌.  అయితే ముందు తెలంగాణ వాటా తేల్చండి. ఆ త‌రువాతే  మీటింగ్ కు వస్తానని మోడీకి తేల్చిచెప్పానని కేసీఆర్ చెబుతున్నారు. ఇంకా తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.  తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్‌.  ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్‌ బ్యాక్‌ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి.  గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ త‌న క్యాడ‌ర్‌కు హిత‌బోధ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.  తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటల్ని కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో గుర్తు చేస్తున్నారు.  ఉద్యమ చివరి దశలో తాను ఢిల్లీ వెళ్తుండగా ఆంధ్రా పత్రికల వాళ్లు తనకు ఒక ప్రశ్న వేశారని, ఢిల్లీ వెళ్తున్న మీరు అక్కడ ఏం జరుగుతుందని... అడిగారని గుర్తు చేశారు. దానికి తాను ఒకటే మాట చెప్పానని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి నేను ఢిల్లీ వెళ్తున్నానని, తిరిగి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పానని, ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం, ఎంత నమ్మకం ఉండాలని అన్నారు. ఆ రోజు ప్రజల దీవెన, బలంతో అన్న ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెట్టినట్లు చెప్పారు.  పదేళ్లలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం.  కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో అంతా గాడి తప్పింది. రాష్ట్రం ఇంత తొందరగా ట్రాక్‌ ఎలా తప్పిందని, ఇప్పుడున్న పాలకులకు ఒక పద్ధతీ పాడు లేదని కేసీఆర్ విమర్శించారు.  తెలంగాణాను తిరిగి బాగు చేయాల్సిన బాధ్యత మనదేనని, మళ్లీ మనం వచ్చేవరకు దీటుగా పనిచేసి రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీని ముందుకు తీసుకొని పోవాలని, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలకు ప్రజలు మోసపోయారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్రంలో రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి వెళ్లిపోయిందని స్పష్టం చేశారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయన్నారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నాయని కెసిఆర్ చెబుతున్నారు.   కాంగ్రెస్ పాలనలో ప్రతి రంగం  విఫలం కావడంతో ప్రజల్లో మార్పు మొదలైందని, తద్వారా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్‌ ఎన్నిక‌లు కేసీఆర్‌కు  ఇజ్జ‌త్‌కే స‌వాల్‌గా మారాయా?  తెలంగాణ సాధ‌న‌ను 2014లో ఆయుధంగా మార్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన కేసీఆర్‌, 2018లో “ఆంధ్రోళ్ల పాల‌న మ‌న‌కు అవ‌స‌ర‌మా?!”-అంటూ.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు.  ఇప్పుడేమో తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదంటున్నారు. మ‌రి తెలంగాణా ప్ర‌జ‌లు లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనైనా కేసీఆర్‌ను ప‌ట్టించుకుంటారా అనేది ఉత్కంఠ‌గా మారింది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

వృద్ధుల ఉసురు తగిలి తీరుతుంది

ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు.. కానీ ‘కర్మఫలం’ అనేది ఒకటి వుంటుంది. అది ఎంతటి వారైనా అనుభవించి తీరాల్సిందే. చేసిన కర్మనిబట్టి కర్మఫలం కూడా అంతే స్థాయిలో వుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి రెడీ అవుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. ఆ కర్మఫలంలో తన వాటా తాను తీసుకోవడానికి రెడీ కావల్సిన వ్యక్తి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. వృద్ధులకు పెన్షన్ ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరించాలని, వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం కాకుండా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరు. చంద్రబాబు పెన్షన్ ఆపే ప్రయత్నం చేశారని ప్రచారం చేయడం ప్లాన్ నంబర్ వన్. పెన్షన్ వృద్ధులకు వాళ్ళ ఇళ్ళ దగ్గర కాకుండా బ్యాంకులకు వెళ్ళి తీసుకునే పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేయడం నంబర్ టు. ఈ రెండు ప్లాన్స్ విజయవంతంగా అమలు చేయడానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తనవంతు సహకారం అందించారు. వృద్ధులకు ఇళ్ళకు వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం వున్నప్పటికీ అలా చేయలేదు. ఆ నిర్ణయం వల్ల, భయంకరమైన ఎండల కారణంగా ఇప్పటి వరకు 33 మంది వృద్ధులు మరణించారు.  తమ రాజకీయ ప్రయోజనాల కోసం పండుటాకుల్లాంటి వృద్ధుల జీవితాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. అవకాశం వున్నప్పటికీ, జగన్  అడుగులకు మడుగులు ఒత్తుతూ సీఎస్ జవహర్ రెడ్డి వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం దారుణం. వృద్ధుల విషయంలో వీరిద్దరూ చేసిన దానికి ‘కర్మఫలం’ అతి త్వరలో లభిస్తుంది. వీరిద్దరికీ వృద్ధుల ఉసురు తగిలి తీరుతుంది.

నెక్ట్స్ వికెట్ సీఎస్ జవహర్ రెడ్డేనా? ఈసీ వేటుకు వేళాయెనా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్  వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్క‌రి పై బదిలీ వేటు వేస్తూ వ‌స్తున్న. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6)  రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న స్థానంలో ర‌వికుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా   నియ‌మించింది. రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై గ‌త కొంత‌కాలంగా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల నుంచి ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాజేంద్ర‌నాథ్ రెడ్డి అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఎన్నిక‌ల్లో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాల‌ను సైతం  స‌మ‌ర్పించారు. దీంతో రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ర‌వికుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియ‌మించింది. రాజేంద్ర‌నాథ్  రెడ్డిపై బ‌దిలీ వేటు తో నెక్ట్స్ వికెట్ ఎవ‌రిద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ‌, అధికార వ‌ర్గాల్లో జోరందుకుంది.  ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పై ఈసీ బ‌దిలీ వేటు వేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.  ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికార వైసీపీ కార్య‌క‌ర్త‌లా ప‌నిచేస్తున్నార‌ని, సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌నే ఇప్ప‌టికీ ఆయ‌న పాటిస్తున్నార‌న్న విమర్శలు కూటమి నేతల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఈసీకి కూడా పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా వాలంటీర్లు, పెన్ష‌న్ల పంపిణీ విష‌యంలో సీఎస్ వ్య‌వ‌హ‌రించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ప్ర‌తీనెలా ప్ర‌భుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్నది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డంతో వారు ఎలాంటి విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. పెన్ష‌న్ దారుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా పెన్ష‌న్లు అందించాల‌ని సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ, జ‌వ‌హ‌ర్ రెడ్డి ఈసీ ఆదేశాల‌ను పెడ‌చెవిన పెట్ట‌డంతో ఏప్రిల్ నెల పెన్ష‌న్లు తీసుకొనే స‌మ‌యంలో పెన్ష‌న్ దారులు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ప‌లువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో వైసీపీ నేత‌లు ఈ వ్య‌వ‌హారాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందు ప్ర‌య‌త్నాలు చేశారు. మే నెల పెన్ష‌న్ల పంపిణీ విష‌యంలోనూ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి  స‌మ‌ర్థ‌వంతంగా ఈసీ ఆదేశాల‌ను పాటించ‌క పోవ‌టంతో పెన్ష‌న్ దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   సీఎస్ తీరుపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెన్షనర్లు ఏమైపోయినా పరవాలేదు.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మేలు జ‌ర‌గాల‌ని సీఎస్ వ్య‌వ‌హ‌రించార‌ని టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశారు. పెన్ష‌న్ పంపిణీ విష‌యంలోనూ, వాలంటీర్ల విష‌యంలోనూ, ఇత‌ర అంశాల్లోనూ సీఎస్ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆధారాల‌తో స‌హా ఈసీకి విప‌క్ష నేత‌లు ఫిర్యాదు చేశారు. అయితే, విప‌క్షాల ఫిర్యాదుల‌పై ఈసీ విచార‌ణ చేయ‌గా సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మైన‌ట్లు తెలుస్తోంది. దీంతో నేడో, రేపో జ‌వ‌హ‌ర్ రెడ్డిపై ఈసీ బ‌దిలీ వేటు వేయ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ అధికార వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ఒక‌వేళ ఈసీ జ‌వ‌హ‌ర్ రెడ్డిపై వేటు వేయ‌కుంటే ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగే ప‌రిస్థితి ఉండ‌ద‌ని విప‌క్ష నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా ఉండగా ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహణపై పట్టుదలగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా పలు సందర్భాలలో  చెప్పారు. ఇప్పుడు ఎన్నికల సంఘం వరుసగా అధికారులపై బదిలీ వేటు వేయడాన్ని చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. తాజాగా సోమవారం అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. అలాగే ఆయనకు ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని సీఎస్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  

అనంతపురం రేంజ్ డిఐజిపై వేటు 

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.  ఎన్నికల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కింది స్థాయి అధికారికి వెంటనే బాధ్యతలను అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆయనకు ఎన్నికలకు సంబంధించిన విధులను అప్పగించవద్దని ఆదేశించింది. ఈ రాత్రి 8 గంటల లోపు ముగ్గురు అధికారుల పేర్లతో ప్యానల్ పంపాలని ఆదేశాలు జారీ చేసింది.  డీఐజీ అమ్మిరెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అధికార వైసీపీకి ఆయన సహకరిస్తున్నారని విపక్ష కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా చూపారు. ఈ నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకుంది. ఇప్పటికే అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో అమిత్ బర్దర్ ను నియమించింది. మరోవైపు, అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్ ను, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.   

జగన్ ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా వుండాల్సింది...

‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అనవసరంగా నోరు జారి తన పదవిని, పరువుని పోగొట్టుకుంటాడు. క్లైమాక్స్.లో రఘువరన్ బాల్చీ తన్నేస్తూ హీరోతో ‘‘అది చాలా గొప్ప ఇంటర్వ్యూ’’ అంటాడు. అంటే, ఒక్క ఇంటర్వ్యూ ముఖ్యమంత్రి అంత స్థాయి వున్న వ్యక్తిని పూర్తిగా పతనం అయ్యేలా చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొన్నీమధ్య నేషనల్ మీడియాకి.. ముఖ్యంగా టైమ్స్ నౌ ఎడిటర్ నవికా కుమార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సేమ్ టు సేమ్ ‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఇంటర్వ్యూ  లాంటిదే. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పదవి పోయింది.. ఈ రియాల్టీలో ముఖ్యమంత్రి పరువు పోయింది. జగన్ గెలవబోతున్నాడా.. ఓడుతున్నాడా అని అప్పటి వరకు జాతీయ స్థాయిలో గానీ, స్థానికంగా గానీ వున్న డోలాయమాన పరిస్థితికి ఆ ఇంటర్వ్యూ ఫుల్‌స్టాప్ పెట్టింది. నవికా కుమార్ అడిగిన ప్రశ్నలకు జగన్ ఇచ్చిన సమాధానాలు, హావభావాలు జగన్ ఓటమిని ఫిక్స్ చేశాయి. ఇక జగన్ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమన్న క్లారిటీ జాతీయ స్థాయిలో కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా వుండాల్సిందనే అభిప్రాయాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి. గతజలసేతు బంధనం మాదిరిగా, జరిగిపోయిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ వర్గాలు తీరిగ్గా బాధపడుతున్నాయి. ఇకమీదట జగన్ ఏ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకూడదని వైసీపీ వర్గాలు ఫిక్సయ్యాయి. అసలే ఓటమి భయం నిలువెల్లా ఆవరించి వున్న జగన్ ఢిల్లీ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తడబడిపోతున్న పరిస్థితి. జాతీయ రాజకీయాల మీద మీ వ్యూ ఏమిటని అడిగితే, నాకు జాతీయ రాజకీయాల గురించి అంతగా తెలియదు అని సమాధానం చెప్పడం... అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా అనడం చాలా మైనస్ అయింది. అందుకే, ఎందుకొచ్చిన గొడవ.. నేషనల్ మీడియాకి దూరంగా వుంటే సరిపోతుంది కదా అని వైసీపీ వర్గాలు ఫిక్సయ్యాయి. ఏపీలో మీడియాకి జగన్ అంతట జగనే చెప్పడం తప్ప, జర్నలిస్టులు అడిగిన దానికి సమాధానం చెప్పే అలవాటు జగన్‌కి లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఇదే వ్యవహారం. మరి నేషనల్ మీడియా జర్నలిస్టులు అలా కాదు.. కోడి ఈకలు పీకినట్టు ప్రశ్నలు సంధిస్తారు. ఆ పీకుడుని తట్టుకునే పరిస్థితిలో జగన్ లేరు. మరీ ముఖ్యంగా... బాబాయ్ హత్య గురించి, చెల్లెమ్మ షర్మిల తిరుగుబాటు గురించి ప్రశ్నలు అడిగితే మాత్రం జగన్ తడబడిపోతున్నారు. ఆయా ప్రశ్నలకు ఏ సమాధానం చెబుతున్నారో జగన్‌కే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల ప్రభుత్వం పోతే పోయింది.. ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవడం ఎందుకన్న అభిప్రాయంలో వైసీపీ వర్గాలు వున్నట్టు సమాచారం.

తెలుగుదేశం మేనిఫెస్టోపై అవాస్తవ ప్రచారంతో వైసీపీ నవ్వులపాలు!

ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో  ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తెలగుదేశం మేనిఫెస్టో 2024ను   ఆ పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించిందంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపింది. తెలుగుదేశం, వైసీపీ మేనిఫెస్లోలు విడుదల చేసినప్పటికీ, వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలలో స్పందన కనిపించలేదు. ఆ మేనిఫెస్టోపై కనీసం చర్చ కూడా జరగలేదు. అందుకు భిన్నంగా తెలుగుదేశం మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించింది. ఆ పార్టీ గ్యారెంటీలపై ప్రజలలో విశ్వాసం కనిపించింది.  తెలుగుదేశం మేనిఫెస్టో కూటమికి బ్రహ్మాండమైన మైలేజీని తీసుకువచ్చింది. అదే సమయంలో వైసీపీ మేనిఫెస్టో పట్ల సర్వత్రా పెదవి విరుపే కనిపించింది. దీంతో తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చి హామీల అమలు సాధ్యం కాదంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్  ప్రచారానికి తెరలేపింది. ఆ ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం కూటమిని మించి విపక్ష పార్టీ మేనిఫెస్టోకు ప్రచారం కల్పించింది. అది ఫలించలేదని గ్రహించిన వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం తన వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టో తొలగించేసిందంటూ  వదంతులను వ్యాప్తి చేయడానికి తెరతీసింది. ఇందుకు నిదర్శనమంటూ తెలుగుదేశం వెబ్ సైట్ స్క్రీన్ షాట్ ను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.  ఆ స్క్రిన్ షాట్ ఏమిటంటే.. పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని కనిపిస్తోంది. అయితే వాస్తవం ఏమిటంటే..  తప్పు యూఆర్ఎల్ ను టైప్ చేసి ఎర్రర్ మెసేజ్ వచ్చిన స్క్రీన్ షాట్ ను  వైసీపీ వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నది.  తెలుగుదేశం వెబ్ సైట్ హోం పేజ్ ఓపెన్ కాగానే ఆ పార్టీ మేనిఫెస్టో డిస్ ప్లే అవుతోంది. అయినా సరిగ్గా ఎన్నికల వేళ ఏ పార్టీ కూడా తన మేనిఫెస్టోను తొలగించదన్న కనీస ఇంగితాన్ని కూడా వైసీపీ కోల్పోయిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అవాస్తవ ప్రచారంలో ఎన్నికల గండం గట్టెక్కేందుకు  వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యి ఆ పార్టీనే నవ్వుల పాలు చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం చట్టం కాదు.. నీతి ఆయోగ్ సిఫారసు మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు. వారి ప్రసంగాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను ఎలా  వారికి దూరం చేస్తుందో వివరిస్తున్న తీరు ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాను అధికారంలోకి రాగానే చేసే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటన, ఇస్తున్న హామీ ప్రజలకు భరోసా కలిగిస్తోంది. చంద్రబాబు ఇప్పటికే మెగా డీఎస్సీపైనే తన తొలలి సంతకం అని ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు జగన్ ను, ఆయన సర్కార్ ను మరింత దూరం చేసిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఈ తరుణంలో వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్ర చట్టం కాదనీ, దానిని రద్దు చేయడం సాధ్యం కాదనీ పేర్కొంటూ తన సామాజిక మాధ్యమ వేదికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.  అయతే వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం చట్టం ఎంత మాత్రమూ కాదు. భూమి అన్నది రాష్ట్రానికి చెందిన అంశం. ఈ విషయంలో కేంద్రం చట్టాలు చేయజాలదు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను నీతి ఆయోగ్ ప్రతిపాదన మాత్రమే. ఆ ప్రతిపాదనను పరిగణననలోనికి  తీసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. కానీ దుష్ట యోచనతో ఒక్క జగన్ సర్కార్ మాత్రమే ఆ నీతీ ఆయోగ్ ప్రతిపాదనను చట్టం చేసింది. హడావుడిగా అమలులోకి తీసుకువచ్చేసింది.   తాను కూడా ఆ చట్టానికి బాధితుడినేనంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమైనదో కళ్లకు కట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ చట్టాన్ని రద్దు చేసే హక్కు రాబోయే ప్రభుత్వానికి  పూర్తిగా ఉంది. అంటే ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబు అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి ఎటువంటి అవరోధాలూ ఉండవు. ఇది కేంద్రం చట్టం అంటూ చేస్తున్న వైసీపీ ప్రచారం పూర్తి అవాస్తవమని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు. 

ఏపీ కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఏపీ ఇన్ చార్జ్  డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు.  ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు. వీరిలో 1992 బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఈసీ ఖరారు చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు.  మొత్తం మీద ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల వేళ, కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు వేయడాన్ని తెలుగుదేశం కూటమి స్వాగతిస్తున్నది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నెలన్నర తరువాత ఈ బదిలీ జరగడం గమనార్హం, ముఖ్యంగా అనకాపల్లి లోక్ సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై దాడి అనంతరం ఎన్నికల సంఘం రాష్ట్రంలో  శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందన్న అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయనపై వేటు వేసి ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ సాయంత్రం  ఆయన బాధ్యతలు చేపట్టారు. 

రెండు నెలల్లో 90 మంది ఎన్ కౌంటర్! పట్టు కోల్పోతున్న మావోయిస్టులు

ఛత్తీస్‌గడ్ దండకారణ్యమంతా నివురుగప్పిన నిప్పులా మారింది.  వరుస ఎన్ కౌంటర్‌లతో మావోయిస్ట్‌లపై భద్రతా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం మావోయిస్టులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. గడిచిన మూడు నెలల్లో యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొనే సిబ్బంది సంఖ్యను ఒక్కసారిగా పెంచారు. ప్రస్తుతం ఒక్క బస్తర్‌ రీజియన్‌లోనే 80 వేల మంది డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ జవాన్లు నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు.  తెలంగాణ సరిహద్దులో ఉండే మావోయిస్టుల కంచుకోట పూవర్తి, తెర్లం  నుంచి  అబూజ్‌మడ్‌ అడవుల వరకు 400 కిలోమీట‌ర్ల మేర పోలీసులు క్రమంగా క్యాంపులను విస్తరించారు.  అడవిలో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీసు క్యాంపు ఏర్పాటైంది. ఒక్కో క్యాంపులో 2 వేల నుంచి 5 వేల వరకు బలగాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. గడిచిన మూడున్నర నెలలుగా ఎన్‌కౌంటర్లు పెరిగాయి.  అబూజ్ మడ్ దట్టమైన  అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో  90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.  బాహ్య ప్రపంచానికి ఆవల.. ఎక్కడో విసిరివేయబడ్డట్టుంటుంది అబూజ్ మడ్. దట్టమైన చెట్లతో అడుగు తీసి అడుగేయడమే కష్టం.  4 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం… నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాలతో పాటు.. ఇటు తెలంగాణా రాష్ట్రంలోని జయశంకర్ భూపాల జిల్లా.. అటు మహారాష్ట్రలోని గడ్చిరోలితో పాటు.. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బార్డర్స్ లో విస్తరించి ఉంది. నక్సల్స్ ఈ అబూజ్ మడ్ ను సేఫెస్ట్ ప్లేస్ గా ఎంచుకున్నారు. అలా ఈ ప్రాంతం నక్సల్స్ కు ఒక ప్రధాన స్థావ‌రంగా మారింది.  ఈ డెన్ ను కనుక నిర్వీర్యం చేస్తే… ఇక మావోయిస్టులు, ఇతర తిరుగుబాటు దళాల ఉనికే లేకుండా చేయొచ్చనే ఉద్దేశంతో మోదీ సర్కార్ అబూజ్ మడ్ పై దృష్టి పెట్టింది. తరచూ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఎన్ కౌంటర్స్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగులుతోంది.  సరిహద్దు భద్రతా దళాలతో పాటు.. జిల్లా రిజర్వ్ గార్డ్ దళాలతో కలిసి ఈ ఆపరేషన్స్ చేస్తున్నాయి. సుశిక్షితులైన దళాలను రంగంలోకి దింపి మొత్తంగా అబూజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవ‌డానికి కేంద్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.  అబూజ్ మడ్ లో ఇటీవ‌ల జరిగిన ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బూటకపు ఎన్ కౌంటర్లతో గడిచిన రెండు నెలల్లోనే 90 మందిని కాల్చి చంపారని హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి ఆరోపించారు. నక్సల్స్ స్థావరాలను గుర్తించి డ్రోన్ల ద్వారా విష రసాయనాలను చల్లుతున్నారని మండిపడ్డారు. ఆపై నక్సల్స్ స్పృహ తప్పగానే కాల్పులు జరిపి వారిని మట్టుబెడుతున్నారని మండిపడ్డారు. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని అడవుల్లోకి తీసుకొచ్చి, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వారిని ఏరివేసేందుకు ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల నుంచి.. నేపాల్‌ వరకు రెడ్‌కారిడార్‌ను ఏర్పాటు చేసుకున్న నక్సల్స్‌ ఇప్పుడు సేఫ్‌జోన్లు లేక సతమతమవుతున్నారా? దండకారణ్యంపై మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

డబుల్ బెడ్ రూం ఓ బూటకం: బిజెపి 

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్ల మాదిరిగా  కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగి పోయింది. కాంగ్రెస్ ను నిలువరించడానికి బిఆర్ఎస్, బిజెపి చేసిన ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఐదు నెలల కాలంలో మిత్రులు కాస్తా శత్రువులయ్యారు. బిజెపి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయితే రెండో ప్రత్యర్థి మాత్రం బిఆర్ఎస్  అని తెలుస్తోంది . రానున్న లోకసభ ఎన్నికలు మరో వారం రోజులు ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.  డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజల్ని మోసగించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూం హామీని బీజేపీ పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేంద్రం అందించిన పీఎంజేవై పథకాన్ని వినియోగించుకోలేకపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేబాటలో నడుస్తున్నారని ఆయన విమర్శించారు.  పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ...ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మారుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఫార్మా, పెట్రో కెమికల్స్ రంగాల్లో మన దేశం రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఇదివరకు మొబైల్ ఫోన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని, కానీ నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశంలోనే మొబైల్ ఫోన్ల తయారు చేస్తున్నామని తెలిపారు. మేకిన్ ఇండియా ద్వారా తయారైన మొబైల్ ఫోన్లనే మనం వినియోగిస్తున్నట్లు నడ్డా చెప్పారు. ఇప్పటివరకు దేశంలో 56 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామని, 52 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుద్డీకరణ పూర్తయిందని వెల్లడించారు. ప్రపంచంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐదోస్థానంలో ఉందని తెలిపారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 148 కి పెంచామని, లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు జేపీ నడ్డా చెప్పారు.

ఉపాధ్యాయులు రివెంజ్ కు రెడీ అయిపోయారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ ఐదు లక్షల మందికి పైగా పోస్టల్ బ్యాలట్ ఉపయోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఏ విధంగా చూసినా రికార్డే. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రతి ఎన్నికలలోనూ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేందుకు లక్షా లక్షన్నర మంది కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ సారి మాత్రం ఉద్యోగులలలో తమ ఓటు హక్కు వినియోగించుకు తీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు పెద్దగా సుముఖత చూపరు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలంటూ నియోజకవర్గ కేంద్రానికి లేదా మండల కేంద్రాలకు కానీ వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది.  అయితే ఈసారి ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగుల కోసం  కేంద్ర ఎన్నికల సంఘం 7, 8 తేదీలలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులు బాటు కల్పించింది. ఫారం 12ను సమర్పించి 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వెసులు బాటు కల్పించింది. దీంతో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పొందే విషయంలో అవరోధాలు, ఇబ్బందులు ఎదురౌతున్నా పట్టించుకోకుండా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి తమ ఓటు హక్కును వినియోగించుకుతీరాలన్న సంకల్పం వారిలో కనిపించింది. ఈ పట్టుదల, సంకల్పం  వెనుక జగన్ ను గద్దె దించాలన్న తపన కూడా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో  ఉద్యోగులు, మరీ ముఖ్యంగా టీచర్లను అన్ని విధాలుగా వేధింపులకు, అవమానాలకు గురి చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాన్న వాగ్దానాన్నివిస్మరించడం విషయంలో కానీ, వారికి చట్టబద్ధంగా, న్యాయపరంగా అందాల్సిన అలవెన్సులు, సబ్బిడీల విషయంలో కానీ జగన్ ఏ మాత్రం సానుకూలత లేకుండా వ్యవహరించారు.  ఉపాధ్యాయుల్లో 90 శాతం మంది తెలుగుదేశం కూటమికే ఓటు వేయడానికి నిర్ణయించేసుకున్నట్లుగా వారి వాట్సాప్ గ్రూపులలో సంభాషణలు, చర్చల ఆధారంగా వెల్లడౌతోంది. ఉద్యోగులు, టీచర్లు తన ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలన్న ప్రచారం కూడా టీచర్ల వాట్సాప్ గ్రూపులలో పెద్ద ఎత్తున జరుగుతోంది.   ఫలానా పార్టీ, ఫలానా కూటమికి ఓటు అని ప్రత్యేకంగా చెప్పకున్నప్పటికీ, స్పష్టంగా అధికార పార్టీకి వ్యతిరేకం అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాది.  న భూతో అన్నట్లుగా టీచర్లు చురుకుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న తీరు మాత్రం జగన్ సర్కార్ తో వారు ఎంతగా విసిగిపోయారో తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 3

వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని, ఆ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఇంతకుముందు రెండు భాగాల్లో వివరించడం జరిగింది. ఇప్పుడు ‘నార్సీ’ మానసిక వ్యాధిగ్రస్తులకు వుండే ఇతర లక్షణాలను చూద్దాం.  జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం మూడు లక్షల టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసింది. వాటిని జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఐదేళ్ళుగా అవి పాడుబడిపోయి వున్నాయి. వాటిని అలా ఉంచేసి, జగన్ సెంటు భూమి పథకం పట్టుకొచ్చాడు. సెంటు భూమి ఎలా సరిపోతుంది? ఆ ఇచ్చే భూమి కూడా ఎక్కడో ఊరు చివరో, మునక ప్రమాదం వున్న ప్రాంతాల్లోనే ఇచ్చాడు. ఇళ్ళు కట్టుకోవడానికి సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ఇవ్వక తప్పని పరిస్థితి. ఇంకా ఈ స్కీములో ఎన్నో స్కాములు, తిరకాసులు, లబ్ధిదారులను స్థలం ఇచ్చాం కాబట్టి మా పార్టీకి ప్రచారకర్తలుగా పనిచేయాలంటూ బెదిరించడం.. ఇలాంటి లీలలు ఎన్నెన్నో. మరి పేదకు ఇళ్ళు సమకూర్చే ఈ పథకాన్ని ఇంత నాశనం చేసిన జగన్, చంద్రబాబు ఇచ్చి టిడ్కో ఇళ్ళు బాగున్నాయని ఎవరైనా అంటే తట్టుకోగలడా.. అందుకే వాటిని పాడుబెట్టేశాడు. జగన్ ఎప్పుడూ దుష్ట చతుష్టయం అనే మాటను వాడుతూ వుంటాడు. జగన్ తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళందర్నీ ఒక తాటిమీద కట్టేస్తాడు.  ఎవరైతే జగన్ ప్రభుత్వం గురించి నిజాలు చెప్తున్నారో వాళ్ళను దొంగలు, దగుల్బాజీలు, అట్లాంటి వాళ్ళు.. ఇట్లాంటివాళ్ళు వాళ్ళ మీద అబద్ధాలు దుష్పచారం చేస్తాడు. చివరికి వాళ్ళు చెప్పే నిజాన్ని కూడా జనం నమ్మని పరిస్థితి తెస్తాడు. అప్పుడు వాళ్ళు ఎంత గట్టిగా నిజం చెప్పినా జనం పట్టించుకోవడం మానేస్తారు. ఇలా జరగడం ప్రపంచంలో ఇది మొదటిసారి కాదు... ఉదాహరణకు, 10 రూపాయల నాణెం దేశం మొత్తంలో చెలామణీలో వుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పదిరూపాయల నాణాన్ని విలన్ని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే, ఎప్పుడో ఒకసారి పదిరూపాయల నాణెం చెల్లదనే పుకారు వచ్చింది. దాన్ని జనం నమ్మేశారు. చదువుకున్నవారు.. చదువుకోనివారు.. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవారు.. అందరూ పదిరూపాయల నాణాన్ని తీసుకోవడం మానేశారు. పదిరూపాయల నాణెం చెల్లదని అంటే జైలుకు పంపిస్తామని రిజర్వ్ బ్యాంక్ చెప్పినా జనం ఇప్పటికీ పది రూపాయల నాణాన్ని మిగతా కాయిన్స్.ని నమ్మినట్టుగా నమ్మరు. పుకారుకు వున్న బలం అలాంటిది. జగన్ అండ్ టీమ్ కూడా తమను వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా రకరకాల పుకార్లు పుట్టిస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహాన్యూస్ నిజాలు చెబుతూ వుండేసరికి వాటికి టీడీపీ రంగు, కులంరంగు పులుముతారు. వాళ్ళూ వాళ్ళూ ఒక కులం వాళ్ళు కాబట్టి జగన్‌కి వ్యతిరేకంగా ఈ న్యూస్ రాసి వుంటార్లే అని జనం అనుకునేలా చేయడం ఒక వ్యూహాత్మక కుట్ర. న్యూట్రల్‌గా వున్నవారిని కూడా ప్రజలు నమ్మకుండా చేసే భయంకరమైన కుట్ర. ఇదే నార్సీ విధానం. ఆమధ్య చంద్రబాబు నాయుడు భార్య మీద దుర్మార్గమైన కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద మాట్లాడుతూ రోదిస్తే, దాన్ని మీడియాలో చూపించీ చూపించీ.. అతను ఏడవడం లేదు.. డ్రామా చేస్తున్నాడు అంటూ  జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. మనిషి అనేవాడు పగవాడు కళ్ళ వెంట నీరు పెట్టుకుంటే కొంచెమైనా చలిస్తాడు. అయ్యో అనుకుంటాడు. అదే ఒక మనిషి ఏడుస్తుంటే చూసి మనసు నిండా విశృంఖలంగా ఆనందం కలిగితే దాన్ని శాడిజం అంటారు. ఆ శాడిజం పుష్కలంగా కలిగిన వ్యక్తి జగన్. తనకున్న శాడిజాన్ని తనను నమ్మే వారి మనసులలో కూడా బలంగా నాటడమే ఈ నార్సీ విధానం. నార్సీ మానసిక వ్యాధి వున్నవాళ్ళు తనను అనుసరించే వాళ్ళలో వున్న రాక్షసత్వాన్ని నిద్ర లేపుతారు.  (ఇంకావుంది)

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు... కూట‌మిలో జోష్ పెంచిందా?

పోస్ట‌ల్ బ్యాలెట్ ఏపీ రాజ‌కీయాల్నే మ‌లుపు తిప్ప‌నుందా?   ప్రజలు ఎవరివైపు వున్నారు? అధికార‌, ప్ర‌తిప‌క్ష కూట‌మిలో అదే ఉత్కంఠ‌త‌.  మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తూ పావులు కదుపుతున్నారు.. మ‌రో వైపు జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, బీజేపీ కూట‌మి జోరుగా ప్రచారం చేస్తోంది. ఇరు ప‌క్షాలు  మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఓటు కీల‌కంగా మారింది. ముఖ్యంగా పోస్ట‌ల్ బ్యాలెట్ గెలుపు ఓట‌మిల నిర్ణ‌యంలో కీల‌కంగా మార‌నుంది. మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది. ఉద్యోగులు కూడా ఈసారి నూటికి నూరు శాతం ఓట్లు వేయడానికే మొగ్గు చూపించారు. పోలింగ్ రోజైన మే 13వ తేదీ నాడు విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్,  రెండు రోజుల పాటు  కొనసాగిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆరంభమైన ఈ ఓటింగ్.. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు, విభాగాల్లో పని చేస్తోన్న అయిదు లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు  85 ఏళ్ళు నిండిన వయో వృద్ధుల కోసం హోం ఓటింగ్ ఈ నెల 3న స్టార్ట్ అయింది. ఈ నెల 10 వరకూ కొనసాగనుంది.   పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ తీరు చూస్తే, ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్థులలో అధికార పార్టీపై వున్న అస‌హ‌నం, ఆగ్ర‌హం స్ప‌ష్టంగా క‌న‌బ‌డింది.  ఉద్యోగులంతా తమవైపే అనుకున్న వైసీపీ ఇప్పుడు ఆలోచనలో పడింది.   పోస్ట‌ల్ బ్యాలెట్ తీరు చూస్తే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందని సోషల్ మీడియాలో విశ్లేషణలు వ‌స్తున్నాయి.   ఉద్యోగుల ఓట్లన్నీ తమకేనని నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉంది అధికార పార్టీ, ఇప్పుడు చేతులెత్తేసింది. జీతాలు టైంకు ఇవ్వ‌కుండా ఉద్యోగులను తిప్పలు పెట్టారని, టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని, వారితో స్కూల్ లో టాయిలెట్లు కడిగించారని, ఇతర డిపార్ట్ మెంట్లలో కూడా ఉద్యోగుల స్వేచ్ఛను హరించినందుకు ఉద్యోగ‌స్తులు ఇప్పుడు త‌మ ఆగ్ర‌హాన్ని ఓట్ల రూపంలో చూపారు.పోస్టల్ బ్యాలెట్ లో కూట‌మిదే పైచెయ్యి క‌నిపిస్తోంది.      ప్ర‌భుత్వ ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్ సీపీఎస్ రద్దు. అయితే దీని మీద ఈసారి ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడేందుకే సాహసించలేదు. మరో వైపు చూస్తే కొత్త పీఆర్సీ విషయంలో పార్టీలు సానుకూలంగా మాట్లాడుతున్నా కూడా, రేపు అధికారంలోకి వచ్చాక ఎంత వరకూ నెరవేరుస్తాయన్నది డౌటే అన్న భావన కూడా ఉంది.  అటు అధికార వైసీపీ ఇటు టీడీపీ కూటమి కూడా ఒకరిని మించిన తీరులో మరొకరు సంక్షేమ పధకాలను ప్రకటించారు. ఖజనా పరిస్థితి ఏమిటో ఉద్యోగులకు మాత్రమే తెలుసు. ఏ మాత్రం తేడా వచ్చినా మొదట తమ జీతాలకే కోత పెడతారని వాళ్ళు భ‌య‌ప‌డుతున్నారు.  అందుకే ఉద్యోగుల ఓట్లు ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నాయి.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

తాండవ నదితో ఏలూరు కాల్వల అనుసంధానం.. నారాయణ మూర్తిని నమ్మించి మోసం చేసిన జగన్!

మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు. అందుకే జగన్ తాజా ఎన్నికల మేనిఫెస్టో గురించి కనీసం పట్టించుకోవడం లేదనీ, ఆయన నవరత్నాలు ప్లస్ ను నమ్మడంమే లేదనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అందుకే జగన్ తన మేనిఫెస్టో గురించి మాట్లాడటం మానేసి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ మాటతప్పి, మడమ తిప్పిన మరో అంశం ఇప్పుడు  సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. అదీ నటుడు, దర్శకుడు నారాయణ మూర్తికి ఇచ్చిన మాట కావడం విశేషం.  సామాజిక సమస్యలపై సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించే నటుడు ఆర్. నారాయణ మూర్తిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వామపక్ష భావజాలంతో ప్రజాసమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో తన సినిమాలలో పరిష్కారం చూపుతారు. సీనీ పరిశ్రమలో అజాత శత్రువుగా, అందరి మనిషిగా గౌరవాన్ని పొందే ఆర్. నారాయణ మూర్తిని కూడా జగన్ నమ్మించి వంచించారు. అదీ ఒక రోజో, నెలరోజులో కాదు.. ఏళ్ల తరబడి ఆర్. నారాయణ మూర్తి జగన్ చెప్పింది చేస్తారన్న నమ్మకంతో ఉన్నారంటే జగన్ ఆయనను ఎంతగా నమ్మించారో అర్థమౌతుంది. ఇంతకీ విషయమేమిటంటే .. నారాయణ మూర్తి జగన్ వద్దకు ఒక ప్రతిపాదన తీసుకువెళ్లారు. అదేమిటంటే ఏలూరు కాలువలను  విశాఖ తాడవ నదితో అనుసంధానం చేస్తే రెండు జిల్లాల్లోనూ 56 వేల ఏకరాలు సాగులోకి వస్తాయి. ఈ ప్రతిపాదనకు జగన్ వెంటనే ఆమోదం తెలిపేశారు. 2021 మార్చిలో ఈ ప్రాజెక్టు కోసం జగన్ ప్రభుత్వం 470 కోట్లు కూడా మంజూరు చేసింది. టెండర్లనూ పిలిచింది. దీంతో నారాయణమూర్తి దేశంలోనే ఇలాంటి మంచి సీఎం ఎక్కడా లేరంటూ ప్రశంసలు గుప్పించేశారు. సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారని చెప్పారు. తనకు రాజకీయ పార్టీలతో పనిలేదని, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. దేశంలోనే జగన్ లా ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్న సీఎం మరొకరు ఉండని వేనోళ్ల పొగిడేశారు.  అయితే ఆర్భాటమే తప్ప ఆచరణ ఉండదని జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టు విషయంలో మరో సారి రుజువు చేసుకుంది. ప్రాజెక్టుకు అనుమతించిన మూడేళ్ల తరువాత కూడా ఇప్పటి వరకూ కనీసం శంకుస్థాపన జరగలేదు. ఈ ప్రాజెక్టు పూర్తిగా కాగితాలకే పరిమితమైంది. తత్వం బోధపడిన నారాయణ మూర్తి మౌనం వహించారు. తాను గతంలో జగన్ పై కురిపించిన పొగడ్తల వర్షం ఎవరికీ గుర్తుండకుండా ఉంటే బాగుండునని భావించడమే ఈ మౌనానికి కారణం అయ్యుండొచ్చు. కానీ నెటిజనులు మాత్రం జగన్ మోసాల జాబితాలో తాండవ నదితో ఏలూరు కాల్వల అనుసంథానం ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా చేరిపోయిందంటూ మరోసాని జగన్ సర్కార్ వైఫల్యాలు, మోసాల జాబితాను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తున్నారు. 

జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 2

జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని, ఆ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం. జగన్ ప్లాన్‌లో జీవితాలను నాశనం చేసుకున్న యువత ‘వాలంటీర్’ అనే విష వలయంలో చిక్కుకున్నారు. ఉద్యోగాలు వుండి, ఉపాధి వుండి, పరిశ్రమలు వుంటే, ఐదు సంవత్సరాలుగా కేవలం ఐదువేల రూపాయలకే పనిచేసే యువత ఎలా దొరకుతారు? ఉపాధి లేకపోవడం వల్ల  కేవలం ఐదువేలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగంలో యువత చేరారు. జీవితంలో ఎదగాల్సిన, ఏదైనా స్కిల్, ఏదైనా నాలెడ్జ్ నేర్చుకుని ముందడుగు వేయాల్సిన యువత ఐదేళ్ళపాటు తమ జీవితాన్ని ‘వాలంటీర్’ అనే ఉచ్చులో చిక్కుకునేలా చేసుకున్నారు.  ఏదో సేవ చేస్తున్నాం, భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అనే భ్రమల్లో చిక్కుకున్న యువత తమ జీవితాలలో విలువైన ఐదేళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారు. మధ్యలో జీతం పెంచమన్న పాపానికి ప్రభుత్వ పెద్ద నుంచి పిచ్చి తిట్లు కూడా తిన్నారు. ‘నార్సీ’ జగన్ తన అబద్ధాలను వాలంటర్లు నమ్మేలా చేసి, తన అబద్ధాలను ప్రచారం చేసేలా వాలంటీర్లను వాడుకున్నాడు.  పోలవరం పూర్తయిందనుకోండి. కృష్ణానది నీటిని రాయలసీమకు తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చు. అప్పుడు రాయలసీమ కూడా కృష్ణ, గోదావరి జిల్లాల తరహాలో మారుతుంది. అలా మారకుండా చేసి, కృష్ణ, గోదావరి జిల్లాల వాళ్ళ మీద రాయలసీమ వాళ్ళకి ద్వేషం పెంచేలా చేసే కుట్రలో భాగమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం. రాయలసీమ సస్యశ్యామలం అయితే పగలు, ప్రతీకారాలు వుండవు, ఫ్యాక్షనిజం వుండదు.. అందరూ సంతోషంగా వుంటే తన మాట వినేవారు వుండరు.. అందుకే రాయలసీమను యథాతథంగా వుంచే కుట్రలో భాగంగానే పోలవరాన్ని పక్కనపెట్టాడు.  ఇక మద్యం గురించి చెప్పాలంటే, మద్యాన్ని నిషేధిస్తానని అధికారంలోకి వచ్చాడు. కేవలం స్టార్ హోటళ్ళలో మాత్రమే మద్యం అమ్మేలా చేస్తానని, మద్య నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పి అధికారంలోకి వచ్చాడు. చెప్పింది చేయకపోతా విషం లాంటి కల్తీ మద్యాన్ని, రేట్టు మూడు నాలుగు రెట్లు పెంచి అమ్మాడు. ఇది కేవలం సొంత బ్రాండ్స్ ద్వారా వచ్చే డబ్బుకు ఆశపడి మాత్రమే కాదు... అంతకు మించి.. అంతకు మించి... ఒక మగాడు మద్యానికో, గంజాయికో బానిసైపోతే ఆ కుటుంబం చెల్లాచెదురైపోతుంది. అతలాకుతలం అయిపోతుంది. ఆ ఇంటి ఇల్లాలికి జగనన్న అవసరం పడుతుంది. కల్తీ మద్యం ద్వారా బావ ఉసురు తీసి, చెల్లికి చక్కటి తెల్లటి చీర పెట్టే గొప్ప అన్న రాజకీయం ఇది. ఒక భయంకరమైన, దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఇది.  ఇక అన్న క్యాంటీన్ల పేరు మార్చి కొనసాగిస్తే, జనం చంద్రబాబుని మర్చిపోతారా? మర్చిపోరు.. ఎక్కడో ఒకచోట, ఎంతో కొంత చంద్రబాబు గుర్తు మిగిలిపోతుంది కదా.. అది జగన్ భయం.. అందుకే జనం కడుపు మీద తన్నాడు.. అన్న క్యాంటిన్లు మూసేశాడు. తన రాజకీయ మనుగడ కోసం పేద జనం నోటి దగ్గర వున్న అన్నం తీసేశాడు. అన్న క్యాంటిన్లు ఉన్నాయనుకోండి.. ‘చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పని చేశాడా.. ఒక్క మంచి పని చేశాడా’ అని జగన్ పదే పదే అనలేడు కదా.. (ఇంకావుంది...)

కవితకు కోర్టులో చుక్కెదురు ... బెయిల్ నిరాకరణ 

మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న రెండు పిటిషన్లను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది. కవితకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ ఇప్పటికే పూర్తి కాగా ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. సోమవారం ఉదయం తీర్పు వెలువరిస్తూ.. కవితకు బెయిల్ ఇవ్వడం కుదరదని పేర్కొంది. వాదనల సందర్భంగా.. ఎలాంటి ఆధారాలు లేకున్నా తన క్లయింట్ కవితను అక్రమంగా అరెస్టు చేశారని కవిత లాయర్ వాదించారు. ఈ వాదనను రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన కేసుతో పాటు లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన కేసులతో ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అంతకుముందు తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరు పరచాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ నూ కోర్టు తోసిపుచ్చింది.

ప్రజల ఆస్తులు గుటకాయస్వాహా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   ఆయన తన ట్వీట్ లో చెప్పిందేమిటంటే..  కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన ఆయన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్  ఆయన దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీవో పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి  వెనక్కు పంపేశారు. తన తల్లిదండ్రుల భూములపై తనకు ఏ హక్కూ లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్‌ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన తన అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం అని పేర్కొన్నారు.  వాస్తవానికి  ఏపీలో రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రతిపాదించిన రోజునే ఆయన కన్ను ప్రైవేటు ఆస్తులపై పడిందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అసలు జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ కాదేదీ తాకట్లునకు అనర్హం అన్న రీతిలోనే వ్యవహరించింది.  రాష్ట్ర ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అందిన కాడికి అప్పులు చేసింది. వివిధ కార్పొరేషన్ల పేరిట, బాండ్లను ష్యురీటీగా పెట్టి రకరకాల మార్గాల ద్వారా  అప్పలు చేసింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి అప్పు తెచ్చింది. చివరికి దేవాలయాల భూములను కూడా తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించింది కానీ కోర్టు మొట్టికాయలతో అది ఆగింది.  ఒక రాష్ట్రం తన పరిధికి చేయాల్సిన అప్పును ఏపీ ప్రభుత్వం ఎప్పుడో మించేసింది. ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలాడుకుంటుంది. అందుకు కేంద్రం పెట్టే షరతులకు ఒప్పుకొని ప్రజా ప్రయోజనానికి కూడా గండికొట్టడానికి సైతం సిద్ధమైపోయింది. అయితే అలా చేసిన  అప్పులు సరిపోలేదేమో  ఇప్పుడు ఏకంగా ప్రజల ప్రైవేట్ ఆస్తులను కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్  సొంతం చేసుకోవడానికి సిద్ధమైపోయింది.   ఇందుకు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ ఉదంతమే ఉదాహరణ. ఏకంగా పీఎంవో ఆఫీసులో పని చేసిన సీనియర్ మోస్ట్ అధికారి భూములకే రక్షణ లేకుండా పోయిందంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.