తమిళనాడు గవర్నర్ కు సుప్రీం షాక్!

గవర్నర్‌ అధికారాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలకు పంపడాన్ని సవాల్ చేస్తూ స్టాలిన్ సర్కార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది.    ఎంకే స్టాలిన్ ప్రభుత్వం పంపిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా,  వాటిని రాష్ట్రపతికి పంపడాన్ని  చట్టవిరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని సుప్రీం కోర్టు పేర్కొంది.  ఈ పది బిల్లులను  గవర్నర్ ఒక సారి తిరస్కరించి రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని మరోసారి గవర్నర్ కు పంపింది. అలా రెండో సారి గవర్నర్ కు పంపిన బిల్లులను ఆమోదించాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పది బిల్లులూ గవర్నర్‌కు తిరిగి పంపిన తేదీ నుంచే ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని   జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతొ కూడిన ధర్మాసనం మంగళవారం (ఏప్రిల్ 8) తీర్పు చెప్పింది. గవర్నర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు పేర్కొంది.  అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెంటనే క్లియర్ చేయాల్సి ఉందనీ, అయితే గవర్నర్ ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే బిల్లులను ఆమోదించలేదని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో బిల్లులను రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం.. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ముందుకు వచ్చినప్పుడు ఆయన  ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం నిలిపివేయవచ్చు. కొన్ని సవరణలతో బిల్లును తిరిగి శాసనసభకు పంపవచ్చు. అయితే, శాసనసభ తిరిగి అంటే రెండో సారిఆమోదించి పంపితే గవర్నర్ తప్పనిసరిగా దానికి ఆమోదం తెలపాలి.  అయితే తమిళనాడు గవర్నర్ అందుకు భిన్నంగా వ్యవహరించారని కోర్టు తప్పుపట్టింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ తీసుకునే ప్రతి చర్యను కోర్టు సమీక్షించవచ్చునని పేర్కొంది.  

పోలీసుల విచారణలో మాట మార్చిన వైకాపా నేత బెన్నిలింగం

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. వైకాపా అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న వైకాపా మైనార్టీ విభాగం అధ్యక్షుడు బెన్నిలింగం పూటకో మాట మాట్లాడుతున్నారు.  పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యే నని , ఇందులో అనుమానాలకు తావు లేదని చెప్పిన బెన్నిలింగం పోలీసుల విచారణలో  మాత్రం మాట మార్చారు. ఇటీవల ఆయన రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్ద ఆయన మాట్లాడుతూ ‘‘ పాస్టర్ ప్రవీణ్ ది హత్యే. అందులో అనుమానమే లేదు. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఉచకోత కోస్తాం, మమ్మల్ని కెలకొద్దు, మేం మంచి వాళ్లం కాదు. మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు’అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన బెన్నిలింగంపై కేసు నమోదైంది. విచారణకు రావాలని పోలీసులు  ఆయనకు నోటీసులు జారి చేశారు. ఈ నోటీసులు అందుకున్న బెన్నిలింగం పోలీసుల విచారణకు హాజరయ్యారు పోలీసుల విచారణకు హాజరైన బెన్నిలింగం మాట మార్చారు.  తనది నరం లేని నాలుక అని నిరూపించే విధంగా ఆవేశంతో  ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది. తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.  పోలీసుల ప్రశ్నలకు బెన్నిలింగం నీళ్లు నమిలారు. బెన్నిలింగం సమాధానాలను పోలీసులు వ్రాతపూర్వకంగా స్వీకరించారు. మత కలహాలు ప్రేరేపించే  వ్యాఖ్యలు చేసిన బెన్నిలింగం తాను చెప్పిన మాటలకే కట్టుబడి లేకపోవడం చర్చనీయాంశమైంది. 

 నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పున: ప్రారంభం

ఎపిలో ఎన్టీఆర్ వైద్య సేవలు యదాతధంగా అమలు కానున్నాయి. వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం( ఆశా)  ప్రకటించింది. ప్రభుత్వం అత్యవసర చర్చలు జరిపి వైద్య సేవలు పునరుద్దరించింది. రూ 500 కోట్ల బకాయలను చెల్లించడానికి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారి చేయడంతో ఈ ప్రతిష్టంభన ముగిసింది.  మంగళవారం  ఎన్టీఆర్ వైద్య సేవలు పున: ప్రారంభమయ్యాయి.  రూ 3, 500 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని ఆశా ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అనంతరం  ఈ ప్రతినిధులు వైధ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబుతో చర్చలు జరిపారు. మంగళవారం తక్షణ సాయం క్రింద రూ 500 కోట్లు విడుదల చేస్తున్నట్టు కృష్ణబాబు ఆశ ప్రతినిధులకు హామి ఇచ్చారు. దీంతో ఆశ సంఘం వైద్య సేవలను పున:రుద్దరించాలని నిర్ణయం తీసుకుంది. 

ట్రంప్ సుంకాల దెబ్బకు ఆంధ్ర రొయ్యల రైతులు ఫ్రై

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఏపీ ఆక్వా రైతులపై పడింది. ట్రంప్ వేసిన ట్యాక్సులు మేం కట్టలేం బాబో అని మన వ్యాపారులు చేతులెత్తేశారు. ఇప్పటికే లక్షలు, కోట్లలో నష్టపోయామని, ఇప్పట్లో రొయ్యలు కొనలేమని తెగేసి చెబుతున్నారు. మరి కొంత మంది రొయ్యల రేట్లు తగ్గించి మరీ కొంటున్నారు. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే ఆక్వా ఉత్పత్తులపై 27 శాతం ఇంపోర్ట్ టారిఫ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించారు. గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులపై ఈ నిర్ణయం ప్రభావం గట్టిగా పడింది.  ఇంపోర్ట్ టారిఫ్ భారం మన ఆక్వా రైతులపై డైరెక్ట్‌గా పడుతుండటంతో ఇప్పటికే తాము చాలా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు.  ట్రంప్ టారిఫ్ దెబ్బకు భీమవరం, పాలకొల్లు, పెద్దాపురం, కాకినాడ, తుని తదితర ప్రాంతాల్లోని ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యలను కొనుగోలు చేయడం మానేశాయి. రైతులు ప్రాధేయపడితే మార్కెట్ ధర మీద 30 రూపాయల నుంచి 90 రూపాయల వరకు తగ్గించి కొంటున్నారు. దీని వల్ల చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  మరోవైపు ఏప్రిల్‌ మొదటి వారంలో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు ఆక్వా ప్రొడక్ట్స్‌తో 2 వేల షిప్‌మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 2500 షిప్‌మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంది. వీటిలో మొత్తంగా దాదాపు 3500 షిప్‌మెంట్లు ఏపీకి చెందినవేనని ఎగుమతిదారులు చెబుతున్నారు. అమెరికా కొత్తగా విధించిన ఇంపోర్ట్ టారిఫ్ ప్రకారం లెక్కిస్తే వీటిపై నష్టభారం 600 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని నష్టపోవడమే తప్ప ఈ భారాన్ని తిరిగి కస్టమర్లపై వెయ్యలేని పరిస్థితి ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. ఓ పక్క వ్యాధులు, మరోపక్క ధరల పతనం, పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం మింగుడు పడటం లేదు. భారత్‌ నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో, గంటల వ్యవధిలోనే ఆయా కౌంట్లను బట్టి రొయ్యల ధరలు పతనమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్ఠంగా రూ.40 వరకు పడిపోయింది. భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం. ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏటా ఉత్పత్తి 4 లక్షల టన్నులు కాగా, 3.5 లక్షల టన్నుల వరకు విదేశాలకు పంపిస్తున్నారు. మొత్తంగా రూ.18 వేల కోట్ల వ్యాపారంలో విదేశీ లావాదేవీల వాటే అధికం. ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది. బుధవారం 100 కౌంట్‌ రొయ్య ధర కిలో రూ.240 ఉండగా, గురువారం రూ.200కి తగ్గిపోయింది. సాధారణంగా 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు. అయితే, ప్రతీకార సుంకాన్ని సాకుగా చూపించి అన్ని కౌంట్లపై గరిష్ఠంగా కిలోకు రూ.30-40 వరకు తగ్గించారు. కొన్నిచోట్ల కొనుగోళ్లు లేవని, ట్రేడర్లు ముందుకు రాలేదని రైతులు వాపోయారు. సాగుదారులపైనే కాదు, ఆక్వా రంగంపై ఆధారపడ్డ కూలీల ఉపాధికి కూడా ఇది దెబ్బేనని ట్రేడర్లు చెబుతున్నారు.

అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్నారు. అతడు చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. అతడి చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. అదే విధంగా అగ్నిప్రమాదం కారణంగా వచ్చిన దట్టమైన పొగ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో ఉక్కిరిబిక్కిరై ఇబ్బందులకు లోనయ్యాడు. దీంతో పాఠశాల సిబ్బంది మార్క్ శంకర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కోలుకుంటున్నారు.  అగ్నిప్రమాదంలో తన చిన్న కుమారుడు గాయపడిన సంగతి  అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్  తెలిసింది. పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లాల్సిందిగా పవన్ కు అధికారులు, పార్టీ నేతలూ సూచించారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శించి, వారి సమస్యలు తెలుసుకున్న తరువాత వెడతానని తెలిపారు. అలాగే కురిడి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉందనీ వాటిని కూడా పూర్తి చేసిన తరువాత విశాఖ చేరుకుని అక్కడ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.  

తిరుమల కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల విక్రయానికి టీటీడీ అనుమతి?

తిరుమల కొండపై ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం. ఆఖరికి ప్లాస్టిక్ బాటిళ్లకు కూడా అనుమతి లేదు. అయితే ఈ నిషేధాన్ని అడ్డుపెట్టుకుని గాజు వాటర్ బాటిళ్ల రూపంలో భక్తులను దోచుకుంటున్నారు వ్యాపారులు. గత వైసీపీ హయాంలో కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న అధికారులు ఆ నిషేధాన్ని కేవలం ప్లాస్టిక్ బాటిళ్ల విషయంలో మాత్రమే కఠినంగా అమలు చేశారు. అలా ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించి, వాటి స్థానంలో వైసీపీ నాయకులకు ప్రయోజనం చేకూరేలా గాజు వాటర్ బాటిళ్లను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.   ఈ గాజు వాటర్ బాటిల్లను తయారు చేసే అనుమతులను  అప్పట్లో వైసీపీ నేతల బినామీలకే ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. అప్పటినుండి ఇప్పటివరకు తిరుమల కొండపై గాజు వాటర్ బాటిల్ల విక్రయం పేరుతో వైసీపీ నేతలు కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. మరొకరికి అవకాశం లేకుండా వైసిపి నేతలు వాటర్ బాటిల్ల పేరుతో ఒక  పేద్దమాఫియానే నడుపుతున్నారన్న విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి కొండపై  ప్లాస్టిక్ వాడకం నిషేధం విషయంలో అప్పటి వైసీపీ సర్కార్ కు చిత్తశుద్ధి ఉండి ఉంటే.. కేవలం ప్లాస్టిక్ బాటిళ్లనే కాకుండా, ప్లాస్టిక్ కవర్లు, బొమ్మలకు వేసే ప్లాస్టిక్ కవర్లు కూడా నిషేధించాలి. కానీ అలా చేయకుండా కేవలం తమ వారికి అంటే తమ పార్టీ నేతలకు ప్రయోజనం కలిగే విధంగా కేవలం వాటర్ బాటిళ్లపైనే నిషేధం విధించి, వాటి స్థానంలో గాజు బాటిళ్లను తీసుకువచ్చింది. ఈ గాజు నీళ్ల సీసాలతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   గాజు సీసాల వినియోగం, వాటి ధరతో ఇబ్బందులు పడుతున్నారు. ఉత్సవాల సమ యంలో ఎడా పెడా ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగి స్తూనే నిబంధనల పేరుతో భక్తులపై భారం మోపడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తుల సౌలభ్యం కోసం ప్లాస్టిక్ బాటిళ్లకు అనుమతి ఇవ్వాలని టీటీడీ యోచిస్తున్నది . బిస్లరీ, కిన్లే, ఆక్వా ఫినా, టాటా ప్లస్, తదితర బ్రాండెడ్ సంస్థలకు వారు విక్రయించే మినరల్ వాటర్ బాటిళ్లకు అనుమతినిస్తూ, దాంతో పాటుగా కొండపై పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఏ సంస్థలైతే తాగి వాడి పడేసే వాటర్ ప్లాస్టిక్ బాటిల్లను అక్కడికక్కడే నాశనం చేసేలా క్రషింగ్ యంత్రాలను కూడా ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారికే బాటిల్స్ విక్రయ అనుమతులను కూడా మంజూరు చేయాలని షరతును విధించాలని భావిస్తున్నారు. ఈ క్రషింగ్ యంత్రాలను మెయింటెనెన్స్ కూడా సంబంధిత సంస్థలే చేపట్టేలా నిబంధనలు విధించాలని టీటీడీ భావిస్తోంది.  

ఉరి శిక్ష.. దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు

హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్షే సరైందని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 8) తుది తీర్పు వెలువరించింది. గతంలో ఇదే కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అక్తర్, జియా ఉర్ రహమాన్, యాసిన్ భత్కల్, తహసీన్ అక్తర్, అజాజ్ షేక్ లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.   2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో  స్వల్ప వ్యవథిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో మొత్తం 18 మంది మరణించగా, మరో 130 మంది గాయపడ్డారు.  ఈ జంటపేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన రియాజ్ భత్కల్ ను ప్రధాన నిందితుడిగా అలాగే  యాసిన్ భత్కల్, అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, అజాజ్ షేక్ లకు కూడా ఈ పేలుళ్లతో సంబంధం ఉందని నిర్ధారించింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించినఎన్ఐఏ కోర్టు వీరికి ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్ధిస్తూ మంగళవారం (ఏప్రిల్ 8) తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.

సీపీఎం కమిటీల్లో కొత్త రక్తం

తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం  పోలిట్ బ్యూరోలోయువకుడు అరుణ్ కుమార్ కు స్థానం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 24 వ  జాతీయ మహాసభ లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. కొత్తగా పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ లో తెలుగు రాష్ట్రాలకు సముచిత స్థానం దక్కింది.  పార్టీ ఆవిర్భావ సమయంలో అత్యున్నత కమిటీ పోలిట్ బ్యూరోలో పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్యలు సభ్యులుగా కొనసాగారు.. ఆ తరువాత బీవీ రాఘవులు ఎంపికయ్యారు.. తాజాగా మధురై మహాసభలో యువకుడు అరుణ్ కుమార్ కు స్థానం కల్పించారు. దీంతో సుందరయ్య, బసపున్నయ్యల తర్వాత ఇద్దరు తెలుగు వాళ్లు పోలిట్ బ్యూరో కు ఎంపికయ్యారు. కేంద్ర కమిటీ లో కూడా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తవారికి స్థానం కల్పించారు. సహజంగా ఆ పార్టీ కేంద్ర కమిటీలో చోటు దక్కాలంటే ఐదు పదులు దాటాల్సిందే. గత కొంత కాలంగా యువకులకు ఉన్నత కమిటీల్లో చోటు కలిపిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే మధురైలో జరిగిన మహాసభలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తవారికి అవకాశం ఇచ్చారు.  తెలంగాణ నుంచి కొత్తగా రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఎం. సాయిబాబా, టి.జ్యోతి, ఆంధ్రప్రదేశ్ నుంచి డి.రమాదేవి కి చోటు కల్పించారు. తమ్మినేని వీరభద్రం, బీవీ రాఘవులు, పుణ్యవతి, అరుణ్ కుమార్, ఎస్.  వీరయ్య, వి. శ్రీనివాస్ రావులు ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు.   ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా ఆ తరువాత జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అరుణ్ కుమార్ విశాఖపట్టణంలో జరిగిన జాతీయ మహాసభల్లో తొలుత కేంద్రకమిటీకి ఆహ్వానితుడిగా ఎంపికయ్యారు. ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన మహాసభలో పూర్తి స్థాయిలో కేంద్ర కమిటీ సభ్యునిగా తీసుకున్నారు.  ప్రస్తుతం మధురై లో జరిగిన మహాసభలో అరుణ్ కుమార్ ను అత్యున్నత కమిటీ పోలిట్ బ్యూరో లోకి తీసుకోవడం గమనార్హం. అరుణ్ కుమార్ తల్లి హేమలత కూడా కేంద్ర కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు..

తమ్ముడి పెత్తనం- అన్న అలక!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి కొండ్రు మురళీ మెహన్ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దళిత నాయకుడు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న రాజంతో పాటు, గతంలో పోటీ చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిరంతరం యాక్టివ్ పాలిటిక్స్ నడిపించే ఆ లీడర్ ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుందని కొండ్రు గంపెడు ఆశపెట్టుకున్నారు. కానీ అయన ఆశలు అడియాశలైయ్యాయి. మంత్రి వర్గంలో చోటు దక్కక పోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురవుతున్నారంట.  కొండ్రు మురళి మంత్రి వర్గం ఏర్పాటు తరువాత రాజాం నియోజకవర్గానికి రాకపోకలు తగ్గించేశారంట.  ఎక్కువగా విశాఖపట్నానికే పరిమితమవుతున్నారంట. మంత్రి పదవి రాకపోవడంతో సొంత వ్యాపారాలు చూసుకోవడంలో కొండ్రు బిజీ అయ్యారట. దాంతో  ఎమ్మెల్యే కొండ్రు మురళి మెహన్  తమ్ముడు కొండ్రు జగదీష్ రాజాంలో అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారంట. రాజాం నియోజకవర్గంలో ట్రాన్స్‌ఫర్స్ మెదలు, వర్క్స్‌ కేటాయింపు వరకూ  అన్నీ కొండ్రు జగదీష్ చేతుల మీదుగా నడుస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అధికారులు సైతం అతనికే వంత పాడుతున్నారట.  ఆ క్రమంలో కొండ్రు జగదీష్‌కు షాడో ఎమ్మెల్యే అన్న ట్యాగ్ తగిలించేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం  షాడో  ఎమ్మెల్యే పెత్తనమే నడుస్తోందంట. ఆయనే అధికారులతో ఫోన్ మాట్లాడటం, క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించుకుని అవసరమై ఆదేశాలు జారీ చేస్తుండటం స్థానికులను విస్తుపోయేలా చేస్తోంది. రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహించడం, అధికారుల సీట్లో కూర్చుంటూ ఆదేశాలు జారీ చేస్తుండటంతో కొండ్రు జగదీష్‌పై అధికారులు అసహనంతో కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అన్న అందుబాటులో లేకుండా పోవడం, తమ్ముడి పెత్తనంతో అధికార యంత్రాంగం తలలు పట్టుకోవాల్సి వస్తోందంట.

అడవి తల్లి బాటలో గిరిజనులతో మమేకం!

గిరిజన గ్రామాల అభివృద్ధికి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్   అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం(ఏప్రిల్ 7) అల్లూరి సీతారామరాజు జిల్లా  డుంబ్రిగూడ మండల పరిధిలోని పెదపాడు గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి జన్ మన్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీవీటీజీ గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్లతో పాటు పాఠశాలలు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంతో గిరిజన గ్రామాలకు మహర్ధశ పట్టనుంది. అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా చాపరాయి నుంచి పెదపాడు వరకు 2.2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును రూ. 2.12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.  అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం పెదపాడు గ్రామస్తులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా  సౌకర్యాలు లేక తాము పడుతున్న ఇబ్బందులపై గ్రామస్తులు  పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ మేరకు వినతి పత్రం కూడా సమర్పించారు. గ్రామానికి ప్రధాన సమస్య అయిన రహదారి నిర్మాణంతో పాటు చాపరాయి గడ్డ వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వర్షాకాలంలో గడ్డ పొంగితే రెండు, మూడు వారాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాగు నీరు, పాఠశాల భవన నిర్మాణం, గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, రచ్చబండ నిర్మాణంతో పాటు లైబ్రరీ, విలేజ్ హెల్త్ క్లినిక్, సెల్ టవర్ నిర్మించాలంటూ వినతిపత్రం సమర్పించారు.  పెదపాడు గ్రామస్తులు కోరిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారు.  గ్రామస్తులు కోరిన 12 అభివృద్ధి కార్యక్రమాలను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.   ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  సహకారంతో, ముఖ్యమంత్రి   చంద్రబాబు  గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు స్పష్టం చేశారు. ఓట్లు వేసినా వేయకపోయినా గిరిజనులకు అండగా నిలబడడం మన బాధ్యత అంటూ అడగగానే నిధులు విడుదల చేశారని చెప్పారు. అంతకు ముందు అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు పెదపాడుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి   గిరిజనులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. గ్రామ శివారు నుంచి పెదపాడు మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో గ్రామంలోకి ఆహ్వానించారు.  గ్రామ పర్యటనలో భాగంగా గిరిపుత్రులు తమ ప్రాంతంలో సేంద్రీయ పద్దతిలో పండించే గిరిజన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న చిన్నారులతో ముచ్చటించి వారికి పుస్తకాలు, స్వీట్లు పంచారు.  అనంతరం గ్రామంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో కలసి మొక్కలు నాటారు.  చాపరాయి గెడ్డలో నడుస్తూ.. సమస్యలు వింటూ.. పెదపాడు నుంచి తిరుగు ప్రయాణంలో పోతంగి గ్రామ పంచాయతీ పరిధిలోని 8 గ్రామాల ప్రజలు  కళ్యాణ్ గారిని కలిసి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఇచ్చారు. చంపపట్టి గెడ్డ మీద ఉన్న బ్రిడ్జి హుదూద్ తుపాన్ సమయంలో ధ్వంసం అయ్యిందని, ఇప్పటి వరకు పునర్నిర్మాణం చేపట్టలేదని చెప్పారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం  తక్షణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

కొరివితో తలగోక్కుంటున్న ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోరి కొరివితో తలగోక్కుంటున్నట్లుంది. ఆయన ప్రారంభించిన వాణిజ్య యుద్ధం దెబ్బకు సోమవారం ప్రపంచంలోని ప్రధాన సూచీల్లో ఒక్కటీ లాభాల్లో లేకుండా పోయాయి. దాదాపు 90 దేశాలపై ట్రంప్‌ భారీగా ప్రతీకార పన్నులు విధించడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఆసియాలోని జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, భారత్‌ ప్రధాన సూచీలు మొత్తం కనీసం 3 నుంచి 10 శాతం  నష్టాలను నమోదు చేశాయి.  అమెరికా మార్కెట్‌ వ్యాఖ్యాత, హార్వర్డ్‌ లా గ్రాడ్యుయేట్‌ అయిన జిమ్‌ క్రెమెర్‌ ఓ అడుగు ముందుకేసి 1987 బ్లాక్‌ మండే మళ్లీ పునరావృతం అవుతుందని వ్యాఖ్యానించడంతో  ఇన్వెస్టర్లు ఉలిక్కిపడ్డారు.  ట్రంప్‌ తక్షణమే చర్చలకు సిద్ధంగా ఉన్న దేశాలతో చర్చలు జరిపి ప్రతీకార పన్నులను తొలగించాలని జిమ్‌ క్రెమెర్‌ కోరాడు. నిబంధనలు పాటించే కంపెనీలకు ఉపశమనం కల్పించకపోతే, ఇప్పటికే మూడు రోజులు నష్టాల్లో ఉన్నాం.. సోమవారం బ్లాక్‌ మండే పునరావృతం కావచ్చని ఆయన హెచ్చరించారు.  ప్రపంచవ్యాప్తంగా 1987 అక్టోబర్‌ 19ని బ్లాక్‌ మండేగా అభివర్ణిస్తారు. ఆ ఒక్క రోజే అమెరికాలోని డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ సూచీ ఏకంగా 22.6 శాతం పతనమైంది. మరో వైపు ఎస్‌అండ్‌పీ 500 సూచీ 30 శాతం విలువ కోల్పోయింది. ఇది అక్కడితో ఆగలేదు. ప్రపంచంలోని ఇతర మార్కెట్లపైనా దీని ప్రతికూల ప్రభావం పడింది. ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపా మార్కెట్లు విలవిల్లాడిపోయాయి. ఈ మార్కెట్ల పతనం దాదాపు నెల రోజులు కొనసాగింది. ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లు ఈ సమయంలో 20శాతం విలువ కోల్పోయాయి.  1987 స్టాక్‌ మార్కెట్‌ పతనం ఏదోఒక కారణంతో జరిగింది కాదు. చాలా అంశాలు దీనికి తోడయ్యాయి. బ్లాక్‌ మండేకు ముందు వరకు బుల్‌ మార్కెట్‌ జోరు కనిపించింది. దీంతో 1982 నుంచి చూస్తే చాలా స్టాక్స్‌ విలువ మూడు రెట్లయ్యాయి. దీంతో అవి కరెక్షన్‌కు గురయ్యాయి.  కంప్యూటరైజేషన్‌ కూడా ఆ పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. అప్పట్లో ఇది ప్రాథమిక దశలోనే ఉంది. నాడు వాడిన ‘సి’ ప్రోగ్రామ్‌ మానవ జోక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆటోమేటిక్‌ కొనుగోలు, విక్రయాలు చేపట్టింది. ధరలు పెరుగుతున్నప్పుడు ఎక్కువ కొనుగోలు   చేయడం, తగ్గుతున్నప్పుడు ఎక్కువ అమ్మకాలు చేపట్టడం వంటివి ఆటోమేటిక్‌గా జరిగాయి. దీంతో అక్టోబర్‌ 19న విక్రయ ఆర్డర్లు పెరగడంతో మార్కెట్‌ కుప్పకూలింది.  మళ్లీ ఏప్రిల్‌ 4న శుక్రవారం నాడు అతిపెద్ద పతనాన్ని అమెరికా మార్కెట్లు చవిచూశాయి. దాదాపు 5 ట్రిలియన్‌ డాలర్ల సొమ్ము ఆవిరైపోయింది.

ట్రంప్ షాక్‌తో యాపిల్ అలెర్ట్

భారత్‌పై అమెరికా టారిఫ్‌లు విధించకముందే, దిగ్గజ సంస్థ యాపిల్‌ ముందు జాగ్రత్త పడింది. భారత్‌ నుంచి 3 రోజుల్లోనే, 5 సరకు రవాణా విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను తరలించినట్లు సమాచారం. తమ ఉత్పత్తులపై భారత్‌ అధిక సుంకాలు విధిస్తున్నందున, ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందు నుంచీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. భారత్‌లో తయారు చేయిస్తున్న ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను అమెరికాకు తీసుకెళ్లినప్పుడు, అదనపు సుంకాలు పడితే, ఆ మేర ధర పెంచాల్సి వస్తుంది. సుంకాలు అమల్లోకి రాకముందే, వీటిని పట్టుకెళ్తే,  కొంతకాలం అయినా ధరలు పెంచకుండా, ప్రస్తుత ధరలకే విక్రయించొచ్చనేది యాపిల్‌ ప్రణాళిక. ఇదే విధంగా రత్నాభరణాల రంగం కూడా ముందస్తుగా ఎగుమతులు భారీగా పెంచింది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో మన దేశ సేవలు-వస్తువుల ఎగుమతుల బిల్లు సుమారు రూ.6.84 లక్షల కోట్లను మించొచ్చని అంచనా వేస్తున్నారు.  అమెరికా, చైనాల మధ్య వివాదం నేపథ్యంలో.. అమెరికా సంస్థ అయిన యాపిల్, మన దేశంలో ఐఫోన్లు, ఇతర పరికరాల తయారీ,అసెంబ్లింగ్‌ చేయిస్తోంది. ఇంతకు ముందు మన దేశం నుంచి అమెరికాకు చేసే ఫోన్ల ఎగుమతులపై సుంకాలు ఏమీ లేవు. ఈనెల 5 నుంచి 10% సుంకం అమల్లోకి వచ్చింది. ఈనెల 9 నుంచి ఇది 26% కానుంది. ఆ మేరకు ధర పెంచి, విక్రయించాల్సి వస్తుంది. చైనా నుంచి ఎగుమతి అయితే పన్ను మరింత ఎక్కువ. ఈ నేపథ్యంలోనే మార్చి చివరిలోనే భారత్‌ నుంచి యాపిల్‌ సంస్థ, మూడు రోజుల్లో 5 విమానాల్లో ఐఫోన్లు, ఇతర పరికరాలను ఎగుమతి చేసినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపినట్లు టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. అమెరికాకు ఎగుమతి అవుతున్న 9 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లలో, అధిక వాటా యాపిల్‌దే కావడం గమనార్హం. చైనా నుంచి కూడా ఐ ఫోన్లను భారీగా ఎగుమతి చేసినట్లు సమాచారం.  ముంబయి నుంచి ఈనెల 1-4 తేదీల్లో అమెరికాకు రత్నాభరణాల ఎగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో 61 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరగ్గా, ఈ ఏడాది ఇవి ఆరింతలు అధికంగా 344 మిలియన్‌ డాలర్ల మేర తరలి వెళ్లాయి.

డీజిల్, పెట్రోల్ పై పెరిగిన ఎక్సైజ్ సుంకం.. వినియోగదారులపై పడని భారం

 భారత ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచింది.  ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం సోమవారం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  2017 నుంచి భారత్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలవుతుంది. అంటే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ పెద్దగా తేడా ఉండదు. పైసల్లోనే హెచ్చు, తగ్గులుండేవి.  2017 సెప్టెంబర్‌లో కేంద్రప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2.16, డీజిల్‌పై రూ.2.02 పెంచింది. ఆ తర్వాత నుంచి డైనమిక్ ప్రైసింగ్ అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109 నుంచి రూ.110 మధ్య ఉండగా జిల్లాను బట్టి పైసల్లో తేడా ఉంటుంది. మంగళవారం (ఏప్రిల్ 8) తెల్లవారుజాము నుంచి ఈ ధరలపై రూ.2 ఎక్సైజ్ సుంకం పెరగనుంది.  అంటే పెట్రోల్ ధర రూ.111 నుంచి రూ.112 కానుంది.  డీజిల్ ధర రూ.97.44 ఉండగా 99.44కు పెరగనుంది. రాష్ట్రాలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చెరిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రూ.1 నుంచి రూ.2 వరకు తక్కువ ఉండే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయని ప్రజల నుంచి విమర్శలు రావడంతో కేంద్రప్రభుత్వం 2021 నవంబర్ 4వ తేదీన కేంద్రప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అలాగే రాష్ట్రప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను తగ్గించాలని పిలుపునిచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు తమ ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంతో వ్యాట్‌ను తగ్గించలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం ఇంధన ధరలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు పెట్రోల్‌పై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం రూ.11 కాగా, పెంచిన రూ.2తో ఎక్సైజ్ సుంకం రూ.13కు పెరగనుంది. డీజిల్‌పై రూ.8 ఉండగా తాజా పెంపుతో రూ.10కు చేరనుంది. మరోవైపు కేంద్రం పెట్రో, డీజిల్ ధరలు పెంచిందనే ప్రచారం జరిగిన కొద్దిసేపటికే కేంద్రం స్పందించింది. ఈ పెంపును ఆయిల్ కంపెనీలు భరిస్తాయని తెలిపింది. ప్రత్యక్షంగా వాహనదారుడిపై ఎలాంటి ప్రభావం చూపించదని స్పష్టంచేసింది. వాహనాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత ధరలకే వాహనదారులకు పెట్రోల్, డీజిల్ లభిస్తుందని తెలిపింది.

రేవంత్ స్కోర్ బోర్డులో మరో మైనస్ మార్క్?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, పట్టు మని పదిహేను నెలలు  కూడా కాలేదు.   ఇంతలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో కొంచెం చాలా ఎక్కువగానే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో అసమ్మతి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. విపక్షాలు సరే సరి  ఆశించిన దాని కంటే ముందే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతోందని  సంబర పడుతున్నాయి.  మరో వంక కాంగ్రెస్ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు  ముందిచ్చిన విలువ ఇవ్వడం లేదు. అందుకు మంత్రివర్గ విస్తరణ అంశాన్ని ఒక ప్రహసనంగా మార్చడమే  నిదర్శనంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే  ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తోందని అంటున్నారు.   నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఫిర్యాదుల సంస్కృతి  కొత్తేమీ కాదు. ముఖ్యమంత్రులపై ఫిర్యాదులు, ముఖ్యనాయకుల మధ్య వివాదాలు  కాంగ్రెస్ కల్చర్ లో ఎప్పటినుంచో ఉన్నదే అంటున్నారు.  ఒక విధంగా ముఖ్యమంత్రులు  తోక జాడించకుండా ఉండేందుకు  పక్కలో బల్లెంలా  అసమ్మతిని అధిష్టానమే ప్రోత్సహించే కల్చర్  ఇందిరమ్మ రోజుల నుంచీ ఉందని అంటారు.  నిజమే  కాంగ్రెస్ లో ఈ కల్చర్ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే ఇంతవరకు ముఖ్యమంత్రి వ్యతిరేకుల నుంచి వచ్చిన ఫిర్యాదులను అంతగా పట్టించుకోని అధిష్టానం,ఇప్పడు కొంచెం సీరియస్ గానే ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకే’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా  అధిష్టానం అగ్ర నేతల దర్శనం లభించడం లేదని అంటున్నారు. మరోవంక అధిష్టానం నేతలు, అసమ్మతి నేతలకు పిలిచి మరీ అప్పాయింట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ అన్నిటినీ మించి  కంచ గచ్చిబౌలి (హెచ్‌సీయూ) భూముల వివాదం, జాతీయ స్థాయిలో పార్టీ ఇమేజ్ ని గట్టిగా దెబ్బ తీసిందని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా  ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు  ప్రభుత్వ వాదనలను పూర్తిగా పూర్వ పక్షం చేస్తూ చేసిన వ్యాఖ్యలు,  ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారం కాంగ్రెస్ అధిష్టానాన్ని మరింత అలర్ట్ చేసిందని అంటున్నారు. కంచ గచ్చిబౌలి (హెచ్‌సీయూ) భూముల వివాదం రాజకీయమ రంగు పులుముకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం సమస్యను సీరియస్ గా  తీసుకోవడమే కాకుండా, పరిష్కా రాన్నితన చేతుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోందని అంటున్నారు.   అయితే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికీ,మీడియాలో జరుతున్న ప్రచారం మొత్తం ఫేక్ అనే భావనలోనే ఉన్నారు. ఏఐ ద్వారా కొందరు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలను సృష్టించి సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని  ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఇస్తున్న వివరణ ఆధారంగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మీడియా మీద కత్తులు దూస్తున్నారు. శనివారం (ఏప్రిల్ 5)  కంచ గచ్చిబౌలి వివాదంపై అధికారులతో నిర్వహించిన  సమీక్ష లోనూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్‌ కంటెంట్‌ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  మరో వంక  నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ కంచ గచ్చిబౌలి భూముల వివాదం  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇమేజ్ ని దెబ్బ తీసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన టీపీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సచివాలయంలో శనివారం (ఏప్రిల్ 5) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా  అటవీ భూమి అవునా కాదా, గతంలో ఎమి జరిగింది వంటి సాంకేతిక అంశాల జోలికి వెళ్ళకుండా విద్యార్థుల ఆందోళనలు, భూములు చదును చేసే క్రమంలో నెమళ్లు. జింకలు ఇబ్బందికి గురైనట్టు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి మంత్రుల కమిటీని మీనాక్షి నటరాజన్‌  ప్రశ్నించినట్లు తెలుస్తోంది.   అలాగే  మంత్రులతో భేటీ అనంతరం ఎన్‌ఎఎస్ యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ నేతలతో గాంధీభవన్‌లో ఆమె వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె  కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని ఎవరికీ నష్టం కలగకుండా పరిష్కరించాలని కాంగ్రెస్‌ అధిష్టానం  ఆలోచనని స్పష్టం చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ అధిష్టానం రాజకీయ కోణంలో చూస్తుంటే, ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి ధోరణి అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. మీనాక్షి నటరాజన్  మరి కొందరు నాయకులూ, సంస్థలతోనూ చర్చలు జరిపిన తర్వాత  అధిష్టానానికి నివేదిక ఇస్తారని  ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటయని అంటున్నారు. ఈ నేపధ్యంలో  కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఎక్కడి వరకు వెళుతుంది? చివరకు ఏమి జరుగుతుంది? అధిష్టానం తీసుకునే నిర్ణయం  రాజకీయంగా ఎలాంటి విపరిణామాలకు దారి   చూపుతుంది?  ఎలాంటి ‘మార్పు’ తెస్తుంది? అన్నవన్నీ శేష ప్రశ్నలు. అయితే చివరకు ఏమి జరిగినా, ఏమీ జరగక పోయినా  అధిష్టానం దృష్టిలో  ముఖ్యమంత్రి స్కోర్ బోర్డులో ఇది మరో మైనస్ మార్క్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భాస్తున్నాయి. 

బియ్యం ఎవరివి? పేరు ఎవరిది ?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదివారం (ఏప్రిల్ 6) ఓ పేదోడి ఇట్లో నేలపై కుర్చుని సహపంక్తి భోజనం చేశారు.ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మరి కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఇంచక్కా కాళ్ళు మడిచి నేలపై కూర్చునే, భోజనం చేశారు. నిజానికి, ముఖ్యమంత్రి ఒక్కరే కాదు,మంత్రులు,అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, గత వారం  పది రోజులుగా, ఇలా పేదల ఇళ్లలోనే చేతులు కడుగుతున్నారు. అంటే, పేదల ఇళ్ళలో,  నేల భోజనమే చేస్తున్నారు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డున్న కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పేదలతో కలిసి, సన్న బియ్యం విందుల్లో పాల్గొంటున్నారు. అవును, వారం పదిరోజుల క్రితం  ఉగాది పండగను పురస్కరించుకుని  కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గం హుజూర్‌నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని  స్పష్టం చేశారు. ఇక అక్కడి నుంచి, మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యం  అన్నం  వండించుకు తింటున్నారు. ఫోటోలు  దిగుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తున్నారు.  ప్రకటనల సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. అయితే సన్న బియ్యం పంపిణీకి ఇంత ప్రచారం  అవసరమా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చారణా కోడికి బారణా మసాలా  అన్నట్లు కూసింత చేసి కొండంత ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నాయి. నిజమే విపక్షాల ఆరోపణను పూర్తిగా కొట్టివేయడం కుదరదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తూ  రాజకీయ ప్రచారం చేసుకోవడం అన్నది  అది ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, గత కేసీఆర్ సర‘కార్’ అయినా సరి కాదు. అలా చేయడం ఆత్మ వంచన, కాదంటే ప్రజలను మోసం చేయడమే అవుతుంది.   అవును దానే దానే పే లిఖా హై ఖానేవాలే కా నామ్  అనేది లోకోక్తి. అంటే, భగవంతుని సృష్టిలోని ప్రతి గింజ పైనా  తినే వాడి పేరు రాసే ఉంటుందని  అర్ధం.  కానీ  ఇప్పడు రాజకీయ పార్టీలు ప్రతి గింజ పైనా తమ పేరు రాసుకునే వికారాలకు పోతున్నాయి.  అందుకే ఇప్పడు రాష్ట్రంలో సన్న బియ్యం వివాదంగా మారింది. పేదల కడుపులు ప్రచార వేదికలు అవుతున్నాయి. ఓ వంక రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దానే దానే పే లిఖా హై రేవంత్  కా నామ్  అంటూ సన్న బియ్యం క్రెడిట్  మొత్తం తమ ఖాతాలో వేసుకుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు, దానే దానే పే లిఖా హై మోదీ కా నామ్ అంటూ క్రెడిట్ మొత్తం కేంద్రం ఖాతాలో అంటే కమలం ఖాతాలో వేసుకుంటున్నారు. నిజానికి  ఇప్పడు కొత్తగా ఉగాది నుంచి పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకంలో కానీ, ఇంతవరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యం పథకంలో కానీ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ వాటా వుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ  ఒక పైసా అటు ఒక పైసా ఇటుగా  ఖర్చును భరిస్తున్నాయి. ఆ వివరాలలోకి వెళ్ళవలసిన అవసం లేదు.  అయితే  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వాలు ఖర్చు చేసేది చేస్తున్నది ప్రజల సొమ్మే కానీ, పార్టీల సొమ్ము కాదు. పజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తాయి.  నిజానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే  సంక్షేమ పథకాల అమలుకు  తను తన జేబులోంచి రూపాయి కూడా తీయనని కుండ బద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పే సందర్భంలో  రేవంత్ రెడ్డి ప్రజలు మోస పోవాలని కోరుకుంటున్నారు. మేము (రాజకీయ పార్టీలు) మోసం చేస్తున్నాం  అంటూ ఎలాంటి దాపరికం లేకుండా కెమెరా సాక్షిగా  తమ అమూల్య అభిప్రాయాన్ని  స్పష్టంగా చెప్పారు. ముందు ముందు అవసరం అయితే చూసుకోవడానికి వీలుగా రికార్డు చేసి మరీ వినిపించారు. సో ..సన్న బియ్యం, దొడ్డుబియ్యం..  బియ్యం ఏదైనా, ఏ గింజ పైన అయినా, ప్రజల పేరే గానీ, పార్టీల పేరు ఉండదు. సో.. బియ్యం ఎవరివి ? పేరు ఎవరిదీ ? అనే చర్చ.. ఎవరు చేసినా  అది ఆత్మ వంచనే అవుతుంది. మోసమే అవుతుంది.

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి

 అన్నమయ్య జిల్లాలో  సోమవారం (ఏప్రిల్ 7) జరనిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డెప్యుటీ కలెక్టర్ మరణించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్‌-2 స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ర‌మాదేవి సంఘటనా స్థలంలోనే మరణించారు. మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  రాయ‌చోటి క‌లెక్ట‌రేట్‌లో గ్రీవెన్స్‌కు వెళ్లి వ‌స్తుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.  క్ష‌తగాత్రుల‌ను క‌లెక్ట‌ర్ శ్రీధ‌ర్ ప‌రామ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికైన ఎణిమిది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు సోమవారం (ఏప్రిల్ 7) ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికైన ఎనిమిది మందిలో ఏడుగురి చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం (ఏప్రిల్ 7) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.  బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు.  ఇక ఎమ్మెల్యే   కోటాలో కాంగ్రెస్‌ ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు ప్రమాణ స్వీకారం చేశారు.  కరీంనగర్‌ పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలు, అలాగే ఖమ్మం టీచర్‌ ఎమ్మెల్సీ స్థానంగెలిచిన పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.  దాసోజు శ్రవణ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నతి తెలియరాలేదు.