ఏపీలో కరోనా.. విశాఖలో తొలి కేసు నమోదు

నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. 2019లో మొదలై 2021 వరకూ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మూడు దశలుగా విస్తరించి, వ్యాపించి లక్షల మంది ఉసురు తీసింది. ఇప్పుడు మరోసారి తన పంజా విసరడానికి రెడీ అయిపోయింది. గత వారం పది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో అయితే కేరళలో ఈ మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఏపీలో   క‌రోనా పాజిటివ్‌ కేసు న‌మోదైంది. విశాఖ జిల్లా మద్దెలపాలెంలో ఒక వివాహితకు కరోనా పాజిటివ్ వచ్చిందనీ,  రాష్ట్రంలో ఇదే తొలి కేసు అని ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఆ తరువాత ఆమె భర్త, ఇద్దరు పిల్లలకూ కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. వారికి చికిత్స అందించి కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉంచనున్నారు.  కరోనా వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా పాజిటివ్ వచ్చిన కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలో  ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.   అంతే కాకుండా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుంపులుగుంపులుగా కూడవద్దనీ,   రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్ పోర్టులు, కోవిడ్  నియమావళి  పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండాల‌ని ప్రభుత్వం పేర్కొంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గ దర్శకాలను తు.చ. తప్ప కుండా పాటించాలని ఆదేశించారు.  

మారని పాక్ తీరు.. ఘోర పరాభవం తరువాత కూడా ప్రగల్భాలు

పాకిస్ధాన్ తీరు మారలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ఆ దేశం ఉగ్రవాదానికి దన్ను గా ఉన్నదన్న సంగతిని ప్రపంచానికి చాటిన భారత్.. ఆ తరువాత తన సైనిక సత్తాను చాటి పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టింది. దాంతో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్థాన్ కాల్పుల విరమణకు వేడుకుంది. మానవతా దృక్పథంతో అందుకు అంగీకరించింది. ఇంత జరిగినా పాకిస్థాన్ తీరు మారలేదు. తాజాగా పాకిస్ధాన్ ప్రధాని తన నోటికి పని చెప్పి వాచాలతను చాటుకున్నారు.  1971 యుద్ధం నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నామని ప్రగల్భాలు పలికారు. అంతే కాదు ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాలుస్తాయని చెప్పడం ద్వారా మరోసారి కయ్యానికి కాలుదువ్వారు.  పాక్ ప్రధాని మాటలకు వంత పాడుతున్నట్లుగా ఆ దేశ సైనిక ప్రతినిథి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఉగ్రభావజాలాన్ని వ్యక్తం చేస్తూ అదుపు తప్పి మాట్లాడారు.  ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై నిప్పులు కక్కారు. పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. "మీరు మా నీటిని అడ్డుకుంటే..  మేం మీ ఊపిరిని అడ్డుకుంటామన్నారు. దీనికి భారత్ కూడా దీటుగా స్పిందించింది.   ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాగవని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలను ఖాళీ చేయడంపై మాత్రమే భవిష్యత్తులో చర్చలు ఉంటాయని  తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం విశ్వసనీయంగా, శాశ్వతంగా ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్ లోనే ఉంటుందని పునరుద్గాటించారు. అలాగే నీరు, రక్తం కలిసి ప్రవహించవని గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.   

కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు.. ఇక అరెస్టేనా?

మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన  అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారు. అసభ్య పదజాలంతో.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించే వారు. ఒక దశలో కొడాలి నాని అంటే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అలా బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని  వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు. అయినా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా తాను మారలేదనీ, తనలో ఫైర్ అలాగే ఉందనీ బిల్డప్పులు ఇచ్చేందుకు శతధా ప్రయత్నించడం మాత్రం మానలేదు. అయితే ఎప్పుడైతే ఆయన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారో.. అప్పటి నుంచీ కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెన్నాడుతోంది. ఆ నేపథ్యంలోనే  దాదాపుగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు.   కొంత కాలం కిందట ఛాతి నొప్పితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అయితే కొడాలి నాని హెల్త్ బులిటిన్ను ఆ ముంబై ఆస్పత్రి విడుదల చేయలేదు కానీ, ఆపరేషన్ విజయ వంతమైందనీ, కొడాలి నాని కొలుకుంటున్నారనీ  గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడొకరు మీడియాకు  తెలిపారు. అంతే ఆ తరువాత నుంచి కొడాలి నానికి సంబంధించి ఏ వార్తా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. నాలుగైదు రోజుల కిందట మాత్రం కొడాలి నాని ముంబై నుంచి తిరిగి వచ్చారనీ, హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారనీ వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిర్దారణ కాలేదు. అయితే కేసుల భయంతో వణికిపోతున్న కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన పట్ల ఎక్కడా సానుభూతి వ్యక్తం అవుతున్నదాఖలాలు లేవు. చివరికి పార్టీ అధినేత జగన్ కూడా కొడాలి నానిని పరామర్శించలేదు. అనారోగ్యం అన్నంత మాత్రాన కేసులు వదిలిపెట్టవన్న సంగతి అర్ధమైన కొడాలి నాని తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్నా అరెస్టు తప్పదన్న భయంతో నాని విశ్రాంతి పేరుతో విదేశాలకు చెక్కేయాలని భావిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు జారీ అయ్యింది.  అయితే ఇప్పుడు కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసిన తరువాత ఆయన ఎక్కడున్నారు? ఇప్పటికే విదేశాలకు చెక్కేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఏది ఏమైనా కొడాలి నాని కేసుల విషయంలో దర్యాప్తు వేగం పుంజుకుందనీ, ఆయన అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారనీ తాజాగా జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల ద్వారా తెలుస్తోంది. 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు కలిసి రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (మే 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లననీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (మే 22) శ్రీవారిని 72 వేల 679 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 67 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చింది. అదలా ఉంచితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెలకు సంబంధించి దర్శన టికెట్లను శుక్రవారం (మే 23) విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు  ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు,  11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేస్తుంది. ఇక శనివారం (మే 24) ఉదయం పది గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. 

జగన్ ఒకటన్నారు.. మరి విజయసాయి ఎన్నంటారో?

రాజ్యసభ మాజీ  సభ్యుడు విజయసాయి రెడ్డిపై    వైసీపీ అధినేత, మాజీ  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ విజయసాయిని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, ఏపీలో కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకే విజయసాయి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆరోపించారు. తన రాజ్యసభ సభ్యత్వం గడువు మరో మూడున్నర సంవత్సరాలు  మిగిలి ఉండగానే విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికేనన్న జగన్.. జయఃసాయి తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూటమికి అమ్మేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   వైసీపీ ఆవిర్భావం నుంచే కాకుండా అంతకు ముందు నుంచీ కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిపై జగన్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి విజయసాయి రెడ్డికి జగన్‌తో మూడు దశాబ్దాలకు పైగా  సన్నిహిత అనుబంధం ఉంది.   జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నారు.  అది పక్కన పెడితే.. ఒక దశలో వైసీపీలో జగన్ తరువాత నంబర్ 2గా ఉన్నవిజయసాయి ఆ పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే రెండో టర్మ్ ఇంకా మిగిలి ఉండగానే ఈ ఏడాది జనవరిలో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికీ, పార్టీకీ రాజీనామా చేశారు. అప్పట్లో విజయసాయి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాననీ, రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు. రాజకీయకు దూరంగా సాగు చేసుకుంటానని చెప్పారు.   అయితే.. ఇప్పుడు జగన్ విజయసాయి రెడ్డి చంద్రబాబు ప్రలోభాలకు లొంగి రాజీనామా చేశారని  అలాంటి వ్యక్తి మాటలకు, స్టేట్‌మెంట్లకు ఏ విలువ ఉంటుంది ప్రశ్నించారు. గతంలో కూడా జగన్ విజయసాయిరెడ్డి విశ్వసనీయత కోల్పోయారని పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లోనే జగన్ వ్యాఖ్యలకు విజయసాయి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు  లిక్కర్ స్కాం  కేసులో విచారణకు హాజరైన విజయసాయి ఇచ్చిన సమాచారం అధారంగానే  నిందితుల అరెస్టులు జరుగుతున్నాయని అంటున్నారు.  మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యం అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోన జగన్ గురువారం (మే 22) మీడియా సమావేశంలో విజయసాయిపై విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణం కేసు తన వరకూరావడానికి విజయసాయే కారణమన్న ఆగ్రహంతోనే జగన్ ఈ స్థాయిలో స్పందించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ విమర్శలపై విజయసాయి స్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. గతంలో  తనను విశ్వసనీయత లేని వ్యక్తిగా జగన్ విమర్శించినప్పుడు విజయసాయి సీరియస్ గా రియాక్టైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

అరెస్టుకు జగన్ ప్రిపేరైపోయారా?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు విషయంలో ఇప్పటి వరకూ ఊహాగాన సభలే జరిగాయి. జగన్ అరెస్టవుతారా? చంద్రబాబు హస్తిన పర్యటన అందుకేనా అంటూ మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్  హాయాంలో జరిగిన ఈ కుంభకోణం మొత్త ఆ పార్టీ అధినేత, అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లోనే జరిగిందనీ, ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్టైన నిందితులు ఆ విషయాన్ని విచారణలో అంగీకరించారనీ వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కూడా అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించిందనీ, ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే అన్న నిర్దారణకు వచ్చిందనీ ప్రచారం జరుగుతోంది.  కానీ ఇప్పుడు జగన్ కూడా తన అరెస్టు అనివార్యమన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అలా చెప్పడం ద్వారా అరెస్టయ్యేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నానని అంగీకరించేశారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మద్యం కుంభకోణంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అసలు మద్యం కుంభకోణమే జరగలేదని చెప్పు కొచ్చారు. లిక్కర్ సేల్స్ తగ్గించి… ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే… కంపెనీలకు నష్టమే కదా…మరి నష్టాలు వచ్చినప్పుడు కంపెనీలు ప్రభుత్వ పెద్దలకో, ప్రతినిధులకో ఎందుకు ముడుపులు ఇస్తాయంటూ అమాయకత్వాన్ని ప్రదర్శించారు.   సరే అధికారంలో ఉండగా తాను చేసినదంతా మంచేననీ, సుపరిపాలన అందించాననీ చెప్పుకున్న జగన్ చివరిగా తనను అరెస్టు చేస్తారన్న ప్రచారంపై మాట్లాడుతూ ఏంజరిగినా దేవుడు చూస్తూ ఉంటాడని వేదాంతం మాట్లాడారు. మొత్తం మీద మీడియా సమావేశంలో జగన్ హావభావాలు, వేదాంత ధోరణిలో మాట్లాడిన మాటలను బట్టి జగన్ అరెస్టునకు మానసికంగా సిద్ధపడినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు.. కల్వకుంట్ల కవిత సంచలన లేఖ

  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్‌ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది మార్చి నెలలో బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై, అంతకు ముందు పరిణామాలపై..ఆ తర్వాత పరిణామాలను కేసీఆర్‌కు రాసిన లేఖకు కవిత ప్రస్తావించారు.  పాజిటీవ్‌,నెగిటీవ్‌ ఫీడ్‌ బ్యాక్‌ అంటూ వివరంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడడంపై అనేక అనుమానాలున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేజన్లపై విస్మరించారు. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారికి వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా? తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మోటివేట్‌ చేస్తారని అందరూ ఎదురు చూశారు. ఓవరాలుగా కొంచెం పంచ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. 

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు.. కేఆర్ఎంబీ ఉత్తర్వులు

  వేసవి నీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ నీటిని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 10.26 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు కేఆర్ఎంబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల వరకు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 505 అడుగుల వరకు నీటిని వాడుకోవడానికి అనుమతించింది. ఏపీ అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నీటి విడుదలతో వేసవిలో తాగునీటి సమస్య కొంతమేర తీరుతుందని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ విషయంలో కూడా బోర్డు కీలకమైన సూచన చేసింది. జులై నెలాఖరు వరకు శ్రీశైలం జలాశయంలో కనీసం 800 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపింది. ఈ నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తాయని బోర్డు వర్గాలు వెల్లడించాయి.  

మళ్లీ కరోనా కాలం.. మాస్కులు అనివార్యం?

కరోనా మహమ్మరి మరో సారి దాడి చేస్తున్నదా? ఇక మళ్లీ మాస్కులు లేకుండా బయటకు రాలేని, రాకూడని పరిస్థితులు ఏర్పడుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు వైద్య నిపుణులు. దేశ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేరళలో మే నెలలో ఇప్పటి వరకూ 182 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మాస్కులు ధరించడాన్ని తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అ దలా ఉండే కోవిడ్ కేసుల వ్యాప్తం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, థాయ్ ల్యాండ్, సింగపూర్ లలో కోవిడ్ వ్యాప్తి తీవ్రత ఒకింత అధికంగా ఉంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందనీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే.. బయటకు రాకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు వ్యాపిస్తున్న ఓమిక్రాన్ ఉప-వేరియంట్‌లు స్వల్ప ఆనారోగ్య కారకాలేకానీ ప్రమాదకరమైనవి కావని పేర్కొంది. 

గంటా శ్రీనివాస్ వారసుడి తెలిసీ తెలియనితనం

  జోహార్ ఎన్టీఆర్, అంటూ అదే ఫ్లో లో బతికి ఉన్న వాళ్లకు జోహార్ చెప్పేశారు? ఓ యువనేత. రాజకీయాల్లో ఓటమి తెలియని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కొడుకు నోటి నుండి వచ్చిన పలుకులివి. తండ్రి ఏమో రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగి ఓటమి తెలియని నాయకుడిగా ముద్ర వేయించుకుంటే రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధంగా ఉన్న కొడుకు రవితేజ తన తెలిసీ తెలియనితనంతో అందరిలో నవ్వులపాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఓటమి తెలియని నాయకుడు ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు... ఓటమి ఎరగని రాజకీయ నాయకుడిగా పేరున్న గంటా శ్రీనివాసరావు 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచి తన రాజకీయ ప్రయాణంలో ఓటమిని దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.  టీడీపీ నుంచి పీఆర్పీకి, అక్కడ నుంచి కాంగ్రెస్‌కి తర్వాత తిరిగి టీడీపీకి వచ్చిన గంటా శ్రీనివాస్ తన ఇమేజ్‌కి ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఓ మెట్టు పైకి ఎదుగుతూనే వచ్చారు. అలాంటి మాజీ మంత్రికి ఇప్పుడు కొడుకు రూపంలో కొత్త తలనొప్పి మొదలైందంట. రాజకీయ నాయకుల్లో అత్యధికులు కచ్చితంగా రాజకీయ వారసత్వాన్ని తెరమీదకి తీసుకొచ్చి తమ బిడ్డల్ని గ్రాండ్ లాంచ్ చేస్తారు. అలాగే గంటా శ్రీనివాస్ తన కొడుకు రవితేజని రాజకీయాల్లో గ్రాండ్‌గా లాంచింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భీమిలి నుండి గెలిచిన ఆయన భీమిలి నియోజకవర్గం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తనతో పాటు తన కొడుకును కూడా ముందు పెట్టి నడిపిస్తున్నారు. గత సంవత్సర కాలంగా భీమిలి నియోజకవర్గంలో  జరిగే అధికారిక కార్యక్రమాల్లో గంటా కొడుకు రవితేజ అన్ని తానై ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందు ఉండి పనులు చేస్తున్న రవితేజ పెద్దగా ప్రసంగాలు చేయలేదు. స్టేజీ మీద మాట్లాడితే ఒక్క నిమిషానికి మించి ఏ రోజు మాట్లాడింది లేదు.  అలాంటి గంటా రవితేజ తాజాగా భీమిలి నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో తన తండ్రితో పాటు నియోజకవర్గంలోని కీలకమైన రాజకీయ నాయకుల సమక్షంలో క్యాడర్‌ని ఉత్సాహపరచడానికి మాట్లాడుతూ నోరు జారి జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య అంటూ నినాదాలు చేశారు.రవితేజ తెలిసీ తెలియక కనబర్చిన అత్యుత్సాహాన్ని కేడర్ మొత్తం ఫాలో అయింది. చేసిన తప్పును గుర్తించి సరిదిద్దుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. రవితేజ మినీ మహానాడు స్టేజి మీద మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. బ్రతికున్న వాళ్లకు జోహార్లు ఏంటయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఆ వ్యాఖ్యలతో గంటా వారసుడు నవ్వులపాలు అవుతున్నా... ఇంతకాలం ఆయన ఎవరో తెలియని వారికి కూడా పరిచయమవుతున్నారంట. గంటా రవితేజ తెలియని వారు ఉండరు అనే అంతగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు.   గంటా శ్రీనివాస్ తన కొడుకుని  సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టి కొత్త ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నారు. స్టార్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌తో జై దేవ్ అనే మూవీతో గంట రవితేజను లాంచ్ కూడా చేశారు. జయదేవ్ సినిమా డిజాస్టర్ కావడంతో గంటా రవితేజ తనకి సినిమాలు సరిపడవు అనుకున్నారో ఏమో?మొదటి సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసి తండ్రి రాజకీయ వారసుడిగా ఓనమాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు.  టీడీపీ అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో జరుగుతున్న మినీ మహానాడు తన ఆ రాజకీయ ఆరంగేట్రానికి సరైన సమయం అని భావించిన రవితేజకు తొలి పొలిటికల్ ప్రసంగంలోనే చుక్కెదురవ్వడంతో.. ఆయన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుందన్న సందేహాలు మొదలయ్యాయి.  2024 ఎన్నికల బరిలో తన వారసుడ్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించాలని గంట శ్రీనివాస్ ప్రయత్నం చేసినట్లు జోరుగా ప్రచారం సాగింది.  చంద్రబాబు దగ్గర కూడా తన కొడుకుకి సీటు ఇవ్వాలని గంటా కోరినట్లు అప్పట్లో టాక్ నడిచింది. 2024 ఎన్నికల్లో ప్రతి సీటు టీడీపీకి కీలకం కావడంతో చంద్రబాబు నిరాకరించడంతో గంట తానే స్వయంగా భీమిలి బరిలోకి దిగి విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కచ్చితంగా గంట శ్రీనివాస్ కు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది.మంత్రి పదవి రాకపోవడంతో నియోజకవర్గ మీద కొంత ఫోకస్ తగ్గించిన గంటా తన వారసుడ్ని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారంట.  రవితేజను భీమిలి నియోజకవర్గంలో బలమైన నేతగా తయారు చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్న మాజీ మంత్రి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కుమారుడ్ని ముందు పెట్టి నడిపిస్తున్నారంట. తీరా చూస్తే రవితేజ మినీ మహానాడు స్పీచ్‌తో అందరికీ కామెడీగా మారిపోయారు. మరి సినిమాల్లో ఫ్లాప్ అయిన ఆయన పొలిటికల్ స్క్రీన్‌పై ఏ మాత్రం రాణిస్తారో చూడాలి.

కేసీఆర్ కుటుంబంలో కొత్త డ్రామా... తండ్రి వైఫల్యాలను ఎత్తి చూపించిన కవిత

  బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కెసిఆర్ స్థానంలో పార్టీపై పెత్తనం కోసం కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లకు తల్లిదండ్రుల్లో తలా ఒకరు సపోర్ట్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఇటీవల కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. బావా బామ్మర్దులు ఒకటికి రెండుసార్లు భేటీ అవ్వటం, కేటీఆర్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తన సపోర్టు ఉంటుందని హరీష్ రావు ప్రకటించటంతో  వారి మధ్య ఏమీ లేదని గులాబీ శ్రేణులు సంబరపడిపోయాయి. అయితే తాజాగా కవిత... కేసీఆర్ కు రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గాలు చుట్టి వచ్చిన కవిత.. పార్టీ క్యాడర్, లీడర్ షిప్ ఏమనుకుంటుందో అవే విషయాలను చెబుతున్నా అంటూనే పార్టీకి కొన్ని సూటి ప్రశ్నలనే సంధించారు. మహిళా సమానతలో పదేళ్లలో అనుకున్నంత ముందుకు వెళ్లలేక పోయామన్న  కవిత డైలాగ్ తో గులాబీదళం ఇరకాటంలో పడింది.  ప్రత్యర్థి పార్టీలు కూడా కెసిఆర్ పై ఎప్పటి నుంచో అవే విమర్శలు చేస్తున్నాయి.కేసీఆర్ కు కవిత కొన్ని రోజుల క్రితమే రాసినట్లుగా చెబుతున్న లేఖ తాజాగా బయటికొచ్చింది. ఇప్పుడు ఆ లేఖ చుట్టూ కొత్త రాజకీయ చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ తర్వాత కేసీఆర్‌కు ఆయన కుమార్తె,  కవిత ఓ లేఖ రాశారు. సభ నిర్వహించిన తీరుపై తన అభిప్రాయాన్ని లేఖలో కుండ బద్దలు కొట్టారు . పార్టీ మీటింగ్ సక్సెస్ అయ్యిందంటూనే లోపాలను బయటపెట్టారామె. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ రెండు పార్టులుగా లేఖ రాశారు. తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ - తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలామంది అనుకున్నారని కవిత తన తండ్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతంపై మాట్లాడతారని అనుకున్నట్టు కవిత రాసుకొచ్చారు. కేసీఆర్ స్పీచ్ బాగుందంటూనే.. ఇంకొంచెం పంచ్‌ ను కేడర్ ఎక్స్‌పెక్ట్ చేసిందని కవిత తెలిపారు. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్‌ బిల్లు మీద మాట్లాడకపోవడం నెగిటివ్ అయిందన్నారు. బీసీలకు 42శాతం అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడమూ నెగిటివ్ అని లేఖలో ప్రస్తావించారామె. ఇంత పెద్ద మీటింగ్‌కు పాత ఇంచార్జులను ఇవ్వడంపై కొన్ని నియోజకవర్గాల్లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని, లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈ ఇంఛార్జులే బీఫామ్స్ ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీలుగా ఉండాలనుకునేవాళ్లు రాష్ట్ర నాయకత్వమే బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారని కవిత తన లెటర్‌లో రాశారు.భవిష్యత్తులో బీజేపీతో పొత్తుపెట్టుకుంటారన్న ప్రచారాన్ని చాలామంది మొదలుపెట్టారన్న విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంకొంచెం బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ  అంటూ... ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న కవిత  పేర్కొనటం చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామన్న మెసేజ్‌ను కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకెళ్లిందని  ఆమె ఎత్తి చూపారు. అన్నీ చెప్పాక పెద్దలేఖ రాసినందుకు క్షమించాలని ప్రత్యేకంగా కవిత కోరుతూ అందరికీ అందుబాటులో ఉండాలని కెసిఆర్ ని కవిత  కోరడం కూడా ఇప్పుడు బిగ్ డిబేట్ కు దారి తీసింది.    టిఆర్ఎస్  రజతోత్సవం మొత్తం కేసీఆర్, కేటీఆర్ నిర్వహించారని, కవిత, హరీశ్ రావు డమ్మీగా మారిపోయారన్న ప్రచారం ఉంది . పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ప్రెసిడెంట్‌‌గా వ్యవహరిస్తున్నారు అని గులాబీ శ్రేణులే అంటున్నాయి . ప్రస్తుతం కవిత లేఖతో  వైఎస్ జగన్‌‌పై షర్మిల ఎలాగైతే ఎదురు తిరిగారో.. కేటీఆర్‌‌‌‌పై కూడా కవిత పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్న చర్చ మొదలైంది.వీటికి తోడు ఇటీవల ములుగు జిల్లాలో సోదమ్మలతో సోది జోస్యం చెప్పించుకున్నారు కవిత. అందులో కవిత సీఎం అవుతారని జోస్యం చెప్పారంట. ఆ విషయం కూడా హాట్ టాపిక్ అయింది. కవిత బీసీల గురించి చాలా మీటింగ్స్ పెట్టారు. అక్కడ ఆమె అనుచరులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు కవిత ఏ నియోజకవర్గం వెళ్లినా ఆమె అనుచరగణం సీఎం సీఎం అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఈ లేఖతో కెసిఆర్ కుటుంబంలో కొత్త డ్రామా మొదలైంది అంటున్నారు .

ఎక్కడ నక్కినా ఉగ్రవాదులను వదిలే ప్రశక్తే లేదు.. కేంద్ర మంత్రి జైశంకర్

పాకిస్థాన్ సహా ప్రపంచంలో ఏ మూల నక్కినా ఉగ్రవాదులను వదిలే ప్రశక్తే లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్ లో పర్యటిస్తున్న జైశంకర్ అక్కడి మీడియాతో మాట్లాడారు.  సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ తో కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఇసుమంతైనా లేదని కుండబద్దలు కొట్టారు.  ట్రంప్ మాటలు పట్టించుకోబోమని ఉద్ఘాటించారు. అలాగే కాశ్మీర్‌పై చర్చల ప్రశ్నేలేదన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని స్సష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ తన విధానంగా చేసుకుందనీ, ఈ విషయంపై భారత్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోందని వివరించిన జైవంకర్  అలాంటి చర్యలకు తగిన రీతిలో బదులిచ్చే హక్కు భారత్‌కు ఉందని  అన్నారు.  . ఏప్రిల్ 22 నాటి ఘటనలు పునరావృతమైతే, కచ్చితంగా ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా ఉంటుందని పాక్ ను ఆపరేషన్ సిందూర్ ద్వారా హెచ్చరించామని అన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే అన్న విషయంలో రెండో అభిప్రాయానికి తావే లేదనీ,  తేల్చి చెప్పారు.  పాకిస్థాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాన్ని ఎప్పుడు ఖాళీ చేస్తారన్న విషయంపై మాత్రమే పాకిస్థాన్ తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.అంతే కానీ  నియంత్రణ రేఖ, జమ్మూకశ్మీర్ పాలనా వ్యవహారాలపై చర్చించే ప్రశ్నే లేదని జైశంకర్ చెప్పారు.   అదలా ఉండగా అంతర్జాతీయంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టేందుకు భారత్ చేపట్టిన దౌత్య యుద్ధానికి సర్వత్రా సానుకూల స్పందన లభిస్తోంది. ఏడు అఖిల పక్ష బృందాలను ప్రపంచ దేశాల పర్యటనకు పంపింది.  యూఏఈ, జపాన్ లకు వెళ్లిన అఖిలపక్ష బృందాలు అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. పాక్ దుశ్చర్యలు వివరించారు. ఉగ్రవాదంపై భారత్ పోరుకు యూఏఈ, జపాన్ లు పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా భారత్ పై ప్రశంసల వర్షం కురిపించాయీ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేస్తారా?

కేసీఆర్ కు బహిరంగ లేఖ సంకేతమేంటి? సొంత కుంపటికి రెడీ అయిపోయినట్లేనా? బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ తీరు పట్ల, పార్టీలో తనకు ప్రాముఖ్యత దక్కక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకునే నిర్ణయానికి వచ్చేశారా? అంటే ఇటీవలి పరిణామాలకు తోడు తాజాగా ఆమె పార్టీ అధినేత, తన కన్న తండ్రి అయిన కేసీఆర్ కు రాసిన ఘాటు లేఖ చూస్తుంటే ఔనని అనక తప్పడం లేదంటున్నారు విశ్లేషకులు.   ఇటీవలి కాలంలో పార్టీ పట్ల కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు జోరుగా వినిపించాయి. వినిపిస్తున్నాయి కూడా.   ఇపపుడు తాజాగా ఆమె పేరుతో తాజాగా బయటకు వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఇందులో ఆమె బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తనకు వచ్చిన ఫీడ్ బ్యాక్ గురించి ప్రస్తావించారు. రజతోత్సవ సభకు పాజిటివ్ రెస్సాన్ తో పాటు నెగటివ్ రెస్పీన్స్ కూడా గట్టిగానే ఉందని కేసీఆర్ ను ఉద్దేశించిన ఆ లేఖలో పేర్కొన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలోని మంచి, చెడులను ఆ లేఖలో పేర్కొన్నారు.  ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకించడం , పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలపడం,    కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే ప్రకటించడం కేసీఆర్ ప్రసంగంలో మంచి అంశాలని పేర్కొన్న కవిత.. అదే లేఖలో కేసీఆర్ ప్రసంగంలోని బేడ్ ఎలిమెంట్స్ కూడా ప్రస్తావించారు.  కేసీఆర్ రజతోత్సవ సభలో చేసిన మొత్తం ప్రసంగంలో బీజేపీని విమర్శించడానికి కేవలం రెండంటే రెండు నిముషాలే వెచ్చించారనీ, ఇది ప్రజలకు భవిష్యత్ లో బీఆర్ఎస్, బీజేపీల పొత్తు ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చిందని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.  తనను జైలుపాలు చేసిన బీజేపీని విమర్శించకపోవడం వ్యక్తిగతంగా తనకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని,  . అలాగే , బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని కేసీఆర్ తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించకపోవడం కూడా బీసీలను పార్టీలకు దూరం చేసిందని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.   ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం కూడా ప్రజలలో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడానికి దోహదపడిందన్నారు. ఇక   ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న నేతలకు రజతోత్సవ సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వకపోవడం కూడా పార్టీకి మైనస్ గా మారిందని పేర్కొన్నారు.  మొత్తం మీద కవిత కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. అదే సమయంలో ఆ లేఖ కవిత రాసి ఉండకపోవచ్చునని కూడా కొందరు అంటున్నారు.  కన్నతండ్రి అయిన కేసీఆర్ తో ఏ విషయాన్నైనా దైర్యంగా చెప్పే చనువు, స్వేచ్ఛ ఉన్న తన అభిప్రాయాలు, అసంతృప్తిని ఆయనకు లేఖ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.  అయితే ఇటీవలి కాలంలో పార్టీ లైన్ కు భిన్నంగా కవిత చేస్తున్న ప్రకటనల కారణంగా కేసీఆర్ తో భేటీకి కవితకు అవకాశం లేకుండా పోయి ఉండొచ్చనీ, అందుకే బహిరంగ లేఖ రూపంలో తన అభిప్రాయాలను, అసంతృప్తినీ వ్యక్తం చేసి ఉంటారన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జరుగుతోంది.  మొత్తం మీద కవిత పేరుతో వెలువడిన బహిరంగ చర్చ బీఆర్ఎస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ వాతావరణం ఉందనడానికి తార్కానమని అంటున్నారు.  

ముప్పేట దాడితో విలవిల్లాడుతున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి

  రాయలసీమ జిల్లాలలో తిరుగులేని హవా నడిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సింగిల్ జిల్లాకు పరిమితం కానున్నారు. అయనకు రాజకీయంగా చెక్ పెట్టడానికి  అన్నిదారులను కూటమి ప్రభుత్వం మూసివేస్తుంది. గతంలో మూడు జిల్లాలకు పరిమితమైన అయన హావాను కేవలం ఓ జిల్లాకు పరిమితం చేయడానికి సిద్దమైంది. అందులో బాగంగానే అయన నియోజకవర్గం పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపిందంటున్నారు. దాంతో పాటు అయన అస్తులపై విజిలెన్స్ నివేదిక అదారంగా ఎక్కడి కక్కడ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం దూకుడు పెంచింది. పెద్దిరెడ్డిని ఒక్క జిల్లాకు పరిమితం చేయడంతో టీడీపీ నేతల కంటే వైసీపీ సీనియర్లు తెగ హ్యాపీగా పీలవుతున్నారంట.వైసీసీ ప్రభుత్వంలో జిల్లాలో విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రాబల్యం ఉండేట్లు పెద్దిరెడ్డి చక్రం తిప్పారు.   తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్‌లో ఉన్నప్పటికి చాల తెలివిగా తన నియోజకవర్గాన్ని మాత్రం చిత్తూరు జిల్లాలో కలిపించుకున్నారు. ఆయన కూమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపి కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్న తంబల్లపల్లి నియోజకవర్గం కూడా అన్నమయ్య జిల్లాలో ఉంది. దీనికితోడు అయనకు రాజంపేట నియోజకవర్గంలో దగ్గర బంధువులు ఉన్నారు. మరో వైపు పెద్దిరెడ్డి నివాసం తిరుపతిలో ఉండటంతో అక్కడ కూడా తనకు ప్రోటో‌కాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ అగిపోయింది.అయితే అయన వ్యాపారాలు అస్తులు తిరుపతిలో ఉండటంతో పాటు అయన అనుంగు శిష్యులు అంతా తిరుపతి జిల్లాలో ఉండటంతో ఇక్కడ కూడా అయన ప్రభ వెలిగిపోయింది అధికారం ఉన్నప్పుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయన వర్గం 2019-24 మద్య కాలంలో తమ అధికారాన్ని అన్ని విధాలుగా 3 జిల్లాలలో చూపించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున భూముల అక్రమణ జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులిచెర్ల మండలంలోని మంగళం పెట అటవీ భూముల్లో  సరిహద్దు రాళ్లు నాటిన పెద్దిరెడ్డిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసింది. పాకాల కోర్టులో దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ మొదలు అయ్యాయి. మదనపల్లి బండమీదామ్మపల్లెలో అయన ఆక్రమించిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో సీఐడీ కోర్టులో ప్రోసీడింగ్స్ మొదలయ్యాయి.. ఇక తిరుపతిలోని పెద్దిరెడ్డి నివాసం,  పార్టీ కార్యాలయం, గోశాల అన్నీ బుగ్గ మఠానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో ఉన్నాయన్న సర్వే డిపార్ట్ మెంటు నివేదిక అదారంగా అయనను విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. ఇక ఏపీ లిక్కర్ స్కాంలో పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిధున్‌రెడ్డి నాలుగో నిందితుడు.  అలా పెద్దిరెడ్డిపై ముప్పేట దాడి మొదలవ్వడంతో కూటమి శ్రేణులతో పాటు వైసీపీ నేతలు కూడా ఖుషీ అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోపెద్దిరెడ్డి చెప్పిందే శాసనం అన్నట్లు నడిచింది. అప్పట్లో అయనను కేవలం అన్నమయ్య జిల్లాకే పరిమితం చేయాలని వైసీపీలోన మిగతా జిల్లా మంత్రులు , సీనియర్లు ప్రయత్నించినప్పటికి ఫలించలేదు. అప్పట్లో డిప్యూటీ సియం గా ఉన్న నారాయణ స్వామి కంటే మాములు మంత్రి అయన పెద్దిరెడ్డికి అధికారిక కార్యక్రమాలలో అధికారులు పెద్దపీట వేసేవారు. చివరకు సియం హాజరైన అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ నిలబడి ఉంటే ద్దిరెడ్డి కూర్చున్న పోటోలు అప్పట్లోసోషియల్ మీడియాలో  పెద్దఎత్తున హల్ చల్ చేసాయి. ఇక రోజా సైతం పెద్దిరెడ్డి వైభోగం చూస్తూ తనకు మంత్రి హోదా ఎందుకు అని ఫీలైన సందర్భాలున్నాయంట. ఇలాంటి తరుణంలో అయన నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ఉండటంతో పుంగనూరుని చిత్తూరులో కలవవద్దని వైసీపీ నేతలు కోరారంట.  కాని అప్పుడు పెద్దిరెడ్డి హావా ముందు వీరి మాటలు సాగలేదంట. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఇబ్బంది రాకుండా తిరుపతి ,చిత్తూరు జిల్లా నుంచి దూరం చేయడానికి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపేసింది. దాంతో పాటు పుంగనూరు సెగ్మెంట్లోని పులిచెర్ల మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి చర్యలు తీసుకుందంట. పులిచెర్ల మండలం గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. పులిచెర్లలో టీడీపీ బలంగా ఉండటంతో ఆ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి సొంత నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి స్కెచ్ గీసిందంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై చాలామంది వైసీపీ ముఖ్య నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారంట. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ నేతలు ఇకపై పెద్దిరెడ్డి పెత్తనం ఉండదని సంబరపడిపోతున్నారంట.

తిరుమలలో అపచారం.. భక్తులు ఆందోళన

  తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పురోహిత సంఘం వద్ద  ఉన్న ఖాళీ ప్రదేశంలో ముస్లిం వ్యక్తి నమాజ్  చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని.. భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు.  గుర్తు తెలియని వ్యక్తి నమాజ్ చేయడాన్ని అటు స్థానికులు సైతం గమనించారు. వెంటనే టీటీడీకి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తిరుమలకు వచ్చిన ఆ వ్యక్తి వాహనం నెంబర్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు ప్రార్ధనలు చేయడం శ్రీవారిని అపచారం చేయడమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పల్గమా దాడి నేపద్యంలో ఇలాంటి ఘటనలో తిరుమలలో జరగడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు  

కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు

  కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2017 లో  మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం, గుర్తురులో ఝాన్సీ రెడ్డి రాజేందర్‌రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కోసం ఈ స్థలంలో శంకుస్థాపన చేయడంతో భూమి వ్యవహా రం వెలుగుచూసింది. ఈ స్థలాన్ని విదేశీయురాలైన ఝాన్సీరెడ్డి ఎలా కొనుగో లు చేసిందని వర్ధన్నపేట, ఇల్లంద ప్రాంతానికి చెంది న దామోదర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో భారత పౌరసత్వాన్ని వదిలి అమెరికా పౌరసత్వం స్వీకరించిన ఝాన్సీరెడ్డి, విదేశీ మారక వ్యవహారాల చట్టం ప్రకారం వ్యవసాయ ల్యాండ్ కొనుగోలు చేయడం నేరం. పిటిషనర్ వాదనల ప్రకారం, ఝాన్సీ రెడ్డి భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా పౌరసత్వం స్వీకరించారని, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ప్రకారం ఆమె వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించి ఈ భూమిని దక్కించుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం కూడా జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై మే 1వ తేదీన జస్టిస్ సీవీ భాస్కరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజా విచారణలో... ఝాన్సీ రెడ్డి ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో, భూమి కొనుగోలు వ్యవహారంపై జూన్ 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆమెకు, ఆమె భర్తకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారితో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్‌లకు కూడా న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది

పాకిస్థాన్ ను మోకాళ్లపై నిలబెట్టాం.. ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ను మోకాళ్లపై నిలబెట్టామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రాజస్థాన్ లోని బికనూర్ ఎయిర్ బేస్ ను గురువారం (మే 22) సందర్శించిన మోడీ ఆ తరువాత ఓ బహిరంగ సభలో మాడారు.   పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలను కేవలం 22 నిముషాలలో ధ్వంసం చేశామన్నారు.  గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో బదులు తీర్చుకున్నామని వెల్లడించారు. మన ఆడపడుచుల సిందూరం తుడిచిన ఉగ్రవాదులకు సిందూరం తుపాకి తూటాగా మారితే ఏం జరుగుతుందో చూపామన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారనీ, ఆపరేషన్ సిందూర్ తో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారనీ ప్రధాని మోడీ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడితో తన నరాల్లో రక్తం కాదు సిందూరం మరిగిందన్న ప్రధాని మోడీ.. ఇక ముందు కూడా ప్రతి ఉగ్రదాడిని, ఉగ్ర చర్యనూ యుద్ధంగానే పరిగణిస్తామన్నారు.  

మేడిగడ్డలో కాంగ్రెస్ నేతలే బాంబులు పెట్టారు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. మేడిగడ్డ పగుళ్లకు బహుశా కాంగ్రెస్ నాయకులు బాంబులు పెట్టారని అనుమానం వస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం సుప్రీంకోర్టుకు అర్ధమైంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి అర్థం కావట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని ఆయన అన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నోటీసులు. కాంగ్రెస్ పార్టీ కమిషన్లు బయటపడుతున్నాయని తెలిశాకే.. ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యాఖ్యానించిందని కేటీఆర్ పేర్కొన్నారు.  జస్టిస్ గోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందన్నారు. అయితే కమిషన్‌ గడువు మళ్లీ ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలి. కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్టు సమాచారం లేదు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాంమని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గ్లామర్ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి ప్రమాదకరమైన మానసిక స్థితి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారు.  అందుకే ఒకే అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్నారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 580 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వర్షాలకు వరి ధాన్యం కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇలాంటి సమయంలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి, రేవంత్ రెడ్డి నాలుగుసార్లు మిస్ వరల్డ్ కార్యక్రమాలకు హాజరయ్యారు. తెలంగాణకు ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా?" అని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతూనే, అందాల పోటీల కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. "సీపీఐ నేత నారాయణ చెప్పినట్లుగా, మంత్రులు అందాల రాణులకు టూర్ గైడ్‌లుగా మారారు. ఇది పాలనా లేక ఫ్యాషన్ షోనా?" అని కేటీఆర్ నిలదీశారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు మృతి

మాజీ ఐఏఎస్ అధికారి గోపిశెట్టి నాగేశ్వరరావు (జీఎన్ రావు) బుధవారం (మే 21) కన్నుమూశారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. హైదరాబాద్ కుందన్ బాగ్ లోని తన స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించారు.  రిటైర్ అయిన తరువాత ఈయన ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆరంభించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల కమిటీని జగన్ 2020లో ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి జీఎన్ రావును చైర్మన్ గా నియమించారు. జీఎన్ రావు నేతృత్వంలోని మూడు రాజధానుల కమిటీ   మూడు రాజధానులే రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని  నివేదిక సమర్పించింది. అలా నివేదిక సమర్పించి ఊరుకోకుండా.. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్ ని విశాఖలో ఏర్పాటు చేయాలేని కూడా జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. అలాగే రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా నియమించాలనీ జీఎన్ రావు కమిటీ సిఫారసు చేసింది. ఈ నివేదికపై అప్పట్లో  చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావుపై తీవ్ర విమర్శలు సైతం చేశారు.   1988 బ్యాచ్ కు చెందిన జీఎన్ రావు ఉద్యోగ ప్రస్థానం గుంటూరు కలెక్టరుగా ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పలు కీలక పోస్టులలో పని చేశారు.  పదవీ విరమణ చేసిన తరువాత  అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆయన్ని శిల్పరామం స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు.  జీఎస్ రావు అంత్యక్రియలు శుక్రవారం  (మే 23) జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరుగుతాయి.