జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

  పూరి జగన్నాథ రథయాత్రలో  విషాదం చోటు చేసుకుంది.  తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఆదివారం (జూన్ 29) తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో మూడు రథాలు గుండిచా ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. ఈ సమయంలో రథాలపై ఉన్న దేవతల దర్శనం  భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. అ తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. పూరి జగన్నథ రథయాత్రలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించడం పట్ల ఒడిశా మంత్రి పృధ్విరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.  పూరీలో ఏటా జరిగే జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను రథాలలో ఊరేగిస్తూ గుండిచా ఆలయానికి తీసుకెళ్లే ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత గల ఉత్సవంగా భావిస్తారు. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.  కాగా ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

వైసీపీలో పిన్నెళ్లి ఛాప్టర్ ముగిసినట్లేనా?

వైసీపీ సీనియర్ నేత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వైసీపీ అధికరంలో ఉన్నన్నాళ్లూ దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు కలుగులో దూరిన ఎలుకలా మారిపోయారు. కేసుల చట్రంలో ఇరుక్కుని బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారు. అసలాయన రాజకీయాలలో ఉన్నారా? ఉంటే వైసీపీలోనే ఉన్నారా? అసలెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్రలకు సమాధానం లభించని పరిస్థితి నెలకొంది.  పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ వదిలేసిందన్న చర్చ మాచర్ల నియోజకవర్గంలో ఓ రేంజ్ లో జరుగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా  వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఆయన ఏమంత క్రియాశీలంగా ఉండటం లేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులలో ఉన్న పిన్నెళ్లి పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ఒక సారి జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. ఆయనపై ఇంకా పలు కేసులు ఉన్నాయి. ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా క్రియాశీలంగా ఉండేందుకు వెనుకాడుతున్నారు.  అసలు జనంలోకి రావడం లేదు. జనం వరకూ ఎందుకు పార్టీ నాయకులు, క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడం లేదు. పార్టీ జెండా ముట్టుకోవడం లేదు. వైసీపీ తరఫున గళమెత్తడానికి సైతం జంకుతున్న పరిస్థితి.  ఇటీవలి జగన్ పల్నాడు పర్యటనలో కూడా పిన్నెళ్లి జాడ కనిపించలేదు.  ఇదిలా ఉంటటే జగన్ మాత్రం చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా పార్టీ నేతలూ, క్యాడర్ ఇంటింటికీ వెళ్లి మరీ ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే ఆ ఆదేశాల మేరకు పిన్నెళ్లి పని చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక పల్నాడు వైసీపీలో కూడా పిన్నెళ్లి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే పార్టీ పుంజుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు. అదే సమయంలో ఆయనను పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తత పరిస్థితుల్లో పిన్నెళ్లి మునుపటిలా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండే పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. దీంతో వైసీపీతో ఆయన రాజకీయ ప్రయాణం దాదాపు ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జైళ్లకు వెళ్లేందుకు సద్ధపడాలని, పార్టీ నేతలూ క్యాడర్ అందరూ బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని జగన్ పిలుపునిచ్చిన తరుణంలో కేసులకు భయపడి బయటకు రావడం మానేసిన పిన్నెళ్లిని పార్టీ పదవి నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఏపీ బీజేపీలో స్తబ్దత..ఎందుకో మరి!?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉందా? అసలు ఏపీలో బీజేపీ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లభించడం లేదు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటమే కాకుండా.. తన వంతుగా కేబినెట్ లోనూ, నామినేటెడ్ పోస్టులలోనూ పదవులు తీసుకుని కూడా.. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వంపై సంధిస్తున్న విమర్శలను ఖండించడం కానీ, దీటుగా స్పందించడం కానీ చేయడం లేదని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఏపీలో బీజేపీ నేతల తీరు.. ప్రభుత్వంపై విమర్శలకు స్పందించాల్సిన బాధ్యత తమది కాదు.. కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుుదేశం పార్టీది మాత్రమే అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ సీనియర్ నేతలు  కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా..  పరామర్శ యాత్రల పేరుతో నిబంధనలు తుంగలోకి తొక్కి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వ్యవహరిస్తున్నా.. బీజీపీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారే తప్ప పెదవి విప్పి విమర్శలు చేయడం లేదు.   వైసీపీనీ, జగన్‌ని ఎదుర్కోవలసిన బాధ్యత సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, అలాగే తెలుగుదేశం, జనసేనలదే అన్నట్లు మౌనంగా ఉండిపోతున్నారు. వచ్చే నెల 1న  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ శాఖలకు   కొత్త అధ్యక్షుల ఎంపిక జరగ నుంది.  అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం అక్కడి నేతలలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.  ఇప్పుడు కాదు.. భవిష్యత్ లో కూడా ఏపీలో బీజేపీ స్టేక్ పెరిగే అవకాశం కనిపించడం లేదన్న భావనో ఏమో.. ఇంతోటి దానికి అధ్యక్ష పదవి కోసం పోటీ ఎందుకు అన్న నిర్లిప్తతతో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.   

ఫ్లవర్ ని కాదు.. ఫైర్ ని అంటున్న కొండా మురళి

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాపై గట్టి పట్టు ఉన్న నాయకుడైన కొండా మురళి ఇటీవల వచ్చే ఎన్నికలలో పరకాల నియోజకవర్గం నుంచి తన కుమార్తె సుస్మిత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్టీలోని కొందరు సీనియర్లు, ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.  తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి, ఆపార్టీని భ్రష్ఠుపట్టించి.. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్, కేటీఆర్ కు దగ్గరై వారిని కూడా తప్పుదోవ పట్టించి నాశనం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపాయి. సొంత పార్టీ నాయకులపైనే బహిరంగంగా విమర్శలు చేయడం,వరంగల్ లో తాను ఉన్నంత కాలం మరో లీడర్ రాడంటూ ప్రకటించడం,  పరకాలనియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో తన కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారని ఏకపక్షంగా ప్రకటించడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు.  ఆ భేటీలో కొండా మురళి వ్యాఖ్యలను ఖండించారు. ఈ భేటీలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, సారయ్య, గుండు సుధారాణి, నాయిని, గండ్ర సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అదలా ఉంటే తాజాగా కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట శనివారం (జూన్ 28)  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారీగా మద్దతు దారులతో గాంధీభన్ కు ర్యాలీగా వచ్చారు. క్రమశక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యులు శ్యాంమోహన్, రామకృష్ణ, కమలాకరరావులతో దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్నపరిణామాలపై క్రమశిక్షణ సంఘానికి లేఖ ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే తన వ్యాఖ్యలు, తనపై ఆరోపణలపై వివరణ ఇచ్చారని తెలుస్తోంది.    క్రమశిక్షణ కమిటీ తో భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన మురళి తనను రెచ్చగొట్టదంటూ పరోక్షంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తాను పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చాననీ, మరి కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా? చేయరా? ఆయనే తేల్చుకోవాలన్నారు. తాను దేనికీ భయపడనన్న మురళీ.. అవసరం వచ్చినప్పుుడు అన్ని విషయాలూ చెబుతానన్నారు. మురళి వ్యాఖ్యలపై వివరణ కోరడానికి పిలిచిన క్రమశిక్షణ కమిటీ ఆయనను ఏం ప్రశ్నించిందన్నది పక్కన పెడితే మురళి మాత్రం కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిపై కమిటీకి ఫిర్యాదు  చేసినట్లు తెలుస్తోంది.  ఉమ్మడి వరంగల్‌లో ప్రతీ నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలపై  వేదికలాంటి లేఖను క్రమశిక్షన కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. కడియం, రేవూరి, నాయినిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. క్రమశిక్షణ కమిటీలో తనను అసలు ప్రశ్నించలేదన్న మురళి..తానే  అయితే తానే తనపై  ఆరోపణలకు సంబంధించిన సమగ్ర వివరణ ఇచ్చానన్నారు.   

ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఒకరి అరెస్టు

తిరుపతి జిల్లా రంగంపేట మార్గంలో అక్రమంగా రవాణా చేస్తున్న 24 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్నకారు నుసీజ్ చేసి   ఒకరిని అరెస్ట్ చేశారు.  టాస్క్ ఫోర్స్ బృందం  భాకరాపేట సెక్షన్ నాగపట్ల బీటు పరిధిలో కూంబింగ్  నిర్వహిస్తుండగా శనివారం (జూన్ 28)  రంగంపేట - శ్రీనివాస మంగాపురం రోడ్డులో  వేగంగా వచ్చిన ఒక కారు పోలీసులను చూసి దూరంగా ఆగింది. అందులోనుంచి  ఒక వ్యక్తి దిగి పారి పోతుండగా  పొలీసులు వెంటాడి  అరెస్టు చేశారు. అతనిని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారులో 24ఎర్రచందనం దుంగలు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దుంగలు సహా అరెస్టు అయిన వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.  

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు నార్కో టెస్ట్?

ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత   చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి  ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును  క్వాష్ చేయాలనిఆయన  దాఖలు చేసుకున్న పిటిషన్‌ ను హైకోర్టు   తిరస్కరించింది.  ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు వాదించగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్  దమ్మాలపాటి శ్రీనివాస్  వాదించారు.  మోహిత్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం విజయవాడ   కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఒకవైపు దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసి  ః చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు కోరడం సరికాదని దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు ఏజీ  వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కింది  కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, హైకోర్టులో క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు కోరడంపై  అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్‌కు సంబంధించిన వాదనలను విజయవాడ   కోర్టులోనే వినిపించి, అక్కడే తగిన ఆదేశాలు పొందాలని మోహిత్ రెడ్డికి సూచించింది.   ఈ కేసుపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సిట్ ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.  ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహత్ రెడ్డిని ఏ39గా సిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే.   ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల మోహిత్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అయితే మోహిత్ రెడ్డి  . విచారణకు గైర్హాజరై యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇలా ఉండగా ఏపీ మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన సిట్.. విచారణకు సహకరించకుండా వ్యవహరిస్తున్న నిందితులకునార్కోటెస్ట్ చేయించాలని భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్పకు నార్కో టెస్ట్‌లు నిర్వహించే విషయమై ఉన్నతాధికారులతో చర్చించి వారి సూచనల మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కోర్టు అనుమతి ఇస్తే లిక్కర్ స్కామ్ నిందితులు నార్కో పరీక్షలు నిర్వహించి నిజాలను రాబట్టాలని సిట్ భావిస్తోంది.

అయినా ..ఆయనే బీజేపీ అధ్యక్షుడు !

    వినాయకుడి  పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు సంవత్సర కాలం పైగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. విశ్వసనీయ సమాచారం మేరకు, మరో రెండు రోజులో,జూన్ 30 న నామినేషన్లు,జూలై 1 న నూతన అధ్యక్షుని ఎన్నికకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి,వచ్చే నెల (జులై) 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగానే,బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని, నిర్ణయించిన నేపధ్యంలో,ఈలోగా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా, రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరగని మిగిలిన అన్ని రాష్ట్రాలలో జులై 15లోగా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది.ఇదే విషయాన్ని, బీజీపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుకే. లక్ష్మణ్ ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అప్పటినుంచే, ఆసవహుల పరుగులు మొదలయ్యాయి.  అదలా ఉంటే, బీజేపే నూతన అధ్యక్షుని ఎన్నిక విషయంలో, పార్టీ అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోందని, పార్టీ వర్గాల అంతర్గత సమాచారంగా తెలుస్తోంది. ముందున్న స్థానిక  సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలకు, ప్రాధాన్యత ఇస్తూనే 2028 అసెంబ్లీ ఎన్నికల విజయం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అంతిమ లక్ష్యంగా దీర్ఘకాల లక్ష్యంతో, అధ్యక్షుని ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడుఎన్నికయ్యే అధ్యక్షుని నాయకత్వంలోనే 2028 ఎన్నికలకు వెళ్ళవలసి ఉంటుందన్న  అంచనాతో తాత్కాలిక వ్యూహంతో కాకుండా దీర్ఘకాలిక వ్యూహంతో నూతన అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు, ‘తెలుగు వన్’ చెప్పారు. అయితే,అది ఎవరనే విషయంలో మాత్రం ఇంతవరకు అధిష్టానం నోటినుంచి సంకేతం రాలేదని అంటున్నారు. అయితే, ప్రస్తుతానికి వినిపిస్తున్న నలుగురు ఎంపీల పేర్లలో. మల్కాజిరి ఎంపీ, ఈటల రాజేందర్ పేరు ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది.నిజానికి,ఈటల పేరు, ఎప్పుడోనే ఖరారైందని, అనుకోని సంఘటనలు, అనూహ్య పరిణామాల కారణంగా, ప్రకటన వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఇటీవల తెర పైకి వచ్చిన, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణకు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా హాజరైన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, చెప్పిన విషయాలు, కొంత వివాదస్పద మయ్యాయి.ఈ కారణంగా, ఆయన అధ్యక్షుని రేస్’లో వెనక పడ్డారని, నిజామాబాదు ఎంపీ ధర్మపురి ఎంపీ ముందుకు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటికీ ఈటలే రేసులో ముందున్నారని, పార్టీ అంతర్గత సమాచారంగా తెలుస్తోంది.  అయితే,ఈటలతో పాటుగా, పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘనందన్‌రావు, డీకే.అరుణ కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, పాత కొత్త లెక్కల్లో భాగంగా, ముందు నుంచి రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ ఎమ్మల్యే చింతల రామచంద్రా రెడ్డి,తో పాటుగా, కల్వకుర్తి నియోజకవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన, పార్టీ సీనియర్ నాయకుడు తల్లోజు ఆచారి పేరు కూడా పార్టీ సర్కిల్స్’లో వినిపిస్తోంది. అయితే, అంతిమంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, అనేది అధికారిక ప్రకటన తర్వాత కానీ, తెలిసే అవకాశం లేదని అంటున్నారు. అయితే, రేపు (జులై29) కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్న నేపధ్యంలో, రానున్న 24 గంటల్లో మరికొంత క్లారిటీ రావచ్చని పార్టీ వారలు భావిస్తున్నాయి.

సీతక్క ప్రజల్లో పట్టు కోల్పోతుందా?

  ప్రతిపక్ష నాయకురాలిగా ప్రజల గొంతుకై ప్రశ్నించింది, తనను నమ్ముకున్న ప్రజల సంతోషాల్లో కష్టాల్లో భాగస్వామ్యం అయింది, ప్రజల పట్ల తనకున్న అభిమానం విలక్షణమైన తన సేవ గుణం దేశంలోనే ఒక గొప్ప నాయకురాలుగా పేరు సంపాదించుకుంది. కానీ అధికార పార్టీ మంత్రిగా ఉన్న తనకి తన పార్టీ నాయకుల వ్యవహార శైలితో రోజురోజుకీ ప్రజల్లో పట్టుకోల్పోతుందా అనిపిస్తుంది ఇంతకీ ఎవరు ఆ నాయకురాలు ఏంటా కథా.. సీతక్క ఓ నమ్మకం, కష్టాలో ఆమె ఓ సహాయం, ఆపదలో ఉన్న వారికి ఆమె భరోసా, ప్రజా నాయకురాలిగా అలుపెరుగని పోరాటం, ప్రజాసేవలో అలసిపోని మానవత్వం కలిగిన అరుదైన వ్యక్తిత్వం సితక్క, ఆలాంటి నాయకురాలు కోటికొక్కరుంటారు..కానీ అధికార పార్టీ మంత్రిగా ఉన్న తనకి ఒకప్పుడు  జేజేలు పలికినవారు నేడు ఆమెకి దూరం అవుతున్నారు. ఒకప్పుడు ఎంత బిజీగా ఉన్నా, ప్రజల కష్టాలలో ఓదార్చి వారి తరుపున మాట్లాడి వ్యక్తి, నేడు రాష్ట్ర మంత్రిగా, మరో జిల్లా ఇంచార్జ్ మంత్రిగా  బిజీ గా ఉండటంతో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఎందుకు సీతక్క లాంటి నాయకురాలు ప్రజల నుండి దూరం అవుతున్నారు, ప్రజలు సీతక్క గురించి ఏమను కుంటున్నారో తన దృష్టికి వెళ్తుందా లేదా ములుగు జిల్లా నాయకులు మంత్రి సీతక్క ను మై మరిపిస్తున్నారా..? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ములుగు లోని ప్రజలు ఎంతో సంతోషించారు ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో కలలు కన్నారు.. కానీ వారు కన్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి..సితక్క లాంటి డైనమిక్ లీడర్ తన నియోజకవర్గంలో జరుగుతున్న అధికార పార్టీ నాయకుల ఆగడాలు తనకు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా అయోమయంలో నియోజకవర్గ ప్రజలు.  గల్లీ లీడర్ నుంచి జిల్లా లీడర్ వరకు సెటిల్మెంట్ల దందా, ఇసుక దందా లో అధికార పార్టీ నాయకుల చేతివాటం పై అనేక ఆరోపణలు, అర్హులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ నాయకుల అక్రమ దందాకు అసలైన లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు ఎవరైనా నిలదీస్తే వారిని టార్గెట్ చేసి కేసులు పెడుతూ దాడులు చేస్తామని బెదిరిస్తున్న అధికార పార్టీ నాయకులు. దీంతో ఒకప్పుడు జేజేలు కొట్టిన వారే ఇప్పుడు అసహ్యించుకుంటున్నారు.ములుగునియోజకవర్గ అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి తో  సీతక్క గెలుపు కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన ఎందరో అభిమానుల మనసులో వున్న అభిమానం తొలగిపోతుంది.  ఒక మండలంలోని గ్రామ అధ్యక్షుడు ఇందిరమ్మ ఇళ్లలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మంత్రి సీతక్క మండల నాయకుల నుండి జిల్లా నాయకులు వరకు చేస్తున్న అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదు సరికదా వారి ఆగడాలకు అడ్డు కట్ట వేయక పోవటంతో రెచ్చిపోతూ వి డోంట్ కేర్ ఎనీ వన్ అన్ని విర్ర విగుతున్నారు. అధికారమనేది ఎవరికి శాశ్వతం కాదు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు చేసే అభివృద్ధి పనులు స్థిర స్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోవాలి. ఆ విధంగా ప్రజల మన్ననలు పొందాలి.  అధికారం ఉందనే పొగరుతో పోలీసుల సహాయంతో కోర్టు గొడవలు,భూ పంచాయతీలు, బలవంతపు సెటిల్మెంట్, అవినీతి అక్రమాలు, పేకాట దందాలు, ఇసుక దందా, కాంట్రాక్టర్ల దందా లకు కేరాఫ్ అడ్రస్ గా ములుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహార శైలి ఉంది అని ప్రజలు గుసగుస లాడుతున్నారు. ఓ సీనియర్ నాయకుడు జిల్లాలో భారీగా పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పలుమార్లు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రాణం పోయినా పేకాట ఆపను అని బహిరంగనే చెప్తున్నా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఎలాంటి హోదా లేకపోయినా హడావుడి చేస్తున్న ఎందుకు సీతక్క అతనిపై చర్యలు తీసుకోవటం లేదు. నైతిక విలువలకు మారుపేరుగా ఉన్న సీతక్క అధికార మత్తులో విలువలు విశ్వసనీయతను పక్కకు పెట్టేసిందా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు.. సీతక్క అంటే ఒక అంకితభావం,క్రమశిక్షణ, పట్టుదల కలిగిన గొప్ప నాయకురాలు తన జీవితం లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, తన 20 సంవత్సరాల పైగా  రాజకీయ జీవితంలో ప్రజా సేవ లలో తనకంటూ ప్రజల్లో గొప్ప అభిమానం సంపాదించుకున్న నాయకురాలు సీతక్క..ఇప్పటికైనా సీతక్క తన వ్యక్తిత్వానికి మచ్చ తీసుకువస్తున్న వారిని కంట్రోల్ చేయాల్సిన అవసర ఎంతైనా ఉంది. అధికార పార్టీ నాయకులను అధికార అహంకారం నుంచి ప్రజాసేవ వైపు మళ్లించాలి ప్రజలు కోరుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పేకాట,సెటిల్మెంట్లు, అక్రమ దందాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకొనీ అధికార పార్టీ మంత్రిగా తనని నమ్ముకున్న ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ప్రజలు ఆశిస్తున్నారు.

భారత గూఢచార సంస్థ రా కొత్త చీఫ్ గా పరాగ్ జైన్ నియామకం

  భారత  గూఢచార సంస్థ రిసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ చీఫ్‌గా పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. జూలై 1 నుంచి పరాగ్ జైన్ రెండేళ్ల పాటు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.పరాగ్‌ జైన్‌.. 1989 బ్యాచ్‌ పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో హెడ్‌గా పనిచేస్తున్న ఆయన్ని.. రవి సిన్హా స్థానంలో రా చీఫ్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది.  పాకిస్థాన్‌పై ఇటీవలే భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లో పరాగ్‌ జైన్‌ కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషి చేశారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్‌ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.వీటితో పాటు, జమ్మూ కాశ్మీర్‌లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం కూడా పరాగ్ జైన్‌ను ఈ పదవికి ఎంపిక చేయడంలో దోహదపడింది. గతంలో ఆయన కెనడా, శ్రీలంక వంటి దేశాల్లోనూ భారత ప్రతినిధిగా దౌత్యపరమైన సేవలు అందించారు

మహా న్యూస్‌పై దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

  హైదరాబాద్‌‌లో మహా న్యూస్ హెడ్ ఆఫీస్‌పై బీఆర్‌ఎస్ నేతల దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. స్టూడియోపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమని ఎక్స్ వేదికంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని పిలుపునిచ్చారు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాని చంద్రబాబు ట్వీట్టర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు మహాన్యూస్ కార్యాలయంపై దాడికి దిగిన విషయం తెలిసిందే. మహాన్యూస్ కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ను, స్టూడియోను ధ్వంసం చేశారు. కార్యాలయం లోపలికి ప్రవేశించిన బీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఫీస్ ముందున్న పలు కార్లను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహాన్యూస్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారిపైనా దాడికి దిగినట్లు తెలుస్తోంది. 

ముఖ్యమంత్రికి కోప మొచ్చింది .. ఎందుకో?

  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారంచేసి, ఇంచుమించుగా 18నెలలు అయింది. అయితే, ఈ 18 నెలల కాలంలో, రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యమంత్రుల్లా అధికార దర్పాన్ని ప్రదర్శించిన సందర్భాలు అంతగా కనిపించవు. ముఖ్యంగా సహచర మంత్రులపై గుస్సా అయిన సందర్భాలు అసలుకే లేవని చెప్పవచ్చును. మంత్రి వర్గ సమావేశాల్లోకానీ,  బయట ఇతరత్రా కార్యక్రమాల్లో  కానీ,మంత్రులు తనకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని రేవంత్  రెడ్డి కోరుకున్నది కూడా లేదని అంటారు.  నిజానికి, ముఖ్యమంత్రి అందరిలో ఒకడిలా కలిసిపోతున్నారని, హుందాతనం రావడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, నిజానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కిరీటాలు ఏమీ ఉండవు. మంత్రి వర్గంలో అందరూ సమానమే,అందులో ముఖ్యమంత్రిది మొదటి స్థానం,అంతే అంతకు మించి’ ముఖ్యమంత్రి మరో ప్రత్యేక ఏదీ ఉండదు. అయితే, అది సత్యమే అయినా వాస్తవం కాదు. వాస్తవంలో ముఖ్యమంత్రికి పెట్టని కిరీటంఉంటుంది,  ఆయన మాటే శాసనం అన్నట్లు. పరిపాలన నడుస్తుంది. కానే, రేవంత్ రెడ్డి మాత్రం, కారణాలు ఏమైనా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు.  అందరిలో ఒకరిగానే మెలుగుతున్నారు. అదలా ఉంచితే,  రేవంత్ రెడ్డి గడచిన 18 నెలల్లో ఎప్పుడు మంత్రులను మందలించిన సందర్భం లేదు, కానీ, ఈ మధ్య కాలంలో సీఎం స్వరంలో కొంత మార్పు కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో   రేవంత్ రెడ్డి  మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ ఉన్నా కూడా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వాటిపై దృష్టిపెట్టడం లేదని గుస్సా అయ్యారని, ఇలా అయితే, కుదరదని కొంచెం చాలా గట్టిగానేహెచ్చరించారని  సమాచారం. అలాగే, మంత్రులకు డూస్’ అండ్’  డోంట్స్’, (ఏమి చేయాలి, ఏమి చేయకూడదు)కు సంబదించి కూడా దిశా నిర్దేశం చేశారని, అందులో భాగంగా,. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదేనని స్పష్టం చేసినట్లు చెపుతున్నారు. అలాగే, నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో పదవులు భర్తీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. నిజానికి, ఇక్కడ ముఖ్యమంత్రి ఏ ఒక్క మంత్రిని పేరు పెట్టి తప్పు పట్టలేదు.కానీ, ముఖ్యమత్రి, అందరినీ కాకుండా కొందరిని ఉద్దేశించి మాత్రమే, గుస్సా అయ్యారని, అందులో, రెవిన్యూ శాఖ  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యులని పార్టీ వర్గాల సమాచారంగా, మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఒకప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత మంత్రులలో పొంగులేటి పేరు ప్రముఖంగా వినిపించేది. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, ఇదరి మధ్య దూరం పెరిగిందని అంటారు. నిజానికి, ఒక దశలో,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటిని, కీలక శాఖల నుంచి తప్పించే ఆలోచన చేశారని, ప్రచారం జరిగింది. అదొకటి అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి తొందరపడి చేసిన ప్రకటన విషయంలోనూ పొంగులేటిని పీసీసీ చీఫ్’ మందలించి నట్లు వార్తలొచ్చాయి. అంటే కాకుండా, ఇటీవల కాలంలో పొంగులేటి వ్యతిరేకంగా ఢిల్లీకి ఫిర్యాదులు చేరినట్లు ప్రచారం  జరిగింది. ఈ నేపధ్యంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మూడు రోజుల క్రితం (బుధవారం) ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఇప్పడు ఈ భేటీ వ్యహారం పార్టీ వర్గాల్లో, ముఖ్యంగా, కీలక నేతల స్థాయిలో  చర్చనీయాంశం అయిందని అంటున్నారు. అంతే కాదు, పొంగులేటి ఢిల్లీ ఎందుకు వెళ్ళారుఅనే విషయంలో, విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పొంగులేటిని అధిష్ఠానమే పిలిచిందా? లేదంటే, తనపై వస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌’ను కలిసి తనపై చేసిన ఆరోపణలకు సంబదించి వివరణ ఇచ్చేందుకు ఆయనే ఖేర్గేను కలిశారా, అనే విషయంలో క్లారిటీ లేదని అంటున్నారు. అయితే, అరిటాకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వెళ్లి అరిటాకు మీద పడినా చినిగి పోయేదే,  ఆకుకే నష్టం, అలాగే, ఈయన వెళ్లి ఆయన్ని కలిసినా ఆయనే ఈయన్ని పిలిపించినా,జరిగేది అదే అంటున్నారు.  అయితే గంటకు పైగా జరిగినట్లు చెపుతున సమావేశంలో ఖర్గే, రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకెళ్లాలని పొంగులేటికి హితబోధ చేసినట్టు చెపుతున్నారు. అయితే ఢిల్లీ కోర్టుకు చేరిన పొంగులేటి పంచాయతీ’ ఇంతటితో ముగిసేది కాదని, ముందు ముందు కొత్త మలుపులు తిరిగినా,మరింతగా ముదిరిన ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. ఉక్కపోతను ఎక్కువ కాలం తట్టుకోవడం ఎవరికైనా కొంచెం చాలా కష్టం,సో.. పొంగులేటి వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు  

మహా న్యూస్ ఛానెల్‌పై దాడి హేయమైన చర్య : పవన్ కళ్యాణ్

  హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు.  మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదని డిప్యూటీ సీఎం తెలిపారు.  మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలని ఆయన పేర్కొన్నారు. ఈ దాడికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాని పవన్ అన్నారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ సూచించారు.  

యాంక‌ర్ స్వేచ్ఛ చ‌నిపోవ‌డానికి కార‌ణం అత‌డేనా?

  పూర్ణ‌చంద్ర‌రావు అనే ఒక వ్య‌క్తితో యాంక‌ర్ స్వేచ్ఛ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ‌తంలో కూడా ఆమె ఒక‌రితో వివాహం అయ్యి త‌ర్వాత విడిపోయారు. ఆమె టీవీనైన్ వంటి ప్ర‌ముఖ న్యూస్ ఛానెళ్ల‌లో ప‌ని చేశారు. చ‌నిపోయే నాటికి స్వేచ్ఛ టీ  న్యూస్ యాంక‌ర్ గా ఉన్నారు. అయితే ఆమెకు పూర్ణ‌చంద్ర‌రావు ఇక్క‌డే ప‌రిచ‌యం అయిన‌ట్టు తెలుస్తోంది. పూర్ణ టీ న్యూస్ ప్రోగ్రామింగ్ హెడ్ గా చేస్తున్నారు. స్వేచ్ఛ తండ్రి మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే పూర్ణ‌చంద్ర‌రావు త‌న కూతురి వెంట మూడేళ్లు ప‌డ్డాడ‌నీ.. త‌న భార్య‌ను వ‌దిలి నిన్నే పెళ్లాడుతానంటూ అత‌డు ఆమెను న‌యానా భ‌యానా ఒప్పించాడ‌నీ.. ఇందువ‌ల్లే ఆమె ఇత‌డితో స‌హ‌జీవ‌నం చేస్తూ వ‌చ్చింద‌ని అంటున్నారాయ‌న‌. అయితే గ‌త కొంత కాలంగా స్వేచ్ఛ పూర్ణ మ‌ధ్య వివాదం న‌డుస్తోంద‌ని.. అత‌డ్ని పెళ్లి చేసుకోమ‌ని ఈమె ఎంత అడుగుతున్నా.. ఇంట్లో క‌న్విన్స్ చేయాల్సి ఉంద‌ని అత‌డు త‌ప్పించుకుని వ‌స్తున్నాడ‌ని అన్నారు స్వేచ్ఛ తండ్రి. ఫైన‌ల్ గా తామిద్ద‌రం విడిపోద‌లుచుకున్నామ‌ని త‌న‌తో త‌న కూతురు చెప్పింద‌ని అంటున్నారు స్వేచ్ఛ తండ్రి. ఏది ఏమైనా త‌న బిడ్డ చావుకు కార‌ణం ఈ పూర్ణ చంద్ర రావే కాబ‌ట్టి అత‌డిపై తాను కేసు పెట్టానని చెబుతున్నారు స్వేచ్ఛ తండ్రి. అత‌డ్ని తాను చూడ్డం కూడా ఇదేన‌ని.. ఇంత వ‌ర‌కూ తాను చూడ‌లేదని.. అన్యాయంగా త‌న కూతురికి మాయ మాట‌లు చెప్పి.. మోసం చేసి, చివ‌రికి ఆమె ప్రాణాలు పోవ‌డానికి గ‌ల కార‌ణ‌మైన  ఇత‌గాడికి త‌గిన శిక్ష ప‌డాల‌ని డిమాండ్ చేస్తున్నారు యాంక‌ర్ స్వేచ్ఛ తండ్రి.

మహా టీవీ ఆఫీస్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

  మహా టీవీ ఆఫీస్‌పై బీఆర్‌‌ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మహా టీవీ ఆఫీస్‌పై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లు, స్టూడియోను ధ్వంసం చేశారు.  కార్యకర్తలు ఆఫీసులోకి ప్రవేశించి నిరసన తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకున్నారు. మీడియా స్వేచ్చపై దాడిని ఖండిస్తున్నట్లు మహా టీవీ వంశీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని తెలిపారు. కానీ స్టూడియో పై దాడి, కెమెరాలను ధ్వంసం చేయడం పద్ధతి కాదని ఆయన తెలిపారు.  

క‌మ‌ల్ హాస‌న్‌కు అరుదైన అవ‌కాశం

  క‌మ‌ల్ హాస‌న్ కి యూనివ‌ర్శ‌ల్ హీరోగా పేరుంది. క‌మ‌ల్ కి ఆస్కార్ కీ ఉన్న సంబంధ బాంధ‌వ్యాలు అన్నీ ఇన్నీ కావు. భార‌త్ నుంచి అత్య‌ధికంగా ఆస్కార్ కి  నామినేట్ అయిన క‌థానాయ‌కుల్లో క‌మ‌ల్ ముందు వ‌రుస‌లో ఉంటారు.1987లో ఉత్త‌మ విదేశీ భాషా  చిత్రంగా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది క‌మ‌ల్ న‌టించిన  నాయ‌క‌న్ చిత్రం. అయితే తుది జాబితాలో చోటు ద‌క్కించుకోలేక పోయింది. ఇక 1992లో దేవ‌ర్ మ‌గ‌న్, 1995లో కురుతి పూన‌ల్, 1996లో ఇండియ‌న్, 2000 సంవ‌త్స‌రంలో హేరామ్ చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. కానీ ఇంత వ‌ర‌కూ క‌మ‌ల్ కి ఎలాంటి  ఆస్కార్ పుర‌స్కారం రాలేదు. అలాంటి క‌మ‌ల్ హాస‌న్ కి అరుదైన గౌర‌వంగా.. ఆస్కార్ క‌మిటీలో చోటు ద‌క్కింది. అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుద‌ల చేసిన స‌భ్యుల జాబితాలో క‌మ‌ల్ పేరు కూడా ఉంది. ఎంతో మంది హాలీవుడ్ న‌టీన‌టుల‌తో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్ర‌క్రియ‌లో పాలుపంచుకోనున్నారు క‌మ‌ల్. ఆస్కార్ కి నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైన‌ల్ ఎంపిక ప్ర‌క్రియ‌లో వీరికి ఓటు వేసే ఛాన్సునిస్తుంది క‌మిటీ.  కాగా ఈ ఏడాది మొత్తం 534 మంది స‌భ్యుల‌ను ఆహ్వానించిన‌ట్టు ప్ర‌క‌టించింది అకాడ‌మీ. ప్ర‌తిభావంతులైన వీరికి అకాడ‌మీలో చోటు క‌ల్పించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని పేర్కొంది అకాడెమీ.ఇటీవ‌ల క‌మ‌ల్ హీరోగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన థ‌గ్ ఆఫ్ లైఫ్ అనే చిత్రం అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది. అయినా స‌రే ఆయ‌నకు శుభ‌వార్త‌ల వెల్లువ ఆగ‌డం లేదు. ఇటీవ‌లే డీఎంకే త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన క‌మ‌ల్ కి అనుకోకుండా  ఆస్కార్ క‌మిటీ స‌భ్యుడిగానూ ఎంపిక కావ‌డంతో ఆయ‌న ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికకు ముహూర్తం ఖరారు

  జూలై 1న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు కమలం పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెలువడనుండగా, ఎల్లుండి సోమవారం నామినేషన్ల స్వీకరిస్తారని సమాచారం. ఆ తర్వాత పార్టీ చీఫ్‌ను ఎంపిక చేస్తారు.  ఈనెల 29న కేంద్ర మంత్రి అమిత్‌షా ఇందూరుకు రానున్నారు. అదే రోజున బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు అమిత్ షా పలువురు  బీజేపీ సీనియర్ లీడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఒకరిద్దరి పేర్లు ఫైనల్ చేయొచ్చని సమాచారం. ఆ సమయంలోనే ఏపీ నూతన అధ్యక్షుడి నియామకం సైతం జరుగునుంది.  అయితే,  బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి రేసులో ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘనందన్‌రావు, డీకే.అరుణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాషాయ పార్టీ హైకమాండ్​ ఎట్టకేలకు జులై రెండో వారంలో ప్రకటన చేస్తుందనే ప్రచారం ఉండటంతో బీజేపీ పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుని ఎంపిక ఆలస్యమైందని, త్వరగా ప్రకటిస్తే వచ్చే జూబ్లీహిల్స్​ఉప ఎన్నికతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ  జీహెచ్‌ఎంసీ ఎన్నికలు  సత్తాచాటుతామని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు  

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పీఏకు నోటీసులు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తవ్విన కొద్దీ సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సిట్ విచారణకు హాజరైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు  ఫోన్‌లో ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత సహాయకుడికు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు కవిత పీఎను  విచారణకు రావాలంటూ ఇవాళ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వీఐపీల వాంగ్మూలాలను అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే.  మరోవైపు 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ ఫోకస్ సిట్ ఫోకస్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై సిట్ అధికారుల ఆరా తీస్తున్నారు. కేసీఆర్ విడుదల చేసిన ఆడియో రికార్డింగులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డ్ చేసినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్ లోకి వచ్చాయి అనే దానిపై అధికారులు దృష్టి సారించారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రలోభలకు గురిచేసిన ఆడియోలు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. దర్యాప్తు నివేదికను సుప్రీంకు సమర్పించిన సిట్

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ  ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు ఆరోపణ  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  దీనిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ ను కాదని.. సుప్రీం కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ ను నియమించింది.  ఆ సిట్ దర్యాప్తులో  ఇప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసినది కల్తీ నెయ్యి అనడానికి కూడా లేదనీ, ఎందుకంటే అది  అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టుకు తెలిపింది. కెమికల్స్‌తో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసి బోలేబాబా డెయిరీ వాటిని వైష్ణవి, ఏఆర్ డెయిరీల పేరుతో టీటీడీకి సరఫరా చేసిందని  సిట్ స్పష్టం చేసింది.   ఈ కేసు   దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీం కోర్టుకు శుక్రవారం (జూన్ 27) నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో తన దర్యాప్తులో ఇంత వరకూ వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన నివేదికను దేశ సర్వోన్నత న్యాయస్థానానికి   సిట్ సీల్డ్ కవర్ లో  అందజేసింది.   ఆ నివేదికలో  సిట్ తన దర్యాప్తులో  ఇప్పటివరకు సాధించిన పురోగతిని, నిందితులు వివిధ న్యాయస్థానాలలో దాఖలు చేసిన పిటిషన్ల వివరాలను  సమగ్రంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది.  కేసు దర్యాప్తునకు  నిందితులు స‌ృష్టించిన,  సృష్టిస్తున్న అడ్డంకులపై కూడా ఆ నివేదికలో సిట్ పొదుపరిచినట్లు సమాచారం.   అలాగే   నిందితులు సాక్షులను బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా సిట్ పేర్కొన్నట్లు చెబుతున్నారు.   వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి నప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావనీ, ఎవరూ నోరు విప్పరనీ, తమంటే  ఇప్పటికీ టీటీడీ అధికారులలోనూ, ప్రజలలోనూ వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి నప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావనీ, ఎవరూ నోరు విప్పరనీ, తమంటే   ఇప్పటికీ టీటీడీ అధికారులలోనూ, ప్రజలలోనూ  తామంటే భయం ఉందపి భావించారు. అయితే..  చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదనీ,  అందులోనూ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారానికి ఎంతటి వాడికైనా శిక్ష తప్పదనీ, ఎవరైనా కర్మఫలం అనుభవించకతప్పదనీ ఇప్పుడు తెలిసివస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు సిట్ విచారణలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి అన్ని విషయాలూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు సిట్ ఇంత వరకూ తన దర్యాప్తు నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించడంతో కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రాధారులు, పాత్రధారులూ ఎవరన్నది బయటకు రావడం ఖాయమని అంటున్నారు.