ముంబై రైలు పేలుళ్ల కేసు.. హైకోర్టు తీర్పుని సవాల్ చేయనున్న సర్కారు

దేశంలోని అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటైన 2006 ముంబై రైలు పేలుళ్లు కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముంబై లోకల్ రైళ్లలో జూలై 11, 2006న జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశాన్ని విషాదంలో ముంచాయి. ఈ కేసులో కింద కోర్టు నిందితులకు విధించిన శిక్షను బాంబే హైకోర్టు రద్దు చేసి నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ తీర్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై లోకల్ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు ఘటన భారతదేశ చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రవాద దాడుల్లో ఒకటిగా నిలిచింది. ఈ దాడుల్లో 189 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 900 మంది గాయాలపాలయ్యారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల కంటే ఎక్కువ మంది ఈ పేలుళ్లలో మరణించారు . ఈ కేసులో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ 13 మందిని అరెస్టు చేసింది. 2015లో స్థానిక కోర్టు ఒకరిని మినహాయించి మిగిలిన 12 మందిని దోషులుగా తీర్పు చెప్పింది. కానీ, ఇటీవల బాంబే హైకోర్టు ఈ తీర్పును రద్దు చేస్తూ.. ఆ12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం బోంబాయి హైకోర్టు తీర్పును  సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది. బాంబే హైకోర్టులోని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం..  2015లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ ఈ కేసును నిరూపించడంలో పూర్తిగా విఫలమైందనీ, నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టమని కోర్టు తన 671 పేజీల తీర్పులో పేర్కొంది.  దర్యాప్తులో లోపాలను హైకోర్టు గుర్తించింది. నిందితుల అపరాధాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు సరిపోలేదని, ఒప్పుకోలు వాంగ్మూలాలు నమ్మదగినవి కావని, సాక్షుల కథనాలు అస్పష్టంగా ఉన్నాయని, ముఖ్యమైన కాల్ డేటా రికార్డులను తొందరగా నాశనం చేశారని, ఆధారాలను జాగ్రత్తగా నిర్వహించలేదని కోర్టు పేర్కొంది. ఒప్పుకోలు వాంగ్మూలాలను పరిశీలిస్తే.. మొదటి భాగంలో వివరణాత్మక సమాచారం ఉంది. కానీ, పేలుళ్లకు సంబంధించిన సమాచారం విషయంలో నిందితులు ఇచ్చిన వివరాలు అస్పష్టంగా, అర్థరహితంగా ఉన్నాయి. ప్రాసిక్యూషన్ కూడా ఈ అంశాలపై ఎలాంటి ఆధారాలను సమర్పించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించారు. తీర్పు గురించి న్యాయవాదులతో చర్చించినట్లు  సీఎం తెలిపారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. ఈ కేసులో న్యాయం కోసం పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2006 ముంబై రైలు పేలుళ్లు దేశంలోని అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడులు ముంబై రైల్వే వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, సామాన్య ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిలో చాలా మంది దాదాపు 19 సంవత్సరాలు జైలులో గడిపారు. వీరిలో ఒకరైన కమల్ అహ్మద్ అన్సారీ 2021లో మరణించారు. ఈ తీర్పు దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాలు చేయనుంది. దీంతో ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఉపరాష్ట్రపతి రాజీనామా.. తెర వెనక కథేమిటి?!

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎలాంటి సంకేతం, సమాచారం లేకుండా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే ధన్‌ఖడ్‌ తమ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు సమర్పించారు. అనారోగ్య కారణాల రీత్యా వైద్య సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. కనీసం చిన్న సంకేతం కూడా లేకుండా ఉప రాష్ట్రపతి రాజీనామా చేయడం సంచలనం సృష్టించడమే కాదు.. సందేహాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే..  ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం కాకపోవచ్చనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి..  ధన్‌ఖడ్‌  తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లుగా  అనారోగ్య కారణాల వల్లనే రాజీనామా నిర్ణయం తీసుకుని ఉంటే.. ఇంత హటాత్తుగా తన నిర్ణయాన్ని ప్రకటించవలసిన అవసరం ఏముందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ఇంత సంచలన నిర్ణయం తీసుకోవడం  సహజంగానే సందేహాలకు తావిచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నిటికీ మించి రోజంతా  సభలో ఎప్పటిలా యథావిధిగా కార్యక్రమలు నిర్వహించిన ఉపరాష్ట్రపతి  ఆ వెంటనే తమ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడంతో ధన్‌ఖడ్‌ ఆకస్మిక రాజీనామా వెనుక రాజకీయ కారణాలుండవచ్చునన్న చర్చ జోరందుకుంది.   అయితే అదేమిటనే విషయంలో మాత్రం ఎవరికీ స్పష్టత ఉన్నట్లు కనిపించడం లేదు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం  పెద్ద నోట్ల రద్దు మొదలు అనేక సంచలన నిర్ణయాల విషయంలో పాటించిన గోప్యతనే ఉప రాష్ట్రపతి రాజీనామా విషయంలోనూ పాటించిందనీ..  విషయం ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడిందని అంటున్నారు.  అయితే..  గత కొంత కాలంగా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో సంచలన నిర్ణయం ఏదో తీసుకుంటుందనే అనుమానాలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా విపక్ష శిబిరంలో వినిపిస్తున్నాయి. కానీ.. మోదీ తీసుకునే సంచలన నిర్ణయం ఉప రాష్ట్రపతి రాజీనామా అవుతుందని మాత్రం ఎవరూ ఉహించలేదు. అయితే, పహల్గం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, బీహార్ ఓటర్ల సవరణ అస్త్రాలతో వర్షాకాల యుద్ధానికి సిదమైన విపక్షాలను ఎదుర్కునేందుకు వక్ఫ్ బిల్లును తీసుకురావడమో లేదా మరో కీలక నిర్ణయం తీసుకోవచ్చని విపక్షాలు ఊహిస్తున్నాయి. కానీ, ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తారని మాత్రం ఎవరూ ఉహించలేదు. కాగా.. విశ్వసనీయ సమాచరం మేరకు మూడు రోజుల కిందట..అంటే శనివారం  (జులై 19) ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్  హటాత్తుగా ఢిల్లీ వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి గంటకు పైగా ప్రధానితో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఆయన నేరుగా హోమ్ మంత్రి అమిత్ షాను కలిశారు. మరో గంట ఆయనతో సమావేశమయ్యారు. ఆ వెంటనే అమిత్ షా, ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశ మయ్యారు. అదే సమయంలో పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా సిబ్బంది  మాక్ డ్రిల్  నిర్వహించినట్లు సమాచారం.  అలాగే సోమవారం (జులై 21) పార్లమెంట్ జరుగుతున్న సమయంలోనే ప్రధాని పార్లమెంట్ కార్యాలయంలో  హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ నాథ్ సింగ్,ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రసాయనాలు  ఎరువుల శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ జిజూ, మరో ఒకరిద్దరు కీలక శాఖల మంత్రులు సమావేశమయ్యారు. శని(జులై 19),సోమ(జులై 21)వారాల్లో జరిగిన జరిగిన కీలక సమావేశాలకు, ఉప రాష్ట్రపతి  ఆకస్మిక రాజీనామాకు ఏదైనా సంబంధం ఉందా? లేదా?  అనే విషయంలో స్పష్టత లేకున్నా..  సంబంధం ఉండే ఉంటుందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే.. ఈ సమావేశాల్లో ఎక్కడా నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేక పోవడాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    తెరవెనక జరిగిన ఈ  పరిణామాల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఆకస్మిక రాజీనామా వెనక.. అసలు కథ ఇంకేదో ఉందని అంటున్నారు. ముఖ్యంగా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల మధ్య అంతర్గతంగా సాగుతున్న విభే దాలు.. మరీ ముఖ్యంగా 75 సవత్సరాల వయోపరిమితి నిబంధనను ప్రధాని మోదీకి వర్తింప చేయాలని  ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్  పట్టు పడుతున్న నేపథ్యంలో, మోదీకి  పోటీగా ఉన్న నాగపూర్ ఎంపీ నితిన్ గడ్గరిని పక్కకు తప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగానే ఉపరాష్ట్రపతి చేత రాజీనామా చేయించారని అంటున్నారు. గతంలో వెంకయ్య నాయుడును క్రియాశీల రాజకీయాలకు దూరం చేసేందుకు, ఆయనకు ఇష్టం లేకున్నా, బలవంతంగా ఉపరాష్ట్రపతిని చేసిన విధంగా, ఇప్పడు నితిన్ గడ్కరీని క్రియాశీల రాజ కీయాల నుంచి తప్పించేందుకు  ఉపరాష్ర్టప్రతిని  చేసే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. అయితే..  నితిన్ గడ్కరీ అందుకు అంగీకరిస్తారా? అంతకంటే ముఖ్యం గా  మోదీ, షా .. జోడీ.. ప్రయత్నాలకు నాగపూర్ ఆమోదిస్తుందా? అంటే చూడాల్సి ఉందని అంటు న్నారు.

మల్లారెడ్డి చూపెటు.. సైకిల్ వైపా..కమలం వైపా?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఛామకూర మల్లారెడ్డి కమలం గూటికి చేరనున్నారా? కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే తెలంగాణ రాజకీయవర్గాలలో ఔననే ప్రచారమే జరుగుతోంది. ఇటీవలి కాలంలో మల్లారెడ్డి  బీఆర్ఎస్ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదు. అదే సమయంలో ఆయన కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ అడుగులు బీజేపీవైపు పడుతున్నట్లుగా కనిపిస్తున్నది. వాస్తవానికి ప్రీతిరెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటారు. వచ్చే ఎన్నికలలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు ఆమె బండి సంజయ్ ద్వారా ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.   ఇటీవల బోనాల వేడుకల సందర్భంగా బండి సంజయ్ ను ఆహ్వానిస్తూ , శుభాకాంక్షలు చెబుతూ పాతబస్తీలో  పలు ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీలలో చాలా వరకూ బీజేపీ నేతలు, శ్రేణులు ఏర్పాటు చేసినవే.  అయితే బండి సంజయ్ కు స్వాగతం పలుకుతూ చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతీరెడ్డి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే బండి సంజయ్ కు విందు కూడా ఇచ్చారు. ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు, ఆమె ఇచ్చిన విందుకు బండి సంజయ్ హాజరైన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయిన తన మామ మల్లారెడ్డి అనుమతి, ఆశీర్వాదం లేకుండానే ప్రీతిరెడ్డి బీజేపీకి అనుకూలంగా ఇలా వ్యవహరిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొంత కాలంగా రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా కనిపించని మల్లారెడ్డి.. బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నారన్న ప్రచారం ఇప్పటికే జోరుగా ఉంది. ప్రీతిరెడ్డి బండి సంజయ్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆయనకు విందు ఇవ్వడం  మల్లారెడ్డి వ్యూహమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

వర్షాలే.. వర్షాలు.. ఇక ఇప్పుడు ఏపీ వంతు

గత నాలుగు రోజులుగా తెలంగాణలో దంచి కొట్టిన వర్షాలు మంగళవారం నాడు ఒకింత తెరిపి ఇచ్చాయి. ఇక ఇప్పుడు ఏపీ వంతు అంటున్నాయి. రానున్నమూడు రోజులూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  ముఖ్యంగా అల్లురి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందనీ, మిగిలిన జిల్లాలలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

గిరిజనుడిపై పెద్దపులి దాడి

నల్లమల అడవి ప్రాంతంలోని అభయారణ్యంలో పెద్దపులి దాడిలో ఓ  గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆత్మకూరు రేంజ్ లో  కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచు గుడానికి చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడిపై సోమవారం ( జులై 21) పులి దాడి  చేసింది. అదృష్టవశాత్తూ పులి దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన అంకన్నను ఆత్మకూరు  ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందించారు. ఆత్మకూర్ రేంజ్ పరిధిలోని చదరం పెంట చెంచుగూడెం లో పులిచెర్ల అంకన్న తన పొలంలో సాగుచేసిన వరి పంటను చూసుకునేందుకు పొలం వైపు వెడుతుండగా.. పొదల్లో మాటేసి ఉన్న  పెద్దపులి ఒక్కసారిగా  దాడి చేసింది. ఎలాగో పెద్దపులి దాడి నుంచి అంకన్న తప్పించుకున్నప్పటికీ కాళ్లకూ, చేతులకూ తీవ్ర గాయాలయ్యాయి.  ఈ సంఘటనతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. అంకన్న కేకలు విని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావడం.. వారి అరుపులకు బెదరిని పులి అంకన్నను వదిలేసి పోయింది. అయితే మనిషిరక్తం రుచి చూసిన పులి మానీటర్ గా మారుతుందన్న ఆందోళన గిరిజనులతో వ్యక్తం అవుతోంది.  అటవీ అధికారులు పులులు గ్రామాలలోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో ఏ12 బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు

వైసీపీ నేతలు, శ్రేణులను అరెస్టు భయం వణికించేస్తున్నది. అధికారంలో ఉండగా చేసిన తప్పుడు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడటంతో వారు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్టయ్యారు. మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారు అజ్ణాతంలోకి వెళ్లి కోర్టు బెయిలు మంజూరు చేస్తుందన్న ఆశతో ఉన్నారు. ఇక తాజాగా మరో ఇద్దరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో స్కాములు, దాడులు, దౌర్జన్యాలు, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలకు పాల్పడిన వైసీపీయులు వరుసగా అరెస్టు అవుతున్నారు. ఇప్పడు  నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు  సోమవారం (జులై 21)నఅరెస్టు చేశారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిథి రమేష్ రెడ్డిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసి మదనపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.  బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వైసీపీ హయాంలో జరిగిన  క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, పెద్దఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, అట్రాసిటీ కేసులో ఏ 12 నిందితుడిగా శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. గత కొంత కాలంగా నెల్లూరు జిల్లా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో  బిరదవోలు హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసుకున్న నెల్లూరు జిల్లా పోలీసులు ఆయనను అక్కడ అరెస్టు చేసి ఏపీకి తరలించారు.  ఇదే కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి  మాజీ మంత్రి,   వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్‌కు  అత్యంత సన్నిహితుడు.   ఇక  రమేష్ రెడ్డి  ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన  కేసులో అరెస్టు చేశారు. లక్కిరెడ్డిపల్లిలో అరెస్టు చేసిన రమేష్ రెడ్డిని భారీ బందోబస్తు మధ్య మదనపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.  

వివేకా హత్య కేసులో మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయం కోరిన సుప్రీం

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై సోమవారం (జులై 21)  సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి సహా పలువురు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీతతో పాటు సీబీఐ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బెయిలుపై ఉన్న నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరఫు న్యాయవాది సిద్ధార్ధ్​లూద్రా వివరించారు.  ఈ విషయంలో సీబీఐ తన అభిప్రాయాన్ని చెప్పాక  బెయిల్ రద్దు పై విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను వాయిదా వేసింది. మూడు విషయాలలో సీబీఐ తన అభిప్రాయం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. వివేకా హత్య కేసులో ఇంకా  దర్యాప్తు అవసరమా?  ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో వేసిన క్లోజర్ రిపోర్టుపైన, కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా?  అన్న అంశాలపై  సుప్రీం కోర్టు సీబీఐ అభిప్రాయాన్ని కోరింది. వివేకా హత్య కేసులో  అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ  సీబీఐ, సునీత దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.  సీబీఐ ఈ మూడు అంశాలపై అభిప్రాయాన్ని తెలిపిన తరువాత బెయిలు రద్దు పిటిషన్ విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

భారత ఉపరాష్ట్రపతి రాజీనామా

  భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారు.  ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రాజీనామా లేఖను పంపారు. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన పదవీ కాలంలో మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీకి ధన్యవాదలు తెలిపారు. కాగా 2022 ఆగస్టు11న ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకు ముందుకు 1990-91 మధ్య కేంద్రమంత్రిగా 2019-22 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సేవలందించారు . కిసాన్ పుత్రగా ఆయన దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. జనతాదళ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన గతంలో శాసనసభ, లోక్‌సభ సభ్యుడుగా కూడా పనిచేశారు.  

హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ ధరలు పెంపు

  తెలంగాణలో హరిహర వీరమల్లు మూవీ టికెట్ రెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జులై 23న  ప్రీమియర్ షోకు  టికెట్ ధర రూ.600  గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఈ నెల 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.150 వరకు పెంచుతు జీవో జారీ చేసింది. హరిహర వీరమల్లు’ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఇది ఫిక్షనల్ కథతో రూపొందించిన హిస్టారికల్ మూవీ. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు.  నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు.  ఏపీ లో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం స్పెషల్ జీవో జారీ చేసింది. మూవీ రిలీజైన తర్వాత మొదటి రెండు వారాలపాటు ధరలు పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత గవర్నమెంట్ ని కోరారు. కానీ మొదటి 10 రోజులు మాత్రమే రేట్లు పెంచడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆగస్టు 10 లోపు రోజా జైలుకెళ్లక తప్పదు..శాప్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు

  ఏపీ శాప్ ఛైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగస్టు 10 లోపు జైలుకెళ్లక తప్పదని రవినాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల అవినీతికి పాల్పడిన రోజా జైలుకెళ్లడం ఖయామని  శాప్ ఛైర్మన్ తెలిపారు. గతంలో క్రీడా మంత్రిగా పని చేసిన ఆమె అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతోందని వెల్లడించారు.  రోజా రోజులు లెక్కబెట్టుకోవాలని ఆయన అన్నారు. క్రీడా శాఖ మంత్రిగా ఒక్క స్టేడియం అయినా రోజా నిర్మించారా..? ఆయన ప్రశ్నించారు. రోజా నగరికి టూరిస్ట్ మాత్రమేన్నారు. నిత్యం ఆమె తమిళనాడులోనే ఉంటున్నారని రవినాయుడు అన్నారు. ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్ పై రోజా వ్యాఖ్యలు క్షమించరానిదన్నారు. రోజమ్మా నీకు దమ్ముంటే గాలిభాను సవాల్ ను స్వీకరించాలని సవాల్ విసిరారు. రోజా వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయిని తెలిపారు.  సీఎం చంద్రబాబును ఏకవచనంతో రోజా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. పరిశ్రమలు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడాన్ని వైసిపి నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు.గత మూడునెలలుగా జగన్ వికృత చేష్టలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని  శాప్ ఛైర్మన్ మండిపడ్డారు.  

కమల దళంలో.. కుమ్ములాటలు.. క్యాడర్ బజార్ !!

  భారతీయ జనతా పార్టీ  (బీజేపీ) లో ఏమి జరుగుతోంది ? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ బీజేపీలో ఏదో జరుగుతోంది,అనేది ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత వ్యవహరాల్లో పార్టీకి, పార్టీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్)కు మధ్య ఒక పెద్ద అగాధమే ఏర్పడిందనేది, ప్రముఖగ్మ వినవస్తోంది.  సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి, బీజేపీ, ఆర్ఎస్ఎస్’ అధినాయకుల మధ్య విభేదాల  కారణంగానే, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక ఎంతకీ ముడి పడడం లేదని ఇటు బీజేపీ ముఖ్యనాయకులు, సంఘ్ పరివార్ సంస్థల కీలక నేతలు, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంగీకరిస్తున్నారు. అదలా ఉంటే, మరో వంక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతల మధ్య ఎంతో కాలంగా ఎంతో కొంత గుంభనంగా సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు ఇప్పడు బహిరంగంగా బయటకు తన్ను కొచ్చాయి.  పతాక స్థాయికి చేరాయి. ముఖ్యంగా, కేంద్ర మంత్రి బండి సంజయ్,మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం,పార్టీని ఒక కుదుపు కుదిపింది. దీంతో, పార్టీ అధ్యక్షునిగా రామచంద్ర రావు ఎంపిక విషయంలో తలెత్తిన విభేదాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా వంటి సంఘటనలతో,  అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితిని మరింతగా దిగజారుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  నిజానికి, రాజకీయ పార్టీలలో అంతర్గత విభేదాలు కొత్త కాదు. అందుకు బీజేపీ మినహాయింపు కాదు.  కానీ, క్రమశిక్షణకు మారు పేరుగా ముద్ర వేసుకున్న బీజేపీలో అంతర్గత విభేదాలు చాలా వరకు అంతర్గంగానే ఉంటాయే, కానీ,  బజారుకు ఎక్కడం అంతగా ఉండదు. అందుకే, బండి వర్సెస్ ఈటల మాటాల యుద్ధం మేదో దృష్టిని గట్టిగా ఆకర్షిస్తోంది. అయితే, ప్రస్తుత బీజేపీ నేతలంతా సంఘ్ పరివార్’ సంస్కృతీ నుంచి వచ్చినవారు కాదు. ఈటల విషయాన్నే తీసుకుంటే. ఆయన వామపక్ష భావజాలం నుంచి వచ్చిన నాయకుడు. అంతే కాకుండా, ఆయన బీజేపీలోకి వచ్చే నాటికే, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, కేసీఆర్ మంత్రి వర్గంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుడు. సో.. సహజంగానే’ ఆయన ఆశించిన అధ్యక్ష పదవి రాకుండా పోవడంతో నిరాశకు గురయ్యారని, దానికి బండి సంజయ్’తో ఉన్న చిరకాల వైరం తోడవడంతో ఈటల భగ్గుమన్నా రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  నిజానికి అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి, ఈటల వర్సెస్ బండి వార్’కు  పెద్దగా తేడాలేదు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ,రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై, రాజగోపాల రెడ్డి, అది కాంగ్రెస్ పార్టీ విధాలకు విరుద్దమంటూ  తీవ్రంగా తప్పు పట్టారు. నిజానికి, అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక్క కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మాత్రమే కాదు, అసంతృప్తి ఉడికి పోతున్న నాయకులు ఇంకా ఉంటారు.  ఇక బీఆర్ఎస్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అయితే, ఇతర పార్టీల కథ ఎలా ఉన్నా, బీజేపీలో అంతర్గత విభేదాలు.. మీడియా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అందుకే, ఈట ల వర్సెస్ బండి మాటల యుద్ధం రాష్ర్ం రాజకీయాల్లో సంచలనంగా మారిందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే.  బండి వర్సెస్ ఈటల ‘వార్’ ఎలా ఎండ్’ అవుతుంది? అనేది ఆశక్తికరంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.  

తెలంగాణలో ఈ నెల 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ

  తెలంగాణలో జులై 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రల్లో పంపీణి చేయాలని  ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టర్ల పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్‌ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ.. ఆందోళన అవసరం లేదు’’ అని సీఎం అన్నారు. సన్నం బియ్య ఇస్తుండటంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని సీఎం తెలిపారు. జిల్లాల పరిధిలోని ఐఏఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో తనకు తెలియజేయాలని సీఎం  ఆదేశించారు. వర్షాలు, వానాకాలం పంటసాగు, సీజనల్‌ వ్యాధులు, రేషన్‌కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. ‘‘రాష్ట్రంలో సరిపడినంత ఎరువులు ఉన్నాయి. ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్‌ ఉందో బయట నోటీస్‌ బోర్డు పెట్టాలి. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి తెలిపారు. కలెక్టర్లు వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.కోటి కేటాయించామని తెలిపారు.  

రాహుల్ వ్యాఖ్యలపై లెఫ్ట్ పార్టీల .. ఆగ్రహం !

  కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్), భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్సిష్స్ట్ ) లను ఒకే గాటన కట్టేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమిలో చిచ్చు పెట్టాయి. నిజానికి, రాహుల్ గాంధీ ఒక్క ఆర్ఎస్ఎస్,  సీపిఐ(ఎం)లను మాత్రమే కాదు, మొత్తంగా రాజకీయ వ్యవస్థనే, టార్గెట్ చేస్తూ, రాజకీయ నాయకులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం లేదనే అర్థం వచ్చేలా విమర్శలు గుప్పించారు.  రాహుల్ గాంధీ వ్యాఖ్యల పట్ల కూటమి భాగస్వామయ పార్టీలు, ముఖ్యంగా, వామపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. కొట్టాయం (కేరళ)లో జరిగిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ ద్వితీయ వర్ధంతి సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్,సిపిఐ( ఎం)లనిఉ ఒకే గాటన కట్టి విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్’ తోపాటుగా, సిపిఎం(ఎం)ను తమ సైద్ధాంతిక శత్రువుగా పెర్కొన్నారు. అటు ఆర్ఎస్ఎస్ ఇటు సిపిఐ (ఎం)తో  తాను సైద్ధాంతిక పోరాటం చేస్తున్నానని, చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్, సిపిఐ(ఎం) లకు మానవీయ విలువలు తెలియవని, ప్రజాసమస్యలు పట్టవని,విమర్శించారు. నిజానికి, ఆర్ఎస్ఎస్, సిపిఐ(ఎం)లను మాత్రమే కాదు, రాహుల్ గాంధీ, ఇడియా కూటమి భాగస్వామ్య పార్టీలు సహా  మొత్తం రాజకీయ వ్యవస్థనే టార్గెట్ చేస్తూ, ‘సమకాలీన రాజకీయ నాయకులలో కొద్ది మంది మాత్రమే ఇతరుల మనోభావాలను పంచుకుంటున్నారు” అంటూ, రాజకీయాలలో ఉండాలంటే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని,పార్టీ నాయకులకు హితబోధ చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను, ఇండియా కూటమి నాయకులు తప్పు పట్టారు. ముఖ్యంగా వామపక్ష భావజాలం గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సిపిఐ జాతీయ నాయకుడు,డి. రాజా,  ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు మంచిది కాదని హితవు పలికారు. కూటమిని బలహీన పరుస్తాయని హెచ్చరించారు.  మరోవంక సిపిఐ(ఎం) పొలిట్’ బ్యూరో సభ్యుడు, ఎంఎస్ బేబీ, ఎక్స్’ వేదికగా  రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరం అంటూ, రాహుల్ గాంధీకి కేరళ రాజకీయాలు అర్థం కాలేదని చురక అంటించారు. అలాగే, 2004లో వామపక్షాల మద్దతుతోనే కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసియన్ విషయాన్ని గుర్తు చేశారు. అయితే, “ బీజీఎపీ హటావో .. దేశ్ కో  బచావో’ నినాదంతో ఏర్పడిన కూటమి లక్షయం నేరవేరే వరకు, ఇండియా కూటమిలో కొనసాగుతామని లెఫ్ట్ నేతలు. చెప్పడం కొసమెరుపు.

ఏపీలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో జీరో ఫేర్ టిక్కెట్

  ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేరో టిక్కెట్‘ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు... ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి... 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ... వంటి వివరాలు ఆ టిక్కెట్‌లో పొందుపరచాలని చెప్పారు. జీరో ఫేర్ టిక్కెట్‌ ఇవ్వడం ద్వారా ఎంత లబ్దిపొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందని ముఖ్యమత్రి అన్నారు.  ఇందుకు సంబంధించి సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్ధికంగా ఎంత భారం పడింది... మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని ఆగస్ట్ 15 నుంచి సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.    ఆర్టీసీని లాభాల బాట పట్టించండి :  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా... ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణా వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి.. ఎటువంటి విధానాలు తీసుకురావాలి... అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు.  మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్నవాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణా వ్యయం తగ్గుతుందని... అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైనా అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.  

పార్టీలో హద్దు దాటితే చర్యలు తప్పవు...టీ బీజేపీ చీఫ్ హెచ్చరిక

  భారతీయ జనతా పార్టీలో అంతర్గత పోరుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పందించారు. తమ అంతర్గత వ్యవహారాలు తామే పరిష్కరించుకుంటామని తెలిపారు. టీ బీజేపీ చీఫ్  ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్-కవిత కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి- కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య కుడా అంతర్గత విభేదాలు ఉన్నాయని గుర్తు చేశారు. పార్టీలో హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఈ నేపథ్యంలో రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు. తెలంగాణలో రాజకీయ వ్యూహాలు, స్థానిక ఎన్నికల సన్నాహాలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. మతపరమైన రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుందని మరోసారి స్పష్టం చేసారు.  బీసీలకు 42% రిజర్వేషన్లను సమర్థిస్తుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ బిల్లులో ముస్లిం రిజర్వేషన్లను చేర్చి ఓబీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.  బీజేపీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలదని, మతపరమైన రిజర్వేషన్లు లేకుండా రిజర్వేషన్లు కల్పించాలని టీ బీజేపీ ఛీప్ తెలిపారు .ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ హైకమాండ్ సానుకూలంగా స్పందిస్తాయని ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణలో బీసీలకు న్యాయం చేయడానికి  బీజేపీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.   

కేరళ మాజీ సీఎం కన్నుమూత

  కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్చుతానందన్ కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2019 లో స్ట్రోక్ తో మంచం పట్టిన అచ్యుతానందన్ కు ఇటీవల గుండెపోటు వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.  ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చారు.1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నుండి బయటకు వెళ్లి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించారు. 32 మందిలో అచ్యుతానందన్ మాత్రమే జీవించి ఉన్న నాయకుడు. ఆయన కేరళ అసెంబ్లీలో మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. చాలా సంవత్సరాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన 2021 వరకు కేరళ అసెంబ్లీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు.ఆయన వయసు 101 సంవత్సరాలు. గతేడాది అక్టోబర్‌ 20న ఆయన 101లోకి అడుగుపెట్టారు. 

లోక్‌సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం..విపక్షాల నిరసన

  భారత పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఆపరేషన్ సింధూర్ నిలిపివేత, ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే రెండు సార్లు సభను వాయిదా వేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల, తాజాగా సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మరో పక్క రాజ్య సభలోను ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంతో ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభ వాయిదా పడింది.  లోక్ సభ, రాజ్య సభ రెండింటిలోను పహల్గాం ఉగ్రదాడి, పహల్గాం టెర్రర్ ఎటాక్ విషయంలో చర్చకు విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ట్రంప్ మధ్యవర్తిత్వం వివాదంపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.గత నెల గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని, దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.  తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. అయితే, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపట్టాం. అంతర్జాతీయ ప్రొటోకాల్‌ ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోంది. ప్ర‌మాదంపై ఏఏఐబీ (ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్విస్టిగేష‌న్ బ్యూరో) పార‌ద‌ర్శ‌కంగా ద‌ర్యాప్తు జ‌రుపుతోందని పేర్కొన్నారు.  కానీ, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక వచ్చింది. తుది నివేదికలో మరిన్ని వివరాలు తెలుస్తాయి. బ్లాక్‌బాక్స్‌ దెబ్బతిన్నా డేటాను రిట్రీవ్‌ చేశాం. బ్లాక్‌బాక్స్‌ను తొలిసారి డీకోడ్‌ చేయగలిగాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరకుండా చర్యలు తీసుకుంటున్నాం. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు చర్యలు చేపట్టాం" అని రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.