మిథున్‌రెడ్డికి ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతి

  ఏపీ మద్యం కుంభ కోణం కేసులో అరెస్ట్‌యిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వసతులు కల్పించడానికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. జైలులో ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతి ఇచ్చింది. మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్‌, కూలర్‌, పేపర్‌-పెన్ను, టేబుల్‌, ప్రొవిజన్‌ ఉంటే టీవీ అనుమతించాలని కోర్టు పేర్కొంది. పేపర్‌, వాటర్‌ బాటిల్స్‌, ఫుడ్ ఖర్చును మిథున్‌రెడ్డి భరించాలని స్పష్టం చేసింది. బయటి ఆహారం తీసుకువస్తే అండర్‌ టేకింగ్‌ లెటర్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జైలులో ఉన్న వైద్య వసతి కల్పించాలని.. అవసరమైతే జైలు బయట వైద్య సౌకర్యం కల్పించాలని సూచించింది. న్యాయవాదులకు వారంలో మూడు సార్లు, కుటుంబ సభ్యులు వారంలో రెండు సార్లు ములాఖత్‌లకు కోర్టు వీలు కల్నించింది.

ఫ్రీజ్‌లో ఉంచిన మటన్ తిని ఒకరి మృతి..ఏడుగురికి సీరియస్

  హైదరాబాద్ వనస్థలిపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న చికెన్, మటన్ బొటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని తిని ఓకే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురుయ్యారు. వారిలో ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ చికిత్స  పొందుతూ మృతి చెందారు. ఆర్టీసీ కాలనీకి చెందిన ఫ్యామిలీ ఆదివారం బోనాల పండుగ సందర్బంగా మటన్ వంటుకుని తిన్నారు.  మిగిలిన దాన్ని ఫ్రిజ్‌లో పెట్టారు. దాన్ని ఇవాళ వేడి చేసి తినడంతో ఫుడ్ పాయిజన్ అయి వాంతులు, విరేచానాలు అయ్యాయి. దీంతో మిగిలిన ఏడుగురు చింతలకుంటలోని హిమాలయ ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సిట్‌ అధికారుల లీకులతోనే ఆ కథనాలు ..ధనుంజయ్‌రెడ్డి ఆవేదన

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి ఏసీబీ కోర్టు ఎదుట తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన ఫ్యామిలీ గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. మేం ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. కారాగారం పక్కన బిల్డింగ్ టెర్రస్‌ పైనుంచి మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు. పై నుంచి అడిగితే మేం ఫోటోస్ తీస్తున్నామని చెబుతున్నారు.  నేను ఐదుగురితో మాట్లాడినట్టు సెల్‌ఫోన్‌ ట్రాక్ ద్వారా గుర్తించినట్టు పేపర్‌లో ఓ న్యూస్ చూశాను. ఆ కథనంలో పేర్కొన్న ఐదుగురిలో ఇద్దరిని మాత్రమే నేను కలిశానంతే. మిగతా ముగ్గురిని ఇప్పటి వరకు ఎప్పుడూ నేను కలవలేదు. కావాలంటే ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థతో నైనా ఎంక్వైరీ చేయించుకోవచ్చని కోరుతున్నాను తెలిపారు. నేను నా లైఫ్‌లో కొన్న ఒకే ఒక్క శాంట్రో కారు. నా వైఫ్ మరో కారు వాడుతోంది. ఇవి రెండు విలాసవంతమైన కార్లా?. న్యూస్ పేపర్‌లో వస్తున్న కథనాలతో మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ విధంగా మాపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.  సిట్ అధికారులే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు. గత 20 రోజులుగా వార్త  పత్రికల్లో న్యూస్ చూస్తే మేం ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. చార్జీషీట్‌లో ప్రతి పేరా గురించి పత్రికల్లో రాశారు. ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. నేను కోర్టులో ఈ విషయం చెప్పాను. కాబట్టి రేపట్నుంచి సిట్ మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అయినా అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం అని  ఆవేద వెలిబుచ్చారు.  

అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం

  ఏపీ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఈ కేసు తదుపరి విచారణకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జీషీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2022 మే 19న రాత్రి కాకినాడలో సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరి చేసిన విషయం తెలిసిందే.  అనంతబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించగా.. మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యాడు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కేసు విచారణ సరిగా జరగలేదని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరోసారి విచారణకు ఆదేశించగా.. పోలీసులు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   

మాజీ మంత్రి అనిల్‌ యాదవ్‌కు బిగిస్తున్న ఉచ్చు

  వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని ఏపీ పోలీసులు  హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. క్వార్జ్ మైనింగ్ స్కామ్‌లో అనిల్‌కుమార్ యాదవ్ పాత్రపై కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. అనిల్, కాకాణితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ పోలీసులకు తెలిపినట్లు టాక్. 2023 ఆగస్టు నుంచి అనిల్, కాకాణితో క్వార్జ్ వ్యాపారం చేశాను. లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశామని వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు.  పర్యవేక్షించినందుకు నాకు టన్నుకు రూ.1000 ఇచ్చేవారు.. క్వార్జ్‌ను ఏనుగు శశిధర్‌రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్లం. శశిధర్‌రెడ్డికి ఎకరాకు రూ.25 వేలు ఇచ్చేలా ఒప్పందం. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వార్జ్‌ను చైనా పంపాం.’’ అని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. దీంతో తదుపరి చర్యలపై పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు. నాయుడుపేట వద్ద 50 ఎకరాల్లో వెంచర్ వేశామని  హైదరాబాద్‌లోనూ రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేశామని మణికొండ అల్కాపురి, తుర్కయాంజల్‌లో వెంచర్లు వేశామని శ్రీకాంత్‌ పేర్కొన్నారు. మణికొండ అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్ పేరిట వెంచర్ - తుర్కయాంజల్‌లో గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్ వేశాం - 2024లో ప్రభుత్వం మారాక హైదరాబాద్‌కు మకాం మార్చాని కేసులకు భయపడి హైదరాబాద్‌కు మకాం మార్చాని శ్రీకాంత్‌రెడ్డి పోలీసుల విచారణలో తెలిపారు.     

ఏపీలో జిల్లాల పేర్లు మార్పుపై కేబినెట్ సబ్‌కమిటీ

  ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు మార్పుపై ఏడుగురు మంత్రులతో ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, బీసీ జనార్ధన్‌రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై డిమాండ్లు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాల మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  జిల్లా, రెవెన్యూ డివిజన్‌, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం సూచించింది. సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని, జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించింది.  

త‌ల్లిని తలుచుకోని.. భావోద్వేగానికి గురైన మంచు ల‌క్ష్మీ

  ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి సందడి చేశారు. పట్టణంలోని రాజగోపాలపురంలో టీచ్‌ ఫర్‌ చేంజ్‌ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ను మంచు లక్ష్మి ప్రారంభించారు. డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించేందుకు విచ్చేసిన సినీనటి మంచు లక్ష్మికి స్థానిక నాయకులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పూలమాలలు, శాలువలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు.   మంచు లక్ష్మీని చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు, బంధువులు అధిక సంఖ్యలో తరలివచారు. ముందుగా నాయుడుపేటలోని అమరాగార్డెన్‌లో ఉన్న అమ్మగారి స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో టీచ్‌ఫర్‌ చేంజ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 320 పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు మంచు లక్ష్మి తెలియజేశారు.  అమ్మమ్మ గారి ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ రూమును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.  అధునాతన సాంకేతికతతో విద్యార్థులకు డిజిటల్ క్లాస్‌ రూమ్‌ అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు.  విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకుని చదువుల్లో ఉన్నతంగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సనత్‌కుమార్‌, ఎంఈఓ బాణాల మునిరత్నం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ రఫీ, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.   

టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు

  తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా  పరిపాలనా భవనం  నిర్మాణం చేయాలని, .తిరుమలలో మూడో క్యూకాంప్లెక్స్‌ నిర్మాణ అవసరంపై చర్చించి, నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం కమిటీ, తిరుమల ఆలయాల నిర్మాణాలపై విధివిధానాలపై అధ్యయనానికి సబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధి, శ్రీవారి సేవలో ప్రొఫెషనల్స్‌ వినియోగానికి ఆమోదం, సైబర్‌ నేరాల నియంత్రణకు సైబర్‌ క్రైమ్‌ లాబ్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం నిర్వహణ మరింత మెరుగుకు చర్యలు,  ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయంలో అన్నప్రసాదాల కోసం కోసం రూ. 3.45 కోట్లు కేటాయించాలని, కడపలో పురాతన శివాలయం జీర్ణోద్ధరణకు తీర్మానం చేశామని చెప్పారు. 600 మంది వేదపారాయణదారులకు సంభావన కోసం రూ. 2.16 కోట్లు , 142 మంది డ్రైవర్ల క్రమబద్దీకరణ, శ్రీవాణి నిధులతో భజన మందిరాల నిర్మాణాలకు అనుమతినిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో టీటీడీ  అధికారులు పాల్గొన్నారు.

మొన్న క్విడ్‌ ప్రోకో..ఇవాళ కిక్ బ్యాక్స్..జ‌గ‌న్ చిక్కే ఛాన్సెంత‌?

  జ‌గ‌న్ స్టైలే వేర‌బ్బా. చాలా మంది చంద్ర‌బాబే సంప‌ద సృష్టిలో టాప్ అంటారుగానీ అదంతా ఉట్టిది. ఇది కేవ‌లం రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారం. అదే సొంతంగా సంపాదించ‌డంలో జ‌గ‌న్ త‌ర్వాతే ఎవ‌రైనా. గ‌తంలో తండ్రి అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రో కో ద్వారా భారీ ఎత్తున అవినీతికి తెర‌లేపారా? అదే ఇప్పుడు మ‌ద్యం కుంభ‌కోణంలో వినిపిస్తున్న కొత్త ప‌ద‌జాలం.. కిక్ బ్యాక్స్. ఈ కిక్ బ్యాక్స్ ఇప్పుడు క‌ర‌ప్ష‌న్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి వ‌ర‌కూ ఏ1 టు ఏ 38 ఒక సిండికేట్ గా ఏర్ప‌డి.. వీరు చేసిన విధ్వంసం విలువ 3500 కోట్లు. ఈ మొత్తం నాలుగైదు చేతులు మారి ఫైన‌ల్ గా చేరింది జ‌గ‌న్ కే అంటారు. ఛార్జ్ షీట్ లో కూడా జ‌గ‌న్ పేరు ప్ర‌ముఖంగానే ప్ర‌స్తావించారు. అయితే జ‌గ‌న్ కి చేరిన‌ట్టు గ‌ల ఆధారాలు సంపాదించ‌డం అంత తేలికేనా? అన్న‌దొక ప్ర‌శ్న‌. గ‌తంలో కూడా జ‌గ‌న్ ఇలాగే.. క్విడ్ కో ప్రో ద్వారా ఎవ‌రికీ చిక్క‌కుండా చేసిన హ‌డావిడి హంగామా ప‌త్రిక‌ల్లో  క‌నిపించింది త‌ప్ప‌.. పెద్ద గొప్ప‌గా జ‌గ‌న్ ఇరుక్కున్న‌దేం లేదు. పైపెచ్చు ల‌క్ష కోట్ల‌ని చెప్పి చివ‌రికి తేల్చింది 12 వంద‌ల కోట్ల‌క‌న్నా మించి లేదు. దానికి తోడు అవ‌న్నీ కూడా తండ్రి హ‌యాంలో జ‌రిగిన‌వి. కాబ‌ట్టి ఇవేవీ పెద్ద నిల‌బ‌డే కేసులు కావ‌న్న కోణంలో ఉండ‌వ‌ల్లి లాంటి వారినోటి నుంచి విన‌వ‌చ్చిందీ వినే ఉంటాం. ఇపుడీ లిక్క‌ర్ కేసు ప‌రిస్థితేంటి? అన్న‌దొక చ‌ర్చ‌. ఇందులో పెద్ద పెద్ద తిమింగ‌లాలు బ‌య‌ట ప‌డ‌తాయి, ప్ర‌పంచంలో అతి పెద్ద మ‌ద్యం కేసు అని మంత్రి కొల్లు చెబుతున్నారుగానీ.. అతి పెద్ద తిమింగ‌లం ఎవ‌రు? ఆ తిమింగ‌లాన్ని ఎలా అరెస్టు చేస్తారంటే అందుకు త‌గిన ఆధారాలున్న‌ట్టే క‌నిపించ‌డం లేదు.  రాజ్ కేసిరెడ్డి  నుంచి చెవిరెడ్డి వ‌ర‌కూ సాగించిన ఈ లిక్క‌ర్ లీల‌లో సొమ్మంతా జ‌గ‌న్ కి చేరిన‌ట్టు చెబుతున్నారు కానీ అందుకు త‌గిన ఆధారాలు కేవ‌లం నోటిమాట‌లుగానే తెలుస్తున్నాయి. ఈ వాంగ్మూలాల‌తో జ‌గ‌న్ ని బుక్ చేయ‌డం అంటే సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అన్న‌ది మ‌రొక ప్ర‌శ్న‌. జ‌గ‌న్ ఎప్పుడూ త‌న వైపు త‌ప్పు ఉండేలా చేసుకోరు. అది క్విడ్ ప్రో  కోలో అయినా, కిక్ బ్యాక్స్ వ్య‌వ‌హారంలో అయినా. ఎవ‌రెంత మొత్తుకున్నా.. ఆయ‌న‌కంటూ ఒక లూప్ హోల్ పెట్టుకుని అందులోంచి త‌ప్పించుకోవ‌డం త‌న‌దైన క‌రెప్ష‌న్ స్టైల్. కాబ‌ట్టి ఆ తిమింగ‌లం అంత తేలిగ్గా చిక్కేది కాద‌ని అంటారు కొంద‌రు న్యాయ‌నిపుణులు.  

అచ్యుతానందన్.. ఎర్ర జెండా నీడలో వందేళ్ల ప్రస్థానం!

భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ఆవిర్భావానికి  కొంచెం అటూ ఇటుగా, జన్మించిన కురువృద్ద కమ్యూనిస్ట్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి  వీఎస్ అచ్యుతానందన్  మృతితో  భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. అవును.. భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపోయి,సిపిఎంను ఏర్పాటు చేసిన కమ్యూనిస్ట్ నాయకుల్లో చిట్టచివరి నేత  కామ్రేడ్ అచ్యుతానందన్  అస్తమయంతో సిపిఎం తొలి తరం నేతల్లో చిట్ట చివరి జ్యోతి ఆరిపోయింది. 1923 అక్టోబర్ 20న కేరళలో వెనుకబడిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్, 101 సంవత్సరాల వయసులో 2025 జూలై 21 న కన్నుమూశారు.  అచ్యుతానందన్  అంతగా చదవు ‘కొన’ లేదు. పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే ఆయన చదువుకు స్వస్తి చెప్పారు. బాల్యం లోనే  టైలరింగ్  నేర్చుకుని కొంత కాలం అదే వృత్తిలో కొనసాగారు. ఆ తర్వాత కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో చేరి.. తద్వారా కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. ఎర్ర జెండా పట్టుకున్నారు.  అలా.. వామపక్ష ఉద్యమంలో అడుగు పెట్టిన అచ్యుతానందన్ తుది శ్వాస విడిచేవరకూ ఎర్రజెండాను వదలలేదు. 17 సంవత్సరాల నవ యవ్వనంలో, 1940లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడయ్యారు. ఇక అక్కడి నుంచి ఉద్యమ బాటలో ముందుకు సాగారు. ట్రావెన్‌కోర్ సంస్థానానికి చెందిన భూస్వాములపై పోరాటం చేసి జైలుకు సైతం వెళ్లారు. అయితే.. 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) నిట్ట నిలువునా చీలిన సందర్భంలో అచ్యుతానందన్  సీపీఐ జాతీయ కౌన్సిల్‌  సభ్యత్వానికి రాజీనామా చేసి  సీపీఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలి సారిగా, 1967లో కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టిన అచ్యుతానందన్  2016 వరకు, ఇంచు మించుగా అర్థ శతాబ్దం పాటు  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేరళ చరితలోనే కాదు, బహుసా దేశ చరిత్రలో కూడా ఇంత సుదీర్ఘ కాలం ఎమ్మెల్యే కొనసాగిన   నాయకుడు అచ్యుతనందన్ వినా మరొకరు ఉండి ఉండకపోవచ్చు. అలాగే  అచ్యుతానందన్  తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో  మూడు సార్లు విపక్షనేతగా.. ఒకసారి ముఖ్యమంత్రిగా పని చేశారు. అన్నిటినీ మించి నిబద్దతగల కమ్యూనిస్ట్  గా  జీవించారు. కమ్యూనిస్ట్  గానే జీవితం చాలించారు.  అందుకే..  రాజకీయలకు అతీతంగా అనేక మంది రాజకీయ రాజకీయేతర ప్రముఖులు  దివంగత నేతకు నివాళులు అర్పించారు. అంతిమ వీడ్కోలు పలికారు. నిజాయితీగా, ప్రజాహితం కోసం పని చేసి.. ఆదర్శ నేతగా ఆచ్యుతానందన్ నిలిచారని కొనియాడారు.

విపక్షాల ఆందోళన రెండో రోజు లోక్ సభ వాయిదా

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండవరోజు ఎలాంటి చర్చ లేకుండా వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల ఆందోళన బీహార్‌లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR), ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రవాద దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలతో మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అటు నిరసన హోరుతో సభను రోజంతా వాయిదా వేసి, రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.  కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, విపక్షాలు చర్చకు డిమాండ్ చేస్తూనే సభను నడవనీయకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ ఆందోళనల నడుమ, రాజ్యసభలో షిప్పింగ్ డాక్యుమెంటేషన్ చట్టాలను ఆధునీకరించే లాడింగ్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, లోక్‌సభలో వాయిదా తీర్మానాలపై చర్చ జరగలేదు. హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  కోరారు. నగరానికి సెకండ్ ఫేజ్ మెట్రో మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవాళ లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రో రెండో దశ గురించి  ఎంపీ చామల మాట్లాడారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగా నగరం అని ఇది దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతోందన్నారు.  

తిరుమ‌ల‌ మూడో క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. పరిశీలనకు నిపుణుల కమిటీ

తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఘం క్యూ కాంప్లెక్స-3 నిర్మాణానికి సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణుల కమిటీని వేయాలని తరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించింది. తిరుమల లోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశ వివరాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు తెలిపారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు (లాంజ్ లు) ఏర్పాటుకు గల అవకాశాలను అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.  అలాగే అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా మౌలిక వసతుల కల్పన, భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఇక తిరుమలలో శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత పర్యాటక ఆకర్షక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది.   తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది.సీఎం  నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల  మేరకు తిరుమల వేంకటేశ్వరుని  వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, వివిధ దేశాల్లో       శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై  టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ  నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని  నిర్ణయించింది.   తిరుమలలోని కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మరింత మెరుగైన సౌకర్యాలతో పాటు పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించింది.   తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.    అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించేందుకు టీటీడీ ఆమోదంచింది.  

ఏపీ లిక్క‌ర్ స్కామ్ ఛార్జ్ షీట్ .. దిమ్మ‌తిరిగే నిజాలు వెలుగులోకి

మ‌ద్య‌పాన  నిషేధం అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో ఏకంగా మద్యం కుంభకోణం చేసి 3500 కోట్ల మేర అవినీతికి  పాల్పడ్డారని సిట్ అంటోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో  సిట్ వేసిన 305 పేజీల‌ ఛార్జ్ షీట్ లో ఈ స్కామ్ లో కీల‌క పాత్ర పోషించినది  ఏ 1 రాజ్ కేసిరెడ్డి. అంతే కాదు ఈ డ‌బ్బుల‌తో ఆయ‌న గ‌చ్చిబౌలిలో ఒక ప్లాట్ ఆపై వివిధ ప్రాంతాల్లో 92 ఎక‌రాల మేర త‌న త‌ల్లి,  త‌న‌ సంస్థ ఎషాన్ ఇన్ ఫ్రా పేరిట ఈ భూములు కొన్న‌ట్టుగా  గుర్తించారు విచార‌ణాధికారులు. ఈ భూముల  విలువ   110 కోట్ల మేర ఉంటుందంటున్నారు. ఇదిలా ఉంటే ఈ బినామీ సొమ్మును ప‌రి ప‌రివిధాలుగా ఖ‌ర్చు చేయ‌డానికి  రాజ్ కేసిరెడ్డి, అత‌డి అనుచ‌ర గ‌ణం.. ప్ర‌య‌త్నంచిన‌ట్టు తెలుస్తోంది. జాంబియా, టాంజీనియా వంటి ఆఫ్రిక‌న్ దేశాల్లో మైనింగ్ చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలు కూడా వీరు ప‌రిశీలించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ దిశ‌గా వీరు ఆయా దేశాల‌కు ట్రిప్పులు వేసిన‌ట్టు కూడా గుర్తించారు విచార‌ణాధికారులు.  యూఏఈ, యూకేల్లోనూ  ర‌క‌ర‌కాల కంపెనీలు స్థాపించిన‌ట్టు గుర్తించారు. ఇందుకోసంగానూ రాజ్ కేసిరెడ్డి అండ్ కో ఏకంగా 28 సార్లు ఫారిన్ టూర్లు వేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్నిక‌ల్లో న‌గ‌దు పంప‌కాల కోసం ఎంత మొత్తం వాడార‌ని చూస్తే.. సుమారు 200 కోట్ల రూపాయ‌ల మేర‌.. ఈ మ‌ద్యం డ‌బ్బులోంచి వాడిన‌ట్టు సిట్ గుర్తించింది  ఇందుకోసం హైద‌రాబాద్, తాడేప‌ల్లిలో కొన్ని స్థావ‌రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు చెబుతున్నారు విచారణాధికారులు. ఇదంతా ఏ 38 చెవిరెడ్డి అధ్వ‌ర్యంలో న‌డిచిన‌ట్టు స‌మాచారం. ఈయ‌న సూచ‌న‌ల మేర‌కు ఎక్క‌డెక్క‌డి నుంచి ఎంతెంత మొత్తం సొమ్ము ఎక్క‌డికి త‌ర‌లించాలో ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు చెబుతున్నారు. ఒక సారికి ఒక ట్రిప్పులో 8 నుంచి 12 కోట్ల రూపాయ‌ల మేర సొమ్ము త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు  తుడా వాహనాల‌ను సైతం వాడిన‌ట్టు గుర్తించారు.ఇలా ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి కూడా ఈ మ‌ద్యం సొమ్ము వాడిన‌ట్టు గుర్తించింది సిట్. ఇప్ప‌టి వ‌ర‌కూ అరెస్ట‌యిన వారిలో మిథున్ రెడ్డి రెండో రాజ‌కీయ ప్ర‌తినిథి కాగా.. మిగిలిన వారు ఎప్పుడ‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింది.  ఏ5 విజ‌య‌సాయిరెడ్డి ఎప్పుడు అరెస్టు అవుతార‌న్న‌ది స‌స్పెన్స్ గా మారింది. అయితే ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చి.. అప్రూవ‌ర్ గా మారడానికి సిద్ధంగా ఉన్నారు. అదలా ఉంటే ఆల‌స్యం అవుతుందేమోగానీ ఆయన అరెస్టు మాత్రం ప‌క్కా అంటున్నారు. ఎందుకంటే విజ‌య‌సాయిరెడ్డి ఇన్వాల్వ్ మెంట్ ఈ మొత్తం ఇష్యూలో రెండు మూడు ప్ర‌ధాన‌మైన ఘ‌ట్టాల్లో ఉన్న‌ట్టు సిట్ గుర్తించింది. మ‌రి చూడాలి  మంత్రి కొల్లు ర‌వీంద్ర చెప్పిన‌ట్టు త‌ర్వాతి బిగ్ వికెట్ ఎవ‌రిదో తేలాల్సి ఉంది.

చెవిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు

  ఏపీ మద్యం కుంభ కోణ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన పీఏ బాలాజీ కుమార్ యాదవ్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ జగ్గయ్యపేట వద్ద టోల్‌గేట్ సమీపంలో రూ.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఘటనపై వివరణ సిట్ ఆదేశించింది. అలాగే ఇండోర్‌లో బాలాజీ అరెస్ట్ వేళ తాము సీజ్ చేసిన రూ. 3.50 లక్షల సొమ్ము లిక్కర్ స్కాందేనని భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇదివరకే ఒకసారి చెవిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.  ఏసీబీ కోర్టులో తన వాదనలు వినిపించుకునే క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని న్యాయాధికారికి చెప్పిన చెవిరెడ్డి.. తనను మద్యం వ్యాపారం చేయవద్దని తండ్రి చెప్పినట్టు వెల్లడించారు. తండ్రి, తమ్ముడు చనిపోవడంతోనే తాను లిక్కర్ జోలికి వెళ్లలేదని, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్నందుకు బాధగా ఉందని‌ కోర్టులో ఎమోషనల్ అయ్యారు తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఒకవైపు లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మరోవైపు తుడా ఉచ్చు బిగుసుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.380 కోట్ల పైచిలుకు ఇష్టానుసారంగా ఖర్చు చేసినట్లు విజిలెన్సు అధికారులు గుర్తించారు. ఈ కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 11 మంది నిందితులకు రిమాండ్‌ ముగియడంతో సిట్‌ అధికారులు  కోర్టులో హాజరుపర్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి సహా 11 మందికి రిమాండ్‌ను పొడిగించింది.

గాల్లో గెలిచిన..గాలి నా కొడుకులు..రోజా సంచలన వ్యాఖ్యలు

  వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి రెచ్చిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాలిలో గెలిచిన..గాలిన కొడుకులు ఎక్కువయ్యారంటూ కూటమి నేతలపై మండిపడ్డారు. వైసీపీ వస్తే టీడీపీ, జనసేన అమెరికా పారిపోవాలి. ఇప్పుడు సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ హైదారాబాద్ పారిపోతున్నారు. రేపు అమెరికా పోతారు. పవన్ కళ్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరింది. ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టానంటాడు అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారంలో ఉన్నామని టీడీపీ, జనసేన నేతలు ఇష్టం వచ్చినట్టు వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టి దాడులు చేస్తే తాము వంద రెట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించ్చారు. రోజా తన శాఖల ద్వారా చేసిన అభివృద్ధి శూన్యమని, సభ్యసమాజం తలదించుకునేలా నోరు పారేసుకోవడమే ఆమె పని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా, వైసీపీ హయాంలో మాజీ మంత్రి రోజా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమె త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమని టీడీపీ కీలక నేతలు అంటున్నారు.

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్.. భారత్‌కు లక్ కలిసొచ్చేనా?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో ఇండియాని అదృష్టం వెక్కిరిస్తోంది. భారత్ యువ జట్టు ఇంగ్లాండ్ టూర్ లో మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్నప్పటికీ లక్ మాత్రం కలిసి రావడం లేదు. కాస్త అదృష్టం తోడైతే భారత్ ఇప్పిటికే  3-0 ఆధిక్యంతో నిలిచి సిరీస్ కైవసం చేసుకునేదని క్రీడా పండితులు అంటున్నారు.  అటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో మంచి ప్రదర్శన చేసిన భారత్ కీలక సమయాల్లో పట్టు నిలబెట్టుకోలేక రెండు మ్యాచ్‌లను చేజార్చుకుని 1-2తో వెనుకబడి ఉంది. లార్డ్స్‌లో చివరి వరకు పోరాడి ఓడిన టీమ్ ఇండియా ఇప్పుడు కీలకమైన నాలుగో టెస్టుకు రెడీ అవుతోంది. ఆతిథ్య జట్టుతో బుధవారం (జులై 23)  మాంఛెస్టర్ లో కీలక  నాలుగో టెస్టులో తలపడనుంది.  మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాపోర్డ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకంగా మారింది. ఇందులో ఓడితే టీమ్ ఇండియా సిరీస్ ఆశలు ఆవిరవుతాయి.  ఇలాంటి తరుణంలో భారత జట్టుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అక్కడ ఇంగ్లాండ్‌తో  9 టెస్టుల్లో భారత్ 4 మ్యాచుల్లో ఓడిపోయింది. అయిదు డ్రాగా ముగించగలిగింది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో  కూడా విజయంసాధించిన చరిత్ర లేదు.  చివరిగా 2014లో ఆడిన టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో చిత్తైంది.  ఈ సిరీస్‌కు ముందు ఎడ్జ్‌బాస్టన్‌లోనూ టీమ్ ఇండియాకు విజయం దక్కలేదు. అయితే ఈ సిరీస్‌లో భారత్ అక్కడ అద్భుత విజయం సాధించింది.  దాంతో గత రికార్డులను పట్టించుకోకుండా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌ని భారత్ స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉందంటున్నారు. ఇప్పటి వరకు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని సరైన వ్యూహంతో ముందుకెళ్లాలని యువ క్రికెటర్లకు సూచిస్తున్నారు టీమ్ ఇండియా సీనియర్లు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ కవ్వింపులకు నోటితో సమాధానం చెప్తూనే ఆటతో వాళ్ల నోళ్లు మూయించాలంటున్నారు. అప్పుడే మాంచెస్టర్‌లో టీమ్ ఇండియా తొలి విజయం నమోదు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది. సో బెస్ట్ ఆఫ్ లక్ టీమ్ ఇండియా.

ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రధాని మోదీ స్పందించారు. వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయని తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదికగా ప్ర‌ధాని పేర్కొన్నారు. కాగా, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  రాజ్యాంగంలోని 67(ఎ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. 74 ఏళ్ల ధన్‌ఖడ్‌ అనారోగ్య సమస్యల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో రెండు సంవత్సరాలు పదవీకాలం ఉండగానే జ‌గ‌దీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడం చర్చకు దారితీసింది.  2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ కావడంతో ఆయన బెంగాల్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరేట్‌ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకుగాను 528 ఓట్లు గెలుచుకుని 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా ఆయ‌న‌ రికార్డు సృష్టించారు  

తదుపరి ఉప రాష్ట్రపతి .. నితీషా? గడ్కరీయా?

ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ చేసిన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఇక ఇప్పుడు నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం. ఇక్కడే ధన్ ఖడ్ రాజీనామాకు కారణాలేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు, ధన్ ఖడ్ రాజీనామాకూ ముడి పెడుతూ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎలాగైనా విజయం సాధించితీరాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే ధన్ ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిని బీహార్ కు చెందిన నాయకుడితో భర్తీ చేయాలని భావిస్తోంది. అసలు అలా బీహార్ కు చెందిన నేతను  ఉప రాష్ట్రపతి చేయాలన్న ఉద్దేశంతోనే ధన్ ఖడ్ చేత రాజీనామా చేయించిందా? అన్న అనుమానాలు కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అదంతా వేరే చర్చ. ఇప్పుడు ఇక ధన్ ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని ఎవరితో భర్తీ చేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ధన్ ఖడ్ స్థానంలో ఎవరు అన్న విషయంలో రాజకీయవర్గాలలో పలు పేర్లు తెరమీదకు వస్తున్నాయి. నితిన్ గడ్కరీ నుంచి నితీష్ కుమార్ దాకా ఈ పేర్ల జాబితా కొండవీటి చాంతాడంత ఉందని అంటున్నారు. అయినా అన్ని పేర్లలోనూ ప్రముఖంగా వినవస్తున్న పేర్లు మాత్రం నితిన్ గడ్కరి, బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పేర్లు ఉన్నాయి.  అయితే ఈ ఇద్దరూ కూడా క్రియాశీల రాజకీయాలలో చాలా చాలా చురుకుగా ఉన్నవారే. వీరు క్రియాశీల రాజకీయాలకు దూరం కావడానికి అంగీకరిస్తారా? ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టడానికి అంగీకరిస్తారా? అంటే సందేహమే అన్న అభిప్రాయమే పరిశీలకుల నుంచి వినవస్తుంది.  ముందుగా నితిన్ గడ్కరీ విషయాన్నే తీసుకుంటే..  ప్రధాని పదవికి రేసులో ఉన్న నితిన్ గడ్కరినీ సైడ్ లైన్ చేయడానికి మోడీ షా ద్వయం వ్యూహాత్మకంగా ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే అందుకు నితిన్ గడ్కరీ ఎందుకు అంగీకరిస్తారన్న ప్రశ్న కూడా గట్టిగా వినిపిస్తోంది. అయినా బీహార్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ కు నచ్చని పని చేసే ధైర్యం మోడీ, షా చేస్తారా? అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఎవరు కాదన్నా.. మోడీకి ప్రత్యామ్నాయం నితిన్ గడ్కరి అన్న భావన సంఘ్ పరివార్ లో బలంగా ఉంది. 75 సంవత్సరాల పరిమితిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ నొక్కి మరీ ప్రస్తావించడం వెనుక మోడీ ఇక ప్రధానిగా దిగిపోవాలన్న సూచనే ఉందని అంటున్నారు. ఒక వేళ మోడీ 75 ఏళ్ల పరిమితికి తలొగ్గి  దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడితే.. నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ మద్దతు, ఆశీర్వాదాలతో పీఎం పదవి రేసులో ముందు వరుసలో ఉంటారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి వారిని బీజేపీ ప్రతిపాదించి రేసులో నిలబెట్టినా వారంతా నితిన్ తరువాతి స్థానాలకే పరిమితమైతారని పరిశీలకులు అంటున్నారు.  ఈ నేపథ్యంలో.. వ్రతం చెడినా ఫలం దక్కితే చాలన్నట్లుగా బీజేపీ అధినాయకత్వం బీహార్  ఎన్నికలపైనే దృష్టినంతా కేంద్రీకరిస్తుందంటున్నారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి ఇప్పుడు ఓ సవాల్ గా మారింది. సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న నితీష్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన అంత చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆరోగ్యం కూడా సరిగా లేదని అంటున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ, జేడీయూ సీఎం ఫేస్‌గా ఈ సారి నితీష్‌ను కాకుండా కొత్త వ్యక్తిని చూపించాలనుకుంటున్నారు. అయితే సీఎం నితీష్ ను తప్పించడం వల్ల బలమైన వర్గం అసంతృప్తికి గురైతే మొదటికే మోసం వస్తుంది. అందుకే నితీష్ ను అత్యున్నతంగా గౌరవిస్తున్నామని చెప్పేందుకు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. నితీష్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే.. సుదీర్ఘకాలంగా సీఎం పదవిలో ఉన్న నితీష్ పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఈ తరుణంలో నితీష్ ను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ ఎన్నికలకు వెళ్లడం ఆత్మహత్యాసదృశంగా బీజేపీ భావిస్తోంది. అందుకే నితీష్ కు ఉపరాష్ట్రపతి తాయిలం ఇచ్చి పక్కన పెడితే.. బీహార్ లో విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందన్న అంచనాతో ఉంది. అందుకే నితీష్ ను ఉపరాష్ట్రపతిగా ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రతిపాదనకు నితీష్ అంగీకరిస్తారా అన్నదే చూడాల్సి ఉంది. ఇంకా ఉపరాష్ట్రపతి రేసులో శిశిథరూర్ పేరు కూడా వినిపిస్తోంది. అసలింతకీ బీజేపీ వ్యూహం ఏమిటి?  తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది.  

మిథున్ రెడ్డి జైలు ఎపిసోడ్.. కోర్కెల చిట్టా వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

  ఒక టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి భోజనం, మంచం, దోమ తెర,  యోగ మ్యాట్,  వాకింగ్ షూస్, వార్త పత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి ఐదు రోజులు ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు, రెగ్యులర్ మెడిసిన్, నోట్  బుక్స్, పెన్స్. ఇదీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలిక నిందితుడు మిథున్ రెడ్డి జైల్లో కావాలని అడిగిన సౌకర్యాలు. ఈ మేరకు ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు ఆయన కోరినవన్నిటికీ సమకూర్చమని జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.  జులాయి అనే సినిమాలో  సినిమాలో బ్ర‌హ్మాంనందం అడిగిన‌ట్టు.. నోట్ బుక్స్ పెన్స్ కూడా అడ‌గ‌టం చూస్తుంటే... ఇప్ప‌టి వ‌ర‌కూ వేసిన లిక్క‌ర్ లెక్క‌లు చాల‌వ‌నా.. కొత్త‌గా జైల్లో కూడా లెక్క‌లు వేయాలా? అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.  ఇదిలా ఉంటే ఒక రాజ‌కీయ ప్ర‌ముఖుడు జైలుకెళ్లాడ‌ని తెలిసిన వెంట‌నే ఇలాంటి వార్త‌లు త‌ర‌చూ వ‌స్తుంటాయ్. బేసిగ్గా రాజ‌కీయ రిమాండ్ ఖైదీల విష‌యంలో అధికారులు కూడా ఏమంత క‌టవుగా ఉండ‌రు. వారికి తోచినంత‌లో వారు వీరికి మ‌ర్యాద‌లందిస్తూనే ఉంటారు.