మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు : హోం మంత్రి

  బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో కోస్తాంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాల అంచన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. వర్షాలు, ష్లడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందుస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు హోం మంత్రి ఆదేశించారు. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆదేశించారు.  రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై విపత్తు నిర్వహణ ఎండీ ప్రఖర్‌ జైన్‌, సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ వైపు కదులుతుందన్నారు. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు.. రాయలసీమ ప్రాంతంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని చెప్పారు.  తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. వరద ముప్పు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని హాట్‌స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి అని కలెక్టర్లకు హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ లో  112, 1070, 1800-4250101 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలను ఆమె కోరారు.

శ్రీల‌క్ష్మి ఐఏఎస్ కి తెలంగాణ హైకోర్టు షాక్

ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందే . గతంలో ఇదే తెలంగాణ హైకోర్టు  ఇదే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయం లేదని పేర్కొంటూ, ఆ కేసునుంచి తప్పించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. అదే తెలంగాణ హైకోర్టు ఇప్పుడు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయంపై విచారించేందుకు సీబీఐ, ఈడీలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి నేతృత్వంలో జ‌రిగిన ఓబులాపురం మైనింగ్ అక్ర‌మాల వ్య‌వ‌హా రంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మిని విచారించాల్సిందేన‌ని.. ఆ అక్రమాలలో ఆమె పాత్ర సుస్ప‌ష్టంగా ఉంద‌ని.. తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఆమెను విచారించేందుకు సీబీఐ, ఈడీల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు తేల్చి చెప్పింది.  ఇదే కోర్టు గ‌తంలో గ‌నుల కేసులో శ్రీల‌క్ష్మికి ప్ర‌మేయం లేద‌ని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను కేసు నుంచి త‌ప్పించాల‌ని సీబీఐ, ఈడీల‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సీబీఐ, ఈడీలు.. ఈ ఉత్త‌ర్వుల‌ను సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు, ఈ కేసులో శ్రీల‌క్ష్మి పాత్ర స్ప‌ష్టంగా ఉంద‌ని తెలుస్తోంద‌ని..  ఆమెను కేసు నుంచి ఎలా త‌ప్పిస్తార‌ని నిలదీస్తూ..  మ‌రోసారి దీనిపై హైకోర్టు విచార‌ణ చేసి.. ఆదేశాలు ఇవ్వాల‌ని పేర్కొంది. దీంతో హైకోర్టులో మ‌రోసారి శ్రీల‌క్ష్మి.. త‌నను ఈ కేసు నుంచి త‌ప్పించాల‌ని కోరుతూ.. రివిజ‌న్ పిటిష‌న్ దాఖలు చేశారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో శ్రీల‌క్ష్మి కేసును విచారించాల్సిందేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. సీబీఐ వాదనలు వినకుండా గ‌తంలో ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఉప‌సంహ‌ రించుకుంటున్నట్లు హైకోర్టు పేర్కొంది.  వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కేటాయించిన ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి అన్ని అనుమతులనూ శ్రీల‌క్ష్మి  ఇచ్చార‌ని.. ఆమె ఉద్దేశ పూర్వకంగానే ఈ అక్ర‌మాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌నీ సీబీఐ ఆరోపిస్తోంది.  అయితే,  ప్ర‌భుత్వం తీసుకున్న విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కు మాత్ర‌మే తాను అనుమ‌తి ఇచ్చాన‌ని, అధికారిగా త‌న పాత్ర పోషించాన‌ని శ్రీల‌క్ష్మి చెబుతున్న శ్రీలక్ష్మి ఈ కేసు నుంచి తనను తప్పించాలని కోరుతున్నారు. 

కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్‌ఫ్యూజన్

వరుస పరాజయాలు మూటగట్టుకున్న గులాబీ పార్టీలో నెలకొన్న వివాదాలు, ఆధిపత్యపోరు ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కారు పార్టీని తిరిగి రేసులోకి తీసుకురావాల్సిన పార్టీ ముఖ్యనేతలు,  అందులోనూ కల్వకుంట్ల వారసులు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ వర్గాకు అసలు మింగుడుపడటం లేదంట.  తాజాగా కవిత జాగృతి వర్సెస్ పార్టీ అనుభంద సంస్థ బీఆర్ఎస్వీ పోటాపోటీగా ఓకే రోజూ శిక్షణ తరగతులు, వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది. ఒకే రోజు జాగృతి ఒకవైపు.. బీఆర్ఎస్వీ మరోవైపు కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో ఆధిపత్య పోరు అన్నాచెల్లెళ్ల సవాల్ అన్నట్లుగా మారిందనే చర్చ నేతల్లో నడుస్తోంది. జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉంది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా.. ఒకే రోజు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ కేడర్ లో మాత్రం గందరగోళానికి తెరదీసిందట. బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత ఇద్దరూ కీలక నేతలు. ఇద్దరూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసులే. పార్టీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నప్పటికీ సొంత జాగృతి సంస్థ బలోపేతంపైనే ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ జాగృతి ఆధ్యర్యంలోనే కార్యక్రమాలు చేపడుతూ యాక్టివ్ అవుతున్నారు. కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ విద్యార్థి విభాగం నేతలను పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  అయితే ఒకే రోజు ఇటు జాగృతి శిక్షణ తరగతులు, అటు బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వేదికలు వేర్వేరు ప్రాంతాలు అయినప్పటికీ ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు కల్వకుంట్ల వారసులు  ప్రకటించారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే లీడర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత రెండు సెషన్లుగా నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్వీ సదస్సుకు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలు హాజరై రెండు సెషన్లలో పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో ఆయోమయానికి, గందరగోళానికి కారణమైందట.  ఎందుకు ఒకేసారి అన్నచెల్లెలు ఒకే సారి వేర్వేరుగా ప్రోగ్రాంలను ఫిక్స్ చేశారు?  అసలు కారణం ఏంటి?  ఒకరు ఒక తేదీలో.. మరొకరు ఇంకో తేదీలో శిక్షణ తరగతులు నిర్వహించవచ్చుకదా? అన్న చర్చ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. ఆ క్రమంలో అసలు పార్టీలో ఏం జరుగుతుందనేది తెలియక కేడర్ లో అయోమయం నెలకొందట. కవిత యువత, విద్యార్థులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో జాగ‌ృతిని యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు. యువత, మహిళలు, బహుజనులు రాజకీయాల్లో రావాలని ప్రతీ సందర్భంలోనూ పిలుపునిస్తున్నారు.  అందులో భాగంగానే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలుత రాష్ట్రస్థాయిలో ‘లీడర్’ పేరుతో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం (జులై26)  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ  కార్యక్రమం నిర్వహించనున్నట్లు  ఆమె గత నెల 15నే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి జాగృతి ప్రతినిధులు రావాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ బాస్ ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు. దాంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  కేటీఆర్ పార్టీని నడిపిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ముఖ్యులందరికీ కేసుల చట్రం బిగుసుకుంటుండటంతో... చిన్నబాస్‌కు పార్టీ నేతల సహకారం  పూర్తి స్థాయిలో లభించడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయినా తనదైన వ్యూహాలు అమలు చేస్తున్న కేటీఆర్  బనకచర్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను బీఆర్ఎస్వీకి అప్పగిస్తూ తాజా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అందుకు తగ్గట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యచరణ సిద్ధంచేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై జంగ్ సైరన్ మోగించేందుకే ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 26న ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం ఉదయం సెషన్ ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభిస్తుండగా... సాయంత్రం సెషన్ లో కేటీఆర్ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని చూస్తున్నారు. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఎవరికి వారే పార్టీ తమకు ప్రాణం అంటూనే .. ఎవరికి వారు సొంతంగా యాక్షన్‌ప్లాన్లు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోకపోయినా.. ఎవరికి వారు సొంత కార్యచరణ మేరకు ముందుకు సాగడం చూస్తుంటే.. వారిరువురి తీరు   గులాబీ పార్టీని మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయన్న అభిప్రాయం పార్టీ లీడర్లు, క్యాడర్ లో వ్యక్తమౌతోంది.

బీజేపీ అధిష్టానంతో విభేదాలే ధన్ ఖడ్ నిష్క్రమణకు కారణం?

ఉపరాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా కు న్యాయమూర్తి వర్మ ఉదంతమే ప్రధాన కారణమని దాదాపుగా నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుల సంతకాలతో వర్మ అభిసంసన తీర్మానం ఆమోదించమే  ధన్ ఖడ్  నిష్క్రమణ కు కారణమైంది. అంతకు ముందే బీజేపీ పెద్దలతో ఆయనకున్న విభేదాలకు ఇది క్లైమాక్స్ గా భావించాల్సి ఉంటుందంటున్నారు. దన్ ఖడ్ రాజీనామాపై ప్రధాని మోదీ మక్తసరి స్పందన, అలాగే రాజీనామా ఉపసంహరణకు ఎలాంటి బుజ్జగింపులు లేకుండా తక్షణ ఆమోదమే ఇందుకు తార్కాణగా చెబుతున్నారు. ఆయన ధిక్కార వైఖరి పట్ల  ఆగ్రహంతో ఉన్న బీజేపీ పెద్దలు ఆయనపై అభిశంసన పెట్టాలని కూడా ఒక దశలో ఆలోచన చేశారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఆయనకు గౌరవ విడ్కోలు పలుకుదామన్న కాంగ్రెస్ ప్రతిపాదన ను కూడా ప్రభుత్వం తిరస్కరించడం కమలనాథులకు ఆయన పట్ల ఉన్న ఆగ్రహ స్థయిని తెలియజేస్తున్నదని చెప్పాల్సి ఉంటుంది. ప్రొటోకాల్ విషయంలో ధన్ ఖడ్ కు కేంద్రానికి  విభేదాలు ఉన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ పర్యటనలో ఈ విషయం ప్రస్ఫుటంగా బయటపడింది. జేడీవాన్స్ తనను కలవకపోవడం వెనుక కేంద్రం పాత్ర ఉందని ధన్ ఖడ్ ఆ సమయంలో బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు.  వాహనాల విషయంలో, మంత్రుల కార్యాలయాల్లో ఫోటోల విషయంలో  కూడా ధన్ ఖడ్, కేంద్రం మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. వి రైతుల గిట్టుబాటు ధర విషయంలో  ధన్ ఖడ్ కేంద్రమంత్రిని నిలదీయడం వంటి సంఘటనలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ వ్యవహారం కూడా ధన్ ఖడ్ కు కేంద్రానికి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైంది.  ఇక చివరిగా రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఖర్గేకు  అధికారపక్ష నేత నడ్డా కంటే ఎక్కువ సమయాన్ని ధన్ ఖడ్ కేటాయించడం ఈ విభేదాలకు పరాకాష్టగా మారింది.  ఇక న్యాయమూర్తి వర్మ అభిశంసన వ్యవహారంలో  న్యాయవ్యవస్థను కూడా బాధ్యత వహించేలా చేయాలంటూ కేంద్రం ఆశలపై ధన్ ఖడ్ నీళ్లు చల్లడంతో  బీజేపీ పెద్దల ఆగ్రహం పీక్స్ కు చేరిందని పరిశీలకులు అంటున్నారు.  ఎన్డీయే ఎంపీల సంతకాలు లేకుండా ప్రతిపక్షాల తీర్మానాన్ని ఆమోదించవద్దని మూడు సార్లు ప్రభుత్వ పెద్దలు   ధన్ ఖడ్ కు సూచించినా ఆయన పట్టించుకోలేదు. ఇలా కేంద్రంతో ఆయన కు పొసగలేదనీ, దీంతో అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. హమ్మయ్య అనుకుని కేంద్రం వెంటనే ఆయన తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్నదానిపై కసరత్తులలో మునిగిపోయింది.  

గోవాకు అశోకగజపతి రాజు.. గవర్నర్ గా ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతిర రాజు శుక్రవారం (జులై 25) గోవాకు బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాకు బయలు దేరారు. గోవా గవర్నర్ గా నియమితులైన ఆయన శనివారం (జులై 26) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు విజయనగరం నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో గోవాకు చేరుకుంటున్నారు.  గోవా గవర్నర్ గా నియమితులైన తరువాత అశోకగజపతి రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన అశోకగజపతి రాజు పార్టీతో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ  తెలుగుదేశంతోనే ఉన్న అశోకగజపతి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం లోక్ సభ సస్థానం నుంచి ఒక సారి ఎంపీగా విజయం సాధించిన అశోకగజపతి రాజు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.  

మోదీ మరో మెట్టు పైకి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ  విశ్వాసాలతో, ఆయన పరిపాలనా విధానాలతో ఎవరైనా విభేదించవచ్చుకానీ.. భాతర రాజకీయాల్లో ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ  కాదన లేరు. నిజానికి.. స్వతంత్ర భారత రాజకీయాల్లో, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా  ఆరు వరస విజయాలను సొంతచేసుకున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ. వరసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యంత్రిగా విజయం సాధించిన మోదీ..  భారత ప్రధానిగా వరసగా 2014, 2019, 2024లో  హ్యాట్రిక్ సాధించి  డబుల్’ హ్యాట్రిక్’ సాధించిన ఏకైక నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచి పోయారు.  ఇక ఇప్పుడు మోదీ మరో రికార్డు ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంతవరకు దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానిగా స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరున ఉన్న రికార్డును మోదీ సొంత చేసుకున్నారు. ఇందిరాగాంధీ.. 1966 జనవరి  నుంచి 1977 మార్చి  వరకు 4 వేల 77 రోజులు ప్రధాని పదవిలో కొనసాగారు.  కాగా.. 2014 మే 26 న తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ  శుక్ర వారం (జూలై 25, 2025)తో 4,078 రోజులు పూర్తిచేసుకుని ఇందిరాగాంధీ రికార్డు ను అధిగమించి దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. కాగా.. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు (1947-1964) పదవిలో కొనసాగారు.  అనుకోకుండా ఎమ్మెల్యే అయినా కాకుండానే..  2001లో నేరుగా ముఖ్యమంత్రిగా గుజరాత్ శాసనసభలో కాలు పెట్టిన మోదీ 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 2014లో ప్రధానిగా పార్లమెంట్ లో తొలి అడుగు పెట్టారు. మోదీ నాయకత్వంలో   బీజేపీ  2014లో 272 లోక్‌సభ సీట్లతో ఘన విజయం సాధించింది.  2019లో ఈ సంఖ్య 303కు పెరిగింది  ఇది బీజేపీ బలాన్ని స్పష్టం చేసింది.  2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ..  ఎన్డీఏ భాగస్వాముల సహకారంతో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 లో 30 ఏళ్లుగా సాగుతున్న సంకీర్ణ రాజకీయాలకు చుక్కపెట్టిన నేతగా.. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్సేతర  ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు.

తెలంగాణ క్యాబినెట్‌ భేటీ వాయిదా

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం (జులై 25) జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని అధికారవర్గాలు తెలియజేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మంత్రులు  పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఈ కేబినెట్ భేటీ సోమవారం మధ్యాహ్నం జరిగే అవకాశం ఉందని అధికా రవర్గాల సమాచారం.

భార‌తీయుల‌కు ఉద్యోగాలివ్వొద్దు.. ట్రంప్ కామెంట్ల కాక‌

హ‌లో ట్రంప్ ఎక్స్ క్యూజ్  మీ.. మీ దేశంలో మా వాళ్ల ప‌నితీరుకు ఆయా కంపెనీలు ఏం రేంజ్ లో లాభాల బాట‌లో ఉన్నాయో తెలుసా.. తెలియకపోతే ఒక్క‌సారి ఈ వివ‌రాల‌ను చూడండి. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా  పని చేస్తున్నారు సత్య నాదేళ్ల. హైదరాబాద్ లో జన్మించిన ఆయన మైక్రో సాఫ్ట్ ను క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ లీడర్ గా తీర్చి దిద్దారు. ఒకప్పుడు 300 బిలియన్ డాలర్లు గల ఈ సంస్థను 3 ట్రిలియన్ డాల్లకు పైగా పెంచారు. మణిపాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, విస్కాన్సిన్ మిల్వాకీ యూనివర్శిటీ నుంచి ఎంఎస్, చికాగో యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. తన శక్తి సామర్ధ్యాలన్నిటినీ ఉపయోగించి సత్యా నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ని ఒక మహా వృక్షంగా విస్తరింప చేసిన పేరు సాధించారు. గుగుల్ సీఈవోగా మోస్ట్ పాపులర్ అయిన సుందర్ పిచాయ్.. 2015 నుంచీ ఈ సంస్థ కోసం పని చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లో సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. అంతకు ముందు గుగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ కి నాయకత్వం వహించారు. ఐఐటీ ఖరగ్ పూర్, స్టాన్ ఫోర్డ్, వార్టన్ నుంచి పట్టభద్రులైన సుందర్ పిచాయ్.. సారథ్యం వహిస్తున్న సంస్థ ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్లకు పైగా టర్నోవర్ కలిగి ఉంది. ప్రస్తుతం మనం మొబైల్ ఫోన్ మ్యాప్స్ ని చూస్తూ వాహనాలను నడుపుతున్నాం అంటే అదంతా సుందర్ పిచాయ్ ఐడియానే.   ఇక ఇంటర్నేషనల్ బిజినెస్ మిషీన్స్.. షార్ట్ ఫామ్ లో చెబితే.. ఐబీఎం కార్పొరేషన్ సీఈవో అరవింద్ కృష్ణ.. ఇల్లినాయిస్ యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ పొందారు. ఈ ఐఐటీ కాన్పూర్ విద్యార్ధి సారథ్యంలో నడుస్తోన్న ఐబీఎం ప్రస్తుత టర్నోవర్ 244 బిలియన్ డాలర్లు కాగా.. ఇందులోని రెడ్ హ్యాట్ టర్నోవర్ 34 బిలియన్లు. ఇందుకు సారథ్యం వహించింది కూడా అరవిద్ కృష్ణే. అంతే కాదు హైబ్రిడ్ క్లౌడ్, ఏఐ పైనా దృష్టి సారించి ఈ దిశగా కంపెనీ ముందుకు వెళ్లేందుకు నాయకత్వం వహిస్తున్నారు అరవింద్ కృష్ణ.   అడోబ్ సీఈవో శంతను నారాయణ్. 2007 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ 2024 నాటికి 250 బిలియన్ డాలర్లు. హైదరాబాద్ లో జన్మించిన నారాయణ్ అడోబ్ ని సబ్ స్క్రిప్షన్ ఆధారిత మోడ్ లోకి మార్చారు. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ లో అగ్రగామిగా నిలిచిందంటే ఇదంతా శంతను ఆలోచనల వల్ల మాత్రమే సాధ్యమైందని అంటారు. ఉస్మానియా, బౌలింగ్ గ్రీన్ స్టేట్, బర్కిలీ యూనివర్శిటీల నుంచి డిగ్రీలను పొందిన ఈయన తన సంస్థ  అంచెలంచలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు.   మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మల్హోత్రా.. 2017 నుంచి సంజయ్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ గా పని చేస్తున్నారు.  ఈ సంస్థ ఆదాయం 21 బిలియన్ డాలర్లు. బిట్సి పిలానీ, యూసీ బర్కిలీ గ్రాడ్యుయేట్. శాన డిస్క్ సహస్థాపకులైన సంజయ్.. సెమికండక్టర్ మెమరీలో మైక్రాన్ ని ముందుండి నడిపిస్తున్నారు.   పాలో ఆల్టో నెట్ వర్క్స్ సీఈవో నికేష్ అరోరా.. 2018 నుంచి ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. 2024 నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా ఉంది.  ఐఐటీ వారణాశి, బోస్టన్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన అరోరా.. గతంలో గూగుల్, సాఫ్ట్ బ్యాంక్ లో సీనియర్ పొజిషన్లో వర్క్ చేశారు. పాలో ఆల్టో సైబర్ సెక్యూరిటీ పోర్ట్ ఫోలియోని మరింత బలోపేతం చేశారు.  ప్రస్తుతం ఆల్ఫాబెట్ యాజమాన్యంలో ఉన్న యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 2023 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. సుమారు 182 బిలియన్ డాలర్ల టర్నోవర్ గల ఈ సంస్థకు నీల్ మోహన్ సారథ్యం ఎంతో ప్రయోజనకరంగా మారింది. గతంలో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గానూ పని చేశారీ ఇండో అమెరికన్. ఈ ప్లాట్ ఫామ్ ని కమర్షియల్ గా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషించారు. దీంతో ఆయనకు నాయకత్వ బాధ్యతలను అప్పగించిందీ సంస్థ. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ రేష్మా కేవల్ రామణి 2020 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ బయో టెక్నాలజీ సంస్థ 2024 నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంది.  ముంబైలో జన్మించిన రేష్మా బోస్టన్ లో వైద్య శాస్త్రంలో డిగ్రీ తీస్కున్నారు. జన్యు, కణ చికిత్సలను డెవలప్ చేస్తున్న యూఎస్ బేస్డ్ బయోటెక్ సంస్థకు తొలి మహిళా చీఫ్ ఎగ్జిక్యుటివ్ గా రికార్డు సృష్టించారు రేష్మా కేవల్. ఇక కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్.. 2023 నుంచి ఈ సంస్థ సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 19 బిలియన్ డాలర్ల ఆదాయం గల ఈ సంస్థను ఇండో- అమెరికన్ అయిన రవి పరుగులు పెట్టిస్తున్నారు. ట్రాన్స్ యూనియన్ లో ఇండివిడ్యువల్ డైరెక్టర్ గానూ వర్క్ చేస్తున్నారు. అరిస్టా నెట్ వర్క్స్ సీఈఓ అయిన జయశ్రీ ఉల్లాల్  2008 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. 90 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల ఈ సంస్థకు సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు జయశ్రీ. ఈమె భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ అమెరికన్ కావడం విశేషం. అరిస్టాను క్లౌడ్ కంప్యూటింగ్ లో అగ్రగామిగా నిలుపుతున్నారీమె. వేఫర్ సీఈఓ నీరాజ్ షా.. 2002లో స్థాపించిన ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులు కూడా. ఈ కామర్స్ లో ఫర్నిచర్, గృహోపకరణాల్లో 12 బిలియన్ డాలర్ల ఆదాయం ఈ సంస్థ సొంతం. ఇండో అమెరికన్ అయిన షా, వేఫర్ ను గృహోపకరణాల విభాగంలో ప్రముఖ ఆన్ లైన్ రీటైలర్ గా నిర్మించారు. ఫెడెక్స్ సీఈఓ రాజ్ సుబ్రహ్మణ్యం 2022 నుంచి ఈ సంస్థ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. లాజిస్టిక్స్ లో ఈ సంస్థ 90 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది. ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన రాజ్ ఫెడ్ ఎక్స్- ప్రపంచ వ్యాప్త విస్తరణపై తనదైన ముద్ర వేశారు. గోడాడీ సీఈఓ అమన్ భూటానీ 2019 నుంచి ఈ సంస్థ సారధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ విశ్వ విద్యాలయం, లాంకాస్టర్ వర్శిటీ నుంచి డిగ్రీలను పొందిన భూటాని వెబ్ హోస్టింగ్, డొమైన్ రిజిస్ట్రేషన్ లో గోడాడి విస్తరణకు నాయకత్వం వహిస్తున్నారు. అమన్ నాయకత్వంలోని ఈ సంస్థ 4 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది.    వీళ్లే కాక ఇక మీ స్సేస్, సాఫ్ట్ వేర్, మెడిక‌ల్, లా, త‌దిత‌ర రంగాల్లో గ‌ల భార‌తీయుల ప్ర‌తిభిపాట‌వాల విలువ అమెరికాకు ల‌క్ష  కోట్ల మేర ఉంటుంది. అంతేనా భార‌తీయులు అమెరికాకు ప‌న్ను క‌ట్టే వారి ప‌ర్సంటేజీలో 1. 5 శాతం వ‌ర‌కూ ఉన్నారు. ఇక్క‌డున్న కుల‌-మ‌త‌-వ‌ర్గ- వైష‌మ్యాల‌నే బాధ‌లు ప‌డ‌లేక అక్క‌డికి వ‌ల‌స వ‌చ్చిన మావాళ్లు.. మీ దేశాభివృద్ధిలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. వాళ్లే లేకుంటే మీ సంస్థ‌ల‌ ఆర్ధిక ప‌టుత్వం  నేల చూపులు చూసే అవ‌కాశ‌ముంది. ఐడియా ఎవ‌రైనా ఇస్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేయ‌డంలోనే ఉంటుంది అస‌లు స‌త్తా. ఆ స‌త్తాగ‌ల భార‌తీయులు లేకుంటే మీ గ‌తి అధోగ‌ తే అన్న‌ది ప‌లువురు అంత‌ర్జాతీయ వాణిజ్య నిపుణులు అంటోన్న మాట‌.

కోర్టులో మళ్లీ చుక్కెదురు.. మరి కొన్ని రోజులు జైల్లోనే జూనియర్ పెద్దిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరి కొన్ని రోజులు జైలువాసం తప్పేటట్లు కనిపించడం లేదు. తనను ఏ4 నిందితుడిగా చేర్చిన నాటి నుంచి బెయిల్ కోసం గజనీ మహ్మద్‌లా విఫల యత్నాలు చేసుతున్న రాజంపేట ఎంపీ జూనియర్ పెద్దిరెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను  కోర్టు ఈ నెల 29కి  వాయిదా వేసింది. దీంతో మిథున్ రెడ్డి మరో నాలుగు రోజులు జైల్లోఉండక తప్పదు.  కా  మద్యం కుంభకోణం కేసులో   అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి  ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సహాయకుడిని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.  జైలులో ఖైదీలకు సహాయకుల్ని ఏర్పాటు చేసే నిబంధనలు లేవనీ, కోర్టు ఆదేశాల్లో ఉన్న మార్గదర్శకాలను పునః పరిశీలించాలని ఆయన ఆ రివ్యూ పిటిషన్ లో కోరారు.   జైలు నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నా, లేదా తీవ్రమైన అనారోగ్యానికి లోనైతే తప్ప ప్రత్యేక సహాయకుడిని నియమించే అవకాశం లేదని, అటువంటి పరిస్థితుల్లో జైలులో ఉన్న  సహాయ సిబ్బందిని ఉపయోగిస్తామని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ముందుగా కోర్టు ఇచ్చిన అనుమతులతో ఎంపీకి జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న అంశంపై ఇప్పటికే కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది ఈ నెల 29న జరిగే విచారణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. 

ఫోర్జరీ కేసులో మాజీ మంత్రి కాకాణికి రిమాండ్

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ నెల్లూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూముల కబ్జాకు వెంకటాచలం తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కాకాణిపై నమోదైన కేసుకు సంబంధించి నెల్లూరు అడిషన్ మేజిస్టేట్ కోర్టు ఈ ఉత్తర్వలు జారీ చేసింది. ఇప్పటికే మరో కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఫోర్జరీ చేసులో వర్చువల్ గా గురువారం (జులై 24) నెల్లూరు కోర్టులో హాజరు పరిచారు.  ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండానే కాకాణిని 14వ నిందితుడిగా చేర్చారని ఆయన తరపు లాయర్లు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణిని 14 రోజుల పాటు అంటే ఆగస్టు 7 వరకూ జ్యూడీషియల్ రిమాండ్ కు ఆదేశించింది. ఇళఆ ఉండగా కాకాణికి బెయిలు ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది.  

సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా?

సజ్జలపై కేసు సంగతి ఏమిటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాసిక్యూషన్ ను నిలదీసింది. అమరావతి మహిళలపై సజ్జల చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తున్నారా లేదా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సజ్జల దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. ఆ లోగా సజ్జలపై కేసు నమోదు చేస్తున్నారా? లేదా తెలపాలని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.  సజ్జల అమరావతి ప్రాంత ప్రజలు, మహిళలను ఉద్దేశించి సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారన్న భయంతో సజ్జల ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ గురువారం జరిగింది. సజ్జల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదించారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదించారు.  ఆయన తన వాదనలో అమరావతి ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సజ్జలపై ఇప్పటి వరకూ కేసు నమోదు కాలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సజ్జల తరఫున వాదించిన పొన్నవోలు అరెస్టు చేస్తారన్న అనుమానం ఉన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అమరావతి ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ఆధారంగా సజ్జలపై కేసు నమోదు చేస్తారా? చేయరా? అన్న విషయం తెలపాలని ప్రాసిక్యూషన్ ను ఆదేశిస్తూ.. సజ్జలపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి విచారణ వరకూ పొడిగిస్తూ కేసు విచారణకు హైకోర్టు వాయిదా వేసింది.  

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

కల్లోలంగా ఉన్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను పొడగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హింసాకాండ, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 3న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి విదితమే. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన బీరేన్ సింగ్ ప్రభుత్వం వైదొలగడంతో ఆక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.  తాజాగా అక్కడి పరిస్థితులు నెమ్మదినెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోనికి వచ్చే వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగించాని కేంద్రం నిర్ణయించింది. దీంతో   కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ అందుకు ఆమోదం తెలిపింది. వెంటనే తీర్మానాన్ని రాష్ట్రపది ద్రౌపది ముర్ముకు పంపగా ఆమె ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో  తీ మణిపుర్ మరో ఆరు నెలల పాటు అంటే ఫిబ్రవరి 2026 వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగనుంది.  

పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు చిన్నారులు మృతి

రాజస్థాన్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు విద్యార్థులు మరణించారు. ఈ దుర్ఘటన ఝలావర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం (జులై 25) ఉదయం ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు అంతలోనే మృత్యువాత పడటంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల దుఖానికి అంతులేకుండా పోయింది. ఝలావర్ లోని ప్రాథమిక పాఠశాల భవనం పై కప్పు ఈ ఉదయం పది గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు గాయపడగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొంతమంది విద్యార్థులు చిక్కుకున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. స్థానికులు, పోలీసులు, అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.  

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బెజవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్న అంచనాతో అధికారులు దుర్మమ్మ కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డును మూసివేశారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, భక్తులు సహకరించాలనీ అధికారులు కోరారు. వర్షాలు తెరిపి ఇచ్చి వాతావరణం కుదు టపడిన తరువాత మళ్లీ ఘాట్ రోడ్డుపై వాహనాలను అనుమతిస్తామని తెలిపారు.  

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయంపడుతోందంటే?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. మూమూలు రోజులలోనే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అలాంటిది శ్రావణమాసం అంటే ఇక చెప్పనే అవసరం లేదు. శుక్రవారం (జులై 25) నుంచి శ్రావణ మాసం ఆరంభం కావడం, అందులోనూ తొలి రోజే శుక్రవారం కావడం, వారాంతం సమీపిస్తుండటంతో    శుక్రవారం (జులై 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేసి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక గురువారం (జులై 24) శ్రీవారిని మొత్తం  68,800 మంది   దర్శించుకున్నారు. వారిలో 22,212 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం  నాలుగు కోట్ల 49 లక్షల రూపాయలు  వచ్చింది.  

గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి వరదలో మునిగారు!

గూగుల్ మ్యాప్స్ ను నమ్మి ముందుకు వెడితే గంగలో మునగక తప్పదని మరో సారి రుజువైంది. ఇటీవలి కాలంలో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వెడుతున్న వాహనదారులు దారి తప్పిన సంఘటనలూ, ప్రమాదాల బారిన పడిన ఘటనలూ తరచుగా జరుగుతున్నాయి. ఇటీవలే గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ వెళ్లి సగం నిర్మించిన బ్రిడ్జిపై నుంచి కారు కిందపడి మరణం సంభవించిన సంఘటన మరిచిపోకముందే దాదాపు అలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది.  కేరళకు చెందిన జోసెఫ్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ ప్రయాణం చేస్తూ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కొట్టాయం ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆ సమయంలో కొట్టాయంలోని కడుతురుత్తి రోడ్డుపై కారులో తన భార్యతో కలిసి వెడుతున్నారు.  వారు గమ్యస్థానం చేరడానికి పూర్తిగా  గూగుల్ మ్యాప్స్ పైనే ఆధారపడ్డారు. ఆ మ్యాప్స్ చూపుతున్న మార్గంలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన జోసెష్ నేరుగా వరద నీటిలోకి వెళ్లారు. తృటిలో ఘోర ప్రమాదం జరిగేదే. అయితే స్థానికులు గమనించి అప్రమత్తం చేయడంతో కారును ఆపారు. అయితే అప్పటికే జోసెఫ్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం వరద నీటిలో మునిగిపోయింది. స్థానికులు తక్షణమే స్పందించి జోసెఫ్ ను, ఆయన భార్యను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.  

ఏపీ లిక్కర్ కేసు.. విదేశాల్లో కీలక నిందితులు.. రెడ్ కార్నర్ నోటీసులు?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ దూకుడును మరింత పెంచింది. ఈ కేసులో నిందితులు అయిన ఎనిమిది మంది విదేశాలలో ఉన్నట్లు గుర్తించిన సిట్ వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది. విదేశాలలో తలదాచుకున్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసుందుకు రంగం సింద్ధం చేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఎనిమిది మంది నిందితులు దుబాయ్, ధాయ్ ల్యాండ్ లో ఉన్నట్లు గుర్తించింది. వీరిలో కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్. సైమన్ ప్రసన్న, ప్రద్యుమ్నలు దుబాయ్ లోనూ, ఇక అవినాష్ , అనిరుధ్ రెడ్డిలు ధాయ్ ల్యాండ్ లోనూ ఉన్నట్లు గుర్తించింది. వీరిలో ధాయ్ ల్యాండ్ కు పారిపోయిన అవినాష్, అనిరుథ్ రెడ్డిలు వారిపై కేసు నమోదు అయిన తరువాత పరారీ అయ్యారు. ఈ ఎనిమిది మందిని భారత్ కు రప్పించేందుకు సిట్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే  విదేశాంగ శాఖకు సిట్ అధికారులు సమాచారమిచ్చారు.  దుబాయ్, థాయ్ ల్యాండ్ కు పరారైన ఈ నిందితులను భారత్ కు ఆయా దేశాలతో ఉన్న మ్యూచువల్ లీగల్ ట్రీటీస్ ద్వారా భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా విదేశాంగ శాఖకు సిట్ అధికారులు లేఖ రాశారు. 

ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణలో జరిగిన కులగణన సర్వే డేటా 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్‌లో కులగణన సర్వేపై కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదన్నారు. కొన్ని విషయాల్లో ఎన్డీయే సర్కార్ దిగి వచ్చేలా రాహుల్ గాంధీ పోరాటం వల్లే కులగణన చేసేందుకు కేంద్రం అంగీకరించిందని రేవంత్ తెలిపారు. కులగణన దేశానికి ఒక దిక్సూచిలా ఈ సర్వే నిలిచి పోతుందని అన్నారు. ఈ సర్వేపై తెలంగాణలోని అగ్రకులాల నుంచి అభ్యంతరం వచ్చిందని, అందరి సంతోషం కోసం పరిస్థితులను బట్టి ముందుకు సాగాలని వివరించి, ఒప్పించామని సీఎం తెలిపారు.  ప్రధాని మోడీ పుట్టుకతో ఓబీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అని అందుకే ఆయన బీసీల కోసం ఏమీ చేయరని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల కోసం అన్ని త్యాగాలు చేస్తుందని వెల్లడించారు. ఓబీసీలకు ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నిర్ణయంతో, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కులగణన సర్వే పూర్తి చేశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన పకడ్బందీగా నిర్వహించిందని రాహుల్ అన్నారు. కులగణన అంత సులభం కాదు కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతర నేతలు అంచాలకు మించి రాణించారని తెలిపారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలరాయిగా నిలుస్తుందని తెలిపారు.  ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. రాహుల్‌ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు. కాంగ్రెస్‌ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు పాల్గొన్నారు.