బీహార్ లో గెలుపు ముంగిట ఎన్డీయే.. చంద్రబాబు హర్షం, అభినందన

బీహార్‌లో ఎన్డీయే కూటమి భారీ, చారిత్రక విజయం ముంగిట నిలవడం పట్ల  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) తరఫున గెలుపొందిన, ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ  వికసిత భారత్ దార్శనికతకు, ఎన్డీయే ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన పోస్టు చేశారు.  బీహార్‌లో ఎన్డీయే సాధించిన ఈ అద్భుతమైన విజయం, కూటమి అందిస్తున్న ప్రగతిశీల పాలనపై ప్రజలకు ఉన్న అపార విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.    ఈ సందర్భంగా ఆయన నితీశ్ కుమార్‌కు, బీజేపీ, జేడీయూ విజేతలకు   శుభాకాంక్షలు తెలిపారు.  తన పోస్టుకు చంద్రబాబు నరేంద్రమోడీ, నితీష్ కుమార్ పేర్లను కలుపుsp ఎన్ఎఎన్ఐ (NaNi)  #NaNiLandslideInBihar అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.  జాతీయ రాజకీయాల్లో కీలకమైన బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్డీయే మిత్రపక్ష నేతగా చంద్రబాబు స్పందించారు.  

సెంచరీకి చేరువలో రాహుల్ గాంధీ ఓటములు...బీజేపీ సైటర్లు

  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై బీజేపీ సైటైర్లు సంధించింది. ఎక్కడ ఎన్నికలు జరిగిన ఓటములకు చిహ్నంగా రాహుల్ గాంధీ మారారని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ విమర్శించారు. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ 95 సార్లు ఓడిపోయారని తెలిపారు. 2004 నుంచి  2025 వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్  ఓడిపోయిన  మ్యాప్‌ను కూడా మాలవీయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మరో ఎన్నిక, మరో ఓటమి ఎలక్షన్  ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే మొత్తం రాహుల్‌కే వస్తాయి అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.    బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే  కూటమి దుందుభి మోగించింది. ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ (122)ను దాటేసి, 192 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు మహాగఠ్‌ బంధన్‌ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 84  జేడీయూ 78 ఎల్‌జేపీ 20 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో ప్రధాన పార్టీ ఆర్జేడీ 32 సీట్లలో ముందంజలో ఉండగా కాంగ్రెస్‌ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బిహార్‌లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

అధికార దుర్వినియోగంతోనే కాంగ్రెస్ విజయం.. జూబ్లీ ఫలితంపై కేసీఆర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు పాతిక వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఘనవిజయం సాధించారు. ఈ పరాజయంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. జూబ్లీలో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేసీఆర్ కాంగ్రెస్  నాయకులు బెదిరింపులకు, అక్రమ మార్గాలకు, అధికార దుర్వినియోగానికీ పాల్పడ్డారనీ, ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనీ అన్నారు.  ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం గడపదాటి రాని కేసీఆర్ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ ఆరోపణలు, విమర్శలు గుప్పించడంపై పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అధినేతగా ప్రచార బాధ్యతలను మోయాల్సిన కేసీఆర్.. అసలు ప్రచారానికే రాకపోవడం బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.  ఒక జూబ్లీ ఓటమిపై మీడియా సమావేశంంలో స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్కి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ఇకపైనా ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.  గెలుపు ఓటములు సహజమన్న కేటీఆర్ 2014 నుండి 2023 వరకు జరిగిన 7 ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయిందని గుర్తు చేశారు.  ఈ ఓటమితో పార్టీ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్న ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామని చెప్పారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. 

బీహార్ లో ఎన్డీయే హవా

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. అయితే ట్రెండ్స్ ను బట్టి ఈ ఎన్నికలలో ఘన విజయంతో ఎన్డీయే రాష్ట్రంలో మరో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయంగా తేలిపోయింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆధిక్యతల ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థులు 191 స్థానాలలో ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్   49 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తోంది.ఎన్డీయే కూటమిలో బీజేపీ  84 స్థానాల్లోనూ, జేడీయూ 80 స్థానాల్లో  ముందంజలో ఉన్నాయి.   శుక్రవారం(నవంబర్ 14) ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్డీయే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీయే మెజారిటీ స్థానాలలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నది.   కాగా ఈ ట్రెండ్ చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతోందని సీపీఐ నాయకుడు రాజా అన్నారు. ప్రచారంలో మహాఘట్ బంధన్, తేజస్వీ యాదవ్ ల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.  ఇక కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ బీహార్ ఫలితాలను చూసిన తరువాతైనా పార్టీలో ఆత్మపరిశీలన జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కేవలం ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోదనీ, కూర్చుని ఆలోచించాలనీ, ఎం తప్పు జరిగింది? ఎక్కడ జరిగింది అన్న విషయాలపై పార్టీలో విస్తృత చర్చ జరగాలని, వ్యూహాత్మక, సంస్థాగల తప్పులు ఏమిటన్నదానిపై అధ్యయనం జరగాలని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.   ఇక బీహార్ ఎన్నికలలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జన సురాజ్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ పార్టీ మొత్తం స్థానాలలో పోటీ చేసినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా విఫలమయ్యాయి. 

వెనుకంజలో తేజస్వీ యాదవ్... లాలూ కంచుకోట బద్దలు

  బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో  మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన సొంత నియోజకవర్గం రాఘోపూర్‌లో వెనుకంజలో ఉన్నారు. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 3,230 ఓట్ల తేడాతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ స్థానంలో ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధి సతీష్ కుమార్ అధిక్యంలో ఉన్నారు. ఆర్జేడీకి, లాలూ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన రాఘోపూర్ నియోజకవర్గంలో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి తర్వాత 2015 నుంచి తేజస్వి యాదవ్ ఇక్కడి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2020లో తేజస్వి ఇదే నియోజకవర్గం నుంచి 38,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తన బలాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఈ స్థానం విషయంలో వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచుతోంది. ఈసారి బీజేపీ వ్యూహాత్మకంగా సతీశ్ కుమార్ యాదవ్‌ను రంగంలోకి దించింది. సతీశ్ కుమార్ కూడా రాఘోపూర్‌లో గణనీయమైన ఆధారాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా, 2010లో జేడీయూ తరఫున పోటీ చేసి రబ్రీ దేవిని ఓడించడం ఆయనకు పెద్ద గుర్తింపు తీసుకువచ్చింది. ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ‘జన్ సురాజ్’ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టగా, తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ స్థాపించిన ‘జనశక్తి జనతా దళ్’ తరఫున ప్రేమ్ కుమార్ పోటీలో ఉండటం గమనార్హం. ఈ బహుముఖ పోటీ వల్ల ఓట్లు విపరీతంగా చీలుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బీజేపీ డిపాజిట్ గల్లంతు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో  బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో మాదే అధికారం అని చెప్పుకుంటున్న బీజేపీకి జూబ్లీ బైపోల్ లో డిపాజిట్ గల్లంతు కావడం పెద్ద షాక్ అనే చెప్పాలి. అంతే కాదు.. షేక్ పేట్ డివిజన్ లో కమలం పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క ఓటు కూడా రాలేదు.  బీజేపీ జూబ్లీ బైపోల్ లో ఓటమిని ప్రచార పర్వంలోనే అంగీకరించేసింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీ ఎన్నిక చాలా చిన్న ఎన్నిక అంటూ చేసిన కామెంట్ తో ఆ పార్టీ శ్రేణులు సైతం ఓటమి ఖాయమన్న భావనకు వచ్చేశారు. అయితే కనీసం డిపాజిట్ కూడా రానంతగా బీజేపీ చ తికిల పడుతుందని పరిశీలకులు కూడా ఊహించలేదు. బీజేపీకి పట్టణ ప్రాంతాలలో ఒకింత పట్టు ఉందని అంతా భావిస్తారు. ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలో ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పట్టణ ప్రాంతాలలో కూడా బీజేపీ పట్టు అంతంత మాత్రమేనని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కేవలం 9100 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలో తనకు డిపాజిట్ రాకపోవడంపై స్పందించిన అభ్యర్థి దీపక్ రెడ్డి.. జూబ్లీ ఉప ఎన్నికలో డబ్బు ప్రభావం అధికంగా ఉందన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. 

పాతికవేల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి మెజారిటీ సాధించింది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచీ కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పాతిక వేలపైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.  తొలి రౌండ్ నుంచీ నవీన్ యాదవ్ ఆధిక్యంలోనే ఉన్నారు. అంతే కాకుండా రౌండ్ రౌండ్ కూ ఆ అధిక్యత పెరుగుతూ వచ్చింది.  ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గాంధీ భవన్ లోనూ, నవీన్ యాదవ్ కార్యాలయంలోనూ కాంగ్రెస్ నేతలు, శ్రేణులూ మిఠాయిలు పంచుకుని, బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.  జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం పై హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విజయాన్నిపురస్కరించుకుని గ్రామ గ్రామాన సంబరాలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.   జూబ్లీ ఉప ఎన్నిక విజయం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గెలుపుగా ఆయన అభివర్ణించారు.   కాగా జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ విజయంపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు  మహేష్ కుమార్ గౌడ్.. ఈ విజయం ఊహించిందేనన్నారు. ఈ  ఉప ఎన్నికలో కాంగ్రెస్‎ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కుఅయ్యి చేసిన రాజకీయాలు ఫలించలేదన్నారు.   బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటైనా.. కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించిందన్నారు. ఈ విజయం విజయం కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.  

షేక్ పేట్ డివిజన్ లో బీజేపీ స్కోరు జీరో ఓట్లు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైన క్షణం నుంచీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలోనే ఉన్నారు. రౌండు రౌండుకూ ఆయన మెజారిటీ పెరుగుతూ వచ్చింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గట్టిపోటీయే ఇచ్చినా వెనుక బడ్డారు. కానీ ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారం మాదే.. అందుకు జూబ్లీ విజయంతో తొలి అడుగు వేస్తాం అంటూ  గొప్పలు చెప్పుకున్న బీజేపీ జూబ్లీ బైపోల్ లో అసలు పోటీయే ఇవ్వకపోవడం. జాతీయ పార్టీ, అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. జూబ్లీ ఉప ఎన్నికలలో ఘోరంగా పెర్ఫార్మ్ చేసింది. కౌంటింగ్ పూర్తి కాకముందే ఓటమి అంగీకరించేసి ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి ఇంటికి వేంచేశారు. సరే రాజకీయపార్టీకి గెలుపు ఓటములు సహజమే అని సరిపెట్టుకోవడానికి కూడా లేనంత ఘోర పరాభవం బీజేపీకి జూబ్లీ ఉప ఎన్నికలో ఎదురైంది. అదెలా అంటారా? కమలం పార్టీలో షేక్ పేట డివిజన్ లో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా రాలేదు. ఔను నిజం.. ఓట్ల లెక్కింపులో భాగంగా   షేక్ పేట డివిజన్ లో ఓట్ల లెక్కింపులో బీజేపీ జీరో ఓట్లు స్కోర్ చేసింది. దీంతో కమలం నేతలు షాక్ కు గురయ్యారు. కనీసం ఆ పార్టీ తమ ఏజెంట్లుగా పెట్టుకున్న వారు కూడా బీజేపీకి ఓటు వేయలేదన్న సంగతి తేటతెల్లమైంది.  బీజేపీ పరిస్థితి భాగ్యనగరంలో ఇంత ఘోరంగా ఉందా అని ఆ పార్టీ వ్యతిరేకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ ఆధిక్యత 19వేల ఓట్లు

జూబ్లీ బైపోల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత పెరుగుతూ వస్తున్నది. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 19 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ జరిగిన ఏడు రౌండ్లలోనూ నవీన్ యాదవ్ కే ఆధిక్యత లభించింది.  రౌండు రౌండు కూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత పెరుగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడ్డాయి. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆ పార్టీ ఏజెంట్లు బయటకు వచ్చేశారు. ఇక బీజేపీ  అభ్యర్థి దీపక్ రెడ్డి అయితే ఐదో రౌండ్ పూర్తి కాగానే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. మరో వైపు కాంగ్రెస్ గెలుపు సంబరాలు ఆరంభించేసింది. గాంధీ భవన్ లో సందడి వాతావరణం నెలకొంది. 

ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ మెజారిటీ 12 వేలకు పైనే

జూబ్లీ బైపోల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత పెరుగుతూ వస్తున్నది. ఇప్పటి వరకూ ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తికాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 12 651   ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు. బీజేపీ ఇక్కడ మూడో స్థానానికే  పరిమితమైంది. ఇప్పటివరకూ పూర్తయిన ఐదు రౌంట్ల ఓట్ల లెక్కింపులోనూ ప్రతి రౌండ్ లోనూ అనిల్ యాదవ్ కుఆధిక్యత వచ్చింది.  నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థికి 42 వేల 126 వోట్లు, మాగంటి సునీతకు 33 వేల 978 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 6, 856 ఓట్లు వచ్చాయి. 

జూబ్లీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యతతో కాంగ్రెస్

జూబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది. అయితే బీఆర్ఎస్ కూడా హోరాహోరీ పోరాడినట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి కేవలం 62 ఓట్ల ఆధిక్యత కనబరిచిన కాంగ్రెస్ రెండో రౌండ్లో గట్టిగా పుంజుకుంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 9 వేల 926 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ కు 62 ఓట్ల ఆధిక్యత లభించింది.  అయితే రెండో రౌండ్లో నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యత కనిపించడంతో ఆయన ఆధిక్యత 1,114కు పెరిగింది. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం

బీహార్  అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో ముందుగా బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు. కాగా రెండు విడతలుగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రెండు విడతలలోనూ కూడా భారీ ఓటింగ్ నమోదైంది. అత్యధిక ఓటింగ్ తమకే అనుకూలమని ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడిన మహాఘట్ బంధన్, ఎన్డీయే కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  తొలి దశలో 121 సీట్లకు, మలి దశలో 122 సీట్లకు పోలింగ్ జరిగింది.  

జూబ్లీ బైపోల్ కౌంటింగ్ షురూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది.  సుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో  ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు షురూ అయ్యింది. నియోజకవర్గ పరిధిలోని  407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించడానికి 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్‌లో  పాల్గొన్నారు. జూబ్లీ బైపోల్ లో 48.49శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.  అత్యధికంగా బోరబండ డివిజన్ లో 55.92 శాతం పోలింగ్ జరిగితే.. అత్యల్పంగా  సోమాజిగూడలో 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కౌంటింగ్ విషయానికి వస్తే.. ఈ ప్రక్రియను మొత్తం పది రౌండ్లలో పూర్తి చేయనున్నారు. గంట సేపటిలోగా ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉండగా, మధ్యాహ్నం రెండు గంటలకల్లా తుది ఫలితం వెల్లడౌతుందని అంచనా.   ఇలా ఉండగా ఈ ఉప ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్ కు చేరుకున్నారు.  పోటీలో మొత్తం 58 మంది అభ్యర్థులు  ఉన్నప్పటికీ.. ప్రధాన పోరు మాత్రం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యే ఉంది.  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత రంగంలో ఉన్న సంగతి విదితమే. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు.  

జూబ్లీ బైపోల్.. సునీతకు మాగంటి అభిమానుల సహాయ నిరాకరణ?

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.  ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థికే అనుకూలంగా వచ్చాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన అన్ని సంస్థలూ అంచనావేశాయి.   మాగంటి మరణం తర్వాత అనివార్యంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. సిట్టింగ్ సీట్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు, తిరిగి మాగంటి కుటుంబానికే జూబ్లీహిల్స్ టికెట్ కన్ ఫర్మ్  చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. సెంటిమెంటే తమ అస్త్రంగా మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. అయినా కూడా మాగంటి సునీతకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్గాలలో దీనిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి.  జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా  మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపినాథ్ కు అనేకమంది అనుచరులు, అభిమానులు ఉన్నారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ఈ ఉపఎన్నికలో మాత్రం గోపినాథ్ భార్య మాగంటి సునీతకు ఆయన అనుచరులు, అభిమానులు ఎవరూ  గ్రౌండ్ లెవల్ లో సహకరించలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాగంటి ఎన్నికల్లో నిలబడుతున్నారంటే చాలు ఆయన అభిమానులే ఎన్నికల భారమంతా తమ భుజాల మీద మోస్తూ గోపీనాథ్ ను గెలుపించుకునేవారు. కానీ, ఈ ఉపఎన్నికలో మాత్రం వారంతా నామమాత్రంగానే పనిచేశారనీ, అందుకే సునీత వెనుకంజలో ఉన్నారని గులాబీ పార్టీలో టాక్ నడుస్తోంది.  మాగంటి సునీత విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ ఎలాగైనా ఆమెను గెలుపించుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. ప్రచార బాధ్యతను మొత్తం ఒంటిచేత్తో లాక్కొచ్చిన కేటీఆర్, కింది స్థాయి నాయకత్వాన్ని సమన్యయపరచడానికి సరైన కార్యచరణ చేయలేకపోయారని, మాగంటి గోపీనాథ్ అనుచరులను సునీత విజయం  కోసం పనిచేసేలా మోటివేట్ చేయడంలో విఫలమయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే సునీత విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డ కేటీఆర్ నాయకుల్లో సమన్వయం తీసుకురావడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారట. మాగంటి గోపీనాథ్‌ది సహజ మరణం కాదంటూ, ఆయన మరణం వెనుక ఏదో కారణం ఉందంటూ.. గోపీనాథ్ అభిమానుల పేర్లతో జూబ్లీహిల్స్ లో వెలిసిన పోస్టర్లు.. మాగంటి మొదటి భార్య, కొడుకు హైదరాబాద్ కు వచ్చి చేసిన ఆరోపణలు, గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఏకంగా కేటీఆర్ పైనే ఆరోపణలు చేయడం.. ఇవన్నీ సునీత ఓటమికి కారణాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    గోపీనాథ్ అభిమానులు, అనుచరులు ఈ ఉప ఎన్నికలో సునీత విజయం కోసం అంకిత భావంతో పని చేయకపోవడం  బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా మారిందని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.  మరి చూడాలి ఈ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో..  మాగంటి సునీతకు ఎంతమేర ఓటు పర్సెంటేజ్ నమోదవుతుందో?

జూబ్లీ బైపోల్ కౌంటింగ్ రేపు.. ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం (నవంబర్ 14)న వెలువడనున్నాయి. పోలింగ్ ఈ నెల 11న అంటే మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం తధ్యం అని అంచనా వేసినా, తుది ఫలితం కోసం పార్టీలూ, అభ్యర్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో కూడా తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి వ్యక్తం అవుతోంది.   ఈ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత కేంద్ర బలగాల మూడంచెల భద్రత నడుమ కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్రంగా ఉంచారు. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమౌతుంది.  ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి.  ఇక కౌంటిగ్ కోసం  42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలోనే  కౌంటింగ్ పూర్తి అవుతుంది.  ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు కౌంటింగ్‌లో పాల్గొంటారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రారంభిస్తారు.  ఈ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాకపోవడంతో.. ముందుగా హోం ఓటింగ్ ఓట్లు లెక్కిస్తారని తెలుస్తోంది.  హోం ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా, 101 మంది ఓటు వేశారు. ఈవీఎంలో ముందుగా షేక్ పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఫలితాల వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. మరోవైపు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. ఇందులో 1,94,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 99,771 మంది పురుషులు, 94,855 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.  ఇక మధ్యాహ్నానికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. 

సెల‌బ్రిటీస్ సారీ..గామా!

ఒకే రోజు మూడు సారీలు. లారీల నిండా సారీలు. వారిలో టాప్ ప్లేస్ కి చెందిన సారీ చెప్పిన వారు.. మంత్రి కొండా సురేఖ‌. ఈమె గ‌తంలో అంటే తాను మంత్రి అయిన తొలి రోజుల్లో  నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఒక అబాంఢం వేశారు. దీంతో  నాగార్జున న్యాయాన్ని ఆశ్ర‌యించారు కూడా. ఆపై సురేఖ మంత్రిపదవి ఊడిపోతుందేమో అన్నంతగా వ్య‌వ‌హారం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.  అయితే.. , బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారే అలా వెంట్రుక వాసిలో  అప్పట్లో వేటు నుంచి కొండా సురేఖ త‌ప్పించుకున్నారు.  ఆమె మంత్రిగా ఉండి కూడా  ప్రభుత్వంలో తమను   తొక్కేస్తున్నార‌ని ఆరోపణలు గుప్పించి కూడా  పదవిని భద్రంగా కాపాడుకోగలుగుతున్నారు. అది వేరే విషయం.  అప్ప‌టి నుంచీ కూడా సురేఖ సైలెంట్ మోడ్ లో కి వెళ్లిపోయాన‌ని అంటారు. తానేదైనా అంటే  అది మ‌రొక‌టిగా రూపాంత‌రం చెందుతోంద‌ని.. ఫీల‌య్యి మీడియాతో మాట్లాడ్డ‌మే మానేశాన‌ని చెప్పుకొచ్చారీ మ‌ధ్య ఒక మీడియా చిట్ చాట్ లో. ఇప్పుడు కూడా సురేఖ‌.. ట్వీట్ చేసి స‌రిపుచ్చారు త‌ప్ప‌.. మీడియా ముందుకు రాకుండా జాగ్ర‌త్త వ‌హించారు చూశారా!? ద‌టీజ్ కొండంత సారీల సురేఖ‌  అంటే. ఇక  రెండో బిగ్గెస్ట్ సారీ ఆఫ్ ద ఏపీ విష‌యానికి వ‌స్తే.. మాజీ ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్. ఒక స‌మ‌యంలో షాడో సీఎం గా వ్య‌వ‌హించార‌న్న పేరుండేది. అప్ప‌ట్లో ఇద్ద‌రి ప‌ట్ల తాను ఎంతో దారుణంగా ప్ర‌వ‌ర్తించాన‌నీ ఆయ‌న ఇప్పుడు తాజాగా ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ వారెవ‌రో చూస్తే మాజీ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, ఐఆర్ఎస్ జాస్తి కిషోర్ కుమార్. ఈ ఇద్ద‌రి ప‌ట్ల తాను అలా వ్య‌వ‌హ‌రించి ఉండ‌కుండా ఉండాల్సింద‌న్న కోణంలో ఆయ‌న చేసిన ఒక వీడియో ప్రెజంటేష‌న్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  అప్ప‌ట్లో జ‌గ‌న్ ఏదంటే  అది అన్న మాట‌క‌న్నా, ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ ఏదంటే అదీ అన్న టాక్ వినిపించేది. ఒక ద‌శ‌లో ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ మీద ఉపాధ్యాయులంతా  క‌ల‌సి కంప్ల‌యింట్ చేశారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. అలాంటి ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ నుంచి  సారీ.. అది  కూడా ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల‌కు అందింది.  ఒక మూడో సారీ..  న‌టుడు ప్ర‌కాష్ రాజ్చెప్పారు.   బేసిగ్గా ప్ర‌కాష్ రాజ్ ఎంత అగ్రెసివ్ గా ఉంటారంటే.. జ‌స్ట్ ఆస్కింగ్ పేరిట ఏకంగా ప్ర‌ధాన మంత్రినే ఏ ప్ర‌శ్న‌లంటే ఆ ప్ర‌శ్న‌లు అడిగే బాప‌తు. దేశంలో ఏ చిన్న విష‌య‌మైనా స‌రే ఆయ‌న నిగ్గ దీసి అడుగు- ఈ సిగ్గులేని స‌మాజాన్ని అనే టైపు. అలాంటి ప్ర‌కాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ చేసినందుకుగానూ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తనకే పాపం తెలీదంటే అది త‌ప్పు అవుతుందని అన్నారు.  అయితే.. తాను గ‌తంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్ర‌చారానికిగానూ సారీ చెబుతున్నా! అంటూ మీడియా ముఖంగా చెప్పారు. దీంతో ఒకే రోజు ముగ్గురు ప్ర‌ముఖుల నుంచి మూడు సారీలు వెలువ‌డ్డంతో ఇదో స‌రికొత్త రికార్డు  సృష్టించింది. వీరంతా మామూలోళ్లు కారు. అలాంటి మొండి- జ‌గ‌మొండి ఘ‌టాల నుంచి ఇలాంటి క్ష‌మాప‌ణ‌ల ప‌ర్వం ఈ స‌మాజం చూస్తుంద‌నుకోలేదు. కాబ‌ట్టే ఇంత ఎగ్జ‌యిట్ మెంట్. ఇందులో ఏదైనా త‌ప్పుంటే సారీయే..!

తాడిపత్రిలో హై టెన్షన్

  అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్త చర్యగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. అదే సమయంలో, స్థానిక  ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు.  దీంతో పెద్దారెడ్డి కార్య క్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దారెడ్డిపై ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరిని అడ్డుకుంటున్నాం.. గత ఐదేళ్లు పట్టిన పీడను వదిలించుకుని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో పెద్దారెడ్డి ఏం చేశారని అంటు అస్మిత్‌రెడ్డి ప్రశ్నించారు