మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్

ఇటీవల మరణించిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం (నవంబర్ 6) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సుబ్బానాయుడు, భాను చందర్ వంటి కార్యకర్తలను కోల్పోవడం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న లోకేష్ తనకు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ సబ్బానాయుడితో మంచి పరిచయం, అనుబంధం ఉందన్నారు. సుబ్బానాయుడు అనారోగ్యానికి గురయ్యారని తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు చెప్పిన ఆయన సబ్బానాయుడి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మాలేపాటి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అంతే కాకుండా ఆ కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకువచ్చేందుకు వ్యక్తిగతంగా తాను చేయూతనిస్తానని లోకేష్ చెప్పారు. మాలేపాటి పై దుప్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

రోజా ఎబౌట్ టర్న్.. రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి!?

సీనియర్ హీరోయిన్, నటి రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలలో నటించడం చాలా వరకూ తగ్గించేశారు. టీవీ రియాలిటీ షోలలో జడ్జీగా చేసినప్పటికీ.. మంత్రి అయిన తరువాత అదీ మానేశారు. గత ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చినా సినిమాల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఆమె ఎబౌట్ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.  ఇప్పుడు ఆమె సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయారు.   తమిళ సినిమా లెనిన్ ఇండియన్ అనే సినిమాతో రోజా వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు.  ఈ మేరకు ఆ మూవీ మేకర్స్ రోజా తమ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.  అంతే కాకుండా సినిమా వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు కూడా. ఇక  రోజా 2013లో   డాటర్ అఫ్ వర్మ అనే   చిత్రంలో చివరిసారిగా నటించారు.  ఇక ఇప్పుడు తమిళమూవీతో రోజా సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే.. ముందు ముందు ఆమె నటిగా మళ్లీ బిజీ అవ్వాలని భావిస్తున్నట్లు తెలు స్తోంది. అయితే ఆమె తెలుగు సినిమాలలోనూ నటిస్తారా? నటిస్తే ఆమెకు వచ్చే అవకా శాలెలాంటివి? అన్న చర్చ అప్పుడే మొదలైంది.  

కిషన్ రెడ్డికి దమ్ముంటే జూబ్లీలో డిపాజిట్ తెచ్చుకోవాలి : సీఎం రేవంత్‌

  జూబ్లీ హిల్స్‌లో సెంటిమెంటో గెలుస్తుందో డెవలప్‌మెంటో గెలుస్తుందో తెలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.షేక్ పేట డివిజన్ పారా మౌంట్ కాలనీలో ముఖ్యమంత్రి ప్రచార సభ నిర్వహించారు. కిషన్ రెడ్డి..ఎందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వొద్దు? నీ అబ్బ జాగీరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే నీకు ఏం ఇబ్బందని రేవంత్ అన్నారు. రెహమత్ నగర్ లో నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పించిందని స్ఫష్టం చేశారు.  కాంగ్రెస్ అంటే ముస్లిం..ముస్లిం అంటే కాంగ్రెస్ అని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో  నేను మూడు సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఎంతో ఉందని సీఎం అన్నారు. ప్రధాని మోదీ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కటే అని కేసీఆర్ ప్రతి సారి కేంద్రంలో మోదీకి మద్దతు ఇచ్చాడని రేవంత్ అన్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని..బీఆర్ ఎస్ ముస్లిం లను మోసం చేస్తుందని పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ పైన సీబీఐ విచారణ అడిగితే మోదీ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ కార్ రేస్ కేసు లో కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ అనుమతించడం లేదని తెలిపారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే జూబ్లీ హిల్స్ లో డిపాజిట్  తెచ్చుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు. జూబ్లీ హిల్స్ గ్రౌండ్ లో అసలు బీజేపీనే లేదని తెలిపారు.

ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ : పల్లా శ్రీనివాస్

  మంగళగిరి నియోజకవర్గాల్లో సరిగ్గా గ్రీవెన్స్ నిర్వహించడం లేదని, నాయకులు ప్రజల సమస్యలు సరైన రీతిలో పరిష్కరించివుంటే మంత్రి లోకేష్  ప్రజాదర్బార్ కు 4వేల మంది ఎందుకు వస్తారు అని నాయకులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు మండిపడ్డారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యటించిన ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలతో ఆయన మాట్లాడుతూ.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని ఆదేశించారు.  ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని కోరారు. నవంబర్ 15వ తేది లోపు నియోజకవర్గ కమిటీల నుంచి గ్రామ స్థాయి కమిటీల వరకు పార్టీ నియామకాలు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. 15వ తేది లోపు పూర్తి చేయలేకపోతే జాతీయ అధ్యక్షులు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సంస్కృతి. క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. కొందరి నాయకుల వలన పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు వారి ప్రవర్తన మార్చుకోవాలని, మరలా పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో పార్టీ నాయకులు సఫలం కావాలి, దానికి తగ్గట్టు నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో నిర్వహిస్తూ.. క్యాడర్ ను కలుపుకుంటూ.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని సూచించారు. కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది.. అందరూ సఖ్యతతో పనిచేయాలి.. సంయమనం పాటించండి.. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టండంతో పాటు వైసీపీ దుష్ప్రచారాలకు ప్రజలు ప్రభావితం కాకుండా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయండని కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, పార్లమెంట్, నియోజకవర్గ ఇంచార్జులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.  

రంగంలోకి పవన్ కళ్యాణ్...బీజెపీకి మద్దతుగా ప్రచారం

  జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గోన్ననున్నారు.  బిజెపి అభ్యర్థికి లంకల దీపక్‌రెడ్డికి మద్దతుగా ఒక రోజు రోడ్-షో, బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా డిప్యూటీ సీఎంను బిజెపి నాయకులు  ఆహ్వానించారు. బిజెపికి మద్దతుగా తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తారు. జూబ్లీహిల్స్ లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ గౌడ్‌ మద్దతు ప్రకటించారు.  ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీబీజేపీ చీఫ్ ఎన్‌.రామచందర్‌రావు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గల్లీ గల్లీకి తిరుగుతు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా కేటీఆర్ రోడ్ షాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బిజెపి అభ్యర్థికి లంకల దీపక్‌రెడ్డికి గెలుపు కోరుకు మార్నింగ్ వాక్, పాదయాత్రలు చేస్తున్నారు.  

హర్యానాలో 5 లక్షల నకిలీ ఓట్లు : రాహుల్ గాంధీ

  హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో సీఈసీ చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాహుల్ విమర్శించారు. హరియాణలో ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ ఓటు ఉందని ఆరోపించారు. డూప్లికేట్ ఓట్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాప్ట్‌వేర్ ఉంది. అయినా 5 లక్షల నకిలీ ఓట్లు ఎలా వచ్చాయిని రాహుల్ ప్రశ్నించారు.  బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌కు కూడా 22 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఆమె ఫోటో ఒకటే అయినప్పటికీ సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధ పేర్ల, వయస్సులు, జెండర్లతో 22 ఓట్లను సృష్టించారు. హర్యానా ఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచించినప్పటికి ఫలితాలు భిన్నంగా వచ్చాయన్నారు. హెచ్ ఫైల్స్ అనే పదం గురించి ప్రస్తావించారు.ఓటు హక్కు నమోదుకు హౌస్ నెంబర్ తప్పనిసరి కావడంతో ఇళ్లు లేని నిరుపేదలకు ఇబ్బంది కలుగుతోందని ఈసీ ఓ కొత్త రూల్ తీసుకొచ్చిందని రాహుల్ గుర్తు చేశారు.  ఇల్లు లేని నిరుపేదలు ఓటు హక్కు నమోదు సమయంలో ఇంటి నెంబర్ ను ‘జీరో’ గా పేర్కొనే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. అయితే, ఈ విధానం వెనక నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలనే సదుద్దేశం కన్నా అక్రమ ఓటర్లు, ఫేక్ ఓటర్లకు జాబితాలో చోటు కల్పించాలనే దురుద్దేశమే ఉందని రాహుల్ విమర్శించారు .ఎన్నికల జాబితాలో ఇంటి నెంబర్ జీరోగా పేర్కొన్న పలు ఓటర్ల ఇళ్లను తన టీమ్ ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించిందని ఆయన తెలిపారు.  క్షేత్రస్థాయిలో జరిపిన ఈ పరిశీలనలో సంచలన విషయాలు బయటపడ్డాయని రాహుల్ చెప్పారు.హర్యానా చరిత్రలో తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదని, ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని, కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఓటమిగా మార్చడానికి ఒక ప్రణాళికను అమలు చేశారని రాహుల్‌ ఆరోపించారు. అయితే ఎన్నికల కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చాయి.   

బీజేపీది అతి విశ్వాసమా?.. అపజయ అంగీకారమా?

తెలంగాణలో బీజేపీది అతి విశ్వాసమో, అపజయ అంగీకారమో తెలియని పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలుపునకు తొలి అడుగుగా ఆ పార్టీ గంభీరంగా చెబుతున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ  ప్రచారం తీరు తెన్నులు చూస్తుంటే గెలుపు విషయంలో పెద్దగా నమ్మకం కలగడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎన్నికలకు ముందు వరకూ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే తరువాయి.. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న రీతిలో వ్యవహరించిన కమలం పార్టీ ఆ తరువాత చతికిల పడింది. అధికారం సంగతి అటుంచి కనీసం రెండో స్థానంలో కూడా నిలబడలేకపోయింది.   ఇక గత రెండేళ్లలో రాష్ట్రంలో బీజేపీ ఒకింత బలహీనపడిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థి ఎంపికకే చాలా సమయం తీసుకున్న ఆ పార్టీ.. ప్రచారంలోనూ వెనుకబడింది. ప్రచార సరళిని బట్టి చూస్తుంటే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అన్న అభిప్రాయం కలుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తులో ఉంది. కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేనలు భాగస్వాములుగా ఉన్నాయి. అయినా కూడా బీజేపీ తెలంగాణలో తెలుగుదేశం మద్దతును ఇప్పటి వరకూ కోరిన దాఖలాలు లేవు. ఎవరు ఔనన్నా కాదన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయినా కూడా  బీజేపీ తెలుగుదేశం పార్టీ మద్దతును కూడగట్టుకునే విషయంలో పెద్ద ఆసక్తి కనబరచడం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు జనసేన తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ను కలిసి మద్దతు కోరారు కానీ.. తెలుగుదేశం వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. జూబ్లీ ప్రచార పర్వం మరో ఆరు రోజులలో ముగియనుంది. పోలింగ్ ఈ నెల 11న జరుగుతుంది. అంటే సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికీ  బీజేపీ ప్రచారం పుంజుకోలేదు.  ఇలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తటస్థంగా ఉంది. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలేమీ లేకపోవడంతో తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకనేత అయిన రేవంత్ రెడ్డి పట్ల తెలంగాణ తెలుగుదేశంలో సాఫ్ట్ కార్నర్ ఉంది. తెలుగుదేశం శ్రేణుల మద్దతును ఇప్పటికే రేవంత్ కోరినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో  బీజేపీ  తెలుగుదేశం మద్దతును బహిరంగంగా కోరలేదు. అలా కోరితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిస్సందేహంగా బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యతిరేక పార్టీగానే చూస్తున్నట్లుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా ఉండిపోవడానికి ప్రధాన కారణం మాత్రం ఆ పార్టీ అతి విశ్వాసమేనని పరిశీలకులు అంటున్నారు.  అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకూ అది అతివిశ్వాసమా? అపజయ అంగీకారమా? తెలియడం లేదని చెబుతున్నారు.  

నాగబాబు పరిణితి.. కూటమికి మంచిదేగా!

మెగా బ్రదర్ నాగబాబు.. ఈ పేరు వినగానే ముందు వెనుకలు ఆలోచించకుండా, పర్యవశానాల గురించి పట్టించుకోకుండా దురుసు వ్యాఖ్యలు చేస్తారన్న అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు పలు సందర్భాలలో తెలుగుదేశం, జనసేన పార్టీలను సమస్యలలోకి నెట్టేశాయి కూడా. ముఖ్యంగా పిఠాపురం వర్మ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సయోధ్య బీటలువారేలా చేశాయి.  నాగబాబును తన కేబినెట్ లోకి తీసుకుంటానంటూ గతంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ అది జరగలేదనుకోండి అది వేరే సంగతి. కానీ చంద్రబాబు నాగబాబుకు కేబినెట్ బెర్త్ అనగానే తెలుగుదేశం శ్రేణులలో అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఆ అసంతృప్తిని తెలుగుదేశం క్యాడర్ దాచుకోలేదు కూడా. ఇందుకు కారణం గతంలో నాగబాబు తెలుగుదేశం పార్టీపైనా, పార్టీ అధినేత చంద్రబాబుపైనా చేసిన విమర్శలే అనడంలో సందేహం లేదు. అది పక్కన పెడితే నాగబాబు ఎమ్మెల్సీ అయిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదని నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం శ్రేణులు అంటుండేవి. ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి పర్యటనను తన సోదరుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నుంచే మొదలు పెట్టారు. కానీ ఆ పర్యటన ఆద్యంతం తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే విధంగానే సాగింది. ఆయన పిఠాపురం పర్యటనకు పిఠాపురం వర్మను దూరంగా ఉంచడమే అందుకు కారణం.  ఇలా ఉండగా ఇటీవలి కాలంలో నాగబాబు వ్యవహార శైలి మారిందనీ, ఆయనలో పరిణితి కనిపిస్తోందనీ పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా తాజాగా బాలకృష్ణ, చిరంజీవిల వివాదంపై ఆయన స్పందించిన తీరును చూపుతున్నారు. ఆ వివాదమేంటంటే.. ఇటీవల అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జగన్ ను సైకోగాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా జగన్ హయాంలో సినీమా టికెట్ల పెంపు వ్యవహారంలో జగన్ ను కలవడానికి వెళ్లిన అగ్రనటులకు అవమానం జరిగిందంటూ పేర్కొన్నారు. ఆ క్రమంలో బాలకృష్ణ చిరంజీవి పేరు కూడా ప్రస్తావించారు. చిరంజీవిని జగన్ అవమానించారన్నట్లుగా మాట్లాడారు. దానిపై చిరంజీవి వెంటనే స్పందించారు. తనకు జగన్ నుంచి ఎటువంటి అవమానం ఎదురుకాలేదంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిని వైసీపీయులు జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అది వేరు సంగతి కానీ బాలకృష్ణ వ్యాఖ్యలపై కానీ, చిరు స్పందనపై కానీ ఇటు సీఎం చంద్రబాబు కానీ, అటు డిప్యూటీ స్పీకర్ పవన్ కల్యాణ్ కానీ బహిరంగంగా స్పందించలేదు. నాగబాబు కూడా ఈ విషయంపై ఎటువంటి కామెంట్స్ చేయలేదు.  అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై అడిగిన ప్రశ్నకు నాగబాబు.. కూటమిలో భాగస్వాములుగా మేం సంయమనంతో వ్యవహరించాలి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అదే చేస్తున్నారు. మేం అదే అనుసరిస్తున్నాం. అనుసరించాలి కూడా అని జవాబిచ్చారు. ఇది నాగబాబులో వచ్చిన పరిణతికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 

ప్రజానాయకుడి ప్రజాదర్బార్!

ఆంధ్రప్రదేశ్ లో.. ఆ మాటకొస్తే దేశంలోనే  ఇప్పుడున్న అగ్రశ్రేణి రాజకీయ నేతలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అందరి కంటే సీనియర్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. సీనియారిటీలోనే కాదు.. ఆయన స్టేచర్, అనుభవం, దార్శనికతలలో మేటిగా నిలుస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆయనకు సాటి రాగల నేత కాగడా పెట్టి వెతికినా కనబడరు. అయితే ఆయన అంత సీనియారిటీ లేకపోయినా, యువనేత, మంత్రి నారాలోకేష్ ను చంద్రబాబుతో పోటీ పడుతున్న నేతగా చెప్పుకోవాల్సి ఉంటుంది.  తెలుగువన్  2023 జులైలో నిర్వహించిన ఆన్ లైన్ పోల్ సర్వేలోనే  చంద్రబాబు తరువాత ఏపీలో బెస్ట్ ఫాలోయింగ్ ఉన్న ప్రజానేతగా నారా లోకేష్ నిలిచారు.  నారా లోకేష్ ఈ స్థాయికి ఎదగడం వెనక కఠోర శ్రమ ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. రాజకీయంగా లోకేష్ తొలి అడుగు వేయకుండానే ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. బాడీషేమింగ్, ఆయన నడక, మాట ఇలా   కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రత్యర్ధులు శృతి మించి ఆయన్ను తూలనాడారు. లోకేష్ ఆహారం, ఆహార్యం ఇలా ప్రతి విషయంలోనూ ఆయనను గేలి చేశారు. రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు.   బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టి బెరుకు లేకుండా, బెదురు లేకుండా నిలదొక్కుకుని ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారారు. ఆ క్రమంలో ప్రజల హృదయాలనూ గెలుచుకున్నారు. ఇదీ నాడు తెలుగువన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ సర్వేలో తేలిన వాస్తవం.    అయితే అప్పటిలో ఆయనకు జనం బ్రహ్మరథం పట్టడానికి అప్పటికి ఆయన  చేస్తున్న యువగళం పాదయాత్ర ప్రధాన కారణమని చెప్పాలి. అయితే తెలుగువన్ ఆన్ లైన్ సర్వే నిర్వహించి రెండేళ్లు దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి కూడా 16 నెలలు గడిచిపోయింది. పార్టీలో, ప్రభుత్వంలో ఇప్పుడు నారా లోకేష్ అత్యంత కీలకం. ఈ స్థితిలో ఆయనలో, ఆయన వ్యవహార శైలిలో  ఏదైనా మార్పు ఉందా? అంటే పరిశీలకులు అబ్బో చాలా చాలా మార్పు ఉందంటున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మరింతగా ప్రజలతో మమేకమౌతున్నారని అంటున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఆయన చూపే చొరవ.. అక్కడికక్కడ తీసుకునే నిర్ణయాలతో ప్రజల నాయకుడిగా మరింతగా ఎదిగారని చెబుతున్నారు.     రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో వరుస విదేశీ పర్యటనల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటూనేజజ ప్రజా సమస్యల పరిష్కారం విషయం అత్యంత ప్రత్యేక దృష్టి సారిస్తూ లోకేష్ ఒకే సమయంలో అటు పెట్టుబడుల వేటలోనూ, ఇటు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలోనూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు.  ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు తాను రూపొందించుకున్న  ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని లోకేష్ అత్యంత శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే మంగళవారం (అక్టోబర్ 4) మంగళగిరిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. లోకేశ్ ను కలిసేందుకు వచ్చిన జనంతో అక్కడ అర కిలోమీటర్ కు పైగా క్యూ లైన్ ఏర్పడింది.ఇది తమ సమస్యల పరిష్కారం విషయంలో లోకేష్ పట్ల ప్రజలలో ఉన్న విశ్వాసం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.   ఉదయం 11 గంటలకు మొదలైన ఈ ప్రజాదర్భార్ లో లోకేష్ తో వ్యక్తిగతంగా సంభాషించి తమ సమస్యలు తెలుపుకోవడానికి వచ్చిన వేలాది మందిని ఆయన నిరాశపరచలేదు. దాదాపు నాలుగువేల మందిని కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా విని వాటి పరిష్కారం విషయంలో భరోసా ఇచ్చారు. తెలుగుదేశం  కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత   జూన్ 15, 2024న లోకేష్ ఈ ప్రజాదర్బార్ ను ప్రారంభించారు.  ప్రజల నుంచే నేరుగా వారి సమస్యలు తెలుసుకుని వాటిని వీలైనంత వేగంగా పరిష్కరించే నాయకుడిగా లోకేష్ లోకేష్ ఈ కార్యక్రమం ద్వారా జనాలకు మరింత చేరువ అవుతున్నారు.  

జగన్ రూటే సెపరేటు.. మొంథా తుపాను నష్టం పరిశీలన టూ లేటు

వైసీపీ అధినేత జ‌గ‌న్  రూటే సెపరేట్. ఆయన మాటలతో నేల విడిచి సాము చేస్తారు. ఏ విషయమైనా సరే.. తానైతేనా అని చెప్పుకుంటారు. తన మాటలను ఎవరైనా విశ్వసిస్తున్నారా? లేదా అన్న అనుమానమే ఆయనకు రాదు. ప్రత్యర్థులను విమర్శించడానికీ తనను పొగుడుకోవడానికీ మాత్రమే ఆయన నోరు తెరుస్తారు. అది ప్రెస్ మీట్ అయానా, బహిరంగ సభ అయినా, పరామర్శ యాత్ర అయినా, ఓదార్పుయాత్ర అయినా ఆయన ప్రసంగ సారాంశం ఒక్కటే.. సకల సమస్యల పరిష్కారం తన చేతిలో ఉందని చచెప్పడమే. తాజాగా కృష్ణా జిల్లాలో మొంథా తుఫాను ప్ర‌భావంతో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆయన మంగళవారం (నవంబర్ 4) ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన స‌హ‌జంగానే  తెలుగుదేం కూటమి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ విమర్శల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద ఎత్తున నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. తాను ఉంటే మొంథా తుపాను వచ్చేదే కాదన్నట్లుగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. దీంతో అంతా విస్తుపోయారు.   కృష్ణాజిల్లా రామరాజుపాలెం ప్రాంతంలోని ఆకుమర్రు లాకు వద్ద పంట పొలాలను జ‌గ‌న్ పరిశీలించారు. అయితే రైతులు కోరినా జగన్ మాత్రం పొలాల్లోకి అడుగుపెట్టలేదు.  ఇదే రకం పరిశీలనో అర్ధంగాక రైతులు తలలుబాదుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్న సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నానన్నారు.  మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పాతిక  జిల్లాల్లో పంట‌న‌ష్టం జ‌రిగింద‌న్నారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదన్నారు. రైతులకు అండగా తాను ఉంటాన్నన్నారు. వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతాన్నారు.  మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు.  రాష్ట్రంలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.  రైతుల‌కు స‌రైన స‌మ‌యంలో సొమ్ములు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు.  నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైసీపీ వారికి అండ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు.  కూట‌మి పాల‌న‌లో రైతుల‌కు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వ‌డం లేదని విమర్శించారు. అయితే గ్రౌండ్ రియాలిటీ మాత్రం జగన్ చెప్పిన దానికి భిన్నంగా ఉంది. ఈ విషయాన్ని రైతులే చెబుతున్నారు.సాధారణంగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ముందుగా విపక్ష నేత క్షేత్ర స్థాయికి చేరుకుని, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి ప్రజలతో మమేకమై అండగా ఉన్నామనీ, ఉంటామనీ హామీ ఇచ్చి ప్రజలతో మమేకమౌతారు. తద్వారా విపత్తు కారణంగా నష్టపోయిన వారికి సత్వరసాయం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలలో  మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులూ క్షేత్ర స్థాయిలో ప్రజలకు అండగా నిలిచారు. అదే సమయంలో వైసీపీ అధినేత బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై ఉన్నారు. అక్కడ నుంచే బాధితులకు అండగా నిలవాలంటూ పార్టీ నేతలూ, శ్రేణులకూ పిలుపునిచ్చారు. కానీ యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా.. అధినేతకే పట్టనప్పుడు తమకెందుకు అనుకున్నట్లుగా వైసీపీయులెవరూ గడపదాట లేదు.   మొంథాతుపాను తీరం దాటిన తరువాత ప్రభావిత ప్రాంతాలలో  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు  క్షేత్ర స్థాయిలో తిరిగారు. బాధితులను నేరుగా కలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులకు భరోసా ఇచ్చి ధైర్యం నింపారు. ఇదంతా జరుగుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ కనీసం రాష్ట్రంలో లేరు. బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.    తుపాను వచ్చి వెళ్లిపోయిన వారం రోజుల తరువాత ఆయన తీరిగ్గా తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు వచ్చారు. అయితే అప్పటికే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పలువురు మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, జరిగిన నష్టాన్ని పరిశీలించి, కేంద్రానికి నివేదిక పంపి తగు విధంగా ఆదుకోవాలని కోరడం కూడా జరిగిపోయింది. జగన్ పర్యటన చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం మంకుపట్టు పట్టి కూర్చున్న జగన్ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా ఆయన తన బాధ్యతలను పూర్తిగా విస్మరించారనీ, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు పూర్తిగా ముఖం చాటేసి ఇప్పుడు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వల్ల ప్రయోజనం ఇసుమంతైనా ఉండదనీ అంటున్నారు.  

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మైనర్లను సైతం ప్రచారం లో వాడారంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై ఫిర్యాదు నమోదైంది.  యూసుఫ్ గూడా కు చెందిన షఫీయుద్దీన్ అనే  ఈ ఫిర్యాదు చేశారు.  ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో మైనారిటీ తీరని పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ  కేటీఆర్ పై షఫీయుద్దీన్ ఫిర్యాదు చేశారు.   ఈ నెల 2న బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్  నిర్వహించిన సమావేశంలో  కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా,  ఒక మైనర్ బాలిక ను వేదికపై తీసుకువచ్చి రాజకీయ ప్రేరేపిత , భావోద్వేగ ప్రకటన చేయించారనీ, తద్వారా ఓటర్లలో  సానుభూతిని ప్రేరేపించడానికి,  ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  మైలేజ్ ల కోసం మైనారిటీ తీరన పిల్లలను ప్రచార సభలకు తీసుకువస్తున్నారంటూ షపీవుద్దీన్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి  తక్షణమే చర్యలు తీసు కోవాలని  కోరారు. 

నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే 4 వేల ఇళ్లు కట్టిస్తా : సీఎం రేవంత్

  బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో  రహమత్‌నగర్‌లో ముఖ్యమంత్రి రోడ్‌షో చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేయిల కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన ప్రధాని మోదీ, అమిత్‌షా ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మంత్రి హరీష్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈనెల 11లోగా వారిని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.  ఫార్ములా ఈరేసు పేరుతో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.  విచారణ జరిపి గవర్నర్‌కు పంపితే ఇప్పటివరకు అరెస్ట్ అనుమతి ఇవ్వలేదని సీఎం అన్నారు. కారు పార్టీ కమలం పార్టీ ఫెవికాల్‌ బంధం ఉందని పేర్కొన్నారు. 2007లో పి.జనార్దన్‌రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక వస్తే కేసీఆర్‌, టీఆర్‌ఎస్ క్యాండెట్‌ను పోటీలో నిలబెట్టారని సిట్టింగ్‌ ఎమ్మెల్యే చనిపోతే వచ్చే ప్రతి ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అధినేత అభ్యర్థిని పెట్టారని రేవంత్ అన్నారు. రెండేళ్ల పాలనలో జూబ్లీహిల్స్‌లో 14,159 రేషన్‌ కార్డులు మంజూరు చేశామని నవీన్ యాదవ్ గెలిపిస్తే 4 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.  జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి  30 వేల మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని ముఖ్యమంత్రి విశ్వసం వ్యక్తం చేశారు  

జూబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన

  జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలతోతెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్  పలువురు జనసేన నాయకులు సమావేశం అయ్యారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటామని వారు తెలిపారు. జూబ్లీ  బైపోల్‌కు ఇంకా ఆరు రోజులే ఉండటంతో ప్రచారం ఊపు అందుకుంది. కమలం పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగ ప్రచారం చేస్తున్నారు. లంకల దీపక్ రెడ్డి తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ మద్దతు ప్రకటించడంతో కమలం పార్టీలో నూతన జోష్ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటింది. బీఆర్ఎస్ తరుఫున గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగగా..2025, నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు ఫలితం వెలువడనుంది. ఎన్నికకు మరో 6 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. 

మంత్రి అజారుద్దీన్ శాఖలివే!

ఇటీవలే రేవంత్ కేబిరెట్ లో బెర్త్ లభించిన మహ్మద్ అజారుద్దీన్ కు మైనారిటీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు దక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి నుంచీ అజారుద్దీన్ కు హోంశాఖ కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆ శాఖ ముఖ్యమంత్రి అధీనంలో ఉండటమే. దీంతో కొంత మేర ఒత్తిడి తొలగించుకునేందుకు ముఖ్యమంత్రి హోంశాఖను అజారుద్దీన్ కు కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణుల నుంచీ, ప్రభుత్వ వర్గాల నుంచీ ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖను తన వద్దే అట్టేపెట్టుకున్నారు. అజారుద్దీన్ కు ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ శాఖలు అప్పగించారు. 

తాళం తీసింది నేనే.. దొంగ మాత్రం ఆయనే!

మాట్లాడింది నేనే.. కంటెంట్ నాది కాదు.. పోలీసుల విచారణలో శ్యామల వైసీపీలో అధినేత నుంచి అధికార ప్రతినిథి వరకూ అందరూ స్క్రిప్ట్ రీడర్లే తప్ప.. వారి వద్ద ఒరిజినల్ కంటెంట్ లేదన్న సెటైర్లు పేలుతున్నాయి.  ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. అందులో ఏముంది? ఆ ఉన్నదాంట్లో వాస్తవమేంటి? అన్న విషయంతో వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం ఉండదని అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్క్రిప్ట్ లేకండా సొంతంగా ప్రసంగం చేయడం ఇప్పటి వరకూ ఎవరూచూడలేదు. అధికారంలో ఉన్నప్పుడూ అదే పరిస్థితి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పూ లేదు.  స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని తన బలహీనత బయటపడకూడదని ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్కటంటే ఒక్కసారి కూడా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడింది లేదు. ఇక బహిరంగ సభలో అయితే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేయడమే చూశాం. అది కూడా గడగడా కాదు.. తడబడుతూ, నట్టుతూ నిమిషనిమిషానికీ ముందున్న పేపర్లు చూసుకుంటూ చదవడమే. అయితే బహిరంగ సభల్లో ఆయనకు ఉన్న వెసులుబాటు ఏంటంటే.. మీడియా ప్రతినిథులు ప్రశ్నలు వేయరు. వేయలేరు. దాంతో ఆయన చదవాల్సిది చదివేసి వెళ్లిపోయేవారు. ఇక అధికారం కోల్పోయిన తరువాత మీడియా సమావేశాలు ఏర్పాటు చేయక తప్పని సరిపరిస్థితి.  అప్పూడూ అంతే తాను చదవాల్సింది  చదివేసి ప్రశ్నల వేసే అవకాశం విలేకరులకు ఇవ్వకుండా ప్రెస్ మీట్ ముగించేస్తున్నారు.  ఇప్పుడు అధకారం కోల్పోయిన తరువాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తాను మట్లాడాల్సింది మాట్లాడేసి.. అదే ఫైనల్ అన్నట్లుగా ముగించేయడం తెలిసిందే. ఒక సందర్భంలో తాను మాట్లాడుతుంటే మధ్యలో ప్రశ్నలు వేయవద్దు ఫ్లో దెబ్బతింటుందంటూ మీడియాపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.  మొత్తంగా జగన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం అన్న సంగతి కొత్తేం కాదు. అందరికీ తెలిసిన సంగతే. అందుకే జగన్ ప్రసంగాలలో విషయం అంటే అతిశయం, ఆడంబరం ఎక్కువగా ఉంటాయి. అందుకు కారణం ఆయన ప్రసంగంలో విషయం ఏమిటన్నది ఆయనకే పెద్దగా తెలియకపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    అందుకే తరచుగా  జగన్  స్క్రిప్ట్ రీడింగ్ ప్రసంగాలన్నీ బూమరాంగ్ అవ్యడమో నవ్వుల పాలు కావడమో  జరుగుతుంటాయంటారు.  ఇప్పుడు తాజాగా తేలిన విషయమేంటంటే.. జగన్ పార్టీలో కీలక పదవులు, పొజిషన్ లలో ఉన్న చాలా మంది పరిస్థితీ అదేనని. వైసీపీ  ప్రసంగీకులలో చాలా మంది ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి తమ భుజాలు తామే చరిచేసుకుంటారని ఆ పార్టీ అధికార ప్రతినిథి తేటతెల్లం చేశారు.  అదెలాగంటే.. ఇటీవల కర్నూలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై వైసీపీ అధికార ప్రతినిథి విమర్శలు గుప్పించేశారు. ఆ బస్సు డ్రైవర్, అతడి సహాయకుడూ కూడా బెల్టు షాపులో తప్పతాడి బస్సెక్కారనీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం హయాంలో బెల్టు షాపులు తామరతంపరగా వెలిశాయనీ, అదే కర్నూలు బస్సు దుర్ఘటనకు కారణమని ఆరోపణలు చేశారు.  దీంతో బస్సు ప్రమాద ఘటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ.. పోలీసులు శ్యామల సహా 27 మందిపై కేసు  నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా వైసీపీ అధికార ప్రతినిథి శ్యామలను సోమవారం (నవంబర్ 3) విచారణకు పిలిచారు. ఆ విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్యామల సమాథానం చెప్పడంలో తడబడ్డారని తెలిసింది. మరీ ముఖ్యంగా డ్రైవర్ తాగి బస్సు నడిపారనడానికి ఆధారాలేంటి అన్న ప్రశ్నకు శ్యామల సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారని తెలిసింది. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణాలేమిటన్నది తనకు తెలియదనీ.. వైసీపీ అధికార ప్రతినిథిగా పార్టీ తనకు ఇచ్చిన స్క్రిప్ట్ ను తాను చదివాననీ అంగీకరించేసినట్లు సమాచారం.   అయితే విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ శ్యామల ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు విచారణలకు పిలిచినా భయపడేది లేదని చెప్పుకొచ్చారనుకోండి అది వేరే సంగతి.

రాజకీయాలు ఇప్పుడు కాదు.. వైసీపీకి లోకేష్ హితవు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అభివృద్ధి సందడి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా తరలివస్తున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు దిగ్గజ సంస్థలు తరలివస్తున్నాయి. అయితే అదే సమయంలో  ప్రతిపక్షహోదా కూడా లేని వైసీపీ రాజకీయాలు చేస్తున్నది. పెట్టుబడులను అడ్డుకునే విధంగా రాజకీయవిమర్శలకు తెగబడుతోంది. ఈ తరుణంలోనే రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రతిపాదన చేశారు. రాజకీయాలకు ఇంకా చాలా చాలా సమయం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి దోహదపడండి అంటూ వైసీపీకి పిలుపునిచ్చారు.   రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటైన 16 నెలలలో  రాష్ట్రానికి  పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. సోమవారం (నవంబర్ 3) మీడియాతో మాట్లాడిన ఆయన ఈ పెట్టుబడులలో అర్సేల్లర్ మిల్లర్ లక్షా ఐదువేల కోట్ల రూపాయలు, గూగుల్ 87 వేల కోట్ల రూపాయలు, అలాగే బీపీసీఎల్ లక్ష కోట్ల రూపాయలు, ఎన్టీపీసీ లక్షా పాతిక వేల కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకం ఏర్పడేలా ఈ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం కరెక్టు కాదని ఆయన వైసీపీకి సూచించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేద్దామనీ, ప్రస్తుతం సమష్టిగా రాష్ట్రప్రగతికి కృషి చేద్దామనీ లోకేష్ పిలుపునిచ్చారు. మేమే కాదు, మీరు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చునని,  రాష్ట్ర అభివృద్ధి అనేది సమష్టిగా చేయాల్సిన పని అనీ హితవు పలికారు.  పెట్టుబడులకు వైసీపీ నాయకులు ఎవరినైనా సిఫార్సులు చేస్తే ఆమోదిస్తామన్నారు.   అదే సమయంలో వైసీపీపై విమర్శలూ గుప్పించారు.  విశాఖకు వచ్చిన గూగుల్ డేటా కేంద్రంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ జనంలో లేని పోని భయాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.  డేటా కేంద్రం ఏర్పాటుతో రేడియేషన్ పెరిగి చెట్టు పెరగవంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు సత్యదూరాలన్న ఆయన  అన్నీ ఆలోచించే సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు.  దేశానికి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా కేంద్రమేనన్న లోకేష్.. దీనివల్ల భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనీ,  విశాఖ రూపురేకలు కూడా ప్రపంచ స్థాయికి పెరుగుతాయన్నారు.  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందని, దీనికి సీఎం చంద్రబాబు విజనే కారణమని లోకేష్ వివరించారు.

పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, కేశినేని

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పంచాయతీని పరిష్కరించేందుకు తెలుగుదేశం అధిష్ఠానం సమాయత్తమౌంది. ఇరువురినీ మంగళవారం (నవంబర్ 4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాల్సిందిగా తాఖీదులు జారీ చేసింది. ఇరువురినీ వేర్వేరుగా క్రమశిక్షణ కమిటీ విచారించి, వారి నుంచి వివరణ తీసుకోనుంది. ఇందుకోసం ఇప్పటికే కొలికపూడి శ్రీనివాసరావు మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.   గత నెలలో వీరిరువురూ బహిరంగంగా  ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలతో మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ వీరి వ్యవహారం మీడియాలోనూ, రాజకీయవర్గాలలోనూ, సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ అవుతోంది.  ఈ నేపథ్యంలోనే వీరిరువురినీ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు.  ఇద్దరు నేతలు ఇచ్చే వివరణ ఆధారంగా వీరిపై చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి.  దీంతోనైనా వీరిరువురి పంచాయతీకి తెరపడుతుందా? లేదా చూడాల్సి ఉంది. 

బీఆర్ఎస్ హైడ్రా పాలిటిక్స్ ...కొంపముంచేనా?

  హైడ్రాతో జూబ్లీహిల్స్ ఎన్నికలను గట్టెక్కాలని బీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలను చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా వస్తుందని మీ ఇళ్లను కూల్చివేస్తుందన ఓటర్లను భయపెట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున హైడ్రా బాధితుల పేరుతో కొంతమందిని తీసుకు వచ్చి వారి బాధల్ని వినిపించారు. అందులో చిన్న పిల్లలు, వికలాగంలు,మహిళలు ,అనాధలు ఇలాంటి సమీకరణాల్ని చూసుకున్నారు. ఆ వీడియోలు వీలైనంతగా జూబ్లీహిల్స్ ప్రజలకు పంపుతారు. అంత వరకూ బాగానే ఉంది కానీ జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ ఓస్తే హైడ్రా మాత్రం రాకుండా ఉంటుందా అన్న డౌట్ ప్రజలకు వస్తే సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నేతల వద్ద సమాధానం లేదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి వద్ద ఉంది. ఓడితేనే హైడ్రా వస్తుంది.. గెలిస్తే రాదు ! జరుగుతోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక మాత్రమే. ఆ ఉపఎన్నిక సీటు కాంగ్రెస్ పార్టీ బలంపై ఎలాంటి ప్రభావం చూపదు. గెలిస్తే ఓ సీటు పెరుగుతుంది. కానీ ఓడిపోతే తగ్గదు. ఎందుకంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఈ ఎన్నికల వల్ల ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీని గెలిపించినా హైడ్రా చేయాలనుకుంటే తమ పనులు చేసేస్తుంది. బీఆర్ఎస్ తరపున గెలిచే ఎమ్మెల్యే కూడా ఆపలేరు. తాము ఆపగలుగుతామని కూడా బీఆర్ఎస్ చెప్పడం లేదు. అక్కడే అసలు పాయింట్ ఉంది. కేవలం భయపెట్టి ఓట్లు పొందాలనుకుంటున్నారు. అంతకు మించిన ఆలోచన ప్రజలు చేస్తారని అనుకోవడం లేదు. కాంగ్రెస్ ను ఓడించడం రెచ్చగొట్టడమే అని ఓటర్లు అనుకుంటే అంతా రివర్స్ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెచ్చగొడితే రేపు తమ ఇళ్ల మీదకు హైడ్రాను తీసుకు వస్తే ఎవరు అండగా ఉంటారన్న ప్రశ్న బీఆర్ఎస్ ప్రచారం వల్ల ప్రజలకు వస్తుంది. అప్పుడు వారికి కనిపించే సమాధానం… కాంగ్రెస్ ను ఓడించడం ఎందుకు.. ఓ ఓటు వేస్తే పోలా అని. ఒక వేళ ఓటు వేసిన తర్వాత కూడా హైడ్రా వస్తే వారికి నవీన్ యాదవ్ ఉంటారు. నవీన్ యాదవ్ లోకల్ లీడర్. రాత్రికి రాత్రి వచ్చిన నేత కాదు. అక్కడ ప్రతి బస్తీలోనూ.. ఆయనకు అనుచరగణం..బలం ఉంటుంది. కాబట్టి ఆయన కాపాడుతారనే నమ్మకం ఉంటుంది. బీఆర్ఎస్ ప్రచారాన్ని కాంగ్రెస్ వాడుకుంటుందా? నిజానికి జూబ్లీహిల్స్ లో హైడ్రాకు పని ఉండదు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే.. చెరువును కబ్జా చేస్తే మాత్రం హైడ్రా వెళ్తుంది. జూబ్లీహిల్స్ మొత్తం కిక్కిరిసిపోయిన జనవాసాల కాలనీలే ఉంటాయి. ఏదైనా సమస్య ఉంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది కానీ.. హైడ్రా వరకూ వెళ్లలేదు. కానీ బీఆర్ఎస్ లోతుగా ఆలోచించలేక.. పూర్తిగా హైడ్రాను ఆయుధంగా చేసుకుంటుంది. ప్రజలు తమ జోలికి హైడ్రా రాకుండా ఉండాలంటే..కాంగ్రెస్‌కు ఓటేయడం బెటర్ అనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయినట్లే. అయితే కాంగ్రెస్ ఎలా వాడుకుంటుది అన్నదానిపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. హైడ్రా కూల్చివేతలపై బాధితులతో కలిసి తెలంగాణ భవన్‌లో  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు...ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క కొత్త కట్టడం లేదు. రేవంత్‌రెడ్డి చేసింది ఏంటి అంటే.. కూలగొట్టడమే’ కేటీఆర్‌ మండిపడ్డారు.  మరో 500 రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి రానుందని, అప్పుడు బాధితులందరికీ న్యాయం   చేస్తామని తెలిపారు.‘హైడ్రా అరాచకాలు: పెద్దలకు న్యాయం, పేదలకు అన్యాయం’పేరుతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి  పాలనలో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం లభిస్తోందని ప్రశ్నించారు. ఒవైసీ స్కూళ్లు కూడా కూల్చివేసిన ప్రభుత్వం, గర్భిణులను పక్కకు తోసేసి, మూడేళ్ల చిన్నారులు భోజనం లేకుండా ఏడ్చేలా చేసిందని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌లో మంత్రి వ‌ర్గ చిచ్చు

  అస‌లే కాంగ్రెస్ ఆపై మంత్రిప‌ద‌వుల‌కు ఆశావ‌హులు చాలా మందే ఉంటారు. ఆ మాట‌కొస్తే అక్క‌డ ముఖ్యమంత్రి ప‌ద‌వి కోసం కూడా పోటీ పెద్ద ఎత్తునే ఉంటుంది. అలాంటిది మంత్రి ప‌దవిపై మాత్రం కాంపిటిష‌న్ ఉండ‌దా?  మొద‌టి లొల్లి మైనార్టీ  నాయ‌కుల  నుంచి  మొద‌లైందట‌. అజారుద్దీనే మైనార్టీ నేత  అయితే మ‌రి మేమంతా  ఎవ‌రు? అని నిల‌దీస్తున్నారు ఫిరోజ్  ఖాన్, సీనియ‌ర్ లీడ‌ర్  ష‌బ్బీర్ అలీ.  వీరిద్ద‌రూ ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కులు. అజారుద్దీన్ లా స్పోర్ట్స్ కోటాలో ప‌ద‌వి కొట్టేసిన  బాప‌తు కాదు. దీంతో మాకెందుకివ్వ‌లేదు మంత్రి ప‌ద‌వి? అన్న‌ది వీరి ప్ర‌శ్న‌. అజారుద్దీన్ కన్నా మాకేం  త‌క్కువ‌. అజార్ క‌న్నా తెలుగు రాదు. అదే  మాకు అలాక్కాదు క‌దా.. తెలుగులోనూ మాట్లాడి క‌వ‌ర్ చేస్తాం.. అంటారు వీరు. అజారుద్దీన్ అంటే గ‌తంలో జూబ్లీహిల్స్ రేసు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాబ‌ట్టి.. ఆయ‌న్ని మంత్రిని చేస్తే జూబ్లీహిల్స్ లోని మైనార్టీ ఓటు బ్యాంకును విశేషంగా ఆక‌ట్టుకోవ‌చ్చ‌న్న‌ది అధిష్టానం ఆలోచ‌న. అయితే  నేను ఇక్క‌డి నుంచి పోటీ  చేయాల్సింది. నేను త్యాగం  చేయ‌డం వ‌ల్లే న‌వీన్‌కి  వ‌చ్చిందా టికెట్ కాబ‌ట్టి నాకు క‌దా  ప‌ద‌వి ఇవ్వాల్సింద‌ని అంటారు అంజ‌న్ కుమార్ యాద‌వ్. ప‌దేళ్లుగా బీఆర్ఎస్ తో కొట్లాడిన నాకు మంత్రి ప‌దవి ఏదీ? అంటూ నిల‌దీస్తారు జీవ‌న్ రెడ్డి. ఇలా మంత్రి  ప‌ద‌వుల‌పై బీభ‌త్స‌మైన గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. అదృష్ట‌మో దుర‌దృష్ట‌మో.. ఇక్క‌డ గోపీనాథ్ మ‌ర‌ణించ‌డం. ఆ టికెట్ అజారుద్దీన్ ఆశించ‌డం. అటు పిమ్మ‌ట  దానికి న‌వీన్ యాద‌వ్ పోటీ రావ‌డం. అజారుద్దీన్ని ఎలాగైనా  స‌రే బుజ్జ‌గించాల్సిందే అన్న ప్ర‌శ్న త‌లెత్తిన‌ప‌పుడు మిగిలి ఉంచిన మూడు మంత్రి ప‌ద‌వుల్లో ఒక‌టి ఆయ‌న‌కు మైనార్టీ కోటా కింద ఇవ్వ‌డం జ‌రిగింది. అప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న‌రావు స్తానంలో హెచ్. సీ. ఏ అధ్య‌క్ష ప‌ద‌వికి  అజారుద్దీన్ని పంపాల‌నుకున్నారు.  కానీ, అందుకు ఆయ‌న స‌సేమిరా అన‌డంతో.. ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డానికి సిద్ధ ప‌డింది కాంగ్రెస్ అధిష్టానం. అలాగ‌ని ఈ ఎపిసోడ్ ఇక్క‌డితో ముగిసిపోలేదు. ఎమ్మెల్యేల‌కు నామినేటెడ్ పోస్టులు ఇవ్వ‌డంపైనా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ్. జ‌గ్గారెడ్డి, మ‌ధు  యాష్కి వంటి సీనియ‌ర్లు ఈ విష‌యంలో గుర్రుగా ఉన్నార‌ట‌. త‌మ‌ను అడ‌క్కుండా,  బుజ్జ‌గించ‌కుండా ఇలా ఎలా చేస్తార‌ని వారు అంటున్నారట‌. కొంద‌రైతే వీరెన్ని చేసినా  జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపు అంతంత మాత్ర‌మే అని ఓపెన్ కామెంట్లు చేస్తున్నార‌ట‌.