అందుకే జగన్‌ అసెంబ్లీ రావడం లేదు : స్పీకర్ అయ్యన్న

  వైసీపీ అధినే జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని  ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీ శాసన సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై సభాపతి స్పందించారు. జగన్‌కు సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన సమయమే  ఇస్తామని స్ఫష్టం చేశారు. ఆయన మీడియా ముందు కాకుండా అసెంబ్లీ కొచ్చి మాట్లాడాలని హితవు పలికారు.  నా ముందు అధ్యక్ష అనడం ఇష్టం లేక అసెంబ్లీకి  రావడం లేదని తెలిపారు. వైసీపీ 10 మంది  ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు జగన్‌ తప్ప..  కానీ అసెంబ్లీకి మాత్రం రావడం లేదని స్పీకర్ తెలిపారు. గత జగన్ హయాంలో ఏపీ సర్వనాశనమైందని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో 41 రోజుల పాటు నిర్వహిస్తున్న మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగ, చంఢీయాగ, నవగ్రహ యాగాల్లో సభాపతి అయ్యన్న సోమవారం పాల్గొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని కాపాడారని. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు  చిత్తశుద్ధిగా పని చేస్తుంటే వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ అధికారులపై కేసు.. వివేకా హత్య కేసులో డాక్టర్ సునీతకు నైతిక విజయం.. భారీ ఊరట!

దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరి డాక్టర్   సునీతకు ఏళ్ల తరబడి చేస్తున్న న్యాయపోరాటంలో ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది.  2019లో తన తండ్రి దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ తండ్రి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలంటూ చేస్తున్న న్యాయపోరాటంలో డాక్టర్ సునీత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని పట్టుదలతో  న్యాయం కోసం అవిశ్రా పోరాటం సాగించారు. సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.  ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సోదరుడు జగన్  ఉన్న సమయంలోనే ఆమెకు ఈ సవాళ్లు ఎదురయ్యాయి. వైఎస్ వివేకా హత్య కేసులో  పోలీసులు ఆమె, ఆమె భర్తపై  క్రిమినల్ కేసులు నమోదు చేశారు.  విచారణలంటూ వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సునీత, ఆమె భర్తపై నమోదు చేసినవన్నీ తప్పుడు కేసులంటూ కొట్టివేసింది. అంతే కాదు.. ఈ తప్పుడు కేసులు నమోదు చేసిన అప్పటి అధికారులపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. ఇంతకీ అప్పట్లో సునీతపై, ఆమె భర్తపై అక్రమంగా కేసులు నమోదు చేసిన అధికారులు ఎవరంటే.. అప్పటి  ఏఎస్ఐ రామకృష్ణ రెడ్డి, అప్పటి ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి.  ఆ ఇద్దరూ కూడా ప్రస్తుతం పదవీ విరమణ చేశారు. అయినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారిరువురిపై శాఖాపరమైన విచారణకు నిర్ణయించిందని చెబుతున్నారు.  ఆ ఇరువురిపై శాఖాపరమైన విచారణ లేదా దర్యాప్తు పూర్తయ్యే వరకూ  వారి పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.  ఆ తప్పుడు కేసుల నమోదుకు తెరవెనుక ఉండి చక్రం తిప్పిన వారిని సైతం గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.    ఇప్పటికే ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కొత్తగా ఫిర్యాదు నమోదైంది. లింగాలకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి సునీత, ఆమె భర్తపై అక్రమ కేసులు నమోదు చేయడం, వేధించడంలో కీలక పాత్ర పోషించిన  అప్పటి ఎఎఐ రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ రాజేశ్వరరెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొత్తగా ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదుపై వారిరువురిపై కేసు నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  సంవత్సరాల పోరాటం తరువాత దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతకు ప్రస్తుత పరిణామం నైతిక విజయంగా పరిశీలకులు ఆభివర్ణిస్తున్నారు. నాడు తప్పుడు కేసులతో తనను వేధించిన అధికారులే ఇప్పుడు నిందితులుగా బోనెక్కాల్సిరాడమంటే ఇది క చ్చితంగా వివేకా హత్య కేసులో న్యాయం దిశగా పడిన కీలక అడుగుగా భావించాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  

అంబటినోట టీటీడీపై ప్రశంసలు.. అన్నప్రసాదం అద్భుతం అంటూ పొగడ్తలు

తిరుమలలో అన్న ప్రసాదం నాణ్యత విషయంలో వైసీపీ హార్డ్ కోర్ నేతలు కూడా ప్రశంసించక తప్పడం లేదు. ప్రత్యర్థుల ప్రశంసలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎత్తి చూపడానికీ, వంక పెట్టడానికి ఇసుమంతైనా అవకాశం లేకుండా.. తెగడ్తలు గుప్పిద్దామన్నా నోటినుంచే పొగడ్తలు వచ్చేలా అన్న ప్రసాదం నాణ్యత, రుచి, శుభ్రత ఉంటున్నాయి. ఇందుకు తాజా నిదర్శనమే..నిత్యం తెలుగుదేశం ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నాయకులపైనా విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు తిరుమలలో అన్నప్రసాదం నాణ్యత, అన్న ప్రాసాదం క్యాంటిన్ లో శుచి, శుభ్రతల గురించి మైమరిచి మరీ పొగడ్తల వర్షం కురిపించారు.  వైసీపీ హయాంలో అన్న ప్రసాదం ఒక్కటే కాదు, చివరాఖరికిరి తరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా ఉందన్న ఆరోపణలు భక్తుల నుంచే వచ్చాయి. అవేమీ రాజకీయ ఆరోపణలకు కావని లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ గురించిన సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది కూడా. వైసీపీ హయాంలో అసలు తిరపతిలో భక్తుల సౌకర్యాలను గురించి పట్టించుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడుతూ, తిరుమల కొండపై పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సౌకర్యాల కల్పన ఉందన్న ప్రశంశలు వస్తున్నాయి. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వరంలో నడుస్తున్న శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు.   ఆ క్యాంటిన్ ను నిర్వహిస్తున్న తీరు, అక్కడి శుచి, శుభ్రత, అన్నప్రసాదం నాణ్యత, రుచి అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు గుప్పించారు. అక్కడితో ఆగకుండా.. తాను కుటుంబ సభ్యులతో కలిసి  శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో  భోజనం చేస్తున్న వీడియోను  షేర్ చేశారు.  ఆహారం నాణ్యత, నిర్వహణ, పారిశుధ్యం, భక్తులకు అన్నప్రసాదం వడ్డన ఇలా అన్నీ ఏగ్రేడ్ లో ఉన్నాయంటూ ప్రశంసించారు.  ఇదే ప్రశంస వేరే ఎవరినుంచైనా వచ్చి ఉంటే.. వైసీపీ.. రాజకీయం చేసి ఉండేది. ఎల్లో మీడియా ప్రచారం అంటూ ఊరూవాడా ఏకం చేసేసేది.  కానీ ఇక్కడ ఈ పొగడ్తలు వైసీపీ సీనియర్ నాయకుడు, కరుడుగట్టిన తెలుగుదేశం వ్యతిరేకి అయిన అంబటి రాంబాబు నుంచి వచ్చాయి.   దీంతో వైసీపీకి గొంతులో పచ్చవెలగకాయ పడినట్లు అయ్యింది.  ఇటీవలి కాలంలో టీటీడీపై వైసీపీయులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇకపై వారు టీటీడీపై విమర్శ చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించకతప్పని పరిస్థితిని అంబటి రాంబాబు పొగత్తలు కల్పించాయి.  

ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం

  జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 వారాలుగా మోగిన మైకులు, ఉపన్యాసాలిచ్చిన నేతలు సైలెంట్ అయ్యాయి. మరోవైపు బీహార్‌లోనూ రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 407 పోలింగ్ బూత్‌లు  ఏర్పాటు చేశాం. మూడంచెల భద్రత ఉంటుంది. 45 FST, 45 SST టీమ్స్ నియోజకవర్గం లో పని చేస్తున్నాయి. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు. పారా మిలిటరీ బలగాలు.. ‘‘561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల క్యూ మెయింటెన్ చేయడానికి ఎన్‌సీసీ వాలంటీర్లు పని చేయనున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తుమని తెలిపారు 26 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి తెలిపారు.పోస్టల్ బ్యాలెట్ ద్వారా 103 మంది ఓటింగ్ పూర్తిందని పేర్కొన్నారు. ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారని ఈ నెల 11న పోలింగ్.. 14న కౌంటింగ్, ఫలితాల వెల్లడి తాయని తెలిపారు  

ఓటర్ కార్డులో సునీత భర్త పేరు వేరే ఉంది...బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

  బీజేపీ అంటేనే హిందువు... హిందువు అంటేనే బీజేపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో పాదయాత్ర చేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతు 20 శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే  కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి మ మాట్లాడుతున్నారంటే ఏమనాలి అని  బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.  అయ్య పేరు చెప్పి గెలిచిన బతుకు కేటీఆర్ ది.... అయ్య లేకుంటే ఆయనను కుక్కలు కూడా దేకవ్ అని కేంద్ర మంత్రి విమర్శించారు. 2014కు ముందే తెలంగాణ కోసం, హిందుత్వం కోసం పోరాడితే 60 కేసులు పెట్టారు. 7సార్లు జైలుకు పోయి వచ్చిన... నీకు నాతో పోలికా? అని అన్నారు. మాగంటి గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారు...అదేనెల 25న గోపీనాథ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదిగో ఆధారాలు... కంప్లయింట్ కాపీ పంపిస్తున్నా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంజయ్ తెలిపారు.  గోపీనాథ్ కొడుకును ఇండియాకు రాకుండా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించిన మాట వాస్తవని ప్రశ్నించారు కేంద్రమంత్రి. వాటికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ ను గోపీనాథ్ కుటుంబ సభ్యులు చూపించారని తెలిపారు. మాగంటి సునీత తప్పుడు ఆధారాలు చూపించి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకుందని ఆయన తెలిపారు. విచారణలో ఆమె తప్పుడు  సమాచారమిచ్చినట్లు తేలడంతో ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికేట్ ను రద్దు చేసిందని బండి సంజయ్ అన్నారు. ఒక ఓటర్ కార్డులో సునీత భర్త పేరు సునీత మనోహర్ అని ఉందని..ఇంకో ఓటర్ కార్డులో సునీత భర్త పేరు మాగంటి గోపీనాథ్ అని ఉందని సంజయ్ ఆరోపించారు. ఇదిగో ఆ ఓటర్ కార్డులను మీకు పంపిస్తున్నా...విచారణ జరపించాలని రేవంత్ రెడ్డికి సవాల్  విసిరారు.  2023 ఎన్నికల అఫిడవిట్ లో మాగంటి సునీతకు చదువుకోలేదని రాసిచ్చారని..2025లో ఎన్నికల అఫిడవిట్ లో టెన్త్ వరకు చదువుకున్నారని రాసిచ్చారని ఆయన తెలిపారు వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలిపారు. గోపీనాథ్ ఆస్తులపై సునీతతో కలిసి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కన్నతల్లిని కూడా గోపీనాథ్ ను చూడనీయకుండా ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యంతో నోటీసులిప్పించారని ఆయన అన్నారు.  గోపీనాథ్ పై బీఆర్ఎస్ కు ప్రేమ లేనేలేదు...గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి విమర్శించారు. గోపీనాథ్ సుప్తచేతనావస్థలో ఏఐజీ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని రానీయ్యలే....కానీ అదే ఆసుపత్రిలో 9వ ఫ్లోర్ లో కేటీఆర్, ఆయన సతీమణి తిష్టవేసి ఆస్తులను కాజేసే కుట్రకు తెరదీసింది నిజం కాదాని బండి సంజయ్ అన్నారు. బీజేపీకి ఓటేసి దీపక్ రెడ్డిని గెలిపిస్తే...కేంద్రంతో మాట్లాడి జూబ్లిహిల్స్ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తాని బండి సంజయ్ తెలిపారు.  

టీడీపీలో టికెట్ ఫ‌ర్ సేల్ సీజ‌న్ 2

  టీడీపీని కోట్ల‌కు టికెట్ల గొడ‌వ ఒక ఊపు ఊపేస్తోంది. శ‌నివారం నాడు తిరువూరు వ్య‌వ‌హారం క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ముందు చ‌ర్చ‌కు వ‌చ్చింది. తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి  శ్రీనివాస‌రావు తాను ఎంపీ చిన్నికి ఈ నియోజ‌క‌వ‌ర్గ  టికెట్ కోసంగానూ రూ. 5 కోట్లు ఇచ్చానంటూ సంచ‌ల‌నం రేకెత్తించారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ వంటి ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాల‌ను సొంత ఖ‌ర్చుతో నిర్వ‌హించే తానేంటి? ఇలాంటి వ‌సూళ్లు చేయ‌డ‌మేంట‌న ఆయ‌న పెద్ద ఎత్తున రియాక్ట‌య్యారు. ఈ వ్య‌వ‌హారంపై ఇరువురు నేత‌ల‌ను పిలిచి.. ఒక నివేదిక రూపొందించి అధినేత చంద్ర‌బాబుకు స‌మ‌ర్పించారు వ‌ర్ల‌రామ‌య్య త‌దిత‌ర పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ  స‌భ్యులు. ఇదిలా ముగిసిందో లేదో మ‌రో కొత్త టికెట్ల‌కు కోట్ల గొడ‌వ  తెర‌పైకి వ‌చ్చింది. అదే రైల్వే కోడూరు సీటు కోసం రూ. 7 కోట్ల వ‌ర‌కూ ఇచ్చిన వ్య‌వ‌హారం.  సుధా మాధ‌వి అనే ఒక టీడీపీ మ‌హిళా కార్య‌క‌ర్త వేమ‌న‌ స‌తీష్ అనే టీడీపీ ఎన్నారైనేత పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. తాను స‌తీష్ కి డ‌బ్బులు ఇచ్చే వీడియోతో పాటు.. ఇత‌ర ఆధారాల‌ను ఆమె బ‌య‌ట పెట్టారు. అదెలా ఇచ్చార‌ని ఆమెను అడిగితే.. వేమ‌న స‌తీష్ చంద్ర‌ బాబు, భువ‌నేశ్వ‌రి, లోకేష్ వంటి వారు త‌న‌కు బాగా తెలుసున‌ని వారితో ఆయ‌న‌ ఫోటోలు దిగ‌డం చూసి న‌మ్మి ఇచ్చామ‌ని అన్నారామె. స‌తీష్ కి థ‌ఫ థ‌ఫాలుగా త‌న ఆస్తిపాస్తుల‌ను అమ్మి మ‌రీ 7 కోట్ల‌ మొత్తం చెల్లించిన‌ట్టు చెప్పారామె. ఇప్పుడు చూస్తే ఆ సీటు రాలేద‌ని.. తాను నిండా మునిగిపోయాన‌నీ... తాము రోడ్డున ప‌డ్డామ‌నీ, త‌న భ‌ర్త మంచాన ప‌డ్డాడ‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు  బాధితురాలు సుధా మాధ‌వి. పార్టీకి ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు ఇప్పుడీ కొత్త త‌ల‌నొప్పి తోడ‌య్యింది. ఇటీవ‌లి క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ  తిరువూరు స‌హా మొత్తం 7 నియోజ‌వ‌ర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు ఫించ‌న్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వంటి విష‌యాల‌కు దూరంగా ఉన్న‌ట్టు గుర్తించి వారిపై కూడా చ‌ర్చించారు. ఇక నియోజ‌క‌వ‌ర్గానికో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న కూడా చేస్తున్నారు. తాజాగా ఈ వార్త కూడా వెలుగులోకి రావ‌డంతో.. ప్ర‌స్తుతం పార్టీలో ఇదో క‌ల‌క‌లంగా  మారింది. ఇంత‌కీ వేమన‌ స‌తీష్ ఎవ‌రు? ఆ డీటైల్స్ ఏంట‌న్న  దానిపై జోరుగా  చ‌ర్చ జ‌రుగుతోంది.  తాను చంద్ర‌బాబు జైల్లో ఉన్న‌పుడు 53 రోజుల  పాటు నిరాహార దీక్ష చేశాన‌నీ.. సొంత వాహ‌నాలు పెట్టుకుని  నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని గ్రామాలు తిరిగి  బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతోపాటు టీడీపీ గెలవాలని ఎంతో కృషి  చేశాన‌ని చెప్పుకొచ్చారామె. త‌న కార్య‌క్ర‌మాల‌ను గుర్తించిన వేమ‌న స‌తీష్ త‌న‌కు బాబు, భువ‌నేశ్వ‌రి, లోకేష్ తెలుసున‌ని రైల్వే కోడూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాన‌ని  న‌మ్మ‌బ‌ల‌క‌డంతో ఆస్తుల‌మ్మి  మ‌రీ సొమ్ము చెల్లించిన‌ట్టు చెబుతున్నారామె. అప్పుడే తమ గ్రామ‌స్తులు ఈ విష‌యంపై ధ‌ర్నా నిర్వ‌హిద్దామ‌ని అంటే తానే వ‌ద్ద‌న్నాన‌నీ.. ఇపుడు త‌మ పిల్ల‌లు విష‌యం వెలుగులోకి తేవ‌డంతో మీడియా ముందుకు వ‌చ్చాన‌నీ.. ఒక స‌మ‌యంలో స‌తీష్ త‌న మామ పోలీస‌ని.. ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే చంపేస్తాన‌ని బెదిరించాడ‌నీ... తమ‌కు ఆయ‌న్నుంచి ప్రాణ‌హాని ఉన్న‌ట్టుగా చెప్పారు సుధా మాధ‌వి. కాబ‌ట్టి సీఎం చంద్రబాబు త‌మ‌కు న్యాయం చేయాల్సిందిగా  కోరారు బాధిత మ‌హిళ సుధా మాధ‌వి.

మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ఆ ఇద్దరి నేతల కన్ను : బండి సంజయ్

  దివంగత మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ కన్ను పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం షేక్‌పేట్ శివాజీ విగ్రహం వద్ద బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నరని తెలిపారు. ఇదిగో కంప్లయింట్ కాపీ... పంపిస్తున్నా ముఖ్యమంత్రి..నీకు రోషముంటే, పౌరుషముంటే, చీము నెత్తురుంటే.. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారని బండి సంజయ్ విమర్శించారు. వాస్తవాలు చెబుతుంటే... నన్ను మతతత్వవాది అంటున్నరు.. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడని కేంద్ర మంత్రి అన్నారు. 80 శాతం మంది హిందువులారా...మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు కమలం పువ్వు గుర్తుపై గుద్ది షేక్ చేయండని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాని పోటీ ఉందని తెలిపారు. హిందువులు వర్సెస్ ముస్లింల మధ్యే ఎన్నికలు జరగబోతున్నాయిని తెలిపారు. తురకోళ్ల రాజ్యం కావాలా? హిందువుల రాజ్యం కావాలా? తేల్చుకోండని ఓటర్లకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు సిద్ధమైనరని ఆరొపించారు. కాంగ్రెసోళ్లు ముస్లింలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తున్నరు. కేటీఆర్ నెంబర్ వన్ చోర్ అని ముడుతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకునే తిరిగే కేటీఆర్ కు వేల కోట్లు ఎట్లా వచ్చాయిని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో వేల మంది రైతులు చనిపోయిన సంగతి మర్చిపోదామా? పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాక కూలీ  పని చేసుకున్న విషయం మర్చిపోదామా అని అన్నారు.  బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా కాలేజీ భవనాన్ని కూల్చేస్తామని స్ఫష్టం చేశారు. అక్కడ పేదలకు ఇండ్లు కట్టి ఇస్తామన్నారు. మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిస్తుంటే... కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మోదీ తెలంగాణకు సాయం చేస్తుంటే.. కనీసం ఫోటో కూడా పెట్టడం లేదని తెలిపారు. గోపీనాథ్ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని కూడా చూడనీయకుండా వేధించారని కేంద్రమంత్రి అన్నారు. గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు రెండు ఆధార్ కార్డులున్నాయి. ఇవిగో రెండు ఆధార్ కార్డులు అని వాటిని చూపించారు. గోపీనాథ్ మరణంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. నెల రోజుల క్రితమే గోపీనాథ్ కొడుకు తారక్ సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడని బండి సంజయ్ తెలిపారు

నో డౌట్.. తెలంగాణలో కింగ్ మేకర్ టీడీపీయే!

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప  ఎన్నిక రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇదేంటి.. జూబ్లీ బైపోల్ లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేదుగా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. తెలంగాణలో ఎక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా రాష్ట్రంలో తెలుగుదేశం ఎంత ప్రబలంగా ప్రభావం చూపుతుందన్న విషయం తేటతెల్లమౌతూ వస్తోంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం జెండా పట్టని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే  ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చావోరేవోగా మారిన జూబ్లీ ఉప ఎన్నికలో రెండు పార్టీలూ కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. కేటీఆర్ అయితే ఏకంగా తనకు తన తండ్రి కేసీఆర్ ఎన్టీరామారావు పేరే పెట్టారంటూ సెంటిమెంట్ ప్లే చేశారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిని, రాష్ట్ర పురోభివృద్ధిని చూసిన జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ కే ఓటేస్తారన్న ధీమాను కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు.  అయితే దీనిపై రేవంత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తెలుగుదేశం అధినేతను జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో హైదరాబాద్ లో నిరసన ప్రదర్శనలను అడ్డుకున్నందుకు తెలుగుదేశం మద్దతు దారులు బీఆర్ఎస్ కు ఓటేస్తారా? లేక బీఆర్ఎస్ హయాంలో ఎన్టీఆర్ ఘాట్ ను తొలగించడానికి ప్రయత్నించినందుకు ఓటేస్తారా? అంటూ నిలదీశారు. మొత్తం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ తెలుగుదేశం జపంతో జూబ్లీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితి ఈ రోజుకూ తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు, ప్రాబల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఎమికబుల్ గాజూబ్లీ ఉప ఎన్నికలో పార్టీని పోటీకి దూరంగా ఉంచి ఉండొచ్చు కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇద్దరూ కూడా పోటాపోటీగా తెలుగుదేశం మద్దతుదారుల సపోర్ట్ కోసం పోటీపడుతున్న తీరు గమనించిన ఎవరికైనా తెలంగాణలో తెలుగుదేశం ప్రభావం, పట్టు ఎంత బలంగా ఉన్నాయో అవగతమౌతుంది.  

బీహార్ లో లోకేష్ ఎన్నికల ప్రచారం

బిహార్  అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయ్యింది. ఈ నెల 11 రెండవ చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఇందు కోసం ఆయన శనివారం (నవంబర్ 8) పట్నాకు వెళ్లారు. ఆయన బీహార్ లో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.  ఎన్డీఏకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన  బీహార్ ఎన్నికల్లో మిత్ర పక్షాల నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి,  మంత్రి లోకేష్ బీహార్ లో ప్రచారం చేయనున్నారు. ఎన్డీయేలో నిర్ణాయక శక్తిగా ఉన్న తెలుగుదేశం  ఎన్డీఏ విజయం కోసం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే.  గతంలో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు ప్రచారం చేసిన సంగతి విదితమే.   ఇప్పుడు బీహార్ లో  ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు కాకుండా లోకేష్ వెడుతున్నారు.  కాగా బీహార్ ఎన్నికల ప్రచారం కోసం రెండు రోజుల పాటు ఆ రాష్ట్రనంలో పర్యటించనున్న లోకేష్ పనిలో పనిగా పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. అలాగే పట్నాలో చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో కూడా పాల్గొంటారు. శనివారం సాయంత్రం ఈ భేటీలు జరగనున్నాయి. ఆ తరువాత ఆదివారం  (నవంబర్ 9)  పాట్నా లో ఎన్డీఏ కు మద్దతు గా మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడతారు. అదే రోజు మధ్యాహ్నం  పాట్నా నుండి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.    

హైద‌రా.. బ్యాడ్ బ్ర‌ద‌ర్స్ ఎవ‌రంటే?!

కేటీఆర్, కిష‌న్ రెడ్డిలను హైద‌రాబాద్ బ్యాడ్ బ్ర‌ద‌ర్స్ గా అభివ‌ర్ణించారు తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి. వీరు హైద‌రాబాద్ కి రావ‌ల్సిన  ప్ర‌తి దానినీ ఆపేస్తున్నార‌ని విమర్శించారు.  గుజ‌రాత్, ఢిల్లీ, యూపీల్లో స‌బ‌ర్మ‌తి, య‌మున‌, గంగా న‌దుల ప్ర‌క్షాళ‌న  చేయొచ్చు.. ఇక్క‌డి మూసీనీ చేయొద్దా అని అడుగుతూ మూసీతో పాటు మెట్రో విస్త‌ర‌ణ‌కు సైతం కి కిష‌న్ రెడ్డి అడ్డు త‌గులున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్  ని అరెస్టు చేయ‌డ‌డానికి గ‌వ‌ర్న‌ర్ ని అడిగితే అనుమతి  ఇవ్వ‌డం లేద‌ని.. కాళేశ్వ‌రం కేసులో కేసీఆర్, హ‌రీష్ ల‌ను అరెస్టు చేయ‌మ‌ని ఈ కేసుపై సీబీఐ ఎంక్వ‌యిరీ వేయ‌మ‌ని కోరితే.. ఢిల్లీ పెద్ద‌ల్లో క‌ద‌లిక లేదని.. దీన్నిబ‌ట్టీ వీరి మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఎలాంటిదో ఒక‌సారి  చూసుకోవ‌చ్చనీ అన్నారు రేవంత్. ఇక హైడ్రా, ఈగ‌ల్ మీద కూడా ప‌డి ఏడుస్తున్నార‌నీ.. హైడ్రా కార‌ణంగా క‌బ్జాల‌కు గురైన వేల కోట్ల రూపాయ‌ల చెరువులు, కుంట‌లు, నాలాలు ఇప్పుడిప్పుడే వెలికి వ‌స్తున్నాయ‌ని.. అదే వారి కాలంలో చివ‌రికి బ‌తుక‌మ్మ కుంట కూడా క‌బ్జా పెట్టార‌ని.. త‌మ హ‌యాంలో ఇవ‌న్నీ  వెలుగులోకి వ‌స్తున్నాయ‌ని అన్నారు సీఎం రేవంత్. వారి జ‌మానాలో ఇవన్నీ క‌బ్జాల‌కు గురై చిన్న చినుకు ప‌డితే హైద‌రాబాద్ చెరువు అయిపోయేద‌ని.. అన్నారు రేవంత్. కేటీఆర్ హ‌యాంలో స్కూలు ఎదుట కూడా గంజాయ్, డ్ర‌గ్స్ దొరికేలాంటి క‌ల్చ‌ల్ ఏర్ప‌డింద‌ని.. ఆయ‌న హ‌యాంలో ప‌బ్ క‌ల్చ‌ర్ పెరిగినంత మ‌రెక్క‌డా పెర‌గ‌లేద‌నీ.. సొంత బావమరిది ఫామ్ హౌస్ లో జ‌రిగిన డ్ర‌గ్స్ పార్టీయే ఇందుకు ప్ర‌త్య‌క్ష  సాక్ష్య‌మ‌న్నారు రేవంత్. దీంతో ఈగ‌ల్ ప‌నితీరుపై కూడా కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారనీ విమర్శలు గుప్పించారు.  గోవాలో లింకులు కూడా త‌మ ఈగ‌ల్ తీగ‌లాగి మొత్తం డ్ర‌గ్స్ నెట్ వ‌ర్క్ ని వెలికి తీస్తుంటే కేటీఆర్ తిక‌మ‌క అయిపోతున్న‌ారని విమర్శించారు. ఇక ఇంజినీరింగ్ కాలేజీల వ్య‌వ‌హారం చూస్తే వీరు వ్యాపారం చేస్తూ, ప్ర‌జాసేవ  చేస్తున్న వారికి మ‌ల్లే పోజులు కొడుతున్నార‌ని, వారు అడిగిన అడ్డ‌గోలు అనుమ‌తులు తాము నిరాక‌రించ‌డం వ‌ల్లే ఈ యాగీ చేస్తున్నార‌నీ,  ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ ఇచ్చేదే నాణ్య‌మైన విద్య అందివ్వ‌డానికి అలా జ‌రుగుతుందా లేదా చూడ్డం కూడా త‌ప్పేనా? ఇదే అద‌నుగా భావించి పిల్ల‌ల చ‌దువుగానీ మ‌ధ్య‌లో ఆగితే అంతే తేలిగ్గా వ‌ద‌ల‌మ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. విడ‌త‌ల వారీగా వారికి నిధులు మంజూరు చేస్తామ‌ని అన్నారు. వీరి ఆగ‌డాల‌కు మంద‌కృష్ణ‌, ఆర్ కృష్ణ‌య్య తోడ‌వుతున్నార‌నీ, ఇక్క‌డ నెల‌కు రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయ‌ం రూ.18,500 కోట్లు మాత్ర‌మే. 6 వేల కోట్ల‌కు పైగా.. కేసీఆర్  చేసిన అప్పుల‌కు ఆర్బీఐ చెప్పా పెట్ట‌కుండానే లాగేసు కుంటోంది. ఇక ఆరు వేల కోట్ల రూపాయ‌లు ఉద్యోగుల జీత, భ‌త్యాలు. మిగిలిన ఖ‌ర్చుల‌తో సంక్షేమ ప‌థ‌కాలు ఇచ్చే దారి క‌నిపించ‌క‌, కొత్త అప్పులు పుట్ట‌క నానా అవ‌స్థలు ప‌డాల్సి వ‌స్తోంది. ఎవ‌రైనా ఇంత‌క‌న్నా మించిన పాల‌న చేస్తామ‌ని ముందుకొస్తే వారికే ఈ మొత్తం పాల‌న అప్ప‌గించేస్తాం ముందుకు రావ‌చ్చ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రేవంత్.గోపీనాథ్ కుటుంబ వ్య‌వ‌హారం తాను కూడా మీడియాలో చూశాన‌నీ.. ఒక వేళ అందులో ఏదైనా లోటు పాట్లు ఉంటే బండి సంజ‌య్ ఫిర్యాదు చేస్తే విచార‌ణ చేయిస్తామ‌న్నారు.  

తెలంగాణ సీఎం రేవంత్ కు మోడీ, చంద్రబాబు బర్త్ డే విషెస్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పలు పార్టీల అధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు రేవంత్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేవంత్ కు మాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు రాజకీయ ప్రముఖులు తెలంగాణ సీఎంకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. 

క్రెడిట్ చోరీ కోసమేగా వైసీపీ ఏడుపంతా?

ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిడిట్ చోరీ అంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. అయితే అసలు క్రెడిట్ చోరీ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ నవ్వుల పాలౌతున్నది ఆయననేనని తాజాగా మరోసారి రుజువైపోయింది.  ఇంతకీ విషయమేంటంటే.. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్.. సంక్షేమం, అభివృద్ధి, విపత్తు సమయాలలో ప్రజలను ఆదుకోవడం.. ఇలా అన్ని విషయాలలోనూ ప్రజల మెప్పు పొందుతోంది. అదే సమయంలో జగన్ హయాంలో ఏం జరిగింది, ఆ ప్రభుత్వం ఎంత నిష్పూచీగా వ్యవహరించింది అన్న చర్చ కూడా జనంలో జోరుగా సాగుతోంది. దీంతో దిక్కు తోచని స్థితిలో వైసీపీ నాయకులు అయినదానికీ కాని దానికీ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలలో మరింత చులకన అవుతున్నారు. తాజాగా మహిళల వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీమ్ ఇండియా జట్టు సభ్యురాలు శ్రీచరణి ప్రభుత్వం పట్టించుకోలేదంటూ వైసీపీ విమర్శల రాగం మొదలు పెట్టింది. శ్రీచరణిని ఏపీ సర్కార్ పట్టించుకోలేదంటూ గగ్గోలు పెట్టేసింది. శ్రీకాంత్ రెడ్డి అయితే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వాన్ని విమర్శించేశారు.  ఇంతకీ శ్రీచరణి వరల్డ్ కప్ విజయం తరువాత శుక్రవారం (నవంబర్ 7) రాష్ట్రానికి తిరిగి వచ్చారు. గురువారం  (నవంబర్ 6) ఆమె హస్తినలో ప్రధాని మోడీ నివాసంలో జట్టు సభ్యులతో పాటు ఉన్నారు. అంటే శ్రీచరణి  రాకముందే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైసీపీ గగ్గోలు పెట్టేయడం మొదలు పెట్టేసింది. సొంత మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేసేసింది. ఇక్కడ వైసీపీ దుగ్ధ అంతా ఎలాగూ ప్రభుత్వం శ్రీచరణికి భారీగా నజరానాలు ప్రకటిస్తుంది. అయితే ప్రభుత్వం అలా ప్రకటించడానికి తామే కారణమన్న క్రెడిట్ కొట్టేయడానికే వైసీపీ ఇలా వ్యవహరించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    సరే జరిగిందేమిటంటే.. శ్రీ చరణి శుక్రవారం (నవంబర్ 7) రాష్ట్రానికి వచ్చారు. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి నేరుగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సందర్భంగా చంద్రబాబు ఆమెను అభినందించారు.  ఆ వెంటనే రెండున్న కోట్ల నగదు బహుమతి, గ్రూప్1 స్థాయి ప్రభుత్వోద్యోగం, ఆమె స్వస్థలం కడపలో వెయ్యి గజాల నివాసస్థలం ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది. కడపలో ఆమెను ఘనంగా సత్కరించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ సహజంగా జరిగేవే. క్రీడల పట్ల, క్రీడాకారులను ప్రోత్సహించడం పట్ల చంద్రబాబు ఎంత ప్రోయాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు ప్రభుత్వం శ్రీచరణికి నజరానాలు ప్రకటిస్తుందన్న విషయం తెలిసిన వైసీపీ ముందుగానే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించేసి.. ఇప్పుడు తాము గట్టిగా మాట్లాడడం వల్లనే చంద్రబాబు సర్కార్ శ్రీచరణికి నజరానాలు ఇచ్చిందని చెప్పుకుని క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసిందని అంటున్నారు. అయితే క్రెడిట్ చోరీకి వైసీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందంటున్నారు. ఎందుకంటే.. వైసీపీ హయాంలో  రాష్ట్రంలో  క్రీడలను ఇసుమంతైనా ప్రోత్సహించలేదు. క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యా లూ కల్పించలేదు సరికదా.. ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దండుకున్నారు.  అంతే కాదు చంద్రబాబు చేపట్టిన గాండీవం ప్రాజెక్టులో భాగంగా ఏపీ ప్లేయర్లకు ట్రైనింగ్ ఇచ్చిన కంపెనీకి బిల్లులు ఎగ్గొట్టడమే కాకుండా, శిక్షణను సైతం వైసీపీ సర్కార్ నిలిపివేసింది.  ఇప్పుడు శ్రీచరణి విషయంలో వైసీపీ చంద్రబాబు సర్కార్ పై చేస్తున్న విమర్శల నేపథ్యంలో జనం నాడు జగన్ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రస్తావిస్తూ నవ్వుకుంటున్నారు.  

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ.. ఇంతకీ అందులో ఏముందంటే?

మాగంటి కుటుంబ కలహం ఇప్పుడు అంటే జూబ్లీ ఉప ఎన్నిక ముంగిట బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలు ఇంత వరకూ అంటే జూబ్లీ  ఉప ఎన్నికలో మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే వరకూ.. అసలంతదాకా ఎందుకు మాగంటి గోపీనాథ్ బతికి ఉన్న కాలంలో ఎన్నడూ మాగంటి మొదటి భార్య అన్న ప్రస్తావనే రాలేదు. అసలు మాగంటి సునీత ఆయనకు రెండో భార్య అన్న విషయమే దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ మాగంటి మరణం తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూబ్లీ ఉప ఎణ్నిక ముంగిట మాగంటి కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మాగంటి గోపానాథ్ సిసలైన వారసుడిని తానేనంటూ ప్రద్యుమ్నతారక్ మీడియా ముందుకు వచ్చారు. అంతే కాదు.. ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు.  మాగంటి గోపానాథ్ భార్యను అంటూ సునీత అఫిడవిట్ లో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారనీ, ఆమె నామినేషన్ రద్దు చేయాలనీ కోరారు. సరే ఎన్నికల సంఘం మాగంటి సునీత నానినేషన్ సరిగానే ఉందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా మాగంటి తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి మాగంటి సునీతపై విమర్శలు గుప్పించారు. తన కుమారుడు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న సమయంలో కూడా తనను దూరం పెట్టారనీ, కన్నకొడుకుని కడసారి చూసుకునే భాగ్యం కూడా దక్కకుండా చేశారని ఆరోపించారు. అంతే కాదు.. తన కుమారుడి మరణమే ఓ మిస్టరీ అంటూ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.  దీంతో బీఆర్ఎస్ ఒకింత ఇబ్బందుల్లో పడింది.  ఆ తరువాత మాగంటి సునీత రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ మరింత సంచలనం సృష్టిస్తోంది. మాగంటి ఆస్పత్రిలో ఉన్న సమయంలో సునీత ఆస్పత్రి సెక్యూరిటీకి రాసినట్లుగా ఉన్న ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ లేఖలో మాగంటి తల్లి, సోదరుడు సహా కుటుంబ సభ్యులెవరినీ మాగంటి గోపీనాథ్ ను చూసేందుకు ఆస్పత్రిలోకి అనుమతించవద్దంటూ మాగంటి సునీత  రాసినట్టుగా ఉన్న లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.   దీంతో బీఆర్ఎస్ లో ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద మాగంటి కుటుంబ వివాదం ప్రభావం జూబ్లీ బైపోల్ పై ఏ మేరకు పడుతుందన్నది వేచి చూడాల్సిందే. 

కొస‌రాజు వ‌ర్సెస్ మాగంటి.. ఓ కుటుంబ రాజ‌కీయ కథాచిత్రం!

మాగంటి గోపీనాథ్ కుటుంబ క‌థా చిత్రంలో రోజుకో కొత్త వాద‌న‌.. రోజుకో కొత్త ట్విస్ట్ బయటకు వస్తున్నాయి.  సునీత గోపీనాథ్ కి భార్యే కాదంటూ ఇటు గోపీనాథ్ త‌ల్లి, అటు మొద‌టి భార్యా మాలినీ దేవి, ఆమె కొడుకు తార‌క్ తీవ్ర  స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పిస్తుంటే..   బీఆర్ఎస్ లీడ‌ర్లు మ‌ర‌లాంట‌పుడు ఈ ఇద్దరు భార్య‌ల పిల్ల‌ల్లో ఎవ‌రి ఇంటి  పేరు ఏంటో చూడాలంటూ లాజిక్ మాట్లాడుతున్నారు.   మాగంటి గోపీనాథ్ తొలిభార్య మాలినీ దేవికి పుట్టిన  తార‌క్ ప్ర‌ద్యుమ్న ఇంటి పేరు కొస‌రాజుగా ఉంది. అదే  సునీత‌కు పుట్టిన  పిల్లల‌ ఇంటి పేరు మాగంటిగా  ఉంది. ఇందుకు త‌గిన సాక్ష్యాధారాలు సైతం వారి ద‌గ‌గ‌ర ప‌దిలంగా ఉన్నాయంటారు మాగంటి సునీత‌కు చెందిన  న్యాయ‌వాదులు. ఇదిలా ఉంటే ఇన్నాళ్ల పాటు తార‌క్ ను మాలినీ దేవి సొంతంగా పెంచుకున్నార‌నీ.. ఆమెకు కూడా గోపీ ఆస్తిలో కొంత వాటా ఇవ్వాలిగా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు గోపి త‌ల్లి మ‌హానంద‌కుమారి. దీంతో ఈ ఫ్యామిలీ డ్రామాలో ఎవ‌రూ ఎక్క‌డా త‌గ్గ‌ట్లా.  అయితే ఈ వివాదం బీఆర్ఎస్ గెలుపు ఆశ‌ల‌పై    నీళ్లు కుమ్మ‌రిస్తుందా అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.  ఇదంతా వాటాల‌కు సంబంధించిన వ్య‌వ‌హార‌మైతే ఈ స‌రికే కేటీఆర్ ఇరు ప‌క్షాల వారిని పిలిపించి పంచాయితీ చేస్తే స‌రిపోతుంది. ఆయ‌న ఈ విష‌యంలో పెద్ద‌గా క‌ల‌గ చేసుకోవడం లేదు.  ఇందుకు కార‌ణ‌మేంటో చూస్తే.. ఒక వేళ ఈ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోతే.. ఇదంతా కుటుంబ క‌ల‌హంగా చెప్పుకోవ‌చ్చు. గోపీనాథ్ అస‌లైన భార్య‌గా జ‌నం సునీత‌ను గుర్తించ‌లేదు కాబ‌ట్టే తాము ఓడిపోయామ‌ని చెప్పుకునే అవకాశం ఉంటుందన్న భావనే అంటున్నారు పరిశీలకులు. అందుకే ఈ కుటుంబ కుంప‌టి ని  చ‌ల్లార్చేందుకు కేటీఆర్ పూనుకోవడం లేదంటున్నారు. 

అద్దంకిలో వైసీపీ మరో ప్రయోగం.. ఇన్చార్జ్‌గా పల్నాడు డాక్టర్ అశోక్

అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది.  మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అక్కడ తిరుగులేని పట్టుంది. అద్దంకి ఆయన సొంత నియోజకవర్గం కాకపోయినా, తనకు స్థానికంగా ఉన్న పరిచయాలతో, ఆయన 2009లో సొంత నియోజకవర్గమైన మార్టూరు నియోజకవర్గం రద్దు కావటంతో అద్దంకి వచ్చి    గట్టి పాగానే వేశారు. ప్రజలతో మమేకమై ప్రజాభిమానాన్ని పొంది ఓటమెరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 నుండి 2024 వరకు ఓటమన్నదే ఎరగకుండా.. పార్టీతో సంబంధం లేకుండా ఐదు సార్లు విజయం సాధించిన అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్.  2004వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చిన రవికుమార్  మార్టూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సోదరుడు గొట్టిపాటి నరసయ్యపై విజయం సాధించారు. 2009 ఎన్నికలలో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాంపై విజయ ఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరిన రవికుమార్ బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పై పోటీ చేసి విజయం సాధించారు. అనంతర పరిణామాలలో గొట్టిపాటి ఫ్యాను పార్టీని వీడి సైకిల్ ఎక్కారు.  2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్థి గరటయ్యపై మరో గెలుపు సొంతం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పాణెం హనిమిరెడ్డిపై భారీ విజయం సాధించి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందటమే కాకుండా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 పార్టీ ఆవిర్భావంలో గొట్టిపాటి రవి చలవతో అద్దంకి నుంచి విజయం సాధించిన వైసీపీ తిరిగి అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తోంది గాని ఫలితం లేకుండా పోతుంది. ప్రతి ఎన్నికలకు అభ్యర్థిని మారుస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఫలితాలతో నిరాశ చెందుతోంది.  2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన పాణెం హనిమిరెడ్డి ఎన్నికల అనంతరం పెట్టా బేడా సర్దేశారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్  సత్తా ఉన్న నేత కావాలి అంటూ పలు ప్రయత్నాలు చేసారు. ఆ క్రమంలో పక్కనున్న పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్  అశోక్‌ను అద్దంకి వైసీపీ ఇన్చార్జ్‌గా నియమించారు. వైసిపి వైద్య విభాగపు నేతగా జగన్ దగ్గర గుర్తింపు తెచ్చుకున్న అశోక్ అద్దంకిలో తన సత్తా చూపిస్తానంటూ అధినేతకు మాటిచ్చి వచ్చారంట. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలనైతే ముమ్మరం చేశారు. అద్దంకిలోని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న అశోక్ ప్రతి విషయంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది టిడిపి నేతలను కూడా తన వైపునకు తిప్పుకునేందుకు పలు ప్రయత్నాలు మొదలుపెట్టారంట.అద్దంకి పట్టణానికి చెందిన 50 కుటుంబాలను పార్టీలోకి చేర్చుకొని అధినేత దగ్గర మంచి మార్కులే వేయించుకున్నారంటున్నారు. స్థానిక నేతలకు అందుబాటులో ఉంటూ అద్దంకిలో అశోక్ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తుఫాను సమయంలో అధికారులు గుండ్లకమ్మలో చిక్కుకుపోతే వారిని కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని తాను ప్రజలకు దగ్గరగా ఉన్నానని సంకేతాలను పంపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి ఎరగని నేతగా తనదైన రాజకీయ చాతుర్యంతో దూసుకుపోతున్న గొట్టిపాటి రవి కుమార్ ముందు అశోక్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అనే అనుమానాలనైతే అద్దంకి ప్రజలు వ్యక్తపరుస్తున్నారట.  రాజకీయ ఉద్దండుడు ప్రజా నేతగా గుర్తింపు ఉన్న గొట్టిపాటి రవికుమార్‌ను అశోక్ ఎంతవరకు ఎదుర్కోగలరు అనే అనుమానాలను  సొంత పార్టీ నేతలే వ్యక్తపరుస్తున్నారంట. ఎన్నికలకు చాలా సమయం ఉందని అప్పటి వరకు నిలకడగా పనిచేసి, ప్రజలతో మమేకమై భరోసా కల్పిస్తే అద్దంకిలో సక్సెస్ కావడం పెద్ద కష్టం కాదని కొందరు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.   ఆరంభ శూరత్వమో ... చివరి వరకు పోరాడే తత్వమో తెలియదు కానీ తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలను అయితే అటు అధిష్టానంతో పాటు ఇటు అద్దంకి ప్రజానీకానికి కూడా అశోక్ పంపే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు సొంత పార్టీ నేతలు సరైన నాయకుడు వచ్చాడు అంటూ చెప్పుకుంటుండగా,  మరికొందరు మాత్రం ఐరావతం ముందు ఎలుక పిల్ల ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతుందనే విమర్శలు కూడా చేస్తున్నారట. అయితే రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదని  ... ట్రెండ్... ప్రజానాడి ఎవరు పట్టగలిగితే వారే సక్సెస్‌ఫుల్ నేతలని ఎన్నో సందర్భాలలో రుజువైందని ... తాను కూడా అదే విధంగా విజయం సాధిస్తానంటూ అశోక్ సొంత పార్టీ నేతలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న చందంగా సొంత పార్టీ నేతలకు నమ్మకం భరోసా కల్పించి తరువాత తన సత్తా ఏంటో అద్దంకి నియోజకవర్గానికి చూపాలనే భావనలో అశోక్ ఉన్నారట.  మరి ఎంతవరకు ఈ డాక్టర్ అద్దంకి ప్రజల నాడిని పట్టగలుగుతారో చూడాలి .

బీహార్ తొలి విడతలో ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం (నవంబర్ 6) తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ముందుకు వచ్చి మరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నిటికీ మించి తొలి విడతలో గతంలో ఎన్నడూ లేని విధంగా 64.66 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇది రికార్డు స్థాయి అని చెప్పవచ్చు.   రాష్ట్రంలో ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి.  రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో  121 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక రెండో విడత పోలింగ్  నవంబర్ 11న జరగనుంది. ఆ విడతలో  మిగిలిప 122 స్థానాలకూ పోలింగ్ జరుగుతుంది.  సరే ఇక తొలి విడతలో పోలింగ్ విషయానికి వస్తే.. మహిళలు అత్యధికంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటింగ్ శాతం పెరగడం అధికార కూటమికా, లేక ఇండియా కూటమిగా ఎవరికి ప్లస్ కానుందన్న చర్చ అప్పుడే మొదలైంది. అలాగే.. జనసురాజ్ పార్టీ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న అంచనాలు కూడా మొదలయ్యాయి.  బీహార్ అసెంబ్లీకి 1951-52లో జరిగిన మొదటి  ఎన్నికల్లో  అత్యల్పంగా 42.6 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 2000 సంవత్సరంలో 62.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2020లో 57.29 శాతం నమోదైంది. అయితా  తాజాగా   తొలి విడతలోనే 64.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే రాజకీయ పరిశీలకుల విశ్లేషణలకు పదును పెట్టింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంపై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళల ఓటింగ్ శాతం భారీగా పెరగడం జనం రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతమని అంటున్నారు. అయితే భారీగా పోలింగ్ నమోదు కావడంపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మార్పు కోసమే మహిళలు తరలివచ్చారని చెబుతున్నారు. కాదు కాదు.. అధికార కూటమి పనితీరుకు ప్రజలు పాజిటివ్ గా స్పందించడమే ఓటింగ్ శాతం పెరగడానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు.  అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఏ కూటమికి కలిసి వచ్చిందన్నది తేలాలంటే ఫలితాలు వెలువడే నవంబర్ 14 వరకూ ఎదురు చూడాల్సిందే.  

కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తానంటూ జగన్ పిటిషన్!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మొదటికి వచ్చారు.  కోర్టుకు ఆదేశాలను ధిక్కరిస్తానంటూ ఏకంగా కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల లండన్ పర్యటనకు  కోర్టు అనుమతి ఇచ్చిన సందర్భంగా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని షరతు విధించింది. అప్పుడు ఆ షరతుకు ఓకే అన్న జగన్.. ఇప్పుడు దానిని ఉల్లంఘించడానికి రెడీ అయిపోయి.. కోర్టు షరతును ఉల్లంఘిస్తాను అనుమతి ఇవ్వండి అంటూ హైదరాబాద్ సీబీఐ  కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో తాను కోర్టుకు హాజరు కాలేనని పేర్కొంటూ, ఒక వేళ ఆయన తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అయితే.. అందుకు ప్రత్యేక మైన భద్రతా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందనీ, అది తనకు ఇష్టం లేదు కనుకనే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనీ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.   అయితే ఇక్కడ ఆయన ఎంత వితండ వాదం చేస్తున్నారంటే.. కోర్టుకు హాజరు కావడం అన్నది ఆయన ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయంగా చెబుతున్నారు. న్యాయవ్యవస్థ అంటే తనకు లెక్కలేదన్నట్లుగా ఆయన పిటిషన్ ఉంది. నిజంగా ఆయన కోర్టు హాజరు సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాల్సి ఉంటే ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వ ఏర్పాట్ల విషయంలో ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం ఏముంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పుష్కరంపైగా బెయిలుపై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఆ బెయిలు షరతులను సైతం ఉల్లంఘిస్తుండటం పట్ల న్యాయ నిపుణులలో సైతం విస్మయం వ్యక్తం అవుతోంది. పైగా తాను హాజరు కాను కనుక అవసరం అనుకుంటే కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే హాజరౌతానంటూ ఆ పిటిషన్ లో కోర్టుకే బంపరాఫర్ ఇచ్చారు.  ఇక్కడే న్యాయనిపుణులు ఆయన పరామర్శల పేరిట దర్జాగా రాజకీయయాత్రలు చేస్తున్నప్పుడు అడ్డు రాని భద్రత.. కోర్టుకు హాజరు కావడానికే అడ్డువచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

టోపీ పెట్టుకునే పరిస్థితి వస్తే తల నరుక్కుంటా.. బండి సంజయ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు అత్యంత కీలకంగా మారింది. మూడు పార్టీలూ ఈ ఉప ఎన్నికలో విజయాన్ని చావో రేవో అన్నట్లుగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీ ఉప ఎన్నిక మూడు పార్టీలకూ అగ్నిపరీక్షగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీంతో పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రచార వేడి రోహిణీకార్తెను మించిపోతున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గం హోరెత్తిపోతున్నది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ  ఈ తీరు పెరిగిపోతున్నది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో  ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. 14న ఫలితం వెలువడనుంది.    బీఆర్ఎస్  అభ్యర్థిగా మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో నిలిచారు.   కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం (నవంబర్ 6)  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోరబండ డివిజన్ లో పర్యటించిన ఆయన   కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు.   తాను కట్టర్ హిందువునని, ఇతర మతాలకు చెందిన వారి టోపీ పెట్టుకుని, దొంగ నమాజ్ చేసి కించపర్చనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ  అలాంటి పరిస్థితి వస్తే తల నరుక్కుంటా గానీ టోపీ పెట్టుకోన్నారు. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని ఆరోపించారు. ఈ మాట స్వయంగా గోపీనాథ్ తల్లి చెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.   బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు వావి వరసల్లేవని, చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేదన్నారు. సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకమని తీవ్ర విమర్శలు గుప్పించారు.తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకోవాలంటూ కల్వకుంట్ల కవితకు హితవు చెప్పారు.  ఇక ముఖ్యమంత్రి రేవంత్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు తినేటోడు వచ్చాడని విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఆడోళ్ల మెడల్లో ఉన్న మంగళసూత్రాలు కూడా గుంజుకుపోతారని బండి సంజయ్ అన్నారు.   టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా నటుడు వేణుమాధవ్ గుర్తొచ్చాడని బండి అన్నారు.  

రజనీకి రేపల్లె దారి చూపుతున్న జగన్!?

ఘోర పరాజయం తరువాత కూడా జగన్ లో ఇసుమంతైనా మార్పు రాలేదు.  2024లో వైసీపీ ఘోర పరాజయానికి తన ఐదేళ్ల హయాంలో అవలంబించిన కక్ష సాధింపు రాజకీయాలు, వేధింపు చర్యలు, అభివృద్ధిని పట్టించుకోకపోవడం వంటి కారణాలతో పాటు మరో కారణం కూడా ఉంది. అదే  సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెట్టడం.  అయితే ఆ విషయం ఇప్పటికీ జగన్ కు అర్ధమైనట్లు కనిపించడం లేదు. 2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే  ఈ విషయాన్ని మాజీ మంత్రి విడదల రజనీకి చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో కూడా చిలకలూరి పేట సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విడదల రజనిని అక్కడ నుంచి  గుంటూరు పశ్చిమకు మార్చారు. అయితే ఆమె అక్కడ విజయం సాధించలేకపోయారు. అంతకు ముందు 2019 ఎన్నికలలో విడదల రజని చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు. ఆ తరువాత జగన్ విడదల రజనీకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ఆమె మంత్రిగా కొనసాగారు. మంత్రి హోదాలోనే గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన రజని ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఆమె పరాజయానికి కారణాలెన్ని ఉన్నా, ఆమె మాత్రం తనను నియోజకవర్గం మార్చడమే పరాజయానికి కారణమని భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతారు. ఓటమి తరువాత  విడదల రజనీ మళ్లీ చిలకలూరి పేటకు వచ్చేశారు. చిలకలూరి పేట క్షేత్రంగానే ఆమె రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 2029 ఎన్నికలలో చిలకలూరిపేట నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఇక్కడే జగన్ ఆలోచన వేరుగా ఉంది. రఆమె ఓటమి తర్వాత, రజినీ నిశ్శబ్దంగా చిలకలూరిపేటకు తిరిగి వచ్చి స్థానిక పనిని తిరిగి ప్రారంభించారు. కానీ జగన్ ఇప్పుడు రేపల్లె నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను పోటీకి దింపాలని కోరుకుంటున్నారని సమాచారం. రేపల్లె నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన  అనగాని సత్యప్రసాద్‌ పై విడదల రజనిని పోటీకి నిలబెడితే.. ఆమె ఖాతాలో మరో పరాజయం జమ కావడం ఖాయమని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.