తుస్సు మంటున్న వైసీపీ ఆందోళనలు.. తెలుగుదేశంకూ తప్పని తలపోట్లు!

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెంచడానికి వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. నాన్ ఇష్యూస్ ను సైతం తీసుకుని ఆందోళనలకు పిలుపునిస్తోంది. అయితే వైసీపీ వాదనలు, ఆందోళనలను ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అదే సమయంలో  అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలకూ పెద్దగా స్పందన కానరావడం లేదు.  ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజా సేవలు, శాఖా సమీక్షలు, పింఛన్ పంపిణీల, ఇతర పథకాల అమలు ద్వారా ప్రజలకే చేరువకావడానికి ప్రయత్నం చేస్తుంటే.. వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ మొత్తం వ్యవహారం అంతా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావడంగా పరిశీలకులు చెబుతున్నారు.  అధికార  తెలుగుదేశం సంక్షేమ, అభివృద్ధి నినాదంతో జనానికి చేరువకావడానికి ప్రయత్నిస్తుండగా, వైసీపీ ప్రజాహక్కులు అన్న నినాదంతో ప్రజలలోకి వెళ్లాలని చూస్తున్నది.    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 'పేదల సేవలో ప్రజా వేదిక' పేరిట ప్రతినెలా పింఛన్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదల మద్దతును పొందగలుగుతున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, నాయకుల తీరు కారణంగా తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ఒకింత మసకబారుతున్న పరిస్థితీ కనిపిస్తోంది.     ఇక వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంటూ చేపట్టిన ఆందోళన పెద్దగా ప్రజలను ఆకర్షిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆయన నర్సీపట్నం పర్యటనకు జనం మొహం చాటయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చునని పరిశీలకులు అంటున్నారు.  తన పాలనలో ప్రారంభమైన 17 మెడికల్ కాలేజీలు  పేదలకు వైద్య విద్య, ఆరోగ్య సేవలు అందించడానికి ఉద్దేశించినవనీ, చంద్రబాబు సర్కార్ వాటిని ప్రైవేటు పరం చేస్తున్నదని జగన్ చేస్తున్న ప్రచారానికి, ఆందోళనకు ప్రజామద్దతు పెద్దగా లభిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే కాలేజీల ప్రకటన వినా అవి పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని చెప్పాలి.  అయినా కూడా వైసీపీ అక్టోబర్ 10 (శుక్రవారం) నుంచి వచ్చే నెల 22 వరకూ రచ్చబండ, అక్టోబర్ 28న నియోజకవర్గ స్థాయి ర్యాలీలు, 12న జిల్లాస్తాయి ర్యాలీలు అంటూ ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు మెమోరాండం సమర్పించాలని సంకల్పించింది. అయితే ఈ కార్యక్రమాలకు పిలుపునిచ్చి.. వైసీసీ అధినేత జగన్ విదేశీ పర్యటనకు చెక్కేయడంతో వీటికి సీరియస్ నెస్ లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అననిటికీ మించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పీపీపీ విధానానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం, మెడికల్ పాలేజీల పీపీపీ విధానానినికి టెండర్ల ప్రక్రియపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం అధికార పార్టీకి కలిసి వచ్చినట్లైంది.   మొత్తంగా రాష్ట్రంలోని పరిస్థితి ప్రతిపక్షానికి ఇసుమంతైనా అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలపై వెల్లువెత్తున్న వ్యతిరేకత, ఆరోపణల కారణంగా ప్రభుత్వం పట్ల కూడా పెద్దగా సానుకూలత లేదని పరిశీలకులు అంటున్నారు. 

నోబెల్ కోసం ట్రంప్ ‘కల’ వరం

నోబెల్ శాంతి పురస్కారం ప్రకటనకు ప్రకటనకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారం రేసులో ముందంజలో ఉన్నారు.  నోబెల్ శాంతి పురస్కారం ప్రకటనకు ప్రైజ్ ప్రకటనకు ఒక్క రోజు ముందు.. దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్-గాజా ఘర్షణలో.. కీలకమైన శాంతి ఒప్పందాన్ని కుదిర్చినట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  నిజంగానే ట్రంప్‌ని నోబెల్ శాంతి పురస్కారం వరిస్తుందా? అన్న చర్చ మొదలైంది. నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్ ను వరిస్తుందా? అన్న ఆశక్తి ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.  కొన్నాళ్లుగా నోబెల్ శాంతి పురస్కారం కోసం ట్రంప్ పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఈ పురస్కారం దక్కించుకోవాలని ఆయన కలకంటున్నారు. దక్కదేమో అని కలవర పడుతున్నారు. ఏకంగా ఐక్యరాజ్యసమితి వేదికగానే.. తాను ఏడు యుద్ధాలు ఆపి,  శాంతిని నెలకొల్పిన వ్యక్తిగా ఆయనంతట ఆయనే ప్రకటించేసుకున్నారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనిని కూడా తానే చేశాన్న ఆయన స్వోత్కర్ష  అప్పట్లో వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌‌గా మారింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ తాను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు అర్హుడిననే విషయాలు  షేర్ చేస్తూ వచ్చిన ట్రంప్. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది కూడా తానేనని ప్రకటించుకున్నారు. భారత్ నిర్ద్వంద్వంగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించినా పట్టించుకోలేదు. పదే పదే అదే మాట చెబుతూ వస్తున్నారు.  ఇలా కొన్నాళ్లుగా నోబెల్ శాంతి పురస్కారం కోసం కోసం ట్రంప్  ఆరాటపడుతున్నారు. తనను తానే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా నోబెల్ పురస్కార ప్రకటనకు ఒక్క రోజు ముందు..  దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్-గాజా వివాదంలో కీలకమైన శాంతి ఒప్పందాన్ని తాను కుదిర్చినట్లు ప్రకటించుకున్నారు.  దీనికి తోడు వైట్ హౌజ్ ఆయనని  ద పీస్ ప్రెసిడెంట్  అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేసింది.  దీంతో ట్రంప్ నోబెల్ పురస్కారం అందుకోవాలన్న పిచ్చి పీక్స్ కు చేరిందంటూ నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అది పక్కన పెడితే వైట్ హౌస్ ఆయనను పీస్ ప్రెసిడెంట్ గా అభివర్ణించడం ట్రంప్ పీస్ రేసుకి  ఊతమిచ్చినట్లయిందని పరిశీలకులు అంటున్నారు.  మొత్తం మీద నిజంగానే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందా?  వైట్ హౌజ్ హంగామాని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ తొలి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్‌ తెలిపారు.  ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేశాయని తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.  గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు  ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్‌ అభివర్ణించారు.  నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడానికి ఒక్క రోజు ముందు ఈ ఒప్పందం కుదిరింది. 79 ఏళ్ల ట్రంప్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఇది. ఇలాంటి క్షణంలో  వైట్ హౌజ్ చాలా తెలివిగా పీస్ ప్రెసిడెంట్ అంటూ  ట్వీట్ చేసింది. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం నోబెల్ కమిటీ తనకు బహుమతి ఇవ్వకుండా ఉండేందుకు,  ఓ మార్గాన్ని కనుగొంటుందనీ,  వాళ్లు శాంతి స్థాపన కోసం ఏమీ చేయని వ్యక్తికే  ఈ పురస్కారం ఇస్తారనీ అనడం చర్చనీయాంశంగా మారింది.  అంతేకాదు  తాము రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించేందుకు కూడా దగ్గరగా ఉన్నామని ట్రంప్ చెప్పుకుంటున్నారు. చరిత్రలో ఎవరూ కూడా ఇన్ని యుద్ధాలు పరిష్కరించదంటూ తన భుజాలను తానే చరిచేసుకుంటున్నారు ట్రంప్.  అంతే కాదు.. తనకు నోబెల్ పురస్కారం దక్కకపోతే అది అమెరికాకే పెద్ద అవమానం అవుతుందంటున్నారు ట్రంప్.  అమెరికాకే  నోబెల్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నానని  వర్జీనియాలో జరిగిన ఉన్నత స్థాయి సైనిక సమావేశంలో అన్నారు.  మొత్తానికి.. ప్రెసిడెంట్  ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారం కోసం  చాలాచాలా పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారు. తనను తాను యుద్ధాలను ఆపిన శాంతి దూతగా ప్రమోట్ చేసుకోవడమే కాకుండా, నోబెల్ కమిటీని బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు.   నిజం చెప్పాలంటే.. ట్రంప్ ప్రపంచానికి వ్యతిరేకంగా పోటీ పడుతున్నారు. యుద్ధాల్లో జోక్యం చేసుకోవడం, శాంతి కోసం ఒప్పించేందుకు ప్రయత్నించడం లాంటివన్నీ,  నోబెల్ కోసమే చేస్తున్నారని క్లియర్‌గా తెలుస్తోంది.  దానికితోడు రిపబ్లికన్ నేతలు, అనేకమంది ప్రపంచ నాయకులు ట్రంప్‌ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు.  ఇప్పుడు కూడా రెండేళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధాన్ని ఆపడంతో ట్రంప్‌కు  మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కసరత్తు అంతా నోబెల్ కమిటీని ప్రభావితం చేసేందుకేననే చర్చ జరుగుతోంది.

జగన్ మెడికల్ రాజకీయం.. సెల్ఫ్ గోల్ అవుతుందా?

 ఫ్యాన్ పార్టీ మరో తప్పటడుగు వేస్తోందా ? తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి  పెట్టాలన్న తొందరలో అనాలోచితంగా వ్యవహరించి సెల్ఫ్ గోల్ చేసుకోబోతోందా?   అంటే అనకాపల్లి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా  ప్రజలు అవుననే అంటున్నారు.  ఎప్పుడైనా నాయకుడు పూర్తి చేసిన భవనం, పథకం గురించి పర్యటించి గొప్పగా చెప్పుకుంటారు గాని, అందుకు  భిన్నంగా అసంపూర్ణంగా ఉన్న మెడికల్ కాలేజ్ భవనం చూపించి జగన్ ఏం చేయాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన   కేవలం రాజకీయం మాత్రమే చేయబోతున్నారనీ, ఇది ఒకరకంగా వైసీపీకి   సెల్ఫ్ గోల్ అవుతుందని ఫ్యాన్ పార్టీ నాయకులు కూడా మధనపడుతున్నారు  ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు ప్రతిపా దనలు చేశారు అందులో ప్రస్తుత అనకాపల్లి లో నిర్మాణానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు కానీ ఆ స్థలం వివాదం కావడంతో అనకాపల్లికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెం వద్ద 52.15 ఎకరాల భూమిలో 20 22 డిసెంబర్ 28న జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం 500 కోట్ల రూపాయలఅంచనాతో ఏడు అంతస్తులలో మెడికల్ కాలేజీ భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయి. కానీ మూడు అంతస్తులకు మాత్రమే వేయడం జరిగింది . మిగిలిన నాలుగు ఐదు భవనాలకు పిల్లర్లు వేశారు. కాంట్రాక్టర్ నిర్మాణ పనులను ఎన్నికల ముందే నిలిపివేశారు. ఇప్పటి వరకు దాదాపు పాతిక కోట్ల రూపాయలను ఈ మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి వెచ్చించినట్టు అధికారులు తెలిపారు. అయితే కేంద్రం ప్రతి నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణ ప్రతిపాదన చేసింది. కానీ నర్సీపట్నంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీకి సంబంధించి కేంద్రం అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు .  ఏపీలో ఏడు మెడికల్ కాలేజీలకు  దరఖాస్తులు రాగా పిడుగురాళ్ల, పాడేరు మచిలీపట్నం లో మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేంద్రం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా నిర్మాణ పనులు పూర్తి చేపట్టాలని కొన్నిసార్లు ప్రభుత్వాలు భావిస్తాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజీ విషయంలో కూడా అదే రీతిన జగన్ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని భావించారు. అయితే తాజా కూటమి ప్రభుత్వం అసంపూర్ణంగా మిగిలిన మెడికల్ కాలేజీ లను పిపిపి పద్ధతిలో పూర్తి చేయాలని ప్రతిపాదన చేసింది. దీన్ని సహజంగానే ఫ్యాన్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పటికే  ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి  ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయి విద్యార్థులు అడ్మిషన్ లు జరిగిన కాలేజీని కాక   అసంపూర్ణంగా ఉన్న నర్సీపట్నం కాలేజీని ఎంచుకోవడం కేవలం రాజకీయం కోసమే అని పరిశీలకులే కాదు,  కొందరు వైసిపి నాయకులు కూడా అంటున్నారు.  కేవలం స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియోజవర్గంలో రాజకీయం చేసేందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన  పెట్టుకున్నారనీ, దీని వల్ల సెల్ఫ్ గోల్ చేసుకోవడం వినా మరో ప్రయోజనం సిద్ధించదని చెబు తున్నారు.  

వెంక‌య్య చెప్పింది వేద‌మ‌య్యా.. కానీ! ?

రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంక్షేమ ప‌థ‌కాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఆ ఖ‌ర్చు కూడా శృతి మించి పాకాన ప‌డుతోంది. ఈ విష‌యాన్నే ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు. ప్ర‌స్తుతం ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న ఉచితాలు అనుచితంగా మారాయ‌ని వెంకయ్య అన్నారు.  ఈ మాట‌లు కూడా నిజ‌మే క‌దా  అనిపించ‌క మాన‌వు. ఏం ప‌థ‌కాల‌వి? జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కుడు పాల‌న‌ బామ్మ కూడా చేస్తుంద‌న్న బాబు.. ఇప్పుడేం చేస్తున్నార‌న్న‌ది కూడా ఒక చ‌ర్చ‌నీయాంశ‌మే. జ‌గ‌న్ ఏటా డెబ్భై వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చయ్యేలాంటి ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న చేస్తే, అదే చంద్ర‌బాబు అంత‌కు రెట్టింపు చేస్తున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.  అలాగ‌ని ఇదంతా చంద్ర‌బాబుకు నచ్చి చేస్తున్న‌ది కాద‌న్న‌ది కూడా అంతే వాస్త‌వం. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో జ‌నాన్ని సంక్షేమ ప‌థ‌కాల ద్వారా మ‌భ్య పెట్ట‌డం ద్వారా మాత్ర‌మే రాణించ‌గ‌ల‌మ‌న్న‌ది తెలిసిందే.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ జ‌గ‌న్ అయిన దానికీ కానిదానికీ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు. ఆయ‌న ప‌థ‌క‌ ర‌చ‌న డీ కోడ్ చేయాలంటే అంత‌క‌న్నా మించిన ప‌థ‌క ర‌చ‌న చేస్తేనే సాధ్యం. జ‌గ‌న్ ప్ర‌వేశ పెట్టిన చాలా చాలా ప‌థ‌కాలు గ‌తంలో లోకేష్ ప్ర‌స్తావించిన‌వే. ఆ ప‌థ‌కాల‌ను బాబు తొలుత వ‌ద్ద‌న్నారు. కానీ, అదే 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌రాజ‌యం కొని తెచ్చి పెట్టింది.  2024 ఎన్నిక‌ల‌ నాటికి చంద్రబాబు త‌న ప్లాన్ ఛేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్ప‌టికీ ఆయ‌న ప్ర‌భుత్వ‌ సొమ్ము ప‌ప్పు బెల్లాల్లా పంచి పెట్ట‌డానికి ఏమంత స‌ముఖంగా లేరు. అందుకే పీ-4 వంటి ప‌థ‌కాల‌ను తీసుకొచ్చి ప్ర‌యివేటు వ్య‌క్తుల భాగ‌స్వామ్యం సంక్షేమంలో పెంపొందిస్తున్నారు.  ఇక మెడిక‌ల్ కాలేజీల్లో పీపీపీ ప‌థ‌కం కూడా స‌రిగ్గా ఇలాంటిదే.  ప్రైవేటు భాగ‌స్వామ్యం ఎలాంటి ఫ‌లితాలనిస్తుందో హైద‌రాబాద్- మెట్రోను బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీస్కోవ‌చ్చు. ఇప్పుడు హైద‌రాబాద్ మెట్రోను బ్ర‌హ్మాండంగా తీర్చిదిద్దిన ఎల్ అండ్ టీ చాలా చాలా త‌క్కువ ధ‌ర‌కు త‌మ వాటాల‌ను వ‌దులుకోడానికి సిద్ధ ప‌డుతోంది. దీని ద్వారా లాభ‌మేంటంటే ఈ మొత్తం  ప్ర‌భుత్వానికి ఒక ఆస్తిగా మ‌రుతున్నది. భ‌విష్య‌త్ లో న‌గ‌రానికే ఇదొక మ‌ణిహారంగా మారుతుంది.  కానీ విధిలేని ప‌రిస్థితుల్లో బాబు ఆయా ప‌థ‌కాల‌ను ఇస్తుండ‌టం ఒక రాజ‌కీయ అనివార్య ప‌రిస్థితిలో భాగంగానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తోంది. పోటా పోటీ రాజ‌కీయాల కార‌ణంగానే ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం ఈ సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఆటో డ్రైవ‌ర్ల సేవ ఇంచు మించు అలాంటిదే. ఉచిత బ‌స్సు ప‌థ‌కం  ఆటో డ్రైవ‌ర్లకు ఇబ్బందిక‌రంగా మారింది.  దీంతో ఆటో డ్రైవ‌ర్ల‌కు 15 వేల రూపాయ‌లను విధిలేని ప‌రిస్థితుల్లో ఇవ్వాల్సి వ‌చ్చింది.  వాజ్ పేయి అన్న‌ట్టు విద్యా, వైద్యం త‌ప్ప మ‌రేదీ ఉచితంగా అందివ్వాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ప్ర‌స్తుతం ఇటు ఏపీలో కావ‌చ్చు, అటు తెలంగాణ‌లో కావ‌చ్చు ఉన్న రాజ‌కీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. వ్య‌వసాయ ఆధారిత రాష్ట్రాలు కావ‌డంతో.. ఇక్క‌డ సంక్షేమానికి పెద్ద పీట వేయ‌క త‌ప్ప‌దు.  దానికి తోడు రాజ‌కీయాల్లోకి ఈ వ్యూహకర్తల రాకడ వ‌ల్ల‌ కూడా.. ఈ పోటా పోటీ సంక్షేమ ప‌థ‌కాలు తెలుగు రాజ‌కీయాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. క‌ర్ణాట‌క‌లో వ‌ర్క‌వుట్ అయిన ప‌థ‌కాల‌ను గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌క‌టించ‌డంతో.. అప్ప‌టి వ‌ర‌కూ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తూ వ‌చ్చిన ప‌థ‌కాలు కాస్తా గాలికెగిరిపోయాయి. మ‌హిళ‌లంతా క‌ల‌సి త‌మ కోసం కాంగ్రెస్ ప్ర‌క‌టించిన.. రూ. 500కే గ్యాస్ సిలిండ‌ర్, ఉచిత విద్యుత్, స‌న్న‌బియ్యం.. అన్నిటిక‌న్నా మించి ఫ్రీ బ‌స్ కి జై కొట్టారు.  దీంతో కాంగ్రెస్ ఇక్క‌డ అనూహ్యంగా మూడో స్థానం నుంచి దూసుకొచ్చి ఫ‌స్ట్ ప్లేస్ ఆక్ర‌మించింది. అధికారం కైవ‌సం చేసుకుంది.  ఇది గుర్తించిన తెలుగుదేవం కూట‌మి ఇవే సంక్షేమాల‌ను అటు ఇటుగా మార్చి.. సూప‌ర్ సిక్స్ అన్న నామ‌క‌ర‌ణం చేసి వ‌ద‌ల‌డంతో.. ఇక్క‌డ జ‌గ‌న్ సంక్షేమ జాత‌ర‌కు ఒక్క‌సారిగా ఫుల్ స్టాప్ ప‌డ్డ‌ట్ట‌య్యింది. దీంతో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువైంది.  ఉచితం అన్న‌ది రాజ‌కీయ క్రీడ‌లో ఒక‌ భాగ‌మై పోయింది. మేము ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలూ ఇవ్వం అని చెప్పి ఇక్క‌డ రాజ‌కీయాలు చేయ‌డానికి వీల్లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం వెంక‌య్య నాయుడు మాత్ర‌మే కాదు గ‌తంలో జేపీ న‌డ్డా ఏపీ వ‌చ్చిన‌పుడు కూడా ఈ సంక్షేమాలు త‌మ అభిమ‌తం కాద‌న్నారు. కానీ ఏపీలోని రాజకీయాల‌పై సంక్షేమం ఎంత‌టి ప‌వ‌ర్ఫుల్ అంటే, సోము వీర్రాజును కాస్తా సారాయి వీర్రాజుగా మార్చేంత‌. ఆయ‌న కూడా ఉచితాల ప్ర‌క‌ట‌న‌లో భాగంగా ఆనాడు.. అత్యంత చౌక‌గా మ‌ద్యం అందుబాటులోకి తెస్తామ‌ని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. ఇక్క‌డ అలాంటి కాంట్ బ‌ట్ సిట్యువేష‌న్ రాజ్య‌మేలేతున్న విధం కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ల్సి ఉంది.   పొలిటిక‌ల్ గా ఇలాంటి ప్రాక్టిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ చాలానే ఉన్నాయి. దీంతో సంక్షేమాలు ఒక అనివార్యంగా త‌యార‌య్యాయి. అభివృద్ధి మాత్ర‌మే చేస్తామ‌ని తెలుగు రాజ‌కీయాల్లో నెట్టుకు రావ‌డం చాలా చాలా క‌ష్టం అన్న‌ది ఇక్క‌డ ఏ  క్రియాశీల రాజ‌కీయ నాయ‌కుడ్ని అడిగినా చెబుతారు.

రేవంత్ పై పీకే విమర్శలు.. వ్యూహమేంటంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం, విమర్శల వెనుక అర్ధవంతమైన కారణమే ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించడానికి బీహార్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలను ఒక్క ప్రశాంత్ కిశోర్ మాత్రమే కాదు.. రాజకీయాలకు అతీతంగా బీహార్ వాసులంతా తప్పుపడుతున్నారు. బీహార్ కు చెందిన కన్హయ కుమార్ వంటి కాంగ్రెస్ నేతలు రేవంత్ ను మర్యాద తెలియని మనిషిగా, అనాగరికుడిగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.   ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. తనది తెలంగాణ డీఎన్ఏగా గర్వపడుతున్నానని చెబుతూ.. కేసీఆర్ డీఎన్ఏను తక్కువ చేసి వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమైంది.  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  కారాలు మిరియాలు నూరుతున్నారు. వచ్చే ఎన్నికలలో రేవంత్ ను గద్దెదింపడం ఖాయమని పీకే ప్రతిజ్ణ చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తింపు ఉన్న పీకే చేసిన ఈ సవాల్ సంచలనం సృష్టించింది. అంతే కాదు.. రేవంత్ వ్యాఖ్యల ప్రభావం కచ్చితంగా బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలపై చూపే అవకాశం ఉందన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.   తాజాగా రేవంత్ వ్యాఖ్యలపై పీకే వ్యక్తం చేసిన ఆగ్రహం, చేసిన సవాల్ 2028 లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై చూపే ప్రభావం ఏమిటో తెలియదు కానీ, ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే చేసిన వ్యాఖ్యల వెనుక వ్యూహం మాత్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీయాలన్నదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా రేవంత్ పై వ్యక్తం చేసిన ఆగ్రహం ద్వారా బీహారీలలో ఆత్మగౌరవ నినాదాన్ని తట్టిలేపడం ద్వారా తన జనసూరత్ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పీకే ఈ ఎత్తుగడ బీహార్ లో ఆయన పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందో తెలియదు కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ విజయావకాశాలను దెబ్బతీయడం ఖాయమని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. పీకే తన పార్టీ విజయం కంటే.. ప్రత్యర్థి పార్టీల అవకాశాలను దెబ్బతీయడానికే వ్యూహాలు రచిస్తారని గతంలో పలు సందర్భాలలో రుజువైన సంగతి తెలిసిందే.   

ఏపీలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల సవారీ!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాల స్వారీ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల చూసినా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలూ సజావుగా అమలు ఔతున్నాయి. 2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల జగన్ పాలనలో పేరుకే సంక్షేమం, అభివృద్ధి శూన్యం అన్నట్లుగా సాగిన తీరును గుర్తు చేసుకుంటూ.. తెలుగుదేశం కూటమి సర్కార్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం కూటమి సర్కార్ ముందుకు సాగుతోందనిపరిశీలకులు సైతం చెబుతున్నారు.  రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం పనులు చకచకా సాగుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలూ ఎలాంటి అవరోధాలూ లేకుండా సాగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. జగన్ హయాంలో కంటే ఇప్పుడే సంక్షేమం ఎక్కువగా ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో అందించిన సంక్షేమం గోరంత,  చేసుకున్న ప్రచారం కొండంత అన్నట్లుగా ఉండేదని అంటున్నారు. అందుకు భిన్నంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రచారం కంటే లబ్ధిదారులకు సంక్షేమం అందడం ముఖ్యం అన్నట్లుగా సాగుతోందని అంటున్నారు. అభివృద్ధి పనులు నిరాటంకంగా నిరంతరం సాగుతుండటంతో ఉపాధి సైతం పుష్కలంగా లభిస్తోంది. గత జగన్ పాలనతో పోలుస్తూ ప్రస్తుత తెలుగుదేశం కూటమి పాలనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. జగన్ హయాంలో అమ్మఒడి కుటుంబంలో ఒక్కరికి మాత్రం ఇచ్చారు. అదే ఇప్పడు బాబు పాలనలో తల్లికి వందనం పథకాన్ని కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింప చేస్తున్నారు. అలాగే గతంలో అంటే జగన్ హయాంలో పింఛన్ల కంటే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎక్కకువ ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకు జగన్ హయాంలో పది వేల రూపాయలు ఇస్తే.. ఇప్పుడు చంద్రబాబు 15 వేల రూపాయలు ఇస్తున్నారు.  ఇలా ఏ పథకం చూసుకున్నా.. జగన్ హయాంలో కంటే ఇప్పుడు చంద్రబాబు పాలనలో మెరుగ్గా ఉంది. అమలు పారదర్శకంగా ఉంది. గతంలో బటన్ నొక్కి సంక్షేమం ఇచ్చానని జగన్ చెప్పినా.. ఆ బటన్ నొక్కిన సొమ్ములు ఎప్పడు లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతాయో ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇక  జగన్ హయాంలో  అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రం అంతటా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. పారిశ్రామిక రంగం కళకళలాడుతోంది. పెట్టుబడులు ఏపీయే గమ్యం అన్నట్లుగా తరలి వస్తున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ, ఆందోళనలకు పిలుపునిస్తున్నా పార్టీ శ్రేణులే సీరియస్ గా తీసుకోని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. 

తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం.. ఇంతకు మించి తరుణం ఉంటుందా?!

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మహత్తర ఆశయంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ  తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందనడంలో సందేహం లేదు.  తెలుగు ప్రజల అభ్యున్నతి, ఆత్మగౌరవం లక్ష్యంగా పని చేస్తున్న  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో   వెనుకబడింది.  ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో   ఉనికి మాత్రంగానే మిగిలిందని చెప్పవచ్చు.  అయితే ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్నది నాయకుల కొరతే తప్ప కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచారు.   ఈ విషయం పలు సందర్భాల్లో నిర్ద్వంద్వంగా రుజువైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం అండ కోసం అన్ని రాజకీయపార్టీలూ వెంపర్లాడిన పరిస్థితి.  కాంగ్రెస్, బీజేపీలు ఆ ఎన్నికల  ప్రచారంలో తెలుగుదేశం ప్రస్తావన తీసుకురావడమే కాదు, పార్టీపై ప్రశంసల వర్షం కురిపించారు.  అంతే కాదు..  అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జపం చేసి ఆ పార్టీ కార్యకర్తలకు దగ్గరవ్వాలని విశ్వ ప్రయత్నం చేసింది.  ఎవరు ఔనన్నా కాదన్నా.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం దండిగా ఉంది. ఈ విషయం పదేపదే నిర్ద్వంద్వంగా రుజువు అవుతూనే వస్తోంది. రాష్ట్ర విభజన అనంతర   పరిణామాలతో  తెలంలగాణలో తెలుగుదేశం పార్టీ   ఒకింత ఇన్ యాక్టివ్ అయ్యిందన్న మాట వాస్తవమే. అయితే ఆ పార్టీ పునాదులు మాత్రం తెలంగాణలో చెక్కు చెదరలేదు.  తెలుగుదేశంఅధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు క్రియాశీలంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు.  2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించిన అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న భావనతో ఉన్నారు. ఇందు కోసం ఆయన తరచుగా తెలంగాణ తెలుగుదేశం నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం కొద్ది కాలం కిందట జోరుగా సాగింది. అయితే ఆ దిశగా పార్టీ ముందుకు సాగిన దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. అయితే పరిశీలకులు మాత్రం తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం కావడానికి, పునర్వైభవం సంతరించుకోవడానికి ఇది మంచి తరుణమని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కారణాలేమైతేనేం.. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత  తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి జంప్ అయ్యారు. అయితే ఆలా వెళ్లిన నేతల వెంట కార్యకర్తలు మాత్రం వెళ్లలేదు. అంతెందుకు తొలి నుంచీ తెలుగుదేవం పార్టీతో అనుబంధం ఉన్న పలువురు నేతలు ఇప్పటికీ తెలుగుదేశంతోనే ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా తెలుగుదేశం ఇన్ యాక్టివ్ అయినా.. ఎప్పటికైనా తెలుగుదేశం రాష్ట్రంలో పుంజుకుంటుందన్న విశ్వాసం మాత్రం కార్యకర్తలలో ఇసుమంతైనా సడలలేదు.   ఇటీవల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేశారు.  ఇది జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ.. పార్టీ పరంగా ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఈ తరుణంలో తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో తెలుగుదేశం క్యాడర్ ఈ ఎన్నికలలో పోటీ చేయాలని పార్టీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.  గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా.. స్థానిక సమరంలో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించితే.. పార్టీ ప్రజలకు చేరువ అవుతుందనీ, అది రాష్ట్రంలో ముందు ముందు  తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వచ్చేందుకు దోహదపడుతుందని కార్యకర్తలు గట్టిగా చెబుతున్నారు.  పరిశీలకులు విశ్లేషణలు కూడా అలాగే ఉన్నాయి. చూడాలి మరి పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో? 

తెలంగాణ స్థానిక ఎన్నికలు.. చేతులెత్తేసిన పార్టీలు

రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికల సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించవలసి వుంది. దీంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లపై జీవో జారీ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి మార్గం సుగమం చేసింది. అంతే వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అయితే ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రధాన పార్టీలేవీ రెడీగా లేవు.  వైపు ఓటమి భయం అన్ని పార్టీలలోనూ సమానంగా వ్యక్తం అవుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోన ఫలితాలు ప్రతికూలంగా వస్తే.. అన్న ఆందోళన కనిపిస్తున్నది. ఈ దశలో బీజేపీ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అసలు స్థానిక ఎన్నికలు జరిగే అవకాశమే లేదంటూ కుండబద్దలు కొట్టేశారు. అనవసరంగా భారీ ఆర్భాటంతో ప్రచారాలు చేయవద్దనీ, దావతుల పేరుతో డబ్బులు వృధా చేసుకోవద్దనీ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  నిజానికి స్థానిక సమరంలో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందన్న అంచనాలు బలంగా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలూ కూడా ఎన్నికల సన్నాహకాల విషయంలో ఇంకా తొలి అడుగులోనే ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల జీవో తో రేవంత్ సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నా.. ఆ నిర్ణయం కాంగ్రెస్ గ్రాఫ్ ను ఏ మాత్రం పెంచిందంటే.. ఆ పార్టీ నాయకులే అనుమానం అంటూ నసుగుతున్నారు. అధికారంలో ఉండి స్థానిక ఎన్నికలలో సత్తా చాటలేకపోతే ఆబోరు దక్కదన్న భయం కాంగ్రెస్ లో వ్యక్తం అవుతుంటే.. బీఆర్ఎస్ లో స్థానిక ఓటమి పార్టీ ఉనికికే ముప్పు తెస్తుందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.    ఇక్కడ మరో ప్రధాన అంశమేంటంటే.. బీజేపీ 42శాతం రిజర్వేషన్లను బాహాటంగా వ్యతిరేకించే పరిస్థితుల్లో లేదు. అయినా ఈటల మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా స్థానిక సంస్థ‌ల్లో కాంగ్రెస్ ప్రభుత్వం  ప్ర‌భుత్వం 42 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని చూస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.  ఏదోలా ఎన్నికలు జరిగినా.. తరువాత ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే జరిగిన ఎన్నికలను రద్దు చేసే అవకాశాలున్నాయని ఈటల చెబుతున్నారు. తద్వారా ఈటల హేతురహితంగా ఎన్నికల రద్దు ప్రస్తావన తేలేదనీ, గతంలో  మ‌హారాష్ట్రంలో ఇలాగే జరిగిందనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో మహారాష్ట్ర కూడా రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించింది. అయితే ఆ తరువాత ఆ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని బొంబై హైకోర్టు రద్దు చేసింది. ఈ విషయాన్ని కూడా ఈటల ఉదహరించారు. ఆ ఉదాహరణ చూపుతోనే.. ఎన్నికలకు ప్రచారార్భాటాలు, దావత్ లతో సొమ్ము వృధా చేసుకోవద్దన్నారు.  అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశమేంటంటే స్వయంగా బీసీ నాయకుడై ఉండీ ఈటల కాంగ్రెస్ ప్రభుత్వ రిజర్వేషన్ల జీవోను వ్యతిరేకించడం. దీనినే ఎత్తి చూపుతూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నా.. ఎన్నికల విజయంపై మాత్రం ఆ పార్టీలో ధీమా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అందుకే షెడ్యూల్ విడుదలైనా ఎన్నికల హడావుడి మాత్రం పార్టీలలో పెద్దగా కనిపించడం లేదు. 

స్ధానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ కు రిజర్వేషన్ల సవాల్!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగానే.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. దీనికి సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందు నుంచీ ప్రచారం జరిగినట్లుగానే..  తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 5 వేల 749 ఎంపీటీసీ స్థానాలు, 565 జడ్పీటీసీ స్థానాలకు.. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇక.. 12 వేల 733 గ్రామ పంచాయతీలకు..  3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.  అక్టోబర్‌ 9న తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 11న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్‌ 13న రెండో దశఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. రెండో దశ నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 15ని చివరి తేదీగా నిర్ణయించారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ  స్థానాలకు.. అక్టోబర్ 23న తొలిదశ , అక్టోబర్ 27న రెండో దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి.  అక్టోబర్ 31న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం లక్షా 12 వేల 474 పోలింగ్ స్టేషన్లలో.. పోలింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కోటీ 67 లక్షల మందికి పైగా ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో.. 85 లక్షల 36 వేల మందికి పైగా మహిళా ఓటర్లు, 81 లక్షల 65 వేల మందికి పైగా పురుష ఓటర్లు ఉన్నారు. కోర్టు ఆదేశాలతో.. 14 ఎంపీటీసీ, 27 గ్రామపంచాయతీలకు ఎన్నికలను నిలుపుదల చేసింది ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో.. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే.. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ జీవో జారీ చేసింది. ఈ మేరకు.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే.. అక్టోబర్ 9న తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అయితే.. దానికంటే ఒక్క రోజు ముందే.. 42 శాతం రిజర్వేషన్ల అమలుపై.. హైకోర్టు ఏం చెబుతుందనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కోర్టు నుంచి సానుకూలమైన ఆదేశాలు గనక వస్తే.. బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే చర్చ జరుగుతోంది. ఇది.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర మేలు చేస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం బహుశా ఇదే తొలిసారి. ఇప్పటికే దీనిపై జనంలో చర్చ మొదలైంది. దాంతో.. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు కైవలం చేసుకుంటుందన్నదే ఉత్కంఠ రేపుతోంది.

ఆసియా క‌ప్ కాదు.. భార‌త్- పాక్ గ్రౌండ్ వార్?

ఈ సారి ఆసియా క‌ప్   చాలా చాలా ప్ర‌త్యేకం. దీన్ని పిచ్ పై జ‌రిగిన‌ భార‌త్- పాక్  వార్ గానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తోంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ లో భార‌త్ గెలిచిందే కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వ‌లేదు. అప్ప‌టి నుంచి మొద‌లైంది అస‌లు ర‌గ‌డ‌. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య కేవ‌లం స‌రిహ‌ద్దులోనే కాదు ఏ వైదిక‌మీద‌నైనా యుద్ధం యుద్ధ‌మేని. అందుకే మోడీ కూడా ఇదే త‌ర‌హాలో ట్వీట్ చేశారు. పిచ్ మీద జ‌రిగిన‌ ఆప‌రేష‌న్ సిందూర్ లో కూడా భార‌త్ దే విజ‌య‌మంటూ ఆయ‌న అన‌డం అదే సూచించింది. ఈ టోర్నీలో రెండు జ‌ట్ల మ‌ధ్య మొత్తం మూడు మ్యాచ్ లు జ‌ర‌ిగాయి.. ఫైన‌ల్లో భార‌త్, పాక్ ని ఉత్కంఠ పోరులో చిత్తు చేసి త‌న క్రికెట్ ప్ర‌తీకారంతీర్చుకోగ‌లిగింది.  ఒక ద‌శ‌లో పాక్ ఆట‌గాళ్లు అన్న మాట‌లేంటంటే.. తాము ఎందుకు ఓడిపోయామంటే.. భార‌త్ ని ఫైన‌ల్ వ‌చ్చేలా చేసి.. అక్క‌డ ఓడించి ప్ర‌తీకారం తీర్చుకోడానికీ అన్న కామెంట్లు పెద్ద ఎత్తున హాస్యాస్ప‌ద‌మ‌య్యాయి. ఆ స‌రికే గ‌న్ పేల్చిన పోజులు, విమానాన్ని కూల్చామ‌న్న సిగ్న‌ళ్లిచ్చి వివాదాస్ప‌ద‌మైన పాక్ ఆట‌గాళ్లు.. త‌ర్వాత ఐసీసీ చేత చీవాట్లు తినాల్సి వ‌చ్చింది. ఇక ఇలాంటి వారికి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం కూడా నేర‌మ‌న్న కోణంలో సూర్య‌కుమార్ యాద‌వ్ చేసిన ప్ర‌తీకార చ‌ర్య‌కు ఐసీసీ ద్వారా మ్యాచ్ ఫీజులో కోత ఎదుర్కోవ‌ల్సి వ‌చ్చింది. అయినా సరే ఏమంత లెక్క  చేయ‌లేదు.. సూర్యా భాయ్. పైపెచ్చు ఆ  దేశాన్ని త‌మ‌కు ప్ర‌త్య‌ర్ధిగా అభివ‌ర్ణించ‌రాద‌ని కూడా సూచించారాయ‌న‌. కార‌ణం.. త‌మ‌తో ఏ పిచ్ మీద, ఏర‌క‌మైన మ్యాచ్ జ‌రిగినా.. వ‌రుస‌గా ఓడిపోయే టీమ్ ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ఎలా అవుతుంద‌ని నిల‌దీశారు  సూర్య‌. ఇక ఫైన‌ల్ అయితే టాస్ ఓడి బ్యాటింగ్ మొద‌లు పెట్టిన పాక్.. తొలుత మంచి ప్రారంభం చేసింది. కానీ ఓపెన‌ర్లు ఔట్ కాగానే, ఆ ఇన్నింగ్స్ కాస్తా పేక‌మేడ‌లా కూలింది. కుల్ దీప్ అయితే ఏకంగా  నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు ఆ నాలుగు వికెట్లలో మూడు ఒకే ఓవర్ లో తీసుకున్నాడు. ఇక 147 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న మొద‌లు పెట్టిన భార‌త్ .. అభిషేక్ శ‌ర్మ రూపంలో ఊచ కోత మొద‌వుతుంద‌ని అంద‌రూ ఆశిస్తే.. అది కాస్తా ఆశ అడియాశే అయ్యింది. ఆపై శుభ్ మ‌న్ గిల్, సూర్య కూడా త‌క్కువ ప‌రుగుల‌కే ఔట్  అయ్యారు. అయితే ఇండియా చేతులెత్తేయలేదు. తెలుగింటి కుర్రాడు.. తిల‌క్ వ‌ర్మ‌.. త‌న‌దైన బ్యాటింగ్ విధ్వంసంతో క‌ప్పు భార‌త్ చేజారి పోకుండా కాపాడాడు. దీంతో 9వ సారి ఆసియా క్రికెట్ కింగ్ భార‌తే అని నిరూపించ‌గ‌లిగాడు.  ఒక్క మాట‌లో చెప్పాలంటే తిల‌క్ వ‌ర్మ చేసినవి కేవ‌లం 69 తొమ్మిది ప‌రుగులు మాత్ర‌మే కావు, కోటాను కోట్ల మంది భార‌తీయుల‌ భావోద్వేగాలు. దీంతో సూర్య‌కుమార్ యాద‌వ్ తిల‌క్  వ‌ర్మ‌కి టేక్ అబౌ ఇచ్చి గౌర‌వించాడు. ఇక క‌ప్ ఒక పాకిస్తానీ నుంచి అందుకోవ‌డం భారత్ కు నచ్చకపోవడంతో.. ప్రజంటేషన్  సెర్మ‌నీ గంట‌న్న‌ర ఆల‌స్యంగా జ‌రిగింది. ఆపై మ‌రొక‌రి ద్వారా ఇస్తార‌న్న మాట కూడా వినిపించింది .కానీ..  ఏషియ‌న్ ఛాంప్స్- 2025 ఈ సారి క‌ప్ అందుకోకుండానే టీమిండియా స‌భ్యులు త‌మ‌ సెల‌బ్రేష‌న్స్ చేసుకోవ‌ల్సి వ‌చ్చింది.  దీనంత‌టికీ కార‌ణం పాకిస్థానీయుల‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌క పోవ‌డం మాత్ర‌మే కాదు, వారిచ్చే క‌ప్పు కూడా మాకు గ‌డ్డిపోచ‌తో స‌మానం అన్న అర్ధ‌మొచ్చేలా వ్య‌వ‌హ‌రించింది భార‌త జ‌ట్టు. ఒక ద‌శ‌లో టోర్నీ  నుంచి నిష్క్ర‌మిద్దామ‌నుకున్న పాక్ జ‌ట్టు.. కోట్ల రూపాయ‌ల‌  న‌ష్ట‌ప‌రిహారం క‌ట్ట‌లేక కొన‌సాగ‌డం మాత్ర‌మే కాదు.. ఫైన‌ల్ లోనూ భార‌త్ చేతిలో ఓడి.. భార‌త్ ముందు త‌న ప‌రాజ‌య ప‌రంప‌ర‌ను పూర్తి చేసుకుంది.  దీంతో క‌ద‌న రంగంలో,క్రికెట్ పిచ్ పైనా.. రెండింటా.. భార‌త్ ముందు పాక్ దిగ‌దుడుపే అని మ‌రోమారు ప్ర‌పంచానికి అర్ధమయ్యేలా   ఈ ఆసియా క‌ప్ జ‌రిగిన‌ట్టు భావిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు చెప్పండ్రా అమెరిక‌న్లూ.. కాల్పుల విర‌మ‌ణ మీరు చేశారా? లేక భార‌తే పాక్ ని త‌ల వంచేలా చేసిందా?  అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.  ఆ మాట‌కొస్తే ఇండియ‌న్ ఫ్యాన్స్ ఫ‌స్ట్ మ్యాచ్ నే బాయ్ కాట్ చేశారు. పెహ‌ల్గాంలో అకార‌ణంగా 26 మంది చావుకు కార‌ణ‌మైన పాక్ జ‌ట్టుతో మ‌నం క్రికెట్ ఆడ్డం ఏంట‌న్నది వీరి వాద‌న‌.  కాగా.. ఇపుడీ ఫైన‌ల్ మ్యాచ్ విన్నింగ్ ద్వారా పాక్ కి మ‌రో మారు బుద్ధి చెప్ప‌గ‌లిగింది భార‌త్. ఇదిలా ఉంటే కొంద‌రు పాకిస్థాన్ క్రికెట్ ల‌వ‌ర్స్.. మా క్రికెట్ జ‌ట్టు వ‌ల్ల మాకెలాంటి లాభం లేదు. సుఖం సంతోషం లేదు.. పాకిస్థాన్ మొత్తం క‌ట్ట‌క‌ట్టుకుని వ‌చ్చినా కూడా భార‌త్ పై మేం గెల‌వ‌డం సాధ్యం కాదు. అందుకే ఐ ల‌వ్ ఇండియా. మేం కూడా టీమిండియా అభిమానుల‌మే.. అన‌డం క‌నిపించింది.

ఔషధాల ఎగుమతులపై ట్రంప్ టారిఫ్‌ బాంబు

ఇప్పటికే.. భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. మరోసారి టారిఫ్ షాక్ ఇచ్చింది. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా టారిఫ్ విధించింది. దాంతో పాటు ఫర్నిచర్, ట్రక్కులు, కిచెన్ ఉపకరణాలపైనా అమెరికా అధ్యక్షుడు సుంకాలతో విరుచుకుపడ్డారు.  ముఖ్యంగా పేటెంట్ ఔషధాలపై.. ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇక.. కిచెన్ క్యాబినెట్, బాత్ రూమ్ పరికరాలపై 50 శాతం, అప‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై పాతిక శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ విధించిన   జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకొని.. ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ సుంకాలతో.. భారత ఫార్మా ఉత్పత్తులపై ఎంత ప్రభావం పడుతుం దన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.  2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 28 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31 శాతం ఔషధాలు యూఎస్‌కే వెళ్లాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 3.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45 శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15 శాతం ఇండియా నుంచి సరఫరా అయ్యేవే ఉంటాయి.  ఇప్పుడు.. ట్రంప్ విధించిన టారిఫ్‌లతో  అమెరికా మార్కెట్‌లో భారత ఔషధాల ధరలు రెట్టింపు కానున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతుండగానే.. ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. భారత్‌ అమెరికాకు ఎగుమతి చేసే మెడిసిన్లలో ఎక్కువ భాగం జనరిక్ మందులే ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిపై టారిఫ్ లేదు. కేవలం.. బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మా ఉత్పత్తులకు మాత్రమే ఈ వంద శాతం టారిఫ్ వర్తిస్తుంది. దీంతో.. ఈ తరహా ఔషధాలు ఎగుమతి చేసే కంపెనీల లాభాల మార్జిన్‌లు, స్టాక్ ధరలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ.. టారిఫ్ పరిధిని కాంప్లెక్స్ జనరిక్స్‌కి కూడా విస్తరిస్తే.. భారతీయ ఫార్మా రంగంపై ఎఫెక్ట్ ఉంటుందనే చర్చ జరుగుతోంది.  తక్కువ ధరలలో నాణ్యమైన ఔషదాలను భారత ఫార్మా కంపెనీలు కొన్నేళ్లుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికాకు అవసమయ్యే 47 శాతం ఔషధ అవసరాలను భారత్ కంపెనీలే తీరుస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన వంద శాతం టారిఫ్‌లు కేవలం బ్రాండెడ్, పేటెంట్ కలిగిన  ఔషధ దిగుమతులకే వర్తిస్తాయి. అమెరికాకి భారత్ నుంచి ఎగుమతి అయ్యేవి జనరిల్ ఔషధాలే. కాబట్టి ఇప్పటికిప్పుడు భారత్ ఎగుమతులపై ప్రభావం ఉండబోదంటున్నారు.  అయితే.. సుంకాల నుంచి మినహాయింపు పొందేందుకు.. భారతీయ కంపెనీలు అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గానీ, ఇతర అంతర్జాతీయ మార్కెట్లపై ఫోకస్ చేయడం లాంటి వ్యూహాలను అనుసరిస్తే సరిపోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. తరచుగా ట్రంప్ సర్కార్.. భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని.. విదేశాంగ విధాన వైఫల్యంగా విపక్షాలు వర్ణిస్తున్నాయి. సుంకాలు, హెచ్1బీ వీసాల ఫీజు పెంపు, వాణిజ్య ఒప్పందంలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. అమెరికా చర్యల పట్ల.. కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటంపైనా.. విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

రాహుల్ కోరుకుంటున్న జెన్ జెడ్ మూవ్ మెంట్ ఇదేనా?

మొన్నా మ‌ధ్య రాహుల్ ఓట్ చోరీ వ్య‌వ‌హారంలో చేసిన కామెంట్ ఏంటంటే.. భార‌త్ లోనూ విద్యార్ధులు జెన్ జెడ్ ఉద్య‌మం మొద‌లు పెడితే.. వారికి తాము అండ‌గా నిలుస్తామ‌ని అన్నారాయ‌న‌. అందులో భాగంగానే త‌న విదేశీ స‌ల‌హాదారు శ్యామ్ పిట్రోడా ద్వారా.. పాకిస్థాన్ సొంతింటిలా అనిపిస్తుంది.. నేపాల్, బంగ్లా ప్ర‌శాంతంగా ఉంటాయ‌న్న రాంగ్ కామెంట్స్ చేయించిన‌ట్టు గానూ తెలుస్తోంది. ఇవ‌న్నీ అలాగుంటే ఇప్పుడు ల‌డక్ నుంచి రాహుల్ కొన్ని విదేశీ శ‌క్తుల‌తో క‌ల‌సి జెన్ జెడ్ మూమెంట్ ని మొద‌లు పెట్టిన‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు కొంద‌రు. కావాలంటే చూడండి.. ఇందులో కీల‌క పాత్ర పోషిస్తోంది పైకి సోనం వాంగ్ చుక్ అయినా.. దీని వెన‌క ఉన్న‌ది స్థానిక కాంగ్రెస్ నేత‌.. పుంట్సోక్ త్సెసాగ్ అంటారు వీరు. లేహ్ లోని ప్ర‌భుత్వ ఆస్తుల‌తో పాటు బీజేపీ కార్యాల‌యాన్ని త‌గ‌ల‌బెట్టించ‌డం అనే ఘ‌న కార్యం ఈ త్సెసాగ్ చేతుల మీదుగానే జ‌రిగింద‌ని చెప్పుకొస్తారు. ఇంత‌కీ ఎవ‌రీ సోనం వాంగ్ చుక్. ఏంటీ ల‌డ‌క్ డిమాండ్? అని చూస్తే..  ఒక విద్యావేత్తగా, ఇంజినీర్‌గా, పర్యవరణ సంరక్షకునిగా, సామాజిక కార్యకర్తలు ఈ దేశ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని సోనమ్ వమ్ము చేశాడ‌ని అంటారు బీజేపీ నేత‌లు. ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో లడ‌క్ ప్రజలను రెచ్చగొడుతున్నార‌నీ ఆరోపిస్తున్నారు వీరంతా.   లడ‌క్ ప్ర‌స్తుత‌ పరిస్థితిని మనమంతా గమనించాలనీ.. ఇప్పటికే లడక్‌లోని సగభాగం అక్సాయ్ చిన్‌ను చైనా ఆక్రమించిందనీ.. దేశ భద్రత దృష్ట్యా అది మన దేశానికే కీలక ప్రాంతమ‌నీ.. ఈ కారణాలవల్లే ఆర్టికల్ 370 రద్దు దర్వాత జమ్మూ కశ్మీర్ నుంచి లడ‌క్ ప్రాంతాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించించారనీ చెప్పుకొస్తారు కాషాయ నేత‌లు.   కేవలం 2 లక్షల మంది కోసం ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధ్యం?  ఈ లెక్కన మన దేశంలోని ప్రతి జిల్లాను ఒకటో, రెండో రాష్ట్రాలు చేయాల్సిందేనా? లడ‌క్‌ను ఆరో షెడ్యూల్ కింద చేర్చాలంటే దాన‌ర్ధ‌మేంటి? దీన్ని అడ్డం పెట్టుకొని అక్కడ పరిశ్రమలు, ఉపాధి కేంద్రాలు, ఏర్పాటు చేయకాకుండా అడ్డుకోవాల‌నే కుట్ర కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు క‌మ‌ల‌నాథులు.  ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌య‌మేంటంటే.. వాంగ్‌చుక్‌కు పాకిస్తాన్ హ్యాండిల్స్  ఎందుకు మద్దతు ఇస్తున్నాయి? ఈయన వెనుక కొన్ని విదేశీ శక్తులు దాగి ఉన్నాయా? అన్న కోణంలోనూ ఆరా తీయాల్సిందేనంటారు బీజేపీ వారు. ఈ అనుమానాల‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా.. సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో పర్యటించి వచ్చారు. అంతే కాదు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌తో కూడా స‌త్సంబంధాలు ఉన్నాయి సోన‌మ్ కి. వాంగ్‌చుక్ చేస్తున్న డిమాండ్లను పరిశీలిస్తున్న కేంద్రం చర్చల కోసం తేదీలను కూడా ప్రకటించింది. అసలు సోనమ్ ఇచ్చిన జన్ జడ్ పిలుపు అర్థం హింసేనా? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తో పోల్చ‌డంలోని ఆంతర్యం ఏమిటి? ఇవన్నీ అంత‌ర్గ‌తంగా దేశ శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అత‌లాకుత‌లం చేసే కుట్రలు కావా? అని ప్ర‌శ్నిస్తున్నాయి కాషాయ వ‌ర్గాలు. రాహుల్ గాంధీ చెప్పిన జన్ జడ్ తిరుగుబాటు ఇదేనా? లడాక్‌లో అల్లరి మూకలను పోగేసి విధ్వంసానికి దిగింది ఎవరో గమనించ‌మంటున్నారు క‌మ‌ల‌నాథులు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంట్సోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ చేతిలో ఆయుద్ధం పట్టుకొని హింసాకాండకు నాయత్వం వహించాడ‌నీ.. లేహ్‌లో ప్రభుత్వ ఆస్తులతో పాటు బీజేపీ కార్యాలయానికి కూడా ఇత‌డే నిప్పు పెట్టించాడనీ అంటారు బీజేపీ లీడ‌ర్లు. అయితే ఫోటోల్లో ఉన్నది తాను కాదని త్సెపాగ్ బుకాయిస్తున్నాడనీ.. నిజమేంటో త్వ‌ర‌లో దర్యాప్తు ద్వారా తేలుతుందని చెప్పుకొస్తున్నారు బీజేపీ లీడ‌ర్లు.  అసలు సోనమ్‌ వాంగ్‌చుక్‌కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు ఏమిటి? ఈ విష‌యం కూడా త్వ‌ర‌లోనే బ‌య‌ట ప‌డుతుంద‌ని.. ఇదంతా రాహుల్ విదేశీ శ‌క్తుల‌తో చేతులు క‌లిపి చేస్తున్న కుట్ర మాత్ర‌మేన‌ని అంటోంది క‌మ‌ల‌ద‌ళం. మ‌రి చూడాలి.. ఈ పోరాటం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో!

విశ్వవిద్యాలయాలపై కాషాయ జెండా రెపరెపలు.. దేనికి సంకేతం?

కాంగ్రెస్ అగ్ర నాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తమ మనసులోని మాటను చాలా చక్కగా బయట పెట్టారు. మన ఇరుగు పొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో వచ్చిన జెన్  జెడ్    తిరుగుబాటు మన దేశంలో కూడా వస్తుందనీ, దేశంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్ముక్కై ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆందోళన సాగిస్తున్న రాహుల్ గాంధీ.. తమ ఓటు చోరీ ఆందోళన జెన్ జెడ్  ఆందోళనగా రూపాంతరం చెందుతుందని ఆశిస్తున్నారు. నమ్ముతున్నారు. అదే మాట అంటున్నారు. విద్యార్ధులు, యువత ఒక్కటై రాజ్యాంగాన్ని కాపాడుకుంటారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను ఎప్పుడూ ముందుంటాననీ, జెన్ జెడ్  ఆందోళనకు సంపూర్ణ మదటు ఉంటుందని  రాహుల్ గాంధీ చెబుతున్నారు.  ఒక్క  రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు..  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామరావు కూడా  ప్రభుత్వాలు ఇదే విధంగా ప్రవర్తిస్తే మన దేశంలోనూ నేపాల్ తరహా  జెన్  జెడ్ తిరుగుబాటు తప్పక వస్తుందంటున్నారు. మొత్తానికి  రాహుల్ గాంధీ మొదలు కేటీఆర్ వరకు.. ఇంకా ఇండి  కూటమి పార్టీల నాయకులు కూడా నేపాల్  తరహా  తిరుగుబాటు మన దేశంలోనూ వస్తుందనీ.. రావాలని ఆశిస్తున్నారు.  మరో వంక  బీజేపీ రాహుల్  గాంధీ ఆలోచనలను అర్బన్ నక్సల్  ఆలోచనలుగా పేర్కొంటూ.. దేశంలో అస్థిరత్వాన్ని ప్రోది చేసేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని ఆరోపి స్తున్నారు.  అదలా ఉంటే..  భారత దేశంలో నిజంగా   ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్న పరిస్థితి ఉందా? బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల అంత తీవ్ర వ్యతిరేకత ఉందా? అంటే..   విద్యార్ధి లోక నుంచి లేదనే జవాబే వస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు, ఇటివల కాలంలో వెలువడిన విద్యార్ధి తీర్పులను ఉదాహరణగా చూపిస్తున్నారు.  ఇటీవలి కాలంలో ఢిల్లీ జరిగిన వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘం ఎన్నికల్లో  ఆర్ఎస్ఎస్  అనుబంధ అఖిల భారతీయ విద్యర్ది పరిషత్ (ఏబీవీపీ) వరస విజయాలను సొంతం చేసుకుంది. ఢిల్లీ నుంచి మణిపూర్ వరకూ,మణిపూర్ నుంచి గుహవటి వరకూ,  గుహవటి నుంచి పంజాబ్ , పంజాబ్ నుంచి పాట్నా, పాట్నా నుంచి ఉత్తారఖండ్, ఉత్తారఖండ్ నుంచి హైదరాబాద్ వరకు వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘాల ఎన్నికలలో ఏబీవీపీ ఎదురులేని విజయాలను సొంత చేసుకుంది.  ఈ విజజయాలు   నేపాల్ తరాహా విద్యార్ధి తిరుగుబాటును ఆశించిన రాహుల్ గాంధీ, సహా పలువురు నేతల ఆశలను అడి యాసలు చేశాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే..  విద్యార్ధులు, యువతలో అశాంతి అసలే లేదా అంటే ఔనని చెప్పలేం. అయితే..  ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశం ముందు ప్రత్యామ్నాయ విధానాలు, ప్రత్యామ్నాయ నాయకత్వం ఉంచడంలో విఫలం కావడం వల్లనే విద్యార్ధులు,యువత సహా అన్ని వర్గాల ప్రజలు కాషాయంవైపు చూస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటు న్నారు.  

కేంద్ర మంత్రి పదవి.. గవర్నర్ పోస్టు.. తెలుగుదేశంకు కేంద్రం ఆఫర్?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి కేంద్రంలో ఉన్న పలుకుబడి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇలా అడిగితే.. అలా కేంద్రం అనుమతులు మంజూరు చేస్తోంది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సర్కార్ మనుగడకు తెలుగుదేశం మద్దతు అత్యంత కీలకం కనుక మాత్రమే ఈ పలుకుబడి అనుకోవడానికి వీలు లేదు. చంద్రబాబు దార్శనికత.. దేశ ప్రగతికి ఆయన సలహాలు అత్యంత ముఖ్యమని కేంద్రం పెద్దలు భావిస్తుండటమే అందుకు కారణమని పరిశీలకులు అంటున్నారు.  ఇక తాజాగా కేంద్రం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. కేంద్రం తెలుగుదేశం పార్టీకి మరో రెండు కీలక పదవులను కట్టబెట్ట నుంది. అవేంటంటే బీహార్ ఎన్నికల తరువాత జరగనున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగుదేశం కు మరో మంత్రి పదవి. అంటే ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఇద్దరు తెలుగుదేశంకు చెందిన వారు ఉన్నారు. అదనంగా మరో మంత్రిపదవిని కూడా తెలుగుదేశంకు ఇచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా.. ఒక రాష్ట్రానికి గవర్నర్ గా కూడా తెలుగుదేశం కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్రం వర్గాలు అంటున్నాయి.  ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ప్రధాని మోడీ చర్చించినట్లు సమాచారం.  ఇటీవలే  కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి   అశోక్ గజపతి రాజును గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సీనియర్ నేతను మరో  రాష్ట్రానికి గవర్నర్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది.  దీంతో ఇప్పడు అంటే బీహార్ ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం మరో రెండు కీలక పదవులను తెలుగుదేశంకు ఆఫర్ చేయనున్నది. అయితే ఆ పదవులకు చంద్రబాబు ఛాయస్ ఎవరై ఉంటారన్నచర్చ ఇప్పుడు రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. తెలుగుదేశం వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు  తెలుగుదేశం నుంచి గవర్నర్ పదవి కోసం రేసులో ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. వారిలో ఒకరు మాజీ మంత్రి, మాజీ స్పీకర్ అయిన యనమల రామృష్ణుడు కాగా మరొకరు మాజీ మంత్రి కేఈకృష్ణమూర్తి. ఈ ఇరువురూ కూడా చంద్రబాబుకు సన్నిహితులే. ఈ ఇరువురిలో చంద్రబాబు కేఈ కృష్ణమూర్తివైపే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా ఉన్నారు. కనుక ఇప్పుడు రాయల సీమకు చెందిన కేఈ కృష్ణమూర్తికి అవకాశం ఇస్తే.. సామాజిక సమీకరణలతో పాటు ప్రాంతీయ సమతుల్యం కూడా పాటించినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక యనమనలను అయితే రాజ్యసభకు పంపించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక కేంద్ర మంత్రి పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై పార్టీ సీనియర్లలో ఆయన సమాలోచనలు జరుపుతున్నారని అంటున్నారు. 

అన్న‌ల్లో ఏంటీ గంద‌ర‌గోళం?

ఎల్లకాలమూ సింహం మాత్ర‌మే   వేటాడ‌దు. అప్పుడ‌ప్పుడూ సింహాన్ని వేట‌గాడు త‌రిమి త‌రిమి  కొడుతుంటాడు. దీంతో ఆ సింహం వెన‌క‌డుగు వేసి అల‌సి సొల‌సి లొంగిపోయేలా క‌నిపిస్తుంది. వేట నుంచి త‌ప్పుకుందామ‌ని కొంత సేపు. లేదు నేనింకా మృగరాజునే.. న‌న్నెవ‌డ్రా ఆపేద‌న్న ఆలోచ‌న కూడా చేస్తుంటుంది. ఈ రెండు ఆలోచ‌న‌ల దోబూచులాట‌లో.. ప‌డ్డ సింహం అవ‌స్థ ఆ వేట‌గాడికి కూడా కాసేపు ఏం చేయాలో అర్ధం కాదు. స‌రిగ్గా అలాంటి దృశ్య‌మే క‌నిపిస్తోంది అడ‌విలోని.. అన్న‌ల విష‌యంలో. కావాలంటే చూడండీ.. మొన్న నక్సల్ నేత అభ‌య్ పేరిట ఇక ఈ ఉద్య‌మం మేం న‌డ‌ప‌లేం అన్న ఆడియో క్లిప్పింగ్ విడుద‌లైందా? ఇప్పుడు చూస్తే అదే అన్నల నాయకుడు జ‌గ‌న్ పేరిట మ‌రో లేఖ విడుద‌లైంది. అన్న‌లు అలాంటి డెసిష‌న్ ఏమీ తీసుకోలేదు. ఇప్ప‌టికీ మేం అదే ఊపులో.. ఉద్య‌మంలో.. ఉన్నాము. ఇప్ప‌టికిప్పుడు మా ఉద్య‌మానికొచ్చిన లోటేం లేదు. త‌గ్గేదే లే  అన్నది ఆయన లేఖ సారాంశం.   సోనూ అలియాస్ అభ‌య్ లా ఎవ‌రైనా లొంగిపోవాల‌నుకుంటే.. వారు ఎంచ‌క్కా పార్టీ ప‌ర్మిష‌న్ తీసుకుని వెళ్లిపోవ‌చ్చు. ఇక్క‌డెవ‌రూ వార్ని ఆప‌డం లేద‌ని కూడా జ‌గ‌న్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఇటు చూస్తే 2026 మార్చినాటిక‌ల్లా అడ‌వుల్లో అన్న‌ల్ని ఏరి పారేస్తామంటోంది కేంద్రం. దానికి  తోడు ఆప‌రేష‌న్ క‌గార్ ద్వారా స‌గం అడ‌వుల‌ను ఖాళీ చేసేశారు. మొన్నా మ‌ధ్య నంబాల అనే అతి పెద్ద మావోయిస్టు వ‌ట వృక్షాన్ని నేలకూల్చారు. యువ క‌మాండ‌ర్ హిడ్మా ఎలా ఉన్నాడో తెలీడం లేదు. ఇంకో ప‌క్క చూస్తే.. అస‌లు మావోయిస్టు పార్టీలో తెలుగు వారి ప్రాబ‌ల్యం బాగా త‌గ్గిపోయింది. అస‌లు అన్న‌ల్లో చేరుతున్న వారెవ‌రైనా ఉన్నారంటే.. అడ‌వుల్లోని ఆదివాసీలే. వారికంటే ఇటు మృగ వేట అటు పోలీసుల‌ వేట కు పెద్ద  తేడా తెలీదు. ఈ దిశ‌గా నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌ప్పుట్లో అన్న‌లంటే బీటెక్, ఎంటెక్ చ‌దివే వారు,  యూనివ‌ర్శిటీల నుంచి ఎక్కువ‌గా వెళ్లేవారు. నంబాల అదే కోవ‌లోకి వ‌స్తారు. ఇప్పుడు అలాంటి డిగ్రీ హోల్డ‌ర్స్ ఎవ‌రూ లేర‌క్క‌డ‌. ఎంచ‌క్కా ల్యాప్ ట్యాప్ నే త‌మ ఆఫీసు చేసుకుని.. ఐదు రోజుల డ్యూటీ ఆపై ప‌బ్బుల వెంబడి తిరిగి తాగి తంద‌నాలాడుతూ డాల‌ర్ల వేట‌లో పీక లోతు మునిగిపోయి క‌నిపిస్తున్నారు. ప్రెజంట్ అడ‌వుల్లో ఉన్న‌ద‌ల్లా వ‌య‌సుడిగిన బ్యాచీయే. వీరంతా క‌ల‌సి.. ఉద్య‌మం న‌డ‌పాలా వ‌ద్దా? అన్న రెండు కోణాల ఆలోచ‌న చేస్తున్న‌ట్టు బ‌య‌ట ప‌డుతోంది. అందులో భాగంగానే ఈ భిన్న పార్శ్వాలు వెలుగులోకి వ‌స్తున్న‌ట్టు అంచ‌నా  వేస్తున్నారు విశ్లేష‌కులు.

యువ గళంతో కమల దళం భవిష్యత్ వ్యూహం!

వందేళ్ళు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్),భవిష్యత్  వ్యూహంలో భాగంగా బీజేపీ సహా, సంఘ్ పరివార్ సంస్థల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా?  ముఖ్యంగా, బీజేపీకి కొత్త రూపు ఇచ్చేందుకు, కాషాయ కూటమి  కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోందా? దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న యువతను ఆకట్టుకునేందుకు పార్టీకి  యూత్ లుక్, యువ వర్చస్సు ఇచ్చే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగ్తున్నాయా అంటే ఇటు పరివార్ వర్గాల నుంచి అటు పార్టీ వర్గాల నుంచి కూడా అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి..  2024 ఎన్నికలకు ముందు నుంచి కూడా బీజేపీ  ఒక పథకం ప్రకారం పార్టీలో యువ నాయకత్వానికి సముచిత ప్రాధాన్యత  ఇస్తూ వస్తోంది. ఆర్ఎస్ఎస్ , విద్యార్ధి పరిషత్’ వంటి సంఘ్ పరివార్  సంస్థల నుంచి ఎంపిక చేసిన యువ నాయకులను  పార్టీలోకి ఆహ్వానించి బాధ్యతలు అప్పగించింది.  నిజానికి..  పరివార్ సంస్థల నుంచి పార్టీలోకి రావడం కొత్త విషయం కాదు. ముందు నుంచి కూడా ఉన్నదే. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో..  బీజేపీ పాలిత  రాష్ట్రాల మంత్రి వర్గాల్ల, సంఘ్ పరివార్ సంస్థలలో పనిచేసిన అనుభవం  సైద్ధాంతిక అవగాహన ఉన్నవారే మెజారిటీగా ఉన్నారు.  అయితే.. ఇప్పుడు 2029 తర్వాత కూడా అధికారం నిలుకునేందుకు, అంతకంటే ముఖ్యంగా ప్రస్తుత సైద్ధాంతిక ప్రస్థానాన్ని మరింతగా ముందుకు తీసుకు పోయేందుకు, భవిష్యత్ నాయకత్వ నిర్మాణం పై ప్రత్యేక శ్రద్ద అవసరమని బీజేపీ, పరివార్ నాయకత్వం  గుర్తించింది.  అందుకే 2024 ఎన్నికలకు ముందు నుంచి యువ నాయకత్వ నిర్మాణం పై  దృష్టిని కేంద్రీకరించింది. ఇప్పడు యువ నాయకత్వ నిర్మాణంలో వేగం పెంచిందని  పార్టీ వర్గాల  సమాచారం.    అదలా ఉంచితే.. సంఘ్ పరివార్ సంస్థల నుంచి యువ నాయకత్వాన్ని నిర్మించుకోవడంతో పాటుగా.. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలలో సత్తా నిరూపించుకున్న సమర్ధ యువ నేతలను ఆకర్షించే దిశగా కమల దళం కదులుతోంది. నిజానికి..  ఇప్పటికే రాహుల్ గాంధీ పుణ్యాన, కాంగ్రెస్  పార్టీని వదిలిన  జ్యోతిరాదిత్య సింధియా వంటి అనేక మంది యువ నాయకులు  బీజేపీలో చేరారు. ముఖ్యంగా, కుటుంబ రాజకీయ వారసత్వం ఉన్న కాంగ్రెస్ యువ నాయకులు  బీజేపీ గూటికి చేరిన వారిలో అధికంగా ఉన్నారు.  ఉదారణకు  సోనియా గాంధీ రాజకీయ సలహాదారుగా, మన్మోహన సింగ్ ప్రభుత్వ హయాంలో అంతకు ముందు, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక భూమిక పోషించిన అహ్మద్ పటేల్ కుమారుడు  ఫైసల్ పటేల్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే..  గాంధీ నెహ్రూ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రునిగా నిలిచిన రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏకే అంటోనీ కుమారుడు అనీల్ అంటోనీ  సైతం కమలం గూటికి చేరారు.అదే విధంగా సోనియా గాంధీకి అత్యంత సన్నిహితునిగా.. ముందస్తు అప్పాయింట్ మెంట్ లేకుండా నేరుగా ఆమెను కలిసే ఏకైక నాయకుడిగా గుర్తింపు పొందిన  మాజీ ఏపీసీసీ చీఫ్  ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారడు, నిజామాబాద్ ఎంపీ, ధర్మపురి అరవింద్  బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రెండు మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించిన నాయకుల కుమారులు అనేక మంది కమల దళంలో చేరారు.  కమల దళంలో చేరడం మాత్రమే కాదు.. మెల్ల మెల్లగా బీజేపీ ఐడియాలజీతో మమేక మవుతున్నారు.  నిజమే..  రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారిపోవడం కాంగ్రెస్ యువ నాయకులు బీజేపీలో చేరడానికి ఒక   కారణం అయితే  కావచ్చు కానీ.. బీజేపీ జాతీయ భావజాల వ్యాప్తి లక్ష్యంగా రచించిన  భవిష్యత్ వ్యూహంలో భాగంగా పార్టీలతో సంబంధం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా యువ నాయకులను అకర్షించే ప్రయత్నాలు చేసింది. అందుకే..  యువ నాయకులను ఆకర్షిచడం ద్వారా  భావజాల వ్యాప్తికి విశేషంగా కృషిచేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నిజానికి..  జాతీయ స్థాయి మొదలు గ్రామ స్థాయి వరకు యువతను ఆకట్టుకునేందుకు, తద్వారా యువతలో జాతీయ భావజాలాన్ని నింపేందుకు  బీజేపీ  ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. ఫలితంగా ఈరోజు  బీజేపీ భావజాలం ముందుకంటే వేగంగా విస్తరిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి  పైకి కనిపించే పేర్లు కొన్నే అయినా అనేక రాష్ట్రాలలో చాప కింద నీరులా వేర్వేరు పార్టీల యువ నాయకులు కమల దళం లో చేరుతున్నారని సోదాహరణంగా చెబుతున్నారు.  మరో వంక భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని  బీజేపీతో పాటుగా ఎన్డీఎని బలోపేతం చేసేందుకు, ఎన్డీఏ పరిధిని విస్తరించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.  మిత్ర పక్షాలతో సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు  ముఖ్యంగా మిత్ర పక్షాల యువ నాయకత్వాన్ని ఆకర్షించేందుకు, యువ నేతలతో సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.  ఏపీలో తెలుగుదేశం, బిహార్ లో  జేడీయు, ఎల్జీపీతో పాటుగా.. వేర్వేరు పార్టీల యువ నాయకులను, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే..  కేంద్ర మంత్రులుగా ఉన్న యువ నాయకులు  కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, జ్యోతిరాదిత్య సింధియా సహా పార్టీతో సంబంధం లేకుండా యువ మంత్రులకు  ప్రధాని మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. అంతే కాదు..త్వరలో చేపట్టే మంత్రివర్గ పునర్వ్య స్థీకరణలో యువతకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేక పోలేదని, తద్వారా ప్రస్తుతం 58 ఏళ్లుగా ఉన్న  కేంద్ర మంత్రివర్గ సగటు వయసును మరింతగా తగ్గించే  ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా..  బీజేపీలో అంతర్గతంగా సాగుతున్న పరిణామాలను దగ్గరగా గమనిస్తున్న విశ్లేషకులు దేశ జనాభాలో ఇంచుమించుగా 60 శాతానికి పైగా ఉన్న యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయని అంటున్నారు.

బీసీ కార్డ్.. తీన్మార్ మల్లన్న సరే.. కవిత ఎంట్రీ ఎప్పుడు?

తెలంగాణ రాజకీయాలలో బీసీల రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీలూ బీసీల అభ్యున్నతి, సంక్షేమం తమ అజెండాగా చెప్పుకుంటున్నాయి. కాంగ్రెస్ బీసీల విషయంలో చాంపియన్ గా నిలిచేందుకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆయుధంగా వాడుకుం టుంటే... ఈ పార్టీ నుంచే ఎమ్మెల్సీ అయ్యి.. ఇప్పుడు కాంగ్రెస్ బీసీ విధానాలు లోపభూయిష్టమని విమర్శలు గుప్పిస్తూ.. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నఏకంగా ఓ కొత్త పార్టీ ప్రారంభిం చేశారు.  తెలంగాణ రాజ్యధికార పార్టీ (టీఆర్పీ) అని తన పార్టీకి పేరు పెట్టి, బీసీలకు రాజ్యాధికారం అంటూ నినదిస్తున్నారు. అయితే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ గా తెలంగాణ రాజకీయాలలో కి ఎంట్రీ ఇచ్చిన తీన్మార్మల్లన్న బీసీ నినాదంతో రాష్ట్రంలో గతంలో లేని కుల రాజకీయాలను వేదికపైకి తీసుకువచ్చారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.  సరే  తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కూడా బీసీ నినాదంతోనే రాజకీయాలు చేస్తున్నారు. సామాజిక తెలంగాణ సాధన అంటూ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసి సస్పెండై మరీ సొంత రాజకీయ బాట ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. తన కార్యక్రమాలలో ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతున్న కవిత.. సొంత పార్టీతో ఎప్పుడు ముందుకు వస్తారన్న చర్చ తీన్మార్ మల్లన్న పార్టీ ఏర్పాటు తరువాత మరింత గట్టిగా వినిపి4స్తోంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. కాంగ్రెస్ బీసీ కార్డును ఎదుర్కొనేందుకు, బీఆర్ఎస్ కు కవితను బీఆర్ఎస్ ట్రంప్ కార్డుగా ప్రయోగించిందా? కవిత తిరుగుబాటు వెనుక కేసీఆర్ వ్యూహం ఉందా అన్న అనుమానాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కవిత బీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు గుప్పించి సస్పెండైనా, హరీష్ కు మద్దతుగా, కవితకు వ్యతిరేకంగా కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా రాలేదు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కానీ కవితపై పన్నెత్తు మాట అనలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ తీన్మార్ మల్లన్న పొలిటికల్ ఎంట్రీపై పడింది. ఆయన బీఆర్ఎస్ ను పల్లెత్తు మాట అనడం లేదు.. కానీ కల్వకుంట్ల కవితపై నిప్పులు చెరుగుతున్నారు. కవితపై తీన్మార్ మల్లన్న విమర్శలను బీఆర్ఎస్ ఖండించడం లేదు.  దీంతో ఈ ఇరువురి వెనుకా ఉన్న శక్తులేంటి? వ్యక్తులెవరు అన్న సందేహం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. సరే శక్తుల సంగతి పక్కన పెడితే.. తీన్మార్ మల్లన్న టీఆర్సీ పార్టీని ప్రకటించడంతో.. ఇప్పుడు కవితపార్టీ ప్రకటన ఎప్పుడన్న ప్రశ్నకు ఆమె బదులు చెప్పుకోవాల్సి ఉంది. చూడాలి మరి జూబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ తరువాత తెలంగాణ రాజకీయాలలో ఎవరి రంగు ఏమిటి?  ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది అన్నది తేలే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.  

చరిత్ర సృష్టించిన అసామాన్యడు.. మోదీ @75

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  బుధవారం  (సెప్టెంబర్17) 75 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ సహా దేశ విదేశీ ప్రముఖులు అనేక మంది మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు.  మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.   మోడీ పుట్టింది పేద కుటుంబంలో  ప్రధానమంత్రి మోదీ సెప్టెంబర్ 17, 1950న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్ పట్టణంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ. పుట్టింది, పెరిగింది అతి సామాన్య కుటుంబం. ఇంకా సపష్టంగా చెప్పాలంటే..  అత్యంత నిరు పేద కుటుంబంలో మోదీ జన్మించారు. బాల్యం నుంచే పేదరికాన్ని రుచి చూశారు. అయినా.. జీవితంలో ఎక్కడా అధైర్య పడలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అదే ఆత్మవిశ్వాసంతో, ఒక సారి కాదు, రెండు సార్లు కాదు,  వరసగా మూడు సార్లు దేశ ప్రధాని, బాధ్యతలు చేపట్టారు.  దేశ ప్రధాన సేవకుడిగా, దేశానికి సేవలు అందిస్తున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రభావమంతమైన నాయకుడిగా  గుర్తింపు, గౌరవం సొంతం చేసుకున్నారు.  స్వాతంత్య్రానంతరం  జన్మించన తొలి ప్రధానిగానే,  కాకుండా.. వరసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెసేతర తొలి ప్రధానిగానూ చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకున్నారు.  నిజానికి స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడుసార్లు ప్రధాని పదవిని చెపట్టిన  ప్రదానిగానూ మోదీ చరిత్ర  పుటల్లో  ఇందిరాగాంధీ కంటే ఒకమెట్టు పైన నిలిచారు.  వరసగా మూడు సార్లు ప్రధాని పదవిని అలంకరించిన మోదీ..  దేశంలో తిరుగులేని నేతగా నిలవడమే కాదు, ప్రపంచ దేశాల్లో భారత దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారు. చేస్తున్నారు.  ప్రపంచ నాయకుల్లో అత్యంత ప్రభావమంతమైన నాయకుడిగా కితాబు నందుకున్నారు. ఈ రోజుకు కూడా, 75 శాతం ప్రజమోదంతో మోదీ ప్రపంచ దేశాలు అత్యంత ప్రభావంతమైన నాయకులలో ప్రప్రధముడిగా నిలిచారు. అతేకాదు, ఇంతవరకు భారత ప్రధాని ఎవరూ అందుకోనన్ని, ప్రపంచ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇంతవరకు 18 దేశాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో భారత ప్రధానమంత్రి, ప్రథమ సేవకుడు మోదీని  సత్కరించాయి. భారత దేశం పూర్వ వైభవాన్ని,  విశ్వగురు స్థానాన్ని తిరిగి పొందడమే లక్ష్యంగా.. 75 ఏళ్ల యువకుడిగా వడివడిగా అడుగులు వేస్తున్న మోదీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసు కారణంగా ఆయన శరీరంపై ముడతలు కనిపించినా.. ఆయన గుండె నిబ్బరం ఎక్కడా చెక్కు చెదరలేదు. ఎక్కడా ముడతలు, మడతలూ లేవు. ఒకటే గమ్యం.. ఒకటే లక్ష్యం అన్నట్లుగా  ముందుకు సాగుతున్నారు. అందుకే, 75 సంవత్సరాల వయోపరిమితి రేఖ  ఆయన ప్రస్థానానికి అడ్డు కాలేదు. సర్వామోదంతో ఆయన  ప్రధాన మంత్రిగా, ప్రధాన సేవకుడిగా  కొనసాగుతున్నారు.   బాల్యం నుంచే  1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో సామాన్య కుటుంబంలో జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ..  ఎనిమిదేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు.ఇక అక్కడి నుంచి ఆయన జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా, చిరుప్రాయంలో పడిన సైద్ధాంతిక  పునాదుల ఆధారంగానే  మోదీ జీవన ప్రస్థానం సాగింది.  హై స్కూల్ చదువు పూర్తయిన  తర్వాత    ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపిన మోదీ..  ఇల్లు వదిలి కొంత కాలం  రామకృష్ణ మఠంలో, ఆ తర్వాత హిమలయా పర్వతాలలో   గురువులు, సాధు సంతుల మార్గదర్శకత్వంలో ఆద్యాత్మిక  జీవిత ప్రస్థానం సాగించారు. అయితే, ఆ తర్వాత కాలంలో  గురువులు, సాధుసంతుల ఆదేశం మేరకు, తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేయాలనే నిర్ణయానికి కొచ్చారు. ఆర్ఎస్ఎస్  లో క్రియాశీల కార్యకర్తగా ప్రవేశించి..  కొద్ది కాలానికే  ప్రచారక్ (పూర్తి సమయ కార్యకర్త) గా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 15 సంవత్సరాలు వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల్లో, సంఘ్ ప్రచారక్ గా  పనిచేశారు. ఈ 15 సంవత్సరాల కాలంలో మోదీ దేశ సామాజిక స్థితి గతులను,సమూలంగా అధ్యయనం చేశారు.   ఆ తర్వాత సంఘ్ ఆదేశాల మేరకు  బీజేపీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. 2014 వరకు మూడుసార్లు ఆ పదవిలో కొనసాగారు. ఆయన పాలనలో గుజరాత్ ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి సాధించింది. పారిశ్రామిక అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యంతో  గుజరాత్ మోడల్ జాతీయ స్థాయిలో ప్రచారం పొందింది. ముఖ్యమంత్రిగా ఆయన పాలన దేశానికి ఒక ఉదాహరణగా మారింది. మోదీ సారథ్యంలో బీజేపీ గుజరాత్  లో ఆరోజు నుంచి ఈరోజు వరకు ఏనాడూ ఓటమిని చూడలేదు. 2014 మే 26న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో బీజేపీ ఆ తరువాత 2019, 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించింది.ఇది ఆయన జనాదరణ, నాయకత్వ పటిమను స్పష్టం చేస్తుంది.  ఇంచుమించుగా పుష్కర కాలంగా సాగుతున్న మోదీ పాలనలో దేశం  కొవిడ్ మహమ్మారి సహా  ఎన్నో సవాళ్ళను ఎదుర్కున్నది. మైలు రాళ్ళను దాటింది. ఆర్థిక రంగంలో  అనూహ్య ప్రగతిని సాధించింది. 2014 లో తొమ్మిది, పది స్థానాల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ.. ఈరోజు ప్రపంచంలో నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అలాగే..  సైనిక సామర్ధ్యంలో మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అందుకే,మోదీ తిరుగులేని నేతగా నిలిచారు. నవ భారత నిర్మాతగా గుర్తింపు, గౌరవాన్ని పొందుతున్నారు.

జగన్ పై నడ్డా విమర్శల మతలబేంటి?

 జ‌గ‌న్  హయాంలో  పాల‌న‌పై జేపీ న‌డ్డా కీల‌క‌మైన కామెంట్లు చేశారు. జ‌గ‌న్ అస‌మ‌ర్ధ, అస్త‌వ్య‌స్త పాల‌న  ద్వారా ఏపీ అభివృద్ధి మొత్తం ప‌డ‌కేసింద‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక‌.. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో  సంక్షేమం అభివృద్ధి గాడిలో పడుతున్నాయని నడ్డా అన్నారు. నడ్డా మాటలు అక్షర సత్యాలే అయినా.. ఇంత కాలం లేనిది ఇప్పుడీ విమర్శలేంటన్న సంశయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ మీద ఈగ వాల‌నివ్వ‌ని బీజేపీ స‌డెన్ గా ఇలా రివర్స్ అవ్వడమేంటి?  జగన్ పై వ్యతిరేక కామెంట్లు చేయడమేంటి? అన్న ఆశ్చర్యం, విస్మయం పరిశీలకుల్లోనే కాకుండా.. సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతోంది. దానికి తోడు ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అడిగీ అడ‌క్క ముందే.. బీజేపీకి మద్దతు ప్రకటించచేసి ఎన్డీయే అభ్యర్థికి ఓటేసిన  జ‌గ‌న్ పార్టీ.. ఇటు చెల్లి నుంచి ఢిల్లీ గ‌ల్లీ గ‌ల్లీ వ‌ర‌కూ విమ‌ర్శ‌ల పాల‌య్యింది. ఆర్ఎస్ఎస్ భావ‌జాలానికి చెందిన ఒక వ్య‌క్తికి వైయ‌స్ఆర్ కొడుకు ఇలా ఓటు వేయ‌డ‌మేంట‌ని.. ఆయన సోదరి ష‌ర్మిళ అయితే క‌డిగిపాడేశారు. ఇక వైఎస్ అతేవాసి, జగన్ కు బిహైండ్ ది కర్టెన్ మెంటార్ అయిన ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్  అయితే.. ఇక్క‌డ ఎన్డీయే కి వ్య‌తిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన జ‌గ‌న్ తాము కాంగ్రెస్ వ్య‌తిరేకులం అంటూ ఎన్డీయే అభ్య‌ర్ధికి ఓటు వేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. కొంత‌లో కొంత‌.. బీఆర్ఎస్సే న‌యం.. కాస్త సంయ‌మ‌నం పాటించి ఓటింగ్ లోనే పాల్గొన‌లేదు. జ‌గ‌న్ మ‌రీ ఇంత దిగ‌జారుడుత‌న‌మా? అన్న టాకొచ్చింది. అలా తమ అభ్య‌ర్ధికి ఓటు వేసిన పార్టీ అని కూడా చూడ‌కుండా.. జేపీ న‌డ్డా ఇలా అనేశారేంటన్న చర్చ సాగుతోంది.  ఈ మ‌ధ్య ఒక కొత్త ఈక్వేష‌న్ వెలుగులోకి వ‌చ్చింది. బీజేపీ అంటే దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అయితే అయి ఉండొచ్చేమోగానీ, ఏపీలో మాత్రం ఇందుకు భిన్నం. బీ అంటే- బాబు జే అంటే- జ‌గ‌న్, పీ అంటే- ప‌వ‌న్ అంటూ కామెంట్ చేశారు మాజీ ఐఏఎస్ విజ‌య కుమార్. దానికి తోడు బీజేపీకి వైసీపీకి చీక‌టి ఒప్పందాలు ఏవో ఉండ‌బ‌ట్టే.. ఆయ‌నింకా జైలుకు వెళ్ల‌కుండా బ‌య‌ట  ఉండ‌గ‌లు గుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. మ‌ద్యం కుంభ‌కోణంలో కూడా జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌లేవీ క‌నీసం ముట్టుకోలేదీ కేసును. దీన్నిబ‌ట్టీ చూస్తే బీజేపీ జ‌గ‌న్ మ‌ధ్య అవినీతి సంబంధం స్టిల్ అలైవ్ అంటున్నారు విశ్లేషకులు.  ఇలాంటి కామెంట్లకు కాస్త ఫుల్ స్టాప్ పెట్ట‌డానికో ఏమో.. జేపీ  న‌డ్డా జ‌గ‌న్ పై ఇలాంటి కామెంట్లు చేశార‌న్న మాట వినిపిస్తోంది. జ‌గ‌న్ ఎప్పుడైతే జైలుకు వెళ్తారో అప్పుడు త‌ప్ప బీజేపీని న‌మ్మ‌డానికి వీల్లేద‌న్న కామెంట్ కూడా వినిపిస్తోంది. ఇప్ప‌టికే.. తెలంగాణ ఎన్నిక‌ల్లో క‌వితను అరెస్టు చేయ‌కుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక‌టే అన్న అర్ధం వ‌స్తుంద‌ని ఏకంగా.. ఆ పార్టీ ఎంపీ కొండా అన‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం.  తాజాగా ఏపీలో కూడా స‌రిగ్గా ఇలాంటి మాటే వినిపిస్తోంది. జ‌గ‌న్ బ‌య‌ట  ఉన్నంత వ‌ర‌కూ వీరెన్ని మాట‌లు మాట్లాడినా అది జ‌నం దృష్టి మ‌ర‌ల్చే ఎత్తుగ‌డ త‌ప్ప మ‌రొక‌టి కాదంటున్నారు చాలా మంది.