ఎంతపని చేశావ్ జగన్?!

  వైసీపీ నాయకుడు జగన్ ఏ పని చేసినా పప్పులో కాలు వేసే విధంగా చేస్తూ వుంటారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు ఒకపక్క అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతూ వుండగానే తననే ముఖ్యమంత్రి చేయాలని సంతకాల సేకరణ జరిపినప్పటి నుంచి జగన్ తప్పటడుగులను జనం చూస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆయన తహతహ కాంగ్రెస్ అధిష్ఠానానికి నచ్చలేదు. దాంతో పక్కన పెట్టేసింది. చివరికి జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో జగన్ కాస్తంత ఓర్పుతో వ్యవహరించినట్టయితే తర్వాత అయినా ముఖ్యమంత్రి అయ్యేవారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ వుంటాయి. అలా ఓర్పు లేకుండా వ్యవహరించడం వల్లే ఆయన ఇప్పటికీ ఓదార్పు యాత్రలు చేసుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తోంది. జగన్ ప్రస్తుతం వున్న స్థితికి ఆయన వేసే తప్పటడుగులే ప్రధాన కారణం అని రాజకీయ పరిశీలకులు అంటూ వుంటారు. అలాంటి తప్పటడుగు ఆయన మరోసారి వేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి తెలంగాణలో వున్న ఒకే ఒక ఎమ్మెల్యే మద్దతు టీఆర్ఎస్‌కి ఇవ్వడం జగన్ చేసిన ఒక చారిత్రాత్మక తప్పిదంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు కారణం కావడంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పాతాళానికి పడిపోవడానికి కారణం అవడం, నిరంతరం సీమాంధ్రులను తిట్టిపోసే టీఆర్ఎస్ అంటే సీమాంధ్రులకు ఎంతమాత్రం సదభిప్రాయం లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ పార్టీ టీఆర్ఎస్‌కి మద్దతు ఇవ్వడాన్ని సీమాంధ్రుల జీర్ణించుకునే అవకాశం ఎంతమాత్రం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ ఇప్పుడు వేసిన ఈ అడుగు భవిష్యత్తులో ఆయనకు రాజకీయంగా ఎంతో నష్టం చేసే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. అయినా, తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని, తెలంగాణలో తన పార్టీని ఒక్క ఎమ్మెల్యేకే పరిమితం చేసిన టీఆర్ఎస్‌కి జగన్  మద్దతు ఇవ్వడం విచిత్రంగా వుందని, తెలుగుదేశం మీద కోపంతో టీఆర్ఎ‌స్‌కి జగన్ మద్దతు ఇవ్వడం పెద్ద కామెడీగా వుందని అంటున్నారు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయితే టీఆర్ఎస్‌కి మద్దతు ఇచ్చారో, ఆ ఎమ్మెల్యే భవిష్యత్తులో టీఆర్ఎస్‌లోకి జంప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

సెంటిమెంటల్ టచ్ సూపరెహె

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలహీనపర్చాలని వైసీపీ నేత రొటీన్‌గా చేసే ప్రయత్నాలు తప్ప అక్కడ పెద్దగా చెప్పుకోవాల్సిన రాజకీయ పరిణామాలేవీ కనిపించడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం రాజకీయం మహా రంజుగా సాగుతోంది. తెలంగాణ తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్‌లోకి వలస వెళ్ళడం దగ్గర్నుంచి, నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు కావడం వంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద అందరికీ ఇంట్రస్టు పెరగడానికి కారణం అయ్యాయి. రేవంత్ రెడ్డి విషయం అలా వుంచితే, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్‌లోకి వలస వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎప్పుడూ కొన్ని రికార్డు చేసిన మాటలు చెబుతూ వుంటారు. టీఆర్ఎస్ అద్భుత పాలన చూసి ఆకర్షితుడిని అయ్యానని, అలాగే తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని చెబుతారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ మీద కొన్ని విమర్శలు కూడా చేస్తారు. అయితే లేటెస్ట్‌గా పార్టీ మారిన కూకట్‌పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు మాత్రం పార్టీ మారినప్పుడు వాడే పడికట్టు పదాలను ఉపయోగించడంతోపాటు కొంత సెంటిమెంటల్‌ టచ్ కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో తెలుగుదేశం పార్టీకి జలక్ ఇచ్చిన ఆయన కళ్ళలో నీటి పొరలు కదులుతూ వుండగా తాను తప్పనిసరి పరిస్థితుల్లోనే, తన నియోజకవర్గంలో వున్న పేదల సంక్షేమం కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తనను పార్టీ మారకుండా చేయాలని పార్టీ నాయకత్వం ఎంత ప్రయత్నించినా మారకుండా వుండలేకపోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఇలా అన్యాయం చేసినందుకు తనను చంద్రబాబు నాయుడు, లోకేష్ క్షమించాలని తెగ ఫీలైపోతూ చెప్పారు. మాధవరం కృష్ణారావు చివర్లో ఇచ్చిన ఈ సెంటిమెంటల్ టచ్ మనసులను హత్తుకునేలా వుంది. టీఆర్ఎస్‌లో టైం బాగాలేకపోతే మళ్ళీ టీడీపీలోకి రావడానికి ముందుగానే కర్చీఫ్ వేసినట్టుగా వుంది.

బహిరంగ ఓటింగ్ విధానంతో తెరాసకు కొత్త చిక్కులు

  జూన్ 1వ తేదీన యం.యల్యేల కోటాలో జరుగబోయే తెలంగాణా శాసనమండలి ఎన్నికలలో తెరాస 5వ అభ్యర్ధిని నిలబెట్టడంతో ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఊహించినట్లే ప్రతిపక్ష పార్టీల యం.యల్యేల పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. ఈరోజు తెదేపా కూకట్ పల్లి యం.యల్యే. మాధవరం కృష్ణా రావు తెరాసలోకి ఫిరాయించారు. కానీ తెరాస ఇతర పార్టీల యం.యల్యేలను ఫిరాయింపులకి ప్రోత్సహించి వారిని పార్టీలో చేర్చుకొన్నప్పటికీ, ఈసారి మండలి ఎన్నికలు రహస్య బ్యాలట్ ద్వారా కాకుండా బహిరంగ ఓటింగ్ పద్దతిలోనే నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించడంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలబెట్టిన 5వ అభ్యర్ధిని గెలిపించుకోవడం తెరాసకు పెద్ద సవాలుగా మారింది. ఈ పద్దతిలో ఏ పార్టీకి చెందిన యం.యల్యే. ఎవరికి ఓటేసారనే విషయం అక్కడే తెలిసిపోతుంది కనుక ఒకవేళ ఎవరయినా యం.యల్యే. క్రాస్ ఓటింగ్ చేసినట్లయితే పార్టీ విప్ ను దిక్కరించినందుకు అతను/ఆమెపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. మరి ఈ సమస్యను తెరాస ఏవిధంగా అదిగమిస్తుందో తెలుసుకోవాలంటే జూన్ 1వరకు ఆగాల్సిందే!

కాంగ్రెస్ పార్టీని ఇక ఆ దేవుడే రక్షించాలిట!

  శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య నిన్న తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యతును, తమ భవిష్యత్తును దేవుడే చూసుకొంటాడని” చెప్పడం రాష్ట్రంలో ఆ పార్టీ దైన్య స్థితికి అద్దం పడుతోంది. ఇటీవల కొంత కాలంగా రాష్ట్రంలో మిగిలిన కాంగ్రెస్ నేతలు తమ పార్టీ ఉనికిని, తద్వారా తమ రాజకీయ ఉనికిని కాపాడుకొనేందుకు ప్రత్యేక హోదా అంశం పట్టుకొని పోరాడుతున్నప్పటికీ దానికి ప్రజల నుండి స్పందన కరువయింది. రాష్ట్ర విభజన చేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నేటికీ దానికి ప్రజలు దూరంగానే ఉంటున్నారు.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క రఘువీరారెడ్డి తప్ప మరెవరూ కనబడటం లేదు. ఉన్న ఒక్క చిరంజీవి తన 150సినిమాతో తీరిక లేకుండా ఉన్నారు. గుంటూరు జిల్లాలో పార్టీకి కొండంత అండగా ఉండే కన్నా లక్ష్మి నారాయణ ఇదివరకే గుట్టు చప్పుడు కాకుండా బీజేపీలోకి జంప్ అయిపోగా, ఇప్పుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి వైకాపాలో వెళ్ళిపోతున్నారు. ఆయనతో బాటే విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు నేతలు కూడా వైకాపాలో చేరిపోవడం ఖాయం. ఒకపక్క రోజురోజుకి పార్టీ ఖాళీ అయిపోతుంటే అదే సమయంలో మరోపక్క తెదేపా, బీజేపీ, వైకాపాలు క్రమంగా బలపడుతున్నాయి. మిగిలిన ఈ నాలుగేళ్లలో ఇంకా ఎంతమంది కాంగ్రెస్ పార్టీని వీడుతారో ఎవరికీ తెలియదు. కనుక వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం మాట దేవుడెరుగు, ఆసలు అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగిలే ఉంటుందా లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బహుశః ఇక కాంగ్రెస్ నేతలెవరూ కూడా రాష్ట్రంలో పార్టీని కాపాడలేరని భావించిన మాజీ దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య తమ పార్టీని కాపాడే బాధ్యత, భారం ఆ దేవుడికే అప్పగించేసినట్లున్నారు. కానీ రాజకీయ పార్టీలను కాపాడే అదనపు బాధ్యతలు కూడా దేవుడికి అప్పగిస్తే చూసుకొంటాడో లేదో?

మోడీని రాహుల్ అందుకే టార్గెట్ చేసుకొంటున్నారా?

  మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీతో గంటసేపు సమావేశమవడంపై రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఆయన రాజకీయ అపరిపక్వతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పుతోందని డా. మన్మోహన్ సింగ్ హెచ్చరించగానే కంగారుపడిన ప్రధాని మోడీ తక్షణమే ఆయనను తన నివాసానికి ఆహ్వానించి ఆయన చేత పాఠాలు చెప్పించుకొన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు.   డా.మన్మోహన్ సింగ్ మంచి ఆర్ధికనిపుణుడనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానంలేదు. కానీ అంతటి వాడిని కూడా తల్లీకొడుకులు కలిసి ఒక డమ్మీగా చేసి దేశాన్ని ఏవిధంగా భ్రష్టు పట్టించారో, అందుకు వారికి ప్రజలు ఏవిధంగా గుణపాఠం చెప్పారో రాహుల్ గాంధీ కూడా తెలుసు. అంత గొప్ప మేధావి సేవలు ఉపయోగించుకొని దేశాన్ని ప్రగతి పధంలో నడిపించకపోగా, అటువంటి మచ్చలేని నిజాయితీపరుడుకి కూడా బొగ్గు మసి అంటించింది ఎవరు? చివరికి కొన్ని విదేశీ పత్రికలలో సైతం ఆయన ‘అత్యంత అసమర్ధ ప్రధానమంత్రి’ అని హెడ్డింగ్ పెట్టి కవర్ పేజీ కధనాలు ప్రచురించాయంటే దానికి ఎవరిని నిందించాలి?   ప్రధాని నరేంద్ర మోడీ డా.మన్మోహన్ సింగ్ అంత గొప్ప చదువులు చదువుకొని ఉండకపోవచ్చును. కానీ కేవలం ఏడాది కాలంలోనే దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టగలిగారని స్వదేశంలోనే కాదు విదేశీ ఆర్ధిక నిపుణులు సైతం మెచ్చుకొంటున్న సంగతి కూడా రాహుల్ గాంధీకి తెలియకపోతే ఆయన లోకజ్ఞానం ఎంతగొప్పగా ఉందో అర్ధమవుతుంది.   కేవలం నెహ్రూ కుటుంబానికి చెందినందునే కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షపదవిలో, కుదిరితే ప్రధాని కుర్చీలో కూడా కూర్చోవాలనుకొన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ రక్తంలోనే ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక తమ పార్టీలో కనిపిస్తున్న క్రమాశిక్షణా రాహిత్యాన్నే ప్రజాస్వామ్యమని చెప్పుకోవడం కూడా ఆయనకే చెల్లు. తమ పార్టీలో ఏవిషయంపైనైనా అందరూ కలిసి కూర్చొని నిర్భీతిగా చర్చించగలరని రాహుల్ గాంధీ చెప్పుకోవడమూ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సాక్షాత్ డా.మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసిన ప్రజా ప్రతినిధుల చట్టం నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు...దానిని చెత్త బుట్టలో పడేయాల్సిందేనని రాహుల్ గాంధీ ఆయనను ఏవిధంగా అవమానించారో, ఆ తరువాత ఆ చట్టాన్నినిజంగానే చట్టబుట్టలో పడేయడం గురించి కూడా ప్రజలందరికీ తెలుసు. తమ ప్రభుత్వమే చేసిన చట్టాన్ని ఏ అధికారంతో ఆయన నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదని తీసిపడేసారు? అని ప్రశ్నకు బహుశః ఆయన వద్ద సమాధానం ఉండకపోవచ్చును.   ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆ తల్లి కొడుకుల పుణ్యమాని రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ, దానితో బాటు అనేకమంది నేతలు ఏవిధంగా బలయిపోయారో అందరికీ తెలుసు. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ మీద కర్రపెత్తనం చేస్తూనే మళ్ళీ మోడీ కర్ర పెత్తనం చేస్తున్నారంటూ విమర్శించడం చాలా హాస్యాస్పదం.   కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు నిత్యం మోడీని టార్గెట్ చేసుకొని ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? అని ఆలోచిస్తే దానికి చాలా ఆశ్చర్యకరమయిన కారణాలు కనబడతాయి. కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలు ఆయన నాయకత్వ శక్తిని, లక్షణాలను అనుమానిస్తూ, పార్టీ పగ్గాలు వేరెవరికయినా అప్పగించాలని కోరుతున్న సంగతి అందరికీ తెలిసిందే. బహుశః మోడీని విమర్శిస్తుండటం వలన తాను మోడీకి ఏమాత్రం తీసిపోనని, తనలోని ఆయనకున్న నాయకత్వ లక్షణాలన్నీ ఉన్నాయని కనుక కాంగ్రెస్ పార్టీ అద్యక్షపదవిని చెప్పట్టేందుకు తనే అన్ని విధాల అర్హుడనని నిరూపించుకొనే ప్రయత్నంలోనే ఆయన మోడీని విమర్శిస్తున్నారేమో? అనే అనుమానాలు కలుగుతున్నాయి మోడీని విమర్శించడం ద్వారా ఆయన తన స్థాయి పెరుగుతుందనుకొంటే అది భ్రమ మాత్రమే. పైగా తన స్థాయిని పెంచుకోవడానికి రాహుల్ గాంధీ అటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలు కూడా నవ్వుకొంటారు.

వెయ్యిమంది బలిదానాలు చేసుకొన్నారు: కెటిఆర్

  తెలంగాణా పాఠ్య పుస్తకాలలో రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల గురించి, తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురించి ప్రస్తావన లేనందుకు టీ-కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు చాలా ధీటుగా సమాధానం చెప్పారు. తెలంగాణా ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆలశ్యం చేయడం వలననే అనేక వందలమంది బలిదానాలు చేసుకొన్నారని, ముఖ్యంగా 2009లో తెలంగాణా ఇస్తామని యూపీయే ప్రభుత్వం ప్రకటించి మాట తప్పడంతో సుమారు 1000 మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నారని, అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి పుస్తకాలలో ఏమని వ్రాయమంటారు? అని ఎదురు ప్రశ్నించారు.   కాంగ్రెస్ పార్టీకి భలే సమాధానం ఇచ్చిన కెటిఆర్ బలిదానాల గురించి నోరు జారి కాంగ్రెస్ పార్టీకి దొరికిపోయారనే చెప్పాలి. తెలంగాణా ఉద్యమం చాలా ఉదృతంగా సాగుతున్న సమయంలో కనీసం 1200 మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నారని తెరాస నేతలే చెప్పేవారు. కానీ ఇప్పుడు మంత్రి కెటిఆర్ వారి సంఖ్య1000కి పైగా ఉంటుందని చెపుతున్నారు. కానీ తెలంగాణా ప్రభుత్వం కేవలం 452మందిని మాత్రమే అమరవీరులుగా మాత్రమే గుర్తించింది? స్వయంగా కె. తారక రామారావే 1000 మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నారని ద్రువీకరిస్తున్నప్పుడు, తెలంగాణా ప్రభుత్వం మిగిలిన అమరవీరుల కుటుంబాలను ఎందుకు పట్టించుకోలేదు?ప్రభుత్వం పట్టించుకోకపోతే, అందులో మంత్రిగా ఉన్న ఆయనైనా మిగిలినవారికి కూడా ఆర్ధిక సహాయం చేయాలని ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? అనే ప్రశ్నలు రేపు కాంగ్రెస్ నుండి ఆయన ఎదుర్కోవలసి రావచ్చును.

వారి నాలుకలకి రెండు వైపులా పదునే!

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందు శాసనసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తలుచుకొన్నందునే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని, అందుకు తనతో సహా తెలంగాణా ప్రజలందరూ ఆమెకు సదా రుణపడి ఉంటారని అన్నారు. కానీ తెలంగాణా ఇచ్చింది సోనియా గాంధీయే అయినప్పటికీ, అందుకు కారణం రాష్ట్ర సాధన కోసం తమ పార్టీ చేసిన పోరాటాలేనని మరో ముక్క అప్పుడే జోడించారు. ఆయన చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజం కనుక శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ తెలంగాణా పాఠ్య పుస్తకాలలో ఎక్కడా ఆమె ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ మండిపడుతున్నారు. రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల గురించి ఎక్కడా పేర్కొనకుండా కేవలం తెరాస, దాని అధ్యక్షుడు కేసీఆర్ చేసిన పోరాటాల వలననే తెలంగాణా ఏర్పడినట్లు చరిత్రను వక్రీకరించి పిల్లలకు పాఠాలు నేర్పుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.   అందుకు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు భలే విచిత్రమయిన సమాధానం చెప్పారు. “గత ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలలో అనేకమంది బలిదానాలు చేసుకొన్నారు. ముఖ్యంగా 2009లో తెలంగాణ ఇస్తామని యూపీయే ప్రభుత్వం ప్రకటన చేసి, మళ్లీ మాట మార్చిన తరువాత వెయ్యి మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నారు. ఇంత జరుగుతున్నా సోనియా గాంధీ తెలంగాణా ఇచ్చేందుకు వెనుకాడి చివరికి తెరాస ఒత్తిడి కారణంగానే తెలంగాణా ఏర్పాటు చేసారు. ఒకవేళ తెలంగాణా చరిత్రలో కాంగ్రెస్ పార్టీ గురించి దాని అధ్యక్షురాలు సోనియా గాంధీ గురించి వ్రాయవలసి వస్తే ఈ చేదు నిజాలన్నిటినీ కూడా పేర్కొనక తప్పదు. అందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమేనా? తెలంగాణా ఏర్పాటు చేసిన క్రెడిట్ కోరుకొంటున్నకాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలన్నిటికీ మూలకారణం తనేనని అంగీకరించేందుకు సిద్దమేనా?” అని ప్రశ్నించి కల్వకుంట్ల వారి నాలికలకి రెండు వైపులా పదునేనని కెటిఆర్ మరొక్కమారు నిరూపించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ఏదో డొంక తిరుగుడు సమాధానం చెప్పగలదేమో కానీ దేనినీ ఔనని ఒప్పుకోలేదని అందరికీ తెలుసు.

పార్టీలో గుంట నక్కలతో జాగ్రత్త సుమీ

  ఈరోజు మహానాడులో మోత్కుపల్లి నరసింహులు మాటలు అందరినీ ముసిముసి నవ్వులు నవ్వుకొనేలా చేసాయి. ఆయన ప్రసంగిస్తూ, ఇంతకు మునుపు స్వర్గీయ ఎన్టీఆర్ తనను మంత్రిని చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకంగా గవర్నర్ ని చేస్తానని అంటున్నారని అన్నప్పుడు చంద్రబాబుతో సహా అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు. “మీరు గవర్నర్ అయితే ఇక్కడ కేసీఆర్ తో యుద్ధం చేసేవారు ఉండరని” చంద్రబాబు చమత్కరిస్తే తను గవర్నర్ అయినా కాకపోయినా తన ధ్యేయం మాత్రం వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ను ఓడించడమేనని మోత్కుపల్లి గడుసుగా జవాబిచ్చారు. “నేను ఇంకా గవర్నర్ కాకపోయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను గవర్నర్ గారని సంభోదిస్తుంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని” మోత్కుపల్లి అన్నప్పుడు అందరూ మరోమారు మనసారా నవ్వుకొన్నారు. కానీ మోత్కుపల్లి చెప్పిన ఒక మాట పార్టీలో ఎవరినో ఉద్దేశించి అన్నట్లుంది. కొంతమంది గుంటనక్కలు మన పార్టీలో ఉంటూ ప్రత్యర్ధి పార్టీలతో చేతులు కలుపుతూ తన వంటి వారిని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అటువంటి వారిపట్ల పార్టీ అధిష్టానం చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అయితే ఆ గుంటనక్క ఎవరనే సంగతి ఆయన బయటపెట్టకపోయినా అదెవరో పార్టీలో చాలా మందికి బాగా తెలుసట.

ఇంతకీ మన్మోహన్ మోడీ నివాసానికి ఎందుకు వెళ్లినట్లో?

  రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఒకరి గురించి మరొకరు, ఒకరి ప్రభుత్వం గురించి మరొకరు మీడియాలో విమర్శలు గుప్పించుకొంటుంటే రాజకీయాలలో అది చాలా సహజమని అందరూ భావించారు తప్ప ఏదో విడ్డూరంగా భావించలేదు. కానీ అంతగా ఒకరినొకరు విమర్శించుకొన్న తరువాత మోన్న సాయంత్రం డా.మన్మోహన్ సింగ్ ని మోడీ తన నివాసానికి ఆహ్వానించడం, ఆయన అభ్యర్ధనను మన్నించి డా.మన్మోహన్ సింగ్ నిన్న సాయంత్రం మోడీ నివాసానికి వెళ్ళడం, మోడీ ఆయనకు ఎదురేగి సాదరంగా ఆహ్వానించిలోనికి తోడ్కోనిపోయి, టీ ఫలహారాలు చేస్తూ వారిరువురు ముచ్చట్లు ఆడటం మాత్రం నిజంగా విడ్డూరమేనని అందరూ అనుకొంటున్నారు.   సుమారు అర్ధగంట సేపు సాగిన వారిరువురి సమావేశంలో దేశ ఆర్ధిక పరిస్థితిపైనే ప్రధానంగా చర్చ సాగిందని సమాచారం. కానీ అంతకంటే చాలా ముఖ్యమయిన విషయం గురించే వారిరువు చర్చించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ అధికారం చేప్పట్టి ఏడాది పూర్తయింది గనుక ఆయనను అభినందించేందుకే డా. మన్మోహన్ సింగ్ మోడీ నివాసానికి వెళ్లి ఉంటారని అందరికీ అమోదయోగ్యమయిన కారణాన్ని కూడా చెప్పుకొంటున్నారు. నరేంద్ర మోడీ తమ ఫోటోని ట్వీటర్ లో పోస్ట్ చేసి “మళ్ళీ చాలా కాలం తరువాత మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ని కలుసుకొన్నందుకు చాలా సంతోషంగా ఉంది,” అంటూ ఒక మెసేజ్ కూడా పెట్టారు. కానీ మళ్ళీ రేపటినుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు యధావిధిగా తమ పోరాటాలు కొనసాగిస్తాయేమో? అయితే ఇంతకీ బద్ద శతృవులుగా వ్యవహరిస్తున్న వారిరువు ఎందుకు కలిసారు అనే ప్రశ్నకు సరయిన జవాబు మాత్రం దొరకనే లేదు.

ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుదే

  హైదరాబాద్ నగరాన్ని ఐటి కేంద్రంగా మలిచి రాష్ట్రానికి పెద్ద ఆర్ధికవనరుని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడేనని తెరాసకు కూడా తెలుసు. కానీ రాజకీయ కారణాల చేత ఆ విషయాన్ని తెరాస నేతలు బహిరంగంగా అంగీకరించలేకపోతున్నారనే సంగతి కూడా అందరికీ తెలుసు. హైదరాబాద్ ని తను అభివృద్ధి చేసారు గనుక చంద్రబాబు నాయుడు అదే విషయం మహానాడులో చెప్పుకొంటే దానినీ తెరాస నేతలు తప్పుపట్టడం హాస్యాస్పదం.   అయితే అప్రస్తుతమయిన ఆ అంశాన్ని పట్టుకొని సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడం కూడా అనవసరమే. ఎందుకంటే తెదేపా ప్రభుత్వం సుమారు పదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించింది. కనుక తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అది చెప్పుకోవడం చాలా సహజం. కానీ నిన్న మొన్న అధికారం చేప్పట్టిన తెరాస పార్టీ తమ ప్రభుత్వం తను ఏమి చేసిందో చెప్పుకోవాలంటే మిగిలిన ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిచూపాల్సి ఉంటుంది. అప్పుడే గత కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల పాలనతో, వాటి హయాంలో జరిగిన అభివృద్ధితో బేరీజు వేసుకొనే హక్కు పొందుతుంది. కానీ అధికారం చేప్పట్టి ఏడాది కూడా పూర్తి కాకుండానే గత ఆరు దశాబ్దాలలో కాంగ్రెస్, తెదేపాలు చేయలేని పనిని తాము చేసేస్తున్నామని గొప్పలు చెప్పుకొన్నట్లయితే రేపు అదే పాయింటు పట్టుకొని ప్రతిపక్షాలు మళ్ళీ తెరాస ప్రభుత్వాన్ని ఎదురు ప్రశ్నించవచ్చును.

హుస్సేన్ సాగర్ ఇక ఖాళీ కాదు

హైదరాబాద్‌ నడిబొడ్డున వున్న కాలుష్య కాసారం హుస్సేన్ సాగర్ ఇక ఖాళీ కానట్టే.  అసాధ్యమైన అంశాన్ని నెత్తికి ఎత్తుకున్న  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హుస్సేన్ సాగర్ ద్వారా కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. హుస్సేన్ సాగర్ని ఖాళీ చేసి, ఆ చెరువును మంచినీటితో నింపాలనే ఆలోచనే ఆచరణలో అసాధ్యమైన ఆలోచన. ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోకుండా హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయించడం ప్రారంభించారు. రాజకీయ పార్టీలు ఎంత ప్రయత్నించినా కేసీఆర్ పట్టు సడలించకుండా హుస్సేన్ సాగర్‌‌లోని నీటిని బయటకి వదిలే పనిని కొనసాగించారు. అయితే కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారన్నట్టుగా హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘‘సేవ్ అవర్ అర్బన్ లేక్స్’’ అనే స్వచ్ఛంద సంస్థ పోరాటం చేసింది. హుస్సేన్ సాగర్ నీటిని వదలడం వల్ల ఆ నీరు ప్రవహించే నాలాల పరిసరాల్లో నివసించే ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం వుందని ఈ సంస్థ వాదించింది. చెన్నైలో వున్న పర్యావరణ కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చి, హుస్సేన్ సాగర్ నీటిని విడుదల చేయకుండా ఆపించింది.  ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా హుస్సేన్ సాగర్ నీటిని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. నాలాల మరమ్మతుల కోసం మాత్రమే నీటిని వదలాలి తప్ప ఖాళీ చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ఈ వేసవిలో హుస్సేన్ సాగర్ని ఖాళీ చేసి తీరతామని స్పష్టంగా చెప్పిన సీఎం కేసీఆర్ మాట ఫలించకుండా పోయే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. హుస్సేన్ సాగర్లోకి కాలుష్య జలాలను తీసుకుని వస్తున్న నాలాలను దారి మళ్ళించే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వచ్చిన సుప్రీం తీర్పు తెలంగాణ ప్రభుత్వం మీద నీళ్ళు జల్లింది. ప్రస్తుతం ఎండాకాలం ముగింపు దశలో వుంది. పదీ పదిహేను రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది. వర్షాలు కురవడం మొదలైందంటే హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. అప్పుడు కోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా వుండే ఆదేశాలు వచ్చినా ఉపయోగం వుండదు.  మొత్తమ్మీద పరిస్థితుల్ని, పరిణామాల్ని చూస్తే ఇక హుస్సేన్ సాగర్ ఖాళీ అవనట్టే భావించాలి.

దేశ ప్రజలకు మన్మోహన్ షాక్

  పదేళ్ళు ప్రధానమంత్రిగా వున్న కాలంలో మహానుభావుడు ఒక్క ముక్కకూడా మాట్లాడకుండా నెట్టుకొచ్చారు. సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మలా గుర్తింపు పొంది, పదవి ఊడిపోయిన తర్వాత చరిత్ర నన్ను అర్థం చేసుకోవాలంటూ బాధపడిపోయారు. అతగాడు మరెవరో కాదు... మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఆయన బుధవారం నాడు దేశ ప్రజలకు షాక్ ఇచ్చారు... ఆ షాక్ ఏంటంటే, భారత ప్రధానిగా ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీని ఆయన ఇంటికి వెళ్ళి మరీ మన్మోహన్ అభినందించారు.  అసలు ఈ పరిణామం ఎవరూ ఊహించనిది. ఈ పరిణామాన్ని ప్రధాని మోడీ కూడా ఊహించి వుండరు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ ఏంటీ... తమ పార్టీని గద్దె మీద నుంచి దించిన నరేంద్రమోడీని ఇంటికెళ్ళి మరీ అభినందించడమేంటి? నరేంద్రమోడీ పాలన ఒక ఏడాదిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం ఏడాదికాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేసుకుంటూ వుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మోడీ ప్రభుత్వం మీద బురద జల్లే పనిలో బిజీగా వున్నారు. రాహుల్ గాంధీ అయితే, ఏం మాట్లాడుతున్నారో తనకే అర్థం కాని విధంగా మోడీ సర్కారును విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడైన మన్మోహన్ సింగ్ మోడీ ఇంటికి వచ్చి అభినందనలు తెలపడం ఏ తరహా రాజకీయమో అర్థం కావడం లేదు. మన్మోహన్ మనస్పూర్తిగా అభినందించడానికి వచ్చారా.. దీని వెనుక ఏదైనా అంతరార్థం వుందా... సోనియాగాంధీ రాజకీయ పాచిక ఏమైనా వుందా  అనే సందేహాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఉస్మానియాలో ఆత్మహత్యలు జరక్కూడదు

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు ఒక్కటే మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. అది... ఉస్మానియా యూనివర్సిటీలో ఇకపై ఆత్మహత్యలు జరగకూడదు. సున్నిత హృదయులైన విద్యార్థులు మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడకూడదు. వాళ్ళందరూ చల్లగా వుండాలి. హాయిగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. కానీ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మనోభావాలను గాయపరిచేలా వున్నాయి. ఇలా మనోభావాలు గాయపడటం వల్లే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేశారు. మా తెలంగాణ మాగ్గావాలె... మా భూములు మాగ్గావాలె.. మా నీళ్ళు మాగ్గావాలె... మా నిధులు, నీళ్ళు మాగ్గావాలె అంటూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉస్మానియా విద్యార్థులు అనేకమంది తెలంగాణ రాదేమోనన్న బెంగతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఆత్మబలిదానాలతో తెలంగాణ అమరవీరులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారికి జోహార్లు. ఉస్మానియా విద్యార్థులు సరస్వతీ పుత్రులు. వాళ్ళు నిరంతరం చదువుకుంటూనే వుంటారు. అద్భుతమైన చరిత్ర వున్న విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నామన్న ఆత్మ సంతృప్తితో వుంటారు. ఉస్మానియాలో ఎక్కడ చూసినా మెరికల్లాంటి విద్యార్థులు కనిపిస్తూ వుంటారు. ఒక ఐన్‌స్టీన్, ఒక థామస్ అల్వా ఎడిసన్‌లకు తీసిపోని మేధావులు ఉస్మానియా యూనివర్సిటీలో వున్నారు. వారు కేవలం మేధావులు మాత్రమే కాదు... వారిలో అంతర్లీనంగా కవులు, కళాకారులు, పోరు బిడ్డలు, ఉద్యమవీరులు కూడా వున్నారు. ఇలాంటి గొప్పగొప్ప విద్యార్థులతో ఉస్మానియా విశ్వవిద్యాలయం కళకళలాడుతూ వుంటుంది. ఇలాంటి విద్యార్థులు తన దగ్గర చదువుకుంటూ ఉన్నందుకు విశ్వవిద్యాలయం గర్వంతో పొంగిపోతూ వుంటుంది. అలాంటి విద్యార్థులు తమ మనోభావాలు దెబ్బతింటే మాత్రం రాజీలేని ఉద్యమం చేపడతారు. తమ ప్రాణాలు పోయినా లెక్క చేయరు. తాము నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ఉస్మానియా విద్యార్థుల ఆ తత్వమే ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. తెలంగాణ రాష్ట్రం రాగానే తమకు ఉద్యోగాలు వచ్చేస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఉస్మానియా విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఆ నిరాశతోనే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లాంటి ప్రభుత్వ నిర్ణయాలు ఉస్మానియా విద్యార్థుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. దానికితోడు తాజాగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో పేదలకు ఇళ్ళు కట్టించాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా వారిని ఎంతో బాధపెడుతోంది. తమ యూనివర్సిటీ స్థలాలను లాక్కుంటే ఒప్పుకోమంటూ ఉద్యమించిన విద్యార్థుల వీపుల మీద లాఠీలు నాట్యం చేశాయి. ఉస్మానియా స్థలంలో కట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందిన హోటల్ మీద ఏదో ఆవేదనతో రాళ్ళతో దాడి చేసిన విద్యార్థులను రిమాండ్‌కి పంపించడం కూడా ఉస్మానియా విద్యార్థి లోకానికి మనోభావాలు దెబ్బతినేలా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా క్రుంగిపోయిన ఉస్మానియా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడతారేమోనన్న ఆందోళన అందరిలోనూ కలుగుతోంది. అలా జరిగితే తెలంగాణ తల్లి కన్నీరు మున్నీరు అయిపోతుంది. అందుకే అలా జరక్కుండా చూడాలి. అలా జరక్కుండా చూసే శక్తి తెలంగాణ ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ సాధనకు నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ చేతిలోనే వుంది.

స్నేహం చీటీ మళ్ళీ చించేశారా?

టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తారో... ఎప్పుడు ఎవరితో స్నేహం చీటీ చించేస్తారో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్నటి వరకు ఎంఐఎం నాయకులతో ఫ్రెండ్‌షిప్ చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు మోడీవైపు మళ్ళింది. మొన్నటి వరకూ మోడీని ఎంతమాత్రం పట్టించుకోని టీఆర్ఎస్ కొద్ది రోజుల క్రితం నుంచి మోడీని మంచి చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ పక్కనే నిల్చుని ఫొటో దిగి మురిసిపోతే, కేసీఆర్ కుమార్తె మోడీతో సెల్ఫీ దిగి ముచ్చటపడిపోయింది. మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని ఎంతమాత్రం పట్టించుకోని కేసీఆర్ మోడీని మంచి చేసుకునే ప్రయత్నాల్లోనే భాగంగానే స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలను చేపట్టారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలా మరిన్ని అంశాల్లో మోడీని మంచి చేసుకోవాలన్న ప్రయత్నంలో వున్న టీఆర్ఎస్‌ సడన్‌గా ఆ ప్రయత్నాలకు బ్రేక్ వేసినట్టు కనిపిస్తోంది. మొన్నామధ్య టీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఎంపీ కవిత కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా మోడీ ఆహ్వానిస్తే ఆలోచిస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేంద్రమంత్రి అవ్వాలని ఉవ్విళ్ళూరుతున్న ఆమె పిలిస్తే ఆలోచిస్తానని అనడం జనానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే బీజేపీ వర్గాలకు మాత్రం ఆగ్రహాన్ని తెప్పించింది. కవితమ్మ అలా అన్నారో లేదో ఇలా బీజేపీ స్పందించింది. టీఆర్ఎస్ తమకు ప్రత్యర్థి పార్టీయేనని, ఆ పార్టీకి కేంద్ర ప్రభుత్వంలో స్థానం కల్పించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దాంతో మొన్నటి వరకూ బీజేపీని పల్లెత్తు మాటకూడా అనకుండా ఓర్పు వహించిన టీఆర్ఎస్ నాయకులు మళ్ళీ గళం విప్పారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇటీవల మాట్లాడుతూ, ‘మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మధ్యలో ఆగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన స్వచ్ఛ హైదరాబాద్ మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది’’ అన్నారు. నిన్నటి వరకూ మోడీ స్ఫూర్తితోనే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఇలా ప్లేటు తిప్పేశారంటే మోడీతో స్నేహానికి టీఆర్ఎస్ నాయకులు మంగళం పాడినట్టుగానే భావించాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్ వాసనలు వదల్లేనట్టుంది...

చిమడవే చిమడవే ఓ చింతకాయ నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు...  ఉడకవే ఉడకవే ఓ ఉల్లిపాయ... నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు... అనిచిన్నప్పుడెప్పుడో చదువుకున్న పద్యం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని చూస్తే ఇప్పుడు గుర్తొస్తోంది. ఉడికిన ఉల్లిపాయకు కంపు పోనట్టు భారత రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నప్పటికీ ప్రణబ్ ముఖర్జీ గారి నుంచి కాంగ్రెస్ పార్టీ వాసనలు వదిలినట్టు లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భోఫోర్స్ కుంభకోణాన్ని అసలు కుంభకోణమే కాదన్నట్టుగా ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు. దేశాధినేత హోదాలో వున్న ప్రణబ్ ముఖర్జీ ఇలా మాట్లాడ్డం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నో పదవులు, చివరికి రాష్ట్రపతి పదవిని కూడా పొందిన ప్రణబ్ ముఖర్జీ తన కృతజ్ఞతను బోఫోర్స్ అనేది అసలు కుంభకోణమే అన్నట్టు మాట్లాడుతున్నారు. మీడియానే దానిని కుంభకోణం అంది తప్ప ఏ కోర్టూ దానిని కుంభకోణం అంటూ వ్యాఖ్యానించలేదని చెప్పుకొచ్చారు. ప్రణబ్ ముఖర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసినట్టుగానే భావించాలి. అయితే రాష్ట్రపతి పదవిలో వున్న ఆయన పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి వుంటుంది. ఆచితూచి మాట్లాడాల్సి వుంటుంది. ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు చేసిన ఆ వ్యాఖ్యలు ఆ విలువల పరిధిని దాటాయనే భావించాల్సి వుంటుంది. రాష్ట్రపతి పదవికి వచ్చినప్పటికీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం తగ్గకపోతే పదవీ విరమణ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కీర్తిస్తూ కాలక్షేపం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిన్నారెడ్డిని చితగ్గొట్టారా? సో వాట్?

  తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మీద కొంతమంది టీఆర్ఎస్ నాయకులు దాడి చేసి వాతలు పడేలా కొట్టారు. రాజకీయాలు గౌరవంగా మాట్లాడుకునే స్థాయి నుంచి, పచ్చిబూతులు తిట్టుకునే స్థాయికి ఎదిగి, ఇప్పుడు కొట్టుకునే స్థాయికి ఒదిగిన పరిస్థితుల్లో ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేని మరో పార్టీకి చెందిన కార్యకర్తలు చితగ్గొట్టడం అనేది ప్రజలకు పెద్దగా షాక్ కలిగించే అంశంకాదు. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు పైకి కనిపిస్తోంది. లోపల మాత్రం నానా యాగీ చేయడానికి తమకో అవకాశం దొరికిందని సంతోషిస్తోంది. ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాల్లాంటి కార్యక్రమాలతో ప్రస్తుతం బిజీగా వుంది. చిన్నారెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టడం నేరం, ఘోరం, అన్యాయం, అక్రమం అని కాంగ్రెస్ పార్టీ ఆక్రోశిస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులో, టీఆర్ఎస్ నాయకులో ఎవరైతేనేమి ఎంతోమందిని కొట్టారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణను కొట్టారు. టీఆర్ఎస్ పార్టీకి చెందని నాయకులు ఎంతోమందిని ఎన్నోరకాలుగా ఉద్యమం ముసుగులో చావబాదారు. అప్పుడెప్పుడూ కాంగ్రెస్ నాయకులు ఆ ఘటనలను ఖండించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ఎంపీనే ముఖ్యమంత్రి హెలికాప్టర్ని కూల్చేస్తానంటే ఆ పార్టీ లైట్‌గా తీసుకుంది. ఆ సమయంలో అంత కూల్‌గా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిన్నారెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు చితగ్గొట్టడం చూసి చాలా ఫీలైపోతోంది. కాంగ్రెస్ పార్టీ ఫీలవుతోందిగానీ, తెలంగాణలో ఇలాంటి ఘటనలను చూసీచూసీ విసిగిపోయి వున్న జనం మాత్రం సో వాట్? అంటున్నారు.. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే మంచిది.

కాంగ్రెస్‌కి మెంటల్ ముదిరింది

కాంగ్రెస్ పార్టీకి మెంటల్ బాగా ముదిరినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మెంటల్ ఎక్కిందన్న ఉద్దేశంతోనే ప్రజలు ఏడాది క్రితం ఎన్నికల సమయంలో తరిమికొట్టారు. అయినప్పటికీ ఈ పార్టీ తన మెంటల్ చేష్టలు మానుకోవడం లేదు. ఇప్పుడు అటు దేశంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే, ఈ పార్టీకి మెంటల్ బాగా ముదిరిపోయిందన్న విషయం అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు సమాధి కట్టేశారు. ఆ సమాధిలోంచే ‘వదల బొమ్మాళీ’ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రంకెలు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిరంతర కృషి చేస్తు్న్న తెలుగుదేశం ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలుతోంది. సరే, ఏదో ఉనికికోసం కాంగ్రెస్ నాయకులు ఇలా నోరు పారేసుకుంటార్లే అని క్షమించేయాలని జనం అనుకుంటున్నప్పటికీ ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే కాంగ్రెస్‌ని ఎప్పటికీ క్షమించకూడదని ఏపీ ప్రజలు డిసైడ్ అవుతున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో తలతిక్క పనిచేసింది. అసలు ఈ పని చేయడానికి మనసెలా ఒప్పిందో... జనం వెటకారంగా నవ్వుకుంటారని ఆ పార్టీ నాయకులకు కొద్దిగా కూడా అనిపించలేదా అనే సందేహం కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మొత్తం ఆరు వందల హామీలు ఇచ్చిందట. వాటిలో ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చలేదట. అలా హామీలు నెరవేర్చనందుకు తెలుగుదేశం పార్టీని ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత వేటువేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్‌కి వినతిపత్రం ఇచ్చారు. ఇంత ముదిరిపోయిన మెంటల్ తరహా పని కాంగ్రెస్ పార్టీ మినహా మరో పార్టీ చేయగలదా?

వలల బిజినెస్ మళ్ళీ పుంజుకోవచ్చు

తెలంగాణ రాష్ట్రంలో వలల బిజినెస్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో ఈ బిజినెస్ బాగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ బిజినెస్ దాదాపుగా జీరో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వలల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లే  ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా విద్యార్థులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి సంస్థల మీద రాళ్ళదాడులు చేశారు. దాంతో పలు సంస్థలు, భవనాలకు పెద్దపెద్ద వలలు కట్టుకున్నారు. ఆంధ్రావారి పరిశ్రమలకు చుట్టూ వలలు కట్టుకున్నారు. కొన్ని పరిశ్రమలు, సంస్థలవారయితే వలలు కట్టుకోవడంతోపాటు ‘‘మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు’’ అని బోర్డులు కూడా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో అయితే ఏ ఆంధ్రావారికి చెందిన ఏ బిల్డింగ్ మీద అయినా పైనుంచి కింద వరకు పెద్ద వల కట్టేసి వుండేది. ఏ బిల్డింగ్ ఆంధ్రావారిది, ఏ బిల్డింగ్ ఆంధ్రావారిది కాదు అని చెప్పడానికి ఈ వలలే పెద్ద కొండగుర్తుగా వుండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రావారు వలలు తొలగించి రిలాక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ వలల బెడద తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉస్మానియా భూములను స్వాధీనం చేసుకుని, అక్కడ పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలగా వుండటం, దీన్ని వ్యతిరేకించిన ఉస్మానియా విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ జరిపించడం రాష్ట్రంలోని పరిస్థితిని మార్చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ స్థలాల్లో కట్టారంటూ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందిన ఒక హోటల్ మీద ఉస్మానియా విద్యార్థులు రాళ్ళదాడి చేశారు. అలాగే ఒక పెట్రోల్ బంక్ మీద కూడా తమ ప్రతాపం చూపించారు. భవిష్యత్తులో ఉస్మానియా విద్యార్థులు మరెంత రెచ్చిపోతారో, ఉస్మానియాలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా ఏయే వర్గాలకు విస్తరిస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్‌కి చెందిన నాయకులు, టీఆర్ఎస్ సానుభూతిపరులు తమ భవంతులకు రక్షణగా వలలు కట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో వలల బిజినెస్ ఊపందుకునే అవకాశం వుంది.

ఏపీ ఉద్యోగుల మనసు కరగదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకూడదని ఏపీ ఎన్జీవోలు భారీ స్థాయిలో ఉద్యమం చేశారు. అంతవరకు ఓకే. రాష్ట్రం విడిపోకూడదని ఉద్యోగులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అని అప్పట్లో వారిమీద సదభిప్రాయం కలిగింది. ప్రభుత్వ ఉద్యోగుల మీద అప్పటి వరకూ వ్యతిరేకతను వ్యక్తం చేసేవారు కూడా ఉద్యోగులు సమైక్య ఉద్యమం చేసిన తీరు చూసి తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఏపీ ఎన్జీవోల నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో చెట్లకింద అయినా పనిచేయడానికి సిద్ధం అని ప్రకటించేసరికి ఏపీ ప్రజలందరూ ఉద్యోగుల ఔదార్యం చూసి మురిసిపోయారు. అయితే  కాలం గడుస్తున్నకొద్దీ ఉద్యోగుల తీరు చూసి ఏపీ ప్రజలకు కళ్ళు తిరుగుతున్నాయి. ఏపీ కొత్త రాజధానిలో చెట్లకింద కూర్చుని అయినా పనిచేస్తామని గతంలో ప్రకటించిన ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు కొత్త రాజధాని పేరు చెబితేనే రాము పొమ్మంటున్నారు. తమకు అక్కడ సౌకర్యాలు, సదుపాయాలు వుండవని అందువల్ల ఇప్పుడప్పుడే కొత్త రాజధానికి రానే రామంటూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఉద్యోగుల ఈ తీరు చూస్తే, అప్పట్లో వీరు చేసిన సమైక్య ఉద్యమం మీద కూడా అనుమానాలు కలుగుతున్నాయి. వీరు చేసిన ఉద్యమం తమ ఉద్యోగాలకు స్థానభ్రంశం కలుగుతుందన్న ఆందోళనతో చేసిందే తప్ప, తెలుగుజాతి విడిపోతుందన్న బాధతో కాదని అర్థమవుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా అన్నీ వున్న తెలంగాణ రాష్ట్రం తమ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే, ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే ఫిట్‌మెంట్ ఇచ్చింది. ఇంత చేసిన ముఖ్యమంత్రి బతిమాలుతున్నా ఉద్యోగులు హైదరాబాద్‌ దాటి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం శ్రమిస్తోందే తప్ప.. ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు రాకపోవడం బాధాకరం. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల మనసులు కరగలేదు. ముందుముందు కరుగుతాయన్న ఆశ కూడా కలగడం లేదు.