మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తోంది!
posted on Mar 17, 2023 @ 11:04AM
చచ్చింది అనుకున్న. కొవిడ్ 19 (కరోనా) మహమ్మారి మళ్ళీ బతికొచ్చింది. రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకున్న, కరోనా భూతం తిరిగొచ్చింది. అది సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ఆర్థిక వ్యవస్థపై మరోమారు దండయాత్రకు మహమ్మారి సిద్దమవుతోంది.
అవును ఎక్కడో కొవిడ్ పుట్టిల్లు చైనాలో కాదు, మన దేశంలోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ జాబితాలో తెలంగాణ పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఉన్నాయి. వీటితో పాటు తమిళనాడు, కేరళ, గుజరాత్కూ గురువారం(మార్చి 16)కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా కేసులు అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతున్నాయో దృష్టిసారించాలని పేర్కొంది.
కొన్ని రాష్ట్రాల్లో స్థానిక వ్యాప్తి ద్వారా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటిచోట ముప్పు అంచనాతో ముందు జాగ్రత్త, కట్టడి కీలకం.నియంత్రణ చర్యల్లో ప్రస్తుత పరిస్థితిని కొనసాగించడం అత్యవసరం. ఎక్కడైనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంటే నిరోధానికి ముందస్తు చర్యలు తీసుకోండి. గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించండి అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో సూచించారు.
కాగా, తెలంగాణలో చాలారోజుల తర్వాత బుధవారం పాజిటివ్ రేటు రెండంకెల గీత దాటింది. ఒకే రోజున 54 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత ఏడాది నవంబరు 12న దేశవ్యాప్తంగా 734 కేసులు వచ్చాయి. నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ గురువారం కేసుల సంఖ్య 700 దాటింది. బుధవారం( మార్చి 15) ఉదయం నుంచి గురువారం (మార్చి 16) ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో దేశంలో 754 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్లో తర్వాత కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కరోనా మహమ్మారితో కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,633 యాక్టివ్ కరోనా కేసులున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్లో లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 4,46,92,710కు చేరింది. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి చేరింది. దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వాక్సిన్ డోస్లు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
ఇలా ఒక్క సారిగా కేసులు పెరగటానికి దేశంలో టెస్టులు గణనీయంగా తగ్గడం కూడా కారణం కావచ్చని, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలు/యూటీలను అప్రమత్తం చేస్తూ రాసిన లేఖలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుదలపై హెచ్చరిక చేశారు. కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్ ట్రాక్, ట్రీట్ వ్యాక్సినేషన్ అనుసరించాలని కేంద్రం కోరింది.
అయితే, కరోనా గురించి ఇప్పడు అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలతో కరోనాను జయించ వచ్చని అంటున్నారు. అయితే, అదే సమయంలో, నిర్లక్ష్యం చేస్తే, మరో మారు మహమ్మారి విజృంభించే ప్రమాదం లేకపోలేదని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.