English | Telugu
నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. 'విరూపాక్ష' వసూళ్ల ప్రభంజనం!
Updated : Apr 25, 2023
సినిమాలో కంటెంట్ ఉంటే జోనర్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబట్టొచ్చని నిరూపిస్తూ దూసుకుపోతున్న చిత్రం 'విరూపాక్ష'. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ హారర్ థ్రిల్లర్ కి కార్తీక్ దండు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్ అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.
రూ.23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'విరూపాక్ష'.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.6.35 కోట్ల షేర్, రెండో రోజు రూ.7.30 కోట్ల షేర్, మూడో రోజు రూ.7.17 కోట్ల షేర్ తో.. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి దాదాపు 21 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ కి చేరువైంది. ఇక నాలుగో రోజు సోమవారం అయినప్పటికీ రూ.3.53 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీంతో నాలుగు రోజుల్లోనే రూ.24 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది.
నాలుగు రోజుల్లో నైజాంలో రూ.8.52 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.79 కోట్లషేర్, ఆంధ్రాలో రూ.8.06 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన విరూపాక్ష.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.19.37 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.1.62 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.3.36 కోట్ల షేర్ కలిపి.. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.24.35 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముంది.