English | Telugu
పదేళ్ళ తర్వాత రిలీజ్కి రెడీ అవుతున్న ‘ధ్రువనక్షత్రం’
Updated : Oct 25, 2023
సినిమా రంగంలో ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్తో ఆగిపోతాయి. కొన్ని సినిమాలు కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోతాయి. మరికొన్ని సినిమాలు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్కి సిద్ధమైనప్పటికీ అవి రిలీజ్కి నోచుకోవు. అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే సినిమా అనౌన్స్ చేసిన పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ సినిమా లైన్లోకి వస్తే ఎలా ఉంటుంది.
ఇప్పుడు విక్రమ్, గౌతమ్ వాసుదేవన్ కాంబినేషన్లో రూపొందిన ‘ధ్రువనక్షత్రం’ విషయంలో అదే జరిగింది. 2013లో హీరో సూర్యతో ఈ సినిమా చేయబోతున్నట్టు గౌతమ్ మీనన్ ప్రకటించాడు. అయితే హీరోకి, డైరెక్టర్కి వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల ఈ సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాడు. 2016లో షూటింగ్ స్టార్ట్ చేసి 2017లో రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ, ఈ సినిమా పూర్తి చేయడానికి అనేక అడ్డంకులు వచ్చాయి. చాలాసార్లు షూటింగ్ వాయిదా పడిరది. అన్ని అవరోధాల్ని దాటుకొని ఈ సినిమా పూర్తయింది. ఆమధ్య ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ను విడుదల చేశారు. నవంబర్ 24న సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఒక స్పై అండర్ కవర్ ఆపరేషన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సినిమా అంతా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్షన్ మూవీస్ని లైక్ చేసే వారికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. విక్రమ్ యాక్షన్ సీక్వెన్స్లు కూడా బాగున్నాయి. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ కూడా ఒక ముఖ్యపాత్ర పోషించాడు. రీతువర్మ, ఐశ్వర్య రాజేష్, రాధికా, సిమ్రాన్, అర్జున్ దాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంబంధించి మరో ముఖ్య విశేషం ఏమిటంటే.. దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చెయ్యాలని నిర్ణయించారు. నవంబర్ 24న చాప్టర్ 1 రిలీజ్ కాబోతోంది.