Read more!

English | Telugu

'ధమాకా' దర్శకుడితో నాగశౌర్య మూవీ!

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'ధమాకా'తో దర్శకుడు త్రినాథరావు నక్కిన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కెరీర్ మొదట్లో లవ్ స్టోరీలు తీసిన ఆయన 'సినిమా చూపిస్త మావ' దగ్గర నుంచి ట్రాక్ మార్చి ఎంటర్టైనర్స్ తీస్తున్నాడు. అప్పటి నుంచి వరుస విజయాలు అందుకుంటూ మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక గతేడాది డిసెంబర్ లో 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ క్రమంలో త్రినాథరావు తన తదుపరి సినిమాని ఏ హీరోతో చేస్తాడనే ఆసక్తి నెలకొంది. అయితే ఆయన తదుపరి సినిమాపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. యంగ్ హీరో నాగశౌర్యతో ఆయన సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాగశౌర్య కుటుంబానికి చెందిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో త్రినాథరావు తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఆయన నాగశౌర్య తల్లిదండ్రుల చేతుల మీదుగా అడ్వాన్స్ కూడా అందుకున్నాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఇప్పటిదాకా రూపొందిన సినిమాలు అన్నింటిలోనూ శౌర్యనే హీరోగా నటించాడు. దీంతో ఈ సినిమాలో కూడా అతనే హీరోగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐరా బ్యానర్ లో ఇప్పటిదాకా 'ఛలో', 'నర్తనశాల', 'అశ్వత్థామ', 'కృష్ణ వృంద విహారి' వంటి సినిమాలు రాగా.. అందులో 'ఛలో' మాత్రమే ఘన విజయాన్ని సాధించింది. మరి ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

త్రినాథరావు శైలికి నాగశౌర్య సరిగ్గా సరిపోతాడు. ఆయన దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తీస్తే 'ఛలో' స్థాయి విజయాన్ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి అసలు ఐరా బ్యానర్ త్రినాథరావుకి అడ్వాన్స్ ఇచ్చింది శౌర్య కోసమా? లేక మరెవరైనా హీరో కోసమా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.