English | Telugu
పొలిటికల్ హీట్ పెంచుతున్న 'స్కంద' డైలాగ్ లు.. బోయపాటి టార్గెట్ ఎవరు?
Updated : Sep 25, 2023
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ 'స్కంద'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. సెప్టెంబర్ 28న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలతో, పవర్ ఫుల్ డైలాగ్స్ తో కొత్త ట్రైలర్ అదిరిపోయింది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో రామ్ విశ్వరూపం చూపించాడు. అయితే ఈ ట్రైలర్ లోని డైలాగ్స్ మాత్రం పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి.
జైలులో ఉన్న శ్రీకాంత్ ని, కోర్టుని చూపిస్తూ.. "పరిస్థితులకు తలవంచి మీరు తప్పు చేశారని ఒప్పుకోవచ్చు. ఆ చట్టం ఒప్పుకోవచ్చు, ఆ ధర్మ ఒప్పుకోవచ్చు, కానీ ఆ దైవం ఒప్పుకోదు సార్" అంటూ స్కంద రిలీజ్ ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ లోని డైలాగులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా ఉన్నాయి అంటున్నారు. ముఖ్యంగా "మేము కోడిని, పొట్టేలునే కాదు.. మాకు ఎదురొస్తే దేన్నయినా పచ్చడి పెడతాం", "మనిషికో పేరు, ఊరికో గౌరవం, ప్రతి పదవికీ ఓ బాధ్యత ఉంటది. అది మరిచిపోయి మీరిద్దరూ తీసిన పరువు, కూల్చేసిన ఆత్మగౌరవం తిరిగి మీరే నిలబెట్టాలి." వంటి డైలాగ్ లు హాట్ టాపిక్ గా మారాయి. ఈ డైలాగ్ లు ఏపీకి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని టార్గెట్ చేస్తూ ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనూ బోయపాటి సినిమాల్లోని కొన్ని డైలాగ్ లు, సన్నివేశాలు ఆ నాయకుడిని టార్గెట్ చేస్తూ ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది.