English | Telugu

‘ఓజీ’కి వచ్చేవాళ్ళు ఎక్స్‌ట్రా టీ షర్ట్‌ తెచ్చుకోండి: ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ ప్రకటన

భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య విడుదలైన ఓజీ చిత్రం అన్ని ఏరియాల్లోనూ బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకొని హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. ఎంతో కాలంగా ఒక పవర్‌ఫుల్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి ఓజీ పూర్తి స్థాయిలో సంతోషాన్ని కలిగిస్తోంది. అంతేకాదు, ఇప్పుడు ఓజీ ప్రదర్శిస్తున్న థియేటర్స్‌ అన్నీ సెలబ్రేషన్స్‌ సెంటర్స్‌గా మారిపోయాయి. సినిమాలో పవన్‌కళ్యాణ్‌ ఎంట్రీ, పెర్‌ఫార్మెన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు.. ఇలా అన్ని సందర్భాల్లోనూ ఫ్యాన్స్‌ విపరీతమైన సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్‌ ఉత్సాహాన్ని గమనించిన ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ యాజమాన్యం.. ఒక వినూత్నమైన ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో ఓజీపై ఇప్పటివరకు ఉన్న బజ్‌ రెట్టింపు అయిందని చెప్పాలి.

‘ఓజీ’ చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులు, అభిమానులు చాలా సందడి చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్‌ తమ ఆనందాన్ని తట్టుకోలేక టీ షర్టులు చింపేసుకుంటున్నారు. ఇవి మా దృష్టికి వచ్చాయి. సినిమా అంటే మీకు ఎంత ప్యాషన్‌ ఉందో మాకు అర్థమైంది. అయితే మీ వల్ల ఇతర ప్రేక్షకులు ఇబ్బందులు పడతారు. అది కూడా మనం గమనించాలి. అందుకే అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వచ్చేటప్పుడు ఎక్స్‌ట్రా టీ షర్టు తెచ్చుకోండి. అవసరమైతే దాన్ని ఉపయోగించండి. మేం ఒక మంచి సినిమా చూసేందుకు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వగలంగానీ, మీ డ్రెస్‌కి మేం బాధ్యత వహించలేం కదా’ అని ఆ ప్రకటనలో పేర్కొంది ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ యాజమాన్యం. ఇప్పుడీ నోట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇదేం మాస్‌ సినిమారా నాయనా’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.