English | Telugu
ఈమాత్రం దానికి థియేటర్స్ లో రిలీజ్ చేయడం ఎందుకు?
Updated : Oct 9, 2023
ఇటీవల థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు పెద్దగా థియేటర్ల వైపు చూడటంలేదు. ఇది సినిమా వసూళ్ళపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది చాలదు అన్నట్టు కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. అంతేనా.. థియేటర్స్ లో విడుదలైన మూడో రోజే ఓటీటీ రిలీజ్ డేట్ ఇస్తున్నారు. తాజాగా 'మామా మశ్చీంద్ర' విషయంలో ఇదే జరిగింది.
సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'మామా మశ్చీంద్ర'. హర్షవర్ధన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దీనికి తోడు విడుదలైన మూడో రోజే ఈ సినిమా అక్టోబర్ 20 నుంచి ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటన వచ్చింది. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వస్తుండటం, అది కూడా మూడో రోజే ప్రకటన రావడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సుధీర్ బాబు గత చిత్రం 'హంట్' విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ ఏడాది జనవరి 26న ఆ సినిమా థియేటర్లలో విడుదల కాగా, రెండు వారాలకే ఫిబ్రవరి 10న ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటన కూడా థియేటర్లలో విడుదలైన వారం లోపే వచ్చింది. దీంతో ఈ మాత్రం దానికి సినిమాలను థియేటర్లలో విడుదల చేయడం ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సుధీర్ బాబు విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి సుధీర్ బాబు సినిమాలకి కొంతకాలంగా థియేటర్లలో కనీస ఆదరణ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.