English | Telugu
కృష్ణ చివరి చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో 'గుంటూరు కారం' సక్సెస్ సెలబ్రేషన్స్
Updated : Jan 14, 2024
సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం 'కృష్ణ విజయం'. అంబుజా మూవీస్ పతాకంపై మధుసూదన్ హవల్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోంది. నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలీ, సూర్య, గీతాసింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ దర్శకులు ముప్పలనేని శివ, సంజీవ్ కుమార్ మేగోటి, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్ తదితరులు పాల్గొన్న ఈ వేడుకలో ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ, ధనలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 'గుంటూరు కారం' సాధిస్తున్న సంచలన వసూళ్లను పురస్కరించుకుని సక్సెస్ కేక్ కట్ చేశారు. 'గుంటూరు కారం' సాధిస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ చూసి ఓర్వలేక కొందరు కావాలని కువిమర్శలు చేస్తున్నారని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి అన్నారు. సినిమా బాగా లేకపోతే ఆ విషయాన్ని తమ హీరో కృష్ణ గారే ముందుగా చెప్పేసేవారని, ఆ లక్షణం మహేష్ బాబులోనూ ఉందని, కానీ... ఫ్యాన్స్ తోపాటు అందరూ ఆస్వాదిస్తున్న గుంటూరు కారం గురించి ఘోరంగా మాట్లాడడం సరి కాదని వారు హితవు పలికారు.
'కృష్ణ విజయం' ప్రి రిలీజ్ వేడుకలో 'గుంటూరు కారం' సక్సెస్ సెలబ్రేషన్స్ జరగడం సూపర్ స్టార్ కృష్ణ గారికి మనమిచ్చే గొప్ప నివాళిగా భావిస్తున్నానని పేర్కొన్న దర్శకుడు మధుసూదన్.. కృష్ణ ఫ్యాన్స్ అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని అన్నారు.