English | Telugu
షాకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన 'ప్రేమమ్' డైరెక్టర్
Updated : Oct 30, 2023
2015లో విడుదలైన మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నివిన్ పౌలీ, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. భాషతో సంబంధం లేకుండా విశేష ఆదరణ పొందింది. అయితే తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రెన్ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు 39 ఏళ్ళ ఆల్ఫోన్స్ ప్రకటించాడు.
మలయాళం, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన 'నేరం'(2013)తో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఆల్ఫోన్స్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన, ఆ తర్వాత 'ప్రేమమ్'(2015)తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆయన నుంచి మూడో సినిమా రావడానికి ఏడేళ్ళు పట్టింది. గతేడాది ఆయన డైరెక్ట్ చేసిన మూడో సినిమా 'గోల్డ్' విడుదలై నిరాశ పరిచింది. అయితే కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో తాను సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు ఆల్ఫోన్స్.
"నేను నా సినిమా, థియేటర్ కెరీర్ను ఆపేస్తున్నాను. నాకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉందని తెలిసింది. నేను ఎవరికీ బర్డెన్ కావాలి అనుకోవడంలేదు. నా సినిమా కెరీర్ను ముగించినా సాంగ్స్, వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ కంటెంట్ చేస్తూ ఉంటాను. నాకు సినిమాలకు దూరమవ్వాలని లేదు. కానీ నాకు ఇంకో ఆప్షన్ లేదు. నిలబెట్టుకోలేని ప్రామిస్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా ఎదురవుతుంది." అని ఆల్ఫోన్స్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు.