English | Telugu
బన్నీ వాసు చేతికి క్రేజీ సీక్వెల్!
Updated : Oct 6, 2023
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అంటూ 'బాహుబలి-2' కోసం అప్పుడు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో.. చనిపోయిన కవిత ఎలా తిరిగొచ్చింది? అంటూ ఇప్పుడు 'మా ఊరి పొలిమేర-2' కోసం కొందరు ప్రేక్షకులు అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'మా ఊరి పొలిమేర' అనేది చేతబడి నేపథ్యంలో రూపొందిన మర్డర్ మిస్టరీ ఫిల్మ్. ఆచార్య క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రమ్య, గెటప్ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలో 2021 డిసెంబర్ 10 న విడుదలైంది. ఏమాత్రం అంచనాల్లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర కథనం, ట్విస్ట్ లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ రెండో భాగంపై ఆసక్తి కలిగేలా చేసింది. దాంతో 'మా ఊరి పొలిమేర-2' కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్పై గౌరీకృష్ణ నిర్మిస్తున్న పొలిమేర-2 ని నవంబర్ 2 న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రైట్స్ ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తీసుకున్నట్లు సమాచారం. బన్నీ వాసు సినిమా అంటే థియేటర్లలో చెప్పుకోదగ్గ సంఖ్యలో విడుదలవుతుంది అనడంలో సందేహం లేదు. అసలే పొలిమేర చూసిన వాళ్ళు పార్ట్-2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బన్నీ వాసు కూడా తోడు కావడంతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.